• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడే ప్రాధాన్యత-వుద్యోగుల, కార్మికుల కర్తవ్యం

14 Friday Apr 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Others

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, BJP, Central Government Employees, cps, EMPLOYEES, Government employees, heymarket, mayday, NDA, NPS, workers

Image result for mayday-haymarket

ఎం కోటేశ్వరరావు

మే డే ! కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. పశ్చిమార్ధ గోళంలో అనేక దేశాలలో, సమాజాలలో అది వసంత రుతు ఆగమన పండుగ రోజు. మే ఒకటవ తేదీని కార్మికులు వుత్సవంగా జరుపుకుంటే యజమానులకు పండుగ, వారు కూడా దానికి అవసరమైన నగదు మొత్తాలను సంతోషంతో సమకూర్చుతారు. అదే దీక్షా దినంగా పాటించే చోట సదరు కార్మిక సంఘాన్నే మొత్తంగా లేపేయటానికి, కార్మికులను భయపెట్టటానికి కూడా వెనుకాడరు. మే ఒకటవ తేదీ ప్రాధాన్యతను కార్మికవర్గం తెలుసుకోకుండా చేసేందుకు ఆ రోజుకు బదులు మరొక రోజును కార్మికదినంగా మార్చేందుకు మరోవైపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సంప్రదాయ వసంత రుతు వుత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కార్మికుల బతుకులు మాడిపోతున్నా, యజమానులు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకులు అణచివేస్తున్నా అవేమీ పట్టకుండా ప్రకృతి పరంగా చెట్లు చేమలు వికసిస్తాయి. కానీ మేడే వస్తే కార్మికుల బతుకులు వాటంతట అవే వికసించవని గుర్తించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరుపుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది వారి చైతన్యానికి గీటురాయి.

ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్బో దీని గురించి మాకు తెలియందేముంది, ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు విన్నది, చదువుకున్నదేగా అని పెద్దలు అనుకుంటారు. ప్రపంచ పువ్వుల రోజు, లవ్వుల రోజు, నవ్వుల రోజుల మాదిరిగా ఇది కూడా 365రోజుల్లో ఇదొక రోజేగా అని యువత భావించవచ్చు. అనేక దేశాలలో చాలా మందికి ఇప్పటికీ , చివరికి దీనికి నాంది పలికిన అమెరికాలో సైతం మే డే గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతిమనిషీ యాదృచ్చికంగానో లేదా కొంత మంది అన్నట్లు ప్రమాదవశాత్తో ఏదో ఒక మతాన్ని అవలంభించే కుటుంబంలో పుట్టటం తెలిసిందే. ఆయా మతాల దేవుళ్ల లేదా దేవ దూతలు లేదా ఇతర ప్రతినిధుల ప్రవచనాలు అనేకసార్లు విన్నప్పటికీ కుటుంబ, సామాజిక వుత్సవాల సందర్భాలలో మరోసారి వినేందుకు డబ్చిచ్చి మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే. అందువలన ప్రతి ఒక్కరూ తమ వర్గానికి చెందిన అంతర్జాతీయ రోజు గురించి మంత్ర తంత్రాలు, ప్రవచనాల క్రతువు మాదిరి అయినా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ?

Image result for mayday-haymarket

చాలా మంది మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for mayday-haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గానికే ముందు చూపు ఎక్కువని అనేక సందరా&భలలో రుజువైంది. తన చావు గోపబాలుడి చేతిలోనే వుందని గ్రహించిన కంసుడు చంపటానికి పుట్టుక నుంచి ఎలా ప్రయత్నించాడో అలాగే తనకు సమాధికట్టేది కార్మికవర్గం అని గ్రహించిన పెట్టుబడిదారీ వర్గం కూడా అదే చేసింది. చికాగో అమరజీవుల త్యాగం ప్రపంచ కార్మికవర్గానికి వుత్తేజం కలిగించేందు మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మికదినంగా పాటించాలని రెండవ ఇంటర్నేషనలన చేసిన నిర&ణయం తమ దేశ కార్మికవర్గాన్ని ప్రభావితం చేయకుండా చూసేందుకు అమెరికా పాలకవర్గం ప్రారంభం నుంచీ ప్రయత్నించింది. అమెరికా కార్మికోద్యమంలో సోషలిస్టు భావాలున్న శక్తులు చురుకుగా వుండటాన్ని గమనించిన పెట్టుబడిదారీ వర్గం తమ చెప్పుచేతలలో వుండే వారిని కార్మికనేతలుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. సోషలిజాన్ని వ్యతిరేకించే నైట్స ఆఫ్‌ లేబరన పేరుతో వ్యవహరించేవారితో 1869లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. వారి ప్రతిపాదనలలో సెప్టెంబరులో కార్మికులకు ఒక రోజు సెలవు ఇవ్వాలనే ఒక డిమాండు వుంది. దానిని ఆసరా చేసుకొని మే డే వైపు తమ కార్మికవర్గం మొగ్గకుండా చూసేందుకు 1887లో ఓరేగాన్లో, తరువాత 1894 నుంచీ దేశ వ్యాపితంగా సెప్టెంబరులో మొదటి సోమవారాన్ని కార్మికదిన సెలవుగా, కార్మికదినోత్సవంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటవ తేదీని కార్మికదినంగా చేస్తే చికాగోలో హేమార్కెటన మాదిరి కార్మికులు కొట్లాటలకు దిగుతారని పాలకవర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి కార్మికులు మే డేను పాటించారు. తరువాత 1958లో కార్మికులను గందరగోళపరిచేందుకు, యజమానులకు విధేయులుగా చేసేందుకు మే ఒకటవ తేదీని అమెరికా విధేయతా దినంగా ప్రకటించింది. దానికి స్వాతంత్య్రవుద్యమ వారసత్వం అనే మనోభావాన్ని జోడించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచంలో అనేక చోట్ల పాలకవర్గం చేసింది, చేస్తోంది.

Image result for mayday-haymarket

మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు గాను 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. అయితే దాని సభ్యులుగా వున్న కార్మికులు మే డేను పాటిస్తున్నా వద్దని నివారిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచంలో తొలి కార్మికరాజ్యాన్ని, తరువాత అనేక దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను వునికిలోకి తేవటంలో కార్మికవర్గం ముందు పీఠీన వుంది. అదే కార్మికవర్గం 1990 దశకంలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడటమే కాదు, ఎండమావుల వంటి పెట్టుబడిదారీ వ్యవస్ద స్వర్గాలను చేరాలనే అత్యాశతో తాను కూడా సోషలిస్టు వ్యతిరేక శక్తులతో చేతులు కలపటం కూడా ఆ శతాబ్దంలోనే జరిగింది. కార్మికవర్గం సోషలిస్టు భావజాలం వైపు మొగ్గకుండా చూసేందుకు పెట్టుబడిదారీ వర్గం రెండవ ప్రపంచ యుద్దం తరువాత తన లాభాలను కాపాడుకొనేందుకు నూతన మార్గాలను వెతుకుతూనే కార్మికవర్గానికి కొన్ని రాయితీలు కల్పించి, సంక్షేమ కార్య క్రమాలను అమలు జరిపింది. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజం, సోషలిజాలకు కాలం చెల్లిందనే ప్రచారదాడితో పాటు అంతకు ముందు తాను అమలు జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటం, కార్మికవర్గంపై కొత్త భారాలను మోపటం గత పాతిక సంవత్సరాలలో ఐరోపా, ఇతర ధనిక దేశాలలో చూశాము. ఇదే సమయంలో సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న దేశాల కార్మికవర్గ పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక సమస్యలున్నప్పటికీ ఇప్పటికీ సోషలిస్టు వ్యవస్దలున్న చైనా, వియత్నాం, క్యూబా వంటి చోట్ల కార్మికవర్గ పరిస్థితులు మెరుగ్గా వున్నాయన్నది దాచినా దాగని సత్యం.

పెట్టుబడిదారీ వర్గం అమలు జరుపుతున్న వుదారవాద విధానాల ప్రభావం, ప్రపంచ సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తరువాత యాజమాన్యవర్గాలదే పై చేయి అయింది. కార్మికవర్గాన్ని మరింతగా దోచుకొనేందుకు కార్మికవర్గంపై అనేక షరతులను రుద్దుతున్నారు. వాటిని వుల్లంఘిస్తే వుద్యోగాల నుంచి వూడగొడతామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. కార్మిక చట్టాలను నీరు గార్చటంతో పాటు వున్న చట్టాలను కూడా అమలు జరపకుండా, కనీసం తనిఖీ చేసే అధికారం కూడా కార్మికశాఖకు లేకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. అనేక చట్టాలను పూర్తిగా ఎత్తివేయటానికి పూనుకున్నారు. కార్మిక సంఘాలు కొన్ని వర్గసామరస్య విధానాల వూబిలో కూరుకుపోయాయి. పైరవీల ద్వారా కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పూనుకున్నాయి. భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను గాలికి వదలి పెట్టాయంటే అతిశయోక్తి కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వుదాహరణకు కేంద్ర ప్రభుత్వ వుద్యోగుల వేతన సవరణ విషయమే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోవటం తప్ప న్యాయంగా తమకు రావాల్సిందాన్ని సాధించుకొనేందుకు కనీసం అన్ని తరగతుల వుద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మె చేసేందుకు కూడా అనువైన పరిస్ధితులు నేడు లేకపోవటానికి ప్రపంచవ్యాపితంగా మారిన పరిస్థితులు, వర్గ సామరస్య వైఖరే కారణం. ఇదే ధోరణి కానసాగితే భవిష్యత్‌లో మరింత దారుణ స్ధితిలోకి నెట్టబడతారని గుర్తించాలి. 2004 తరువాత ప్రభుత్వ వుద్యోగాలలో చేరిన వారు నూతన పెన్షన్‌ పధకం పేరుతో తమ పెన్షన్‌కు తామే డబ్బు చెల్లించుకుంటున్నారు. దానిని ప్రారంభం నుంచీ వామపక్ష పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు పనిచేసే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కొంత మంది ఈ స్కీమును బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ప్రవేశపెట్టింది కనుక కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కొందరు ఆ రోజుల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన వారున్నారు. అసలు ఇప్పుడు చాలా మందికి ఇది బిజెపి సర్కార్‌ పుణ్యమే అని తెలియదు. 1998-2004 మధ్య కాలంలో అధికారంలో వున్న వాజ్‌పేయి సర్కార్‌ 1999లో ‘ఒయాసిస్‌ ‘(ఓల్డ్‌ ఏజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ) పేరుతో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దాని సిఫార్సుల ప్రాతిపదికన నూతన పెన్షన్‌ పధకాన్ని రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని కూడా ఏర్పాటు చేశారు. 2003 డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2004 జనవరి ఒకటవ తేదీ తరువాత చేరిన సాయుధ దళాల సిబ్బంది తప్ప ప్రభుత్వ వుద్యోగులందరూ ఈ స్వచ్చంద పెన్షన్‌ స్కీములో విధిగా చేరాల్సి వచ్చింది. ఇది అమెరికాలో అమలులో వున్న 401(కె) పెన్షన్‌ స్కీముకు అనుకరణ తప్ప ‘భారతీయ’ పధకం కాదు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే బిజెపి అమలులోకి తెచ్చిన ఈ పధకాన్ని తరువాత పది సంవత్సరాలు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. ఆ నాడు వుద్యోగ సంఘాలు నామ మాత్ర వ్యతిరేకత తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఘటించలేదు. అప్పటికే వుద్యోగులుగా వున్న వారు అది తమకు వర్తించదు కనుక రాబోయే వుద్యోగులే చూసుకొంటారు మనకెందుకు లెమ్మని వుదాసీనంగా వున్నారు. వారిలో తమ భవిష్యత్‌ కుటుంబ సభ్యులు వుంటారని కూడా ముందు చూపుతో ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ పెన్షన్‌ స్కీము కింద చేరిన వుద్యోగులు దాని తీరుతెన్నులు చూసి గొల్లు మంటూ రద్దు కోసం ఆందోళనలు చేయాలని కోరుతున్నారు. చిత్రం ఏమిటంటే గతంలో వుద్యోగ సంఘాల నేతలుగా వుండి ఏ మాత్రం పట్టించుకోని నేతలు తగుదునమ్మా అంటూ ఇప్పుడు నూతన పెన్షన్‌ వ్యతిరేక ప్రకటనలు చేయటం గమనించాల్సిన అంశం. తెలంగాణా వంటి చోట్ల వుద్యోగ సంఘాల నేతలుగా పని చేసిన వారు ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్నారు. అయినా ఆ ప్రభుత్వం నూతన పెన్షన్‌ స్కీమును అమలు చేస్తోంది తప్ప రద్దు చేసే విషయాన్ని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు.

ఇక ఏడవ వేతన కమిషన్‌ చేసిన దారుణమైన సిఫార్సులు, వాటిని అమలు జరిపేందుకు మోడీ సర్కార్‌ వుద్యోగుల మెడలు వంచిన తీరు గురించి తెలిసిందే. వాటి మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. సాధ్యమైన మేరకు తాము ఇవ్వదలచుకున్నదానికే వుద్యోగుల చేత ఆమోదింపచేయించేందుకు చేయాల్సిందంతా చేశారు, చేస్తున్నారు. కేంద్ర వుద్యోగులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వర్తింప చేసే అలవెన్సుల గురించి ప్రకటన వెలువడుతుందని ఎంతో ఆశించి ఫూల్స్‌ అయ్యారు.అసలు ఎప్పుడు వాటిని ఖరారు చేస్తారో కూడా తెలియని స్ధితి ఇప్పుడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నాయకత్వంలోని అలవెన్సుల కమిటీ నివేదిక గతేడాది నవంబరునెలలోనే వెలువడాల్సి వుంది. ప్రభుత్వం దాని గడువును మూడు నెలలు పొడిగించింది. ఫిబ్రవరిలో వెలువడాల్సిస సిఫార్సుల నివేదికకు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందని చెప్పారు. ఎన్నికలైపోయాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు పాతపడుతున్నాయి. ఇంతవరకు నివేదికను సమర్పించలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానిని ప్రభుత్వం పరిశీలించేది ఎప్పుడు ఖరారు చేసేది ఎన్నడో చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ గతేడాది జనవరి నుంచి అమలు కావాల్సిన అలవెన్సుల బకాయిల గురించి వుద్యోగులు ఆశలు వదులుకొని ఏదో ఒకటి అసలు అలవెన్సులు ప్రకటిస్తే చాలనే విధంగా పరిస్ధితిని తెచ్చేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. తాజాగా మూడు శాతం డిఎ వస్తుందని చూసిన వుద్యోగులు రెండుశాతం ప్రకటనతో కంగుతిన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే వేతన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్ధితి. మరో వేతన సవరణ నాటి వరకు వాయిదా వేస్తారని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీపద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. వుద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిందానిని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని కూడా విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం.

గమనిక:ఈ వ్యాసం ‘ ఎంప్లాయీస్‌ వాయిస్‌ ‘ పత్రిక కోసం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈక్వెడోర్‌లో వామపక్ష విజయం-ప్రాధాన్యత, సవాళ్లు !

05 Wednesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Ecuador, ecuador presidential race, leftist moreno wins, Lenín Moreno

Image result for lenín moreno ecuador

నిల్చున్న వ్యక్తి రాఫెల్‌ కొరెయా,  కూర్చున్నది లెనిన్‌ మొరేనో

ఎంకెఆర్‌

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగులుతూ మితవాదశక్తులు చెలరేగిపోతున్న తరుణంలో వాటికి అడ్డుకట్ట వేసి ఈక్వెడార్‌లో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. ఆదివారం నాడు జరిగిన తుది విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి లెనిన్‌ మొరేనో సాధించిన విజయం ప్రపంచ అభ్యుదయ శక్తులన్నింటికీ కొత్త శక్తి నిస్తుంది. పోలైన ఓట్లలో 99.65శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 51.16శాతం, ప్రత్యర్ధి గులెర్మో లాసోకు 48.84శాతం వచ్చినట్లు తెలిపిన ఎన్నికల అధికారులు లెనిన్‌ విజయసాధించినట్లు ప్రకటించారు. తాను విజయం సాధించనున్నట్లు మూడు ఎగ్జిట్స్‌ పోల్స్‌లో ప్రకటించారని, తీరా అందుకు భిన్నంగా ఫలితాలు వుండటం అంటే ఎన్నికలలో అక్రమాలు జరగటమే అంటూ తానే అసలైన విజేతనని లాసో ప్రకటించుకోవటమే గాక ఎన్నికల అక్రమాలకు నిరసన తెలపాలని మద్దతుదార్లకు పిలుపు ఇచ్చాడు. న్యాయమూర్తులు కూడా అక్రమాలలో భాగస్వాములయ్యారని ఆరోపిస్తూ తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికలను పర్యవేక్షించిన అమెరికా రాజ్యాల సంస్ధ ప్రతినిధులు తాము తనిఖీ చేసిన 480చోట్ల పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా తేడా బయటపడలేదని, అందువలన లాసో చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. లాసో మద్దతుదార్లు పలుచోట్ల ప్రదర్శనలకు దిగి హింసాకాండకు పాల్పడ్డారు.

Image result for lenín moreno victory marches

ప్రతిపక్ష అభ్యర్ధి చర్య జనాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చేసిన కుట్ర అని ప్రస్తుత అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా విమర్శించారు. బ్యాలట్‌ ద్వారా సాధించలేని దానిని హింసాకాండద్వారా పొందాలని చూస్తున్నారని దేశ ప్రజలను హెచ్చరించారు. ఫిబ్రవరి19న జరిగిన ఎన్నికల ఫలితాలపై సెడాటోస్‌ అనే ఎన్నికల జోశ్యుడు చెప్పిన అంశాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. విజయం సాధించేందుకు ఎవరికీ అవసరమైన మెజారిటీ రాకపోవటంతో తొలి రెండు స్ధానాలలో వచ్చిన వారు తుది విడత పోటీ పడ్డారు. ఈ పోటీలో ప్రతిపక్ష లాసో ఆరుశాతం మెజారిటీతో విజయం సాధిస్తారని అదే జోశ్యుడు చెప్పాడు. అయితే అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది. ప్రతిపక్ష అభ్యర్ధి ఓటమిని అంగీకరించకుండా, అక్రమాలు జరిగాయని, తానే విజయం సాధించానని ప్రకటించి ఆందోళనకు రెచ్చగొట్టిన నేపధ్యంలో ఏర్పడిన గందరగోళానికి మంగళవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెరదించింది. కమిషన్‌ అధ్యక్షుడు జువాన్‌ పాబ్లో పోజో అధికారికంగా టీవీలో ఒక ప్రకటన చేస్తూ ‘ఫలితాలకు తిరుగులేదు, అక్రమాల ఆనవాళ్లు లేవు, దేశం తమ అధ్యక్షుడిని స్వేచ్చగా ఎంపిక చేసుకుంది’ అని ప్రకటించారు.

Image result for lenín moreno victory marches

 

రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని వామపక్ష అలయన్స్‌ పాయిస్‌ పార్టీ రాజకీయ వారసుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో మేనెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓట్ల లెక్కింపులో విజయం ఖరారు అయిన వెంటనే పాలకపార్టీ నేతలందరూ అధ్యక్ష భవనం నుంచి జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా లెనిన్‌ హాపీ బర్తడే అంటూ శుభాకాంక్షలు తెలుపగా పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు కొరెయా ఈనెల ఆరున జరుపుకోవాల్సిన తన 54వ పుట్టిన రోజును ముందే జరుపుకుంటూ మూడవ తేదీనే కేక్‌ కట్‌ చేశారు. పది సంవత్సరాల కొరెయా పాలన తరువాత మూడవ సారి కూడా వామపక్షం విజయం సాధించటానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలను ఆసరా చేసుకొని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, లాటిన్‌ అమెరికా పెట్టుబడిదారులు, మితవాద, క్రైస్తవ మతవాద శక్తులు, అగ్రశ్రేణి మీడియా కుమ్మక్కుతో వామపక్ష శక్తులు అధికారానికి దూరమయ్యాయి.ఈ నేపథ్యంలో తదుపరి వంతు ఈక్వెడోర్‌ అని వామపక్ష వ్యతిరేక శక్తులు సంబరపడ్డాయి. తొలి విడత ఓటింగ్‌లో కూడా అదే ధోరణి వ్యక్తమైంది.ఫిబ్రవరి 19న అధ్యక్ష ఎన్నికతో పాటు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 137 స్థానాలకు గాను వామపక్ష పార్టీ 74 సంపాదించి మెజారిటీ తెచ్చుకుంది. గతం కంటే 26 స్ధానాలు తగ్గాయి. ప్రతిపక్షంలోని ఏడు పార్టీలకు కలిపి 60, స్వతంత్రులకు మూడు స్ధానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలట్‌ పత్రాలను వేసిన వారు 22.1శాతం మంది వున్నారు.

లాటిన్‌ అమెరికాను తమ నయా వుదారవాద విధానాల ప్రయోగశాలగా చేసుకున్న పెట్టుబడిదారీ వర్గం ఆఖండంలోని దేశాల ఆర్ధిక వ్యవస్ధలను వస్తు ఎగుమతి ఆధారితంగా మార్చివేశాయి. కార్మికవర్గ సంక్షేమ చర్యలకు మంగళం పాడటంతో పాటు, రుణవూబిలో ముంచివేశాయి. జనం నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి సైనిక నియంతలను లేదా వారితో కుమ్మక్కైన మితవాద శక్తులను గద్దెలపై ప్రతిష్ఠించాయి. వారిని భరించలేక జనంలో తిరుగుబాట్లు తలెత్తటంతో వారిని పక్కన పెట్టి తమ అడుగుజాడల్లో నడిచే శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఎన్నికలకు కాస్త వెసులుబాటు కల్పించిన పూర్వరంగంలో నయావుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు, వామపక్షాలు అనేక చోట్ల అధికారానికి వచ్చి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. జనానికి తక్షణం వుపశమనం కలిగించే చర్యలు చేపట్టటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అందుకే జనం గత పదిహేను సంవత్సరాలలో వరుసగా అనేక చోట్ల ఆశక్తులకు పట్టం గట్టారు. తమకు రాగల ముప్పును పసిగట్టిన సామ్రాజ్యవాదులు, బహుళజాతి గుత్త సంస్ధలు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయి. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో 2008 నుంచి కొనసాగుతున్న తీవ్ర ఆర్ధిక మాంద్యం, సంక్షోభాల ప్రభావం వామపక్షాలు అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా దేశాలపై కూడా పడటంతో ఆ ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతులలో వాటిపై అసంతృప్తి మొదలైంది. ఈ తరుణంలో మీడియా ప్రచార ఆయుధాలతో మితవాద శక్తులు విజృంభించి జనంలో అయోమయం, వామపక్ష వ్యతిరేకతను రెచ్చగొట్టటం, అప్పటికే వున్న మితవాద శక్తులను మరింత సంఘటిత పరచటం వంటి చర్యలకు పూనుకున్నాయి. మరోవైపు ఆర్ధిక రంగంలో ప్రపంచ మార్కెట్లో పెట్రోలియంతో సహా వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతి ఆధారిత వ్యవస్ధలుగా వున్న దేశాలలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వీటికి ఇతర కారణాలు కూడా తోడు కావటంతో సామ్రాజ్యవాద, మితవాద శక్తుల కుట్రలు ఫలించి అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల వామపక్ష శక్తులకు ఎదురుదెబ్బలు తగిలాయి. దానికి భిన్నంగా ఫలితం రావటమే ఈక్వెడోర్‌ ఎన్నికల ప్రత్యేకత.

Photo by: Reuters

2007లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులను తాము తీర్చాల్సిన అవసరం లేదంటూ మూడువందల కోట్ల డాలర్లను చెల్లించేది లేదని ప్రకటించారు. అయితే అప్పులిచ్చిన వారు అంతర్జాతీయ కోర్టులకు ఎక్కారు. అప్పులలో 60శాతం మేరకు రద్దు కావటంలో కొరెయా ప్రభుత్వం విజయం సాధించింది.దాంతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలు కలిగింది. 2006-16 మధ్య కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య తగ్గింపు చర్యల కారణంగా 36.7 నుంచి 22.5శాతానికి తగ్గిపోయింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు రెండదశాబ్దాల కాలంలో తలసరి జిడిపి పెరుగుదల రేటు 0.6శాతం కాగా కొరెయా పదేళ్ల కాలంలో అది 1.5శాతానికి పెరిగింది. అసమానతలను సూచించే జినీ సూచిక 0.55 నుంచి 0.47కు తగ్గింది. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం ప్రకారం అవినీతి కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు, వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతుల ఆదాయం తగ్గిపోయింది. భూకంప బాధితులను ఆదుకొనేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావటం వంటి కారణాలతో 2014 నుంచి ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులకు లోనైంది.వృద్ధి రేటు పడిపోయింది. మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గిపోయింది. అనేక పరిశ్రమలు, వ్యాపారాలలో కార్మికులు వుద్వాసనకు గురయ్యారు. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతుల్లో అసంతృప్తి మొదలైంది. దీనిని గోరంతను కొండంతగా చిత్రించటంలో మీడియా ప్రారంభం నుంచి ప్రచారదాడి జరిపింది.

ఈ పూర్వరంగంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అధికార వామపక్ష నేత లెనిన్‌ మొరేనోకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన 40కిగాను 39శాతమే వచ్చాయి. మిగతా వారికి 28,16 చొప్పున వచ్చాయి. దాంతో తొలి ఇద్దరి మధ్య ఎన్నిక ఈనెల రెండున జరిగింది. పదహారుశాతం వచ్చిన మితవాద క్రైస్తవ పార్టీతో సహా వామపక్ష వ్యతిరేకులందరూ పాలకపార్టీకి వ్యతిరేకంగా నిలిచిన మితవాది లాసోకు మద్దతు ప్రకటించారు. అరవై ఒక్కశాతం ఓట్లు అధికారపక్షానికి వ్యతిరేకంగా పడటంతో ప్రతిపక్ష నేత లాసో గెలుపు తధ్యమని ఎన్నికల పండితులు జోశ్యాలు చెప్పారు. అంతిమ ఎన్నికలలో అందుకు విరుద్దంగా పదకొండుశాతానికి పైగా ఓటర్లు వామపక్షం వైపు మొగ్గటం మితవాద శక్తులను కంగు తినిపించింది.

Image result for lenín moreno victory marches

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో ఎలాంటి మచ్చలు లేని స్వచ్చమైన వామపక్ష కార్యకర్త, సార్ధక నామధేయుడిగా మారారు. ఈక్వెడోర్‌ అమెజాన్‌ ప్రాంతంలో మధ్యతరగతికి చెందిన సెర్వియో తులియో మొరేనో లెనిన్‌ రచనలతో ఎంతో ప్రేరణ పొందాడు. ఆ కారణంగానే 1953 మార్చి 19న జన్మించిన తన కుమారుడు బోల్టెయిర్‌ మొరేనో గ్రేసెస్‌కు ముందు లెనిన్‌ అని చేర్చాడు. తండ్రి ఆకాంక్షకు అనుగుణ్యంగానే లెనిన్‌ మొరేనో వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా జీవించి ఇపుడు దేశాధ్యక్షుడయ్యాడు. ఇంతకు ముందు 2007-13 సంవత్సరాల మధ్య దేశ వుపాధ్యక్షుడిగా పని చేశారు. వికలాంగుల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గాను ఎన్నో ప్రశంసలు పొందారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొంది వుత్తమ గ్రాడ్యుయేట్‌గా గౌరవం పొందిన లెనిన్‌ 1976లో ఒక శిక్షణా కేంద్ర డైరెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.1998 మార్చి మూడవ తేదీన ఒక దుకాణ పార్కింగ్‌లో వున్న సమయంలో వచ్చిన ఇద్దరు యువకులు ఆయనకు తుపాకి చూపి కారు, పర్సు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆయన కారు తాళం చెవి, పర్సు వారికి ఇచ్చారు. వాటిని తీసుకొని వెళ్లిపోతూ వారిలో ఒకడు లెనిన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యాడు. దాని నుంచి కోలుకోవటం కష్టమని వైద్యులు నిర్ధారించారు. అయితే ధైర్యం కోల్పోకుండా చదివి నవ్వుల చికిత్స ద్వారా స్వస్ధత పొందవచ్చని తాను గతంలో చదివిన దానిని ఆచరణలో పెట్టి నాలుగు సంవత్సరాల తరువాత చక్రాల కుర్చీలో కూర్చొని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే స్ధితికి చేరారు. అదే స్ధితిలో వుపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడై ఒక చరిత్రను సృష్టించారు. నడవలేని వ్యక్తి ఒక దేశాధ్యక్షుడు కావటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు.

ప్రత్యర్ధి లాసో దేశం 1999లో ఎదుర్కొన్న బ్యాంకింగ్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొన్న ఒక బ్యాంకరు. రాజకీయాలకు దూరంగా వున్న ఆయనను మితవాదులు ఎన్నికలపుడు మాత్రమే రంగంలోకి తెచ్చారు. ఆ పెద్దమనిషి ఎన్నికైతే ఇప్పటి వరకు తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల హక్కులకు పూర్తి భంగం కలుగుతుందని, కార్మికవర్గం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అధ్యక్షుడు కొరెయా పెద్ద ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనాన్ని కోరారు. దీనికి తోడు గత రెండు నెలల కాలంలో మితవాదుల ఆధ్వర్యాన వున్న అర్జెంటీనా, బ్రెజిల్‌ పాలకుల చర్యలకు నిరసనగా అంతకు ముందు వారికి మద్దతు ఇచ్చిన వారితో సహా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంది. రెండోవైపు మితవాదులు అధికారంలో వున్న దేశాలన్నింటా ఇదే పరిస్థితి పునరావృతం కావటం తదితర కారణాలతో ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది. అంతకు ముందు వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేసిన వారిలో పదకొండుశాతం మంది మనసు మార్చుకొని లెనిన్‌కు ఓటు వేయటంతో మితవాదుల యాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

అమెరికా ప్రభుత్వ, సిఐఏ ఇతర సంస్ధల కుట్రలు, కూహకాలు, బండారాలను బయటపెడుతూ ఇప్పటికీ మిలియన్ల కొలది పత్రాలను బయట పెడుతున్న వికీలీక్స్‌ స్ధాపకుడు, ఆస్ట్రేలియన్‌ అయిన జులియన్‌ అసాంజేను ఎదో ఒక పేరుతో శిక్షించాలని, అంతం చేయాలని చూస్తున్న అమెరికా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో 2012 నుంచి ఈక్వెడోర్‌ వామపక్ష ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షిస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే నెల రోజుల్లో అసాంజేను బయటికి పంపిస్తానని మితవాద అభ్యర్ధి లాసో ప్రకటించగా ఆశ్రయం కొనసాగిస్తానని లెనిన్‌ వాగ్దానం చేశారు. ఇప్పుడు లెనిన్‌ విజయంతో అసాంజేకు ముప్పు తప్పింది. ఫలితాలు స్పష్టమైన తరువాత అసాంజే ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘ పన్నుల స్వర్గాల(అక్రమంగా సంపదలు దాచుకొనే ప్రాంతాలు) లోని మిలియన్ల కొద్దీ దాచుకున్న సంపదలతో గానీ లేకుండా గానీ నెల రోజుల్లో లోపల ఈక్వెడోర్‌ వదలి వెళ్లాలని లాసోకు సవినయంగా మనవి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అయితే ఈ విజయంతో ఈక్వెడోర్‌ వామపక్షం సంతృప్తి చెందితే అది ఎంతో కాలం నిలవదు.అధికారంలో వున్న లేదా తిరిగి అధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులందరి ముందు పెద్ద సవాలు వుంది. నయా వుదారవాద పునాదులను అలాగే వుంచి సంక్షేమ చర్యలు చేపట్టటం ఎల్లకాలం సాధ్యం కాదని అన్ని దేశాల అనుభవాలూ నిరూపించాయి. తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొనేందుకు లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు సంఘటితం కావటానికి అధికారికంగా చేసిన కొన్ని ప్రయత్నాలు రాజకీయంగా చైతన్యవంతులైన జనాన్ని వుత్తేజితం చేస్తాయి తప్ప ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారిని సంతృప్తి పరచజాలవు. నయా వుదారవాద విధానాల నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాహిత వైపు అడుగులు వేస్తూ అందుకు ఆటంకంగా వుంటూ ఆర్ధిక వ్యవస్ధను అదుపులో వుంచుకున్న శక్తులను, వారికి మద్దతుగా ప్రచారదాడి చేస్తున్న స్వప్రయోజన మీడియాను అదుపు చేయకుండా లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు ముందుకు పోజాలవని గత పదిహేను సంవత్సరాల అనుభవాలు విదితం చేస్తున్నాయి. బొలివర్‌ సోషలిజం, 21వ శతాబ్దపు సోషలిజం, ప్రజాస్వామిక సోషలిజం ఇలా ఏ పేరు పెట్టుకున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గ ఆర్ధిక పునాదులను కదిలించకుండా మరొక అడుగు ముందుకు వేయలేము అనే అంశాన్ని అవి గుర్తించకతప్పదు. ప్రపంచీకరణ పేరుతో సకల దేశాలను ఆక్రమించాలని చూసిన అగ్రగామి పెట్టుబడిదారీ వ్యవస్ధలన్నీ మరొక మారు స్వరక్షణ చర్యలకు పూనుకుంటున్న సమయమిది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధలోని బలహీనతకు చిహ్నం. ఇలాంటి రక్షణ చర్యలు, మార్కెట్ల ఆక్రమణ క్రమంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. అందువలన వర్తమాన పరిస్ధితులలో మార్క్సిజం-లెనినిజాలను ఏ దేశానికి ఆదేశం తమ పరిస్థితులకు సక్రమంగా అన్వయించుకొని తదుపరి పోరాట మార్గం, రూపాలు,ఎత్తుగడలను నిర్ణయించుకోవాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుపి ముఖ్య మంత్రిగా ‘చెడ్డ పిల్లాడు’ ఆదిత్యనాథ్‌ !

22 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Hinduthwa, naughty boy, UP CM, YogiAdityanath

Image result for yogi adityanath

ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. వుద్రేకాలు, వుద్వేగాలు, అధికార రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయటంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ వెనుకపడలేదని, తమకూ ఆ సత్తా వుందని బాల్యంలోనే బిజెపి నిరూపించుకుంది. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ క్రీడలో మాకు మేమే సాటి, బస్తీమే సవాల్‌ అంటూ తొడగొడుతున్న బిజెపిని ప్రస్తుతానికి ఎవరేమీ చేయలేరనే వాతావరణం అంతటా ఆవరించి వుంది. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ రూపం బయట పడటానికి దేశానికి 28 సంవత్సరాలు పట్టింది.(1975 అత్యవసర పరిస్ధితి) మీడియా ఎంతగా మూసిపెట్టాలని చూసినా బిజెపి గురించి తెలుసుకోవటానికి అంత వ్యవధి అవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమం అనే ఒక ప్రజాతంత్ర ప్రవాహం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అందుకు విరుద్దమైన మారుమనసు పుచ్చుకోవటానికి మూడు దశాబ్దాలు పట్టింది. బిజెపి పూర్తిగా తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారానికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా పూర్తిగాక ముందే తానేమిటో బహిర్గతం చేయటం ప్రారంభించింది. పురాణాల ప్రకారం నరకుడనే రాక్షసుడు విష్ణుమూర్తి-భూదేవికి పుట్టినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమే వివాదాస్పదం, భయానికి నాంది పలికింది. అందువలన ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్నవారందరూ దాని గతాన్ని అంగీకరించి ఆ పని చేస్తున్నారని అనుకోలేము.నరకుడిని భరించలేని స్ధితిలో విష్ణువు మరో రూపంలో తల్లిచేతనే సంహరింపచేసిన దీపావళి కథ తెలిసిందే. చరిత్రలో ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు, శక్తులు చివరికి ఏమయ్యాయో కూడా చూస్తూనే వున్నాం.

మన గొప్పతనం గురించి మాత్రమే కాదు, మన బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించే స్వేచ్చ మనకు వుండాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. రెండు చోట్ల గెలిచింది. నాలుగు చోట్ల మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. ఇదెలా సాధ్యమైంది అని ప్రశ్నించేవారు లోకం పోకడ పట్టించుకోని, ఈ కాలానికి తగని వారు అనుకోవటం తప్ప మరొక విధంగా చెప్పలేం. అన్నయ్యా వాలిని, రావణుడిని రాముడు చంపా డాలేదా అని తప్ప ఎలా అన్నది ముఖ్యం కాదు అన్నట్లు, ప్రస్తుత పరిస్ధితుల్లో మనం ఆవు అంటే వీపులు పగులగొట్టే వారు సిద్ధంగా వున్నారు కనుక మరో విధంగా చెప్పుకుందాం. మన గేదె లేక బర్రె ఏ దొడ్లో కట్టింది అని కాదు మన దొడ్లో ఈనిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు అనుకున్న విజయం సాధించారా లేదా ఎలా అన్నది ముఖ్యం కాదంటూ దానిని కీర్తించేవారే ఎక్కువగా వున్నారు. మన సమాజ బలహీనత ఇది.

2014లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం యూపీలో 42.3 నుంచి 39.7కు, వుత్తరాఖండ్‌లో 55.3 నుంచి 46.5కు పడిపోయింది. వీటికోసం నానా గడ్డీ కరిచిన తరువాత వచ్చిన ఫలితమిది. దీన్ని మద్దతు పెరగటంగా చెప్పటమంటే జనాన్ని చెవిలో పూలు పెట్టుకున్నవారిగా జమకట్టటమే. ఈ రీతిలో పెరుగుతున్న ‘మద్దతుతో ‘ రెండు సంవత్సరాల తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి మోడీ విజయం సాధించబోతున్నారనే ‘ప్రచారదాడికి ‘ నాంది పలికారు. మీడియాను ఆక్రమించిన కార్పొరేట్లు తమ లాభాలకు ఎవరు తోడ్పడతారో వారి ప్రచార కార్యకర్తలుగా మారటాన్ని చూశాము. అందువలన విజయగానాలకు కొదవేముంటుంది. ప్రతిపక్షం చీలికలు పేలికలు, జనం కులాలు, మతాలు, ప్రజావ్యతిరేకుల పట్ల వుపేక్ష వహిస్తే 2014 పునరావృతం కూడా కావచ్చేమో !

హిట్లర్‌ హయాంలో జన మెదళ్లను గందరగోళ పరచే ప్రచారదాడికి రూపకల్పన చేసిన గోబెల్స్‌ కనుక స్వర్గం లేదా నరకం నుంచో మన వేద లేద పురాణ కాల పుష్పక విమానమెక్కి మన దేశంలో దిగి చూస్తే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవారిగా కనిపించే మీడియా గోబెల్స్‌ను చూసి ఇంత విపరీతమా అని సిగ్గుపడిపోతాడు. పెద్ద నోట్ల రద్దును జనం సమర్ధించారని చెప్పుకొనేందుకు రెండు రాష్ట్రాల ఫలితాను చూపుతున్నారు. గెలిచిన యూపిలో 60శాతం వ్యతిరేకంగా జనం ఓటు చేయటం సమర్ధించటమా? ఓడిపోయిన మూడు రాష్ట్రాల సంగతేమిటి? పోనీ గెలిచిన చోటయినా గతం కంటే ఓట్లెందుకు తగ్గాయి ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించిందేమిటి ? అసలు ఎన్ని నోట్లు రిజర్వుబ్యాంకుకు తిరిగి వచ్చాయి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాని గురించి చెప్పరెందుకని, చన్నయ్‌ శేఖర రెడ్డి వంటి వారికి కొత్త రెండువేల నోట్ల రూపాయలకట్టలను నేరుగా అందించిన వున్నతాధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? ఇలాంటి ప్రశ్నలన్నీ విజయగానాల ముందు వినిపించవు, మీడియాలో కనిపించవు.

నిప్పు, పట్టుకోవద్దు, కాలుతుంది అని చెబుతాం. ప్రశ్నించటం పిల్లల లక్షణం కనుక నీకెలా తెలుసు అని ఠకీమని అడగటం సహజం. వారితో పాటు వున్న వారు లేదు మీకు నిప్పంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు, అందుకే అలా చెబుతున్నారు అన్నారనుకోండి కాలేది పిల్లలకే, వారికి కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వస్తే అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం తలెత్తుతుంది అని అతగాడి గురించి తెలిసిన వారు చెప్పారు. అయినా సరే అమెరికా సామాన్యుల కంటే ఆంగ్లం బాగా చదివి, రాయగలిగిన అక్షరాస్యులైన ప్రవాస భారతీయులతో సహా అనేక మంది తన్మయత్వంతో ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాము. అక్కడి జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాల హోరులో వేదమంత్రాలు వినిపించలేదన్న వార్తలు చదువుకున్నాం. అందువలన జనం ఎల్లకాలం ఒకేలా వుంటారని అనుకోనవసరం లేదు. ఏ కమ్యూనిస్టులు ప్రేరేపిస్తే అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ? ఎవరి కాళ్ల కిందకు నీరు వస్తే గాని వారికి తెలియదు.

కనుక కేంద్రంలోని బిజెపి తన అధికారాన్ని మరింతగా విస్తరించుకోవటానికి గోవా, మణిపూర్‌ వంటి చోట్ల అప్రజాస్వామిక పద్దతులకు పాల్పడి ప్రజాతీర్పును వమ్ము చేసినా, గతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తమ విధానాలకు మద్దతు పెరిగిందని పెద్ద నోళ్లు వేసుకొని అరిచినా, నోరు తెరిస్తే మతోన్మాదం, పరమత విద్వేషం, హంతక భాష తప్ప మరొకటి పలకటం రాని ‘యోగి ‘ ఆదిత్యనాథ్‌ను వుత్తర ప్రదేశ్‌ పీఠంపై కూర్చో బెట్టినా ముందే చెప్పినట్లు చరిత్ర తనపని తాను చేస్తుంది. విదేశీ దండయాత్రలను, ఆక్రమణను సమైక్యంగా అడ్డుకోలేకపోయిన కారణంగా మన దేశం అనుభవిస్తున్న పర్యవసానాలను చూస్తున్నాము. విదేశీయులు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టి దానిని నాశనం చేయటం తప్పని చెబుతున్న స్వదేశీయులు ఆయోధ్యలో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఏమనాలి? చరిత్రనుంచి మనం ఏ పాఠాలు నేర్చుకున్నట్లు ?

మనం చరిత్రలో, పురాణాలు, ఇతిహాసాలలో అనేక మంది యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినుల గురించి చదివాం. కొంత మంది దృష్టిలో హిందూత్వను పునరుద్దరించే కారణ జన్ములుగా స్ధానం వున్న ఇలాంటి యోగులు ఎవరి వారసులో, ఎలా పుట్టుకు వచ్చారో, వారిని సమర్ధించేవారు అడ్డగోలుగా కాకుండా ఆధారాలతో చెప్పాలి. కులాల పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన తరగతుల మంత్రం జపించే బిజెపి ఒక వేళ ఒక యోగినే ఎంచుకోదలచుకుంటే క్షత్రియడు తప్ప వివాదాస్పదం కాని వెనుకబడిన తరగతుల యోగి దొరకలేదా ?

యోగి ఆదిత్యనాధ్‌ గురించి లోకానికి తెలిసిందానితో పాటు తానేమిటో తనపై వున్న నేరపూర్తి కేసులేమిటో పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలలోనే స్వయంగా రాసుకున్నారు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌ వంటి దేశాల గురించి విమర్శలు తెలిసిందే. మరి వుత్తర ప్రదేశ్‌ సంగతేమిటి ? హిందూ మతానికి చెందిన గోరఖనాధ్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాధ్‌ దాన్ని వదులుకోకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీన్నేమనాలి ? మత రాజ్యం గాక పోతే మత రాష్ట్రం. ఒక చోట అధికారికంగా మతాన్ని రుద్దుతారు మరోచోట అనధికారికంగా అదే పని చేస్తారు. ఇలాంటి విపరీత పరిస్ధితిని మన లౌకిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వూహించి వుండరు.

యుపి ముఖ్యమంత్రిగా వివాదాస్పద యోగిని ఎంపిక చేయటాన్ని సమర్ధించుకోవటానికి బిజెపికి అడ్డగోలు వాదనలు తప్ప తర్కానికి నిలిచే మాటలు చెప్పటం లేదు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ వచ్చిన పార్టీ తమ నేతగా ఎవరిని నియమించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్టం, ఒక ఎత్తుగడగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు ఇలాంటి సారం లేని వాదనలు తప్ప తమ యోగికి వున్న అర్హతల సమర్ధించుకొంటూ మాట్లాడకపోవటం దాని బలహీనతను సూచిస్తోంది. ఎవరిని ఎంచుకోవాలన్నది మీ ఇష్టమైతే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు కనుక ఆ ఎంపికపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు, ప్రజలందరికీ వుంటుంది. చెప్పుకొనేందుకేమీ లేకపోగా వివాదాస్పద నేపధ్యం వున్న కారణంగానే యోగికి ఒక అవకాశమిస్తే తప్పేమిటి, ఇటీవలి ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు కదా, ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వుంటారో చూడకుండానే విమర్శలా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్రమోడీ తన మంత్ర దండంతో ఇలాంటి వారందరినీ అదుపులో వుంచుతాడు అంటూ భరోసా ఇస్తున్నారు. రంజాన్‌ సమయంలో పూర్తి విద్యుత్‌ ఇచ్చారు, దీపావళికి కోతలు విధించారంటూ స్వయంగా సదరు మోడీయే యుపీ గల్లీలలో రెచ్చగొట్టే ప్రచారం చేసి ఓట్లడుక్కున్న దిగజారుడు తనం దాస్తే దాగుతుందా ? తానే మత భావనలను రెచ్చగొట్టే భాష మాట్లాడకుండా తమాయించుకోలేని వ్యక్తి ఆదిత్యనాధ్‌ వంటి యోగులను నియంత్రిస్తారంటే నమ్మటం ఎలా ? సదరు పెద్దమనిషి గత చరిత్ర చూస్తే బిజెపియే తన బాటలో నడవాలి తప్ప తాను నడవాల్సిన అవసరం లేదని చెప్పటమే కాదు, తన మత అజెండాను అమలు జరిపేందుకు ఒక సంస్ధనే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ తేడా ఏమంటే మాంసం తినండి గానీ ఎముకలు మెడలో వేసుకొని తిరగవద్దని బిజెపి చెబితే మాంసమంటూ తింటున్న తరువాత ఎముకలు వేసుకు తిరిగితేనే కదా జనానికి మనమీద నమ్మకం కలిగేదన్నది యోగి తీరు.

ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తనపై వున్న హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపులు, కొట్లాటలు, భిన్నమతాల జనం మధ్య శతృత్వాన్ని పెంచే నేరాలకు సంబంధించిన కేసులను ఎలా ఎత్తివేయించుకుంటారన్నది ఆసక్తికరం. ఎన్నికల సభలలో నోరు పారవేసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయన్ను మందలించింది. ప్రధాని నరేంద్రమోడీ అపరభక్తురాలైన జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ‘బూతులు, దుర్భాషలు మాట్లాడే వున్మత్తుడని’ ఒక సందర్భంలో వర్ణించారు. రెండు సంవత్సరాల క్రితం లష్కరే తాయెబా స్ధాపకుడు హఫీస్‌ సయిద్‌కు సినీనటుడు షారూఖ్‌ ఖాన్‌కు తేడాలేదని యోగి సెలవిచ్చారు. ఆ మాటలు సరికాదని, తమ పార్టీ లేదా ప్రధాని నరేంద్రమోడీ మూల విశ్వాసాలకు అవి ప్రతిబింబాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేశారు. ఒక యోగిగా ఏం చేశాడన్నది పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూసేందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ వంది మాగధులచేత మాట్లాడిస్తున్నారు. అదే సరైన ప్రాతిపదిక అయితే మాకూ ఒక అవకాశమిచ్చి చూడండి అని అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ మజ్లిస్‌ కూడా ఓటర్లను అడుగుతోంది. ఒకరు గాడ్సే భావజాలానికి, కార్యాచరణకు, మరొకరు రజాకార్ల భావజాలం, కార్యాచరణకు వారసులన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందువలన అవకాశమివ్వాల్సిన ‘అర్హతల’లో ఎవరు ఎవరికీ తీసిపోరు ! అవకాశం ఇచ్చి చూడాలనటం గురించి ఒక విశ్లేషకుడు పాఠకులకు ఒక ప్రశ్న వేశారు. పోటీగా వున్న ఒక స్కూలును తగులబెట్టి రమ్మని మీ పిల్లలు చదివే స్కూలు హెడ్మాస్టర్‌ ఒక పని అప్పగించారనుకోండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక అవకాశం ఇచ్చి, వారి పనితీరు ఎలా వుంటుందో చూద్దామని అనుకుంటారా లేక ఆందోళన వ్యక్తం చేస్తారా ? అన్నదే ఆప్రశ్న.

ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు, మీకు ఇష్టం లేకపోతే ఆరునెలల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి గనుక అప్పుడు ఓడించండి అంటూ ఒక వుచిత సలహా. ఆ మాత్రం తెలియని అమాయకత్వంతో యోగిని విమర్శించే వారు వున్నారనుకుంటున్నారా ?

రాహుల్‌ గాంధీ కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పార్టీ నడిపే అర్హత లేదని బిజెపి విమర్శిస్తుంది. ఎన్నిక కావటమే అర్హత అయితే వుత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాధ్‌ కంటే పేరు మోసినవారు ఎందరో వున్నారు, వారికి ముందు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నికైన ప్రతి నాలుగో ఎంఎల్‌ఏ మీద అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల కేసులు వున్నాయి. కొత్త అసెంబ్లీకి నూట మూడు మంది ఎన్నికైనందున రొటేషన్‌ పద్దతులలో వారందరికీ ఒక్కో ఏడాది పాటు మంత్రి పదవుల అవకాశాలు ఇచ్చి కొత్త పాత్రను వారెలా పోషిస్తారో చూడాలి. బిజెపికి మాత్రమే అలాంటి అవకాశం అంటే ఆపార్టీలో వున్న 82 మందికి రెండున్నర సంవత్సరాల చొప్పున అవకాశం ఇవ్వాలి మరి. ముక్తార్‌ అన్సారీ అనే పేరుమోసిన కేసులున్న పెద్దమనిషి అదే యూపీలో తాజా ఎన్నికలతో సహా 1996 నుంచి ఆదిత్యనాధ్‌తో పాటు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికౌతూనే వున్నాడు.అదీ నాలుగుసార్లు జైల్లో వుండే గెలిచాడు. మరో పెద్ద మనిషి వున్నాడు రాజా భయ్యాగా పేరుమోసిన రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌. మాజీ రాజకుటుంబానికి చెందిన ఆ పెద్దమనిషిపై కేసులు తక్కువేమీ లేవు.ఆదిత్యనాధ్‌ కంటే ముందునుంచి అంటే 1993 నుంచి వరుసగా ఎన్నికవుతూనే వున్నాడు.కేరళలో కెఎం మణి ఏకంగా 13 సార్లు వరుసగా ఎన్నికయ్యాడు. అందువలన ఈ రోజుల్లో ఐదుసార్లు ఎన్నికయ్యాడు కనుక సచ్చీలుడు అంటే కుదరదు. బిజెపి తరఫున తాజాగా ఎన్నికైన వారిలో నేరస్ధ నేపధ్యం వున్న ఇద్దరు మహిళలు కూడా ఎన్నికైన ఘనత ఆపార్టీ ఖాతాలో వుంది. అందులో ఒకరు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి గెలిచిన ఒక డాక్టర్‌ కూడా వున్నారు.

మా యోగి రాహుల్‌ గాంధీ మాదిరి కుటుంబ నేపధ్యం నుంచి రాలేదు అన్నది మరొక ముక్తాయింపు. నిజమే గోరఖ్‌ పూర్‌ మఠం ఒక మతానికి చెందినది. దాని అధిపతిగా వున్న మహంత్‌ అవైద్యనాధ్‌ మతాధికారిగా వుంటూనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన స్ధానంలో మతబాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్‌ అదే మత పూర్వరంగంలో ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఒకరికి కుటుంబం, మరొకరికి మత వారసత్వం ! తేడా ఏముంది? వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నలుపు మాత్రం బిజెపికి కనపడదు. నరేంద్రమోడీ ఒక ఎత్తుగడగా తన మత అజెండాను పక్కన పెట్టి గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించారు. కానీ ఆదిత్యనాధ్‌ రికార్డులో నేరపూరిత, మతోన్మాదం తప్ప అభివృద్ధి జాడలు లేవు. తాజా ఎన్నికలలో అలాంటి ప్రసంగాలు, ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయనొక ప్రధాన ప్రచారకుడిగా కూడా లేరు. గతంలో ఆయన ప్రసంగాలన్నీ ముస్లింల చుట్టూ తిరిగాయి తప్ప అభివృద్ధి కాదు. చివరిగా ఒక ముక్క చెప్పాలి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తనదైన శైలిలో ఆదిత్యనాధ్‌ను సమర్ధించారు. దొంగకు తాళాలిస్తే సొత్తుకు హామీ వుంటుందన్నట్లుగా ఒక తరగతిలో చెడు ప్రవర్తన కలిగిన పిల్లవాడిని తరగతి పర్యవేక్షకుడిగా చేస్తే మంచిగా ప్రవర్తించే మాదిరి యుపి ముఖ్య మంత్రిగా ఆదిత్యనాధ్‌ వ్యవహరిస్తారు అని కితాబునిస్తూ భగత్‌ ట్వీట్‌ చేశాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మరించజాలని కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిస్టు పార్టీల ప్రాధాన్యత

09 Thursday Mar 2017

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ 1 Comment

Tags

China, china communist party, communist manifesto, Engels, Marx, Marx and Engels, Narendra Modi, Xi Jinping

Image result for one cannot deny the importance of the communist manifesto

ఎం కోటేశ్వరరావు

ఏ తర్కానికైనా దానికి ఒక న్యాయబద్దమైన ముగింపు వుంటుంది. తర్కంలో పాల్గొనేవారు తమకు అనుకూలమైనంత వరకే స్వీకరించి ఎదుటి వారికి సరైన సమాధానం చెప్పకపోతే చివరకు ఆ తర్కం అసంబద్దంగా ముగుస్తుంది. వుదాహరణకు కమ్యూనిజానికి కాలం చెల్లింది, అది పనికిరాదు అంటారు. అదే నిజమైతే ప్రపంచవ్యాపితంగా కమ్యూనిజం గురించి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఎందుకు చర్చ జరుగుతోంది?

కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగి ఫిబ్రవరి 21 నాటికి 170 సంవత్సరాలు పూర్తి అయింది.అమెరికాలో ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పుస్తక దుకాణాలలో ఆఫ్రో-అమెరికన్ల గురించి రాసిన న్యూ జిమ్‌ క్రో గ్రంధం తరువాత కమ్యూనిస్టు మానిఫెస్టో గురించి పాఠకులు అడుగుతున్నారని అమెరికాలోని సింపోజియం బుక్స్‌ యజమాని చెప్పారు. జనం కమ్యూనిస్టుమానిఫెస్టో గురించి ఎందుకు అడుగుతున్నట్లు ? అంటే కమ్యూనిస్టు సిద్దాంతం పనికిరాదని చెబుతున్నమాటలను జనం పూర్తిగా విశ్వసించటం లేదన్నమాట. 2008లో ధనిక దేశాలలో సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక మంది కమ్యూనిస్టు మానిఫెస్టో దుమ్ముదులుపుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ఒక సందర్భంలో ‘మనం మార్క్స్‌వైపు చూస్తున్నామంటే ఆయన సర్వజ్ఞుడని కాదు, ఎందుకంటే ఆయన్నుంచి మనం తప్పించుకోలేం’ అన్నారు. పాలకవర్గాలు తమ అస్ధిత్వానికి ముప్పు ఏర్పడినపుడు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ దాన్నుంచి తప్పించుకొనేందుకు ఒక మహా సంఘటనగా ఏర్పడతాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల కూల్చివేతకు ఐరోపా, అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు, పోప్‌ ఒక కూటమిగా ఏర్పడటం ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన ఘటన కాదా? అంటే ఈ రెండు ఖండాలలోని అధికార శక్తులు కమ్యూనిజం తమను సవాలు చేసే ఒక శక్తి అని గుర్తించినట్లే కదా ? చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జరిగిన కుట్రలో బౌద్ద దలైలామా ఒక పావుగా వుపయోగపడ్డారా లేదా ? అందుకే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలు ఇప్పటికీ కొత్త తరాలకు ఆసక్తి కలిగిస్తూనే వున్నాయి. ఇక్కడొక ప్రశ్న తలెత్త వచ్చు. తమకు ముప్పు తెచ్చే పుస్తకాలను అమెజాన్‌ వంటి బహుళజాతి కార్పొరేషన్లు ఎందుకు విక్రయిస్తున్నాయి, గూగుల్‌ వంటి కంపెనీలు ఆ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు అనుమతిస్తున్నాయని ఎవరైనా అడగవచ్చు. మార్క్సు రైనిష్‌ జీటుంగ్‌ పత్రికలో నాటి రష్యన్‌ జారు ఒకటవ నికోలస్‌ను విమర్శిస్తూ వ్యాసం రాయటంతో ఆ పత్రికపై నిషేధం విధించాలని ప్రష్యన్‌ ప్రభుత్వాన్ని కోరగా ఆ పని చేశారు. కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ తొలి ముద్రణలు పొందినపుడు వాటి వల్ల ముప్పు వస్తుందని నాటి పాలకవర్గాలు భావించలేదు కనుకనే ముద్రణ, విక్రయాలకు అనుమతిచ్చాయి, ఇప్పుడు ముప్పులేదని పైకి చెబుతున్న కారణంగా, దాని కంటే ఆ పుస్తకాలకు గిరాకీ వున్నందున వాటిపై కూడా లాభం సంపాదించేందుకు ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఎంతకాలం అనుమతిస్తారో చూడాల్సిందే.

Image result for marx engels

చైనా కంటే భారత్‌ ఎందుకు వెనుకబడింది అంటే అది నిరంకుశ దేశం, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని టక్కున సమాధానం చెబుతారు.అమెరికాతో పోలిస్తే 1917కు ముందు రష్యా కూడా నిరంకుశ జార్‌ పాలనలోనే మగ్గింది. మరి అదెందుకు వెనుకబడిపోయింది. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పినట్లు చెప్పుకొనే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగి వున్న బ్రిటన్‌ ఈ రోజు అమెరికా అనుచర దేశంగా ఎందుకు మారిపోయింది? నిరంకుశ దేశాలన్నీ చైనా మాదిరి అంతగాకపోయినా వాటి స్ధాయిలో అయినా ఎందుకు పురోగమించటం లేదు అంటే సరైన సమాధానం వుండదు. మన దేశం త్వరలో చైనాను అధిగమించనుంది అని చెబుతున్నారు. అంతకంటే కావాల్సిందేముంది? మన వారందరూ అమెరికా వెళ్లి ఆ దేశాన్ని ప్రధమ స్ధానంలో వుంచుతున్నారని మన చంద్రబాబు వంటి వారు చెబుతున్నారు. అందువలన అభివృద్దిలో చైనాతోయేం ఖర్మ అమెరికాతోనే పోటీ పడాలి. కానీ మనం ఎక్కడున్నాం, సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని కూడా తయారు చేసుకోలేక చైనాకు ఆర్డర్‌ ఇచ్చాము. అదే నోటితో మేకిన్‌ ఇండియా అని పిలుపులు ఇస్తాము. మన ముందు ఏం మాట్లాడినా మన వెనుక ప్రపంచం నవ్వదా ?

Image result for xi jinping

చైనా విజయానికి కమ్యూనిస్టు పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహించింది అనే పేరుతో అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అదేమీ మ్యూనిస్టు అనుకూల పత్రిక కాదు. సెబాస్టియన్‌ హెయిల్‌మాన్‌(51) అనే ఒక జర్మన్‌ బెర్లిన్‌లోని మెర్కాటర్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైనీస్‌ స్టడీస్‌ సంస్ధ స్ధాపక అధ్యక్షుడు. ట్రయర్‌ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ప్రొఫెసర్‌.ఆయనతో ఇంటర్వూ చేసి న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. హెయిల్‌ మన్‌ రాసిన చైనా రాజకీయ వ్యవస్ధ అనే అంగ్ల అనువాదాన్ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నవీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు చైనాలో జరుగుతున్న మార్పులను పాఠకులకు అందించేందుకు దానిని ఆన్‌లైన్‌లో పెట్టారు. చైనా పురోభివృద్ధిలో చైనా కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి ఆయనెంతో లోతుగా పరిశోధించారు. ఇది కమ్యూనిజం విజయం కాదా? మనమెంతో తెలివిగలవారమని, చైనీయులు నల్లమందు భాయీలని ఎద్దేవా చేసిన రోజులను మనం మరిచిపోయామా ? అలాంటి వారిని ఎంతో తెలివిగలవారిగా మార్చిందెవరు ? కమ్యూనిస్టులు కాదా ? ప్రజాస్వామ్య వ్యవస్ధ మనలను అలా ఎందుకు మార్చలేకపోయింది ?

     మన దేశంలో అధికారంలో ఏ పార్టీ వున్నా తన కాడర్‌పై ఆధారపడటం అన్నది ఆత్మవంచన చేసుకొనేవారు తప్ప మిగిలిన వారందరూ అంగీకరిస్తున్న సత్యం. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులను ఇచ్చి రాజకీయ నిరుద్యోగం పోగొట్టి వుపాధి కల్పించటం, ఆ పదవులను స్ధాయిని బట్టి పెద్ద ఎత్తున అక్రమంగా పోగేసుకోవటానికి వినియోగించటం తెలిసిందే. అది చైనాలో లేదా అంటే అక్కడా వుందని కమ్యూనిస్టుపార్టీయే స్వయంగా చెప్పి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నది. ఎన్నో వేల మందిపై వేటు వేశారు. మన దేశంలో ఏ పార్టీ అయినా అవినీతికి పాల్పడిన వారిని ఒక్కరినంటే ఒక్కరిని తొలగించి, శిక్షించిన వుదంతం వుందా ? ఎందుకు లేదు? ప్రజాస్వామ్యం నుకనా ?

     మన వంటి దేశాలలో విధాన నిర్ణయాలు, చట్టాలు చేసేది చట్టసభలు. వాటిని అమలు జరిపేది వుద్యోగ యంత్రాంగం. చైనాలో చట్టసభలు తమపని తాము చేస్తే వాటిని అమలు చేసే బాధ్యత పార్టీ కార్యకర్తలపై పెట్టటమే అక్కడి విజయ రహస్యం అన్నది హెయిల్‌మన్‌ అధ్యయన సారంశాలలో ఒకటి. వుదాహరణకు మన ప్రధాని నరేంద్రమోడీ సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా నల్లధనం నుంచి అవినీతి, వుగ్రవాదం, పన్నుల ఎగవేత, నగదు రహిత లావాదేవీల వంటి అనేక చర్యలకు గాను ఒకే మాత్ర అన్నట్లుగా పెద్ద నోట్ల రద్దును ప్రకటించి అమలు చేశారు. ఆ సందర్భంగా బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులందరూ తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను పార్టీ నాయకత్వానికి అందచేయాలని ఆదేశించినట్లు మన ప్రజాస్వామిక మీడియాలో వార్తలు చదివాము. ఆ లెక్కల్లో ఎలాంటి అక్రమాలు లేవని అయినా ప్రకటించాలి కదా ? అసలు దాని గురించి ఎందుకు మాట్లాడరు ? అన్నింటికీ మించి రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన రద్దయిన నోట్లెన్ని? ఎంత నల్లధనం బయటపడిందీ ఎందుకు ప్రకటించలేదు. ప్రజాస్వామిక వ్యవస్ధలలో ఇలాంటి వన్నీ రహస్యమా ?

చైనాలో కూడా బయటి నుంచి వచ్చిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవినీతి కూడా దిగుమతి అయి కొందరు అవినీతిపరులుగా మారారు. వారిపై అక్కడి అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ కూడా చర్యలు తీసుకున్నారు. రోజూ ఏదో ఒక మూల నుంచి అవినీతి పరులపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు చదువుతూనే వున్నాము కదా? మన దేశంలో అలాంటి వార్తలు ఎందుకు రావటం లేదు. చెన్నయ్‌లో కోట్ల కొలది కొత్త నోట్లు పోగేసిన బడా కాంట్రాక్టర్‌ వుదంతంలో ఎందరు బ్యాంకు వున్నతాధికారులపై చర్యతీసుకున్నారో ఎవరైనా ప్రకటించారా ?

చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో పట్టువిడుపులతో చట్టాలు చేయబోయే ముందు అనేక అంశాలపై ప్రయోగాలు చేసిన తరువాతే చట్టాలు చేయటం కూడా విజయ రహస్యమని జర్మన్‌ ప్రొఫెసర్‌ అంటున్నారు. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అన్నది 1917కు ముందు తెలియదు. సోవియట్‌ ఒక ప్రయోగం. అక్కడ వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసిన తరువాత చైనా తనదైన పంధాను ఎంచుకున్నది. భూ సంస్కరణల విషయంలో అది కనిపిస్తుంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి ఒక మూస అనేది వుండదని గ్రహించిన తరువాత చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌, తరువాత నేతలుగా వున్న వారు అనేక ప్రయోగాలకు తెరతీశారు. మంచి గాలికోసం కిటికీలు తెరిస్తే దాంతో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశించవచ్చు, అయితే వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని డెంగ్‌ అన్నారంటే ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టటమే. దానికి తోడు సత్వర ఫలితాలు రావాలంటే ప్రయోగాలను కూడా వికేంద్రీకరించాలని భావించారు, అది అవినీతికి తెరతీసిందని గ్రహించిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కేంద్ర స్ధానం నుంచి పధకాలకు రూపకల్పన చేస్తున్నారు. దీని ఫలితాలను చూసిన తరువాత మార్పులు చేర్పులు చేయటం అనివార్యం. చైనా విజయ రహస్యం ఇదే. సోషలిజం, కమ్యూనిజం వాటిని అమలు చేసే వ్యవస్ధల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఎదురుదెబ్బలు తిన్న పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల గురించిగానీ లేదా ప్రస్తుతం సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణంలో నిమగ్నమైన చైనా, వియత్నాం, క్యూబా, లావోస్‌, కంపూచియా ప్రయోగాల గురించి తమ తమ దృక్కోణాల నుంచి అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. వాటిని యథాతధంగా స్వీకరించటం లేదా తిరస్కరించటం గాకుండా అధ్యయనం చేయటం అవసరం. మావో మరణం తరువాత ఇంక చైనా పని అయిపోయినట్లే అని అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. తరువాత డెంగ్‌ను గురించి కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాలలో వున్న కమ్యూనిస్టు పార్టీలకు ఒక ప్రత్యేక చరిత్ర, అంకిత భావం గల కార్యకర్తల గురించి వారు విస్మరించారు. నాయకులు మరణించిన తరువాత కమ్యూనిజానికి భవిష్యత్‌ లేదని చెప్పటం వ్యతిరేకుల ప్రచారదాడిలో అస్త్రాలు తప్ప మరొకటి కాదని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. రామాయణం గురించి చెప్పేవారు రాక్షసుడిగా చిత్రించినప్పటికీ రావణుడిని , మహాభారతంలో ధుర్యోధనుడిని, హిట్లర్‌ను పొగిడేవారు వాడి పీచమణిన స్టాలిన్‌ గురించి, గాడ్సేసు దేవుడిగా కొలిచే ‘జాతీయవాదులు’ మహాత్మాగాంధీని పక్కన పెట్టి ముందుకు పోలేరు. అలాగే ప్రఖ్యాత అమెరికన్‌ ఆర్ధికవేత్త రాబర్ట్‌ ఎల్‌ హెయిల్‌బ్రోనర్‌ ‘మార్క్స్‌ నుంచి మనం తప్పించుకోలేం’ అని చెప్పినట్లుగానే వర్తమానంలో అపూర్వ విజయాలు సాధించిన, సాధిస్తున్న చైనా గురించి అధ్యయనం చేయకుండా కమ్యూనిస్టు వ్యతిరేకులతో సహా ఎవరూ తప్పించుకోలేరు.

భూమి పొరలలో వుండి నిరంతరం తొలిచే లక్షణం గల చుంచెలుక మనం వూహించని చోట బయటకు వచ్చి కనిపిస్తుంది. అలాగే దోపిడీ శక్తులను వ్యతిరేకించే శక్తులు కూడా నిరంతరం పని చేస్తూనే వుంటాయి. అవి ఎక్కడ, ఎలా కనిపిస్తాయనేది ఎవరూ చెప్పజాలరు. రూపం మారవచ్చు తప్ప మౌలిక లక్షణం మారదు. కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా అలాంటిదే. రెండు రెళ్లు నాలుగు అన్నది మారనట్లే దోపిడీ వున్నంత కాలం దానిని కొనసాగించేందుకు ఎవరెంతగా ప్రయత్నించినా, దానిని నాశనం చేసేందుకు పిలుపు ఇచ్చిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఏదో రూపంలో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటుంది. ఇదే కమ్యూనిస్టుల తర్కానికి మూలం, ముగింపు కూడా.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం అవుతోందా !

04 Saturday Mar 2017

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KODANDARAM, midterm elections, Telagana politics, Telangana, Telangana CM, trs

Image result for is telangana going for midterm elections

ఎం కోటేశ్వరరావు

   తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ రంగంలో అనూహ్య చర్యలకు తెరలేవనున్నదా అనే అనుమానం కలగక మానదు. అవలోకిస్తే రెండు దృశ్యాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.ఒకటి తెరాస అధికారానికి వచ్చి మూడో సంవత్సరం పూర్తి కావస్తున్నా నిర్ధిష్టంగా ఫలానా పని చేశామని చెప్పుకొనేందుకేమీ లేకపోవటంతో అధికారపక్షంలో ఆందోళన, ప్రతిపక్షాలలో ఆశలు మొలకలెత్తటం, కొంత అస్పష్టంగానే వున్నప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తిగాక ముందే ఏదో ఒక సాకుతో నాలుగో సంవత్సరం ప్రారంభంలోనే అధికారపక్షం మధ్యంతర ఎన్నికలకు వెళ్ల నుందా అన్నది మరొకటి. రెండు దృశ్యాలూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.

    తాజాగా ప్రత్యక్షంగా అధికారపక్షానికి, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు మధ్య టిజాక్‌( తెలంగాణా జెఎసి) నేత కోదండరాం లేదా తెరాస ప్రచారం చేస్తున్నట్లు కోదండరాం రెడ్డి కేంద్ర బిందువుగా వున్నారు. ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు నాయకుడిగా కోదండరాంను తెరమీదకు తెచ్చిన సారధి కెసిఆర్‌ ఇప్పుడు తన సైనికులతో కోదండరాంపైనే ప్రచార దాడి చేయిస్తున్నారు. తామేమీ చేశామో చెప్పుకొనేందుంకటే ప్రత్యర్ధులపై విరుచుకుపడటానికే అధికారపక్షం, దాని మద్దతుదార్లు, అధికారానికి దగ్గరై ఫలాలను అందుకోవాలని చూస్తున్న శక్తులు ప్రయత్నిస్తున్నాయి.పంచ రంగులలో తాము చూపిన బంగారు తెలంగాణా గురించి చెబుతున్నప్పటికీ ఆ నగ తయారీ ఎంతవరకు వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పటం లేదు. అంతకంటే ఎక్కువగా కోదండరాం కులం గురించి, ఒక కులానికి చెందిన నేతలందరూ ఒక్కటవుతున్నారనేదానిపైనే కేంద్రీకరించి మాట్లాడుతున్నారు.

     ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కులం తురుఫు ముక్కలతోనే తన లేదా తమ కుటుంబ పట్టును పదిల పరుచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు రాజ్యాంగ బద్దంగా వున్న షెడ్యూలు కులాలు, తెగల వుప ప్రణాళికలకు తిలోదకాలిచ్చి దానిని నీరు గార్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే మరోవైపు కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల, వేల కోట్ల కేటాయింపులు, సంక్షేమం గురించి ఆకాశంలో వెండి మబ్బులను చూపుతున్నారు. కన్నతల్లికి కాస్తంత కూడు పెట్టని కొడుకు పినతల్లికి బంగారు తొడుగులు చేయిస్తా అన్నట్లుగా దళితులకు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి పదవే ఇవ్వకపోతే పోయారు వాగ్దానం చేసిన భూమి గురించి మాట్లాడటం లేదు. అలాంటిది బిసిలు, అందులోనూ అత్యంత వెనుకబడిన బీసీలంటూ వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులనే ఎండమావులను చూపి వాటి వెంట పరిగెత్తించాలని చూస్తున్నారు. దళితుల గురించి మాట్లాడటం మాని వెనుకబడిన తరగతుల గురించి జపం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా వాగ్దానాలు చేస్తే అంత ఎక్కువగా భ్రమలు పెంచి అంతే స్ధాయిలో నిరసనను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం తెలియనంత అమాయకుడు కాదు కెసిఆర్‌. అయినా చట్టపరంగా ఇంకా ఎన్నికలు రెండు సంవత్సరాలు వుండగానే ఇంతగా వాగ్దానం చేస్తున్నారంటే కొత్త రాజకీయ ఎత్తులకు తెరలేవనున్నదని భావించకతప్పదు.

    ఇంతకాలం తమ వేతనాలు పెంచాలనిఅందోళన చేసిన కాంట్రాక్టు లెక్షరర్లు, అంగన్వాడీలు, విఆర్వోలు, ఇతర చిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గి కొంతమేరకు వేతనాలు పెంచుతున్నారు. అనివార్యమై కొన్ని పోస్టులను రెగ్యులర్‌ చేసేందుకు నిర్ణయించారు.ఇవన్నీ ఆయా తరగతుల పోరాట ఫలితాలు తప్ప మరొకటి కాదు. ఎవరి సంగతి వారు చూసుకోవటం ముఖ్యమనే వాతావరణం ఆవరించి వున్న నేటి పరిస్థితులలో తమ సంగతేమిటన్నది నిరుద్యోగుల ప్రశ్న. భారత్‌ను ఆక్రమించిన తెల్లవారు దేశం వదలి వెళితే మన పరిస్థితి బాగుపడుతుందని నమ్మి యావత్‌ దేశం ఆశోపహతులైనట్లే, వుమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ‘ఆంధ్రావలస పాలకులు’ పోయి తెలంగాణా స్వంతపాలకులు అధికారానికి వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన వారు కూడా అదే మాదిరి పాలకులు మారారు తప్ప పాలనా పద్దతులు మారలేదని గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు. మిషన్‌ భగీరధ, సింగరేణి, ఆర్టీసి వంటివాటిలో సంవత్సరాల తరబడి పనికి తగ్గ వేతనాలు లేకుండా పని చేసిన వారిలో ఓ పద్నాలుగువేల మందిని క్రమబద్దీకరించటం అభినందించదగినదే. మిగిలిన వన్నీ గతంలో మాదిరి సాధారణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన, చేపట్టనున్న బండి గుర్రానికి గడ్డి చూపుడు వ్యవహారం తప్ప మరొకటి కాదు. హైదరాబాదు మహానగరంలో ముఖ్య మంత్రి వుండటానికి లేదా గృహకార్యాలయ ఏర్పాటుకు భవనాలే లేవా ? కానీ అలాంటివేమీ లేనట్లుగా ఆఘమేఘాల మీద గతంలో వున్న వాటిని పడగొట్టి పూర్వపు రాజులు, దొరల మాదిరి పెద్ద గడీని కట్టించటానికి చూపిన శ్రద్ధ వుద్యోగ నియామకాలలో కనిపించటం లేదన్నదే నిరుద్యోగుల ఫిర్యాదు. అనేక మంది వయసు మీరిపోయి అనర్హులుగా మారిపోతున్నారు. లేదూ మినహాయింపులు ఇచ్చినా ఒక వేళ వారు వుద్యోగం పొందినా వారికి పెన్షన్ల వంటివి లేవు. ఎవరి పెన్షన్‌కు వారు చెల్లించుకోవాలి. ఆ మొత్తంలో కొంత షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెడితే లాభం వస్తే ఎంత ఇస్తారో ఇంకా తెలియదు గానీ నష్టం వస్తే అసలుకే మోసం.

    ఈ పూర్వరంగంలోనే కోదండరాం నాయకత్వంలోని జెఎసి నిరుద్యోగ సమస్యపై ప్రదర&శనకు పిలుపు ఇచ్చింది. ఒక ర్యాలీ జరిగినంత మాత్రాన చంద్రశేఖరరావు ప్రభుత్వానికి వచ్చే ముప్పు వుండదు. అయినప్పటికీ నా పాలనను ఎత్తి చూపటమా అన్న భావోద్వేగానికి లోనై లేదా కొందరు చెబుతున్నట్లు దొరతనపు అహం గానీ మొత్తానికి సహించలేక ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవటం, అసాధారణ రీతిలో కోదండరాంను, ఇతరులను అరెస్టు చేయటం అనేక మందిని ఆశ్చర్యపరచింది. ఏట్లో వుండగా ఓడ మల్లయ్య ఓడ దిగింతరువాత బోడి మల్లిగాడన్నట్లుగా కెసిఆరన తయారైనట్లు చెప్పకనే చెప్పినట్లయింది. ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళనలు నిర్వహించి విద్యారు&ధలు, నిరుద్యోగులకు అనేక ఆశలు చూపిన కెసిఆర్లో ఎంతలో ఎంత మార్పు !

    తెలంగాణా రాష్ట్ర సమితి నాయకత్వంలో వెల్లడవుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ఆ పార్టీ బలహీనతకు రుజువు. వారి వాదనల ప్రకారం తెలంగాణా రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు వారి నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదు. ఐదు నెలల పాటు నాలుగువేల కిలోమీటర్ల దూరం జరిపే మహాజన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం శ్రీకారం చుట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వుక్రోషం వెలిబుచ్చారు. పాదయాత్ర చేపట్టటానికి ఆ పార్టీకి నైతిక హక్కు లేదని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం నేతలు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాంటి వారిని అసలు తమ ప్రాంతాలకు రానివ్వవద్దని జనానికి పిలుపు ఇచ్చారు. తమ యాత్ర ప్రభుత్వానికి, అధికారపక్షానికి వ్యతిరేకం కాదని దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల సమస్యలను తెలుసుకొని వారిని చైతన్యపరచటానికి తప్ప మరొకటి కాదని సిపిఎం స్పష్టం చేసింది. తనపాలనను ఎవరూ ఎత్తి చూపవద్దన్న పెత్తందారీ భావజాలంతో ముఖ్యమంత్రి అలాంటి ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదని అనేక మంది అప్పుడు భావించారు. ఒక జాతీయ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనను సిపిఎం వ్యతిరేకించింది.తెలంగాణాను వ్యతిరేకించిన ఇతర పార్టీలలోని నేతలను, అసలు నిజాంపాలనకు మద్దతు పలికి భారతదేశంలో విలీనాన్నే వ్యతిరేకించిన వారి వారుసులందరినీ తనలో చేర్చుకున్న టిఆర్‌ఎస్‌కు ఇతరులను విమరి&శంచే నైతిక హక్కు ఎక్కడిది అన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్ర సమైక్యత, విభజన అన్నది ఇప్పుడు ముగిసిన అంశం. దాని గురించి రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకత్వం జనంలో లేదని సజావుగా సా సిపిఎం మహాజన పాదయాత్ర నిరూపించింది. రాజకీయాలకు అతీతంగా ఆ యాత్రకు సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు ఇతర అనేక సంస్ధల వారు మద్దతు తెలిపారు. తెరాస మద్దతుదారులు కూడా తమనేతల రెచ్చగొట్టుడు వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. ఒక వేళవారా పని చేసి వుంటే పాదయాత్ర మరింతగా జయప్రదం అయి వుండేది. చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా అధికార మత్తులో మునిగిపోయారని అధికారపక్షం గురించి జనంలో ఆలోచన ప్రారంభయ్యాకనే సిపిఎం పాదయాత్ర చేపట్టింది, ఆ కారణంగానే దాన్ని వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి పిలుపును జనం కూడా పట్టించుకోలేదని ఇప్పటికైనా అధికారపక్షం గ్రహిస్తుందా ?

    ‘ఆంధ్రావలసపాలన’ అంతం కాగానే లక్షలాది వుద్యోగాలను కల్పిస్తామని, ప్రభుత్వ వుద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేసి హడావుడి చేసిన విషయాన్ని యువతకు ఏ కోదండరామో, మరొక ప్రతిపక్ష పార్టీయో గుర్తు చేయనవసరం లేదు. తెలంగాణా యువత మరీ అంత అమాయకంగా లేదు. మూడవ సంవత్సరం పూర్తి కావస్తున్నా వట్టిస్తరి-మంచి నీళ్ల మాదిరి ప్రకటనలు తప్ప నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ వుద్యోగాల ఖాళీలను భర్తీ చేయటానికి, అవసరమైన చోట కొత్త వుద్యోగాలను కల్పించటానికి కావాల్సింది చిత్త శుద్ది తప్ప రాజ్యాంగ సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం లేదే. అటువంటి చిత్త శుద్ది లోపించిన కారణంగానే టిజాక్‌ నాయకుడు కోదండరాం నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. తెలంగాణా ఆందోళనలో భాగస్వాములైన అనేక మంది తెరాసకు దూరంగా వుంటున్నారు. అదే సమయంలో అధికారం కారణంగా అవకాశవాదులు దగ్గర అవుతున్నారు.

  తెలంగాణాలో వున్న నిరుద్యోగులతో పోల్చితే వుద్యోగఅవకాశాలు పరిమితంగా వున్నాయి. హైదరాబాదు ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలకు ఒక ప్రధాన కేంద్రంగా మారినప్పటికీ ఆ రంగంలో లభించే వుద్యోగాలకు దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడుతున్నారు తప్ప తెలంగాణా వాసులకే పరిమితం కాదు, రిజర్వేషన్లు లేవు. కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొన్ని మూతపడటం తప్ప కొత్తవి రావటం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టటం కేంద్ర ప్రభుత్వ అజండా నుంచి ఎప్పుడో రద్దయింది. వుమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమలేవీ పెట్టలేదు. పోనీ వారు ‘వలస పాలకులు’ అనుకుంటే స్వరాష్ట్ర పాలకులు తెరాస వారు కూడా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ఓలా, వుబేరన వంటి అంతర్జాతీయ దిగ్గజాలు హైదరాబాదు నగరాన్ని చుట్టేస్తున్నాయి. దీంతో ఆటోలకు కొంత మేర గిరాకీ తగ్గిపోయింది. ఇదే సమయంలో తమ ఆదాయాలు పడిపోతున్నాయని ఓలా, వుబేరన టాక్సీ సిబ్బంది సమ్మెకు దిగినపుడు ప్రభుత్వం వారికే మాత్రం సాయపడలేదు. పరోక్షంగా యజమానుల కొమ్ము కాసింది. త్వరలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అది కూడా ఆటో, టాక్సీ రంగాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయటం అనివార్యం. ఈ పూర్వరంగంలో యువతలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో వుద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాల గురించి ఆశలు పెరగటం తప్పు, అత్యాశమే కాదు. వారిని ఎంతగా భ్రమలలో ముంచితే అంతగా అసంతృప్తి పెరుగుతుందని గ్రహించాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆందోళనకు ప్రయత్నించి అనేక మంది గతంలో విఫలమయ్యారు.కెసిఆర్‌ నాయకత్వం సఫలమైంది. అలాగే నిరుద్యోగ సమస్యపై తెరాస, దానికి వెన్నుదన్నుగా వున్న మీడియా పెద్దలు కోదండరాం ఆందోళన విఫలమైందని సంతోషపడితే పడవచ్చు. కోదండరాం కాకపోతే మరొకరు, మరొకరు వస్తారు తప్ప ఆగిపోదు.

    ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు తన కుమారుడికి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగించేందుకు ప్రారంభం నుంచి పావులు కదుపుతున్నారు. అధికారం చుట్టూ తిరిగే పాలక రాజకీయాలలో ఇది సహజం. గడువు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల గడువుంది. అయినప్పటికీ కొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయన్నట్లుగా ఆయన చర్యలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎవరు అధికారంలో వున్నప్పటికీ ఒక బలమైన సామాజిక వర్గం చక్రం తిప్పిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. కెసిర్‌ ఆ వర్గంతో అమీ తుమీ తేల్చుకోవాలనే ఎత్తుగడతో వున్నట్లు కనిపిస్తోంది. అందుకు అవసరమైన ఇతర వెనుకబడిన, మైనారిటీ సామాజిక సామాజిక వర్గాలను కూడగట్టే వైపు పావులు కదుపుతున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఇటీవలి కాలంలో కులాలవారీ ప్రతినిధులను పిలిచి వందల కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాగ్దానాలు చేస్తున్నారు. దళితులలో గణనీయంగా వున్న ఒక వర్గాన్ని కూడగట్టుకొనేందుకు రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు తప్ప అంతకు మించి చేసిందేమీ లేదు. వర్గీకరణను వ్యతిరేకించే మరో బలమైన తరగతిని దూరం చేసుకొనేందుకు అటు కేంద్రంలోని బిజెపి సిద్దంగా లేదు. ఎన్నికల రాజకీయాలలో దేనికైనా ఓట్ల లాభ నష్టాలే ప్రాతిపదిక. బీసి కులాలతో ములాఖత్‌లు నడుపుతున్న కెసిఆర్‌ కుల వృత్తులను పునరుద్దరిస్తామనే వాగ్దానాలతో వందల కోట్ల కేటాయింపుల గురించి రెండు సంవత్సరాల ముందుగానే వాగ్దానాలు కుమ్మరిస్తున్నారంటే వాటి భ్రమల నుంచి వారు బయటపడక ముందే ఎన్నికలకు పోవటం అనివార్యం. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగుల వుపాధికి తప్ప మరొకందుకు పనికిరావని గతంలో స్పష్టం చేసిన అనేక కార్పొరేషన్లకు ఇటీవల జరుపుతున్న నియామకాలు ఓట్ల వలతప్ప మరొకటి కాదు. చిన్నా చితకా కలిపి మరో ఐదారువేల పోస్టులలో తమ మద్దతుదార్లను నియమించేందుకు కసరత్తు మొదలైందని వార్తలు. ఇలాంటి వన్నీ ఎన్నికల ముందే చేస్తారు తప్ప మరొకటి కాదన్నది కూడా మరో అనుభవం. పదవులు రాని వారిలో అసంతృప్తి పెరిగి అది సంఘటితం కాక ముందే ఎన్నికలకు పోవాలి తప్ప ఆలస్యం చేస్తే నష్టమే.

    వీటన్నింటినీ చూస్తున్నపుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలకు తెరలేచిందని చెప్పవచ్చు. దానికి కోదండరాం నిరుద్యోగ ఆందోళన పిలుపు నాంది అయితే రానున్న నెలల్లో పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది చూడాల్సి వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటు కేంద్రంలో బిజెపి రాజకీయాలు, కార్యాచరణను కూడా ప్రభావితం చేస్తాయి. అది తెరాసమీద కూడా ఏదో ఒక ప్రభావం చూపకపోదు. నరేంద్రమోడీ బలహీనపడే పరిణామాలు వస్తే చంద్రశేఖరరావు వంటి వారిని మచ్చిక చేసుకుంటారు. లేదు తమకు ఎదురు లేదు అనుకుంటే మరొక విధంగా జరుగుతుంది. ఏదైనా పరిణామాలు వేగం పుంజుకుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మళయాళ నటికి మరుగుజ్జు యోధుల బెదిరింపులు !

20 Monday Feb 2017

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Aami actress, BJP’s trolling army, Manju warrier, Trolls

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d