యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే…..అమెరికా కార్మికోద్యమంలో కొత్త తరం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలోని 80దేశాల్లో 40వేల వరకు కాఫీ దుకాణాలున్న అమెరికా కంపెనీ స్టార్‌బక్స్‌. అమెరికాలో పదిహేనువేలకుపైగా షాపులున్నాయి. కరడుగట్టిన యాజమాన్య ఆటంకాలను అధిగమించి వాటిలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కార్మికులు ముందుకు రావటం ఒక పెద్ద పరిణామంగా చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘ ఉద్యమాలు తగ్గిపోతున్న నేపధ్యంలో స్టార్‌బక్స్‌ కార్మిక సంఘం ఏర్పాటు ఒక ఆశారేఖగా ఉంది. అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘానికి ఇక్కడి సంఘానికి ఎలాంటి సంబంధాలు గానీ అనుబంధాలుగానీ లేవు. రెండు చోట్లా సంఘాలను గుర్తించాలనే దరఖాస్తులు కార్మికశాఖకు అందచేశారు.2021 ఆగస్టులో బఫెలో, న్యూయార్క్‌లోని మూడు స్టార్‌బక్స్‌ దుకాణాల్లో కార్మిక సంఘాన్ని గుర్తించాలంటూ దరఖాస్తు చేశారు.డిసెంబరు తొమ్మిదవ తేదీన బఫెలోని దుకాణంలో జరిగిన ఎన్నికల్లో సంఘం తొలిసారిగా గుర్తింపు పొందింది. గత ఎనిమిది నెలల్లో 250 దుకాణాల నుంచి అలాంటి దరఖాస్తులు కార్మికశాఖకు వెళ్లాయి. ఇప్పటి వరకు 40 చోట్ల గుర్తింపు లభించింది. ఈ పరిణామం పెద్ద ఎత్తున అనేక వసతి, ఆహార, పానీయ సంస్ధల్లోని సిబ్బందిని కార్మిక సంఘాల వైపు ఆకర్షిస్తున్నది.అమెరికాలో కొత్త వరవడికి నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కార్మికులను బాగా దెబ్బతీసింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇది కూడా కార్మికులను ఆలోచింప చేస్తున్నది.


అమెరికాలోని అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘంలో చేరాలా వద్దా అన్న ఎన్నికల్లో 28 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఒక చోట విజయం, రెండు చోట్ల ఎదురు దెబ్బలు.మరో బహుళజాతి కంపెనీ స్టార్‌బక్స్‌లో పలు దుకాణాల్లో కార్మిక సంఘాల్లో చేరిక. ఈ రెండు పరిణామాలూ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల అమెజాన్‌ కంపెనీ తన సిబ్బందిని ఏ కార్మికసంఘంలోనూ చేరకుండా అడ్డుకుంటున్నది. కొద్ది వారాల క్రితం అమెజాన్‌ కార్మిక సంఘం(ఏఎల్‌య)లో చేరాలా వద్దా అనే అంశంపై కార్మికశాఖ జరిపిన ఎన్నికల్లో న్యూయార్క్‌లోని ఒక గోదాములో సంఘం పట్ల మొగ్గుచూపారు. ఇది ప్రపంచవ్యాపితంగా సంచలనం కలిగించింది. అలబామాలో మరో కార్మిక సంఘంలో చేరిక గురించి జరిపిన ఓటింగ్‌లో మెజారిటీ వద్దని తీర్పు చెప్పారు. ఒక చోట తన పన్నాగాలు పారకపోవటాన్ని యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నది. ఆ ఎన్నిక చెల్లదంటూ వివాద పిటీషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు రానుండగా న్యూయార్క్‌లోని రెండవ గోదాములో ఏప్రిల్‌ చివరి వారంలో జరిగిన ఓటింగ్‌లో కార్మిక సంఘం వద్దని మెజారిటీ సిబ్బంది ఓటు చేశారు. స్టాటన్‌ ఐలాండ్‌లోని ఎల్‌డిజె5 గోదాములో 618 మంది సంఘానికి వ్యతిరేకంగా 380 మంది అనుకూలంగా ఓటు చేశారు. సిబ్బందిలో 61శాతం మంది పాల్గన్నారు.


స్టేటెన్‌ ఐలాండ్‌లోని జెఎఫ్‌కె8 అనే అమెజాన్‌ గోదాములో ఎన్నిక తీర్పును వమ్ముచేసేందుకు సంఘాన్ని గుర్తించకుండా అడ్డుకొనేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది. నేతలు కార్మికులను బలవంత పెట్టి అనుకూలంగా ఓట్లు వేయించారని యాజమాన్యం చేసిన ఫిర్యాదును జాతీయ కార్మిక సంబంధాల బోర్డు విచారణకు స్వీకరించింది. బ్రూక్లిన్‌లోని కార్మిక కార్యాలయం కార్మిక సంఘానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందని అందువలన వేరే చోటుకు విచారణను మార్చాలని కోరగా ఫోనిక్స్‌ కేంద్రానికి బదిలీ చేశారు. సదరు కేంద్ర డైరెక్టర్‌ మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీ సమర్పించిన ఆధారాలను చూస్తే ఓటింగ్‌ చెల్లకపోవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. జెఎఫ్‌కె8 గోదాము సిబ్బంది 58శాతం మంది పోలింగ్‌లో పాల్గనగా వారిలో 55శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.అమెజాన్‌ ఫిర్యాదుపై మే 23వ తేదీ నుంచి విచారణ ప్రారంభమౌతుంది. తమ సిబ్బంది వైఖరి ఏమిటో వినాలని తాము కోరుతున్నామని, ఎన్నికల్లో అలాంటి అవకాశం రాలేదని గోదాములోని సిబ్బందిలో మూడోవంతు మాత్రమే కార్మిక సంఘానికి ఓటు వేశారని అమెజాన్‌ వాదిస్తోంది. ఎక్కువ మంది పాల్గనకుండా లేబర్‌ బోర్డు అడ్డుకుందని, కార్మిక నేతలు గంజాయి పంచినట్లు ఆరోపించింది. కార్మిక సంఘం వీటిని తీవ్రంగా ఖండించింది. ఇక్కడ ఓటింగ్‌ తక్కువగా ఉందికనుక తాము అంగీకరించేది లేదని చెబుతున్న కంపెనీ అలబామాలో తక్కువ మంది పాల్గని కార్మిక సంఘం వద్దని వేసిన ఓట్లను ఎలా పరిగణనలోకి తీసుకున్నదని ప్రశ్నించింది. నిజానికి రెండు చోట్లా కంపెనీ కార్మికులను బెదిరించినట్లు తెలిపింది. అమెజాన్‌ దాఖలు చేసిన కేసులో తీర్పు ఎలా వస్తుందో చెప్పలేము.


కార్మిక సంఘనేతలకు ఇది ఆశాభంగం కలిగించవచ్చునేమో గానీ అమెజాన్‌ కంపెనీ తీరు తెన్నులు తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించలేదు.ఈ ఎన్నిక అమెజాన్‌ కార్మిక సంఘం(ఎఎల్‌యు) కంటే యాజమాన్యానికి, పరోక్షంగా అమెరికన్‌ కార్పొరేట్లన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందుకే రెండవ గోదాములో వారాల తరబడి సిబ్బందిని అనేక రకాలుగా బెదిరించి వత్తిళ్లకు గురిచేసింది. అనేక మంది రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేసే పాక్షిక సిబ్బంది కావటం, గంటకు 30 డాలర్ల వేతనాన్ని తమకు ఇస్తారా లేదా అన్న అనుమానాల వంటివి, ఈ మాత్రం పని ఇక్కడగాకపోతే మరోచోట దొరకదా, మనమెందుకు ఈ వివాదంలో తలదూర్చటం అనే భావం కూడా కొందరిని సంఘానికి దూరంగా ఓటువేసేందుకు దోహదం చేసింది.యాజమాన్యనిరంకుశ వైఖరి తెలిసినప్పటికీ గత నెలలో వందకు పైగా అమెజాన్‌ దుకాణాల్లోని కార్మికులు సంఘంలో చేరటం గురించి ఎఎల్‌యు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇది యాజమాన్యాన్ని కలవపరుస్తున్న అంశమిది. అందుకే న్యూయార్కులోని రెండవ గోదాము మీద కేంద్రీకరించి కార్మికులను బెదిరించి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓడిపోయిన చోటనే కాదు అన్ని చోట్లా కార్మికులను సంఘటిత పరచేందుకు పూనుకుంటామని ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని నేతలు ప్రకటించారు.


కార్మికులు సంఘాల్లో చేరటం తగ్గిపోతుండగా ఈ పరిణామం పునరుజ్జీవన చిగురు వంటిదని చెప్పవచ్చు. అమెరికాలో 1983లో 20శాతం మంది కార్మికులు సంఘాల్లో చేరగా ఇప్పుడు వారు 11శాతానికి తగ్గారు, 1940, 50దశకాల్లో 30శాతం వరకు ఉన్నట్లు పాత సమాచారం తెలుపుతోంది. అమెజాన్‌, స్టార్‌బక్స్‌, ఆపిల్‌ వంటి కంపెనీల్లో సంఘాల స్ధాపన అనేకమందిని ఆలోచింప చేస్తున్నది. దేశంలో 28.8 కోట్ల మంది కార్మికులుండగా వారిలో ఒక్కశాతం మంది సంఘాల్లో చేరినా 30లక్షల మంది పెరుగుతారు. కొన్ని చోట్ల చేరేందుకు సిద్దంగా ఉన్నా సంఘాలు లేవు. మరికొన్ని చోట్ల సంఘాలకు అనుకూలత లేదు. మొత్తంగా చూసినపుడు సంఘటితం కావటానికి అనువైన వాతావరణంఇప్పుడు ఉంది. ఇదే సమయంలో యజమానులు కూడా సంఘాలను లేకుండా చేసేందుకు తీవ్రంగా చూస్తున్నారు.


1936 గాలప్‌ సర్వేలో కార్మిక సంఘాలు ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు 72శాతం మంది కావాలని చెప్పారు. 2021సెప్టెంబరులో అదే సంస్ధ అడిగిన అదే ప్రశ్నకు 68శాతం మంది కావాలని అన్నారు.1953, 57లో గరిష్టంగా 75శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను చూసినపుడు పెద్ద మార్పులు లేవని చెప్పవచ్చు. మరోసారి కార్మిక సంఘాల ఏర్పాటు, వాటిలో చేరే వారు పెరిగేందుకు అనువైన పరిస్ధితి అమెరికాలో ఉందన్నది స్పష్టం. సంఘాల్లో కార్మికులు చేరకపోవటం దేశానికి మంచి కంటే చెడు చేస్తున్నదని అమెరికన్లు నమ్ముతున్నట్లు ఇటీవలి పూ సర్వే వెల్లడించింది. కార్మిక సంఘాలలో చేరాలా వద్దా అన్న అంశంలో రాజకీయ అనుబంధాలు కూడా పని చేస్తున్నాయి.2019 నుంచి 2021వరకు సర్వేల సమాచారాన్ని విశ్లేషించినపుడు 56శాతం మంది కార్మిక సంఘాల సభ్యులు డెమోక్రటిక్‌ పార్టీ అభిమానులు కాగా 39శాతం మంది రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లున్నారు. సంఘటిత పరచే హక్కును రక్షించేందుకు ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టగా గతేడాది పార్లమెంటు దిగువ సభ ఆమోదించగా ఎగువ సభ సెనెట్‌ దాన్ని అడ్డుకుంది.


అమెజాన్‌లో కార్మిక సంఘం ఏర్పాటు జాతీయంగా ఒక విస్తృత ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని డెమొక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీశాండర్స్‌ వర్ణించాడు. కార్పొరేట్ల పేరాశకు కార్మికులు అశక్తులుగా అలసిపోయారని చెప్పాడు. ఇటీవల అమెజాన్‌ కార్మిక సంఘనేతలతో మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీలో కుర్రకారు ఇంతటి విజయం సాధించారంటే మేమూ అదే మాదిరి మేమూ చేయగలం అని అనేక మంది చెప్పారని అన్నాడు. రాజ్యాంగ హక్కైన కార్మిక సంఘ ఏర్పాటును అడ్డుకొనేందుకు కోట్లాది డాలర్లను ఖర్చు చేయటానికి బదులు సమస్యల గురించి దానితో చర్చించేందుకు అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సిద్దం కావాలని డిమాండ్‌ చేశాడు.కార్మిక సంఘాలను లేకుండా చేయాలని చూస్తున్న అమెజాన్‌ కంపెనీ చట్టవిరుద్దమైన చర్యలను విరమించేంత వరకు సదరు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు శాండర్స్‌ లేఖ రాశాడు. కార్మిక సంఘాల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరపాలని గుర్తు చేశాడు.


కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అవసరమైన నివారణ ఏర్పాట్లు తగినన్ని చేయాలంటూ జెఎఫ్‌కె8 గోదాములో కార్మికులను సమీకరించి ఆందోళన చేసినందుకు 2020లో క్రిస్టియన్‌ స్మాల్‌ అనే కార్మికుడిని కంపెనీ తొలగించింది. అతని చొరవతో ఏర్పడిన కార్మిక సంఘాన్ని అదే గోదాములో కార్మికులు గుర్తించారు. వెబ్‌సైట్‌లో సలహాలు, సమాచారాన్ని అందుబాటులో ఉంచటం కాకుండా ముఖాముఖీ కార్మికులతో సమావేశం కావటం ద్వారానే సంఘాల అవసరం ఏమిటో బాగా వివరించగలమని స్మాల్‌ చెప్పాడు. అవసరమైతే పదే పదే చర్చలు జరపాలన్నాడు. అమెజాన్‌లో విజయం తరువాత మరో పెద్ద కంపెనీ స్టార్‌బక్స్‌లో అనేక చోట్ల కార్మిక సంఘానికి మద్దతుగా కార్మికులు ఓటువేశారు. దాంతో ఆ సంస్ద కూడా ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు పూనుకుంది. గంటకు ప్రస్తుతం ఇస్తున్న 18 డాలర్లను 30 డాలర్లకు పెంచాలని, పని మధ్యలో భోజన, ఇతర విరామాలకు వేతనం ఇవ్వాలని కార్మిక సంఘం కోరుతోంది.గంటకు ఇన్ని వస్తువులను విధిగా చేరవేయాలనే చెల్లింపు పద్దతి రద్దుకావాలని కోరుతున్నారు.ఈ నిబంధన కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఇతర చోట్లతో పోలిస్తే అమెజాన్‌లో ఎక్కువగా ఉన్నాయి.


అమెరికాలోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఊహించినదానికి భిన్నంగా జీవితాలున్నాయి. గత తరాలు దిగువ నుంచి మధ్యతరగతిగా మారినట్లు తాము మారటం, ఆరంకెల ఆదాయానికి చేరటం ఎంతో కష్టమని వారు భావిస్తున్నారు. కార్మికోద్యమం పెరిగేందుకు ఈ పరిస్దితి దోహదం చేస్తోంది.1990దశకంలో కాలేజీ డిగ్రీలు ఉన్నవారు కార్మిక సంఘాలకు 55శాతం మంది మద్దతు ఇస్తే ఇప్పుడు వారి సంఖ్య 70శాతానికి పెరిగింది, తాజాగా డిగ్రీలు పొందిన వారిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
భౌతిక పరిస్ధితులను బట్టే కార్మికవర్గ ఆలోచనలు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి అంతకంటే మెరుగైనదాని కోసం చూసిన ధోరణి వెల్లడైంది. ఇది ఒకరకమైన కార్మిక నిరసనకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ తీరును చూసిన కార్పొరేట్‌లు సిబ్బందిని నిలుపుకొనేందుకు మెరుగైన వేతనాలు, పని పరిస్దితులను కల్పించాల్సి అవసరాన్ని గుర్తించాల్సి వచ్చింది. లేనట్లయితే కార్మిక సంఘాల ఏర్పాటు, పోరాటాలకు అనువైన పరిస్ధితికి దారి తీస్తుందనే ఆందోళన వెల్లడైంది. పెద్ద వారితో పోల్చితే యువత కార్మిక సంఘాలపట్ల సానుకూల వైఖరితో ఉంది. ఇతరులతో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు, పురుషులతో చూస్తే మహిళలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నారు. బాగా తక్కువ లేదా ఎక్కువ ఆదాయాలు వస్తున్నవారి కంటే మధ్యస్ధంగా ఉన్నవారు సంఘాల పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇది అక్కడి కార్మికోద్యమం మరింతగా పెరగటానికి దోహదం చేయనుంది. అది ప్రపంచాన్ని ప్రభావితం చేయకుండా ఉంటుందా !

కాషాయదళాల ముస్లిం వ్యతిరేక ప్రచారం -నిందలూ, నిజాలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

పెట్రోలు ధరలు : రావణదేశంలో 89, సీత పుట్టింట్లో 100, రామరాజ్యంలో 120 !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీ గారికి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి.ఆమ్‌ ఆద్మీ ఢిల్లీ సర్కార్‌ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా ? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్దితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను, కొన్ని రాష్ట్రాలు వాట్‌ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్థంభింప చేశాయి. ఇవన్నీ దేశ లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రు.118.14, పాట్నాలో రు.116.23, బెంగలూరులో రు.111.09, లక్నోలో రు.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా ? గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్‌ 25న పెట్రోలు రేటు రు.373, అదే మన కరెన్సీలోకిి మార్చితే రు.80.39.సీతాదేవి పుట్టిన నేపాల్లో రు.100 ఉంది.మన రామరాజ్యంలో రు.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రు.61.41, బంగ్లాదేశ్‌లో రు.79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.


పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్‌ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి ? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ కూడా జారీ చేసింది ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్‌ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ది పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ? ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.


ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రు.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రు.25,89,388 కోట్లు ? కాంగ్రెస్‌ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత ? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత ? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?


ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది.2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రు.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రు.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్‌ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్‌ మొత్తం రు.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం.2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రు.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రు.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రు.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్‌ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు ఐదువేల కోట్లు గుజరాత్‌లకు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు.బిజెపి ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.


ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్టీసికీ చిల్లర ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్‌ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు,రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి. ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్టీసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్టీసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులు బాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్టీసి లేదా మరొక రాష్ట్ర సంస్ధకైనా, రిటైల్‌ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి. ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరు కాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు 85లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని,ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది. మిగతా రాష్ట్రాల ఆర్టీసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజిలు పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికల్లో బలం పెంచుకున్న ఫాసిస్టు నేషనల్‌ పార్టీ !

Tags

, , ,



ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు(ఏప్రిల్‌ 24) జరిగిన తుది విడత ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ విజయం సాధించాడు. ప్రత్యర్ధి పచ్చిమితవాది లేదా ఫాసిస్టుగా పిలుస్తున్న మారినే లీపెన్‌ 41.5శాతం ఓట్లు తెచ్చుకోగా మక్రాన్‌కు 58.5శాతం వచ్చాయి. గత (2017)ఎన్నికల్లో పదకొండు మంది తొలి దఫా ఎన్నిక పోటీ పడగా తొలి నలుగురికి 24.01 నుంచి 19.58శాతం మధ్య రాగా మిగిలిన వారెవరికీ ఒక అంకెకు మించి ఓట్లు రాలేదు. తాజా ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ పడగా మక్రాన్‌కు 27.85, మారినే లీపెన్‌కు 23.15, వామపక్ష మెలాంచన్‌కు 21.95శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన వారందరూ ఒక అంకెతోనే సరిపెట్టుకున్నారు. ఫ్రెంచి నిబంధనల ప్రకారం తొలి రెండు స్దానాల్లో ఉన్న వారు తుదివిడతలో పోటీపడాల్సి ఉంది. అర్హత కోల్పోయిన పార్టీల మద్దతుదారులు తుది విడత ఎవరో ఒకరిని ఎంచుకొని ఓటు వేస్తారు. 2022 ఎన్నికల్లో, అంతకు ముందు కూడా మక్రాన్‌, లీపెన్‌లే తుది విడత పోటీ పడ్డారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఉన్నంతలో తక్కువ హాని చేసే వారిని ఎన్నుకుందామనే వైఖరిని ఇతర పార్టీలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా పోటీ చేసిన ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష , హరిత పార్టీలు కూడా మక్రాన్‌కు మద్దతు ప్రకటించాయి. లీపెన్‌కు మితవాదశక్తులు బాసటగా నిలిచాయి.


తొలి విడత కమ్యూనిస్టు పార్టీ పోటీకి దిగకుండా దానికి వచ్చిన 2.28శాతం ఓట్లను మెలాంచన్‌కు బదలాయించి ఉంటే 24,13 శాతంతో రెండవ స్దానంలో ఉండి తుది విడత మక్రాన్‌తో పోటీ జరిగేదని, మితవాద-వామపక్ష శక్తుల పోటీగా నిలిచేదని కొందరు పేర్కొన్నారు.ఇదే సూత్రం పచ్చి మితవాద పార్టీలకూ వర్తిస్తుంది. ఎరిక్‌ జుమౌర్‌ అనే పచ్చి మితవాదికి 7.07శాతం వచ్చాయి, ఆ రెండు పార్టీలు కలిసినా వారే మొదటి స్ధానంలో ఉండేవారు. గ్రీన్స్‌, మరో వామపక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లను కూడా కలుపు కుంటే మొత్తం 30శాతం వరకు ఉన్నాయి. వామపక్షశక్తుల మధ్యరాజకీయ విబేధాల కారణంగానే ఎవరికి వారు తమ వైఖరిని ఓటర్ల ముందుంచి పోటీ చేశాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే పోటీ మక్రాన్‌-వామపక్ష అభ్యర్ధి మధ్య జరిగినా గెలుపు మక్రాన్‌దే అన్నది స్పష్టం. మితవాద, పచ్చిమితవాద శక్తులు అధికారం కోసం కుమ్ములాడుకోవటం తప్ప వారి విధానాల్లో పెద్ద తేడాలేమీ లేవు. మక్రాన్‌ ఐరోపా సమాఖ్యలో ఉండాలనే వైఖరి, లీపెన్‌ దానికి భిన్నమైన విధానం కలిగి ఉన్నారు తప్ప దేశ ఆర్ధిక విధానాల్లో వారి మధ్యపెద్ద తేడాలేమీ లేవు.


తనకు వామపక్ష అభిమానులు ఓటు వేశారని తెలుసునని, వారు లీపెన్‌న్ను అడ్డుకున్నారని ఫలితాల అనంతరం చెప్పిన మక్రాన్‌ తనకు ఓటు వేసిన వారందరూ తన మద్దతుదారులు కాదని కూడా చెప్పారు. తాను ప్రకటించిన విధానాలకే కట్టుబడి ఉంటాను తప్ప వామపక్ష అభిమానులు తనకు ఓటేసినంత మాత్రాన ఆ శక్తులు ముందుకు తెచ్చిన విధానాలను తాను అమలు జరపాల్సిన అవసరం లేదనే సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. మక్రాన్‌కు ఓటు వేసినంత మాత్రాన అతగాడి విధానాల మీద భ్రమలుండి కాదని, ఇద్దరు శత్రువులలో ఉన్నంతలో తక్కువ హాని చేసే వారినే ఎంచుకొని వేశామని, తమ ఉద్యమాలకు ఎలాంటి విరామం ఉండదని కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాల మక్రాన్‌ ఏలుబడిని చూసినపుడు ఒకశాతం ధనికులకు మాత్రమే తగిన ప్రతినిధిగా, 99శాతం మందిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన పెద్దమనిషిగా దర్శనమిచ్చాడు. కొత్తగా ఉపాధి లేకపోగా ఉన్న కార్మికులను సులభంగా వదిలించుకొనేందుకు యజమానులకు వీలు కల్పించాడు. ఫలితంగా తక్కువ వేతనాలకు పని చేస్తారా ఉద్యోగాల నుంచి ఊడగొట్టమంటారా అంటూ ఓనర్లు ఉన్నవారికి, కొత్తగా తీసుకున్న వారికి వేతనాలను తగ్గించారు. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులను తగ్గించాడు, ఆ మేరకు సామాన్యుల సంక్షేమ పధకాలకు కోత పెట్టాడు. దానికి తోడు మిలిటరీ ఖర్చును కూడా పెంచాడు.దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు 35శాతం మంది దివాలా తీసినట్లు అంచనా.ప్రస్తుతం 1,07,000 దివాలా కేసులు నడుస్తున్నాయి. ఈ పరిణామాలను చూసిన తరువాత మక్రాన్‌ విధానాల మీద అనేక మందికి భ్రమలు తొలిగి అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు, లేదా ఖాళీ బాలట్‌ పత్రాలను వేశారు.


గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఉన్న పార్టీ ప్రస్తుతం నేషనల్‌ రాలీ పార్టీగా పేరు మార్చుకుంది. తాజా అభ్యర్ధి మారినే లీపెన్‌ తండ్రి జీన్‌ మారీ లీపెన్‌ తొలిసారిగా 2002 ఎన్నికల్లో పోటీ చేసి 18శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో కూతురు మారినే లీపెన్‌ 33.9శాతానికి, తాజాగా 41.5శాతానికి పెంచుకుంది.ఈ పరిణామాన్ని తన గెలుపుగా భావిస్తున్నాను తప్ప ఓడినట్లు భావించటం లేదని, జనానికి ఒక ఆశాభావం కల్పించినట్లు ఆమె అన్నారు. ఫ్రాన్స్‌లోకి వలస కార్మికులను అనుమతించరాదని, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతూ నేషనల్‌ పార్టీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. మక్రాన్‌తో పోలిస్తే ఈ పార్టీ కార్పొరేట్లకు మరింతగా అనుకూలమని, అయితే ఈ సారి ఎన్నికల్లో దేశంలో పెరిగిన ద్రవ్యోణం, ధరలు, జీవన వ్యయం, పన్నుల అంశాలను కూడా ప్రచార అంశం చేసింది. ఇది కూడా ఓట్లు పెరిగేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు.పెన్షన్‌ చెల్లింపులను తప్పించుకొనేందుకు ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతానని మాక్రాన్‌ చెబితే 62 సంవత్సరాలకు మించకూడదని నేషనల్‌ పార్టీ పేర్కొన్నది. అంతే కాదు, దిగజారిన ఆర్ధిక పరిస్ధితులను గమనంలో ఉంచుకొని తాము వస్తే చమురు మీద పన్నులు తగ్గిస్తామని,ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల కోసం కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. తాము విస్మరణకు గురైనట్లు భావిస్తున్న వారు ఈ నినాదాలకు ఆకర్షితులైనట్లు భావిస్తున్నారు. పలు చోట్ల స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేసినప్పటికీ జాతీయంగా అధికారానికి వచ్చే స్ధితి లేనందున వారు కూడా మక్రాన్‌ లేదా నేషనల్‌ పార్టీలవైపు మొగ్గుతున్నారు.
ఈ ఎన్నికలను కూడా అమెరికా మీడియా ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముడిపెట్టేందుకు ప్రయత్నించింది.గతంలోను, ఇటీవల తమ ప్రచారానికి అవసరమైన రుణాలను రష్యన్‌ బాంకుల నుంచి తీసుకోవటం వంటి ఉదంతాలు, గతంలో పుతిన్‌కు నేషనల్‌ పార్టీ మద్దతు ప్రకటించిన వాటిని పట్టుకొని ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలు నాటో వ్యతిరేక-పుతిన్‌ అనుకూల మారినె లీపెన్‌ వైఖరిపై తీర్పుగా ఉంటాయని చిత్రించింది.

అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన అనుభవాలు, ఫలితాలను గమనంలోకి తీసుకున్న వామపక్ష శక్తులు జూన్‌లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఓట్లు చీలకుండా చూడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాయి. అటువంటి సర్దుబాటు కుదిరితే కొన్ని చోట్ల వాటికి మొత్తంగా 30శాతం ఓట్లు ఉండటం, స్ధానికంగా జరిగే ఎన్నికలు గనుక ఇతర పార్టీలకు ఓటు చేసిన వాటి అభిమానులు తిరిగి వామపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉన్నందున మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. తొలి దఫా ఎన్నికల్లో వామపక్షాలకు వచ్చిన ఓట్లను చెదరకుండా చూస్తే మక్రాన్‌ – మారినె లీపెన్‌ ప్రాతినిధ్యం వహించే శక్తులను దెబ్బతీయ గలమని అధ్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఫాబియన్‌ రౌసెల్‌ చెప్పాడు. మే దినోత్సవ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా వామపక్ష ఐక్యతాయత్నాలకు శ్రీకారంచుడతామని అన్నాడు. మక్రాన్‌ గెలిచినంత మాత్రాన అతని విధానాలకు మద్దతు ఇచ్చినట్లు కాదని అలాగే నేషనల్‌ పార్టీ ఓడినంత మాత్రాన పచ్చి మితవాద శక్తుల ప్రమాదం తప్పినట్లు కాదని అన్నాడు. వామపక్ష నేత మెలాంచన్‌ కూడా ఐక్యతాయత్నాలను ప్రారంభించాడు. గతంలో అధికారాన్ని చలాయించిన సోషలిస్టులు కూడా సుముఖంగానే ఉన్నట్లు వార్తలు. మితవాద శక్తులు కూడా పెరిగిన ఓట్లశాతంతో పార్లమెంటులో మెజారిటీ సాధించాలని ముందుకు పోతున్నారు. కార్మికవర్గానికి ముప్పు ముంచుకువస్తున్నదని కార్మిక సంఘం సిజిటి ముందే హెచ్చరించింది. పార్లమెంటులో ఈ రెండు శక్తులది పై చేయికాకుండా చూడాలని 66శాతం మంది ఓటర్లు పేర్కొన్నట్లు ఒక సర్వే వెల్లడించింది.మరొక సర్వేలో కూడా అదే తేలింది.


ఒక నాటో సభ్యదేశంగా ఫ్రాన్సు కూడా రష్యా మీద ఆంక్షలను సమర్ధించినప్పటికీ అమెరికా,బ్రిటన్‌ అనుసరించే వైఖరితో పూర్తి ఏకీభావం లేదు. ఆ ప్రభావం తన మీద పడకుండా చూసుకొనేందుకు మక్రాన్‌ ప్రయత్నించాడు. ఇప్పుడు ఎన్నిక ముగిసింది కనుక అమెరికాతో కలసి శత్రుపూరితంగా ముందుకు పోతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. జూన్‌లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోవటం కూడా అవసరమే కనుక అవి ముగిసే వరకు వైఖరిలో మార్పు ఉండదు. ప్రతిపక్షాలకు మెజారిటీ వస్తే ఇబ్బందుల్లో పడతాడు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ఇప్పటికే ఇతర పశ్చిమ దేశాలతో పాటు ఫ్రాన్సు మీద కూడా పడింది. అది కొనసాగితే కార్మికవర్గ ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. తీవ్ర అసంతృప్తి కారణంగానే తొలి దఫా ఎన్నికల్లో 73.69శాతం మంది ఓట్లు వేయగా తుది దఫా 71.99శాతం మాత్రమే పోలైనట్లు భావిస్తున్నారు.


మక్రాన్‌ గెలిచినందుకు సంతోషం వెలువడినా లీపెన్‌కు ఆ స్దాయిలో ఓట్లు రావటం ఆందోళన కలిగించే పరిణామంగా కూడా అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ఉచ్చు బిగుస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. గత ఐదు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా(72శాతం) పొల్గన్న తొలి ఎన్నిక ఇది. మక్రాన్‌ కార్మిక వ్యతిరేక వైఖరి, లీపెన్‌ మితవాద విధానాలు ఎవరికి ఓటు వేసినా ఉపయోగం ఏముందనే నిర్లిప్తత కారణంగా ఓటర్లు ఉత్సాహం చూపటంలేదని ఓటింగ్‌కు ముందే అభిప్రాయ సేకరణ సర్వేల్లో వెల్లడైంది. ఉదారవాదిగా పేరున్న మక్రాన్‌ మితవాదిగా మారుతుండగా, పచ్చిమితవాది మారినే లీపెన్‌ ప్రజల మనిషిగా కనిపించేందుకు పూనుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్లు కొందరు వ్యాఖ్యానించారు. గతంలో ఆమెను ఒక దయ్యంగా వర్ణించిన మీడియా ఇప్పుడు ఆమెను ఒక కలుపుగోలు, సాధారణ మహిళగా పేర్కొంటున్నది. మక్రాన్‌ అనుసరించిన విధానే పచ్చిమితవాద లీపెన్‌కు ఆదరణ పెరిగేందుకు తోడ్పడిందని భావిస్తున్నారు. ఇది ఐరోపాకే కాదు, ప్రపంచ మొత్తానికి ఆందోళన కలిగించే అంశమే.

రంగనాయకమ్మ గారూ”కుహనా మిత్ర శత్రువు” లతోనే నష్టం ఎక్కువ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


రంగనాయకమ్మ గారి మహా రష్యన్‌ దురహం కారం అనే విశ్లేషణపై స్పందించిన నాకు ఆమె ఆత్మానందాన్ని ఆపాదించారు. దానికి పారమార్ధిక పదకోశంలో చెప్పిన ఒక వ్యాఖ్యానం లేదా భాష్యం ప్రకారం కలిమి,బలిమి మరెందులోనూ తనకు మించిన వారు లేరని సంబరపడటం. అలాంటి అంబర సంబరం నాకు లేదుగానీ పురోగామి వాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉంది. మార్క్స్‌కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ స్పందనకు ప్రతిస్పందనగా కొన్ని అంశాలను పాఠకుల ముందుంచుతున్నాను. (ఆంధ్రజ్యోతిలో మార్చి రెండవ తేదీన రంగనాయకమ్మ గారి విశ్లేషణకు నా స్పందన మార్చి12న ప్రచురితం కాగా ఏప్రిల్‌20న రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన ప్రచురితమైంది)


1. లెనిన్‌ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్‌ రిపబ్లిక్‌ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అనే రాశాను. ‘ఫెడరేటివ్‌’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్‌ రిపబ్లిక్‌ అని రాశాను.(చైనా అసలు పేరు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది) ఆ పేరును అంతకు ముందు ప్రభుత్వ నేతగా ఉన్న కెరెన్‌స్కీ పెట్టారని రంగనాయకమ్మగారు రాశారు. కెరెన్‌స్కీ సర్కార్‌ పెట్టిన పేరు ” రష్యన్‌ డెమోక్రటిక్‌ ఫెడరల్‌ రిపబ్లిక్‌ ” అని తెలుసుకుంటే చాలు. లెనిన్‌ అధికారానికి వచ్చిన 1917 నవంబరు ఏడు నుంచి 1918 జనవరి 18న రాజ్యాంగ సభ ‘రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అని పేరు మారుస్తూ డిక్రీ జారీ చేసే వరకు కెరెన్‌స్కీ పెట్టిన పాత పేరు కొనసాగింది. కెరెన్‌స్కీ-లెనిన్‌ ప్రభుత్వం పెట్టిన రెండు పేర్లలోనూ మధ్యలో పదాలు మారినప్పటికీ ” రష్యన్‌ ” అనే పదంతోనే ప్రారంభమైంది కనుక లెనిన్‌ కూడా రష్యన్‌ మహాదురహంకారానికి గురైనట్లు భావించాలా అని ప్రశ్నించాను తప్ప లెనిన్‌ గురైనట్లు నేను చెప్పలేదు. ” రష్యన్‌ ” పదం లేకుండా తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు. స్టాలిన్‌ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో ఉన్నవారిని ఏ విధంగానూ సంతుష్టీకరించలేము.యుఎస్‌ఎస్‌ఆర్‌లో ఉన్నది ఫెడరల్‌ ప్రభుత్వం తప్ప రంగనాయకమ్మగారు పేర్కొన్నట్లుగా రష్యాలోని కేంద్ర ప్రభుత్వం కాదు. అధికార కేంద్రం(రాజధాని) మాస్కోలో ఉన్నంత మాత్రాన అది రష్యన్‌ కేంద్ర ప్రభుత్వం కాదు.


2. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వంతో కుదుర్చుకొనే ఒప్పందాలమీద దేశాధినేతల సంతకాలు, తరువాత వాటిని పార్లమెంటు ఆమోదించటాలు, పార్టీల విధాన రూపకల్పన పద్దతికి ఉన్న తేడా గురించి రంగనాయకమ్మగారికి తెలియదనుకోలేం. ప్రభుత్వ ఒప్పందాలను సులభతరంగా పాఠకులు అర్ధం చేసుకొనేందుకు అధినేతలు ఒప్పందాలు చేసుకున్నారని ఒక జర్నలిస్టుగా అనేక సార్లు స్వయంగా రాశాను. ఒక విధానాన్ని స్టాలిన్‌కు ఆపాదించి తాను చేసిన దాడిని సమర్ధించుకొనేందుకు నేను చేసిన ప్రస్తావనను ఉటంకిస్తూ నేను కూడా వ్యక్తులకు ఆపాదించినట్లు ఆమె చిత్రించారు. ఒప్పందాలపై సంతకాలు సాంకేతికంగా ప్రభుత్వాల తరఫు దేశాధిపతులు లేదా మంత్రులు కూడా చేస్తారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఆమోదించే,అనుసరించే విధానం అన్నది సమిష్టి నిర్ణయం. ఆమోదించిన తరువాత వాటి మీద లెనిన్‌, స్టాలిన్‌ లేదా ఒక వేళ రంగనాయకమ్మగారే ఏదైనా పార్టీ నేతగా ఉంటే ఆమె సంతకాలు, గెజెట్‌ నోటిఫికేషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల ఒప్పందాలను లిఖించేది అధికారులు. పార్టీల విధాన రూపకల్పన పరిధి, అంశాలను కమిటీలు ఆవెెూదించిన తరువాత ముసాయిదా రాతపనిని ఒకరికో, ఒక బృందానికో అప్పగిస్తారు, వారు దాన్ని ప్రతిపాదిస్తారు, లేదా వివాదం తలెత్తినపుడు కొంత మంది కలసి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తారు. వాటికి ఆమోదం లేదా తిరస్కారం తరువాత అది వ్యక్తులది కాదు ఉమ్మడి అభిప్రాయం మాత్రమే. లెనినిజం, స్టాలినిజం,మరొకయిజం అన్నది మార్క్సు-ఎంగెల్స్‌ల తరువాత సంభవించిన నూతన పరిణామాలు లేదా రంగనాయకమ్మగారి వంటి వారు ముందుకు తెచ్చిన భాష్యాల్లోని వక్రీకరణలను తిప్పికొట్టేందుకు లెనిన్‌ ఇచ్చిన వివరణలు మార్క్కిస్టు సిద్దాంతాన్ని పరిపుష్టం చేశాయి, వాటిని దాదాపుగా కమ్యూనిస్టులందరూ అంగీకరించారు గనుక తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అని పిలిచారు. స్టాలిన్‌ కూడా కొన్ని అంశాలకు వివరణ ఇచ్చినప్పటికీ వాటిని స్వీకరించినా దాన్ని స్టాలినిజంగా ఎవరూ పరిగణించటం లేదు. అలాగే మావో వివరణలు ఆమోదించిన వారు మార్క్సిజం-లెనినిజాలకు మావో ఆలోచనా విధానమనో, మావో ఇజమనో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోని వారు కూడా చైనా పరిస్ధితులకు మావో అన్వయించిన సూత్రీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక రంగనాయకమ్మగారి భాష్యాలను ఆమోదించిన వారు మార్క్సు-లెనిన్‌ సరసన ఆమె ఇజాన్ని కూడా చేర్చి విప్లవాలను తేవచ్చేమో ? ఇంతకీ ఆమె ఇజాన్ని ఆమోదించే లేదా అమలు చేసే పార్టీ ఏదైనా ఉందా ? నిజంగా తెలుసుకొనేందుకే !

3) 1953లో స్టాలిన్‌ మరణం తర్వాత అధికారానికి వచ్చిన కశ్చెవ్‌ స్టాలిన్‌ మీద చేసిన దాడి గురించి చెప్పనవసరం లేదు. అదే పెద్ద మనిషి, బ్రెజ్నెవ్‌ కూడా స్టాలిన్‌ విధానాన్నే కొనసాగించాడని అందుకే ఇతర జాతుల వారు విడిపోవాలనే డిమాండ్‌ను ముందుకు తేలేదని రంగనాయకమ్మగారు చెప్పారు. అలాంటపుడు ఆమె దాడి ఒక్క స్టాలిన్‌ మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు ?


4. సోవియట్‌ యూనియన్‌ నించీ విడిపోయాక ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఉంది. వివిధ పార్టీల, ప్రభుత్వాల నేతలు అమెరికా లేదా రష్యా ప్రభావంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాధారణ దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు తప్ప ఏ కూటమిలోనూ చేరలేదు అని మరోసారి చెబుతున్నాను. తాము నాటోలో చేరాలనుకుంటున్నట్లు బుఖారెస్ట్‌ 2008 నాటో సభకు ఉక్రెయిన్‌, జార్జియా దరఖాస్తు చేశాయి. అమెరికా అంగీకరించగా ఐరోపా దేశాలు కొన్ని కాదన్నాయి, కానీ రాజీగా నిర్ధిష్ట గడువును పేర్కొనకుండా ఈ దేశాలు నాటో సభó్యదేశాలు అవుతాయి అని ప్రకటన చేశారు. తాజా సంక్షోభానికి ఆ విధంగా నాటో కూటమి నాంది పలికింది. తరువాత 2010 ఉక్రెయిన్‌ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ వెంటనే సెవాస్తపూల్‌ రేవు కౌలు గడువును 2042వరకు పెంచుతూ రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే పెద్ద మనిషి తరువాత పశ్చిమ దేశాల వత్తిడితో ఐరోపా యూనియన్‌ కూటమితో ఒప్పందానికి 2013 ఏప్రిల్‌లో సుముఖత తెలిపాడు. వెంటనే రష్యా రంగంలోకి దిగటంతో సంతకాలు చేసేందుకు కొద్ది రోజుల ముందు ఆ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు. ఎవరు వత్తిడి చేస్తే అటు మొగ్గాడు.చివరకు పశ్చిమ దేశాలు నిరసనలను ఎగదోయటంతో దేశం విడిచి వెళ్లాడు. వాస్తవం ఇది కాగా ” అతనికి ముందు 1991 నించీ 2012 వరకూ వున్న వాళ్ళూ, అతని తర్వాత వాళ్ళూ అమెరికా కూటమికి అనుకూలురూ అన్నమాట! ” అంటూ రంగనాయకమ్మగారు చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్దామె అనాకారి అన్నట్లుగా ఉంది.


5) ” రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ వుంది అని వ్యాసకర్త సమర్ధన. అసలు అక్కడ, అప్పుడు వున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం. ఇంకా సరిగా చెప్పాలంటే, పార్టీ పెట్టుబడిదారీ విధానం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల స్వంత ఆస్తిగా లేనంత మాత్రాన, అది సోషలిజం కాదు. ” అన్నారు. అంటే సోవియట్‌ యూనియన్ను సోషలిస్టు దేశంగా గుర్తించలేదు. తత్వం తలకెక్కింది రోకలిని తలకు చుట్టమనటం తప్ప మరొకటి కాదు. సోషలిస్టు వ్యవస్దలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్లు ? ఫలితాలను ఎవరు అనుభవిస్తారు ?

6) ” కొన్ని దేశాలు అమెరికా పెత్తనానికీ, దుర్మార్గానికీ బలయ్యాయనీ రష్యాకి అలాంటి దుర్మార్గ చరిత్ర లేదనీ వ్యాసకర్త కితాబు. మరి, 1956లో హంగరీ మీదకీ, 1968లో చెకొస్లవేకియా మీదకీ, 1979లో అఫ్గనిస్తాన్‌ మీదకీ యుద్ధ టాంకుల్ని పంపింది, రష్యాయా, అమెరికాయా? ” అని ప్రశ్నవేశారు. మొదటి రెండు ఉదంతాల్లో సోషలిస్టు వ్యవస్ధకు అమెరికా సిఐఏ కుట్రలతో ముప్పు తలపెట్టినపుడు వాటి రక్షణకు అక్కడి ప్రభుత్వాల కోరిక మేరకు సోవియట్‌ జోక్యం చేసుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష శక్తుల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేసిన కుట్రను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ కోరిక మేరకే అడుగు పెట్టింది. దానిలో ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ కూడా భాగస్వామే. అంతర్జాతీయ కర్తవ్యంగా ఆపని చేసినందుకు సోషలిస్టు అభిమానులందరూ హర్షించారు. రంగనాయకమ్మ వంటి వారు పురోగామివాదులుగా చెప్పుకుంటూ శత్రువులతో గొంతు కలిపి ఖండించారు. సోషలిస్టు శత్రువులకూ-మిత్రులుగా చెప్పుకున్నవారికీ భలే కలిసింది. సోషలిజం, కమ్యూనిజం అంటే గిట్టదు అని సూటిగా వ్యతిరేకించే వారిని అర్దం చేసుకోగలం. వారి గురించి పురోగామి శక్తులకు స్పష్టత ఉంటుంది. కానీ మార్క్సిస్టు ముసుగులో ఉండి దాడి చేసే వారు ” కుహనా మిత్ర శత్రువులు ” తప్ప మరొకటి కాదు. అసలు శత్రువుల కంటే వీరు చేసే నష్టం ఎక్కువ. వారు సృష్టించిన గందరగోళంలో పడిన పురోగామి వాదులు ఎటూ తేల్చుకోలేక పడక కుర్చీలకు తప్ప దేనికీ పనికి రారు. అంతిమంగా వారు పాలకవర్గాలకు మేలు చేస్తున్నారు తప్ప కార్మికవర్గానికి కాదు.
7) ”ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణని సమర్ధించడానికి, వ్యాసకర్త ఒక కొత్త సూత్రాన్ని తయారు చేశారు. ‘అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు’ అని ” అవును, అది మన కళ్ల ముందున్న ఒక వాస్తవం.శాశ్వతంగా అలాగే ఉంటాయని నేను చెప్పలేదు. పెట్టుబడిదారీ దేశాల స్వభావం గురించి మార్క్సూ- ఎంగెల్సులు చెప్పిన మాట నిజం. అది సాధారణ సూత్రీకరణ. పారిశ్రామిక విప్లవం తరువాత మార్కెట్ల ఆక్రమణకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగానే యుద్దాలు జరిగాయి. తరువాత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా దురాక్రమణదారులుగా మారలేదు. వలసలు అంతరించాయి. దాన్ని గుర్తించకపోతే మొరటుతనం అవుతుంది తప్ప మార్క్సిజం లెనినిజం కాదు. సోషలిస్టు చైనా మీద అమెరికా కుట్రలు చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు తోడ్పడితే వారి సహకారం తీసుకోవాలి. దానిలో భాగమే రష్యా-చైనా మైత్రి. అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా, మరొక సోషలిస్టు దేశం గానీ అవకాశం వచ్చినపుడు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం చేసుకోకపోతే శత్రువలలో చిక్కినట్లే ! అసలు ఇంతకూ రంగనాయకమ్మగారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళ గీతం పాడుతున్నారా ?
8) దురాక్రమణ యుద్ధానికి నాజూకైన పేరే ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రంగనాయకమ్మగారు అంటున్నారు. ఎవరు దేన్ని ముట్టుకుంటే దాన్ని అలా వర్ణిస్తారు అన్న అంధ వికలాంగులు- ఏనుగు కథ తెలిసిందే. దీని కంటే కళ్లుండీ చూడలేక మార్క్సిస్టు కబుర్లు చెబుతున్నవారు తమ వక్రీకరణలకు నాజూకైన పేర్లు పెట్టటమే పెద్ద నష్టం కలిగిస్తోంది. రష్యా తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యకబుర్లు చెప్పలేదు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యఖూనీ జరిగిందనా లేదు. నాటో చేరాలనే ప్రతిపాదనను వదులు కుంటే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తిస్తానని, ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇస్తానని చెప్పింది.


9)” అమెరికా, రష్యా, రెండూ పెట్టుబడిదారీ దేశాలే అని ఒక పక్కన ఒప్పుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా రష్యాని బలపరచాలని సలహా ఇస్తున్నారు వ్యాసకర్త” అన్నారు రంగనాయకమ్మగారు. మార్క్సిజంలో ఔపోసన పట్టటానికి ఇంకేమీ మిగిలినట్లు లేదు కనుక ఆమె చరిత్రను ఒక పట్టుపట్టాలి. చైనా విప్లవ చరిత్రలో జపాన్‌ సామ్రాజ్యవాదుల మీద పోరాడేందుకు అప్పటి వరకు తమను అణిచివేస్తున్నచాంగ్‌కై షేక్‌తోనే కమ్యూనిస్టులు చేతులు కలిపారు.” ఇద్దరు బందిపోటు ముఠాలున్నప్పుడు, ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. అంతేగానీ, ‘ఈ బందిపోటుది న్యాయం, ఆ బందిపోటుది కుట్ర’ అని ఏదో ఒక పక్షాన నిలబడడం అంటే, రెండు దేశాల ప్రజలకూ ద్రోహం చెయ్యడమే.” అని చెప్పిన రంగనాయకమ్మగారి సూత్రీకరణలో చైనా పరిణామాన్ని ఎలా ఇముడ్చుతారు ? మావో నాయకత్వంలో అక్కడి పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని చెబుతారా, ఏమో !


10) ”వ్యాసకర్త… అమెరికా, పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ సోషలిస్టు దేశాలు ఎక్కడున్నాయో చెపితే బాగుండేది. చైనాలో మావో గ్రూపూ, చౌ ఎన్‌ లై గ్రూపూ, లిన్‌ పియావో గ్రూపూ అంటూ 3 పెద్ద గ్రూపుల మధ్య కమ్యూనిస్టు పార్టీలోనే వర్గ పోరాటం లాంటిది జరుగుతూ వుండేది. దాని ఫలితంగానే, అప్పటికి ఎన్నో ఏళ్ళుగా సంబంధం లేని అమెరికాతో చైనా సంబంధాలు మొదలైనాయి.” అని రంగనాయకమ్మగారు చెప్పారు. విస్సన్న చెప్పిందే వేదం – నేను చెప్పిందే అసలు సిసలు మార్క్సిజం అని ఆమె అనుకుంటున్నట్లున్నారు. చైనాతో సహా ఇతర సోషలిస్టు దేశాలను గుర్తించటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైద్దాంతిక, విధానాల అమలు మీద అంతర్గత చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ” వర్గపోరాటం ” అని ఏ మార్క్సిస్టు అవగాహన ప్రకారం వర్ణించినట్లు ? అందుకే పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా తొలి స్పందనలో మనవి చేశాను. మరోసారి అదే చేస్తున్నాను.

” నాగరిక ” ఐరోపాలో ఉక్రెయిన్‌ మహిళల మాన మర్యాదలకు ముప్పు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు, వద్దే వద్దు ! దానిలో ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలే అన్నది ప్రపంచ అనుభవం. సామ్రాజ్యవాదులు తమ లబ్దికోసం యుద్దాలను రుద్దుతున్నారు. అమెరికా, ఐరోపా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య. దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు అనుసరించిన విస్తరణ వాదం చివరకు తన ముంగిట్లో ముప్పుకు దారితీస్తున్నదనే భయాన్ని రష్యా పదే పదే వెల్లడించినా ఐరాస పట్టించుకోలేదు. దుష్టవిధానాల కారణంగా ప్రారంభమైన దాడులను ఎందరు మరణించినా సరే, అతివల మాన మర్యాదలు మంట కలిసినా, పిల్లల జీవితాలు నాశనమైనా తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలు మరింతగా ఎగదోస్తున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 49లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా ఉక్రెయిన్‌ పౌరులు వలస వెళ్లారు. దేశంలో 71లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొన్ని అంచనాల ప్రకారం మరొక కోటీ ఇరవైలక్షల మంది ఎటూ పోలేని స్ధితిలో ఉన్నారని వార్తలు. మొత్తం జనాభా నాలుగున్నర కోట్ల మంది అంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా సరే నాటో కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన జెలెనెస్కీలో ఎలాంటి మార్పు లేదు. దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తమవైపు నుంచి ఉండదని రష్యా పదే పదే చెబుతున్నా నాటో దేశాలు ఇచ్చే ఆయుధాలను చూసుకొని మరింతగా పరిస్ధితిని దిగజార్చుతున్నాడు.


రష్యా దాడులతో విదేశాలకు కాందిశీకులుగా వెళ్లినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు.వారికి బాంబులు, బుల్లెట్లు,క్షిపణుల ముప్పు లేదు. ఆశ్రయం ఇచ్చిన వారి చేతుల్లో మరొక ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. ఆడపిచ్చితో తపించేవారు, దేహాలతో వ్యాపారం చేసే తార్పుడుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతకళేబరాల కోసం వాలే రాబందుల మాదిరి కాందిశీక మహిళల కోసం సాయం చేసే స్వచ్చంద సేవకులు, ఇతర ముసుగులో పోర్నోగ్రాఫర్స్‌(బూతువ్యాపారులు) వాలిపోతున్నారు. కాందిశీకులకు భాష కూడా పెద్ద సమస్యగా మారి వేటగాండ్ల వలలో చిక్కుకుంటున్నారు. తీవ్ర గర్హనీయ అంశం ఏమంటే ఒంటరిగా ఉండే పురుషుల ఇండ్లకు శరణార్ధులైన మహిళలు, పిల్లలను బ్రిటన్‌ ప్రభుత్వం పంపుతున్నదని, ఇది వారిని లైంగికంగా దోపిడీ చేసేందుకు దోహదం చేస్తుందని సాక్షాత్తూ ఐరాస కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే వారెంత నిస్సహాయ స్ధితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక మంది తాము ఎక్కడ ఎలాంటి వారి చేతుల్లో ఇరుక్కున్నామో వెల్లడిస్తున్న గాధలు పత్రికల్లో వస్తున్నాయి.


ఐరోపా దేశాల బూతు వెబ్‌సైట్లలో ఇప్పుడు ఉక్రెయిన్‌ పేరు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది.మహిళల దేహాలు మగతనపుదాడుల కేంద్రాలుగా మారుతున్నాయి.” మేము ఉక్రెయిన్‌పై బాంబులు వేశాము, అమ్మాయిలను అనుభవించాము.యుద్దానికి వెళ్లే ముందు రష్యన్‌ బాలికను అనుభవించిన ఉక్రెయిన్‌ సైనికుడు. ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం ” వంటి అంశాలు బూతుసైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంతకంటే దారుణమైన భాష వాడుతున్నారు. ” ఉక్రెయిన్లో యుద్దం బూతుకు ప్రతిరూపంగా మారింది ” అని ఒక విశ్లేషణకు ఇచ్చిన శీర్షిక. ఇదంతా ఎక్కడో కాదు మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెబుతూ నాగరికులం అని తమకు తామే కితాబునిచ్చుకుంటున్న ఐరోపాలో జరుగుతోంది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షకులం తామే అని ఫోజు పెట్టే అమెరికా, ఐరోపా దేశాలకు ఈ దారుణాలు పెద్దగా పట్టినట్లు లేదు. ప్రతి మానవ విపత్తులోనూ సర్వం కోల్పోయినపుడు ఇలాంటి లైంగిక దాడులు లేదా దోపిడీకి మహిళలు గురికావటం, లాభాల కోసం ఉపయోగించుకోవటం సర్వసాధారణంగా మారింది.


” రుమేనియా సరిహద్దులో మాటువేసిన పురుషులు ఆకర్షణీయ వాగ్దానాలతో లోబరుచుకుంటున్నారు. మీ సెల్‌ఫోన్లకు చార్జిచేసుకోండి, మీరు ఏదైనా కారు ఎక్కితే వాటి నంబర్లు నమోదు చేసుకోండి అని హంగరీ అధికారులు చెబుతున్నారు. పాసుపోర్టులు తమకు స్వాధీనం చేస్తే ఆశ్రయం కల్పిస్తామని, డబ్బిస్తామని కొందరు చెబుతున్నారు” అని ఐరోపా కౌన్సిల్‌ అనే మానవహక్కుల సంస్ధ తన నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలివి. తీరా ఆశ్రయం కల్పించిన వారి ఇండ్లకు వెళ్లిన తరువాత వారి నిజస్వరూపాలు వెల్లడి కావటంతో అనేక మంది తప్పించుకొని తిరిగి సరిహద్దులకు చేరి కొత్తగా వస్తున్న కాందిశీకులను హెచ్చరిస్తున్నారు. పదిహేనులక్షల మంది పిల్లలు పెద్దవారి తోడు లేకుండా సరిహద్దులు దాటి వచ్చారని వారికి ముప్పు ఉందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.మానవ వ్యాపారులు వారిని ఐరోపా దేశాలకే కాదు, వెలుపలకు కూడా తరలించవచ్చని, ఇలాంటి వారితో జరిపే బూతు వ్యాపార విలువ ఏటా వంద బిలియన్‌ డాలర్లని అంచనా. అవయవవ్యాపారుల సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ ఆర్ధిక దుస్ధితి కారణంగా మహిళలు చాలా కాలం నుంచి దోపిడీకి గురవుతున్నారు. అద్దెగర్భాలతో పిల్లల్ని కనటం ఇక్కడ చట్టబద్దం కావటంతో ఆ విధంగా కూడా వారు బాధితులే. కరోనా కారణంగా పరిస్ధితులు దిగజారటంతో యుద్ధానికి ముందే అనేక మంది ఉక్రెయిన్‌ మహిళలు విదేశాల్లో ఉపాధిపేరుతో మానవ వ్యాపారుల(తార్పుడు) వలలో చిక్కుకున్నారు. ఇది మరొక విపత్తు. తాజాగా పోలెండ్‌, తదితర దేశాల్లో అలాంటి వారి వలనుంచి తప్పించుకున్నవారి ఉదంతాలు కూడా ఉన్నాయి.


మార్చినెలలో స్వీడెన్‌ పోలీసులు 38 మంది పురుషులను వ్యభిచార నేరం కింద అరెస్టు చేశారు. వారిలో 31 మందితో ఉన్న మహిళలు ఉక్రెయినుకు చెందిన వారే, ఇటీవల వచ్చిన వారు అని పోలీసులు వెల్లడించారు. రవాణా, ఆశ్రయం వంటి ఇంటర్నెట్‌లో ప్రకటనలతో సంఘటితంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిను కాందిశీకులు 40కిపైగా దేశాలకు వలస వెళ్లినట్లు ఇప్పటి వరకు వివరాలు చెబుతున్నాయి.ఐరాస పేర్కొన్న 49లక్షల మందిలో ఒక్క పోలెండులోనే 27,63,786 మంది ఉన్నారు. మూడు లక్షలకు పైబడి రుమేనియా,హంగరీ, మాల్డోవా, స్లోవేకియా, జర్మనీ ఉన్నాయి. ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి నయానాజీలు జరుపుతున్నదాడులు, అత్యాచారాల నుంచి తప్పించుకొనేందుకు 4,84,725 మంది రష్యాకు కాందిశీకులుగా వెళ్లారని కూడా ఐరాస తెలిపింది. ఈప్రాంతం నుంచి జనాలు వెళ్లిపోవాలని ఉక్రెయిను ప్రభుత్వమే ఆదేశించింది.
ప్రభుత్వం రూపొందించిన పధకం ప్రకారం బ్రిటన్‌లోని కుటుంబాలు, ఒంటరి పురుషులు ఉక్రెయిన్‌ మహిళలకు తమ రూముల్లో లేదా ఇతరంగా ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం కాందిశీక మహిళలను కేటాయించి పంపుతుంది. ఈ కార్యక్రమం తార్పుడు గాళ్లకు చెకుముకి రాయి వంటిదని ఒక స్వచ్చంద సంస్ద తూర్పారబట్టింది. వేలాది మంది బ్రిటన్‌ పురుషులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమతో శృంగారంలో పాల్గొంటేనే ఆశ్రయం కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో వారి కారుణ్యం వెనుక ఉన్న వలేమిటో అర్ధమైంది. నిజానికి ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు అనేక దేశాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఉచితంగా జర్మనీ లేదా పోలెండ్‌ తీసుకుపోతామంటూ ముందుకు వచ్చిన వారెందరో లైంగికదోపిడీ గాళ్లని తేలింది. తమ ఆశ్రయం పొందాలన్నా, తాము చూపిన ఉపాధిలో చేరాలన్నా తమను లేదా తాము పంపేవారిని గాని లైంగికంగా తృప్తి పరచాలనే షరతులను ముందుకు తెస్తున్నారు.


ఉక్రెయిన్‌ మిలిటరీ లేదా నయా నాజీలకు ఆయుధాల అందచేతలో అమెరికా,బ్రిటన్‌ ముందున్నాయి. బ్రిటన్‌ పాలకుల మరొక దుర్మార్గం ఏమంటే వివిధ దేశాల కాందిశీకులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకుండా ఖర్చును తగ్గించుకొనేందుకు తూర్పు ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి పంపుతున్నది.ఈ చర్యను ఐరాస కాందిశీకుల కమిషనర్‌ ఖండించినా బ్రిటన్‌ ఖాతరు చేయటం లేదు, అక్రమంగా ఇంగ్లీషు ఛానల్‌ దాటుతూ ప్రమాదాలపాలు కాకుండా నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నామని కుంటిసాకులు చెబుతున్నది. ఉక్రెయిన్‌ కాందిశీకులకూ దీన్నే అమలు జరుపుతున్నారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పడని వారు ఎవరైనా బ్రిటన్‌ వస్తే వారిని వదిలించుకోవటం ఒక విధానంగా పెట్టుకున్నది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ కాందిశీకులను చౌకగా పని చేసే శ్రామికులుగా వినియోగిస్తూ గతంలో ఉన్నవారిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


లండన్‌ టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకామె కాందిశీకుల దురవస్తలను తెలుసుకొనేందుకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వచ్చిన 22 ఏండ్ల నటలయ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే కుప్పలు తెప్పలుగా శృంగార సందేశాలు పంపుతూ బ్రిటన్‌ పురుషులు స్పందించారు. నా దగ్గర పెద్ద పరుపు ఉంది, ఇద్దరం ఇబ్బంది లేకుండా నిద్రించవచ్చని, నేను సాయం చేస్తా ప్రతిగా నీవు కూడా ఏదో చేయాలి, నీకు వివాహం కాకపోతే నేను చేసుకుంటా,నిన్ను మంచిగా చూసుకుంటా వంటి సందేశాలు వచ్చాయి. ఆమెకు రెండు రోజుల్లో వచ్చిన 75 ప్రయివేటు సందేశాలు పంపిన వారిలో 41 మంది ఒంటరి పురుషులే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడపోతలో నేర చరితులను నిరోధించటం సాధ్యం అవుతుంది తప్ప శృంగార వలవిసిరే వేటగాళ్లు దొరకరు. ఆ వలకు చిక్కిన వారి పరిస్ధితి ఏమిటి ?


ఏప్రిల్‌ 20 నాటికి రష్యా సైనిక చర్య ప్రారంభమై 57వ రోజుకు చేరుకుంది. తన యుద్ద నౌకను ముంచి వేసిన తరువాత రష్యాదాడులను ముమ్మరంగావించింది. కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తూర్పు ఉక్రెయిను మీద దాడి మరింత సులభం అవుతుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో స్ధానికంగా ఉన్న తన మద్దతుదారులతో కలసి పెద్ద ఎత్తునదాడులకు దిగనున్నట్లు తాజావార్తలు వెల్లడించాయి. రష్యా నౌకను ముంచామని, సైనికులకు నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ పాలకులు ఆనందం వెల్లడించటం ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలకు ఆనందం, తృప్తి కలగవచ్చునేమో గానీ తన పౌరులకు, ఆర్ధికరంగానికి జరుగుతున్న నష్టం గురించి జెలెనెస్కీ, ఇతర విధాన నిర్ణేతలకు పట్టినట్లు లేదు.

చైనాతో సఖ్యత కోరితే దేశద్రోహం – వాణిజ్యం చేస్తే దేశభక్తి ! ఏమి తర్కంరా బాబూ !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్‌(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్‌ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్‌ ఫర్‌ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్‌ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!


చైనా విదేశంగ మంత్రి వాంగ్‌ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్‌(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్‌ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్‌ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్‌ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ భారత్‌-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.


ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్‌ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్‌ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్‌ పూనుకుందన్నది స్పష్టం.


మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్‌ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్‌ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్‌ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.


చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్‌ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్‌ ఉదంతాలు చూసినపుడు మన సోషల్‌ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.


ఉక్రెయిన్‌ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.


గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్‌-రిలయన్స్‌ వివాదం, మన కార్పొరేట్‌ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్‌ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్‌ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్‌ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్‌ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !

ప్రతి ఘనతా నరేంద్రమోడీ ఖాతాకే, ఓకే ! ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29శాతం ఉంది. ఏప్రిల్‌ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఉపాధి ఉన్న వారికి కూడా వేతనాల పెరుగుదల ఉండటం లేదు. 2004-05 నుంచి 2011-12 వరకు కాజువల్‌, రెగ్యుల కార్మికుల వేతన పెరుగుదల 5.2శాతం ఉంటే 2011-12 నుంచి 2018-18 వరకు 1.05శాతానికి తగ్గిందని(ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌ వర్కింగ్‌ పేపర్‌ 1-2020) తేలింది. కరోనా కాలంలో పరిస్ధితి ఎలా దిగజారిందో, తరువాత ఎలా ఉందో తెలిసిందే. 2021 మార్చినెలతో పోలిస్తే 2022 మార్చినెలలో ఆహార ధరల పెరుగుదల రేటు రెట్టింపు అంటేే నమ్ముతారా ? ఇవి ఏప్రిల్‌ 12న ప్రకటించిన మోడీ ప్రభుత్వ లెక్కలే.గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 2021 మార్చినెలలో 3.94శాతం ఉంటే, ఈ ఏడాది 8.04శాతానికి పెరిగింది. ఇదే మాదిరి ధరల సూచిక 4.61 నుంచి 7.66శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చినెలల్లో 5.81 నుంచి 8.04శాతానికి చేరింది. దేశం మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో 4.87 నుంచి 7.68శాతానికి, మొత్తంగా ధరల సూచిక గత పదిహేడు నెలల్లో గరిష్టంగా 6.95శాతానికి ఈ ఏడాది మార్చిలో పెరిగింది. ఆహార వస్తువుల్లో నూనెల ధరల సూచిక ఏడాది క్రితంతో పోలిస్తే 18.79 పెరిగింది.
ధరలు పెరిగితే ఏమౌతుంది ? ప్రతి ఒక శాతం ఆహార ధరల పెరుగుదల కోటి మందిని దుర్భర దారిద్య్రంలోకి నెడుతుందని ప్రపంచ బాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ చెప్పాడు. ధనికులు తట్టుకుంటారు, పేదలు ఓపలేరు, పోషకాహరలేమితో పిల్లలు గిడసబారతారు అని కూడా చెప్పాడు.

ద్రవ్యోల్బణ పెరుగుదల ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది, అమెరికా,బ్రిటన్‌, చైనా, శ్రీలంక, పాకిస్తాన్లో కూడా ఉంది అని కొంత మంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకు వచ్చేందుకు పూనుకున్నారు. అంటే మన ఏలికలు దేశాన్ని లంక, పాకిస్తాన్‌గా మార్చబోతున్నారా ? నరేంద్రమోడీ విధానాల ఘనత ఎక్కడికి పోయినట్లు ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఇతర సందర్భాల్లో వాటితో మనలను పోల్చటం ఏమిటని అంటారు. బ్రిటన్‌లో గాస్‌, విద్యుత్‌ ఛార్జీలు ఇటీవలి కాలంలో 54శాతం పెంచిన కారణంగా అక్కడ ఏడుశాతం ద్రవ్యోల్బణం ఉంది. మరి మన దేశంలో కూడా అదే స్దాయిలో ఎందుకున్నట్లో మోడీ సమర్ధకులు చెప్పాలి. అమెరికాలో ధరల సూచిక 8.5శాతం పెరిగింది. చైనాలో ఫిబ్రవరి నెలలో 0.9శాతం వినియోగదారుల సూచి పెరగ్గా మార్చినెలలో 1.5శాతం ఉన్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.దక్షిణ కొరియాలో 4.1శాతం ఉంది. పాకిస్తాన్‌లో మార్చి నెలలో 12.7, శ్రీలంకలో 18.7 శాతం చొప్పున ఉంది. మనం ఎవరి బాటలో నడవబోతున్నాం ? చైనా మార్గమా ? ఇతర దేశాల వెంటా ? ఎవరి మార్గం అనుసరిస్తారో మనకు అనవసరం, ధరలు తగ్గకపోతేమానే పెరగకుండా చూడండి మహా ప్రభో అంటున్నారు జనం.


ప్రతిదానికీ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక సాకుగా చూపటం, జనాన్ని వెర్రివాళ్లను గావించటం మామూలైంది. మనం కూడా గుడ్డిగా నమ్ముతున్నామనుకోండి ! సదరు యుద్దం ప్రారంభమైంది ఫిబ్రవరి 24న, కానీ ఆ నెలలో మన దేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 1.7శాతమే, కానీ అంతకు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 4.7శాతం తగ్గింది. ఈ కాలంలో అంతా బాగుందన్నారు, నవంబరు నాలుగు నుంచి 137 రోజులు చమురు ధరలను మన సర్కారు పెంచలేదు. ఇతరంగా ప్రభావాలేమీ లేవు, ఈ కాలంలో కార్మికుల సమ్మెలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది.మరి ఉత్పత్తి ఎందుకు పడిపోయినట్లు ? ఎలక్ట్రానిక్స్‌ వంటి గృహౌపకరణాలు, ఇతర పరికరాల ఉత్పత్తి 8.2, 5.5శాతాల చొప్పున తిరోగమనంలో ఉంది. మార్చి నెల, తరువాత రోజుల్లో యుద్ద ప్రభావాల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది మరింతగా పడిపోనుంది.


ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ వాటా 30,20శాతాల చొప్పున ఉంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే దేశాల్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు, మన దేశంలో ఎందుకు పెరగాలి? ఆహార ధాన్యాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్లు కొందరు చెబుతారు. అదే నిజమైతే ధరలెందుకు తగ్గటం లేదు. దేశంలో 23-25మిలియటన్నుల ఖాద్యతైలాల వినియోగం ఉండగా స్ధానికంగా ఉత్పత్తి పదిమిలియటన్నులు. మిగతాదంతా దిగుమతే. మన దేశం దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల్లో పామాయిల్‌ 62శాతం ఉంది. పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా 14శాతమే. అది ఫిబ్రవరి వరకు సజావుగానే వచ్చింది. అక్టోబరుతో ముగిసిన ఏడాదిలో మనం 1.89మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు నూనె దిగుమతి చేసుకున్నాం. మన దిగుమతుల్లో ఉక్రెయిన్నుంచి 74, రష్యా, అర్జెంటీనాల నుంచి 12శాతాల చొప్పున జరుగుతోంది. ఉక్రెయిన్నుంచి మార్చినెలలో దిగుమతులు నిలిచినా ఇతర దేశాల నుంచి ఆ మేరకు పామాయిల్‌ దిగుమతులు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాంటపుడు నూనెల ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఏముంది?


ధరల మీద పాలకుల నియంత్రణ కొరవడిందన్నదే అసలు కారణం. పర్యవసానంగా రు.120 నుంచి 190 వరకు నూనెల ధరలు పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకొనే నూనెల మీద విధించిన పన్నుల ద్వారా ఏటా రు.35వేల కోట్లు కేంద్రానికి రాబడి వస్తున్నది. నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతాంగం వరి, గోధుమల వైపు మొగ్గుతున్నారు. సగటున ఏటా పదిబిలియన్‌ డాలర్లను దిగుమతులకు వెచ్చిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు లేవు. తొలి ఐదేండ్లలో అన్ని లోపాలను సరిదిద్దారు అని గతంలో నరేంద్రమోడీ గురించి చెప్పారు.మరి ఇప్పుడు ఎనిమేదేండ్లుగడచినా ఈ లోపాన్ని ఎందుకు సరిచేయలేదన్నది ప్రశ్న. 2013-14లో మన దేశం 11.82 మి.టన్నులు దిగుమతి చేసుకోగా ఇప్పుడు 15మి.టన్నులకు పెరిగిందే తప్ప తరగలేదు.


ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతన పెరుగుదల ఉండదు, దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. అది వస్తువినిమయం తగ్గటానికి, ఉత్పత్తి తగ్గేందుకు. అది ఉపాధి కోల్పోవటానికి దారితీస్తుంది. ఇదంతా ఒక విషవలయం. పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో నిరుద్యోగం12.6శాతానికి చేరింది. అంతకు ముందు మూడు నెలలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న 15ఏండ్లకు పైబడిన వారి శాతం 43.1 నుంచి 40.9శాతానికి తగ్గింది.
కొంత మంది నమ్మిక ప్రకారం ఏ జన్మలో చేసుకున్న ఖర్మ ఫలితమో ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు.ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలేమంటున్నారో చూద్దాం. పిటిఐ వార్తా సంస్ధ 2021 ఆగస్టు ఒకటిన ఇచ్చిన కధనం ప్రకారం మధ్య ప్రదేశ్‌ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ కాంగ్రెస్‌ నిరసన మీద మండిపడుతూ అసలు దేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట దగ్గర ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంతో ప్రారంభమైందని సెలవిచ్చారు. వాక్సిన్లు ఉచితంగా వేయటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిందని బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ చెప్పారు. 2014లో అధికారానికి రాక ముందు పార్టీ పెద్దలు పలికిన సుభాషితాలను చూద్దాం. పెట్రోలు ధరలు పెంచటం యుపిఏ సర్కార్‌ ప్రాధమిక వైఫల్యానికి నిదర్శనమని,సమావేశాలు ముగిసిన తరువాత చేయటం పార్లమెంటును అగౌరవ పరచటమే అని, పెంపుదల వలన గుజరాత్‌ జనాలపై వందల కోట్ల భారం పడుతుందని 2012 మే 23వ తేదీన గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు అదే మోడీ ఏలుబడిలో ధరల పెంపుదలకు అసలు పార్లమెంటుతోనే పనిలేదు.


గాస్‌ సిలిండర్లు పట్టుకొని వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసిన బిజెపి నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారేమన్నారంటే 2011 జూన్‌ 24న ఒక ట్వీట్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ అని చెప్పుకొనే యుపిఏ సర్కార్‌ గాస్‌ బండ మీద రు. 50 పెంపు ఎంత సిగ్గుచేటు అన్నారు.2012 డిసెంబరు 24న మరొక ట్వీట్‌లో యుపిఏ దృష్టిలో జిడిపి వృద్ది అంటే గాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రశ్నించిన వారి మీద ఆమె మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చకపోతే పొలిటీషియన్లు కాదన్న గిరీశాన్ని బిజెపి నేతలు గుర్తుకు తెస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమని 2014కు ముందు చెప్పిన వారు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల మీద నెపాన్ని మోపుతున్నారు. మధ్య ప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారు కూడా నెహ్రూను వదలిపెట్టలేదు. కాంగ్రెస్‌ వారిని ఎద్దేవా చేస్తూ ” చివరికి 1951లో కూడా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ భారత ద్రవ్యోల్బణాన్ని కొరియా యుద్ధం ప్రభావితం చేసిందని చెప్పి ఉండేవారు….. కానీ ఇప్పుడు ప్రపంచం విశ్వవ్యాప్తంగా అనుసంధానమై ఉంది కనుక ఉక్రెయిన్‌ మనలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నాం, అంగీకరించరా ” అన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి మాట్లాడుతూ మధ్యతరగతి వారు కష్టాలను భరించి కరోనా వాక్సిన్లు అందచేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని చెప్పారు. టాక్సులు లేకపోతే చమురు ధరలు ఎక్కువ కాదు. మీరు మాత్రం ఉచితంగా వాక్సిన్లు పొందాలి, మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమీ చెల్లించలేదు, అందుకే ఈ విధంగా వసూలు చేస్తున్నాం ” అన్నారు. జనానికి తెలివితేటలుంటాయని వారు గనుక భావించి ఉంటే ఇంతగా బరితెగించి అడ్డగోలు వాదనలు చేసే వారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో ఏం జరిగినా ఆ ఘనత నరేంద్రమోడీదే, చివరికి పొద్దు పొడుస్తుందన్నా, చీకటి పడుతుందన్నా మోడీ అధికారానికి వచ్చిన నాటి నుంచే జరుగుతోందని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ కంగన రనౌత్‌ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. పోనీ భక్తుల కోరిక మేరకు జరిగిన వాటన్నింటినీ నరేంద్రమోడీ ఖాతాలోనే వేద్దాం. మరి ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ? 1947 నుంచే ప్రారంభమైందని, గాంధీ, నెహ్రూలే కారణం అని బిజెపి పెద్దలు సెలవిచ్చినా జనం నమ్మక తప్పదు, కాదంటే తంటా కొని తెచ్చుకోవటమే. అచ్చేదిన్‌ కనుక మౌనంగా భరిస్తున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు !

ఆత్మగౌరవం, అమెరికా వ్యతిరేకత ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త నినాదమా ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


క్రికెట్‌లో కీలకమైన చివరి ఓవర్‌, బంతి మాదిరి తన ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా శ్రమించినా రాజకీయ క్రీడలో ఓడిపోయాడు. ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల తరువాత అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షం నెగ్గింది. పదకొండవ తేదీన నూతన ప్రధాని ఎన్నిక ఓటింగ్‌కు ముందే పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌ (పిటిఐ) సభ్యులందరూ పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సామూహికంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో ఒక సర్కార్‌ పతనమైంది. గత ఏడాది నవంబరు 28న ప్రారంభమైన ఉత్కంఠకు ఏప్రిల్‌ తొమ్మిదిన తెరపడింది. మరుసటి రోజు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా కొత్త సర్కార్‌ ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం ముగిసినా రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. తదుపరి ఎన్నికలు 2023 ఆగస్టు 13- అక్టోబరు 12 మధ్య జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్‌ నడుస్తుందా ? కొత్త ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ముస్లింలీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ సభ్యుడు షా మహమ్మద్‌ ఖురేషీ కూడా నామినేషన్‌ వేసినప్పటికీ ఆ పార్టీ సభ్యులు రాజీనామా చేయటంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను పిటిఐకి 155 మంది సభ్యులుండగా వారిలో 135 మంది రాజీనామా చేశారు. తిరస్కరించిన 20 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం మీద దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన వెల్లడైనట్లు ఒక సర్వే వెల్లడించింది. సంతోషం వెలిబుచ్చిన వారు 57శాతం, ఆగ్రహించిన వారు 43శాతం ఉన్నట్లు గాలప్‌ పేర్కొన్నది.జనం ఆగ్రహిస్తున్నారని గ్రహించే పిటిఐ సభ్యులు రాజీనామాలకు సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖను ఉపసభాపతి ఖాశింకు అందచేశామని ఆమోదించవచ్చని పిటిఐ నేతలు చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కుట్ర లేఖపై పార్లమెంటరీ కమిటీ విచారణను తాము అంగీకరించటం లేదని, సుప్రీం కోర్టు విచారణ జరపాలని పిటిఐ డిమాండ్‌ చేసింది.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను 174 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ఖాన్‌పై తిరుగుబాటును ప్రకటించిన పిటిఐ పార్టీ సభ్యులు ఓటింగ్‌ సమయంలో అధికాపక్షం వైపే కూర్చున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 172కు గాను అదనంగా మరో రెండు ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలకు వచ్చాయి. అధికారపక్ష సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గతేడాది నవంబరు 28న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీనేత ఖుర్షీద్‌ ఖాన్‌ ఒక ప్రకటన చేస్తూ ఇమ్రాన్‌ ఖానున్న పదవీచ్యుతుడ్ని చేసేందుకు ప్రతిపక్షాలకు మెజారిటీ ఉందని చెప్పాడు. డిసెంబరు 24న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌(ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ కూడా అదే చెప్పాడు. ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదని జనవరి 11న అదే పార్టీ నేత ఖ్వాజా అసిఫ్‌ ప్రకటించాడు. ఇమ్రాన్‌ ఖాన్ను ఇంటికి పంపేందుకు తాము సెనేట్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జరదారీ ప్రకటించాడు.అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్దమని జనవరి 21న అయాజ్‌ సాదిక్‌ చెప్పాడు. ఫిబ్రవరి ఏడున ముస్లింలీగ్‌-పీపుల్స్‌ పార్టీ అధికారికంగానే దీని గురించి చర్చించాయి. పదకొండున ప్రతిపక్షాల తరఫున అవిశ్వాస తీర్మానం గురించి పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ ప్రకటించాడు. మార్చి ఎనిమిదిన పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 12న అధికార పిటిఐ పార్టీ అసంతృప్త నేత అలీమ్‌ ఖాన్‌ లండన్‌లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చించాడు. విదేశీ నిధులతో జరిగిన కుట్ర తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ఉందని మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో చెప్పాడు. మరుసటి రోజు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చింది. ముప్పై ఒకటవ తేదీన దాన్ని చర్చకు తీసుకొని ఏప్రిల్‌ 3కు పార్లమెంటును వాయిదా వేశారు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్‌ తీర్మానం చెల్లదని తిరస్కరించాడు. వెంటనే సభ రద్దు, అధ్యక్షుడి ఆమోద ముద్ర, సుమోటోగా సుప్రీం కోర్టు స్వీకరణ వెంటవెంటనే జరిగాయి.ఏడవ తేదీన స్పీకర్‌ చర్య, సభ రద్దు చెల్లదంటూ పునరుద్దరించిన సుప్రీం కోర్టు తొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ఆదేశించింది. విదేశీ ప్రభుత్వ ఏర్పాటును తాను సహించబోనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమేరకు ఓటింగ్‌ జరిగి నెగ్గటంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ పతనమైంది.


ఏప్రిల్‌ తొమ్మిది-పదవ తేదీ పార్లమెంట్‌ సమావేశంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో అడుగడుగునా ప్రభుత్వ ప్రతిపక్షాలు కత్తులు దూశాయి. అర్దరాత్రి పన్నెండు గంటలకు కొద్ది నిమిషాల ముందు పాలకపక్షం ఎన్నుకున్న స్పీకర్‌ అసాద్‌ ఖ్వైజర్‌ రాజీనామా చేశాడు,ప్రతిపక్ష సభ్యుడు అయాజ్‌ సాదిక్‌కు సభాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు. సాదిక్‌ వెంటనే ఓటింగ్‌ జరిపాడు.ప్రతిపక్షాలకు చెందిన 174 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ప్రతికూలంగా ఎవరూ వేయలేదు.


పదవిలో ఉండగా తన ప్రభుత్వ పతనానికి అమెరికా, భారత్‌, ఇజ్రాయల్‌ ప్రతిపక్షాలతో కలసి కుట్రపన్నిట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించాడు.దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తన ప్రభుత్వాన్ని బెదిరిస్తూ పంపిన లేఖ అంటూ బహిరంగసభలో ప్రదర్శించాడు. మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు, విదేశీ వత్తిళ్లకు భారత్‌ లొంగలేదని చెప్పాడు. మహమ్మదాలీ జిన్నా తరువాత తాను తప్ప పాక్‌ పాలకులుగా ఉన్నవారందరూ సిఐఏ ఏజంట్లు లేదా భారత్‌, ఇజ్రాయల్‌కు అమ్ముడు పోయిన బాపతేనని కూడా చెప్పాడు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభించాలని పదే పదే చెప్పిన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సారాన్ని చూస్తే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, గడువు ప్రకారమే జరిగినా విదేశాంగ విధాన ఆత్మగౌరవ అంశంతో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇది ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. భారత్‌ను తన అక్కున చేర్చుకొనే ఎత్తుగడలో భాగంగా అమెరికా తమ భుజాల మీద నుంచి తుపాకులు పేల్చిందని, ఇప్పుడు అది దగ్గర కాగానే తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పాకిస్తాన్‌ జనంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు ఒక అభిప్రాయం.2018 జనవరి ఒకటిన నాటి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌లో గత పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్‌కు ఇచ్చిన 33 బిలియన్‌ డాలర్లకు ప్రతిగా అమెరికాకు దక్కింది అబద్దాలు, వంచన తప్ప మరొకటి కాదన్నాడు. పాకిస్తాన్‌లో ఏముంటాయంటే మూడు ”ఏ” లు (అల్లా, ఆర్మీ, అమెరికా) ఉంటాయని గతంలో కొందరు ఎద్దేవా చేశారు.
అగ్రరాజ్యమేదీ భారత్‌ను శాసించలేదని, ఆత్మగౌరవాన్ని అక్కడి నుంచి నేర్చుకోవాలని ఖాన్‌ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ భారత్‌ తీసుకున్న వైఖరిని ఏ దేశమూ నిరోధించలేకపోయిందన్నాడు.” రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఐరోపా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ మీద వత్తిడి చేస్తున్నారు కానీ భారత్‌ విషయంలో వారా ధైర్యం చేయలేరు.మరొక దేశం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేను, మన విదేశాంగ విధానం సర్వసత్తాకమైనదిగా ఉండాలి. నా రష్యా పర్యటన పట్ల అమెరికా సంతోషంగా లేదు. మనది ఒక మిత్ర దేశంగా ఉన్నప్పటికీ నాలుగు వందల డ్రోన్‌ దాడులు చేసింది. నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసింది. ఇమ్రాన్‌ఖాన్ను పదవీచ్యుతుడిని చేసిన తరువాతే పాకిస్తాన్ను అమెరికా క్షమిస్తుందని ఒక అమెరికా ప్రతినిధి చెప్పాడు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని నేను అంగీకరించను. న్యాయవ్యవస్ధను నేను గౌరవిస్తాను, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆశాభంగం చెందాను. విదేశీ కుట్ర సాక్ష్యాన్ని కనీసం చూసి ఉండాల్సింది, ఆరోపణలపై విచారణకు ఆదేశించి ఉండాల్సింది. పాకిస్తాన్ను విదేశాలు ఒక తుడుచుకొని పారవేసే కాగితపు ముక్కలా ఉపయోగించకూడదు. ” అన్నాడు.


దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ విదేశీ కుట్రలతో ప్రభుత్వమార్పిడికి వ్యతిరేకంగా మరోసారి స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యం,సార్వభౌమత్వాన్ని ఎల్లవేళలా ప్రజలే కాపాడుకుంటారు” అని పేర్కొన్నాడు. రాజీనామా చేసిన 135 మంది పిటిఐ సభ్యుల లేఖలను ఆమోదిస్తే ఆ స్ధానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది మరొక ఎన్నికల పోరాటంగా మారుతుంది. ఇది కొత్త ప్రభుత్వం మీద, పార్టీల మీద వత్తిడిని పెంచుతుంది. ఎన్నికలు జరిగే వరకు రాజకీయ మధనానికి దారి తీస్తుంది. ఉప ఎన్నికల్లో తిరిగి పిటిఐ అభ్యర్ధులు నెగ్గితే తదుపరి జరిగే ఎన్నికల మీద మరింత వత్తిడిని పెంచుతుంది. లేదా దానికి అవకాశం ఇవ్వకుండా, దేశంలో మరింతగా అమెరికా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు పోవటమా అన్నది కొత్త కూటమి ముందున్న ప్రశ్న.


పాకిస్తాన్‌లో అధికారం ప్రధానంగా మిలిటరీ కనుసన్నలలో నడవటం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు సహకరించినట్లు భావించిన మిలిటరీ ఇప్పుడు వైరంతో ఉందని వార్తలు. కొత్త ప్రభుత్వం పట్ల ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికీ పాక్‌ మిలిటరీ మీద అమెరికా ప్రభావం తీవ్రంగా ఉందన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో అమెరికన్లు మన దేశానికి పెద్ద పీటవేస్తుండటంతో జనంలో అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. భారత్‌ తన ఒళ్లోవాలుతున్నందున మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు, చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టే ఎత్తుగడకు ప్రాధాన్యత ఇస్తున్నందున పాకిస్తాన్‌తో గతం మాదిరి అమెరికా ఉండటం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న స్ధితిలో ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రష్యా,చైనాల వైపు పాకిస్తాన్‌ మొగ్గుతున్నది. బహిరంగంగా అమెరికా వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై అమెరికా కక్షగట్టి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వివిధ శక్తులను ఏకం చేయవచ్చుగానీ దాని విదేశాంగ విధానంలో మార్పులను అమెరికా రుద్దగలదా అన్నది ప్రశ్న. గతం మాదిరి తిరిగి ఇస్లామాబాద్‌ను తన కౌగిలిలోకి అమెరికా తెచ్చుకోదలచుకుంటే, అందుకు పాక్‌ సమ్మతిస్తే పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న నరేంద్రమోడీ పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ఒకే వరలో పాక్‌-భారత్‌ అనే కత్తులను ఇమడ్చాలని అమెరికా చూస్తున్నది. కాశ్మీరు సమస్య కొనసాగినంతకాలం అది కుదరదు.


తనను నమ్ముకున్న దేశాలను అమెరికా నట్టేట ముంచుతుందని గతంలో అనేక మంది హెచ్చరించినా జనాలు పట్టించుకోలేదు. ఆప్ఘనిస్తాన్లో అమెరికాకు ఎదురైన పరాజయం, దానికంటే ఉక్రెయిన్ను ముందుకు తోసి చేతులెత్తేసిన తీరుతో మన దేశంలో అమెరికా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.చైనా బూచిని చూపినా జనం నమ్మే స్ధితి లేదు. ఐరోపాలో నాటో కూటమి పేరుతో తిష్టవేసిన తన సైన్యాలను రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయినుకు పంపటానికి కొన్ని గంటలు చాలు, అయినా అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలేవీ ఆపని చేయలేదు. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపుతున్నాయి. కొంత మంది చెబుతున్నట్లుగా(ఈ రచయిత కాదు) చైనా-భారత్‌ మధ్య యుద్దమే గనుక జరిగితే చతుష్టయ కూటమిలోని అమెరికా లేదా జపాన్‌, ఆస్ట్రేలియా తమ మిలిటరీని మన సరిహద్దులకు పంపుతాయా ? అది సాధ్యమేనా ! కాస్త బుర్రతో ఆలోచించేవారికి కాదని స్పష్టంగా తెలుసు. నేటి భారత్‌ 1962నాటి భారత్‌ కాదని మన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా 1962 నాటి మాదిరే ఉందని అనుకుంటున్నారా ? మనం ఇతర దేశాల దగ్గర ఆయుధాలు కొని పోరుకు దిగాలి. అదే చైనా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులు చేసే స్ధితిలో ఉందని మరచిపోరాదు. ఆర్ధికంగా అమెరికానే సవాలు చేస్తోంది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌తో సహా భారత ఉపఖండంలోని దేశాలన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి. అందువలన చైనాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు పూనుకోవాలే తప్ప అమెరికా ఇచ్చిన తాయత్తులు కట్టుకొని బస్తీమే సవాల్‌ అని రంగంలోకి దిగితే జరిగే ఏం జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.పాక్‌ మిలిటరీతో తమ సంబంధాలు కొనసాగుతాయని అమెరికా మిలిటరీ బుధవారం నాడు ప్రకటించింది.అధికారానిన స్వీకరించి రెండు రోజులు గడిచినా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంత్రివర్గాన్ని ప్రకటించలేదు.భారత్‌ గనుక కాశ్మీరుకు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మనమేం చేయాల్సి ఉంటుందని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో షెహబాజ్‌ ప్రశ్నించాడు.

అతివలకు అగ్రాసనం వేసిన వామపక్ష నికరాగువా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్‌ ఓర్టేగా సర్కార్‌ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్‌ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్‌ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.


1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్‌ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్‌ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.

శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్‌ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.


2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్‌ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.


లాటిన్‌ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్‌ సముద్రం ద్వారా అట్లాంటిక్‌-పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్‌ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్‌ గార్డ్స్‌ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.


2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్‌ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్‌ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్‌ సాల్వడార్‌ చైనాను గుర్తించాయి.హొండురాస్‌ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్‌ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్‌ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్‌ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.