• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు : పదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ఎగుమతులు తగ్గాయన్న ప్రపంచ బాంక్‌ !

16 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, 10 years Narendra Modi, BJP, China, Donald trump, India Exports, India Imports, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మనల్ని నిలదీస్తారు. అంతే కాదు ప్రపంచ దేశాల్లో 2022 సౌదీ అరేబియా తప్ప జి-20 దేశాల్లో 6.7శాతంతో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటపుడు మన దిగుమతులు కూడా ఎందుకు తగ్గినట్లు ? తాజాగా వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వాల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మన ఎగుమతులు 11.9శాతం తగ్గి 172.95 బిలియన్‌ డాలర్లుండగా మన దిగుమతులు 12శాతం తగ్గి 271.83 బి.డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే మన వాణిజ్య లోటు 112.85 నుంచి 98.88 బి.డాలర్లకు తగ్గింది. అంటే పద్నాలుగు బిలియన్‌ డాలర్ల మేర మన విదేశీమారక ద్రవ్యం మిగిలింది. కానీ సెప్టెంబరు 16వ తేదీ సమాచారం ప్రకారం గడచిన పదకొండు వారాలలో ఐదు బిలియన్‌ డాలర్లు తగ్గి మన నిల్వలు 593,9బి.డాలర్లకు చేరాయి. మన దిగుమతులు గతేడాది మాదిరిగా ఉంటే వాటి పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది.

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు అంటూ సాగే జానపద గీతంలో మాదిరి పదేండ్ల నుంచి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన కబుర్లేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
గుజరాత్‌ తరహాలో దేశమంతటినీ అభివృద్ధి చేస్తామన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పారు. ఎగుమతులతో చైనాను వెనక్కు నెట్టేసేందుకు గాను మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పధకాలను ప్రకటించారు. గంగరాజు మురిపించిన మాదిరి కబుర్లు తప్ప పరిస్థితి ఇంకా దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్ప కేంద్రం ప్రకటించిన ఆర్ధిక విధానాలనే రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి.మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలోనే కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ ఫైనాన్స్‌ అనే పత్రికలో 2023 జూన్‌ ఎనిమిదవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలంలో మన సగటు వృద్ధి రేటు 4.1శాతం కాగా, దిగజారిందీ, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉందని చెబుతున్న చైనాలో 5.5 శాతం ఉంది. వికీపీడియా సమాచారం ప్రకారం 2022లో ఎగుమతులలో ప్రధమ స్థానంలో ఉన్న చైనా వస్తు, సేవల విలువ 3,71,582.7 కోట్ల డాలర్లు కాగా, అమెరికా 3,01,185.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మనదేశం 76,771.7 కోట్లతో పదవ స్థానంలో ఉంది. పదిహేనవదిగా ఉన్న హాంకాంగ్‌ ఎగుమతుల విలువ 69,829.3 కోట్ల డాలర్లు. చైనా తన ఉత్పత్తులు కొన్నింటిని హాంకాంగ్‌ పేరుతో ఎగుమతి చేస్తున్న సంగతి బహిరంగమే. ప్రపంచ జిడిపిలో దేశాన్ని నరేంద్రమోడీ ఐదవ స్థానంలోకి తీసుకుపోయినట్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎగుమతుల్లో ఎందుకు తీసుకుపోలేదన్నది ప్రశ్న. ప్రపంచబాంకు విశ్లేషణ ((https://data.worldbank.org/indicator/NE.EXP.GNFS.ZS?locations=IN ) )ప్రకారం 2004లో యుపిఏ అధికారంలోకి వచ్చినపుడు మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతుల విలువ 17.9 శాతం కాగా 2013 నాటికి 25.3కు పెరిగింది. మరుసటి ఏడు 23శాతంగా ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అది క్రమంగా తగ్గుతూ 2019లో 18.7కు దిగజారింది. తరువాత 2022లో 22.4శాతం ఉంది.1960 నుంచి 1990 వరకు మన జిడిపిలో ఎగుమతుల విలువ 4.5 నుంచి 7.1శాతం మధ్య ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్ధిక విధానాల్లో మార్పుల తరువాత అది 1998 నాటికి 11 శాతానికి చేరింది. బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి అధికారంలో ఉన్న 1998-2004కాలంలో పైన చెప్పుక్నుట్లు 17.9శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలోనే తొలిసారిగా పదేండ్ల కాలంలో పతనమైంది. ఎగుమతులను పెంచేందుకు ప్రతి దేశమూ చర్యలు తీసుకుంటున్నపుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నవాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట విధానం, నిలకడ, స్పష్టత లేని, సరైనవి కాని విధానాలను అమలు జరిపినపుడు అవి జయప్రదం కావు. మన దేశంలో జరిగిందీ, జరుగుతున్నదీ అదే. జనానికి ఏం చెప్పారు, ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న.


చైనాతో సరిహద్దు ఉన్న గాల్వన్‌ లోయలో 2020లో జరిగిన ఉదంతంలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద నిషేధం, చైనా నుంచి పెట్టుబడులు రాకుండా ఆంక్షల విధింపు హడావుడి చేసిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దాంతో అనేక మంది చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని, నరేంద్రమోడీ అందుకు సమర్ధులని ప్రచార ఆర్భాటం చేశారు. జనాల మనోభావాలను సంతుష్టీకరించి చైనాను దెబ్బతీసిన మొనగాడిగా నరేంద్రమోడీ కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌లు, పెట్టుబడులు మన రక్షణను దెబ్బతీస్తాయని చెబితేే జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. సరిహద్దు వివాదం, 1962లో యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలూ వివాదాలకు దౌత్య సంబంధాలకు, వాణిజ్యానికి ముడిపెట్టకూడదన్న అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం, పర్యవసానమే నరేంద్రమోడీ- షీ జింపింగ్‌ ఇద్దరూ కలసి ఊహాన్‌-మహాబలిపురాల్లో ఉయ్యాలలూగేందుకు దోహదం చేసింది. గాల్వన్‌ ఉదంతాలు తీవ్ర విచారకరమైనవి. కానీ వాటికి-వాణిజ్యానికి లంకెపెట్టి హడావుడి చేసిన పెద్దలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ మాటలను తామే దిగమింగి పెద్ద ప్రచారం లేకుండా చైనా సంస్థలకు తిరిగి స్వాగతం పలుకుతున్నారు. ఇది రక్షణకు ముప్పులేదని అంగీకరించటమే కదా ! మన దేశంతో సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది. చైనా మినహా మిగిలిన దేశాలన్నీ మన నుంచి పెట్టుబడులను తీసుకొనేవే తప్ప పెట్టుబడులు పెట్టే సత్తా వాటికి లేదన్నది తెలిసిందే. అందుకే ఆ నిబంధన చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. కానీ సూటిగా ఆ మాట చెప్పే ధైర్యం మోడీ సర్కార్‌కు లేదు. కొండంత ప్రతికూల రాగం తీసి కీచు గొంతుతో మాట్లాడుతున్నట్లు ఇప్పుడు దారి తెరిచారు.


మన దేశంలో షియోమీ ఫోన్లను సరఫరా చేసే డిక్సన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో సెల్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు పోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ తెలిపింది. నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న మూడు సంవత్సరాల్లో మూడు లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్‌ ఫోన్ల యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, వచ్చే నెలలో ప్రారంభించనట్లు వార్తలో పేర్కొన్నారు. ఇదే విధంగా మన దేశంలోని అప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు బ్లూటూత్‌ నెక్‌బాండ్‌ ఇయర్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్టును కూడా అదే కంపెనీ అప్పగించింది. ఇటీవలి కాలంలో షియోమీ కంపెనీ మీద విధించిన ఆంక్షలు, ఇతర కారణాలతో మన దేశంలో దాని ఉత్పత్తుల విక్రయం తగ్గింది. ఈ ఒప్పందాలతో ఆటంకాలను అధిగమించి తిరిగి మార్కెట్‌ వాటాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.చట్టబద్దంగా, మన చట్టాలకు అనుగుణంగా పని చేసే చైనాతో సహా ఏ దేశానికి చెందిన ఏ సంస్థనైనా అనుమతిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా సరఫరా వ్యవస్థ నుంచి వైదొలగాలని అమెరికా, ఇతర ఐరోపా దేశాల గీతానికి మన దేశం కోరస్‌గా గొంతు కలిపింది. అయితే చైనా మీద ఆధారపడకుండా మనుగడ కష్టమని గడచిన మూడు సంవత్సరాల అనుభవతత్వం బోధపడటం, మన దేశంలోని కార్పొరేట్‌ సంస్థల వత్తిడి, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు రాకపోవటం, చైనా నుంచి కంపెనీలు వియత్నాంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకోవటం వంటి పరిణామాలతో చైనా కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టం. తన వైఖరిని సమర్ధించుకొనేందుకు మనదేశ కంపెనీలకు 51శాతం వాటా ఉండాలన్న నిబంధన విధించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు 2022 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు లీకులు వదిలారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత విధించిన ఆంక్షల ప్రకారం 2020-21లో చైనా నుంచి వచ్చిన 58 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను, మరుసటి ఏడాది మరో 33 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది.సంయుక్త రంగంలో విద్యుత్‌ వాహనాల తయారీకి వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామన్న చైనా బివైడి కంపెనీ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.2023 మార్చి 21 నాటికి చైనా లేదా హాంకాంగ్‌ నుంచి వచ్చిన 54 పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు తెలిపారు.


ప్రతి దేశం తన స్వంత పరిశ్రమలు, వాణిజ్యాన్ని కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నది. దానికి మనదేశం కూడా మినహాయింపు కాదు. నరేంద్రమోడీ సర్కారు కూడా ఆర్ధిక ఆయుధాలను ప్రయోగించి పరీక్షిస్తున్నది.చైనా విషయంలో అవి పని చేయటం లేదన్నది గత పది సంవత్సరాల అనుభవం చెబుతున్నది. చైనా నుంచి మన దిగుమతులు దాదాపు రెట్టింపు కావటమే దానికి నిదర్శనం. అదే మాదిరి మన ఎగుమతులు పెరగలేదు. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం రెండు దేశాల మధ్య 2022లో 117 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగితే చైనా నుంచి దిగుమతుల వాటా 87శాతం ఉంది. మన దేశం నుంచి రొయ్యలు, పీతల వంటి సముద్ర ఉత్పత్తులు, పత్తి, గ్రానైట్‌, వజ్రాల వంటి వాటిని ఎగుమతి చేస్తుంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ చిప్స్‌,ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, ఔషధాల తయారీకి అవసరమైన పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నాము. మన ఉత్పత్తుల ఎగుమతి నిలిపివేసినా చైనా వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా నుంచి మనం తెచ్చుకుంటున్న వస్తువులను అంత తక్కువ ధరలకు మరేదేశమూ ఇవ్వని కారణంగానే మరో మార్గం లేకౖ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అనుమతించకపోతే కార్పొరేట్ల ఆగ్రహానికి మోడీ గురికావాల్సి వస్తుంది.


ఇక మనదేశం తీసుకుంటున్న రక్షణాత్మక చర్యల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో అంబానీ కంపెనీ జియో లాప్‌టాప్‌లు,టాబ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అంతకు ముందు అదే కంపెనీ వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మార్కెట్‌ చేసింది. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తూ తన పేరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించి అవసరమైన వారు అనుమతి తీసుకోవాలంటూ నిబంధన విధించింది.ఇంతకాలం లేని అనుమతులు ఇప్పుడెందుకు ? ఇది ఎవరికోసమో చెప్పనవసరం లేదు. 2018లో అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్‌ చైనా వస్తువుల మీద దిగుమతి పన్ను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. అదే ఏడాది మన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్ల దిగుమతులను అడ్డుకొనేందుకు ఇరవైశాతం పన్ను విధించింది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా బొమ్మలపై అప్పటికే ఉన్న దిగుమతి పన్నును 60, తరువాత 2021లో 70శాతానికి పెంచింది.షియోమీ, బిబికె ఎలక్ట్రానిక్స్‌ చెల్లించాల్సినదాని కంటే తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపించి ఆ సంస్థల మీద దాడులు చేశారు. మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఉత్పాదక ఎగుమతి బోనస్‌గా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 బిలియన్‌ డాలర్లను పక్కన పెట్టి ఒక పధకాన్ని రూపొందించింది. అందుకోసం పద్నాలుగు రంగాలను గుర్తించింది, వాటిలో ఎక్కువగా చైనా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. చివరకు ఇప్పుడు ఆ చైనా కంపెనీల పెట్టుబడులకే అనుమతులు ఇచ్చి ఉత్పత్తులు చేయించేందుకు, సబ్సిడీలు ఇచ్చి ఎగుమతు చేయించేందుకు పూనుకుంది. స్థానిక కంపెనీలతో కలసి సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయాలనే షరతు విధించింది. గతంలో నిషేధం విధించిన షి ఇన్‌ కంపెనీ మన అంబానీ రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతించింది. ఎందుకు అంటే సదరు కంపెనీ ఇప్పుడు సింగపూర్‌లో ఉందని చెబుతున్నారు. ఎక్కడున్నా అది చైనా కంపెనీయే, లాభాలు వెళ్లేది చైనాకే కదా ! గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న ఉక్కు ఉత్పత్తుల్లో జూన్‌ నెలలో చైనా నుంచి 26.1, వియత్నాం నుంచి ఒకశాతం ఉండగా ఈ ఏడాది జూన్‌ నాటికి అవి 37.1, 4.8 శాతాలకు పెరిగాయి. చైనా ఉక్కు ఉత్పత్తుల దిగుమతి కారణంగా తమకు నష్టం జరుగుతోందని అందువలన వాటి మీద సబ్సిడీ వ్యతిరేక పన్ను విధించాలని మన ఉత్పత్తిదారులు చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే తిరస్కరించింది. దానికి తగిన ఆధారాలు లేవంది. ఇది చైనాను ప్రసన్నం చేసుకొనే చర్యగా ఆ రంగానికి చెందినవారు భావిస్తున్నారు. రాజకీయం, వివాదాస్పదం చేయటం, తిరిగి అదే చైనాకు అనుమతులు ఇవ్వటమెందుకు అంటే లేకుంటే కార్పొరేట్ల లాభాలకు గండి పడుతుంది, అప్పుడు వాటి కన్నెర్రకు గురి కావాల్సి వస్తుంది, చివరికి అధికారానికే ఎసరు వస్తుంది గనుక, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రిక్స్‌ సదస్సులో ధనికదేశాలకు షీ జింపింగ్‌ హెచ్చరిక : రంకెలేసి, బలప్రదర్శన చేస్తే కుదరదు !

29 Tuesday Aug 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BRICS 2023 Summit, BRICS expansion, BRICS nations, China, Narendra Modi, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా నగరమైన జోహన్నెస్‌బర్గ్‌లో ” బ్రిక్స్‌ (బిఆర్‌ఐసిఎస్‌)” కూటమి(బ్రెజిల్‌,రష్యా,ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పదిహేనవ శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా ముగిసింది.అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను ఈ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు, వాటికి అంగీకారమైతే 2024 జనవరి ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయి సభ్యులుగా పరిగణిస్తారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో 2006లో జరిగిన ఒక సమావేశంలో బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనాలతో ఏర్పడిన ఆర్థిక కూటమిని బ్రిక్‌ అని పిలిచారు. తరువాత 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో అది బ్రిక్స్‌ గా మారింది. ఇప్పుడు విస్తరణ బాటలో ఉన్నందున బ్రిక్స్‌ ప్లస్‌ అంటారా లేక మరేదైనా పేరు పెడతారా అన్నది చూడాల్సి ఉంది. బ్రిక్‌ లేదా బ్రిక్స్‌ కూటమి అని పేరు పెట్టటానికి గోల్డ్‌మన్‌ శాచస్‌ కంపెనీ ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ చేసిన వర్ణన ప్రేరణ అని చెబుతారు. ఇలాంటి కూటమి ఏర్పడితే అది 2050 నాటికి ప్రపంచ ఆర్థిక రంగంలో మిగతావాటిని వెనక్కు నెడుతుందని 2001లో జోశ్యం చెప్పాడు. బ్రిక్స్‌ విస్తరణ, దాని తీరు తెన్నులను చూస్తే అంతకంటే ముందే దాని ప్రభావం వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిదానమే ప్రదానం అన్నట్లుగా ముందుకు పోతున్న ఈ కూటమి నేడు పశ్చిమ దేశాల పెత్తనం,తంటాల మారి తనాన్ని ఎదుర్కొనే దిశగా ఉంది. నూతన ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకోసం చూస్తున్న ఈ కూటమి నడక నల్లేరు మీద బండిలా ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతుందని చెప్పలేము. ఈ సమావేశాల్లో లూలా డిసిల్వా(బ్రెజిల్‌),సెర్గీలావరోవ్‌(రష్యా విదేశాంగ మంత్రి),నరేంద్రమోడీ(ఇండియా), షీ జింపింగ్‌ (చైనా), సిరిల్‌ రామఫోసా(దక్షిణాఫ్రికా) పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద అంతర్జాతీయ కోర్టు వారంటు జారీ చేసింది. ఆ కోర్టును రష్యా అంగీకరించలేదు.

బ్రిక్స్‌కు ఆతిధ్యం ఇస్తున్న దక్షిణాఫ్రికా కోర్టు ఒప్పందంలో సభ్యురాలిగా ఉన్నందున తలెత్తే పరిస్థితి కారణంగా పుతిన్‌ హాజరు కాలేదు.
పారిశ్రామిక, సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకోవాలి,విచ్చిన్నం, ఆర్థిక బలవంతం చేయాలని చూస్తున్న శక్తుల చర్యలను అడ్డుకోవాలని, చైనా అధినేత షీ జింపింగ్‌ తాజా సమావేశంలో పిలుపునిచ్చారు. ఇదే తరుణంలో డిజిటల్‌ ఎకానమీ, హరిత వృద్ధి,సరఫరా వ్యవస్థల వంటి రంగాలలో ఆచరణాత్మక సహకారం అందించుకోవాలని కోరారు. అంతర్జాతీయ రంగంలో పెద్ద గొంతులేసుకొని, కండల ప్రదర్శనలతో తమ స్వంత నిబంధనలను రుద్దాలని చూస్తున్నవారి తీరు ఆమోదం కాదని, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.ఒక దేశం- ఒక కూటమి పెత్తనం లేకుండా ముందుకు వస్తున్న బహుముఖ ప్రపంచం, సాంప్రదాయక విలువలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు నూతన ఉదారవాద విధానాలు ముప్పు తెస్తున్నట్లు వీడియో ద్వారా పుతిన్‌ చేసిన ప్రసంగంలో పేర్కొన్నాడు. అమెరికా పేరు పెట్టకుండా దాని గురించే మాట్లాడినట్లు విశ్లేషకులు టీకా తాత్పర్యం చెప్పారు.పశ్చిమ దేశాలు బ్రిక్స్‌ కూటమి తమకు ముప్పుగానూ, జి-7కు పోటీగా దాన్ని మార్చేందుకు చైనా చూస్తున్నదనే అనుమానాలు పశ్చిమ దేశాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. విస్తరణలో భాగంగా చేరుతున్న దేశాలు కూడా పశ్చిమ దేశాల బాధితులే కావటం గమనించాల్సిన అంశం. ప్రపంచంలో ఏ దేశమూ గతంలో మాదిరి ప్రచ్చన్న యుద్ధ వాతావరణలో నడవాలని కోరుకోవటం లేదు.


బ్రిక్స్‌ దేశాల్లోని జనాభా 2022 లెక్కల ప్రకారం 324 కోట్ల మంది, అంటే ప్రపంచంలో నలభై శాతం మంది.భారత్‌, చైనాల్లోనే 382 కోట్ల మంది ఉండగా మిగిలిన మూడింటిలో 42 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ సాధారణ జిడిపిలో ఈ కూటమి వాటా 2000లో 11.74శాతం కాగా పదేండ్లలో 17.95, 2022 నాటికి 26శాతానికి పెరిగింది. అదే పిపిపి పద్దతిలో చూస్తే 31.5శాతానికి పెరిగి జి7 దేశాల 30శాతాన్ని దాటింది.2028 నాటికే బ్రిక్స్‌ వాటా 50శాతం దాట నుందని అంచనా. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2022కు చూస్తే జనాభా వాటా 43.92 నుంచి 41.42శాతానికి తగ్గింది. ప్రపంచ ఎగుమతుల్లో వాటా 8.2 నుంచి 18, ప్రపంచ వాణిజ్యంలో 7.51 నుంచి 18 శాతానికి, విదేశీ మారకద్రవ్య నిల్వ 281.2 నుంచి 4,581 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఆంక్టాడ్‌ 2023 గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) 2001-2021 కాలంలో 84 నుంచి 355 బి.డాలర్లకు పెరిగాయి.ఈ మొత్తంలో చైనా వాటా సగానికి పైగా ఉంది. ఒక్క జనాభాలో భారత్‌ ప్రధమ స్థానంలో ఉండటం తప్ప మిగిలిన అన్ని అంశాలలో చైనా ఎంతో ఎత్తున ఉంది.


జోహన్నెస్‌బర్గ్‌ శిఖరాగ్ర సభలో మొత్తంగా భిన్న నేపధ్యాల పూర్వరంగంలో దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక,ప్రపంచ సమస్యలపై ఏకీభావం సాధించేందుకు సంప్రదింపులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పం వెల్లడైంది. సమీకృత అభివృద్ధి,ప్రపంచ సవాళ్లు,దేశాల మధ్య సంబంధాలను పటిష్టపరుచుకోవాలన్న వాంఛను నేతలు వెలిబుచ్చారు. సభ జరిగింది ఆఫ్రికా ఖండంలో గనుక సహజంగానే దాని ఇతివృత్తానికి కేంద్ర స్థానం లభించింది.ప్రపంచ పేద దేశాలు ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలతో సంబంధాలు, సహకారం గురించి నేతలందరూ మాట్లాడారు. ఈ సభకు పుతిన్‌ రాకపోవటం గురించి పశ్చిమ దేశాల్లో ఇంకేముంది బ్రిక్స్‌లో విబేధాలు, రష్యా పలుకుబడికి గండిపడింది అన్నట్లుగా విశ్లేషణలను వండివార్చారు. ముందే చెప్పుకున్నట్లు ఆతిధ్య దేశాన్ని ఇరకాటంలో పెట్టకూడదన్న పరిణితి పుతిన్‌, ఇతర దేశాధినేతల్లో వెల్లడైంది.స్వయంగా హాజరు బదులు వీడియో కాన్ఫరెన్సుద్వారా పాల్గొని నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారు. బ్రిక్స్‌ను విస్తరించాలన్న ఆలోచన కొత్తగా వచ్చింది కాదు.2013లో దక్షిణాఫ్రికా అధ్యక్ష స్థానంలో ఉన్నపుడు ఆఫ్రికా యూనియన్‌కు స్థానం కల్పించాలని కోరింది. తరువాత 2017లో బ్రిక్స్‌ ప్లస్‌(బ్రిక్స్‌తో పాటు ఇతర దేశాలు) అన్న భావనను చైనా ముందుకు తెచ్చింది. తమకు సభ్యత్వం ఇవ్వాలని ఇరాన్‌, అర్జెంటీనా దరఖాస్తు చేసుకోవటంతో 2022లో బ్రిక్స్‌ సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మొత్తం నలభై దేశాలు ఆసక్తి వెల్లడించటంతో పాటు 23 లాంఛనంగా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి పైన పేర్కొన్న ఆరు దేశాలకు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు.


ప్రపంచ జనాభాలో ఈ కూటమి దేశాల్లో 46.5శాతానికి, జిడిపి 30శాతానికి పెరగనుంది. దేశాల వారీగా జిడిపి బిలియన్‌ డాలర్లలో, బ్రాకెట్లలో ప్రపంచంలో దేశ వాటా శాతాలు దిగువ విధంగా ఉన్నాయి. చైనా 19,374(18.4), భారత్‌ 3,737(3.6), బ్రెజిల్‌ 2,081(2), రష్యా 2,063(2), సౌదీ అరేబియా 1,062(1), అర్జెంటీనా 641(0.6), యుఏఇ 491(0.5) దక్షిణాఫ్రికా 399(0.4), ఈజిప్టు 387(0.4), ఇరాన్‌ 368(0.4), ఇథియోపియా 156(0.1)బి.డాలర్లు. విస్తరణతో ఈ కూటమి దేశాల చమురు వాటా ప్రపంచంలో 20.4 నుంచి 43.1శాతానికి పెరగనుంది.ప్రపంచంలో దేశాల వాటాల శాతాలు ఇలా ఉన్నాయి. సౌదీ అరేబియా 12.9, రష్యా 11.9,చైనా 4.4, యుఏఇ 4.3, ఇరాన్‌ 4.1, బ్రెజిల్‌ 3.3శాతం కాగా అర్జెంటీనా, భారత్‌ 0.8శాతం చొప్పున, ఈజిప్టు 0.7శాతం కలిగి ఉండగా దక్షిణాఫ్రికా, ఇథియోపియాల్లో అసలేమీ లేదు. ప్రపంచ సహజవాయువులో 30శాతం కలిగి ఉన్నాయి, ప్రపంచ చమురు ఎగుమతుల్లో వాటా 18 నుంచి 25.1శాతానికి పెరగనుంది. ప్రపంచ ఆర్థికరంగం మీద పెత్తనం చేస్తున్న డాలరును వెనక్కు నెట్టి బ్రిక్స్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలన్న ఆలోచన మీద కూడా జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల్లో చర్చ జరిగింది. కొన్ని దేశాల సందేహాల కారణంగా ముందుకు పోలేదు.ఉమ్మడి కరెన్సీని పంచుకోవటం గురించి బ్రెజిల్‌ ప్రతిపాదన ముందుకు తేడా మనదేశం భిన్న వైఖరిని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుత సమావేశ అజెండాల్లో లేదని దక్షిణాఫ్రికా పేర్కొన్నది. డాలర్లకు బదులు ఆయా దేశాల కరెన్సీలతో లావాదేవీలు జరపాలని చైనా, రష్యా పేర్కొన్నాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఈ దేశాలు సహజంగా డాలరును వ్యతిరేకిస్తున్నాయి.డాలర్లలో లావాదేవీల వాటా 2015లో వాటి వాటా 90శాతం ఉండగా 2020 నాటికి 46శాతానికి, తరువాత ఇంకా తగ్గింది. మన దేశం మాత్రం ఎగుమతులు-దిగుమతులకు 80శాతం డాలర్లనే వాడుతున్నది.


ప్రస్తుత విస్తరణ, రానున్న రోజుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల పెరుగుదలను చూసినపుడు ప్రపంచ బలాబాల్లో ఈ కూటమి కీలకంగా మారనున్నదనేది స్పష్టం.మనదేశం, చైనాతో సహా మిగిలిన దేశాలన్నీ బహుముఖ ప్రపంచ వ్యవస్థ ఉండాలని కోరుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న దేశాల ఆర్థిక రంగాలను చూసినపుడు తేడా చాలా ఎక్కువగా ఉంది. అందువలన వాటి ప్రయోజనాలు, ప్రాధాన్యతలు కూడా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన దేశం చైనాను అధిగమించాలని చూస్తున్నట్లు బహిరంగంగానే వాంఛ వెల్లడిస్తున్నది.వివాదాస్పద అంశాలపై కూడా ఈ కూటమిలో పూర్తి ఏకీభావం లేనందున అంగీకృత అంశాల మీదనే కేంద్రీకరణ జరుగుతున్నది. ఇండో-పసిఫిక్‌ పేరుతో చైనా వ్యతిరేక కూటమి నిర్మాణానికి పూనుకున్న అమెరికాకు దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకలు తిరిగేందుకు అవకాశం ఉండాలంటూ మన దేశం మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను సమర్ధించనప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలగకుండా ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఒక విధంగా చెప్పాలంటే ఎవరికీ నొప్పి తగలకూడదనే వైఖరితో మన దేశం గడసాము గరిడీలు చేస్తున్నది.


లండన్‌లోని సోయాజ్‌ చైనా సంస్థ డైరెక్టర్‌ స్టీవ్‌ సాంగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ సభ్యదేశాలు ఉపరితలంతో ఒకేవిధంగా లేవని, అయినప్పటికీ ఎవరూ పశ్చిమ దేశాల ఆధిపత్య ప్రపంచంలో జీవించకూడదని అందరూ అనుకుంటున్నట్లుగా చూపేందుకు షీ జింపింగ్‌ చూశారని, చైనా వారు చూపుతున్న ప్రత్యామ్నాయంలో నిరంకుశులు తమ స్వంత దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చని, ప్రజాస్వామిక అమెరికా, ఐరోపా దేశాలు రుద్దిన షరతులను అంగీకరించకుండా ప్రత్యామ్నాయ అభివృద్ధి పధాన్ని కనుగొనవచ్చనే భావన ఉన్నదని అన్నాడు. తమకు గానీ మరొక దేశానికి గానీ ప్రత్యర్ధిగా రాజకీయ ప్రత్యర్ధి తయారవుతున్నట్లుగా తాము భావించటం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులవాన్‌ సమావేశ ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు, వక్రీకరించేందుకు చూశారు.కొత్తగా బ్రిక్స్‌లో చేరిన ఆరు దేశాల్లో ఏ ఒక్కటీ అమెరికా వ్యతిరేకమైనది లేదని వాషింగ్టన్‌లోని క్విన్సీ సంస్థ డైరెక్టర్‌ సరంగ్‌ షిడోర్‌ అన్నాడు.ఈ సమావేశాల తరువాత పశ్చిమ దేశాలకు చెందిన విశ్లేషకులు, మీడియా వార్తల తీరు వక్రీకరణ, కూటమిలో అనుమానాలను రేకెత్తించేదిగా తంపులు పెట్టేదిగా ఉందని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పదేండ్ల ఏలుబడి : మూడోసారి అధికారం కోసం ఎగుమతుల నిషేధంతో రైతాంగాన్ని బలిపెడతారా !

25 Friday Aug 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, agri exports ban, Agricultur, BJP, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన మాటలను తానే దిగమింగి ప్రకటిత విధానాల నుంచి వైదొలగటాన్ని చూసి అనేక మంది అలాగే భావిస్తున్నారు.ఎగుమతి నిషేధాల జాబితాలో ఇక పంచదార వంతు అంటూ ఆగస్టు 23వ తేదీన ఒక వార్త వెలువడింది. అంతకు ఒక రోజు ముందు ” రైతులు లాభపడటాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వం ” అనే శీర్షికతో డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలో అజిత్‌ రనడే అనే ఆర్థికవేత్త కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక విశ్లేషణ రాశారు.కేంద్ర నిర్ణయాల మీద వివిధ కోణాల్లో మరికొందరు కూడా రాస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నింటినీ సడలిస్తామని, ఎలాంటి పరిమితులు విధించబోమంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం ఎగుమతి-దిగుమతి విధానంలో పేర్కొన్నది. తరువాత దాని కొనసాగింపుగా రాష్ట్రాలతో సంప్రదించకుండా, వాటి అభిప్రాయం తీసుకోకుండా మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి దేశం మీద రుద్దాలని చూసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన కారణంగా తప్పనిసరై వాటిని వెనక్కు తీసుకున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా అంతకు రెండేళ్ల ముందు ప్రకటించిన ఎగుమతి -దిగుమతి విధానాన్ని కూడా అటక ఎక్కించింది. ఎప్పుడేం చేస్తారో తెలియని ఇలాంటి పాలకులను నమ్మి ఎవరైనా ముందుకు పోగలరా ? గడచిరైతొమ్మిదేండ్ల పాలనలో ఒకటి స్పష్టం. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద, ప్రేమ రైతాంగం మీద లేదు. వారికి ఇచ్చినన్ని రాయితీలు, రద్దు చేసిన రుణాలు రైతులకు లేవు.


ఇప్పటి వరకు పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు, పరిమితులు మాత్రమే విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నిషేధం విధిస్తూ నేడో రేపో ప్రకటన చేయనుందని ఆగస్టు 23న రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అంతకు ముందు వచ్చే సీజన్‌లో 40లక్షల టన్నులకు ఎగుమతులు పరిమితం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి చెరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేని కారణంగా చెరకు దిగుబడి తగ్గవచ్చని అందువలన పంచదార ధరలు పెరగకుండా ఎగుమతులపై నిషేధం విధించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలో తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు 61లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం మిల్లులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాదిలో 111లక్షల టన్నుల ఎగుమతికి అనుమతించారు.వచ్చే రెండు సంవత్సరాల్లో దిగుమతి తగ్గవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో నెల రోజుల్లో ముగియనున్న సంవత్సరంలో పంచదార ఉత్పత్తి 3.6 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేయగా 3.28ోట్లకు మించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. మన దేశం నుంచి ఎగుమతి లేకుంటే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో పెరిగిన ధరలు మరింత పెరుగుతాయని, బ్రెజిల్‌ ఎగుమతిదారులు మంచి ధరతో లబ్దిపొందుతారని భావిస్తున్నారు.


2022 ఏప్రిల్‌ 13న గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్‌ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ ఆ సందర్భంగా వెల్లడించారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు. అదే ఏడాది మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌లో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్‌ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్‌ 49, పాకిస్తాన్‌ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి. 2022లో 121 దేశాలకు గాను 107వ స్థానంలో మన దేశం ఉంది. శ్రీలంక 64, మయన్మార్‌ 71, నేపాల్‌ 81, బంగ్లాదేశ్‌ 84, పాకిస్తాన్‌ 99 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?


ప్రధాని మాటల కొనసాగింపుగా అంతకు ముందు ఏడాది చేసిన 20లక్షల టన్నులను 2022-23లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్‌,టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం, అల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పది-పదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు.


ఈ ఏడాది తాజాగా గోధుమ పిండి, మైదా, గోధుమ రవ్వ ఎగుమతులను కూడా నిషేధించింది. అంతే కాదు ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మన దేశం ఇప్పుడు గోధుమలను కూడా దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. టన్నుకు 25 నుంచి 40 డాలర్ల వరకు తక్కువకు దిగుమతి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. స్థానిక మార్కెట్లో పెరిగిన ధరలను తగ్గించేందుకు అని చెబుతున్నారు. ఇదంతా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ధరలను తగ్గించామని జనం ముందు చెప్పుకొనేందుకు తప్ప వేరు కాదన్నది స్పష్టం.. ఉల్లి ధరల పెరుగుదల సూచన కనిపించటంతో వాటి ఎగుమతులపై 40శాతం పన్ను విధించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దీంతో నాసిక్‌ ప్రాంతంలోని వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపివేశారు. క్వింటాలు రు.2,410 రూపాయల ధరతో తాము కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ ప్రకటించారు.ఎగుమతులు లేక కేంద్రం దిగుమతులు చేసుకుంటే తాము కొన్న ధరలకంటే మార్కెట్లో తగ్గితే నష్టపోతామన్న భయంతో వారు మానుకున్నారు. ధరలు పెరిగినపుడు కొద్ది నెలలు ఉల్లి తినటం మానుకుంటే సరి అధిక ధరలకు ఎవరు కొనమన్నారు అంటూ మహారాష్ట్ర బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ మంత్రి దాదా భూసే అన్నారు. 2019లో ఉల్లి ధర కిలో రు.100కు చేరినపుడు నేను ఉల్లిపాయలు తినను అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చిన గతం బిజెపికి గుర్తుకు వచ్చి ముందు జాగ్రత్తపడుతున్నది. కానీ నష్టపోతున్నది రైతులే. ధరలు పతనమైనపుడు కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రు.2,410కి కొన్న దాఖలా లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, ఊరూవాడా తిరిగి మరీ చెప్పారు. వ్యాపారుల నిల్వలతో సహా అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తామని రైతులు నేరుగా ఎగుమతులు చేసుకోవచ్చని అరచేతిలో ప్రపంచ మార్కెట్లను చూపారు. ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ? మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను విధించి అడ్డుకుంటున్నారు, రైతులపై ఎందుకీ కత్తి ? పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఎగుమతి ప్రోత్సాహకాల మాదిరే రైతాంగ ప్రయోజనాలను కాపాడాలా లేదా ? ఎగుమతులకు రాయితీలు ఇచ్చి విదేశీయులకు మన వస్తువులను చౌకగా అందించేందుకు పడుతున్న తాపత్రయంలో నూరోవంతు మన వినియోగదారుల మీద చూపి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి తప్ప రైతుల నడ్డి విరవటం ఏమిటి ?


ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్న బిజెపి పాలకుల విధానాలు తెలియనంత అమాయకంగా జనాలు లేరు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మే సందర్భంగా ప్రభుత్వాలు పాలన కోసం తప్ప వ్యాపారాలు చేసేందుకు కాదని చెబుతారు. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల టమాటాలను, ఇప్పుడు ఉల్లిపాయలను కూడా రాయితీ ధరలకు ఎన్‌సిసిఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా అమ్ముతూ వ్యాపారం చేస్తున్నది. ఇందుకోసం వెచ్చిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఎక్కడ నుంచి చెల్లిస్తున్నట్లు ? ప్రజల సొమ్మును బిజెపికి ఓట్ల కోసం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల బాస్మతి రకాలు తప్ప మిగిలిన అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద కేంద్రం నిషేధం విధించింది. దాంతో అమెరికాలో మనవారు అక్కడి దుకాణాల మీద ఎగబడి ఎలా కొనుగోలు చేసిందీ చూశాము. కొంత మంది చెబుతున్నదాని ప్రకారం ఇథనాల్‌ ఉత్పత్తిదారుల కోసమే ఈ పని చేశారు. ముక్కలుగా మారిన 50-60లక్షల టన్నుల బియ్యంలో 30లక్షల టన్నులను ఇథనాల్‌కు కేటాయించనున్నట్లు వార్తలు. బియ్యం ఎగుమతులపై నిషేధం రైతాంగానికి నష్టం.తమకు కావాల్సిన బియ్యానికి క్వింటాలుకు రు.3,400 చెల్లించి మరీ కొంటామని అడిగినప్పటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు కేంద్ర నిరాకరించింది. అదే ప్రభుత్వం పెట్రోలులో కలిపేందుకు తయారు చేసే ఇథనాల్‌కు మాత్రం రు.2,000కే సరఫరా చేస్తున్నది. నీతి అయోగ్‌ రూపొందించిన ఒక పత్రంలో పేర్కొన్న సమాచారం మేరకు 2025-26 నాటికి పెట్రోలులో 20శాతం ఇథనాల్‌ను మిళితం చేయాలని ప్రతిపాదించారు. దీనిలో సగం బియ్యం నుంచి తయారు చేయాల్సి ఉంది.


కేంద్ర ప్రభుత్వం 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ఏటా ఆరువేల రూపాయలను రైతులకు చెల్లించేందుకు ఒక పధకాన్ని ప్రకటించింది.తొలి విడత మొత్తాన్ని 2018 డిసెంబరు నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కోసం అప్పటి నుంచి ఏటా అరవైవేల కోట్ల మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఈ మొత్తాన్ని నరేంద్రమోడీ రైతులకు ఇస్తున్న సాయంగా బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇవ్వటం లేదు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో పేరుతో ప్రతి లీటరు పెట్రోలు మీద రు.2.50, డీజిల్‌ మీద రు.4 సెస్‌ వసూలు చేస్తున్నది.ఆ నిధి నుంచే కిసాన్‌ సమ్మాన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి.2021-22 బడ్జెట్‌లో ఈ సెస్‌ ద్వారా వసూలు చేయాల్సిన మొత్తం రు.76,950 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రైతులకు చెల్లించుతున్నదాని కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి సర్దుబాటు చేస్తున్నాం తప్ప వినియోగదారుల మీద అదనపు భారం మోపటం లేదని కేంద్రం వాదిస్తున్నది. అసలు కిటుకు ఏమంటే ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో వసూలు చేసే మొత్తాలలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని నామమాత్రం చేసి సెస్‌ పేరుతో వసూలు చేస్తే సెస్‌ నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మేరకు రాష్ట్రాలకు రాబడి తగ్గినట్లే. రైతులకు ఇచ్చే ఎరువుల రాయితీ గురించి గొప్పగా చెబుతున్నారు. కొన్నివేల కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలు, రుణాల రద్దుతో పోల్చితే కోట్లాది మంది రైతాంగానికి ఇస్తున్న మొత్తాలు ఎంత ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు రు.73వేల కోట్ల సబ్సిడీ 2022-23లో రెండున్నరలక్షల కోట్లకు పెంచినట్లు ప్రచారం చేస్తున్నారు. పదేండ్ల ఏలుబడిలో ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటంలో తమ వైఫల్యానికి నరేంద్రమోడీ చెల్లిస్తున్న పరిహారమిది. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతి ఖర్చు పెరిగింది. దాన్ని రైతుల ఉద్దరణ అంటున్నారు. పెరిగిన ధరలతో ఎరువులు కొనాలంటే రైతులు సాగు మానుకోవటం తప్ప మరో దారి ఉండదు. నూటనలభై కోట్ల మందికి ఆహారం అందించే పరిస్థితి ఉండదు గనుక తప్పనిసరై భరిస్తున్నారు.ఈ మొత్తం ప్రతి ఏటా ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2014-15లో రు.75,067 కోట్లు ఇస్తే తరువాత సంవత్సరాలలో వరుసగా 76,538, 74,100, 69,206,73,435 కోట్లు ఇచ్చింది. 2019-20 నుంచి తరువాత మూడు సంవత్సరాల్లో ఆ మొత్తాలు రు.83,468, 1,31,229,1,57,640 కోట్లు చెల్లించింది. దీనికి ప్రధాన కారణం దిగుమతి ఎరువుల ధరల పెరుగుదల ఒకటైతే, రూపాయి విలువ పతనాన్ని నిరోధించలేని అసమర్ధత మరో కారణం. ఈ కారణంగానే సబ్సిడీ పెరిగింది. దిగుమతి ఎరువుల ధరలు తగ్గితే సబ్సిడీని తగ్గించి వేస్తారు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరం 2014-15 నుంచి ఇప్పటి వరకు వివిధ బాంకుల నుంచి రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల కోట్లు. దీనిలో సగానికిపైగా మొత్తం బడా పారిశ్రామికవేత్తలు, సేవలందించే కంపెనీలవే ఉన్నాయి.ఈ రుణాలను రద్దు అనకూడదు, పక్కన పెట్టాము, వసూలు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతారు. అదేలా ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి నెల వరకు వసూలు చేసిన మొత్తం రు.2.04లక్షల కోట్లు మాత్రమే. బడా సంస్థలకు పన్ను రాయితీల మొత్తం ఎలా ఉందో చూద్దాం.2014-15లో కార్పొరేట్‌ టాక్సు రు.4.3లక్షల కోట్లు ఉండగా అది 2018-19నాటికి 6.6లక్షల కోట్లకు పెరిగింది. తరువాత దాన్ని తగ్గించటంతో 2021-22 నాటికి రు.5.5లక్షల కోట్లకు పడిపోయింది. దిగుమతుల మీద విధించే కస్టమ్స్‌ సుంకం రు.1.9లక్షల కోట్ల నుంచి రు.1.4లక్షల కోట్లకు తగ్గింది. మధ్య తరగతి ఉద్యోగులు ఎక్కువగా చెల్లించే ఆదాయపన్ను మాత్రం ఇదే కాలంలో రు.2.6 నుంచి 5.6లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల్లో కార్పొరేట్‌ టాక్సు వాటా 34.5 నుచి 24.7శాతానికి, కస్టమ్స్‌ పన్ను 15.1 నుంచి 6.1శాతానికి తగ్గగా ఆదాయపన్ను 20.8 నుంచి 25.3శాతానికి పెరిగింది. ఇంతగా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న పాలకులు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎగుమతులపై నిషేధాలతో వారి నడ్డివిరిచేందుకు చూస్తున్నారు. వారి స్వయం ప్రకటిత విధానాలనే పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికల నాటికి ధరల పెరగకుండా చూసుకోవటం, ఆ ఘనత తమదే అని చెప్పుకొనేందుకు తప్ప మరొకటి కాదు. ఎగుమతుల రద్దు అంటే దాన్ని అవకాశంగా తీసుకొని కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచిన గతం పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : కొనసాగుతున్న రూపాయి పతనం-నిరోధానికి చేసింది శూన్యం !

20 Sunday Aug 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Indian Rupee, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మనవైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలకూ అదే పరిస్థితిని రూపాయి తెచ్చింది. ” రూపాయి అగాధంలో పడుతుందా దాని కంటే ఎక్కువ లోతులో కాంగ్రెస్‌ పడుతుందా అన్న పోటీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి దేశ భద్రత గురించిగానీ అదే విధంగా రూపాయి పతనం గురించి గానీ పట్టలేదు. దాని కుర్చీని కాపాడుకోవటం గురించే ఆందోళన పడుతోంది. డాలరుతో మారకంలో రూపాయి పతనం అవుతోంది. కాంగ్రెస్‌ కారణంగా అది ఐసియులో ఉంది. ” రూపాయి పతనం గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ ట్వీట్లు, సభలలో చేసిన విమర్శలివి.2013-14లో రూపాయి ఒక డాలరుకు రు. 56-62 మధ్య కదలాడింది. ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పి రు. 83 దాటింది.

తాము అధికారానికి వస్తే రూపాయి విలువను రు.45కు పెంచుతామని నాడు బిజెపి చెప్పింది. ” గత మూడు నెలలుగా రూపాయి పతనం వేగంగా జరుగుతోంది. దాన్ని బలపరిచేందుకు కేంద్రం ఏ చర్యలూ చేపట్టలేదు. ఇలా రూపాయి పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి.ఇంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంటుందని దేశం ఎన్నడూ ఊహించలేదు.కానీ అలాంటి సంక్షోభంలో నాయకత్వం దిక్కుతోచకుండా ఉంది.దీంతో ఆశ సన్నగిల్లుతోంది.పౌరుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఎలాంటి చర్యలనూ కేంద్రం తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాంగానీ జరిగిందేమీలేదు. ” అని బిజెపి ఎన్నికల ప్రచారకమిటీ నేతగా మోడీ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 దాటింది. డాలరుతో మారకంలో అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. ప్రధాన కరెన్సీలతో 2014-2023లో ఆగస్టు 19నాటి రూపాయి విలువలు ఎలా ఉన్నదీ చూస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. 2014 ఏడాదిలో సగటు విలువ అని గమనించాలి.
కరెన్సీ ×××××× 2014 ××× 2023
డాలరు ×××××× 60.99 ××× 83.15
రూబుల్‌ ×××××× 1.61 ××× 0.88
పౌండ్‌ ××××××100.45 ××× 105.89
యువాన్‌్‌ ××××× 9.90 ××× 11.42
యన్‌్‌ ××××× 0.57 ××× 0.57
యూరో ××××× 81.04 ××× 90.57


డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి విలువ తగ్గలేదు, ఇతర కరెన్సీల కంటే మనది పటిష్టంగా ఉంది, ఇతర కరెన్సీల విలువలు కూడా పడిపోతున్నాయంటూ సమర్ధించుకొనేందుకు, జనాన్ని నమ్మించేందుకు బిజెపి మంత్రులు, నేతలు చూస్తున్నారు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఒక్క జపాన్‌ కరెన్సీ ఎన్‌తో మాత్రమే మన రూపాయి విలువలో మార్పు లేదు. మిగిలిన కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పతనమైంది. మన కంటే దరిద్రంగా ఉన్న దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మనది పెరగవచ్చు. ఉదాహరణకు పాక్‌ రూపాయి. 2014లో దాని విలువ 1.70 కాగా ఇప్పుడు 0.28కి పడిపోయింది. పాకిస్తాన్‌ నుంచి సరకులు దిగుమతి చేసుకుంటే మనకు కారుచౌక. మన దేశం నుంచి వారు దిగుమతి చేసుకుంటే భారం పెరుగుతుంది. ప్రధాన కరెన్సీలతో కూడా పతనం అన్నది వాస్తవం. డాలరు విలువ పెరిగింది, మనది తగ్గలేదు అని చెబుతున్న వారు ఇప్పుడున్న మారకం రేటుతో డాలర్లను కొంటారా లేక 2014నాటి రేట్లతో కొనుగోలు చేస్తారా ? ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. పతనం పదహారు రూపాయలు. ఇప్పుడు రు.83 అనుకుంటే మోడీ ఏలుబడిలో రు.24 తగ్గింది. మనది ఎగుమతి చేసే దేశమైతే మన కరెన్సీ పటిష్టంగా ఉంటే మనకు లాభం, దిగుమతులైతే డాలర్లు, ఇతర కరెన్సీల కోసం మనం ఎక్కువ రూపాయలు చెల్లించాలి.రాయితీ రేట్లకు మనం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. వారికి డాలర్లలో చెల్లించేందుకు వీలు లేదు గనుక మన చమురు శుద్ధి సంస్థలు ఇటీవల చైనా యువాన్లలో చెల్లిస్తున్నాయి. అంటే మనం డాలర్ల బదులు యువాన్లు కొనుగోలు చేస్తున్నాం.మన కంటే ముందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఎప్పటి నుంచో యువాన్లు చెల్లిస్తున్నాయి.


తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులను తాకింది. ఇంకా పతనం కావచ్చని చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించాలంటే అక్కడ వడ్డీ రేటు పెంచటాన్ని మార్గంగా విధాన నిర్ణేతలు ఎంచుకున్నారు. దాంతో అమెరికా డాలరు రుణాల మీద వచ్చే వడ్డీ ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అక్కడకు చేరుతున్నాయి.దాని విలువ పెరుగుతోంది.మనతో అనేక కరెన్సీల మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. మరికొంత కాలం అమెరికా వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అంటే మన కరెన్సీ విలువ ఇంకా పతనం కావచ్చు.మన ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉన్నందున మనకు నష్టం. డాలరుతో చైనా కరెన్సీ విలువ కూడా తగ్గింది. అది చైనాకు వరంగా మారింది. దాని ఎగుమతులు ప్రపంచంలో తక్కువ ధరకు అమ్ముడుపోతాయి. ఎగుమతి సామర్ధ్యం పెరుగుతుంది.మన ఎగుమతులకు పోటీ పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరిగితే మన రూపాయి మరింత బలహీనమౌతుంది.మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనం గల అనేక మంది స్విస్‌ బాంకుల్లో డబ్బుదాచుకుంటారని తెలిసిందే. వాటిని రక్షిత స్వర్గాలు అని పిలుస్తారు. అంటే స్విస్‌ కరెన్సీ ఫ్రాంక్‌లోకి డబ్బును మార్చుకొని ఆస్తులు కొనుగోలు లేదా బాంకుల్లో డబ్బు దాచుకుంటారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో ఒక స్విస్‌ ఫ్రాంక్‌కు మన కరెన్సీ మారకపు విలువ ఏడాది సగటు రు.66.68. అది ఇప్పుడు ఆగస్టు 19న రు.94.28గా ఉంది. అంటే మన కరెన్సీ పతనమౌతున్న కొద్దీ నగదు వ్యాపారులు డాలర్లు లేదా ఫ్రాంక్‌లో తమ డబ్బును దాచుకునేందుకు ఎగబడతారు. దాంతో వాటి విలువ మరింత పెరుగుతుంది. ఎగబడే దేశాల కరెన్సీ విలువ పతనమౌతుంది. ఇప్పుడు మన రూపాయి ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. పదేండ్ల క్రితం విమర్శలు చేసిన నరేంద్రమోడీ లేదా ఇతర బిజెపి నేతలు ఇప్పుడు నోటికి తాళం వేసుకొని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. మన కరెన్సీ విలువను పెంచేందుకు అంటే పదేండ్ల క్రితం బిజెపి చెప్పినట్లు రు.45కు తగ్గించేందుకు పూనుకుంటే మన ఎగుమతిదార్లు గగ్గోలు పెడతారు, దిగుమతిదార్లు సంతోషిస్తారు. అదే పతనాన్ని అనుమతిస్తే దానికి భిన్నంగా స్పందన ఉంటుంది.


2013 నాటి పతనానికి ఇప్పటి పతనానికి పోలిక సరైంది కాదు అని కొందరు ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని కూడా ఉదాహరణలు చూపారు. అలా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జనానికి కావలసింది రూపాయి బలపడితే లేదా పతనమైతే జనం మీద మన ఖజానా మీద చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఏమిటన్నది గీటురాయి. రెండురెళ్లు నాలుగు అన్నట్లుగా మన ఎగుమతులు పెరిగితే మనకు లాభం, దిగుమతులు పెరిగితే నష్టం. అన్ని అనర్ధాలకు కారకులు గత యుపిఏ పాలకులు అని ఊరూవాడా ప్రచారం చేశారు. మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి చైనా స్థానాన్ని ఆక్రమిస్తామన్నారు. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2022-23లోని గణాంకాల అనుబంధం పేజీ 108,109లో ఇచ్చిన సమాచారం ఏమి చెబుతున్నదో ఎవరైనా చూడవచ్చు.2003-04 (వాజ్‌పాయి సర్కార్‌ చివరి సంవత్సరం)లో మన దేశ ఎగుమతుల విలువ రు.2,93,367 కోట్లు కాగా యుపిఏ చివరి సంవత్సరం 2013-14 నాటికి అవి రు.19,05,011కోట్లకు చేరాయి. అదే నరేంద్రమోడీ ఏలుబడిలో 2021-22 నాటికి రు.30,47,021కు చేరాయి.ఎవరు ఎంత వృద్ధి సాధించినట్లు ? ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా కాంగ్రెసే అని వెంటనే చెప్పేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో దేశం పరువు పోయిందని, విదేశాలు తిరిగి తమ నేతి తిరిగి తెచ్చారని చెప్పుకుంటున్న బిజెపి నేతలు మన ఎగుమతులకు మార్కెట్లను ఎందుకు సంపాదించలేకపోయారో చెప్పగలరా ?


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : ఉపాధి నైపుణ్యం నిల్‌ – ఓట్లు తెచ్చే విద్వేషం ఫుల్‌ !

14 Monday Aug 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Education, employees, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, employability, Hate crime, Hate-Speech, Narendra Modi Failures, National Skill Development, practical skills, Skilled Labor Force


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి. ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18లోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పధకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్‌ ఫైనాన్సింగ్‌ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది.దేశంలోని 78శాతం మంది యువతరానికి అభ్యాససిద్దమైన నైపుణ్యాలు లేవు.జనాభాలో 15-24 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు.ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2శాతం మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల రాంకులో మన దేశం ప్రపంచంలో 60వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7శాతమే నైపుణ్య శిక్షణ పొందగా దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52శాతం ఉన్నారు. ఇక ప్రతిదాన్ని వాణిజ్య ప్రాతిపదికన లెక్కిస్తున్నారు గనుక 2030 నాటికి ప్రపంచ వృత్తి విద్యా మార్కెట్‌ విలువ పెరుగుదల 1,585 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందట.ఇక 2031నాటికి విద్యా రుణాల మార్కెట్‌ విలువ 8,750 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది. నైపుణ్యాలు, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 2020లో మన దేశంలో 180 బిలియన్‌ డాలర్లు ఉందని, 2030 నాటికి అది 313 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా.


2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు 2015లో ప్రధాని నరేంద్రమోడీ ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్‌డిటివీ వార్త ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖ సమాచారం మేరకు 2021 జనవరి 19 నాటికి దేశమంతటా 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 46.27లక్షల మందికి స్వల్పకాల శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి అంతకు ముందు వారు నేర్చుకున్నదాని గురించి పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వారిలో 19లక్షల మందికి ఉపాధి దొరికింది.స్కిల్‌డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సమాచారం మేరకు 2023 ఫిబ్రవరి ఆరు నాటికి 142లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 137లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 124లక్షల మందిని విశ్లేషించి 110లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తరువాత ఈ పధకంలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ విధానాల పరిశోధనా సంస్థ (సిపిపిఆర్‌) వెబ్‌సైట్‌లో 2023 ఫిబ్రవరి నాలుగున ” కొనసాగుతున్న యువనైపుణ్య శిక్షణ నిర్లక్ష్యానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ” అనే శీర్షికతో ప్రచురించిన ఒక విశ్లేషణలోని అంశాల సారాంశం ఇలా ఉంది.ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా చేసిన వాగ్దానాలు, సాధించిన దానికి చాలా తేడా ఉంది.యువత నైపుణ్యానికి వస్తే దాని పునాదులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడుసార్లు యువత అనే పదాన్ని ఉచ్చరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు.(అది మోడీ సర్కార్‌ రాసి ఇచ్చిన ప్రసంగమే) 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పధకాలు వాస్తవరూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది.లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53లక్షల మందికే లేదా 19శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యం ఇవ్వాలని నిర్ణయించారు, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98లక్షల మంది నమోదు చేసుకోగా 4.45లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు. వారిలో కేవలం 15,450 మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం.


యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయివేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్‌ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పాతికలక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపదాటటం లేదు. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది.అమెరికా మీడియా యుఎస్‌ న్యూస్‌ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది. కార్మిక నైపుణ్యంలో జపాన్‌, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది.మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17వ దేశం కాగా మనది 31వదిగా ఉంది.అమెరికా సిఐఏ ఫాక్ట్‌బుక్‌ పేరుతో సమాచారాన్ని విడుదల చేస్తుంది. దాని ప్రకారం 2021లో చైనాలో నిపుణులైన కార్మికులు 79 కోట్ల 14లక్షల 83వేల మంది ఉండగా మన దేశంలో 46 కోట్ల,66లక్షల 70వేల వంద మంది ఉన్నారు. నిజానికి ఈ సంఖ్య తక్కువేమీ కాదు గానీ పని చేసే వారికి అవకాశాలు కల్పించటమే కీలకం, మన దగ్గర అది లేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా ప్రభుత్వమే భారీ ఎత్తున ఖర్చు చేసింది. అందుకే నిపుణులైన కార్మికుల మీద పెట్టే ఖర్చు తప్పుతుంది గనుక అమెరికా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి, చైనా 17.7లక్షల కోట్ల జిడిపిని సృష్టించగలిగింది. దాని తలసరి జిడిపి(పిపిపి) 19,338 డాలర్లు, మన దేశం 3.17లక్షల కోట్ల డాలర్లు, తలసరి 7,334 డాలర్లతో ఉంది. ఏ దేశమైనా నైపణ్యం పెంచటమే కాదు, పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో ఆ రెండూ లేవు.


మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామ మాత్ర వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నాం. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవు పేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తి కాదు. బహుశా ఏ దేశంలోనూ లేని విధంగా వాట్సాప్‌ ద్వారా తప్పుడు, విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింప చేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు. టెక్నాలజీ పరుగులో ముందుండాలంటే పరిశోధన, అభివృద్ది ఖర్చు లేకుండా కుదరదు. అందుకు గాను జిడిపిలో మన దేశ ఖర్చు 0.7శాతం కాగా చైనా ఖర్చు 2.1శాతంగా ఉంది.ి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారంటే కేటాయింపు లేకుండా కేవలం కబుర్లు చెబుతున్నారన్నది స్పష్టం.


నైపుణ్యం పెంచటానికి, పరిశోధనకు నిధులు కేటాయించేందుకు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ అడ్డుకోలేదు. కానీ మన దేశంలో విద్వేషం పెరుగుతున్నది. దానికి కారకులు ఎవరో పదే పదే చెప్పనవసరం లేదు. ఇది ఇంకా పెరిగితే వచ్చే పెట్టుబడులు రావు. మతకొట్లాటలు, పరస్పర అవిశ్వాసంతో కొట్టుకు చావాల్సిందే. అది తెలిసినా మత దేశంగా ఉన్న పాకిస్తాన్‌ దరిద్రం గురించి ఒకవైపు చెబుతున్నవారే దేశాన్ని మెజారిటీ హిందూ దేశంగా మార్చుతామని రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా దేశంలో ఉన్న విద్వేష పూరిత వాతావరణ, ఉదంతాల గురించి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలో పదే పదే ఆందోళన వెల్లడిస్తున్నది. జాతి, మతం, పుట్టిన ప్రాంతం,నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన భిన్న పౌర సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సామరస్యతను దెబ్బతీసే శక్తులను అదుపు చేసేందుకు ఐపిసిలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన 153 ఏ ప్రకారం నమోదు చేసిన కేసులు దేశంలో 2014-2020 కాలంలో 323 నుంచి 1,804కు పెరిగాయి. జాతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు పాల్పడేవారి మీద 153 బి సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తారు. ఇవి 13 నుంచి 82కు పెరిగాయి. తప్పుదారి పట్టించే, విద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచే సమాచారాన్ని వ్యాపింప చేయటం, ప్రకటనలు చేసే వారిని శిక్షించేందుకు ఉన్న సెక్షన్‌ 505 కేసులు 2017లో 257 ఉంటే 2020 నాటికి 1,527కు పెరిగాయి. రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చోట ఒక సామాజిక తరగతి మీద అసలు కేసులే నమోదు చేయటం లేదన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. అందుకే బాధితులు లేదా ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.దేశంలో తలెత్తుతున్న ఆందోళనకర పరిస్థితికి ఈ కేసులు, సుప్రీం కోర్టు ఆదేశాలు నిదర్శనం.


2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని పేర్కొన్నారు. ఇలాంటి రెండింజన్ల పాలనే మణిపూర్‌లో కూడా ఉన్నందున మహిళలను నగంగా తిప్పి, అత్యాచారం చేసిన ఉదంతాన్ని వెల్లడి కాకుండా తొక్కి పెట్టాలని చూశారు. వీడియో వెల్లడి కావటంతో మొక్కుబడి ప్రకటనతో సరిపుచ్చారు.విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినటం లేదు. రిజర్వేషన్ల గురించి ఆందోళన తలెత్తితే మణిపూర్‌లో చర్చ్‌లను తగులబెడతారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తారు. మత విద్వేషం చెలరేగితే హర్యానాలో ఒక మతానికి చెందిన వారి నివాసాలు, దుకాణాల మీదకు మాత్రమే అక్కడి ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లు నడుపుతారు. దేశం ఎటుపోతోంది అని గాదు ఎటు తీసుకుపోతున్నారు, ఎవరు అన్నది ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.దేశంలో ముస్లింలు, దళితుల మీద జరుగుతున్న దాడులను నమోదు చేసేందుకు 2017లో హిందూస్తాన్‌ టైమ్స్‌ అనే పత్రిక పూనుకుంది.దాన్ని వెంటనే యాజమాన్యం నిలిపివేసింది, దానికి చొరవ చూపిన సంపాదకుడు రాజీనామా చేసి తప్పుకున్నారు. దీని వెనుక ఎవరి వత్తిడి ఉండి ఉంటుందో వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాపై చైనా దాడిని ఎక్కుపెట్టిందా ?

10 Thursday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti communist, CAPITALISM, capitalism or socialism, China, Joe Biden



ఎం కోటేశ్వరరావు


పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఎలా చూస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలకవర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒక్కరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు, అమెరికాలో పెట్టుబడిదారీ విధాన మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేథావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం.అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత, దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.


విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ” ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్దాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎన్నటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదలను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్‌ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్‌ రోజర్‌ రాబిన్సన్‌ మాట్లాడుతూ పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది.


పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్‌ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్‌ కంపెనీ సిఇఓ లారీ ఫింక్‌ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడుగా చైనా సంస్థలు లేవని యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెప్పింది. నిర్భంద శిబిరాలు, బలవంతంగా కార్మికులను తరలించే,మారణకాండ, చైనా మిలిటరీకి ఆధునిక ఆయుధాలను సరఫరా చేసేందుకు దోహదం చేసేవిగా చైనా కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయి.ప్రపంచ ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ చైనా సంస్థలతో చేతులు కలిపితే వచ్చే ముప్పును గ్రహిస్తున్నాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. ఇది చాలదు, అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి.డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్‌ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద అనుసరించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ”


అమెరికా గడ్డ మీద, వెలుపలా అమెరికా మీద చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పుడే మేలుకున్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ షీ జింపింగ్‌ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్‌ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌న్ను గాలఘర్‌ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 200బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. తైవాన్‌ విలీనం షీ జింపింగ్‌ జీవిత లక్ష్యమని అందుకు గాను సన్నాహాలకు గాను అవసరమైన సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారని అన్నాడు. దాన్ని ఎదుర్కొనేందుకు ఇండో ఫసిఫిక్‌ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన మిలిటరీ, పరికరాలను సమీకరించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు చైనా చూస్తున్నదని, చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్‌, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్‌ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.


ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేందుకు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ముందుకు తెచ్చిన కొత్త ప్రచార ఎత్తుగడ. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న పోరు పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ పోరులో విజయం సాధించినట్లు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ప్రకటించుకున్నారు. మరోవైపు చైనాలో పెట్టుబడులు పెట్టటంతో పాటు అక్కడి నుంచి భారీ ఎత్తున సరకులు దిగుమతి చేసుకున్నది. దాంతో అనేక మంది చైనా తమ ఉపాధిని హరించిందనే ప్రచారాన్ని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. అది అనేక మంది యువతలో సైద్ధాంతిక మధనాన్ని పెంచింది. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావనలు పెరుగుతున్నాయి. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగిస్తే దశాబ్దాల తరబడి ఆ కమ్యూనిస్టు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ప్రతి వస్తువును అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకున్నారు, ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, చైనాతో తెగతెంపులు చేసుకోవటం లేదని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న ప్రశ్నలకు అమెరికా విధాన నిర్ణతల దగ్గర సమాధానం లేదు. అందుకే మనలను దెబ్బతీసేందుకు మన పెట్టుబడిదారీ వ్యవస్థనే చైనా అస్త్రంగా మార్చుకున్నదనే తర్కానికి నిలవని ప్రచారానికి పూనుకున్నారు. ఒకటి వాస్తవం, ఏ విధంగా చూసినా నేటి చైనా నాటి సోవియట్‌ కాదు.ఆర్థికంగా త్వరలో అమెరికాను అధిగమించనుంది.ప్రపంచీకరణ భావన, స్వేచ్చామార్కెట్‌ను ముందుకు తెచ్చింది అమెరికా తప్ప చైనా కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చైనా లబ్ది పొందిన మాట వాస్తవం. దివాలా కోరు విధానాలతో అమెరికా పెట్టుబడిదారీ విధానం విఫల బాటలో ఉంది.


అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్‌ మీడియెట్‌) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్‌ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. నిజానికి అక్కడి సంస్థల సంఖ్యతో పోలిస్తే అసలు లెక్కలోకి రావు. ఈ పేరుతో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటిలిజెన్స్‌ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్‌ ఫడీస్‌ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.


ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు గాను ప్రతి దేశం అనేక చర్యలను తీసుకోవటం తెలిసిందే. అమెరికా స్కూళ్లలోని టీచర్లు, విద్యార్ధులతో చైనా వారు సంబంధాలు పెట్టుకుంటూ చైనా భాష, సాంస్కృతిక సంబంధాలు, విద్యార్ధి బృందాల మార్పిడి పేరుతో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పిడిఇ ” లిటిల్‌ రెడ్‌ క్లాస్‌ రూమ్స్‌” పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించింది. ఇలాంటి స్కూళ్లు, కాలేజీలన్నీ అమెరికాలోని 20 మిలిటరీ కేంద్రాల చుట్టూ ఉన్నట్లు మరొక కథనాన్ని దానిలో పేర్కొన్నారు. నిజానికి ఇవేవీ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి ఉన్న అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు వేళ్ల మీద లెక్కించదగిన ఆ సంస్థల్లోని కేంద్రాలను మూసి వేయించటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ నిజమే అనుకుంటే ఆ పని చేయకుండా వాటిని అనుమతిస్తూనే మరో వైపు అనుమానాలు రేకెత్తించే ప్రచారానికి అవి తెరలేపుతున్నాయి. అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతుంటే, అది వాస్తవమనుకుంటే అమెరికా సర్కార్‌ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

02 Wednesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, Germany, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

China, Cobots, robotics, Robots, Robots vs. Cobots


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది ఎన్నికల ఏడాది : కాషాయ గోబెల్స్‌ దళం రెచ్చిపోతుంది జర జాగ్రత్త !

23 Sunday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, FDI, India's outward FDI, Joseph Goebbels, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, RBI data, RSS, saffron brigade hypocrisy


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ది జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక అవాస్తవాలు, అతిశయోక్తులు, అర్థ సత్యాలను జనం ముందు కుమ్మరిస్తారు, కాషాయ దళాలు గోబెల్స్‌ ప్రచారంతో వాట్సాప్‌ను నింపేస్తారు. దానిలో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో పెట్టుబడులు,నవకల్పనలో ముందు పీఠీన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జూలై 21న అమరజిత్‌ వర్మ అనే పరిశోధకుడు రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. కియర్‌నే డాట్‌ కామ్‌ నివేదిక ప్రకారం అగ్రశ్రేణిలో ఉన్న పాతిక దేశాల ఎఫ్‌డిఐ కాన్ఫిడెన్స్‌(విశ్వాస) సూచిక జాబితాలో 2020,21,22 సంవత్సరాల్లో మన దేశానికి చోటు లేదు. అంతకు ముందు 2017లో ఎనిమిది,2018లో 11, 2019లో 16వ స్థానాల్లో ఉన్నది. 2023 సూచిక ప్రకారం 16వ స్థానంలో ఉంది.2022లో పదవ స్థానంలో ఉన్న చైనా 2023లో ఏడవ స్థానానికి చేరింది. ఇక నవకల్పనలు అనేవి పరిశోధన-అభివృద్ది రంగాలలో పెట్టే పెట్టుబడులను బట్టి ఉంటాయి.2013లో ఈ సూచికలో మన దేశం 66వది కాగా 2022లో 40వ స్థానంలో ఉంది.(ఆర్గనైజర్‌ పత్రిక విశ్లేషకుడు 2015లో ఉన్న 81వ స్థానాన్ని తీసుకొని 2022లో 40వదిగా ఉందంటే మోడీ పాలనలో ఎంత పెరిగిందో చూడండని జనాన్ని నమ్మించేందుకు చూశారు) ఇదే కాలంలో చైనా 35 నుంచి 11వ స్థానానికి ఎదిగింది. ఈ సూచికలు స్థిరంగా ఉండవు, ఏడాదికేడాది మారుతుంటాయి. ధోరణి ఎలా ఉందన్నదే గీటురాయి.

మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల పెట్టుబడులను 2007 నాటికి జిడిపిలో రెండుశాతానికి పెంచాలని 2003లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ విధాన పత్రంలో పేర్కొన్నది. తరువాత 2013లో యుపిఏ ప్రభుత్వం 2018 నాటికి ఆ మేరకు పెంచాలని గడువు పెంచింది. దాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ 2020 విధాన పత్రంలో 2030 సంవత్సరంగా పేర్కొన్నారు. ఇక ఆచరణను చూద్దాం. ప్రపంచ బాంకు 2022 అక్టోబరు 24న తాజా పరిచిన సమాచారం ప్రకారం 1996లో మన దేశం ఈరంగానికి చేసిన ఖర్చు జడిపిలో 0.64శాతం.2004లో 0.76, 2008లో 0.86, 2014లో 0.7, 2018లో 0.66, 2023లో 0.7శాతం ఉంది. ప్రపంచ సగటు 1.8లో సగం కూడా మన దేశం ఖర్చు చేయటం లేదు. ఇంత తక్కువగా ఉండటానికి కార్పొరేట్‌ రంగం తగినంత ఖర్చు చేయకపోవటమే అని చెబుతున్నారు. (2023 ఫిబ్రవరి 24, హిందూ వార్త)


సులభతర వాణిజ్యం పేరుతో భారీ మొత్తంలో ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా గతంతో పోలిస్తే ఎఫ్‌డిఐలు పెరిగాయి. వాటి మాదిరి మన పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తు ఎగుమతులు పెరగలేదు. ఆత్మనిర్భరత గురించి ఊదరగొడుతున్నారు.ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్‌ పధకం (పిఎల్‌ఐ) పెద్ద ఎత్తున విజయవంతమైందని, 14 రంగాలలో రు.2.74లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పధకం 2020లో ప్రారంభమైంది. ఆరు సంవత్సరాల కాలంలో రు.1.9లక్షల కోట్ల మేర సబ్సిడీకోసం పక్కన పెట్టినట్లు చెప్పారు. దీని కింద 2023 మార్చి నాటికి రు.3,400 కోట్లు తమకు చెల్లించాలని కొన్ని కంపెనీలు కోరగా రు.2,900 కోట్లు చెల్లించారు. ఈ పధకం కింద ఇచ్చే సబ్సిడీతో ఉత్పాదక రంగానికి పెద్ద ఊపు వస్తుందని చెప్పారు. ఆపిల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ను ఒక విజయగాధగా చెబుతున్నారు. దాని వెనుక ఉన్న అసలు కథేంటి ? వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసిన విడి భాగాలను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని ఒక దగ్గర కూర్చటం తప్ప అది ఉత్పత్తి చేసేది కాదు. ఆ ఫోన్లను మన మార్కెట్లో, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. ఉదాహరణకు మన దేశంలో అసెంబ్లింగ్‌ చేసిన అలాంటి ఒక ఫోను విలువ రు. పదివేలు అనుకుందాం. దానిలో తొమ్మిదివేల విలువ గల విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విడి భాగాల విలువ మరొక వెయ్యి జత చేసిందనుకుందాం. దాన్ని రు.200 లాభంతో అమ్మింది, లేదు ఎలాంటి లాభం లేకుండా అసలు ధరకే అమ్మిందనుకుందాం. పిఎల్‌ఐ పధకం కింద మన ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ఇస్తే ఒక ఫోను మీద రు.500 లాభం వచ్చినట్లే. ఆ మేరకు ఇతర దేశాల్లో ధర తగ్గించి ఇతర ఫోన్‌ కంపెనీలను వెనక్కు నెట్టవచ్చు. ఇంత లాభసాటిగా ఉన్నపుడు చైనా నుంచో మరొక చోట నుంచో కంపెనీలు మన దేశానికి ఎందుకు రావు, అసెంబ్లింగ్‌ కేంద్రాలను ఎందుకు ప్రారంభించవు. ఈ పధకం కానసాగినంత కాలం ఇక్కడ ఉంటాయి. తరువాత వేరే చోటకు వెళతాయి.


మన దేశంలో పరిశ్రమలకు ఊపు నిచ్చే రాయితీలు ఆత్మనిర్భర పధకంతో మాత్రమే ప్రారంభం కాలేదు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో అనేక రాయితీలు ఇచ్చారు, అనుకూల విధానాలు తీసుకువచ్చారు. దీని వలన వచ్చిన ఫలితాలను చూస్తే జిడిపిలో పారిశ్రామిక సంబంధిత సెకండరీ సెక్టర్‌ వాటా 1991-92లో ఉన్న 24.7 నుంచి 27.3 శాతానికి 2019-20 సంవత్సరం నాటికి పెరిగింది. ఇప్పుడు 24శాతం ఉంది. మనవంటి దేశాల్లో ఉత్పాదక రంగం గణనీయంగా పెరగాల్సి ఉంది. జిడిపిలో సెకండరీ సెక్టర్‌లో భాగమైన ఉత్పాదక రంగ వాటా 17శాతం దాటటం లేదు. పిఎల్‌ఐ పధకం వలన ఉత్పత్తి పెరుగుతుందన్నది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ సబ్సిడీ పొందేందుకు బడాకంపెనీలతో చిన్న సంస్థలు పోటీపడలేవు. దాంతో అవి మూతపడతాయి. అసెంబ్లింగ్‌ రంగంలో యాంత్రీకరణ, రోబోలు రంగంలోకి వస్తున్నందున కార్మికులకు ఉపాధికూడా పరిమితమే. ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకే ఉపాధి రహిత వృద్ధి అని చెప్పాల్సి వస్తున్నది. దీనితో పాటు పెద్ద మొత్తంలో పన్ను తగ్గింపు కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో మనదేశ కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, వాటాదార్లకు క్రమం తప్పకుండా డివిడెండ్లు ఇస్తున్నాయి. అందుకే విదేశీ మదుపుదార్లు మన వాటాల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వచ్చే డాలర్లను చూపి అది తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. స్టాక్‌మార్కెట్ల సూచీలు, కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీన్ని తాము సాధించిన వృద్ధికి ప్రతీక అని బిజెపి చెబుతోంది. ఈ సూచికలు పెరిగినట్లుగా ఎగుమతులు, ఉపాధి సూచికలు ఎందుకు లేవో చెప్పదు. ఉపాధి రహిత వృద్ధి వలన సమాజంలో గిరాకీ తగ్గుతుంది. వస్తువుల కొనుగోలు తగ్గితే ఎన్నిరాయితీలు ఇచ్చినా ఉత్పత్తి చేసేందుకు ఎవరూ ముందుకురారు. దాంతో వృద్ధి రేటు తగ్గుతుంది. అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని మూసిపెట్టేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్‌ గారడీలు చేస్తున్నది.


వందకు రు.30 పెట్టుబడి పెట్టించి రు.70 సబ్సిడీ ఇచ్చి ఇరవై రెండువేల కోట్లకు అమెరికా కంపెనీ మైక్రాన్ను అధిపతిగా చేసిన ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకాన్ని దేశం ఇటీవలనే చూసింది. మేడ్‌లేదా మేకిన్‌ ఇండియా బదులు ప్యాకిన్‌ ఇండియా సంస్థను పెట్టించేందుకు, అదీ గుజరాత్‌లో ఏర్పాటుకు అమెరికా వెళ్లి మరీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటిదే 70శాతం సబ్సిడీని (దాదాపు లక్షా పాతికవేల కోట్లు) జేబులో వేసుకొనేందుకు చూసిన వేదాంత-ఫాక్స్‌కాన్‌ కంపెనీకి సెమీకండక్టర్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చివరకు దాన్ని రద్దు చేసుకున్నది. తాజా వార్త ఏమంటే మనదేశ కంపెనీ టాటా సన్స్‌ బ్రిటన్‌లో 5.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కార్ల బాటరీలను తయారు చేసేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీ మనదేశంలో పెట్టకుండా అక్కడికి ఎందుకు పెట్టుబడులను తరలిస్తున్నట్లు అన్నది ప్రశ్న.అది 2026 నాటికి మేడిన్‌ బ్రిటన్‌ పేరుతో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, నాలుగువేల మందికి నేరుగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అది ఐరోపాలోనే అతి పెద్ద సంస్థగా ఉంటుందని, ఏటా 40గిగావాట్‌ గంటల బాటరీలను ఉత్పత్తి చేస్తుందని, తమ దేశ అవసరాల్లో సగం తీరుస్తుందని బ్రిటన్‌ ఇంథన భద్రతా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు. టాటా కంపెనీకి బ్రిటన్‌ సర్కార్‌ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ వివరాలు వెల్లడించలేదు.


ఒక దేశం నుంచి మరొక దేశానికి పెట్టుబడులు వెళ్లటం ఒక సాధారణ అంశంగా మారింది. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చినపుడు విదేశాలకు తరచూ ఎందుకు వెళుతున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్‌ ఏలుబడిలో దిగజారిన దేశ ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదార్లు చెప్పారు. మరోవైపు మోడీ అధికారానికి వచ్చిన తరువాత మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు పెరిగాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు చేరినట్లు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి పరుగులు తీస్తుంది తప్ప ఒక నేత పలుకుబడిని బట్టి ఉండదు.నరేంద్రమోడీ ప్రపంచ నేత అని అందరూ కీర్తిస్తున్నారని, ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. అంత పలుకుబడి ఉంటే టాటా కంపెనీ బ్రిటన్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? ఫాక్స్‌కాన్‌ ఎందుకు తప్పుకుంది ? ఐరాస సంస్థ ఆంక్టాడ్‌ సమాచారం ప్రకారం 2004లో మనదేశానికి ఐదువందల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే 2021లో అవి 8,300 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 200 నుంచి 1,500 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా నుంచి కూడా పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే ఇతర దేశాలకు వెళుతున్నాయి. అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది, ఆక్రమంలో పెట్టుబడులు తరలాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టకపోతే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులు జరగకపోవటం వంటి అనేక షరతులు, ఆటంకాల పూర్వరంగంలో అది జరిగింది. మన దేశం కూడా మోడీ చెప్పినట్లు గుజరాత్‌ నమూనాను దేశమంతటా విస్తరించి చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉన్నా, ఆ దిశలో ప్రగతి ఉన్నా టాటా వంటి కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాయంటే అర్ధం చేసుకోవచ్చు.


మనదేశం నుంచి వెళుతున్న పెట్టుబడుల గురించి రిజర్వుబాంక్‌ ఇచ్చిన వివరాల ప్రకారం 2007 నుంచి 2021వరకు 68 శాతం పెట్టుబడులు విదేశాల్లో ఉన్న ద్రవ్య సంబంధ కేంద్రాలకు వెళుతున్నాయి. వాటి వలన మనదేశానికి సాంకేతిక పరిజ్ఞానం, మరొకటో ఏమీ రాదు. పన్నులు తక్కువగా ఉండే సింగపూర్‌, మారిషస్‌, బెర్ముడా, కేమాన్‌ ఐలండ్స్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌ వంటి వాటికి 51శాతం వెళుతున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాల్లో నమోదైన కార్పొరేషన్ల మీద అక్కడి ప్రభుత్వాలు నామమాత్ర పన్ను లేదా కొన్ని సార్లు అసలు పన్నే లేకుండా అనుమతిస్తాయి, అంటే పన్నులను తప్పించుకొనేందుకే అన్నది స్పష్టం. ఈ నిధులు చివరికి ఎక్కడికి చేరుతున్నదీ తెలియటం లేదు. హిండెన్‌బర్గ్‌ నివేదికలో ఇలాంటి డొల్ల కంపెనీలతో లావాదేవీల గురించి ఉంది. మారు పేర్లతో ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశాలకే విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చి రాయితీలు పొందుతున్నాయి. అక్కడున్న డొల్ల కంపెనీలకు అధికారికంగా లేదా అక్రమ పద్దతుల్లో పెట్టుబడులు చేరుతున్నాయి. నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. మన దేశానికి 2000 నుంచి 2023లో ఇప్పటి వరకు వచ్చిన విదేశీ పెట్టుబడులను చూస్తే మారిషస్‌ నుంచి 26, సింగపూర్‌ 23 అంటే రెండు చోట్ల నుంచే 49శాతం వచ్చాయి. దీని వలన మన ఖజానాకు ఎంతో నష్టం జరుగుతోంది. మన ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను ఉపయోగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడులతో కొన్ని దేశాల్లో అప్పటికే ఉన్న సంస్థల కొనుగోలు లేదా విలీనాలకు పూనుకుంటున్నారు. ఇదంతా సదరు కంపెనీల మార్కెట్‌ విస్తరణ, లాభాలను పెంచుకొనేందుకు తప్ప మన దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏమాత్రం తోడ్పడదు. ఆర్థిక వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ప్రకారం మనదేశం విదేశాల్లో నేరుగా పెట్టిన పెట్టుబడుల మొత్తం 2021-22లో 17.53 బిలియన్‌ డాలర్లు కాగా అత్యంత ధనిక దేశమైన అమెరికా పెట్టిన పెట్టుబడులు 12.1 బి.డాలర్లు మాత్రమే. అక్కడి సంస్థలు పన్నులను తప్పించుకొనేందుకు మారిషస్‌ వంటి పన్నులు లేని చోట్ల నుంచి పెట్టుబడులు పెడతాయి. భారీ మొత్తాల్లో సబ్సిడీలు ఇచ్చి పాకింగ్‌ కంపెనీలను తెస్తున్న నరేంద్రమోడీ బాటరీలను ఉత్పత్తి చేసే టాటా కంపెనీ బ్రిటన్‌ ఎందుకు వెళ్లిందో మన జనాలకు చెప్పాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d