• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INTERNATIONAL NEWS

ఎరుపంటే ఎందుకంత భయం : అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక విద్య బిల్లు !

13 Friday Dec 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, Anti-Communism Education Bill, communism, Failure of Capitalism, Socialism

ఎం కోటేశ్వరరావు


ఒక భూతం ఐరోపాను వెంటాడుతున్నది. అదే కమ్యూనిస్టు భూతం అంటూ ప్రపంచ సామాజిక గతినే మార్చివేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది.బ్రిటన్‌లో కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ 1848 ఫిబ్రవరి 21న ఆ గ్రంధాన్ని వెలువరించారు.నాటి నుంచి నేటి వరకు 176 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచంలోని దోపిడీ వర్గాలు, వాటిని కాపాడేవారిని అది భయపెడుతూనే ఉంది. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున పాతిపెట్టాం, విజయం మాదే అని ప్రకటించుకున్న అమెరికా గడ్డ మీదే పాలకవర్గం ఇప్పుడు ఎందుకు వణికి పోతున్నది. 2024 డిసెంబరు మొదటి వారంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌)లో కమ్యూనిస్టు వ్యతిరేక బిల్లును 32762 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. సోషలిజం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో ఉధృతంగా ఉన్న రోజుల్లో అలాంటి బిల్లు పెట్టారంటే అదొక దారి, ఆ ఉద్యమాలు అంత ఆకర్షణీయంగా లేని వర్తమానంలో ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకువస్తున్నట్లు ? అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా చేతులు కలపటంతో ఇంత మెజారిటీ వచ్చింది. ఈ బిల్లుకు పెట్టిన పేరు ఎడ్యుకేటింగ్‌ ఫర్‌ డెమోక్రసీ యాక్ట్‌( ప్రజాస్వామ్యం కోసం చైతన్య చట్టం). ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన అడుగు అని కొందరు వర్ణిస్తే సైద్దాంతిక పరమైన విభజన జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఒక భావజాలాన్ని అణగదొక్కటం చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. ఎవరైనా ఫలానా సిద్దాంతాన్ని రూపుమాపాం అని చెబితే ఎలా అనే ఉత్సుకత ఏ ఒక్కరిలో చిగురించినా అది మొక్కై మానుగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇతర పెట్టుబడిదారీ దేశాలలో జరుగుతున్నది అదే. ఓడిరచామన్న సోషలిజం, కమ్యూనిజాల గురించి యువతరంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతున్నదనే సర్వేల సమాచారం అక్కడి దోపిడీ శక్తులకు కునుకు పట్టకుండా చేస్తున్నది.


1997-2012 మధ్య జన్మించిన వారిని జెడ్‌ తరం అని పిలుస్తున్నారు. వారిలో గణనీయంగా కమ్యూనిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. అంతకు ముందు 1946-64 మధ్యకాలంలో జన్మించిన వారిలో కేవలం మూడు నుంచి ఆరుశాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం మెరుగని 28శాతం మంది జడ్‌ తరం భావిస్తున్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే పురాతన కాలం నుంచి నేటి ఆధునిక సమాజానికి బాటలు వేశాయి. ఇంతకాలం సోషలిజం విఫలమైందని ప్రచారం చేసిన వారి ఏలుబడిలో సోషలిస్టు చైనా నుంచి దిగుమతులు లేకపోతే రోజు గడవటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు అనే ఆలోచన అమెరికా యువతలో ఉదయించదా ? ‘‘ పెట్టుబడిదారీ విధాన ఒక వైఫల్యం ’’ అనే పేరుతో అమెరికా న్యాయమూర్తిగా పనిచేసిన రిచర్డ్‌ ఫోసనర్‌ 2009లో ఒక గ్రంధం రాశాడు. ఈ పెద్దమనిషి కమ్యూనిస్టు కాదు. అప్పటి నుంచి సోషలిజం వైఫల్యం కంటే పెట్టుబడిదారీ వైఫల్యం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ కాలంలోనే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ దేశాలలో సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి పెరుగుతోంది.ఈ ధోరణి అమెరికా పాలకవర్గం, అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తోంది. దిక్కుతోచని స్థితిలో అమెరికా పాలకవర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతగా యువతలో ఆసక్తి పెరటం అనివార్యం. ఉన్మాదంలో ఉంచటం ద్వారా యువతను సైద్దాంతిక మధనానికి దూరం చేయాలని విఫలయత్నం చేస్తోంది.


సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలు, చైనా తదితర సోషలిస్టు దేశాలు, వాటికి నాయకులుగా ఉన్నవారి గురించి ఇప్పటికే పేలిన అవాకులు చవాకులను అమెరికా పిల్లలకు పాఠాలుగా బోధించేందుకు తాజా బిల్లును తెచ్చారు. కమ్యూనిజం లోపాల గురించి చెబితే విద్యార్థులు స్వేచ్చ, ప్రజాస్వామ్య విలువ గురించి తెలుసుకుంటారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ జాన్సన్‌ చెప్పాడు. ఈ చట్టం ప్రకారం బోధించాల్సిన పాఠ్యాంశాలను ‘‘ కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌(విఓసిఎంఎఫ్‌) రూపొందిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు కారకులైన నాజీలు ఎర్ర సైన్యం చేతిలో చచ్చారు. వారిని కూడా కమ్యూనిజం బాధితులుగానే ఈ సంస్థ చిత్రిస్తున్నది.చైనాలోని యుఘిర్స్‌ పట్ల, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల చైనా అనుసరించిన వైఖరిని కూడా కమ్యూనిస్టు వ్యతిరేక అంశాలతో పాటు బోధించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక భావజాలాన్ని వక్రీకరించి చూపుతున్నారని, రాజకీయ భావజాలం కోసం తరగతి గదులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని కొందరు హెచ్చరించారు. ప్రపంచ చరిత్రను సమగ్రదృష్టితో చూడకుండా నిస్సిగ్గుగా పాక్షిక వైఖరితో ఈ బిల్లు చూసిందని వ్యతిరేకించిన డెమోక్రాట్లు పేర్కొన్నారు.‘‘ చరిత్రను బోధించటం అంటే ఒక దానికి వ్యతిరేకంగా మరొక భావజాలాన్ని ప్రోత్సహించటం కాదు. మన రాజకీయం కోసం అవసరమైన దాన్ని మాత్రమే కాదు మొత్తం కథను చెప్పాలి ’’ అని డెమోక్రటిక్‌ సోషలిస్టు 35 ఏండ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్‌ చెప్పారు. ఈమె డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2019 నుంచి న్యూయార్క్‌ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికై పని చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రేరేపితమైన సిలబస్‌తో వత్తిడికి గురవుతున్న టీచర్లు కమ్యూనిజం ముప్పు అంటే స్పష్టత లేని ఈ బిల్లు వలన మరింతగా ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. కమ్యూనిజం గురించి చెప్పాలంటున్నారు సరే అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధానం సంగతేమిటి ? కథను సంపూర్ణంగా చెప్పరా లేక కేవలం స్వంత సిద్దాంతాలను చెప్పుకోవటమేనా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి.


ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న అనేక సర్వేల ప్రకారం గత తరాలతో పోల్చితే సోషలిజం, కమ్యూనిజాల గురించి యువ అమెరికన్లు సానుకూల వైఖరితో చూడటం పెరిగిపోతోందని, ప్రజాస్వామ్య సూత్రాల గురించి అవగాహన తగ్గుతున్నదని రిపబ్లికన్‌ సెనెటర్లు వాపోయారు. బిల్లును రూపొందించిన వారిలో ఒకరైన మరియా సాలాజార్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అమెరికా విలువల బోధన అన్నది ఒక విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. యువతరంలో మూడోవంతు మంది కమ్యూనిజానికి అనుకూలంగా ఉన్న సమయం, అయితే ఆ సిద్దాంత ప్రమాదం, దాని చరిత్రను యువతకు చెప్పటంలో విఫలం అవుతున్నామన్నది స్పష్టం, అందుకే ఈ బిల్లు అవసరమైంది అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించుకొనేందుకు ఇది అవసరమని మరికొందరు సమర్దించారు. స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ బిల్లును ఆమోదించినందుకు అభినందించాడు. విద్యావ్యవస్థలో కమ్యూనిజం వాస్తవాలను గమనించకపోవటం లేదా తక్కువ చేసి చూస్తున్నారని ఆరోపించాడు. చైనా వంటి శత్రుదేశాలు అమెరికా వ్యవస్థలో తమ అజెండాను చొప్పిస్తున్నాయన్నాడు. అమెరికా చట్టాలు అనుమతించిన మేరకు కన్ఫ్యూసియస్‌ తరగతి గదుల పేరుతో చైనా ఐదువందల చోట్ల ఏర్పాటు చేసింది.అవి అమెరికా మిలిటరీ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని, వాటిలో కమ్యూనిస్టు సిద్దాంతాలను బోధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
పురోగామి భావాలను వెల్లడిరచే ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టుగా భావిస్తూ అమెరికన్లలో అనేక మంది మానసికవ్యాధితో బాధపడుతున్నారు. కొందరు కావాలని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ సామాన్యజనాల బుర్రలను చెడగొడుతున్నారు. అలాంటి వాటిలో హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఒకటి. దాని ట్రస్టీ కెవిన్‌ రాబర్డ్‌తో జెసీ కెలీ అనే రేడియో వ్యాఖ్యాత గతేడాది ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు.‘‘ 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. దాంతో పాటే ప్రపంచ కమ్యూనిజపు నీడ జాడలేకుండా పోయింది. కమ్యూనిజం అంతరించిందని అమెరికన్లందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ మనింట్లో కొత్త కుట్ర ప్రారంభమైంది.పురోగామివాద ముసుగులో నేడు కమ్యూనిస్టులు అనేక సంస్థలలో చొరబడ్డారు. అమెరికన్ల రోజువారీ కార్యకలాపాలను వారి నూతన శక్తితో అదుపు చేస్తున్నారు ’’ అని వ్యాఖ్యాత చెప్పాడు. అతగాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రణాళిక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాన్లో కమ్యూనిస్టుల పని తీరు పేరుతో అనేక వక్రీకరణలకు పాల్పడ్డాడు.


మితవాదుల నాయకత్వంలో నడిచే ఫ్రాసర్‌ ఇనిస్టిట్యూట్‌ అనే మేథోమధన సంస్థ జరిపిన సర్వేలో 1834 ఏండ్ల మధ్య ఉన్న కెనడా యువతలో 54శాతం మంది సోషలిజం దేశ ఆర్థిక వ్యవస్థ, పౌరుల మంచి చెడ్డలను ప మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తేలింది. అంతవరకే కాదు, ఆ సర్వే ప్రకారం పదిలక్షల మంది యువత సోషలిజం కంటే కమ్యూనిజం మంచి ఆర్థికవ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పటంతో సర్వే నిర్వాహకులు నిర్ఘాంతపోయారట. అంతేనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేయటం లేదని యువత భావించటం వారికి ఆందోళన కలిగించింది. ఆ సర్వేను మరింత లోతుగా చూసినపుడు 1834 ఏండ్ల వారిలో సోషలిజం అనువైనదని చెప్పినవారు 46శాతమైతే, 1824 ఏండ్ల వయస్సు వారిలో 50శాతానికి పెరిగారు. పెట్టుబడిదారీ విధానం మంచిదని చెప్పిన వారు 1834లో 39శాతమే ఉండగా కాదన్నవారు 41శాతం. సోషలిజానికి మారాలని చెప్పిన వారు 1834లో 54శాతం ఉండగా 1824లో 58శాతం ఉన్నారు, కాదని చెప్పిన వారు 17శాతం మాత్రమే. ఎందుకు యువత ఇలా భావిస్తున్నదంటే 2008లో ధనిక దేశాల్లో వచ్చిన సంక్షోభం అనుభవించారు గనుక, అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. దానికంటే మరింత పెద్ద సంక్షోభం రానున్నదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలే హెచ్చరిస్తున్నందున ఎక్కడైనా యువత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ఉంటుందా ? వారికి సోషలిజం, కమ్యూనిజం తప్ప మరొకటి కనిపించటం లేదు. పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక సరైన సమాధానం చెప్పలేక ధరలు పెరిగి ఆహారవస్తువులను కొనుగోలు చేయలేకపోతే ఉదయపు అల్పాహారాన్ని మానుకోండని ఉచిత సలహా చెప్పింది. పరిస్థితి ఇంకా దిగజారితే రోజుకు ఒక పూటే తినండని కూడా చెప్పగలదు.యువత కమ్యూనిజం పట్ల ఇంత ఆసక్తిని ఎందుకు పెంచుకుంటున్నదన్న ప్రశ్నకు ఫ్రాసర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జేసన్‌ క్లెమెన్స్‌ సమాధానమిస్తూ ఇంతటి దురవస్థను వారి మీద ఎన్నడూ రుద్దలేదు అన్నాడు. భూతల స్వర్గం అనుకుంటున్నవారికి లాభాలు పిండుకొనే కార్పొరేట్‌ భూతాలు కళ్ల ముందు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మానవనైజం కాదు. తగ్గేదే లేదు, దాని అంతమే తమ పంతం అంటారు, కాదంటారా ! దానికి సోషలిజం తప్ప మరొక మార్గం కనుచూపు మేరలో కనిపించటం లేదు, అందుకే మూలనపెట్టిన సిద్దాంత పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు.నడిచే సమయం రాగానే, తపన కలగ్గానే ఏం చేయాలో పసివాళ్లకు ఎవరూ చెప్పనవసరం లేదు. వారంతటవారే లేచి అడుగులు వేసినట్లుగా మార్గం వెతుక్కుంటారు. సమాజమార్పూ అంతే !


కమ్యూనిస్టు మానిఫెస్టో రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట నిజం. అది ఆ నాటికి సరిపోయిందిగానీ నేటికి పనికి రాదు అని కొందరు వ్యతిరేకులు దాడి చేస్తున్నారు.దాన్లో చెప్పింది ఒక శాస్త్రీయ సిద్దాంతం. కూడినా హెచ్చవేసినా రెండురెళ్లు నాలుగే. అది మారదు. అలాగే శ్రమదోపిడీ ఉన్నంత కాలం దాన్నుంచి జనావళిని విముక్తం చేసేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలో విప్లవం ఒకే విధంగా జరగదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వెనుకబడిన, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రభావితం చేస్తున్న దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలనేది అక్కడి కార్మికవర్గం నిర్ణయించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దక్షిణ కొరియాలో కుట్ర : అధ్యక్ష కార్యాలయంపై పోలీసు దాడి, మిలిటరీ పాలన పత్రాల స్వాధీనం !

11 Wednesday Dec 2024

Posted by raomk in Asia, Current Affairs, History, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

South Korea martial law, South Korea’s Six-Hour Coup, South Korean president, Yoon Suk Yeol


ఎం కోటేశ్వరరావు


అత్యవసరపరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరతీసి కేవలం ఆరుగంటల వ్యవధిలో అనివార్య పరిస్థితుల్లో ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశం విడిచి పోకుండా అక్కడి అవినీతి నిరోధకశాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. అధ్యక్ష కార్యాలయం, ఇతర భద్రతా విభాగాల ఆఫీసులపై కూడా పోలీసులు దాడి చేసి సైనిక పాలన విధింపు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అధ్యక్షుడు కార్యాలయంలో లేడని చెబుతున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడిరచారు. దీంతో అక్కడ సంక్షోభం ఏ మలుపు తిరిగేదీ ఆసక్తి కలిగిస్తోంది. 1987 తరువాత తొలిసారిగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు.2024 డిసెంబరు మూడవ తేదీ మంగళవారం రాత్రి సైనిక పాలన విధించి బుధవారం తెల్లవారు రaామున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంటు వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ నాటకీయంగా జరిగాయి. అనేక అనుమానాలకు తావిచ్చే ఈ పరిణామం ఎందుకు, ఎలా జరిగింది, తెరవెనుక కథ ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కారణాలేమైనా తాత్కాలికంగా అయినా జనం ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. మరోసారి పెట్టేందుకు చూస్తున్నారు. తప్పు చేసినట్లు యూన్‌ ప్రకటించాడు. తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే బాధ్యతను పార్టీకి అప్పగిస్తున్నట్లు జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పాడు. అయితే అధ్యక్షుడు ఏ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ప్రధాని హాన్‌ డక్‌ సూ. అధికార పీపుల్స్‌ పవర్‌ పార్టీ (పిపిపి) నేత హాన్‌ డాంగ్‌ హూ ప్రకటించారు. మరోవైపు యూన్‌ మీద విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రకటించాడు. అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేదా నేరాలకు పాల్పడినపుడు అరెస్టయితే తప్ప విధులు నిర్వహించటానికి ప్రధానికి అవకాశం లేదు. మిలిటరీ కమాండర్‌ ఎవరనే ప్రశ్న కూడా తలెత్తింది. సాంకేతికంగా అధ్యక్షుడు ఉన్నా అధికారాలు లేనట్లు ప్రకటించిన తరువాత హోం మంత్రి రాజీనామాను ఆమోదించిన తీరు చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోందన్న భావన కలుగుతోంది. అధ్యక్షుడికి అధికారాలు లేకుండా చేసి పదవి నుంచి తొలగించకుండా కొనసాగించటం దేశంలో జరిగిన రెండవ కుట్రగా ప్రతిపక్షాలు వర్ణించాయి.


తాత్కాలిక రక్షణ మంత్రి, సైనిక దళాల జాయింట్‌ చీఫ్‌ కమాండర్‌ ఒక ప్రకటన చేస్తూ యూన్‌ మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఆమోదించేది లేదని చెప్పటం విశేషం. అత్యవసర పరిస్థితి ఎత్తివేత తరువాత రక్షణ మంత్రి రాజీనామా చేశాడు, అతనిపై దేశద్రోహనేరం మోపి అరెస్టు చేశారు. ప్రత్యేక దళాల, రాజధాని రక్షణ కమాండర్లు అనేక మందిని విధుల నుంచి తప్పించారు. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది.1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తరువాత 1987నుంచి పౌరపాలన ఉన్నప్పటికీ పౌర భద్రతా వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒక్కరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగవిరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. అందువలన పౌర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మిలిటరీ నేతల మీదనే ఆధారపడుతున్నారు. మిలిటరీ అధికారుల తీరుతెన్నులు చూసినపుడు వారు రాజకీయాల్లోని మితవాద శక్తులతోనే బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం.ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళన, ఉద్యమాలను అణచివేసిన చరిత్ర వారిది. తమతో చేతులు కలపని లేదా విబేధించే వారిని కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనో దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనో ఆరోపించి అణచివేయటం పరిపాటిగా మారింది. డిసెంబరు మొదటి వారంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి విధిలేక వెనక్కు తీసుకున్న యాన్‌ కూడా అవే చిలుక పలుకులు వల్లించాడు. అక్కడ మిలిటరీ పాలన ముప్పు మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. 2017లో దొడ్డిదారిన మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు. అవినీతికి పాల్పడినందుకు అధ్యక్షురాలు పార్క్‌ యున్‌ హై మీద పెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. దాంతో ఆమెను తిరిగి నియమించకూడదంటూ ఆందోళనకు సిద్దపడిన వారిని, మీడియాను అణచేందుకు వందలాది మిలిటరీ వాహనాలు, ఆరువేల మంది సైనికులను సిద్దం చేసి మిలిటరీ పాలన ప్రకటించేందుకు దాదాపు ఏర్పాట్లు చేశారు.


తాజా పరిణామాలకు వస్తే అత్యవసర పరిస్థితి విధింపును వ్యతిరేకిస్తూ పద్దెనిమిది మంది అధికార పక్ష సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో నెగ్గింది. అయితే అభిశంసన తీర్మానం సమయానికి వారు వెనక్కు తగ్గటంతో వీగిపోయింది. అయినప్పటికీ యూన్‌ రాజీనామా, అతగాడి అరెస్టు, అధికార పార్టీని రద్దు చేయాల్సిందేనంటూ ఆదివారం నాడు సియోల్లో పార్లమెంటు ముందు వేలాది మంది జనం ప్రదర్శన చేశారు. అధ్యక్షుడిని తప్పించకుండా ప్రధానికి అధికారాన్ని కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్దమని పార్లమెంటు స్పీకర్‌ ఊ వన్‌ షిక్‌ ప్రకటించాడు. తక్షణమే యూన్‌ అధికారాన్ని సస్పెండ్‌ చేసేందుకు అవకాశాలను వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం జరపనున్నట్లు ప్రకటించాడు. స్వల్ప మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికైన యూన్‌ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రతిపక్షాలు, మీడియా, కార్మికవర్గాన్ని అణచివేసేందుకు చూశాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. 2023 ఆగస్టులో లిబరేషన్‌ డే ప్రసంగంలో కమ్యూనిస్టు నియంతృత్వశక్తులు ప్రజాస్వామ్యం, మానవహక్కుల కార్యకర్తలు లేదా పురోగామి శక్తుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. నియంతల పాలనలో ప్రతివారూ ఇలాంటి చిలుక పలుకులే వల్లించారు. సైనిక పాలన విధించేందుకు అవసరమైన పద్దతుల్లో యూన్‌ ఏదో చేయబోతున్నట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ కిమ్‌ మిన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. తన స్కూలు సహాధ్యాయులు, అనుచరులను పెద్ద సంఖ్యలో కీలకమైన మిలిటరీ, ఇతర భద్రతా అధికార పదవుల్లో నియమించాడని పేర్కొన్నాడు. తాజా పరిణామాల తరువాత కిమ్‌ చెప్పింది వాస్తవమే అని పచ్చి మితవాద పత్రిక చోసన్‌ ఇబో వ్యాఖ్యానించింది. యూన్‌ భార్య కిమ్‌ ఇవోన్‌ హి, అధ్యాత్మిక సలహాదారు మైయుంగ్‌, ఇతర అనుచర గణం అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అధికార పార్టీలో తమ అనుచరులకు పెద్ద పీటవేశారు.


కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యూన్‌ ప్రతిపాదించాడు. వారానికి 52గంటలకు బదులు 120 గంటలు పని చేయాలని, ఏడు రోజులూ 17 గంటల చొప్పున విధి నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చినెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనిక జనరల్‌ ఆన్‌ సూ అన్ని రాజకీయ కార్యకలాపాలు, కార్మికుల సమ్మెలను నిషేధించాడు, పత్రికల మీద సెన్సార్‌షిప్‌ ప్రకటించాడు, ఎవరినైనా వారంటు లేకుండా అరెస్టు చేసే అధికారమిచ్చాడు. సమ్మెచేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసమంటూ ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మేనెలలో యూన్‌ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకొనే విధంగా అసోసియేషన్లను ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులను సంఘాలకు దూరం చేసే, విచ్చిన్నం చేసే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు మెజారిటీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక నేరాలకు పాల్పడే సంఘటిత శక్తులని యూన్‌ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులను మాత్రమే వినియోగించాలని కంపెనీల మీద సంఘాలు వత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు కార్మిక సంఘాలను బూచిగా చూపి నిందిస్తే జనం హర్షిస్తారని భావించిన యూన్‌ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో కేవలం 0.73శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే యూన్‌ ఎన్నికయ్యాడు.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలకు గాను యూన్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ పవర్‌ పార్టీ 108 స్థానాలను మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 వచ్చాయి. అందువలన తన అజెండాకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేకపోవటంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాకులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒక వైపు మిలిటరీ పాలన ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్ధించుకున్నాడు. పార్లమెంటులో మెజారిటీగా ఉన్న పార్టీలు అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్‌తో సహా ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు పూనుకున్నట్లు ఆరోపించాడు.


ఇప్పుడు దక్షిణ కొరియాలో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి తలెత్తింది. యూన్‌ రాజీనామా చేయటం, అధ్యక్ష ఎన్నికలను ప్రకటించటం ఒకటి. అయితే గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం పాలైన అధికార పక్షం ఇంత జరిగాక ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతుందా ? యూన్‌ మీద విచారణ తతంగం జరిపి తిరిగి ఓటర్లలో విశ్వాసం ఉంది అనుకుంటే అప్పుడు ఎన్నికలకు వెళ్లవచ్చు. దాన్లో భాగంగానే దేశ పౌరులకు టీవీలో క్షమాపణ కూడా చెప్పించారు. అధికార విధులేవీ నిర్వర్తించకూడదని, ఒక క్రమ పద్దతిలో తప్పుకుంటాడని ఆదివారం నాడు పార్టీ ప్రకటించినప్పటికీ మరోసారి సైనిక పాలన విధించేందుకు అవసరమైన అధికారాలన్నీ అతగాడి వద్ద ఉన్నాయి.శనివారం నాడు పార్లమెంటు వద్ద యూన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పదిలక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించగా పోలీసులు లక్షా 49వేల మంది అని చెప్పారు.అనేక అంశాలతో పాటు ఆర్థిక దిగజారుడు అక్కడి కార్పొరేట్లను ఆందోళనకు గురిచేస్తున్నది.వృద్ధి రేటు 2010లో 6.8శాతం ఉండగా గతేడాది 1.4శాతానికి దిగజారింది. ఈ ఏడాది 2.2శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం 2022లో నిజవేతనాలు 0.2శాతం, 2023లో 1.3శాతం పడిపోగా ఈ ఏడాది 0.5శాతం ఉండవచ్చని అంచనా. ఈ కారణంగానే అనేక పరిశ్రమల, సంస్థల కార్మికులు ఇటీవలి కాలంలో ఆందోళనలు చేపట్టారు. దాని అణచివేత ప్రయత్నమే సైనిక పాలన అని చెప్పవచ్చు. వచ్చే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా లేదా సైనిక తిరుగుబాటు జరిగినా కార్మికవర్గానికి పోరుబాట తప్ప మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ డాలరుకు ఎసరు వస్తోందా ! డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు అర్ధమేమిటి !!

04 Wednesday Dec 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, BRICS nations, China, dedollarization, Donald trump, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


తమ కరెన్సీ డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం జరిపేందుకు బ్రిక్స్‌ కూటమి దేశాలు పూనుకుంటే వందశాతం పన్ను విధిస్తామని జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు.బ్రిక్స్‌ దేశాలని, వేరే కరెన్సీ అని చెప్పినప్పటికీ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకూ వర్తింపచేస్తామనే హెచ్చరిక దీని వెనుక ఉంది.ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏయి) ఉన్నాయి.మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటిని నిరుత్సాహపరిచేందుకు కూడా ట్రంప్‌ ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలోనే దీని గురించి చెప్పాడు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరు సుబ్బారావు వంటి వారు ట్రంప్‌ మాటలు ఊకదంపుడేనా, నిజంగా అమలు జరుగుతాయా, అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువుల మీద పదిశాతం, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది ఏ రూపంలో అన్నది చూడాల్సిఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ మారకపు కరెన్సీగా బ్రిటీష్‌ పౌండు ఉన్నది.1920దశకం నుంచి డాలరు క్రమంగా పెరిగి పౌండ్‌ను వెనక్కు నెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపులో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్థల ఏర్పాటు తరువాత పూర్తిగా డాలరు పెత్తనం ప్రారంభమైంది. గతంలో ఒక ఔన్సు(28.35 గ్రాములు) బంగారం 35 డాలర్లకు సమానమైనదిగా మారకపు విలువ నిర్ణయించారు. 2024 డిసెంబరు రెండవ తేదీన ఒక ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉంది. 1971లో డాలరుబంగారం బంధాన్ని తెంచిన తరువాత డాలరుకు ఎదురులేకుండా పోయింది. దాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా ధనికదేశాలు యూరో కరెన్సీని ముందుకు తెచ్చినా డాలరుకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. గత పదిహేను సంవత్సరాలుగా డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతోంది.రాజకీయంగా తమ పెత్తనానికి ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఆర్థికంగా నిలిచి ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా చూస్తున్నది, అదే ట్రంప్‌ అజెండా, దానికి అనుగుణంగా ప్రకటనలు ఉన్నాయి.అయితే అది జరిగేనా ?

డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా 2023లో ప్రతిపాదించాడు. అంతకు ముందు నుంచే దీని గురించి చర్చ ఉంది. డాలరును ఉపయోగించవద్దని ఏ దేశం మీద కూడా వత్తిడి తేవద్దని, బ్రిక్స్‌ మద్దతు ఇచ్చే కరెన్సీలో చెల్లింపులు పెరగాలని, దుర్బలత్వాలను తగ్గించుకోవాలని లూలా అన్నాడు. తనకు నచ్చని దేశాల మీద డాలరును అమెరికా ఆయుధంగా ఉపయోగిస్తున్నది. ఇరాన్‌తో లావాదేవీలపై అమెరికా నిషేధం విధించిన కారణంగా మనదేశం అక్కడి నుంచి చమురుకొనుగోలు నిలిపివేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యా ఒక్కదాన్నే బాధ్యురాలిగా చేస్తూ దాని మీద కూడ అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది.మరోవైపు మన కరెన్సీని అంగీకరించే విధంగా 23 దేశాలతో ఇప్పటికే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూపాయితో లావాదేవీలు జరిగితే ఎగుమతి, దిగుమతిదార్లకు కరెన్సీ మారకపు విలువ హెచ్చు తగ్గుల ముప్పు ఉండదు. మన విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఈ దేశాలతోనే జరుగుతున్నది.అమెరికాతో ఉన్న రాజకీయ బంధం, డాలరుతో తెగతెంపులు చేసుకోవటం పూర్తిగా ఇష్టం లేని కారణంగా మనదేశం ఇరకాటవస్థలో ఉంది.తామెన్నడూ డాలరును దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకోలేదని మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. కొన్ని సందర్భాలలో తమ వాణిజ్య భాగస్వాములకు డాలర్లు ఉండటం లేదని, ఆ కారణంగా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్ధేశ్యాలు లేవని చెప్పారు.చైనాతో మన వాణిజ్యం లోటులో ఉండగా అమెరికాతో మిగులులో ఉంది. ఈ కారణంగానే దానితో సంబంధాల విషయంలో మనదేశం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటోంది. కొన్ని లావాదేవీల్లో డాలర్లకు ఆటంకాలు ఉన్నందున స్థానిక కరెన్సీలతో ఏర్పాట్లు చేసుకుంటున్నది.డాలరుతో తెగతెంపులు చేసుకొనేందుకు, తద్వారా అమెరికా మార్కెట్‌ను కోల్పోయేందుకు మనదేశంలోని ఐటి, దాని అనుబంధ, సేవారంగాలలో, ఔషధ, వస్త్ర పరిశ్రమల కార్పొరేట్లు అంగీకరించే అవకాశం లేదు.

కార్పొరేట్‌ శక్తులు పశ్చిమదేశాల మార్కెట్‌ మీద కేంద్రీకరించిన కారణం కూడా విస్మరించరానిదే.మనదేశం డాలర్‌ పెట్టుబడులను ఆశిస్తున్నందున దాన్ని దెబ్బతీసేందుకు ముందుకు పోదన్నది అభిప్రాయం. బ్రిక్స్‌ కూటమి జిడిపిలో 70శాతం వాటా చైనాదే. ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందితే దానిలో ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది, రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్న మనదేశంలోని చైనా వ్యతిరేకశక్తులు అంగీకరించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరుకు బదులు మరొక కరెన్సీని వినియోగించే అవకాశం లేదని, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అమెరికాకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది, బ్రిక్స్‌ దేశాలు డాలరుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుండటాన్ని మేము గమనించటం ముగిసిందని, అద్బుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో తమ వస్తువులను అమ్ముకోవటానికి స్వస్థి పలకాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించాడు. ప్రస్తుతం డాలర్‌దే ఆధిపత్యమైనా అన్ని దేశాలూ తమ విదేశీమారక ద్రవ్యంలో ఒక్క డాలరు మీదే ఆధారపడటం లేదు. ఇతర కరెన్సీలను కూడా నిల్వచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎటుబోయి ఎటువస్తుందో అన్నట్లుగా బంగారం నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి.ఇరాన్‌, రష్యా దేశాలపై ఆంక్షలు విధించి తన స్వంత చట్టాలను రుద్దుతోంది. దానిలో భాగంగా అంతర్జాతీయ అంతర బ్యాంకుల ద్రవ్య లావాదేవీల టెలికమ్యూనికేషన్‌ సమాజ (స్విఫ్ట్‌) వ్యవస్థ నుంచి వాటిని ఏకపక్షంగా తొలగించింది. రేపు తనకు నచ్చని లేదా లొంగని ఏ దేశం మీదనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చుగనుక గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కరెన్సీల గురించి ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 23శాతం కలిగి ఉన్నాయి. ఇవి నూతన కరెన్సీని సృష్టించటం లేదా డాలరును పక్కన పెట్టే మరొక కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని తమకు హామీ ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. మహావృక్షం వంటి డాలరుకు బదులు మరొక పిలక కోసం ప్రయత్నించినా ఫలితం ఉండదన్నాడు. సార్వభౌత్వం కలిగిన ఏ దేశమూ ఇలాంటి హామీ ఇవ్వదు. అమెరికా నాయకత్వంలోని జి7 కూటమిని ఎదుర్కోవాలంటే బ్రెజిల్‌,రష్యా,భారత్‌,చైనా చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ 2001లో ప్రతిపాదించాడు. తరువాత అది నిజంగానే 2011లో ఉనికిలోకి వచ్చింది. డాలరును తాము ఏకపక్షంగా తిరస్కరించటం లేదని, డాలరు లావాదేవీలపై పరిమితులు విధిస్తున్నందున ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వస్తోందని ఆంక్షలకు గురైన రష్యా అధినేత పుతిన్‌ ఇటీవల జరిగిన కజాన్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో చెప్పాడు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎన్‌డిబి)ని మరింతగా విస్తరించాలని కూడా నిర్ణయించారు.

ప్రస్తుతం అమెరికా ఖండాల్లో వాణిజ్యంలో 96శాతం, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 74, ఇతర చోట్ల 74శాతం డాలరు వినియోగంలో ఉంది. ఐరోపాలో మాత్రం 66శాతం యూరో ఆక్రమించింది. ప్రపంచ దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 60శాతం డాలర్ల రూపంలో, మిగిలింది ఇతర కరెన్సీలు, బంగారం రూపంలో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 1960దశకంలో ప్రపంచ జిడిపిలో అమెరికా వాటా 40శాతం కాగా 2023లో 26శాతానికి పడిపోయింది.చైనాను చూస్తే 2000 సంవత్సరంలో 3.6శాతంగా ఉన్నది 16.9శాతానికి పెరిగింది. మన జిడిపి ఇదే కాలంలో 1.4 నుంచి 3.4శాతానికి మాత్రమే పెరిగింది. దేశాల రిజర్వుబ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకొనే విదేశీ కరెన్సీలలో డాలరు వాటా 2002లో 70శాతం ఉండగా 2024 మార్చి ఆఖరులో 59శాతం ఉంది. ఇదే సమయంలో యూరో, ఎన్‌, పౌండ్‌ తప్ప ఇతర కరెన్సీల వాటా 1.8 నుంచి 10.9శాతానికి పెరిగింది. అనేక దేశాలు డాలరును క్రమంగా వదిలించుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్థిరతకు గురికావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచుతున్నాయి.దేశాల రిజర్వుబాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1టన్ను కొనుగోలు చేశాయి. మన విషయానికి వస్తే ఆర్‌బిఐ ప్రతినెలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది.జనవరి నుంచి 43 టన్నులు కొనుగోలు చేయగా మొత్తం నిల్వ 846 టన్నులకు పెరిగింది. చైనా రిజర్వుబాంకు వద్ద అక్టోబరు ఆఖరులో 2,264 టన్నుల బంగారం ఉంది. గతేడాది అన్ని దేశాల కేంద్ర బాంకులు కొనుగోలు చేసిన 1,037 టన్నుల్లో 30శాతం చైనా పీపుల్స్‌ బాంకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అంతకు మించి కొనుగోలు చేయనున్నట్లు జనవరిమార్చినెలల్లో లావాదేవీలు వెల్లడిరచాయి. ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నదంటే డాలరుకు ప్రత్యామ్నాయంగా కరెన్సీని ముందుకు తెచ్చేందుకే అని పరిశీలకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయా దేశాల్లో విదేశీమారక నిల్వల్లో పోర్చుగల్‌లో బంగారం వాటా 72శాతం, అమెరికా 70,జర్మనీ 69, ఫ్రాన్సు 67, ఇటలీ 66, నెదర్లాండ్స్‌ 58, టర్కీ 30, రష్యా 26శాతం భారత్‌ 9, చైనా నాలుగుశాతం మాత్రమే కలిగి ఉన్నాయి. శాతం రీత్యా చూస్తే మనం ఎగువన ఉన్నప్పటికీ విలువలో చూస్తే చైనాతో ఎంత తేడా ఉందో పైన పేర్కొన్న అంకెలు వెల్లడిస్తాయి.

మొత్తంగా బ్రిక్స్‌ దేశాల మీద ట్రంప్‌ దాడి ఉన్నప్పటికీ కేంద్రీకరణ అంతా చైనా మీదనే అన్నది స్పష్టం.అక్కడి మార్కెట్‌లో తన వస్తువుల విక్రయాలకే ఈ వత్తిడి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దాడి తీవ్రత పెరగవచ్చని ఊహించిన చైనా ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. దాని అమ్ముల పొదిలో కూడా అమెరికాను దెబ్బతీసే కొన్నిఅస్త్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు చైనా వద్ద అమెరికా తీసుకున్న రుణం 734 బిలియన్‌ డాలర్లు ఉంది.2017 నుంచి క్రమంగా ఈ మొత్తాలను తగ్గిస్తున్నది. దాన్ని ఇతర దేశాలకు చైనా విక్రయిస్తే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం, అమెరికా బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. తన దగ్గర ఉన్న 3.38లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వదిలించుకుంటే చైనాకూ సమస్యలు వస్తాయి.అమెరికాను దెబ్బతీయాలంటే తన కరెన్సీ యువాన్‌ విలువ తగ్గింపు ఒక ఆయుధం. దానితో లాభంనష్టం రెండూ ఉన్నాయి. సెమీకండక్టర్లు, విద్యుత్‌ బాటరీలకు ఉపయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేయవచ్చు. తమ మార్కెట్లో ఆపిల్‌, టెస్లా వంటి అమెరికా కార్పొరేట్‌ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించి దెబ్బతీయవచ్చు.అయితే వాటిని ప్రయోగిస్తుందా లేదా అన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న దేశం-పెద్ద సందేశం : ఉరుగ్వేలో మరోసారి వామపక్ష జయకేతనం !

27 Wednesday Nov 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Broad Front, Frente Amplio, Latin america left, Uruguay Elections 2024, Uruguay runoff election results, Yamandú Orsi wins, Yamandu Orsi

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని ఉరుగ్వే అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి వామపక్ష కూటమి ‘‘విశాల వేదిక ’’ (బ్రాడ్‌ ఫ్రంట్‌) మరోసారి విజయం సాధించింది.గతంలో 2005 నుంచి 2020వరకు అధికారంలో ఉన్న ఈ కూటమి ఐదు సంవత్సరాల క్రితం మితవాద శక్తుల చేతిలో ఓటమి పాలైంది.ఈ సారి తిరిగి అధికారానికి వచ్చింది. అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో నిబంధనల ప్రకారం 50శాతంపైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య నవంబరు 24న తుది ఎన్నిక జరిగింది. విశాల వేదిక కూటమి అభ్యర్ధి, గతంలో చరిత్ర అధ్యాపకుడిగా, మేయర్‌గా పనిచేసిన యమండు ఆర్సి(57) 52.08శాతం ఓట్లతో గెలిచారు. తొలి రౌండులో 46.12శాతం తెచ్చుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దిగువ సభ ఛాంబర్‌లో 99 డిప్యూటీల స్థానాలకు గాను ఆర్సి నాయకత్వంలోని కూటమికి 48, ఎగువ సభ సెనెట్‌లోని 30 సీట్లకు గాను 16 వచ్చాయి. తొలి రౌండులో ప్రత్యర్థులుగా ఉన్న రెండు మితవాద పార్టీల అభ్యర్థులు ఇద్దరికి కలిపినా 45.09శాతమే రావటంతో తుదిపోరులో వామపక్ష అభ్యర్థి విజయం ఖాయంగా కనిపించినప్పటికీ పోటీ తీవ్రంగా మారింది. మీడియా, ఇతర శక్తులు వామపక్ష వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ విశాల వేదిక విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నూతన ప్రభుత్వం 2025 మార్చి ఒకటవ తేదీన కొలువుతీరనుంది.స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాత్వత్వం మరోసారి విజయం సాధించింది, ఈ మార్గాన్నే పయనిద్దాం అంటూ తన విజయం ఖరారు కాగానే వేలాది మంది మద్దతుదార్లతో యమండు అర్సీ తన ఆనందాన్ని పంచుకున్నాడు.గత ఐదు సంవత్సరాలలో తాము వామపక్ష సంఘటన కంటే ఎక్కువే చేశామని అధికారపక్ష రిపబ్లికన్‌ కూటమి చేసిన ప్రచారాన్ని ఓటర్లు ఆమోదించలేదు. తమ ఏలుబడిని చూసి ఐదేండ్ల కాలంలో జరిగిన కుంభకోణాలను జనం మరచిపోతారని అది భావించింది.తమను మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో ఓటర్లకు చెప్పలేకపోయింది.

ఉరుగ్వే నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరైన కారణాలు చూపకుండా ఓటు వేయని వారికి జరిమానా, ఇతర అనర్హతలకు గురౌతారు. దేశంలో 35లక్షల మంది జనాభా ఉండగా పద్దెనిమిదేండ్లు దాటిన ఓటర్లు 27లక్షలకుపైగా ఉండగా 24లక్షలకు పైగా ఓటు వేశారు. ఏ అభ్యర్థి నచ్చకపోతే ఖాళీ బ్యాలట్‌ పత్రాలను పెట్టెల్లో వేయవచ్చు. ఒకేసారి అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికలు జరుగుతాయి గనుక ప్రతి ఒక్కరూ తొలి రౌండులో మూడు ఓట్లు వేయాల్సి ఉంటుంది.పార్లమెంటు ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య పద్దతిలో జరుగుతాయి.పార్లమెంటు ఎన్నికల్లో విశాల వేదిక కూటమికి 43.94శాతం ఓట్లు వచ్చాయి. రద్దయిన సభలో ఉన్న సీట్లతో పోల్చితే దిగువ సభలో 42 నుంచి 48కి, ఎగువ సభలో 13 నుంచి 16కు పెరిగాయి. అధ్యక్ష పదవికి వేసిన ఓటునే ఉపాధ్య పదవి అభ్యర్థికి కూడా వర్తింప చేస్తారు. ఆ విధంగా కరోలినా కోసె ఎన్నికయ్యారు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరైన ఆమె విద్యార్థిగా ఉన్నపుడు యువ కమ్యూనిస్టు లీగ్‌లో పనిచేశారు. తాజా ఎన్నికలలో విశాల వేదిక తరఫున ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న చర్చ వచ్చినపుడు యమందు ఆర్సికరోలినా పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఆమెను అభ్యర్థిగా నిలిపితే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు మొగ్గుచూపకపోవచ్చని, గత ఎన్నికల్లో ఆ కారణంగానే ఫ్రంట్‌ ఓడిరదని, ఈ సారి ఆర్సితో ఆ లోపాన్ని సరి చేయాలని మాజీ అధ్యక్షుడు ముజికా సూచించటంతో ఆమెను ఉపాధ్యక్షురాలిగా నిలిపారు. గతంలో ఆమె మంత్రిగా పనిచేశారు. పార్లమెంటు దిగువ సభలో ఫ్రంట్‌కు వచ్చిన 48 సీట్లలో కమ్యూనిస్టు పార్టీకి ఐదు, సెనెట్‌లోని 16 సీట్లలో రెండు వచ్చాయి.ఉరుగ్వే మిలిటరీ నియంతలకు వ్యతిరేకంగా జరిగిన పోరుకు వామపక్ష నేత జోస్‌ ముజికా (88) నాయకత్వం వహించాడు. తరువాత 2010 నుంచి 15వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు వివిధ జైళ్ల చిత్రహింసలు, ఏకాంతవాస శిక్ష అనుభవించాడు. అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత 90 శాతం వేతనాన్ని దేశానికే విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు అధ్యక్ష భవనం నివాసం తనకు అక్కర లేదని ప్రకటించాడు. ముజికా వారసుడిగా యమండు అర్సీని పరిగణిస్తున్నారు. ఒక ద్రాక్ష తోట రైతు కుటుంబంలో జన్మించిన అర్సీ తాను కూడా ముజికా బాటలోనే పయనిస్తానని ప్రకటించాడు.

చిన్న దేశమైనప్పటికీ ఉరుగ్వే ప్రపంచానికి పెద్ద సందేశమిచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ చోట్ల ఓడిపోయాయి. మితవాద ఫాసిస్టు శక్తులు ముందుకు వచ్చాయి. ఇక్కడ మితవాదులను ఓడిరచి జనం వామపక్షానికి పట్టం కట్టారు. గత పాతిక సంవత్సరాలలో ఏ రాజకీయ పక్షం కూడా పది లక్షల ఓట్ల మార్కును దాటలేదు. తొలిసారిగా వామపక్షం ఆ ఘనతను సాధించింది. ఈ కూటమి ఇప్పటికి ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసింది.నాలుగు సార్లు అధికారానికి వచ్చింది. గతంలో గెలవని ప్రాంతాలు, నియోజకవర్గాలలో ఈసారి తన పలుకుబడిని పెంచుకుంది.పందొమ్మిది ప్రాంతాలలో(మన జిల్లాల వంటివి) పన్నెండు చోట్ల ప్రధమ స్థానంలో ఉంది. అన్ని చోట్లా దిగువ సభలో ప్రాతినిధ్యం పొందింది. ఈ ఎన్నికల సందర్భంగానే రెండు రాజ్యాంగబద్దమైన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఓటింగ్‌ జరిగింది. లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన చోట్ల అధ్యక్ష పదవులు పొందినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఉరుగ్వేలో ఎగువ సభలో మెజారిటీ ఉంది. దిగువ సభలో 99కి గాను 48 ఉన్నాయి.
మొత్తం లాటిన్‌ అమెరికా వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఉరుగ్వేలోని విశాల వేదిక కూడా ఎదుర్కొంటున్నది. గతంలో మూడు సార్లు అధికారానికి వచ్చినప్పటికీ అమల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కొనసాగిస్తూనే కార్మికులు, ఇతర తరగతులకు కొన్ని ఉపశమన, సంక్షేమ చర్యలను అమలు జరిపింది. దాంతో సహజంగానే అసంతృప్తి తలెత్తి గత ఎన్నికల్లో మితవాదులను గెలిపించారు. గత పాలకుల వైఫల్యం తిరిగి వామపక్షాలకు అవకాశమిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన అర్సి ఒక పెద్ద జిల్లా గవర్నర్‌గా పనిచేశాడు. రెండవ దఫా ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉండగానే 49.8 శాతం ఓట్లు పొందిన అర్సి విజయం ఖాయంగా తేలటంతో ప్రత్యర్థి అల్వారో డెల్‌గాడో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశాడు.దేశంలో వామపక్ష శక్తులు విజయోత్సవాలను ప్రారంభించాయి. విశాల వేదికలో కమ్యూనిస్టు, సోషలిస్టు, క్రిస్టియన్‌ డెమోక్రాట్లు భాగస్వాములు కాగా ప్రతిపక్ష రిపబ్లికన్‌ కూటమిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా మితవాద భావజాలానికి చెందినవే. విశాల వేదికలో కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ తమ అజెండాను పూర్తిగా ముందుకు నెట్టే అవకాశం లేదు.

లాటిన్‌ అమెరికాలో ఉన్నంతలో ఉరుగ్వే మెరుగైన స్థితిలో ఉన్నవాటిలో ఒకటి. అయితే పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నందున దానికి ఉండే జబ్బులకు కార్మికవర్గం గురవుతున్నది. వామపక్షాల పదిహేనేండ్ల పాలనలో మెరుగ్గా ఉన్నప్పటికీ కరోనా సమయంలో లాక్‌డౌన్‌లు, ఇతర ఆర్థిక సమస్యలను ఆసరా చేసుకొని ప్రతిపక్షం గత ఎన్నికల్లో లబ్ది పొందింది. జవాబుదారీతనంతో కూడిన స్వేచ్చను ఇస్తామని, జనాన్ని తాళం వేసి ఉంచేది లేదని ఓటర్ల ముందుకు వెళ్లింది. గత ఐదు సంవత్సరాలలో ఇరుగుపొరుగుదేశాలలో తలెత్తిన సమస్యల కారణంగా విదేశీ పెట్టుబడులు ఉరుగ్వేకు వచ్చినప్పటికీ అక్కడి ప్రమాణాల ప్రకారం చూస్తే నేరాలు, మాదక ద్రవ్యాల జాఢ్యం సవాలుగా మారింది.భద్రతలేదని జనం భావించారు. నేరగాండ్లను రాత్రిపూట అరెస్టుచేసేందుకు అనుమతించాలంటూ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల కూటమి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలో సురక్షితమైనదిగా ఒకప్పుడు పరిగణించిన ఉరుగ్వేలో ఇప్పుడు సంఘటిత నేరగాండ్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో 47శాతం మంది అభద్రత ప్రధాన సమస్యగా ఉందని చెప్పగా 18శాతం ఉపాధి, 12శాతం ద్రవ్యోల్బణం గురించి చెప్పారు. జీవన వ్యయం, ఆర్థిక అసమానతల పెరుగుదల వంటి సమస్యలను ఉరుగ్వే ఎదుర్కొంటున్నది. మితవాద ప్రభుత్వం 2030 నుంచి ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతామని చెప్పగా విశాల వేదిక 60 ఏండ్లుగా ప్రతిపాదించింది.పిల్లల్లో దారిద్య్రరేటు 25శాతం ఉంది.ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. తమకు అధికారమిస్తే వామపక్ష నూతన మార్గంలో అంటే మార్కెట్‌ అనుకూల, జనానికి సంక్షేమ విధానాలను, వ్యవసాయానికి పన్ను రాయితీలు ఇస్తామని అర్సీ వాగ్దానం చేశాడు. గత వామపక్ష ప్రభుత్వాల పాలనలో అబార్షన్లను చట్టబద్దం కావించారు, స్వలింగ వివాహాలను అనుమతించారు. గత పది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో పెద్ద మార్పు లేకపోగా ఈడికగా సాగుతున్నది. ధనికుల గురించి గాక తమ గురించి విశాల వేదిక శ్రద్ద చూపుతుందనే ఆశాభావాన్ని కార్మికవర్గం వ్యక్తం చేసిందనటానికి ఈ విజయం ఒక సూచిక అని చెప్పవచ్చు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. దేశ ఆర్థిక లోటును తగ్గించేందుకు నూతన ప్రభుత్వం ఏం చేయనుందనే ప్రశ్నలను పరిశీలకులు సంధిస్తున్నారు. బలమైన ప్రభుత్వ పాత్ర ఉండాలని వామపక్ష వేదిక చెబుతున్నది.ధనికులపై పన్ను మొత్తాన్ని పెంచకుండా ఇది ఎలా సాధ్యమన్నది ప్రశ్న. అయితే ఈ అంశం గురించి ఎన్నికల ప్రచారంలో అర్సీ స్పష్టత ఇవ్వలేదు.ఆర్థిక వృద్ధి ద్వారా అదనపు రాబడిని సాధిస్తామని చెప్పాడు.వామపక్ష ప్రభుత్వాల పట్ల అమెరికా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పూర్వరంగంలో ఉరుగ్వే`చైనా సంబంధాలు ఎలా ప్రభావితం అయ్యేది చూడాల్సి ఉంది.చైనాకు ఎగుమతులపై ఉరుగ్వే ఎక్కువగా ఆధారపడి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనం చెవిలో బిజెపి పూలు : మోడీ వెనుకే అదానీ – అలా విదేశీ పర్యటనలు ఇలా ఒప్పందాలు ఎలా !

27 Wednesday Nov 2024

Posted by raomk in Africa, BJP, Congress, Current Affairs, Economics, Greek, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

#Modani, Adani bribery, BJP, crony capitalism, Gautam Adani, Gautam Adani Devised Bribery Scheme, Narendra Modi, US cases on Adani

ఎం కోటేశ్వరరావు

జనం కళ్లుమూసుకొని ఉన్నంత వరకు ఎవరేమనుకుంటే నాకేం అనుకొనే వాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. వివాదాస్పద కార్పొరేట్‌ అధిపతి అదానీ కంపెనీల అవకతవకల గురించి ఏ సంస్థ లేదా ఎవరైనా వెల్లడిస్తే వెంటనే బిజెపి, దాని అనుచరగణం, అమ్ముడు పోయిన మీడియా పెద్దలు కొందరు దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న కుట్ర అంటూ గోలగోల చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే మాకు అధికారం రాకముందే అదానీ పెరిగాడు, అతనికీ మాకు సంబంధం ఏమిటి అని అడ్డంగా బిజెపి మాట్లాడుతుంది. అదానీ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నమాట నిజం, గత పదేండ్లలో అతని కంపెనీల విస్తరణను చూస్తే ‘‘మోదానీ’’ ని విడదీసి చూడలేము. తాజాగా అమెరికా న్యాయశాఖ, సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ కమిషన్‌(సెక్‌) దాఖలు చేసిన కేసుల వెనుక కుట్ర ఉందని బిజెపి అంటోంది. అమెరికాలో కేసులు ఏమౌతాయి ? రాజు తలచుకుంటే దెబ్బలకూ నజరానాలకూ కొదవ ఉండదు. నరేంద్రమోడీ మధ్య ఉన్న స్నేహంతో డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడి న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తారా ? ఏం జరుగుతుందో తెలియదు గానీ అలా చేస్తే అమెరికా పరువు గోవిందా ? కేసులు ఏమైనా అక్కడి మదుపుదార్లు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అదానీ కంపెనీ ఇచ్చిన లేదా వాగ్దానం చేసిన 26.5కోట్ల డాలర్లు లేదా 2,200 కోట్ల రూపాయల ముడుపుల గురించి విచారణ జరిపేందుకు సుముఖత కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడలేదు.కొన్ని దేశాలు వెంటనే స్పందించిన తీరు చూస్తే మోడీ సర్కార్‌ మౌనం ఎందుకో వేరే చెప్పనవసరం లేదు.

నరేంద్రమోడీ విదేశాలలో మనదేశ ప్రతిష్ట పెంచేందుకు పర్యటనలు చేసినట్లు చెప్పినప్పటికీ అవి అదానీ కోసం చేసిన యాత్రల్లా ఉన్నాయి, ఎక్కడికి మోడీ వెళితే అక్కడ అదానీ ప్రత్యక్షం.ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌,గ్రీస్‌, మయన్మార్‌, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌, కెన్యా, టాంజానియా, నేపాల్‌,శ్రీలంక ఇలా అనేక ఉదంతాలు బహిరంగంగా తెలిసినవే ఉన్నాయి. అమెరికా కేసుల గురించి తెలియగానే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌ బ్రౌన్‌ ఫౌండేషన్‌ తరఫున అదానీ(పై నిఘా) వాచ్‌ నిర్వహిస్తున్న సమన్వయకర్త జెఫ్‌ లా ఆ దేశ ప్రధాని అల్బనీస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఆస్ట్రేలియాలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తూ పన్నులు ఎగవేసేందుకు లేదా నామమాత్రంగా చెల్లించేందుకు వీలుగా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌ వంటి ‘‘పన్నుల స్వర్గాల’’లో కంపెనీలు ఏర్పాటు చేశారని, ఈ విషయాల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ప్రముఖుడని హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడిరచిందని , అంతకు ముందు 2017లోనే ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఏబిసి సందిగ్దమైన అదానీ కంపెనీల గురించి బయటపెట్టిందని అన్నాడు.గత ప్రభుత్వాలు 2009 నుంచి 2024వరకు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు, వాటి మీద వచ్చిన ఆవినీతి ఆరోపణల గురించి సమీక్ష, దర్యాప్తు చేసేందుకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం విశ్రాంత హైకోర్టు జడ్జితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.వీటిలో అదానీ కంపెనీతో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాలు కూడా ఉన్నాయి. వీటిలో మనదేశంలో 1,234 మెగావాట్ల గొడ్డా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఉంది. దీని నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన చట్టం ప్రకారం ఎగుమతికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన గొడ్డా విద్యుత్‌ను మన మార్కెట్లో కూడా విక్రయించుకొనేందుకు వీలు కల్పించింది. దీంతో బంగ్లాదేశ్‌ ఆందోళన వెల్లడిరచింది.ఇలాంటి విద్యుత్‌ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న రaార్కండ్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉత్పత్తి మొత్తాన్ని బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తారు. చిత్రం ఏమిటంటే దీనికి అవసరమయ్యే బొగ్గును తొమ్మిదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని అదానీ గనుల నుంచి రవాణా చేసి ఒడిషాలోని అదానీ పోర్టుకు చేర్చి ఇక్కడ వినియోగిస్తారు. ఆ కేంద్రాన్ని బంగ్లాదేశ్‌లోనే నిర్మించవచ్చు. మనకు కాలుష్యాన్ని పంచి అదానీకి లాభాలు తెచ్చే ఈ ప్రాజెక్టును మోడీ సర్కార్‌ ఆమోదించింది. దీని కోసం ప్రత్యేకంగా రైలు మార్గాన్ని విస్తరించి అదానీకి అప్పగించింది. బంగ్లాదేశ్‌తో ఒప్పందం కుదిరిన తరువాత పన్నురాయితీలు ఇచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక జోన్‌గా గుర్తింపు ఇచ్చింది. అదానీ కంపెనీకే ఎక్కువ లాభం కలిగే ఆ ప్రాజక్టు వద్దని స్వదేశంలో వ్యతిరేకత వెల్లడైనా నాటి ప్రధాని హసీనా ఒప్పందం చేసుకున్నారు.బంగ్లాలో తయారయ్యే విద్యుత్‌ ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ చెల్లించటంతో పాటు, విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా పాతికేండ్లలో 45కోట్ల డాలర్లను అదానీకి చెల్లించాల్సి ఉంటుంది.కొత్త ప్రభుత్వం దీన్ని సమీక్షిస్తామని ప్రకటించింది.

అదానీ కంపెనీలతో కుదుర్చుకున్న 250 కోట్ల డాలర్ల విలువ గల ఒప్పందాలను రద్దు చేస్తూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించాడు. అమెరికా కేసుల వార్త తెలియగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండవ రన్‌వే, విద్యుత్‌ సరఫరా లైన్ల నిర్మాణం వంటివి ఉన్నాయి. ఈ లావాదేవీల గురించి తనకు దర్యాప్తు సంస్థలు, భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన కొత్త సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూటో చెప్పాడు. ఈ ఒప్పందాలలో పారదర్శకత లేదని, జనం సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ధ్వజమెత్తాయి. కెన్యా ఒప్పందాలు ఎలా జరిగాయో చూస్తే అదానీ కోసం నరేంద్రమోడీ తన అధికారాన్ని ఎలా వినియోగించారో అర్ధం చేసుకోవచ్చు. అదానీ కంపెనీల అక్రమాల గురించి హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ నివేదిక వెల్లడి తరువాత కూడా అధ్యక్షుడు రూటో ఒప్పందాలను గట్టిగా సమర్థించాడు.చిత్రం ఏమిటంటే అదానీతో ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించటానికి కొద్ది గంటల ముందు కెన్యా విద్యుత్‌ శాఖ మంత్రి ఓపియో వాండాయ్‌ పార్లమెంటు సభ్యులతో మాట్లాడుతూ ఒప్పందంలో ఎలాంటి అవినీతి లేదు గనుక విద్యుత్‌ లైన్ల నిర్మాణం ముందుకు సాగుతుందని ప్రకటించాడు. కెన్యా అధ్యక్షుడు రూటో 2023 డిసెంబరు ఐదున ఢల్లీిలో ప్రధాని నరేంద్రమోడీని కలుసుకున్నారు.హైదరాబాద్‌ హౌస్‌లో వారి భేటీ సందర్భంగా అక్కడ గౌతమ్‌ అదానీ ప్రత్యక్షం. మోడీఅదానీ మధ్య ఎంత సాన్నిహిత్యం లేకపోతే ఇద్దరు దేశాధినేతల మధ్య దూరగలరు ?

డిసెంబరులో మోడీరూటో భేటీ, మూడునెలలు తిరక్కుండానే ఈ ఏడాది మార్చినెలలో నైరోబీ విమానాశ్రయ రెండవ రన్‌వే ఏర్పాటుకు అదానీ కంపెనీ డిపిఆర్‌ సమర్పించటం వెంటనే ఆమోదం చకచకా జరిగిపోయాయి. అంతిమ ఒప్పందం మినహా ముఫ్సై సంవత్సరాల కౌలు అవగాహన, ఇతర నిబంధనల మీద ఏకీభావం కుదిరింది. దీని మీద దేశంలో గగ్గోలుతో రూటో పరువు పోయింది. దాని వివరాలు బయటకు పొక్కనీయలేదు. జూలైనెలలో ఒక వ్యక్తి సామాజిక మాధ్యమంలో దీని గురించి పోస్టు పెట్టటంతో మరింత రచ్చయింది.సెప్టెంబరు పదకొండున విమానాశ్రయ సిబ్బంది ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సమ్మె చేశారు. ఒప్పందం ప్రకారం ఉద్యోగాలు పోవటంతో పాటు కెన్యా పౌరులకు బదులు ఇతర దేశాల వారిని విమానాశ్రయ సిబ్బందిగా నియమించుకొనేందుకు అవకాశం ఉంది.లాభాలను దేశం వెలుపలకు తరలించవచ్చు. అనేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక్కడి నుంచి 54దేశాలకు విమాన రాకపోకలు జరుగుతాయని, ఈ ఒప్పందంతో దేశానికి ఆర్థికంగా నష్టదాయకమని కార్మిక సంఘం పేర్కొన్నది. కౌలు గడువు ముగిసిన తరువాత 18శాతం వాటాను అదానీ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివి ఆరు రాయితీలు ఉన్నాయని, ఇతర విమానాశ్రయాల కాంట్రాక్టులు కూడా వచ్చేందుకు వీలు కల్పించే విధంగా ఒప్పందం ఉన్నట్లు బయటపడిరది. విమానాశ్రయ విస్తరణ గురించి ఎలాంటి బహిరంగ ప్రకటన లేదు, అంతా గుట్టుగా జరిగింది. ఈ వ్యవహారం కోర్టుకు ఎక్కటంతో ఇంకా ఎలాంటి ఒప్పందం జరగలేదని ప్రభుత్వం చెప్పుకోవాల్సి వచ్చింది. అక్కడి సుప్రీం కోర్టు ఆ ఒప్పందాలను పక్కనబెట్టటంతో విధిలేక అధ్యక్షుడు రూటో రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు.

తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో బాగామోయో రేవు అభివృద్దికి చైనా కంపెనీతో కుదిరిన అవగాహనను అక్కడి ప్రభుత్వం 2019లో రద్దు చేసుకుంది. ఆ రేవుతో పాటు మరో రెండు రేవులను అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అదానీ కంపెనీఅబుదాబీ కంపెనీ సంయుక్తంగా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2023 అక్టోబరులో అధ్యక్షురాలు సమియా సులు హసన్‌ భారత సందర్శనకు వచ్చినపుడు మనదేశంతో అనేక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఏడాది మే నెలలో అదానీ కంపెనీ టాంజానియా దారుసలామ్‌ రేవులో కంటెయినర్‌ జెట్టీని అభివృద్ది చేసేందుకు 30 ఏండ్ల రాయితీ ఒప్పందం చేసుకుంది. విద్యుత్‌ లైన్‌ నిర్మాణం గురించి కూడా అదానీ కంపెనీ అమెరికా కంపెనీతో కలసి చేపట్టేందుకు టాంజానియా సంప్రదింపులు జరుపుతోంది. మయన్మార్‌లోని యంగూన్‌ రేవులో ఒక జెట్టీని అభివృద్ధి చేసేందుకు 2019లో కాంట్రాక్టు పొందినట్లు అదానీ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు మయన్మార్‌ మిలిటరీ జనరల్‌ మిన్‌ అంగ్‌ లైయింగ్‌తో గౌతమ్‌ అదానీ కుమారుడు కరన్‌ అదానీ భేటీ అయ్యాడు.సదరు అధికారి గుజరాత్‌లోని ముంద్రా రేవును సందర్శించాడు.ఆ సందర్భంగా మిలిటరీ జనరల్‌, అతనితో పాటు వచ్చిన అధికారులకు ‘‘బహుమతులు’’ ముట్టచెప్పారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి లైయింగ్‌ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. నియంతలతో కూడా అదానీ తన కంపెనీల కోసం చేతులు కలిపారన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. మిలిటరీ పాలకులపై అమెరికా ఆంక్షలు విధించినా అదానీ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగలేదు.మిలిటరీ అధికారుల కనుసన్నలలో నడిచే మయన్మార్‌ ఎకనమిక్‌ కార్పొరేషన్‌కు అదానీ మూడు కోట్ల డాలర్లు చెల్లించిందని, అవి ముడుపులని ఆరోపణలు వచ్చాయి. తరువాత కాలంలో పశ్చిమ దేశాల ఆంక్షలు తీవ్రం కావటంతో ఆ రేవు ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని, పెట్టిన పెట్టుబడి 19.5 కోట్ల డాలర్లు ఇస్తే ఎవరికైనా విక్రయిస్తామని ప్రకటించింది. ఎవరూ ముందుకు రాకపోవటంతో 2023లో మూడు కోట్ల డాలర్లకే విక్రయించింది.తమకు 15.2కోట్ల డాలర్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నది.


శ్రీలంక ప్రభుత్వంతో గతంలో అదానీ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించనున్నట్లు ఇటీవల ఎన్నికైన అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ప్రకటించాడు.ఈ మేరకు 44 కోట్ల డాలర్లతో తలపెట్టిన గాలిమరల విద్యుత్‌ ప్రాజెక్టు గురించి పునరాలోచించనున్నట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు మనదేశం సాయం చేసింది. దానికి ప్రతిగా మోడీ మనదేశానికి ఉపయోగపడే పని చేయాల్సిందిపోయి తాము చెప్పిన అదానీకి ప్రాజెక్టులను అప్పగించాలని కోరటం అధికార దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. భారత వత్తిడి కారణంగా గాలి మరల విద్యుత్‌ ప్రాజెక్టును కట్టబెట్టినట్లు అక్కడి అధికారే స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడిరచాడు, అతని ప్రాణానికి ముప్పురావటంతో ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదానీకి కట్టబెట్టేందుకు పోటీ లేకుండా అక్కడి చట్టాన్నే మార్పించారు. మోడీ సర్కార్‌ దన్నుతో కొలంబో రేవులో సగం వాటాతో తూర్పు కంటెయినర్‌ జట్టీ అభివృద్ధి, నిర్వహణకు అదానీ రంగంలోకి దిగాడు. కీలకమైన ఆ ప్రాజెక్టు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని రేవు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.దాంతో దాని బదులు పశ్చిమ కంటెయినర్‌ జెట్టిని అప్పగిస్తామని, సగం బదులు 85శాతం వాటాతో గత ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వీటన్నింటినీ సమీక్షిస్తున్నందున ఏమవుతుందో చూడాలి.


నలభై సంవత్సరాల తరువాత తొలిసారిగా భారత ప్రధానిగా నరేంద్రమోడీ 2023 ఆగస్టులో గ్రీస్‌ పర్యటనకు వెళ్లారు.పైకి ఏమి చెప్పినా అదానీకి అక్కడి ప్రాజెక్టుల కోసమే అని వార్తలు వచ్చాయి.ఎందుకంటే ఇరుదేశాల నేతల మధ్య రేవుల గురించి చర్చ జరిగింది. ఇండోనేషియాలోని అదానీ గనుల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ధరను మూడు రెట్లకు పైగా ఎక్కువగా నిర్ణయించారు. నాసిరకాన్ని నాణ్యత కలదిగా పేర్కొన్నారు.ఇది యుపిఏ హయాంలో జరిగినప్పటికీ మోడీ సర్కార్‌ ఎలాంటి విచారణ జరపలేదు.2023 సెప్టెంబరు ఏడున మోడీ ఇండోనేషియా పర్యటన జరిపారు.నెల రోజులు కూడా తిరగక ముందే అదానీ ప్రత్యక్షమై సబాంగ్‌ రేవు గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇలా గత పదేండ్లలో అదానీ కంపెనీలు విదేశాల్లో విస్తరణకు మోడీ సహకరించారన్నది స్పష్టం. విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటపడతాయి. అలాంటి చిత్తశుద్ది కేంద్ర ప్రభుత్వానికి ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అదానీ-జగన్‌ రెడ్డి ముడుపుల చెలగాటం : ఇరకాటంలో నరేంద్రమోడీ-చంద్రబాబు !

22 Friday Nov 2024

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, tdp, TDP, USA, Ycp

≈ Leave a comment

Tags

Adani bribery, Adani Group, BJP, CHANDRABABU, Gautam Adani Devised Bribery Scheme, Narendra Modi Failures, Solar Power, YS jagan

ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద పారిశ్రామిక, వాణిజ్యవేత్త గౌతమ్‌ అదానీ పరివారపు లంచాల బాగోతం బట్టబయలైంది. హరిత ఇంథన కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారికి 26.5 కోట్ల డాలర్ల మేరకు ముడుపులు చెల్లించిందని రెండు కేసులు దాఖలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌ కోర్టులో నవంబరు 20న ఒక కేసును న్యాయశాఖ, మరో కేసును సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ల నియంత్రణ సంస్థ వేసింది. ముడుపుల మొత్తంలో సింహభాగం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ముట్టిందని చెబుతున్నారు. అసలు తమ నేత అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకి)తో డిస్కామ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఒక ప్రభుత్వరంగ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా అని వైసిపి ఒక ప్రకటనలో అమాయకత్వాన్ని ప్రదర్శించింది. అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల పత్రాలలో పేర్కొన్నదాని మేరకు సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.తాను స్వంతంగా లేదా ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి చేసిన హరిత విద్యుత్‌ను సెకి కొని అవసరమైన వారికి విక్రయిస్తుంది. ఆ మేరకు 2019 డిసెంబరు, 2020 జూలై మధ్య కాలంలో కేంద్ర పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ కంపెనీ సెకి ద్వారా అదానీ కంపెనీ, మరో అమెరికా కంపెనీ అజూర్‌ పవర్‌ నుంచి పన్నెండు గిగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది.దానిలో అదానీ ఎనిమిది, అమెరికా కంపెనీ నాలుగు గిగావాట్లు సరఫరా చేయాల్సి ఉంది. విద్యుత్‌ను నిలువ చేయటానికి వీలుండదు గనుక తమ దగ్గర నుంచి కొనుగోలు చేసే వారి కోసం సెకి ప్రయత్నించింది. ఒప్పందాలు చేసుకుంటేనే సదరు కంపెనీలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.


అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమైంది.అమెరికా న్యాయశాఖ ఆరోపించిన మేరకు గౌతమ్‌ అదానీ, అతగాడి మేనల్లుడు సాగర్‌ అదానీ, వినీత్‌ జైన్‌ మరో ఐదుగురు రాష్ట్రాలలో ఉన్న పాలకులు, అధికారులకు ముడుపుల బాగోతానికి తెరతీశారు. అమెరికా, ఇతర దేశాల నుంచి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారికి తెలియకుండా ఈ అక్రమాన్ని దాచి అమెరికా చట్టాల ప్రకారం మోసం చేశారు. సెకి నుంచి ఎవరైనా విద్యుత్‌ను కొనుగోలు చేస్తేనే అదానీ, అమెరికా కంపెనీలు ముందుకు పోవాల్సి ఉంటుంది. అయితే సెకి ధర ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలేవీ ముందుకు రాలేదు.అదానీ, అమెరికా కంపెనీల పెద్దలు కూర్చుని రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల నేతలు, అధికారులకు తామే ముడుపులు చెల్లించి సెకితో ఒప్పందాలు చేయించాలని పథకం వేశారు. దాని ప్రకారమే అంతా జరిగింది. అమెరికా కేసులో దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, గౌతమ్‌ అదానీ అందుకోసమే కలిశారన్నది ఆరోపణ. ఆ తరువాతే 2021 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయని చెబుతున్నారు. అంటే ముడుపుల బేరసారాలకే వారి కలయిక అన్నది స్పష్టం.

ఇక ఈ ఒప్పందం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన శ్వేత పత్రాల సందర్భంగా చెప్పిందేమిటి ? సెకి నుంచి యూనిట్‌కు రు.2.49 చొప్పున ఏడువేల మెగావాట్లు ఆంధ్రప్రదేశ్‌ కొనుగోలు చేసింది. మూడువేల మెగావాట్లు 2024సెప్టెంబరు నుంచి, మరో మూడువేల మెగావాట్లు 2025 సెప్టెంబరు, మిగిలిన వెయ్యి 2026 సెప్టెంబరు నుంచి సరఫరా చేయాలి. అయితే ఒప్పంద సమయంలో మార్కెట్లో యూనిట్‌ ధర రు.1.99 మాత్రమే ఉందని, సెకితో ఒప్పందం వలన ఏటా వినియోగదారులపై రు.850 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు విద్యుత్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు చెల్లించాల్సిన సరఫరా ఛార్జీల భారాన్ని ఏటా మూడు నుంచి మూడున్నరవేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, ఇవన్నీ కలుపుకుంటే ఒప్పంద గడువు పాతిక సంవత్సరాలలో 62వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటన) ఏమంటున్నారు ?


గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం యూనిట్‌ ధర రు.5.10కి చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు పదివేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తయారీకి జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.దాన్లో భాగంగా 2020 నవంబరులో 6,400 మెగావాట్లకోసం ఏపి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా టెండర్లు పిలిచింది.యూనిట్‌ రు.2.49, 2.58 చొప్పున సరఫరా చేసేందుకు 24 టెండర్లు వచ్చాయి. అయితే న్యాయపరమైన సమస్యలతో వాటిని రద్దు చేసింది. ఆ తరువాత యూనిట్‌ ధర రు.2.49కి సరఫరా చేసేందుకు సెకి ముందుకు వచ్చింది.అది 2019 జూన్‌లో ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల నుంచి సరఫరా చేస్తుంది. విద్యుత్‌ సరఫరా చార్జీలను మినహాయించేందుకు సెకి అంగీకరించింది. దీని వలన ఏటా రాష్ట్రానికి రు.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సరఫరా ఛార్జీల భారం రాష్ట్రం మీద పడుతుందని అంటే జగన్మోహనరెడ్డి లేదని చెబుతున్నారు. ఏది వాస్తవమో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి, ఒప్పంద పత్రాలను జనాల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నిజం తెలుస్తుంది.


అమెరికాలో దాఖలైన కేసు జగన్‌మోహనరెడ్డి లేదా ఇతర రాష్ట్రాలలో ఒప్పందం చేసుకున్నవారి మీద కాదు. అమెరికా, అంతర్జాతీయ మదుపుదార్లను ముడుపుల గురించి మభ్యపెట్టి అదానీ కంపెనీ మోసం చేసినదాని గురించి మాత్రమే. సూదికోసం సోదికి పోతే పాత గుట్టంతా రట్టయినట్లుగా ఈ క్రమంలో ముడుపుల బాగోతం బయటపడిరది. అదానీ అండ్‌ కో మొత్తం 26.5 కోట్ల డాలర్లు(మన కరెన్సీలో రు.2,209 కోట్లు) ముడుపులుగా ఇచ్చారని, ఈ మొత్తంలో రు.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఒప్పించటానికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ముడుపులకు ఒప్పించిన తరువాత ఒడిషా, జమ్ము అండ్‌ కాశ్మీరు, తమిళనాడు, చత్తీస్‌ఘర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సెకి ఒప్పందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదానీ సంస్థ ఏడువేల మెగావాట్లు, అమెరికా సంస్థ 650 మెగావాట్లను మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ముడుపుల గురించి దర్యాప్తు చేసేందుకు పూనుకున్న ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించినట్లు అమెరికన్‌ ఎఫ్‌బిఐ(మన సిబిఐ వంటిది) అధికారి ఫిర్యాదు చేశాడు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సెకి ఒప్పందం కుదుర్చుకోక ముందు 2021 ఆగస్టులో సిఎం జగన్‌మోహన రెడ్డితో గౌతమ్‌ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముడుపులు చెల్లించటం లేదా ఇచ్చేందుకు అదానీ వాగ్దానం చేసినట్లు, ఆ కారణంగానే ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా సెక్యూరిటీస్‌ సంస్థ దాఖలు చేసిన కేసు 80, 81పేరాలలో పేర్కొన్నది. అదానీ గ్రీన్‌ మరియు అజూర్‌ పవర్‌ అంతర్గత వర్తమానాలలో సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది అనే సమాచారం ఉన్నట్లు మరోమాటలో చెప్పాలంటే ముడుపులు చెల్లించటం లేదా వాగ్దానం పనిచేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక మెగావాట్‌కు రు.25లక్షలు చెల్లించేట్లు ఆ మొత్తం రు.1,750 కోట్లని, అదానీ కంపెనీ అంతర్గత రికార్డుల్లో ఉన్న అంశం దీనికి దగ్గరగా ఉందని కూడా చెప్పింది. ఇవన్నీ తమ మీద చేసిన నిరాధార ఆరోపణలు మాత్రమేనని, నేరం రుజువయ్యేవరకు నిందితులుగానే పరిగణించాలని అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.


అమెరికా కోర్టులో దాఖలైన కేసుల్లో ఏమి తేలుతుందో తెలియదు, అదానీ కంపెనీల మీద 2023లో హిండెన్‌బర్గ్‌ సంస్థ వెల్లడిరచిన నివేదిక, కొన్ని దేశాల్లో అదానీ కంపెనీల బాగోతాలు చూసిన తరువాత విదేశాల్లో మన గురించి ఒక చెడు అభిప్రాయం ఏర్పడిరదన్నది వాస్తవం. ఈ ఉదంతాల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినందున ప్రతి వారి నోళ్లలో మనదేశం నానుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ సెకి విద్యుత్‌ను అమ్మే స్థితిలో లేదన్న సందేశం, అందుకోసమే ప్రయివేటు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ముడుపులు ఇచ్చినట్లు తాజా ఉదంతంతో వెల్లడైంది. విదేశాలు తిరిగి ప్రతిష్టను పెంచానని చెప్పుకున్న నరేంద్రమోడీ అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల గురించి పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అక్కడ విద్యుత్‌ ప్రాజెక్టును అదానీకి ఇప్పించారని వచ్చిన వార్తల గురించి చెప్పనవసరం లేదు. గతంలో హిండెన్‌బర్గ్‌ సంస్థ ముందుకు తెచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే అది తన లబ్దికోసం పనిచేసే ప్రైవేటు సంస్థ అంటూ కొట్టివేశారు. సెబిపేరుతో విచారణను నీరుగార్చారు. ఇప్పుడు అమెరికా అధికారిక సంస్థలే కేసులు దాఖలు చేసినందున మోడీ సర్కార్‌ గతంలో మాదిరి తప్పించుకుంటుందా ?


ఈ ఉదంతం గురించి పూర్తి వివరాలు తెలియవని, విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ రాష్ట్రాల నేతలకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చినందున కేంద్రమే దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో నరేంద్రమోడీచంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడినట్లు చెప్పవచ్చు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహనరెడ్డి పట్ల ఎలాంటి సానుభూతి లేకున్నా, ముడుపులు ఇచ్చినట్లు చెబుతున్నది అదానీ గనుక విచారణ గురించి చంద్రబాబు పట్టుబడతారా అన్నది సందేహమే. ఎవరు అవునన్నా కాదన్నా మోడీఅదానీ బంధం గురించి తెలిసిందే. గతంలో తాను చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చినందున ఆ సంబంధాలతో అదానీ అండ్‌కోను బయటపడవేయిస్తే ఇక్కడ జగన్మోహనరెడ్డిని రక్షించినట్లే గాక సచ్చీలుడని అంగీకరించాల్సి ఉంటుంది. అదానీ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆశిస్తున్న చంద్రబాబు మాట మాత్రంగా విచారణ జరపాలన్నారు తప్ప అంతకు మించి మాట్లాడకపోవచ్చన్నది ఒక అభిప్రాయం. గతంలో వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్న విద్యుత్‌ మీటర్ల ఒప్పందాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం దాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే విద్యుత్‌ సమస్య తలెత్తవచ్చనే సాకు చూపి కొనసాగించవచ్చు. కేంద్రం తీసుకొనే నిర్ణయం, ప్రతిపక్షాలు ఈ సమస్యను ముందుకు తీసుకుపోయే తీరు తెన్నులను చూసిన తరువాత చంద్రబాబు వైఖరి నిర్ణయం కావచ్చు. అవినీతి అక్రమాలను నిలదీస్తా, తాట వలుస్తా అని గతంలో బీరాలు పలికిన జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కూ ఇది పరీక్షే. అమెరికాకూ ఇది ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.అక్కడి న్యాయశాఖ, ఆర్థికలావాదేవీల నియంత్రణ సంస్థ దాఖలు చేసిన కేసులు వీగిపోతే అవినీతిని సహించదనే దాని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మొత్తం మీద ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రికార్డులను తిరగరాసిన వామపక్షం !

21 Thursday Nov 2024

Posted by raomk in Asia, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Anura Kumara Dissanayake, Sri Lanka JVP, Sri Lankan NPP


ఎం కోటేశ్వరరావు

సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా వామపక్ష నేత అనుర కుమార దిశనాయకే విజయం ఒక పెద్ద మలుపు.నవంబరు 14న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గత అనేక రికార్డులను బద్దలు కొట్టి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) మూడిరట రెండువంతుల మెజారిటీతో 225కు గాను 159 సాధించి లంక చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.ఈ పార్టీకి గరిష్టంగా 130 స్థానాలు వస్తాయని ఎన్నికల పండితులు అంచనాలు వేశారు. జనతా విముక్తి పెరుమన(సంఘటన), దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి. అన్నింటికంటే ముఖ్య అంశం తమిళ, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవటం ఎవరూ ఊహించని పరిణామం. సోమవారం నాడు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. లంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని నూతన ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తుండగా వామపక్ష ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు, విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ప్రజలలో వ్యతిరేకతను పెంచటం కూడా ఎన్‌పిపి విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.


అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమారకు 42.3శాతం ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల్లో 61.68శాతం వచ్చాయి. 2010 ఎన్నికల్లో మహింద రాజపక్సే పార్టీకి 60.33శాతమే ఇప్పటి వరకు రికార్డు. అదే విధంగా పార్లమెంటులో 2020ఎన్నికల్లో అదే పార్టీకి 145 సీట్ల రికార్డును 159తో ఎన్‌పిపి బద్దలు కొట్టింది.ఇరవై రెండు జిల్లాలకు గాను 2010రాజపక్స 19చోట్ల ఎక్కువ సీట్లు సంపాదించగా ఈసారి ఎన్‌పిపి 21 జిల్లాల్లో మెజారిటీ సాధించింది. తమిళులు మెజారిటీగా ఉన్న బట్టికలోవాలో మాత్రమే రెండవ స్థానంలో ఉంది. వీటన్నింటిని చూసినపుడు కేవలం మెజారిటీ సింహళీయుల, మైనారిటీ వ్యతిరేకుల పార్టీ అన్న ముద్రను ఎన్‌పిపి పోగొట్టుకుంది. ఇది ఎలా జరిగింది, కారణాలేమిటి అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. జాతుల పరంగా మెజారిటీ, మైనారీటీ సామాజిక తరగతుల ఛాంపియన్లుగా తరతరాలుగా ముద్ర పడిన పార్టీల మీద జనం విశ్వాసం కోల్పోవటమే దీనికి ప్రధాన కారణం. కరోనాకు ముందు దీర్ఘకాలం ఉన్న ఉగ్రవాద సమస్య, తరువాత తలెత్తిన ఆర్థిక సంక్షోభాలతో అందరూ దెబ్బతిన్నారు. దుర్భరపరిస్థితుల నుంచి సాంప్రదాయ పార్టీలేవీ గట్టెంకించలేవన్న భావన ఓటర్లలో బలంగా తలెత్తింది. అధ్యక్ష ఎన్నికల తరువాత ఎస్‌జెపి అనురకుమారను వ్యతిరేకించేశక్తులు చేతులు కలిపితే పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని వేసిన అంచనాలన్నీ తప్పాయి. లంక రాజ్యాంగం ప్రకారం 225 స్థానాలలో 196 మందిని నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నుకుంటారు.మరో 29 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం వాటికి సీట్లు కేటాయిస్తారు. ఎన్‌పిపి 141నియోజవర్గాల్లో గెలవగా దామాషా ఓట్లతో 18 స్వంతం చేసుకుంది. 2020 ఎన్నికలలో ఎన్‌పిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి.


ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం తెలిసిందే.ఆ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ ఎస్‌జెపి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం, అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే(ఎన్‌డిఎఫ్‌) స్వతంత్ర అభ్యర్ధిగా 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం అధ్యక్షపదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.నిబంధన ప్రకారం 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి ఉంటాయో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం వచ్చాయి. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే 50శాతంపైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు. ముందే చెప్పుకున్నట్లు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. వామపక్ష ఎన్‌పిపికి వ్యతిరేకంగా సాజిత్‌ ప్రేమదాస, రానిల్‌ విక్రమసింఘే తమ విబేధాలను పక్కన పెట్టి ఒకే అభ్యర్థిని నిలిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.


అధ్యక్ష ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు కలిపి 50శాతంపైగా ఓట్లు వచ్చాయి. అదే పార్లమెంటు ఎన్నికలలో ఎస్‌జెపికి 17.66. ఎన్‌డిఎఫ్‌కు 4.49శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. ఎస్‌జెపికి అంతకు ముందు 54 సీట్లు ఉండగా ఈ సారి 40కి తగ్గాయి. ఎన్‌డిఎఫ్‌కు కొత్తగా ఐదు సీట్లు వచ్చాయి. తిరుగులేని సోదరులుగా పేరుతెచ్చుకొని, అత్యంత హీన చరిత్రను మూటగట్టుకున్న శ్రీలంక పొడుజన పెరుమన(ఎస్‌ఎల్‌పిపి)కి గత ఎన్నికల్లో 59శాతం ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 2.57శాతం మాత్రమే తెచ్చుకొని పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే పార్లమెంటు ఎన్నికల్లో 3.14శాతం ఓట్లతో 145లో 142 పోగొట్టుకొని కేవలం మూడు సీట్లు మాత్రమే తెచ్చుకుంది. శ్రీలంక 74 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో 38 ఏండ్ల పాటు అధికారంలో ఉండి చరిత్ర సృష్టించిన యుఎన్‌పి 0.59శాతం ఓట్లు తెచ్చుకొని ఒక్క సీటుకు పరిమితమైంది.అనూహ్యమైన అనుర కుమార విజయం తరువాత ఎన్‌పిపిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనతా విముక్తి పెరుమన(జెవిపి) వైఖరిలో వచ్చిన మార్పు లేదా ఎత్తుగడల్లో భాగంగా అన్ని సామాజిక తరగుతులకు అది దగ్గరైంది. వారి విశ్వాసాన్ని చూరగొంది. అధ్యక్ష`పార్లమెంటు ఎన్నికల మధ్య ఉన్న రెండునెలల వ్యవధిని అది ఉపయోగించుకుంది.తమిళులు, ముస్లింలు గణనీయంగా ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆ సామాజిక తరగతులకు చెందిన వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఆ స్థానాల్లో అంతకు ముందు పాతుకుపోయిన నేతలందరినీ చిత్తుచిత్తుగా ఓడిరచారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇలంకాయ్‌ తమిళ అరసు కచ్చి(ఐటిఎకె) పార్టీ 1949 నుంచి పని చేస్తున్నది. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా జిల్లాలోని నాలుగు సీట్లలో దీనికి ఒక సీటు రాగా ఎన్‌పిపి మూడు తెచ్చుకుంది. ఇలాంటిదే మరో జిల్లా బట్టికలోవాలో ఎన్‌పిపికి ఒకటి, ఐటిఏకి మూడు వచ్చాయి. ఇక్కడ మాత్రమే ఎన్‌పిపి వెనుకబడిరది. పార్లమెంటు ఎన్నికల్లో 2.31శాతం ఓట్లు, ఎనిమిది సీట్లతో మూడవ స్థానంలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తమిళులు ఉండే ప్రాంతాలలో కేవలం పదిశాతం అంతకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎన్‌పిపి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 25 నుంచి 42శాతం వరకు పెంచుకుంది.


ఎన్‌పిపికి తిరుగులేని మెజారిటీ వచ్చిన కారణంగా అనేక పార్టీల మాదిరి అది కూడా నిరంకుశంగా వ్యవహరిస్తుందా అన్న చర్చను కూడా కొందరు లేవనెత్తుతున్నారు. లంక అధ్యక్షుడికి కార్యనిర్వాహక అధికారాలు ఉన్న కారణంగా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి పార్లమెంటులో మెజారిటీ కూడా తోడైంది. ఈ కారణంగానే అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటంతో తలెత్తిన నిరసనకారణంగా అధ్యక్ష భవనంపై దాడితో మిలిటరీ రక్షణతో దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. నూతన రాజ్యాంగాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను తొలగిస్తామని గతంలో వాగ్దానం చేసిన పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్‌పిపి కూడా అదే వాగ్దానం చేసింది.ఇది కూడా కొత్త రాజ్యాంగాన్ని తెస్తుందా , ఇతర పార్టీల బాటలోనే ఉన్నదాన్నే కొనసాగిస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు లంకలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా స్పష్టమైన తీర్పు వచ్చింది. అందువలన ఎన్‌పిపి తన అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. లాటిన్‌ అమెరికా వామపక్షాల మాదిరే ఉన్న వ్యవస్థపునాదుల మీదనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందా లేక వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్త్తి తలెత్తటం అనివార్యం.


ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులను ఒకవైపు అమలు జరుపుతూ మరోవైపు సంక్షేమ చర్యలను కొనసాగించిన దేశాలు దాదాపు లేవు. ఐఎంఎఫ్‌ షరతుల నుంచి పేదలను రక్షిస్తానని అధ్యక్షుడు దిశనాయకే ప్రకటించినప్పటికీ నిలబెట్టుకుంటారా అన్నది ప్రశ్న. గత ప్రభుత్వం అంగీకరించిన మేరకు నాలుగు వందల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం లేదా పునర్‌వ్యవస్తీకరించాలి.ఏది జరిగినా లక్షల ఉద్యోగాలు పోతాయి.పౌరుల మీద పన్నులు పెంచాలి, ఉచిత విద్య, వైద్యం వంటి సేవల నుంచి ప్రభుత్వం వైదొలగాలి లేదా గణనీయంగా వాటి ఖర్చుకోత పెట్టాలి. మరోవైపు విదేశాంగ విధానం ఒక సవాలుగా మారనుంది. ఇప్పటి వరకు చైనా అనుకూల దేశంగా లంకకు ముద్రపడిరది. దాన్నుంచి తన ప్రభావంలోకి తెచ్చుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నది ఒక అభిప్రాయం. గత ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడితో అదానీ కంపెనీకి ఇచ్చిన విద్యుత్‌ ప్రాజెక్టును రద్దు చేస్తామని కూడా దిశనాయకే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అదే జరిగితే మనదేశ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులకు ముందుకు వెళ్లరు. మరోవైపు హిందూమహా సముద్రం మీద పట్టుకోసం అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పెను సవాళ్లు !

13 Wednesday Nov 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

#US Elections 2024, Democratic party, Donald trump, Kamala Harris, Republican party

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభల మధ్యంతర ఎన్నికలు నవంబరు ఐదున జరిగాయి.అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీలో డోనాల్డ్‌ ట్రంప్‌ 312, కమలా హారిస్‌ 226 స్థానాలు తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య 435కాగా మెజారిటీ 218, రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209స్థానాల్లో ముందంజ లేదా గెలిచారు. ఎన్నికలకు ముందు రిపబ్లికన్లు 222,డెమోక్రాట్లు 213 స్థానాలు కలిగి ఉన్నారు. ఎగువ సభ సెనేట్‌లో మెజారిటీకి 51స్థానాలు అవసరం కాగా రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45, ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. గతంలో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర సెనెటర్లు ఈ సారి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆ స్థానాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా డెమోక్రాట్లు 23, రిపబ్లికన్లు 27 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చిన కొన్ని అంశాలను చూద్దాం.ఎన్నికల పండితులు చెప్పిన జోశ్యాలు నిజం కాలేదు.కృత్రిమ మేథను ఉపయోగించి కొందరు రూపొందించిన అంచనాలు కూడా తప్పాయి.ఈ పండితులంతా గతంతో పోల్చితే మా అంచనాలు దగ్గరగా ఉన్నాయనే కొత్త వాదనను ముందుకు తీసుకువచ్చారు.

సర్వేల అంచనాలకు భిన్నంగా ట్రంప్‌ గెలవటం గురించి మధనం జరుగుతున్నది. అతగాడు గెలిచినప్పటికీ ఓటింగ్‌ సరళిని చూసినపుడు కార్మికుల హక్కులు, అబార్షన్లకు వ్యతిరేకంగా, ఇతర పురోగామి విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.గత ఎన్నికల్లో జోబైడెన్‌కు 8.128కోట్ల ఓట్లు (51.3శాతం) రాగా ట్రంప్‌కు 7.422 కోట్లు(46.8శాతం) వచ్చాయి.ఈసారి 95శాతం లెక్కింపు పూర్తయ్యే సమయానికి ట్రంప్‌కు 7.54కోట్లు(50.2శాతం), కమలకు 7.23కోట్ల ఓట్లు(48.2శాతం) వచ్చాయి. గతంలో వచ్చిన వాటిలో కోటి ఓట్లను డెమోక్రటిక్‌ పార్టీ కోల్పోయింది. కార్మికులకు ప్రాధాన్యత, జాతి, లింగవివక్షకు వ్యతిరేకమైన విధానాలకు ఓటర్లు స్పష్టమైన ధోరణి, మద్దతు కనపరిచారని వివిధ రాష్ట్రాల ఓటింగ్‌ తీరుతెన్నులను విశ్లేషించిన ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విశ్లేషణ పేర్కొన్నది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు విధానాలను రూపొందించే క్రమంలో ఈ ధోరణి ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పింది. ఐదు రాష్ట్రాలు వేతన సంబంధిత సమస్యల మీద ఓట్లు వేశాయి. 2009 నుంచి జాతీయ స్థాయిలో కనీసవేతనాలు పెంచకపోయినా 30 రాష్ట్రాలు, 63 స్థానిక సంస్థలు తమ ప్రాంతాల్లో కనీసవేతనాలను పెంచాయి. తాజా ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలలో కనీసవేతనం గంటకు 15డాలర్లు ఉండాలన్న వైఖరికి మద్దతు తెలిపారు. మహిళల్లో ఉన్న వాంఛలను ప్రతిబింబిస్తూ ఏడు రాష్ట్రాలు తమ రాజ్యాంగాల్లో అబార్షన్‌ హక్కును పొందుపరిచాయి. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, తలిదండ్రులకు ఓచర్ల రూపంలో డబ్బులిచ్చి బాధ్యతను వదిలించుకోవాలని చూస్తున్న ధోరణులను మూడు రాష్ట్రాలలో తిరస్కరించారు. కార్మిక సంఘాల ఏర్పాటులో కంపెనీల జోక్యం ఉండకూడదని కోరేవారు విజయాలు సాధించటం కార్మికుల వైఖరిని వెల్లడిరచింది.

కొన్ని వైరుధ్యాలు కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యాయి.అబార్షన్‌ హక్కు లేదని సుప్రీం కోర్టు చెప్పినదానిని ట్రంప్‌ తలకెత్తుకున్నప్పటికీ మహిళలు ఓటు వేయటం, గంటకు కనీస వేతనంగా ఉన్న 7.5డాలర్లను స్వల్పంగా అయినా పెంచుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ట్రంప్‌ నిరాకరించినా కార్మికులు కొంత మంది మద్దతు ఇవ్వటం వంటి అంశాలు ఉన్నాయి. గతంలో పురోగామి విధానాలకు ఓటు వేసిన చోట కూడా ఈ సారి డెమోక్రాట్లను కాదని ట్రంప్‌కు వేశారని తేలింది. ఎలక్టరల్‌ కాలేజీ వ్యవస్థ కారణంగా స్వింగ్‌ స్టేట్స్‌ను తమవైపు తిప్పుకొనేందుకే డెమోక్రాట్లు కేంద్రీకరించటం, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోలేదని తేలింది. అదే సమయంలో ట్రంప్‌ తనకు వ్యతిరేకంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాలను 2022లో, తాజాగా కూడా వదల్లేదు, దాంతో ప్రజాప్రతినిధుల సభలో కొన్ని స్థానాలను అక్కడ గెలిచినట్లు ఫలితాలు వెల్లడిరచాయి.ఈ రాష్ట్రాలలో గెలిచిన స్థానాలతో దిగువ సభలో మెజారిటీ సాధిస్తే అది డెమోక్రాట్ల లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కార్పొరేట్లు భారీ ఎత్తున ట్రంప్‌కు మద్దతుగా డబ్బు సంచులను దింపాయి. రాష్ట్రాల కార్మిక చట్టాల నుంచి తమ డ్రైవర్లను మినహాయించాలంటూ ఉబెర్‌,లిప్ట్‌ కంపెనీలు కాలిఫోర్నియాలో కోట్లాది డాలర్లను ఖర్చు చేశాయి. డబ్బు, సోషల్‌ మీడియా, టీవీలు, పత్రికలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి కూడా డెమాక్రాటిక్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్న ఓటర్లు ప్రభావితమై కొందరైనా ట్రంప్‌కు ఓట్లు వేశారు. మరొక అభిప్రాయం ప్రకారం తమను విస్మరించిన డెమోక్రాట్లకు గుణపాఠం చెప్పేందుకు కసితో ట్రంప్‌కు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.ఈ వ్యతిరేకతను గుర్తించటంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. రిపబ్లికన్‌ పార్టీ నాయకత్వం పచ్చిమితవాదంతో, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉంటుంది. ఎలాగైనా గెలవాలని అనుకున్న ట్రంప్‌ తన ఎత్తుగడలను మార్చాడు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీం కోర్టు తిరస్కరించటాన్ని సమర్ధిస్తూనే మరో వైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్‌ ప్రభుత్వం తరఫున అబార్షన్లపై నిషేధం విధించనని ప్రకటించి కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే అధికారానికి వచ్చిన తరువాత అతగాడి నిజస్వరూపం వెల్లడి అవుతుంది.మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనుక నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎంతగా అణచివేస్తే అంతగా కార్మికవర్గం ప్రతిఘటిస్తుంది. డెమోక్రాట్లు కాడిపడవేసినంత మాత్రాన కార్మికవర్గం నీరుగారిపోతుందని అనుకుంటే పొరపాటు. అవసరమైతే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, కార్మికుల తరఫున రాజీలేకుండా పోరాడేశక్తులను ముందుకు తెస్తారు. అంతర్గత విధానాలు, విదేశీ విధానాలను జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ట్రంప్‌ ప్రకటిస్తాడు. అప్పటి వరకు వివిధ దృశ్యాలను ఊహించుకుంటూ సాగించే విశ్లేషణలే వెలువడతాయి.

అమెరికా ఎన్నికల గురించి సర్వేలు ఎందుకు విఫలమయ్యాయి అనే చర్చ కూడా ప్రారంభమైంది.పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని, ఓడిపోతే కేసులు దాఖలు చేసేందుకు ట్రంప్‌ మద్దతుదారులు అన్నీ సిద్దం చేసుకున్నారని చెప్పారు, తీరా చూస్తే ట్రంప్‌ తిరుగులేని మెజారిటీతో నెగ్గాడు. సర్వేలు, పండితులు అతగాడిని ఎందుకు తక్కువ అంచనా వేశారంటూ ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుడు ఫలితాలు వచ్చాయంటే సర్వేల్లో డెమోక్రాట్లు ఎక్కువగా పాల్గొన్నందున అని ఒక సాకు చెబుతున్నారు. సర్వేలన్నీ పోటాపోటీ ఉందని, స్వల్ప మెజారిటీతో కమలాహారిస్‌ గెలుస్తారని, పోటీ తీవ్రంగా ఉన్న స్వింగ్‌ స్టేట్స్‌లో కూడా నాలుగింట ఆమెకే మెజారిటీ ఉందని కొద్ది గంటల్లో ఓటింగ్‌ ప్రారంభానికి ముందు కూడా చెప్పాయి. ఈ సారే కాదు, 2016, 2020,2022 ఎన్నికల్లో కూడా అంచనాలు తప్పాయి.కోల్పోయిన తమ విశ్వసనీయతను పునరుద్దరించుకొనేందుకు ఈ సారి తమ పద్దతులను సవరించుకొని కచ్చితంగా ఉండేట్లు చూస్తామని సర్వే సంస్థలు ప్రకటించాయి. ఆచరణలో అదేమీ కనిపించలేదు. అన్ని స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యతలో ఉన్నాడు.ఒక విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడిగా పనిచేస్తున్న అలాన్‌ లిచ్‌మన్‌ తాను 13అంశాలను పరిగణనలోకి తీసుకొని గత పన్నెండు అధ్యక్ష ఎన్నికల గురించి చెప్పిన జోశ్యాల్లో 11సార్లు నిజమైందని ఈ సారి కమలాహారిస్‌ గెలుస్తారని తాను చెప్పింది తిరగబడిరదని అంగీకరించాడు. తన పద్దతి గురించి మరోసారి సరిచూసుకుంటానని చెప్పాడు. రెండు వారాల క్రితం ట్రంప్‌ గెలుస్తాడని చెప్పిన 538 సంస్థ అధిపతి సిల్వర్‌ అనే మరో ఎన్నికల పండితుడు ఎన్నికలకు కొద్ది గంటల ముందు స్వల్పతేడాతో కమల గెలుస్తారని చెప్పాడు. అమెరికా ఎన్నికల్లో బెట్టింగ్‌ బంగార్రాజులు కాసిన పందేల విలువ 360కోట్ల డాలర్లని ఒక అంచనా. ఇవి బహిరంగంగా ప్రకటించిన మేరకు వచ్చిన వివరాలు మాత్రమే, ఇంకా ఇంతకంటే భారీ మొత్తాల్లోనే పందాలు ఉన్నాయి. వెల్లడైన సమాచారం మేరకు ఎక్కువ మంది ట్రంప్‌ గెలుపు మీదనే పందాలు కాశారు. అంటే ఎన్నికల పండితుల కంటే జూదగాండ్లే జనం నాడిని బాగా పసిగట్టినట్లు తేలింది. ఎన్నికల రోజున ఐదు జూద కంపెనీలు ట్రంప్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఓటింగ్‌ ముగిసిన తరువాత ట్రంప్‌ మీద పందాలు విపరీతంగా పెరిగాయి.

ఎన్నికల పండితులు, కృత్రిమ మేథకంటే ఒక పిల్ల హిప్పోపోటోమస్‌ ఎన్నికల ఫలితాన్ని కచ్చితంగా చూపిందని సామాజిక మాధ్యమంలో సందేశాలు వెల్లువెత్తాయి. థాయ్‌లాండ్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న మూ డెంగ్‌ అనే పిల్ల హిప్పోపోటోమస్‌కు భవిష్యత్‌ను చెప్పే అద్భుతశక్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఎన్నికల్లో గెలిచేది ఎవరో తేల్చాలంటూ దాని ముందు రెండు పళ్లాలలో కేకుతోపాటు పుచ్చకాయలు పెట్టి ఒకదాని మీద కమల హారిస్‌, మరొకదానికి మీద డోనాల్డ్‌ ట్రంప్‌పేరు రాసి పెట్టారట.ఏ పళ్లంలోని కేకును తింటే ఆ పేరుగల అభ్యర్థిగెలుస్తారన్న నమ్మకం దాని వెనుక ఉంది. పెద్దగా ఆలోచించకుండా ట్రంప్‌ పేరు రాసిన పుచ్చకాయ కేకును మూ డెంగ్‌ తినటంతో ట్రంప్‌ గెలుస్తాడంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పిల్ల హిప్పోపోటోమస్‌ తల్లి మాత్రం కమల పేరున్న పుచ్చకాయ తిన్నదట. పిచ్చి ఎంత పతాకస్థాయికి చేరిందంటే ఆ పిల్ల జంతువును చూసేందుకు ఒక అమెరికన్‌ మహిళ 20గంటలు ప్రయాణించి ఆ జంతు ప్రదర్శనశాలకు వచ్చి పులకించిపోయిందట. దరిద్రం ఏమిటంటే తమ నాయకురాలి పేరున్న ప్లేట్‌వైపు చూడనందుకు మూ డెంగ్‌ గురించి డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం చేశారట. మరొక పిచ్చి చర్య ఏమంటే కృత్రిమ మేథతో పనిచేసే చాట్‌ జిపిటిని ఎవరు గెలుస్తారని అడిగితే ట్రంప్‌ లేదా కమల ఇద్దరూ అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టరని చెప్పిందట. మూడవ పక్షం కింగ్‌ మేకర్‌ అవుతుందని కూడా సెలవిచ్చింది. ఆన్‌లైన్‌ ఒరాకిల్‌ అయితే పట్టణాల్లో హింసాకాండ చెలరేగుతుందని జోశ్యం చెప్పింది.

అమెరికాలో ఎన్నికల జోశ్యాలు 1880దశకం నుంచి ప్రారంభమయ్యాయి.ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బోల్తాపడ్డాయి.2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓట్లు ఎక్కువగా వస్తాయని, ఆమేరకు ఎలక్టరల్‌ కాలేజీలో కూడా మెజారిటీ తెచ్చుకుంటారని సర్వే సంస్థలన్నీ చెప్పాయి. మొదటిది మాత్రమే నిజమైంది, రెండవదానిలో అంచనాలు తప్పాయి. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఓట్లు తక్కువ, ఎలక్టరల్‌ కాలేజీలో గెలుపుకు అవసరమైన ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుస్తాడని చెప్పినప్పటికీ అసాధారణ మెజారిటీ తెచ్చుకుంటారని చెప్పిన జోశ్యాలు తప్పాయి.2022లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పినప్పటికీ అలా జరగలేదు.సాధారణ మెజారిటీ 2018 కాగా రిపబ్లికన్లకు 222 మాత్రమే వచ్చాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో డెమోక్రాట్లు సెనెట్‌ను 5149 మెజారిటీతో గెలుచుకున్నారు. మరింత శాస్త్రీయ పద్దతిలో సర్వేలు నిర్వహించాలని అనేక మంది చెప్పారు, రానున్న రోజుల్లో ఏ పద్దతిని అనుసరిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమదేశాలు వద్దు – మాతృదేశమే ముద్దు అంటున్న చైనా విద్యాధికులు !

06 Wednesday Nov 2024

Posted by raomk in Asia, CHINA, COUNTRIES, Current Affairs, Europe, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, China AI, China education power, GenAI Patents, Narendra Modi Failures, STEM PhDs, WIPO, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అంతరిక్ష రంగంలో అమెరికాకు ధీటుగా 2050నాటికి అగ్రదేశంగా మారేందుకు చైనా మూడు దశల ప్రణాళికలు రూపొందించింది.వివిధ గ్రహాల గురించి పరిశోధన, ఒక అంతర్జాతీయ లూనార్‌ పరిశోధనా కేంద్ర నిర్మాణం వంటివి దీనిలో ఉన్నాయి.చంద్రుడి మీదకు 2030నాటికి వ్యోమగాములను పంపే లక్ష్యం కూడా ఉంది. ఆర్థికంగా చైనా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నవారే ఈ పరిశోధనలకు భారీ మొత్తాలను ఎలా ఖర్చు పెడుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారు. దేశ చరిత్రను చూసినపుడు లక్ష్యాలను ప్రకటించిన నిర్ణీత కాలంలో పూర్తిచేసిన చరిత్ర ఉందని కూడా అంటున్నారు. తొలిసారిగా చంద్రుడికి ఆవలి వైపున రోవర్‌ను దించిన చైనా ఘనత తెలిసిందే.అంతరిక్ష లక్ష్యాల రోడ్‌ మాప్‌ను కేంద్ర కాబినెట్‌ స్థాయి కార్యాలయం పర్యవేక్షించనుంది.2028 నుంచి 2035వరకు మానవులను పంపే కార్యక్రమాలతో పాటు చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.మూడవ దశలో 30మిషన్‌లను ప్రయోగిస్తారు.ఐరోపా స్పేస్‌ ఏజన్సీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారు.తమ అంతరిక్ష పరిశోధన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉందని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు.

పశ్చిమ దేశాల్లో పరిశోధనలు చేయటం, చేతి నిండా సంపాదించటం ఎంతో మంది కనేకల. అది తప్పేం కాదు. స్వదేశంలో తమ మేథకు పదును పెట్టే అవకాశాలు, దానికి తగిన ప్రతిఫలం పొందే పరిస్థితి లేనపుడు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. గతంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి సంపాదించిన వారిని చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి ‘‘ డాలరు కలలు ’’ కనేవారు ఉన్నారు. దీన్నే మరో విధంగా మేథోవలస అనేవారు. ధనికదేశాలన్నీ ఇలాంటి వలసలను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నాయి. చైనా తాజాగా వెల్లడిరచిన సర్వే సమాచారం ప్రకారం ‘‘స్టెమ్‌’’ (సైన్సు,టెక్నాలజీ,ఇంజనీరింగ్‌,గణిత శాస్త్రాలకు పెట్టిన పొట్టి పేరు) పరిశోధనకు(పిహెచ్‌డి) విదేశాలకు వెళ్లిన చైనీయులలో 80శాతం మంది తిరిగి వస్తున్నారట. 1987లో కేవలం ఐదుశాతమే ఉండగా 2007లో 30.6శాతం నుంచి ఇప్పుడు 80శాతానికి చేరారు. ధనికదేశాల్లో అకడమిక్‌ అవకాశాల కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పోటీ ఉంది.ఎందుకు చైనీయుల్లో ఇలాంటి మార్పు అని చూస్తే ప్రపంచ భూ భౌతికఆర్థిక శక్తిగా చైనా ఎదగటం తప్ప మరొక కారణం లేదు. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు చైనాలో అవకాశాలు, ఆర్థిక ప్రతిఫలాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.అయితే విదేశాల్లో ఇంకా ఆకర్షణ కొనసాగుతూ ఉంటే వలసలు మరోసారి కొనసాగవని చెప్పలేము.చైనాలో పెరుగుతున్న ఆర్థిక లబ్దితో పాటు, ఒకే బిడ్డ అన్న విధానం అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన తరానికి చెందిన వారు వృద్ద తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ సంబంధాలు కూడా పరిశోధకులు తిరిగి రావటం వెనుక కారణాలుగా తేలాయి.పశ్చిమదేశాల్లో సంపాదించిన దానికి దగ్గరగా చైనాలో కూడా ఉండటంతో తిరిగి వచ్చేవారి వేగం పెరుగుతున్నది.


చైనాలో విద్య, పరిశోధనలకు పెద్ద పీటవేస్తున్న కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(జన్‌ఏఐ) పేటెంట్లకు దరఖాస్తున్నట్లు ప్రపంచ పేటెంట్‌ సంస్థ(డబ్ల్యుఐపిఓ) తాజా సమాచారం వెల్లడిస్తున్నది. ఈ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న అమెరికా, దక్షిణ కొరియా,జపాన్‌, భారత్‌ను చైనా అధిగమించింది. 2023తో ముగిసిన దశాబ్దిలో దాఖలైన 54వేల దరఖాస్తుల్లో నాలుగోవంతు గతేడాదిలోనే ఉన్నాయి.చైనా నుంచి 201423 సంవత్సరాలలో 38వేల దరఖాస్తులు వచ్చాయి.వేగంగా దూసుకువస్తున్న కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం ఆటతీరునే మార్చివేయనుంది. ఇదే కాలంలో 54వేల పేటెంట్‌ దరఖాస్తులతో పాటు 75వేల శాస్త్రీయ పత్రాల ప్రచురణ కూడా చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జారీచేసిన అన్ని రకాల పేటెంట్లలో ఏఐ వాటా కేవలం ఆరుశాతమే. పది అగ్రశ్రేణి సంస్థలలో టెన్‌సెంట్‌(2,074, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌(1,564), బైడు(1,234), చైనీస్‌ సైన్స్‌ అకాడమీ(607), అలీబాబా (571) శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ (468),ఆల్ఫాబెట్‌(443), బైట్‌డాన్స్‌(418), మైక్రోసాఫ్ట్‌ 377 ఉన్నాయి. మొత్తం దేశాల వారీ చూస్తే చైనా 38,210, అమెరికా 6,276, దక్షిణ కొరియా 4,155, జపాన్‌ 3,409, భారత్‌ 1,350 ఉన్నాయి. రంగాల వారీగా ఇమేజ్‌, వీడియో డేటా, 17,996,టెక్స్ట్‌ 13,494, మాటలు లేదా సంగీతం 13,480 ఉన్నాయి.విదేశాల్లో చదివి భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదని కెనడా విద్యాసంస్థ ఎం స్క్వేర్‌ మీడియా (ఎంఎస్‌ఎం) తన సర్వేలో తేలినట్లు 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. విదేశీ డిగ్రీల గుర్తింపుతో సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2022లో 7.7లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.201519 మధ్య విదేశాల్లో చదువుకొని స్వదేశం తిరిగి వచ్చిన వారిలో 22శాతం మాత్రమే ఉపాధి పొందినట్లు తేలింది. విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు భారత్‌లో గుర్తింపు లేకపోవటం ఒక ప్రధాన సమస్య.


ప్రపంచ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా తన సత్తాను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది.2035 నాటికి అగ్రశ్రేణి విద్యాశక్తిగా మారేందుకు పథకాలను రూపొందించింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విద్యాకేంద్రంగా మారేందుకు చూస్తున్నట్లు చైనా విద్యామంత్రి హువెయ్‌ జిన్‌పెంగ్‌ ఇటీవల ప్రకటించాడు.సైన్సు, ఇంజనీరింగ్‌ రంగాలలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త డిగ్రీకోర్సులతో సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పాడు. అనేక ఇబ్బందులు, సవాళ్లు ఉన్నప్పటికీ అధ్యక్షుడు షీ జింపింగ్‌ మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రణాళికను అమలు జరపనున్నట్లు వెల్లడిరచాడు. పెద్ద విద్యాశక్తిగా ఉన్న స్థితి నుంచి బలమైన శక్తిగా మారేందుకు 2010లో నిర్ణయించామని, తాజా లక్ష్యాన్ని 2020లోనే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆచరణలో పెట్టినట్లు జిన్‌ పెంగ్‌ చెప్పాడు.ఆర్థికంగా కొన్ని సమస్యలున్నప్పటికీ విద్యారంగ పథకాలను కొనసాగించాల్సిందేనని షీ జింపింగ్‌ నిర్దేశించాడు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ సమాచారం 2024 ప్రకారం 207 దేశాల విద్యారంగ సమాచారాన్ని విశ్లేషించగా చైనా 13వ రాంక్‌లో ఉండగా భారత్‌ 101. మనకంటే ఎగువన శ్రీలంక 61,నేపాల్‌ 56, దిగువన మయన్మార్‌ 109, బంగ్లాదేశ్‌ 122,పాకిస్తాన్‌ 136 స్థానాలలో ఉన్నాయి. విద్యార్థుల్లో 1823 సంవత్సరాల వయస్సు వారిలో ఉన్నత విద్యకు వెళ్లే వారు ప్రస్తుతం చైనాలో(జిఇఆర్‌) 60శాతం దాటారు, ఇది ఉన్నత మధ్యతరగతి ఆదాయ దేశాలకు సమానం. 2012లో ఇది 30శాతం మాత్రమే ఉండేది. అందరికీ ఉన్నత విద్యలో చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 50వేలు, ఫ్రాన్సునుంచి మూడు సంవత్సరాలల్లో పదివేల మంది విద్యార్థులను మార్పిడి కార్యక్రమం కింద ఆహ్వానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా మారేట్లు చైనా చూస్తున్నది. అక్కడ జరిగే పరిశోధన ఫలితాలను ఉత్పత్తి, సేవారంగాలలో వినియోగించే విధంగా వాణిజ్య స్థాయిలో విక్రయించేందుకు కూడా ప్రోత్సహిస్తున్నది తద్వారా ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా వచ్చే ఆదాయంతో మరింతగా పరిశోధకులను ప్రోత్సహించేందుకు వీలుకలుగుతుంది.ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమల్లో వచ్చే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించటం, నవీకరించే పరిశోధలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.ఫలితంగా ఈ పరిశోధనల విలువ 201923కాలంలో 150 నుంచి 290 కోట్ల డాలర్లకు పెరిగింది.దీనికి అనుగుణంగానే వార్షిక నివేదికలను విడుదల చేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సంఖ్య 3,447 నుంచి 4,028కి పెరిగింది. మార్కెట్లో తమ పరిశోధన ఫలితాలను అందచేసేందుకు చేసుకున్న ఒప్పందాలు కూడా 3,34 నుంచి 6.4లక్షలకు పెరిగాయి. వీటిలో 60శాతం స్థానిక సంస్థలవే కావటంతో ప్రాంతీయ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయన్నది స్పష్టం.


చైనా విద్యను కూడా ఎగుమతి చేయాలని చూస్తున్నది.దీనిలో భాగంగా అనేక దేశాలలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల స్థాపనకు పూనుకుంది. చైనీయులు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.వారి కుటుంబాలు తిరిగి రావాలంటే చైనా విద్య అవసరం ఎంతో ఉంది.చైనా స్కూళ్లలో ఏ పాఠ్యాంశాలనైతే బోధిస్తున్నారో వాటి నకలుతో దుబాయ్‌లో 500 చైనా కుటుంబాల విద్యార్థులతో స్కూలు నడుస్తున్నది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. దుబాయ్‌లో ప్రయోగాత్మకంగా 2020 నుంచి నడుస్తున్నది. అమెరికా,బ్రిటన్‌తో సహా 45 దేశాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలను చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తన దౌత్యవేత్తలను కోరింది. ప్రపంచంలో కోటి మంది చైనీయులు ఆ దేశానికి చెందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్థానికులతో అలాంటి వారి పిల్లలు పోటీపడలేకపోతున్నారు. అందువలన చైనా భాష, సిలబస్‌తో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల వారిని కూడా ఈ స్కూళ్లకు ఆకర్షించేలక్ష్యం కూడా దీని వెనుక ఉంది. ఉదాహరణకు విదేశాల్లో నడిపే ఫ్రెంచి స్కూళ్లలో కేవలం నలభైశాతం మందే ఆ దేశానికి చెందిన వారుంటుండగా మిగతావారందరూ ఇతర దేశీయులే. అమెరికన్‌ స్కూళ్లలో పరిస్థితి కూడా ఇదే. చైనాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్కూళ్లను నడుపుతున్నాయి. ఇవి విదేశాల్లో కూడా చైనా స్కూళ్లను ప్రారంభిస్తే ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు ప్రాంతాన్ని చైనా మనదేశానికి అప్పగించిందా ? నరేంద్రమోడీ పరువు తీస్తున్న సోషల్‌ మీడియా భక్తులు !

02 Saturday Nov 2024

Posted by raomk in Asia, BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, BJP, fake news, Indo - China trade, Indo-China standoff, Narendra Modi Failures, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ఫేక్‌ న్యూస్‌, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్‌ ఉన్న ఫోన్‌ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.

ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్‌ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్‌ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్‌ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్‌ చేసిందని, షేర్‌ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్‌, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.

చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్‌ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదని, టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్‌ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్‌ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్‌ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.


2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్‌ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఉపన్యాసమంటూ ఫేక్‌ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్‌ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్‌ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్‌ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్‌ అయింది. తీరా అది ఫేక్‌ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్‌ మహిళా మేయర్‌ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్‌ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్‌ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్‌ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్‌ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్‌ న్యూస్‌ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d