• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

ఐరాస ప్రధాన కార్యదర్శినీ ధిక్కరించిన వైనం : గాజాలో నరమేథ పాత్రధారి ఇజ్రాయెల్‌ – సూత్రధారి అమెరికా !

09 Saturday Dec 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Politics, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel Attack 2023, Israel genocide, Israel-Hamas war, Joe Biden, UNSC Failures, US Veto


ఎం కోటేశ్వరరావు


శుక్రవారం నాడు అనుకున్నట్లే జరిగింది. వర్తమాన మానవాళి చరిత్రలో మరోదారుణ మారణకాండ, గాజాలో మొత్తం పాలస్తీనియన్లనే లేకుండా చేసే దుర్మార్గానికి పూనుకున్న ఇజ్రాయెల్‌కు మీకు అండగా నేనున్నా ముందుకుపోండి, సర్వనాశనం చేయండి అంటూ అమెరికా నిస్సిగ్గుగా ముందుకు వచ్చింది. పొద్దున లేస్తే ప్రపంచానికి మానవహక్కుల గురించి సుభాషితాలు చెప్పే అమెరికన్లు గాజాలో తక్షణమే మానవహననాన్ని నిలిపివేయాలని కోరిన భద్రతా మండలి తీర్మానాన్ని అడ్డుకున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్‌ తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్‌ 99 ప్రకారం చేసిన వినతినీ పెడచెవిన పెట్టింది. కాల్పులను విరమించాలంటూ అరబ్‌ దేశాల బృందం తరఫున యుఏయి ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో అధికారంతో తోసిపుచ్చింది.పదిహేను మంది సభ్యులుండే మండలిలో మిగిలిన 14 మందిలో పదమూడు మంది మద్దతు ప్రకటించారు. అమెరికా అడుగులకు మడుగులొత్తే బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండి నేనూ మీ వైపే ఉన్నానంటూ ఇజ్రాయెల్‌కు మద్దతు పలికింది. దారుణాన్ని నివారించేందుకు సమయం ఆసన్నమైందంటూ చరిత్ర, ప్రపంచ నేత్రాలు చూస్తున్నట్లు అంతకు ముందు గుటెరస్‌ అన్నాడు. గాజాలో 339 విద్యా సంస్థలు, 26 ఆసుపత్రులు, 56 ఆరోగ్యకేంద్రాలు, 88 మసీదులు, మూడు చర్చ్‌లను కూల్చివేశారు. అరవైశాతం గృహాలను నాశనం చేశారు, 85శాతం జనాభాను ఇళ్ల నుంచి తరమివేశారు, వేలాది మంది ప్రాణాలు తీశారని చెప్పాడు. ఎక్కడా రక్షణ లేదన్నాడు. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం మరణాల సంఖ్య 17,487కు పెరిగింది. తీర్మానాన్ని అడ్డుకోవద్దంటూ చివరి ప్రయత్నంగా సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్‌ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌న్ను కోరినప్పటికీ వినిపించుకోలేదు. గాజాలో జాతి నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఉందనే వాస్తవం తెలియదని నటించేందుకు మనం ఇక్కడున్నామా అని ఐరాసలో పాలస్తీనా శాశ్వత ప్రతినిధి రియాద్‌ మన్సూర్‌ సభ్యులను అడిగాడు. దాడులను విరమిస్తే మరో యుద్ధానికి విత్తులు చల్లినట్లే అవుతుందని అంతకు ముందు అమెరికా ప్రతినిధి రాబర్ట్‌ ఉడ్‌ చెప్పాడు. రెండు దేశాలు ఏర్పడాలని అసలు హమస్‌ కోరుకోవటం లేదని ఆరోపించాడు. ఆర్టికల్‌ 99ని ప్రయోగించటం ద్వారా గుటెరస్‌ పక్షపాతంగా వున్నట్లు తేలిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. వందకు పైగా దేశాలు యుఏయి తీర్మాన సహప్రతిపాదకులుగా ఉన్నాయి. వారిలో ఒకటైన చైనా ప్రతినిధి ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ మాటలకందని మానవ విషాదమిది, ఒక్క క్షణం ఆలస్యం చేసినా మరిన్ని మరణాలు సంభవిస్తాయి, ప్రస్తుత తరుణంలో కాల్పుల విరమణ తప్ప మరొక మార్గం లేదన్నాడు.


గాజాలో జరుగుతున్న దారణాలను జరుపుతున్నది ఇజ్రాయెల్‌ అయితే దాని వెనుక సూత్రధారి అసలైన యుద్ధ నేరస్తురాలు అమెరికా అన్నది స్పష్టం. గాజాలో జరుగుతున్న అత్యాచారాలకు ఇజ్రాయెల్‌ బాధ్యురాలు కాగా దానికి ఆయుధాలు అందిస్తున్నది, దౌత్యపరమైన రక్షణ కవచాన్ని కల్పిస్తూ యుద్ధ నేరాల్లో అమెరికా భాగస్వామి అవుతున్నదని, రెండు దేశాలూ కలసి పాలస్తీనియన్లను శిక్షిస్తున్నాయని మానవహక్కుల నిఘా సంస్థ ప్రకటించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో తరువాత ఈ ప్రకటన వెలువడింది. గాజా పౌరుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ టాంకులకు అవసరమైన 45వేల ప్రాణాంతక మందుగుండ్లను విక్రయించేందుకు అనుమతించాలని జో బైడెన్‌ యంత్రాంగం పార్లమెంటును కోరింది. ఒక జర్నలిస్టుతో సహా అనేక మంది పురుషులను డ్రాయర్లతో తిప్పుతూ వారంతా హమస్‌ తీవ్రవాదులంటూ తీసిన చిత్రాలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మానవతాపూర్వక, వైద్య సాయం అందించే బృందాలను అనుమతించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇజ్రాయెల్‌ను కోరింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తరువాత తొలిసారిగా శుక్రవారం నాడు ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం మీద రాకెట్ల దాడి జరిగింది. అమెరికా అందించిన మారణాయుధాలతో ఇజ్రాయెల్‌ జరిపిన రెండు వైమానికదాడుల్లో డజన్లకొద్దీ పౌరులు మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొన్నది. రెండు చోట్లా ఇటీవలే అమెరికా సరఫరా చేసిన బోయింగ్‌ తయారీ ఆయుధాల కిట్లు కనిపించాయి. మరోవైపు పౌరుల ప్రాణాలను కాపాడాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఇజ్రాయెల్‌కు సుభాషితాలు వినిపించారు.డెబ్బయి శాతం పిల్లలు, మహిళలతో సహా 17వేల మంది మరణించిన తరువాత ఈ కబుర్లు చెప్పారు. మేం చెప్పేది చెబుతాం మీపని మీరు కానివ్వండి అన్నట్లుగా అమెరికా నేతల తీరుతెన్నులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌-హమస్‌ చర్యల్లో ఉన్న యుద్ధ నేరాలను విచారించటం తమ ప్రాధాన్యత అని అంతర్జాతీయ నేర కోర్టు ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చెప్పాడు. అయితే ఈ కోర్టు అధికారాన్ని అమెరికా గుర్తించటం లేదు. ఇజ్రాయెల్‌ మీద విచారణ తూతూ మంత్రంగా ఉందని పాలస్తీనా అధికారులు, బాధితులు, న్యాయనిపుణులు విమర్శించారు. ముందుగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తరువాత పశ్చిమ గట్టు ప్రాంతంలో కరీమ్‌ ఖాన్‌ విచారణ జరిపాడు. కేవలం పదినిమిషాల్లో బాధితులు చెప్పదలచుకున్నదానిని ముగించాలని కోరటంతో వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గంటసేపు విన్నారు. ఆ గంటలో ఆలకించిన తీరు చూసిన తరువాత ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు, కేవలం హమస్‌ చేసిందాన్ని గురించి విచారించటానికే వచ్చినట్లుంది తప్ప ఇజ్రాయెల్‌ రెండు నెలలుగా చేస్తున్న తీవ్ర దాడులు పెద్దగా పట్టినట్లు లేదని బాధితులు విమర్శించారు. ఆసుపత్రులు, శరణార్ధి శిబిరాలు, ఐరాస కేంద్రాల మీద దాడులతో సహా తాము చేస్తున్నవన్నీ చట్టబద్దమే అని ఇజ్రాయెల్‌ బుకాయిస్తున్నది. వాటిని హమస్‌ మానవ కవచాలుగా మార్చుకున్నందున దాడులు చేయకతప్పదని అంటున్నది.


ఇజ్రాయెల్‌ చెబుతున్న కథలన్నింటినీ నిజమే అని అమెరికా సమర్ధిస్తున్నది. ఇజ్రాయెల్‌ చేస్తున్నది కార్పెట్‌ బాంబింగ్‌(ఒక్క అంగుళాన్ని కూడా వదల కుండా నాశనం చేయటం) కాదని, అది వేరే అని అధ్యక్షుడు జో బైడెన్‌ చెబుతున్నాడు. ఆసుపత్రుల మీద దాడులు చేసినపుడు ఇజ్రాయెల్‌ వైద్యులు,అంబులెన్సులను కూడా తమతో పాటు తీసుకువచ్చిందని తమకు సమాచారం ఉందన్నాడు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం గదా అన్నాడు. తాము దాడులు చేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని జనానికి చెబుతున్నందున ఇజ్రాయెల్‌ వారి మీద దాడులు చేస్తున్నట్లు ఎలా అవుతుందని అమెరికా భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాదిస్తున్నాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని పౌరులకు పరిమితహాని కలిగే విధంగా ఒక సార్వభౌమత్వదేశం ముందుకు పోవద్దని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించాడు. యుద్ధంలో రెండు పక్షాలూ చట్టాలను ఉల్లంఘిస్తాయి అని అమెరికా గూఢచార శాఖలో మానవ హక్కుల డైరెక్టర్‌గా పనిచేసిన అలైస్‌ బోర్నీ చెప్పింది. ఒకవైపు పౌరుల మరణాలు పెరుగుతుండగా మరోవైపు దాడులు కొనసాగుతున్నకొద్దీ అమెరికా మద్దతు తగ్గిపోతుందేమోనని ఇజ్రాయెల్‌ ఆందోళన చెందుతున్నట్లు మాజీ భద్రతా సలహాదారు హులాటా చెప్పాడు. మా మద్దతు ఇక ఉండదు అని అమెరికా చెప్పే తరుణం రావచ్చు అన్నాడు. అమెరికా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సహజంగానే బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుంది.


శరణార్ధి శిబిరాల్లో ఖాళీలేకపోవటంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో పాలస్తీనియన్లు ఉంటున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జనాన్ని ఖాళీ చేయించినపుడు మరోచోట వారికి తగినన్ని ఏర్పాట్లు చేయాలని గాజాలో ఎక్కడా అలాంటి ఆనవాళ్లు లేవని ఐరాస బాలల నిధి ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ చెప్పటం మానవతాపూర్వక సాయం అందిస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారం బండారాన్ని వెల్లడించింది. ఇరవై మూడులక్షల మంది పౌరుల్లో 19లక్షల మంది నెలవులు తప్పారు, పదిలక్షల మంది ఐరాస శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్‌లో తమ మీద దాడులు జరగకుండా గాజా ప్రాంతాన్ని మిలిటరీ రహితంగా ఉంచాలన్న ఇజ్రాయెల్‌ ప్రతిపాదనను అమెరికా కూడా వ్యతిరేకించింది. అది పాలస్తీనా ప్రాంతంగా ఉండాల్సిందేనని పేర్కొన్నది.గాజా ఎలా ఉండాలన్నది అక్కడి పౌరులు నిర్ణయించాలని టర్కీ పేర్కొన్నది. ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచి ఎమెన్‌లోని హౌతీ సాయుధశక్తులు అడపాతడపా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నౌకల మీద దాడులు చేస్తున్నాయి. లక్షల మంది సాయుధులతో పాటు దాని దగ్గర నౌకా దళం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులను ఆపివేయించేందుకు అమెరికా మీద వత్తిడి తేవటమే ఈ దాడుల లక్ష్యం.

ఇప్పటి వరకు అమెరికా పాటించిన సంయమనాన్ని ముందు కూడా కొనసాగించాలని తాజాగా సౌదీ అరేబియా కోరింది. ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తూ కవ్విస్తున్నది.ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకున్న సౌదీ ఇజ్రాయెల్‌ దాడులను ఆటవిక చర్యలంటూ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అమెరికా కుట్రలో భాగంగా ఇదే సౌదీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హౌతీ తిరుగుబాటుదార్లను అణచేందుకు విఫల యత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారితో నేరుగా చర్చలు జరుపుతూ శాంతి క్రమం ముందుకు పోవాలని కోరుకుంటున్నది. ఎమెన్‌ పౌరులు,అరబ్బు. ఇస్లామిక్‌ దేశాల్లో స్వేచ్చను కోరుకొనే జనాల ఆకాంక్షల మేరకు పాలస్తీనియన్లకు మద్దతుగానే తాము దాడులు చేస్తున్నట్లు ఎమెన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు ప్రకటించాయి. దాడులను విరమించే వరకు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశాయి. వారు ప్రయోగిస్తున్న క్షిపణులు సౌదీ గగనతలం నుంచే వెళుతున్నందున అమెరికా ప్రతిదాడులకు పూనుకుంటే మధ్యలో సౌదీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందువలన వివాదం మరింత ముదరకుండా చూసుకొనేందుకే సంయమనం పాటించాలని కోరిందన్నది స్పష్టం.ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఆ ప్రాంత దేశాల మీద బెదిరింపులకు దిగిన అంశం ఎరిగినదే. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ఇజ్రాయెలీలు నెతన్యాహు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

25 Monday Sep 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Women

≈ Leave a comment

Tags

BJP, Delimitation Commission of India, Narendra Modi, Narendra Modi Failures, women reservation bill 2023


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక బిజెపి టిక్కెట్‌ మోసం కేసు : పోలీసు కస్టడీలో పక్కా హిందూత్వ వాదులు !

23 Saturday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Chaitra Kundapura, G M Abhinava Halaveerappajja, Karnataka BJP ticket promise case, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వ వాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగలూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలో పక్కా హిందూత్వ వాదులుగా జనంలో ప్రాచుర్యం పొందిన వారు. ఇప్పుడు పక్కా మోసకారులుగా పోలీసుల చేతికి చిక్కారు. సంవత్సరాల తరబడి వారిని ఉపయోగించుకున్న బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు ఇప్పుడు వారితో తమకేమీ సంబంధం లేదని నమ్మబలుకుతున్నాయి. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బిజెపి యువమోర్చ నేతలు, ఇతరులు ఈ కేసులో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయోగించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్ణాటకలో ఇప్పుడు బిజెపి టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది.తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్రనేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు. బిజెపిలో టిక్కెట్లు ఎలా సంపాదించుకొనే అవకాశం ఉందో ఈ మోసం వెల్లడిస్తున్నది.


ఇంతకీ జరిగిందేమిటంటే బిజెపి టికెట్‌ వస్తే దాంతో గెలిచి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చనే దురాశతో గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త పైన చెప్పుకున్న మోసగాళ్ల ముఠాకు ఐదు కోట్లు సమర్పించుకున్నట్లు సెప్టెంబరు ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాన నిందితుల్లో చైత్ర కుందాపుర, ఆమె అనుచరులను పోలీసు అరెస్టు చేశారు.ఈ వార్త తెలియగానే మరో ప్రధాన నిందితుడు అభినవ హలస్వామి కాషాయ దుస్తులు పక్కన పడేసి మారు వేషంలో తప్పించుకున్నాడు. టీ షర్టు, షార్టు (లాగు కంటే ఎక్కువ, పాంట్స్‌ కంటే తక్కువ పొడవు) వేసుకొని పారిపోతుండగా ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బిజెపి టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి కార్యాలయం,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి మూడు కోట్లు, మరో రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు.


అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్ణాటకలో 2020లో బెంగలూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు.అతగాడు 2014 నుంచి 2020వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు.2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనందకుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బిజెపి నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖంచాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని ఇరవై కోట్లు, కర్ణాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్ర కళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రు.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బిజెపి అగ్రనేతలను పరిచయం చేశారట.ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ 30లక్షలు సమర్పించుకున్నారట.2019లో స్వామి తనను పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి , ఒక క్షురకుడు ఉన్నారు.తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బిజెపి కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45 ఏండ్లుగా పని చేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగలూరులోని ధనికులు నివాసం ఉండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110 సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు.ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నానాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకుబడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో 50 లక్షలు, తరువాత మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు.2022 జూలై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.


బిజెపి అభ్యర్ధులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌ కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తి లేడని తేలింది.దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగలూర్‌ కెఆర్‌ పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాని చైత్ర నొక్కేసింది. కుందాపురలోని ఒక సహకార బాంకులో రు.1.8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు, రు.65లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నట్లు, మరో రు.40లక్షలను ఒక బంధువు సాయంతో శ్రీరామ్‌ బాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక బాంకులాకర్‌ నుంచి రు.23లక్షల బంగారు బిస్కట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక నలభై లక్షలు వెచ్చింది చైత్ర తనకు కొత్త ఇంటి నిర్మాణంతో పాటు తన సోదరి ఇంటిని 15లక్షలతో మరమ్మతు చేయించినట్లు, పన్నెండు లక్షలతో కియా కారు కొన్నట్లు తేలింది. గగన్‌ కదూర్‌ వివాహానికి రు.35లక్షలు ఖర్చు చేసి పది లక్షలతో కొత్త కారు కొన్నారు, రమేష్‌ నాయక్‌ రు.1.5లక్షలు, చెన్నా నాయక్‌కు రు.93వేలు ఇచ్చారు. తమ ముఠాలోని ఆరుగురు మూడు కోట్లు తీసుకున్నట్లు చైత్ర పోలీసులకు వెల్లడించింది. స్వామీజిని అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న పెద్దల గురించి తెలుస్తుందని కూడా చెప్పిందని పోలీసులు చెప్పారు.ఆమెను ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకేమీ కాలేదని తరువాత తేలింది. బిజెపి నేత ఒకరు ఈ ముఠావెనుక ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ ఆరోపించారు. కొంత మందికి టిక్కెట్లు రాకపోవటంతో ఇలాంటి మోసాలన్నీ వెలుగు చూస్తున్నాయని మాజీ సిఎం, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్‌ షెట్టార్‌ అన్నారు.రియలెస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. అరెస్టు చేసిన వారెవరూ అసలు తమకు తెలియదని బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 80శాతం కొట్టేసిన సొమ్ము ఆచూకీ దొరికినట్లు పోలీసులు చెప్పారు.


ఒకటిన్నర కోట్లు తీసుకున్న హలశ్రీ స్వామి తప్పించుకోగా అతని కారు డ్రైవర్‌ పోలీసులకు దొరికాడు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన గోవింద పూజారి కేసు దాఖలు చేశారు. పన్నెండవ తేదీన చైత్రను ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసిన స్వామి ఆ రోజు హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి వెళ్ల కుండా తప్పించుకున్నాడు. మైసూరు పారిపోయే ముందు నాలుగు కొత్త సిమ్‌ కార్డులు, నాలుగు కొత్త ఫోన్లు కొన్నాడట, పారిపోతున్నపుడు కారు నంబరు ప్లేటును తొలగించారు, తరువాత కారును ఒక బంధువు ఇంట్లో ఉంచి, కర్ణాటక నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్‌ నుంచి బుద్ధ గయకు రైలులో వెళుతుండగా కటక్‌ వద్ద పోలీసులకు దొరికాడు. మైసూరు నుంచి హైదరాబాద్‌, పూరీ, కోణార్క్‌ వెళ్లి అక్కడి నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికాడు. గోవింద పూజారి నుంచి తీసుకున్న సొమ్ముతో వ్యవసాయ భూమి కొనుగోలు, ఒక పెట్రోలు బంకులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.


విద్యార్ధినిగా ఉండగా ఎబివిపిలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాంకర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారిటీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమె మీద కేసులు కూడా నమోదు చేశారు.ఈ ఉపన్యాసాలకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.2021లో ఒక సభలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై మూడు శాతం ఉన్న మీకే ఇంత అహం ఉంటే 70శాతంగా ఉన్న హిందువులకు ఎంత ఉండాలి ?ఇదే మీకు చివరి హెచ్చరిక, మీరు గనుక లౌ జీహాద్‌ను మానుకుంటేనే మీరు బతికి ఉంటారు, 70శాతం హిందువులు 23శాతం మందిని మార్చాలని అనుకుంటే, లౌ జీహాద్‌కుపూనుకుంటే రెండు రోజులు చాలు మీ ఇండ్లలో ఒక్క బుర్కా కూడా కనిపించదు. మేము ప్రతి ముస్లిం యువతి నుదుటి మీద తిలకం దిద్దుతాం అని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఆమె గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. శ్రీరామ్‌ సేన నేత ప్రమోద్‌ ముతాలిక్‌తో కలసి వేదికలను పంచుకున్నది. రెచ్చగొట్టే ప్రసంగాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందును కలుబుర్గి జిల్లాలో అలంద్‌ తాలుకాలో వారం రోజుల పాటు తిరగ కుండా జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ప్రారంభంలో నిషేధం విధించారు. 2018లో సర్పపూజ్‌ ఎలా చేయాలనే అంశంపై గొడవ పడి గురుప్రసాద్‌ పంజా అనే హిందూ జాగరణ్‌ వేదిక కార్యకర్తమీద చేయి చేసుకున్న కేసులో అరెస్టయింది.


అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బిజెపి కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని , హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బిజెపి టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బిజెపి టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బిజెపి వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహుకరించారు. ఏ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశించాడో అదే చోట బిజెపి అభ్యర్ధికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బిజెపి ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎక్కడైనా బావే గానీ సిఎం కుర్చీ దగ్గర కాదు : మహారాష్ట్రలో బిజెపి, షిండే శివసేన కుమ్ములాట – ముద్దులాట !

14 Wednesday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP-Sena rift, Maharashtra, Narendra Modi Failures, Siva Sena


ఎం కోటేశ్వరరావు


మహారాష్ట్రలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందుమత ఉద్దారకులం తామే అంటున్న బిజెపి – షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.” ఢిల్లీలో నరేంద్రమోడీ – రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా ” దేశంలో మోడీ – మహారాష్ట్రలో షిండే ” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది.మంగళవారం నాడు కొల్లాపూర్‌లో సిఎం ఏకనాధ్‌ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవిస్‌ బహిష్కరించారు, అనారోగ్యసాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది.” అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం ” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది. దానిలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, బాలాసాహెబ్‌ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతో పాటు ఏకనాధ్‌ షిండే -దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1శాతం, ఫడ్నవిస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3 శాతం మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికివస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్‌ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిా థాకరే శివసేన పార్టీ (ఎంవిఏ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.


శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండుసార్లు సిఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాధ్‌ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవిస్‌ ” ఢిల్లీలో నరేంద్రమోడీ- రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాధ్‌ షిండే రంగంలోకి దిగారు. ఒక టీవీ ఛానల్‌-ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1శాతం, ఫడ్నవిస్‌ను కోరుతున్నవారు 23.2శాతం అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతే కాదు బిజెపికి 30.2శాతం, షిండే సేనకు 16.2శాతం ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో షిండే అమలు జరుపుతున్న పధకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం. బాలాసాహెబ్‌ థాకరే ఫొటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్‌ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధావ్‌ ధాకరే సేన నేత సంజయ రౌత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాధ్‌ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవిస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే , ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవిస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకువచ్చిన 40 మంది ఎంఎల్‌ఏల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.


షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్దావ్‌ధాక్రేపై తిరుగుబాటులో కీలకపాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవిస్‌ ఇటీవల అమిత్‌ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు. ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఏలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపీ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్‌ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాధ్‌ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ట్ర రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్‌ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్‌ పవార్‌ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.


మరాఠీ పత్రిక సకాల్‌ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో నరేంద్రమోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1శాతంగా కాగా వద్దన్నవారు 41.5శాతం ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5శాతం మంది ఉద్దావ్‌ ధాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7శాతం మొగ్గుచూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఉద్దావ్‌ శివసేన కూటమికి 48శాతం మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు 16.41,15.66 మొత్తం 32.07శాతం రాగా 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్‌ బహుజన్‌ అగాధీకి 6.92 శాతం దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్‌ బహుజన్‌ అగాధీ ప్రస్తుతం ఉద్దావ్‌ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75,16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు-ముద్దులాటలుగా ఉన్న బిజెపి-షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు,పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.కలసి ఉన్నా ఎంవిఏ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !

07 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, capitalism or socialism, Capitalism’s flaws, capitalist crisis, karal marx


ఎం కోటేశ్వరరావు


ఎవరు ఎన్ని చెప్పినా చివరికి కారల్‌ మార్క్స్‌ చెప్పిందే సరైనదా ? అంటూ జర్మన్‌ కార్పొరేట్‌ల పత్రిక డెర్‌ స్పీగల్‌ ఈ ఏడాది జనవరిలో ఒక విశ్లేషణను ప్రచురించింది. అంతకు ముందు గతేడాది సెప్టెంబరులో అమెరికా పరిశోధనా సంస్థ పూ సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల గురించి అమెరికన్లలో ఉన్న వైఖరి గురించి సర్వే వివరాలను వెల్లడించింది.దీనిలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. అమెరికాలో పద్దెనిమిది-ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారిలో సోషలిజాన్ని సమర్ధించే వారు 44శాతం మంది ఉండగా పెట్టుబడిదారీ విధానాన్ని అభిమానించిన వారు 40శాతం ఉన్నారు.2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు. ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ధనిక దేశాల్లో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పూర్వరంగంలో సోషలిజం, మార్క్స్‌ మీద ప్రేమ కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులను హెచ్చరిస్తూ చేసిన విశ్లేషణలు ఇవి అన్నది గమనించాలి. సర్వే సంస్థలు ఇచ్చే ప్రశ్నావళి, దానికి అడిగే సమాధానాల తీరు తెన్నులను బట్టి సమర్ధకులు, కాని వారి సంఖ్య మారుతున్నప్పటికీ రూపుదిద్దుకుంటున్న ప్రధాన ధోరణులు ఏమిటన్నదానిని చూడాలి. గతంలో సోషలిజాన్ని వ్యతిరేకించే అంశం గురించి చర్చలు జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి కమ్యూనిస్టుల కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులే ఎక్కువగా మాట్లాడుతున్నారు.


” పెట్టుబడిదారీ విధానం మీద విమర్శ కొత్తదేమీ కాదు. కరోనా మహమ్మారి నాలుగో సంవత్సరం, ఉక్రెయిన్‌ యుద్ధం రెండవ సంవత్సర ప్రారంభంలో గమనించాల్సినంతగా అది పెరుగుతున్నది. అనేక అంశాలు ఎక్కువ కాలం పని చేయవు. ప్రపంచీకరణ కుప్పకూలుతున్నది, దానితో పాటే జర్మన్‌ తరహా కలిమి కూడా ఉంది.ప్రపంచం శత్రుపూరిత కూటములలో పాదుకొనిపోతున్నది. ద్రవ్యోల్బణం పేదలు-ధనికులను మరింతగా వేరు చేస్తున్నది. దాదాపు అన్ని పర్యావరణ లక్ష్యాలు తప్పాయి. వ్యవస్థలో కనిపిస్తున్న కొత్త పగుళ్లన్నింటినీ రాజకీయవేత్తలు ఇంకేమాత్రమూ సరి చేయలేరు. ఒక పెద్ద సమస్య తరువాత మరొకటి వెనుకే వస్తున్నది, అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇంథన సంక్షోభం, వాణిజ్యపోరు, ప్రపంచ యుద్ధం పోకడలు కనిపిస్తున్నాయి.జనాకర్షక(మభ్యపెట్టే) నేతలు, నిరంకుశ పాలకుల నుంచి ప్రజాస్వామ్యం దాడులను ఎదుర్కొంటున్నది.ఇటీవలి వరకు ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంటుందని, మార్కెట్‌ తనను తాను రక్షించుకోగలదని అనుకున్నారు. కానీ ఈ రోజు దాన్ని ఎంత మంది నిజంగా నమ్ముతున్నారు ? ప్రత్యేకించి అన్ని ప్రతికూలతలు, వాతావరణ సంక్షోభం అనేక రెట్లు పెరుగుతున్నది.” ఇలాంటి వర్ణన సాధారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు చేస్తుంటాయి. కానీ ఇదంతా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించే డెర్‌ స్పీగల్‌ విశ్లేషకుల అభిప్రాయాల సారమే.అంతేనా ?


” పెట్టుబడిదారీ విధానాన్ని తక్షణమే మౌలికంగా సంస్కరించాల్సి ఉంది. లేకుంటే అది నాశనమౌతుంది గనుక తగిన చర్యలు తీసుకోవాలి ” అని రే డాలియో అనే 2200 కోట్ల డాలర్ల హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చెప్పాడు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌,గోల్డ్‌మన్‌ శాచ్స్‌, బోష్చ్‌ వంటి సంస్థలు ఎన్నో ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించినట్లు ఆ పత్రిక విశ్లేషకులు ఉటంకించారు.” మహా పెట్టుబడిదారులుగా రుజువు చేసుకున్న వారు ప్రపంచస్థితి గురించి చెబుతూ ఆకస్మికంగా కారల్‌ మార్క్స్‌ అభిమానుల మాదిరి మాట్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు, కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయాలు,అగ్రశ్రేణి మేథావులు, వ్యవహార జ్ఞానులు ఎవరైనా అడుగుతున్న అతి పెద్ద, మౌలిక ప్రశ్న ఏమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థతో మనం కొనసాగ గలమా అంటున్నారు.” అని డెర్‌ స్పీగల్‌ అన్నదంటే పెట్టుబడిదారులకు తమ వ్యవస్థ మీద తమకే విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పినట్లే . దీని అర్ధం వారు చేతులు ముడుచుకు కూర్చుంటారని కాదు, దాన్ని అధిగమించేందుకు, జనాన్ని తొక్కిపెట్టేందుకు కొత్త పద్దతులను వెతికే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం సాధారణ సంక్షోభాన్ని కాదు ప్రపంచంలో 2023లో విధాన పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు డెర్‌ స్పీగల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


వారి అసలు బాధ ఏమిటో కూడా దాచుకోలేకపోయారు. ” పారిశ్రామిక దేశాలలో సంవత్సరాల తరబడి ఒక స్పష్టమైన ఆగ్రహం వ్యాపిస్తున్నది. అది సైద్దాంతిక కారణాలతో కాదు, ఎందుకంటే ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆస్తులను కొనుగోలు చేయలేనివిగా మారాయి. వనరులనుంచి సంపదలను సృష్టించే యంత్రం అందరికీ సృష్టించనపుడు దాన్ని ఎందుకు ఆమోదించాలి ” అని ప్రశ్నిస్తున్నారని అంటూ అమెరికాలో సోషలిజం పట్ల యువతలో సానుకూల వైఖరి పెరగటాన్ని ఉటంకించారు. అసంతృప్తి, ఆగ్రహం, ఉద్యోగాలకు రాజీనామాలతో నిరసన కొట్టవచ్చినట్లుగా కనిపిస్తోందని, సోషలిస్టు సిద్దాంతాల పట్ల ఆకర్షితులౌతున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఇదే పత్రిక జరిపిన సర్వేలో పెట్టుబడిదారీ విధానం వాతావరణ సంక్షోభానికి కారకురాలైనట్లు సగం మంది జర్మన్లు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తినపుడే దాన్నుంచి బయటపడే మార్గాలను సమాజం వెతుకుతుంది. అసలీ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టకపోతే ఈ కమ్యూనిస్టు సిద్దాంతం, బీరకాయ ఉండేది కాదు అని కొందరు అనుకుంటారు. వారుగాక పోతే మరొకరు, మరొకరు దోపిడీని అంతం చేసే శాస్త్రీయ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చి ఉండేవారు. సోషలిజం గాక పోతే మరొక పేరు పెట్టి ఉండేవారు. దోపిడీ అంతం కావటం, సమసమాజం రావటం తప్ప పేరు ఏదైతేనేం. నిజానికి వారి కంటే ముందుగానే సోషలిజం గురించి చెప్పిన వారున్నారు. దాన్ని సాధించే మార్గం వారు చెప్పలేకపోయారు గనుక వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారు. మన దేశంలో కూడా సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పిన వారు, వసుధైక కుటుంబం అన్నవారి గురించి తెలిసిందే.


అమెరికాలో పూ సంస్థ జరిపిన సర్వే ప్రకారం అక్కడి డెమోక్రాట్లలో అనేక మంది పౌరుల మౌలిక అవసరాలను సోషలిజం తీరుస్తుందని నమ్ముతున్నారు. వ్యక్తిగత స్వేచ్చను హరిస్తుందని రిపబ్లికన్లు చెబుతారు.2019లో సోషలిజం పట్ల డెమోక్రాట్లలో 65శాతం మంది సానుకూలంగా ఉన్నారని 2022లో 57శాతానికి తగ్గినట్లు సర్వే చెప్పింది. పెట్టుబడిదారీ విధానం గురించి సానుకూల వైఖరి ఉన్న డెమోక్రాట్లు ఇదే కాలంలో 55 నుంచి 46 శాతానికి తగ్గినట్లు కూడా పేర్కొన్నది. దీన్ని ఏ విధంగా చూడాలి ? ఏ సమాజంలోనైనా మధనం జరగాలి. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతున్నదని చెప్పవచ్చు. పెట్టుబడిదారీ విధానం పట్ల రిపబ్లికన్లలో సానుకూల వైఖరి 78 నుంచి 74శాతానికి తగ్గింది. ఇదీ మంచి పరిణామమే కదా ! పెట్టుబడిదారీ విధానం ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని నమ్ముతున్నవారు తగ్గుతున్నారు. తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారు సోషలిజం పట్ల సానుకూలంగా ఉంటే ఎక్కువ వస్తున్నవారు పెట్టుబడిదారీ విధానమే ఉండాలని కోరుకుంటున్నారు. జనాలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఆరోగ్యం, ఇంటి వసతులను సోషలిజం తీరుస్తుందని 38శాతం నమ్ముతుంటే 18శాతానికి పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు ఉన్నాయి. మూడు పదులు దాటిన వారిలో వయసుపైబడిన కొద్దీ సోషలిజం పట్ల సానుకూల వైఖరి ఉన్నవారు తగ్గినట్లు సర్వే వెల్లడించింది. దానిలో ఆశ్చర్యం ఏముంది ? తీవ్రమైన సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి లోనైన వారు.గతంలో అనుభవించిన సామాజిక రక్షణ పధకాలు నేటి తరాలకు అందుబాటులో ఉండటం లేదు. పాతవారితో పోల్చితే బతుకుదుర్భరంగా మారుతున్నది. అందువలన యువతలో కొత్త ఆలోచనలు. సోవియట్‌ ఉనికిలో ఉన్నపుడు సోషలిస్టు దేశాల గురించి చేసిన తప్పుడు ప్రచారంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో అది తగ్గింది. ఎందుకంటే సోషలిజం మీద విజయం సాధించామని అక్కడి పాలకులు మూడు దశాబ్దాల క్రితం ప్రకటించారు. అదే నోటితో ఇప్పుడు పోరు సాగిస్తామని చెప్పలేరు కదా ! అందుకే కొత్త తరాలు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించే క్రమంలో ప్రత్యామ్నాయంగా సోషలిజం తప్ప మరొకటి కనిపించటం లేదు గనుక దాని పట్ల క్రమంగా సానుకూలత పెరుగుతోంది.


సోషలిస్టు దేశాలంటే జనానికి ఇచ్చిన మేరకు తీసుకోవటం తప్ప అవసరమైన సరకులను అందించలేరంటూ ఖాళీగా ఉన్న దుకాణాలను చూపి కట్టుకథలను ప్రచారం చేశారు. మరోవైపు చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కానీ అక్కడి నుంచి కావాల్సిన వస్తువులన్నింటినీ దిగుమతి చేసుకుంటారు. ఆ మేరకు తమ ప్రభుత్వం తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని అమెరికన్లు భావించటంతో పాటు చైనా అనేక దేశాలకు వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం కూడ ప్రారంభమైంది.మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? అన్న సందేహాలు మొగ్గతొడిగాయి.. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా అమెరికన్లలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. నూట ఆరు సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా బ్రిటన్‌లో నర్సులు సమ్మె చేశారు. ఫ్రాన్సు సమ్మెలు, ప్రదర్శనల ఆందోళనలతో ఉడికిపోతోంది. ప్రభుత్వం దిగిపోవాలని 74శాతం మంది కోరుకుంటున్నారు. ఐరోపాలో అనేక దేశాల్లో కార్మికవర్గం వీధుల్లోకి వస్తోంది. పెట్టుబడిదారీ విధానం మీద కరోనాకు ముందే అమెరికాలో దాడి మొదలైందని, తరువాత ఆర్ధిక, సామాజిక ఇబ్బందులు పెరగటంతో మరింత తీవ్రమైందని కొందరు గగ్గోలు పెడుతూ పత్రికల్లో రాశారు. పెట్టుబడిదారీ విధానం చితికింది అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక, ఇంకేమాత్రం పెట్టుబడిదారీ విధానం పనిచేయదు అంటూ సిఎన్‌ఎన్‌, పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలి అని ప్రపంచ ఆర్థికవేదిక వంటివి చెప్పిన తరువాత జనాలకు ఆ వ్యవస్థమీద విశ్వాసం ఎలా పెరుగుతుంది. మరో ప్రపంచం అది సోషలిస్టు సమాజం సాధ్యమే అని చెప్పేందుకు పెట్టుబడిదారీ విధానమే అనేక అవకాశాలను ముందుకు తెచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

19 Friday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP, Karnataka election 2023, Karnataka milk producers, Narendra Modi Failures


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

17 Wednesday May 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Austrian Communist Party, Chicago mayor, communism, Communism won, communist manifesto, Joe Biden, karal marx


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్స్‌ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్‌ రికార్డ్‌ అనే వెబ్‌ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్‌ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్‌ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.


మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్‌ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.


కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.


అమెరికాలో న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్‌ యూనియన్‌, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్‌ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్‌ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్‌ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్‌-అమెరికన్‌ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్‌ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్‌ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.


ఏప్రిల్‌ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్‌ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్‌ డంకల్‌ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్‌ గతంలో గ్రీన్ప్‌ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్‌ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్‌ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్‌ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.


తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్‌ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్‌ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి జిమ్మిక్కులురా బాబూ : ఓట్ల కోసం చర్చి ప్రార్ధనల్లో నరేంద్రమోడీ !

12 Wednesday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Christians, Kerala CPI(M), LDF, Narendra Modi, Narendra Modi Failures, Pinarayi Vijayan, RSS, sangh parivar, UDF


ఎం కోటేశ్వరరావు


వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్‌ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీన ఈస్టర్‌ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్‌ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్‌ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.


గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్‌ మిషినరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, అతని కుమారులు ఫిలిప్‌,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్‌ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్‌ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్‌ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌(యుసిఎఫ్‌) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్‌ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.


ఈస్టర్‌ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్‌ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్‌ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్‌ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్‌ ముక్త్‌ – ఫాదర్‌ ముక్త్‌ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్‌ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్‌ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.


నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్‌ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్‌ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్‌ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్‌ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్‌ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.


క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్‌ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక ఎన్నికలు 2023 : కుమ్ములాటల్లో బిజెపి-కాంగ్రెస్‌లో ఉత్సాహం !

10 Monday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BL Santhosh, BS Yediyurappa, BY Vijayendra, CT Ravi, jds, Karnataka Congress, Narendra Modi



ఎం కోటేశ్వరరావు


అధికార బిజెపి-ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది.ఇప్పటి వరకు వెలువడిన వార్తలను చూస్తే కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్సాహం, బిజెపి దొడ్లో కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు తమ జాబితాను ప్రకటిస్తామని సిఎం బసవరాజు బొమ్మై చెప్పారు. బిజెపి నేతలంతా ఢిల్లీలో జాబితా గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం లేదా మంగళం వారం గానీ జాబితా వెలువడవచ్చని బొమ్మై చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని చోట్ల నామినేషన్లు ప్రారంభమైన తరువాత జాబితాలను ప్రకటించిన ఉదంతాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికే 142 మందితో జాబితాను ప్రకటించింది. బిజెపి జాబితాను బట్టి మిగతా సీట్లకు ప్రకటిస్తారని వార్తలు. బిజెపి అసంతృప్త నేతల కోసం కూడా ఎదురు చూస్తుండవచ్చు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటున్న బిజెపి ఇంతవరకు జాబితాను తేల్చుకోలేకపోవటం బలహీనత, కుమ్ముటాటలకు చిహ్నం.


మొత్తం 224 స్థానాలున్న అసెంబ్లీకి మే పదవ తేదీన ఎన్నికలు, పదమూడవ తేదీన ఫలితాలు వెలువడతాయి. ఈ నెల పదమూడున నోటిఫికేషన్‌, 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ,21న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం సభలో బిజెపికి 117, కాంగ్రెస్‌కు 75, జెడిఎస్‌కు 27 స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24వ తేదీ వరకు ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.14శాతం ఓట్లు 80 సీట్లు, బిజెపికి 36.85 శాతం ఓట్లు 104 సీట్లు, జెడిఎస్‌కు 18.35 శాతం ఓట్లు 37 సీట్లు వచ్చాయి.జెడిఎస్‌ నేత కుమార స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడాది గడచిన తరువాత 2019 జూలైలో కాంగ్రెస్‌,జెడిఎస్‌ల నుంచి కొంత మందిని ఆకర్షించి వారితో రాజీనామాలు ఇప్పించిన బిజెపి సభలో తమకే మెజారిటీ ఉందంటూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి బిఎస్‌ ఎడియూరప్పను సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లతో పూర్తి మెజారిటీ సాధించింది. తరువాత బిజెపిలో కుమ్ములాటల కారణంగా 2021 జూలై 26న ఎడియూరప్పతో రాజీనామా చేయించి కొత్త సిఎంగా బసవరాజ్‌ బొమ్మైని గద్దె నెక్కించారు.


ఎన్నికల ప్రకటన వెలువడిన రోజునే బిజెపి ఓడిపోనుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కర్ణాటకలో1985 తరువాత ఇప్పటి వరకు ఒకసారి నెగ్గిన పార్టీ మరొకసారి వెంటనే అధికారానికి రాలేదు. ఈ సారి ఆచరిత్రను తిరగరాసి తమ పట్టును శాశ్వతం చేసుకోవాలని బిజెపి చూస్తున్నది. తిరిగి అధికారానికి రావటం ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు దేశమంతటా ఊపు తేవాలని కాంగ్రెస్‌ భావిస్తున్నది.దక్షిణాదిన హిందూత్వ ప్రయోగశాలగా పరిగణిస్తున్న కర్ణాటకలో మత ప్రాతిపాదికన ఓటర్లను చీల్చి లబ్ది పొందాలని బిజెపి, సంఘపరివారం అనేక వివాదాలను ముందుకు తెచ్చి చిచ్చుపెట్టింది. చిత్రం ఏమిటంటే అధికారం వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండి అసంతృప్తి తలెత్తటం సహజం కానీ ఓడిపోతుందని భావిస్తున్న బిజెపిలో కుమ్ములాటలు అంతకంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు బిజెపి అభ్యర్ధులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎంతో ముందుగానే ఎక్కువ సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాయి. అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయకముందే దాదాపు నలభై సీట్లలో బిజెపి తిరుగుబాటును ఎదుర్కోనుందని డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక ఏప్రిల్‌ ఎనిమిదవ తేదీన రాసింది. అభ్యర్ధుల ఎంపికలో తీవ్ర వత్తిడి ఉన్న మాట నిజమేనని, తాము గెలిచే సీట్లలో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఆశావహులు ఉన్నారని, ఆ సంఖ్యను రెండు నుంచి మూడుకు తగ్గించి ఒక జాబితాను రూపొందించామని,గెలిచే అవకాశాలు, అధిష్టానం సలహాను బట్టి జాబితాను ఖరారు చేస్తామని ఎడియూరప్ప చెప్పారు. తమను ఎంపిక చేయకుంటే తిరుగుబాటు చేస్తామని అనేక మంది బాహాటంగానే చెబుతున్నారు. సిద్దాంతాలు తప్ప తమకు అధికారం ముఖ్యం కాదని, ఇతర పార్టీలతో పోలిస్తే తమది ఎంతో భిన్నమైనది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకొనే బిజెపిలో ఇలాంటి ధోరణులు వెల్లడికావటం ఇదే ప్రధమం కాదు. కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలలో అధికారం కోసం ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరుతెన్నులను చూస్తున్న తరువాత తమకు దక్కని అధికారం ఇతరులకూ దక్కనివ్వం అనే ధోరణి పెరిగి బిజెపి మరో కాంగ్రెస్‌గా మారటం కర్ణాటకలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం ఎలా ఉండేది చూడాల్సి ఉంది.


2019 ఫిరాయింపుల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి రమేష్‌ జర్కిహౌలీ తాను కోరిన మూడు సీట్లను తన అనుచరులకు ఇవ్వకుంటే తాను పోటీలో ఉండనని బెదిరించారు. వారసత్వ రాజకీయాలంటూ ఇతర పార్టీల మీద ధ్వజమెత్తిన బిజెపి ఇప్పుడు కర్ణాటకలో అదే సమస్యతో సతమతం అవుతోంది. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించిన ఉదంతం కాంగ్రెస్‌కు ఒక ప్రచార అస్త్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఓబిసిలను అవమానించిందంటూ ప్రచారం చేస్తున్న బిజెపి కూడా దాన్నే ఇక్కడా కొనసాగించవచ్చు. కన్నడిగుల ఓట్ల కోసం మతాన్ని జోడించి ఎంతో ముందుగానే సమీకరణకు పూనుకుంది. ముఠా కుమ్ములాటలకు తోడు నలభైశాతం కమిషన్‌ ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. అవినీతి పట్ల కఠినంగా ఉండటంలో విఫలమైనట్లు, బలహీనమైన సింఎంగా బసవరాజ్‌ బొమ్మైని పరిగణిస్తున్నారు.గతంలో సామాజిక సమీకరణలను రెచ్చగొట్టి లబ్దిపొందిన బిజెపికి ఇప్పుడు అవే గుదిబండలుగా మారుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎడియూరప్ప-బిఎల్‌ సంతోష్‌ వర్గాలుగా బిజెపి ఉంది.


ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడిగా ఉన్న బిఎల్‌ సంతోష్‌ వర్గనేతలు విద్వేష ప్రచారానికి పెట్టింది పేరని అనేక ఉదంతాల్లో వెల్లడైంది. రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్‌ కటీల్‌, రాష్ట్ర మంత్రి సిటి.రవి, కేంద్ర మంత్రి అనంత కుమార్‌ హెగ్డే వంటి వారు హిందూత్వ రాజకీయాలకు కేంద్రంగా ఉండగా ఎడియూరప్ప వర్గం కులసమీకరణల మీద కేంద్రీకరిస్తుంది. బొమ్మై ఈ రెండు గ్రూపుల్లో ఎడియూరప్ప వర్గానికి చెందినట్లు చెబుతారు.హిజబ్‌, టిప్పు సుల్తాన్‌ వివాదాన్ని ముందుకు తెచ్చిన హిందూత్వశక్తుల అజెండాను అమలు జరిపి వారిని సంతుష్టీకరించినట్లు విమర్శలున్నాయి. ముస్లిం వ్యతిరేకతలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లను రద్దు చేశారు. వక్కళిగ-లింగాయత్‌ కులాలకు రిజర్వేషన్లను సమం చేసి వారిని సంతుష్టీకరించేందుకు చూశారు. బిజెపి కుమ్ములాటలతో ఉండగా అధికారం కళ్ల ముందు కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌లోని ప్రధాన వర్గాలు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నట్లు వార్తలు. వక్కళిగ సామాజిక తరగతి మద్దతు ప్రధానంగా ఉన్న జెడిఎస్‌ కూడా పోటీ చేస్తున్నది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకున్నా తన బలంతో ఒక నిర్ణాయక శక్తిగా ఉంటున్నది. అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ మద్దతుతో ఆ పార్టీ నేత కుమారస్వామి సిఎంగా పని చేశారు. త్రిముఖ పోటీగా కనిపిస్తున్నప్పటికీ మూడు పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బలంగా ఉండటంతో ఆచరణలో రెండు ప్రధాన పక్షాల సమీకరణే ఎక్కువగా ఉంటున్నది.గత అనుభవాలను చూసిన తరువాత ఈ సారి దానిలో మార్పు వస్తుందా అన్నది ప్రశ్న.


క్రైస్తవుల మీద విద్వేష పూరిత ప్రసంగం చేసి రెచ్చగొట్టినందుకు రాష్ట్ర మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చినెల 31న ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మురికి వాడల్లో ఉన్న వారిని మతమార్పిడి చేస్తున్న క్రైస్తవులను తన్ని తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం బృంద అధికారి మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మునిరత్న బెంగలూరులోని రాజరాజేశ్వరి నగర్‌నుంచి ప్రాతినిధ్యవహిస్తున్నారు.కన్నడిగులు-తమిళుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఉన్న హనుమంతరాయప్ప కూడా మునిరత్న మీద కేసుదాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎవరైనా అడుగుపెడితే తన్ని పంపండి, నేను చూసుకుంటాను అన్న మంత్రి వీడియోను కూడా పోలీసులకు అందచేశారు. ఇతగాడు సినిమా నిర్మాత కూడా.” ఉరి గౌడ నంజె గౌడ ”అనే పేరుతో ఒక సినిమా పేరు నమోదు చేశారు. వక్కళిగ సామాజిక తరగతికి చెందిన ఆ పేర్లు గల వారు పద్దెనిమిదవ శతాబ్దిలో మైసూరు రాజు టిప్పు సుల్తాన్ను హత్య చేశారన్నది ఒక కథ. దాన్ని చరిత్రకారులు కొట్టిపారవేశారు. తరువాత అంతటితో నిలిపివేశారు.


మాజీ సిఎం ఎడియూరప్పను గద్దె దించటంలో ప్రత్యర్ధులు పై చేయి సాధించారు. ఇక అతని హవా నడవదు అని కొద్ది వారాల క్రితం బిఎల్‌ సంతోష్‌ వర్గానికి చెందిన సిటి రవి బహిరంగంగానే ప్రకటించారు.తాను ఎనిమిదిసార్లు గెలిచిన షికారిపుర స్థానం నుంచి తన కుమారుడు విజయేంద్ర పోటీ చేస్తాడని 2022 జూలైలోనే ఎడియూరప్ప ప్రకటించారు. షికారిపురతో సహా ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది నిర్ణయించాల్సింది అధిష్టానం తప్ప ఎవరో ఒకరి వంటింట్లో కాదని సిటి రవి అన్నారు.బిఎల్‌ సంతోష్‌ ఎత్తుగడలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. విజయేంద్ర తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చి నాయకత్వస్థానం కోసం పోటీ పడతారని అనేక మంది బిజెపి నేతలు భావిస్తున్నారు.వారిలో తన కుమారుడిని రంగంలోకి తేవాలని చూస్తున్న అదే సామాజిక తరగతికి చెందిన మంత్రి సోమన్న కూడా చూస్తున్నారు. గతంలో ఇతగాడిని బిజెపికి ఆకర్షించటంలో ఎడియూరప్ప కీలకంగా ఉన్నారు. ఎప్పుడూ ఆ ఒక్క కుటుంబానిదేనా ఆధిపత్యం అన్నది సోమన్న వాదన.


ప్రభుత్వ రంగ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ విక్రయించే ” నందిని ” పాలను దెబ్బతీస్తూ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన అమూల్‌ను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. నందిని మీద ప్రేమ కంటే నరేంద్రమోడీ, అమిత్‌షా మీద ఉన్న ద్వేషాన్ని ఇది సూచిస్తున్నదని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ఇదొక అడ్డదారి అని విమర్శకుల వాదన. రాష్ట్రంలో తమిళనాడుకు చెందిన ఆరోగ్య, హెరిటేజ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాడ్ల, తిరుమల పాలు విక్రయిస్తున్నపుడు అమూల్‌ను ఎందుకు వ్యతిరేకించాలని సూర్య ప్రశ్నించారు. ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలకు చెందినవి. కర్ణాటక ప్రభుత్వ సంస్థను దెబ్బతీస్తూ మరో ప్రభుత్వ కంపెనీకి ఎర్రతీవాచీ పరవటం ఏమిటన్నది ప్రశ్న.దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ దెబ్బతీస్తున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సంస్థల జోలికి పోకుండా వాటిని రక్షిస్తున్నారన్న విమర్శ ఇప్పటికే ఉంది. కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ బిజెపి తరఫున ప్రచారానికి దిగనున్నారు. దీని మీద మరోనటుడు ప్రకాష్‌ రాజ్‌ స్పందించారు. ఒక కళాకారుడిగా అందరి అభిమానం పొందే మీరు ప్రజల వాణిగా ఉంటారనుకున్నాను. కానీ స్వయంగా ఒక పార్టీ రంగు వేసుకున్నారు. మంచిది, ప్రతి పౌరుడు మిమ్మల్ని, మీ పార్టీని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. ఆదాయపన్ను శాఖ దాడుల బెదిరింపుతోనే సుదీప్‌ బిజెపికి ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. మొత్తం మీద కన్నడ ఎన్నికల్లో సినిమా స్టార్ల ప్రచారం ఒక ఆకర్షణగా మారనుంది. జనం ఏదైనా ఒక పార్టీని ఓడించదలచుకున్నపుడు ఎంత పెద్ద స్టార్లు ప్రచారం చేసినా సదరు పార్టీని రక్షించలేదని గతంలో అనేక చోట్ల రుజువైంది. కర్ణాటక దానికి మినహాయింపుగా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d