• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: History

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మళయాళ నటికి మరుగుజ్జు యోధుల బెదిరింపులు !

20 Monday Feb 2017

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Aami actress, BJP’s trolling army, Manju warrier, Trolls

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిస్సహాయత + అసహనం = చంద్రబాబు

11 Saturday Feb 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

chandababu, chandrababu fire on media, Intolerent chandrababu naidu, Media

Image result for Incapable,Intolerance chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

    అసహనం ! అసహనం !! అసహనం !!! సహనానికి మారుపేరైన మన దేశం, అక్షర క్రమంతో పాటు సహనంలో కూడా అగ్రస్ధానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అసహనం అనే మందుపాతర మీద వున్నదా అనిపిస్తోంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్లు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఒకటేమిటి అన్ని రంగాలు, స్త్రీ, పురుష బేధం లేకుండా ఎక్కడబడితే అక్కడ అన్ని చోట్లా పెరుగుతున్న అసహనం ఎలాంటి పర్యవసానాలకు దారితీయనుందో !

    అసహన రాజకీయాలు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని 90దేశాల పరిణామాలను పరిశీలించిన మానవ హక్కుల నిఘా సంస్ధ జనవరిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ప్రకటించింది. అమెరికా, ఐరోపాలో ప్రజాకర్షక ధోరణి పెరుగుదల ప్రపంచంలో నియంతృత్వ నేతలను ప్రోత్సహించటం, బలిష్టం కావిస్తోందని కూడా హెచ్చరించింది.వేళ్లమీద లెక్కించగలిగిన ప్రపంచ బడా కార్పొరేట్లు, వాటి లాభాల కోసం కొన్ని ధనిక దేశాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల పర్యవసానంగా ప్రపంచం మొత్తం అభివృద్ధికి ఎదురుగాలి వీస్తున్నది. సంక్షోభం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది.

   అధికారమే పరమావధిగా ఏ అడ్డదారి తొక్కేందుకైనా సిద్ధం సుమతీ అన్నట్లు వుండే రాజకీయ పార్టీల, నేతల ప్రజాకర్షక నినాదాలు, చర్యలు ప్రకటించటాన్ని ఒలింపిక్స్‌లో చేరిస్తే మనకు అన్ని పతకాలు రావటం ఖాయం. తీరా అధికారానికి వచ్చాక వారి అసలు రంగు బయటపడుతోంది.తాబేలు నడక, ప్లేటు ఫిరాయించటం, చెప్పినవాటిని అమలు జరపమని ఎవరైనా అడిగితే వారిపై తాసుపాములా కస్సుమంటూ లేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఏ మాత్రం సహించలేక దురుద్ధేశ్యాలను ఆపాదించి అధికార దర్పంతో నోరు మూయించాలని చూస్తున్నారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల పరిధి దాటి జర్నలిస్టులకు సైతం రాజకీయ అనుబంధాలు, వుద్ధేశ్యాలను ఆపాదించి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రమాదకర పోకడ, గర్హనీయం కాదా ?

   విద్యా గంధం ఇచ్చే అత్యున్నత ఫలితం సహనం అని ప్రముఖ మానవతావాది హెలెన్‌ కెల్లర్‌ చెప్పారు. అది ఎంత మందిలో ప్రతిబింబిస్తున్నది అన్నది ప్రశ్న. ఒక కేసులో మన సుప్రీం కోర్టు మరో విధంగా చెప్పింది. అసహనం ప్రజాస్వామ్యానికేగాక వ్యక్తులుగా వారికి కూడా ఎంతో ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సలహా ఇచ్చింది.

    అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ప్రజాకర్షక వాగ్దానాల వరదలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు, ఫిలిప్పీనియన్ల జీవితాలను దుర్భరంగా మార్చివేసిన వారందరినీ అంతం చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో జనాన్ని రెచ్చగొట్టిన రోడ్రిగో డార్టే ఆదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో వుద్యోగాలు అమెరికన్లకే, అమెరికాలో వుత్పత్తి చేయకుండా బయటి నుంచి దిగుమతులు చేసుకొంటే వాటిపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తా, బయటి దేశాలలో పని చేయించే కంపెనీలపై జరిమానాలు వేస్తా అంటూ వాగ్దానాలు చేసిన డోనాల్ట్‌ ట్రంప్‌ కూడా అధ్యక్షుడయ్యాడు. రాష్ట్రాన్ని ఒక పద్దతి ప్రకారం చీల్చకుండా అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ మీద కారాలు మిరియాలు నూరుతూ వూరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షం బిజెపి, వారిద్దరి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ గురించి తెలిసిందే.

   బాబొస్తే జాబొస్తుందన్న నినాదం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి స్వయంగా నరేంద్రమోడీ ఇక వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి, వేస్తున్న పిల్లి మొగ్గలూ అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అక్కడ నరేంద్రమోడీ ప్రధాని, వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. వీరందరూ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాలలో ముదుర్లు తప్ప లేగ దూడలు కాదు. అందుకే తరువాత చూసుకోవచ్చు లెమ్మని ప్రత్యేక హోదావంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జనంపై ఎదురుడాడికి దిగారు.

    చంద్ర ‘బాబా ‘ తత్వశాస్త్రం ప్రకారం కేంద్రంపై పోరాటం చేస్తే పోలవరం వంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా బదులు పాకేజి తీసుకోవటం మెరుగు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని పెద్దలు చెప్పారు గానీ అది చివరికి ఎదురు తన్నుతుంది. అధికారానికి వచ్చిన తరువాత అమెరికాలో ట్రంప్‌ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి అసంగతమైనవని, ఆ చర్యలతో అమెరికాను అస్తవ్యస్ధతలోకి నెట్టారని, ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక వుదాహరణగా మారాడని, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి జనం అధికారాన్నిచ్చారని, ఒక జోకర్‌గా ట్రంప్‌ తయారయ్యాడని చంద్రబాబు వివిధ సందర్బాలలో వ్యాఖ్యానించారు. జనం సొమ్మును అప్పనంగా ఖర్చు చేసి నేతల కీర్తి కండూతి కోసం మహిళా సాధికారత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును దలైలామాతో ప్రారంభోత్సవం చేయించారు.

    ఈ రెండు చర్యలు ‘బాబా ‘ గారి లాజిక్కుకు విరుద్దమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు హాని కలిగించేవి. ట్రంప్‌ మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో వుంటారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడని, అమెరికాను నాశనం చేస్తున్నాడు, జోకర్‌ అని విమర్శించిన తరువాత అమెరికా నుంచి లేదా అమెరికా కంపెనీలున్న మలేషియా తదితర దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి. తనను అంత తీవ్రంగా విమర్శించిన నేత పాలకుడుగా వున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అమెరికాలో స్ధిరపడిన ప్రవాస ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భక్తులు పెట్టే పెట్టుబడుల గురించి ట్రంప్‌ ప్రభుత్వం సహిస్తుందా ? దలైలామా చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మన దేశంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటి పెద్దమనిషిని పిలిచి పెద్ద పీట వేస్తే గతంలో చంద్రబాబు చేసిన చైనా పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు చేసిన యత్నాలు ‘పవిత్ర సంగమం’ (కృష్ణా నది)లో పోసినట్లే కదా ! ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్లు ? దలైలామాను పిలిచినందువలన మీడియాలో వార్తలు తప్ప పైసా ప్రయోజనం వుంటుందా ? చైనా కంపెనీలు ఒకటికి రెండుసార్లు వెనుకా ముందూ ఆలోచించవా?

   రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయటానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నాన్చి, నాన్చి రెండు సంవత్సరాల తరువాత ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పేసింది. దానికోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు. తీరా హోదా లేదు పాకేజి ఇస్తామని చెప్పగానే అందని ద్రాక్ష పుల్లన అన్న నక్క సామెత చందాన హోదా వలన ప్రయోజనం లేదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు తెచ్చే పాకేజి ఎంతో ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.పనికిరాదని ముందే తెలిసినపుడు ఎన్నికలలో వాగ్దానమెందుకు? అసెంబ్లీ తీర్మానాలెందుకు? హోదా బదులు పాకేజీకి ఆమోద ముద్ర కోసం పోరాడాలని ఎంపీల సమావేశాలలో వుద్బోధలెందుకు ? ప్రతి నెలా జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశాలలో తెలుగు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తారని అయన కోసం ఎయిర్‌ కండిషన్ల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ప్రధాని రావటం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం. చివరికి అదేమీ లేకపోగా ఏ కార్యక్రమాలూ లేకపోతే ఆకాశవాణిలో ప్రసారం చేసే ‘నిలయవిద్వాంసుల’ సంగీత కార్యక్రమాల మాదిరి వెంకయ్య నాయుడిని పంపారు. ప్రత్యేక హోదాను నిరాకరించిన తరువాత రాష్ట్రానికి రావటానికి నరేంద్రమోడీ జంకుతున్నారా ? వీడియో కాన్ఫరెస్సులో మాట్లాడకపోతే పోనీ రికార్డు చేసిన సందేశం పంపటానికి కూడా మోడీ తిరస్కరించారంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడి పలుకుబడి ఏపాటిదో అర్ధం కావటం లేదా ?

    హోదా లేదన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దానికి కూడా సహనంతో సర్దుకు పోతున్నారు. పోనీ పాకేజీని అయినా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందా అంటే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారైన స్ధితిలో వాటి గురించి అడగటమే పాపమన్నట్లుగా అటు వెంకయ్య నాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు చిందులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హోదా గురించి అడిగింది మేము మాత్రమే, మిగతావారెవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మేమే అవసరం లేదంటున్నాము, అప్పటి మాదిరి ఇపుడు కూడా మిగతావారంతా నోర్మూసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలోనా లేక నందంటే నంది పందంటే పంది అనక తప్పని నిరంకుశపాలనలో చెవుల్లో పూలు పెట్టుకొని వున్నామా ?

   గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. తన విధానాలను విమర్శించే లేదా పదే ప్రశ్నించే రెండు పత్రికలను, ఛానళ్లను లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముద్రవేసి శత్రుపూరితంగా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు నచ్చని ఛానళ్లు పత్రికలకు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు పార్టీల ముద్రవేసి అదేపని చేస్తున్నారు. తటస్ధ వైఖరి తీసుకొనే మీడియా సంస్ధల జర్నలిస్టులే ప్రశ్నలు అడగాలని నిర్ధేశిస్తున్నారు. మీడియా తటస్ధత అంటే ఒక సంఘటన, ఒక అభిప్రాయం, అంశంపై ఒకే వైఖరిని పాఠకుల ముందుంచటంగాక అన్ని రకాల అభిప్రాయాలకు తగు స్ధానం కల్పించి అందచేయటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడగకూడదని అర్ధం కాదు.

     చంద్రబాబు తత్వశాస్త్రం ప్రకారం తటస్థం అంటే ఏం జరిగినా నోరు మూసుకోవాలని చెప్పటమే. తటస్ధ మీడియా సంస్ధల జర్నలిస్టులను కూడా చంద్రబాబుతో సహా ఏ ముఖ్యమంత్రీ సహించటం లేదు. మీడియా సమావేశంలో ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే సదరు విలేకరి వార్త ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లక ముందే సంపాదకుడు లేదా యాజమాన్య ప్రతినిధికి సచివాలయం నుంచి ఫోన్లు వెళ్లటం, ప్రకటనలను మరిచి పోవాల్సి వస్తుందని హెచ్చరించటం – వారు విలేకరికి తలంటించటం, వుద్యోగం నుంచి వుద్వాసనకు హెచ్చరికలు బహిరంగ రహస్యం. లాభాల కోసం రంగంలోకి వచ్చిన మీడియా సంస్ధలు చచ్చిన చేపల మాదిరి వాలునబడి పోతాయి తప్ప తటస్థంగా ఎ్కడుంటాయి ? వుద్యోగ భద్రత లేని కారణంగా అనేక మంది బలవంతంగా మౌనంగా సహిస్తున్నారు తప్ప జర్నలిస్టులందరూ ఆ స్థితికి చేరలేదు. ప్రజలకు వుపయోగపడతాయనుకున్న అంశాలను వెలికితీయటం, పాలకులుగా వున్న వారిని ప్రశ్నించే యావ, చేవ ఇంకా సజీవంగానే వుంది. అది లేని వారు యజమానులతో ప్రత్యక్ష సంబంధాలున్న రాజకీయనేతలో, యజమానో అధికారో చెప్పింది రాసుకొనే షార్ట్‌ హాండ్‌ గుమస్తాలు తప్ప జర్నలిస్టులు కారు. అటువంటి స్ధితి ప్రజాస్వామ్యానికి, జనస్వామ్యానికి ముప్పు.

     తటస్థం అని చెప్పుకొనే మీడియా సంస్ధల యాజమాన్యాలకు రాజకీయపార్టీలతో వున్న సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక మంది పెట్టుబడులు వాటిలో వున్నాయి, అందువలన తెలుగు నేలపై అలాంటి తటస్థ మీడియా ఎక్కడ వుందనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన విలేకరులు, మీడియా సంస్ధలపై వైఎస్‌, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వారు విరుచుకుపడినపుడు సీనియర్‌ జర్నలిస్టులు కూడా మౌనం దాల్చటానికి పూర్వరంగమిదే. పోనీ ఈ మౌనం వలన జర్నలిస్టులు బావుకుంటున్నదేమైనా వుందా అంటే అదీ లేదు. తమకు చట్టపరంగా రావాల్సిన వేతన భత్యాలను పొందుతున్న జర్నలిస్టులు ఎంత మంది వున్నారు. అసలు చట్టాలే అమలు జరగటం లేదు, వాటిని అమలు జరపాల్సిన ప్రభుత్వాలు యజమానుల కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలనలోగానీ తెలుగుదేశం పాలనలో గానీ ముఖ్య మంత్రులుగా వున్న వారు కొన్ని సంస్ధలపై విరుచుకుపడి వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించారే తప్ప జర్నలిస్టులకు అమలు చేయాల్సిన చట్టాల అమలుకు ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకున్న పాపాన పోలేదు. కార్మిక శాఖ అధికారులు ఎన్ని మీడియా కార్యాలయాలను సందర్శించారు, చట్టాల అమలును పర్యవేక్షించారో చెప్పమనండి. జర్నలిస్టుల వేతన చట్ట అమలు గురించి సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.

     చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి మూడో సంవత్సరం త్వరలో పూర్తికానుంది. ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై అధికారికంగా యూనియన్‌ ప్రతినిధులతో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా జరిపి సాధకబాధకాలను చర్చించలేదు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అనేక మంది విలేకర్లపై అధికారపక్ష శాసనసభ్యులు, వారి దగ్గరి బంధువులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని నియంత్రించటం లేదు, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయటానికి సర్కార్‌కు రెండున్నర సంవత్సరాలకుపైగా పట్టింది, ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. ప్రెస్‌ అకాడమీ కూడా అంతే. చైర్మన్‌ నియామకం జరిపారు, పాలకవర్గాన్ని వేయలేదు, ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఇంత వరకు అసలు కమిటీ నియామకమే జరపలేదు. ఎందుకని ?

    అసహనాన్ని వ్యక్త పరిచేందుకు తెలుగులో ఒక సామెత వుంది. అదే మంటే నిస్సహాయతతో ‘ అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు ‘. రాజకీయ చాణుక్యుడిగా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాగే వుందా అనిపిస్తోంది.అంతర్జాతీయ విషయాలపై స్పందన అడిగినపుడు మాదీ ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ విషయాలెందుకు బ్రదర్‌ అనే వారు. అలాంటిది ట్రంప్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తే చంద్రబాబు బుర్ర ఎంతగా కలవర పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఎపుడైనా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనపుడు గతంలో నో కామెంట్‌ (వ్యాఖ్యానించదలచలేదు) అని తనదైన శైలిలో కన్నుగీటుతూ తప్పించుకొనే వారు. దాంతో విలేకరులు కూడా అంతకు మించి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్న వస్తే వెంటనే ముందు నువ్వు ఏ పత్రిక, ఏ ఛానల్‌ అని అడుగుతున్నారు. దానిని బట్టి స్పందిస్తున్నారు. విశాఖలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రజాశక్తి’ విలేకరిపై విరుచుకుపడుతూ చేసింది అదే. ఆల్‌ఇండియా, ప్రపంచ స్ధాయిలో ఎందరో జర్నలిస్టులను చూశానని చెప్పిన చంద్రబాబు ఆ స్ధాయిలో వ్యవహరించి వుంటే ఆయనకు హుందాగా వుండేది. అలా చేయకపోవటం విచారకరం. ఏ జాతీయ, అంతర్జాతీయనాయకుడు ప్రశ్న అడిగిన వారిని నువ్వు ఏ సంస్ధ ప్రతినిధివి అని అడిగి రాజకీయ అనుబంధాన్ని అంటగట్టిన వుదంతం మనకు కనపడదు.

    అంతెందుకు ఆ రెండు పత్రికలు, ఛానల్స్‌ అంటూ కయ్యం పెంచుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రారంభింప చేయించిన పత్రిక, టీవీ ఛానల్‌లో తాను వ్యతిరేకించిన మీడియా సంస్ధల నుంచి వచ్చిన వారినే జర్నలిస్టులుగా నియమించారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నవారికి విధి నిర్వహణ ముఖ్యం. వారు కూడా పౌరులే కనుక ఏ రాజకీయ అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు.యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేసి వుండవచ్చు. అంతమాత్రాన పని చేసే సంస్ధను బట్టి రాజకీయాలు, వుద్దేశ్యాలను అపాదించటం తగని పని. ఆ మాటకు వస్తే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారి రాజకీయాల సంగతేమిటి ?

అనేక దేశాలు రక్షణాత్మక చర్యలలో భాగంగా తమ దేశాల నుంచి పెట్టుబడులు బయటకుపోకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తామే ఆకర్షించుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో రాష్ట్రాలు అంతకంటే ఎక్కువగా రాయితీలతో పోటీ పడుతున్నాయి. అందువలన విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి అగమ్యంగా వుంది. విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా లేదు, దాని బదులు అంతకంటే మెరుగ్గా ఇస్తామన్న ప్రత్యేక పాకేజి బ్రహ్మపదార్ధంగా మారింది. నిజానికి అలాంటి ప్యాకేజీలు ప్రకటించటానికి కేంద్రానికి అసలు అధికారాలేమిటో ఎవరైనా చెప్పగలరా ?

   కన్నుగీటితే చాలు కాసుల వర్షం అన్నట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు వస్తున్నాయని, వాణిజ్యం చేసేందుకు అగ్రపీఠీన అత్యంత అనుకూల స్ధానంలో వున్నామని నిత్యం ఏదోఒక చోట సంతోషంతో విజయగాధలు వినిపిస్తున్న స్ధితిలో తమ అజెండాలోని వాటి గురించే ఒక చిన్న ప్రశ్న అడిగినా భరించలేని అసహనం ఎందుకు ? దేశ, విదేశాలు తిరిగి ఎంతో అనుభవం గడించిన చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా ? రాష్ట్రంలో జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచటానికి ఏదో ఒక రాజకీయం చేయాలి, లోపల ఏమున్నా పైకి నటించాలి. కేంద్రం నుంచి ప్రచారం చేసిన మాదిరి సాయం రాదని తేలిపోయింది. మాటలతో ఎక్కువ కాలం గడపటం కష్టం. అనేక రంగాలలో పురోగతి లేమి దాంతో ఒకవైపు నిస్సహాయత, దాన్నుంచి మరోవైపు తలెత్తుతున్న అసహనం అన్నీ కలిస్తే చంద్రబాబు అని చెప్పవచ్చు.

     అందుకే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోవటానికి కారణమిదే ! ఇప్పుడున్న స్ధితిలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు, ఏ రోజు ఏ ఎంఎల్‌ఏను తమ నుంచి తీసుకుపోతారో అని ప్రతిపక్షమే భయపడే స్ధితి. జనానికి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, వివిధ తరగతులపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రతిఘటించాలి? ఎవరికి వారు ఏదో ఒక కారణం వెతుక్కొని నా వరకు వచ్చినపుడు కదా చూసుకోవచ్చు అనుకొనే వారికి జర్మన్‌ రచయిత మార్టిన్‌ నిమోలియర్‌ నాజీల గురించి రాసిన ప్రఖ్యాత కవితను గుర్తు చేయటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు- నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత కార్మికనేతల కోసం వచ్చారు -నేను కార్మికనేతను కాదు కనుక మిన్నకున్నాను

తరువాత యూదుల కోసం వచ్చారు -నేను యూదును కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు – నోరు విప్పేందుకు అప్పటికి నా వెనుక ఎవరూ లేరు

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారాల పెంపు తప్ప జనానికి వుపశమనం లేని బడ్జెట్‌

04 Saturday Feb 2017

Posted by raomk in Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Budget 2017-18, Central budget 2017, Demonetisation, Economic Survey, GST

Image result for Budget 2017-18 Imposes Further Burdens, no relief on the People

ఎం కోటేశ్వరరావు

     ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అన్నట్లుగా ఇప్పుడు ప్రతి రోజూ బడ్జెట్‌ రోజుగా మారిపోయింది. మనకు బడ్జెట్‌ అంటే బ్రిటీష్‌ వారి సాంప్రదాయ ప్రకారం ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది. ఏం మే ఒకటవ తేదీ నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు అని ఎవరైనా వాదనకు దిగితే విబేధించేందుకేమీ వుండదు. సాంప్రదాయానికి భిన్నంగా రుతువుకు ముందే కూసిన కోయిల మాదిరి కేంద్ర బడ్జట్‌ ఒక నెల ముందుగానే వచ్చింది. ఏడాదికి ఒకసారి దేశ సంపద పంపిణీకి చేసే కసరత్తే బడ్జెట్‌. ఇది సామాన్యులకు ఒక పట్టాన అంతుపట్టదు. మేథావుల తరగతిలో ఎంత మందికి అర్ధం అవుతుందన్నది పెద్ద ప్రశ్న. లెక్కించే పద్దతులలో తేడాలు, లోపాలు వున్నాయనే విమర్శలు, ఆరోపణలు ఎలా వున్నప్పటికీ మన దేశంతో సహా ప్రపంచమంతటా అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నది పచ్చి నిజం.దవోస్‌లో ప్రపంచ కార్పొరేట్ల సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ అనే సంస్ధ విడుదల చేసిన వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సంపద ఎంత అంటే మన దేశంలో 40శాతం మంది పేదల సంపదకు సమానం. మన దేశంలోని రిలయన్స్‌ కంపెనీ అన్నదమ్ములలో పెద్ద వాడైన ముఖేష్‌ అంబానీ దగ్గర 30శాతం మంది సంపదకు సరిపడా వుంది. గత 70 సంవత్సరాలుగా మంచి, పురోగామి బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని అధికారంలో కాంగ్రెస్‌, జనతా, బిజెపి ఇలా ఎవరున్నా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అదే వాస్తవమైతే దేశంలో అసమానతలు ఇంతగా ఎందుకు పెరిగాయి? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అబద్దాలు చెబుతున్నా మేథావులు అర్ధం చేసుకోలేకపోతున్నారా లేక అర్ధమై తాము కూడా ఏనాటికైనా అంబానీలం కావాల్సిన వారిమే కనుక ఈ విధానాన్ని ప్రశ్నించటం, తప్పుపట్టకూడదనుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ?

   ఎన్‌డిఏ ప్రభుత్వం 2017-18 సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. దాని మీద చర్చలు జరుగుతాయో, అసలు పార్లమెంట్‌ సమావేశాలే పద్దతిగా నడుస్తాయో లేదో తెలియదు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విధానం నుంచి మరలి గత రెండున్నర సంవత్సరాలుగా పారదర్శకమైన పద్దతిని పాటిస్తున్నట్లు మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీని అభిమానిస్తున్నవారు మాకు కనిపిస్తోంది, మాకు కనిపిస్తోందని చెబుతున్నారు కనుక పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే దేవతా వస్త్రాల వంటిదే ఇది అనుకోవాలి మరి. దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కామని చెప్పినట్లుగా ఒక నెల ముందుగానే బడ్జెట్‌ ప్రవేశ పెట్టటం గురించి అధికారపార్టీ సమర్ధన వుంది. బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టనున్నట్లు గతేడాది సెప్టెంబరులోనే చెప్పామని, దీని వలన ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి పెట్టుబడుల చక్రం తిరగటం ప్రారంభమౌతుందని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అదే అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరేం ఖర్మ జనవరిలోనే ప్రవేశపెట్టి ఫిబ్రవరి నాటికి ఆమోదం పొందితే ఇంకా స్పష్టత వచ్చి ‘పెట్టుబడుల చక్రం ‘ పూర్తి స్ధాయిలో వేగంగా తిరుగుతుంది, రాష్ట్రాలకు వచ్చే నిధులేమిటో రానివేమిటో మరింత స్పష్టమై వాటి బడ్జెట్లను మరింత స్పష్టంగా రూపొందించుకోవటం కుదురుతుంది కదా ! అలా చేస్తే ఎవరు వద్దన్నారు ? కడుపులో దుష్ట ఆలోచన పెట్టుకొని పిల్లా గడ్డికొస్తావా అన్నట్లుగా ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రచారం కోసమే ఇది అన్నది అందరికీ తెలిసిన అసలు విషయం. కేంద్ర సర్కార్‌ పారదర్శకత బండారమిది.

    ఇక బడ్జెట్‌ తీరు తెన్నులు చూస్తే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా వుంది. కోర్టుకు చెప్పినట్లు ఏప్రిల్‌ ఒకటి నుంచి పెట్టుబడుల చక్రం తిరగటానికి దోహదం చేసే ఎలాంటి విప్లవాత్మక విధాన ప్రకటనలేమీ లేవు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్‌ను ఒక ప్రహసనంగా మార్చివేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రత్యామ్నాయ పద్దతి లేకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వానికి ప్రతి దినమూ బడ్జెట్‌ రోజే. అందుకే ఈ మధ్య ఏ ఒక్క వాణిజ్య సంస్ధ కూడా బడ్జెట్‌ వస్తోంది ముందుగానే వస్తువులు కొనుక్కోండి అని ప్రకటనలు గుప్పించటం లేదు. బడ్జెట్‌, పార్లమెంటు ఆమోదంతో పనేమీ లేకుండానే ముందే విధాన ప్రకటనలు, పన్నులు, భారాలను వడ్డించి చూశారా భారాలు లేని బడ్జెట్‌ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజా బడ్జెట్‌ కూడా అంతే. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో డిజిటల్‌ ఎకానమీ అనే అంశం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. గతేడాది బడ్జెట్‌కు ముందు అంటే 2015 నవంబరులో కేంద్ర ప్రభుత్వం పది హేను రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పెద్ద విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. తరువాత జనవరిలో స్టార్టప్‌, స్టాండప్‌ ఇండియాల పేరుతో ప్రధాని మరొక ప్రకటన చేశారు.సరే నవంబరు నెలలో చేసిన పెద్ద నోట్ల రద్దు అనే చారిత్రాత్మక నిర్ణయం గురించి చెప్పనవసరం లేదు. అది కూడా ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచార వస్తువుగా వుపయోగించుకొనేందుకే అన్నది స్పష్టం.అన్నింటికీ మించి ఇలాంటి ప్రధాన నిర్ణయాలేవీ హల్వా వంటకంతో ప్రారంభిస్తున్నవీ, పార్లమెంట్‌లో చర్చించి చేస్తున్నవీ కాదు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ లేక బహుళజాతి కార్పొరేట్‌ సంస్ధల అజెండాలను తయారు చేసే సంస్ధల సలహాలు మొరటుగా చెప్పాలంటే ఆదేశాల ప్రకారం చేస్తున్నవి తప్ప మరొకటి కాదు. ఇది నరేంద్రమోడీ నూతన దారి కాదు, గతంలో మన్మోహస్‌ సింగ్‌ కూడా నడిచిన బాట అదే. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చినపుడు గానీ అసలు విషయాలు బయట పడవు. మోడీ సర్కార్‌ను గట్టిగా బలపరిచే ఒక వ్యాఖ్యాత ఈ ఏడాది రెండో బడ్జెట్‌ లేదా చిన్న బడ్జెట్‌ వుండదని చెప్పలేము అని పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరం అక్టోబరుకు మారిపోనుందని చెప్పారు. అందువలన ఈ బడ్జెట్‌ అంకెలను చూసి భారాలు, రాయితీల గురించి చర్చించటం అసవసర ఆయాసం తప్ప మరొకటి కాదు.

Image result for Budget 2017-18 meme

    ఇది సమగ్రబడ్జెట్‌ కాదు అనేందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఇదే కాదు, అన్ని రాష్ట్రాల బడ్జెట్లు ఒక విధంగా మూడు లేదా ఆరునెలలకు అవసరమయ్యే ఖర్చులకు అనుమతి పొందే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ వంటివే. ఎందుకంటే వస్తు,సేవల పన్ను జూలై లేదా సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుంది. మన ఆదాయంలో సింహభాగం దాని నుంచే రావాల్సి వుంది. దాదాపు 1400 వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో, దాని పరిధిలోకి రానివేవో ఇంకా తెలియదు. ఇదొక ప్రధాన కారణమైతే అమెరికా పద్దతుల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఆర్ధిక సంవత్సరాన్ని కూడా మార్చాలని ఇప్పటికే ఒక కమిటీ చేసిన సిఫార్సు గురించి కూడా ఈలోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధలన్నీ కూడా అదే కోరుతున్నాయి. అదే జరిగితే 2018 బడ్జెట్‌ ఏ సెప్టెంబరో, అక్టోబరులోనే ప్రవేశ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌, తరువాత మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌ఘర్‌ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇవన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలు. వాటి ఫలితాలు 2019లో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఏడాది ఎలాగూ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ మాత్రమే ప్రవేశపెడతారు. అంటే మోడీ సర్కార్‌కు 2018 బడ్జెట్‌ కీలకం, బహుశా ఆ కారణంగానే కావచ్చు, తాజా బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక ప్రతిపాదనలు చేయలేదు. ఇంత ముందుగా చేస్తే జనం మరిచిపోయే అవకాశం వుంది కనుక ఎన్నికల సంవత్సరాలలో అయితే తాము సొమ్ము చేసుకోవచ్చన్నది బిజెపి ఆలోచన.

   ప్రతి బడ్జెట్‌ సమావేశానికి ముందు ప్రభుత్వం తమ విధానాలు, విజయాల గురించి చెప్పుకొనేందుకు పార్లమెంట్‌ వుభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్వారా ఒక ప్రసంగం చేయిస్తుంది. మోడీ ప్రభుత్వ ‘ఘనత ‘ ఖాతాలో వేస్తారో మరొకదానిలో వేస్తారో తెలియదు గానీ అసాధారణ రీతిలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి 651 సవరణలు ప్రతిపాదించారు. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. వీటిలో మోడీ సర్కార్‌పై విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్‌ నుంచి ఒక్కటంటే ఒక్క సవరణ కూడా లేకపోవటం ఒక కిక్కు. గతంలో వేసిన కుర్చీలు చాలక అనేక మంది ఎంపీలు నిలబడి ప్రసంగాలను వినేవారని, తాజా ప్రసంగానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని మీడియాలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. జన గణమణ పాడుతుండగానే కొందరు ఎంపీలు వెళ్లిపోవటం ప్రారంభించారని కూడా రాశారు. రాజ్యసభ సభ్యులు ప్రతిపాదించిన సవరణల్లో పెద్ద నోట్ల రద్దు గురించి రాష్ట్రపతి సరిగా చెప్పలేదన్నది ఒక ప్రధాన అంశం.ఈ సవరణల మీద ఓటింగ్‌ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కూడా వుంది.

    ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే తినబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లుగా వుంది. ఎగుమతులు ఎందుకు తగ్గాయంటే అంతర్జాతీయ పరిస్థితులు అంటారు, అదే నోటితో తమ ఘనత కారణంగా అభివృద్ధి బహుబాగుంది అని చెబుతారు. అంకెల గారడీ తప్ప ఇదెలా సాధ్యం ! మన ఆర్ధిక వ్యవస్ధ అధిక వృద్ది రేటుతో పురోగమిస్తున్నదని, కావాలంటే ఐఎంఎఫ్‌ కూడా చెప్పింది చూడమంటున్నారు. అన్నింటికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లు అన్ని దేశాల గురించి జోశ్యం చెప్పే ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధలేవీ 2008 నుంచి ధనిక దేశాలను, తరువాత వాటి అడుగుజాడల్లో నడిచే మన వంటి దేశాలను పట్టి పీడిస్తున్న ఆర్ధిక సంక్షోభాన్ని పసిగట్టటంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందువలన అవి చెప్పే జోశ్యాలను సమర్ధనకు తీసుకోవటం జనాన్ని తప్పుదారి పట్టించటమే.

     గతేడాది ప్రపంచంలో సంభవించిన ప్రధాన ఆర్ధిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో పెద్ద అనిశ్చితిని ఎదుర్కోనున్నదని, 2017లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే ఆలోచన వున్నందున వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు వచ్చే పెట్టుబడులు తగ్గవచ్చని, బయటకు వెళ్లే మొత్తాలు ఎక్కువ కావచ్చని, వస్తువుల ధరలలో అనిశ్చితి ముఖ్యంగా ముడి చమురు ధరల కారణంగా వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని, రక్షణాత్మక చర్యలు పెరుగుతున్న కారణంగా వస్తువులు, సేవలు, జనం విషయంలో ప్రపంచీకరణ వెనుక పట్టు పట్టే సూచనలు మన ముందున్న సవాళ్లని చెబుతూనే రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్ధ బాగా పురోగమించనున్నదని చెప్పారు.

    అసలు ప్రణాళికా సంఘమే రద్దయింది కనుక 2017-18 బడ్జెట్‌లో ప్రణాళిక-ప్రణాళికేతర అనే విభజనే లేకుండా పోయింది. అందువలన వివిధ రంగాలకు కేటాయింపులు, గతంతో పోల్చుకోవటానికి వీలు లేకుండా పోయింది. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి సాధారణ బడ్జెట్‌లో దాన్నొక శాఖగా కలిపివేశారు.లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను పునరావృతం చేసేట్లున్నది. తొలుత నల్లధనం ఆరులక్షల కోట్లని, తరువాత దానిని మూడు లక్షల కోట్లని అనధికారిక అంచనాలు చెప్పిన వారు ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. ఎందుకయ్యా అంటే బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లను ఇంకా లెక్క పెడుతూనే వున్నారట. కొన్ని వార్తల ప్రకారం ఆగస్టులో రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికలో మాత్రమే ఆ వివరాలు వెల్లడి అయ్యే అవకాశం వుంది. అయితే ప్రతిపక్షాలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో అంత తేలికగా వదలవు గనుక ఈ సందర్భంగా అయినా వెల్లడి అవుతాయా అన్నది చూడాల్సిందే.

   పెద్ద నోట్ల రద్దు నల్ల ధనం వెలికితీతకే అని చెప్పినప్పటికీ చివరకు అది డిజిటల్‌ ఆర్ధిక లావాదేవీలను జనంపై బలవంతంగా రుద్ధేందుకు అన్నది స్పష్టమైంది. అదనపు భారం పడకుండా వుంటే నగదు రహిత లావాదేవీలను జరపటానికి జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పేటిఎం, రిలయన్స్‌, తదితర కార్పొరేట్ల ఆదాయాలు పెంచటానికే అన్నది తేలిపోయింది. ప్రభుత్వమే ప్రతిదానికి వినియోగ చార్జీలు, సేవా పన్ను పేరుతో జనాన్ని బాదుతుంటే ప్రయివేటు సంస్ధలు అదీ కేవలం వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్ధిక సంస్ధలు వుచితంగా సేవలు అందిస్తాయని నమ్మటానికి జనం చెవుల్లో పూలుపెట్టుకొని లేరు. నగదు రహిత లావాదేవీలు జరిగితే అవినీతి వుండదన్నది ఒక ఎండమావి. అవినీతికి-నగదు రహితానికి సంబంధం లేదు. అమెరికాలో 45శాతం నగదు రహితమే, అయినా అది ప్రపంచ నల్లధనానికి అగ్రస్ధానంలో వుంది, కెనడాలో 57, బ్రిటన్‌లో 52శాతం నగదు రహితమే, ఆ రెండూ ప్రపంచంలో నల్లధనంలో అగ్రస్ధానంలో వున్న పది దేశాలలో వున్నాయి. ఇక ప్రపంచంలో నల్లధన కుబేరులు, పన్నుల ఎగవేతదార్లందరికీ ఆశ్రయం కల్పిస్తూ, అవినీతిని ప్రోత్సహించే స్విడ్జర్లాండ్‌ వంటి దేశాల గురించి చెప్పాల్సిందేముంది. నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయం తరువాత హైదరాబాదు వంటి అనేక పట్టణాలలో కొన్ని చిన్న దుకాణదారులు పోయిన వ్యాపారాన్ని రాబట్టుకొనేందుకు నగదు రహిత లావాదేవీలకోసం మిషన్లు పెట్టారు. ప్రస్తుతం నగదు సాధారణ స్థాయికి రావటంతో అనేక చోట్ల వాటిని ఎత్తివేశారు. జనాన్ని నగదు రహితం వైపు మళ్లించటానికి ఈ బడ్జెట్‌లో సహజంగానే పెద్ద పీట వేశారు. బ్యాంకుల్లో పది లక్షలు, ఆధార్‌తో లింక్‌ చేసే మరో 25లక్షల మిషన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. మూడులక్షల రూపాయల కంటే నగదు లావాదేవీలు జరపరాదనే నిర్ణయం రాబోయే రోజుల్లో చేయనున్నారు. అంతా బాగుందని ఒకవైపు చెబుతారు, మరోవైపు అభివృద్ధి వుద్దీపన పేరుతో పారిశ్రామిక సంస్ధలపై పన్ను రేటు తగ్గిస్తున్నారు.ఏటా యాభై కోట్లకు లోబడి లావాదేవీలు జరిపే వాటిపై ఆదాయపన్ను 25శాతానికి తగ్గించటం అదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న వుద్యోగుల విషయానికి వస్తే ఇది వట్టిస్తరి మంచి నీళ్ల వంటిదే. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయంపై పన్ను రేటు పది నుంచి ఐదు శాతానికి తగ్గించి పండుగ చేస్కోండి అన్నట్లుగా ఫోజు పెట్టారు. దీని వలన అంతకు మించి ఆదాయం వున్నవారికి 12,500 రూపాయలు తగ్గుతాయి. ఇంతకు మించి మరొకటి లేదు.

    బడ్జెట్‌ను మొత్తంగా చూస్తే వాస్తవాలను ప్రతిబింబించలేదనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వలన అనేక మంది నష్టపోయారు. ఆ నష్టం గురించి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో ఆర్ధిక ప్రగతి మందగించిందని, వస్తువులు, సేవల డిమాండ్‌ పెద్ద ఎత్తున పడిపోయిందని, వుపాధిపోయిందని, వ్యవసాయ ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అంతా బాగుందని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి చెప్పారు. లోటు తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవటం గురించి గొప్పగా చెప్పారు. అసలు విషయం ఏమంటే ఖర్చు తగ్గించారు. వర్తమాన సంవత్సరం జిడిపిలో 13.4 శాతం మొత్తం బడ్జెట్‌గా వుంటే వచ్చేఏడాది దానిని 12.7శాతానికి తగ్గించారు.మొత్తం ఆదాయం 9.4శాతం వస్తుందనుకుంటే సవరించిన బడ్జెట్‌లో తొమ్మిదిశాతానికి తగ్గించారు. అయితే కార్పొరేట్‌లకు ఇచ్చిన రాయితీలు మాత్రం అంచనాల కంటే 30వేల కోట్ల రూపాయలు పెరిగాయి. తక్కువ మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించేవారికి 20వేల కోట్లరూపాయల వరకు భారం తగ్గించినప్పటికీ పరోక్ష పన్నుల ద్వారా జనంపై 75వేల కోట్ల మేరకు అదనపు భారాన్ని ప్రతిపాదించారు. ఈ ఏడాది కూడా చమురు వుత్పత్తులపై అధిక ఎక్సయిజ్‌ డ్యూటీ ప్రాతిపదికన ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రతిపాదించారు. అంటే గత మూడు సంవత్సరాలలో పెంచిన పన్ను తగ్గేది లేదన్నది స్పష్టం. ఇండ్ల నిర్మాణానికి రాయితీల ప్రకటన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదుగానీ రియలెస్టేట్‌ రంగంలో కాపిటల్‌ గెయిన్‌ పన్ను ప్రాతిపదిక సంవత్సరాన్ని 1981 నుంచి 2001కు మార్చటం ద్వారా ఆ రంగంలోని బడా పెద్దలకు విపరీత లాభాలు సమకూర్చేందుకు వీలుకల్పించారు. షెడ్యూలు తెగల సంక్షేమానికి 1.48శాతం, షెడ్యూలు కులాల వారికి 2.44 శాతాల మొత్తమే మొత్తం బడ్జెట్‌లో కేటాయించారు. వారి జనాభాతో పోల్చితే ఇది చాలా తక్కువ. జనాభాలో సగానికి పైగా మహిళలు వున్నప్పటికీ లింగ ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపు కేవలం 5.3శాతమే వుంది.

   వుపాధి హామీ పధకానికి కేటాయింపు 48వేల కోట్లకు పెంచినట్లు చెప్పినా వాస్తవానికి గతేడాది చేసిన ఖర్చు 47.5వేల కోట్లకు దగ్గరగానే వుంది తప్ప తగినంత పెంపుదల లేదు.విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణ్యంగా పెంపుదల లేదు. 2016-17లో 2.2శాతం అని నిర్ణయించినా సవరించిన అంచనా 2.16కు తగ్గింది. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు అని జపం చేయటం తప్ప అందుకు నిర్ధిష్ట చర్యలు లేవు. గతబడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించిన 1.98శాతంలో సవరించిన అంచనా పకారం 1.95శాతం కంటే ఖర్చయ్యే అవకాశం లేదు. మౌలిక సదుపాయాల పరిస్ధితి కూడా ఇంతే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం వెలికితీతపై రాష్ట్రపతి మౌనరాగం !

31 Tuesday Jan 2017

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

black money, Demonetisation, Economic Survey, NPA;s, PARA, President pranab mukherjee

Image result for President pranab mukherjee parliament speech

ఎం కోటేశ్వరరావు

   బుధవారం నాడు ప్రవేశపెట్ట నున్న బడ్జెట్‌ సందర్బంగా ఆనవాయితీ ప్రకారం ముందురోజు మంగళవారం నాడు వుభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చేది తప్ప మరొకటి కాదు. వాటిలో జనానికి బాగా తెలిసిన అంశాలను మరింత వివరంగా చెప్పారు. దేశమంతా ఎదురు చూస్తున్న అంశాన్ని విస్మరించటం విస్మయం కలిగిస్తోంది. నల్లడబ్బును అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని స్వయంగా నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. గడువు ముగిసి నెల రోజులు దాటి పోయింది. అయినా ఇంతవరకు ఎంత మొత్తంలో నల్లడబ్బును వెలికి తీశారో, అసలు బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్మెంతో, మోడీ సాధించిన విజయాలేమిటో చెబుతారనుకుంటే ఇక్కడా ‘మౌనమే ‘ పాటించారు. ఆర్థిక సర్వేలోని అనేక అంశాలను తరువాత పరిశీలించవచ్చు. గత పార్లమెంట్‌ సమావేశాలలో పట్టుమని పదినిమిషాలు కూర్చోకుండా, చర్చలో పాల్గొనకుండా తప్పించుకున్నారనే విమర్శలను మూటగట్టుకున్న ప్రధాని నోట్ల రద్దు గురించి ఆర్ధిక సర్వే ఏం చెప్పిందో చూద్దాం.

     దేశంలో నల్లధనం ఎంత వుంది అన్నదానికి ఇప్పటి వరకు మౌనంగా వున్న సర్కార్‌ ఆర్ధిక సర్వేలో మన్‌కీ బాత్‌ను(మనసులోని మాట) కొత్త భాషలో బయటపెట్టింది. వంద రూపాయలు, అంతకంటే తక్కువ విలువ వున్న నోట్లు ప్రతి ఏటా వంద అచ్చువేశారనుకుంటే ఏడాది తిరిగే సరికిలో వాటిలో 33 పాతబడిపోయి, వినియోగంలోంచి తీసివేసి కొత్త నోట్లు వేస్తారు. అలాంటివి ఐదు వందల నోట్లు 22శాతం, వెయ్యి రూపాయలవి 11శాతం వుంటాయట. పెద్ద నోట్లు పాతబడటం తక్కువ శాతం వుండటం అంటే వాటిని వినియోగించకుండా దాచివేస్తున్నట్లు పరిగణిస్తే ఆ మొత్తం 7.3లక్షల కోట్ల రూపాయలని, దానిని నల్లధనంగా పరిగణిస్తారట. నలిగిపోయి పనికిరాకుండా పోయే నోట్లను అమెరికాతో పోల్చి చూస్తే నల్లధనాన్ని మూడులక్షల కోట్ల రూపాయలుగా అంచనా అని ఇది జిడిపిలో రెండుశాతమని పేర్కొన్నారు. మరి ఈ మొత్తమైనా బయటకు వచ్చిందా అంటే జవాబు లేదు. పార్లమెంట్‌ సమావేశాలలో అయినా చెబుతారా ? వేచి చూద్దాం !

   ఈ సమావేశాలకు ముందు తొమ్మిదివేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి, అందరి కళ్ల ముందునుంచే విదేశాలకు పారిపోయిన విజయ మాల్యకు రుణాల మంజూరు, పారిపోయేందుకు అవకాశం ఇవ్వటం గురించి పరస్పరం బిజెపి, కాంగ్రెస్‌లు విమర్శించుకున్నాయి. ఇలాంటి మాల్యలు ఎందరో తీసుకున్న రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో పేరుకు పోయిన నిరర్ధక ఆస్థుల తగ్గింపుకు చర్యలు తీసుకొనేందుకు ఆస్థుల పున:నిర్మాణ కంపెనీల(ఎఆర్‌సి)తో పాటు ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఈ సర్వేలో వెల్లడించింది. అతి పెద్ద, అత్యంత క్లిష్టమైన వుదంతాలలో ప్రభుత్వ రంగ సంస్ధల నిరర్ధక ఆస్థురుల తగ్గింపునకు రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా ఈ సంస్ద పని చేస్తుందట.

    మంచిదే. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులను బిజెపి ఏలుబడిలో ఇబ్బడి ముబ్బడిగా పారుబాకీలుగా ప్రకటించి రద్దు చేశారనే తీవ్ర విమర్శలను నరేంద్రమోడీ సర్కారు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నెల ఏడున అప్పుల రద్దుకు నిరసన తెలుపుతూ బ్యాంకు వుద్యోగుల సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో కారణం ఏదైనా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సరే ఆచరణలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో దేశం చూడబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రతి కార్పొరేట్‌ కంపెనీ అధిపతీ నరేంద్రమోడీ చర్యలకు మద్దతు ప్రకటించి ‘దేశభక్తి ‘ సర్టిఫికెట్‌ను తమకు తామే ఇచ్చుకుంటున్నారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గనుక వాటి వివరాల్లోకి పోనవసరం లేదు. ఆ ప్రచారంలో చోటుదొరకని అంశాలలో బ్యాంకుల నిరర్దక ఆస్థుల పెరుగుదల ఒకటి. గతేడాది సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థుల విలువ ఆరులక్షల 30వేల 323 కోట్ల రూపాయలు. అవెంత వేగంగా పెరుగుతున్నాయంటే జూన్‌-సెప్టెంబరు కాలంలో 79,977 కోట్లు పాత బాకీలకు తోడయ్యాయి. ఈ మొత్తం ఎంత అంటే బ్యాంకులు వంద రూపాయల రుణం ఇచ్చాయనుకుంటే 12 రూపాయలు నిరర్ధక ఆస్థులుగా తేలాయి. ఇవన్నీ కేంద్ర మంద్రి సుజనా చౌదరి వంటి ఘరానా పెద్దలు తీసుకున్న వందల కోట్ల రూపాయల మొత్తాలకు చెందినవే. ఒక్క రష్యాతప్ప ఇంత మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కార్పొరేట్‌ పెద్దలు మరొక ఏ వర్ధమాన దేశంలోనూ లేరట. సరే రష్యా అంటే సోషలిస్టు వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించిన సమయంలో దొంగలదోపిడీ జరిగిందనుకోండి.

   వ్యవసాయం గిట్టుబాటు గాక లేదా పంటలు పోయి, రకరకాల కారణాలతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దౌర్బాగ్య పరిస్థితి రైతాంగంలో వుంది. ఎక్కడా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పారిశ్రామిక, రాజకీవేత్తల గురించి మనం ఎక్కడా వినం, కనం. ఎందుకంటే వారు స్వంత డబ్బులతో లావాదేవీలు నిర్వహించరు గనుక. ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను ఎందుకు ఏర్పాటు చేయవలసి వస్తోందో ఆర్ధిక సర్వేలో చెప్పారు. ‘ రుణాల ఎగవేత సమస్య గురించి ప్రజలు చేస్తున్న చర్చలలో బ్యాంకుల పెట్టుబడి గురించి కేంద్రీకరించారు. ఈ రుణాల సమస్యకు పరిష్కారం కనుగొనటం పెద్ద సమస్యాత్మకంగా వున్నందున దానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంది. కొన్ని వుదంతాలలో నిధుల మళ్లింపు వలన సమస్యలు తలెత్తాయి. అయితే అత్యధిక వుదంతాలలో ప్రపంచ ద్రవ్య సంక్షోభం తరువాత ఏర్పడిన ఆర్ధిక వాతావరణంలో అనూహ్య మార్పులు దీనికి కారణమయ్యాయి. దాని వలన టైమ్‌టేబుల్స్‌, కరెన్నీ మార్పిడి రేట్లు, అభివృద్ధి అంచనాలు తీవ్రంగా తారుమారయ్యాయి. పెద్ద కేసులను పరిష్కరించటం పెనుసవాలుగా మారినందున దీనితో కేంద్రీకరించవచ్చు. రాని బకాయిలను ఆస్థులుగా చూపుతున్నందున వాటిని తగ్గించి ప్రభుత్వ రంగ సంస్ధల ద్రవ్య ఆరోగ్యాన్ని పునరుద్దరించాల్సి వుంది. సరే ఇలా ఎంతో అందమైన భాషలో చెప్పారనుకోండి. ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలున్నాయి.

    రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఇలాంటి పరిష్కార చర్యలను వ్యవసాయరంగ సంక్షోభం పరిష్కారానికి ఎందుకు తీసుకోదు? ఎవరు అడ్డుపడుతున్నారు. అమెరికా వంటి ధనిక దేశాలలో 2008లో తలెత్తిన సంక్షోభం మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఎం వంటి వామపక్షాలు, ఎందరో ఆర్ధిక వేత్తలు చేసిన హెచ్చరికలను నాడు అధికారంలో వున్న యుపిఏ పెద్దలు కొట్టివేశారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పెద్దలకు అసలు దాని గురించి పట్టలేదు. ఎక్కడో అమెరికాలో జరిగిన దివాళా పర్యవసానాలు ఎనిమిది సంవత్సరాల తరువాత మన బ్యాంకుల ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసినట్లు మన ప్రభుత్వమే అంగీకరించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాలనే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ అనుసరిస్తున్నది. వాటిని వారు బాగా అమలు జరపలేదు, మేం పక్కాగా చేస్తాం అని మరీ చెబుతున్నది. పాలకంటే మంచినీళ్ల ధరలు మోడీ హయాంలో కూడా ఎక్కువగానే వున్నాయి. నీళ్ల వ్యాపార కంపెనీలు తెలివి మీరి ఒక లీటరు బదులు ముప్పావు లీటరు సీసాలను అధిక ధరలకు అమ్ముతున్నాయి. మరి మార్పు ఏమి వచ్చినట్లు ? అందువలన ప్రపంచీకరణ పేరుతో అమలు జరుపుతున్న దివాలాకోరు, ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం కానున్నాయి. వాటిని జనం వుమ్మడిగా కాకపోతే ఎవరు పట్టించుకుంటారు. ప్రపంచీకరణతో వచ్చిన సమస్యలను ప్రపంచవ్యాపిత కార్యాచరణతోనే ఎదుర్కోవాలి. కులాలు, మతాలు, బంధుత్వాల పేరుతో జనం మొత్తానికి శఠగోపం పెట్టే విధానాలను వ్యతిరేకించకపోతే నష్టపోయేది జనమే. బ్యాంకుల్లో మన డబ్బు మనం రోజుకు 50వేల కంటే ఎక్కువ తీసుకుంటే పన్ను వేయాలని మన చంద్రబాబు గారి కమిటీ సిఫార్సు చేసింది. వారానికి 24వేల పరిమితిని ఆర్‌బిఐ ఇంకా ఎంత కాలం కొనసాగిస్తుందో తెలియదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో డబ్బున్న మారాజులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రాజకీయ వత్తిడికి లొంగి కరెంటు ఖాతాలపై పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది. ఇలాంటి పనులు సామాన్యుల విషయంలో ఆర్‌బిఐ ఎందుకు తీసుకోలేదు?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు బెర్లిన్‌ గోడ బద్దలు-నేడు మెక్సికో గోడ నిర్మాణం !

30 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti Muslim, ban on refugees, Berlin wall, Donald trump, Mexico wall, Muslim, Trump’s visa ban

Image result for Then who supported the dismantle of the Berlin wall now constructing Mexico wall

ఎం కోటేశ్వరరావు

    అధికారంలో వున్న వారి మాటలకు అర్ధాలే వేరు ! పెద్ద పెద్ద జలాశయాలకు పడే గండ్లు తొలుత చిన్నవిగానే వుంటాయి, తరువాత పూడ్చలేని విధంగా తయారవుతాయి. అమెరికా అధ్య్ష పీఠంపై కూర్చున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ పిచ్చి పనులు చేస్తారో తెలియని స్ధితి. ఆతగాడి చర్యలు ఎటు దారితీస్తాయో వెంటనే వూహించటం కష్టం. పాలకవర్గాలు తాము ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని జనం మీదో, మరొక దేశం మీదో నెట్టాలని నిర్ణయించుకుంటే రెచ్చగొట్టుడు, పిచ్చిపనులు చేయటం గత చరిత్ర అనుభవం. ప్రస్తుతానికి రెండు దృశ్యాలను వూహించ వచ్చు. ఒకటి, ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసిన ట్రంప్‌ తనకు ఓటు వేసిన జనాన్ని సంతృప్తి పరచాలంటే ఏదో ఒకటి చేస్తున్నట్లు నటించటం అవసరం కనుక ఆ స్క్రిప్టులో భాగంగా ఇలా చేస్తుండి వుండాలి. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటోంది, దానికి పెద్ద దిక్కుగా వున్న అమెరికా తన స్ధాయికి తగిన రీతిలో సమస్యలను ఎదుర్కొంటోంది. అందువలన తన బలాన్ని వుపయోగించి ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో, తన పెరటి దొడ్డిగా మార్చుకొనేందుకు పూనుకొని వుండి వుంటే ట్రంప్‌ను ఒక పావుగా వుపయోగించి తన జూదాన్ని అయినా ప్రారంభించి వుండాలి. ఏది అనేది కొద్ది వ్యవధిలోనే తేలిపోతుంది. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధిస్తూ ట్రంప్‌ శుక్రవారం నాడు ఒక వుత్తరువును జారీ చేశాడు. శనివారం నాడు ఆ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా అధికారులు అడ్డగించటంతో వచ్చిన వారు పలు విమానాశ్రయాల్లో నిరసనలకు దిగారు. వారం రోజుల పాటు ఆ వుత్తరువులను నిలిపివేయాలని శనివారం నాడు (జనవరి 28న) న్యూయార్క్‌ కోర్టు ఆ నిషేధాన్ని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా పౌర హక్కుల యూనియన్‌ (ఎసిఎల్‌యు) న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ఇరాకీ ప్రయాణీకుల తరఫున కోర్టుకు వెళ్లినప్పటికీ తాను జారీ చేసిన వుత్తరువు అమెరికా అంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నది. కొంత మంది ట్రంప్‌కు ఇది తొలి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ‘మన దేశానికి బలమైన సరిహద్దులు మరియు తీవ్రమైన నిఘా వుండాలి. ఇప్పుడు ఐరోపా, ప్రపంచమంతటా వాస్తవంగా ఏం జరుగుతోందో చూడండి-భయం కరమైన గందర గోళం ‘ అంటూ ఆదివారం వుదయం ట్వీట్‌ ద్వారా వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఏడు దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు విధించాను తప్ప ముస్లింల మీద విధించిన నిషేధం కాదంటూ ఎప్పటి నుంచో మన దేశం గట్టి నిఘా వేసి వుండాల్సింది, రాబోయే రోజులలో ఆ పని చేయబోతున్నాం అంటూ ఐఎస్‌ను ఓడించేందుకు 30రోజుల్లోగా ఒక పక్కా ప్రణాళికను తయారు చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు.

Image result for mexico wall

     అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చున్నా నడిపేది అక్కడి బడా కార్పొరేట్లు తప్ప మరొకరు కాదు. నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారం చూస్తుంటే తలతిక్క రాజు పనుల మాదిరి కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్బంగా ఏమి చెప్పినా కార్పొరేట్లకు ఇబ్బంది లేదు, ఓట్ల కోసం పడే పాట్లుగా వినోదం చూస్తారు. అధికారానికి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనేదే వారికి ముఖ్యం. ఆ రీత్యా చూసినపుడు ట్రంప్‌ పిచ్చి ప్రకటనలు ఎత్తుగడగా కేవలం జనాన్ని మభ్యపెట్టటానికేనా అని కూడా అనుమానించాల్సి వుంటుంది. తమ వస్తువులు, పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ బడితే అక్కడ ప్రవేశించటానికి ఎక్కడ ఎలా తిరిగినా మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఏ దేశంలో తిరిగినా చివరకు తమ దొడ్లలో లాభాలను పదిల పరుచుకోవటానికే కార్పొరేట్లు సరిహద్దులు, ఆటంకాలు లేని ప్రపంచీకరణ భావనను ముందుకు తెచ్చారు. ఐరోపా యూనియన్‌ పేరుతో ఇప్పటికే ఐరోపా ధనిక దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా ముందుకు పోవటం ఎలా అన్నది దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ స్ధితిలో అసలు సరిహద్దులు లేని దేశం ఒక దేశమా అంటూ ట్రంప్‌ ఐరోపా యూనియన్‌, ప్రపంచం ముందు ఒక కొత్త సవాలును విసిరారు.

    తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని, ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చని రామకృష్ణ పాత్రధారి చేత చెప్పించారు. ( ప్రాసకోసం వుపయోగించారు తప్ప నియోగులు అలాంటి వారని నేను అనుకోవటం లేదు ) పెట్టుబడిదారులు మాత్రం అలాంటి వారే. తమకు అవసరాలకు అనుగుణ్యంగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమకు అవసరం అనుకుంటే వున్న చోట గోడలు పడగొడతారు, లేని చోట కొత్త గోడలు కడతారు. పాతిక సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని కూల్చివేశామని ప్రకటించిన అమెరికా పాలకులు దానికి చిహ్నంగా బద్దలు కొట్టించిన బెర్లిన్‌ గోడను చూపారు. దాని శిధిలాల ముక్కలను ఇండ్లకు తీసుకుపోయి విజయ చిహ్నాలుగా అలంకరించుకున్నారు. గత 70 సంవత్సరాలుగా పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా అడ్డుకోవటమే గాక, దాని భూభాగాలను క్రమంగా ఆక్రమిస్తూ, జనం రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఇజ్రాయెల్‌ నిర్మిస్తున్న గోడలను అమెరికా సమర్ధిస్తోంది. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేసినట్లు ఇప్పుడు అదే అమెరికన్లు స్వయంగా మిగతా వారి కంటే పెద్ద గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. నాడు తూర్పు జర్మనీని బలవంతంగా పశ్చిమ జర్మనీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పని చేస్తే ఇప్పుడు తమ సమాజంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మెక్సికో సరిహద్దులలో గోడ నిర్మాణానికి పూనుకున్నారు. నిజంగా ఆ పనిచేస్తారో లేదో తెలియదుగానీ గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వుత్తరువులపై సంతకాలు చేశారు. అందుకు అవసరమయ్యే నిధులను పార్లమెంట్‌ మంజూరు చేసి, చట్టపరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకపోతే గోడ నిర్మాణం ఏప్రిల్‌ తరువాత ప్రారంభమౌతుంది.

Image result for mexico wall cartoon

    మెక్సికో గోడ నిర్మిస్తే ఎవరికి లాభం-ఎవరికి నష్టం అన్న చర్చ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది.ఇప్పుడు ఇంకా పెరిగింది. నిజానికి ఇది కేవలం ఒక గోడ నిర్మాణానికే పరిమితం కాదు.దానితో అమెరికా సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ మంతా ఎల్లలు లేని ఒక కుగ్రామం అని అందరూ ఒకవైపు చెబుతూనే ఏదో ఒక కారణం చూపి గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి వివిధ దేశాల మధ్య 45 గోడలు, కంచెలు వున్నాయి. వాటికి కారణాలుగా చెప్పిన సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. ట్రంప్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికన్లకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి వుద్యోగాలు కల్పించాలంటే విదేశాల నుంచి ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై పన్ను విధించి తద్వారా స్ధానికంగా వుత్పత్తిని ప్రోత్సహించి నిరుద్యోగ, ఆర్ధిక సంక్షోభ సమస్యను పరిష్కరించాలనే దగ్గర దారి ప్రయత్నమిది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో-మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్నట్లుగా మిగిలిన దేశాలు అమెరికా పెద్దన్న పెత్తనానికి తలవంచుతాయంటే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు.

     అమెరికా-మెక్సికో సంబంధాలలో రెండు అంశాలున్నాయి. ఒకటి అమెరికా చెబుతున్నట్లు మెక్సికో నుంచి బతకటానికి వచ్చే వారు అడ్డదారుల నుంచి అమెరికాలో ప్రవేశించటం. 1994లో అమెరికా-మెక్సికో-కెనడాలు వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో అమెరికా నుంచి మెక్సికో దిగుమతులు ఎక్కువగా వున్నాయి. వాటిని మరింతగా పెంచేందుకు ఆ ఒప్పందం వుపయోగపడుతుందని అమెరికా కార్పొరేట్‌ శక్తులు ముందుగా అంచనా వేశాయి. అయితే ఆ తరువాత అందుకు విరుద్దంగా జరిగింది. 1995-2016 మధ్య మెక్సికో నుంచి అమెరికా దిగుమతులు 65 నుంచి 295 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మెక్సికోకు ఎగుమతులు 68 నుంచి 235 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. అంటే నాఫ్టా ఒప్పందం వలన మెక్సికో లాభపడింది. ఈ అంకెలను చూపి నాఫ్టా ఒప్పందం ఏకపక్షంగా జరిగిందంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లు వ్యవహరించే పెద్దన్న అమాయకంగా ఒప్పందంపై సంతకం చేశారంటే ఎవరైనా నమ్ముతారా ?

   కార్పొరేట్‌ శక్తులకు కావాల్సింది లాభం. అది స్వంత దేశంలోని కార్మికులకు పని కల్పించి సంపాదించిందా, పొరుగుదేశంలోని కార్మికుల నుంచి పిండుకున్నదా అన్నది వారికనవసరం.ఆ క్రమంలో మెక్సికో నుంచి దిగుమతులు చేసుకోవటమే వారికి లాభసాటిగా మారిందన్నది అసలు విషయం. అదే చైనా, మెక్సికో, మిగతా పేద, వర్ధమాన దేశాల అనుభవం. అత్యంత పేద దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోని ధనిక దేశాల వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలన్నీ తమ దుస్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నిజానికి బంగ్లాదేశ్‌ వినియోగం కోసమైతే అన్ని అవసరం లేదు. అక్కడ తయారయ్యేవన్నీ ఎగుమతుల కోసమే. మెక్సికో సుంచి వలసల వలన అక్కడ సమస్య తలెత్తిందనుకుందాం, మరి ఐరోపా ధనిక దేశాల సంక్షోభ సమస్య మాటేమిటి ? అమెరికాలో ఆర్ధిక సమస్యలు తలెత్తి జనానికి అవసరమైన వుద్యోగాలు దొరకక పోవటానికి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తున్నవారే కారణమని అక్కడ వున్న రెండు పార్టీల వారూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. అదొక ఎన్నికల సమస్యగా మారింది. ఎవరు ఆ సమస్య గురించి తక్కువ మాట్లాడితే వారు జనంలో పలుచనయ్యే స్థితి. అందువలననే ఎన్నికలకు ముందు, తరువాత హడావుడి చేయటం తరువాత ఏదో చేశామనిపించి జనాన్ని జోకొడుతున్నారు. ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పర్యవసానాలు ఆ సమస్యను తాజా ఎన్నికలలో మరింత ఎక్కువగా ముందుకు తెచ్చాయి. ప్రతిపక్షంలో వున్న రిపబ్లికన్‌ పార్టీ తాము అధికారానికి వస్తే తెల్లవారే సరికి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి పరిష్కరిస్తామని ప్రచారం చేసింది.

     నిఘా వేయటంలో ఎంతో ఆధునిక పరిజ్ఞానం వున్న అమెరికాకు అక్రమ వలసలను అరికట్టటం ఒక సమస్య కానే కాదు. మెక్సికో ద్వారా వివిధ లాటిన్‌ అమెరికా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించి అధికారికంగా నమోదు కాని కార్మికులుగా పని చేయటం ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లు వదలి వేస్తున్నాయి. ఎందుకంటే చట్టబద్దమైన కార్మికులతో పాటు వీరు కూడా పన్నులు చెల్లిస్తారు. సామాజిక భద్రతా పధకాలు, పెన్షన్‌ వంటి వాటిని వారికి చెల్లించనవసరం లేదు. వలస వచ్చిన వారు తక్కువ వేతనానికి పని చేస్తారు. యజమానులకు అది అదనపు లాభం. స్ధానికులతో పని చేయించుకొనే యజమానులు ఎక్కువ వేతనాలను చెల్లించటంతో పాటు వారి సామాజిక భద్రతా పధకాలకు తమ వాటా చెల్లించాల్సి వుంటుంది. ఇది వారి లాభాలను, పోటీ శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పని చేసేందుకు ఎక్కువగా వీరిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నట్లు వారి రాకను నిరోధించేందుకు నిఘా పెంచినా, అడ్డుకునేందుకు పెద్ద గోడను నిర్మిస్తే ఏం జరుగుతుంది?

   వలసలు ఆగిపోయి కొంతమేరకు స్ధానికులకు వుద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. ఇదే సమయంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ అన్నది ఎక్కువగా వినిపిస్తోంది.ప్రపంచ మార్కెట్‌లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే ఇప్పటికే అమెరికాలో వుత్పాదక ఖర్చులు ఎక్కువగా వున్నాయనే కారణంతో అమెరికా పెట్టుబడిదారులు కొత్తగా పెట్టే వాటితో పాటు పాత పరిశ్రమలను కూడా వేతన రేట్లు తక్కువగా వుండే దేశాలకు తరలించారు. ఆధునిక పరిజ్ఞానం ఇమిడి వుండే కొన్ని వస్తువులకు సంబంధించిన భాగాలు అమెరికాలో తయారు చేసి వాటిని ఇతర దేశాలకు తరలించి అక్కడ తయారైన వస్తువులను తిరిగి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వుదాహరణకు జపాన్‌కు చెందిన మన దేశంలోని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో తయారయ్యే కార్లను జపాన్‌తో సహా మరో వంద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాడి సెప్టెంబరు నాటికి పదిహేను లక్షల కార్లను ఎగుమతి చేశారు. అలాగే మెక్సికో నుంచి జరుగుతున్నాయి.

   ట్రంప్‌ చెబుతున్నట్లు గోడ నిర్మాణానికి లేదా దిగుమతుల నిరోధానికి 20శాతమో అంతకంటే ఎక్కువో దిగుమతి పన్ను విధిస్తే అది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దమే గాక అమెరికాకే నష్టం. మెక్సికో నుంచి ఏటా 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను అమెరికా దిగుమతి చేసుకొంటోంది. వీటిలో 40శాతం వరకు అమెరికా నుంచి విడి భాగాలను మెక్సికో పంపి అక్కడి నుంచి పూర్తిగా తయారైన వస్తువులు తిరిగి అమెరికాకు వచ్చేవి వున్నాయి. వాటి మీద, అలాగే పూర్తిగా మెక్సికో నుంచి వచ్చే వాటిమీద ఎంత పన్ను విధిస్తే, అవి దిగుమతి చేసుకోవటం అనివార్యం అయితే ఆ మేరకు భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుంది. ఇది చైనా, కెనడా, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. దీని వలన తలెత్తే సమస్యలను అధిగ మించాలంటే మెక్సికో, ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను విధించటం వంటి చర్యలకు పాల్పడతాయి.అంటే అది వాణిజ్య యుద్ధంగా మారుతుంది. మెక్సికోతో వాణిజ్యంపై ఆధారపడి అమెరికాలో 60లక్షల మంది వుపాధి పొందుతున్నారు. ఒక వేళ మెక్సికోలో వాటి తయారీని నిలిపివేస్తే అమెరికాలోనే వాటిని తయారు చేస్తే కొంత మంది వుపాధి పోవటం, వినియోగదారులపై అదనపు భారం పడటం అనివార్యం. ఇలాంటి ఎన్నో సమస్యలున్న కారణంగానే అలాంటి పిచ్చిపనులు చేస్తే విజేతలంటూ వుండరు, అటూ ఇటూ నష్టపోతారని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ దవోస్‌ సమావేశంలో హెచ్చరించారు. అమెరికా కార్పొరేట్లు ట్రంప్‌ ప్రకటనల లాభ నష్టాలను బేరీజు వేసుకొని తమకు లాభం వచ్చే మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఏం చేస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధారణ ప్రపంచ వ్యాపిత నిరసనల మధ్య అందలమెక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌

23 Monday Jan 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, protest, WomensMarch against Donald Trump

ఎం కోటేశ్వరరావు

    1860లో అమెరికా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌ చరిత్ర సృష్టించాడు. ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. వైట్‌ హౌస్‌లో ఆయన ఆశీనుడు కావటాన్ని సహించలేని దక్షిణాది రాష్ట్రాలలోని బానిసల యజమానులు ప్రత్యేక దేశ ఏర్పాటును ప్రకటించి అంతర్యుద్ధానికి కారకులయ్యారు. రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తిరుగుబాటుదార్లు లొంగిపోయి అంతర్యుద్ధం ముగిసింది అనుకుంటున్న తరుణంలో బానిసత్వాన్ని సమర్ధించే ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదే రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీస్వీకారం చేస్తున్న సమయంలో అమెరికాతో సహా అన్ని ఖండాలలో నిరసన ఎదుర్కొన్న వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వదరుబోతులకు అమెరికా సమాజం పెట్టింది పేరు. ఇంతవరకు అలాంటి వారెవరూ అధ్యక్ష స్ధానంలో కూర్చోలేదు. డోనాల్ట్‌ ట్రంప్‌తో అది కూడా జరిగిపోయింది. మహిళలు, కార్మికులకు, సామాన్య జనానికి, ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఒక ఫాసిస్టుగా ముద్రపడి ప్రపంచ వ్యాపితంగా నిరసనలకు కారకుడయ్యాడు. అమెరికా వంటి దేశాలలో సాధారణ నిరసన ప్రదర్శనలంటే బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని కొన్ని వందల మంది వీధులలోకి రావటం తప్ప సంఖ్య ఎక్కువగా వుండదు. యుద్ధవ్యతిరేక వుద్యమం వంటి సందర్భాలలోనే లక్షల సంఖ్యలో హాజరైన వుదంతాలు వున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్ధాయిలో ముఖ్యంగా మహిళలు లక్షల మంది వీధులలోకి వచ్చి అనేక నగరాలలో ప్రదర్శనలు జరిపారు. ఒక వ్యక్తి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి దేశాధినేత ఎన్నికైనట్లు ప్రకటించగానే అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తటం తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వున్నప్పటికీ అమెరికన్‌ సమాజం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు, తీరు తెన్నులను చూసి ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే నిరసనలు వ్యక్తం చేశారు. అంతకంటే పెద్ద స్ధాయిలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటం బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికా అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌తోనే ప్రారంభమై వుండాలి.ట్రంప్‌ తన పదవీకాలంలో ఎలా ప్రవర్తిసాడు, ఏవిధంగా ముగుస్తుందన్నది ఆసక్తికరం.

Image result for donald trump oath taking

   ప్రజాస్వామ్యం అంటే అమెరికాలో మాత్రమే వుంటుందన్నది కొందరి ప్రగాఢ నమ్మకం. అర్హత కలిగిన ఓటర్లలో కేవలం 25శాతం మాత్రమే ట్రంప్‌కు ఓటు చేశారు. జనం వేసిన ఓట్లు ట్రంప్‌ కంటే ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా వున్న హిల్లరీ క్లింటన్‌కు 28లక్షలు అదనంగా వచ్చాయి. కానీ అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎక్కువ స్ధానాలు రావటంతో ట్రంప్‌ గెలిచాడు.ఇదీ అక్కడి ప్రజాస్వామ్యం తీరు. ప్రపంచీకరణ గురించి ఇంతకాలం సుద్దులు చెప్పిన వారు ఇప్పుడు అమెరికా తరువాతే మిగతా దేశాలు (అమెరికా ఫస్ట్‌ ) అని ట్రంప్‌ మాట్లాడుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. అలాంటి పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అసాధారణరీతిలో తెలుగు మీడియా వార్తలు ఇచ్చిన తీరు ప్రమాదకర పోకడలను తెలియ చేస్తోంది.ఫాసిస్టులు జనం కోసం కబుర్లు చెప్పి ఆచరణలో కొద్ది మంది తమ చుట్టూ వుండే కుటుంబాలు, బినామీలు, కార్పొరేట్లు, విధేయులకు ఆచరణలో వుపయోగపడతారు. ఎన్నికల ప్రచారంలో అమెరికన్ల వుద్యోగాలు, వుపాధి వంటి అంశాల గురించి, ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు వచ్చిన వారు స్ధానికుల వుపాధిని దెబ్బతీస్తున్నారని, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పెద్ద మొత్తంలో పన్నులు, బయటి వారికి వుపాధి కల్పించే స్ధానిక పెట్టుబడిదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ చెప్పటం జనం ఓట్ల కోసమే. ఇప్పుడు అధికారం స్వీకరించారు గనుక కార్పొరేట్లు, విధేయులు, కుటుంబ సేవ ప్రారంభిస్తారు. అత్యంత ధనికులు, పేరు మోసిన కార్మిక వ్యతిరేకులు, జాత్యహంకారులతో కూడిన పచ్చి మితవాద ప్రముఖులందరినీ తన మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకొని నాంది పలికారు. ఎన్నికల ప్రచారంలో మెక్సికో, చైనా నుంచి వలసలు వచ్చిన వారి గురించి, ముస్లింలు, మీడియా, కార్మిక సంఘాల గురించి అవాకులు చెవాకులు పేలిన ట్రంప్‌ పదవీబాధ్యతల స్వీకారం సందర్భంగా వాటిని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షపద్దతులలో తన మద్దతుదారులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడి సంతృప్తి పరచారు. అమెరికా వస్తువులనే కొనాలి, అమెరికన్లకే వుద్యోగాలివ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక పెద్ద రియలెస్టేట్‌ వ్యాపారి. తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని శ్రీశ్రీ చెప్పినట్లుగా విదేశాల నుంచి వలస వచ్చి అమెరికా రికార్డులలో నమోదు కాకుండా తక్కువ వేతనాలకు పని చేసిన వారినే తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కార్యాలయాల నిర్మాణానికి వుపయోగించుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారందరూ ధరించిన కొత్త సూట్లు, కోట్లు, టైలు ఒకటేమిటి సర్వం కారు చౌకగా విదేశీ కార్మికులు తయారు చేస్తే ట్రంప్‌ స్వంత కంపెనీలు దిగుమతి చేసుకున్న సరుకే. ఇలాంటి వ్యక్తిని అమెరికన్లు ఎందుకు ఎన్నుకున్నారన్న ప్రశ్న తలెత్తటం సహజం. సంక్షోభంలో వున్న సమయంలో కార్పొరేట్‌ మీడియా పచ్చి మితవాదులను ఆకాశానికి ఎత్తుతుంది, ఓటర్లను ప్రభావితం చేస్తుంది, కార్పొరేట్‌ శక్తులు కూడా తమ ప్రయోజనాలను నిర్ధాక్షిణ్యంగా కాపాడేవారిని ఎంచుకుంటాయి. ప్రపంచ మంతా ఫాసిస్టు హిట్లర్‌ను వ్యతిరేకిస్తే 1940 అధ్యక్ష ఎన్నికలలో హిట్లర్‌ అనుకూల లిండ్‌ బెర్గ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొని ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ను ఓడించారు. అందువలన వివిధ కారణాలతో జనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా అమెరికా సమాజంలో ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లుగా వున్న వారిలో నియతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. శ్వేత జాతీయల పార్టీగా అది తయారైంది. గత ఎన్నికలలో ట్రంప్‌కు తోడ్పడిన అంశాలలో అదొకటిగా పరిశీలకులు చెబుతున్నారు.

Protesters at the Women's March in Washington

   ట్రంప్‌ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రపంచవ్యాపితంగా ఆరువందల నగరాలలో లక్షలాది మంది ప్రదర్శనలు చేసినట్లు ఒక వార్తా సంస్ధ కథనం. అమెరికాలో జరిగిన ప్రదర్శనలలో ఎంత మంది పాల్గొన్నారనేదానిపై తమ స్వంత లెక్కలు వేయలేదని, ప్రభుత్వ శాఖలు వేసిన అంచనాలను అందచేస్తున్నామని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. వాషింగ్టన్‌ నగరంలో అతి పెద్ద ప్రదర్శన జరిగింది. అత్తమీద కోపం దుత్త మీద చూపారన్న సామెత మాదిరి తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న జనంపై విమర్శలకు దిగితే మరింతగా తన పరువు పోయే అవకాశం వున్నందున ఆ కోపాన్ని మీడియాపై ప్రదర్శించినట్లుగా వుంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రమాణాస్వీకారోత్సవంతో పోల్చి తన కార్యక్రమానికి జనం తక్కువగా వచ్చారని, కొన్ని ప్రాంతాలు ఖాళీగా వున్నాయని మీడియా రాయటం, చూపటంపై మరుసటి రోజు ట్రంప్‌ మండి పడ్డారు. సిఐఏ కార్యాలయ సందర్శన సందర్శన సందర్భంగా మాట్లాడుతూ భూమ్మీద నిజాయితీ లేని మనుషులు ఎవరంటే జర్నలిస్టులే అంటూ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పది, పదిహేను లక్షల మంది వచ్చినట్లుగా తనకు కనిపించిందని ట్రంప్‌ చెప్పారు. అయితే వాషింగ్టన్‌ మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి గురించి నమోదైన వివరాల ప్రకారం ఐదులక్షలకు పైగా వుండగా బరాక్‌ ఒబామా తొలిసారి ప్రమాణస్వీకారం సందర్భంగా పదకొండు లక్షలు, రెండవ సారి ఎనిమిది లక్షల వరకు ప్రయాణించినట్లు నమోదైంది. ఒక పత్రిక ట్రంప్‌ సభకు రెండున్నరలక్షల వరకు వచ్చినట్లు పేర్కొన్నది.దానిపై ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ అది అబద్దం తప్ప తప్పుకాదు, అంతకంటే ఎక్కువే వచ్చారు అన్నారు. ప్రమాణ స్వీకార సభకంటే నిరసన ప్రదర్శనకు ఎక్కువ మంది రావటం, మీడియాలో ప్రచారం రావటం ట్రంప్‌ ఆగ్రహానికి అసలు కారణం. ట్రంప్‌ అనుగ్రహం పొందే యత్నంలో భాగంగా అధ్యక్ష భవన సిబ్బంది అధిపతి రెయిన్స్‌ ప్రైబస్‌ కూడా మీడియాపై దండెత్తారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్‌ను చట్ట విరుద్ధ అధ్యక్షుడిగా చిత్రించే మానసిక స్ధితికి మీడియా గురైందని దాన్ని చూస్తూ వూరుకోబోమని, ప్రతిరోజు చీల్చి చెండాడుతామని బెదిరింపులకు దిగారు. బరాక్‌ ఒబామా 2009 ప్రమాణ స్వీకార ఫొటోలను చూస్తే ట్రంప్‌ కార్యక్రమానికే ఎక్కువ మంది వచ్చినట్లు చూడవచ్చన్నారు. ట్రంప్‌ పత్రికా కార్యదర్శి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ ఏడు లక్షల 20వేల మంది ప్రమాణ స్వీకారనికి వచ్చారంటూనే ఎవరి దగ్గరా లెక్కలు లేవన్నారు. స్పైసర్‌ లెక్కను అగ్రశ్రేణి మీడియా సంస్ధలు తప్పుడు లెక్కలుగా వర్ణించాయి. స్పైసర్‌ రుజువు చేయదగిన అవాస్తవాలు చెబుతున్నారని ఒక చర్చా కార్యక్రమంలో యాంకర్‌ చెప్పటంతో ట్రంప్‌ సహాయకురాలు కెలీయానే కాన్వే తమ ప త్రికా కార్యదర్శిని అలా సంబోధిస్తే మీడియాతో సంబంధాల గురించి పునరాలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు. వచ్చిన జనం నిజంగా ఎంత మందో లెక్క వేయటానికి అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించటంతో ఒక జర్నలిస్టు నవ్వాడు. దానికామె స్పందిస్తూ మీరు నన్ను చూసి నవ్వవచ్చు, మమ్మల్ని మీడియా ఎలా చూస్తున్నదో చెప్పటానికి మీ నవ్వే చిహ్నం అని వుడుక్కున్నారు. ఇలాంటి ట్రంప్‌, పరివార చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది వెండి తెరపై చూడాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ప్రపంచీకరణ హీరోగా మారిందా ?

21 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Chinese President, Donald trump, globalisation, Oxfam, WEF, World Economic Forum 2017, Xi Jinping

Image result for IS really China became Globalisation Hero

ఎం కోటేశ్వరరావు

   అమెరికా, బ్రిటన్‌ వేరే అజండాలతో ముందుకు పోతుంటే దవోస్‌ నిర్వాహకులు చైనా కమ్యూనిస్టుపార్టీ అనే కొత్త హీరోను ముందుకు తెచ్చారు అంటూ ప్రపంచ ధనికుల పత్రిక ఫోర్బ్స్‌ శీర్షిక పెట్టింది. వర్తమాన పరిస్థితులలో ఇలా రాసినందుకు ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు గర్వపడాలా లేక ప్రపంచ ధనికుల వేదికలో హీరోగా మారినందుకు లేదా మార్చినందుకు చైనా సోషలిజం గురించి అనుమానించాలా అన్న సందేహం ఎవరికైనా కలగటం సహజం. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలలో పాల్గొన్న తొలి చైనా అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన గ్జీ జిన్‌పింగ్‌ ప్రపంచీకరణను గట్టిగా సమర్ధించినట్లు వార్తలలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీటిని చూసిన తరువాత చూశారా మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం, చైనాలో పభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం, కమ్యూనిజం లేదు పాడు లేదు అని చెబుతున్నవారు మరింతగా రెచ్చి పోవచ్చు. రాబోయే రోజులలో చైనా కంటే మన దేశ అభివృద్ధి రేటు ఎక్కువగా వుంటుందని, అమెరికా తరువాత రెండో స్ధానంలో వున్న ‘మందుభాయీలను’ వెనక్కు నెట్టి ఆ స్ధానాన్ని ఆక్రమించాలని, పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని సాహసం చేశారని వంది మాగధుల పొగడ్తలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల వైపు కన్నెత్తి చూడలేదు. మోడీగారు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా ఎందుకు వుంటున్నారన్న విమర్శకు విదేశీ పెట్టుబడుల సాధనకు అని సిద్దం చేసుకున్న సమాధానం చెప్పారు. దవోస్‌ అంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ చేరే కేంద్రం. అలాంటి కేంద్రాన్ని సందర్శిస్తే అన్ని దేశాల పెట్టుబడిదారులను అక్కడే కలుసుకోవచ్చని నరేంద్రమోడీకి తట్టలేదా లేదా చెప్పిన వారు లేరా ? కనీసం చంద్రబాబును చూసైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబూ ఆ సమావేశాలకు పోయి నేనూ వెళితే నా గొప్పేముంటుంది అనుకున్నారా ? సరే చంద్రబాబు నాయుడు తన పరివారంతో అత్యంత ఖరీదైన ఈ జాతరకు క్రమం తప్పకుండా వెళ్ళటం పెద్దలతో కలిసిన ఫొటోలు, ప్రకటనలు గుప్పించటం, తడిచి మోపెడు ఖర్చును జనంపై రుద్దటం గత ఆనవాయితీ, షరా మామూలే అనుకోండి. రాజుల సొమ్ము రాళ్లపాలైందన్న సామెతను తిరగరాసుకుంటే ఆంధ్రుల సొమ్ము చంద్రబాబు పరివార విదేశీ యాత్రలపాలు అని చెప్పాల్సి వుంటుంది. గతంలో చేసిన యాత్రలు, దిగిన ఫొటోలు, అయిన ఖర్చులు, పొందిన హామీలు, సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం సమర్పిస్తే అసలు బండారం బయట పడుతుంది.

Image result for wef 2017

    ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు జరిగాయి. ‘ ప్రతి స్పందక మరియు జవాబుదారీ నాయకత్వం ‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమలు జరుగుతున్న విధానాల పర్యవసానాల గురించి నేతలు ప్రతిస్పందించటం లేదని, జవాబుదారీయుతంగా వ్యవహరించ కుండా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని భావించాలి. ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకు పోయే క్రమంలో ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది. కాల క్రమంలో కొన్ని మార్పులకు లోనైనప్పటికీ మౌలిక లక్ష్యం మారలేదు. ఏటా కనీసం ఐదువందల కోట్ల డాలర్లకు పైబడి లావాదేవీలు నిర్వహించే బడా కంపెనీలకు మాత్రమే దీనిలో సభ్యత్వం ఇస్తారు. ఎగ్జిబిషన్లలో ప్రవేశం పొందాలంటే ప్రవేశ రుసుం మాదిరి దీని సమావేశాలకు హాజరుకావాలంటే 68వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (ఒక ఫ్రాంక్‌ మన రు 67.75 సమానం) అంటే 46లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ఎగ్జిబిషన్‌లోకి వెళ్లిన తరువాత జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ఫొటో తీయించుకోవటం ఇలా ప్రతిదానికి ఒక్కో రేటు చెల్లించాలి. దవోస్‌ సమావేశాలలో అలా అన్ని విభాగాలలో ప్రవేశం పొందాలంటే ఆరులక్షల ఫ్రాంకులు అంటే 40 కోట్ల 64లక్షల రూపాయలు చెల్లించాలి. అంత మొత్తం చెల్లించిన కంపెనీ సిఇఓ తనతో పాటు నలుగురిని తీసుకు వెళ్ల వచ్చు. అదనంగా తలకు 18వేల స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలి. చంద్రబాబు అండ్‌కోకు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేదా ఆయన ద్వారా లబ్ది పొంద చూసే ఏ అనిల్‌ అంబానీయో, మరొక బడా కార్పొరేట్‌ కంపెనీయో ఆ ఖర్చులను భరించాల్సి వుంటుంది.

    దవోస్‌ వేదిక ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, నిరసనలు తెలపటం, పోటీ సమావేశాలు పెట్టటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎనిమిదిమంది చేతులలో ప్రపంచంలోని 360 కోట్ల మంది పేదల దగ్గరున్న వాటికి సమానమైన సంపదలు కేంద్రీకృతమయ్యాయని ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించటం దీనిలో భాగమే. అటువంటి అంతరాలు పెంచే ప్రపంచీకరణను కమ్యూనిస్టు చైనా వ్యతిరేకించాలి కదా ? ఆ పని చేయకుండా జిన్‌పింగ్‌ అలా మాట్లాడటం ఏమిటి ? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.

    ఐరోపా యూనియన్‌లో చేరితో ప్రయోజనం జరుగుతుందని అనుకున్నాము. అటువంటిదేమీ కనిపించటం లేదు కనుక బయటికి పోయి, విడిగా మా లావాదేవీలు మేము నిర్వహించుకుంటాం అంటూ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణే బ్రెక్సిట్‌ అన్నది తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు ముగిసిన తరువాత మెక్సికో, చైనా తదితర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై పది నుంచి 50శాతం వరకు పన్ను విధిస్తామని, అమెరికా వుద్యోగాలను బయటికి పంపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఇంకా అనేక రక్షణ చర్యలు తీసుకోవటం తద్వారా వుద్యోగాలు కల్పిస్తానంటూ ఎన్నికల సందర్భంగా అమెరికా వూరూ వాడా అంతా తిరిగి చెప్పారు. ఇంకా అనేక ధనిక దేశాలలో అలాంటి మాటలు మాట్లాడేవారి వైపే మొగ్గేందుకు జనం సిద్ధ పడుతున్నారన్నది పరిణామాల విశ్లేషణ.( ప్రపంచ సంస్ధలకు మన మార్కెట్‌ తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని ముఖ్యమైన యుపిఏ ప్రభుత్వ విధానాలన్నింటినీ, రూపాయి విలువ పతనాన్ని బిజెపి పదేళ్లపాటు వ్యతిరేకించి జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆ విధానాలనే మరింతగా అమలు జరుపుతోంది, దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అది వేరే విషయం. ) నిజానికి ఇవన్నీ ప్రపంచ ధనిక దేశాలు ఇంతకాలం నుంచి చెబుతున్న ప్రపంచీకరణ , ప్రపంచ వాణిజ్య సంస్ధ, దాని తరఫున జరుగుతున్న చర్చల ప్రక్రియకు విరుద్దం.

    పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు వాణిజ్యం పేరుతో ప్రపంచం మీద వలసవాదాన్ని రుద్ధి ఎవరి బలం కొద్దీ వారు ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పంచుకున్నారన్నది గత చరిత్ర. దానికి ప్రతిఘటన ఎదురుకావటం, చివరకు యుద్ధాలతో సామ్రాజ్యవాదులు చావు దెబ్బలు తిని తోక ముడిచారు. ఆ తరువాత తమ దోపిడీని కొనసొగించేందుకు రూపొందించిన నయా వలస లేదా నూతన దోపిడీ పద్దతులలో భాగమే ప్రపంచీకరణ. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నది లేదా ముందుకు తెచ్చిన అవగాహన కాదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న పిలుపు దోపిడీ సమాజాన్ని కూలదోయటానికి, సమసమాజాన్ని నిర్మించటానికి తప్ప దోపిడీకి కాదు.

    బ్రిటీష్‌ వారి స్ధానంలో ప్రపంచ సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల నాయకురాలిగా ముందుకు వచ్చిన అమెరికా ఒకవైపు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటంతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో ఆవిర్బవించిన నూతన సోషలిస్టు రాజ్యాలను, వాటికి మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని దెబ్బతీయటం అనే లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నారు. దానిలో భాగంగానే సోషలిస్టు దేశాలను దెబ్బతీయటానికి, వాటికి ఆధునిక పరిజ్ఞానం, అవసరమైన పెట్టుబడులు అందకుండా చేసి సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానమే దిక్కు అని చెప్పేందుకు గతంలో పెట్టుబడిదారీ దేశాలు అనేక చర్యలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దానిలో భాగంగానే అమెరికన్లు దశాబ్దాల తరబడి క్యూబాను అష్టదిగ్బంధనం కావించారు. ఈ పూర్వరంగంలోనే చైనాతో సహా మిగిలిన సోషలిస్టు దేశాలు సోషలిస్టు సంస్కరణలకు తెరతీశాయి. వీటిపై కమ్యూనిస్టుపార్టీలు, లేదా వామపక్ష మేథావులలో కొన్ని భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు చైనా అధ్యక్షుడి ప్రసంగానికి ప్రపంచీకరణను సమర్ధించే హీరోగా వర్ణిస్తే చైనాలో అంతర్భాగంగా వుంటూ పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ మీడియా విలన్‌గా పేర్కొన్న విషయాన్ని గమనించాలి.

   చైనా సంస్కరణలతో నిమిత్తం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే నూతన పరిస్థితులలో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు నూతన ఎత్తుగడలతో సామ్రాజ్యవాదులు నాంది పలికారు. దాని పర్యవసానమే బ్రెట్టన్‌ వుడ్‌ కవలలుగా పిలుస్తున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ. అవి రెండూ అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని రూపొందించాయి. ఆ విధానంలో అంతర్భాగంగా వుండే వాణిజ్యం సాఫీగా సాగేందుకు, పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు వాణిజ్య సరళీకరణకు గాను వివిధ దేశాలు అప్పటి వరకు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను సడలించేందుకు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌)పై 23 దేశాలు జెనీవాలో ఏడు నెలలపాటు చర్చలు జరిపి 1947 అక్టోబరు 30న సంతకాలు చేశాయి. తరువాత దాని అమలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చలు ఎవరు ప్రారంభిస్తే లేదా ఎక్కడ ప్రారంభమైతే ఆ దఫా చర్చలు అని పిలిచేవారు. అలా ఫ్రాన్స్‌లోని అనెసీలో రెండవ దఫా చర్చలు 1949లో 34 దేశాలతో ప్రారంభమై ఐదు నెలల్లో ఐదువేల సరకులపై పన్నుల తగ్గింపునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1950 టొరొక్వే(బ్రిటన్‌) ఎనిమిదినెలలు, 1956 జనీవా-2 ఐదునెలలు, 1960 దిలియాన్‌(అమెరికా మంత్రి) 11నెలలు, 1964 కెన్నడీ(అమెరికా అధ్యక్షుడు) 37నెలలు, 1973 టోక్యో 74నెలలు, 1986 వురుగ్వే 87నెలల చర్చల తరువాత ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చింది. దాని ఆధ్వర్యంలో 2001లో ప్రారంభమైన దోహా చర్చలు 16 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని స్ధితి. దీనికి కారకులు ఎవరు? మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటి కొస్తూ మాకేం తెస్తావ్‌ అంటున్న ధనిక దేశాల అత్యాశ, పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న సంక్షోభమే అన్నది కొందరి అభిప్రాయం.

   గాట్‌ ఒప్పందం చేసుకున్న తొలి 23 దేశాలలో చైనా ఒకటి అయినప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదికి చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అందువలన ప్రపంచ వాణిజ్య చర్చలలో అది భాగస్వామి కాలేదు. 1978లో చైనా సంస్కరణలకు తెరతీసి విదేశీ పెట్టుబడులు, సంస్థల ప్రవేశానికి వీలు కల్పించిన తరువాత 1986లో పరిశీలక హోదాతో అనుమతించారు. తరువాత మిగతా ఏ దేశానికీ లేని విధంగా కఠినమైన షరతులు విధించి 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు పూర్తి సభ్వత్వం ఇచ్చారు.ఈ పూర్వరంగంలో చైనా అధ్యక్షుడి మాటలను పరిశీలించాల్సి వుంటుంది.

     పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది కీలకం అన్న చైనా సామెత మాదిరి తమ దేశంలోని 95 కోట్ల మంది జనాభా(1978)కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమదైన లక్షణాలతో కూడిన సోషలిస్టు సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది. అప్పటికే మార్కెట్లకోసం అర్రులు చాస్తున్న అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే, అక్కడి సోషలిస్టు వ్యవస్ధను కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అందుకు చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. మంచి గాలి, వెలుతురు కోసం కిటికీలను తెరుస్తాము. వాటితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి. అయితే వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు. దానికి అనుగుణ్యంగా తియన్‌మెన్‌ స్క్వేర్‌ పేరుతో జరిగిన కుట్రను చైనా ప్రభుత్వం వమ్ము చేసింది.

   బ్రిటీష్‌ వారు తమ లాభాల కోసం వేసుకున్న రైళ్లలో వారిని దేశం నుంచి పంపివేసేందుకు స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకూడా ప్రయాణించారు. అవే రైళ్లు గాంధీతో పాటు ఆయన ప్రాణాలు తీసిన హిందూ మతోన్మాది గాడ్సేను కూడా మోశాయన్నదీ తెలిసిందే. అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అన్నట్లుగా ప్రపంచీకరణను ధనిక దేశాలు ఒకందుకు ప్రారంభిస్తే దాని ద్వారా వచ్చిన నూతన అవకాశాన్ని చైనా, వియత్నాం సోషలిస్టు దేశాలు తమ జనాభా జీవన ప్రమాణాలు పెంచేందుకు వుపయోగించుకున్నాయి. ప్రపంచీకరణ విధానాల ద్వారా తమకు అందుబాటులోకి వచ్చిన చైనా మార్కెట్‌లో లాభాలు పిండుకోవాలని ప్రపంచ ధనిక దేశాలు ఆశించాయి. తమ దగ్గర వున్న అపార శ్రమశక్తిని, ప్రజానుకూల యాజమాన్య పద్దతులను పెట్టుబడిగా పెట్టి జనం కోసం పని చేయాలని కమ్యూనిస్టులు భావించారు. నలభై సంవత్సరాల లావాదేవీలు లేదా అనుభవాన్ని మదింపు చేస్తే తేలిందేమిటి? పశ్చిమ దేశాల ఎగుమతి మార్కెట్‌పై ఆధారపడిన చైనా అదిరిపోయే అభివృద్ది రేటుతో ముందుకు పోయింది. దాని నుంచి దిగుమతులు చేసుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్‌ శక్తులు లాభాలు ఆర్జించాయి. అందుకే మన దేశంలోని కార్పొరేట్‌ శక్తులు కూడా చైనా నుంచి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అందుకే వాటికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయ పార్టీలతో పాటు చంద్రబాబు, కెసిఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా చైనా మోజుతో యాత్రలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమెరికా నుంచి అరువుతెచ్చుకున్న పద్దతులతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒకవైపు జనంలో కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను రెచ్చగొడుతూనే మరోవైపు అధికారికంగా ఆ మడి బట్టలను విప్పి గట్టున పెట్టి చైనాతో సంబంధాలను కొనసాగించక తప్పనివిధంగా కార్పొరేట్లు దాని మెడలను వంచాయి.

   పెట్టుబడిదారీ విధాన పంధాను అనుసరిస్తున్న దేశాల పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్లను మాత్రమే పెంచి తమ కార్మికవర్గానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం అదే. అందుకే అక్కడ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వ్యతిరేకించిన శక్తుల వెనుక జనం సమీకృతమయ్యారు. కొన్ని మినహాయింపులతో సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్న చైనా అదే ప్రపంచీకరణను తన కార్మిక వర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు వుపయోగిస్తున్నది. అందుకే ధనిక దేశాలలో తలెత్తిన సంక్షోభ ప్రభావం పడి కొంత మేర అభివృద్ధి వేగం తగ్గింది తప్ప సంక్షోభంలో పడలేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. చైనాలో బిలియనీర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? కార్మికవర్గాన్ని దోపిడీ చేయకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? వారు చైనా సోషలిస్టు వ్యవస్ధలను కొనసాగనిస్తారా? మరో సందర్భంలో వాటి గురించి చర్చించవచ్చు.ప్రపంచీకరణ పేరుతో మన వంటి దేశాలలో జనంపై రుద్దుతున్న భారాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం పోరాటాలు చేయాల్సిందే. దానిలో ఎలాంటి రాజీ వుండనవసరం లేదు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు. ప్రపంచీకరణ ఫలితాలను జనాలకు అందిస్తున్నారు. ఒకే దేశం రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని వాటి విలీనం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు కనుక, సంస్కరణలలో భాగంగా పరిమితంగా అయినా ప్రయివేటు పెట్టుబడులను అనుమతించింది కనుక వారు కూడా లబ్ది పొందుతూ వుండవచ్చు. ఆ విధానాల వలన తలెత్తే సమస్యలతో రాబోయే రోజులలో ఏం చేస్తారన్నది చైనీయుల అంతర్గత వ్యవహారం.

   చైనా అధ్యక్షుడు దవోస్‌ సమావేశంలో రక్షణాత్మక చర్యల గురించి చెప్పిన అంశాలు తన వరకు వచ్చేసరికి అమలు జరపటం లేదని చైనాలో అంతర్భాగమైనా పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికలు, అక్కడి పెట్టుబడిదారీ మేథావులు జన్‌పింగ్‌ను ఒక విలన్‌గా వర్ణిస్తున్నారు. తమ దేశానికి చెందిన సంస్ధలను విదేశాలలో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం స్వదేశంలో విదేశీ పెట్టుబడులపై అనేక ఆంక్షలను విధిస్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందచేస్తూ స్ధానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే షరతులు పెడుతున్నదని వారు విమర్శిస్తున్నారు.

   దవోస్‌ సమావేశాలలో చైనా అధ్యక్షుడు ప్రపంచీకరణపై సిద్ధాంత చర్చ చేయలేదు. ప్రస్తుతం అమలులో వున్న దానికి భిన్నంగా రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎవరైనా వాణిజ్య యుద్ధానికి తలపడితే విజేతలంటూ ఎవరూ వుండరన్నది ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఆకస్మికంగా వాటిలో మార్పులు చేస్తే అన్ని దేశాలూ నష్టపోతాయి. అంటే బయట గాలీ, వెలుతురు వుంటే ఎవరైనా అవి లేని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూస్తే ఎలా వుంటుందో రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అలాగే వుంటుందని గ్జీ హితవు చెప్పారు. ద్రవ్య పెట్టుబడి అధిక లాభాల కోసం వెంటపడటం, ఏ మాత్రం క్రమబద్దీకరణ లేకపోవటం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం అన్నారు. తాము ప్రపంచీకరణకు కట్టుబడి వున్నామని, మరింతగా క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన సమాన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తమది కమ్యూనిస్టు నమూనా అంటూ అందరికీ సరిపోయే ఒకే పద్దతి లేదన్నారు. సముద్రం మధ్యలో తుపానులొస్తే వెనక్కు తిరిగిపోయే అలవాటును ప్రోత్సహించకూడదని చెప్పారు.

   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట అంటూ రక్షణాత్మక చర్యలు చేపడితే అమెరికా-చైనా రెండూ నష్టపోతాయని, అందువలన మాటలు తప్ప రెండు దేశాలూ రాజీపడతాయని ఐరోపాలోని వారు భావిస్తున్నారు. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య యుద్ధ పర్యవసానాల గురించి హెచ్చరించింది. చైనా తనకు కావాల్సిన వ్యవసాయ వుత్పత్తులను పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, చైనా నుంచి అమెరికన్లు దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందుతోంది. అమెరికాలో చైనా వాణిజ్యం, ఇతర ఆర్ధిక లావాదేవీల కారణంగా 26లక్షల వుద్యోగాలు కల్పిస్తున్నదని, అమెరికా జిడిపికి 1.2శాతం సమకూర్చిందని 2015 నివేదికలో అమెరికా-చైనా వాణిజ్య మండలి నివేదిక పేర్కొన్నది. చైనా నుంచి వస్తు దిగుమతుల కారణంగా అమెరికాలోని ప్రతి కుటుంబానికి సగటున ఏడాదికి 850 డాలర్లు ఆదాఅవుతున్నాయని ఒక విశ్లేషణ తెలిపింది. అన్నింటి కంటే అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలను పెట్టి తమకు అవసరమైన వస్తువులను చౌకగా తయారు చేసుకొని తిరిగి తమ దేశానికే దిగుమతి చేసుకుంటున్నాయి. అందువలన ట్రంప్‌ చెప్పినట్లు చైనా నుంచి వచ్చే వాటిపై దిగుమతి సుంకం విధిస్తే నష్టపోయే వాటిలో అమెరికన్‌ కంపెనీలు కూడా వుంటాయని గ్లోబల్‌ టైమ్స్‌ విశ్లేషకులు హెచ్చరించారు. అదే విషయాన్ని దవోస్‌లో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ సామెతలతో, తమలపాకులతో కొట్టినట్లుగా చెప్పారు. దానిని గ్రహించకుండా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగితే అది మన దేశంతో సహా ప్రపంచమంతటికీ తీరని నష్టాలకు దారి తీస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బ్రిక్, బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్.. అమెరికా ఆధిపత్యానికి ప్రతిఘటన!
  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d