• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

కేరళ రాజకీయం : అన్న కాంగ్రెస్‌, ఇడి భయంతో చెల్లి బిజెపి ! సిపిఎం వైపు ముస్లిం ఓటర్ల మొగ్గు !!

10 Sunday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala Politics, BJP, CPI()M, Kerala CPI(M), Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేరళలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రసవత్తర రాజకీయం మొదలైంది. కాంగ్రెస్‌ గతంలో సాధించిన సీట్లను నిలుపుకోవాలని చూస్తున్నది. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించి లోక్‌సభ సీట్లును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, సుప్రీం కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని తేలిపోయింది. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ తాజాగా ఒక సమీక్షలో పేర్కొన్నది. దానిలోని కొన్ని ముఖ్య అంశాల సారం దిగువ విధంగా ఉంది.


గత ఎన్నికల అనంతరం సిఎస్‌డిఎస్‌ జరిపిన సర్వేలో మూడింట రెండువంతుల మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు వెల్లడైంది. గతం కంటే నరేంద్రమోడీ అధికారంలోకి రాగూడదన్న భావన ముస్లింలలో పెరిగినప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్‌వైపు మొగ్గే ధోరణిలో లేరు. మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ వంటి చోట్ల బిజెపి కంటే కాంగ్రెస్‌ ఎక్కువ హిందూత్వను అనుసరించటం ముస్లిం సామాజిక తరగతిని ఆశాభంగానికి గురి చేసింది. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోవటం లేదని చెప్పేందుకు కాంగ్రెస్‌ ఆలశ్యం చేయటం కూడా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్‌ మీద తొలుగుతున్న భ్రమలతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా సిపిఎంను చూస్తున్నారు. ” కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరే అవకాశం కోసం వేచి చూస్తున్నారు.వారు ఉన్నత రాజకీయ లక్ష్యాలనేమీ ప్రకటించటం లేదు.వారికి కేవలం అధికారం మాత్రమే ప్రధానంగా ఉంది ” అని రచయిత, ఒక పరిశోధనా సంస్థ అధ్యక్షుడు ముజిబ్‌ రహమాన్‌ కినలూర్‌ చెప్పారు. ” అలాంటి వలస కేరళలో కూడా కనిపిస్తోంది.ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని, ఇప్పుడు కరుణాకరన్‌ కుమార్తె పద్మజ బిజెపిలో చేరారు.ఎవరైనా కాంగ్రెస్‌ ఎంపీని నమ్మాలంటే ఎంతో కష్టంగా మారుతోంది” అని కూడా ముజిబ్‌ చెప్పారు. ”బిజెపిని ఎదుర్కొనే అవకాశం సిపిఎంకు లేదని మాకు తెలుసు, కానీ కాంగ్రెస్‌కు ఉంది.ఇప్పుడు రెండు పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువలన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిని ఎంచుకుంటే తేడా ఏముంటుంది.” అని ఇస్లామిక్‌ పండితుడు, రచయిత అష్రాఫ్‌ కడక్కల్‌ ప్రశ్నించారు.” ఈ సారి ప్రతి ముస్లిం ఒక అభ్యర్ధి లౌకిక వైఖరినే చూస్తారు.పార్లమెంటులో గట్టిగా లౌకికవాదాన్ని ఎవరు గట్టిగా రక్షణకు నిలబడతారు, ఉదాహరణకు జాన్‌ బ్రిట్టాస్‌(సిపిఎం రాజ్యసభ సభ్యుడు) వంటి వారిని ఎంచుకుంటారు ” అని కూడా చెప్పారు.లౌకివాద పరీక్షలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కే ప్రేమ చంద్రన్‌ ఫెయిల్‌ అయ్యారు. హమస్‌ను ఉగ్రవాద సంస్థ అని శశిధరూర్‌ వర్ణించారు.పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ మారణకాండను గట్టిగా ఖండించలేదు. దీంతో పాలస్తీనా సంఘీభావ సభల్లో పాల్గొనే వారి జాబితా నుంచి ముస్లిం సంస్థలు శశిధరూర్‌ పేరును తొలగించాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావటంతో ప్రేమచంద్రన్‌పై అపనమ్మకం ఏర్పడింది.


శుక్రవారాల్లో నమాజు తరువాత మసీదుల్లో చేసే ప్రసంగాల్లో ఎల్‌డిఎఫ్‌ను విమర్శించాలని ముస్లింలీగు కోరుతున్నది. మసీదుల్లో రాజకీయ విమర్శలు చేయకూడదని సమస్త కేరళ జమాయతుల్లా చెప్పింది.ముస్లిం లీగ్‌ చేస్తున్న రాజకీయాలు సమస్తలోని ఒక వర్గాన్ని ఆశాభంగానికి గురిచేశాయి.వారు ఈసారి ఎల్‌డిఎఫ్‌ను ఎంచుకోవచ్చు.లీగ్‌ నేతల తీరుతెన్నులను విమర్శించినందుకే పార్టీ నేత కెఎస్‌ హంసను బహిష్కరించారు. ఇప్పుడు సిపిఎం తన అభ్యర్ధిగా హంసను పొన్నాని బరిలో నిలిపింది.అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి నిరసన తెలపాల్సిన అవసరం లేదని, అక్కడ మసీదు నిర్మాణం కూడా చేయనున్నందున లౌకికవాదం మరింత బలపడుతుందని ముస్లింలీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్‌ అలీ తంగల్‌ చేసిన వ్యాఖ్యలను లీగ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.జ్ఞానవాపి మసీదు కూడా కావాలని సంఘపరివార్‌ కోరుతున్నందున అలా ఎలా మాట్లాడతారని సమస్త నేత ప్రశ్నించారు.తిరువాన్కూర్‌ సెంట్రల్‌ ప్రాంతంలో 2016 ఎల్‌డిఎఫ్‌కు ముస్లింలు 25శాతం మంది మద్దతు ఇవ్వగా 2021లో అది 50శాతానికి పెరిగింది.ఎక్కడైతే బిజెపి పోటీ ఇస్తుందని అనుకుంటారో అక్కడ ఓడించేవారిని చూసి ఎంచుకుంటారు.


కాంగ్రెస్‌ నేత బొమ్మతో బిజెపి ప్రచారం !
కేరళలో జగమెరిగిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం కరుణాకరన్‌. ఆయన కుమార్తె పద్మజ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరగానే బిజెపి పెద్దలు కాషాయ జెండాపై కరుణాకరన్‌ బొమ్మను ముద్రించి ప్రచారానికి దిగారు. తన తండ్రి కాంగ్రెస్‌ ఆస్తి అని త్రిసూర్‌ లోకసభ కాంగ్రెస్‌ అభ్యర్ధి కె మురళీధరన్‌ ప్రకటించారు. నిలంబూర్‌లో నరేంద్రమోడీ, కరుణాకరన్‌, పద్మజ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో వారు వాటిని చించివేశారు. రాష్ట్రంలో మొత్తం 20లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 16చోట్ల అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కె కరుణాకరన్‌, ఎకె ఆంటోనీ. ఇద్దరూ కాంగ్రెస్‌ ప్రముఖులే. గతంలో ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని బిజెపిలో చేరగా,ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పత్తానంతిట్ట లోక్‌సభ బరిలో దిగారు. అక్కడ సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ పోటీ చేస్తున్నారు. పద్మజ వేణుగోపాల్‌ వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మీద ఆమె పోటీ చేయనున్నట్లు నిర్దారణగాని వార్తలు వచ్చాయి. దేశవ్యాపితంగా ఈ పోటీని సంచలనాత్మకం కావించేందుకు బిజెపి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం వడకర ఎంపీగా ఉన్న మురళీధరన్‌ త్రిసూర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా మార్పును ప్రకటించారు.
కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరటంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రోజు కాంగ్రెస్‌లో ఉన్న నేతలు రేపుదానిలో ఉంటారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. బిజెపిలో చేరతానని గతంలో పిసిసి అధ్యక్షుడు సుధాకరన్‌ స్వయంగా చెప్పారు. ఇద్దరు ప్రముఖుల పిల్లలు బిజెపిలో చేరారు. ఇంకా ఎంత మంది చేరతారో తెలియదు. కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ వారు పార్టీలో కొనసాగుతారన్న ఎలాంటి హామీ లేదన్నారు.ఇంకా ఎంత మంది కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరతారో మీరే చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్లతో అన్నారు. అనేక మంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారని, మొత్తంగా బిజెపిలో చేరరన్న గ్యారంటీ ఏముందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మాజీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ముగ్గురు పిసిసి అధ్యక్షులు బిజెపిలో చేరారని చెప్పారు.


సురేష్‌ గోపికి కోపమొచ్చింది ! ఓట్ల కోసం ఎన్ని తిప్పలో !!
ఈ సారి ఎలాగైనా విజయం సాధిస్తాననే ధీమాతో త్రిసూర్‌లో పోటీకి దిగిన సినీనటుడు సురేష్‌ గోపికి శనివారం నాడు కోపమొచ్చింది. ఒక గిరిజన కాలనీలో ప్రచారానికి వచ్చిన గోపికి కొంత మంది మహిళా వలంటీర్లు తప్ప ఓటర్లు కనిపించలేదు.దాంతో కారుదిగకుండానే వలంటీర్లు కూడా తగినంత మంది లేనపుడు ఇక్కడ పోటీ చేయటం ఎందుకు తిరువనంతపురం వెళ్లి అక్కడ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌కు ప్రచారం చేస్తా అంటూ మండిపడినట్లు మీడియా పేర్కొన్నది. ఇంకా నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు గుర్తుపెట్టుకోండి అంటూ ఆగ్రహించారు. దాంతో కార్యకర్తలు ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారట. అక్కడ సోదరుడికి వ్యతిరేకంగా చెల్లి పద్మజ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు. బిజెపిని మూడవ స్థానంలోకి నెడతామని మురళీధరన్‌, కాంగ్రెస్‌నే ఆ చోటులో ఉంచుతామని సురేష్‌ గోపి ప్రకటించారు. ఓట్ల కోసం ఈ పెద్దమనిషి నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె వివాహాన్ని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించారు. దానికి రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చిలో మేరీమాతకు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అయితే అది బంగారు పూత పూసిన రాగిదనే విమర్శలు రావటంతో వివాదాస్పదమైంది. దానిలో బంగారం ఎంత ఉందో పరీక్షించి చెప్పాలని చర్చి అధికారులను కాంగ్రెస్‌ కోరింది. ఐదు సవర్ల బంగారంతో దాన్ని చేసినట్లు కంసాలి చెప్పారు. తాను ఇచ్చినదానిలో సగం బంగారాన్ని కంసాలి తనకు తిరిగి ఇచ్చారని, 18కారట్ల బంగారంతో కిరీటాన్ని తయారు చేసినట్లు, తాను గెలిస్తే మరో పదిలక్షల విలువగల బంగారాన్ని మేరి మాతకు కానుకగా ఇస్తానని సురేష్‌ గోపి వివరణ ఇచ్చారు. ఎల్‌డిఎఫ్‌ తరఫున సిపిఐ అక్కడ పోటీ చేస్తున్నది.అక్కడ టిఎన్‌ ప్రతాన్‌ తమ అభ్యర్ధి అని కాంగ్రెస్‌ ఎన్నో రోజుల ముందుగానే అనధికారికంగా ప్రకటించింది. దాంతో గోడరాతలతో పాటు మూడున్నరలక్ష వాల్‌పోస్టర్లను కూడా ప్రతాపన్‌ ముద్రించారు. ఇప్పుడు అవన్నీ వృధా అయ్యాయి.


ఇడి దెబ్బకు బిజెపిలోకి ఫిరాయింపు !
పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరటానికి కారణం ఆమె భర్త డాక్టర్‌ వేణుగోపాల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించటమేఅని కాంగ్రెస్‌ నాయకురాలు బిందు కృష్జ చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో తమతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అన్నారు. తన సోదరితో అన్ని బంధాలను తెంచుకున్నానని, ఆమె చేరికతో బిజెపికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని మురళీధరన్‌ మీడియాతో చెప్పారు.తన తండ్రి ఆత్మ ఆమెను క్షమించదన్నారు.ఆమె ఫిరాయింపు వెనుక తమ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మాజీ డిజిపి లోక్‌నాధ్‌ బెహరా ఉన్నారని, అతను ప్రధాని నరేంద్రమోడీ, పినరయి విజయన్‌కూ సన్నిహితుడే అన్నారు. పత్తానం తిట్టలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని ఓట్లకోసం శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. తన పార్టీ జనపక్షంను బిజెపిలో విలీనం చేసిన పిసి జార్జి ఆ సీటును ఆశించి భంగపడ్డారు.కేరళ రాజకీయాల గురించి అనిల్‌ ఆంటోనికి అనుభవం లేదని అక్కడ ఓడిపోతారని ప్రకటించారు. దాంతో బిజెపి నాయకత్వం నష్టనివారణకు పూనుకొని అనిల్‌తో కలిపి శివాలయానికి పంపింది. అక్కడ జార్జి స్వయంగా అనిల్‌ నుదుట తిలకాన్ని దిద్దిన వీడియో వైరల్‌గా మారింది. పోటీకి దిగాలన్న తన కలను సిఎం పినరయి విజయన్‌, బిజెపి మిత్రపక్షం బిడిజెఎస్‌ నేత తుషార్‌ వెల్లపల్లి వమ్ముచేశారని పిసి జార్జి ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాట్సాప్‌ కట్టుకథలు, పిట్టకతలు : గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ గురించి నరేంద్రమోడీ పాకిస్థాన్‌కు నోటీసు పంపారా ?

25 Sunday Feb 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, China, Gilgit-Baltistan, Kashmir, Narendra Modi Failures, pakistan, POK, RSS, Watsapp University


ఎం కోటేశ్వరరావు


” బాల్టిస్థాన్‌, మనదేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు ? ఇప్పుడు మన ప్రధాని మోడీ గారి వల్ల ఈ ప్రాంతం మన స్వంతం కాబోతోంది. దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి ” అంటూ ఒక పోస్టును ” వాట్సాప్‌ పండితులు ” ప్రచారం చేస్తున్నారు. అసలు ఇలాంటి వార్తను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అసలు విన్నారా, చదివారా, చూశారా ? కేవలం వాట్సాప్‌ పండితులకే ఇలాంటివి ఎలా తెలుస్తాయి. ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు. బాల్టిస్థాన్‌ మనదేశంలో అంతర్భాగం, ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉంది. ఎప్పటికైనా మనకు రావాల్సిందే అన్నది వాస్తవం. ఒక నోటీసు ఇవ్వగానే అన్యాక్రాంతమైన ప్రాంతం వెంటనే వస్తుందా? మోడీ నోటీసు ఇవ్వటం ఏమిటి ? అద్డెకున్నవారినే అంతతేలికగా ఖాళీ చేయించలేమే అలాంటిది ఏడు దశాబ్దాలుగా పాక్‌ ఆక్రమణలో ఉన్నదాని స్వాధీనం వెంటనే జరుగుతుందా ? ఉత్తర-దక్షిణ కొరియాలను విలీనం చేయాలని రెండవ ప్రపంచ యుద్దం తరువాత నిర్ణయించినా ఇంతవరకు జరగలేదు. వియత్నాం విలీనం కోసం రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1975వరకు ఆక్రమణదారులు, వారితో చేతులు కలిపిన వారి మీద పోరాడి లక్షల మంది ప్రాణాలను ఫణంగా పెట్టిన తరువాతే సాధ్యమైంది.తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించి తీర్మానించినా ఇంతవరకు చైనా స్వాధీనం చేసుకోలేకపోయింది. ఆక్రమిత కాశ్మీరు గురించి ఐరాసలో ఎలాంటి విలీన తీర్మానం చేయలేదు. శాంతియుత పద్దతుల్లో భారత్‌-పాక్‌ పరిష్కారం చేసుకోవాలి. అసలు గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది ?


పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌తో సహా కాశ్మీరు ప్రాంతం మొత్తం, లడక్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారుచిన్‌ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనదేశం ప్రకటిస్తున్నది. మనదేశ పటాల్లో అదే చూపుతున్నది.మన కాశ్మీరు రాష్ట్ర అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించటం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడక్‌ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ కూడా కాశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్తాన్‌ వేర్వేరు వైఖరులను తీసుకున్నది. గిల్గిట్‌ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ” విముక్త (ఆజాద్‌) కాశ్మీరు” అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉంచింది. ఎప్పటికైనా మొత్తం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. పాక్‌ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గమ్‌ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించటంతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత వెల్లడైంది.అనేక తర్జన భర్జనల తరువాత పాకిస్తాన్‌ గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతాన్ని 2020లో పాక్‌ ఐదవ తాత్కాలిక రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కాశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్‌ వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్‌ చెబుతున్నది. ఆక్రమిత కాశ్మీరులో మాదిరి గిల్గిట్‌లో కూడా ఎన్నికలు జరుపుతున్నది.


ఆక్రమిత కాశ్మీరును తిరిగి మన దేశంలో విలీనం చేసేందుకు పదేండ్లలో చేసిందేమీ లేకపోగా తన గొప్పతనాన్ని ప్రదర్శించుకొనేందుకు నరేంద్రమోడీ పదే పదే పాకిస్తాన్ను రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం ఉంది.దానిలో భాగంగానే 2016 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మానవహక్కులు లేవంటూ ఆక్రమిత కాశ్మీరు, గిల్గిట్‌ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. 1948 నుంచి గిల్గిట్‌ను వేరుగా ఉంచిన పాకిస్థాన్‌ 2019లో ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన తరువాత 2020లో తన ఐదవ రాష్ట్రంగా తాత్కాలిక గుర్తింపుగా ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఒరిగేదేమీలేదు. కాశ్మీరు సమస్య తేలేవరకు అది తాత్కాలిక రాష్ట్రంగా మాత్రమే ఉంటుంది. దేశంలో అంతర్భాగం కాదు. పాక్‌ సుప్రీం కోర్టు పరిధి దానికి వర్తించదు. ఒక వేళ ఆ ప్రాంతం తమ దేశంలో భాగమే అని గనుక ప్రకటిస్తే ఐరాసలో కాశ్మీరు ఒక ప్రత్యేక దేశమంటున్న పాక్‌ వాదన వీగిపోతుంది. దాన్నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది.అందుకే పార్లమెంటులో ఆక్రమిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం కూడా కల్పించటం లేదు. తమ రక్షిత ప్రాంతాలుగానే చెబుతున్నది. అనేక అంశాల గురించి తప్పుడు ప్రచారం చేయటంలో గత పది సంవత్సరాలలో విపరీతంగా పెరిగింది. తప్పుడు వార్తలలో మన దేశం ముందున్నదని ఇటీవలనే ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్గిట్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించటాన్ని భద్రతా మండలిలో వీటో చేస్తామని, అది భారత్‌లో భాగంగా ఉండాలని తాను కోరుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చెప్పాడంటూ ఒక వీడియోను 2022లో వైరల్‌ చేశారు. అసలు ఈ అంశం భద్రతా మండలి చర్చలోనే లేదు. తమ ఆర్థిక రంగం గురించి పుతిన్‌ రష్యన్‌ భాషలో మాట్లాడిన వీడియోకు గిల్గిట్‌ గురించి చెప్పినట్లు ఆంగ్లంలో సబ్‌టైటిల్స్‌ను జోడించి నరేంద్రమోడీ గొప్పతనాన్ని పెంచేందుకు చూశారు. అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అదే వీడియోను చూపుతూ పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల పర్యవసానాల గురించి పుతిన్‌ చర్చించినట్లు పేర్కొన్నాయి.


బిజెపి నేతలు ఇదిగో రేపో ఎల్లుండో ఆక్రమిత కాశ్మీరును తిరిగి వెనక్కు తీసుకువస్తాం అన్నట్లుగా పదే పదే చెబుతుంటారు. తాము మాత్రమే స్వాధీనం చేసుకోగలమని చెప్పుకుంటారు. ఎవరు అధికారంలో ఉన్నా మనదేశం ఎన్నడూ కాశ్మీరు గురించి రాజీపడలేదు. జమ్మూ-కాశ్మీరు ఎప్పుడు విలీనమైందో పాక్‌ ఆక్రమిత కాశ్మీరు-గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ కూడా మన అంతర్భాగాలే అని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1994లో పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా లోక్‌సభలో తీర్మానం ఆమోదించారు. పాకిస్థాన్‌ వెంటనే ఖాళీ చేయాలని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తగిన విధంగా స్పందిస్తామని కూడా పేర్కొన్నారు. అందువలన నరేంద్రమోడీ చెప్పిన తరువాతే గిల్గిట్‌ అనేది ఒకటుందని మనకు తెలిసిందని చెప్పటం అతిశయోక్తి, తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు.2001లో నాటి ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ఒక సందర్భంలో చెప్పారు.2019లో ఆర్టికల్‌ 370తో పాటు కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినపుడు కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. గిల్గిట్‌ ప్రాంతంలోని షాక్స్‌గమ్‌ లోయ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ గతంలో చైనాకు అప్పగించిందని పైనే చెప్పుకున్నాము.దాని ద్వారానే కారకోరం రహదారిని చైనా నిర్మించింది. పాకిస్తాన్‌-చైనా భూ భాగాన్ని కలిపే ఏకైక మార్గమిది.చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాకు ఇది కీలకం.


స్వాతంత్య్రానికి పూర్వం జమ్మూ-కాశ్మీరు సంస్థానంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచిన వాటిలో గిల్గిట్‌ ఏజన్సీ, బాల్టిస్థాన్‌ జిల్లాగా ఉండేవి.పాకిస్థాన్‌ ఆక్రమించిన కాశ్మీరుకు ఇది విస్తీర్ణంలో ఆరురెట్లు ఎక్కువ.ఈ ప్రాంతంలో జనాభా ప్రస్తుతం18 లక్షలకు పైగా ఉంది.2009లో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ అని పేరు పెట్టారు. ఇది స్వయం పాలిత ప్రాంతం. గిల్గిట్‌ పట్టణం రాజధాని. కాశ్మీరులో అంతర్భాగమే అయినప్పటికీ తాము కాశ్మీరీలకంటే భిన్నమైన వారమని ఆ ప్రాంతవాసులు భావిస్తారు.కాశ్మీరులో సాగిన డోగ్రా (రాజరిక) పాలన మీద వారు తిరుగుబాటు చేశారు. తాము అటు భారత్‌లోనూ ఇటు పాకిస్థాన్లో కూడా విలీనానికి అంగీకరించం అని చెప్పారు. తరువాత మారిన పరిస్థితిలో అది పాక్‌ ఆక్రమణకు గురైంది. విముక్త కాశ్మీరుగా(మనం ఆక్రమిత ప్రాంతం అంటున్నాం) పాకిస్థాన్‌ ప్రకటించిన ప్రాంతాలకు, గిల్గిట్‌ ప్రాంతాలకు వేర్వేరు పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు.1994 నుంచి గిల్గిట్‌లో పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం గురించి జై శ్రీరామ్‌ పేరుతో పెట్టిన ఊరూ పేరులేని పోస్టులు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి. వీటిని ఎవరు వ్యాపిస్తున్నారో అందరికీ తెలుసు. తప్పుడు సమాచారంతో జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరు పంపినా గుడ్డిగా ఇతరులకు పంచటం గాకుండా వాటి విశ్వసనీయత గురించి పంపిన వారిని ప్రశ్నిస్తే అసలు సంగతి తేలుతుంది. దానిలో ” నిన్న గిల్గిట్‌ బాల్టిస్ధాన్ను ఖాళీ చేయమని మోడీ పాకిస్ధాన్‌కు నోటీసు ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన(భారత్‌) భూభాగం అనే తెలియదు ” అని కూడా సెలవిచ్చారు. మోడీ ప్రతిష్టను పెంచేందుకు భక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఇదొకటి. ఇక్కడ ఆ పోస్టు మొత్తంలో నిన్న అంటే ఏ తేదీ, ఏ నెల, ఏ సంవత్సరంలో అలాంటి నోటీసు పంపారో రాసి ఉంటే దాని బండారం బయటపడేది. గోడమీద రాసే అప్పు రేపు అన్నట్లుగా దీన్ని వాట్సాప్‌లో కొత్తగా చదివేవారికి అంతకు ముందు రోజే నోటీసు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అది నిజమా కాదా అని సరిచూసుకొనే ఆసక్తి మన జనాలకు ఉండదు అనే ధీమాతో ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అదే నరేంద్రమోడీ గిల్గిట్‌ గురించి పాకిస్థాన్‌కు నోటీసు ఇస్తే మరి ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చైనాకు ఎందుకు నోటీసు ఇవ్వలేదు ? మొత్తం ఆక్రమిత కాశ్మీరులో గిల్గిట్‌ కూడా ఒకటి, గిల్గిట్‌ను మాత్రమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చిన నరేంద్రమోడీ మిగతా కాశ్మీరు ప్రాంతం గురించి ఎందుకు ఇవ్వలేదు ? అందుకే ఇది తప్పుడు ప్రచారం అన్నది స్పష్టం. ఎవరైనా ఆధారాలు ఉంటే చూపవచ్చు. కొస మెరుపు ఏమంటే 2016లో నరేంద్రమోడీ ఎర్ర కోటలో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రస్తావనతో చేసిన ప్రసంగ అంశం మీద ఆంగ్ల మీడియాలో పెట్టిన శీర్షికల్లో ఒక దానికి ” రెడ్‌ ఫోర్టు నోటీసు – విల్‌ మోడీస్‌ న్యూ పాకిస్థాన్‌ పాలసీ గో బియాండ్‌ రిహొటరిక్‌ ? ”(స్క్రోల్‌ ఆగస్టు 29,2016) అని పెట్టారు. దీని అర్ధం పాకిస్థాన్‌కు ప్రధాని నోటీసు ఇచ్చారనా ? కానే కాదు, వట్టి మాటలేనా చేతలేమైనా ఉంటాయా అని అర్ధం. ” ఎర్రకోట ప్రకటన- పాకిస్థాన్‌ నూతన విధానంతో మోడీ వాక్పటిమ కంటే ముందుకు పోతారా ” అన్నది తెలుగు అర్ధం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ దశాబ్ది పాలన : రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో వేడి కబుర్లు !

14 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, modinomics, Narendra Modi Failures, Ten years Narendra Modi rule, White Paper


ఎం కోటేశ్వరరావు


మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?


ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్‌,పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.


కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్‌ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.


పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్‌ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్‌ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.


ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్‌లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్‌, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నకిలీ వార్తల సృష్టి ఆద్యుడు మహాభారతంలో శ్రీకృష్ణుడా !

27 Saturday Jan 2024

Posted by raomk in Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, BJP, fake news, fake news in mahabharata, fake news in Ramayana, fake news stories, Propaganda War, Rational Thinking, RSS, Sri Krishna, Sri Rama


ఎం కోటేశ్వరరావు


రానున్న సంవత్సరాలలో ప్రపంచానికి 34 రకాల ముప్పులు ఉంటాయని, వాటిలో ఒకటైన తప్పుడు వార్తల సునామీ తొలుత మన దేశాన్నే తాకుతుందని దవోస్‌లో జరిగిన 54 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే నకిలీ వార్తల వరదలో నిండా తడిచిన జనం సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. అసలు మన జనం అలాంటి వార్తలను అంతగా ఎందుకు నమ్ముతున్నారు? వాటిని ఎవరు, ఎందుకు వండి వడ్డిస్తున్నారు. జనం గుడ్డిగా తాము తిని, ఇతరులకు ఎందుకు తినిపిస్తున్నారు అన్నది ప్రశ్న. ఇతిహాసాలుగా ఉన్న భారత రామాయణాలు, వాటి చుట్టూ అల్లిన పురాణాలు, వేల సంవత్సరాలుగా వాటిలోని అంశాలను ఎందుకు అని ప్రశ్నించకుండా మనల్ని మందమతులుగా, వాలునబడి కొట్టుకుపోయే వారిగా మార్చివేసిన మన పూర్వీకుల ఆచరణ- భావజాలమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఎందుకు అనటమే పెద్ద పాపం అన్నట్లుగా ప్రశ్నించే తత్వాన్నే అణచివేశారు. రావణుడికి పుష్పక విమానం ఉంది, అదే కాలంలో ఉన్న రాముడికి అదెందుకు లేదు ? ఈ ప్రశ్నవేస్తే ఉత్తిపుణ్యానికే అనేక మంది మనోభావాలను గాయపరుచుకుంటారు. సున్నా, ఇంకా ఇతర అనేక అంశాలను కనిపెట్టింది మనమే అని గొప్పగా చెప్పుకుంటాం.వాటి కొనసాగింపు నవకల్పనలు ఉంటే పారిశ్రామిక విప్లవం, తదుపరి కొనసాగింపుకు మనదేశమే కేంద్రమే అయి ఉండేది.పురాణాల్లో విమాన రూపకల్పన పద్దతి ఉందని గొప్పగా చెప్పుకుంటాం. వర్తమానంలో మన సంస్కృత పండితులు, శాస్త్రవేత్తలు వాటి ఆధారంతో ఆధునిక విమానాలను ఎందుకు రూపొందించలేకపోయారు ? ఇప్పటికైనా పైకీ, కిందికీ, ఎటుబడితే అటు, ఇంథనం లేకుండా తిరిగే పుష్పక విమానాల మాదిరి వాటిని అభివృద్ధి ఎందుకు చేయటం లేదు ? ప్రశ్న లేకుంటే మానవ జాతి ముందుకు పోయేది కాదు, ఆ ప్రశ్నకు అడ్డుగోడలు కట్టి మనువాదులు సమాజాన్ని వెనక్కు నడిపేందుకు చూశారు.ప్రశ్నించిన చార్వాకుల రచనలను సర్వనాశనం చేశారు.


వేల సంవత్సరాల క్రితమే మన దేశం సముద్రాలను దాటి విదేశీ వ్యాపారం చేసిందని చరిత్రలో చెప్పుకుంటాం. అలాంటి సమాజంలో సముద్రం దాటి విదేశాలకు వెళితే పాపం అనే సుభాషితాలు, ఆంక్షలు ఎలా వచ్చాయి. అవి రాకపోతే కొలంబస్‌కు బదులు అమెరికాను మనవారే ఎప్పుడో కనుగొని ఉండేవారు కదా ! అలాంటి అవకాశాలను లేకుండా చేసిందెవరు ? బౌధాయన సూత్రాల ప్రకారం విదేశీగడ్డ మీద హిందూమతానికి చెందిన వారు పవిత్రులుగా ఉండలేరు. సముద్రాలు దాటిన వారు కులాన్ని, పునర్జన్మ అవకాశం కోల్పోతారు.అందువలన సముద్రయానం నేరం, పాపం. దానికి పరిహారం కూడా చెప్పారు. అలాంటి వారు ఏం చేయాలంటే రెండు రోజులకు ఒకసారి కొద్దిగా ఆహారం తీసుకోవాలి, మూడు పూటలా స్నానం చేయాలి. పగలంతా నిల్చోవాలి, రాత్రి పూట కూర్చోవాలి. ఇలా మూడు సంవత్సరాలు చేస్తే పాపం నుంచి విముక్తి అవుతారు. ఎవరైనా అలాంటి పాపానికి, దానికి ప్రాయచిత్తానికి పూనుకుంటారా ? అందుకే నోరు మూసుకొని గిరిగీసుకొని ఉన్నారు. వాటిని ధిక్కరించిన వారు కూడా ఉన్నారు. భీమవరానికి చెందిన యార్లగడ్డ సుబ్బారావ్‌ వారిలో ఒకరు. ఆయన అమెరికా వెళ్లకుండా పౌరోహిత్యమో, కరణీకమో చేసుకుంటూ ఉండి ఉంటే ఫోలిక్‌ యాసిడ్‌ను కనుగొన్న ఘనత ఆయనికీ, భారతీయులుగా మనకీ దక్కేదా ?


చిత్రం ఏమిటంటే ఇప్పటికీ సముద్రాలు దాటిన వారిని తిరుమల తిరుపతి దేవుడి పూజారిగా అనుమతించటంలేదు(వికీపీడియా,ఇతర సమాచారం). బ్రిటన్‌లో న్యాయవాద విద్య అభ్యసించటానికి వెళ్లిన మహాత్మాగాంధీని కులం నుంచి వెలివేశారు. రాజస్థాన్‌ రెండవ మహారాజా సవాయి మధోసింగ్‌ 1901లో బ్రిటన్‌ వెళ్లాడు.హిందువులు విదేశీ నీటిని తాగకూడదన్న నిబంధన ఉన్న కారణంగా ఒక పాత్రలో నాలుగువేల లీటర్ల గంగా జలాన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు. ఉడిపి కృష్ట దేవాలయ పూజారిగా సుగేంద్ర తీర్ధ విధులు నిర్వహించటానికి వీల్లేదని 2007లో కొందరు స్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకటా, అతను విదేశాల్లో పర్యటించి సాగరోల్లంఘనకు పాల్పడినందుకు అని చెప్పారు. మరుసటి ఏడాది కోర్టు తీర్పు ప్రకారం పూజారిగా అనుమతి పొందారు. కేరళలోని తిరువళ్లలో ఉన్న శ్రీవల్లభ ఆలయంలోకి విష్ణునారాయణ నంబూద్రి లండన్‌ పర్యటించి వచ్చిన తరువాత పూజారిగా ప్రవేశించటానికి వీల్లేదని అడ్డుకున్నారు. పాపపరిహారం చేసుకోవాలని, 1008సార్లు గాయత్రీ మంత్రం పఠించి పునీతుడు కావాలని ఆంక్షలు విధించారు. దానికి అతను నిరాకరించారు.చివరికి తిరవాన్కూర్‌ దేవస్థానం బోర్డు జోక్యం చేసుకొని ఇద్దరు అధికారులను తొలగించింది.రాజీగా పవిత్ర జలాలను చల్లుకున్న తరువాత పూజారిగా అనుమతించారు. సనాతన ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించాలని చెబుతున్నవారు విదేశాలు తిరిగి రహస్యంగా ప్రాయచిత్తం చేసుకుంటున్న బహిరంగ రహస్యం తెలిసిందే.ఎవరైనా హేతువాదులు ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలను ప్రశ్నిస్తే సనాతన, హిందూ విరోధులు అంటూ సామాజిక మాధ్యమంలో, వెలుపలా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ అనేక దేశాలు తిరిగారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సనాతన ధర్మం ప్రకారం ఆయన ప్రాయచిత్తం చేసుకున్నట్లు ఎక్కడా వార్తలు చదవలేదు. రహస్యంగా ఏమైనా చేశారో తెలియదు.


ఇలాంటి చాదస్తాలతో మునిగి తేలుతున్న జనానికి డబ్బుకావాలి, దాంతోపాటు తరతరాలుగా గూడుకట్టుకున్న భయంతో ప్రాయచిత్తం చేసుకోవాలి. అందుకే ఒక చేత్తో డాలర్‌ పూజ మరో చేత్తో పోలేరమ్మకు సద్ది పెడుతున్నారు. డాలర్‌మే పరమాత్మాహై ! అందుకే వాటి కోసం ఎంతటి స్వదేశీ, సనాతన ధర్మ పరిరక్షకులైనా తలవంచాల్సిందే. ఇక్కడ హేతువు, ప్రశ్నను చంపేస్తున్నాం. వాలునబడి కొట్టుకుపోయేందుకు అలవాటు పడ్డాం గనుక గత తరాలు పుక్కిటి పురాణాలను నమ్మితే వర్తమానంలో వాట్సాప్‌ సందేశాలను మోసుకుపోయేందుకు సిద్దపడుతున్నాం. ఇక తప్పుడు వార్తల విషయానికి వస్తే అర్ధ సత్యం అనేది పూర్తి అబద్దమని బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పాడు. అబద్దాలు అనేక రకాలుగా ఉంటాయి, నిజానికి అలాంటి అవకాశాలు లేవన్నది ఒక సామెత. అసత్య ప్రచారం, అబద్దాలను వాస్తవంగా చిత్రించటం మనకు వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తోంది. వర్తమానంలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్‌ వీడియోలు, ఆడియోలు, తప్పుడు సమాచారం జనాన్ని పక్కదారి పట్టించటంలో భాగమే. మహాభారత కథ ప్రకారం తప్పుడు వార్తలు, మాయల సృష్టికర్తగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు ఎందుకు అలాంటి పని చేశాడు అంటే యుద్ధంలో ద్రోణుడిని చంపకపోతే పాండవులకు విజయం దక్కదన్న కారణమే. ఒక ఎత్తుగడపన్ని ధర్మరాజుతో అశ్వద్దామ హతహ అని పెద్దగా పలికించిన తరువాత నారో వా కుంజరో వా (మరణించింది మనిషి లేదా ఏనుగు కావచ్చు అని అర్ధం) అని పూర్తి చేసేటపుడు వినపడకుండా బాజాలు మోగించేట్లు చేయించాడని, దాంతో అశ్వద్దామ మరణించాడనే వార్త వ్యాపించింది. అది విన్న తండ్రి ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయటం, ద్రోణుడిని చంపివేయటంతో పాండవులు ముందుకు పోయారని చెబుతున్నది తెలిసిందే. తన కుమారుడికి చావులేదని తెలిసినప్పటికీ ద్రోణుడు అలా ఎందుకు అస్త్రసన్యాసం చేశాడంటే ధర్మరాజు మీద ఉన్న తిరుగులేని విశ్వాసం.


ఎవరినైనా గుడ్డిగా నమ్మితే తప్పుడు వార్తలు ఎంతగా ప్రభావితం చేసేదీ దీనిలో మనకు కనిపిస్తుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకే హిందూ, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాలకు చెందిన వారు, వాటిని ఆశ్రయించుకున్న వారు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల యుద్ధాన్ని ఏం చేసైనా గెలవాలన్న మహాభారత నీతి సూత్రమే గత రెండు లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు వార్తల వ్యాప్తికి తెరలేపింది.నాడు మహాభారత యుద్దంలో అలాంటి వార్తలతో పాండవులు గెలిచి ధర్మాన్ని నిలబెట్టారని చెబుతుంటే నేడు అపర మహాభారతంలో కౌరవులు గెలుస్తూ రాజధర్మాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెడుతున్నారు.జనం నమ్ముతున్నారు గనుక అది సాధ్యమౌతోంది. అందుకోసం మీడియా, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌) వంటి అస్త్రాలను వాడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక విదేశీ గడ్డ మీద మహాభారత రధం దొరికింది అని ఒక వీడియోను యూట్యూబ్‌లో పెడితే జనం వేలం వెర్రిగా చూశారు. నిజానికి అది 2018లో చైనా టీవీ నిర్మించిన ఒక డాక్యుమెంటరీలో చూపిన 255 సంవత్సరాల నాటి షాంగ్‌ రాజవంశ రధం. ఒక పురావస్తు ప్రదర్శనశాలలో చిత్రీకరించింది. అదే విధంగా భీముడి కుమారుడు ఘటోత్కచుడి భారీ కంకాళం దొరికిందని చెప్పినా జనం గుడ్డిగా నమ్మారు.


రావణుడి చెరలో ఉన్న సీత శీలం గురించి తప్పుడు వార్తల ప్రచారం కారణంగానే రాముడు ఏం చేశాడో తెలిసిందే. తాజాగా నటి రష్మిక మందన్నా మార్ఫింగ్‌ వీడియో సంచలనం, నిందితుడి అరెస్టు తెలిసిందే. బంగరు లేడి ఉండదని తెలిసినా దాన్ని పట్టుకురమ్మని సీత కోరటం ఏమిటి ? లక్ష్మణుడిని సీతకు కాపలాగా పెట్టి రాముడు ఆ లేడి వెంట వెళ్లటం, దాన్ని చంపటం, అప్పుడు లేడి రూపంలో వచ్చిన మారీచుడు ప్రాణం కోల్పోతూ కూడా రాముడి స్వరాన్ని అనుకరించి సీతా, లక్ష్మణా అని అరవటం, సీత కంగారు పడి లక్ష్మణుడిని వెళ్లి చూడమని కోరటం, ఏం కాదు అన్న తిరిగి వస్తాడని చెప్పినా వినకపోవటం, విధిలేక ఒక గీత గీసి దాన్ని దాటి వెలుపలికి రావద్దని లక్ష్మణుడు అడవిలోకి వెళ్లగానే రావణుడు మారువేషంతో రావటం, గీత దాటిన సీతను అపహరించటం తెలిసిందే. కొద్ది సంవత్సరాల క్రితం జెఎన్‌యులో దేశద్రోహ నినాదాలు చేశారంటూ మార్ఫింగ్‌ వీడియోలు సృష్టించిన కథకు, మాయలేడి ఉదంతానికి సంబంధం కనిపించటలేదూ ! రావణుడి ఆయుపట్టు గురించి రాముడికి చెప్పిన విభీషణుడు ధర్మం కోసం పనిచేసిన పవిత్రుడిగా ఆరాధిస్తాం. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో అలాంటి వారిని ఎదుటి పక్షం తయారు చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నది, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నవి అంటే రామాయణం నుంచే. మన సమాజ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నవారిని తప్పు పట్టాలా ? ఎలాంటి తర్క వితర్కం, హేతుబద్దత లేకుండా నమ్ముతున్నవారిని విమర్శించాలా ? కొన్ని దేశాలు ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఎందుకున్నాయి ? మనల్ని వాటిలో ముంచితేల్చుతున్నది ఎవరు ? విధి అనుకుందామా, వాట్సాప్‌ అందామా ? మన చేతుల్లో లేని విధి రాతగా భావించి అచేతనంగా ఉన్నా, మన ఫోన్లో ఉన్న వాట్సాప్‌ను అడ్డుకోకపోయినా నష్టపోయేది మనమే, కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాల రామాలయం ఓకే, కాలయాపన కమిటీలు, కోట్లాది రైతుల సంగతేమిటి మోడీ గారూ !

24 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

#Balk Ram, BJP, Farm Bills, MSP demand, Narendra Modi Failures, National Turmeric Board, Railway Zone in Vizag, Ram Temple politics, RSS, SC Sub-Categorisation, South Coast Railway Zone


ఎం కోటేశ్వరరావు


ఎట్టకేలకు అయోధ్య బాలక్‌ రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది. జనవరి 22న ఆ కార్యక్రమ కోసం ప్రధాని నరేంద్రమోడీ దేశం నలుమూలలా ఎంతలా తిరిగిందీ, ఎన్ని పొర్లుదండాలు, ఎక్కడ ఎన్ని మొక్కులు మొక్కిందీ చూశాము. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు కనిపిస్తున్నందున ఈ తాపత్రయాన్ని అర్ధం చేసుకోవటం కష్టం కాదు. పోయిన దేశ ప్రతిష్టను, దానితో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అధికారానికి వచ్చిన కొత్తలో విదేశాలు తిరిగిన తీరు, చేసిన హడావుడి చూశాము.సరే ఎవరెన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయని చరిత్రకెక్కిన పాలకుల సరసన చేరిన నరేంద్రమోడీ రామాలయ ప్రారంభాన్ని ప్రభుత్వ-సంఘపరివార్‌ కార్యక్రమంగా మార్చివేశారు. మతానికి ప్రభుత్వానికి ఉన్న గీతను చెరిపివేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, మనదేశ ప్రతిష్టను పెంచినట్లు ప్రచారం చేసుకున్నా చెప్పినంతగా పెట్టుబడులు రాలేదు.పలుకుబడి పెరుగుదలకు రుజువూ లేదు. మేడిన్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత సాకారం కాలేదు. ఇప్పుడు రామాలయం కోసం తిరిగినదానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయా ? ఏం జరిగిందీ, ఎందుకు జరిగిందీ దేశమంతా చూసింది. ఏం జరగనుందో చూద్దాం !


రామాలయం మీద చూపిన శ్రద్ద ప్రజల సమస్యల మీద నరేంద్రమోడీ చూపారా ? తమది పనిచేసే ప్రభుత్వమని మోడీ, బిజెపి కూడా చెప్పుకుంటుంది.పదేండ్లలో అలాంటిదేమీ కనిపించలేదు.అచ్చేదిన్‌లో ఆకలో రామచంద్రా అన్న పరిస్థితిని అంగీకరిస్తూ సబ్సిడీతో కూడా జనాలు కొనుక్కోలేని స్థితిలో (లేకుంటే ఉచితంగా ఇవ్వాల్సిన పనేముంది) ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ఉచిత ఆహార ధాన్యాల అందచేత పథకాన్ని పొడిగించారు. కొన్ని అంశాల్లో మోడీ సర్కార్‌ ఎక్కడలేని వేగాన్ని కనపరిచిన మాట వాస్తవం.బహుశా కనపడని శక్తి ఏదో నెడుతూ ఉండాలి. ఉదాహరణకు మూడు సాగు చట్టాలనే తీసుకుందాం.2020 సెప్టెంబరులో 17న లోక్‌సభ, 20తేదీన రాజ్యసభ ఆమోదం, 27న రాష్ట్రపతి అంగీకారం, పది రోజుల్లో అంతా జరిగింది. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించలేదు. ఎంత వేగంగా చట్టాలను రుద్దారో ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఎదురైంది. రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే సెప్టెంబరు 25న భారత బంద్‌కు పిలుపు ఇచ్చారు.వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులను రాజధానిలో ప్రవేశంచకుండా అడ్డుకోవటంతో నవంబరు 26 నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేశారు.చట్టాల అమలు మీద 2021 జనవరి 12 సుప్రీం కోర్టు స్టే విధించి, రైతుల చెబుతున్నదానిని వినాలంటూ ఒక కమిటీని వేసింది. అయినా రైతులు తగ్గలేదు.చివరకు నరేంద్రమోడీ దిగివచ్చి క్షమాపణలు చెప్పి మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు నవంబరులో ప్రకటించారు. డిసెంబరు ఒకటిన పార్లమెంటులో రద్దు బిల్లుతో ఉపసంహరించుకున్నారు.


రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు.ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ద చూపటం లేదు ? గతంలో సుప్రీం కోర్టు కమిటీ వేసిన నివేదిక, ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తరువాత నాలుగు నెలలకు బహిర్గతమైంది. దానిలోని అంశాలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదనలు తప్ప మరొకటి కాదు. అందుకే రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వం వేసిన కనీస మద్దతు ధరల కమిటీ నివేదిక లోక్‌సభ ఎన్నికలకు ముందే వస్తే అది రైతుల్లో చర్చకు దారి తీస్తుందన్న భయంతోనే కాలపరిమితి నిర్దేశించలేదు. కనీసం ముసాయిదా నివేదికలు కూడా సమర్పించలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఏమి సిఫార్సు చేస్తుందో అయోధ్య బాల రాముడికే ఎరుక.
రామాలయ నిర్మాణం పూర్తిగాక ముందే ప్రారంభోత్సవం జరపటం గురించి శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు.మనం కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పూర్తిగాక ముందే ప్రవేశ పూజలు చేసి తరువాత మిగతా పనులు చూసుకోవటంలేదా అని అనేక మంది సమర్ధించారు. నిజమే, ఇదే పద్దతి ఇతర వాటికి ఎందుకు వర్తింప చేయటం లేదు ?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అక్టోబరు నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు, ఆఫీసు ఏర్పాటు లేదు.దీని ఏర్పాటుకు వివాదాలేమీ లేవు. వేల కోట్ల ఖర్చూ కాదు. ఎందుకు తదుపరి చర్యలు లేవు. ముందు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి నిర్దేశించిన కార్యకలాపాలు ప్రారంభమౌతాయి. పరిశోధనలకు అవసరమైన భూమి కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి వీలుంటుంది. చిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పసుపు లేదు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పడుతుంది, అది రైతులకు ఎలా మేలు చేస్తుంది ? రాబోయే కాలానికే వదలివేద్దాం. అంతకు ముందు పసుపు రైతులకు బాండ్లు రాసిచ్చిన బిజెపి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి పసుపు బోర్డు కంటే ఇదే గొప్పది అని చెప్పుకున్నారు. అది రైతుల్లో పేలకపోవటంతో పసుపు బోర్డు గురించి మరో అంకాన్ని ప్రారంభించారు.


ప్రకటనలు చేయటం మీద ఉన్న శ్రద్ద అమలులో లేదని పదేండ్ల అనుభవం నిరూపించింది. రాష్ట్ర విభజన 2014చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటును పరిశీలించాలని ఉంది. ప్రత్యేక హౌదా వాగ్దానంపై మడమ తిప్పిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం దానికి బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామం బిజెపి మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దాంతో 2019 ఫిబ్రవరి 27న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు, దాని మీద స్పందించినట్లు ప్రచారం చేశారు.వారు ఐదేండ్లు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోమారో తెలియదు. మరోసారి లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు రైల్వే జోన్‌ ఏర్పడలేదు. అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అదుగో ఇదిగో అంటూ చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఇవ్వలేదన్నారు. ఫలాన చోట ఇస్తామని చెప్పిన తరువాత దాని మీద నిర్ణయం తీసుకోలేదంటూ కాలంగడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే జోన్‌ ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఉంచేందుకు విశాఖలో అద్దె భవనాలే దొరకవా ? ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించిన తరువాతే జోన్‌ ఏర్పాటు చేస్తారా ? రాజకీయం గాకపోతే మరొకటేమైనా ఉందా ?


విశాఖ ముడసర్లోవలో ప్రతిపాదిత రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి 52.2ఎకరాలు ఇస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇంకా భూమిని గుర్తించాల్సి ఉందని, దాన్ని ఆమోదించాలని, ప్రాజెక్టు నివేదిక సిద్దంగా ఉందని 107 కోట్ల రూపాయలను మంజూరు చేశామని డిసెంబరులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కె రామమోహన్నాయుడి ప్రశ్నకు సమాధానంలో చెప్పారు.2023-24 బడ్జెట్‌లో పది కోట్లు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. జోన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నలకు సమాధానం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు నెల రోజుల క్రితం మాట్లాడుతూ ముడసర్లోవ భూములను అధికారులు ఖరారు చేశారని, నిర్మాణ జాప్యం ఎందుకో అర్దం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఖరారులో చాలా ఆలశ్యం చేసిందన్నారు.విశాఖ జోన్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖ డివిజన్ను రద్దు చేసి మూడు ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను రాయఘఢలో మరో ముక్కను ఖుర్దా, మూడో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేస్తారు. ఈ జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ప్రధాన కేంద్రంలో డివిజన్‌లేని జోన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుంది.


బిజెపి ఓట్ల రాజకీయంలో భాగంగా తెలంగాణా ఎన్నికలకు ముందు షెడ్యూలు కులాల ఉపవర్గీకరణ గురించి వాగ్దానం చేసింది. కానీ దానికి ఎలాంటి ఫలితమూ దక్కలేదు.అయిననూ ప్రయత్నించి చూడవలె అన్నట్లుగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణలో ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం తప్ప ఈ కమిటీ ఏం చేస్తుందన్నది అనేక మందిలో ఉన్న సందేహం.ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ సమస్య మీద దశాబ్దం క్రితం అధికారానికి వచ్చిన బిజెపి చేసిందేమిటి? అన్నది సమాధానం లేని ప్రశ్న.ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉన్నందున నిజానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసేందుకు పూనుకోవచ్చు.ఆ పని చేయలేదు. కాబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందా ?ఉండేట్లయితే కమిటీ చేసే పనేమిటి ? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ? అందుకే దీన్ని ఓట్ల ఆకర్షణ కమిటీ అంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల : బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !! ఎన్నికల ఎత్తులు, పొత్తులు !!!

29 Friday Dec 2023

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, tdp, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, AP Assembly Elections 2024, AP Politics, BJP, CHANDRABABU, CPI, CPI(M), Pawan kalyan, YS jagan


మన్నెం కోటేశ్వరరావు


వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీ నేత వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమైంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోపని చేసేందుకు ఒక బాధ్యత అప్పగిస్తారనే వార్తలు, అది రాష్ట్ర అధ్యక్ష పీఠం లేదా దానికి సమానవమైన మరొకటి అనే ఊహాగానాలు వెలువడ్డాయి. 2024 ఎన్నికల పూర్వరంగంలో ఒక మానసిక తంత్ర క్రీడ(మైండ్‌గేమ్‌) ప్రారంభమైంది. రాష్ట్ర బాగు కోసమంటూ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు చండీయాగం,హౌమాలు నిర్వహించారు. వర్తమాన, భవిష్యత్‌ పరిణామాల గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రభావం అన్ని పార్టీల మీదా పడింది. బిజెపి తమతో కలవాలని అంటున్న తెలుగుదేశం-జనసేన కూటమి దానితో నిమిత్తం లేకుండానే సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా సభల నిర్వహణ తదితర అంశాల గురించి కసరత్తు ప్రారంభించింది.ఎన్నికల సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే, సర్వేలు నిర్వహించే సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం సంబంధం లేదని గతంలో ప్రకటించిన ప్రశాంత కిషోర్‌ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావటం చర్చనీయాంశమైంది. బెంగలూరు విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ భేటీ ఊహాగానాలకు తెరలేపింది. జనంలో, స్వంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలలో కొందరికి ఉద్వానస పలికేందుకు నియోజకవర్గాల బదిలీలకు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పూనుకున్నారు. ఇలాంటి మార్పులు 90కిపైగా నియోజకవర్గాలలో జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నప్పటికీ 50 చోట్ల ఉండవచ్చని రాష్ట్ర వైసిపి నేత ఒకరు చెప్పారు. ముఫ్పై మందికి ఉద్వాసన ఉంటుందని, ఇరవై మందిని అటూ ఇటూ మార్చవచ్చన్నారు.


టీ కప్పులో తుపాను !
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరు కావాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా హైదరాబాదులోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతో అంగీకరించినట్లు చెబుతున్నారు.ఈ వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఊహాగానాలే తప్ప ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరికి పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లటంతో ఈ అంశం టీకప్పులో తుపానులా ముగిసింది.ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని తెలుగుదేశం చెబితే, ఘోరంగా విఫలమైందని వైసిపి వర్ణించింది.


ఎన్నికల గోదాలో దిగిన పార్టీలు !
ఇంకా ఎన్నికల ప్రకటన జరగకపోయినా ఒక విధంగా అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల గోదాలోకి దిగాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ నామమాత్రంగా మారటం విశేషం. అవి 2019 అసెంబ్లీ ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. గతంలో వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిన వాసగిరి వెంకట ( జెడి) లక్మీనారాయణ దానికి భిన్నంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ పేరుతో స్వంత దుకాణం తెరిచారు. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వైఎస్‌ జగన్‌ మీద నమోదైన కేసులను విచారించిన అధికారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసిపి తిరస్కరించి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయమైతే, ఆయనతో ఒక పార్టీని పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక కాపు ఓట్లను చీల్చేందుకు చూస్తున్నట్లు మరొక ప్రచారం జరుగుతోంది.దేన్నీ కొట్టివేయలేము.ప్రధాన పార్టీలలో అవకాశం రాని వారు అనేక మంది తమ బలాన్ని పరీక్షించుకొనేందుకు, ప్రచారం కోసం ఇలాంటి కొత్త పార్టీల తరఫున పోటీ చేశారు.


వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంత ఉంటుంది !
రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరనున్న వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరితే నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా నేతల సూచన మేరకు అధిష్టానం కూడా ఆమె చేరికను వాయిదా వేసింది. ఆమె చేరగానే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు వస్తాయనుకొనేందుకు తగిన వాతావరణం లేదు. షర్మిలను చేర్చుకొని వెంటనే అధికారానికి రాకున్నా పార్టీని పునరుద్దరించవచ్చనే అంచనాలో కేంద్ర నాయకత్వం ఉంది.తెలుగుదేశం – జనసేన-వైసిపి నేతల మాదిరి బూతులకు దూరంగా ఉన్నప్పటికీ జగన్మోహన రెడ్డి పాలనను షర్మిల తెగనాడితే వైసిపి నేతలు ఊరుకుంటారా అన్నది ప్రశ్న. తిడదామంటే అక్క కూతురు, కొడదామంటే కడుపుతో ఉంది అన్న పరిస్థితి వైసిపికి ఎదురుకావచ్చు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా జరగవచ్చు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపి కోసం పాకులాడకుండా కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిస్తే షర్మిల ప్రచారం ఆ కూటమి మొత్తానికి ఉపయోగపడుతుంది. స్వంత చెల్లెలికే అన్యాయం చేసినట్లు మాట్లాడుతున్న తెలుగుదేశం-జనసేన నేతల ప్రసంగాల తీరు ఒక ఎత్తు బాధితురాలిగా అన్న మీద వైఎస్‌ షర్మిల ధ్వజం మరొక ఎత్తుగా ఉంటుంది.ప్రచారానికి మంచి ఊపువస్తుంది. తీవ్రమైన పోటీ ఉన్నపుడు ప్రతి ఒక్క ఓటునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.తెలుగుదేశం కూటమి అలాంటి ఆలోచన చేస్తుందా ? తెలుగుదేశం-జనసేనల్లో చేరేందుకు అవకాశం లేని వైసిపి అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌ వేదికగా మారవచ్చు. బిజెపితో సంబంధాల గురించి చంద్రబాబు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. ఓట్ల రీత్యా చూసుకుంటే కాంగ్రెస్‌తోనే ప్రయోజనం ఎక్కువ.వాటి సంబంధాల గురించి అలాంటి సూచనలు ప్రస్తుతం లేనప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడేం జరిగేదీ దేన్నీ కాదనలేం. నారా లోకేష్‌కు షర్మిల పంపిన క్రిస్మస్‌ బహుమతి అలాంటిదే. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఎత్తుగడ లేకుండా ఇలాంటివి జరగవు. షర్మిల ప్రభావంతో వైసిపి ఓట్లను కాంగ్రెస్‌ చీల్చినా లేదా బిజెపి లేని పార్టీల కూటమిలో చేరితే దానితో పాటు ఇతర పార్టీలకూ అది ప్రయోజనకరం.


పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మాప్‌ పంపని బిజెపి !
బిజెపి తమకు రోడ్‌ మాప్‌ ఇవ్వాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే పార్టీ ఆవిర్భావ సభలో కోరిన సంగతి తెలిసిందే.నిజానికి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మిత్రపక్షమైన బిజెపికి రోడ్‌ మాప్‌ ఇవ్వాలి. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని 2020లోనే నిర్ణయించుకొని ఒప్పందం కూడా చేసుకున్నందున వారిద్దరూ కూర్చుని రోడ్‌ మాప్‌ను తయారు చేసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌ జైల్లో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఇది జరిగింది. జనసేనతో తామింకా భాగస్వామ్య పక్షంగా ఉన్నామని చెబుతూనే ఈ పరిణామం గురించి బిజెపి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. జనసేన పార్టీ ఎన్‌డిఏలో చేరింది. తెలంగాణా ఎన్నికల్లో బిజెపితో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు పొగొట్టుకుంది. చివరి క్షణంలో తెలుగుదేశం-జనసేన కూటమితో చివరి క్షణంలో చేరవచ్చనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అదే జరిగితే వచ్చే లాభనష్టాలు ఏమిటన్నది తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. తెలంగాణాలో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడ దరిదాపుల్లో లేదు. దాని సిఎం అభ్యర్ధులుగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌,బండి సంజరు ఇద్దరూ ఓడిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బిజెపి బలం 6.98 నుంచి 13.9శాతానికి పెరిగినా తెలంగాణాలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 19.65 శాతం ఓట్లతో పోల్చుకుంటే 5.75శాతం తగ్గాయి.


బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి. వైసిపి 49.96 , తెలుగుదేశం 39.17, మూడవ కూటమిగా పోటీసిన పార్టీలలో జనసేన(137) 5.53,సిపిఎం(7)0.32, బిఎస్‌పి(21)0.28, సిపిఐ(7)0.11 శాతాలు తెచ్చుకున్నాయి. నోటాకు 1.28 ,కాంగ్రెస్‌కు 1.17, బిజెపికి 0.84 శాతం వచ్చాయి. బిజెపితో తెలుగుదేశం ఉన్నపుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ముస్లిం మైనారిటీల్లో 66శాతం ఓట్లు పొందగా, 2019 ఎన్నికలకు ముందు బిజెపితో సంబంధాల కారణంగా అది 49శాతానికి తగ్గినట్లు, తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడు వారి మద్దతు తగ్గిందని లేనపుడు పెరిగిందని ” పీపుల్స్‌ పల్స్‌ ” పరిశోధకుడు ఐవి.మురళీ కృష్ణ శర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని తెలుగుదేశంలో కొందరు భయపడుతున్నారు. వైసిపి నవరత్నాలతో గ్రామీణ ప్రాంతాలలో గతం కంటే కొంత మద్దతు పెంచుకున్నట్లు చెబుతున్నా పట్టణాల్లో మద్దతు తగ్గిందని, మొత్తంగా మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఇతర స్కీముల సిబ్బంది, కార్మికులలో మద్దతు కోల్పోయినట్లు, ఆ మేరకు తెలుగుదేశం, జనసేన బలపడినట్లు ఒక అంచనా.ఈ పూర్వరంగంలో ప్రతి ఓటునూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కేవలం 4,81,868 లేదా 2.05శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణాలో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.పైకి ఏమి చెప్పినప్పటికీ ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమితో బిజెపి సంబంధాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు స్పందించిన తీరు ఇలా ఉంది.


వామపక్షాల వైఖరేంటి !
” బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నపార్టీలతో ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లకు మేము సిద్దం కాదు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపితో సంబంధాల గురించి స్పష్టత ఇచ్చినపుడు, రాజకీయంగా దానికి వ్యతిరేక వైఖరి తీసుకుంటే పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.లేనట్లయితే ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి లేదా అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ వివిధ అంశాలపై తీసుకొనే వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కానందున దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఎన్నికలకు ముందు వెల్లడిస్తాం.”
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇలా చెప్పారు.” బిజెపితో సంబంధాలు పెట్టుకోవద్దని అనేక ఉద్యమాలలో కలసి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీతో చెబుతున్నాం. ఒక వేళ పెట్టుకుంటే ఆ కూటమితో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్‌డిఏ కూటమిలోని జనసేన బిజెపితో సంబంధం లేకుండా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశంతో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. జనసేనను లౌకిక పార్టీగానే పరిగణిస్తున్నాం.జెడి లక్ష్మీనారాయణ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎలాంటి విధానాలను అనుసరిస్తారో వేచి చూస్తాం ”


ప్రశాంత కిషోర్‌ కలయిక్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసుకొని చర్చలు జరిపారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లేందుకు వచ్చానని మాత్రమే ముక్తసరిగా ఆయన చెప్పారు. దాన్ని ఎవరూ విశ్వసించటం లేదు. ప్రశాంత కిషోర్‌ గెలిచే పార్టీలకే సలహాలు చెబుతారనే ఒక అభిప్రాయం ఉంది.(బిఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ప్రశాంత కిషోర్‌తో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలను పక్కన పెట్టాలన్న సలహాను కెసిఆర్‌ విస్మరించినందునే అలా జరిగిందని చెప్పేవారు లేకపోలేదు.) ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌లో భాగమని, దాని వలన తెలుగుదేశం కూటమికి కలసి వచ్చేదేమీ లేదని వైసిపి రాష్ట్ర సంయుక్తకార్యదర్శి కారుమూరి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత కిషోర్‌ ప్రస్తుతం అలాంటి సలహాలు ఇవ్వటం లేదని, అతనికి ఎలాంటి బృందాలు కూడా లేవని అన్నారు.జెడి లక్ష్మీనారాయణ పార్టీ వెనుక తమ పార్టీ హస్తం వుందనటం వాస్తవం కాదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు, కాంగ్రెస్‌తో సయోధ్యకు ఒప్పించేందుకు ప్రశాంత కిషోర్‌ వచ్చినట్లు కూడా చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్దా మీది కూలీ మాదిరి రాష్ట్ర ఆర్థిక స్థితి: భారాలు మోపితే జనానికి ఆగ్రహం ! రేవంత రెడ్డి కత్తిమీద సాము !!

23 Saturday Dec 2023

Posted by raomk in BRS, Congress, Current Affairs, Economics, NATIONAL NEWS, Politics, Telangana

≈ Leave a comment

Tags

A Revanth Reddy, Telangana CM, Telangana CM Revanth Reddy, Telangana White Papers


ఎం కోటేశ్వరరావు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒక మంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి మీద కూడా వెంటనే ప్రకటిస్తారని ఆశిద్దాం. వీటికి పోటీగా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని బిఆర్‌ఎస్‌ ప్రకటించింది. మథనం జరగటం మంచిదే. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందన్నది ఒక సామెత. అధికారానికి వచ్చిన కొత్తలో గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు శ్వేత పత్రాను విడుదల చేశాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.పైకి ఎన్ని సుభాషితాలను వల్లించినా మీడియా రాజకీయ శిబిరాల వారీ చీలి నాణానికి ఒకవైపు మాత్రమే చూపుతూ తాను మద్దతు ఇచ్చే పక్ష ప్రతికూల సమాచారాన్ని తొక్కిపెడుతున్నది. చాకుతో కూరగాయలతో పాటు మెడను కూడా కోయవచ్చు. శ్వేతపత్రాలు కూడా అలాంటివే. జనానికి వాస్తవాలు చెప్పే మంచితో పాటు ఆ సమాచారాన్ని చూపే పాలకులు వాగ్దాన భంగాలకూ పాల్పడవచ్చు. గత అనుభవాన్ని బట్టి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు.


తెలంగాణా ఆర్థిక స్థితి గురించి వెల్లడించిన పత్రంలోని వివరాలు, రాష్ట్ర సర్కారుకు ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. గత పాలకులు చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది..2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి. ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాల బకాయిలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది. ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం వరకు అప్పులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 27.8శాతంగా ఉన్నాయి. ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి. దీంతో రాష్ట్ర రుణ అర్హత పరిమితి తగ్గింది.


బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22లో పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతరులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్టుల రూపంలో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది. అడ్డామీద కూలీకి ఏరోజు పని దొరికితేనే ఆ పూట భుక్తి. రాష్ట్ర స్థితి కూడా అలాంటిదే. ఈ కారణంగానే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు.(ప్రస్తుతం రేవంత రెడ్డి రైతు బంధును కూడా దశలవారీ విడుదల చేస్తున్న కారణం అదే.) .2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరిగింది. 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.


నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. దీనికి జనాభా ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు అంటే 41.68శాతం ఉంది.( రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు వాటిలో పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు)


ఇక విద్యుత్‌ రంగ పరిస్థితి మీద విడుదల చేసిన పత్రంలో ఉన్న వివరాల ప్రకారం పది సంవత్సరాల నాడు పంపిణీ కంపెనీలు(డిస్కామ్స్‌) రు.12,186 కోట్ల నష్టాలతో ఉండగా ప్రస్తుతం రు.62,461 కోట్లకు చేరాయి. ప్రభుత్వ బకాయిలే రు.43,770 కోట్లు ఉన్నాయి.విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌ ముందు ప్రతిపాదించి ఆమోదం పొందిన దానికన్నా వాస్తవిక వ్యయం పెరిగితే దాన్ని ట్రూ అప్‌ ఛార్జీలు అంటారు.తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధర రు.5.86 నుంచి గరిష్టంగా రు.20వరకు ఉంది.ఒక్క 2022-23లోనే ట్రూఅప్‌ ఛార్జీల మొత్తం రు.12,550 కోట్లు. ఇవిగాక క్రమబద్దీకరణ కమిషన్‌ ఆమోదం పొందిన సమయంలో విద్యుత్‌ తయారీకి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ వంటి ఇంథన ధరల్లో పెరుగుదల ఎంత ఉంటే అంత సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయవచ్చు.ఇవి, ట్రూఅప్‌ ఛార్జీలను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలి లేదా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత భారం జనాల నుంచి వసూలు చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలను గమనంలో ఉంచుకొని వాటిని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఇంతవరకు చెల్లించలేదు. ఇవన్నీ భారాల రూపంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.


బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నప్పటికీ వివిధ ఖాతాల్లో చూపుతారు. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చటం సామాన్యులకు సాధ్యం కాదు గనుక వాటి జోలికి పోరు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి. ఈ పత్రాలపై చర్చ సందర్భంగా అసెంబ్లిలో, వెలుపలా అధికార పార్టీకి చెందిన వారు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని, అధికారికంగా సమీక్షల్లో చూసిన తరువాతనే తీవ్రత అర్ధమైందని మాట్లాడుతున్నారు. వీటిని చూస్తే గతం గుర్తుకు వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేత వై.ఎస్‌ .జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్నారు. తరువాత అడ్డం తిరిగి దాని గురించి తెలియక మేము వాగ్దానం చేశాము, దాని బదులు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి మడమ తిప్పారు.ఐదు సంవత్సరాల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే మానుకున్నారు. ఎందుకంటే దాని మీద వచ్చే రాబడిని వదులుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ఆర్థికంగా పరిస్థితి దిగజారి నవరత్నాలకు కోతపెట్టాల్సి వస్తుందన్నదే దీని వెనుక ఉన్న అసలు కారణం. తెలంగాణా రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది. తీరా అడ్డం తిరిగి కొనటానికి భూమి లేదని తప్పించుకున్నది.ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పుకోవచ్చు.


రేవంత రెడ్డి సర్కార్‌ ముందు తీవ్ర సవాళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులుకేటాయించి విద్యుత్‌ సంస్థలు, ఇతరులకు పెద్ద ఎత్తున బకాయి పెట్టింది. అప్పులు తెచ్చుకొనే అవకాశాలన్నింటినీ వాడుకొని కొత్తగా పుట్టకుండా చేసింది. వడ్డీ, అసలు వాయిదాలకే పరిమితంగా తీసుకొనే అప్పు సరిపోదు. రైతు బంధు పధకంలో పెద్ద రైతులకు మినహాయిస్తామని చెప్పినందున దాని వలన పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే అర్హులకు గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పటంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలకు నగదు అందిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.లబ్దిదారుల గుర్తింపు విధి విధానాలను ఇంకా ప్రకటించలేదు.లోక్‌సభ ఎన్నికలలోపు వాటిని విడుదల చేస్తే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతున్నారు గనుక అప్పటి వరకు శ్వేత పత్రాలు, వాటి మీద చర్చ, తక్షణమే నగదుతో పనిలేని పధకాలను ప్రారంభించవచ్చు. విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టినందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అంత పెద్ద మొత్తాలను వెంటనే ఎలా తీరుస్తుందన్నది ప్రశ్న. ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు పెరిగేవే తప్ప తగ్గవు.వడ్డీల చెల్లింపు తప్పదు.ఈ కారణంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు కాకుండా సాగదీసే అవకాశం ఉంది. తక్షణమే వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పినందున సహజంగానే జనం కూడా అలాగే ఎదురు చూస్తారు.ఫిబ్రవరి లేదా మార్చినెలలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తప్ప పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు గనుక ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో వెంటనే జనానికి తెలిసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై నిరంతర వక్రీకరణలతో కొందరికి అదో ” తుత్తి ” !

21 Thursday Dec 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

#Anti China, #media lies on China, anti china, China economy, China exports, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


సంస్కరణల బాట పట్టిన 1978 నుంచీ చైనాలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతికూలంగా స్పందించకపోతే ప్రపంచ మీడియాకు రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. రాసేవారి బుర్ర ఎంతో పదునుగా ఉంటోంది గనుకనే పదే పదే కొత్త కొత్త ”కత”లతో జనం ముందుకు వస్తున్నారు.యుద్ధాలలో అమాయకులు బలౌతున్నట్లే వర్తమాన ప్రచార దాడులలో అనేక మంది మెదళ్లకు గాయాలై సరిగా పనిచేయటం లేదు. ఆ ప్రచారం వారికి ఒక సినిమాలో చెప్పినట్లు అదో తుత్తి (తృప్తి) నిస్తోంది. కరోనా నిరోధానికి విపరీత కట్టుబాట్లతో చైనా కుప్పకూలిపోయిందని చెప్పి కొందరు సంతోషించారు. నమ్మినవారిని వెర్రి వెంగళప్పలను చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రపంచ వస్తువుల ఎగుమతుల విలువ 2022లో 25లక్షల కోట్ల డాలర్లు. దానిలో కేవలం పదకొండు పెద్ద ఎగుమతి దేశాల వాటా 12.8లక్షల కోట్లు. మిగతా దేశాలన్నింటిదీ 12.1లక్షల కోట్లే. కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామని, దేశాన్ని తిరిగి అభివృద్ది పట్టాల మీద ఎక్కించామని మన కేంద్ర ప్రభుత్వం, బిజెపి ఎంతగా చెప్పుకున్నా తొలి పదకొండు దేశాల జాబితాలో లేదు.చివరికి పదో స్థానంలో ఉన్న హాంకాంగ్‌(చైనా) ప్రాంత ఎగుమతులు 609.9 బి.డాలర్లు కాగా మనవి 453.5 బి.డాలర్లు మాత్రమే. ప్రధమ స్థానంలో ఉన్న చైనా 3.6లక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేసింది. అంటే 14.4 శాతం వాటా కలిగి ఉంది. తరువాత ఉన్న అమెరికా 8.4శాతం కలిగి ఉంది.2009 నుంచి చైనా తన ప్రధమ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దాన్ని అధిగమించి తెల్లవారేసరికి మన దేశాన్ని ముందుకు తీసుకుపోతామని నరేంద్రమోడీ అండ్‌కో చెబుతుంటే జనం నిజమే అని నమ్ముతున్నారు.


ఇటీవలి కాలంలో తమ విదేశీ వాణిజ్యం తిరిగి పట్టాలకు ఎక్కటం ప్రారంభమైందని చైనా ప్రకటించింది.ఆగస్టు నుంచి తిరోగమనంలో ఉన్నది గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది 1.2శాతం పెరిగిందని అధికారులు ప్రకటించారు. అమెరికాకు గత పద్నాలుగు నెలలుగా తగ్గుముఖం పట్టిన ఎగుమతులు కూడా 9.6శాతం అధికంగా ఉన్నాయి. చైనా చెప్పిన అంకెలను ఎప్పుడూ నమ్మని నిత్యశంకితులు, తమకు అనుకూలం అనుకున్నవాటిని మాత్రమే చెప్పేవారు ఉంటారన్నది తెలిసిందే. ఎవరు నమ్మినా నమ్మకున్నా చైనాకు పోయేదీ, ఇతర దేశాలకు వచ్చేదేమీ లేదు.డిసెంబరు పద్నాలుగవ తేదీన ఎకానమిస్ట్‌ పత్రిక ” తన ఎగుమతి విజయాన్ని చైనా తక్కువ చేసి చూపుతోందా ” అంటూ ఒక విశ్లేషణను ప్రచురించింది. గడచిన రెండు దశాబ్దాలలో తన వాణిజ్య మిగులును సబ్సిడీలుగా ఇచ్చి ఎగుమతులతో ఇతర దేశాల్లో ఉపాధిని హరించిందని, ఇప్పుడు విద్యుత్‌ కార్లను వేగంగా ఉత్పత్తి చేసిన తన వాణిజ్య భాగస్వాములను ఆందోళనకు గురి చేస్తోందని కూడా దానిలో పేర్కొన్నారు. చైనా వాణిజ్య మిగులు ఇప్పుడు 312బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా విదేశీ మారక ద్రవ్య యంత్రాంగం(సేఫ్‌) పేర్కొన్న అంకెలు నిజమేనా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. అమెరికా విదేశీ సంబంధాల మండలికి చెందిన బ్రాడ్‌ సెట్సర్‌, ఆర్థిక వ్యవహారాల వ్యాఖ్యాత మాథ్యూ కెలిన్‌ అభిప్రాయాలను దానిలో ఉటంకించారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసినపుడు చైనా మిగులు ఎక్కువగా ఉన్నప్పటికీ నాటకీయంగా తక్కువ చేసి చూపుతున్నారని, విదేశీ ఆస్తుల నుంచి వచ్చిన రాబడి, ఎగుమతులను తక్కువగా చూపుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రకటించిన మిగులు కంటే రెండువందల బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంటాయని సెట్సర్‌ చెప్పాడు.చైనా నుంచి లెక్కల్లో చూపకుండా విదేశాలకు తరలుతున్న పెట్టుబడులను దాచి పెట్టేందుకు చూస్తున్న కారణంగానే తక్కువ చేసి చూపుతున్నారని వారు ఆరోపించారు. తక్కువ-ఎక్కువ ఏది చెప్పినా ఇతరులకు నష్టం ఏమిటి ? గడచిన ఆరు నెలల్లో తొలిసారిగా చైనా ఎగుమతులు పెరిగినందున అక్కడి ఫ్యాక్టరీలకు ఎంతో ఉపశమనం కలిగించిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ధరలు తగ్గించిన కారణంగా ఎగుమతులు పెరిగాయని, ఇలా ఎంతకాలం కొనసాగిస్తారని కొందరు అనుమానాలు వెల్లడించారు. ఎక్కువగా ఎగుమతులు ఎలక్ట్రానిక్‌ యంత్రాలు, కార్లు ఉన్నాయని, ఐరోపా, రష్యాలో ఉన్న గిరాకీ కారణంగా ఎగుమతులు ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. విదేశీ వాణిజ్యలోటు ఉన్న మన దేశమే ఎగుమతి ప్రోత్సాహకాల పేరుతో ఎగుమతిదార్లకు రెండు లక్షల కోట్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వచ్చే రాయితీల మేరకు మన దేశంలోని వారు కూడా వస్తువుల ధరలను తగ్గించి దిగుమతిదార్లను ఆకర్షిస్తారు. వ్రతం చెడ్డా మనకు ఫలం దక్కటం లేదు.


చైనా జిడిపి వృద్ధి రేటు 2024లో 4.8 నుంచి 4.4శాతానికి తగ్గుతుందని ప్రపంచబ్యాంకు తాజాగా పేర్కొన్నది. అక్కడి ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేనంత దుస్థితిలో లేదని అమెరికాలోని నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ నాన్సీ క్వియాన్‌ చెప్పారు.ఓయిసిడి దేశాలైన స్వీడెన్‌, స్పెయిన్‌, ఇటలీ వంటి వాటితో పోలిస్తే యువతీ యువకుల్లో నిరుద్యోగం పెరుగుదల చైనాలో తక్కువ అని ఆమె అన్నారు. ఇటీవలి దశాబ్దాలలో సాధించిన ప్రగతితో పోల్చిచూస్తే తాజాగా చిన్నపోయినట్లు కనిపించవచ్చు తప్ప మరింకేమీ కాదని చెప్పారు.చైనా వాణిజ్య మిగులు పెరిగితే విదేశాల్లో ప్రతిగా రక్షణాత్మక చర్యలు పెరిగే అవకాశం ఉందని బాకోని విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ గ్రోస్‌ చెప్పాడు. చైనా అనుసరిస్తున్న విధానాల కారణంగానే అక్కడ రియలెస్టేట్‌ బుడగ ఎప్పటి నుంచో తయారవుతున్నదని ఇప్పుడు పేలిందని కొందరు చెబుతున్నారు. దానిలో భాగంగానే ఎవర్‌గ్రాండే కంపెనీ చెల్లింపుల సంక్షోభంతో అమెరికాలో దివాలా రక్షణ కోరింది. దీన్ని చూసి ఇంకే ముంది చైనా మొత్తం దివాలా తీయనుందని ఊదరగొట్టారు. ఒక నిర్మాణ కంపెనీ చేతులెత్తేస్తే దానిలో లాభాల కోసం పెట్టుబడులు పెట్టిన వారు దెబ్బతింటారు. దాని దగ్గర ఉన్న భూములు, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు ఎక్కడకూ పోవు. ప్రభుత్వం లేదా మరొక సంస్థ వాటిని పూర్తి చేస్తుంది. చైనా సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు..అక్రమాలకు పాల్పడితే బాధ్యులైన వారు కటకటాలపాలు కావాల్సిందే.దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు చైనా నిపుణులు అనేక ప్రయోగాలు చేశారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న పూర్వరంగంలో నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులను చైనా ప్రోత్సహించింది. ఇప్పుడు తలెత్తిన సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నది. 2010లో అక్కడ ఇళ్లు కొనే వయస్సులో ఉన్న జనాభా 20 కోట్ల మంది ఉంటే అది 2020నాటికి 22 కోట్లకు చేరి అప్పటి నుంచి తగ్గుతున్నది. ఎవర్‌ గ్రాండే సమస్యలు కూడా ప్రారంభం అప్పుడే.2030 నాటికి పదిహేను కోట్లకు తగ్గి తరువాత 2040 నాటికి 16 కోట్లకు పెరుగుతుందన్నది ఒక అంచనా కాగా 12 కోట్లకు తగ్గవచ్చన్నది మరొక అభిప్రాయం. ఒక కుటుంబంలో ఇల్లు కొంటే అది తరువాత తరాలకూ ఉంటుంది, అందువలన గిరాకీ ఎప్పుడూ ఒకేమాదిరి ఉండదు.


అలాగే ఒక బిడ్డ విధానం. అది ప్రతికూల సమస్యలను ముందుకు తెచ్చినట్లు గ్రహించగానే దాన్ని ఎత్తివేశారు. సంస్కరణల ప్రారంభంలో జనాభా ఎక్కువగా ఉండటం, వారికి అవసరమైన ఆహారధాన్యాలు పండించేందుకు సాగు భూమి తక్కువగా ఉండటంతో కుటుంబనియంత్రణకు పూనుకున్నారు. మనదేశంతో పోలిస్తే 1980లో తలసరి సాగు భూమి అక్కడ 40శాతమే. అది వాస్తవం కాదని, అంతకంటే ఎక్కువగా ఉందని తరువాత సర్వేల్లో తేలింది. 2022లో మనదేశ సాగుభూమిలో 77శాతమే చైనాలో ఉంది.కానీ అక్కడి ధాన్య ఉత్పత్తి మనకంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.చైనాలో భూమిని ”ము ” ప్రమాణంలో కొలుస్తారు(ఒక ము మన పదహారు సెంట్లకు సమానం).ఒక ము విస్తీర్ణంలో 1980లో 196కిలోల తృణధాన్యాలు పండితే 2021నాటికి 421 కిలోలకు పెరిగింది. అందువలన సాగు భూమిని బట్టి జనాభా ఉండాలన్న అవగాహన తప్పని తేలింది. అయినప్పటికీ చైనా ఇప్పటికీ తన ఉత్పత్తిలో ఐదో వంతుకు సమంగా దిగుమతులు చేసుకుంటున్నది. ప్రస్తుతం ఉన్న 195 కోట్ల ” ము ”లకు తోడు మరో 85 కోట్ల ము లను సాగులోకి తేవచ్చని చైనా సైన్సు అకాడమీ అధ్యయనంలో తేలింది. దీనికి తోడు రెండువందల కోట్ల ము ల ఎడారిలో కూడా సాగు చేసేందుకు ఉన్న అవకాశాలను ఇప్పటికే పరీక్షిస్తున్నారు. ఆరువందల కోట్ల ము ల గడ్డి భూములలో మాంసం, పాల ఉత్పత్తి పెంచేందుకు చూస్తున్నారు.


చైనా ఆర్థిక వృద్ధి గురించి ప్రపంచ బాంకు ప్రధాన ఆర్థికవేత్తగా పని చేసిన డేవిడ్‌ దావోకుయి లీ, చైనా ఆర్థికవేత్త జస్టిన్‌ ఇఫు లిన్‌ వంటి వారు చెప్పిన అంచనాలు తప్పాయి. వారు చెప్పిందేమిటి ? 2025వరకు ఎనిమిది, అప్పటి నుంచి 2050వరకు ఆరుశాతం చొప్పున ఆర్థిక వృద్ధి ఉంటుందని, అమెరికాకు మూడు రెట్లు అవుతుందన్నారు. కానీ జరిగిందేమిటి ? 2011లో 9.6శాతంగా ఉన్న వృద్ధి రేటు 2019నాటికి ఆరుకు, తరువాత 4.5శాతానికి తగ్గింది. యువ నిరుద్యోగుల పెరుగుదల గురించి వార్తలు రావటంతో ఇంకే ముంది చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతున్నదంటూ వాటికి ప్రతికూల భాష్యాలు వెలువడటంతో ప్రభుత్వం నెలవారీ సమాచార విడుదల నిలిపివేసింది. నిజానికి కూలిపోవాల్సి వస్తే ఐఎంఎఫ్‌ చెప్పినట్లుగా 2024లో అమెరికాలో ఈ ఏడాది 1.6, వచ్చే ఏడాది 1.1, అలాగే బ్రిటన్‌లో మైనస్‌ 0.3 – 1, జర్మనీలో మైనస్‌ 0.1 -1.1 శాతాలుగా ఉంటాయని చెప్పగా చైనాలో అవి 5.2-4.5శాతాలుగా ఉన్నాయి. అందువలన ఓయిసిడి దేశాలలో ఏండ్ల తరబడి 20శాతంగా ఉన్న యువ నిరుద్యోగంతో పోలిస్తే చైనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అన్ని దేశాల్లో పరిస్థితులు మారుతున్నాయి. మన దేశంలో ఒకనాడు బిఏ, బికాం, బిఎస్‌సి వంటి డిగ్రీలకు ఎంతో విలువ, తరువాత ఇంజనీరింగ్‌, ఇప్పుడు అదే ఇంజనీర్ల పరిస్థితి ఏమిటో, ఉపాధి దొరికిన వారికి ఇస్తున్న వేతనాలెంతో చూస్తున్నాము. నిరుద్యోగ సమస్యను పాలకుల దృష్టికి తెచ్చేందుకే తాము లోక్‌సభలో పొగబాంబులు వేసినట్లు దాడికి పాల్పడిన యువకులు చెప్పినట్లు వార్తలు. అదే నిజమైతే మనదేశంలో పరిస్థితి గురించి ఆలోచించాలి. ఐదు సంవత్సరాల నాటి కంటే నేడు యువ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ అన్నది వాస్తవం, సరైన లెక్కలు లేవు, ఉన్నవాటిని ప్రకటించకుండా మూసిపెడుతున్నారు గనుక వాస్తవాలు తెలియటం లేదు. ప్రస్తుతం చైనా ఉపాధి ఎక్కువగా ఉండే పరిశ్రమల నుంచి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఉండే సంస్థలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్దుబాటుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం చైనా మీద అనేక దేశాలు వాణిజ్య యుద్ధం ప్రకటించి అమలు జరుపుతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు గానీ, అమెరికా, ఐరోపా దేశాలకు లేదు.చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళలో రాష్ట్రపతి పాలన బెదిరింపు -రెచ్చగొడుతున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

18 Monday Dec 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Pinarai Vijayan, RSS, sfi, SFI Protest


ఎం కోటేశ్వరరావు


కేరళలో రాజ్యాంగ యంత్రం విఫలమౌతోందంటూ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తానని బహిరంగంగా బెదిరించటం తప్పమరొకటి కాదని భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రపతి పాలనకు నాలుగు ప్రధాన కారణాలతో గవర్నర్లు సిఫార్సు చేస్తారు, వాటిలో రాజ్యాంగబద్ద యంత్రాంగం విఫలమైందన్నది ఒకటి. తనకు వ్యతిరేకంగా కాలికట్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బానర్లను తొలగించాలని గవర్నర్‌ పోలీసులను ఆదేశించి ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి ఏడు గంటలకు వచ్చిన సమయంలో బానర్లు అలాగే ఉండటాన్ని చూసి గవర్నర్‌ ఆగ్రహించారు. సిగ్గులేని జనాలు అంటూ పోలీసుల మీద నోరుపారవేసుకున్నారు.ఆగ్రహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎస్‌ఎఫ్‌ఐ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నది, వారు బానర్లు కడుతుంటే మీరు చూస్తున్నారు అంటూ చిందులు వేశారు.కాలికట్‌ విశ్వవిద్యాలయంలో తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బానర్లను వైస్‌ ఛాన్సలర్‌ ఎలా ఆమోదించారో సంజాయిషీ అడగాలని గవర్నర్‌ రాజభవన్‌ కార్యదర్శిని ఫోన్లో ఆదేశించారు. తరువాత బానర్లను తొలగించారు. ఈ పరిణామం తరువాత రాజభవన్‌ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బ్యానర్లను ఏర్పాటు చేశారని, అది గవర్నర్‌ను అవమానించటమేనని, దీన్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. తన మీద కుట్ర జరిగిందని, ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా బానర్ల ఏర్పాటు జరగదని, కావాలని ముఖ్యమంత్రి చేయిస్తున్న ఇలాంటి చర్యలు రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావటానికి దారి తీస్తుందని హెచ్చరించింది. కాగా తెల్లవారే సరికి వందలాది బానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. గవర్నర్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బానర్‌ను విద్యార్ధులు తగులబెట్టారు.


” మీ క్రూరమైన నోటిని మూసుకోమని మేమూ చెప్పగలం…. కానీ గవర్నర్‌ పదవికి గౌరవం ఇస్తున్నాం గనుక ఆ మాట అనటం లేదు.” అని కేరళ టూరిజం శాఖ మంత్రి పిఏ మహమ్మద్‌ రియాజ్‌ ఆదివారం నాడు చెప్పారు. శనివారం నాడు కాలికట్‌ విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు రక్తసిక్త చరిత్ర గురించి తనకు తెలుసునంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సమాధానంగా పత్తానంతిట్ట జిల్లా కొన్నిలో జరిగిన నవకేరళ సదస్సులో రియాజ్‌ స్పందించారు. ఇటీవల గవర్నర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పూనుకున్న తీరు మీద గవర్నర్‌ వెళ్లిన ప్రతి చోటా విద్యార్ధులు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారు.నవ కేరళ సదస్సులతో రాష్ట్ర సిఎం, మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఆ సదస్సులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు బహిష్కరిస్తున్నారు. గవర్నర్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చటమే కాదు, ఆ పార్టీ నేతల భాషను కూడా ఉపయోగిస్తున్నారు. మూడు రోజుల కాలికట్‌ పర్యటనకు వచ్చిన గవర్నర్‌కు శనివారం సాయంత్రం నిరసన ఎదురైంది. అంతకు ఐదు రోజుల ముందు నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్‌ తనపై దాడి చేయించేందుకు పూనుకున్నారని గవర్నర్‌ ఆరోపించారు.


ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసనల మధ్య కాలికట్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన గవర్నర్‌ శనివారం నాడు మాట్లాడుతూ వారు కోతుల వంటి వారు. వాటిని చూసి మనం భయపడితే అవి మన వెంటపడతాయి. నేను ఆ విధంగా పారిపోను, నన్ను ఏ విధంగానూ వేధించలేరు, నన్నెవరూ భయపెట్టలేరు.కానీ ముఖ్యమంత్రి అలా చేస్తున్నారు, ఎందుకంటే కన్నూరు నుంచి వచ్చారు గనుక, కన్నూరుకు రక్త చరిత్ర ఉంది, అక్కడ ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. గవర్నర్‌ సంఘపరివార్‌ పనిముట్టుగా పని చేస్తున్నారని, విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని వివిధ సందర్భాలలో విజయన్‌ విమర్శిస్తున్నారు. సంఘపరివార్‌కు చెందిన వారిని తన అధికారంతో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో చేరుస్తున్నారని చెబుతున్నారు. గవర్నర్‌ మతిమాలిన మాటలతో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకారులను రెచ్చగొడుతున్నారని విజయన్‌ విమర్శించారు. కాలికట్‌ విశ్వవిద్యాలయంలో సంఘీ ఛాన్సలర్‌ వెనక్కు పో అంటూ హిందీలో ” సంఘీ ఛాన్సలర్‌ వాపస్‌ జావో – ఎస్‌ఎఫ్‌ఐ ” అన్న ఒక బానర్‌ను ఏర్పాటు చేశారు. దీని గురించి విలేకరుల ప్రశ్నకు స్పందనగా అవును నేను కాషాయమయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని దేవాయలయాలు కేరళలో ఉన్నాయి. అవి కాషాయ చిహ్నాలు కావా, దమ్ముంటే వాటిని తొలగించండి అన్నారు. అవును నేను కాషాయీకరణకు పూనుకున్నాను. పురాతన భారత సంస్కృతి రక్షకురాలు కేరళ. పురాతన ఆలయాలు, పురాతన నృత్య రీతులను మీరు ఉత్తర ప్రదేశ్‌లో చూడలేరు, బీహార్‌లో చూడలేరు. వాటిని కేరళలోనే మీరు చూస్తారు.కేరళలో ప్రతిదీ కాషాయమయమే.పురాణాల ప్రకారం కంటికి ఆహ్లాదంగా కనిపించే రంగు కాషాయమే అని చెబుతున్నా. ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నియమిస్తున్నానని అనటానికి వారెవరు ? వివిధ మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన పేర్ల నుంచి కొందరిని సిఫార్సు చేశాను. అది నా విచక్షణ అధికారానికి సంబంధించిన అంశం. వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి, రాష్ట్రపతికి తప్ప ఎవరికీ జవాబు చెప్పాల్సినపని లేదు.వారు క్రిమినల్స్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కిరాయికి ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు చేశారంటే అతను కన్నూరు నుంచి వచ్చారు. కన్నూరుకు రక్తసిక్త చరిత్ర ఉందని నాకు తెలుసు, అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దారి మళ్లించాలని సిఎం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సంపదలను సృష్టించకుండా సంక్షేమ పధకాలను ప్రకటిస్తున్నారు, డబ్బంతా విదేశాల నుంచి వస్తున్నది. అన్నారు.


సిఫార్సులను పక్కన పెట్టి తమను కాకుండా గవర్నర్‌ తమ కంటే తక్కువ అర్హతలు కలవారిని కేరళ విశ్వవిద్యాలయ సెనెట్‌కు నలుగురు విద్యార్ధులను నియమించినట్లు దాఖలైన పిటీషన్‌ స్వీకరించి నియామకాల మీద హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన ఇద్దరు విద్యార్ధులను పక్కన పెట్టి గవర్నర్‌ తన ఇష్టం వచ్చిన వారిని నియమించారు. ఆదివారం నాడు పత్తానంతిట్ట జిల్లాలో నవకేరళ సదస్సు సందర్భంగా సిఎం పినరయి విజయన్‌ విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్‌ మతిమాలిన చర్యల ద్వారా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ చర్యలు నిరసనలకు పురికొల్పుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన తెలుపుతున్నది.వారి మీద గవర్నర్‌ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు.చురుకైన రాజకీయాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి వారిని రక్తం మరిగిన నేరగాళ్లు అని ఎలా మాట్లాడారో నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఇది మతిమాలిన చర్య. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు ఇలాంటి దిగజారుడు పదజాలంతో మాట్లాడకూడదు. ఖాన్‌ గారు ఈ రాష్ట్ర గవర్నర్‌ అని మరిచిపోయినట్లున్నది. తన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతిని విచ్చిన్నం చేసేందుకు కావాలనే మాట్లాడుతున్నారని గతంలో కూడా నేను చెప్పాను. ప్రతి సమస్య మీద గరిష్టంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు ” అని విజయన్‌ చెప్పారు.


కన్నూరు చరిత్ర మీద నిందలు వేసిన గవర్నర్‌ వ్యాఖ్యల గురించి మంత్రి రియాజ్‌ మాట్లాడుతూ ” కన్నూరు చరిత్ర అంత చెడ్డదా ?వలస పాలకులకు వ్యతిరేకంగా కన్నూరు గడ్డ మీద పోరాడిన అనేక మంది అమరజీవులయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కన్నూరు ముఖ్య పాత్రను పోషించింది. కన్నూరు, కేరళ పట్ల గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు అంత కోపమెందుకు ? 1970 డిసెంబరులో ఆర్‌ఎస్‌ఎస్‌ మతహింసాకాండ వ్యాప్తికి కన్నూరులోని తలసెరిని ఎంచుకుందని గౌరవనీయ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తెలుసుకోవాలి. వారు ఒక మసీదు మీద డాడికి యత్నించారు. మసీదును కాపాడేందుకు ఇతర కమ్యూనిస్టులతో కలసి యుకె కున్హిరామన్‌ ప్రయత్నించారు. మలబార్‌ ముస్లిం బిడ్డ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కొట్లాటలను నివారించేందుకు ఎర్రజెండా కట్టుకున్న ఒక నల్లరంగు జీపు తిరుగుతూ శాంతిని పాటించాలని ప్రచారం చేసింది. శాంతికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని దానిలో ఉన్నవారు చెప్పారు. ఆ జీపు ముందుభాగంలో కూర్చున్న ఒక యువకుడే నేటి ముఖ్యమంత్రి విజయన్‌. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు చరిత్రను తెలుసుకోవాలి. కన్నూరు, కేరళ చరిత్రను వక్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పద్దతుల్లో ముఖ్యమంత్రిని, ఆయన జిల్లాను అవమానపరుస్తున్నారు.” అని రియాజ్‌ చెప్పారు. తాము ఆందోళనను విరమించటం లేదని మలప్పురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. అయితే గవర్నర్‌ పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాల వద్ద ఎలాంటి నిరసన తెలపటం లేదని స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d