నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అగ్నిపథ్‌ పధకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద నిరసనలు తలెత్తటంతో సమర్ధించేందుకు మిలిటరీ అధికారులను దించింది. ఇది ఒక ప్రమాదకర సాంప్రదాయం.మనది పాకిస్థాన్‌, ఇతర అనేక దేశాల మాదిరి మిలిటరీ కనుసన్నలలో నడిచే ప్రభుత్వం కాదు. ఈ పధకం మిలిటరీ రూపొందించింది తప్ప తమది కాదు అని తప్పుకొనేందుకా అన్నట్లుగా ప్రధాని, సంబంధిత శాఖ మంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటనతో దేశం ముందుకు రాలేదు. పరోక్షంగా సుభాషితాలు పలుకుతున్నారు. ఈ పధకంతో మిలిటరీ ఎంపికలో సమూల మార్పులు చేశారు. ఇదేమీ రహస్యం కాదు. విద్యుత్‌ సంస్కరణల ప్రతిపాదనల మాదిరి. ముందుగానే ప్రతిపాదనలను బహిరంగంగా విడుదల చేసి అభిప్రాయాలను తీసుకోవచ్చు.


ఈ పధకం గురించి వివరించేందుకు గాను మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారని వార్తలు. ఈ పధకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తరువాతనే జూన్‌ 14న ప్రకటించారు. ఇలాంటి కీలకాంశం గురించి ముందుగా ప్రధానికి వివరించకుండానే ఇదంతా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఒకవేళ అదే జరిగితే నిరసన తలెత్తిన వెంటనే దీని సంగతేమిటని ప్రధాని అడిగి ఉండాలి కదా ! ముందే తెలిపి ఉంటే ఇప్పుడు కొత్తగా చెప్పేదేమిటి ? ఈ పధకం ప్రకటనతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య గురించైతే అది మిలిటరీ అధికారులకు సంబంధం లేదు, హౌంశాఖ మంత్రి, ప్రతినిధులు వివరించాలి.తగిన కసరత్తు, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా తీసుకొనే సంస్కరణలు దేనికి దారితీస్తాయో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, మూడు సాగు చట్టాల తీరుతెన్నులను చూశాము. అందుకే నష్టనివారణ చర్యగా ఈ తతంగం జరుగుతోందా అనే సందేహాలు కలగటం సహజం.


ఈ పధకానికి నిరసనగా సోమవారం నాడు భారత బంద్‌కు మిలిటరీ ఎంపికకు సిద్దం అవుతున్నవారు పిలుపుఇచ్చినట్లు వార్తలు.దాంతో ముందు జాగ్రత్త చర్యగా దేశమంతటా ఐదు వందలకు పైగా రైళ్లను రద్దు చేశారు. ఝార్కండ్‌లో స్కూళ్లను మూసివేశారు. ఢిల్లీ వంటి చోట్ల పోలీసుల అతి కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. హర్యానాలో రెండు జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశించారు. ఈనెల 24న నిరసన తెలుపున్నట్లు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ ప్రకటించారు. సోమవారం నాడు బంద్‌ ఎలా జరిగిందన్నది ప్రశ్న కాదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నదే కీలకం. ఒక్కటి మాత్రం స్పష్టం.అగ్నిపథ్‌ పధకం సంగతేమో గానీ దాని కింద శిక్షణ పొందిన వారు అగ్నివీరులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. ఆ పధకం కింద ఎంపికైన వారికి మిలిటరీ శిక్షణలో భాగంగా ఇతర అంశాలతో పాటు బట్టలుతకటం,క్షౌరం చేయటం, చౌకీదార్లుగా నైపుణ్యం కల్పిస్తారట. ఇక ఈ పధకం గురించి విమర్శల వెనుక టూల్‌కిట్‌ గాంగ్‌ ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ ఆరోపించారు. మరి ఆ గాంగ్‌ చిరునామా ఏమిటో వారి మీద కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో తెలీదు. ఒక వేళ అలాంటి గాంగ్‌ ఉంటే వారు రూపొందిస్తున్న టూల్‌కిట్లకు టూల్స్‌ సరఫరా చేస్తున్నది బిజెపి నేతలే. విమర్శించేవారు చెప్పేది స్పష్టంగా ఉంది. సమర్ధిస్తూ మాట్లాడేవారే అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నారు. రైతు ఉద్యమం సందర్భంగా దిశ రవి అనే యువతి మీద కేంద్ర ప్రభుత్వం టూల్‌ కిట్‌ కేసు పెట్టి దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఒక చోట చేర్చి సామాజిక మాధ్యమంలో అందుబాటులో ఉంచటాన్నే టూల్‌కిట్‌గా వర్ణించారు.


తమ ఆఫీసులకు అవసరమైన భద్రతా సిబ్బంది నియామకంలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది కైలాష్‌ విజయవర్గీయ. ఆ పెద్దమనిషి ఆరుసార్లు ఎంఎల్‌ఏగా, పన్నేండ్లు మంత్రిగా పని చేసి ఇప్పుడు వారసత్వంగా కుమారుడు ఆకాష్‌ను ఎంఎల్‌ఏ చేశారు తప్ప బిజెపి ఆఫీసులో చౌకీదారుగా నియమించలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కైలాష్‌కు కొత్తేమీ కాదు. స్వంత రాష్ట్రమైన మధ్య ప్రదేశ్‌లో బిజెపి నేత లక్ష్మీకాంత శర్మ వంటి వారి ప్రమేయ ఉన్న వ్యాపం కుంభకోణం గురించి విలేకర్లు అడిగితే అది మీకు పెద్దది కావచ్చు గాని మాకు చిన్న కుంభకోణం అని సెలవిచ్చారు. దాని గురించి వివరాలు సేకరిస్తున్న జర్నలిస్టు అక్షయ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించటం గురించి అడిగితే మరణించిన ఆ జర్నలిస్టును మరచిపోండి, నాకంటే అతను ముఖ్యమా అని ఎదురు ప్రశ్నించారు. అంతేనా దేశంలో జరుగుతున్న మానభంగాల గురించి అడిగితే మహిళలు వారి హద్దుల్లో వారు లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని సెలవిచ్చారు. ఇండోర్‌ నగరంలో ఒక పాతభవన కూల్చివేతను పర్యవేక్షిస్తున్న ఒక అధికారిని కుమారుడు ఆకాష్‌ హాకీ బాట్‌తో కొట్టటాన్ని సమర్ధించి తన పుత్ర ప్రేమను చాటుకున్నారు. వివాదాస్పద మాటలతో ఎప్పుడూ జనం నోళ్లలో నానుతున్న కైలాష్‌ అగ్నివీరులను బిజెపి ఆఫీసులో చౌకీదార్లుగా పెడతామని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది !


దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్దపడి మిలిటరీలో చేరేందుకు సిద్దపడుతున్న వారిని కించపరిచేలా ఉన్న తన వ్యాఖ్యలు దుమారం రేపటంతో తన మాటలను టూల్‌కిట్‌ గాంగ్‌ వక్రీకరించిందని ఎదురుదాడికి దిగారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కైలాష్‌ ఇలా మాట్లాడారు.” నేను గనుక బిజెపి ఆఫీసులో భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వస్తే అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తా, మీరు కూడా చేయవచ్చు. నా స్నేహితుల్లో ఒకరు 35 ఏండ్ల రిటైర్డ్‌ మిలిటరీ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకున్నారు, అతని మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు. అతను సైనికుడు కాబట్టి తాను భయపడలేదని చెప్పారు.దీని అర్ధం ఏమిటి సైనికుడు అంటే ఆత్మవిశ్వాసం ” అని కైలాష్‌ చెప్పారు. దీని మీద విమర్శలు తలెత్తటంతో వివరణ ఇచ్చుకుంటూ అంతకు ముందు చెప్పినదాన్ని సమర్ధించుకున్నారు.” అగ్ని పథ్‌ పధకం కింద శిక్షణ పొందిన అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసిన తరువాత వారు తప్పనిసరిగా నైపుణ్యం పొందుతారు, తమ విధుల పట్ల అంకిత భావంతో ఉంటారు. మిలిటరీలో తమ సేవ పూర్తైన తరువాత ఎంచుకునే రంగాలలో ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదీ నేను చెప్పదలచుకున్నది. టూల్‌కిట్‌ ముఠాలతో సంబంధం ఉన్న నా మాటలను వక్రీకరించి శ్రమజీవులను కించపరిచేందుకు చూస్తున్నారు. ఇది ఈ దేశ కర్మవీరులకు అవమానం.రాష్ట్ర వీరులు-ధర్మవీరులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఈ టూల్‌కిట్‌ ముఠా గురించి దేశానికి బాగా తెలుసు.” అన్నారు.నైపుణ్యం, అంకిత భావం ఒక్క మిలిటరీకేనా, ఇతర పౌరసేవల్లో ఉన్నవారికి అవసరం లేదా ?


దేశ యువతను అవమానించవద్దని ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌ అన్నారు. వారు దేశం కోసం పని చేసేందుకు సిద్దం అవుతున్నారు తప్ప బిజెపి ఆఫీసు వెలుపల చౌకీదార్లుగా పనిచేసేందుకు కాదు అన్నారు. 2019లో నేను కూడా చౌకీదారునే అనే బిజెపి ప్రచారం అర్ధం ఏమిటో ఇప్పుడు కైలాష్‌ మాటలద్వారా బోధపడిందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చమత్కరించారు.బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా విమర్శించారు. మిలటరీ అంటే దేశసేవ కోసం తప్ప కేవలం ఉపాధికోసం కాదన్నారు. కేంద్ర టూరిజం మంత్రి జి కిషన్‌రెడ్డి కూడా అగ్నివీరుల గురించి అనుచితంగానే మాట్లాడారు.” అగ్ని వీరులకు ఇతర అంశాలతో పాటు ఎలక్ట్రీషియన్లుగా, డ్రైవర్లుగా, బట్టలుతికేవారిగా, క్షురకులుగా అన్ని రకాల శిక్షణ ఇస్తారు.” అన్నారు. నైపుణ్య శిక్షణ పేరుతో కార్యక్రమం ఉంది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు మిలటరీలో శిక్షణ ఇవ్వకూడదా అని ఎదురు ప్రశ్నించారు. ఈ పన్లు చేసేందుకు మిలటరీలో చేరాలా అనే ప్రశ్న ఎదురవుతుందనే విచక్షణ బిజెపి నేతలకు లేకపోయింది. బట్టలుతికేందుకు మిషన్లున్నాయి. మిలిటరీ, పోలీసు క్రాఫ్‌లు చేసేందుకు నిజానికి పెద్ద నైపుణ్యంతో పనేముంది.


2018 ఏప్రిల్‌ 22న ఢిల్లీలో బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఏల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన హితవచనాలను ఆ పార్టీ నేతలు మరిచినట్లున్నారు. పార్టీ అధికారిక ప్రతినిధి నూపుర్‌ శర్మ చిల్లర మాటలు మాట్లాడి విధిలేని స్థితిలో సస్పెన్షకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్నిపథ్‌ పధకం మీద యువత ఆగ్రహించినపుడు ఆ పార్టీ నేతలు తమ నోటి తుత్తరను ప్రదర్శించారు. ఐదు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చెప్పిందేమిటి? ” మన మీడియాకు మసాలాను ఇస్తున్నాం. కెమెరాలను చూడగానే మనమేదో పెద్ద సామాజిక శాస్త్రవేత్తలం లేదా మేథావులం అన్నట్లుగా ప్రకటనలు చేసేందుకు దూకుతాం. తరువాత చెరుపు చేసే ప్రకటనలను ఉపయోగించుకొని మన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మీడియా చూస్తుంది. ఇది మీడియా తప్పుకాదు. ” అన్నారు. బహుశా ఈ కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రధానిగా మోడీ విలేకర్ల సమావేశం నిర్వహించలేదు.


భారత్‌ బంద్‌ పిలుపుకు సైతం దారి తీసిన అగ్నిపథ్‌ పధకాన్ని నరేంద్రమోడీ సమర్ధించారు. సోమవారం నాడు బెంగళూరులో మాట్లాడుతూ అనేక నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అనుచితంగానే కనిపించవచ్చు.తరువాత అవి జాతి నిర్మాణానికి తోడ్పడతాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కరణలతోనే దేశం లబ్ది పొందుతుంది. సంస్కరణల బాట మనలను నూతన లక్ష్యాలు, కర్తవ్యాలవైపు తీసుకుపోతుంది అన్నారు. 1990 నుంచి అమలు జరుపుతున్న సంస్కరణలు దేశం అంటే జనానికి చేసిన లబ్ది ఏమిటన్నది బ్రహ్మ పదార్ధం. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్నట్లు ప్రధాని గతంలో చెప్పారు. ఈ ఎనిమిదేండ్లలో అవిచ్చిన ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఇలాంటి సుభాషితాలను నమ్మే స్థితి నుంచి జనం క్రమంగా బయటపడుతున్నారు. దానికి ప్రతిరూపమే అగ్నిపథ్‌ పధకంపై తలెత్తిన నిరసన. ఆ పధకాన్ని ఎలా సమర్ధించుకోవాలో అర్ధం గాక బిజెపి నేతలు రెచ్చగొట్టే-కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ పేరుతో నోరు మూయించాలని చూస్తున్నారు.

నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


పెట్రోలు, డీజిలు మీద వందల రెట్లు పన్నులు పెంచి ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేందుకే అని చెబితే నిజమే కదా అనుకొని మాట్లాడకుండా అంగీకరించారు వారు. నరేంద్రమోడీ మీద ఏర్పడిన నమ్మకం అది.
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు చేరకుండా చూస్తున్నామని చెబితే నోట్ల మార్పిడి కోసం పనులు మానుకొని బాంకుల ముందు వరుసల్లో నిలుచోవటం దేశభక్తి అని భావించారు. ఇదేమిటన్న వారిని ఎంతో అనుభవం ఉన్న నరేంద్రమోడీ అంత తెలివితక్కువ పని చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు.
రైతుల కోసం తెచ్చామని చెప్పిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఉద్యమించినపుడు మనం కర్షకులం కాదు కదా అని వారు ప్రేక్షక పాత్ర వహించారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ సర్కార్‌ మోసం చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారంలో ఉండగా వారు చేసిందీ అదే కదా ఎవరైనా అంతే అని పెదవి విరిచారు. మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నైపుణ్య అభివృద్ది పధకంతో మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచంలోనే ఉత్తమ నిపుణులుగా తయారవుతామని డాలర్‌ కలలు కన్నారు. ఎక్కడా అలాంటి జాడలు లేవు.
నాలుగుదశాబ్దాలల్లో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగులు పెరిగారన్న వార్తలు రాగానే అబ్బెఅబ్బె లెక్కలన్నీ తప్పు, సరిగా వేయలేదు, పకోడీల బండి పెట్టుకున్నవారికి కూడా ఉపాధికల్పించినట్లే కదా అని నరేంద్రమోడీ అన్నపుడు ఇదేదో తేడా కొడుతోంది అనుకున్నారు తప్ప మరొక రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు మూడేండ్ల నాటి కంటే నిరుద్యోగం ఇంకా పెరిగింది.
అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంటు చేయాలని వారు రోడ్ల మీదకు వస్తే మనకేమిటి సంబంధం, అసలు పనే లేదు కదా, మనవంతు వచ్చినపుడు చూసుకుందాంలే అని పక్కన నిలబడి చూశారు వారు. ఇప్పుడు మిలిటరీలో కూడా వాటికి తెరలేపారు.
ఎన్‌పిఎస్‌(నూతన పెన్షన్‌ ) కాదు ఓపిఎస్‌(పాత పెన్షన్‌ ) కావాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే వారికి ఏదో ఒక పెన్షన్‌ ఉంది. మాకసలు ఏ ఉద్యోగమూ లేదు కదా అని పట్టించుకోలేదు వారు. ఇప్పుడు మిలిటరీలో చేరినా మూడో వంతు మందికి ఉద్యోగమూ ఉండదు, నాలుగేండ్ల సర్వీసుకు పెన్షనూ ఉండదు.
ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంటే, తెగనమ్ముతుంటే మనకు పోతున్నదేమీ లేదు, నష్టాలు వచ్చే వాటిని అమ్మితే మంచిదే కదా అనుకున్నారు. ఇలా దేశంలో ఏం జరుగుతున్నా స్పందించకుండా పాలకుల మీద ఆశ, భ్రమలతో తమ కెరీరే ముఖ్యంగా బతుకుతున్న వారు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఎత్తివేసే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేస్తామని నమ్మబలుకుతున్నారు.


దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఇంట్లో పరువు పోతోంది, బతుకుతెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం అని చూస్తే ఎక్కడా పర్మనెంటులేదు, దొరికిన పనికి సరైన వేతనమూ లేదు. గొర్రెతోక బెత్తెడు. జుమాటో, స్విగ్గీ వంటి గిగ్‌ ఉపాధే గతి,ఐనా ఆత్మగౌరవం కోసం తప్పుదనుకున్నారు. అప్రెంటిస్‌ పేరుతో ఏండ్ల తరబడి పర్మనెంటు పని చేయిస్తున్నా కలిసి రాలేదు లేదా మన ఖర్మ అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నింపరు, వాటి మీద ఆశలు వదులుకోవాల్సిందే, దగా దగా కుడి ఎడమల దగా అన్న నిరాశలో కూరుకుపోయారు తప్ప రోడ్లెక్కలేదు. సరిగ్గా అటువంటి స్థితిలో కరోనా వచ్చింది. ఎవరూ ఏమీ చేయలేం కదా అని సరిపెట్టుకున్నారు. రెండు సంవత్సరాలుగా మిలిటరీ రిక్రూట్‌మెంట్లు లేవు. అర్హత పరీక్షలు కొన్ని పూర్తి చేసుకొని చివరి పరీక్ష, నియామకాల కోసం ఎన్నో ఆశలతో ఈ ఏడాది వాటికి సిద్దమౌతున్న స్థితిలో…….. అగ్నిపథ్‌ పేరుతో చివరికి మిలిటరీలో కూడా తాత్కాలిక ఉద్యోగాలకు తెరలేపటం అగ్గిమీద గుగ్గిలం వేసినట్లయింది. ఏటా లక్షల మందిని మిలిటరీలో చేర్చుకోరు. పరిమితమే కావచ్చుగానీ ఎన్నో ఆశలతో ఉన్నవారికి ఇది ఆశనిపాతంగా మారటంతో ఒక్కసారిగా కడుపు మండి వీధుల్లోకి వచ్చి అగ్గివీరులుగా మారారు.మిలిటరీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం కావటమే, అలాంటి తమను కాంటాక్టు సైనికులుగా మారుస్తామనే సరికి రక్తం సలసలా కాగింది.


మరిగే నీరు వంద డిగ్రీల వేడెక్కిన తరువాతే ఆవిరిగా కొత్త రూపం సంతరించుకుంటుంది. అంటే దాని అర్ధం అప్పటివరకు నీటిలో మార్పేమీ జరగలేదని కాదు. వెలుపలికి కనిపించదు. గుణాత్మక మార్పుల తరువాత పరిణామాత్మక మార్పు సంభవిస్తుంది. మంచి రోజులు తెస్తామన్న పాలకుల మాటలు నమ్మి అవి జుమ్లా అని అర్ధం అవుతున్నా దేశంలో సంవత్సరాల తరబడి అసంతృప్తి పేరుకు పోయిన యువతలో అలాంటి మార్పు ఇప్పుడు కనిపిస్తోందని చెప్పవచ్చు. 2022 జూన్‌ 14న అగ్నిపథ్‌ పధకానికి రక్షణ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిసింది. ఆ మరుసటి రోజున జెడి(యు) – బిజెపి పాలిత బీహారులో ప్రారంభమైన ఆందోళన దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. అనేక చోట్ల ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. శుక్రవారం నాడు సికిందరాబాదులో కాల్పులకు దారితీసి ఒకరిని బలిగొన్నది. శనివారం నాడు బీహార్‌లో బంద్‌కు పిలుపునిచ్చారు. విస్తరిస్తున్న ఆందోళనను నీరుగార్చేందుకు గత రెండు సంవత్సరాలుగా ఎంపికలు లేవు గనుక ఈ ఒక్క ఏడాదికి గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సిఆర్‌పిఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని శనివారం నాడు మరొక ప్రకటన చేశారు. అసలు ఈ పధకమే వద్దు అంటుంటే ఈ బుజ్జగింపులతో జోకొట్టాలని చూస్తున్నారు. ఈ రెండు బిస్కెట్లు కాకుండా ఇంకా ఏమైనా వేస్తారేమో చెప్పలేము.


ఏండ్ల తరబడి ఖాళీగా ఉంచిన పదిలక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసేందుకు పూనుకున్నట్లు ప్రకటన వెలువరించటం, తరువాత అగ్నిపథ్‌ స్కీమును ప్రకటించటం ఒక ఎత్తుగడతో చేసిందే అన్నది స్పష్టం. చేదు మాత్రను మింగించటానికి పంచదార పూత పూసినట్లుగా పదిలక్షల ఖాళీల భర్తీ ప్రకటనగా భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పోస్టుల భర్తీ ఎంత ప్రహసనంగా ఉందో మిగతా చోట్ల దానికి భిన్నంగా ఉంటుందని అనుకోలేము. అందుకే పదిలక్షల పోస్టుల ప్రకటన నిరుద్యోగుల్లో పెద్ద స్పందన కలిగించలేదన్నది స్పష్టం. అది ఎంతకాలానికి నెరవేరుతుందో ఈ లోగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ అవుతాయో చెప్పలేము.
ఏడాదికి పైగా సాగిన రైతు ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. దాని వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులు, కమిషన్‌ ఏజంట్లు ఉన్నారని తప్పుడు ప్రచారం చేసినట్లుగానే అగ్నిపథ పధకాన్ని వ్యతిరేకిస్తున్న వారి వెనుక ప్రతిపక్షాలున్నట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలకే పరిమితం కాగా ఇది దేశమంతటా తలెత్తింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ వ్యవస్థలో అడితీదార్లు లేదా కమిషన్‌ ఏజంట్లను ఏ పార్టీ కూడా సమర్ధించలేదు. రైతులు ఢిల్లీలో ఏడాదిపాటు తిష్టవేస్తే దానివెనుక వారి పాత్ర ఉందంటూ బిజెపి, గోడీ మీడియాతో సహా దాని మద్దతుదార్లు పెద్ద చర్చ పేరుతో రచ్చ చేశారు. విధిలేక క్షమాపణలు చెప్పి మరీ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నారు మంచిదే, మరి సదరు ఏజంట్లను ఇంకా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎందుకు కొనసాగిస్తున్నట్లు ? వారిని తొలగించవద్దని ఏ రైతు సంఘమూ కోరలేదే ! సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు. రైతుల మాదిరి మోసపోయేందుకు కుర్రకారు రైతులు కాదని ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేము. నిప్పుతో చెలగాటాలాడని నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడుతోందా ?


ఈ పధకాన్ని ఎందుకు తెచ్చారన్నది ప్రశ్న. తక్కువ వేతనాలతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసేందుకు టీచర్లు దొరుకుతున్నపుడు ఎక్కువ వేతనాలిచ్చి ప్రభుత్వం ఎందుకు నియమించాలన్న ప్రపంచబాంకును సంతృప్తి పరచేందుకు స్కూళ్లలో విద్యావలంటీర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రైల్వేల వంటి చోట్ల పాక్షిక ప్రయివేటీకరణ, రిటైరైన సిబ్బంది నియామకాలు, వివిధ శాఖల్లో పొరుగుసేవలు, కాంట్రాక్టు సిబ్బంది, అప్రెంటిస్‌ వంటివన్నీ ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల ఫలితమే. వేతనాలు, అలవెన్సులు, సామాజిక భద్రతా పధకాల ఖర్చు లేకుండా చేసేందుకే ఇదంతా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖకు సైతం వర్తింపచేసి సైనికుల పెన్షన్‌ బిల్లును తగ్గించుకొనేందుకు నాలుగేండ్ల పాటు పని చేసే నియామకాలకు శ్రీకారం చుట్టింది.


2014 లోక్‌సభ ఎన్నికల తరుణంలో మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న వారి కుటుంబాల ఓట్లు పొందేందుకు ఒకే రాంకు-ఒకే పెన్షన్‌ వంటి వాగ్దానాల సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగేండ్ల సర్వీసుతో అలాంటి రాంకులు ఉండవు-అసలు పెన్షనే ఉండదు. ఈ పధకంలో చేరిన వారిలో 25శాతం మందిని ప్రతిభ ఆధారంగా పర్మనెంటు చేస్తారట. అంటే శిక్షణ ముగిసిన దగ్గర నుంచి తన తోటివారిని ఎలా వెనక్కు నెట్టి తాను పర్మనెంటు ఎలా కావాలా అన్న తపన తప్ప వారిలో మరొకటి ఉంటుందా ? బుట్టలో తవుడు పోసి కుక్కలను ఉసికొల్పినట్లుగా ఉండదా ! ఇప్పటికే సివిల్‌ సిబ్బందిలో ప్రమోషన్లు, మంచి పోస్టులు, స్థలాల కోసం ఎలాంటి అవాంఛనీయపోటీ, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిందే. రేపటి నుంచి అదే మిలిటరీలో పునరావృతం కాదనే హామీ ఏముంటుంది.


నాలుగేండ్ల సర్వీసులో చేరి వెలుపలికి వచ్చిన వారికి సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీలో చేరేందుకు తిరిగి ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టి చేర్చుకుంటారని నమ్మబలుకుతున్నారు. ఈ బిస్కెట్లన్నీ ఎందుకు ? కొనసాగింపుగా వారిని తరువాత పారామిలిటరీ, ఇతర భద్రతా సంస్థల్లో, ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రాల సాయుధ బలగాల్లో చేరుస్తామని చెబితే గొడవే ఉండదు. రాష్ట్రాలకు శిక్షణా భారం తప్పుతుంది. వెంటనే విధుల్లోకి వచ్చే సిబ్బంది దొరుకుతారు కదా ! ఆ విధంగా వివిధ విభాగాల్లో పర్మనెంటుగా నియమిస్తామని, వారి పెన్షన్‌కు ఢోకా ఉండదని ముందుగానే హామీ ఇస్తే ఇంత జరిగేది కాదు కదా ? ఆర్మీలో ఒకసారి చేరిన తరువాత నిరంతరం ఫిట్‌నెస్‌ ఉండేందుకు చూస్తారు, తిరిగి పారామిలిటరీకి పరీక్ష ఎందుకు ? అందుకే ఇవన్నీ తప్పుదారి పట్టించే వాదనలు. దీనికి ఎలాంటి ప్రతిఘటన లేకపోతే తరువాత వంతు సిఆర్‌పిఎఫ్‌ వంటి పారామిలిటరీ, ఇతర దళాలకు దీన్ని పొడిగిస్తారు. అదే బాటలో రాష్ట్రాలు ఇప్పుడున్న హౌంగార్డులకు తోడు నాలుగేండ్ల పోలీసులను ప్రవేశపెట్టవనే హామీ ఏముంది? విదేశాల్లో ఇలాంటి పద్దతి ఉంది అని చెబుతున్నారు. ఉంటే ఉండవచ్చు, విదేశాల నుంచి అన్ని అంశాలను తీసుకుంటూ దీన్ని కూడా తీసుకుంటే అదొక దారి అలా లేదే. అమెరికాలో ఇలాంటి సైనికులతో పాటు అక్కడ నిరుద్యోగులకు ఉన్న భృతి, సామాజిక భద్రతా పధకాలను ఇక్కడ కూడా ముందు ప్రవేశపెట్టి యువతకు భరోసా కల్పించిన తరువాత ఇలాంటి వాటిని ప్రవేశపెడితే అదొక తీరు, మోడీ సర్కార్‌ అలాలేదే !


రెగ్యులర్‌ ఆర్మీకి వంద మందిని ఎంపిక చేయాలంటే 1000 మందిని పిలిచి ఫిల్టర్‌ చేస్తారట. ప్రతిభావంతులైన యువకులు మిలిటరీలోకి వస్తారట. ఇప్పుడు తీసుకుంటున్నవారికి కూడా అన్ని పరీక్షలు పెట్టే తీసుకుంటున్నారు కదా ! ఆరుపదులు దాటిన వారినేమీ తీసుకోవటం లేదు కదా !యువత మరీ అంత అమాయకంగా ఉందని భావిస్తున్నారా ? ఫిల్టర్‌లో కొత్తేముంది, ప్రతి ఉద్యోగానికి, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సీట్లకు జరుగుతున్నది అదే కదా ! కానీ అగ్నిపథ్‌లో వంద మందికి గాను ఐదు వందల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వారిలో వంద మందిని పర్మనెంటు చేసి మిగతా నాలుగువందల మందికి నాలుగేండ్ల తరువాత పన్నెండు లక్షలు ఇచ్చి ఇంటికి పంపుతారని, ఇతర రంగాల్లో సర్దుబాటు చేస్తారని, నాలుగేండ్లు ఇంటి దగ్గర ఉన్నవారు ఇంత సంపాదించగలరా అంటున్నారు. దేశంలోని యువత అందరికీ ఇలాగే మిలిటరీగాక పోతే ఎవరికి తగిన రంగంలో వారికి శిక్షణ ఇచ్చి అందరికీ నాలుగేండ్ల ఉపాధి, పన్నెండు లక్షలు ఇచ్చే పధకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. స్వచ్చందంగా ఎవరికి నచ్చిన దానిలో వారు చేరతారు. ఎలాంటి ఆందోళనలు ఉండవు. దేశానికి నిపుణులైన పనివారు దొరుకుతారు కదా !


ఉట్టికెగరలేని వారు స్వర్గానికి ఎగరగలరా ! కరోనాలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన రైలు ఛార్జీలు ఎవరు భరించాలి అన్న చర్చకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వ పెద్దల నిర్వాకం చూసిన తరువాత ఇంతటి మహత్తర లబ్ది కల్పిస్తారని చెబితే నమ్మేదెవరు ? పకోడీల బండి ద్వారా పొందే ఉపాధి కూడా ప్రభుత్వం కల్పించినదానిలో భాగంగానే లెక్కించాలని ప్రధాని నరేంద్రమోడీ గారు సెలవిచ్చిన సంగతి మరచిపోగలమా ? కార్పొరేట్లకోసం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతుల కోసం అని నమ్మించేందుకు చూశారు, వీలుగాక క్షమాపణ చెప్పి మరీ వాటిని రద్దు చేశారు.అదే సందర్భంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా దాని ఊసులేదు. ఇలాంటి వారి మాటలు నమ్మాలని వాట్సాప్‌ పండితులు బోధలు చేస్తున్నారు. జైకిసాన్‌ అంటూనే వారికి వెన్నుపోటు పొడిచేందుకు చూసిన వారు ఇప్పుడు జై జవాన్లకు పెన్షన్‌ లేకుండా చేసేందుకు పూనుకున్నారు.


ఆందోళనలు చేస్తున్నవారు హింసాకాండకు పాల్పడటాన్ని ఎవరూ సమర్ధించరు,హర్షించరు. అలాంటి చర్యలకు పాల్పడటానికి ప్రత్యేక శిక్షణ ఎలా ఉంటుందో కళ్ల ముందే కరసేవ పేరుతో బాబరీ మసీదును కూల్చివేసిన తీరు వెల్లడించింది. భక్తులుగా వచ్చిన వారు గునపాలు, పెద్ద సుత్తులు ఎందుకు తెచ్చారు, ఎలా తెచ్చారు అని అడిగి తెలుసుకొని ఉంటే, ఈ రోజు రైళ్లు తగులబెడుతున్న వారికి అవి ఎలా దొరుకుతాయో తెలిసి ఉండేది. దేశం కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దపడి సైనిక ఎంపికలకు సిద్దం అవుతున్నవారు కడుపుమండితే ఎంతకైనా తెగిస్తారు. ఇలా చెప్పటమంటే వారిని సమర్ధిస్తున్నట్లు కాదు. బాబరీ మసీదును కూడా కడుపు మండినవారు కూల్చారుతప్ప మాకేమీ సంబంధం లేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అప్పుడు చెప్పారు కదా ! వాట్సప్‌ గ్రూపుల ఏర్పాటు వాటి ద్వారా సందేశాలు, కుట్రల గురించి చెబుతున్నారు. నిజమే అనుకుందాం కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలేమి చేస్తున్నట్లు ? నివారణ చర్యలేమి తీసుకున్నట్లు ?


. 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు. దాన్ని ముందుగా చర్చిస్తే నల్లధనం ఉన్నవారు జాగ్రత్తపడతారని చెప్పకుండా చేశారనుకుందాం. కానీ దాని గురించి కూడా ఆశ్రితులకు ముందుగానే ఉప్పందించారన్న విమర్శలు తెలిసిందే. అందుకే నల్లధనం ఒక్కపైసా కూడా దొరకలేదు. ఒకేదేశం-ఒకే పన్ను పేరుతో తగిన సన్నాహం లేకుండా తెచ్చిన జిఎస్‌టి ఎలాంటి పర్యవసానాలకు దారి తీసిందో చూశాము. జమ్ము కాశ్మీరు అసెంబ్లీ తీర్మానం, చర్చతో నిమిత్తం లేకుండా ఆర్టికల్‌ 370,ఏకంగా ఆ రాష్ట్రాన్నే రద్దు చేసిన తీరు తెలిసిందే. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయం గురించి మూడు సాగు చట్టాలను ఎంత హడావుడిగా ప్రహసన ప్రాయంగా చేసిందీ చూశాము. వాటి అనుభవం నుంచి పాఠాలేమీ నేర్చుకున్నట్లు లేదు. మిలిటరీ రిక్రూట్‌మెంటులో సమూల మార్పులను తలపెట్టి అగ్నిపథ్‌ పధకాన్ని తీసుకువచ్చే ముందు దానిలోని అంశాలను ముసాయిదా రూపంలో చర్చకు పెట్టకుండా మూసిపెట్టి ఆకస్మికంగా అమల్లోకి తీసుకురావటం ఏ రకపు ప్రజాస్వామ్యం ? అదేమీ గుట్టుగా ఉంచాల్సింది కాదు కదా !

యువతలో ఉన్న అసంతృప్తి బిజెపి-జెడియు ఏలుబడిలో ఉన్న బీహార్‌లో ఈ ఏడాది జనవరిలోనే వెల్లడైంది. రైల్వే ఉద్యోగార్దులు నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కేంద్ర పెద్దలు తమకు పార్లమెంటులో మంద మెజారిటీ ఉంది కదా అని నిరంకుశంగా ఏది బడితే అది చేసి ఆమోదం పొందాలనే ఒక అప్రజాస్వామిక వైఖరితో ముందుకు పోతున్నారు. అది కుదరదని అగ్నిపథ్‌పై స్పందన వెల్లడించింది. దీన్నుంచైనా గుణపాఠం తీసుకొని లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికవర్గంపై తలపెట్టిన దాడిని వెనక్కు తీసుకుంటారా ? ఇప్పుడు అగ్నిపథ్‌ గురించి చర్చించేందుకు సిద్దం అని కేంద్ర మంత్రి అంటున్నారు. ఎవరితో చర్చిస్తారు, ఆ పని ముందే ఎందుకు జరగలేదు. ప్రతి ఆందోళనకూ ఉన్నట్లే ఇప్పుడు తలెత్తిన ఆందోళనకు పరిమితులు ఉంటాయి. మిలటరీలో చేరాలనుకొనే వారికి భ్రమలు తొలుగుతున్నాయి. మిగతా వారు వారి మాదిరి స్పందించకపోవచ్చు. రేపు తమ ఉద్యోగాలకూ, ఉపాధికి ఇదే గతి అన్న ఆలోచనకు తాజా ఆందోళన నాంది పలుకుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ మీద పెట్టుకున్న – పెంచుకున్న భ్రమలను పటాపంచలు చేస్తుంది. ప్రతి మహానదీ ప్రారంభంలో చిన్న వాగు-వంక మాదిరే ప్రారంభం అవుతుంది. ఇదీ అంతే !!

అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురులేదని ప్రపంచం ముందు కనిపించేందుకు అమెరికా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. అనేక చోట్ల తగులుతున్న ఎదురుదెబ్బలు అంతరంగంలో అమెరికా పాలకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తున్నాయి. 2022 జూన్‌ ఆరు నుంచి పదవ తేదీ వరకు అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దక్షిణ(లాటిన్‌) అమెరికా తన వెనుకే ఉందని చెప్పుకునేందుకు చూసిన బైడెన్‌ యంత్రాంగానికి చివరికి భంగపాటే మిగిలింది. శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ చేసిన ప్రకటన అమెరికా ఒక చెంపను వాయిస్తే సమావేశానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు మరో చెంప వాయించినట్లు మాట్లాడాడు.” కచ్చితంగా భిన్నమైన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశం జరగాలని మనం కోరుకుంటాం.హాజరుగాని వారి మౌనం మనల్ని సవాలు చేస్తున్నది. కాబట్టి మరోసారి ఇలా జరగకూడదు. నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్‌లో జరిగే సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చే దేశాలకు మన ఖండంలోని సభ్య దేశాల హాజరుపై ఆంక్షలు విధించేే అధికారాన్ని ఇవ్వకూడదు.” అని అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చెప్పారు. లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాల సంస్థ(సిఇఎల్‌ఏసి) ప్రోటెమ్‌ అధ్యక్షుడిగా కూడా ఫెర్నాండెజ్‌ పని చేస్తున్నాడు.లోపెజ్‌ బాటలో బొలీవియా, హొండురాస్‌, గౌతమాలా, సెంట్‌ విన్సెంట్‌, గ్రెనడా దేశాధినేతలు నడిచారు.ఎల్‌ సాల్వడార్‌, ఉరుగ్వే నేతలు కూడా ఇతర కారణాలతో పాల్గొనలేదు.


ఇదంతా లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి క్యూబా, వెనెజులా, నికరాగువా నియంతృత్వదేశాలంటూ వాటిని ఆహ్వానించరాదన్న అమెరికా నిర్ణయానికి నిరసనే. ఈ సమావేశం ద్వారా అమెరికా సాధించదలచుకున్న లక్ష్యం ఏదైనప్పటికీ సమావేశ వేదిక మీద, వెలుపలా జరిగిన పరిణామాలు మరోసారి అమెరికా నలుగురి నోళ్లలో నానింది. ప్రత్యేకించి అమెరికా ఖండ దేశాలలో పెద్ద చర్చకు దోహదం చేసింది. దాని ద్వంద్వనీతిని బయట పెట్టింది. ఇంకేమాత్రం తమ మీద అమెరికా ఆధిపత్యం చెల్లదని లాటిన్‌ అమెరికా దేశాలు చెప్పకనే చెప్పటమే. అమెరికా పలుకుబడి బండారం ఇతర చోట్ల కూడా మరింతగా జనానికి తెలియచేసే పరిణామమిది. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌, నేటి ఉక్రెయిన్‌ సంక్షోభం అమెరికా బలహీనతలను, దాన్ని నమ్ముకుంటే నట్టేట మునగటమే అన్న పాఠం నేర్పింది.1994లో అమెరికాలోనే జరిగిన ఈ సంస్థ సమావేశాలతో పోల్చుకుంటే తాజా పరిణామాలు ఆ ప్రాంతంలో జరిగిన పెద్ద మార్పును సూచిస్తున్నాయి.


ఇటీవలి కాలంలో అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) పని తీరు తీవ్ర విమర్శలకు గురువుతోంది. అది పశ్చిమార్ధగోళంలో కేవలం అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒక పని ముట్టుగా మారిందన్నది స్పష్టం. అమెరికాతో పాటు ఈ సమావేశాల్లో ఓఎఎస్‌ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. బొలీవియాలో ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తిరుగుబాటునేత జెనీనె ఆనెజ్‌ను అధ్యక్షురాలిగా చేశారు.(ఇప్పుడు ఆమె నేరంపై విచారణ జరుగుతున్నది) దానికి ఆమెరికా దేశాల సంస్థ (ఓఎఎస్‌) మద్దతు ప్రకటించింది. ఈ దుర్మార్గానికి అండగా నిలవటంతో పాటు బొలీవియాలోని సంకేత, సకాబా ప్రాంతాల్లో ఆనెజ్‌ ఏలుబడిలో జరిగిన మారణకాండ గురించి మౌనం దాల్చిన సంస్థ ప్రధాన కార్యదర్శి లూయిస్‌ అలమగ్రో పదవిలో కొనసాగటం ఏమిటని కొందరు ప్రతినిధులు లేవనెత్తినపుడు అతగాడికి కంటిచూపు తప్ప నోట మాట లేదు. మూడు దేశాలను ప్రజాస్వామ్యం పేరుతో మినహాయించి హైతీలో మాజీ అధ్యక్షుడు జువనెల్‌ మోషే హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న ఏరియల్‌ హెన్రీ, కొలంబియాలో ప్రతిపక్షాలను ఊచకోత కోయిస్తున్న ఇవాన్‌ డూక్‌ను మానవహక్కుల పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న అమెరికా ఎలా ఆహ్వానించిందని కొందరు ప్రశ్నించారు. క్యూబా, వెనెజులా, నికరాగువా దేశాల ప్రభుత్వ నేతలను మినహాయించిన అమెరికా ఆ దేశాల ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన వారిని, అమెరికా ఇచ్చిన నిధులతో వివిధ సంస్థల పేరుతో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల మీద ధ్వజమెత్తే వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించింది. మరొక సభ్య దేశం గురించి తీర్పులు చెప్పే అధికారం ఏ దేశానికైనా ఎవరిచ్చారని అనేక దేశాల ప్రతినిధులు ప్రశ్నించారు. మూడు దేశాలను మినహాయించటాన్ని ఖండిస్తూ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా దేశాల సంస్థను సంస్కరించాలని కోరారు. అనేక మంది కరీబియన్‌ దేశాధినేతలతో పాటు బెల్జి, అర్జెంటీనా, చిలీ అధినేతలు కూడా ఇదే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు.


మూడు దేశాలను ఆహ్వానించకపోవటానికి 2001లో లిమాలో జరిగిన అమెరికా ఖండ దేశాల సమావేశం ఆమోదించిన ఆర్టికల్‌ 19ని సాకుగా చూపారు. ప్రపంచ అర్ధగోళంలోని దేశాల్లో ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలకు ఆటంకం కలిగించటానికి లేదా రాజ్యాంగ వ్యతిరేకంగా మార్చేందుకు పూనుకున్న దేశాలకు భవిష్యత్‌లో జరిగే అమెరికా ఖండ దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు అర్హత ఉండదన్నది దాని సారం. బొలీవియాలో రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ఇవోమొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడింది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమావేశాన్ని నిర్వహించేందుకే దానికి అర్హత లేదు. సరిగ్గా సమావేశానికి ఒక రోజు ముందు క్యూబా, వెనెజులా, నికరాగువాలను మినహాయించినట్లు ప్రకటించటం ఆమెరికాలో స్థిరపడిన ఆ దేశాలకు చెందిన, అమెరికా ఖండదేశాల్లోని వామపక్ష వ్యతిరేకశక్తులను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు.


అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోని 42దేశాల్లో నివసించే మూడోవంతు జనాభాపై చట్టవిరుద్దమైన ఆంక్షలను అమలు జరుపుతున్న అపర ప్రజాస్వామిక వాది. తనకు నచ్చని ప్రభుత్వాలను ఆ దేశాల పౌరులతోనే కూల్చివేయించే ఎత్తుగడ దీని వెనుక ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వెనెజులా మీద, తాజాగా రష్యా మీద ఆంక్షలను మరింతగా పెంచటం దానిలో భాగమే. దశాబ్దాల తరబడి క్యూబాను దిగ్బంధనానికి గురిచేసినా,వెనెజులా, నికరాగువా వంటి చోట్ల ప్రతిరోజూ కుట్రలు చేసినా దాని ఎత్తుగడలు ఎక్కడా పారలేదన్నది కూడా వాస్తవం. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, వెనెజులా, ఇప్పుడు రష్యాలకు చెందిన విదేశాల్లోని ఆస్తులు, బంగారం వంటి వాటిని స్వాధీనం లేదా స్థంభింప చేసిన తరువాత అమెరికా ఆంక్షలకు గురైన దేశాలన్నీ అమెరికా డాలరుతో సంబంధం లేని లావాదేవీల కోసం చూడటం పెరుగుతోంది తప్ప అమెరికాకు లొంగటం లేదు. ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనే పేరుతో ఐరాస మానవహక్కుల సంస్థలో రష్యాకు స్థానం కల్పించకూడదనే అమెరికా తీర్మానానికి అనుకూలంగా 92 ఓట్లు వస్తే తటస్థం లేదా వ్యతిరేకంగా 13 అమెరికా దేశాలతో సహా 82 దేశాలున్నాయి. జనాభా రీత్యా చూస్తే అత్యధికులు ఈ దేశాల్లోనే ఉన్నారు.
లాస్‌ ఏంజల్స్‌ సమావేశానికి మూడు దేశాలను ఆహ్వానించకూడదన్న అమెరికా ఆలోచనలను ముందే పసిగట్టిన మెక్సికో అధినేత లోపెజ్‌ అదే జరిగితే తాను వచ్చేది లేదని ముందుగానే స్పష్టం చేశాడు. గత కొద్ది నెలలుగా బుజ్జగించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే లాటిన్‌ అమెరికాలో బలపడుతున్న పురోగామి శక్తుల బంధాన్ని వెల్లడించింది. లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాల్లో ఎగురుతున్న ఎర్రబావుటాల వాస్తవాన్ని గుర్తించేందుకు అమెరికా నిరాకరిస్తున్నది. గత మొరటు పద్దతులతోనే తన పెత్తనాన్ని సాగించాలని విఫలయత్నం చేస్తున్నది. వెనెజులాలో తన కుట్రలు విఫలమైన తరువాత ప్రతిపక్షనేత జువాన్‌ గుయిడో ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వాన్ని గుర్తించిన ట్రంప్‌ అవసరమైతే దాడులకు సైతం తెగబడతానన్న ప్రేలాపనలతో ఊగిపోయాడు. ప్రస్తుత బైడెన్‌ అలా నోరుపారవేసుకోకపోయినా అదేబాటలో నడుస్తున్నాడు. మదురోను తిరస్కరించినా గుర్తించిన జువాన్‌ గుయిడోను ఆహ్వానించే సాహసం చేయలేకపోయాడు.


వామపక్ష శక్తులు అనేక చోట్ల అధికారానికి వస్తుండటం, తాము బలపరిచిన మితవాద శక్తులను జనాలు తిరస్కరిస్తుండటాన్ని గమనించిన తరువాత అక్కడి పరిణామాలు అమెరికన్లకు మింగుడుపడటం లేదు,వామపక్షాలను ఎలా ఎదుర్కోవాలో దానికి తోచటం లేదు. తాజాగా కొలంబియా ఎన్నికల్లో కూడా మితవాదశక్తులకే అమెరికా మద్దతు ఇచ్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలస వచ్చే వారిని అడ్డుకొనేందుకు అడ్డుగోడ నిర్మాణంతో సహా ట్రంప్‌ తీసుకున్న చర్యలన్నింటినీ బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా ఖండదేశాల మధ్య వలసలు ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేసిన శిఖరాగ్రసభకు అన్ని దేశాల నేతలు వచ్చినపుడే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది. అమెరికాకు మెక్సికో, గౌతమాలా, ఎల్‌సాల్వడార్‌, హొండురాస్‌ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తారు. ఈ దేశాలనేతలెవరూ లేకుండానే సమావేశాలు ముగిశాయి.


అమెరికా ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాలు, వైఖరిని నిరసిస్తూ లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన అమెరికా దేశాల తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశానికి పోటీగా అదే తేదీల్లో అదే నగరంలో వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు, ఉద్యమాల ప్రతినిధులతో పోటీగా ” ప్రజాస్వామ్యం కోసం ప్రజాశిఖరాగ్ర సమావేశాలు ” జరిగాయి. వివిధ అంశాలను చర్చించటంతో పాటు అమెరికా వైఖరికి నిరసనగా ప్రదర్శనలు కూడా చేశారు. జూన్‌ 10 నుంచి 12వ తేదీ వరకు మెక్సికోలోని తిజువానాలో కార్మికుల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో కూడా వివిధ దేశాలకు చెందిన వారితో పాటు అమెరికా వీసాలు నిరాకరించిన క్యూబా, వెనెజులా, నికరాగువా తదితర దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గన్నారు. రెండు సమావేశాల్లో అమెరికా నిరంకుశ పోకడలతో పాటు వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఎలా సమీకరించాలో కూడా చర్చించారు. అమెరికా ఖండాల ప్రజలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాస్‌ ఏంజల్స్‌ సమావేశాల్లో భౌతికంగా, ఆన్‌లైన్‌లో 250 సంస్థలకు చెందిన వారు భాగస్వాములైనారు. ఈ సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అధికారిక సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ కంచెవేసి నిరసనకారులను అడ్డుకున్నారు. నగరంలోని ఒక కాలేజీలో వేదికను ఏర్పాటు చేసుకొని వివిధ అంశాలపై ప్రజాసంస్థలు చర్చలు జరిపాయి. అమెరికా పెత్తందారీ పోకడలకు గురవుతున్న దేశాలకు బాసటగా నిలుస్తామని దీక్ష పూనాయి.

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

బిజెపి నేతల నోటి తుత్తర ఎంత పని చేసిందీ – ఉపరాష్ట్రపతి వెంకయ్యకు అవమానం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ నోటి తుత్తర లేదా అదుపులేని తనం కారణంగా తెలుగువాడైన మన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడికి అవమానం జరిగింది. కతార్‌ పర్యటనలో అధికారిక రాత్రి విందును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. కతార్‌ ఉప ఎమిర్‌ (రాజు)కు కరోనా అన్న అనుమానం అని దానికి సాకు చెప్పారు. ఇప్పటి వరకు ముస్లిం విద్వేష ప్రకటనలు మన అంతర్గత అంశంగా ఉండగా ఇప్పుడు మహమ్మద్‌ ప్రవక్త మీద దాడితో ” మన దేశ ప్రతిష్టను ” నరేంద్రమోడీ అనుచరులు అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు. ఇస్లామిక్‌ దేశాల్లో మన దేశం గురించి పతాకశీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి.దీంతో కతార్‌, కువైట్‌లోని కొన్ని దుకాణాల నుంచి మన దేశ వస్తువులను తొలగించినట్లు బిబిసి పేర్కొన్నది.ఒమన్‌ గ్రాండ్‌ మప్తీ కూడా మన దేశ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.


మహమ్మద్‌ ప్రవక్త గురించి అనుచితంగా మాట్లాడిన బిజెపి నేత నూపూర్‌శర్మ (ఆమె ఢిల్లీ సిఎం అరవింద కేజరీవాల్‌పై పోటీచేశారు) మీద ఇంతవరకు ఎలాంటి కేసులు లేవు. రెచ్చగొట్టిన ఆమె మాటలతో తలెత్తిన ఉదంతాల్లో మాత్రం ఎందరి మీదో కేసులు నమోదు చేశారు. మే 27వ తేదీన గ్యాన్‌వాపి మసీదు పేరుతో చర్చ జరిపిన టైమ్స్‌ నౌ ఛానల్‌లో మాట్లాడిన నూపూర్‌ శర్మ మాటలను కోట్లాది మంది చూశారు. అనుచితంగా మాట్లాడుతున్న ఆమెను సదరు ఛానల్‌ మోడరేటర్‌ నివారించలేదు, అలాంటి మాటలు మాట్లాడటం తమ ఛానల్‌ వైఖరి కాదు అని కూడా ప్రకటించలేదు. ముందే చెప్పుకున్నట్లు నూపూర్‌ మీద గాని సదరు ఛానల్‌ మీద గానీ ఎలాంటి కేసులు లేవు. చర్చలో నూపూర్‌ శర్మ మాటలున్న భాగాన్ని తీసుకొని తీసుకొని ట్వీట్‌ చేసిన ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ మీద మాత్రం కేసులు పెడతారు. మామ తిట్టటం కాదు దాన్ని చూసిన తోడల్లుడు కిసుక్కున నవ్వటం ఘోరం అన్నట్లుగా లేదూ !


ముస్లింలు, ఇస్లాం గురించి ఎంత విద్వేషపూరితంగా మాట్లాడితే అంత దేశభక్తి. మేకిన్‌ ఇండియా అంటే కుప్పలు తెప్పలుగా అలాంటి వివాదాలు, మాటల సృష్టే అన్నట్లుగా మారింది. బిజెపి ఫ్యాక్టరీలో పని చేస్తున్న నూపూర్‌ శర్మ ఉత్పత్తి కాన్పూర్‌లో హింసాకాండకు, కేసులకు దారి తీసింది. పలుచోట్ల ముస్లింలు తమ ప్రవక్తమీద మాట్లాడిన అనుచిత పదజాలానికి నిరసన తెలుపుతున్నారు. ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వానికి లేదా, బిజెపిలో ఎలాంటి స్పందన లేదు. కానీ నూపూర్‌ శర్మ నిర్వాకం ఇస్లామిక్‌ దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మన దేశపు సరకులను బహిష్కరించాలన్న పిలుపులు వెలువడ్డాయి. కొన్ని ప్రభుత్వాలు అధికారికంగా స్పందించి మన రాయబారులను పిలిపించి ఇదేం పని అని మందలించటం, నిరసన తెలుపుతున్నాయి. క్షమాపణ చెప్పాలని కోరాయి. ఇంత జరిగిన తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతలు నష్ట నివారణకు పూనుకున్నారు. మేనెల 27న నూపూర్‌ శర్మ మాట్లాడితే అది పార్టీ విధానం కాదంటూ జూన్‌ ఐదున ఆమెను సస్పెండ్‌ చేయటాన్ని ఏమనాలి ! అందుకే ఈ చర్యలోగానీ, తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటనలో గానీ ఎక్కడా చిత్తశుద్ది కనపడదు.


నూపూర్‌ శర్మ ట్వీట్‌ ద్వారా చేసిన ప్రకటన ఇలా ఉంది.” మన మహదేవ్‌ను అవమానిస్తూ, అగౌరవపరుస్తూ కొనసాగుతున్న టీవీ చర్చలకు నేను గత కొద్ది రోజులుగా హాజరువుతున్నాను. కనిపించింది శివలింగం కాదు ఒక ఫౌంటెన్‌ అని వెక్కిరింతగా మాట్లాడుతూ ఢిల్లీలో రోడ్లపక్క ఉన్న స్థంభాలు, చిహ్నాలంటూ శివలింగాన్ని అపహాస్యం కూడా చేస్తున్నారు.మన మహదేవ్‌ను ఇలా అవమానించటం, అగౌరవపరచటం కానసాగటాన్ని నేను సహించలేను. దానికి స్పందనగానే నేను కొన్ని అంశాలను చెప్పాను. నా మాటలు ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగించినా ఎవరి మత భావాలనైనా గాయపరిచినా, ఏదైనా కానివ్వండి బేషరతుగా నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవ్వరి మతభావనలను గాయపరచటం నా ఉద్దేశ్యం కాదు.” అని పేర్కొన్నారు. ఈ పశ్చాత్తాపం కలగటానికి తొమ్మిది రోజులు పట్టిందంటే అసలు కథేమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటి ? ఆ సుభాషితాన్ని పూర్తిగా వివరించనవసరం లేదు. వికీపీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అయిషా అనే ఆరేండ్ల బాలికను మహమ్మద్‌ ప్రవక్త వివాహం చేసుకున్నట్లు, ఆమెకు తొమ్మిదేండ్లు వచ్చిన తరువాత సంసారం చేసినట్లు నూపూర్‌శర్మ చెప్పినట్లుగా ఉంది.గ్యానవాపి మసీదులో కనిపించింది ఏమిటో అధికారికంగా నిర్ధారించిన తరువాత అది శివలింగమా-ఫౌంటెనా అన్నదాని గురించి ఎవరి అభిప్రాయం చెప్పుకోవచ్చు. బిజెపి అధికారికంగా ఎక్కడా శివలింగమే అది అని తాము నమ్ముతున్నట్లు ఇంతవరకు చెప్పలేదు. పోనీ దాని గురించి చర్చలో మహమ్మద్‌ ప్రవక్త ప్రస్తావన అవసరం ఏమిటి ?


తన నోటితుత్తర కాన్పూర్‌లో హింసాకాండకు దారి తీసినందుకు నూపూర్‌ శర్మ ఎలాంటి విచారం ప్రకటించలేదు, వివరణ ఇచ్చేందుకు కూడా పూనుకోలేదు. తన మాటలను ఉటంకిస్తూ ఆల్ట్‌ న్యూస్‌ మహమ్మద్‌ జుబేర్‌ విడుదల చేసిన వీడియో చూసిన వారు తన మాన ప్రాణాలను హరిస్తామంటూ చేస్తున్న బెదిరింపులకు అతనే బాధ్యత వహించాలని, తన మాటలను వక్రీకరించి అసందర్భంగా చూపారని ఆరోపించారు. ఒక వేళ అదే నిజం అనుకుంటే తన మాన ప్రాణాలకు నిజంగా ముప్పు తలెత్తిందని భావిస్తే తాను మాట్లాడిన వీడియోను తీసుకొని తానే దాన్ని విడుదల చేసి జనాల్లో తలెత్తిన అనుమానాలను తీర్చవచ్చు, అదేమీ ఆమె వైపు నుంచి లేదు. తామెలాంటి మార్పులు చేయలేదని ఆల్ట్‌ న్యూస్‌ మరొక ప్రతినిధి ప్రతీక్‌ సిన్హా స్పష్టం చేశారు. నూపూర్‌ శర్మ వ్యాఖ్యలు ప్రపంచమంతటా ముఖ్యంగా గల్ఫ్‌ ఇస్లామిక్‌ కౌన్సిల్‌ దేశాల్లో సామాజిక మాధ్యమాల్లో బిజెపికి పైసా ఖర్చు లేకుండా ఎంతో ప్రచారాన్నిచ్చాయి.దాంతో ముస్లింలు అధికంగా ఉండే దేశాలను సంతుష్టీకరించేందుకు నరేంద్రమోడీని పురికొల్పాయి. కతార్‌ ప్రభుత్వం మన రాయబారిని పిలిపించి తక్షణమే ఖండించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అనేక దేశాల్లో కూడా అదే జరిగింది. అయితే ఆ మాటలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని, నోటి తుత్తర శక్తులు చేసిన వ్యాఖ్యలని మన రాయబారులు, విదేశాంగశాఖ సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది.


నూపూర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు తప్ప బహిష్కరించలేదు. ఢిల్లీకి చెందిన మరొక బిజెపి నేత నవీన్‌ జిందాల్‌ చేసిన ఒక ట్వీట్‌లో మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచినందుకు పార్టీ నుంచి తొలగించారు. అతగాడు తన ట్వీట్‌ను తొలగించినప్పటికీ చర్యతప్పలేదు. ఇటీవల పార్టీల్లో పదవుల పందారం జరిగినపుడు అధిష్టానం వారిపేరుతో విడుదల చేసే లేఖలను ప్రదర్శించటం మీడియాలో ఒక ధోరణిగా మారింది. దాని కొనసాగింపులోనే కొన్ని ఛానళ్లు, వెబ్‌సైట్‌లు నూపూర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌కు రాసిన లేఖలను ప్రదర్శించాయి, వాటిలో వారి చిరునామాలున్నాయి. తన కుటుంబానికి హాని ఉన్నందున తన చిరునామాను వెల్లడించవద్దని నూపూర్‌ శర్మ మీడియాను కోరారు. తాను పోలీసు రక్షణ కోరినట్లు జిందాల్‌ పేర్కొన్నారు. ఎఎన్‌ఐ వార్తా సంస్థ ఆ లేఖను తొలగించింది. అయితే అప్పటికే ఆమె అడ్రస్‌ జనాలకు కేరింది. అసలు చిరునామాలను చెరపకుండా బిజెపి ఆఫీసు నుంచి మీడియాకు ఆ లేఖలు ఎలా వచ్చాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.


ధర్మ సంసద్‌ల పేరుతో జరిపిన సభల్లో హిందూత్వ నేతలు ముగ్గురు చేసిన విద్వేషపూరిత ప్రసంగాల గురించి ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి మహమ్మద్‌ జుబేర్‌ చేసిన ట్వీట్లకు గాను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టారు. ఈ చర్యను పదకొండు డిజిటల్‌ న్యూస్‌ సంస్థలతో కూడిన డిజిపబ్‌ న్యూస్‌ ఇండియా ఫౌండేషన్‌ ఖండించింది.విద్వేష ప్రసంగాలు చేసిన వారిని వదలివేసి వారి మాటలను జనాలకు నివేదించిన జర్నలిస్టులను వేధించటం తగనిపని అని పేర్కొన్నది.హిందువుల మనోభావాలను కించపరిచినట్లు, ఐటి చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. మే నెల 27న జుబేర్‌ చేసిన ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.” ఇప్పటికే యాంకర్లు స్టూడియోలనుంచి ఎంతో చేస్తుండగా ఒక సామాజిక తరగతికి లేదా ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు యతి నరసింగానంద సరస్వతి, మహంత్‌ బజరంగ్‌ లేదా ఆనంద స్వరూప్‌ వంటి విద్వేషం వెదజల్లే వారికి ధర్మసంసద్‌లను ఏర్పాటు చేయటం ఎందుకు ?” అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలను చూసినపుడు అసలేం జరుగుతోంది అన్న సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులుగా పని చేస్తున్నారు. ఆర్ధికంగా ఆ దేశాలతో అనేక లావాదేవీలు కూడా పెద్దఎత్తునే ఉన్నాయి. బిజెపి నేతల నోటి తుత్తర ఈ సంబంధాల మీద రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ముందుకు తెచ్చిన 80-20 ప్రచారం ఒక అంశాన్ని స్పష్టం చేసింది. తమకు ఇరవైశాతం ముస్లింల ఓట్లు పడకపోయినా ఫరవాలేదని, మెజారిటీ హిందువులు తమను శాశ్వతంగా అధికారంలో కూర్చోబెడతారనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానికి నిదర్శనంగానే ఎక్కడా ముస్లిం అభ్యర్ధులను నిలపటం లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాలు అవసరం గనుక, తన ప్రతిష్టకు మచ్చపడకుండా చూసుకొనేందుకు ఎత్తుగడగా నరేంద్రమోడీ నాయకత్వం ఇప్పుడు ఇద్దరు బిజెపి నేతల మీద చర్యలు ప్రకటించటం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.

” నరేంద్రమోడీ శివలింగం మీద తేలు ” బిజెపి తాజా రాజకీయంలో పాత సంగతి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


శివలింగాల కోసం మసీదులను తవ్వేద్దామన్నారు బిజెపి ఎంపీ బండి సంజయ. ప్రతి మసీదులో శివలింగం కోసం చూడటం ఎందుకు అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సుభాషితం పలికారు. గ్యానవాపి వివాదాన్ని కొత్తగా రేపగా అది కొనసాగుతున్న వివాదమని భగవత్‌ చెప్పటం గమనించాల్సిన అంశం. ఇద్దరూ ఒకే సంస్థకు, భావజాలానికి చెందిన వారు. ఇద్దరి ఆలోచనలు పరస్పరం తెలియని స్థితిలో ఉన్నారా ? ఒకరు పిర్రగిల్లాలి, మరొకరు జోలపాడాలి. ఎవరికి తెలియని నాటకమిది ? భలేగా జనాన్ని ఆడుకుంటున్నారు కదా ! బాబరీ మసీదు మీద సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు రాముడి జన్మభూమి రాజకీయం నడిపారు. ఇప్పుడు శివలింగాల మీద కేంద్రీకరించారు.లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. రాజకీయ, మత వ్యాపారులు దీనికి మినహాయింపుగా ఎలా ఉంటారు ?


ఆమె మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. పదవీ కుమ్ములాటల కారణంగా బిజెపి నుంచి బహిష్కరణకు గురై భారతీయ జనశక్తి పార్టీ పేరుతో స్వంత దుకాణం నడిపి లాభం లేకపోవటంతో తిరిగి బిజెపి దుకాణంలో చేరారు, ఆమె పేరు ఉమా భారతి.రామజన్మభూమి ఆందోళనలో ప్రముఖ పాత్రధారి, బాబరీ మసీదును కూల్చివేసినపుడు అక్కడే ఉన్నారని వార్తలు. ఇప్పుడు ఆమె ఒక శివాలయాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచకపోతే తనకు నిదరపట్టదని, అన్నం మానివేస్తానని బెదిరింపులకు దిగారు. మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్‌ జిల్లాలోని రాయిసేన్‌ కోట భారత పురావస్తుశాఖ (ఎఎస్‌ఐ) ఆధీనంలో ఉంది. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం దాని ఆధీనంలో ఉన్న ఆలయాలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచి పూజలకు అనుమతిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజు పూజలు చేస్తారు. దాన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని ఉమాభారతి డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ నెలలో ఆ కోటను సందర్శించి గేటు వెలుపల నుంచి శివలింగం మీద నీటిని చల్లి అభిషేక తంతు జరిపారు. తాను గంగ నుంచి నీటిని తెచ్చి అధికారులకు అందచేశానని, గుడిని ఎప్పుడు తెరిచేది చెబితే వచ్చి వాటితో అభిషేకం చేస్తానని ఆమె విలేకర్లతో చెప్పారు. తాళాలు బద్దలు కొట్టటం వంటి పనులకు తాను పాల్పడనని అన్నారు. అసలు ఇక్కడ శివాయం ఉన్నట్లే తనకు తెలియదని మత బోధకుడు ప్రదీప్‌ మిశ్రా ప్రకటనల ద్వారా తెలుసుకొని వచ్చానన్నారు. మద్యపాన నిషేధం పేరుతో ఇటీవల ఆమె తన పార్టీకే చెందిన ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో వివాదపడుతున్నారు. దానిలో భాగంగానే శివాలయ రాజకీయం ప్రారంభించారని భావిస్తున్నారు.


శివలింగ రాజకీయంలో బిజెపి నేతలు తక్కువ తినలేదు. గ్యానవాపి మసీదులో కనిపించిందని చెబుతున్న శివలింగం గురించి బిజెపి తన వైఖరి ఏమిటో ఇంతవరకు ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం స్వదేశీ జాగరణ మంచ్‌ నేతగా ఉన్న పి. మురళీధర రావు మాత్రం వ్యక్తిగతం పేరుతో ప్రకటనలు చేస్తుంటారు. ఇదొక నాటకం. శివలింగపూజను ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదని మసీదులో శివలింగం ఉందన్న వాస్తవాన్ని ముస్లింలు అంగీకరించాలని ట్వీట్లు చేస్తారు. అక్కడ శివలింగం దొరికింది కనుక అక్కడ పూజలను అనుమతించాలి, అలా చేసినపుడు 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న యధాతధ స్థితిని కొనసాగించాలని 1991లో చేసిన చట్టం కొనసాగటం అసాధ్యమని వాదించారు. 1991నాటి చట్టం అమల్లో ఉండగా బిజెపి అధికారికంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది కనుక మద్దతుదార్లతో కేసులు వేయిస్తారు, వారితో తమకు సంబంధం లేదంటారు. ఏదో ఒక రూపంలో దాని గురించి రోజూ మాట్లాడుతూ ఉంటారు.

మహారాష్ట్రలో మతవాద రాజకీయాలు నడిపేవాటిలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) ఒకటి.దాని నేత గజానన్‌ కాలే ఒక ట్వీట్‌ చేస్తూ ఔరంగాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉండాల్సిన అవసరం లేదని దాన్ని కూల్చివేయాలంటూ రెచ్చగొట్టాడు. ఆ పని చేస్తే అక్కడికి జనాలు వెళ్లరని అన్నారు. దాంతో కొంత మంది దానికి తాళాలు వేసి రక్షణ కల్పించాలని ప్రయత్నించారు. మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇటీవల సమాధిని సందర్శించిన తరువాత ఇది జరిగింది. ఈ సందర్శన కొత్త వివాదాన్ని సృష్టించేందుకే అని ఒవైసీ మీద విమర్శలు వచ్చాయి. ఇలా ఎక్కడికక్కడ ఏదో ఒక పేరుతో మత శక్తులు రెచ్చిపోతున్నాయి.


చివరకు హిందువుల వ్యక్తిగత స్వేచ్చను కూడా బిజెపి సహించటం లేదు. గుజరాత్‌లోని వడోదరా పట్టణానికి చెందిన కష్మా బిందు అనే యువతి జూన్‌ 11న ఒక దేవాలయంలో తనను తానే వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇది హిందూత్వకు వ్యతిరేకం గనుక దాన్ని అనుమతించేది లేదని నగర బిజెపి నాయకురాలు సునీతా షుక్లా ప్రకటించారు. దీని వలన హిందూ జనాభా తగ్గిపోతుందని, మతానికి వ్యతిరేకంగా చేసే వాటిని సహించేది లేదన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే దేశ చరిత్రలో తనును తానే వివాహం చేసుకోవాలనుకోవటం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. అదే యువతి సాధ్విగా మారి ఉంటే ఎలాంటి అభ్యంతరం, హిందూ జనాభా తగ్గుదల అంశం తలెత్తిఉండేది కాదు.


దేశంలో శివలింగ రాజకీయాలు నడుస్తున్నాయి గనుక ఆసక్తికరమైన అంశాన్ని ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేం. ఒక హత్య కేసులో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ దేవుడు శివుడిని అవమానించారని 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర ప్రసాద్‌ ఆరోపించారు. ఒక కాంగ్రెస్‌ ఎంపీ భయంకరంగా హిందూ దేవుళ్లను అవమానించినందుకు శివ భక్తుడిని అని చెప్పుకున్న రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని, హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరు సాహిత్య సమ్మేళనంలో 2018 అక్టోబరు 28న శశిధరూర్‌ ప్రసంగించారు. నరేంద్రమోడీ శివలింగం మీదకు చేరిన తేలు వంటి వారని దాన్ని చేత్తో తీసివేయలేము చెప్పుతో కొట్టనూ లేమని ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఉపమాలంకారంగా ఒక జర్నలిస్టుతో అన్నారని ఆ ప్రసంగంలో శశిధరూర్‌ చెప్పినట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ నివేదించింది. దాన్ని హిందూమతాన్ని అవమానించినట్లుగా రవిశంకర ప్రసాద్‌ చిత్రించారు. ఈ మాటను శశిధరూర్‌ పాకిస్తాన్‌లో అని ఉంటే నోరు మూయించేవారు, అతను కేవలం ప్రధాన మంత్రినే కాదు ఈ దేశంలోని కోట్లాది మంది శివభక్తులను అవమానించారు అని మరో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ మాటలకు గాను శశి ధరూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్‌ గాంధీని బిజెపి నేత సంబిత్‌ పాత్ర డిమాండ్‌ చేశారు.ఇంతకూ జరిగిందేమిటి ?


శశిధరూర్‌ తన ప్రసంగంలో కారవాన్‌ పత్రిక జర్నలిస్టు వినోద్‌ జోస్‌తో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు నరేంద్రమోడీ శివలింగం మీద తేలుకొండి లాంటివాడని చేత్తో తొలగించలేము, చెప్పుతో కొట్టలేమని అన్న మాటలను ఉటంకిస్తున్నట్లు చెప్పారు.2012 కారవాన్‌ పత్రికలో వినోద్‌ జోస్‌ కథనం ప్రచురితమైంది. దాన్లో ఇలా రాశారు.” నేను గుజరాత్‌ నుంచి వచ్చే ముందు పెద్ద నిట్టూర్పుతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేత తన భావాలను నాతో ఇలా పంచుకున్నారు.” శివలింగం మీద తేలుకొండి కూర్చుని ఉంది. అది పవిత్రమైన శివలింగం కావటంతో చేత్తో తొలగించలేము-చెప్పుతో కొట్టనూ లేము ” అన్నట్లు రాశారు. సదరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పేరు వెల్లడించాలని ఒక ట్విటర్‌ కోరగా ఒక జర్నలిస్టుగా తనకు చెప్పిన వారిని మోసం చేయలేనంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒక్కరే కాదు నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌం మంత్రిగా పని చేసిన గోర్ధన్‌ జడాఫియా కూడా అదే మాట అన్నట్లు వినోద్‌ జోస్‌ సమాధానమిచ్చారు.


2010 సెప్టెంబరు 12న న్యూస్‌ 9 అనే ఆంగ్ల టీవీ ఆరునిమిషాల వీడియో వార్తను ప్రసారం చేసింది. దానిలో మోడీ ఒక తేలుకొండి అంటూ ఒక భాగం ఉంది. తెరమీద ఆ మాటలను చూపిన వెంటనే గోర్ధన్‌ జడాఫియా వ్యాఖ్య ఇలా మొదలైంది.” నేను గనుక చెప్పాల్సి వస్తే శివలింగం మీద తేలుకొండి కూర్చున్నదని చెప్పగలను. సంఘపరివార్‌ కూడా దాన్ని ముట్టుకోలేదు – శివలింగానికి హానీ కలిగేట్లు దేన్నీ విసరలేదు. మొత్తం పరివారమంతా చూస్తున్నది. వారిలో కూడా ఈ భావనలు ఉన్నా వారేమీ చేయలేరు.” అన్నారు. ఈ జడాఫియా విశ్వహిందూపరిషత్‌ నేత. అహమ్మదాబాద్‌ బిజెపి ప్రధాన కార్యదర్శి, రెండుసార్లు ఎంఎల్‌ఏగా, నరేంద్రమోడీ మంత్రివర్గంలో హౌంమంత్రిగా పనిచేశారు.2002 గుజరాత్‌ మారణకాండలో పాత్రధారి అనే విమర్శలున్నాయి. విశ్వహిందూపరిషత్‌కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులను కొన్ని చోట్లకు బదిలీ చేసి హింసాకాండకు తోడ్పడేట్లు చేశారని, అతని ఆదేశం మేరకు పోలీసులు నిర్వాశితులైన బాధితుల మీద శిబిరాల్లోనే దాడులు చేయించినట్లు విమర్శలున్నాయి. నరేంద్రమోడీ పొడగిట్టని విశ్వహిందూపరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా అనుచరుడిగా ఉన్న కారణంగా గుజరాత్‌ హింసాకాండ తరువాత జడాఫియాను మంత్రివర్గం నుంచి మోడీ తొలగించారు. దాంతో 2007 ఎన్నికల్లో మహాగుజరాత్‌ జనతా పార్టీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత బిజెపి నుంచి వెలుపలికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ దుకాణమైన గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీలో దాన్ని విలీనం చేశారు.2012 ఎన్నికల్లో అది బిజెపి మీద పోటీకి దిగి భంగపడింది.తరువాత విశ్వహిందూపరిషత్‌ పూర్తిగా నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించింది. గుజరాత్‌ కొట్లాటలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు సార్లు జడాఫియాను ప్రశ్నించింది, నరేంద్రమోడీ పాత్ర గురించి సాక్ష్యం చెప్పేందుకు సుముఖత చూపినట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు వత్తిడి తెచ్చి వారించినట్లు దాంతో వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. రాజీగా జడాఫియాను తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఒప్పందం కుదరటంతో 2014లో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీని బిజెపిలో విలీనం చేసి పార్టీలో చేరారు.

దేశంలో ప్రస్తుతం ప్రారంభమైన శివలింగాల రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో ! రామజన్మ భూమి మాదిరి ఓట్లను రాలుస్తుందా ? ఈ కొత్త నాటకాన్ని జనం గ్రహిస్తారా ? ఆర్ధిక రంగంలో ఘోరంగా విఫలమై జన జీవితాలు అతలాకుదలం అవుతున్న స్థితిలో వాటి నుంచి జనాన్ని మళ్లించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. దానిలో లింగాల రాజకీయం ఒకటి అన్నది స్పష్టం. శ్రీలంక ఆర్ధిక దిగజారుడు, రాజకీయ పరిణామాల నేపధ్యంలో ధరల అదుపునకు జమ్మిక్కులు చేస్తున్నారు. ఆర్ధిక దిగజారుడు మరింతగా జరగకముందే ఏదో ఒకసాకుతో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపినా ఆశ్చర్యం లేదు.

కొలంబియా ఎన్నికల్లో వామపక్షం ముందంజ !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. ఆదివారం నాడు కొలంబియాలో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికలలో వామపక్ష, పురోగామి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధి గుస్తావ్‌ పెట్రో ముందంజలో ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో సగానికిపైగా తెచ్చుకున్నవారినే విజేతగా గుర్తిస్తారు. మొత్తం ఎనిమిది మంది పోటీ పడగా పెట్రోకు 40.33శాతం, స్వతంత్రుడిగా పోటీ చేసిన మితవాద వాణిజ్యవేత్త రుడాల్ఫో హెర్నాండెజ్‌కు 28.15శాతం ఓట్లు, మూడో పక్ష అభ్యర్ధి ఫెడరికో గూటిరెజ్‌కు 23.92శాతం రాగా మిగిలిన ఐదుగురికి 5.87శాతం వచ్చాయి. తొలి దఫా ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో జూన్‌ 19 మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్యపోటీ జరగనుంది. రెండు, మూడు స్థానాల్లో వచ్చిన వారిద్దరూ మితవాద శక్తులే. తుది పోటీల్లో తాను హెర్నాండెజ్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు గూటిరెజ్‌ ప్రకటించటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల్లో పెట్రో ముందంజ లాటిన్‌ అమెరికాను ఆశాభావంతో నింపిందని, జనాలు సంప్రదింపులు, సామాజిక సమానత్వం, ఏకీకరణ వంటి అంశాలతో కొత్త ఊపిరి పీల్చటం ప్రారంభించినట్లు పందొమ్మిది లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన వామపక్ష నేతలు, మేథావులతో కూడిన ప్యుబెలా బృందం ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చింది.కొలంబియా వామపక్ష పురోగమన ఆశల వ్యక్తీకరణ అని కూడా పేర్కొన్నది.నూతన కొలంబియా గురించి కలలు గన్న యువత అసమాన కృషి ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి అభ్యర్ధుల విజయం వెనుక ఉందని, విస్మరణకు గురైన స్త్రీ,పురుషులందరికీ గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నది. నిష్పాక్షికమైన, ప్రజాస్వామిక,శాంతియుత కొలంబియా నిర్మాణం జరగాలని ఆకాంక్షించింది. 2019 జూన్‌ 12-14 తేదీలలో మెక్సికోలోని ప్యుబెలా పట్టణంలో జరిగిన సమావేశంలో పది దేశాలకు చెందిన 30 మందితో ఈ బృందం ప్రారంభమైంది. దీనిలో ఇప్పుడు ఐరోపాలోని స్పెయిన్‌తో సహా19 లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన 200 మంది గతేడాది నవంబరు 29,30, డిసెంబరు ఒకటవ తేదీల్లో ఇంటర్నెట్‌ ద్వారా జరిగిన ఐదవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బృందంలో లూలా డ సిల్వా, దిల్మా రౌసెఫ్‌(బ్రెజిల్‌), ఆల్బర్టో ఫెర్నాండెజ్‌(అర్జెంటీనా) రాఫెల్‌ కొరెయా (ఈక్వెడోర్‌) ఇవో మొరేల్స్‌(బలీవియా) వంటి నేతలున్నారు.


ఒకవైపు మితవాద – పురోగామివాద శక్తుల రాజకీయ సమీకరణలు, మరోవైపు హింసాకాండ నేపధ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల పాటు 2002-10 మధ్య అధికారంలో ఉన్న ఆల్వారో ఉరిబి కొలంబియా వామపక్షశక్తుల అణచివేతలో, మాదక ద్రవ్యాల మాఫియాలను ప్రోత్సహించటంలో పేరుమోశాడు. వేలాది మంది పౌరులను హతమార్చేందుకు కారకుడు. ప్లాన్‌ కొలంబియా పేరుతో అమెరికా అందచేసిన 280 కోట్ల డాలర్లతో ప్రయివేటు సాయుధ మూకలను తయారు చేసి మిలిటరీకి అనుసంధానించాడు. వామపక్ష గెరిల్లా ఉద్యమాలు నిర్వహించిన ఎఫ్‌ఏఆర్‌సి, ఇఎల్‌ఎన్‌ సంస్థలు,వాటి మద్దతుదార్లను హతమార్చటం, దాడులు చేయటమే వాటిపని. తాజా ఎన్నికల్లో కూడా ఆ మూకలు వామపక్ష కూటమి అభ్యర్ధులను హతమారుస్తామని ప్రకటనలు, కుట్రలు చేశాయి. గతనాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇవాన్‌ డ్యూక్‌ ఉరుబి కీలుబొమ్మ. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం లేనందున ఇతగాడు ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. రెండవది ఈ పార్టీ అనుసరించిన విధానాల కారణంగా జనాలకు దూరమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోకుండా చూసేందుకు మే 25 నుంచి జూన్‌ మూడు వరకు ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు వామపక్ష జాతీయ విముక్తి సైన్యం(ఇఎల్‌ఎన్‌) ప్రకటించింది.


కొలంబియా ఎన్నికల నిబంధనల ప్రకారం అధ్యక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లనే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన వారికీ వర్తింప చేసి విజేతగా ప్రకటిస్తారు. అందువలన రెండు పదవులకూ పోటీచేసే వారి పేర్లు బాలట్‌లో ఉంటాయి.2010లో తొలి సారి పోటీ చేసి నాలుగవ స్థానంలో నిలిచి, తిరిగి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన గుస్తావ్‌ పెట్రోకు తొలి రౌండులో 25.09, రెండవ రౌండ్‌లో 41.77శాతం వచ్చాయి.గత ఎన్నికల్లోనూ ఐదు పార్టీల కూటమి తరఫున పోటీ చేయగా ఈసారి ఆరు వామపక్ష, ప్రజాతంత్ర పార్టీల, ఉద్యమ సంస్థల కూటమి తరఫునే పోటీ చేశారు. గత ఎన్నికల కంటే తొలి రౌండులో పదిహేనుశాతం పైగా ఓట్లు అదనంగా వచ్చాయి. కమ్యూనిస్టు లేదా ఒక వామపక్ష పార్టీ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించిన తరువాత ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేనపుడు, తమ ఎన్నికల అజెండాకు అనుగుణంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో కలసి పోటీ పడటం అనివార్యం.

కొలంబియాలో గత ఎన్నికల్లోని వామపక్ష కూటమి పార్టీల బదులు ఈ ఎన్నికల్లో కొత్తవి రంగంలోకి వచ్చాయి. గుస్తావ్‌ పెట్రో విషయానికే వస్తే 1970లో ఎన్నికల అక్రమాలను నిరససిస్తూ తలెత్తిన” ఏప్రిల్‌ 19 ఉద్యమం ” గెరిల్లా సంస్థలో 17 ఏండ్ల వయస్సులో (1977లో) చేరాడు. తరువాత దాని విధానాలు నచ్చక ఎం19 డెమోక్రటిక్‌ అలయన్స్‌ అనే పార్టీలో పని చేరాడు. ఇలా ఆరు పార్టీల్లో పని చేశాడు.2011లో హ్యూమన్‌ కొలంబియాపేరుతో తాను ఏర్పాటు చేసిన పార్టీలో అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఎన్ని పార్టీల్లో పనిచేసినా పురోగామి భావజాలాన్ని వదులుకోలేదు. సైద్దాంతిక, ఎత్తుగడల అంశంలో విబేధాలతో పార్టీలను వీడాడు.
ఎన్నికల్లో ఒక కూటమిగా కొన్ని పార్టీలు ఏర్పడిన తరువాత అభ్యర్ధి ఎవరనే ప్రశ్న తలెత్తవచ్చు. ఏకాభిప్రాయం లేనపుడు మద్దతుదారులతో జరిపే ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. తాజా ఎన్నికల్లో ఆరుపార్టీల ” చారిత్రాత్మక ఒప్పంద ” కూటమి తరఫున ఆరుగురు పోటీ పడగా హ్యూమన్‌ కొలంబియా-పేట్రియాటిక్‌ పార్టీల తరఫున ఉన్న గుస్తావ్‌ పెట్రోకు పోలైన వాటిలో 80.55శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ” ప్రత్నామ్నాయ ప్రజాస్వామిక కేంద్రం” అభ్యర్ధి ఫ్రాన్సియా మార్కెజ్‌కు 14శాతం వచ్చాయి. ఆమె ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నారు.ఆమె ఆఫ్రో-కొలంబియన్‌ మానవహక్కుల, పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తగా కూడా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను రూపుమాపేందుకు ప్రయత్నించినశక్తులకు ప్రతిరూపంగా నిలిచాడు. ఆ బాటలో నడిచేవారిని ఉరిబిస్టులని, వ్యతిరేకిస్తున్న వారిని ఉరిబిజం వ్యతిరేకులని పిలుస్తున్నారు. వీరిలో వామపక్ష వాదులే ఉండనవసరం లేదు, ప్రజాతంత్ర విధానాలను కోరుకొనే వారు కూడా ఉంటారు. గుస్తావ్‌ పెట్రో ఇలాంటి శక్తులకు ప్రతినిధిగా పోటీ పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పార్లమెంట్‌ సెనెటర్‌గా గుస్తావ్‌ ఉన్న సమయంలో ఉరిబి విధానాలను గట్టిగా ప్రతిఘటించాడు. అందువలన ఉరిబి మద్దతుదార్లు ఎన్నికల ప్రచారంలో గుస్తావ్‌ను వామపక్షవాదిగా పేర్కొంటూ పెట్రో గెలిస్తే వెనెజులాలో ఛావెజ్‌ అమలు జరిపిన విధానాలనే ఇక్కడ కూడా ప్రవేశపెడతారని తప్పుడు ప్రచారం చేశారు.


ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ కూటమి హరిత ఇంథనాన్ని ప్రోత్సహించి చమురువాడకాన్ని తగ్గిస్తుందని పెట్రో చెప్పాడు. ఆర్ధిక అసమానతల తగ్గింపు, ధనికుల మీద పన్నుల పెంపుదల చేస్తామని, దేశాన్ని నాశనం చేసే నయా ఉదారవాద విధానాలనుంచి వైదొలుగుతామని చెప్పాడు. 2021లో జరిగిన నిరసనల మీద ప్రదర్శించిన పోలీసు జులుం గురించి దిగిపోనున్న అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ మీద విచారణ జరుపుతామని కూడా వాగ్దానం చేశాడు. మాదకద్రవ్యాల ఉత్పత్తి శక్తుల చేతుల్లో ఉన్న విస్తారమైన భూములన్నింటిలో ఆహార ఉత్పత్తుల పునరుద్దరణకు కోటిన్నర హెక్టార్లలో సంస్కరణలు చేపడతామని, కొత్తగా చమురు ఉత్పత్తి నిలిపివేస్తామని, ప్రయివేటీకరించిన ఆరోగ్యరంగంలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ విద్యారంగంలో పెట్టుబడులు పెంచుతామని, నీరు, రైలు సౌకర్యాలను మెరుగుపరుస్తామని, తమ ప్రభుత్వ తొలిచర్యగా ఆకలి నిరోధానికి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. మహిళల హక్కులను కాపాడతామని, వెనెజులాతో దౌత్య సంబంధాలను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.


ఎన్నికల ప్రచారంలో ఎదురైన కొన్ని అంశాల మీద గుస్తావ్‌ స్పందన ఎలా ఉందో చూద్దాం. వెనెజులాలో నియంతృత్వం ఉన్నందున దానితో సంబంధాలు ఎలా పెట్టుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సిద్దాంతం ప్రకారం వెనెజులా నియంతృత్వ దేశమైతే మనం దౌత్య సంబంధాలు పెట్టుకోకూడదు, మరి మన ప్రభుత్వం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో సంబంధాలు కలిగి ఉంది, అక్కడ బహుశా మీరు చెబుతున్న వెనెజులా కంటే దిగజారిన నియంతృత్వం ఉంది, దాని సంగతేమిటి ? అని ప్రశ్నించాడు. దౌత్య సంబంధాలనేవి దేశాల మధ్య ఉంటాయి తప్ప వ్యక్తులతో కాదు అన్నాడు. సమానత్వ సాధనకు వెనెజులా నేత ఛావెజ్‌ తీసుకున్న చర్యలను పెట్రో ప్రశంసించాడు. సామాజిక కార్యక్రమాన్ని చమురు ఆదాయంతో ముడిపెట్టటం ఛావెజ్‌ తప్పిదమని ఫ్రెంచి పత్రిక లీమాండ్‌తో చెప్పాడు. గుస్తావ్‌ పెట్రో వెలిబుచ్చిన కొన్ని అంశాలపై విమర్శలు వెలువడినప్పటికీ వామపక్ష వాదిగానే ఎన్నికల్లో ప్రతిపక్షాలు చూశాయి.
గుస్తావ్‌ పెట్రో ఎన్నికైతే తమ ఆటలు సాగవని అక్కడి అమెరికా పాలకులు, కార్పొరేట్‌, ధనికశక్తులు భావిస్తున్నాయి.అందుకే వామపక్ష, ప్రజాతంత్రశక్తులను హతమార్చేందుకు నిరంతరం కుట్రలు చేస్తున్నాయి. పెట్రోతో పాటు ఫ్రాన్సియా మార్‌క్వెజ్‌ను హతమారుస్తామని ప్రభుత్వ మద్దతు ఉన్న మూకల నుంచి అనేక బెదిరింపులు ఎన్నికల ప్రచారంలో వచ్చాయి. ఆ కారణంగానే కాఫీ పండే ప్రాంతంలో పెట్రో ప్రచారం రద్దు చేసుకోవాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలో వారి భద్రత గురించి 20దేశాలకు చెందిన 90 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఒక లేఖలో ఆందోళన వెల్లడించారు. కార్మిక, సామాజిక ఉద్యమ, పర్యావరణం, సామాజిక తరగతుల నేతలు 50 మందిని హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.


ఇక తొలి రౌండులో రెండవ స్థానంలో ఉన్న రోడాల్ఫో హెర్నాండెజ్‌ హింసాత్మక, చౌకబారు స్వభావం కలిగిన ధనికుడిగా పేరుమోశాడు. కొందరు అతడిని కొలంబియా ట్రంప్‌ అని ఎద్దేవా చేశారు. ఉరిబిజంతో కొన్ని అంశాల్లో విబేధించినప్పటికీ పచ్చిమితవాది. అలాంటి వ్యక్తి నేరుగా వామపక్ష నేతతో పోటీ పడనున్నారు. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప రెండవ దఫా ఎన్నికల్లో గుస్తావ్‌ పెట్రో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే లాటిన్‌ అమెరికా ఎర్రపూల వనంలో మరో మందారం మొగ్గతొడగనుందని చెప్పవచ్చు.

మోడీ పన్ను తగ్గింపు ఆవిరి – మరోసారి చమురు ధరల మోత !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్‌ ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్‌ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్‌ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్‌ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్‌ సీనియర్‌ విశ్లేషకుడు జేన్‌ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్‌ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.


రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్‌ రోజెన్‌బర్గ్‌ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.


అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్‌ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.


గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్‌ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్‌ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.


ఇటీవల ఎడిపి(రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్‌ గోయల్‌ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.