• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

వియత్నాం,ఆఫ్ఘనిస్తాన్‌ – కమ్యూనిస్టులు, కానివారికీ తేడా !!

24 Tuesday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RELIGION, USA, WAR

≈ Leave a comment

Tags

Communists, Taliban, Vietnam and Afghanistan


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పుకోలేని చోటదెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలిబాన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధికారులు పరోక్షంగా అయినా అంగీకరించకతప్పలేదు.అధ్యక్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్ధితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబాన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరువాత స్పష్టత వస్తుందా ? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడియాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతనమైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమెరికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా ? అంతకు మించి ఏమీ లేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో వియత్నాంలో సర్వనాశనమైన నాటి సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరువాత హౌచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జిడిపిలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్దం చేసుకోవచ్చు.

ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయన్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడింటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియత్నాంను 1945లో స్వాతంత్య్ర దేశంగా కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్దంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది.దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్దంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది.

1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం.ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్దాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగించాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్దం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హౌచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరువాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారిపోయింది. అఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు.

సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హౌచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్దంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు , నీరు తాగేందుకు పనికిరాకుండా చేశారు. అమెరికా యుద్ద చరిత్రలో అత్యధికంగా 58వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబాన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబాన్లు వదలివేసే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్దంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.


పరాభవం పాలైన అమెరికా తరువాత కాలం ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్ధికదాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్ధితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడికా చరిత్రకెక్కాడు.


అమెరికా విదేశాంగ , మిలిటరీ విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా ఆప్ఘన్‌ ఉదంతం కూడా నిర్ధారించింది. మూడులక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజాహిదీన్లు, తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది ? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు.1970దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్టటంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్ఘన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్ధిరపడిన తరువాత తమ దేశంపై కూడా దాడి చేయవచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది.

సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరువాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్ధితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబాన్లు పుట్టుకు వచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబాన్లకు శిక్షణ ఇవ్వటమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్దాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్ఘనిస్తాన్‌లోకి పంపింది. అదే విధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్రవాదులు తరువాత ఏకు మేకయ్యారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పెంజేష్వర్‌ లోయలో తాలిబాన్లను ప్రతిఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేV్‌ా వెనుక ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముుఠాలతో రాజీచేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడింది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబాన్లు, ఆల్‌ఖైదాను అంతమొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది.ఆల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని అనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్తాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహిస్తున్న సాలేV్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి ఆఫ్ఘన్‌ గూఢచార వ్యవస్ధ అధిపతిగా ఏర్పాటు చేసింది.తరువాత ఉపాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.


వియత్నాం-ఆఫ్ఘన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆదేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆపని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి దేశాన్ని తిరిగి నిర్మించి నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాము. ఆప్ఘనిస్తాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల,తాలిబాన్ల ప్రభుత్వం, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశాబ్దాలలో పరిస్ధితి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసిన తరువాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్ధిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడింది అమెరికన్‌ కంపెనీలు, ఆఫ్ఘనిస్తాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. ఆఫ్ఘన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ద ప్రభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాలిబాన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు.తాలిబాన్లు దేశాన్ని బాగు చేస్తారా ? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబాన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లాల్సింది ఎవరు ? నిర్మలక్క, స్మృతక్క, కంగనక్క, సాధ్వులు, ప్రచారక్‌లా ? ఇతరులా !!

20 Friday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Akhand Bharat, BJP, BJP’s trolling army, China, Donald trump, Narendra Modi, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


” అరెస్టు స్వర భాస్కర్‌ ” ఇప్పుడు సామాజిక మాధ్యమంలో నడుస్తున్న మరుగుజ్జుదాడి. ఎందుకటా ! ఆ సినీ నటి తాలిబాన్ల భయానికి – హిందూత్వ భయానికి(టెర్రర్‌) పెద్ద తేడా లేదని తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఏకీభావం ఉంటే సరే లేకపోతే విభేదించవచ్చు, అభిప్రాయం చెప్పినంత మాత్రాన్నే ఆమెను అరెస్టు చేయాలనటం ఏ ప్రజాస్వామిక న్యాయం? ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చింది ఎవరు ? ఇంతకీ స్వర భాస్కర్‌ చెప్పిందేమిటి ? ” తాలిబాన్‌ భయంతో దిగ్భ్రాంతికి గురైనట్లు, సర్వనాశనం అయిందని అనుకుంటున్నారు అందరూ, హిందూత్వ భయాన్ని కూడా మనం అంగీకరించకూడదు. తాలిబాన్‌ భయంతో నీరుగారి పోకూడదు, హిందూత్వ భయం మీద అందరం ఆగ్రహించాలి. అణిచివేసిన మరియు అణచివేతకు గురైన వారెవరు అన్న ప్రాతిపదికన మన మానవత్వం మరియు నైతిక విలువలు ఉండకూడదు.” దీన్లో తప్పేముంది. అమెఎవరినీ పేరు పెట్టి కూడా విమర్శ చేయలేదు.


ఆమె మీద ప్రచారదాడికి దిగిన వారు అంటున్నదేమిటి ? తాలిబాన్‌ – హిందుత్వ రెండింటినీ ఒకేగాటన కట్టకూడదు. ఆ మాటే చెప్పండి. అరెస్టు చేయాలనటం ఏమిటి ? ఈ డిమాండ్‌ ఎందుకు వచ్చింది ?మహారాష్ట్రలో బిజెపికి చెందిన ఒక లాయర్‌గారు ఆమె మీద పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. మతం పేరుతో జనాల్లో శత్రుత్వాన్ని పెంచుతున్నారు అన్నది ఆరోపణ. అంతవరకే పరిమితం కాలేదు. స్వరభాస్కర్‌ను అరెస్టు చేయాలనే హాషటాగ్‌తో సామాజిక మాధ్యమంలో ప్రచారానికి కూడా దిగారు. దాన్ని అందుకొని మిగతావారు తలా ఒకరాయి వేస్తున్నారు. ఎవరు వారంతా… బిజెపి వారే. స్వర భాస్కర్‌ మీద కాషాయ తాలిబాన్ల దాడి కొత్త కాదు. గతంలో ఇజ్రాయెల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్ల నిరసనలకు ఆమె మద్దతు ప్రకటిస్తూ ఇజ్రాయెల్‌ను జాతివివక్ష దేశంగా వర్ణించారు. దానికి గాను ఆమెను తూలనాడుతూ దాడి చేశారు. ఇజ్రాయెల్‌ను ఆమె విమర్శిస్తే వారికి ఇబ్బంది ఏమిటి ? పెగాసెస్‌ ఉప్పు తిన్నందున కృతజ్ఞతగా ఇజ్రాయెల్‌ను పొగడండి, పూజించండి. ఎవరిష్టం వారిది. భగవద్గీతను కూడా అంత నిష్టగా, సంఘటిత పద్దతిలో పంచరు. హంతకుడు గాడ్సే నేనెందుకు గాంధీని చంపాను అంటూ కోర్టులో చేసిన వాదనను పుస్తకంగా ప్రచురించి పంచుతుంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది సరైనదో జనం నిర్ణయించుకుంటారు. ఏ దేశాన్ని ఎలా విమర్శించకూడదో మీరే నిర్ణయిస్తారా ? విమర్శకుల మీద దాడి ఫాసిస్టు లక్షణం తప్ప మరొకటి కాదు. ఇస్లామ్‌కు షరియత్‌ ఎలాగో హిందూ మతం అని చెప్పుకొనే వారికి మనుస్మృతి కూడా అలాంటిదే కదా ! మన రాజ్యాంగంలో మనుస్మృతి ప్రతిబింబించలేదని, దానికి అడ్డుపడింది అంబేద్కరే అనే విమర్శలు చేస్తున్నదెవరు ? మనువాద భావజాలం ఉన్నవారే కదా ! స్వర భాస్కర్‌ వంటి వారు చెబుతున్నది అదే కదా !


ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘన్‌ మహిళల ఉనికికే ముప్పు ముంచుకు వచ్చిందని సాంప్రదాయ, సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజమే, ఉగ్రవాదం అది మత లేదా మరొక ఉగ్రవాదం అయినా ముందు బలయ్యేది మహిళలే. భావజాలం రీత్యా, రాజకీయంగా వ్యతిరేకులైన మహిళానేతలు, కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని పార్టీల వారి పేర్లతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని ఎద్దేవా చేస్తూ ఊరూ పేరూ లేకుండా కొందరు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక పోస్టులో ఇలా ఉంది.” సంధ్యక్క, దేవక్క, పుణ్యవతక్క, మలాలా,బర్ఖదత్‌, అమీర్‌ ఖాన్‌, జావేద్‌ అక్తర్‌, హమీద్‌ అన్సారీ, నసీరుద్దీన్‌ షా, దీపికా పడుకొనే, తమన్నా బాటిల్‌, మిర్చి దేశారు, రాజ్‌దీప్‌ సర్దేశాయి, దయచేసి ఆప్ఘాన్‌ ఆడపిల్లలను రక్షించండి. తక్షణమే మీ అవసరం వారికి ఉంది. మోడీ పెద్ద ఫాసిస్టు ….. ఆయన చేయలేరు. మీరే వెళ్లండి…. వారిని రక్షించండి. ఒవైసీ దయచేసి వారికి నేతృత్వం వహించండి. కావాలి అంటే దేశంలో పెద్ద యువకుడు కరాటే కుంగ్ఫు లాంటి విలువిద్యల్లో నైపుణ్యుడు రాహుల్‌ గాంధీని, పెళ్లికాని యువకురాలు, రెండు చేతులతో రాళ్లు రప్పలు సోడాలు విసరగల మమతా బేగాన్నీ సహాయకంగా తీసుకు వెళ్లండి. అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించండి. ఎలాగూ లాయర్‌ కప్ప చీబల్‌ ఉన్నాడు… మర్చి పోకండి పిల్లిజ్‌ ” అంటూ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాల మీద సామాజిక మాధ్యమంలో ఊరూ పేరు చెప్పుకొనేందుకు సిగ్గుపడే కొంత మంది పేరు లేకుండా ఒక పధకం ప్రకారం లౌకివాదులు, కమ్యూనిస్టులు, ఇతర పార్టీల వారి మీద చేస్తున్న దాడి ఇది.


వారు వెళతారా లేదా అన్నది తరువాత చూద్దాం. ముందు వెళ్లాల్సిన వారు వెళ్లకుండా ఇతరుల మీద ఎదురుదాడికి దిగారు. కొంతమంది ప్రవచించే అఖండభారత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఉందా లేదా ! అది ఉందని చెబుతూ మడికట్టుకున్నట్లు ప్రచారం చేసుకొనే ప్రచారక్‌లు, సాధ్వులు, సాధువులు, వారికి మద్దతు ఇస్తున్న కాషాయ దళాలు కదా ముందుగా ఆఫ్ఘన్‌ వెళ్లాల్సింది. ఒకనాడు అఖండభారత్‌లో భాగమై, ఇప్పుడు విడిగా ఉంటున్న దేశాలన్నీ( ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, చైనా-టిబెట్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌) ఎప్పటికైనా ఒకటి కావాల్సిందే అని చెబుతున్నవారు కదా ముందుగా కదలాల్సింది ! అందులోనూ నిన్నటి వరకు ఉగ్రవాదుల మీద పోరు సలిపామని చెప్పుకొనే వారు ఇప్పుడు ఇతరులు వెళ్లాలని చెప్పటం ఏమిటి ?తాలిబాన్లు వచ్చారు కనుక మహిళలకు ముప్పు వచ్చిందని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి. వారితో ఒప్పందం చేసుకున్నది అమెరికా ! దాన్ని హర్షించింది నరేంద్రమోడీ సర్కార్‌ ! తాము మారినట్లు తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు తప్ప ఒప్పంద సమయంలో స్వయంగా వారు గానీ-అమెరికా వారు గానీ చెప్పలేదు. అయినా దాన్ని దాన్ని మనంఎందుకు హర్షించినట్లు ? (2020 ఫిబ్రవరి 29, హిందూ పత్రిక) ఏమాత్రమైనా బాధ్యత ఉందా ? అమెరికా వాడు ఏది చేస్తే అదే కరెక్టు అనే గుడ్డి అనుసరణ కాదా ? దోహాలో జరిగిన సంతకాల కార్యక్రమానికి కతార్‌ ప్రభుత్వం మనలను ఆహ్వానించగానే మనం ఎందుకు హాజరు కావాలి? రాజుగారు నందంటే నంది పందంటే పంది అనాలన్నట్లుగా ఉగ్రవాదులుగా ప్రకటించిన తాలిబాన్లతో అమెరికా వాడు ఒప్పందం చేసుకోవటం ఏమిటి ? వారి మీద పోరాడుతున్నట్లు చెప్పుకున్న మనం దాన్ని హర్షించటం ఏమిటి ? మనకు ఒక స్వతంత్ర వైఖరి లేదా ? అమెరికాతో పాటు మనమూ తాలిబాన్లు ఉగ్రవాదులు కాదని చెప్పినట్లే కదా ? మరి ఇప్పుడు బిజెపి మద్దతుదార్లు తాలిబాన్ల గురించి గుండెలు బాదుకోవటం నటన తప్ప నిజాయితీ ఉందా ? ఏకత, శీలము ఉన్నవారు చేయాల్సిన పనేనా ?


ఈ ఒప్పందానికి ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ మధ్య భేటీ జరిగింది. ఆ తరువాతే తాలిబాన్‌ ఉగ్రవాదులతో ప్రజాస్వామ్య అమెరికా చేసుకున్న ప్రయివేటు ఒప్పంద సమయంలో మనం సాక్షులుగా దోహా సమావేశంలో పాల్గొన్నాం. ఆ సందర్భంగా మనకు వినిపించిన కహానీలను 2020 ఫిబ్రవరి 29వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ కథనంలో చూడవచ్చు. ఏమిటటా ! పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరిన కోరికలు వ్యక్తిగత స్ధాయిలో ఏవగింపు కలిగించినా ఆఫ్ఘనిస్తాన్‌లో తమ లక్ష్యాల సాధనకు అతనితో మాట్లాడాల్సి వచ్చిందని అమెరికా మనకు చెప్పిందట.పాకిస్తాన్‌ తమకు నమ్మదగిన మిత్రుడు కాదని కూడా చెప్పారట. అలా అయితే సరే అని మనం అన్నామట. గత 19 సంవత్సరాలుగా మనం సాధించిన ఆఫ్ఘన్‌ రాజ్యాంగం, మహిళల, మైనారిటీల హక్కులు, ఆఫ్‌ఘన్‌ రక్షణ దళాలను నష్టపోకూడదనే అంశం గమనంలో ఉంచుకోవాలని కూడా అమెరికాకు చెప్పామట. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే బాణాకర్రను (బిక్‌ స్టిక్‌) ప్రయోగించే అవకాశాన్ని అట్టిపెట్టుకుంటామని అమెరికా మనకు చెప్పిందట. అమెరికా-తాలిబాన్ల మధ్య అవగాహనలో పాకిస్తాన్‌ కీలకపాత్రధారి అని ప్రపంచానికి కంతటికీ తెలిసినప్పటికీ మనకు ఇలాంటి లీకు కథలను వినిపించారు.


తీరా జరిగిందేమిటి ? గడువు కంటే ముందే బతుకు జీవుడా అంటూ అమెరికన్లు పారిపోయారు.తమకు సహకరించిన వారి రక్షణకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆప్ఘన్‌ సైన్యం చేతులెత్తేసి లొంగిపోయింది. రాజ్యాంగమూ లేదు పాడూ లేదు. తాలిబాన్లు చెప్పిందే వేదం. మహిళలకు రక్షణ లేకపోయిందని మన పరివార్‌ దళాలే చెబుతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే అమెరికా బాణా కర్ర ప్రయోగం ఏమైనట్లు ? మనం ఎందుకు అడగలేకపోతున్నాము. నరేంద్రమోడీ నోరు మెదపటం లేదేం? ఆగస్టుమాసం అంతా భద్రతా మండలి అధ్యక్ష స్ధానం మనదేగా, అక్కడ మానవ హక్కుల రక్షణకు తీసుకున్న చర్యలు, దానికి చొరవ ఏమిటి ? అది చేతగాక మలాలా,సంధ్యక్క, దేవక్క, పుణ్యక్క ఆఫ్ఘనిస్తాన్‌ వెళతారా అని అడుగుతున్నారు. నిజానికి అఖండ భారత్‌లో ఎప్పటికైనా అంతర్భాగం చేస్తామని చెబుతున్న ఆఫ్ఘానిస్తాన్‌కు ముందుగా వెళ్లాల్సింది ఎవరు ? అక్కడి తోటి మహిళలను కాపాడే బాధ్యత నిర్మలక్క, స్మృతక్క, మీనాక్షక్క, కంగనక్క, శాపాలశక్తి గలిగిన సాధ్వీమణులకు లేదా ?


తాలిబాన్ల వెనుక చైనా ఉన్నదని పెద్ద ఎత్తున చెబుతున్నారు, రాస్తున్నారు ? మీడియా వంటవారికి ఈ విషయం ఎప్పుడు తెలిసింది ? అమెరికా వాడు ఒప్పందం చేసుకున్నపుడు, దాన్ని మనం హర్షించినపుడు గానీ ఎవరైనా తాలిబాన్ల వెనుక చైనా ఉంది అని చెప్పిన వారున్నారా ? ఎందుకు చెప్పలేదు ?తోటి ముస్లిం దేశంలో జనాన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇతర ముస్లిం దేశాలు, వాటి మిత్ర దేశం చైనా ఎందుకు జోక్యం చేసుకోవు, అక్కడి శరణార్ధులకు ఆశ్రయం ఎందుకు కల్పించవు అంటూ ఒక ప్రచారం. మరికొందరైతే ఇంకొంచెం ముందుకు పోయారు. ఇప్పటి వరకు ముస్లిం దేశాల్లో పరిస్ధితులు బాగోలేనపుడు శరణార్ధులుగా వచ్చిన వారందరినీ పశ్చిమ దేశాల వారే ఆదరించారు. అయితే సదరు ముస్లింలందరూ అక్కడ తమ జనాభాను పెంచి వేసినందున ఇప్పుడు ఆయా దేశాల వారందరూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రపంచం మొత్తాన్ని ముస్లింలతో నింపటానికి వేసిన ఒక పధకం కనుక ఇతర దేశాల వారెవరూ వారిని అనుమతించటం లేదన్నది మరొక ప్రచారం. ఇలాంటి ప్రచారాలకు ప్రాతిపదికలు, వాస్తవాలతో నిమిత్తం లేదు. మన దేశాన్ని కూడా ముస్లింలతో నింపి వేయటానికి కుటుంబ నియంత్రణ పాటించటం లేదనే ప్రచారం తెలిసిందే.


ఆఫ్ఘనిస్తాన్‌లో 1978లో కొంత మంది అభ్యుదయ వాదులు అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నాటి సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ గుర్తించింది. అప్పుడు అక్కడ జనమూ ముస్లింలే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారూ ముస్లింలే. ఆ ప్రభుత్వానికిి వ్యతిరేకంగా జోక్యం చేసుకున్నది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారే కదా ! తొలుత ముజాహిదీన్లు, తరువాత తాలిబాన్లకు మద్దతు, ఆయుధాలు, శిక్షణ ఇచ్చింది ఎవరు ? ఒసామా బిన్‌ లాడెన్‌ను తయారు చేసింది ఎవరు ? వారు ఏకు మేకైన తరువాత అక్కడికి సైన్యాన్ని పంపి దాడులకు రెండు నుంచి మూడులక్షల కోట్ల డాలర్ల వరకు ఖర్చుచేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు ? పునర్‌నిర్మాణం చేస్తున్నామని చెప్పింది ఎవరు ? అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వారితో స్నేహం చేసిన మన దేశమే కదా ? ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలేవీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు, తమ సైన్యాన్ని పంపలేదు, దాడులకు దిగలేదు. పునర్‌నిర్మాణం చేస్తామని చెప్పలేదు, పెట్టుబడులూ పెట్టలేదు. చేసిందంతా అమెరికా, దాని మిత్రులుగా ఉన్న నాటో దేశాల వారైతే ముస్లిం దేశాలు ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇవ్వరెందుకంటూ అతి తెలివి ప్రదర్శనలెందుకు ? ఇప్పటి వరకు ఎంత మంది అలా శరణు కోరారు ? అంటే ఏది చెప్పినా బుర్ర ఉపయోగించకుండా వినే జనాలుంటారన్న చిన్న చూపా ? మానవత్వం మాయమై మతోన్మాదం పెరిగిపోయిన ప్రతి వారికి ప్రతిదానిలో అదే కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా మత ప్రాతిపదికన శరణార్ధులను ఆదుకున్న దేశాలు ఉన్నాయా ?


ఈ ప్రచారం చేస్తున్న వారే చైనా గురించి చెబుతున్నదేమిటి ? ఆప్ఘన్‌ సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రమైన గ్జిన్‌గియాంగ్‌లో ముస్లింలను ప్రభుత్వం ఊచకోతకు గురి చేస్తుంటే ముస్లిం దేశాలు చైనాను ఖండించవు, దానితో లావాదేవీలను ఎందుకు నిలిపివేయవు అని ప్రచారం చేశాయి. ఇప్పుడు తాలిబాన్లకు-చైనాకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ? అదే తాలిబాన్లు, అమెరికా ఇతర దేశాల మద్దతు ఉన్న ఉఘిర్‌ ముస్లిం తెగకు చెందిన కొందరు చైనాలో ఉగ్రవాద, విచ్చిన్న కార్యకలాపాలకు పాల్పడుతూ ఆప్ఘన్‌ గడ్డ మీద ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా వెళ్లిపోయిన తరువాత మరొక దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డను ఉపయోగించుకొనే శక్తులకు తాము తావివ్వబోమని తాలిబాన్లు రష్యాతో చెప్పారు. చైనాతో చర్చల సమయంలో ఇక ముందు తాము ఉఘిర్‌ తీవ్రవాదులకు మద్దతు, ఆశ్రయం ఇవ్వబోమని చెప్పారు. అయితే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గుర్తింపు గురించి నిర్ణయిస్తామని చెనా చెప్పింది. తాలిబాన్లు తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారా, ఉల్లంఘిస్తారా ? అప్పుడు చైనా ఏం చేస్తుంది అన్నది ఊహాజనిత ప్రశ్న. తాలిబాన్లు ఉగ్రవాదులా మరొకటా ఏమిటన్నది ఒక సమస్య. ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరైనా దానికి గుర్తింపు వేరే అంశం. మన పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు చేసి అక్కడి ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి అధికారాన్ని చేపట్టింది. ఆ కారణంతో ఏ దేశమైనా వారితో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుందా ? మిలిటరీ చర్య సరైనదే అని సర్టిఫికెట్లు ఇచ్చాయా ? అంతెందుకు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గోద్రా ఉదంతం అనంతర జరిగిన మారణకాండకు కారకుడంటూ అమెరికా సందర్శనకు అక్కడి ప్రభుత్వం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక ఆపని చేయగలిగింది. అదే అమెరికా ప్రభుత్వం ప్రధాని అయిన తరువాత నరేంద్రమోడీపై చేసిన విమర్శను వెనక్కి తీసుకోకుండానే ఎర్రతివాచీ స్వాగతం పలికిందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి !

16 Monday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75 years India Independence, CPI(M), India Flag, MS Golwalkar, RSS Duplicity, RSS Hindutva, RSS Mohan Bhagavat, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.


సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్‌-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.


అతల్‌ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు, తొలుత రిపబ్లికన్‌ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్‌ అంబేద్కర్‌ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్‌ అంబేద్కర్‌ను నాగపూర్‌ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్‌ అంబేద్కర్‌ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అడ్డుకున్నదని ప్రకాష్‌ అంబేద్కర్‌ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్‌ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జెండా ఎగురవేయటం గురించి మహాజన్‌ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.


2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్‌ కార్డ్‌ న్యూస్‌ పేరుతో నిరంతరం ఫేక్‌ న్యూస్‌ వండి వడ్డించే విక్రమ్‌ హెగ్డే, ఓప్‌ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్‌ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?


1995 ఫిబ్రవరిలో నవీన్‌ జిందాల్‌ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్‌ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్‌ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్‌ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.


నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్‌ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్‌ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.


2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్‌ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్‌ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్‌ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్‌ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్‌ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్‌ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్‌ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.


ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్‌ రాకేష్‌ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్‌ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్‌ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్‌ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్‌ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్‌ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్‌ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్‌ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్‌ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్‌ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్‌ అని తేలిపోయింది.


2018 సెప్టెంబరు 20న న్యూస్‌ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా ఉన్న మోహనభగవత్‌ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్‌ అండ్‌ మిషన్‌ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.


ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్‌ నాగపూర్‌ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్‌ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.


శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్‌ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్‌ కాబినెట్‌ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్‌ గవర్నర్‌ జాన్‌ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.


సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్‌ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్‌ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్‌ డిమాండ్‌ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్‌ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్‌ సమావేశంలో సావర్కర్‌ చెప్పారు. తిరువాన్కూర్‌ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్‌ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్‌ 11న ప్రకటించారు.అఖండ భారత్‌ గురించి చెప్పిన సావర్కర్‌ జూన్‌ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్‌ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్‌ పత్రిక రాసింది.


నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్‌ తన యూనిఫామ్‌ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్‌ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !

సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముస్లిం సంతుష్టీకరణ : ఆర్‌ఎస్‌ఎస్‌ టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విన్యాసాలు !

01 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Hindu Fundamentalism, Hinduthwa, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


చరిత్ర అడక్కు చెప్పింది విను ! ఇది ఒక సినిమాలో మాట.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. బిజెపి, అంతకు ముందు దాని పూర్వ రూపం జన సంఫ్‌ు చరిత్ర చూసినపుడు వారి పార్టీల గొప్పతనం కంటే తాము తప్ప ఇతర పార్టీలన్నీ ముస్లింలను సంతుష్టీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న నిరంతర ప్రచారమే ఎక్కువగా ఉండేది. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. దీని గురించి అనేక విమర్శలు, సమర్దనలూ వెలువడ్డాయి.భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో పడిందని ఎవరూ భయవలయంలో చిక్కుకోవద్దని, మతం ఏదైనా భారతీయుల డిఎన్‌ఏ ఒకటే అని, అసలు హిందూ-ముస్లిం ఐక్యత అనేదే తప్పుదారి పట్టించే మాట అని భగవత్‌ చెప్పారు. తరువాత జూలై 21న గౌహతిలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో కూడా దాన్ని పునరుద్ఘాటించారు. భిన్నమైన మతాలలో ఉన్నప్పటికీ శతాబ్దాల తరబడి కలసి మెలసి ఉన్నారని, ఆహార అలవాట్లు, సంస్కృతి ఒకటే అని చెప్పారు. ఇంతవరకు అద్వానీ, జస్వంత్‌ ఉదంతాలు పునరావృతం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు.


భగవత్‌ ప్రసంగం మీద వెల్లడైన, ఇంకా వెల్లడవుతున్న కొన్ని స్పందనల తీరు తెన్నులు చూద్దాం. ముస్లింలకు సన్నిహితం అయ్యేందుకు చేసిన సంతుష్టీకరణ వ్యవహారమిది అన్నది కొందరి అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, వారు మంచి పిల్లలుగా కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వటానికి మేమేమీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్లం కాదు, కానీ హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని తరువాత కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


వక్రీకరణలకు, తప్పుడు వార్తలకు పేరు మోసిన ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల మీద ఇవన్నీ కొత్తగా వృద్ది చెందిన ఆలోచనలు ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శన దేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భగవత్‌ మీద ధ్వజమెత్తిన వారే కాదు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పుస్తకాలు రాసిన రతన్‌ శారద ఆయన ఉపన్యాసంలో కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవన్నారు. సుదర్శన్‌ గారు అధిపతిగా ఉన్న 2000-09లో కూడా హిందూాముస్లిం ఐక్యత గురించి చెప్పారు. అందుకోసమే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ఏర్పాటు చేశారు.ఆహార అలవాట్లు, పూజా పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చుగానీ ఏకీకరణ మీద అవి పెత్తనం చేయలేవు, మెజారిటీ, మైనారిటీ అనేవి లేవు. ప్రార్ధించే పద్దతిని బట్టి సమాజంలో వర్గీకరణ చేయటమే ముస్లింల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కారణం, ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నది ” అన్నారు. భగవత్‌ డిఎన్‌ఏ ఉపన్యాసంతో తలెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంఘీయులు ఊహించినట్లుగానే సాము గరిడీలు చేస్తున్నారు. గురూజీ హిందూత్వను వదులుకున్నట్లు ప్రకటించలేదు, దానికే కట్టుబడి ఉన్నారు, ఐక్యతను మాత్రమే కోరుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్ధలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోండి. గోవధ హిందూత్వ వ్యతిరేకం అని కూడా చెప్పారు. సంఫ్‌ు ఇంతకాలంగా చెబుతున్నదానిని-భగవత్‌ ప్రసంగాన్ని విడదీసి చూస్తే కొత్తగా చెప్పినట్లు అనిపించవచ్చు తప్ప కొత్తేమీ లేదు అంటూ మొత్తం మీద సంఫ్‌ు అజెండాలో ఎలాంటి మార్పూ లేదు కనుక ఎవరూ కంగారు పడనవసరం లేదనే భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భగవత్‌ ప్రసంగాన్ని విమర్శించిన వారిని ఎక్కడా తప్పు పట్టటం లేదు. ఆయన మాట్లాడింది ముస్లింలు పాల్గొన్నసభ, ఐక్యతను కోరుకుంటున్నది, రెండు మతాల మధ్య ఒక చర్చను ప్రారంభించాలనే లక్ష్యంతో మాట్లాడినవిగా గుర్తించాలని ఓదార్పు పలుకుతున్నారు. భారతీయత గురించి మాట్లాడటం అంటే దాని అర్ధం ముస్లింలు, ఇతర మైనారిటీలను తిరిగి మతమార్పిడి చేస్తామని కాదు, వారు ఈ గడ్డను స్వంతంగా చేసుకొని, విధేయులై జీవించాలన్నదే అని ముస్లింలకు హామీ ఇస్తున్నారు.


అయితే ఇప్పుడెందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత డిఎన్‌ఏ, హిందూ ముస్లిం ఐక్యత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే అలా మాట్లాడతారా ? ప్రతి పార్టీ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించటం రాజకీయాల్లో సహజం. బిజెపి పత్తిత్తేం కాదు. మెజారిటీగా ఉన్న హిందూ మత ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఎంచుకున్న మార్గం వారి సంతుష్టీకరణ. హిందువుల ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తోందని, కొద్ది కాలంలో ముస్లింలు మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ప్రచార యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సాధ్వి ప్రాచీ ఎవరు ఎంత మంది భార్యలను అయినా కలిగి ఉండండి, పిల్లలు మాత్రం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. 1990దశకం చివరిలో వాజ్‌పాయి అధికారానికి వచ్చారు. అందువలన భవిష్యత్‌లో 14శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా ప్రతిపక్షాలకు వేయించటం మంచిది కాదు గనుక వారి పట్ల రాగం, తానం, పల్లవి మార్చాలనే ఆలోచన సంఘపరివార్‌లో ప్రారంభమైంది. ఈ సమయంలోనే 2002 మార్చినెలలో జరిగిన గుజరాత్‌ మారణకాండ ముస్లింలలో మరింత భయాన్ని రేకెత్తించటమే కాదు, బిజెపికి పెద్ద మచ్చగా మారింది. అంతకు ముందు వరకు ఇతర పార్టీల మీద తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముస్లిం సంతుష్టీకరణకు తానూ నాంది పలికింది. అదే ఏడాది డిసెంబరులో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త దుకాణాన్ని తెరిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు వచ్చిన ఓట్లు సీట్లను కూడా బిజెపి నిలుపుకోలేకపోయింది. ఎన్నికలకు మూడు నెలల ముందే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భగవత్‌ అదే ఏడాది డిసెంబరులో తొలిసారిగా డిఎన్‌ఏ ప్రస్తావన చేశారు. ఆ సమయంలో బిజెపి, దాని అభిమానులు ఓటమి విషాదంలో ఉన్నారు గనుక పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అభిమానులు విశ్వగురువుగా కీర్తించే నరేంద్రమోడీ పరువు ప్రపంచ వ్యాపితంగా పోయింది. అసహనం, ఢిల్లీ దాడులు, రైతుల ఉద్యమం సందర్భంగా రోడ్లపై మేకులు కొట్టటాలు, టూల్‌కిట్‌ కేసులు, కరోనాను నిర్లక్ష్యంలో పేరుమోసిన ప్రపంచ నేతల్లో ఒకరిగా మోడీ పేరు చేరటం వంటి అనేక కారణాలు అంతర్జాతీయంగా, జాతీయంగా పలుకుబడిని మసకబార్చాయి. మోడీ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉంటేనే మోడీకి పదవి అన్నది స్పష్టం కనుక పరస్పరం రక్షించుకోవటంలో భాగంగా మోహన్‌ భగవత్‌ డిఎన్‌ఏ సుభాషితాలకు తెరతీశారన్నది కొందరి అభిప్రాయం.
అన్నింటి కంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు అన్నది మరో బలమైన అభిప్రాయం. సంపాదించే ఇంటి యజమాని కరోనాతో అనూహ్యంగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఇప్పుడు నరేంద్రమోడీ అదే స్ధితిలో ఉన్నారు. రవి గాంచనిది అజిత్‌ దోవల్‌కు కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుంది. ఒకేసారి పాక్‌, చైనాలతో వైరుధ్యం కొనసాగించటం సాధ్యం కాదు కనుక ఈ ఏర్పాటు అని కొందరు చెబితే, తాలిబాన్ల సమస్య దానికి పురికొల్పిందన్న వారు మరికొందరు. ఏ ఉగ్రవాదం మీద పోరు సలుపుతామని మోడీ సర్కార్‌ అమెరికాతో కలసి భీకర ప్రతిజ్ఞలు చేసిందో, ఆ ఉగ్రవాద తాలిబాన్లతో తెరముందు -వెనుక మంతనాలు ప్రారంభించింది. అమెరికా ట్రంపు లేడు, తిరిగి వచ్చే అవకాశాలూ లేవు, జో బైడెన్‌తో ఇంకా కౌగిలింతలు ప్రారంభం కాలేదు. చైనాతో సయోధ్యగా ఉంటామని ఆ తాలిబాన్లు ఏకపక్షంగా ప్రకటించటమే కాదు బీజింగ్‌ వెళ్లి మరీ ఆ దేశ నేతలను కలసి వచ్చారు. ఈ నేపధ్యం కూడా దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించాల్సిన అవసరం ఉందని సంఘపరివార్‌ ఆలోచించి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేము.
2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. సరే హిందూత్వ గురించి అంతకు ముందు నుంచీ చెబుతున్నవాటినే పునశ్చరణ చేశారు. ఆ గోష్టిలో పాల్గొన్నవారందరూ కాషాయ దళానికి చెందిన వారే. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.ఐక్యతా యత్నాలతో పాటు దేశంలో నేడున్న పరిస్దితిని కూడా చూడాలంటూ ” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గోవులను తరలిస్తున్నారనో, గో మాంసం తింటున్నారనే సాకుతోనో గోరక్షకుల పేరుతో ముస్లింలను వధించటం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో గోవులను వధించటం హిందూత్వకు వ్యతిరేకం అన్నారు. ఇది ఎదురుదాడి, గోరక్షణలో వాటిని వధించేవారి కంటే రక్షించేవారే ఎక్కువ మంది మరణిస్తున్నారని పరివార్‌ ప్రచారం తెలిసిందే. ముస్లింలందరూ గోవులను వధించకపోయినా వధిస్తున్నవారందరూ ముస్లింలే అని మాట్లాడుతున్నారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే ప్రచారం తెలిసిందే. ఉగ్రవాదం, చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకం అని అనేక సంస్ధలు ప్రకటించాయి. ఇలాంటి మాటలను ఎవరు చెప్పినా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆచరణ ఏమిటన్నదే ముఖ్యం.


తాము మారిపోయామని చెప్పుకొనేందుకు, బిజెపికి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పడుతున్న తంటాలు ఒకటి రెండు కాదు, టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నింటినీ ప్రయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. రెండవసారి నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాల్లేవనే అభిప్రాయం సర్వత్రా వెల్లడి అవుతున్న తరుణంలో ఎన్నికలకు ఆరునెలల ముందు 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొన్ని సందర్భాలలో చెప్పిన మాటలు అప్పటికి తగినవి కావచ్చు, అవే శాశ్వతంగా ఉండవు, కాలాలతో బాటు ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్దాపకుడు డాక్టర్‌ హెడ్గెవార్‌ అనుమతి ఇచ్చారు అన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. గోల్వాల్కర్‌ రాసిన ఆలోచనల గుత్తి పుస్తకంతో సహా ఏదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతినిధి కాదు, హెడ్గెవార్‌ కూడా సంఘగురించి తనకు పూర్తిగా తెలుసని ఎప్పుడూ చెప్పలేదు, అర్ధం చేసుకోవటం ప్రారంభించానని మాత్రమే చెప్పారు అని భగవత్‌ చెప్పారు. అందువలన గోల్వాల్కర్‌నే కాదంటున్న వారు రేపు మరో అధిపతి వచ్చిన తరువాత డిఎన్‌ఏ సిద్దాంతం కూడా మారదని భగవత్‌తో సహా ఎవరూ చెప్పలేరు. హిందూ రాష్ట్రతప్ప ప్రతిదీ మారుతుంటుంది, దానికోసం దేనికైనా సిద్దపడతారు.


అసలు సంతుష్టీకరణ అన్నదానిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే అని చెప్పవచ్చు.జర్మన్‌ కార్మికులు కమ్యూనిస్టుల వైపు ఎక్కడ మొగ్గుతారో అనే భయంతో వారిని సంతుష్టీకరించేందుకు మొదటి ప్రపంచ యుద్దం తరువాత ” నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ ”ని 1920లో ఏర్పాటు చేశారు.ఒక ఏడాది పాటు వేరే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 1921నుంచి 1945వరకు హిట్లర్‌ అధిపతిగా ఉన్నాడు.మెజారిటీ జర్మన్లను యూదుల మీద రెచ్చగొట్టటం, కుహనా జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలన్నీ తెలిసినదే. మన దేశంలో యూదులు లేరు గనుక హిందూత్వ శక్తులు ముస్లింలను ఎంచుకున్నాయి. అందువలన ఆ విధానాలన్నీ విదేశీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని అంటే ఎవరూ ఉడుక్కోనవసరం లేదు. దానికి కాంగ్రెస్‌ అనుసరించిన దివాలా కోరు విధానాలు అవి పెరగటానికి దోహదం చేశాయి. హిందువుల చట్టాల్లో జోక్యం, మార్పులు చేసిన మాదిరి ఇతర మతాల వారి విషయంలో జరగలేదని సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేయటం నిర్దారించింది. వివాదాస్పద బాబరీ మసీదు గేట్లను తెరిచేందుకు రాజీవ్‌ గాంధీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మెజారిటీ హిందువులను సంతుష్టీకరించేందుకే అన్నది స్పష్టం.1989 ఎన్నికల ప్రచారాన్ని తొలుత నాగపూర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వేదికను అయోధ-ఫైజాబాద్‌కు మార్చటం ఆ రాజకీయాల కొనసాగింపే అన్నది స్పష్టం. తొలుత మైనారిటీ సంతుష్టీకరణ తరువాత మెజారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది. చివరికి రెండిటికీ చెడ్డ రేవడిలా మారటాన్ని చూశాము.


కాంగ్రెస్‌కు భిన్నంగా సంఘపరివార్‌-బిజెపి తొలుత మెజారిటీ సంతుష్టీకరణ-మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టింది. అధికారం వచ్చాక దాన్ని నిలుపు కొనేందుకు ఇప్పుడు మైనారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది.నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. దేశం మొత్తాన్ని మెజారిటీ మతోన్మాద పులిని ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. వామపక్షాలు మినహా రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీల వారు కూడా గణనీయంగా పులిని ఎక్కారు. చెవులు కొరుకుతారు తప్ప బహిరంగంగా చెప్పరు. ఈ నేపధ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ వ్యాఖ్యలలో నిజాయితీ ఉందా ? రెండు మతాలవారూ కలసి మెలసి ఉండాలని, డిఎన్‌ఏ ఒకటే అని చెబుతున్నవారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింలకు చోటు, నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించ కుండా ఇతర వేదికలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? ఇంతకాలం తాము నిర్వహించిన విద్వేష ప్రచారానికి స్వస్తి పలుకుతామని, ఇంతకు ముందు చేసిన దానికి చెంపలు వేసుకుంటున్నామని చెప్పి ఉంటే కాస్తయినా విశ్వసనీయత ఉండేది ! అవేమీ లేవు. అందుకే టక్కు టమార విద్యలని అనాల్సి వస్తోంది, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌ సంతుష్ట రాజకీయాలు : బహుజనుల నుంచి బ్రాహ్మలపై మాయావతి దృష్టి !

21 Wednesday Jul 2021

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, STATES NEWS

≈ Leave a comment

Tags

BJP, BSP, Mayawati, SP, UP Appeasement matters, UP Assembly Elections 2022


ఎం కోటేశ్వరరావు


వసుదేవుడు అంతటి వాడు అవసరార్దం గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న కథ తెలిసిందే.ఉత్తర ప్రదేశ్‌లో అధికారం కోసం అక్కడ పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఓట్లున్న బ్రాహ్మణులను సంతుష్టీకరించేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ పాట్లు పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆ రాష్ట్ర అధికారం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. దేశవ్యాపితంగా ఐదుశాతం మంది (ఆరు ఏడు కోట్ల మధ్య) బ్రాహ్మణ సామాజిక తరగతి ఓటర్లు ఉంటారని అంచనా. ఉత్తరాదిన అత్యధిక మంది ఉన్నారు. జనాభాలో శాతాల రీత్యా ఉత్తరాఖండ్‌లో 20, హిమచల్‌ ప్రదేశ్‌ 14, ఢిల్లీ 12, జమ్మూ-కాశ్మీరు 11, ఉత్తర ప్రదేశ్‌ 10, ఒడిషా 9, రాజస్ధాన్‌, గోవా 7, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌ 6, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, పంజాబ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక ఐదు, మహారాష్ట్ర, అసోం నాలుగు, ఝార్ఖండ్‌, త్రిపుర మూడు, చత్తీస్‌ఘర్‌ రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ ఒకశాతం చొప్పున ఈ సామాజిక తరగతిని కలిగి ఉన్నాయి. ఇవి పాత అంచనాలు, 2021లో శాతాలు స్వల్పంగా మారవచ్చు. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్య రీత్యా రెండున్నర కోట్ల మంది వరకు ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు, ఇతర క్రతువులు నిర్వహించేవారిగా మాత్రమే తెలుసు. ఉత్తరాదిన వారు వీటితో పాటు వ్యవసాయం చేస్తారు. వీరిలో కూడా శాఖాబేధాలు, ఎక్కువ తక్కువ నిచ్చెనమెట్లు ఉన్నాయి. కొందరిని కొందరు బ్రాహ్మణులుగా గుర్తించని వంటి అంశాలూ ఉన్నాయి. ఉదాహరణకు భూమిహార్‌లను బ్రాహ్మణులుగా గుర్తించరు. వారిని కూడా కలిపితే ఉత్తర ప్రదేశ్‌లో వారి శాతం 14-15కు పెరుగుతుంది. మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణులను చూస్తున్నప్పటికీ అందరినీ ఆ గాటన కట్టలేము. నిజానికి మనువాదం ఇప్పుడు మిగతా కులాల్లోనే ఎక్కువగా ప్రబలింది. బిజెపి పెరుగుదలకు అది కూడా ఒక కారణం. ఇటీవలి బిజెపి చర్యలను చూసినపుడు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న ఈ సామాజిక తరగతిని సంతుష్టీకరించేందుకు ఎంతకైనా తెగిస్తుందని తేలిపోయింది. కాశ్మీరీ పండిట్ల సమస్యను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఆర్టికల్‌ 370తో పాటు అసలు కాశ్మీరు రాష్ట్రాన్నే రద్దు చేయటం దానిలో భాగమే అని చెప్పవచ్చు.


మనువాద వ్యతిరేక భావజాల ప్రాతిపదికన ఏర్పడిన బహుజన సమాజవాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ సంతుష్టీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాలు ఏలుబడి సాగించిన ఆమెకు అధికార రుచి, అది రంజుగా ఉండాలంటే బ్రాహ్మణ ఓట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలిసారి 2007లో ఆమెకు అధికారం రావటంలో వారి మద్దతు ప్రధాన పాత్ర పోషించింది. దేశమంతటా దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక బలహీనవర్గాల మీద దాడులు, అత్యాచారాల గురించి పార్టీలు చెప్పటం సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల మీద అవి జరుగుతున్నాయని మాయావతి చెప్పటమే గమనించాల్సిన అంశం.ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు తగ్గిందేమీ లేదని, తక్కువ ఉన్నట్లు చూపేందుకు నమోదు చేయవద్దని పోలీసు శాఖను అదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను అధికారాన్ని చేపట్టిన తరువాత బ్రాహ్మల గౌరవం, ప్రయోజనాలను కాపాడతానని ఆమె ప్రకటించారు. జూలై 23న అయోధ్యలో పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా బ్రాహ్మణ మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి విజయానికి బ్రాహ్మణ ఓటర్ల మద్దతు ఒక ప్రధాన కారణమనే అంశం మరోసారి మాయావతికి గుర్తుకు వచ్చింది. 2017లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు పొంది అధికారానికి వచ్చిన బిజెపి వారి సంక్షేమానికి పాల్పడకుండా వేధించిందని, వారిని దోచుకుందని, బిజెపికి మద్దతు ఇచ్చినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి చెప్పారు.


మాయావతి 2007 నుంచి 2012వరకు అధికారంలో ఉన్న సమయంలో సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడ్డారని, అగ్రకులాల వారిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల కారణంగా బ్రాహ్మణులను ఆకర్షించేందుకు పూనుకున్నారని బిజెపి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠీ విమర్శించారు. అయితే వారి గౌరవ మర్యాదలు, సంక్షేమానికి పాటు పడేది బిజెపి అని తెలుసు గనుక వచ్చే ఏడాది ఎన్నికల్లో తమకే ఓటు చేస్తారని చెప్పుకున్నారు. మద్దతు తగ్గిపోతున్న కారణంగా మాయావతి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము అన్ని కులాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి నసీముద్దీన్‌ సిద్దికీ, తాము అన్ని కులావారినీ సమంగా చూస్తామని, మాయావతి ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని చూస్తే బిజెపితో లోపాయి కారీ ఒప్పందం ఉందన్నది వెల్లడైందని సమాజవాది పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ హఫీజ్‌ గాంధీ అన్నారు.


ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలను చూసినపుడు బ్రాహ్మణులు సంఖ్యరీత్యా ఎక్కువ కానప్పటికీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్నారు.దళితులు 20.8, ముస్లింలు 19, ఓబిసి 40 అగ్రకులాలు 20 శాతం ఉంటారని అంచనా. కుల రాజకీయాలు ప్రభావం చూపే ఈ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలలో మొత్తంగా బ్రాహ్మణులు బిజెపితోనే ఉన్నారు. అయితే రాజపుత్రుల ప్రాబల్యం ముఖ్యంగా యోగి ఆదిత్యనాధ్‌ హయాంలో పెరిగిపోయి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. వికాస్‌ దూబే అనే గూండానేతను, ఐదుగురు సహచరులను పోలీసులు కాల్చిచంపారు. ఆ ఉదంతంలో దూబే గ్యాంగు చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దూబే ఉదంతాన్ని చూపి బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా చిత్రించే ప్రయత్నం ఆ సమయంలో జరిగింది.నిజానికి అది కులపరంగా జరిగిన ఉదంతం కాదు.బ్రాహ్మణులు బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ బిజెపికి ఎక్కడో అనుమానాలు ఉన్నాయన్నది స్పష్టం. అయినా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోకూడదని బిజెపి అనుకుంటోంది. అందుకే ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరున్న జితిన్‌ ప్రసాదను ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆకర్షించింది. బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఎకె శర్మను ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు, ఎంఎల్‌సి పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలన్న అధిష్టాన వర్గ ఆదేశాన్ని యోగి ఖాతరు చేయలేదు. ఆయను ఎంఎల్‌సి చేసి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. శర్మను కలుసుకొనేందుకు యోగి నిరాకరించారని కూడా వార్తలు వచ్చాయి. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కూడా సంతుష్టీకరణలో భాగంగా చూపుతున్నది. ఆర్ధికంగా బలహీనవర్గాలకు పదిశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందున వారే ఎక్కువ లబ్ది పొందుతారని ప్రచారం చేసింది. తాము పరశురాముడి అంశకు చెందిన వారమని బ్రాహ్మలు భావిస్తున్న కారణంగానే తాము అధికారానికి వస్తే భారీ పరుశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఎస్‌పి, సమాజవాది పార్టీ ప్రకటించాయి.


బిఎస్‌పి విషయానికి వస్తే 2002లో ఆ పార్టీకి బ్రాహ్మణులు ఆరుశాతం ఓటు వేయగా 2007నాటికి 17శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బిజెపికి 50 నుంచి 42శాతానికి తగ్గాయి. తరువాత 2012లో 38శాతానికి పడిపోయినా 2014లోక్‌ సభ ఎన్నికల్లో 72, 2107 అసెంబ్లీలో 80శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 82శాతానికి పెరిగాయి. రాజపుత్రుల ఓట్లు కూడా అదేస్ధాయిలో బిజెపికి పడ్డాయి. నరేంద్రమోడీ కారణంగా పన్నెండుశాతం ఓట్లు బిజెపికి అదనంగా వచ్చినట్లు సర్వేలు తెలిపాయి. అగ్రకులాల, బిసిల్లోని కుర్మీల ఓట్లు ఈ ఎన్నికల్లో బిజెపికి ఐదింట నాలుగు వంతులు పడగా, ఓబిసీల్లోని దిగువ తరగతి వారు నాలుగింట మూడు వంతులు వేశారు. బిసిల్లో ముందుపడిన వారు సమాజవాది పార్టీతో ఉన్నందున దిగువ తరగతులను చేరదీసేందుకు బిజెపి ఎరవేసింది. బిజెపి ఎత్తుగడలో భాగంగా ముస్లింలను దూరంగా పెట్టి మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు సృష్టికి పూనుకుంది. అది సహజంగానే బ్రాహ్మణులకు సంతృప్తి నిస్తుంది.


బ్రాహ్మణ సంతుష్టీకరణకు రాహుల్‌ గాంధీ కూడా ప్రయత్నించారు. తాను కౌల్‌ బ్రాహ్మణ పూర్వీకుల వారసుడనని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకున్నారు. గతంలో బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉండేవారు. బిఎస్‌పి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారినే ఇప్పుడు నాయకులుగా నియమించారు. మాయావతి మంత్రివర్గంలో గరిష్ట స్ధాయిలో వారున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో అభ్యర్దులుగా వారిని నిలిపారు. నామమాత్రంగా బ్రాహ్మణులు, నాలుగోవంతు దళితులు ఉన్న అంబేద్కర్‌ నగర్‌ లోక్‌ సభ స్ధానంలో పోటీ చేసిన రితేష్‌ పాండే తప్ప మిగిలిన బ్రాహ్మణ అభ్యర్ధులందరూ ఓడిపోయారు.


ఉత్తర ప్రదేశ్‌ మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలను ” ఆవు ప్రాంతం ” అని పిలుస్తారు. బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన అజెండాలో ఆవు కూడా ఒకటి. సాధారణంగానే తమ కారణంగానే హిందూమతం ఇంకా ఉనికిలో ఉందని బ్రాహ్మణులు అనుకుంటారనే అభిప్రాయం ఉంది. ఇలాంటి అనేక కారణాలతో వారు కాంగ్రెస్‌ నుంచి బిజెపి అభిమానులుగా మారారు.
ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు కులాలు, మతాల రాజకీయం నడుస్తోంది. బిజెపి హిందూత్వ తన గుత్త సొమ్మని భావిస్తోంది. మాకూ వాటా ఉందని మేమూ హిందుత్వశక్తులమే అని ఓటర్ల ముందు నాలుగు ప్రధాన పార్టీలూ ఓట్ల జోలె పట్టుకొని నిలుచోబోతున్నాయి. ఆయోధ్య రామమందిరాన్ని చూపి ఓట్లడిగేందుకు బిజెపి పూనుకుంటే బిఎస్‌పి అక్కడే తన బ్రాహ్మణ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టబోతున్నది. శ్రీరాముడి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత మిగతా దేవుళ్ల పట్టణాల్లో సభలు జరుపుతారు. ప్రతిచోటా దేవుడి దర్శనంతోనే ప్రారంభం. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేసిన వారిలో అగ్రకులాల వారే కాదు, దళితులు కూడా గణనీయంగా మొగ్గారు. అందువలన వారి హిందూత్వను సంతుష్టీకరించేందుకు బిఎస్‌పి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో చూడాల్సి ఉంది. గుళ్లు గోపురాలను సందర్శించి తామూ హిందువులమే అని కనిపించేందుకు బిఎస్‌పి, ఎస్‌పి, కాంగ్రెస్‌ నేతలు బారులు తీరుతున్నారు. స్ధానిక మనోభావాలను అర్ధం చేసుకోవాలీ అని ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. అందరూ తమకు పోటీ వస్తున్నందున మత కిక్కు ఎక్కించేందుకు బిజెపి ఏం చేయనుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి వ్యతిరేక కూటమి : వివిధ పార్టీల ముందున్న సవాళ్లు – అవకాశాలు !

23 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti BJP Front, CPI(M), Narendra Modi, Sharad Pawar, TMC


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి కొనసాగితే బిజెపి అదృష్ట యోగం 50 సీట్లే : కేంద్ర ఇంటిలిజెన్స్‌ హెచ్చరిక !

17 Thursday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi, RSS, UP Politics


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్‌. నాలుగు సంవత్సరాలు గడిచే సరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు సూచించినట్లుగా వార్తలు రావటం విశేషం. అబ్బే అదేమీ లేదు, అంతా సజావుగా ఉంది అని చెప్పుకున్నా అది నష్ట నివారణ చర్య తప్ప మరొకటి కాదు. బిజెపి వంటి పార్టీలలో అలాంటి మార్పులు జరపాల్సి వచ్చినా దాని తీరే వేరుగా ఉంటుంది గనుక సమస్య పూర్తిగా ముగిసింది అని చెప్పలేము. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ, హౌం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో యోగి భేటీ అయ్యారు. ఎందుకు ఆ సమావేశం జరిగిందో, ఒక్కరే వచ్చి ఏమి చర్చించారో బయటకు తెలియదు. పైకి చెబుతున్నది మాత్రం మర్యాదపూర్వక కలయిక, మార్గదర్శనం కోసం అని. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, యోగి సర్కార్‌ వైఫల్యాలు, పార్టీనేతలతో పాటు వివిధ తరగతుల్లో అసంతృప్తి, కరోనా వైఫల్యం, రైతాంగ ఉద్యమం వంటి అంశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ముప్పు తెస్తాయనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఉంది. కేంద్ర గూఢచార శాఖ ఇటీవల జరిపిన సర్వేలో యోగి నాయకత్వంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి 403కు గాను 50 మించి రావని తేలినట్లు చెబుతున్నారు. అదే తాజా పరిణామాలకు మూలంగా భావిస్తున్నారు.

యోగీ తొలగింపు వార్తల వెనుక అసలేమీ లేదా అంటే చాలా ఉంది. మొదటిది నరేంద్రమోడీ ఇష్టనేతల్లో యోగి లేరు. అనివార్యమై అంగీకరించారు. గత ఎన్నికల్లోనే మనోజ్‌ సిన్హా అనే మాజీ కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు.నరేంద్రమోడీ మద్దతుదారు. నరేంద్రమోడీ వైఫల్యాల చర్చ వచ్చినపుడు నితిన్‌ గడ్కరీ ప్రత్యామ్నాయంగా పేరు ఎక్కువగా వినిపిస్తున్నది, పెద్ద రాష్ట్రం గనుక రాజనాధ్‌ సింగ్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. యోగి ఆదిత్యనాధ్‌ వీరి పట్ల మొగ్గుచూపుతున్నారు. రాజనాధ్‌ సింగ్‌-యోగి ఇద్దరూ ఠాకూర్‌ సామాజికతరగతికి చెందిన వారే. వారెప్పుడైనా తనకు విరోధులుగా మారతారనే అనుమానం నరేంద్రమోడీలో ఉంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఘోరపరాజయం, కరోనా వైఫల్యాలపై చర్చ నేపధ్యంలో అనుమానం పెనుభూతమైందని వార్తలు. కరోనా విషయంలో యోగి వైఫల్యంతో మోడీ అనుకూలురకు మంచి అవకాశం వచ్చినందున దీన్ని వదులు కోకూడదని తమ వంతు యత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. యోగి కొరకరాని కొయ్యగా మారిన కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లక్నో పర్యటన జరిపి పరిస్ధితిని మదింపు వేశారని చెబుతున్నారు. తరువాతనే యోగి ఆదిత్యనాధ్‌ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నేతలను ఢిల్లీలో ” మర్యాద ” పూర్వకంగా కలిసి ” మార్గదర్శనాన్ని” అందుకున్నారు.


ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద అనుమానాలు తలెత్తటంతో సామాజిక సమీకరణలకు బిజెపి తెరలేపింది. ఉత్తర ప్రదేశ్‌లో సామాజికంగా 21శాతం మంది దళితులు ఉన్నారు. పన్నెండుశాతం మంది బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వారు 20శాతం వరకు ఉన్నారు. యోగి సర్కార్‌ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి వారిలో మొదలైంది. దళితుల కంటే తమ వారు ఎక్కువ మంది హత్యలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు ఒక బ్రాహణ నేతగా పేరున్న కాంగ్రెస్‌ ప్రముఖుడు జితిన్‌ ప్రసాదను బిజెపి వైపు ఆకర్షించటం వెనుక కథ ఇదే. హక్కుల కోసం పోరాడేందుకంటూ 2020 జూలైలో బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో జితిన్‌ ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న తమ సామాజిక తరగతికి సాయం చేసేందుకు టి-20 పేరుతో ప్రతి జిల్లాలోనూ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తరువాత ప్రకటించారు. యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత బ్రాహ్మణుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగినట్లు గతంలో జితిన్‌ ప్రసాద విమర్శించారు. ఇప్పుడు జితిన్‌ ప్రసాదను పార్టీలో చేర్చుకోవటం ద్వారా వారిని బుజ్జగించవచ్చన్నది బిజెపి ఎత్తుగడ.


పార్టీ రహిత ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి పెద్దలు జిల్లాపరిషత్‌ స్ధానాలకు తమ అభ్యర్ధులు వీరే అని ప్రకటించి చేతులు కాల్చుకున్నారు. వారిలో అత్యధికులు ఓడిపోయారు. దీనికి ఆదిత్యనాధే సూత్రధారి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలో, రామాలయానికి శంకుస్దాపన చేసిన అయోధ్యలో కూడా ఓడిపోవటంతో నరేంద్రమోడీ పరువు కూడా పోయింది. అదే యోగి వ్యతిరేకులకు ఆయుధంగా మారింది. స్ధానిక సంస్దలలో ఓటమితో పాటు కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, హైకోర్టు న్యాయమూర్తులతో చివాట్లు తినటం, అనేక చోట్ల ఆక్సిజన్‌ మరణాలు సంభవించటంతో తీవ్ర విమర్శలు, అసంతృప్తి వెల్లడైంది. వీటికి పరాకాష్టగా కరోనా మృతుల దేహాలను గంగానదిలో పారవేయటంతో బిజెపి పరువు గంగలో కలిసింది. గుజరాత్‌ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ నరేంద్రమోడీని దిగంబర రాజుగా వర్ణిస్తూ రాసిన కవిత్‌ వైరల్‌ కావటం తెలిసిందే. ఇన్ని జరిగిన తరువాత నష్ట నివారణ చర్యగా యుపిలో అంతా బాగుంది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయించి యోగి మరిన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వాణిజ్య ప్రకటనలు, పాకేజ్‌ (డబ్బిచ్చి) వార్తలు, ఇంటర్వ్యూల వంటివి చేయించారు. పార్టీ ఢిల్లీ పెద్దల వ్యూహం మేరకు గుజరాత్‌ కాడర్‌గా పని చేస్తున్న యుపికి చెందిన ఆలిండియా అధికారి ఎకె శర్మ చేత రాజీనామా చేయించారు. ఎంఎల్‌సిగా నియమించి కాబినెట్‌లో చోటు కల్పించాలని ప్రతిపాదించారు. అయితే ఆదిత్యనాధ్‌ ఎంఎల్‌సి పదవిని ఇచ్చారు తప్ప మంత్రిమండలిలో చేర్చుకోలేదు, కనీసం శర్మను కలుసుకొనేందుకు కూడా నిరాకరించారని వార్తలు వచ్చాయి.

ప్రధాని తరువాత ఆదిత్యనాధ్‌ను ప్రధాన ప్రచారకుడిగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి పంపారు. ఇప్పుడు మరోసారి అసలు యుపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటర్ల ముందుంచుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్‌, బీహార్‌, హర్యానాల్లో మిత్రపక్షాలు ఉన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అసోంలో మాత్రమే గట్టెక్కింది. యుపిలో బలమైన మిత్రపక్షం కూడా బిజెపికి లేదు. అనేక చోట్ల హిందూత్వ తురుపుముక్క పని చేయలేదు, యుపిలో కూడా అదే పునరావృతం అవుతుందేమో అన్న అనుమానాలు సంఘపరివార్‌లో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఓబిసి, షెడ్యూలు కులాలకు చెందిన వారు తమను ఉపయోగించుకొని వదిలేశారనే భావంతో ఉన్నారు. చిన్న పార్టీలే అయినప్పటికీ మిత్ర పక్షాలు అసంతృప్తితో ఉన్నాయి.భారతీయ సమాజ్‌ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. బిజెపి మునిగిపోయే నావ దానిలో ఎవరైనా ఎక్కాలనుకుంటే వారిష్టం, నేను మాత్రం ఎక్కను అని ఆ పార్టీ నేత నేత ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగుతులను వాడుకొని వదిలేస్తున్నారని, నాలుగున్నర సంవత్సరాలలో తమకు చేసిన వాగ్దానం దేన్నీ అమలు జరపలేదన్నారు. బిజెపిని ఓడించేందుకు తాముప్రయత్నిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అప్నాదళ్‌ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక ముక్క సమాజవాదితో చేతులు కలిపేందుకు నిర్ణయించుకుంది. మరో ముక్క కేంద్రంలో తమకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని బేరం పెట్టింది. నిషాద్‌ పార్టీ కూడా ఇదే విధంగా బేరం పెట్టింది, పదవులు ఇవ్వకపోతే సమాజవాది పార్టీ వైపు చేరతామనే సంకేతాలు ఆ పార్టీలు ఇస్తున్నాయి.


ఈ పార్టీల బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని వాటితో నిమిత్తం లేకుండా హిందూత్వ అజెండాతో తిరిగి విజయం సాధిస్తామనే అభిప్రాయంతో యోగి ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు చెప్పేది వినకుండా తనకు నమ్మకస్తులైన అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసగా అసెంబ్లీలోనే 2019లోనే 200 మంది ఎంఎల్‌ఏలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన ఉదంతం తెలిసిందే. బిజెపికి చెందిన నందకిషోర్‌ గుర్జార్‌ తమ జిల్లా అధికారయంత్రాంగం, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం పట్ల నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బిజెపి ఎంఎల్‌ఏలతో సహా రెండు వందల మంది వివిధ పార్టీలకు చెందిన వారు మూడు గంటల పాటు సభలో ధర్నా జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు అవినేతి కేంద్రాలుగా మారాయని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సమక్షంలోనే ఒక మాజీ ఎంఎల్‌ఏ చెప్పిన మాటలను ఎంఎల్‌ఏలు, నేతలు అందరూ అభినందించిన ఉదంతం ఈ ఏడాది మార్చినెలలో జరిగింది. రైతు ఉద్యమం పట్ల యోగి సర్కార్‌ అనుసరించిన వైఖరి ముఖ్యంగా రాకేష్‌ తికాయత్‌ను అరెస్టు చేసేందుకు చేసిన యత్నం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సంచలనమైంది, తికాయత్‌ జాతీయ నేతను చేసింది.రైతు ఉద్యమం బలపడింది. యోగి ఆదిత్యనాధ్‌ జన్మదినాన్ని నిరుద్యోగదినంగా జరపాలని ఇచ్చిన పిలుపు పెద్ద చర్చనీయాంశమైంది.ఉద్యోగులు, టీచర్లలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది.


ఎన్నికలకు కొద్ది నెలల ముందు యోగిని మార్చటం చిన్న విషయం కాదని బిజెపి పెద్దలకు అర్దమైంది. గతంలో బిజెపితో ఉంటూనే హిందూ యువవాహిని పేరుతో తనదైన దళాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ మెడలు వంచిన ఉదంతాలు ఉన్నాయి. తనకు అధికారం వచ్చిన తరువాత దాన్ని వదిలేశారు. అయినప్పటికీ హిందూత్వకు ప్రతీకగా యోగి ఉన్నందున ఆయనను మారిస్తే ఎలా అన్న గుంజాటన కూడా ఉంది. ఆ ప్రాతిపదికన ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాతో ముందుకు పోవాలంటే యోగి లేకుండా కష్టం అని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, పెద్ద రాష్ట్రమైన యుపి మీద ప్రయోగాలకు పూనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఏదైతే అది అవుతుందన్న తెగింపుతో కేంద్ర బిజెపి పెద్దలకు అవగతం అయి ఉండాలి. అయితే పూర్తిగా పగ్గాలు యోగికే ఇస్తారా అన్నది సందేహమే. యోగికి ఒక సందేశం పంపారు, సూచన చేశారు. గతంలో మాదిరి నరేంద్రమోడీ తిరుగులేని నేతగా ఉంటే అదొక దారి, ఇప్పుడు వైఫల్యాల బాటలో ఉన్నందున యోగి వంటి వారు ఒక పట్టాన అంగీకరిస్తారని చెప్పలేము. ఎందుకంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్‌ చేజారితే అది రాజకీయంగా బిజెపికి కోలుకోలేని దెబ్బ.యోగి మార్పు గురించి చర్చ ప్రారంభమైంది గనుక కొనసాగిస్తే బిజెపిలో, ఆర్‌ఎస్‌ఎస్‌లో నరేంద్రమోడీ పలుకుబడి కోల్పోయినట్లుగా పార్టీలోనే కాదు, దేశ వ్యాపితంగా సందేశం వెళుతుంది. తొలగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు యోగి కానసాగితే నష్టం-మార్చినా యుపిలో గెలుపు కష్టం అన్నట్లుగా ఉంది. నష్టం కంటే కష్టాన్ని ఎలాగోలా అధిగమిద్దాం అని భావించారా ? పరిస్ధితిని మరింత మదింపు వేసేందుకు సమయం తీసుకుంటున్నారా ? అయోధ్య రామజన్మభూమిని పరిష్కరించాం అనే ప్రచారం చేసుకొనేందుకు ఒక అవకాశం ఉంది. యోగి మీద వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా రానున్న రోజుల్లో వారణాసిలోని గ్యానవాపి మసీదు వివాదాన్ని, మధురలో షాహీమసీదు సమస్యను ముందుకు తేవటం ద్వారా దాన్ని అధిగమించి విజయం సాధించవచ్చా అనే మదింపులో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏది ముందు పుట్టింది ? జ్ఞానమా , అజ్ఞానమా – మత శక్తులెందుకు జ్ఞానం మీద దాడి చేస్తాయి ?

07 Monday Jun 2021

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, imperialism, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, USA

≈ Leave a comment

Tags

Anandaiah's K medicine, Ignorance, knowledge, pseudoscience, Science, science literacy, scientific temper


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం కేసులో గిల గిలా కొట్టుకుంటున్న కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి !

03 Thursday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP Hawala Case, Kerala BJP, Kerala RSS, Kodakara Hawala Case


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d