అమెరికా, ఐఎంఎఫ్‌ కౌగిట్లోకి శ్రీలంక – అధ్యక్షుడు గొటబయ పరారీ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఆర్ధికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో శనివారం నాడు (2022 జూలై 9) జరిగిన అనూహ్య పరిణామాల్లో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయినట్లు వార్తలు రాగా, ప్రధాని రనిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు వార్తలు. ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ గొటబయ రాజీనామా కోరుతూ శనివారం నాడు ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో రాజధాని కొలంబో, ఇతర అనేక ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం రాత్రి కర్ఫ్యూ విధించటాన్ని అనేక మంది వ్యతిరేకించటంతో శనివారం ఉదయం సడలించారు. పోలీసు ఆంక్షలను ఖాతరు చేయకుండా వేలాది మంది గొటబయ నివాసంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టిన గొటబయ శుక్రవారం రాత్రే ఒక సైనిక కేంద్రానికి వెళ్లి తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఇది రాసిన సమయానికి ఎక్కడ ఉన్నదీ నిర్దారణ కాలేదు, రాజీనామా బాటలో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కొద్ది వారాల క్రితం గొటబయ సోదరుడు, ప్రధానిగా ఉన్న మహింద రాజపక్స నివాసం ఎదుట నిరసన ప్రదర్శనల కారణంగా రాజీనామా చేసి ట్రింకోమలీలోని మిలిటరీ నౌకా కేంద్రంలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.


అసాధారణమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో మార్చి 15 నుంచి ప్రారంభమైన ప్రజల ఆందోళన తీవ్రతరం అవుతున్నది. గొటబయ కుటుంబపాలన, అనుసరించిన విధానాలు దేశాన్ని అన్ని విధాలుగా అస్తవ్యస్తం గావించాయి. ప్రజల నిరసనలు ప్రారంభమైన తరువాత వేగంగా మారిన అనేక పరిణామాల్లో ప్రభుత్వం ఐఎంఎఫ్‌కు, అమెరికాకు మరింత దగ్గరైంది. గతంలో అప్పులిచ్చి, కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న చైనా చేతుల్లోకి లంక వెళ్లిందని ఊరూవాడా టాంటాం వేసిన మీడియా మారుతున్న పరిణామాల గురించి మౌనం దాల్చింది. అంతేకాదు ముస్లిం విద్వేషాన్ని విపరీతంగా రెచ్చగొట్టిన లంక పాలకులు ఇప్పుడు చమురు కోసం అరబ్బు దేశాలకు దగ్గర అవుతున్నారు. వారి షరతులకు సలాం అంటున్నారు. ” సార్థక ప్రజాస్వామిక పాలన ”ను ప్రోత్సహించే పేరుతో ”అంతర్జాతీయ అభివృద్ధికోసం పని చేసే అమెరికా సంస్థ( యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. జూన్‌ చివరిలో ప్రధాని రానిల్‌ విక్రమ సింఘే ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఇందుకు గాను 5.7 కోట్ల డాలర్లను గ్రాంటుగా అమెరికా ఇవ్వనుంది, 2026వరకు ఈ పధకం కొనసాగుతుంది. గతంలో 2011లో మహింద రాజపక్సే ప్రభుత్వం కూడా ఇదే సంస్థ నుంచి రెండు పధకాలను అమలు జరిపిందని విక్రమ సింఘే గుర్తు చేశాడు.


2019లో శిరిసేన-విక్రమ సింఘే ప్రభుత్వం అమెరికాకు చెందిన మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌(ఎంసిసి) నుంచి 48 కోట్ల డాలర్లు గ్రాంటుగా తీసుకొనేందుకు ముందుకు రాగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న గొటబయ సోదరులు వ్యతిరేకించారు. ఈ మొత్తంతో కొలంబో నగరంలో ట్రాఫిక్‌, బస్‌ సర్వీసులు, దేశంలో కొన్ని రోడ్లను మెరుగుపరిచేందుకు పూనుకుంటామని అప్పుడు చెప్పారు. ఈ గ్రాంటు తీసుకుంటే దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగులుతుందని, ఈ పేరుతో ఎంసిసి ప్రాజెక్టులకు అనేక పన్ను రాయితీలు ఇచ్చే ప్రమాదకరమైన షరతు దాగుందుని ప్రతిపక్షం పేర్కొన్నది. తరువాత అధికారానికి వచ్చిన గొటబయ సర్కార్‌ ఎంసిసితో ఒప్పందంపై సంతకాలను జాప్యం చేసింది. 2021 నవంబరులో సంతకాలు చేసేది లేదని చెప్పగా ఆ పధకాన్ని రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆ సొమ్ము గనుక తీసుకొని ఉంటే ఇప్పుడు వచ్చిన విదేశీమారకద్రవ్య సంక్షోభాన్ని కొంత మేరకు అధిగమించి ఉండేవారమని అమెరికా మద్దతుదారులు చెబుతున్నారు.


తాజాగా గొటబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గంముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగపరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్ధిక లబ్ది లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. మన దేశం చేసిన నగదు, వస్తు సహాయానికి గాను ప్రతిఫలంగా అదానీ కంపెనీకి ఒక విద్యుత్‌ ప్రాజెక్టును అప్పగించే విధంగా స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వచ్చిన అంశం తెలిసినదే. ఇక అమెరికా షరతులకు సంబంధించి వచ్చిన వార్తల ప్రకారం ఐఎంఎఫ్‌ షరతులను లంక సర్కార్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌లను తెరవెనుక నుంచి నడిపించే ధనికదేశాల్లో అమెరికాది నాయకత్వ స్థానం అన్నది తెలిసిందే. సంస్కరణల పేరుతో వాటి పెత్తనాన్ని రుద్దటం అనేక దేశాల్లో చూస్తున్నాము. లంకలో కూడా అదే జరగనుంది. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30నాటికి పదిరోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో జూన్‌ నాటికి పన్నెండు నెలల్లో ద్రవ్యోల్బణం 54.6శాతానికి, ఆహార వస్తువుల ధరలు 80.1శాతం పెరిగాయి. చమురును సరఫరా చేయాలంటే తమకు ముందుగానే డబ్బు చెల్లించాలని లేదా శ్రీలంకేతర దేశాల బాంకుల నుంచి హామీ ఇప్పించాలని అమ్మకందారులు అంటున్నారు.


చమురును ఏదో విధంగా సంపాదించాలనే వత్తిడి కారణంగా గతంలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టినదాన్ని దిగమింగి అప్పుగా ముడిచమురు, గాస్‌ ఇప్పించాలంటూ కతార్‌కు గొటబయ సర్కార్‌ ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. కతార్‌ను మంచి చేసుకొనేందుకు లంకలో పనిచేస్తున్న కతార్‌ ఛారిటీ అనే కతార్‌ ప్రభుత్వ సంస్థ మీద నిషేధాన్ని వెనక్కు తీసుకుంది.2019లో జరిగిన ఉగ్రవాద చర్యలకు ముస్లింలే కారణమని, వారికి కతార్‌ ఛారిటీ నిధులు అందచేసిందని ప్రభుత్వం విమర్శించింది. సదరు సంస్థ నిధులను ప్రభుత్వం స్థంభింపచేసింది. అంతే కాదు కరోనా కారణంగా మరణించిన ముస్లింల శవాలను ఖననం చేస్తే భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని గొటబయ సర్కార్‌ నిషేధం విధించింది.


శ్రీలంక ప్రభుత్వం దిగివచ్చినప్పటికీ కతార్‌ సర్కార్‌ కరుణించలేదు. ఐఎంఎఫ్‌తో చేసుకొనే ఒప్పందాన్ని బట్టి తాము వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్‌ ప్రభుత్వం కూడా సాయానికి సిద్దం అంటూనే తమ సంగతి కూడా తేల్చాలని మెలికపెట్టింది. తాము చమురు సరఫరాకు అవసరమైన 360 కోట్ల డాలర్లు ఇస్తామని, దానికి గాను చెల్లించే వడ్డీ బదులు చమురు తవ్వకాలకు గాను లంకలో కొంత ప్రాంతాన్ని తమ అప్పగించాలని షరతు పెట్టగా ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తిరస్కరించింది. నెలకు 30 కోట్ల డాలర్ల చొప్పున 12నెలల్లో రుణం ఇస్తామని, దాన్ని ఐదు సంవత్సరాల విరామం తరువాత పదిహేను సంవత్సరాల్లో చెల్లించాలని ఒమన్‌ ప్రతిపాదించింది. దీని సంగతి కూడా తేలిస్తే తాము చమురు కొనుగోలుకు రుణం ఇస్తామని లంకలో ఒమన్‌ రాయబారి స్పష్టం చేశారు.ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవటమా లేదా అన్నది లంక సర్కార్‌ ఇష్టమని దాని కంటే ముందు ఇప్పటికే రుణాలు ఇచ్చిన దేశాలు, సంస్థల రుణాల చెల్లింపుల పునర్వ్వస్థీకరణ సంగతేమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. తమ రుణాల చెల్లింపుల గడువులో ఎలాంటి మార్పుకు అంగీకరించేది లేదని చైనా చెబుతున్నట్లు వార్తలు. ఐఎంఎఫ్‌, అమెరికా ప్రభావంలోకి లంక వెళ్లిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది సహజంగానే చైనా లేదా మరొక దేశానికి అనుమానాలు తలెత్తుతాయి.మన దేశం రష్యా నుంచి చౌక ధరలకు ముడిచమురు కొనుగోలు చేసి శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇబ్బందుల నుంచి ఆదుకొనేందుకు నాలుగు వందల కోట్ల డాలర్లను రుణంగా ఇచ్చింది. అందువలన భారత్‌ కూడా అప్పు తీర్చమని గట్టిగా అడుగుతుందా లేక వాయిదా వేయాలంటే అదానీ, అంబానీల వంటి వారికి దొడ్డిదారిన మరికొన్ని ప్రాజెక్టులను అప్పగించాలని డిమాండ్‌ చేస్తుందా అన్నది ప్రశ్న.

వంటగాస్‌ ధరల పెంపు, గాలి వాటు పన్ను – సామాన్యులకు సబ్సిడీల కోత, ధరల మోత !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ధరలు ఎంత పెంచినా జనం ఆమోదిస్తున్నారు, ఎక్కడా నిరసన తెలపటం లేదు. విశ్లేషకులు, జర్నలిస్టులకు ఎందుకు ? ఇదీ ఇటీవల బిజెపి నేతలు వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న ఎదురుదాడి. శ్రీలంక పరిణామాలు ఇక్కడా పునరావృతం అయ్యేంతవరకు అలానే మాట్లాడతారు అది వేరే అనుకోండి. 2022 జూలై మొదటి వారంలో సాధారణ వంటగాస్‌ ధరను మరో రు.50 పెంచారు. దీంతో హైదరాబాదులో రు.1,105కు చేరింది. అంతకు ముందు ఎంత పెంచినా జనాలు కిక్కురు మన లేదు, ఇప్పుడూ అంతే. పార్టీల పిలుపుల్లో కారకర్తలు తప్ప ఇతర జనాలు కనిపించరు. మంచం ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకొని నిద్రించటం అలవాటైన వారం కదా ! సర్దుకు పోవటంలో మన తరువాతే ఎవరైనా ! కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా జనానికి లేనిది ఎవరికైనా ఎందుకు మరి ! అయినా సరే కొన్ని అంశాలను చెప్పక తప్పదు. ఆసక్తి ఉన్న వారు చదవండి మరి !


జూలైలోనే ప్రభుత్వం విండ్‌ ఫాల్‌ టాక్సు పేరుతో చమురు సంస్థల మీద పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మామూలుగా విధించే పన్నుకు అదనం, తాత్కాలికం. దాని వలన కేంద్ర ప్రభుత్వానికి లక్ష నుంచి లక్షా 30వేల కోట్ల వరకు వస్తుందని కొందరు చెబుతుండగా ఇంకా ఎక్కువ ఉండవచ్చని కొన్ని అంచనాలు. సరే ఎంతైనా అది సెస్‌ గనుక వాటిలో రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అమ్మకపు పన్ను, జిఎస్‌టి, మరొక పన్ను గురించో విన్నాం గానీ విండ్‌ఫాల్‌ టాక్సు గురించి పెద్దగా తెలియదు. దీనికి తెలుగులో సరైన పదాన్ని నిఘంటువులేవీ చూపటం లేదు. గాలి వాటు (ఆదాయంపై ) పన్ను అందాం. ఒక కంపెనీకి దాని ప్రమేయం లేకుండా ఆర్ధికంగా పెద్ద మొత్తంలో లాభాలు, లబ్ది పొందటాన్ని విండ్‌ ఫాల్‌ అంటున్నారు. నదులకు భారీగా వరదలు వచ్చినపుడు లంకల్లో ఉన్న పొలాలకు సారవంతమైన ఒండ్రు మట్టి చేరి పంటలు బాగా పండుతాయి. కొత్తగా కొన్ని లంకలు ఏర్పడి భూమిగా అందుబాటులోకి కూడా రావచ్చు. దీనికి రైతుల ప్రమేయం లేదా ప్రయత్నాలుగానీ ఉండవు. అలాగే పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అలాంటి లాభాలు వస్తాయి.ఉక్రెయిన్‌ వివాద ఫలితంగా మన దేశంలోని చమురు కంపెనీలకు అలాంటి అపరిమిత లాభాలు వస్తున్నందున వాటి మీద కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు గాలివాటు పన్ను ఇలా ఉంది. మన దేశం నుంచి ఎగుమతి చేసే పెట్రోలుకు రు.6, డీజిలు మీద రు.13, విమాన ఇంథనానికి లీటరుకు ఒక రూపాయి, దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురు మీద టన్నుకు రు.23,250 చెల్లించాల్సి ఉంటుంది.


కొన్ని దేశాల్లో గాలివాటు లాభాలపై పన్ను విధిస్తుంటే జర్మనీలో ఇంథన సంస్థలను ఆదుకొనేందుకు వినియోగదారుల మీద భారాలు మోపేందుకు అక్కడి సర్కారు ఆలోచిస్తున్నది. పెరుగుతున్న ఇంథన ధరల మేరకు అదనంగా వసూలు చేసేందుకు చట్టసవరణకు పూనుకుంది. రష్యా ప్రభుత్వం కూడా ఇంథన రంగ సంస్థ గాజ్‌ప్రోమ్‌ గాలి వాటు లాభాలపై 20బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను విధించింది. సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు నెలకు 6.5బి.డాలర్ల చొప్పున పన్ను వసూలు చేస్తారు. ఈ సొమ్ము ప్రభుత్వ ఖజనాకు చేరుతుంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపాకు, చమురు, గాస్‌ సరఫరాను తగ్గించినప్పటికీ ఈ సంస్థ రోజుకు పది కోట్ల డాలర్లకు పైగా సంపాదిస్తున్నది. సరఫరాలు తగ్గినా గత ఏడాది వచ్చిన దానికి సమంగా సంపాదిస్తున్నది. ఇటలీలో ఇంథన ధరలు పెరిగిన కారణంగా ప్రభావితులైన వినియోగదారులు, వాణిజ్య సంస్థలను ఆదుకొనేందుకు అక్కడి చమురు సంస్థల లాభాలపై 25శాతం పన్ను విధించినట్లు ప్రకటించారు.బ్రిటన్‌లో 2022 మే26 వతేదీ తరువాత వచ్చిన లాభాలపై పన్నును 40 నుంచి 60శాతానికి పెంచారు. దీనికి ఇంథన ధరల లెవీ అని పేరు పెట్టారు.2025 తరువాత దాన్ని తొలగిస్తారు. మనం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ఈ పన్ను ఎందుకు విధించారు. ఆ వచ్చిన రాబడితో వంటగాస్‌, పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించాల్సి ఉండగా గాస్‌ ధరను రు.50 ఎందుకు పెంచినట్లు ? ఎవరి కోసం ఈ పన్ను ఆదాయాన్ని ఖర్చు చేస్తారు ? ప్రశ్నించకుండా నోరు మూసుకున్నవారు దేశభక్తులు, అడిగినవారు దేశద్రోహులు !


దేశంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో వంటగాస్‌ను ప్రోత్సహించారు.ప్రజల కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నందున దానికి గాను సబ్సిడీలు కూడా ఇచ్చారు. దీంతో వినియోగదారులు గణనీయంగా పెరిగారు. కరోనా లాక్‌డౌన్‌ విధించిన 2020లో పెట్రోలు కంటే దేశంలో తొలిసారిగా గాస్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. తరువాత తిరిగి పెట్రోలు పెరిగిందనుకోండి. సబ్సిడీలను ఎత్తివేసేందుకు గాను వేసిన ఎత్తుగడ ఏమంటే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాలో వేస్తామంటూ గాస్‌ ధర మొత్తాన్ని ముందుగా చెల్లించే అలవాటు చేశారు. తరువాత స్వచ్చందంగా సబ్సిడీ వదులు కోవాలన్న తతంగం నడిపారు. బిజెపి దేశభక్తులు కూడా వదులుకోకపోవటంతో క్రమంగా సబ్సిడీ ఎత్తివేశారు. ఐదుశాతం మంది స్వచ్చందంగా వదులు కున్నట్లు చెప్పగా కాగ్‌ సదరు అంకెలతో అంగీకరించలేదు. 2014లో గాస్‌ ధర రు.414 కాగా తాజా పెంపుదలతో అది రు.1,105(హైదరాబాదు)కు పెరిగింది. 2014 తరువాత నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో గాస్‌ ధర ముడిచమురుతో పాటు గణనీయంగా తగ్గింది.


అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) 2021 డిసెంబరు నాలుగవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది.2013-14 నుంచి 2019-20 కాలంలో అంతర్జాతీయ ఎల్‌పిజి(వంటగాస్‌) ధర 48శాతం తగ్గింది. అదే 2020-21తో పోల్చితే తగ్గుదల 31శాతం ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు వరకు మన దేశంలో ధరను 110శాతం పెంచారు. కరోనా లాక్‌డౌన్ల ఎత్తివేత తరువాత మాత్రమే అంతర్జాతీయ ధర పెరిగింది.అంతకు ముందు ఆరు సంవత్సరాలు తగ్గింది. ఈ కారణంగానే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం తగ్గింది.2013-14 నుంచి 2015 – 16 మధ్య ప్రభుత్వం భరించిన సబ్సిడీ భారం 64శాతం తగ్గింది. అంకెల్లో 746.1 నుంచి 263 బిలియన్ల రూపాయలకు( మన కోట్లలో చెప్పుకుంటే 74,610 నుంచి 26,300 కోట్లకు) తగ్గింది. ఇదే కాలంలో చమురు కంపెనీలు భరించిన సబ్సిడీ మొత్తం 98శాతం అంటే రు.69,128 నుంచి రు.1,268 కోట్లకు తగ్గింది.వినియోగదారులకు నేరుగా చెల్లించిన సబ్సిడీ మొత్తం 2015-16 నుంచి 2020-21 కాలంలో రు.27,570 కోట్ల నుంచి రు.3,658 కోట్లకు తగ్గింది.

ధనికులకు సబ్సిడీని తగ్గించి పేదలకు పెంచామంటూ ప్రచార ఆర్భాటం చేసి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(పిఎంయువై) పధకం పేరుతో మంజూరు చేసిన గాస్‌ కనెక్షన్ల ప్రచారాన్ని అనేక మంది ప్రశ్నించారు. సబ్సిడీల గురించి అనుసరించిన లెక్కల పద్దతిని కాగ్‌ ప్రశ్నించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల కోసం ఈ పధకాన్ని ప్రారంభించారు.2015-16లో ఈ పధకం కింద ఇచ్చినట్లు చెప్పిన సబ్సిడీ రు.2,990 కోట్లు కాగా 2019-20కి అది రు.1,293 కోట్లకు తగ్గింది. ఈ పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన వారి ఆదాయం పెరగని కారణంగా, సబ్సిడీ కోత వలన సిలిండరును తీసుకోలేకపోయారు.


పిఎంయువై పధకం కింద గాస్‌ కనెక్షను ఉన్నవారికి సిలిండర్‌కు రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది.2022 మే 12వ తేదీన హిందూ పత్రిక వార్తలో వెల్లడించిన సమాచారం ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో 90 లక్షల మంది ఉజ్వల లబ్దిదార్లు గాస్‌ను తీసుకోలేదు. కోటి మంది ఒక సిలిండరు మాత్రమే తీసుకున్నారు. 2016 మే ఒకటవ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్రమోడీ ఈ పధకాన్ని ప్రారంభించారు.2020 మార్చి నాటికి ఎనిమిది కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు, తరువాత మరొక కోటి పెంచారు. సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత ఆర్ధిక సంవత్సరంలో (2021 మార్చి నాటికి) ఇచ్చిన కనెక్షన్లలో ఐఓసిలో ఒకసారి మాత్రమే సిలిండర్లు తీసుకున్నవారు 65, హెచ్‌పిసిలో 9.1, బిపిసిలో 15.96లక్షల మంది ఉన్నారు. 2019 సెప్టెంబరు వరకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి బిపిసి ప్రత్యేకంగా పేర్కొన్నది. ఐఓసిలో ఒకసారి మాత్రమే తీసుకున్నవారు 52,హెచ్‌పిసిలో 27.58, బిపిసిలో 28.56లక్షల మంది ఉన్నారు.ఈ ఏడాది మార్చి నెలలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఏటా ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు సగటున ఒక్కొక్కరు 3.6 సిలిండర్లు మాత్రమే తీసుకున్నారు. 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఈ పధకం తీసుకున్న సిలిండర్ల సంఖ 14.17కోట్లని మరొక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపిందని హిందూ పత్రిక పేర్కొన్నది. తొమ్మిది కోట్ల మంది మూడు చొప్పున తీసుకుంటే 27 కోట్లు కావాలి, అంటే కరోనాలో కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకొనే స్థితి లేదన్నది స్పష్టం. అలాంటపుడు కేవలం రెండువందల సబ్సిడీ ఇచ్చి తాజాగా పెంచిన రేటు ప్రకారం రు.900 పెట్టి కొనుగోలు చేసేందుకు ఎందరు ముందుకు వస్తారన్నది ప్రశ్న.వంటగాస్‌ ధరలకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సగటున ఒక లీటరు ధర జూలై నాలుగవ తేదీ నాటికి 80 సెంట్లు ఉంది. మన కరెన్సీలో రు.63.39 కాగా మన దేశంలో 87 సెంట్లు, రు.68.94 ఉంది. మన కంటే ఆస్ట్రేలియాతో సహా 28 దేశాలలో ధర తక్కువగా 22 చోట్ల ఎక్కువగా ఉంది. విశ్వగురువుగా అభిమానుల నుంచి అభినందనలు అందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు ?


గాలి వాటు లాభాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వ రంగ ఓఎన్‌జిసి 2020-21లో సంపాదించిన మొత్తం రు.1,10,345 కోట్లకు గాను దానికి వచ్చిన లాభం రు.40,306 కోట్లు. మన దేశంలో ఓఎన్‌జిసితో పాటు చమురును వెలికి తీసే వేదాంత ప్రైవేటు కంపెనీకి సైతం పెద్ద మొత్తంలో లబ్ది కలిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన గాలివాటు పన్నుతో ఈ రెండు కంపెనీల నుంచే కేంద్రానికి 69వేల కోట్ల మేరకు రాబడి ఉంటుందని పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. రిలయన్స్‌ కంపెనీ జామ్‌నగర్‌లోని చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులపై ఆ కంపెనీ అపరిమిత లాభాలు ఆర్జిస్తున్నది. గాలివాటు పన్ను విధించిన తరువాత కూడా దానికి గణనీయ లాభాలు ఉంటాయని చెబుతున్నారు. జూన్‌ చివరి వారంలో కంపెనీ జిఆర్‌ఎం ఒక పీపాకు 24 నుంచి 26 డాలర్లవరకు ఉందని మోర్గన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఈ కంపెనీ శుద్ధి చేసిన ఉత్పత్తుల్లో 58శాతం ఎగుమతి చేస్తున్నట్లు జఫరీస్‌ సంస్థ తెలిపింది. గాలి వాటు పన్ను వలన జిఆర్‌మ్‌ ఒక పీపాకు 7 నుంచి 12 డాలర్లు తగ్గుతుందని అంచనా.2021లో పీపాకు 5.9, 2022లో 9.7 డాలర్లు రాగా రష్యా చమురు కారణంగా 2023లో 16.5 డాలర్లు ఉండవచ్చని నొమురా పేర్కొన్నది. గతంలో కేవలం ఐదు శాతం దిగుమతి చేసుకోగా ఇప్పుడు రష్యా చమురు 25శాతానికి పెరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గినపుడు ఆ మేరకు జనాలకు తగ్గించకుండా సెస్‌లను విపరీతంగా పెంచి లక్షల కోట్లు తన ఖజనాకు మళ్లించింది. చమురు ధరలను తగ్గించలేదు. ఇప్పుడు చమురు కంపెనీలకు వస్తున్న అపరిమిత లాభాల నుంచి కొంత వసూలు చేయటం సమర్ధనీయమే. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కేంద్రం ఆత్మనిర్భర్‌ పేరుతో వాటికే మరికొంత లబ్ది చేకూర్చింది.గాలి వాటు పన్ను ద్వారా వచ్చే అదనపు రాబడిని ఎవరికోసం ఖర్చు చేస్తారు.కార్పొరేట్లగా సామాన్య జనాలకా ? గాస్‌, చమురు ధరల పెంపుదల ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నది. పరిశ్రమల వృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం పేరుతో కంపెనీలకు ఇస్తున్న పలు రాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి, మరి సామాన్యులకు సబ్సిడీల కోత – ధరల మోత ఎందుకు ?

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

రూపాయి పతనం : వంచనకూ ఒక హద్దుంటుంది :నరేంద్రమోడి , ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా మిత్రోం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


” గతంలో భారత ప్రధానులు అమెరికా అధ్యక్షులను కలుసుకొనేందుకు వారి దగ్గరకు వెళ్లేవారు. ఇప్పుడు వారే మన ప్రధాని దగ్గరకు వస్తున్నారు. అదే నరేంద్రమోడీ గొప్పతనం ” ఇది ఇటీవలి జి7 దేశాల సమావేశం తరువాత సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక పోస్టులోని అంశం. నిజమే ఆ దృశ్యాన్ని చూసి యావత్‌ నరేంద్రమోడీ భక్త జనులు ఆనందపారవశ్యంతో ఆ బొమ్మ ముందు పొర్లు దండాలు కూడా పెట్టి ఉండవచ్చు. ఎవరిష్టం వారిది. ప్రపంచ నేతలతో అందునా అమెరికా నేతలతో కౌగలించుకొనే చనువు మన ప్రధానికి ఉంది గనుక మరొకటి కూడా జరిగి ఉండవచ్చు. ” ఏమిటి మోడీ గారు మా డోనాల్డ్‌ ట్రంప్‌నైతే కౌగలించుకొని చెట్టపట్టాలు వేసుకొని మరీ మధుర భాషణలు జరిపారు. నన్ను చూసి కూడా చూడనట్లు అటు తిరిగి మాట్లాడుతున్నారేం ” అంటూ వెనుక నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నరేంద్రమోడీ భుజం తట్టి మరీ పలకరించి ఉండవచ్చుగా ! వసుదేవుడు అంతటి వాడు తన పని జరిపించుకొనేందుకు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న పురాణ కధ చదివాము. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో తన అవసరం కోసం గత ఐదునెలల్లో బెదిరింపులు-బుజ్జగింపులతో మన దేశాన్ని తనవైపు తిప్పుకొనేందుకు అమెరికా చూస్తున్నదనేది కూడా జగమెరిగినదే. దానిలో భాగంగా కూడా జో బైడెన్‌ వెనుక నుంచి తట్టి మరీ నరేంద్రమోడీని పలుకరించి ఉండవచ్చు మీ వైఖరిని మార్చుకున్నారా అని అడిగి ఉండవచ్చు. అవసరం వారిది కదా ! ఏదైనా దాన్ని వదలివేద్దాం, దీనితో దేశానికి ఒరిగిందేమిటి, జనాలకు దక్కిందేమిటి ?


నరేంద్రమోడీని విశ్వగురువుగా మన జనాలకు చూపేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి వారి సలహాలతో మద్దతుదారులు ఇలాంటివి ప్రచారంలో పెట్టినా ఆశ్చర్యం లేదు. గతంలో చాయవాలా బ్రాండ్‌,ఎన్నికల సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి కూర్చోబెట్టటం, బిజెపి నేతలు టీ అమ్మటం వంటి జిమ్మిక్కులన్నీ దానిలో భాగమే కదా ! చాయవాలా తరువాత చౌకీదారు బ్రాండ్‌తో ముందుకు వచ్చారని తెలిసిందే ! ఇవన్నీ నాణానికి ఒక వైపు మాత్రమే. ప్రపంచానికి పాఠాలు చెబుతున్న విశ్వగురువు తన కార్యస్థానంలో చెప్పిందేమిటి చేస్తున్నదేమిటి ? అన్నింటినీ ఒకేసారి చెప్పుకోలేం గనుక రూపాయి గురించి మోడీ, బిజెపి నేతలు చెప్పిందేమిటో చూద్దాం ? ఇప్పుడు జరుగుతున్నదేమిటో చూద్దాం. దాని గురించి వారు మరిచినట్లు నటిస్తున్నా జనానికి మతిమరుపు వచ్చినా అవసరం గనుక చెప్పుకోక తప్పదు. భజన తప్ప మరొకటి మాకు పట్టదని భక్తులు అంటారా ? వారిని వదలివేద్దాం ! తమ అవసరాల కోసం నరేంద్రమోడీని విదేశాలు – కార్పొరేట్‌లు మునగచెట్టు ఎక్కించవచ్చు, మీడియాలో గొప్పతనాన్ని గుప్పించవచ్చు. దానికి అనుగుణంగానే ఎక్కడ వేదిక దొరికితే అక్కడ మోడీ గారు సుభాషితాలను వల్లిస్తున్నారు. ఒకటి మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి జనాన్ని ఆకట్టుకోవటంలో నరేంద్రమోడీకి ప్రస్తుతం దేశంలో మరొకరు సాటిరారు. అందునా వేషం-భాషల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందారు.


” యుపిఏ నిర్వాకం రూపాయి పతనానికి దారి తీసింది : బిజెపి ” 2013 నవంబరు 21న పిటిఐ వార్తకు శీర్షిక. ” ఎఫ్‌డిఐల ద్వారా ఎఫ్‌ఎఫ్‌ఐల పెట్టుబడులతో నడపాలన్న యుపిఏ విధానం వలన ఈ దుస్థితి ఏర్పడింది. రూపాయి రికార్డు పతనం చెందింది.( ఆరోజు ఒక డాలరుకు 60.15 రూపాయలు)” ఆ రోజు విలేకర్లతో మాట్లాడింది నాడు రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవిశంకర ప్రసాద్‌. ప్రభుత్వం మీద జోకులు పేలుస్తూ ” యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్‌ గాంధీ వయసుతో సమానం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం ” అన్నారు.


రవిశంకర ప్రసాద్‌ కంటే ముందు, 2013 ఆగస్టు 20న గాంధీనగర్‌ నుంచి పిటిఐ వార్తా సంస్థ సిఎంగా ఉన్న నరేంద్రమోడీ వ్యాఖ్యల గురించి ఒక వార్తను ఇచ్చింది. ఆరోజు రూపాయి విలువ 64.11కు దిగజారింది.” ఈ రోజు దేశం ఆశాభంగం చెందింది, ఎందుకంటే ఆర్ధిక రంగం గురించి గానీ రూపాయి పతనం గురించి గానీ ప్రభుత్వానికి పట్టలేదు. దాని ఏకైక చింతల్లా కుర్చీని ఎలా కాపాడుకోవాలా అన్నదే. గత మూడు నెలలుగా రూపాయి పతనం చెందుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.రూపాయి ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తామని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాం, కానీ జరిగిందేమీ లేదు. ” అని బిజెపి ప్రచార కమిటీ నేతగా కూడా ఉన్న మోడీ చెప్పారు.


2018 సెప్టెంబరు మూడున ద క్వింట్‌ పత్రిక జర్నలిస్టు మేఖలా శరణ్‌ రాసిన విశ్లేషణ ” రూపాయి ఆసుపత్రిలో ఉంది, మృత్యువు ా ప్రాణాలతో పోరాడు తోంది ” అని 2013లో నరేంద్రమోడీ చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత ప్రధాన మంత్రి, సెప్టెంబరు మూడున తొలిసారిగా రు. 71.11గా ఉంది అంటూ ప్రారంభమైంది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. 2012లో నరేంద్రమోడీ గట్టిగా ఇలా చెప్పారు.” నేను పరిపాలనలో కూడా ఉన్నాను. నాకు రూపాయి విలువ గురించి తెలుసు అది ఇంతవేగంగా పతనం కాకూడదు.ఈ విధంగా పతనం కావటానికి గల కారణాలేమిటి ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఈ దేశం జవాబును డిమాండ్‌ చేస్తోంది” అన్నారు. మరుసటి ఏడాది బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ఇలా చెప్పారు. ” ఈ విధంగా రూపాయి విలువ పడిపోవటాన్ని గత రాత్రి చూస్తూ భయపడి టీవీ కట్టేశాను.” బిజెపి నేతల ఈ ప్రకటనలను ఉటంకించిన ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ ” ఇప్పుడు రోజులు మారాయి. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు డాలరుతో రూపాయి విలువ పతనమైంది. ఆయన దేన్నిగురించీ చెప్పటం లేదు.” అని ముక్తాయింపు ఇచ్చారు. ఎన్‌డిటీవి యాంకర్‌ రవీష్‌ కుమార్‌ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం మాట్లాడిందీ చూపారు. ” ఈ పతనం(2018) గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు.” గార్గ్‌ మాటల తరువాత ” వంచనకూ ఒక హద్దు ఉంటుంది ” అన్న నరేంద్రమోడీ చెప్పిన ఒక మాటను చూపి రవీష్‌ కుమార్‌ ముగించారు. నరేంద్రమోడీ ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పినా నిత్య సత్యం. కచ్చితంగా కాంగ్రెస్‌ నేతల గురించే చెప్పి ఉంటారు. తరువాత కాలంలో అది తనకూ వర్తిస్తుందని ఊహించి ఉండరేమో !


. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. అదే ధరకు 2012లో చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29. చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, ఇప్పుడు 79 దాటింది. పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. దీని గురించి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఏం చెబుతారు ? రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోందా లేదా ?


2022 జూలై ఒకటవ తేదీన 79.20తో రూపాయి పతనం కొత్త రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోడీ వయస్సును దాటి బిజెపి మార్గదర్శక మండలిలో ఉన్న అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి వారి వయస్సులను అధిగమించేందుకు పోటీ పడుతోంది. త్వరలో 80 దాట నుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్రమోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31నాటికి 633.6 బి.డాలర్లుండగా జూన్‌ 24న 593.3 బి.డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో 77-81 మధ్య రూపాయి విలువ కదలాడవచ్చని కొందరి అంచనా. అది ఇప్పుడున్న ముడిచమురు ధరలు అలా ఉంటే అన్న ప్రాతిపదికన అన్నది గమనించాలి.2022లో 95.6 బి.డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి. పతనమౌతున్న రూపాయి గురించి ఎవరూ మాట్లాడరేం. మరక మంచిదే అన్నట్లు పతనం మంచి రోజుల్లో భాగమే అని బిజెపినేతలైనా చెప్పాలి కదా మిత్రోం !

ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రయాణీకులపై మోడీ – జగన్‌ బాదుడే బాదుడు !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టి) డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణీకుల మీద భారం మోపింది. 2022 జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈ సందర్భంగా సంస్థ చేసిన ప్రకటనలో ” పొరుగు రాష్ట్రంలో అన్ని బస్సుల టిక్కెట్లు మరియు పాస్‌ల ధరలు 9.6.2022 నుంచి పెంచటం జరిగినది ” అని సమర్ధించుకుంది.ఎదుటి వారు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుంటామా అన్న లోకోక్తి తెలిసిందే. భారం మోపేందుకు ఇది ఒక సాకు తప్ప హేతుబద్దత లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ అమలు జరుపుతున్నదా, ఎపిలో ఉన్న వాటిని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా ! ఒకరు పెంచితే మిగతావారు పెంచాలని, తగ్గిస్తే తగ్గించాలనే ఒప్పందం గానీ విధిగానీ లేదు. జూలై రెండవ తేదీన ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఒక లీటరు పెట్రోలు, డీజిలు ధరలు దిగువ విధంగా ఉన్నాయి.
పట్టణం ×××× పెట్రోలు××× డీజిలు
విజయవాడ×× 111.66 ××× 99.43
హైదరాబాదు × 109.66 ××× 97.82
బెంగలూరు ×× 101.94 ××× 87.89
చెన్నై ×××××× 102.63 ××× 94.24
భువనేశ్వర్‌ ××× 103.19 ××× 95.28
ఆర్‌టిసీ ఛార్జీల పెంపుదల కోసం పొరుగు రాష్ట్రంతో పోలిక తెచ్చిన జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ మరి ఈ రేట్లను గమనించి తక్కువ ఎక్కడుందో దాన్ని ఎందుకు అనుసరించటం లేదు ? దున్నబోతే దూడల్లో తినబోతే ఎద్దుల్లో అంటే ఇదే కదా ! అడ్డగోలు సమర్ధనకు ఒక తర్కం-పద్దతీ పాడూ ఉండదు. ఆర్‌టిసి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా సర్వీసులను నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు పొరుగునే తక్కువగా ఉన్న ధరలకు డీజిలు, పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు.అలాగే ఎపిఎస్‌ఆర్‌టిసి ఛార్జీలు తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల జనాలు మన బస్సులు ఎక్కుతారు, రాబడి కూడా పెరుగుతుంది కదా ! సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ తిష్టవేసిన సలహాదారులకు, అధికారులకు గానీ ఈ చిన్న అంశం తట్టలేదా ! గతంలో కూడా డీజిలు ధరలు పెరిగాయి. ఎన్నడూ ఆర్‌టిసి చరిత్రలో దొడ్డిదారిన డీజిల్‌ సెస్‌ పేరుతో భారం మోపలేదు.


నవరత్నాలలో భాగంగా గత మూడు సంవత్సరాలలో లక్షా 50వేల కోట్ల వరకు జనానికి లబ్ది చేకూర్చినట్లు వైసిపి ప్రభుత్వ విజయాలలో చెప్పుకుంటున్నారు. ఆర్‌టిసి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వరుసగా వచ్చినట్లు చెప్పిన నష్టం 2019-20లో రు.1,222.96 కోట్లు, 2020-21లో రు.2,982.32 కోట్లు, 2021-22లో రు.2,698.86 కోట్లు. ఆర్‌టిసిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.ఇది మిగిలిన ప్రభుత్వశాఖల వంటిది కాగా నష్టాల గురించి ఎందుకు చెబుతున్నారన్నది ప్రశ్న. వైద్య ఆరోగ్యశాఖలో కూడా అందించేది సేవ మాత్రమే. ఆర్‌టిసిలో సిబ్బంది వేతనాలు, బస్సుల కొనుగోలు, నిర్వహణ ఉన్నట్లే అక్కడా సిబ్బంది వేతనాలు, ఆసుపత్రులు, వాటికి అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు వంటివి ఉంటాయి. దానిలో లేని లాభనష్టాల లెక్కలు ఆర్టీసికి ఎందుకు చెబుతున్నట్లు ? ఆసుపత్రుల్లో వాణిజ్య దుకాణాలు ఉండవు,అదే బస్టాండ్లలో ఎంతో కొంత దుకాణాల ద్వారా రాబడి వస్తుంది. ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేది పేద, మధ్య తరగతి వారు మాత్రమే. వారి కోసం రవాణా సబ్సిడీని కూడా నవరత్నాల్లో భాగంగా పరిగణించి ఏడాదికి మూడువేల కోట్ల రూపాయల భారాన్ని భరించే శక్తిలేనిదిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా ? నిజానికి నష్టం అని చెబుతున్నదంతా నష్టం కాదు. వృద్దులు, స్కూలు విద్యార్దులు, బస్‌పాస్‌లు, ఆర్‌టిసి మాజీ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతరులకు ఇస్తున్న రాయితీలు కూడా దీనిలో ఉన్నందున ఆ మేరకు ప్రభుత్వం సంస్థకు చెల్లిస్తే నష్టాల మొత్తం తగ్గుతుంది. గత మూడు సంవత్సరాల్లో డీజిలు ధర లీటరుకు రు.40 పెరిగిందని ఆర్‌టిసి తన ప్రకటనలో చెప్పింది. డీజిలు మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 22.25శాతం పన్ను విధిస్తున్నది అంటే, అంత మేర రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నదనేది పచ్చినిజం. ఆ మేరకు ఆర్‌టిసి కొనుగోలు చేసే డీజిలు మీద పన్ను తగ్గించినా భారం తగ్గుతుంది కదా !


పెద్ద మొత్తంలో డీజిలు కొనుగోలు చేసేవారికి లీటరుకు రు.30 అదనంగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఇది జనం మీద విధిస్తున్న మోడీ టాక్సు అని చెప్పవచ్చు. తెలంగాణా వంటి చోట్ల ఆర్‌టిసి ఏకమొత్త కొనుగోలు నిలిపివేసి ఆ భారాన్ని తగ్గించుకొనేందుకు విడిగా కొనుగోలు చేస్తున్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి కూడా అదే పద్దతిని అనుసరించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు కొనుగోలు నిలిపివేశారని చెబుతున్నారు. అలాంటపుడు ఆ పేరుతో జనాల మీద భారం మోపారంటే దీన్ని మోడీ-జగన్‌ టాక్సు అని పిలవాల్సి ఉంటుంది. ఆర్‌టిసి బస్సుల్లో ఇప్పటికే టోలు, పాసింజరు, సేఫ్టీ పేరుతో అదనపు మొత్తాలను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది అదనపు భారం.


ఆర్‌టిసిలో వివిధ సర్వీసుల మీద పెంచిన డీజిల్‌ భారం వెనుక పాలకపార్టీ పెద్దలు-ప్రయివేటు బస్‌ యజమానుల కుమ్మక్కును కొట్టి పారవేయలేము. వారు విడిగా తక్కువ ధరలకు బంకుల్లో డీజిలు కొనుగోలు చేస్తారు కనుక ఆర్‌టిసి పెంచిన మొత్తం ఎంతైతే అంత వారికి వచ్చే అదనపు లాభమే. డిమాండ్‌ ఉన్నపుడు తప్ప మిగిలిన రోజుల్లో ఇప్పటికే ఆర్టీసి కంటే తక్కువ చార్జీలకే తిప్పుతున్నారు. అందువలన ఇప్పుడు ఆర్‌టిసిలో పెంపుదల వారికి మరింత లాభం ఉంటుంది. దానిలో కొంత తగ్గించుకొని ఆర్టీసి కంటే తక్కువ ఛార్జీలకు ప్రయాణీకులను ఆకర్షించేందుకు అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఆర్‌టిసిలో ఎక్కేవారు తగ్గుతున్నారు. లాభం వుండే దూరపు సర్వీసుల్లో మరింతగా తగ్గితే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందువలన ఏ విధంగా చూసినా సంస్థను మరింత దెబ్బతీసేపనే తప్ప మరొకటి కాదు

నోటి దూల నూపుర్‌ శర్మకు సుప్రీం చివాట్లు – బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి ó(ఆమెను తాత్కాలికంగా నిలిపి ఉంచారు తప్ప పూర్తిగా తొలగించలేదు గనుక ఇంకా ఆ పదవిలో ఉన్నట్లే ) నూపుర్‌ శర్మకు జూలై ఒకటవ తేదీన సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వివిధ రాష్ట్రాలలో దాఖలైన కేసులన్నింటినీ ఒక్కటిగా చేసి ఢిల్లీలో విచారించాలని ఆమె చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, జెపి పార్దీవాలాతో కూడిన వేసవి సెలవుల బెంచ్‌ నూపుర్‌ వినతిని విచారించింది. ఆమె నోటి దూల దేశమంతటా నిప్పు రాజేసింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తతలకు ఆమెదే పూర్తి బాధ్యత అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశంలో మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలతో దేశంలో రగిలించిన ఆవేశాలకుగాను దేశం మొత్తానికి ఆమె క్షమాపణ చెప్పాలన్నది. సుప్రీం కోర్టు నుంచి ఇలాంటి ప్రతిస్పందనను ఎవరూ ఊహించి ఉండరు. నూపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొనేట్లు ఆదేశించాలని అజయ గౌతమ్‌ అనే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణకు దరఖాస్తు చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలు చేసినందున ఆమెకు న్యాయం జరగకపోవచ్చని ఆరోపించారు. తన పిటీషన్‌ కాపీని రాష్ట్రపతికి కూడా పంపుతానని అతను పేర్కొన్నాడు.


గ్యానవాపి మసీదు అంశం కోర్టు విచారణలో ఉన్నందున ఒక అజెండాను ముందుకు తేవాలని తప్ప దాని మీద టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ ఎందుకు నిర్వహించింది అని కోర్టు ప్రశ్నించింది. మే 27వ తేదీన సదరు ఛానల్‌ చర్చలో నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ” చౌకబారు ప్రచారం కోసం, రాజకీయ అజెండా లేదా దుర్మార్గమైన కార్యకలాపాల కోసం ఆమె మాట్లాడి ఉండాలి. ఆమె వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ? దేశమంతటా ఆవేశాలను రగిలించేందుకు ఆమె మాట్లాడిన తీరు కారణం, దేశంలో జరుగుతున్నదానికి ఈ మహిళదే ఏకైక బాధ్యత. ఆమె ఎలా రెచ్చగొట్టిందీ చర్చను మేము చూశాము. తరువాత లాయర్నని ఆమె చెప్పుకుంది ఇది సిగ్గుచేటు. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ” అని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్‌ సూర్య కాంత్‌ అన్నారు.


నూపుర్‌ శర్మ తరఫు న్యాయవాది మణీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ చర్చ సందర్భంగా నవికా కుమార్‌ మాట్లాడిన దానికి స్పందనగా నూపుర్‌ శర్మ మాట్లాడినట్లు చెప్పగా అయితే చర్చను నిర్వహించిన వారి మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అన్నది.అలాంటి ఉద్దేశ్యం యాంకర్‌కు లేదు. చర్చలో మరొకరు పదే పదే శివలింగం కాదు కేవలం ఫౌంటెన్‌ చెప్పారు అని మణిందర్‌ సింగ్‌ అన్నారు. తన కక్షిదారుకు ప్రాణహాని ఉన్నందున కేసులన్నింటినీ ఒకేచోట విచారించాలని మణీందర్‌ సింగ్‌ కోరారు. ” అమెకు ముప్పు ఉన్నదా లేక దేశ భద్రతకే ఆమె ముప్పు తెచ్చారా ? ఉదయపూర్‌లో జరిగిన దురదృష్టకర హత్యకు ఆమె మాటలే కారణం ” అని జస్టిస్‌ పార్దీవాలా అన్నారు. నూపుర్‌ శర్మ తన వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పారని, వెనక్కు తీసుకున్నారని న్యాయవాది చెప్పగా ” దేశానికి క్షమాపణ చెప్పేందుకు ఆమె టీవీ స్టూడియోకు వెళ్లాలి. వెనక్కు తీసుకోవటం కూడా చాలా ఆలస్యమైంది. అది కూడా మనోభావాలు గాయపడితే అనే షరతులతో కూడి ఉంది. రెచ్చగొట్టేందుకు వీరేమీ మతపరమైన వారు కాదు.” అని కోర్టు పేర్కొన్నది.


నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించటం గురించి జస్టిస్‌ సూర్య కాంత్‌ మాట్లాడుతూ ” నూపుర్‌ పిటీషన్‌ ఆమె పొగరును వెల్లడిస్తున్నది. దేశంలోని మెజిస్ట్రేట్‌లు ఆమెకు చాలా చిన్నవారిగా కనిపిస్తున్నారు. ఆమె ఒక పార్టీ అధికార ప్రతినిధైతే ఏమిటి ? తన వెనుక అధికారం ఉందని, దేశంలోని చట్టాలతో నిమిత్తం లేకుండా ఏమైనా మాట్లాడగలనని ఆమె అనుకుంటున్నారు. కేవలం ఒక జాతీయ పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన క్షోభను కలిగించే అంశాలు మాట్లాడేందుకు లైసన్సు ఇవ్వరాదు. కోర్టులో ఉన్న అంశం గురించి ఆమె ఎందుకు మాట్లాడారు ” అని జస్టిస్‌ సూర్య కాంత్‌ ప్రశ్నించారు. ఈ అంశంలో ఢిల్లీ పోలీసుల తీరును కూడా కోర్టు ప్రశ్నించింది.పోలీసులు ఏమి చేశారు ? మా నోరు తెరిపించవద్దు అని సున్నితంగా కోర్టు మందలించింది.వివిధ రాష్ట్రాల నుంచి నిరంతరం వస్తున్న బెదిరింపులతో తన ప్రాణాలకు ముప్పు ఉందని నూపుర్‌ శర్మ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.


దేవుడు నైవేద్యం ఆరగించడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే ఎక్కడో ఒక చోట జరిగిన దాని మీద వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఏండ్లతరబడి తిప్పే అంశం బిజెపికి చెందిన నూపుర్‌ శర్మకు, అందునా లాయర్‌ గనుక ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.కాషాయ దళాలు ప్రత్యేక శిక్షణతో ఉంటాయి.నీవు నేర్పిన విద్యఏనీరజాక్షా అన్నట్లుగా మిగతావారూ ప్రారంభించారు. బహుశా ఆ దృశ్యాలు కనిపించి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీలోనే విచారించాలని కోరి ఉండవచ్చు. నూపుర్‌ శర్మ గురించి సుప్రీం కోర్టు తీవ్రమైన వ్యాఖ్యల నేపధ్యంలో కట్టుకథలకు, వక్రీకరణకు మారుపేరైన కాషాయదళాల నిర్వహణలోని వెబ్‌సైట్‌ ఓపి ఇండియా ఒక తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నూపుర్‌ శర్మ దరఖాస్తును విచారించి తిరస్కరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌లో ఒకరు జెబి పార్దీవాలా. సదరు న్యాయమూర్తి గతంలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా, 1980-90లో గుజరాత్‌ స్పీకర్‌గా పని చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నది. నిజానికి ఆ పదవిలో ఉన్నది పార్దీవాలా తండ్రి బి పార్దీవాలా. పదవిలో ఉన్నది 1990 జనవరి 19 నుంచి మార్చి 16వరకు మాత్రమే, 86 ఏండ్ల వయస్సులో 2015లో మరణించారు. ఉద్రేకపడితే విచక్షణ ఎగిరిపోతుంది. జెబి పార్దీవాలా 2022 మే 9వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. అన్నీ సక్రమంగా ఉంటే ఇప్పుడున్న వారిలో సీనియారిటీ ప్రకారం 2028 మే నెలలో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల మూడు నెలలపాటు కొనసాగుతారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినపుడు ఇచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించిన అంశాల మీద అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వాటిని వెనక్కు తీసుకున్నారని ఇప్పుడు అదే న్యాయమూర్తి శుక్రవారం నాడు నూపుర్‌ శర్మ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం వచ్చే రీతిలో ఒపిఇండియా కథనం ఉంది.


దానిలో పేర్కొన్నదాని ప్రకారం పటేల్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్లు కల్పించాలన్న పిటీషన్‌ విచారణ సందర్భంగా ” ఈ దేశాన్ని నాశనం చేసింది లేదా సరైన దారిలో ముందుకు పోయేందుకు ఆటంకం కలిగించిన రెండు అంశాల పేర్లు చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే రిజర్వేషన్లు, అవినీతి అని చెబుతా. ఆరున్నర దశాబ్దాల తరువాత రిజర్వేషన్లు కావాలని అడిగితే ఏ పౌరుడికైనా సిగ్గు చేటు. మన రాజ్యాంగాన్ని రూపొందించినపుడు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. కానీ దురదృష్టం కొద్దీ స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా కొనసాగుతున్నట్ల ” పార్దీవాలా అన్నట్లు, దాంతో జడ్జి పదవి నుంచి తొలగించాలని 58 మంది రాజ్యసభ ఎంపీలు 2015లో పిటీషన్‌ దాఖలు చేసినపడు తన పదజాలాన్ని వెనక్కు తీసుకున్నట్లు పేర్కొన్నది. ఇక్కడ గమనించాల్సింది నిజంగా ఓపి ఇండియా రాసినట్లే జరిగిందా మరొకటా అన్నది కాదు. నూపుర్‌ శర్మ మీద సుప్రీం కోర్టు బెంచ్‌ జడ్జీలు చేసిన వ్యాఖ్యలు కూడా రిజర్వేషన్ల మీద చేసిన అంతటి తీవ్రమైనవైతే ఇప్పుడు కూడా బిజెపి, భుజాలు మార్చుకోకుండా దాన్ని మోస్తున్న పార్టీల ఎంపీలందరూ అలాంటి పిటీషన్‌ పెట్టమనండి.


నూపుర్‌ శర్మ నోటి దూల కలిగించిన పరిస్థితి గురించి దేశంలో ఉన్న అనేక మంది మనస్సులో ఉన్న మాటలనే సుప్రీం జడ్జీలు చెప్పారు.దాంతో బిజెపి, దాని అభిమానులకు అన్నింటికీ మించి నూపుర్‌ శర్మ చేసింది సరైనదే అని వాదించే, నమ్ముతున్నవారికి శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది. సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు చేసిన వా ఖ్యల మీద ” మీడియా నేడు మౌనంగా ఉంది. వారి నోళ్లు మూసుకున్నారు.నూపుర్‌ శర్మ కేసులో ఎవరూ న్యాయమూర్తుల మాటల మీద బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇది నిజంగా చెడురోజు ” అంటూ ఒపి ఇండియా సంపాదకులలో ఒకరైన నూపుర్‌ జె శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా మాట్లాడటం నూపుర్‌ శర్మకు బరితెగించి మద్దతు ఇవ్వటం తప్ప వేరు కాదు.ఆమె నోటి దూల పర్యవసానాలే ఉదయపూర్‌లోని ఒక సాధారణ దర్జీ ప్రాణాలు తీసేందుకు దారి తీసిందని సుప్రీం కోర్టే చెప్పింది. ఇలా చెప్పటమంటే హంతకులను సమర్ధించినట్లు కాదు. దర్జీ ఉదంతం మర్చిపోక ముందే మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో మరొకరు ఆమె నోటి దూలకు బలైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు దాన్ని నిగ్గుతేల్చాల్సి ఉంది. అమిత్‌ మెడికల్‌ స్టోర్స్‌ దుకాణదారు ఉమేష్‌ ప్రహ్లాదరావు కోహ్లే (54) జూన్‌ 21 రాత్రి 10-10.30 మధ్య హత్యకు గురైనాడు. ఆ వెనుకే వస్తున్న కుమారుడు సంకేత్‌, కోడలు ఉమేష్‌ను ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. పోలీసులు చెబుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం ఉమేష్‌ వాట్సాప్‌ గ్రూపులో నూపుర్‌ శర్మకు మద్దతుగా పెట్టిన లేదా ఫార్వర్డ్‌ చేసిన పోస్టు తన ఖాతాదారులైన ముస్లింలు ఉన్న గ్రూపులో కూడా పెట్టాడు. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఒకడు మహమ్మద్‌ ప్రవక్తను కించిపరిచిన వారు చావాల్సిందే అని పోలీసులతో చెప్పినట్లు ఒక అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తన తండ్రి అలాంటి వాడు కాదని తాను కూడా అదే కథనాన్ని విన్నట్లు, డబ్బుకోసమైతే తన తండ్రిని చంపలేదని మాత్రం తాను చెప్పగలనని కుమారుడు చెబుతున్నాడు. పోలీసులు స్పష్టంగా దేన్నీ చెప్పలేదు.


న్యాయమూర్తుల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆదేశించాలన్న దరఖాస్తు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంది. దాన్ని ఏమి చేస్తారన్నది ఆసక్తికర అంశం. ఒక వేళ దరఖాస్తు దారు కోరికను మన్నిస్తే కొత్త సమస్యలకు దారి తీస్తుంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మౌఖికంగా ఏమీ మాట్లాడేందుకు వీలుండకపోవచ్చు. దీన్ని అంగీకరిస్తే గతంలో సుప్రీంతో సహా వివిధ కోర్టులలో చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొత్త పిటీషన్లు, కేసులు దాఖలు కావచ్చు.


పాత కేసుల పేరుతో ఎలా వేధించవచ్చో ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ ఉదంతం వెల్లడించింది. 2018లో చేసిన ఒక ట్వీట్‌ మీద దాఖలు చేసిన కేసులో గతనెలలో జుబేర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు కస్టడీకి పంపారు. ఒక ట్వీట్‌ మీద ఢిల్లీ పోలీసులు నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారట. ఒక వేళ అరెస్టు చేయాల్సినంత పెద్ద నేరమైతే అప్పుడే చేసి ఉండాలి. ఇంతకూ మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు ఆరోపించిన జుబేర్‌ ట్వీట్‌లో ఉన్నదేమిటి ? ఒక పాత హిందీ సినిమాలో ఒక హౌటల్‌ మీద హనుమాన్‌ హౌటల్‌ అని రాసి ఉన్న ఉన్న చిత్రాన్ని తీసుకొని దాని కింద ” 2014కు ముందు హనీమూన్‌ హౌటల్‌ 2014 తరువాత హనుమాన్‌ హౌటల్‌ ” అని ట్వీట్‌ చేశారు. దాని మీద హనుమాన్‌ భక్త అనే పేరుతో ఉన్న ఒక ట్విటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారట. హనుమంతుడు బ్రహ్మచారి, ఇలా రాయటం హిందువులను నేరుగా అవమానించటమే కనుక చర్యతీసుకోవాలని సదరు ట్వీట్టర్‌ పోలీసులకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడట. అసలు ఫిర్యాదీ చిరునామా లేకుండా కేసు ఎలా పెడతారని జుబేర్‌ కోర్టులో ప్రశ్నిస్తే చిరునామా లేకుండా ట్వీటర్‌ సంస్థ ఖాతా తెరవదు కదా అని ప్రభుత్వ ప్లీడర్‌ సమాధానం. అది ఊరూపేరులేని ట్విటర్‌ ఖాతా కావచ్చు. ప్రపంచమంతటా అలాంటి నకిలీ ఖాతాలు ఉన్నపుడు ఆ సాకుతో కేసు పెట్టవచ్చు. తమకు నచ్చని లేదా లొంగని వారిని ఎలా వేధించే పరిస్థితి దేశంలో ఉందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. అంతే కాదు ఒక చిన్న కేసును సంవత్సరాల తరబడి పరిష్కరించలేని అసమర్ధత మన పోలీసు శాఖలో ఉందని ఎవరన్నా అన్నా ఉడుక్కోనవసరం లేదు. అనేక పాత సినిమాలు, విమర్శనాత్మక గ్రంధాలలో అనేక అంశాలు ఉన్నాయి. అవి మా మనోభావాలను దెబ్బతీశాయని కేసులు పెడతారా ? వాటన్నింటినీ విచారిస్తారా ? ఎక్కడికి పోతున్నదీ అసహనం ? దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని పాలకులు చెప్పేదానికి అర్ధం ఇదా ?

రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు – పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్‌లోని ఉదయపూర్‌ పట్టణంలో దుండగులు కనయలాల్‌ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే, నిరసించాల్సిందే. మరొక మాట ఉండకూడదు. కాంగ్రెస్‌ నేతలు, కేరళ సిఎం పినరయి విజయన్‌, అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు ఖండించారు. బిజెపి సరేసరి. ఇలాంటివి పునరావృతం కాకూడదని అందరం కోరుకుందాం. కోరుకుంటే చాలదు, అంతటితోనే ఆగకూడని పరిస్థితిని దేశంలోని మెజారిటీ – మైనారిటీ మతోన్మాదులు కల్పించారు గనుక ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయో ఎలా నివారించాలో ఆలోచించాల్సిన అవసరం లేదా ! ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! గతంలో కొన్ని పార్టీలు మైనారిటీల సంతుష్ట రాజకీయాలు చేసినట్లు ఆరోపించిన వారు ఇప్పుడు మెజారిటీ సంతుష్టీకరణలో పీకల్లోతులో మునిగి ఉన్నారు. ఈ దారుణంలో ఎవరి వాటాాపాత్ర ఎంత ?


కనయలాల్‌ను చంపిన వారు తమ గురించి సచిత్రంగా, స్వయంగా ప్రకటించుకున్నారు. వారు చేసిన దారుణంతో మరోసారి యావత్‌ ముస్లిం సమాజం మీద ధ్వజం-విద్వేషాన్ని వెదజల్లేందుకు అవకాశం ఇచ్చారు. దర్జీ లేదా టైలర్‌ హత్య అన్న శీర్షికతో వార్తలు ఇచ్చిన మీడియా మీద మతశక్తులు ధ్వజమెత్తుతున్నాయి. వాటికి ఆగ్రహం ఎందుకు ? ఒక హిందువును హతమార్చిన ముస్లింలు అని పెద్దక్షరాల్లో పతాక శీర్షికలు పెడితే తప్ప వారు శాంతించేట్లు లేరు. రేటింగులు, వాటితో వచ్చే లాభాల కోసం కొన్ని సంస్థలు మినహా మొత్తంగా మీడియా ఇప్పటికే విలువల వలువలను తొలగించుకుంది. గోచిపాతలతో ఉంది. హిజబ్‌ను వద్దంటున్న మతశక్తులు వాటిని కూడా సహించేట్లు లేవు. వారు కోరుకున్న విధంగా శీర్షికలు పెట్టే రోజులు దగ్గరపడుతున్నట్లుగా ఉంది. చూద్దాం, కానున్నది కాక మానదు, రానున్నది రాకమానదు కదా !


కనయలాల్‌ ఒక మామూలు దర్జీ. కరోనా మాదిరి కాషాయ వైరస్‌ సోకిన వారిలో ఒకడు, కనుకనే ఆ ప్రభావంతో నోటి దూల నూపుర్‌ శర్మను అనుసరించి సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు, షేర్‌ చేశాడు. నూపుర్‌ శర్మ నోటి దూలను చర్చ నిర్వహించిన టీవీ ఛానల్‌ నివారించలేదు, రేటింగ్‌ల కోసం కొనసాగించి ఉండాలి. ఆమె మాటలను బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా దూల మాటలని ఖండించటమే కాదు, తాత్కాలికంగా పార్టీ నుంచి పక్కన పెట్టారు. ఆమె కూడా తన మాటలను వెనక్కు తీసుకున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంత జరిగాక కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్లుగా కనయలాల్‌ వంటి వారు ఎందుకు గోక్కుంటున్నట్లు ? మతశక్తులు విద్వేషాన్ని సామాన్యుల్లో ఎక్కించిన ఫలితం కాదా ? నూపుర్‌ శర్మ నోటి దూల మాటలను సామాజిక మాధ్యమంలో సమర్ధించినందుకు(షేర్‌ చేసినందుకు) అతని మీద కేసు నమోదైంది. అరెస్టు చేశారు.

చిత్రం ఏమిటంటే అసలు సూత్రధారి, పాత్రధారి నూపుర్‌ శర్మ మీద కేసులు నమోదైనా అమిత్‌ షా గారి శిష్యురాలు గనుక అరెస్టులు లేవు, పోలీసు కాపలాతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటున్నారు. మత మనోభావాలను కించపరిచినందుకు గాను కనయలాల్‌ జూన్‌ పదిన అరెస్టుకాగా మరుసటి రోజే కోర్టు బెయిలు మంజూరు చేసింది. అలాంటి పనులు చేసి దర్జాగా తిరగటం ఎంత సులభమో కదా ! తరువాత తనను చంపేస్తామంటూ బెదరింపులు వస్తున్నట్లు, రక్షణ కావాలని పదిహేనవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారి రెండు సామాజిక తరగతులకు చెందిన వారిని పిలిపించి కూర్చో పెట్టి చర్చించిన తరువాత ఎవరి మీద చర్యతీసుకోనవసరం లేదని కనయలాల్‌ రాసి ఇచ్చినందున బెదిరింపుల గురించి పోలీసులు అంతటితో వదలివేశారు. అనుమానితుల జాబితాలో హంతకులు ఉన్నట్లు పోలీసులకు చెప్పలేదు. హత్యకు ముందు తన దుకాణానికి వచ్చిన దుండగుల గురించి హతుడికి ఎలాంటి అనుమానం లేనందున అందరి మాదిరి కొలతలు తీసుకొనేందుకు ఉపక్రమించినట్లు కనిపిస్తున్నది. నిజంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తే అతను కొద్ది రోజులు దుకాణాన్ని కూడా మూతపెట్టి ఉండేవాడు. లేదా నూపుర్‌ శర్మ పార్టీ బిజెపి నేతలను సంప్రదించి ఉండేవాడు. ఏది ఏమైనా జరిగింది దారుణం. పర్యవసానాలను ఊహించి ఉంటే తన ప్రాణం మీదకు తెచ్చుకొనేవాడే కాదు. కనుక విద్వేషాన్ని రెచ్చగొట్టే వాట్సప్‌ సందేశాలను, సోషల్‌ మీడియా పోస్టులను పది మందికి పంచే ఘనమైన పనులకు స్వస్థి పలకటం మంచిదని ఈ ఉదంతం కొందరికైనా కనువిప్పు కలిగిస్తుందా !


దర్జీ దారుణ హత్య ఉదంతం గురించి, అంతకు ముందు నూపుర్‌ శర్మ మాటల గురించి కొన్ని టీవీ ఛానళ్లు చర్చలు నిర్వహించాయి. వాటిలో పాల్గొన్న సంఘపరివార్‌కు చెందిన బిజెపి, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థల ప్రతినిధులెవరూ నూపుర్‌ శర్మ నోటి దూలను ఖండించకపోగా పరోక్షంగా సమర్ధించారు. మహమ్మద్‌ ప్రవక్త మీద కొందరు ముస్లింలే గతంలో మాట్లాడారని, నూపుర్‌ శర్మ వాటిని తిరిగి చెప్పారు తప్ప వేరు కాదని వాదించటమే కాదు, వాటి గురించి ముస్లిం పెద్దలు ఎందుకు నోరు విప్పటం లేదంటూ అడ్డుసవాళ్లు విసురుతున్నారు. అలాంటి చర్చలను చూసిన తరువాత కనయలాల్‌ వంటి వారికి అందునా బిజెపి బలంగా ఉన్న రాజస్తాన్‌లో మరింత ప్రోత్సాహం కలగదా ?


కనయలాల్‌ హత్య మొత్తం హిందువుల మీదనే జరిగిన దారుణంగా కొందరు చిత్రిస్తున్నారు. అదే ప్రమాణాన్ని వర్తింప చేస్తే నూపుర్‌ శర్మ నోటి దూల తమందరికీ ఉన్నట్లు హిందువులు అంగీకరిస్తారా ? కర్ణాటకలో సాహితీవేత్త కులుబుర్గి, జర్నలిస్టు గౌరీలంకేష్‌, మహారాష్ట్రలో గోవిందపన్సారే, నరేంద్ర దబోల్కర్‌ను హత్యచేశారు. వారంతా పుట్టుకతో హిందువులే , వారిని హతమార్చిందెవరు ? హంతకులకు వారితో ఎలాంటి పాతకక్షలు లేవు. విమర్శనాత్మక, భిన్నాభిప్రాయాన్ని సహించలేని కాషాయతాలిబాన్ల పనే కదా ! కనయలాల్‌ హంతకులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అనేక ఉదంతాలలో క్షణిక ఆవేశంలో బాధితుల కుటుంబాలు అలాంటి డిమాండ్లు చేస్తుండవచ్చు. అది చట్టబద్దం కాదు. ఉత్తర ప్రదేశ్‌తో సహా అనేక చోట్ల బూటకపు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లను ముందుకు తెస్తున్న నేపధ్యం ఇలాంటి చట్టబద్దంగాని డిమాండ్లను ముందుకు తేవటంలో ఆశ్చర్యం లేదు. మరి పై నలుగురి కేసుల్లో , ఇతర సామూహిక దాడుల కేసుల్లో హంతకుల మీద కొన్ని సంస్థలు అలాంటి డిమాండ్‌ను ముందుకు తేలేదేం ?
ఉదయపూర్‌ దారుణానికి పాల్పడిన వారికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు. నిజాల నిగ్గుతేల్చటానికి ఎవరు వద్దన్నారు.వారు నరేంద్రమోడీని చంపివేస్తామంటే వారినెవరన్నా సమర్ధించారా ? గత గుజరాత్‌ ఎన్నికలపుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని ఏకంగా నరేంద్రమోడీ చెప్పారు. తరువాత అదేమైంది, వాస్తవమా కాదా, ఎన్నికల్లో ఓట్ల కోసం అలా చెప్పారా? ఏం జరిగిందో చెప్పేవారు లేరు. కనయలాల్‌కు రక్షణ కల్పించటంలో రాజస్తాన్‌ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు బిజెపి చెబుతోంది. దుండగులు విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారని చెబుతున్నారు గనుక కేంద్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి ?


కనయలాల్‌ హత్యను సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టటం జనాలను భయపెట్టేందుకే అన్నది స్పష్టం. ప్రపంచమంతటా ఉగ్రవాదులు చేస్తున్నపనే అది. మధ్య ప్రదేశ్‌లో భవర్‌లాల్‌ జైన్‌ అనే 65 ఏండ్ల మతి స్థిమితం సరిగా లేని వృద్దుడు ఒక వివాహానికి వెళ్లి వస్తూ దారి తప్పాడు. మూడు రోజుల తరువాత అతను శవమై కనిపించాడు. తరువాత సామాజిక మాధ్యమంలో ఒక వీడియో వైరలైంది. దానిలో దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త ఆ వృద్ధుడిని కొడుతూ నీ పేరేమిటి, మహమ్మదేనా, ఆధార్‌కార్డుందా అని ప్రశ్నించినట్లుంది. భవర్‌లాల్‌ జైన్‌ది ప్రాణం కాదా? దాన్ని తీసిన వారి గురించి కాషాయ దళాలు మాట్లాడలేదేం ? ఎన్‌కౌంటర్‌కు డిమాండ్‌ లేదు.


బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే దుండగులు రెచ్చిపోతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పాలన, లక్షలాది మంది మిలిటరీ, పారామిలిటరీ ఉన్న జమ్మూ-కాశ్మీరులో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అక్కడ స్థానిక, కేంద్ర నిఘా సంస్థలు అడుగడుగునా ఉంటాయి. బతకటానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను, కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు హతమారుస్తున్నారు.దీనికి బిజెపి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లా ? ఉగ్రవాదులను ఎందుకు కనుగొనలేకపోతున్నారు, దాడులను ఎందుకు పసిగట్టలేకపోతున్నారు ? ఉదయపూర్‌ దారుణానికి నూపుర్‌ శర్మ మాటలకు సంబంధం లేదని, ఉగ్రవాదుల కుట్రలు నిరంతరం జరుగుతున్నాయంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి ఉగ్రదాడులు ఇప్పుడు జరుగుతున్నది నరేంద్రమోడీ ఏలుబడిలోని కాశ్మీరులో మాత్రమే. కనయలాల్‌ వలస కార్మికుడు లేదా కాశ్మీరీ పండిట్‌ కాదు, కాశ్మీరు నివాసీ కాదు. ఉగ్రవాదులు అతన్నే ఎందుకు బలితీసుకున్నట్లు ?


దుండగులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే, గర్హనీయమే, తీవ్రంగా ఖండించాల్సిందే. రాయిటర్స్‌ వార్తా సంస్థ, వికీపీడియా క్రోడీకరించిన సమాచార విశ్లేషణ ప్రకారం గోరక్షణ దళాల పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారు 49 మందిని చంపివేశారు, 156 మంది గాయపడ్డారు. దాడులలో మూడు మినహా మిగిలినవన్నీ పద్మశ్రీ కంగనా రనౌత్‌ చెప్పినట్లు అసలైన స్వాతంత్య్రం వచ్చిన 2014 నుంచి జరిగినవే. మరి ఈ దారుణాల సంగతేమిటి ? గోరక్షణ దళాల్లో ఎనభై శాతం నకిలీ అని నరేంద్రమోడీ చెప్పారు. వారిలో ఎందరిని శిక్షించారు ? దేశంలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఇవన్నీ నిదర్శనం. ఇక విద్వేష ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. ముస్లింలను చంపమని, మహిళల మాన మర్యాదలను మంటకలపాలని బహిరంగంగా పిలుపులు ఇచ్చిన వారు స్వేచ్చగా తిరుగుతున్నారు. వారి వీడియోలు అందరికీ అందుబాటలో ఉన్నాయి. ఉదయపూర్‌ ఉదంతానికి వీటన్నింటితో పరోక్ష సంబంధం లేదా ? కనయలాల్‌ హంతకులు మహమ్మద్‌ రియాజ్‌, గౌస్‌ మహమ్మద్‌. వారి వెనుక ఉన్నది విదేశీ ఉగ్రవాదహస్తం, పథకమూ కావచ్చు. కానీ దానికి అవకాశం ఇచ్చింది బిజెపి నేత నూపుర్‌ శర్మ నోటి దూల కాదా !

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎవ్విరిబడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్‌ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్‌ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.


ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ కంపెనీ సిఇవో బెజోస్‌ భారత్‌ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్‌ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్‌ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్‌ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్‌ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్‌ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్‌ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం ముకేష్‌ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్‌, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.


రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్‌ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్‌, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్‌ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్‌ 7.8, టర్కీ 6.7, పోలాండ్‌ 4.4, ఫ్రాన్స్‌ 4.3, భారత్‌ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్‌ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్‌ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.


ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్‌ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.


కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్‌ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్‌ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటు కానుంది. కొలంబియాలో ఏడు దశాబ్దాల క్రితం 1948 ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి జార్జి ఎలిసెర్‌ గైటెన్‌న్ను హత్య చేశారు. అప్పటి నుంచి అక్కడ జరిగిన అనేక పరిణామాల్లో వామపక్ష శక్తులను అణచివేశారు.తాజాగా ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి తుది విడత ఎన్నికలలో వామపక్ష, పురోగామి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధి గుస్తావ్‌ పెట్రో విజయం సాధించారు. పెట్రోకు 50.5శాతం ఓట్లు రావటంతో విజేతగా ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. తొలి విడత రెండు వారాల క్రితం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. ఇప్పుడు రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 47.3శాతం వచ్చాయి.


ఎన్నికల్లో పెట్రో విజయం లాటిన్‌ అమెరికాలోని ఇతర వామపక్ష పాలిత దేశాలు, ఇతర చోట్ల ఆనందాతిరేకాల వెల్లడి, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఏ విధంగానైనా సరే పెట్రోను ఓడించాలని చూసిన అమెరికా, మితవాద శక్తులకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చి 13న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో నాయకత్వంలోని వామపక్ష కూటమి ఓట్ల రీత్యాపెద్ద పక్షంగా అవతరించినప్పటికీ ఉభయ సభల్లో మితవాదులు, ఇతర పార్టీల వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశం మొత్తాన్ని 33 విభాగాలుగా చేసి జనాభాను బట్టి 168కి గాను 162 స్థానాలకు ఎన్నికలు జరిపారు. దామాషా ప్రాతిపదికన వచ్చిన ఓట్లను బట్టి సీట్లను కేటాయిస్తారు. మార్చి ఎన్నికల్లో దిగువ సభలో వామపక్ష కూటమికి 16.78శాతం ఓట్లు 27 సీట్లు రాగా సోషల్‌డెమోక్రటిక్‌ శక్తిగా వర్ణితమైన లిబరల్‌ పార్టీకి 14.27 శాతం ఓట్లు 32 సీట్లు వచ్చాయి. మిగిలిన సీట్లన్నింటిని మితవాదులు, ఇతరులు గెలుచుకున్నారు. ఎగువ సభలోని 100 స్థానాలకు గాను వామపక్ష కూటమి 20 సీట్లు తెచ్చుకుంది. పార్లమెంటులోని ఈ పొందిక రానున్న నాలుగు సంవత్సరాల్లో వామపక్ష ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలను ముందుకు తెస్తుందో చూడాల్సి ఉంది. గుస్తావ్‌ పెట్రోను అభినందిస్తూ వామపక్షాలకు చెందిన అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, చిలీ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌, పెరూ అధ్యక్షుడు పెరో కాజిలో, బొలీవియా అధినేత లూయిస్‌ ఆర్సీ, మెక్సికో అధినేత లోపెజ్‌ ఒబ్రాడోర్‌, వెనెజులా నేత నికొలస్‌ మదురో సందేశాలను పంపారు.


అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో మాదిరే కొలంబియాలో కూడా ఉదారవాద విధానాలతో లబ్దిపొందిన శక్తుల పలుకుబడి తక్కువేమీ కాదు. గుస్తావ్‌ పెట్రో గెలిచినప్పటికీ ఓట్లశాతం సగమే అన్నది గమనించాలి. అందుకే ఈ మార్పును కూడా కొందరు విప్లవంగా పిలుస్తున్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇలాంటి పరిణామంతో చరిత్రను తిరగరాశామని అనేక మంది భావిస్తున్నారు. తొలిసారిగా దేశ చరిత్రలో ఆఫ్రికన్‌ సంతతికి చెందిన (ఆఫ్రో-కొలంబియన్‌) ఫ్రాన్సిమార్క్వెజ్‌ తొలిసారిగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె మానవహక్కుల, పర్యావరణ హక్కుల ఉధ్యమకారిణిగా ఉన్నారు. గుస్తావ్‌ పెట్రో ఎం 19 గెరిల్లాగా 1980దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు. దేశ రాజధాని బగోటా మేయర్‌గా పనిచేసి ప్రజల మన్ననలందుకున్నారు. మంచి ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్మికవర్గం, ఇతర సామాజిక తరగతులు పెట్రో మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొలంబియా మితవాద శక్తులు దుర్మార్గాలకు మారుపేరు, వారికి అమెరికా, ఇతర దేశాల మితవాదుల అండదండలు, కార్పొరేట్ల మద్దతు పూర్తిగా ఉంది. ప్రస్తుతానికి విధిలేక పెట్రో గెలుపును అభినందించినప్పటికీ ఎలాంటి కుట్రలకు పాల్పడతారో చెప్పలేము. అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో అలాంటి పరిణామాలు జరినందున వామపక్ష శక్తులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. 2016లో ఎఫ్‌ఏఆర్‌సి అనే గెరిల్లా సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొని ఐదు దశాబ్దాల అంతర్యుద్ధానికి స్వస్తి పలికినప్పటికీ ఒప్పంద అంశాలను సరిగా అమలు జరపలేదనే విమర్శలున్నాయి.రెండు లక్షల 60వేల మంది ప్రాణాలు కోల్పోగా 70లక్షల మంది అంతర్యుద్ధంలో కొలువులు, నెలవులు తప్పారు. అమెరికా చేతిలో కీలుబొమ్మలుగా ఇప్పటి వరకు ఉన్న పాలకులు పక్కనే ఉన్న వెనెజులాతో శత్రుపూరితంగా ఉన్నారు.తాను అధికారానికి వస్తే సంబంధాలు నెలకొల్పుకుంటానని పెట్రో ప్రకటించారు. ఆర్ధిక రంగానికి వస్తే చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని చేసిన ప్రకటన ఇప్పటికే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళన కలిగిస్తున్నది.


ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఫ్రాన్సియా 1981లో ఒక కష్టజీవుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గని కార్మికుడు, తల్లి మంత్రసాని. ఫ్రాన్సియా కూడా బాలకార్మికురాలిగా బంగారు గనిలో పని చేశారు.తరువాత ఇంటిపని కార్మికురాలిగా ఉంది. పదహారేండ్లకే తల్లయింది. ఇద్దరు బిడ్డల తరువాత ఆమె శాంటియాగో విశ్వవిద్యాలయంలో చేరి లాయర్‌గా పట్టా పుచ్చుకుంది. బాల్యం నుంచీ గనుల వాతావరణంలో పెరగటం, గనుల కంపెనీలకు అప్పగించేందుకు అడవుల నుంచి సమీప గ్రామాల నుంచి వేలాది మందిని తొలగించటం, అడవుల నరికివేతను చూసి ఉద్యమకారిణిగా మారింది. గనుల వలన కాలుష్యంగా మారిన ఒక నదిని పరిరక్షించాలని సాగించిన ఆందోళనలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. పర్యావరణ నోబెల్‌ బహుమతిగా ప్రసిద్ది చెందిన గోల్డ్‌మన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ బహుమతిని పొందారు. స్థానిక తెగల ఆమోదం లేకుండా అక్రమంగా అనుమతించిన గనుల రద్దు కోరుతూ ఆమె ముందుకు రావటంతో గనుల యజమానుల అండతో ఏర్పడిన సాయుధ ముఠాలు ఆమెను బెదిరించాయి. దాంతో ఆమె 2014లో తన నివాసాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తనతో పాటు బలవంతంగా గెంటివేసిన ఆఫ్రో-కొలంబియన్లను సమీకరించి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని బగోటాకు వచ్చారు. అక్రమ గనుల నుంచి తమ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపాలని డిమాండ్‌ చేశారు. గెరిల్లా సంస్థతో శాంతి చర్చలకు ప్రభుత్వం పూనుకున్నపుడు నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాంతో మరొకసారి ఆమెను సాయుధ ముఠాలు బెదిరించటమే కాదు హత్యా ప్రయత్నం కూడా చేశాయి. ఆమె మంచి వక్త కూడా. పోరుబిడ్డగా గణుతికెక్కటం, విస్మరణకు గురైన ప్రతినిధిగా గుర్తింపు, ఆమె సామాజిక తరగతి వంటి అనేక అంశాలు వామపక్ష కూటమిలో ఉపాధ్యక్షపదవికి ఆమెను ముందుకు తెచ్చాయి.


ఎన్నికల ప్రచారంలో ఆమె అర్హత గురించి ప్రత్యర్ధులు ప్రశ్నించారు, ఎద్దేవా చేశారు. రాజకీయ అనుభవం ఎంత, గుస్తావ్‌ పెట్రోతో కలసి దేశాన్ని పాలించేందుకు ఉన్న అర్హత ఏమిటి వంటి ప్రశ్నలను తాను అనేక మంది నుంచి ఎదుర్కొన్నానని ఫ్రాన్సియా చెప్పారు. తమను గౌరవ ప్రదంగా బ్రతకనిచ్చేందుకు తనను ప్రశ్నించిన వారు ఎందుకు అనుమతించలేదు, ఎనభై లక్షల మందిమీద దశాబ్దాల తరబడి హింసకొనసాగేందుకు వారి అనుభవాన్ని ఎందుకు వినియోగించినట్లు , దేశ ప్రజలందరూ శాంతితో బతికేందుకు వారి అనుభవం ఎందుకు పనికిరాలేదని తనలో తాను ప్రశ్నించుకునేదాన్నని ఎన్నికల ప్రచారంలో ఆమె చెప్పారు. ఎన్నికల్లో విజయం ఖరారైన తరువాత అభిమానులనుద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో తన విజయాన్ని సామాజిక, మైనారిటీ తరగతుల పోరాటానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.


ఒకవైపు మితవాద – పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్‌ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్‌ డ్యూక్‌ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది.


వామపక్ష విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు కొందరు చూస్తున్నారు. లాటిన్‌ అమెరికాలో వామపక్షాల గెలుపు వాటి భావజాలం మీద ఉన్న అభిమానం కంటే అవి ముందుకు తెచ్చిన ప్రజాకర్షక విధానాల వల్లనే జనం వాటివైపు మొగ్గుతున్నట్లు సూత్రీకరిస్తున్నారు. ఉదారవాద ఆర్థిక విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికా దేశాల్లో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌, అమెరికా ఆదేశించిన విధానాలను అమలు జరిపిన పాలకులు కార్పొరేట్లకు పెద్ద పీటవేసి జనాన్ని విస్మరించిన కారణంగా అక్కడ తలెత్తిన నిరసన, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేశారు. అందుకోసం అనేక దేశాల్లో నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా తలెత్తిన సాయుధ తిరుగుబాట్లకు వామపక్ష శక్తులు నాయకత్వం వహించాయి. ఈ ప్రాంత దేశాల్లో ఎంతగా అణచివేతకు పూనుకుంటే అంతగా తిరుగుబాట్లు ఉండటంతో పాలకవర్గాలు మిలిటరీ నియంతలకు బదులు పచ్చిమితవాద శక్తులను, వారికి అండగా కిరాయి మూకలను రంగంలోకి దింపాయి.ప్రహసన ప్రాయంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మార్చినప్పటికీ ఎన్నికలకు అవకాశం ఉండటంతో వామపక్ష శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకొని అధికారాన్ని పొందుతున్నాయి. దశాబ్దాల తరబడి అణచివేత, దోపిడీకి గురైన సామాన్యులకు కావాల్సింది తక్షణ ఉపశమనం. లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులంటే ఆ తరగతికి కిందికి వచ్చేవన్నీ కమూ ్యనిస్టు పార్టీలు కాదు. సంస్కరణలతో దోపిడీ నుంచి విముక్తి కలిగించవచ్చని నమ్మేశక్తులు, అమెరికా సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించే వారు, అణచివేత, దోపిడీ వ్యతిరేక పోరాటంలో వామపక్ష శక్తులకు దగ్గరైన ప్రజాతంత్ర శక్తులూ వాటిలో ఉన్నాయి. వాటన్నింటి మధ్య ఏకీభావం ఉన్న ఏకైక అంశం ప్రజాస్వామ్యం, కష్టజీవులకు తక్షణ ఉపశమనమే. అందువలన ప్రస్తుతం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేసేవి కాదు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఆ విధానాలకు ఉన్న పరిమితులు అర్ధం అవుతున్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే దోపిడీ శక్తులు తమ మౌలిక పునాదులకు ముప్పులేదని భావిస్తున్న కారణంగానే పరిమితంగానైనా సంక్షేమ చర్యలను ఆమోదిస్తున్నాయి. వాటిని కూడా సహించలేని దశ వస్తే లాటిన్‌ అమెరికా పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.