మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన గురించి కొన్ని అంశాలను మొదటి భాగంలో విశ్లేషించాము. మరికొన్ని అంశాలను ఈ భాగంలో చూద్దాము. 2025 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోయి, ప్రపంచంలో మూడో స్థానంలో నిలబెడతానని 2019లో నరేంద్రమోడీ ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2028 నాటికి 4.92లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఐదు లక్షల కోట్లు కావాలంటే 2029లోనే సాధ్యమని ఐఎంఎఫ్‌ తాజాగా ప్రకటించింది. తరువాత 2027 అని సవరించింది. అప్పటికి నరేంద్రమోడీ అధికారంలో ఉంటారో లేదో కూడా తెలియదు.2028నాటికి రూపాయి విలువ 2022లో 77.7 నుంచి 94.4కు పతనం కానుందని కూడా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. మరోవైపు మన అధికారులు మాత్రం 2025-26 లేదా మరుసటి ఆర్ధిక సంవత్సరానికి ఐదులక్షల డాలర్లకు చేరతామని అంటున్నారు. ఇక్కడ సమస్య ఎంతకు, ఎప్పుడు చేరుతుందని కాదు, దాని వలన జనానికి ఒరిగేదేమిటి ? ఉపాధి రహిత, వేతన పెంపుదల లేని ఆర్ధిక వ్యవస్థలో సంపదలు పోగుపడితే చెప్పుకోవటానికి గొప్పగా ఉండవచ్చు, కుహనా జాతీయ వాదులను సంతృప్తి పరచవచ్చు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020 నుంచి 2027వరకు తలసరి జిడిపి డాలర్లలో ఇలా ఉండనుంది.
దేశం××× 2020×× 2021×× 2022×× 2023×× 2024×× 2025×× 2026×× 2027
భారత్‌×× 1,935 ××2,185××2,342××2,527××2,720××2,929×× 3,138××3,350
బంగ్లాదేశ్‌× 1,962 ××2,147××2,363 ××2,588××2,814××3,056××3,315××3,587
చైనా×× 10,525 ××12,359××14,029××15,486××16,740××17,991××19,312××20743
తొలిసారి 2020లో భారత తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిందని చెప్పటాన్ని కూడా బిజెపి నేతలు దేశద్రోహం అన్నట్లు చిత్రించారు. కావాలంటే బంగ్లాదేశ్‌కు వెళ్లమని చెప్పారు. ఐఎంఎఫ్‌ చెప్పినదాని ప్రకారం 2021 మినహా 2027వరకు మనకంటే బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి ఎక్కువగా ఉండనుంది. ఇదేమైనా అంకెల గారడీనా ? కరోనా కారణమా ? కానేకాదు.2014లో బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి 1,119 మన దేశంలో 1,574 డాలర్లు ఉంది. మనదేశం ఇతర చోట్ల నుంచి పత్తి దిగుమతి చేసుకొని బంగ్లా పాలకులు దుస్తుల ఎగుమతుల మీద కేంద్రీకరిస్తే మన పాలకులు వాటి బదులు వస్త్రధారణ వివాదాల మీద కేంద్రీకరించటమే అసలు కారణం అని చెప్పవచ్చు. సిఇఐసి సమాచారం ప్రకారం కార్మికశక్తి భాగస్వామ్యం 2021లో మన దేశంలో 45.6శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 57, చైనాలో 68.1శాతం ఉంది.పాకిస్తాన్‌లో 50.1శాతం ఉంది. సిఎంఐఇ సమాచారం ప్రకారం 2022 మార్చినెలలో మన దేశంలో కార్మిక భాగస్వామ్యం 39.5శాతం ఉంది. 2018లో నిరుద్యోగం నాలుగుదశాబ్దాల గరిష్ట స్దాయికి చేరితే తరువాత పెరగటమే తప్ప తగ్గింది లేదు. పని చేసే అవకాశాలు, చేసే వారు పెరగకుండా జిడిపి పెరగదు కదా ! గ్రామీణ ప్రాంతాల్లో పని తగ్గిపోతున్న కారణంగా 2013లో గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పని చేసిన వారితో పోల్చితే తాజాగా లెక్కల ప్రకారం నాలుగు రెట్లు పెరిగారు. కరోనా కాలంలో ఎనభై కోట్ల మందికి నెలకు తాము ఆరుకిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా ఇచ్చామని బిజెపి నేతలు ఒక ఘనతగా చెప్పుకుంటారు. దాన్ని తిరగేసి చూస్తే జనాన్ని ఎంతగా దరిద్రంలో ఉంచారన్నది వెల్లడిస్తున్నది.


నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రపంచంలో ఇంతవరకు నరేంద్రమోడీ తప్ప ఏ పాలకుడూ కరెన్సీని రద్దు చేయలేదు.పోనీ ఇంత చేసి సాధించిందేమైనా ఉందా అంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. జనానికి ఇబ్బందులు, ఆర్ధిక రంగాన్ని కుదేలు చేయటం తప్ప జరిగిందేమీ లేదు. మొత్తం నోట్లలో 99.3శాతం బాంకులకు తిరిగి వచ్చాయి, మిగిలినవి కూడా అనేక మందికి తెలియక డిపాజిట్‌ చేయకపోవటం వంటి కారణాలు తప్ప మరొకటి కాదు. ఈ తప్పిదానికి మన్నించమని నరేంద్రమోడీ జనాన్ని కోరలేదు, అసలు ఉలుకూపలుకు లేదు. దేశంలో నల్లధనం ఎప్పటి మాదిరే తనపని తాను చేసుకుపోతున్నదని అందరికీ తెలిసిందే.2016నవంబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం జరిగే కాబినెట్‌ సమావేశానికి మంత్రులెవరూ సెల్‌ఫోన్లు తీసుకురావద్దని చెప్పినట్లు వార్తలు వచ్చాయి, కానీ కొందరు ఆశ్రితులకు ముందే ఈ సమాచారాన్ని చేరవేశారని, వారంతా జాగ్రత్త పడినట్లు తరువాత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


నరేంద్రమోడీ వాగ్దానం చేసిన అచ్చేదిన్‌ (మంచి రోజులు)కు అర్ధం ఏమిటో ఇంతవరకు తెలియదు.అమెరికా సంస్ధ పూ అంచనా ప్రకారం 2021 నుంచి ఇప్పటికి రెండున్నర కోట్ల మంది ఉపాధి కోల్పోయారు, ఏడున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేసినప్పటికీ గత దశాబ్దకాలంలో ఏటా 43లక్షలకు మించలేదు. ఎనిమిదేండ్ల నాటి ధరల పెరుగుల రికార్డులను ఏక్షణంలోనైనా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అంటే జనాలకు చచ్చే రోజులు తప్ప అచ్చేదిన్‌ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఉపాధి, గౌరవ ప్రదమైన, కనీస అవసరాలు తీరే వేతనాలు, సరసమైన ధరల స్థితి ఉంటే రోజులు మంచిగా ఉన్నట్లు భావిస్తారు. ఇప్పుడు ఆ స్ధితి ఉందా ? అందుకే అసలు ఆ పదాన్ని పురాతన భాండాగారంలో పెట్టాలని, అసలు మర్చిపోవాలని జనాలు జోకులు పేలుస్తున్నారు. చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠం 7.79శాతానికి చేరింది. నాలుగుశాతం వద్ద అదుపులో ఉంచాలన్నది ఆర్‌బిఐ నిర్దేశిత లక్ష్యం కాగా దానికి రెట్టింపు ఉంది. జిడిపి వృద్ధిరేట్లలో మన దేశంలో ఒక నిలకడ లేదు.1997 నుంచి ఉద్థాన పతనాలు నమోదవుతున్నాయి. కరోనాకు ముందు మూడు మాసాల్లో 42 సంవత్సరాల కనిష్ట వృద్ధి రేటు నమోదైంది. వార్షిక వృద్ది రేటు 2014లో ఎనిమిదిశాతం ఉండగా 2020 మార్చినాటికి నాలుగుశాతానికి పడిపోయింది. తరువాత కరోనా వచ్చి నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చర్చకు అవకాశం లేకుండా చేసింది. కరోనా ప్రభావం తొలగి సాధారణ స్థితికి వచ్చింది. కానీ ఆర్ధిక రంగంలో అలాంటి మార్పు కనిపించటం లేదు. దిగజారిన ఆర్ధిక వ్యవస్ధ గణాంకాలను ప్రాతిపాదికగా చేసుకొని 2022లో ఎనిమిదిశాతం వృద్ధి రేటు ఉంటుందని ఊదరగొడుతున్నారు. అది జరిగినా కరోనాతో ముందు పరిస్థితితో పోల్చితే వాస్తవ వృద్ధి ఒకటి రెండుశాతం మాత్రమే ఉంటుందన్నది ఒక అభిప్రాయం. అందువలన తరువాత వృద్ధి అంకెలు అచ్చేదిన్‌ అసలు బండారాన్ని వెల్లడిస్తాయి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రయివేటు పెట్టుబడుల లేకపోవటం వంటి అంశాలు ప్రతికూలతను వెల్లడిస్తున్నాయి.


గత పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ బాంకుల వద్ద పేరుకు పోయిన బకాయిలను నిరర్ధక ఆస్తుల పేరుతో రు.11,68,095 కోట్లను రద్దు చేసింది. వాటిని తిరిగి వసూలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఎంత శాతం అన్నది ప్రశ్న. 2021మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో రద్దు చేసిన మొత్తం రు.2,02,781 కోట్లు ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఏడు సంవత్సరాల్లో రద్దు చేసిన మొత్తం రు.10.7లక్షల కోట్లు ఉంది. ఇంతవరకు రుణాలు ఎగవేసిన పెద్దల పేర్లు వెల్లడించేందుకు బాంకులు నిరాకరిస్తున్నాయి. రద్దు చేసిన మొత్తాలలో ప్రభుత్వరంగ బాంకుల వాటా 75శాతం ఉంది.నిరర్దక ఆస్తులను ఖాతాల నుంచి తొలగిస్తే బాంకులకు పన్ను భారం తగ్గుతుందని చెప్పారు.వసూలు అవకాశాలన్నీ మూసుకుపోయిన తరువాతే రద్దు చేస్తారు. తన పాలన అంతా సజావుగా ఉందని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడిలో బకాయిలు పేరుకు పోవటం అంటే కావాలని ఎగవేతకు పాల్పడటమే. ప్రజల సొమ్ము ప్రతిపైసాకు జవాబుదారీ అని చౌకీదారునని చెప్పుకున్న మోడీ అలాంటి వారి పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించటం లేదన్న ప్రశ్నకు జవాబు లేదు. రద్దు చేసిన బకాయిల్లో వసూలవుతున్న మొత్తం 15-20శాతానికి మించి ఉండటం లేదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు స్వదేశీ ఉత్పత్తిని పెంచి చమురు దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో అంతకు ముందున్న స్ధితి కంటే దేశీయ ఉత్పత్తి తగ్గింది. ఎనిమిది సంవత్సరాల క్రితం రూపాయి విలువ డాలరుకు 58 ఉండేది, ఇప్పుడు అది 77.56కు పడిపోయింది. రూపాయి విలువ పతనం ప్రభుత్వ అసమర్దతకు నిదర్శనమని ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు ధ్వజమెత్తారు. ఈ అసమర్ధతను నెహ్రూ మీద నెడతారా ? 2014లో పీపా ముడిచమురు ధర 110వద్ద ఉండగా మోడీ అధికారానికి వచ్చారు. తరువాత తగ్గటం తప్ప పెరిగింది లేదు. ఆ మేరకు జనానికి ధర తగ్గించాల్సిన మోడీ సర్కార్‌ తప్పుడు కారణాలు చూపి పెట్రోలు, డీజిలు మీద భారీగా సెస్‌లను పెంచి సొమ్ము చేసుకుంది. రూపాయి విలువను కాపాడలేని మోడీ సర్కార్‌ అసమర్దతకు జనం మూల్యం చెల్లించాల్సి వస్తున్నది.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా.ద్రవ్యోల్బణం పెరుగుదల, విదేశీ అప్పులు డాలర్లలో చెల్లించాలి గనుక రూపాయి విలువ రికార్డు పతనం కొనసాగితే ఇంకా పెరిగినా ఆశ్చర్యలేదు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వరంగ కంపెనీలను తెగనమ్మి పొందిన సొమ్ము, చమురుపై విధించిన భారీ సెస్సుల ఆదాయమంతా ఎటుపోయినట్లు, తెచ్చిన దాదాపు వందలక్షల కోట్లను ఏమి చేసినట్లు ? చివరికి చూసుకుంటే రికార్డు స్దాయి నిరుద్యోగం, వృద్ది రేటు పతనం, కనుచూపు మేరలో లేని అచ్చేదిన్‌ ! కొనుగోలు శక్తి పడిపోతోంది. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించలేని స్థితిలో కొత్తగా పెట్టుబడులు పెడితే తమకు వచ్చేదేమిటని ప్రయివేటురంగం ప్రశ్నిస్తోంది. ఆత్మనిర్భర్‌, కరోనా పేరుతో పొందిన రాయితీలతో లబ్దిపొందుతోంది.


ఎనిమిదేండ్ల క్రితం నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చిన అంశాలను చూసినపుడు బలమైన ఆర్ధిక పునాదులు వేస్తామన్నదే వాటి సారాంశం. కానీ తరువాత గత ఎనిమిదేండ్లలో అటు కేంద్రంలో, ఇటు మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి కేంద్రీకరణ ఆర్ధిక వృద్ధి కంటే మతపరమైన రాజకీయలక్ష్యాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారన్నది స్పష్టం. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా కట్టుబడిన మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అమలుకు అగ్రాసనం వేశారు. దేశాన్ని ప్రామాణిక హిందూ మూలాల్లోకి తీసుకుపోతామని చెబుతున్నారు. గతంలో అలాంటి భావజాలం, మతం దేశాన్ని పారిశ్రామిక విప్లవానికి దూరం చేసింది. తిరిగి అదే స్థితికి తీసుకుపోతామని చెబుతున్నారు. దానికిగాను హిందూమతానికి సంబంధం లేని హిందూత్వను ఆయుధంగా చేసుకొని మధ్య యుగాలనాటి మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది దేశాన్ని ఆర్ధికంగా దిగజారుస్తుందే తప్ప మంచి రోజుల వైపు తీసుకుపోదు. ఒక ఆర్ధిక వ్యవస్థను ఎలా నాశనం చేయవచ్చు అని ఎవరైనా అధ్యయం చేయదలిస్తే ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలనను ఎంచుకోవచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీలో విఫల నేత అని కొందరు చెప్పవచ్చు. నరేంద్రమోడీ వైఫల్యం, బూటకం గురించి చెప్పింది వాస్తవమే కదా !

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భాగం) : ఆర్ధిక వృద్ధి కంటే మత విభజనకే పెద్ద పీట !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే మాతృ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక గౌరవ ప్రదమైనదిగా జనం చేత ఆమోదింపచేసేందుకు, జాతీయ వాదం పేరుతో సమాజంలో చీలికలు తెచ్చేందుకు నరేంద్రమోడీ, ఇతర పాలకపెద్దలు కేంద్రీకరించిన తీరును ఎనిమిదేండ్లలో చూశాం. దీనిలో వందో వంతైనా సరైన ఆర్ధిక విధానాలపట్ల చూపితే ఎనిమిదేండ్ల తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యాల గురించి జనం చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్నది ఒక అభిప్రాయం. ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన ఆర్ధికలక్ష్యాల సాధనలో వైఫల్యం చెందినట్లు బిజెపి నేత సుబ్రమణ్య స్వామి స్వయంగా చెప్పారు.2016 నుంచి వృద్ధి రేటు దిగజారిందన్నారు. మీరెందుకు నరేంద్రమోడీకి సలహా ఇవ్వటం లేదన్న ప్రశ్నకు స్వామి చెప్పిన సమాధానం మోడీని అభిశంచించటమే.” పూర్వకాలపు రుషుల ఉద్బోధనల ప్రకారం వినే శ్రద్ద ఉన్నవారితో మాత్రమే విజ్ఞానాన్ని పంచుకోవాలి” అన్నారు. నరేంద్రమోడీకి సరైన ప్రత్నామ్నాయం లేదని అభిమానులు చెబుతున్నారు కదా అన్నపుడు ” తాము దేశం వదలిపెట్టిన తరువాత భారత్‌ పతనం అవుతుందని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కూడా చెప్పారు, జరిగిందా అని స్వామి ఎదురు ప్రశ్నించారు. మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం లేదని తెలుసుకొని స్వామి ఇలా మాట్లాడుతున్నారని కొందరు చిత్రించవచ్చు గాని వాస్తవం ఏమిటో వారు నోరు విప్పలేరు. ఈ సందర్భంగా దేశ ఆర్ధిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.

2022 నాటికి దేశ జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగం వాటాను 25శాతానికి పెంచే విధంగా మేక్‌ ఇన్‌ ఇండియా పధకాన్ని 2014లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీనికి గాను ఏటా 12-14శాతం చొప్పున ఈ రంగంలో వృద్ధి రేటు సాధిస్తామని చెప్పారు. ఎనిమిదేండ్ల తరువాత చూస్తే ఇరవై ఐదుశాతానికి పెంచే లక్ష్యం 2025కు చేరనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికోసం నడిపించిన ప్రహసనాలు ఎన్నో. తొలి రోజుల్లో నరేంద్రమోడీ ఎడతెరిపిలేకుండా విదేశాలు చుట్టి రావటం గురించి విమర్శ వస్తే దేశంలో పెట్టుబడులు సాధించేందుకు, విదేశాల్లో అడుగంటిన ప్రతిష్టను తిరిగి నెలకొల్పేందుకే పర్యటనలని అధికారపక్షం బుకాయించింది. ప్రపంచ బాంకు సులభతర వాణిజ్య సూచికలో మన స్ధానం 2014లో 134 ఉండగా 2019 నాటికి 63వ స్ధానానికి నరేంద్రమోడీ తీసుకుపోయారు. అంతిమంగా సాధించిందేమిటి అంటే డబ్బాకొట్టుకొనేందుకు రాంకు పనికి వచ్చింది తప్ప జరిగిందేమీ లేదు. జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి చేరే సంగతి అటుంచి మోడీ ఏలుబడిలోకి వచ్చేనాటికి ఉన్న 16.3శాతం కాస్తా 2020-21నాటికి 14.3శాతానికి దిగజారింది. కరోనా కారణంగా దిగజారింది అని ఎవరైనా బుకాయించవచ్చు, అసలు అంతకు ముందు పెరిగిందేమైనా ఉంటే కదా ? అందువలన 2025 నాటికి కనీసం 2014నాటి స్థితికైనా చేరతామా అన్నది ప్రశ్న.


ఈ దుస్థితికి కారణమెవరు? రెండు ఇంజన్ల పేరుతో కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నందున దిగజారుతున్న ఆర్ధిక దుస్థితికి వారే బాధ్యులు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్న మనం కరోనా వచ్చిన కారణంగా చైనాలో వృద్ధి రేటు తగ్గింది తప్ప మన మాదిరి తిరోగమనంలో లేదు.చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ప్రాణాంతకం కాకున్నా పరిమితంగా కేసులు నమోదైనప్పటికీ తాజాగా షాంఘై వంటి పట్టణాల్లో లాక్‌డౌన్‌ అమలు జరిపింది చైనా. మన దేశంలో అలాంటి పరిస్థితి లేకున్నా కరోనాకు ముందున్న ఆర్దిక వృద్ధి స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఎప్పటికి చేరుకుంటుందో కూడా చెప్పలేము.


దేశంలో పారిశ్రామిక రంగం దిగజారటం లేదా స్థిరంగా ఉంటున్న ధోరణి తప్ప పెరుగుదల కనిపించటం లేదు.2006 నుంచి 2012వరకు పారిశ్రామిక కార్మికులు ఏటా 9.5శాతం పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో అది 7.4శాతానికి దిగజారింది. నిజవేతనాల పతనం కారణంగా కరోనాకు ముందే వినియోగం కూడా తగ్గింది.2019లో వార్షిక ప్రాతిపదికన నిజవేతనాలు 2.8శాతం తగ్గగా 2020 జనవరి-మార్చి నెలల్లో తగ్గుదల 5.3శాతం ఉంది.సిఇడిఏ-సిఎంఐఇ సమాచారం ప్రకారం 2017-2021 మధ్య ఉత్పాదక రంగంలో కార్మికుల సంఖ్య ఐదు నుంచి 2.9కోట్లకు తగ్గింది. స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీల వేతన బిల్లు 2018 సెప్టెంబరులో రు.53వేల కోట్లుండగా 2020జూన్‌ నాటికి రు.48,500 కోట్లకు తగ్గింది.2021 సెప్టెంబరులో రు.60వేల కోట్లుగా ఉంది.ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే నిజవేతనాలు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉపాధి తగ్గటంతో పాటు నిజవేతనాల పతనం కారణంగా గత దశాబ్దిలో గృహస్తుల రుణాలు రెట్టింపైనట్లు ఎస్‌బిఐ నివేదిక వెల్లడించింది.2018 భారత రుణ-పెట్టుబడి నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 84శాతం రుణభారం పెరగ్గా పట్టణాల్లో 42శాతం ఉంది.


మేకిన్‌ ఇండియా పధకాన్ని ఉపాధి పెంపుదల, విదేశాలకు వస్తు ఎగుమతులు, మన దిగుమతులు తగ్గించే లక్ష్యంతో ప్రకటించారు. మన దిగుమతుల బిల్లు తగ్గిన దాఖలాలుగానీ, ఎగుమతులు పెరిగిన ఆనవాలు గానీ కనిపించటం లేదు.2021-22 బడ్జెట్‌లో ఆత్మనిర్భర పేరుతో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సహకాల కోసం కేంద్ర ప్రభుత్వం రు.1.97లక్షల కోట్లు కేటాయించింది. చిత్రం ఏమిటంటే ఈ పధకం కింద లబ్ది పొందేందుకు పరుగులు పెట్టాల్సిన కంపెనీలు మన దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. ఎగుమతుల కోసం విద్యుత్‌ వాహనాలను తయారు చేసేది లేదని, మీ ప్రోత్సాహం అవసరం లేదని ఫోర్డ్‌ కంపెనీ 2022 మే 12న ప్రకటించింది. ఇక్కడున్న ఉత్పాదక సౌకర్యాలను వేరే దేశాలకు తరలించనున్నట్లుగా తెలిపింది. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉన్న కారణంగా అమెరికా, చైనాల్లో తయారైన విద్యుత్‌ వాహనాలను మన దేశంలో విక్రయించరాదని మరుసటి రోజే టెస్లా నిర్ణయించింది. ఫోర్డ్‌ కంపెనీ మూత కారణంగా నాలుగువేల ఉద్యోగాలు ప్రత్యక్షంగానూ, దేశమంతటా దాని డీలర్లు పరోక్షంగా సృష్టించిన మరికొన్నివేల ఉద్యోగాలు పరోక్షంగా హరీమంటున్నాయి.2017తరువాత జనరల్‌ మోటార్స్‌, మాన్‌ ట్రక్స్‌, హార్లేడేవిడ్సన్‌,యునైటెడ్‌ మోటార్స్‌ మూతపడిన కారణంగా తమ పెట్టుబడి రు.2,485 కోట్లు హరీ మన్నదని, 64వేల మందికి ఉపాధి నష్టం జరిగిందని డీలర్స్‌ సంఘం పేర్కొన్నది.


విదేశాల్లో మన ప్రతిష్ట పెంచామని, పెట్టుబడులను ఆకర్షించినట్లు, సులభతర వాణిజ్య పరిస్థితిని కల్పించినట్లు నరేంద్రమోడీ అండ్‌ కో చెబుతున్నదానిలో ఆర్భాటం-వాస్తవమెంతో ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు చికాకు తెప్పిస్తున్నట్లు, వాటి బదులు ఏక రూప పన్నును అమలు చేస్తే ఉత్సాహంగా పెట్టుబడులు పెడతారంటూ జిఎస్‌టిని తెచ్చారు. అది కొన్ని రంగాలను దెబ్బతీసింది తప్ప పరిస్ధితిని చక్కదిద్దలేదన్నది తెలిసిందే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదికల ప్రకారం 2014-2021 కాలంలో నమోదైన విదేశీ కంపెనీల పెరుగుదల 2016లో 3.9శాతం ఉండగా 2021లో అది 1.5శాతానికి తగ్గింది.(216 నుంచి 63కు తగ్గాయి) ఇక చురుకుగా ఉండే కంపెనీలు ఇదే కాలంలో 80 నుంచి 66శాతానికి తగ్గాయి. ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనాను పక్కకు నెట్టేసి మన దేశం ఆవిర్భంచనుందని ఎనిమిదేండ్ల క్రితం ఊదరగొట్టారు. గతేడాది చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు మన దేశానికి రానున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ సిఎంల సమావేశంలో చెప్పారు. పత్రికలు అవి1000 అని రాశాయి. నిజమే అనుకొని కొందరు సిఎంలు సదరు కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచేందుకు సిద్దం అన్నారు. దీని ప్రహసనం 2021పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో వెల్లడైంది.”కరోనా అనంతర ఆర్ధిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ:భారత్‌కు సవాళ్లు,అవకాశాలు ” అనే శీర్షిక కింద చైనా నుంచి వస్తున్నట్లు చెప్పిన కంపెనీల గురించి ఏం చెప్పారో చూడండి.”’ మీడియాల వార్తల ద్వారా తెలుసుకున్నదేమంటే ఈ కంపెనీల్లో అత్యధికం తమ సంస్థలను వియత్నాం, థాయిలాండ్‌, తైవాన్‌ తదితర దేశాలకు తరలించాయి తప్ప భారత్‌కు వచ్చింది కొన్ని మాత్రమే.” అసలు పార్లమెంటరీ కమిటీ పత్రికా వార్తల మీద ఆధారపడటం ఏమిటి ? ప్రభుత్వం తగ్గర సమాచారం లేదా ? ఉంటే అలా రాసి ఉండేవారు కాదు. చైనా నుంచి కంపెనీలు వెలుపలికి రావటం, విదేశాల నుంచి వెళ్లి అక్కడ కంపెనీలు పెట్టటం కొత్త కాదు. జపాన్‌ నొమురా బాంకు 2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు చైనా నుంచి 56 కంపెనీలు వెలుపలికి తరలితే భారత్‌కు వచ్చింది కేవలం మూడే అని తెలిపింది. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపి) 2013 నుంచి 2022 వరకు వార్షిక పెరుగుదల సగటు 2.9శాతం, కాగా ఇదే కాలంలో జిడిపి సగటు 5.5శాతం ఉంది. అంతకు ముందు 2006 నుంచి 2012వరకు సగటు ఐఐపి 9శాతం ఉంది. సామర్ధ్య వినియోగం 2015 నుంచి 2022 వరకు 70.9శాతం ఉంది, అది పదేండ్ల క్రితం 80శాతం. అంటే ఉన్నదాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నాము. ఇదంతా మేకిన్‌ ఇండి పిలుపు తరువాత జరిగిందే సుమా !


తాను వస్తే జనాలకు మంచి రోజులు తెస్తానని మోడీ చెప్పారు. వాటికి వేతనాలు కీలకం. దేశంలో నిజవేతనాల రేటు పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. (అంకెలు శాతాలని గమనించాలి.) మొత్తంగా చూసినపుడు 2011-12కు ముందు ఉన్న పెరుగుదలతో పోల్చితే తరువాత కాలంలో గణనీయంగా తగ్గింది. రెగ్యులర్‌ సిబ్బందికి పెరగకపోగా తగ్గిపోవటాన్ని చూడవచ్చు.(ఆధారం ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, వర్కింగ్‌ పేపర్‌ 01-2020)
2004-05 నుంచి 2011-12 ×××××××× 2011-12 నుంచి 2017-18
తరగతి×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌ ×××మొత్తం×× కాజువల్‌××రెగ్యులర్‌
గ్రామీణ×××6.10 ×× 8.04 ×× 3.02 ××× 2.91 ×× 2.34 ×× -0.22
పట్టణ ×××4.55 ×× 6.42 ×× 4.10 ××× -1.49 ×× 1.10 ×× -2.05
పురుష ×××4.77 ×× 7.08 ×× 3.78 ××× 0.75 ×× 2.23 ×× -1.75
మహిళ×××7.92 ×× 8.24 ×× 4.87 ××× 2.31 ×× 1.34 ×× -1.38
మొత్తం ×××5.52 ×× 7.75 ×× 3.91 ××× 1.05 ×× 2.26 ×× -1.76
రైతాంగానికి 2022 నాటికి వారి ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది ప్రధాని నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలలో ఒకటి. అది నెరవేర్చకపోగా వారికి మొత్తంగా ఎసరు పెట్టి కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాలను రుద్దేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. ఏడాది పాటు చారిత్రాత్మకంగా జరిపిన పోరు నేపధ్యంలో క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని ప్రకటించి ఆరునెలలు దాటినా దాని ఊసే లేదు.
2015-16ను ప్రాతిపదికగా చేసుకొని 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పారు. దీనికి గాను ఏటా 10.4శాతం వార్షిక వృద్ది రేటు అవసరమని అంచనా. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఇంతవరకు సమగ్ర సమాచారమే లేదు.వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారంగా 2019 జనవరి-డిసెంబరు మధ్య సేకరించిన 77వ దఫా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వివరాలే ఉన్నాయి. దాని ప్రకారం 2012-13లో రైతు కుటుంబ నెలవారీ ఆదాయం సగటున రు.6,426 ఉండగా 2019నాటికి రు.10,218కి పెరిగింది. అంటే నరేంద్రమోడీ ప్రకటనతో నిమిత్తం లేకుండానే ఇది జరిగిందని గమనించాలి. అందువలన ఎలాగూ ఎంతో కొంత పెరుగుతుంది గనుక దాన్ని తన ఖాతాలో వేసుకోవచ్చన్న ఆలోచన బిజెపికి వచ్చిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.2019నాటి పెరుగుదల వివరాలను గమనిస్తే అసలు కథ తెలుస్తుంది. రైతులు తమ పొలంలో సాగుతో పాటు వేతన కూలీలుగా, కోళ్లు, పాడిపశువుల పెంపకం వంటి ఉప వృత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతారు.రైతుల ఆదాయవనరులు, వాటి తీరు తెన్నులు ఇలా ఉన్నాయి.నెలవారీ ఆదాయం రూపాయల్లో ఉంది.
వనరు×××××2012-13×××× 2018-19
వేతనం××××× 2,071 ×××× 4,043
పంటలు××××× 3,081 ×××× 3,798
పశుపాలన×××× 763 ×××× 1,582
ఇతరం ××××× 511 ×××× 795
మొత్తం××××× 6,426 ×××× 10,218
పై వివరాలను గమనించినపుడు వేతన, పశుపాలన ఆదాయం పెరుగుదల దాదాపు రెట్టింపు ఉంది.పంటల ఆదాయం ఆమేరకు లేదు. ఇతరంగా వచ్చే ఆదాయం అంటే కౌలు ద్వారా ఇతర అవసరాలకు భూమిని ఇవ్వటం ద్వారా పొందేది.2020-21 ఆర్ధిక సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం 2014-2021 సంవత్సరాల్లో పరిస్ధితి అంచనా సర్వే(ఎస్‌ఏఎస్‌) ప్రకారం రైతులకు వచ్చే ఆదాయంలో పంటల నుంచి వచ్చే మొత్తం 48 నుంచి 37శాతానికి తగ్గింది.వేతనం ద్వారా వచ్చే మొత్తం 32 నుంచి 40శాతానికి, పశుపాలన ద్వారా వచ్చేది 12 నుంచి 16శాతానికి పెరిగింది. దీన్ని బట్టి పంటలకు తగినంతగా మద్దతు ధర కల్పించకపోవటం, లేదా మార్కెట్‌ శక్తుల దోపిడీ కారణంగా రావాల్సినంత రాకపోవటంగానీ జరుగుతున్నది. ఈ కారణంగానే కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేసేందుకు దారి తీసే మూడు సాగు చట్టాల రద్దుకు రైతాంగం తీవ్రంగా పోరాడిందని, దానికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేసినట్లు భావించవచ్చు.ఆదాయంలో వేతనం ద్వారా పెరిగింది ఎక్కువగా ఉండటాన్ని బట్టి రైతులు కూలి మీద ఎక్కువ ఆధారపడుతున్నట్లుగా చెప్పవచ్చు.


రైతాంగ ఆదాయం రు.10,218 అన్నది దేశ సగటు. రాష్ట్రాల వారీ ఎగుడుదిగుడులు ఉన్నాయి.పద్దెనిమిది వేలు అంతకు మించి పొందున్నవారు మేఘాలయ, పంజాబ్‌, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్ము-కాశ్మీరుల్లో ఉండగా ఎనిమిదివేలకు తక్కువ వచ్చే వారు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, ఝార్కండ్‌లో ఉన్నారు. సాగు చట్టాలపై దేశమంతటా రైతులు ఒకే విధంగా స్పందించకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు, ఎక్కువ ఆదాయం పొందుతున్నవారిలో ఉన్న ఆందోళన తక్కువ పొందే వారిలో ఉండకపోవటం సహజం.


పంటల దిగుబడి పెంచటం ద్వారా రైతాంగ ఆదాయం పెంచవచ్చని కొందరు చెబుతారు. అది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సాగు ఖర్చులు స్థిరంగా ఉంటే దిగుబడి పెరిగితే రాబడి పెరుగుతుంది. కానీ దేశంలో ఆ పరిస్థితి ఉందా ? పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు ధరలు, వేతన, యంత్రాల వినియోగ ఖర్చు పెరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదన్న అభిప్రాయంతో అనేక మంది సాగుమాని కౌలుకు ఇవ్వటం వంటి వాటికి మరలుతున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితంతో పోల్చితే 2013-14లో ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 265.05మిలియన్‌ టన్నుల నుంచి 2021-22లో 305.43మి.టన్నులకు పెరిగిందని అంచనా. ఇదే కాలంలో వరి,గోధుమల కనీస మద్దతు ధరలు రెట్టింపు కాలేదు. వరి ధర రు.1,310 నుంచి 1,940, గోధుమలకు రు.1,400 నుంచి 2,015కు పెరిగింది. కేవలం 14శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధరల వలన లబ్దిపొందుతున్నట్లు అంచనా.కనీస మద్దతు, గిట్టుబాటు ధరలను కల్పించే బాధ్యతను తీసుకొనేందుకు మొరాయిస్తున్న పాలకులు రైతాంగానికి గిట్టుబాటు కల్పించే పేరుతో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారు. దీని వలన వ్యవసాయకార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడుతున్నది. మేకిన్‌ ఇండియా మాదిరిగానే రైతుల ఆదాయాల రెట్టింపు అన్నది ఒక కలగానే ఉంది.

ఈ విశ్లేషణ డివివిఎస్‌ వర్మ సంపాదకత్వంలో వెలువడిన మోడీ ”భార” తం ప్రత్యేక సంచికలో తొలుత ప్రచురితమైనది.

మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ భాగం ) : ఐదు లక్షల డాలర్ల జిడిపితో జనానికి ఒరిగేదేమిటి !

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


తాజాగా లీటరు పెట్రోలు మీద రు.8, డీజిలు మీద రు.6 కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించింది. అసల్లేనిదాని కంటే ఏమాత్రం తగ్గినా తగ్గినట్లే కదా అని సంతృప్తి చెందుతున్నారు కొందరు. దీని వలన కేంద్ర ప్రభుత్వం మీద లక్ష కోట్ల భారం పడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంటే ఏదో రూపంలో తిరిగి జనం మీదనే మోపుతారు. తమ మీద భారం భారం అంటూ మురిపిస్తూ జనం మీద మోపిన విపరీత భారాన్ని మరిపించాలని చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను స్ధంభింపచేశారు. తరువాత మార్చినెల 22 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు ధరలు పెంచారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 నుంచి 105.41వరకు, డీజిలు ధర రు.86.67 నుంచి 96.67వరకు పెరిగింది రాష్ట్రాల వాట్‌ను బట్టి అన్ని చోట్లా ఒకే రేట్లు ఉండవు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ఇప్పటి వరకు (ఇది రాసిన మేనెల 23వరకు) సవరించలేదు. బహుశా దీనికి శ్రీలంకపరిణామాలతో పాటు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో దేశంలో పెరుగుతున్న ధరలు కారణం అన్నది స్పష్టం. అంతకు ముందు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చమురు మీద కేంద్రం భారీగా విధించిన పన్నులను తగ్గించాలని ఆర్‌బిఐతో సహా అనేక మంది ఆర్ధికవేత్తలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదు. గత రెండు నెలల్లో పరిస్ధితి మరింతగా దిగజారింది. ఈ ధోరణి మరింతగా విషమించటం తప్ప మెరుగుపడే తీరు కనిపించకపోవటంతో కేంద్రం దిగివచ్చింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కూడా దీనికి కారణం కావచ్చు. అప్పటి వరకు చమురు ధరల స్ధంభన కానసాగించి తరువాత మొత్తంగా వడ్డించవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను సవరించకుండా నిలిపి తరువాత మొత్తాన్ని వసూలు చేసిన సంగతి తెలిసిందే.


అచ్చేదిన్‌ సంగతి గోమాత కెరుక ఇప్పుడున్న ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వీటి పర్యవసానాలతో మనం ఇంకా శ్రీలంకకు ఎంతదూరంలో ఉన్నాం అని జనం ఆలోచించే పరిస్ధితి వస్తుందని బిజెపి పెద్దలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ సింహళ (మెజారిటీ బౌద్దులు) హృదయ సామ్రాట్టుగా నీరాజనాలు అందుకున్న మాజీ అధ్యక్షుడు, ప్రధానిగా పని చేసిన మహింద రాజపక్స ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మహాభారతంలో రారాజుగా కీర్తి పొందిన ధుర్యోధనుడు చివరి రోజుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు మడుగులో దాగినట్లుగా మేనెల 10వ తేదీ నుంచి ట్రింకోమలీలోని నౌకాదళ కేంద్రంలో రక్షణ పొందుతున్నాడు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కుమారుడు నామల్‌ రాజపక్సతో కలసి మే 18వ తేదీన భద్రత నడుమ పార్లమెంటు సమావేశాలకు మహీంద రాజపక్స హాజరయ్యాడు. అతగాడు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. సింహళ మెజారిటీ జాతీయవాదాన్ని తలకు ఎక్కించుకున్న ఆ జనమే ఆర్ధిక సంక్షోభంతో తమ జీవితాలు అతలాకుతలం కావటంతో అదే మహింద రాజపక్స కనిపిస్తే చంపేస్తామంటూ వీధులకు ఎక్కిన దృశ్యాలు మెజారిటీ హిందూ హృదయ సామ్రాట్టులకు కనిపిస్తున్నాయా ? ఏమో !
జనానికి ఎంత భారం తగ్గినా మంచిదే కనుక ప్రభుత్వ చర్య మంచిదే అనుకున్నా పన్నుల పెంపుదల పూర్వపు స్ధాయికి చేరితేనే మరింత ఊరట కలుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులు తగ్గింపు ప్రకటన చేసినదాని కంటే – ఏమాటకామాటే చెప్పుకోవాలి -వాటి గురించి ఇచ్చిన వివరణకు నిజంగా ఆమెను అభినందించకతప్పదు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం చమురు మీద పెంచిన పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎలాంటి వాటా రాదు అని ఎందరు మొత్తుకున్నా బుకాయించి వాటి నుంచి 41శాతం వాటా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇస్తుందని వాట్సాప్‌ విశ్వవిద్యాలయం ద్వారా చేసిన కాషాయదళాలు చేసిన బోధనలను తలకు ఎక్కించుకున్న వారిని ఇప్పుడు తలలు దించుకోవటమే కాదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితిలోకి నిర్మలమ్మ నెట్టివేశారు. అలాంటి కనువిప్పు కలిగించినందుకు ఆమెకు నీరాజనాలు పలకాల్సిందే మరి. తాజా తగ్గింపు వలన రాష్ట్రాలకు వచ్చే వాటా ఏమాత్రం తగ్గదని, అవి వాటాలేని రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ ఖాతాకు చెందినవని ఆమె స్పష్టంగా చెప్పారు. సెస్‌లు దేనికోసం విధించారో అందుకోసమే ఖర్చు చేయాలి. సెస్‌ల విధింపును సమర్ధిస్తూ కాషాయదళాలు చేసిన వాదనలను ఒక్కసారి వారి బోధనలతో ప్రభావితమైన వారు గుర్తుకు తెచ్చుకోవాలి. గత మన్మోహన్‌ సింగ్‌ చేసిన చమురు(ఇరాన్‌కు) అప్పులు తీర్చేందుకు అని తొలుత చెప్పారు. తరువాత చమురు బాండ్లను తీర్చేందుకుఅన్నారు. గాల్వాన్‌ ఉదంతాల తరువాత సైనికులకు ఖర్చు చేసేందుకు చమురు పన్నువేశారంటే కాదన్న వారిని దేశద్రోహులుగా చిత్రించి జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.తొలుత మొరాయించి తరువాత కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేయాల్సి వచ్చే సరికి వీటన్నింటికీ పన్నులు వేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ఎదురుదాడి చేశారు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు చెప్పారు.


పెట్రోలు మీద 8, డీజిలు మీద ఆరు రూపాయల సెస్‌ తగ్గించినందుకు గాను కేంద్రం మీద ఏడాదికి లక్ష కోట్ల మేరకు భారం పడుతుందని, దాన్ని అప్పుల ద్వారా పూడ్చుతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే. చెంపదెబ్బ-గోడదెబ్బ మాదిరి చమురు పేరుతో రోడ్డు పన్ను మన నుంచి వసూలేగాక రోడ్ల మీద తిరిగినందుకు రోడ్డుపన్ను(టోల్‌టాక్సు) కూడా వసూలు చేశారని అనేక మంది ఆమె ప్రకటన తరువాత గ్రహించిన విద్యావంతులు గుండెలు బాదుకుంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చమురు పన్నుల రూపంలో ఎంత మోపిందో ప్రతిపక్షాలు, విశ్లేషకులు చెబితే జనాలకు ఎక్కలేదు, ఇప్పుడు నిర్మలమ్మే చెప్పారు గనుక నమ్మకతప్పదు.మోడీ ఏలుబడి ప్రారంభంలో పెట్రోలు మీద లీటరుకు రు.9.48 గా ఉన్నదానిని రు.32.98కి, డీజిలు మీద రు.3.56గా ఉన్నదానిని రు.31.83కు పెంచారు. అంటే ఇన్నేండ్లుగా జనాల నుంచి కేంద్రం ఎంత పిండిందో, తమ జేబులకు ఎంత చిల్లిపడిందో ఎవరికి వారు లెక్కలు వేసుకోవచ్చు.


గతేడాది కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు కొంతమేరకు తగ్గించినందుకు, ఆ మేరకు తగ్గించని రాష్ట్రాలు కూడా వెసులుబాటు కలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ కొద్ది వారాల క్రితం రాష్ట్రాల మీదకు జనాన్ని ఉసికొల్పారు. నిజం ఏమిటి ? మే 23వ తేదీ హిందూ పత్రిక వార్త ప్రకారం 2015-2021 మధ్య కేంద్ర పన్నులు జిడిపిలో 0.79 నుంచి 1.88శాతానికి పెరిగితే ఇదే కాలంలో రాష్ట్రాల పన్నులు 1.1 నుంచి 1.02శాతానికి తగ్గాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించేందుకు అంగీకరించలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇతరంగా ఏదో రీతిలో సర్దుబాటు చేస్తారు గనుక అవి మౌనంగా ఉన్నాయి. గతేడాది తగ్గించిన మొత్తాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇప్పటి వరకు పెట్రోలు మీద రు.13, డీజిలు మీద రు.16 తగ్గించింది.దీని వలన కేంద్రానికి రు.2,20,000 కోట్ల రాబడి తగ్గుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇది నాణానికి ఒకవైపు చూపటమే. రెండోవైపు చూస్తే 2014-15లో కేంద్రానికి చమురు రంగం నుంచి వచ్చిన వివిధ రకాల రాబడి రు.1,26,025 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లకు పెరిగింది. అంటే జనాల నుంచి ఎంత గుంజారో వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలోనే చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆమేరకు జనానికి తగ్గించకపోగా పన్నులు పెంచి చేసిన దోపిడీని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. వంద పెంచి 50 తగ్గించి చూశారా మా ఘనత అని నమ్మించేందుకు పూనుకున్నారు.


తగ్గింపు మేరకు ఏర్పడిన లోటు పూడ్చుకొనేందుకు అప్పు చేస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే, కేంద్రమే భారం భరిస్తుందని చెప్పలేదు. గతంలో యుపిఏ సర్కార్‌ చమురు సంస్దలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నగదుగా చెల్లించలేక కంపెనీలకు బాండ్ల రూపంలో ఇచ్చింది. ఆ మొత్తం రు.1.44లక్షల కోట్లు, దానికి వడ్డీ 70వేల కోట్లు. దాన్ని తప్పుపట్టటమే కాదు, ఆ బాండ్ల భారాన్ని తీర్చేందుకు అదనంగా పన్నులు వేయాల్సివచ్చిందని అప్పుడు చెప్పారు. ఇప్పుడు తగ్గించిన పన్ను మేరకు బాండ్ల ద్వారా అప్పులు చేస్తామని ఆర్దిక మంత్రి చెబుతున్నారు. రెండింటికీ తేడా ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? పోనీ నరేంద్రమోడీ పలుకుబడిని చూసి ఇప్పుడు తీసుకొనే అప్పుకు ఎవరైనా వడ్డీ లేకుండా ఇస్తారా ? తాము చేస్తే సంసారం, అదేపని ఇతరులు చేస్తే మరొకటా ? రేపు మరోసారి ఇదే సర్కార్‌ అప్పు తీర్చే పేరుతో మరిన్ని భారాలు మోపదని హామీ ఏమిటి ? పన్ను తగ్గించిన కారణంగా అప్పుతీసుకుంటామని సాకు చెబుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఎందుకు తీసుకున్నట్లు ? రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం రాబడి తగ్గితే గతంలో తగ్గించిన కార్పొరేట్‌ పన్నును తిరిగి పెంచాలి. ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల నుంచి అదనంగా రాబట్టాలి. వడ్డీ రేట్లు పెంచేందుకు బుర్రను పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. అప్పుకూడా అంతేగా, లేకపోతే కొత్తగా నోట్లు ముద్రిస్తారు. దానికీ పెద్దగా ఆలోచించాల్సినపనిలేదు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్ధంభింప చేసిన కారణంగా తమకు పెట్రోలు మీద లీటరుకు మే నెల 16వ తేదీ మార్కెట్‌ ప్రకారం రు.13, డీజిల్‌కు రు.24 నష్టం వస్తున్నదని రిలయన్స్‌-బిపి కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు మే 23వ తేదీ ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. తమకు ప్రతినెలా ఏడువందల కోట్ల మేరకు నష్టం వస్తున్నదని సదరు కంపెనీ చెబుతోంది. వారు చెప్పే అంకెలతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పీపా ధర 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంటున్నది. దేశంలో 83,027 పెట్రోలు బంకులుండగా రిలయన్స్‌-బిపికి 1,459, మరో ప్రయివేటు కంపెనీ నయారా ఎనర్జీకి 6,568 ఉన్నాయి.మిగిలినవన్నీ ప్రభుత్వ రంగ సంస్దలవే. ఏప్రిల్‌ ఆరు తరువాత మన దేశం కొనుగోలు చేసే చమురు ధరలో ఎగుడుదిగుడులున్నాయి. ఏరోజు ధరపెరిగితే ఆమరుసటి రోజు పెంచుతాము లేదా తగ్గితే తగ్గించే విధానం అమలు చేస్తున్నట్లు ప్రతి రోజూ ప్రకటించిన ధరల గురించి తెలిసిందే. మార్చినెల 28న మనం కొనే చమురు పీపా ధర 112 డాలర్లుంది. తరువాత అది వందకు పడిపోయింది, తరువాత పెరిగింది, తగ్గుతోంది, కానీ ఆ మేరకు సవరించకుండా ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి ధరలను స్ధంభింపచేశారు. ఎందుకిలా చేశారో జనానికి చెప్పాలా లేదా ?నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ మే 23న 77.66గా దిగజారింది. అంటే ముడి చమురు ధరలు స్ధిరంగా ఉన్నా మన మీద భారం పెరుగుతూనే ఉంటుంది.


ఉజ్వల పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మందికి ఏడాదికి గరిష్టంగా పన్నెండు సిలిండర్ల మీద రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు అందుకు గాను ఏడాదికి 6,100 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంటే ఒక్కొక్కరికి రు.2,400 అనుకున్నారు. కాని మంత్రి చెప్పిన దాన్ని సగటు లెక్కిస్తే రు.677 మాత్రమే. పెంచిన గాస్‌ ధరలు, గతంలో ఉన్న సబ్సిడీ కోతను చూస్తే ఇది పెద్ద లెక్కలోనిది కాదు. అసలు ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు 2020-21లో 90లక్షల మంది అసలు గాసే తీసుకోలేదు. కోటీ ఎనిమిది లక్షల మంది ఒకసారి తీసుకున్నారని సమాచార హక్కు కింద అడిగిన ఒక ప్రశ్నకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ వద్ద ఈ పధకం కింద 15.96శాతం మంది అసలు గాస్‌ తీసుకోలేదని భారత్‌ పెట్రోలియం,9.175లక్షల మంది తీసుకోలేదని హెచ్‌పి కంపెనీ తెలిపింది. గాస్‌ ధరలను భరించలేని కారణంగా ఉజ్వల పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు అసలు తీసుకోవటానికే ముందుకు రావటం లేదు. లేదా బినామీలకు అప్పగిస్తున్నారు.శ్రీలంక పరిణామాల నుంచి మన జనం ఏమి గ్రహించారో తెలియదు గానీ ఆకాశవాణి బిజెపి నేతలను ప్రత్యేకించి నరేంద్రమోడీని హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది.దాని పర్యవసానమే పరిమితంగా మరోసారి పన్ను తగ్గింపు అని ఎందుకు అనుకోకూడదు ?

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

హజ్‌ యాత్రీకుల కోసం నరేంద్రమోడీ పైరవీ – విజయన్‌పై నోరు పారవేసుకున్న పిసిసినేత !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు హజ్‌ యాత్ర సంబంధిత అంశాల గురించి కాషాయ దళాలు చేసిన, చేస్తున్న నానా యాగీ గురించి తెలిసినదే.మరోవైపు హిందూత్వ హృదయ సామ్రాట్టుగా నీరాజనాలందుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ భారత్‌ నుంచి హాజ్‌ యాత్రకు భారత్‌ నుంచి కోటా పెంచాలని, పురుషుల తోడు లేకుండా మహిళలను అనుమతించాలని కోరుతూ సౌదీ అరేబియాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని భారత్‌ హాజ్‌ కమిటీ అధ్యక్షుడు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన ఎపి అబ్దుల్లా కుట్టి స్వయంగా చెప్పారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కేరళ సందర్శించిన సందర్భంగా కోజికోడ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విశ్వాసులకు నరేంద్రమోడీ ఒక బోధకుడి వంటి వారని ఆకాశానికి ఎత్తారు.హజ్‌ యాత్రకు ప్రభుత్వం చేస్తున్న సాయం గురించి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో హజ్‌యాత్ర గురించి హంగామా చేసే వారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని అబ్దుల్లాకుట్టి ఆరోపించారు. అబ్దుల్లా కుట్టి గతాన్ని చూస్తే సిపిఎం తరఫున ఎంపీగా ఎన్నికై 2008లో నరేంద్రమోడీని పొగడటంతో పాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బహిష్క్‌రణకు గురైన తరువాత కాంగ్రెస్‌లో చేరారు.ఆ పార్టీలో ఉంటూ 2019లో మరోమారు నరేంద్రమోడీని పొగటంతో కాంగ్రెస్‌ కూడా సాగనంపింది. అక్కడి నుంచి బిజెపి ఆశ్రయం పొందారు.నరేంద్రమోడీని పొగడటంలో అబ్దుల్లాకుట్టి పేరుమోశారు. కోజికోడ్‌ సభలో దాని కొనసాగింపుగానే పొగడ్తలు కురిపించిన తీరు మీద నెటిజన్లు తరువాత అబ్దుల్లాకుట్టితో ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో నష్ట నివారణ చరó్యకు పూనుకున్నారు. కోజికోడ్‌ సభలో హజ్‌ యాత్రకు సంబంధించి నరేంద్రమోడీ గురించి చెప్పిన మాటలు తప్పిదమేనని, నోరు జారినట్లు పది రోజుల తరువాత సంజాయిషి ఇచ్చుకున్నారు. తాను సభలో మాట్లాడుతున్నపుడు తమ నేత కృష్ణదాస్‌ తనకు మంచి నీరు ఇచ్చారని, తాగిన తరువాత తన ప్రసంగం అదుపు తప్పిందని అబ్దుల్లా కుట్టి చెప్పినట్లు కేరళ కౌముది పత్రిక రాసింది.


అబ్దుల్లాకుట్టిని హజ్‌కమిటీ జాతీయ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మేనెల మొదటి వారంలో ఒక సంస్ధ ఇచ్చిన ఇప్తార్‌ విందు, కుట్టి అభినందన కార్యక్రమానికి ముస్లిం లీగు నేతలు కొందరు హాజరుకావటం వివాదాస్పదమైంది. ఎవరూ అభినందన సభలకు హాజరు కావద్దని లీగ్‌ నాయకులు ఆదేశించిన తరువాత ఇది జరిగింది. అది అభినందన సభగా మారుతుందని తమకు తెలియదని ఇప్తార్‌ ఇచ్చింది తమ బంధువు కావటంతో వెళ్లినట్లు లీగు కన్నూరు జిల్లా కార్యదర్శి తాహిర్‌ సంజాయిషి ఇచ్చుకున్నారు.


మరోమారు నోరు పారవేసుకున్న పిసిసి అధ్యక్షుడు కె సుధాకరన్‌
కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె సుధాకరన్‌కు నోటి దురుసు ఎక్కువ. ఒక కల్లుగీసేవాడి కొడుకు హెలికాప్టర్లలో తిరుగుతున్నాడంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై గతంలో నోరు పారవేసుకున్నారు. తన తండ్రి ఒక గీత కార్మికుడు, తన అన్న ఇప్పటికీ గీత వృత్తిమీదనే బతుకుతున్నాడని, అలాంటి కష్టజీవుల కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని అప్పుడు విజయన్‌ తిప్పికొట్టారు. తాజాగా త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా సుధాకరన్‌ మాట్లాడుతూ గొలుసు తెంచుకున్న కుక్క మాదిరి విజయన్‌ త్రిక్కకర నియోజకవర్గంలో తిరుగుతున్నారంటూ మరోసారి అదేపని చేశారు. ఒక డివైఎఫ్‌ఐ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలారివట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నేత నోటవెలువడిన సంస్కారహీనమైన పదజాలాన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ సమర్ధించారు. కన్నూరు ప్రాంతంలో అలాంటి పదజాలం సాధారణమే కనుక తప్పేంలేదని వెనుకేసుకు వచ్చారు. విజయన్‌ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నందున అలా అన్నానని, దానికి ఎవరైనా బాధపడితే మాటలను వెనక్కు తీసుకుంటానంటూ సుధాకరన్‌ అహంకారంతో మాట్లాడారు.


ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి, త్రిక్కకర అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత ఎంబి మురళీధరన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సిపిఎం అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. ఎల్‌డిఎఫ్‌తో కలసి పని చేస్తానని చెప్పారు. 2020 ఎన్నికల్లో ఓడిపోక ముందు కొచ్చి కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. త్రిక్కకర ఉప ఎన్నికల్లో చర్చి నిలిపిన అభ్యర్ధులెవరూ లేరని ఏ ఎన్నికలోనూ ఎప్పుడూ ఒక అభ్యర్ధికి మద్దతు ఇవ్వలేదని సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ జార్జి అలంచెరీ చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమా థామస్‌, మాజీ సిఎం ఊమెన్‌ చాందీ తదితర కాంగ్రెస్‌ నేతలు అలంచెరీని కలసి మద్దతు ఇవ్వాలని కోరారు. తరువాత అలంచెరీ విలేకర్లతో మాట్లాడారు. సిపిఎం అభ్యర్ధి డాక్టర్‌ జో జోసెఫ్‌ను చర్చికి సంబంధించిన భవనంలో అభ్యర్ధిగా ప్రకటించటం గురించి అడగ్గా అదొక యాదృచ్చిక ఘటన తప్ప చర్చికి దానికి సంబంధం లేదన్నారు. డాక్టర్‌ జోసెఫ్‌ పని చేస్తున్న ఆసుపత్రి ఒక చర్చి నిర్వహణలో ఉంది, ఆ ఆసుపత్రిలోనే మీడియాకు అభ్యర్ధిత్వాన్ని వెల్లడించారు. దాంతో ఇంకేముంది చర్చి తరఫునే నిలుపుతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీని వెనుక పెద్ద కుట్ర వుందంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఎన్నికలో సిపిఎం, కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్ధులతో పాటు ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు.


పన్నెండు జిల్లాల్లోని స్ధానిక సంస్ధల వార్డులకు గతవారంలో జరిగిన ఉపఎన్నికల్లో 42కు గాను 24 చోట్ల సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గెలిచింది.కాంగ్రెస్‌కు 12, బిజెపికి ఆరు వచ్చాయి. ఎన్నికల్లో 31పంచాయతీ, ఏడు మున్సిపాలిటీ, రెండు కార్పొరేషన్‌ వార్డులకు పోలింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ మొత్తం మీద గతంలో ఉన్ని ఎనిమిది వార్డులను కోల్పోయింది. ఎల్‌డిఎఫ్‌ నుంచి మూడు సీట్లను కాంగ్రెస్‌, రెండింటిని బిజెపి గెలుచుకుంది.కొన్ని చోట్ల కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి కూడా రెండు స్దానాలను కోల్పోయింది.


సిపిఎం నేతల సమక్షంలో మతాంతర వివాహం
కోజికోడ్‌ జిల్లా కొడంచెరికి చెందిన భిన్న మతాలకు చెందిన ఎంఎస్‌ షెజిన్‌, జోస్నా మేరీ జోసెఫ్‌ సిపిఎం కార్యకర్తల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఏప్రిల్‌ నెలలో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవటం పెద్ద వివాదానికి దారి తీసింది. లవ్‌ జీహాద్‌ పేరుతో కొందరు రెచ్చగొట్టేందుకు చూశారు. షెజిన్‌ కన్నోత్‌ ప్రాంత డివైఎఫ్‌ఐ కార్యదర్శి, స్దానిక సిపిఎం కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహం జరిగింది. డివైఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ సభ్యుడు దీపు ప్రేమనాధ్‌,తిరువంబాడి సిపిఎం ఏరియా కమిటీ సభ్యులు షిజి అంటోనీ, కెపి చాకోచన్‌ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తెను బలవంతం, బందీగా చేసి వివాహానికి ఒప్పించినట్లు ఆరోపిస్తూ జోస్నా మేరీ తండ్రి జోసెఫ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర వెలుపలి సంస్ధతో విచారణ జరిపించాలని కోరారు. జోస్నాను కోర్టుకు రప్పించి తండ్రి ఆరోపణ నిజమేనా అని ప్రశ్నించగా తాను మేజర్‌నని, తననెవరూ బలవంతపెట్టలేదని ఆమె చెప్పటంతో కోర్టు ఆ పిటీషన్‌ కొట్టివేసి వివాహానికి అనుమతించింది. దాంతో మరుసటి రోజే వివాహం చేసుకున్నారు.ఈ వివాహం వలన స్దానికంగా పార్టీకి దగ్గర అవుతున్న కైస్తవ సామాజిక తరగతిని దూరం చేస్తుందని సిపిఎం మాజీ ఎంఎల్‌ఏ జిఎం థామస్‌ చెప్పటాన్ని సిపిఎం తప్పు పట్టటమే కాదు తగని పని బహిరంగంగా అభిశంచింది. తాను తప్పుమాట్లాడినట్లు థామస్‌ అంగీకరించటంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఈ ఉదంతంలో లబ్దిపొందేందుకు బిజెపి చూసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ జోస్న తలిదండ్రులను కలసి కేంద్ర సంస్దలతో దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపారు. దీని వెనుక పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా హస్తం ఉందని ఆరోపించారు. మీ కుమార్తె ఆ సంస్ధ అలప్పూజ ఆఫీసులో ఉంటుందని అన్నాడు. కొందరు పగలు డివైఎఫ్‌ఐ కార్యకర్తలుగాను వారే రాత్రి ఫ్రంట్‌ కార్యకర్తలుగా ఉంటారని ఆరోపించారు.

ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


భారీ ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ కోరుకుంటున్నదనటం పశ్చిమ దేశాల ప్రచారంలో భాగమని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు నోమ్‌ చోమ్‌ స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పదే పదే రాజకీయ పరిష్కారం కావాలని చెప్పటం, నాటో సభ్యత్వ కోరికను వదులుకుంటామని, తటస్ధంగా ఉంటామని చెప్పిన అంశాలు అమెరికా-బ్రిటన్‌ ప్రచార వ్యవస్ధ నుంచి మనకు ఎక్కడా వినిపించవు అని చోమ్‌ స్కీ అన్నారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని పరిష్కరించేందుకు తోడ్పడే విధంగా పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదా ప్రతిపాదనలు గానీ లేవు. దానికి బదులు తమ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలను అందించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట ఆలోచనను కనపడకుండా చేసేందుకు రష్యా గురించి అనేక తప్పుడు ప్రచారాలను వ్యాపింప చేస్తున్న అంశం తెలిసిందే.
అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు భౌతికదాడుల్లో పాల్గొనటమే కాదు, వాటితో పాటు తప్పుడు ప్రచారదాడులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. అందుకోసం భారీ ఖర్చు, నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకొని అదే తరహాలో మన దేశంలో అనేక సంస్ధలు ప్రత్యేకించి- సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన వివిధ సంస్ధలు, పలు ముస్లిం సంస్ధలకు చెందిన వారు పరస్పరం రెచ్చగొట్టేందుకు వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. మెజారిటీ, మైనారిటీ మతోన్మాద ప్రచారం అనేక మంది మెదళ్లను విద్వేషానికి, భౌతికదాడులకు అనువైనదిగా మారుస్తున్నది.


కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లింలను సమీకరించటం, కమ్యూనిజం, పూర్వపు సోవియట్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు, చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచటంతో సహా పలు ఎత్తుగడలతో బ్రిటన్‌ విదేశాంగశాఖ ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్‌ రిసర్చ్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఆర్‌డి) విభాగం సాగించిన దుర్మార్గాలకు సంబంధించిన పత్రాలను ఇటీవల బహిర్గతం చేశారు. వాటి నుంచి పరిశోధకులు తవ్వినకొద్దీ అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, గతవారంలో కొన్నింటిని విశ్లేషకులు వెల్లడించారు. 1960దశకంలో ఇండోనేషియాలో లక్షలాది మంది కమ్యూనిస్టులు, సానుభూతి పరులను ఊచకోత కోసేందుకు అక్కడి ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టటంలో బ్రిటన్‌ ఐఆర్‌డి ప్రచార అంశాలు ప్రధానంగా దోహదం చేసినట్లు తేలింది. అధ్యక్షుడు సుకర్ణో, విదేశాంగ మంత్రి సుబాంద్రియో కమ్యూనిస్టుల పట్ల సానుకూలంగా ఉండటంతో పాటు బ్రిటీష్‌ వారు రూపొందించిన మలేషియా ఫెడరేషన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. వారిని కొనసాగనిస్తే ఇండోనేషియా కూడా సోషలిస్టు దేశంగా మారుతుందనే అంచనాతో అమెరికా, బ్రిటన్‌ కుట్ర చేసి తిరుగుబాటుకు మిలిటరీని ప్రోత్సహించాయి. దాన్ని సమర్ధించుకొనేందుకు అనువుగా తప్పుడు ప్రచారం సాగించాయి. సుకర్నో, సుబాంద్రియోలను, చైనా జాతీయులను బతకనిస్తే కమ్యూనిస్టు చైనా ఏ క్షణంలోనైనా ఇండోనేషియాను ఆక్రమిస్తుందని, మిలిటరీతో పాటు దేశంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులను, మతశక్తులను రెచ్చగొట్టేందుకు వందలాది కరపత్రాలను పంపిణీ చేశారు.


సిఐఏ, బ్రిటీష్‌ ఎం16 ఏజంట్లు రూపొందించిన కుట్రలో భాగంగా ఆరుగురు మిలిటరీ అధికారులను కిడ్నాప్‌ చేసి వారిని హత్యగావించి ఆ పని చేసింది కమ్యూనిస్టులే అని ప్రచారం చేసి దాడులకు రంగాన్ని సిద్దం చేశారు. కమ్యూనిస్టుల మీద చర్యలు తీసుకుంటే అమాయక చైనీయులు కొందరు ఇబ్బందిపడినప్పటికీ, వారే కారకులని గుర్తించినందున అంతం చేయకతప్పదని రేడియో ప్రసారాలు, ఆ కరపత్రాల్లో రెచ్చగొట్టారు.ప్రవాసంలో ఉన్న జాతీయవాదులైన ఇండోనేషియన్ల పేరుతో సింగపూర్‌లో తిష్టవేసిన ఐఆర్‌డి నిపుణులు రాసిన సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు.1965 అక్టోబరులో ఊచకోతలను ప్రారంభించే ముందు కమ్యూనిస్టులను అంతమొందించాలని ప్రేరేపించారు. ఈ దుర్మార్గంలో తమ పాత్ర లేదని బ్రిటన్‌ దశాబ్దాల తరబడి చెప్పుకున్నది, నాటి పత్రాలు వెల్లడి కావటంతో దాని దుర్మార్గం నిర్ధారితమైంది. కమ్యూనిస్టుల నుంచి దేశాన్ని కాపాడేపేరుతో మిలిటరీ అధికారి సుహార్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.అధ్యక్షుడు సుకర్ణోను బందీగా పట్టుకొని సుకర్ణో పేరుతోనే ఊచకోతకు పాల్పడ్డాడు. తరువాత 1967లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని 32 సంవత్సరాలు నిరంకుశపాలన సాగించాడు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం కోసం 1948లో నాటి లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఐఆర్‌డిని ఏర్పాటు చేసింది. అరబ్బు ప్రాంతం, ఆఫ్రికా, ఆసియాల మీద ప్రధానంగా ఇది కేంద్రీకరించింది.తప్పుడు వార్తలు,నకిలీ పత్రాలను ప్రచారంలో పెట్టటం వంటి పలు రూపాల్లో అది ప్రచారదాడులు చేసింది. తన ప్రచారాన్ని ఆకర్ణణీయంగా మార్చేందుకు యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టటం, జాత్యహంకారం, ముస్లిం మనోభావాల వంటి వాటినన్నింటినీ అది ఉపయోగించుకుంది. ఐఆర్‌డి ఏజంట్లు తెరవెనుక ఉండి స్వతంత్ర సంస్ధల పేరుతో కొన్నింటిని సృష్టించి ఆ పేరుతో తాము రూపొందించిన తప్పుడు సమాచారాన్ని మీడియా, పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు, అనేక సంస్ధలకు అందచేసేవారు. తాము బురద జల్లదలచుకున్న దేశాలు, సంస్ధల పేరుతో వాటిని రూపొందించేవారు. సోవియట్‌ వార్తా సంస్ధ నొవొస్తి విడుదల చేయాల్సిన సమాచారాన్ని ఫోర్జరీ చేసి పదకొండుసార్లు ఐఆర్‌డి ప్రచారంలో పెట్టినట్లు తేలింది. వాటిలో ఒకటి ఈజిప్టుకు మిలిటరీ సాయాన్ని వక్రీకరించటం. 1967లో ఇజ్రాయెల్‌తో ఈజిప్టు జరిపిన ఆరు రోజుల యుద్దంలో చేసిన సాయం వృధా అయినట్లు సోవియట్‌ నుంచి వెలువడిన వార్త పేర్కొన్నట్లు ప్రచారం చేశారు. ఇంతేకాదు అరబ్బు దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్ద పేరుతో కూడా నకిలీవార్తలను సృష్టించారు. ఈజిప్షియన్లను తిరోగామి ముస్లిం మూఢనమ్మకాలను పాటించేవారుగా చిత్రించి చెడు మాటలు మాట్లేడే నాస్తికులు, సోవియట్లు ప్రచారం చేస్తున్నారని బురదజల్లుతూ ముస్లిం బ్రదర్‌హుడ్‌ పేరుతో ప్రచారంలో పెట్టారు.ఇజ్రాయెల్‌తో పోరులో అరబ్బుల ఓటమికి విశ్వాసం లేకపోవటమే కారణమంటూ ఆ సంస్ధ పేరుతో రెచ్చగొట్టారు. యూదులకు మాతృదేశం పేరుతో ఇజ్రాయెల్‌ సృష్టికి బాటలు వేసిన, కుట్రలు చేసిన వారిలో బ్రిటన్‌ది ప్రధాన పాత్ర అన్న సంగతి తెలిసిందే. ఐఆర్‌డి తాను రూపొందించిన నకిలీవార్తలను నిజమని భావించేేందుకు, ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే వారే వాటిని ప్రచారంలో పెట్టినట్లు నమ్మించేందుకు ఈజిప్షియన్లు నేరుగా యూదుల మీద ఎందుకు దాడులకు దిగటం లేదని రెచ్చగొడుతూ రాసేవారు.


ఆఫ్రికా దేశాల్లో సోవియట్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు సోవియట్‌ అనుకూల సంస్దల పేర్లతోనే ప్రచారం చేశారు. ఆఫ్రికన్లు అనాగరికులని ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య వర్ణించినట్లు ఒక వార్తను ఐఆర్‌డి ప్రచారంలో పెట్టింది.సోవియట్‌ విశ్వవిద్యాలయాల్లో చేరిన ఆఫ్రికన్‌ విద్యార్ధులకు చదువు సంధ్యలు రావని తూలనాడినట్లుగా కూడా ప్రచారం చేసింది. ఈ తప్పుడు ప్రచార సంస్ధను ఉపయోగించటంలో లేబర్‌, కన్సర్వేటివ్‌ పార్టీలు దేనికి ఏదీ తీసిపోలేదు. సోవియట్‌కు చేరువ అవుతున్న ఆఫ్రికా దేశమైన ఘనా సంగతి చూడాలని 1964లో కన్సర్వేటివ్‌ ప్రధాని అలెక్‌ డగ్లస్‌ ఆదేశించాడు. కొద్ది నెలల తరువాత చైనా – ఆఫ్రికన్ల మధ్య జాతులపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని లేబర్‌ పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రి పాట్రిక్‌ గార్డన్‌ వాకర్‌ కోరాడు. 1977లో ఈ సంస్దను రద్దుచేసినట్లు ప్రకటించారు. మరొక పేరుతో అదే ప్రచారదాడులను కొనసాగిస్తున్నారు. తప్పుడు సమచారాన్ని ఎదుర్కొనేందుకు కొత్త సంస్దను ఏర్పాటు చేస్తున్నట్లు 2022 ఫిబ్రవరిలో బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. ఆమె ప్రకటన తరువాత అదే నెలలో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ పరిణామం గురించి పశ్చిమదేశాల సంస్ధలు ఎన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నదీ తెలిసిందే. వాటిలో బ్రిటన్‌ ఒక ప్రధాన పాత్రధారి.


సోవియట్‌ ప్రచారాన్ని అడ్డుకొనే పేరుతో అమెరికా , బ్రిటన్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలు జరిపిన దుర్మార్గాలు, ప్రచారదాడి గురించి ప్రపంచానికి తెలిసింది స్వల్పమే. ఐఆర్‌డి సంస్ధలో 360 మంది పని చేశారు.వారి పని కమ్యూనిజం, సోవియట్‌ ముప్పు గురించి కల్పిత నివేదికలను తయారు చేసి వివిధ ప్రభుత్వాలకు, ఎంపిక చేసిన జర్నలిస్టులు, మేథావులకు పంపటం. వాటికి విశ్వసనీయత కల్పించేందుకు బ్రిటన్‌ గూఢచార, భద్రతా సంస్దలు అందచేసిన అంశాలను కూడా జోడించి స్వతంఐత్ర సంస్దల పేరుతో వాటిని పంపేవారు. అ సంస్ధలు కూడా ఐఆర్‌డి ఏర్పాటు చేసినవే. వాటిలో 1964లో ఏర్పాటు చేసిన ” కమ్యూనిస్టు అనుబంధ సంఘాల గురించి శోధించే అంతర్జాతీయ కమిటీ ” ఒకటి. ఇది మరొక సంస్దను ఏర్పాటు చేసింది. దాని పేరు విశ్వాసుల సభ (లీగ్‌ ఆఫ్‌ బిలీవర్స్‌). దీని పనేమిటంటే రష్యన్లకు దేవుడి మీద విశ్వాసం లేదు, అరబ్బుల ఓటమికి దేవుడి మీద సరైన విశ్వాసం లేకపోవటమే అంటూ పచ్చి మతోన్మాదాన్ని ప్రచారంలో పెట్టటం, అలాంటి వారి మన్నన పొందటం లక్ష్యంగా ఉండేది. అది ప్రచారంలో పెట్టినదానిలో ఒక అంశం ఇలా ఉంది.” ఈ తరుణంలో అరబ్‌ జాతి ఇంతగా ఎందుకు విచారంలో ఉంది ?విపత్తుకు గురైంది ? ధైర్యవంతులైన అరబ్బు శక్తులు జరిపిన జీహాద్‌లో దుష్ట యూదుల చేతిలో ఎందుకు ఓడిపోయారు ? సమాధానాలు కనుగొనటం సులభమే ! మనం గతంలో అనుసరించిన సరైన మార్గం నుంచి వైదొలుగుతున్నాము. మతం ఒక సామాజిక జబ్బు అని భావించే కమ్యూనిస్టులు-నాస్తికులు మనకు సూచించిన మార్గంలో మనం వెళుతున్నాము.” అని పేర్కొన్నారు, అంటే కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు దూరంగా ఉండాలని ముస్లింలను రెచ్చగొట్టటమే ఇది. ఇలాంటి రాతల్లో ఇజ్రాయెల్‌ మీద వ్యతిరేకతను చొప్పిస్తారు. వాటిని చూసి సామాన్య అరబ్బులు సహజంగానే తమ హితం కోరేవారు చెబుతున్నట్లుగా భావించేవారు.


ఐఆర్‌డి సంస్ధ ఒక్క కమ్యూనిస్టుల మీదనే కాదు బ్రిటన్‌ ప్రయోజనాలు ఉన్న ప్రతి చోటా జోక్యం చేసుకుంది.ప్రస్తుతం జింబాబ్వేగా పిలుస్తున్న దేశం ఒకనాడు బ్రిటీష్‌ వలస ప్రాంతం. 1965లో ఇయాన్‌ స్మిత్‌ రొడీషియా పేరుతో స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. స్మిత్‌ను వ్యతిరేకించే వారి పేరుతో ఐఆర్‌డి ఒక నకిలీ గ్రూపును ఏర్పాటు చేసింది. తాజా పరిస్ధితిని చూస్తే గతంలో సాగించిన మాదిరే ఇప్పుడూ ప్రచారం చేస్తున్నారు. చైనాలో ముస్లింలను అణచివేస్తున్నారని రోజూ వినిపిస్తున్న కట్టుకథలు అలాంటివే. రుణాల పేరుతో చైనా బలహీన దేశాలను ఆక్రమిస్తున్నదన్నదీ దానిలో భాగమే. కనుక వాట్సాప్‌, టీవీ, పత్రికల్లో వచ్చే వాటిని గుడ్డిగా నిజమని భావించరాదు !

వందేళ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


యువత దేశభక్తి, నవ ప్రవర్తకులుగా ముందుకు సాగాలని కష్టాలు వచ్చినపుడు తప్పుదారి పట్టటం, బెదిరిపోరాదని చైనా అధినేత షీ జింపింగ్‌ మేనెల పదిన పిలుపు నిచ్చారు. చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌ (సివైఎల్‌సి) శతవార్షికోత్సవం బీజింగ్‌లోని గ్రేట్‌హాల్లో ఘనంగా జరిగింది. ఆ సభలో జింపింగ్‌ పాల్గొని సందేశమిచ్చారు.చరిత్రను పరిశీలించినా, వాస్తవాన్ని చూసినా చైనా యువజనోద్యమంలో కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌ ముందున్నదని, దేశం కోసం స్వార్దరహితంగా పని చేసి ముందుకు తీసుకుపోవాలని కోరారు. ప్రతి దేశానికి, ప్రపంచానికి యువతదే భవిష్యత్‌ అని తన కుటుంబం అనిగాక మానవాళి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత కుదిరిన వర్సెయిల్స్‌ ఒప్పందంలో భాగంగా జర్మనీ ఆక్రమణలో ఉన్న తూర్పు చైనాలోని షాండోంగ్‌ ప్రాంతాన్ని జపాన్‌కు అప్పగించారు. ఈ ఒప్పందంపై చైనా పాలకుల లొంగుబాటును నిరసిస్తూ ప్రారంభమైన జాతీయోద్యమం నూతన చైనా ఆవిష్కరణకు నాంది పలికింది. 1919 మే నాలుగున పెద్ద ఎత్తున విద్యార్దులు బీజింగ్‌లోని తియనన్‌మెన్‌ మైదానంలో ప్రదర్శన జరిపారు. దీన్ని మే ఉద్యమంగా పిలిచారు. అప్పటికే జాతీయవాదులుగా ఉన్న వారు లొంగుబాటును నిరసిస్తూ కొత్త బాటలో పోరు సల్పేందుకు కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.ఆ ఉద్యమంలో పాల్గొన్నవారే చైనా యువజనోద్యమాన్ని ప్రారంభించారు. మే నాలుగు ఉద్యమం 1911 విప్లవం కంటే ఒక అడుగు ముందుకు వేసిందని,కమ్యూనిస్టు విప్లవంలో అది ఒక దశ అని దాని ప్రాముఖ్యత గురించి మావో చెప్పారు.1920లో ప్రారంభమైన చైనా సోషలిస్టు యూత్‌లీగ్‌ స్ధాపక కార్యదర్శి యు షీసాంగ్‌ 1922వరకు కొనసాగారు. బీజింగ్‌లో మొగ్గతొడిగిన ఈ సంస్ధను దేశమంతటా విస్తరిస్తూ 1921 జూలైలో అధికారికంగా ప్రకటించారు. తరువాత 1922లో తొలిమహాసభ మే 5-10 తేదీలలో జరిగింది. తరువాత కాలంలో మే ఐదవ తేదీని చైనా యువజన దినంగా ప్రకటించారు. తరువాత 1925లో జరిగిన మూడవ మహాసభలో సంస్ధ పేరును కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత దేశంలో తలెత్తిన పరిస్ధితి, రాజకీయాల నేపధ్యంలో చైనీస్‌ న్యూ డెమోక్రసీ యూత్‌లీగ్‌గా కొత్త పేరు పెట్టారు. 1957 మే నెలలో తిరిగి కమ్యూనిస్టు యూత్‌లీగ్‌గా మార్చారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో హు యావోబాంగ్‌, హు జింటావో కమ్యూనిస్టు పార్టీ అధినేతలుగా, దేశాధ్యక్షులుగా పని చేశారు. గడచిన వంద సంవత్సరాల్లో ఇప్పటి వరకు మొత్తం 17 మంది జాతీయ కార్యదర్శులుగా పని చేశారు. వారిలో హు యావోబాంగ్‌ సుదీర్ఘకాలం 1953 నుంచి 1978వరకు ఉన్నారు. ఈ కాలంలోనే 1968 నుంచి 78వరకు సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న వైఖరి కారణంగా సంస్ధ కార్యకలాపాలను రద్దు చేశారు. 1964 తరువాత మహాసభలు జరగలేదు. 1978 నుంచి తిరిగి క్రమంగా సభలు జరుపుతున్నారు. ప్రస్తుతం 2018లో ఎన్నికైన హి జంకే కార్యదర్మిగా ఉన్నారు.


కమ్యూనిస్టు యూత్‌లీగ్‌లో ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా సభ్యులున్నారు.పద్నాలుగు సంవత్సరాలలోపు వారిని సంఘటితం చేసే బాధ్యతలను కూడా ఈ సంస్ధే నిర్వహిస్తున్నది. అనేక దేశాలలో యువత మాదిరి చైనాలో ఎందుకు యువతరం ఉద్యమాలు నిర్వహించటం లేదంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు వాపోతుంటారు. తామే తుమ్మి తామే తథాస్తు అనుకున్నట్లుగా చైనా గురించి ప్రత్యేకించి సంస్కరణలు అమలు చేస్తున్న 1978 నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు చైనా కుప్పకూలిపోతుందని జోశ్యాలు చెప్పిన వారందరూ బొక్కబోర్లా పడ్డారు.1989లో తియనన్‌మెన్‌ మైదానంలో కొందరు తప్పుదారి పట్టిన విద్యార్దులు చేపట్టిన ఆందోళనను తూర్పు ఐరోపా దేశాల్లో మాదిరి వినియోగించుకొనేందుకు పశ్చిమ దేశాలు చూసినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం విద్యార్దులతో సహనంగా వ్యవహరించి ముగింపు పలికింది. పశ్చిమ దేశాల కుట్రలను వమ్ముచేసింది.


ప్రతి సమాజంలో కొందరు అసంతృప్తవాదులు, భిన్న అభిప్రాయాలు, అవలక్షణాలు కలిగిన వారు ఉన్నట్లుగానే చైనాలో కూడా ఉండటం సహజం. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే పక్కదారి పట్టరు, ఉద్యమాలతో పని ఉండదు. చైనా కొత్తతరంలో తలెత్తిన పశ్చిమ దేశాల క్షీణ సంస్కృతి విస్తరించకుండా అక్కడి సమాజం, ప్రభుత్వం చూస్తున్నది. మొత్తం మీద సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న యువత సహకారం, భాగస్వామ్యం కారణంగానే అమెరికా, ఇతర దేశాలు అనేక ఆటంకాలను కలిగిస్తున్నప్పటికీ చైనా ముందుకు పోతోందన్నది స్పష్టం. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాల్లో యువత భావించటం రోజుకు రోజుకూ పెరగటం చూస్తున్నాం. పెరుగుతున్న ఆర్ధిక అసమానతల గురించి ఆ విధానాల సమర్ధకులే చెబుతున్నారు. చైనాలో కూడా అలాంటి అసమానతలు ఉన్నప్పటికీ తమ ముందు తరాల వారితో పోల్చి చూసినా, ఇతర దేశాలను చూసినా తమకు మెరుగైన అవకాశాలను చైనా ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అక్కడి యువత భావిస్తోంది. ఒక సమాజం పురోగమిస్తోంది అని చెప్పేందుకు కొన్ని అంశాలను గీటురాళ్ళుగా తీసుకోవటం తెలిసిందే. ప్రస్తుతం చైనా సగటు ఆయుర్దాయం 77.3 సంవత్సరాలు. అమెరికాను అధిగమించింది. ఏడున్నరదశాబ్దాల క్రితం అది 43 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఒక నాడు పిల్లలను కనవద్దంటూ ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఎత్తివేసి కనమని ప్రోత్సహిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా జననాల రేటు తగ్గటం తెలిసిందే.


1950కి ముందు చైనాలో పరిస్ధితి దారుణంగా ఉండేది. కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చినా దాదాపు పది సంవత్సరాల పాటు అంతర్గత, బాహ్యశత్రువులు సృష్టించిన సమస్యలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోనివ్వలేదు. తరువాత సాంస్కృతిక విప్లవం పేరుతో చేపట్టిన చర్యలతో యువత తీవ్రంగా ప్రభావితమైంది.1978లో సంస్కరణలకు తెరలేపిన తరువాత పదేండ్లపాటు ఆశించిన మేరకు అవి ఫలితాలను ఇవ్వకపోవటం,ఇతర అంశాల మీద యువతలో తలెత్తిన అసంతృప్తికి ప్రతిబింబమే పశ్చిమ దేశాలు చిత్రించినంత తీవ్రంగాకున్నా తియనన్‌మెన్‌ పరిణామాలు. తరువాత కాలంలో అభివృద్ధి ఊపందుకుంది.1989లో జిడిపి తలసరి సగటు ఐఎంఎఫ్‌ సిబ్బంది లెక్కల ప్రకారం 406 డాలర్లుండగా అది 2021నాటికి 11,891డాలర్లకు చేరింది.2026 నాటికి 17,493 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది.ఈ దశాబ్ది చివరికి అమెరికా జిడిపి మొత్తాన్ని అధిగమించనుందన్న అంచనాల గురించి తెలిసిందే. ఈ పరిణామాలు, పరిస్ధితి యువతను సానుకూలంగా ప్రభావితం చేసేవే.


తలసరి జిడిపిలో అమెరికా ఎంతో ముందున్నదని తెలిసిందే. ఆ స్ధాయికి చేరేందుకు చైనా ఇంకా కష్టపడాల్సి ఉంది. ఆదాయ అంతరాలున్నట్లు వారే స్వయంగా చెబుతున్నారు. అదే సమయంలో అవకాశాలను ఏ విధంగా కల్పిస్తున్నారో చూద్దాం.2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలకు వస్తున్న అవకాశాలు వారి తలిదండ్రులకు రాలేదు. అమెరికాలో ఇదే సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఉన్నత విద్య అవకాశాలు 57శాతం మందికి ఉండగా చైనాలో 54శాతం. రెండు దేశాలను పోలిస్తే చైనాలో ఈ శాతం పెరుగుతుండగా అమెరికాలో పదేండ్లనాటికి ఇప్పటికి పదిశాతం తగ్గింది. అమెరికా విశ్వవిద్యాలయంలో ఏడాదికి ఫీజు 64వేల డాలర్లుండగా చైనాలో రెండువేల డాలర్లు మాత్రమే. పశ్చిమ దేశాలతో పోలిస్తే చైనాలో స్ధిరమైన ఉపాధి రేటు ఎక్కువగా ఉంది. చైనా పిల్లలకు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు పార్టీ బుద్దిశుద్ధి చేసి తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుందని పశ్చిమ దేశాల వారు ఆరోపిస్తుంటారు. పాలకులు ఎవరుంటే ఆ భావజాలాన్ని కలిగించటం అన్ని చోట్లా జరుగుతున్నదే. చైనా ప్రభుత్వం, పార్టీ కూడా సామాజిక బాధ్యతను గుర్తు చేయకుండా దాని లక్ష్యమైన సోషలిస్టు సమాజాన్ని నిర్మించటం ఎలా సాధ్యం అవుతుంది? గ్రామాల్లో ఉన్న పరిస్ధితిని తెలుసుకొనేందుకు, దారిద్య్రనిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్వచ్చందగా అనేక మంది ఇప్పటికీ గ్రామాలకు వెళుతున్నారు. మన దేశంలో కాలేజీల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ పధకంలో భాగంగా విదార్ధులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్న సంగతి తెలిసిందే. అది సక్రమంగా జరగటం లేదు, అమల్లో చిత్తశుద్ది లేదనేది వేరే అంశం. మన దేశంలో ఈ స్వాతంత్య్రం మాకేమిచ్చిందని ప్రశ్నించే యువతరం గురించి తెలిసిందే. స్వాతంత్య్రం తరువాత దాని లక్ష్యాలను పాలకులు విస్మరించిన పర్యవసానమే ఇది. చైనాలో దీనికి భిన్నం తమ, తమ తలిదండ్రుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను పిల్లలకు చెబుతున్నారు. పోరాట కేంద్ర స్ధానాలుగా ఉన్న ఏనాన్‌ తదితర ప్రాంతాలను ఏటా కోట్ల మంది సందర్శించి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన 1950 దశకాల్లో చైనా యువత తాము కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల్లో మాదిరి ఉండాలని కలలు కన్నది, దానిలో తప్పేముంది? తన పౌరులను విదేశాలకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేస్తారని చైనా మీద ఆరోపణలు చేసే వారి గురించి తెలిసిందే. అదే వాస్తవమైతే ఏటా పదిహేను కోట్ల మంది విదేశాల్లో ఎలా పర్యటిస్తున్నారు? వారికి అవసరమైన ఆదాయం లేకపోతే అలా తిరగ్గలరా ? అలాగే చైనా నుంచి ఏటా ఏడు లక్షల మంది విద్యార్దులు విదేశాలకు వెళుతున్నారు. మన దేశం నుంచి ఏటా ఎందరు వైద్య విద్య కోసం వెళుతున్నారో చూస్తున్నాము. ఇది పరస్పరం పరిస్ధితి ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొనేందుకు తోడ్పడదా ? పోల్చుకోరా ? అడ్డుగోడలు ఎక్కడ ఉన్నట్లు ? అమెరికాలో రోజుకు 120 మంది మాదకద్రవ్యాలు లేదా మద్యం తాగి మరణిస్తున్నారు, రోజుకు తుపాకి తూటాలకు 106 మంది మరణిస్తుండగా 210 మంది గాయపడుతున్నారు. ఈ స్ధితిని తమ దేశంలో ఉన్న పరిస్ధితిని చైనా యువత పోల్చుకోదా ? తమ పరిస్ధితి మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపరచుకోవాలంటే సోషలిస్టు విధానం తప్ప దిగజారే పెట్టుబడిదారీ విధానం కాదని అర్ధం చేసుకోదా ? తమ తాతలు, తండ్రులు ఎలాంటి దారిద్య్రం అనుభవించారో తామెలా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నారు గనుకనే కమ్యూపార్టీ పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నారు. 2019లో ఏడు లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్లగా 5,80,000 మంది తిరిగి వచ్చారు. తమ దేశంలో పెరుగుతున్న అవకాశాలతో పాటు దేశానికి తోడ్పడాలన్న ఆకాంక్షకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. పరిశోధన అభివృద్ధికి గాను చైనా తన జిడిపిలో రెండున్నశాతం ఖర్చు చేస్తున్నది. ఈ కారణంగానే గత నాలుగు దశాబ్దాల కాలంలో అది ఎన్నో రంగాల్లో అద్బుతాలను సృష్టిస్తున్నది.శ్రమశక్తిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయటే కాదు, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా యువత దూసుకుపోతున్నది. ఒకప్పుడు నీలిమందు భాయిలని ఎద్దేవా చేసిన ప్రపంచం ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి నివ్వెరపోతున్నది. యువతలో ఉత్సాహం, దీక్ష, పట్టుదల లేకుండా ఇది జరిగేదేనా !

ఉత్కంఠ రేపుతున్న కేరళ ఉప ఎన్నిక – సిపిఎం ఎంపీకి 2000 గొడుగుల బహుమతి !

Tags

, , , ,


ఎం. కోటేశ్వరరావు


ఈ నెల 31వ తేదీన కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎర్నాకుళం జిల్లాలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా తిరిగి నిలుపుకోవాలని కాంగ్రెస్‌, అక్కడ పాగా వేసి ప్రతిష్టను పెంచుకోవాలని సిపిఎం చూస్తున్నాయి. ఎర్నాకుళం నగరంలో కొంత, కొచ్చి నగరంలో కొంత ప్రాంతం ఉన్న ఉన్న ఈ పట్టణ నియోజకవర్గం ఎర్నాకుళం లోక్‌సభ పరిధిలో ఉంది. హిందూ ఓటర్లు 50, క్రైస్తవ ఓటర్లు 35, ముస్లిం ఓటర్లు 15శాతం ఉన్నారని అంచనా. గతేడాది జరిగిన ఎన్నికలలో సిపిఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధిపై గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు పిటి థామస్‌ మరణంతో ఉప ఎన్నిక అవసరమైంది. కాంగ్రెస్‌ తరఫున థామస్‌ సతీమణి ఉమ పోటీలో ఉండగా ఈ సారి సిపిఎం తన స్వంత గుర్తుపైనే ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ జో జోసెఫ్‌ను నిలిపింది. బిజెపి కూడా ఇక్కడ పోటీ చేస్తోంది.గత ఎన్నికల్లో ట్వంటీట్వంటీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధికి పదిశాతం ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో ఆ పార్టీతో కలసి ఆమ్‌ ఆద్మీ ఉమ్మడి అభ్యర్ధిని నిలుపుతామని, రెండు పార్టీలను విలీనం చేస్తామని చేసిన ప్రకటనలకు భిన్నంగా అసలు పోటీ చేయరాదని, విలీనమూ లేదని రెండు పార్టీలు ప్రకటించాయి. ట్వంటీట్వంటీ(2020) పార్టీని ప్రముఖ పారిశ్రామిక సంస్ధ కిటెక్స్‌ ఏర్పాటు చేసింది.తమ సంస్ధపై కార్మికశాఖ తనిఖీలు చేసిందంటూ దానికి నిరసనగా కేరళ నుంచి వెళ్లిపోతామని ఆ సంస్ధ బెదిరించిన సంగతి తెలిసిందే ఆ పేరుతో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాయితీలు ఇస్తే, కాలుష్యం వంటి అంశాలను పట్టించుకోకుండా ఉండే చోట విస్తరిస్తామని చెప్పింది. ఆ పోటీలో తెలంగాణా సర్కార్‌ దానితో ఒప్పందం కుదుర్చుకొని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.ఈ సంస్ధకు కేరళ కాంగ్రెస్‌తో కూడా విబేధాలున్నాయి..


ఆమ్‌ ఆద్మీ పార్టీ కేరళలో అడుగుపెట్టేందుకు కిటెక్స్‌ యజమానులతో సంప్రదింపులు జరిపింది.దాని బలం ఏమిటో ఇంతవరకు ఎక్కడా రుజువు కాలేదు. కిటెక్స్‌ సంస్ధ తమ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గ్రామపంచాయతీని గెలుచుకుంది. మరికొన్ని చోట్ల కూడా పోటీ చేసింది. ఆకస్మికంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ను బలపరిచి సిపిఎంను అడ్డుకోవాలనే ఎత్తుగడ ఉన్నట్లు భావిస్తున్నారు. బహిరంగంగా మద్దతు ఇస్తుందా పరోక్షంగా సహకరిస్తుందా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గత ఎన్నికల్లో దానికి వచ్చిన పదిశాతం ఓట్లలో ఎవరికి ఎన్ని పడతాయనే చర్చ సాగుతోంది.దివంగత ఎంఎల్‌ఏ పిటి థామస్‌ ఆ కంపెనీ కాలుష్యం గురించి తీవ్రంగా విమర్శించారు. ఐనప్పటికీ సిపిఎం వ్యతిరేక ఓటు చీలకూడదు, ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలతో చర్చల తరువాత పోటీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సిపిఎం గెలిస్తే అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ బలం 140కి గాను వంద అవుతుంది. వరుసగా రెండవసారి చారిత్రాత్మక విజయం సాధించిన ఎల్‌డిఎఫ్‌ ఎదుర్కొంటున్న తొలి ఉప ఎన్నిక ఇది. సహజంగానే సిపిఎం కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది.నిజానికి ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.2011లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ సునాయాసంగా గెలిచింది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు కె సుధాకరన్‌, నూతన ప్రతిపక్ష నేత సతీశన్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ముదరకుండా చూసుకొనేందుకు, సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ మద్దతును కూడ గట్టేందుకు ఉమను రంగంలోకి దింపినట్లు భావిస్తున్నారు.


సిపిఎం అభ్యర్ధి ఎంపికలో చర్చి అధికారుల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం ప్రారంభించింది. సిరో మలబార్‌ చర్చ్‌ ప్రతినిధిగా జో జోసెఫ్‌ను నిలిపినట్లు ఆరోపించింది. ఆ ప్రకటనపై సంబంధిత చర్చి వర్గాల నుంచి నిరసన వెల్లడి కావటంతో తన ప్రకటనను వెనక్కు తీసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్ధి ఉమ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. పిటి థామస్‌తో కెఎస్‌యులో కలసి పని చేసినపుడు ఏర్పడిన పరిచయంతో మతాంతర వివాహం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ను కలసి ఆయన తనకు తండ్రితో సమానులంటూ తనను బలపరచాలని కోరారు. గత ఎన్నికలలో కూడా అక్కడ క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారినే సిపిఎం బలపరిచింది. ఎర్నాకుళం నుంచి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించటంతో పాటు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కెవి థామస్‌ ఈ ఎన్నికల్లో సిపిఎంను బలపరిచేందుకు నిర్ణయించారు. కన్నూరులో సిపిఎం మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సెమినార్‌లో మాట్లాడేందుకు అంగీకరించిన థామస్‌పై ఆగ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానం అన్ని పదవుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది తప్ప పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌వాదినేనని ఎల్‌డిఎఫ్‌ అమలు చేస్తున్న అభివృద్ధికార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా ఇవ్వలేదు, మరొక పార్టీలో చేరలేదని కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించుకోవచ్చన్నారు. స్ధానిక కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకు 2018 నుంచీ చూస్తున్నారని అన్నారు.కెవి థామస్‌కు మీడియా అనవసర ప్రాధాన్యత ఇస్తున్నదని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.
2011 ఎన్నికల్లో 5.04శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2016లో 15.7శాతానికి పెంచుకుంది, 2021లో 11.32శాతానికి తగ్గింది. ఈ సారి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది.దాని మత అజెండాలో భాగంగా లౌజీహాద్‌, నార్కోటిక్‌ జీహాద్‌ నినాదాలతో క్రైస్తవ ఓటర్లను ఆకర్షించేందుకు పూనుకుంది. గత ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన ట్వంటీ ట్వంటీ 10.32శాతం ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఎం, బిజెపి మూడు పార్టీలకు ఓట్లశాతాలు తగ్గినందున ఆ మేరకు ట్వంటీట్వంటీకి పడినట్లు భావిస్తున్నారు. ఆ ఓటర్లు ఈ సారి గతంలో మద్దతు ఇచ్చిన పార్టీలకే తిరిగి వేస్తారా లేదా అన్నది చర్చ.


ఎంపీకి గొడుగుల బహుమతి
డివైఎఫ్‌ఐ నేత, తాజాగా కేరళ నుంచి సిపిఎం తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఎఎ రహీంకు అరుదైన బహుమతులు లభించాయి. వివిధ కార్యక్రమాలకు తనను ఆహ్వానించే వారు బంగారుశాలువలు, మెమెంటోలు, ఖరీదైన పుష్పగుచ్చాల వంటివి ఇవ్వవద్దని, అంతగా ఇవ్వాలనుకుంటే గొడుగులు ఇవ్వాలని రహీం సున్నితంగా చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఒకసభలో ఆమేరకు వివిధ సంస్ధల వారు రహీంకు రెండువేల గొడుగులు కానుకగా ఇచ్చారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు అందచేస్తానని రహీం ప్రకటించారు. గతంలో మంత్రిగా పని చేసిన సిపిఎం నేత ఎంఏ బేబీ తనకు పుస్తకాలు కానుకగా ఇవ్వాలని చెప్పేవారు, వాటిని గ్రంధాలయాలుకు ఇచ్చేవారు.

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.