అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

అమెరికాలో కూలుతున్న జఫర్సన్‌ ,రష్యాలో పెరుగుతున్న స్టాలిన్‌ విగ్రహాలు అనే శీర్షికతో అమెరికాలోని అగ్రపత్రికల్లో ఒకటైన లాస్‌ ఏంజల్స్‌టైమ్స్‌ నవంబరు 20న ఒక విశ్లేషణను ప్రచురించింది. ఇదే సమయంలో ఒక స్మారక చిహ్నానికి ఉన్న చట్టబద్దతను రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటీషన్‌పై రష్యా సుప్రీం కోర్టు విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. పూర్వపు సోవియట్‌లో జరిగినట్లు చెప్పే మానవహక్కుల ఉల్లంఘనకు బలైన వారి పేరుతో స్టాలిన్‌, కమ్యూనిస్టు పార్టీ మీద బురద చల్లేందుకు ఏర్పాటు చేసినదే సదరు స్మారక చిహ్నం. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల మీద ప్రేమ పుట్టుకువచ్చి ఈ కేసు దాఖలు చేశారా ?
చరిత్ర నిర్మాతలు జనం, వారికి మద్దతుగా నిలిచిన నేతలు అన్నది తిరుగులేని సత్యం.బ్రిటన్‌ మాజీ ప్రధాని వినస్టన్‌ చర్చిల్‌ చరిత్రను రాసేది విజేతలు అని చెప్పారు. అంతకు ముందు కారల్‌ మార్క్స్‌ చరిత్ర గురించి చెబుతూ చరిత్ర పునరావృతం అవుతుంది, తొలుత అది విషాదకరంగా తరువాత ప్రహసనంగా అన్నారు. చర్చిల్‌ చెప్పినట్లు దేశంలో పూర్తి అధికారాన్ని సాధించిన విజేతగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) తనకు అనుకూలంగా చరిత్రను తిరగరాసేందుకు పూనుకుంది.కారల్‌మార్క్స్‌ చెప్పినట్లు అది విషాదకరమే, రెండవది ఆ పరివారంతో ప్రభావితమై దేశానికి 1947వచ్చింది భిక్ష తప్ప నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ చెప్పటం ప్రహసన ప్రాయమే.( కారల్‌ మార్క్స్‌ ఏ సందర్భంలో,ఏ అంశాల ప్రాతిపదికన అలా చెప్పారని విశ్లేషకులు తలలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు)


అనేక దేశాల్లో చరిత్ర గురించి చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.అమెరికాలో కూడా అదే జరుగుతోంది. లాస్‌ఏంజల్స్‌టైమ్స్‌ విశ్లేషణ రచయిత నికోలస్‌ గోల్డ్‌బెర్గ్‌ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను రాశారు. మరోసారి అమెరికన్లు చరిత్ర గురించి పోట్లాడుకుంటున్నారు అనే వాక్యంతో ప్రారంభించారు. తాజమహల్‌ నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలెవరని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్లే అమెరికా నిర్మాతలెవరు, ఏ పునాదులమీద నిర్మించారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యాన్ని ప్రస్తావిస్తూ అమెరికా నిర్మాతగా పరిగణించే థామస్‌ జఫర్సన్‌ – నాజీల పీచమణచిన కమ్యూనిస్టు నేత స్టాలిన్ల గురించి రాశారు. స్టాలిన్ను నియంతగా వర్ణిస్తూ మే నెలలో జరిగిన సర్వేలో 56శాతం మంది రష్యన్లు స్టాలిన్ను గొప్పనేతగా పరిగణించటం దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ తన రాజకీయ అవసరాల కోసం స్టాలిన్‌కు పునరావాసం కల్పిస్తున్నారని, గత తరాలు ధ్వంసం చేసిన విగ్రహాల స్ధానంలో కొన్ని పట్టణాలలో తిరిగి ప్రతిష్ఠిస్తున్నారని రచయిత వాపోయాడు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ప్రధాన రచయిత ధామస్‌ జఫర్సన్‌ ఆరువందల మంది బానిసలను కూడా కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తి విగ్రహం తమ సిటీ హాల్‌లో ఉండటం అవమానకరమంటూ దాన్ని తొలగించాలని న్యూయార్క్‌ నగరపాలక సంస్ధ ఏకగ్రీవంగా తీర్మానించటం గురించి గగ్గోలు పెట్టాడు. అందుకే జఫర్సన్‌ విగ్రహాలను తొలగిస్తుంటే స్టాలిన్‌ విగ్రహాలను కొత్తగా పెడుతున్నారంటూ విశ్లేషణ చేశాడు.


సోవియట్‌ను కూల్చిన తొలి రోజుల్లోనే స్టాలిన్‌ మీద తప్పుడు ప్రచారం చేసేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేశారు.2016లో దాన్ని విదేశీ ఏజంట్‌గా ప్రకటించారు.దాని ప్రకారం మానవహక్కుల సంస్దల పేరుతో దాన్ని నిర్వహిస్తున్నవారి మీద చర్య తీసుకోవచ్చు. రాజకీయంగా తమను అణచివేసేందుకే పుతిన్‌ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసేందుకు పూనుకుందని వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా స్టాలిన్‌ మీద జనంలో పెరుగుతున్న సదభిప్రాయం కారణంగానే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు పుతిన్‌ కూడా ఎత్తులు వేస్తున్నాడన్నది స్పష్టం. రష్యాకోర్టులో తమ కేసు వీగిపోతే ఐరోపా కోర్టుకు వెళతామని నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ ఏజంట్లనే ముద్రవేసి పుతిన్‌ తన రాజకీయ ప్రత్యర్దులను దెబ్బతీస్తున్నాడు. కమ్యూనిస్టు ఎంపీ మీద కూడా తప్పుడు కేసు పెట్టించాడు.


2010లో స్టాలిన్‌ విగ్రహాలకు మద్దతు ఇచ్చిన వారు 25శాతం, వద్దన్నవారు 36శాతం కాగా ఈ ఏడాది ఆగస్టులో అవి 48 – 20శాతాలుగా ఉన్నట్లు లెవడా కేంద్రం సర్వే వెల్లడించింది.2005-21 మధ్యకాలంలో 18-24 ఏండ్ల వయసులో ఉన్న వారిలో స్టాలిన్‌ పట్ల అభిమానం ఐదు రెట్లు పెరిగింది. స్టాలిన్‌ గొప్పనేత అని చెప్పిన వారు ఈ ఏడాది మేనెల సర్వేలో 56శాతం మంది ఉన్నట్లు, 2016తో పోల్చితే రెట్టింపు అని లెవడా తెలిపింది. ద్వితీయ ప్రపంచ యుద్దంలో సోవియట్ల చర్యలను నాజీలతో పోల్చటాన్ని నిషేధిసూపార్లమెంట్‌ చేసిన తీర్మానానికి ఈ ఏడాది జూలైలో పుతిన్‌ ఆమోద ముద్రవేశాడు.యుద్దంలో పౌరుల నిర్ణయాత్మక పాత్రను తోసిపుచ్చటాన్ని కూడా నిషేధించారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ పతనంలో స్టాలిన్‌ పాత్ర చెరిపితే చెరిగేది కాదు. స్టాలిన్‌ మరణం తరువాత నాటి పార్టీనేతలు చేయని తప్పుడు ప్రచారం లేదు, మసోలియం నుంచి భౌతిక కాయాన్ని తొలగించి క్రెమ్లిన్‌లో సమాధి చేశారు. సోవియట్‌ పతనం ముందు తరువాత కూడా తప్పుడు ప్రచారం సాగినా ఇటీవలి కాలంలో స్టాలిన్‌ పట్ల రోజు రోజుకూ జనంలో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్‌ గురించి ఇతర దేశాల్లో సాగించిన తప్పుడు ప్రచార నేపధ్యంలో అనేక మందికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు గానీ రష్యన్లు ఆ విధంగా భావించటం లేదు. తమ దేశ ఔన్నత్యం నిలిపిన నేతగా పరిగణిస్తున్నారు.


స్టాలిన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా నాజీలు ఆకస్మికంగా దాడి చేసినపుడు ఎర్రసైన్యం పసిగట్టలేకపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఆ కారణంగా 2005 సర్వేలో స్టాలిన్‌ తగిన సన్నాహాలు చేయలేదనే అభిప్రాయం 40శాతం కలిగి ఉండగా 2021లో 17శాతానికి తగ్గింది. స్టాలిన్‌ గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలిపేందుకు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మాస్కోకు 450 కిలోమీటర్ల దూరంలోని నోవోగోర్డ్‌ కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ అధినేత జుగనోవ్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సోషలిస్టు సమాజాన్ని కుప్పకూల్చి జన సంపదలను దోచుకున్న వారు ఎల్సిన్‌ పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినపుడు స్టాలిన్‌ పేరుతో ఏర్పాటు గురించి ఎందుకు ఆలోచించకూడదని జుగనోవ్‌ సహాయకుడు అలెగ్జాండర్‌ యుషి చెంకో అన్నారు. గతంలో ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేదని, సోవియట్‌ పతనం తరువాత పుట్టిన, పెరిగిన యువతరం ఇప్పుడు సానుకూల వైఖరితో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి.


వివిధ సర్వేలలో స్టాలిన్‌ పట్ల సానుకూల వైఖరి వెల్లడి కావటం అంటే నూతన తరంలో సోషలిజం, కమ్యూనిజం పట్ల ఆసక్తి పెరగటం, కూల్చివేసిన సోషలిస్టు సమాజంతో ప్రస్తుత పరిస్ధితులను పోల్చుకోవటం సహజంగానే జరుగుతుంది. అది ఇప్పుడున్న పుతిన్‌ లేదా ఇతర అధికార బూర్జువా పార్టీలకు అంగీకారం కాదు. రెండవది రోజు రోజుకూ పుతిన్ను సమర్ధించేవారు తగ్గుతున్నారు. సర్వేల ఫలితాలు జనంలో చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో సర్వేలు రష్యా సమాజాన్ని ప్రతిబింబించటం లేదని ధ్వజమెత్తుతున్నారు.కొందరైతే సర్వేల్లో అసలు స్టాలిన్‌ గురించి అడగాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రష్యన్‌ చరిత్రలో స్టాలిన్‌ పాత్ర గురించి జనం 70శాతం మంది సానుకూలంగా స్పందిస్తున్నపుడు పండితులు దాన్ని ఎలా కాదో చెప్పలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు, లెవడా సర్వేలు అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి, స్టాలిన్‌ యుద్ధ విజేత, తెలివిగల నేత అని భావిస్తున్నారు. స్టాలిన్ను అభిమానించే వారు పెరగటం అంటే పాలకపార్టీ పట్ల అసంతృప్తి పెరగటంగా భావించవచ్చని కొందరు సూత్రీకరిస్తున్నారు. గతంలో స్టాలిన్ను ఒక నియంత, బూచిగా ఒక పధకం ప్రకారం చూపారు, చరిత్రను చూస్తే మహత్తర పోరాటం సాగించిన స్టాలిన్‌ మీద ఎల్లకాలం బురదచల్లటం కొనసాగించలేని స్ధితిలో జనాలు నిజాలు తెలుసుకుంటున్నారు. వాటిని పుతిన్‌ సహిస్తాడా ? చరిత్రలో వ్యక్తుల పాత్ర తక్కువేమీ కాదు. కానీ చరిత్ర అంటే వ్యక్తులు కాదు. వ్యక్తి ఆరాధనలకు పురోగామి వాదులు, కమ్యూనిస్టులు వ్యతిరేకం.

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

రైతుల చారిత్రాత్మక పోరాట విజయం-ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు !

Tags

, , , , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఉక్కు సంకల్పంతో 2020 నవంబర్‌ 26 నుండి చేస్తున్న రైతులు చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి విజయం లభించింది. పోరాడితే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదని నిరూపించారు. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న అహంకారానికి వ్యతిరేకంగా దఢసంకల్పం సాధించిన విజయం. విపరీతమైన వేగంతో నయా ఉదారవాదాన్ని పెంచి పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ముఖ్యమైన ఎదురుదెబ్బ.మనం ఏమీచేయలేము, ప్రభుత్వం బలమైనది , మొండిగా వున్నది అంటూన్నవారి మాటలను వమ్ము చేశారు.ప్రజలలో ఉన్న నిరాశ,నిస్పహలను పఠాపంచలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకతప్పలేదు.స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించవలసివచ్చింది. ఎట్టకేలకు 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేబినెట్‌ ఆమోదించింది. ఉపఎన్నికలలో ప్రజలు చూపించిన శాంపిల్‌ దెబ్బకే పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ను కొద్దిగా తగ్గించారు.
అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవటంలేదు. చట్టాలు మంచివే కానీ ప్రజలను ఒప్పించుటంలో వైఫల్యం చెందామంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ల లో రాబోయే ఎన్నికల లో చావుదెబ్బ తినబోతున్నామనే సర్వేల సంకేతాలు భాజపా కు మింగుడు పడలేదు. ఉత్తర భారత దేశంలో తీవ్రంగా ప్రజావ్యతిరేకత రాజుకుంటుందని అర్ధమౌతున్నది. దేశ అధికార పీఠానికి ఉత్తర భారతదేశం కీలకం. అక్కడనే నిప్పు రాజుకుంది. ఎవరితోనైనా పెట్టుకో కానీ.. రైతు కూలీలతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండ వని భారత రైతులు చరిత్రను పునరావత్తం చేస్తున్నారు.


ఈ నిర్ణయం వెనుక అపర చాణుక్య నీతే కారణం అని కొంతమంది సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇది మాస్టర్‌ స్ట్రోక్‌ అనీ ఈ దెబ్బతో రైతు ఉద్యమం ఖాళీ అనీ డబ్బాకొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌,పంజాబ్‌ ల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ఎత్తుగడ గా తాత్కాలిక వెనుకడుగేనంటున్నారు. అవకాశవాదం తప్ప ఉద్యమ ప్రభావంకాదంటున్నారు.
చట్టాలరద్దునిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు
1) పెరుగుతున్న ఉద్యమ స్పూర్తి-తరుగుతున్న మత విద్వేషం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ లో సెప్టెంబర్‌ 5 న, 10 లక్షల మంది ప్రజలతో భారీ సభ దిగ్విజయంగా జరిగింది.. మహాపంచాయత్‌ పేరున రైతులు, కార్మికులుఒకచోట గుమికూడి రైతువ్యతిరేక నల్లచట్టాలను రద్దుచేయాలని కోరటం నూతన సామాజికచైతన్యానికి దారితీసింది. ఇదే ముజఫర్‌ నగర్‌ లో 2013లో మతపరపమైన అల్లర్లను భాజపా రెచ్చగొట్టింది.మతవిద్వేషాలను పక్కనపెట్టి లౌకికఐక్యతను సాధించుతూరైతులు ఉద్యమంలోకి రావటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
2) సంవత్సరంపాటుసాగిన రైతుల పోరాటంలో 3సార్లు భారత్‌ బంద్‌ కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.సెప్టెంబర్‌ 27న భారత్‌ బంద్‌ పిలుపు అపూర్వ విజయాన్ని సాధించింది. దేశం నలుమూలలనుండి లక్షలాదిమంది. రైతులు, కార్మికులు,యువకులు, విద్యార్ధులు, మహిళలు,వ్యాపారులు, ఉద్యోగులు వీధుల్లోకి రావటమే భాజపా కు ప్రమాదసంకేతాలనుఇచ్చింది.
3) లఖింపూర్‌ ఖేరీ లో భాజపా జరిపిన దారుణమారణకాండ దేశప్రజలనందరినీ కదిలించింది.కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజయమిశ్రా ఆదేశాలనుఅనుసరించి గుమికూడిన ప్రజలపైకారును తోలి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపిన ఘటన యావద్భారత ప్రజలందరికీ కోపంతెప్పించింది. భాజపా ను అప్రతిష్టపాలుచేసింది. అక్టోబర్‌ 15,దసరా రోజున దేశవ్యాపితంగా బీజేపీ అగ్రనేతల దిష్చిబొమ్మలను తగలెట్టారు. రైళ్ళను ఆపేసి ఆందోళనలను నిర్వహించారు.
4) దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆకలికేకల సూచికలు, అసమానతలు, అసంతప్తి, ఆర్ధిక సంక్షోభం, ఆందోళనలు భాజపా పతనానికి దారిచూపుతున్నాయి. మతవిద్వేష ప్రచారం ఒక్కటే ప్రభుత్వాన్ని రక్షించేటట్లు లేదు. పాకిస్ధాన్‌, చైనా వ్యతిరేక జాతీయఉన్మాదాన్ని రెచ్చగొట్టే అవకాశాలు ప్రస్తుతం లేవు.
5)రైతు ఉద్యమ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేస్తూ, పాప్‌ స్టార్‌ రిహన్నా” మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు” అంటూ ట్విట్టర్‌ లోనూ గూగుల్‌ లోనూ లేవనెత్తిన ప్రశ్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు తెచ్చింది.యువ పర్యావరణవేత్త గ్రేటా ధెన్‌ బర్గ్‌ రైతుఉద్యమానికిఎలామద్దతు తెలపాలో సలహఇస్తూ ”టూల్‌ కిట్‌” కార్యాచరణప్రణాలికను దిశా రవి షేర్‌ చేసింది.అందుకు ప్రతిఫలంగా నేరపూరితకుట్ర, శత్రుత్వాన్నిప్రోత్సహించారన్నఆరోపణలతోప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కెనడా ప్రధానితో సహా, అమెరికాలోని 80 సంఘాలు, లాయర్‌ మీనాహారిస్‌, అంతర్జాతీయ మీడియా,సెలిబ్రిటీలు, సౌహార్ధ్రతను వెలిబుచ్చారు. పెరుగుతున్న అంతీర్జాతీయ మద్దతు భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
6) రాబోయే ఎన్నికలలో పరాజయం తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. మూడు చట్టాలపై వెనకడుగువేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతు కార్యకర్తలకు ప్రజాదరణ, విశ్వసనీయత పెరిగింది.
అంతా తమ ప్రయోజకత్వం అనే అంబానీ అదానీలకు మద్దతుగా మోడీ నిలబడి వ్యవసాయంలో కార్పొరేట్‌ సామ్రాజ్యాలను స్థాపించాలని చేస్తున్నప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. కార్పొరేట్‌ వ్యవసాయక్షేత్రాలను స్ధాపించాలనే పేక మేడలను కూల్చిన ఘనత రైతులకు చెందుతుంది. కార్పొరేట్‌ శక్తులకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంతో సంఘర్షించి రైతు ఉద్యమ చరిత్రను సష్టించారు.

రాజకీయ కోణమా లేక రైతు ఉద్యమ ఉధతా?

ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక నూటికి నూరు పాళ్ళు రాజకీయకోణం ఉందనీ రైతుల ఉద్యమ ఉధతి కాదని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. మోడీ అపర చాణక్యనీతితో వ్యూహాత్మకంగా వ్యవసాయచట్టాల రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ లతోపాటుఅయిదురాష్ట్రాల లో కీలకమైన ఎన్నికలు జరగబోతునందున వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతా మనే భయానికి కారణం అన్నదాతల ఉద్యమ ఉధతి అన్న సంగతిని గుర్తించ నిరాకరిస్తున్నారు.భాజపా పార్టీనాయకులు ప్రజలలోకి వెళ్ళలేని పరిస్ధితిని మర్చిపోతున్నారు. పట్టుదలతోప్రాణత్యాగాలకు నిలబడ్డ రైతుల పోరాటాన్ని తక్కువ చేయచూస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలవలననే ప్రజలు భాజపా కు దూరమౌతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. ప్రజలు పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతులౌతున్నారు.


మొక్కవోని దీక్షతో సాగించిన రైతుల పోరాటం కొన్నివిలువైన గుణపాఠాలను నేర్చుకుంది. ఉద్యమాలు అలలు లాగానే కాకుండా నిశ్చలప్రవాహంలాగా ఉధతంగా కూడాసాగించవచ్చని అనుభవం నేర్పింది. ప్రజా పక్షంవహించటమే పార్టీల ఎజెండా కావాలని ఉద్యమం డిమాండ్‌ చేసింది. అందుకనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సష్టించింది.పార్టీల జెండాలు కాదు ఎజండా ముఖ్యమని చెప్పింది. పదవులు,రాజ్యాధికారమే పరమావధిగావున్నరాజకీయపక్షాలను ఉద్యమ వేదికలకు దూరంగా వుంచవలసిన అవసరాన్ని తెలియచెప్పింది.

”అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ , నిర్మించిన కత్రిమచట్టాల్‌,

ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై,

పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.

చిరకాలం జరిగిన మోసం,బలవంతుల దౌర్జన్యాలూ,

ధనవంతుల పన్నాగాలు ఇంకానా! ఇకపై చెల్లవు” – అన్న శ్రీశ్రీ స్ఫూర్తి మరింతగా పోరాటాలను ముందుకు తీసుకుపోనుంది.

రైతు సంఘాలన్నీ ఏకమై కనీసమద్దతుధర కోసం..ఉద్యమ క్రమం
2018 నవంబర్‌లో 217 రైతు సంఘాలన్నీ ఏకమై ఐక్యపోరాటానికి పిలుపునిచ్చాయి.నవంబర్‌ లో లక్షలాదిమంది రైతులుఢిల్లీ నగరవీధులలో కదంతొక్కారు. లక్షలాది మంది రైతులు అరుదైన ప్రదర్శన చేసి కనీసమద్దతుధరకు చట్టబధత ను కల్పించి, ఋణవిముక్తిని కల్పించమన్నారు. మరుసటి సంవత్సరం నవంబర్‌ లో రైతు పార్లమెంటును నిర్వహించారు. కనీసమద్దతు ధరకు, ఋణవిముక్తికి ముసాయిదా చట్టాలను తయారుచేసి పార్లమెంటులో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రధాన డిమాండ్లైన కనీసమద్దతు ధరను, ఋణవిముక్తి అంశాలను పక్కనపెట్టి 2020, జూన్‌ 5న మూడుసాగు చట్టాలు తీసుకొస్తున్నట్టు కేంద్రంఆర్డినెన్స్‌ జారీ చేసింది. అప్పటినుండి రైతు కి న్యాయం చేయాలంటూ అన్నంపెట్టే అన్నదాతలు, రైతుసంఘాలు పంజాబ్‌ లోగ్రామగ్రామాన ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్య పరిచారు.. ఐక్యంగా రోడ్డెక్కారు. రైలు పట్టాలపై పడుకున్నారు.సెప్టెంబర్‌ 17 న గందరగోళపరిస్ధితులమధ్య, విపక్షాల నిరసనలమధ్య లోక్‌ సభలో భాజపా కి వున్నమెజారిటీతో ఆమోదంపొందింది. సెప్టెంబర్‌ 20న రాజ్యసభలో బిల్లులను ఆమోదించామని అప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. కనీసం వోటింగ్‌ జరపమన్న డిమాండ్‌ ను కూడా అంగీకరించలేదు. రైతుసంఘాలన్నీ ఏకమై నవంబర్‌ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. పశుబలంతో ఢిల్లీ సరిహద్దులలోనే ఆపిన ప్రభుత్వ బలగాలను ఎదిరించారు. రోడ్లపై కొట్టిన మేకులు, ముళ్ళకంచెలు రైతుల ప్రస్ధానాన్ని ఆపలేకపోయాయి. నల్ల చట్టాలను రద్దుచేయాలని పట్టువదలకుండా ఉక్కు సంకల్పంతో ప్రభుత్వాన్ని వణికించారు.


ఎముకలు కొరికే చలిని, చండ్ర నిప్పులుకక్కే ఎండలను, భీకర వర్షాలను లెక్కచేయలేదు.ది గజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బందులు, సమ్మెలు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బంధ్‌ లు, సమ్మెలు కు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. ఘోరమైన కోవిడ్‌-19 వేవ్‌ కాలంలో కూడా నిరసనకారులు తమ గుడారాల్లోనే ఉన్నారు.టాక్టర్లనే నివాసాలుగా మార్చుకున్నారు. రోడ్ల పైనే వండుకొని తిన్నారు. సంవత్సరం రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నూతన తరహాలో చారిత్రక పోరాటాన్ని నిర్మించారు. రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ప్రజలలో వారిని అభాసుపాలు చేయడానికి రకరకాల అసత్య ప్రచారాలను లేవదీశారు. స్థానికులను రెచ్చగొట్టారు. హింసను సష్టించారు. ప్రభుత్వం ఆందోళనకారులను ఆందోళన జీవులనీ,పరాన్న జీవులనీ,ఖలీస్ధానీవాదులనీ, టెర్రరిస్టులనీ, దేశద్రోహులనీ పలు పేర్లతో నిందించారు.జనవరి 26, రిపబ్లిక్‌ డేరోజున రైతులు ట్రాక్టర్ల పెరెడ్‌ ను విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. లఖింపుర్‌ ఖేరిలో అక్టోబరు 3న శాంతియతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై కేంద్రమంత్రి కుమారుడు కారును పోనిచ్చిరైతులను హత్యచేశాడు.నల్గురు రైతులు ఒక జర్నలిస్టు హత్యకుఅశిష్‌ మిశ్రా కారణమయ్యాడు. ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలను అర్పించి పోరాటం కొనసాగించారు.


నల్ల చట్టాలను చట్టబద్ధంగా రద్దు చేసేంతవరకూ,కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంత వరకూతమ నిరసన కొనసాగుతుందని పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంఘర్షణ సమితి ప్రకటించింది. ఉదాహరణకు వరిధాన్యానికి కనీసమద్దతు ధర హామీ అమలులేకపోవడంతోఎకరానికి పదివేల పైగా నష్టపోతున్నారు.రైతు వరిధాన్యాన్ని75 కిలోల బస్తాను రు.1000- 1,200కి విక్రయించవలసి వస్తుంది.కనీస మద్దతు ధర క్వింటాలుకు రు.1960 అంటే 75 కేజీ లో బస్తాకు రు.1470 రావాలి.కనీసమద్దతు ధరకు చట్టబధత ఉంటే బస్తా దాన్యాన్ని 1470 కన్నా తక్కువకు కొంటానికి చట్ట ప్రకారం వీలు లేదు. ఒక్క బస్తాకు రు.300 నుండి 400 నష్టపోతున్నాడు. ఎకరానికి సగటున 30 బస్తాలు దిగుబడి ఉంటుందనుకుంటే, 9000 నుండి 12000 వరకు నష్టపోతున్నాడు. ఢిల్లీ లో రైతుల పోరాటంలో 2018 నుండీ ప్రధాన డిమాండ్‌ ఇదే. నల్ల చట్టాలు, చట్టాల రద్దు కోసం పోరాటం, పోలీసు కేసుల రద్దు,లఖింపుర్‌ ఖేరిలోహత్యలు, 760 మంది రైతుల మరణం – నష్టపరిహారం -అన్నీప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల దుర్మార్గపు విధానాల ఫలితమేనని మరువరాదు.చట్టాలను రద్దు చేశారని సందడిలో పడి అసలు డిమాండ్లను వదలరాదు.కనీసమద్దతు ధరకు చట్టభద్దత కల్పించేవరకూ పోరాడుతూనేవుండాలి.. ఆ పోరాటంలో భాగంకావటం మనందరి కర్తవ్యం.

రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘం నేత.

అడకత్తెరలో నరేంద్ర మోడీ : అటు రైతులు, కార్మికులు – ఇటు కార్పొరేట్‌ బకాసురులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మొరటుగా ఉన్న ఇనుము కొలిమిలో బాగా కాలి ఉన్నపుడే కమ్మరి దాన్ని సాగదీసేందుకు లేదా అనువైన పరికరంగా మార్చేందుకు పూనుకుంటాడు. ఇది చాలా మందికి తెలిసిన అంశం. రైతులు, కార్మికులకు ఇప్పుడు మరింత స్పష్టమైంది. ప్రధాని నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పారు. అందువలన మరోవైపు రైతులు,కార్మికులు మరోపోరాటానికి సిద్దం అవుతున్నారు. మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలను భుజాన వేసుకొని ఆహా ఓహౌ అంటూ భజన చేసిన వాటిని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించటంతో కంగుతిన్నారు. వారే ఇప్పుడు మరోపల్లవి అందుకున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ తదుపరి సంస్కరణలపై వెనక్కు తగ్గవద్దని నరేంద్రమోడీ మీద వత్తిడి ప్రారంభించారు. నరేంద్రమోడీ ఎవరి పక్షాన ఉండేది రానున్న రోజుల్లో మరింత స్పష్టం కానుంది. ఇక వంది మాగధుల తీరు తెన్నులను చూస్తే ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లేకుండా చేసి తన చాణక్యాన్ని ప్రదర్శించారట, క్షమాపణలు చెప్పి మనసులను చూరగొన్నారట, పట్టువిడుపులు తెలిసిన వారట. ఉచితంగా చెవుతున్నారు కదా అని బుర్ర తలుపులు మూసి చెవులప్పగించే జనాలున్నపుడు ఏమైనా చెబుతారు. వెంపలి చెట్టుమీద నుంచి ఒక్క గంతుతో ఎగిరి దూకగలిగిన ప్రతిభావంతులని కూడా చెప్పగలరు. జనాల బుర్రలు పని చేయటం లేదని, కొన్ని సరిగా ఉన్నా వాటిని ఉపయోగించరనే ప్రగాఢ విశ్వాసం కలిగిన వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు, ఇతరులూ ఇంతకంటే ఏమి చెబుతారు.


రైతులను వీధుల్లోకి రప్పించింది, ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలు కల్పించింది, వాటినే ఆయుధాలుగా మార్చుకొనేట్లు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది నరేంద్రమోడీ గారే కదా ? నిజానికి పట్టువిడుపులుంటే సాగు చట్టాలను ఆర్డినెన్సులుగా తేవటం ఎందుకు, సెలెక్టు కమిటీకి పంపమంటే తిరస్కరించటం ఎందుకు, చర్చలేకుండా ఆమోదం ఎందుకు పొందారు ? నోరా చెంపకు చేటుతేకే అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.రైతులను నిందించాలని తన అనుచరగణాన్ని పురికొల్పినపుడు ఏమైంది వివేకం.తొలుత రైతులు ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ఏకైక డిమాండ్‌ను తెచ్చినపుడే చాణక్యం ప్రదర్శిస్తే క్షమాపణ చెప్పుకోవాల్సిన దుస్ధితి ఉండేది కాదు, పరువు నిలిచేదికదా ! ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. దీని వెనుకా ఎత్తుగడ ఉంది, మోడీని తక్కువ అంచనా వేయ వద్దని భక్తులు మాట్లాడుతున్నారు. రైతులను తక్కువ అంచనా వేసే కదా ఇంతదాకా వచ్చింది. మరోపిచ్చి పని చేస్తే మరింతగా ఉద్యమిస్తారని ఈ పెద్దలకు తలకు ఎక్కటం లేదు. పండుగాడి దెబ్బ అలా తగిలింది మరి !


అంతం కాదిది ఆరంభం.సంస్కరణల పేరుతో జనాన్ని కార్పొరేట్ల దోపిడీకి అప్పగించే ప్రక్రియను కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభిస్తే దాన్ని మరింత వేగంగా నడిపేందుకు నరేంద్రమోడీ పూనుకున్నారు. నీరు మరగటం ప్రారంభమైనపుడే ఆవిరి రూపం మనకు కనిపించదు, వంద డిగ్రీల వేడి తరువాతే తెలుస్తుంది. అది ఇప్పుడు రైతుల ఆందోళన రూపంలో వెల్లడైంది. వారి చారిత్రాత్మక విజయం కొత్త పోరాటాలకు నాంది. ఆ సెగ అప్పుడే ప్రధాని నరేంద్రమోడీకి తగిలినట్లు వార్తలు. రైతుల ఉద్యమాన్ని అపర చాణుక్యులు ఊహించలేదు. భాగస్వాములైన రైతు సంఘాల నేతలను చీల్చేందుకు చేయని పని లేదు. సామ,దాన,భేద,దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు. మెెత్తబడిన నేతలు కూడా రైతుల దీక్ష, పట్టుదలను చూసిన తరువాత మోడీకి భజన చేసేందుకు భయపడ్డారు. రైతు ఉద్యమం సాధించిన విజయాల్లో అదొకటి. రానున్న రోజుల్లో సాగే ఐక్య పోరాటాల్లో విభీషణులకు ఒక ముందస్తు హెచ్చరిక. రైతులు కొద్ది నెలలు వేచి చూసి విసుగుపుట్టి వెనక్కు వెళతారని, తరువాత కార్మిక, విద్యుత్‌ తదితర సంస్కరణలను ముందుకు తీసుకుపోవాలని భావించారు.


అనుకున్నదొకటి అయింది ఒకటి. ఐదు రాష్ట్రాల, ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, రైతు ఉద్యమంలో వివిధ సామాజిక తరగతుల మధ్య పెంపొందిన ఐక్యత, అన్నింటికీ మించి వివిధ రంగాలలో మోడీ సర్కార్‌ వైఫల్యాలు, జనంలో తొలుగుతున్న భ్రమలు మహాభారతంలో రారాజును గుర్తుకు తెస్తున్నాయి. భీముడి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు ధుర్యోధనుడు చివరకు మడుగులో దాక్కున్నట్లుగా శ్రామిక భీముల నుంచి కాపాడుకొని రాజకీయంగా బతికి బట్టకట్టేందుకు నరేంద్రమోడీ దారులు వెతుకుతున్నారు. దానిలో సాగు చట్టాలు వెనక్కి, క్షమాపణ ఒకటి మాత్రమే. తాజాగా వస్తున్న వార్తలు, అధికారవర్గాల అంతరంగం మేరకు కార్మిక, విద్యుత్‌ సంస్కరణలను కూడా వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు వాటి జోలికి పోవద్దని నిర్ణయించినట్లు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను విదేశీ-స్వదేశీ కంపెనీలు ఏర్పాటు చేసే సంస్దలలో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేందుకు, యజమానుల చిత్తానికి వారిని అప్పగించేందుకు కేంద్ర కార్మిక చట్టాలను మార్చివేసేందుకు పూనుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదిగో ఇప్పుడే అన్నట్లుగా మాట్లాడినప్పటికీ ముందుకు రాలేదు. మరోవైపు వాటిని ప్రతిఘటించేందుకు కార్మిక సంఘాలు కూడా సన్నద్దం అవుతున్నాయి. రైతు ఆందోళనకు కార్మికులు మద్దతు ప్రకటించటంతో రైతులు కూడా తమ డిమాండ్లలో కార్మిక అంశాలను కూడా చేర్చారు. సాగు చట్టాలతో పాటు లేబర్‌ కోడ్‌ల రద్దు కోరారు. ఇప్పటికి చేసింది చాలు మొదటికే మోసం తేవద్దు అని కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దిశానిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు చెబుతున్నారు.


సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తీరు కార్మికోద్యమానికి ఎంతో విశ్వాసాన్నిచ్చిందని చెప్పవచ్చు. రైతు-కార్మిక ఐక్యతను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం మరింత గట్టిపడింది.నరేంద్రమోడీ ప్రకటనకు ముందే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో రెండు రోజుల సాధారణ సమ్మె జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సాగు చట్టాలను నిరసిస్తూ గతేడాది నవంబరు 26న ఢిల్లీ చలో పిలుపు ఇచ్చిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకోవటంతో వారు సింఘు,టిక్రి, ఘాజీపూర్‌ వద్ద తిష్టవేసి నిరవధిక ఆందోళన ప్రారంభించిన అంశం తెలిసిందే. కార్మిక సంస్కరణలను రుద్దితే అదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. సాగు చట్టాల రద్దు రైతులదే కాదు తమకూ విజయమే అని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ వర్ణించారు. రైతులు మోడీ సర్కార్‌ను వెనక్కు కొట్టగా లేనిది కార్మికులకు ఎందుకు కుదరదని హింద్‌ మజ్దూర్‌ సభ నేత నారాయణ సింగ్‌ ప్రశ్నించారు.


ఎక్కడ బడితే అక్కడ, తమకు ఇష్టమైన ధరకు పంటలను అమ్ముకొనే అవకాశాలను రైతులకు కల్పించేందుకే సాగు చట్టాల మార్పు అని చెప్పింది కేంద్రం. అసలు లక్ష్యం కార్పొరేట్లకు రైతాంగాన్ని అప్పగించటం. అదే విధంగా కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసేందుకు లేబర్‌ కోడ్‌లను రూపొందించారు. ఐఏఎన్‌ఎస్‌-సి ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్‌డిఏ-ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా సాగు చట్టాల రద్దు కార్మిక సంస్కరణలను వ్యతిరేకించేందుకు ప్రేరేపణ కలిగిస్తున్నట్లు 43శాతం మంది, ప్రయివేటీకరణను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని 48శాతం చెప్పారు. ఇరవై ఐదుశాతం మంది కార్మిక చట్టాల గురించి, ప్రయివేటీకరణ గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు వెల్లడించలేదు.భారత్‌లో సంస్కరణలు జరగటం లేదనే సందేశం భారత-విదేశీ పెట్టుబడిదారులకు వెళ్లినట్లేనా అన్న ప్రశ్నకు 36శాతం మంది అవునని, అంతేశాతం కాదని చెప్పగా 29శాతం ఎటూ చెప్పలేదు. దీన్ని బట్టి సంస్కరణల గురించి సాధారణ జనానికి విశ్వాసం లేదని తేలుతోందని సర్వే విశ్లేషణ పేర్కొన్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సాగు చట్టాల రద్దు ప్రభావం ఉంటుందని 55.1శాతం మంది చెప్పినట్లు ఎఎన్‌ఎస్‌-సిఓటర్‌ సర్వే తెలిపింది. ఎన్‌డిఏ మద్దతుదారుల్లో 53శాతం మంది కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు.


కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువలన పార్లమెంటు, రాష్ట్రాలు రెండూ చట్టాలను చేయవచ్చు. లేబర్‌ కోడ్‌లను ఆమోదించక ముందు నలభైకి పైగా కేంద్ర, వందకు పైగా రాష్ట్రాల చట్టాలు ఉన్నాయి. రెండవ జాతీయ లేబర్‌ కమిషన్‌ (2002) చేసిన సిఫార్సు ప్రకారం 2019లో 29 కేంద్ర చట్టాలను నాలుగు కోడ్‌లుగా బిల్లులను ప్రతిపాదించింది.వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ-ఆరోగ్యం-పని పరిస్ధితులుగా వర్గీకరించారు. మొదటిదానిని 2019లోనే ఆమోదించారు. మిగిలిన మూడింటిని స్టాండింగ్‌ కమిటీకి నివేదించి కొన్ని సవరణలతో 2020 సెప్టెంబరులో ప్రతిపాదించి, వెంటనే ఆమోదించారు. నాలుగింటినీ ఒకేసారి నోటిఫై చేయవచ్చు. కార్మికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో ఆపని చేయలేదు. వేతన కోడ్‌ను రాష్ట్రాలకు పంపి తరువాత దాని ముసాయిదాను ఖరారు చేయకుండా, అమలు నిలిపివేశారు.


గతంలో ఉన్న అసందిగ్దతలను తొలగిస్తామని చెప్పిన పాలకులు ఆమోదించిన వేతన కోడ్‌, ఇతర వాటి మీద వచ్చిన విమర్శల తీరు చూస్తే అవెలాంటివో అర్ధం చేసుకోవచ్చు. కనీస వేతనాల నిర్ణయానికి ప్రాతిపదికల గురించి, ఎవరు నిర్ణయిస్తారనే స్పష్టత లేదు.ప్రాంతాలు, నైపుణ్యం, పనిలో ఇబ్బందుల స్ధాయి, తదితర అంశాల ప్రాతిపదికన కనీసవేతన నిర్ణయం జరపాలన్నారు. ఈ అంశాలకు కొలబద్దలేమీ ఉండవు కనుక నిర్ణయించే అధికారుల విచక్షణకు వదలివేస్తారు. అది లాబీయింగు,ప్రలోభాల వంటి ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుంది. వేతన తగ్గింపు నిబంధన నిరంకుశమైనది, కార్మికులను సంఘాల్లో చేరకుండా నిరోధించేందుకు ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు అత్యధిక కార్మికులు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారు వేతనాల చెల్లింపులో విఫలమైతే యజమానిని అడిగే హక్కు కార్మికులకు ఎంతో కష్టం అవుతుంది.యజమానులు వేతన చెల్లింపు ఉల్లంఘనకు పాల్పడినపుడు పరిమిత అధికారాలున్న అప్పీలు అధారిటీకి విన్నవించుకోవటం తప్ప కోర్టులకు వెళ్లే హక్కు లేదు. కార్మికులను ఇష్టమొచ్చినపుడు తీసుకోవటం లేనపుడు తొలగించటం సులభం అవుతుంది. అరవై రోజుల సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, వివాదం విచారణలో ఉన్నపుడు సమ్మె హక్కు ఉండదు.త్రిపక్ష విచారణ పూర్తైన రెండు నెలల తరువాతే సమ్మెకు వెళ్లవచ్చు.మూడు వందల లోపు సిబ్బంది పని చేసే సంస్దలలో కార్మిక హక్కులు నీరుగారతాయి. అనేక సంస్దలను ఫ్యాక్టరీ నిర్వచనం నుంచి తొలగించారు.మహిళలు రాత్రుళ్లు కూడా పని చేసే విధంగా నిబంధనలు మార్చారు. ఇలా మొత్తం మీద చూసినపుడు కార్మికులకు వ్యతిరేకంగానూ, యజమానులకు అనుకూలంగానూ మార్చివేశారు. ఈ సంస్కరణల పట్ల కఠినంగా ఉండాలని వెనక్కు తగ్గవద్దని కార్పొరేట్‌ లాబీ చెబుతున్నది.


” సంస్కరణలను ఆలశ్యం చేస్తే దేశ ఆర్ధిక రంగానికి నిస్సందేహంగా అది ఒక ఎదురుదెబ్బ. వాణిజ్యం, పెట్టుబడులకు భారత మనోహరత్వము తగ్గుతుంది.ఇటీవలి ఉదంతాలు సాగు, కార్మిక సంస్కరణల గురించి ప్రకటించటానికి-అమలు చేసేందుకు ఉన్న తేడాను వెల్లడించాయని” బెంగలూరులోని సొసైటీ జనరల్‌ సంస్ద ఆర్ధికవేత్త కునాల్‌ కుందు చెప్పారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్ల కనుసన్నలలో పనిచేసే పత్రిక. అది రాసిన సంపాదకీయంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” ఇతర డిమాండ్లను సాధించుకొనేందుకు నిరసన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రకటించింది. దాని డిమాండ్ల కలగూర గంపలో అత్యంత ప్రమాదకరమైనది కనీస మద్దతు ధరలకు చట్టబద్ద హామీ మరియు విద్యుత్‌ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను వెనక్కు తీసుకోవాలన్నది అత్యంత దారుణమైన కోరిక.. .. ఎస్‌కెఎం ఇప్పుడు పూర్తిగా అసహేతుకమైన మార్పులను కోరుతున్నది, అవి భారత్‌ ఆర్ధిక వ్యవస్దను దిగజారేదిగా మారుస్తాయి….. భారత విద్యుత్‌ రంగం విచ్చిన్నమైంది. ఒక సంక్షోభం తరువాత మరొక సంక్షోభంలోకి నెడుతున్నది…. ఉచిత లేదా చౌకగా విద్యుత్‌ను కొనసాగించాలని ఎస్‌కెఎం పట్టుబడుతున్నది…. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం సదుద్ధేశ్యంతోనే చేసింది, ఇప్పుడు వెనక్కు తగ్గింది. అసహేతుకమైన కోరికల విషయమై ప్రభుత్వం ఒక గిరి గీసుకోవాలి. సాగు చట్టాలను ఆమోదించిన పార్లమెంట్‌ సమావేశాల్లోనే మూడు లేబర్‌ కోడ్‌లను కూడా ఆమోదించారు. వాటిని ఇంకా పూర్తిగా అమలు జరపలేదు. ప్రభుత్వం సంస్కరణలపై గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది లేదా దుర్బలమైన ప్రభుత్వంగా మారే అవకాశం ఉంది. సంస్కరణల మీద ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది, అదే సమయంలో అసహేతుకతను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కఠిన వైఖరిని కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం.” పదాలు కొన్ని అటూ ఇటూ మారినా పెరిగినా తరిగినా మొత్తం మీద స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల వైఖరికి ఈ సంపాదకీయం అద్దం పట్టింది. కనుక తమ జీవితాలను మరింత దుర్భరం చేసుకోవటమా, మెరుగుపరచుకోవటమా, దానికి అనుసరించాల్సిన బాటను తేల్చుకోవాల్సింది ఇక రైతులు, కార్మికులే.

మతోన్మాదం దేన్నీ వదలదు : రామాయణ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది దుస్తులు – శబరిమల హలాల్‌ బెల్లం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉజ్జయని పీఠాధిపతులకు కోపం వచ్చింది. ఢిల్లీలో రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రైల్వే అధికారులు వారి డిమాండ్‌కు తలొగ్గారు. రైతులు కూడా మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ముందు కేంద్రాన్ని కోరారు. వినలా, తరువాతే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. బిజెపి పాలకులు ఏడాది పాటు వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో అనేక మంది పీఠాధిపతులు, లక్షలాది మంది సాధువులున్నారు. కానీ ఉజ్జయని వారికే ఆగ్రహం వచ్చింది. కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది.లక్షలాది మంది రైతులకు లేని బలం, పలుకుబడి కొద్ది మంది పీఠాధిపతులకు ఉందంటే దేశాన్ని నడిపిస్తున్నది మతశక్తులే అన్నది మరోసారి రుజువైంది.


ఇంతకీ వారికి కోపం ఎందుకు వచ్చింది ? రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైల్వే ఒక ప్రత్యేపాకేజ్‌తో పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుపుతున్నది. దానిలో ప్రయాణించే వారికి అవసరమైన భోజన సదుపాయాలను సమకూర్చే సిబ్బందికి సాధువుల మాదిరి కాషాయ రంగు బట్టలు,రుద్రాక్షలతో ఏకరూప దుస్తులను ఇచ్చారు. ఇలా దుస్తులు వేసి సేవలందించటం హిందూమతాన్ని అవమానించటమే అని ఉజ్జయని పీఠాధిపతులకు ఆగ్రహం వచ్చింది. వాటిని విప్పించకపోతే డిసెంబరు 12న ఢిల్లీలో రైలును ఆపివేస్తామని చెప్పారు. రెండురోజుల్లో అధికారులు మార్చివేశారు. సాధువుల మాదిరి ఏకరూప దుస్తులు మతాన్ని, పీఠాధిపతులను అవమానించటమే అని ఉజ్జయని అఖారా పరిషత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేష్‌ పూరీ చెప్పారు.హిందూమతాన్ని రక్షించుకొనేందుకు రైలు మార్గంపై బైఠాయిస్తామన్నారు.


ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ అధికారపెద్దలకు కాషాయ రంగంటే ప్రీతి కనుక వారి మనసెరిగి రైల్వే అధికారులు సాధువుల మాదిరి సిబ్బందికి దుస్తులను నిర్ణయించారు. కొత్తగా రూపొందిచిన వాటిలో నల్లపాంట్లు, తెల్ల షర్టులతో పాటు కాషాయ రంగు మాస్కులు, చేతులకు అదే రంగు తొడుగులను ఏర్పాటు చేసి సగం హిందూత్వను కాపాడామన్నట్లుగా అధికారులు పెద్దలను సంతుష్టీకరించారు. ఒక సారి ఉన్మాదాన్ని ఎక్కించిన తరువాత అది మెజారిటీ – మైనారిటీ, జాతీయవాదం ఏదైనా సరే ఎక్కించిన వారు కూడా దాన్ని అదుపు చేయలేరు. ఒకసారి వెర్రితలలు వేసిన తరువాత వారు చేసేదేమీ లేదు. అదుపు చేసేందుకు పూనుకుంటే వారు కూడా దానికి బలైనా ఆశ్చర్యం లేదు. వారి చేతిలో ఉండదు.


కేరళలో అధికారానికి అవసరమైన సీట్లను తెచ్చుకుంటామని ప్రగల్భాలు పలికి, మెట్రోమాన్‌ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించుకున్న బిజెపి పొందిన పరాభవం తెలిసిందే. అంతకు ముందున్న ఒక్కసీటును, ఓట్లను కూడా గణనీయంగా పోగొట్టుకుంది. గతంలో శబరిమల ఆందోళనపేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారు, రెచ్చగొట్టారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు.చివరికి దొంగడబ్బు పంపిణీలో వాటాలు కుదరక దొరికిపోయి కేసులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనేమీ లేక ఇప్పుడు కొత్త వివాదంతో జనాల మనోభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అదేమంటే శబరిమల ఆలయానికి హలాల్‌ చేసిన బెల్లాన్ని సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మాంసానికి కోసే కోడి,మేక వంటిది కాదు బెల్లం, దానికి హలాల్‌ ఏమిటి ? బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టగల సమర్దులు. శబరిమలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు కనుగొన్నారట. మన దేశం నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేసే వాటిలో మాంసంతో సహా అనేక ఉత్పత్తులు ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకొనే దేశాల వ్యాపారులు హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతారు. ఉంటేనే కొనుగోలు చేస్తారు.


అందువలన అలాంటి లావాదేవీలు నిర్వహించేవారు ముస్లింలైనా మరొక మతం వారైనా హలాల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా రాజకీయం చేసి పోగొట్టుకున్న మద్దతునైనా తిరిగి తెచ్చుకోవాలని బిజెపి పూనుకున్నట్లు కనిపిస్తోంది. హలాల్‌ చేసేందుకు ముస్లిం మతపెద్దలు ఆహారం మీద ఉమ్మివేస్తారంటూ సామాజికమాధ్యమంలో రెచ్చగొడుతున్నారు.శబరిమల ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న బెల్లాన్ని వాడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌జెఆర్‌ కుమార్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ వేశారు.వివరాల్లోకి వెళితే గతేడాది బెల్లం సరఫరా టెండరు పొందిన మహారాష్ట్ర కంపెనీల యజమానులెవరూ అసలు ముస్లింలు కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి సరఫరా చేస్తున్న ఎస్‌పి ఆగ్రోప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సమీర్‌ సురేష్‌ పాటిల్‌, సురేష్‌ సాహెబ్‌రావు పాటిల్‌,సరితా సురేష్‌ పాటిల్‌, మతి ఉండి చేసే ఫిర్యాదులేనా ఇవి. ఆ కంపెనీ గల్ఫ్‌ దేశాలకూ బెల్లం ఎగుమతులు చేస్తోంది. వారికి హలాల్‌ సర్టిఫికెట్‌ అవసరం కనుక తీసుకున్నారు. ప్రతి సంచిమీద దాని నంబరు ముద్రించారు. దాన్ని పట్టుకొని బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఈ వివాదం ద్వారా దేవస్ధానానికి నష్టం కలిగించే కుట్రవుందని అయ్యప్పతో సహా అనేక దేవాలయాలను పర్యవేక్షించే తిరువాన్కూర్‌ దేవస్ధానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.


ఇదిలా ఉండగా కేరళ అంతటా పలుదుకాణాల ముందు హలాల్‌ బోర్డులు కొత్తగా వెలిశాయంటూ వాటిని నిషేధించాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నవంబరు 25న ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించింది. ఇదిసాంఘిక దురాచారమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్‌ వర్ణించారు.హలాల్‌ ఒక మతాచారమని తాము భావించటం లేదని ఇస్లామిక్‌ పండితులు కూడా సమర్ధిస్తారని తాను అనుకోవటం లేదని, ఉగ్రవాద సంస్ధలు కేరళ సమాజంలో మతపరమైన అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్నాయని, మతపరంగా చేస్తే పెద్దలు పూనుకొని సరి చేయాలన్నారు. బిజెపి నేతలు మత అజెండా గురించి మాట్లాడటం దొంగేదొంగ అనటమే. సుధీర్‌కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మాట్లాడుతూ హలాల్‌ బోర్డులు అమాయకంగా, అనుకోకుండా పెట్టినవి కాదన్నారు. జనాన్ని చీల్చేందుకు చేస్తున్నారన్నారు. హిందూత్వ బిజెపితో కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే క్రైస్తవ పార్టీ నేత పిసి జార్జి కూడా గొంతుకలిపారు.హలాల్‌ ఆహారం మతఛాందసంలో భాగమే అన్నారు. ఆహారం మీద ఉమ్మటం ముస్లింలకు ఒక విధి, మూడుసార్లు ఉమ్ముతారని, శబరిమల ప్రసాదానికి హలాల్‌ బెల్లాన్ని వినియోగించరాదని క్రైస్తవమత టీవీ ఛానల్‌ ఒకదానిలో చెప్పారు.

బెల్లానికి హలాల్‌తో ముడిపెట్టటాన్ని బిజెపి అధికార ప్రతినిధి సందీప్‌ వారియర్‌ ఫేస్‌బుక్‌లో రాస్తూ తప్పుపట్టారు. మతాల వారు ఒకరి మీద ఒకరు ఆర్ధికపరమైన ఆంక్షలతో జీవించలేరని పేర్కొన్నారు. కోజికోడ్‌లోని పారగాన్‌ హౌటల్‌ మీద సామాజిక మాధ్యమంలో చేస్తున్న దాడిని తాను ఖండించానని అయితే దానిని మీడియా పార్టీ వ్యతిరేఖ వైఖరిగా వక్రీకరించిందని, దాంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశం మేరకు పోస్టును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి సందీప్‌ స్పందన తరువాత బిజెపి ఇరకాటంలో పడి అతని మీద వత్తిడి తెచ్చిందన్నది స్పష్టం. ఇతర మతాల మీద విశ్వాసం ఉన్నవారు కూడా హలాల్‌ హౌటళ్లలో తినేందుకు, పని చేసేందుకు వస్తారని, సేవారంగం దెబ్బతింటే ఎన్నోకుటుంబాలు దారిద్య్రంలోకి కూరుకుపోతాయని, ఇలాంటి అంశాలపై చర్చలో ఉండాల్సింది హేతువు తప్ప ఉద్రేకం కాదన్నారు సందీప్‌.


వివిధ సామాజిక తరగతుల మధ్య లౌకిక వారధిగా ఉన్న ఆహారం మీద సంఘపరివార్‌ దాడిని కేంద్రీకరించిందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. సమాజంలోని మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కొడియరి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేసినా మొత్తం మీద కేరళలో ఫలించలేదని బాలకృష్ణన్‌ అన్నారు.హలాల్‌ చర్చ అనవసరమని తెలిసి కూడా ఇక్కడ వివాదాన్ని సృష్టించేందుకు పూనుకున్నారని అన్నారు.


హలాల్‌ ఆహారంపై విష ప్రచారం చేస్తున్న శక్తుల మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర రెస్టారెంట్లు, హౌటల్స్‌ సంఘం ముఖ్యమంత్రి విజయన్ను కోరింది. గుజరాత్‌లో సంఘపరివార్‌ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి విభజన తేవటంలో విజయం సాధించిందని, అక్కడ ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు నిర్వహించే వాటిని పాకిస్తాన్‌ హౌటల్స్‌ అని పిలుస్తారని ఎంఏ బేబీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని శక్తులకు పోటీగా ఇతర మతాలకు చెందిన ఛాందసవాదులు కొత్త డిమాండ్లను ముందుకు తేవచ్చని స్వచ్చమైన శాఖాహారం వంటి బోర్డులకు వ్యతిరేకంగా డిమాండ్లు ముందుకు రావచ్చని అన్నారు.నిజానికి ఇలాంటి బోర్డుల వలన వినియోగదారులు తాము కోరుకుంటున్న ఆహారం, పానీయాలు దొరికేదీ లేనిదీ తెలుసుకుంటారని అన్నారు.ఇలాంటి ఛాందసడిమాండ్లకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హలాల్‌ డిమాండ్‌ సమాజ-జాతీయ-రాజ్యాంగ వ్యతిరేక వైఖరని, కేరళలో అది కుదరదని బేబీ చెప్పారు.
తెలుగునాట ఇప్పటికీ అనేక ప్రాంతాలలో హౌటళ్లు, మెస్‌లకు బ్రాహ్మణ, ఆర్య-వైశ్య, రెడ్డి, క్షత్రియ, చౌదరి అని కులాలు, విజయవాడ, ఏలూరు, గుంటూరు భోజనం అనీ, హైదరాబాద్‌ బిర్యాని, ఉడిపి, కల్కూర ఇలా అనేక రకాల పేర్లను తగిలించటం తెలిసిందే. రంజాన్‌ మాసంలో అనేక పట్టణాలలో ప్రత్యేక వంటకంగా ముస్లింలు నిర్వహించే హౌటళ్లలో విక్రయించే హలీంను కుల,మతాలతో నిమిత్తం లేకుండా అందరూ లొట్టలు వేసుకుంటూ తినే అంశం తెలిసిందే. ఇక బిర్యాని సంగతి చెప్పనవసరం లేదు.అక్కడ హలాల్‌ క్రతువు నిర్వహిస్తారని తెలిసిందే.

నరేంద్రమోడీకి యావత్‌ దేశం ” కృతజ్ఞతలు ” చెప్పాలి మరి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక ధుర్యోధనుడు, ఒక రావణుడు, ఒక ముస్సోలినీ, ఒక హిట్లర్‌, ఒక జారు చక్రవర్తి, ఒక ఇందిరాగాంధీ, ఒక నరేంద్రమోడీ చరిత్రను మలుపుతిప్పే మహానుభావుల పరంపర ఇది. కొంత మంది నమ్ముతున్నట్లు విధి లిఖితం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రతినాయకుల జన్మ ప్రతి కాలంలోనూ పునరావృతం అవుతున్నందున ఆ క్రమంలోనే ప్రజా నాయకులు కూడా పుట్టుకువస్తారు. ఇప్పుడు రైతుల రూపంలో అదే జరిగింది. కొందరు త్యాగధనులు ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. రైతు ఉద్యమం అనేక పోరాటాలకు ఊతమిచ్చింది. యాభై ఆరుగాదు 112 అంగుళాల గుండెలున్నవారిని కూడా పిండిచేయగలమని, దిగివచ్చేట్లు చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీష్‌ వారిని పారద్రోలాలనే ఏకైక లక్ష్యం భిన్న రాజకీయ ధోరణులు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఆ తరువాత అత్యవర పరిస్ధితి విధింపు కొంత మేరకు అందుకు దోహదం చేసింది. ఇప్పుడు అంతకంటే మరింత ప్రాముఖ్యత కలిగినదిగా దేశంలో రైతుల ఆందోళన ఒక మహత్తర దృశ్యానికి తెరతీసింది. అందుకు పురికొల్పిన ” మహానుభావుడు” ప్రధాని నరేంద్రమోడీకి యావత్‌ జాతి కృతజ్ఞతలు చెప్పాలి కదా !


చరిత్రలోని ప్రతినాయకులందరికీ వారి తీరుతెన్నులను చూసి ఇది తగదు, అది తగని పని అంటూ వారి మంచి కోరుకొనే వారు చెప్పినా వినిపించుకోలేదన్నది చరిత్ర, సాహిత్యం చెప్పిన సత్యం. విధి లేదా తలరాత అలా రాసి ఉంటుంది మరి. ముస్లింలపై గుజరాత్‌లో జరిగిన మారణకాండ సమయంలో రాజధర్మాన్ని అనుసరించాలని నాటి ప్రధాని అతల్‌బిహారీ వాజ్‌పాయి హితవు చెప్పారు. వాజ్‌పాయిగారు ఏదైతే చెప్పారో సరిగ్గాదాన్నే పాటిస్తున్నా అని అదే వేదిక మీద ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. పూర్వకాలపు మనిషి గనుక వాజ్‌పాయి మరోదారి లేక అవును ఆయన అదే చేస్తున్నారు అని చెప్పకతప్పలేదు.సీత గీత దాటకపోతే రామాయణమే లేదు. పాండవులకు ఐదూళ్లు ఇచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. సాగు రాష్ట్రాల అంశమైనా వాటితో సంప్రదించకుండా కరోనా తాండవిస్తుంటే ఆర్డినెన్సుల రూపంలో రుద్దటం, తరువాత వాటి మీద పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదం, రాష్ట్రపతి ముద్ర వెనుక ఏదో ఒక మహత్తరశక్తి లేకపోతే మానవమాత్రులను అలా చేయిస్తుందా ? అందుకుగాను ” నిమిత్తమాత్రుడైన ” నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం తప్పుకదా !


కరోనా నివారణకు చప్పట్లు, కంచాలు, గిన్నెలు మోగించాలంటే ఆ పని చేశారు. దివ్వెలు వెలిగించమంటే గౌరవభావంతో వెలిగించారు. ఏ కతలు చెబితే వాటిని నమ్మారు కదా అని బతుకు దీపాలనే ఆర్పుతాం అంటే రైతులు సహిస్తారా ? సాగు చట్టాల గురించి కూడా నరేంద్రమోడీకి హితవు చెప్పిన వారు లేకపోలేదు. జనంతో సంబంధం లేని, కార్పొరేట్లకు సేవలు చేసే జయప్రకాష్‌లు, జనాల మీదకు ఎక్కే ఆర్నాబ్‌లు, గుడ్డిగా సమర్ధించే ప్రాంతీయ పార్టీల నేతలమద్దతు, కార్పొరేట్‌లు కళ్ల ముందు కనిపిస్తుంటే రైతుగోడు వినిపించుకొనే తీరిక ఎక్కడుంటుంది పాపం ! విదురనీతి, హితవచనాలు విని ఉంటే రైతు భారతం ఎలా జరుగుతుంది? మోడీ క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం గురించి పట్టని ఇతర రైతులు, తలకు ఎక్కించుకోని ఇతర జనాలకు కిక్కు దిగేది కాదు, యావత్‌ ప్రపంచానికి తెలిసేది కాదు కదా ! అంతటి కనువిప్పు కలిగించి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పకపోవటం ” క్షంతవ్యం ” కాదేమో !


సంచలనాలు సృష్టించటం బలవంతులకే కాదు బలహీనులకూ, పిరికిబారిన వారికీ సాధ్యమే. తిరుగులేని రామబాణం కలిగినట్లు చెప్పే రాముడూ పరువు కోసం సీతను కష్టాల పాలు చేసిన బలహీనతకు గురైన సంగతి తెలిసిందే. రామాయణంలో రాముడు, రావణ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాముడిని తప్పుపట్టిన రజకుడికీ అంతే ఉంది ! నరేంద్రమోడీలో చాలా మందికి వారు రాజకీయంగా వ్యతిరేకించే లేదా అనుకూలించే వారికి ఇప్పటి వరకు ఒక రూపమే కనిపించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చేయదలచుకున్నదానిని చేస్తారని గుజరాత్‌ మారణకాండ సమయంలో అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఇతరుల్లో భయం పుట్టించారు. తాము కోరుకున్న సంస్కరణలను అమలు జరిపేందుకు జనాన్ని అవసరమైతే అణచివేసే బాహుబలుడిని కార్పొరేట్లకు నరేంద్రమోడీలో చూపింది కూడా అదే. కట్టుకున్న ఇల్లాలిని కూడా విస్మరించి దేశం కోసం సంఘపరివార్‌ పెంచిన బిడ్డగా నరేంద్రమోడీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి సమాజాన్ని వెనక్కు నడపాలనే తిరోగామి హిందూత్వ కాగా, రెండవది దానికి అధికారం, అందుకోసం అవసరమైన కార్పొరేట్ల ఆసరా. రెండూ సాధించారు గానీ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు.

హిందూత్వను అమలు జరిపేందుకు స్వమతమౌఢ్యం-పరమత ద్వేషం నింపాలి. మన దేశంలో అది చాలా ప్రమాదకరం. కార్పొరేట్లకు అంగీకారం కాదు, కొంత మేరకు వారు రాజీపడతారు తప్ప వాటిది పైచేయి కానివ్వరు. ఐరోపాలో ఫ్యూడల్‌ ప్రభువులను, ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్న చర్చిని వదిలించుకున్న చరిత్ర తెలిసిందే. మన దేశంలో ఉన్న పరిస్ధితులను బట్టి కార్పొరేట్లు గుళ్లూ గోపురాలను కట్టించారు, మత, ఉదారశక్తులకూ మద్దతు ఇచ్చారు, భూస్వాములు, ధనిక రైతులతో రాజీపడ్డారు. భూమి కేంద్రీకరణ వారి లాభాలను అడ్డుకుంటుంది కనుక భూ సంస్కరణలను ముందుకు తెచ్చారు. గ్రామాల్లో ఉన్న భూస్వాములను, వారి కండబలాన్ని వదులుకొనేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా లేనందున వాటిని నీరుగార్చింది. ధనిక రైతులను సంతుష్టీకరించే చర్యలను తీసుకుంది.

ఇప్పుడు గ్రామాల్లో కూడా పరిస్ధితులు మారాయి. ఓట్లకొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హూజారాబాద్‌లో మహిళలు రోడ్డెక్కే విధంగా పరిణామాలు పురోగమించటాన్ని చూశాము.దళారీలు లేకుండా నేరుగా ఓట్లు కొనుగోలు, అందరికీ ఒకే రేటు ఇవ్వాలని కోరారు. భూస్వాముల పెత్తనం సాగదింక, అంటే కార్పొరేట్ల డబ్బుతోనే ఇక ముందు పార్టీలకు పని. కనుకనే కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. దీనికి తోడు బహుళజాతి గుత్త సంస్దల వత్తిడి కూడా తోడైంది. అవసరమైతే ధనిక రైతులను వదులు కొనేందుకు మోడీ సర్కార్‌ సిద్దమైంది కనుకనే ఆదరాబాదరా మూడు సాగు చట్టాలు. ఇప్పుడు వాటికి మంగళం పాడుతూ అధికారానికి ఎసరు రాకుండా చూసుకొనేందుకు కొత్త నాటకానికి తెరతీశారు. దీనివలన కార్పొరేట్లలో మోడీ మీద ఉన్న భ్రమలు తొలుగుతాయి. కొత్త బొమ్మను వెతుకుతారు. ఏడాది కాలంగా మోడీ తీరుతెన్నులను చూసిన ఏ రైతూ అంత తేలికగా బిజెపిని బలపరచడు. ఏమైనా సరే దేశాన్ని వెనక్కు నడుపుతారు, హిందూత్వను ఏర్పాటు చేస్తారని హిందూ హృదయ సామ్రాట్‌గా భావిస్తున్న శక్తులలోనూ మోడీ అనుమానాలు రేకెత్తించారు. లేదూ అలాంటిదేమీ లేదు, వ్యూహాత్మకంగానే తమ నేత వెనక్కు తగ్గినట్లు, మరింత గట్టిగా తాను చేయదలచుకున్నది చేస్తారని భక్తులు చెబుతున్నారు. కనుక ఏది జరిగినా తలెత్తే అనూహ్యపరిణామాలకు కచ్చితంగా మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.


తమ నేత ఓట్ల కోసం జనాన్ని సంతుష్టీకరించరు, దేశం కోసం అవసరమైతే కఠిన చర్యలను తీసుకొనేందుకూ వెనుకాడరంటూ ప్రజావ్యతిరేక చర్యలను సమర్ధించేందుకు పూనుకున్న వారున్నారు. మోడీ వెనక్కు తగ్గినా వారు తగ్గేట్లు లేరని సాగు చట్టాల రద్దు ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. ఒకసారి పులిని ఎక్కిన తరువాత అంత తేలికగా దిగుతారా ! మోడీ నిర్ణయంతో తమకు నిమిత్తం లేదు, ఆ చట్టాలు సరైనవే అని కొందరు ప్రబుద్దులు కొత్త వాదన మొదలు పెట్టారు. నరంలేని నాలికలు, అద్దె నోళ్లు ఏమైనా మాట్లాడగలవు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతులు తమకు వ్యతిరేకమైన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు తప్ప ఎవరూ క్షమాపణ కోరలేదే ! ఎవరైనా ఎప్పుడు అలాంటి పని చేస్తారు. తప్పుచేసి తప్పించుకొనే దారిలేక అడ్డంగా దొరికినపుడు, లేదా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినపుడు చెబుతారు.

” నేను దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను..సాగు చట్టాల గురించి రైతులను ఒప్పించలేకపోయాము. మూడు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. దేశ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, కనీస మద్దతు ధరలను మరింత సమర్దవంతంగా, పారదర్శకంగా చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని మోడీ చెప్పారు. నరేంద్రమోడీ తరువాత ప్రధాని పదవికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి అదిత్య నాధ్‌ స్పందిస్తూ ” బహుశా మావైపు నుంచి లోపం ఉన్న కారణంగా మేము చెప్పదలచుకున్నదాన్ని జనాలకు చెప్పటంలో మేము విఫలమయ్యాము ” అన్నారు.సాగు చట్టాలకు రైతాంగంలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని కూడా సెలవిచ్చారు. గతంలో చట్టాలు చేసినపుడు వాటిని చారిత్రాత్మకమైనవని వర్ణించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రద్దును కూడా చారిత్రాత్మకంగానే వర్ణించారు. జనానికి మతిమరపు ఎక్కువని భావించేవారే ఇలా సమర్ధించుకోగలరు. మొత్తం మీద సాగు చట్టాలు తేవటం తప్పన్న మాట పెద్దల నోట రాలేదు. అందుకే జనంలో మోడీకి పెద్దగా సానుకూలత రాలేదు. కొంత మందిని కొంతకాలం మోసం చేయ గలరు తప్ప అందరినీ ఎల్లకాలం చేయలేరు. తన పదజాలం వెనుక ఉన్న మర్మాన్ని జనం గ్రహించేట్లు చేసినందుకు నరేంద్రమోడీకి కృతజ్ఞత చెప్పాలి మరి !


సాగు చట్టాలు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ప్రభావితం చేసేవి. వాటి దుష్ఫరిణామాలు తక్కువ కాదు. ముందుగా ఉప్పందుకున్న వేళ్లమీద లెక్కించదగిన అధికారపార్టీ పెద్దలు, ఆశ్రితులైన వారు తప్ప మోడీగారి పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, జనాన్ని నానా యాతనల పాలు చేసింది-ఘోరంగా విఫలమైంది. అలాంటి పిచ్చిపని ప్రకటించిన లక్ష్యం నెరవేరలేదు, దానికి గాను జనాన్ని ఇబ్బంది పెట్టాను, ఆర్ధిక రంగాన్ని చెప్పరాని ఇబ్బందులపాలు చేశాను అని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఉంటే ఇప్పుడు చేసిన ప్రకటనను జనం నమ్మి ఉండేవారు.తమకళ్ల ముందే జరిగిన పెద్ద నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించకపోగా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి, పన్ను చెల్లింపుదార్లు పెరిగారంటూ కొత్త కతలు చెప్పారు. పొద్దున్నే రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించగానే వేరే శక్తి అవాహనలోకి వెళ్లారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మహూబా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కొంత మంది రైతులను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది ప్రతిపక్షాన్ని విమర్శించటం కంటే రైతులను తెలివితక్కువ దద్దమ్మలుగా నిందించటం తప్ప వేరు కాదు. ఇది కూడా రైతాంగాన్ని చైతన్యపరిచేదే, మరింత కసి పెంచేదే కనుక అందుకూ మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే ?


వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాల రద్దుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తామని చెప్పారు. ఐనా సంయుక్త కిసాన్‌ మోర్చా నమ్మలేదు. ముందుగా ప్రకటించిన ఆందోళనా కార్యక్రమంతో ముందుకు పోవాలని ప్రకటించింది. నెలాఖరులో మరోసారి సమావేశమై మిగతా అంశాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ-స్వదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు చేసిన చట్టాలను పార్లమెంటు ఎంత ప్రహసన ప్రాయంగా ఆమోదించిందీ ప్రపంచం చూసింది. 2020జూన్‌లో ఆర్డినెన్స్‌ల ద్వారా వాటిని తెచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుద్వారా ఆమోదముద్ర వేశారు. తరువాత వాటిని వెనక్కు తీసుకొనేందుకు ససేమిరా అన్న పాలకులు రైతాంగాన్ని అపహాస్యంపాలు చేశారు. వారు అసలు రైతులే కాదన్నారు, దళారీలన్నారు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్రవేశారు. విదేశీ నిధులతో ఆందోళనలు చేశారని నిందించారు. చర్చలను ప్రహసన ప్రాయంగా మార్చారు. రైతుల మీద భౌతికంగా దాడులు చేశారు, రెచ్చగొట్టేందుకు చూశారు. తరువాత సుప్రీం కోర్టు వాటి అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నివేదిక ఇమ్మంది. ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడలేదు. దాన్ని కూడా మూసిపెట్టారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని వేరే చెప్పనవసరం లేదు. దానికెంత ప్రాధాన్యత ఉందో రద్దు, మోడీ క్షమాపణల ప్రకటన ఆ చట్టాలను నిస్సిగ్గుగా సమర్దించటానికి తమ మేధాశక్తి నంతటినీ రంగరించి రైతుల మీద రుద్దటానికి ప్రయత్నించిన ప్రబుద్దులకు చెప్పుకోవటానికి వీల్లేని చోట నరేంద్రమోడీ కొట్టిన తిరుగులేని దెబ్బగా కూడా చెప్పవచ్చు.సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, అంతకు ముందు చట్టాలను సమర్ధించిన షేత్కారీ సంఘటన నేత అనిల్‌ గన్వట్‌ గోడు మామూలుగా లేదు. వాటిని రద్దు చేసినంత మాత్రాన ఆందోళనకు తెరపడదు, బిజెపి ఆశించినట్లుగా ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడదని చెప్పారు. ఆ నివేదికలో ప్రభుత్వ చర్యను గుడ్డిగా సమర్ధించి ఉండకపోవచ్చు, అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తే చట్టాలను వెనక్కు తీసుకోవాలని సుప్రీం కోర్టు సలహా ఇస్తే మోడీ సర్కార్‌ పరువు మరింతగా పోతుంది, అందువలన మరింత నష్టం జరగకుండా విధిలేక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదని గట్టిగా నమ్మి అతని కంటే ఘనులు అన్నట్లు ఎక్కువగా సమర్ధించిన వారు మోడీ తమను వెన్నుపోటు పొడిచినట్లు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.అందువలన ఇక ముందు మోడీ లేదా మరొకరు ఎవరు ప్రకటించిన లేదా అమలు జరిపే విధానాలనైనా గుడ్డిగా సమర్ధించకూడదని ఇప్పటికే అనే మంది మనసులోనే చెంపలు వేసుకుంటున్నారు. వారిలో అలాంటి మారుమనసు తెచ్చినందుకు నరేంద్రమోడీని అభినందించకుండా ఉండగలమా ?


రైతుల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తుండగా నవంబరు 26వ తేదీ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే మరో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పరాభవం ఎదురుకానుందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో నరేంద్రమోడీ సర్కార్‌ వెనక్కు తగ్గింది. తాను నోరు విప్పినా విప్పకపోయినా, పరోక్షంగా రైతులను పరిహసించినా రాజును మించి రాజభక్తిని ప్రదర్శించి సాగు చట్టాలను సమర్ధించిన వారికి వెన్నుపోటు పొడిచి తన లబ్దిని తాను చూసుకున్నారు. మోడీ మొండి వైఖరి కారణంగా కొందరు రైతుల్లో తమ పోరాటం ఫలిస్తుందా అన్న అనుమానాలు తలెత్తటం అసాధారణం కాదు, అలాంటి వారి సంశయం-ఇటు తన మద్దతుదారుల ధృడవిశ్వాసానికి భిన్నంగా రైతు చట్టాల మీద మోడీ తోకముడిచారు. వ్రతం చెడినా ఫలందక్కదు. సాగు చట్టాలకు దారి సుగమం చేసుకొని కార్మిక చట్టాలను దెబ్బతీసేందుకు, ఆర్ధిక రంగంలో పెను మార్పులకు మోడీ సర్కార్‌ అస్త్రాలను ప్రయోగించాలని కాచుకు కూర్చున్నది.వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చూస్తున్న వారికి సాగు చట్టాల రద్దు ఎంతో ఊపునిస్తుంది.రైతుల ఆందోళన వెలుగులో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతారు. అందుకు దోహదం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం అన్యాయం కదా !

ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెరాస మాత్రమే కాదు, ఇతర పార్టీలూ రంగంలోకి రావాలి !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. వడ్ల కొనుగోలు గురించి ఇప్పటి వరకు ఏ రోజున కేంద్రంతో కెసిఆర్‌ ఏం మాట్లాడారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అన్నది గతం. ఇప్పుడు రైతులకు తక్షణం కావాల్సింది వారి పంట కొనుగోలు, వేసవిలో వరి వేసుకోవాలా లేదా అన్నది వారికి చెప్పాలి. కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం నాడు ధర్నాకు దిగారు. రెండు రోజుల్లోపల కేంద్రం తేల్చని పక్షంలో ఆందోళనను ఢిల్లీకి తీసుకుపోతానని ప్రకటించారు. ఇలాంటి ఉదంతం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం హడావుడేనా లేక పరిస్ధితి తీవ్రతకు ప్రతిబింబమా ? కేంద్ర ప్రభుత్వం-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా రాష్ట్ర సమితి – బిజెపి కేంద్ర నాయకత్వం మధ్య జనం అనుకుంటున్నట్లుగా ఇంతకాలం తెరవెనుక జరిగిన మంతనాలేమిటన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఆరుబయట వానకు తడిచి ఎండకు ఎండుతున్న వడ్లను కొంటారా లేదా అన్నదే రైతులకు కావాల్సింది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడు వివాదాలు ఆరు రేటింగులు అన్నట్లుగా మీడియాకు రంజుగా ఉండవచ్చు. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. చేతికొచ్చిన పంటను కొంటారా లేదా రబీ(వేసవి లేదా యాసంగి)లో వరి వేయాలా వద్దా ? అదిగాకపోతే ఏ పంటను సాగు చేయాలి అన్నది వారికి అంతుబట్టటం లేదు. వెంటనే తేల్చాల్సిన తరుణం వచ్చింది.


ప్రభుత్వం, అధికారపార్టీ వరి వేయవద్దని చెబుతోంది, ప్రతిపక్షం, కేంద్రంలో అధికారపార్టీ వరి సాగు చేయండి ఎలా కొనుగోలు చేయరో చూస్తాం అంటూ సవాలు విసిరింది. మాటలకే పరిమితం కాకుండా బిజెపి కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో రాజకీయ యాత్రలకు పూనుకుంది. పరిశీలించవచ్చు, తప్పుపట్టనవసరం లేదు, వందల కార్లు,జనంతో అట్టహాసం ఏమిటి ? బిజెపి నేతలు పరిశీలిస్తే టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటి ? అది కూడా పోటాపోటీగా కొనుగోలు కేంద్రాల వద్దకు తన మద్దతుదార్లను దింపింది. బిజెపి నేత మీద రాళ్ల దాడి జరిగింది.ఆగ్రహించిన రైతులే ఆ దాడి చేసినట్లు టిఆర్‌ఎస్‌ చెబుతోంది. సరే రాళ్లంటే పొలాల్లో, రోడ్ల మీద దొరుకుతాయి గనుక ఆగ్రహించి రైతులే విసిరారు అనుకుందాం. మరి కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిజెపి వారి వెంట రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికారపక్షం ఫొటోలు కూడా చూపుతోంది. అధికారం కోసం పాకులాడే రాజకీయం పార్టీల వెంట అందునా బిజెపితో రౌడీలు, గూండాలు ఉండటం ఆశ్చర్యం లేదు. ఎవరినైనా చంపినపుడు నక్సల్స్‌ ఎవరు చంపారంటే జనమే ఖతం చేశారు అని చెప్పినట్లుగా బిజెపి మీద ఆగ్రహిస్తున్న రైతులే ఆ పార్టీ నేతల మీద దాడి చేసినట్లు అధికారపార్టీ చెబుతోంది. ఎవరైనా ముందుగా పధకాన్ని రూపొందించుకోకపోతే కోడి గుడ్లను వెంట తీసుకుపోరు అన్న సామాన్యుల సందేహానికి సమాధానం ఏమిని చెబుతారు. అలాగే బిజెపి నేతల వెంట రౌడీలు, గూండాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి కూడా వారు చెప్పాలి.


ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు, పార్టీల నేతలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలను చూద్దాం. పంజాబ్‌ తరహాలోనే మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి. ఈ డిమాండ్‌లో తప్పులేదు. ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు ఇంతకాలం దాని గురించి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అన్నది రైతులకు, ఇతర జనాలకు తెలియాలి కదా. పంజాబ్‌లో రైతులు పండించిన వడ్లలో ఒక్క గింజను కూడా అక్కడి జనం తినరు, వాటిని విక్రయించటానికే వేస్తారు. తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలు అలా కాదే, వినియోగమూ, అమ్మకమూ రెండు కలిసి ఉంటాయి.అందువలన అన్ని చోట్లా ఒకే పరిస్ధితి లేదు. కేంద్రం తన బాధ్యతను తప్పించుకోజాలదు.


ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని మరోసారి అడగను అని కెసిఆర్‌ రాతపూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చిన సంగతి రైతులకు చెప్పలేదు. అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ప్రచారం చేసుకున్నారు.ప్రసాదాన్ని దేవుడు తినడు అనే అంశం పూజారికి మాత్రమే తెలుసు. అలాగే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చినందున ఉప్పుడు బియ్యం కొనరనే అంశం కెసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకనే కొద్ది నెలల క్రితం సన్నవరి రకాలు వేసుకోవాలని, ఆ రైతులకు అదనంగా ప్రోత్సాహక మొత్తాలను ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం బదులు అంత మేరకు గతం కంటే అదనంగా పచ్చి బియ్యం కొంటుందనే హామీ లేకపోవటంతో కెసిఆర్‌కు తత్వం తలకెక్కి రోడ్డెక్కారు. రైతుల కోసమే గనుక ఆందోళనకు దిగటాన్ని తప్పుపట్టనవసరం లేదు. ఈ సంగతులన్నీ రైతులకు, ఇతర జనాలకు చెప్పకుండా దాచటంలో ఆంతర్యం ఏమిటన్నదే ప్రశ్న.


రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బిజెపి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని వడ్ల సంగతి తేల్చకుండా రైతుల్లో కెసిఆర్‌ను గబ్బు పట్టించాలన్న దురా,దూరాలోచన ఉంది కనుకనే కొనుగోలు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయటం లేదన్నది తేలిపోయింది. రెండు అవకాశాలున్నాయి. ఒకటి మరికొద్ది రోజులు సమస్యను ఇలాగే నానబెట్టి రైతాంగాన్ని కెసిఆర్‌, అధికారపార్టీ మీదకు రెచ్చగొట్టటం, కెసిఆర్‌ విఫలమైనట్లు చెప్పటం, తరువాత రాష్ట్ర బిజెపి పెద్దలు ఢిల్లీ పర్యటనలు జరిపి కేంద్రాన్ని ఒప్పించినట్లు తతంగం జరిపి మావల్లనే వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొనేందుకూ అవకాశం ఉంది. కేంద్రం, ఎఫ్‌సిఐ నిమ్మకునీరెత్తినట్లుగా రైతుల ఆందోళనను పట్టించుకోకుండా స్పందించకుండా ఉందంటే ఏమనుకోవాలి ?
కెసిఆర్‌ రోడ్డుమీదకు రావటం వెనుక బహుశా ఇతర కారణాలు కూడా ఉండి ఉండాలి. విద్యుత్‌ సంస్కరణలను అమలు జరపాలని కేంద్రం వత్తిడి తెస్తోంది. దానికి లొంగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి ప్రకటన చేసింది. తదుపరి తెలంగాణా వంతు రానుంది. పంపుసెట్లకు మీటర్లు అంటే తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే రైతులు గుర్రు మంటున్నారు. తెలంగాణాలో అది పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ సంస్కరణల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో నిండా మునిగి ఏమి చేయాలో దిక్కుతోచని కెసిఆర్‌ కొంత కాలమైనా దాని గురించి చర్చ జరగకుండా వడ్ల సమస్యను తెచ్చారా ? కేంద్రం కూడా వెంటనే వత్తిడి తేలేదు, ఏం జరుగుతుందో చెప్పలేము.


కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తోంది. ఇది సేకరణ బాధ్యతనుంచి తప్పుకొనే ఎత్తుగడలో ఒక ప్రచారం. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత వివిధ సూచికల్లో మన దేశం మెరుగుపడకపోగా దిగజారుతోంది. సులభతర వాణిజ్య సూచికలో మెరుగుదలను ప్రకటించినపుడేమో దాన్లో ఎలాంటి లోపాలు కనిపించవు, కానీ దిగజారిన మిగతావాటి గురించి లెక్కించిన పద్దతి తప్పు, మన స్ధానం మరింత మెరుగుపడిందనే వితండవాదానికి దిగుతోంది. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఆ సూచికలను చూపే గత ప్రభుత్వాలను తూర్పారపట్టిందని మరచిపోరాదు. అప్పుడు లెక్కింపు పద్దతి దానికి గుర్తుకు రాలేదు. ప్రపంచ ఆకలి సూచిక 2021 వివరాలను అక్టోబరులో ప్రకటించారు. చైనాతో సహా పద్దెనిమిది దేశాలు ఒకటో స్దానంలో ఉంటే 116దేశాలకు గాను మనం 101వ స్ధానంలో ఉన్నాం.మోడీ ఏలుబడిలో 2016లో 97గా ఉన్నది ఇప్పుడు 101కి దిగజారింది.మన తరువాత 103వదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. శ్రీలంక 65, మయన్మార్‌ 71, బంగ్లాదేశ్‌, నేపాల్‌ 76, పాకిస్తాన్‌ 92వ స్ధానాల్లో ఉన్నాయి. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నప్పటికీ ఇలా జరిగింది. ఈ సూచికకు నాలుగు అంశాలు ప్రాతిపదిక. తగిన్ని కాలరీలు తీసుకోలేని ఆహారలేమి, ఐదేండ్లలోపు పిల్లల పెరుగుదల గిడసబారుతనం, తగినంత ఆహారలేమి, ఐదేండ్లలోపు మరణించేవారి రేటు ప్రాతిపదికగా తీసుకొని లెక్కిస్తారు.


ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే మెజారిటీ జనానికి ఆహారధాన్యాల కొనుగోలు శక్తి పెరగాలి. అది జరగాలంటే అందుకు సరిపడా వేతనాలు లభించే ఉపాధిని వారికి చూపాలి.దేశంలో మొత్తంగా చూసినపుడు ఆ రెండూ లేవు.మరోవైపున జనానికి సబ్సిడీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కోత పెడుతున్నది. రోజు రోజుకూ ఆహారానికి చేసే ఖర్చును జనం తగ్గించుకొని ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. గోదాముల్లో గోధుమ, బియ్యాలను ఎలుకలు, పందికొక్కులకు పెట్టటాలు, ముక్కిపోయిన తరువాత పనికిరాని వాటిని పారపోసేందుకైనా కేంద్రం సిద్దపడుతోంది, లేదా సబ్సిడీలిచ్చి విదేశాలకు ఎగుమతులు చేస్తోంది గానీ మన జనానికి అందించేందుకు ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా ఇరవైలక్షల కోట్లతో ఆత్మనిర్భర పాకేజ్‌లంటూ ఆర్భాటం చేసిన పాలకులు తెలంగాణాలో ఉప్పుడు బియ్యాన్ని కొనేందుకు ముందుకు రావటం లేదు. గత వేసవిలో అంగీకరించిన మేరకు ఇంకా ఐదు లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉండగా దాని గురించి ఎటూతేల్చటం లేదు. ఖరీఫ్‌లో పండిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేస్తారో అదీ చెప్పదు. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని ముందే చెప్పిన కేంద్రం పచ్చిబియ్యాన్ని ఎంత పరిమాణంలో కొంటారో ఎందుకు చెప్పటం లేదు. ఎఫ్‌సిఐ ముందుగానే ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేయాలో ప్రణాళికలను రూపొందించుకోదా ? సిబిఐ, ఆదాయపన్ను, ఇడి, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్దలను తనకు లొంగని లేదా తనతో చేరని నేతల మీద ప్రయోగిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరాసను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎఫ్‌సిఐని ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర పోకడ.

ప్రతిపక్ష పార్టీల పట్ల కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, తూలనాడుతున్న తీరు అభ్యంతరకరమే. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి వైఖరిని వారు తీసుకోవచ్చు. వడ్ల కొనుగోలు లేదా బలవంతపు విద్యుత్‌ సంస్కరణల వంటి వాటి మీద పోరాడాల్సి వచ్చినపుడు వాటిని వ్యతిరేకించే పార్టీలన్నీ రోజువారీ విబేధాలను పక్కన పెట్టి పెట్టి రైతాంగం, ఇతర పీడిత జనం కోసం కేంద్రం మీద వత్తిడి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది. తెరాసతో కలిసేందుకు ఇబ్బందైతే ఎవరి కార్యాచరణతో వారు ముందుకు రావాలి.కెసిఆర్‌ది కేవలం హడావుడే అయితే విశ్వసనీయత మరింత దిగజారుతుంది. రైతాంగ ఆగ్రహం, ఆవేశాలు కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నేతల మీదకు మళ్లుతాయి.రాజకీయంగా తగిన ఫలితం అనుభవిస్తారు.

పట్టువీడని జీ జింపింగ్‌ – మెట్టు దిగిన జో బైడెన్‌ !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌, అమెరికా అధినేత జో బైడెన్‌ మధ్య మంగళవారం నాడు ( వాషింగ్టన్‌లో సోమవారం రాత్రి) మూడు గంటల 24నిమిషాల సేపు వీడియో కాన్ఫరెన్సుద్వారా రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. వెలువడిన ప్రాధమిక సమాచారం మేరకు అధినేతలిద్దరూ అనేక అంశాల గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య 1979లో దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత తొలిసారిగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, వివాదాల నడుమ అసలు భేటీ కావటమే ఒక విశేషం. బైడెన్‌ అధికారానికి వచ్చిన 300వ రోజు ఈ భేటీ జరిగింది. సుహృద్భావ సూచికగా రెండు దేశాల నేతలు సమావేశానికి హాజరైన సమయంలో బైడెన్‌ చైనా ఎర్రజెండాకు చిహ్నంగా ఎర్ర రంగు టై ధరించగా, అమెరికా అధికారపార్టీ రంగైన నీలి రంగు టై ధరించి గ్జీ జింపింగ్‌ పాల్గొన్నారు.


రెండు దేశాల సంబంధాలలో ఒక నిశ్చయాన్ని లేదా విశ్వాసాన్ని ఈ సమావేశం నింపిందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. పరస్పరం సహకరించుకోవాలనే అభిలాష వ్యక్తం కావటం ప్రపంచానికి సానుకూల సూచికగా పరిగణిస్తున్నారు. సహజంగా ఇలాంటి సమావేశాలలో మాట్లాడే అగ్రనేతలెవరూ సానుకూల వచనాలే పలుకుతారు. ఇక్కడా అదే జరిగింది. తరువాత ఎవరెలా ప్రవర్తించేదీ చూడాల్సి ఉంది. రెండు దేశాలూ పరస్పరం గౌరవించుకోవాలి, శాంతితో సహజీవనం చేయాలి, ఉభయ తారకంగా సహకరించుకోవాలని, సానుకూల మార్గంలో ముందుకు వెళ్లేందుకు రెండు దేశాలూ చురుకైన అడుగులు వేయాలని జింపింగ్‌ చెప్పాడు.దాపరికం లేకుండా నిర్మొగమాటం లేకుండా చర్చల కోసం చూస్తున్నానని, రెండు దేశాల మధ్య ప్రస్తుత మార్గాన్ని ఘర్షణవైపు మళ్లించవద్దని, రెండు దేశాల మధ్య ఉన్న పోటీ బాటను పోరువైపు మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరుదేశాల అగ్రనేతల మీద ఉందని, ఇరుపక్షాలూ పరిస్ధితి చేజారకుండా తగిన జాగ్రత్తలు(గార్డ్‌ రెయిల్స్‌ – మెట్లు, గోడల మీద నడిచేటపుడు పడకుండా పట్టుకొనేందుకు ఇనుప రాడ్లు, కర్రలు, తాళ్లవంటివి ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఇరు దేశాల వైఖరులు కుప్పకూలిపోకుండా జాగ్రత్తలు) తీసుకోవాలని జోబైడెన్‌ చెప్పాడు. దానికి ప్రతిగా జింపింగ్‌ కూడా స్పందించాడు.చైనా -అమెరికాలు సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు పెద్ద ఓడల వంటివి.ఒకదానినొకటి ఢకొీట్టుకోకుండా ఉండాలంటే అలలను ఛేదించుకుంటూ ముందుకు పోవాలంటే ఒకే వేగం, దిశ మారకుండా సాగేందుకు చుక్కానుల మీద అదుపు కలిగి ఉండాలి అన్నారు.


చైనా తరఫున కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డింగ్‌ గ్జూఎక్సియాంగ్‌, ఉప ప్రధాని లి హె, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా వైపు నుంచి ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు ఫిబ్రవరి, సెప్టెంబరు నెలల్లో ఫోన్‌ ద్వారా అధినేతలు మాట్లాడుకున్నారు. వాటిలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ భేటీ కావాలని నిర్ణయించారు. ముఖాముఖీ సమావేశం కావాలని బైడెన్‌ కోరినప్పటికీ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా గ్జీ జింపింగ్‌ విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నందున వీడియో సమావేశం జరిగింది.


ఈ సమావేశానికి ముందు జరిగిన పరిణామాలను బట్టి అమెరికా జో బైడెన్‌ ఒక మెట్టు దిగినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విధించిన కొన్ని సుంకాలను ఎత్తివేసేందుకు సముఖంగా ఉన్నట్లు అమెరికా నేతలు సూచన ప్రాయంగా వెల్లడించారు. వాణిజ్య యుద్దాన్ని 2018లో ట్రంప్‌ ప్రారంభించిన తరువాత చైనా కూడా అదే మాదిరి స్పందించింది. అందువలన ముందుగా అమెరికన్లే స్పందించాలనే వైఖరిని చైనా ప్రదర్శిస్తోంది. అహం అడ్డువచ్చిన అమెరికా ఇతర విధాలుగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌, జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ముస్లింలను అణచివేస్తున్నారని, భారీ సంఖ్యలో చైనా అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నదంటూ చేస్తున్న ప్రచారం, చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం(క్వాడ్‌), అకుస్‌ పేరుతో చేస్తున్న సమీకరణల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.


అమెరికా ఒక మెట్టుదిగటానికి అక్కడి పరిస్ధితులు, జోబైడెన్‌పై సాధారణ జనం, వాణిజ్యవేత్తల నుంచి వస్తున్న వత్తిడి, జోబైడెన్‌ పలుకుబడి దిగజారుతున్నట్లు వెలువడుతున్న సర్వేలు, వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు బైడెన్‌ యంత్రాంగం మీద వత్తిడిని పెంచుతున్నాయి.ఇరునేతల భేటీకి ఒక రోజు ముందు ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ అమెరికాలోని సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ చైనా సరకుల మీద విధించిన దిగుమతి పన్నులు స్దానికంగా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు. పన్నులను రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు వాటిని తొలగిస్తే కొంత తేడా ఉంటుందని ఆమె అంగీకరించారు. రెండు దేశాల మధó పన్నులు తగ్గించాలని ఒక ఒప్పందం కుదిరినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు, పన్నుల తగ్గింపు కోరికలను తాము గుర్తించామని అమెరికా వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారు.


ప్రస్తుతం అమెరికాలో 31 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 6.2శాతంగా నమోదైంది.సరఫరా వ్యవస్ధలు చిన్నాభిన్నమై అనేక దుకాణాలు సరకులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఆర్ధిక రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ ఎప్పుడు కోలుకుంటుందో తెలియటం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యులతో పాటు తామూ ప్రభావితులం అవుతున్నామని 24వాణిజ్య సంఘాల ప్రతినిధులు పన్నులను రద్దు చేయాలని కోరారు. అమెరికా-చైనా వాణిజ్య మండలి కూడా అదే కోరింది. సెక్షన్‌ 301పేరుతో విధించిన పన్నుల కారణంగా వందల బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతిదారులు చెల్లించారు, ఆమేరకు వినియోగదారుల మీద భారం పడింది. పన్నులను రద్దు చేస్తే చైనా కంటే అమెరికాకే ఎక్కువ ఉపయోగం కనుకనే బైడెన్‌ మెట్టుదిగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా చైనా కూడా కొన్ని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వెంటనే కోలుకొని వృద్ధి రేటుతో ముందుకు పోతున్నది.చైనాలో ధరలు స్ధిరంగా ఉంటేనే అమెరికాలో కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలుగుతారని భావిస్తున్నారు. జో బైడెన్‌ విధానాలను సమర్ధిస్తున్నవారు 41శాతం మందే అని ఆదివారం నాడు ఎబిసి సర్వే ప్రకటించింది. ఈగ్రాఫ్‌ క్రమంగా తగ్గుతున్నది. ట్రంప్‌తో పోలిస్తే కాస్తమెరుగ్గా ఉన్నప్పటికీ ఏడాది కూడా గడవక ముందే ఇలా పడిపోవటం అధికార డెమోక్రటిక్‌ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నతీరును 39శాతం మంది మాత్రమే సమర్ధించారు.క్రిస్మస్‌, ఇతర పండుగల సీజన్‌లో ఆహారపదార్ధాలు, ఇతర వస్తువులకు కొరత ఏర్పడవచ్చని జనం భావిస్తున్నారు.


అమెరికన్లు ఒక్క చైనా మీదనే కాదు చివరికి మిత్రదేశాలుగా ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల మీద కూడా పన్నుల దాడి చేస్తున్నారు. ఒకవైపున బైడెన్‌-జింపింగ్‌ భేటీ జరుగుతుండగా అమెరికా వాణిజ్యమంత్రి గినా రైమోండో, వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి జపాన్‌, ఇతర ఆసియాల పర్యటనకు వచ్చారు.ఉక్కు, అల్యూమినియంలపై పన్ను తగ్గించాలని కోరుతున్నారు.తనకు దక్కనిది ఇతరులకూ దక్కకూడదన్నట్లుగా అమెరికా తీరు ఉంది. చైనాలో చిప్‌ల తయారీ పరిశ్రమను పెట్టవద్దని ఇంటెల్‌ కంపెనీని బైడెన్‌ అడ్డుకున్నాడు. చైనాకు వాటి సరఫరా నిలిపివేయాలని తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా కంపెనీల మీద వత్తిడి తెస్తున్నాడు. ఇది చైనాతో ఆ దేశాల సంబంధాల మీద కూడా ప్రభావం చూపనుంది.చైనా వస్తువులపై పన్నులను ఎత్తివేయటం చైనాకు ఎంత లాభమో అమెరికాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది.చైనాలో ఆర్ధిక రంగం వేగం తగ్గితే పర్యవసానాలు ప్రపంచం మొత్తం మీద పడతాయని అమెరికా ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ చెప్పారు.


అక్టోబరు నెలలో అనేక చైనా విమానాలు తమ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వైపు పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా ఇటీవలి కాలంలో దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడటమే గాక ఒక వేళ విలీనానికి చైనా బల ప్రయోగం చేస్తే తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించి రెచ్చగొట్టింది.తన నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం జరిపిందని ప్రచారం చేయటమే గాక 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు సమకూర్చుకోనుందని తప్పుడు ప్రచారం మొదలెట్టింది. ఇప్పటికిప్పుడు అమెరికాలో ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓటర్లు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఓటు వేస్తారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఉభయ సభల్లో మెజారిటీని కోల్పోతే రానున్ను మూడు సంవత్సరాల్లో బైడెన్‌ సర్కార్‌ను రిపబ్లికన్లు అటాడుకుంటారు. అదిరింపులు, బెదరింపులు పని చేయకపోతే తమ అవసరాల కోసం అమెరికన్లు దిగి వస్తారని గతంలో అనే సార్లు రుజువైంది. ఇప్పుడు చైనా విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా స్ధానిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌ పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.


ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అమెరికా కాస్త వెనక్కు తగ్గుతోందనేందుకు సూచికగా చెప్పవచ్చు. తైవాన్‌ విలీనానికి బలవంతంగా పూనుకుంటే జోక్యం చేసుకుంటామని ప్రకటించి బైడెన్‌ నోరు జారాడు. అది దశాబ్దాల కాలంగా అమెరికా అనుసరిస్తున్న ఒక చైనా వైఖరికి విరుద్దం. వెంటనే అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసి తమ ఒక చైనా విధానంలో ఎలాంటి మార్పు లేదని వివరణ ఇచ్చింది. తైవాన్‌ తనను తాను రక్షించుకొనేందుకు సాయం పేరుతో ఆయుధాలు విక్రయిస్తూ సాయుధం గావిస్తోంది. చైనా టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ హువెయి ఉన్నత అధికారిణి మెంగ్‌ వాన్‌ ఝౌ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఆమె మెక్సికో వెళుతుండగా కెనడా విమానాశ్రయంలో అరెస్టు చేయించిన అంశం తెలిసిందే. ఇరాన్‌ మీద తాము విధించిన ఆంక్షలను సదరు కంపెనీ ఉల్లంఘించిందంటూ కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఇద్దరు కెనడియన్లను చైనా అదుపులోకి తీసుకుంది. ఈ ఉదంతంలో అమెరికా దిగివచ్చి కేసు ఎత్తివేసేందుకు అంగీకరించి వాంగ్‌ విడుదలకు చొరవ చూపింది.తైవాన్‌ సమస్యలో అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని, దానితో ఆడుకుంటే ఆ నిప్పుతోనే కాలిపోతుందని గ్జీ జింపింగ్‌ మంగళవారం నాడు మరోసారి హెచ్చరించాడు. కీలక అంశాల మీద ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేయటమే ఇది.

అప్పుచేసి పప్పు కూడు, కేంద్ర షరతులతో భారాలు – నవరత్నాలే జగనన్నకు ముప్పు తెస్తాయా ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి. మూసిపెడితే పాచి పోతుంది అన్నట్లు పరిస్ధితి ఉంది. అప్పుల తిప్పలు జగన్మోహనరెడ్డి సర్కారును చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిబంధనల పరిమితిని మించి అప్పులు తీసుకున్నారు.రోజు గడవాలంటే కొత్త అప్పులు తీసుకోక తప్పటం లేదు. అలా తీసుకోవాలంటే కేంద్రం విధించే షరతులను అమలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చేసి ఆ మేరకు జనాల మీద భారాలు పెంచుతున్నారు.వృతం చెడ్డా ఫలం దక్కని స్ధితి రానుంది.


తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకు అంటే సెస్టెంబరు వరకు మూలధన( కొత్త ఆస్తుల కల్పన పెట్టుబడి) వ్యయ కేటాయింపులో నిర్ణీతశాతం ఖర్చు చేసిన రాష్ట్రాలకు పరిమితికి మించి 0.5శాతం జిఎస్‌డిపికి సమానమైన మొత్తాన్ని అదనంగా అప్పు తెచ్చుకొనేందుకు కేంద్రం అనుమతిని ప్రకటించింది. ఏడు రాష్ట్రాలు అలాంటి అర్హత సాధించాయి. ఆ విధంగా చత్తీస్‌ఘర్‌కు 895, కేరళకు 2,256, మధ్యప్రదేశ్‌కు 2,590, మేఘాలయ 96, పంజాబ్‌, 2,869, రాజస్తాన్‌ 2,593, తెలంగాణా 5,392 కోట్ల మేరకు కొత్తగా రుణాలు తీసుకోవచ్చు. సెప్టెంబరు 30వరకు 22 రాష్ట్రాలు అందచేసిన సమాచారం మేరకు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో నాలుగుశాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో మూలధన పెట్టుబడికింద చేసిన కేటాయింపులలో తొలి మూడు మాసాల్లో 15శాతం, ఆరుమాసాల్లో 45, తొమ్మిది మాసాల్లో 70, ఏడాది చివరికి నూరుశాతం ఖర్చు చేశారా లేదా అనే ప్రాతిపదికన సమీక్ష చేస్తారు. అందువలన ఒక మూడు మాసాల్లో ఆ మేరకు చేయకపోయినా తరువాత ఖర్చు చేస్తే అర్హత వస్తుంది. తొలి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అలాంటి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. తదుపరి సమీక్ష డిసెంబరు 31న జరుగుతుంది.


తొలిఆరునెలల్లో రాష్ట్ర ఆదాయ(రెవెన్యూ)లోటు 662.8శాతంగా ఉంది. 2021-22 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రు.5,000.08 కోట్లుగా చూపితే ఏప్రిల్‌-సెప్టెంబరునాటికి రు.33,140.62కోట్లకు చేరింది. కాగ్‌ వివరాల ప్రకారం ఆరునెలల్లో మొత్తం ఆదాయం రు.1,04,804.91 కోట్లు, దీనిలో అప్పుగా తెచ్చిన రు.39,914.18 కోట్లు కలసి ఉన్నాయి.రాబడిలో రు.50,419 కోట్లు సంక్షేమ పధకాలకు, మిగిలిన మొత్తంలో అప్పుల అసలు, వడ్డీలు, వేతనాలు, సబ్సిడీలకు చెల్లించినట్లు చూపారు. ఏడాది మొత్తంలో అప్పులుగా తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.37,029.79 కోట్లు కాగా ఆరునెలల్లో తీసుకున్నదే రు.39,914 కోట్లు. మరో ఆరునెలల్లో ఎంత అవుతుందో తెలియదు. గతేడాది కంటే ఆదాయం పెరిగినప్పటికీ చేసిన అప్పు ఇదని గమనించాలి. మూలధన పెట్టుబడి ఖర్చు రు.6,415.51 కోట్లు, ఇది గతేడాది తొలి ఆరునెలల కంటే రు.2,912 కోట్లు తక్కువ. ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లు అంకెల్లో తప్ప అమలుకు నోచుకోదు. గతేడాది నిర్వాకం కూడా ఇదే రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,385 కోట్లే.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీనికి గాను రు. 1,77,247 కోట్లు స్వంత వనరులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆదాయం వస్తుందని, రు.50,525 కోట్లు అప్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆదాయలోటు ఐదువేల కోట్లు,ద్రవ్యలోటు 37వేల కోట్లు అని చూపారు. ప్రతి సంవత్సరం చివరిలో వాటిని సవరిస్తారు. ఉదాహరణకు 2020-21లో ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు. ఇదే ఆదాయాన్ని చూస్తే రు.1,62,558 కోట్లుగా చూపి రు.1,19,126 కోట్లకు తగ్గించగా అప్పు రు.60,258 కోట్లు తెస్తామని రు.57,805 కోట్లు తెచ్చారు.


ఇక కేటాయింపు, ఖర్చు అంశానికి వస్తే దీనిలో అనేక మతలబులున్నాయి.2020-21లో పెట్టుబడి వ్యయం రు.18,797 కోట్లు, ఇది కేటాయింపు కంటే 37శాతం తక్కువ. సాగునీరు, వరద నివారణ పధకాలకు రు.6,786, రవాణాకు 1,962 కోత పెట్టారు. పెట్టుబడి ఖర్చులో ఆస్తులను సమకూర్చే పధకాల నిర్మాణంతో పాటు, గతంలో వాటికోసం తెచ్చిన తీర్చే అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. 2019-20లో ఇందుకోసం చేసిన వాస్తవ ఖర్చు రు.36, 226 కోట్లు, దీనిలో ఆస్తుల కల్పనకు చేసింది రు.12,242 కోట్లు. అంటే అప్పులకే ఎక్కువ పోయింది. 2020-21లో మొత్తం రు.44,397 కోట్లు కేటాయించి రు.32,478 కోట్లకు కుదించారు. దీనిలో అప్పులకు రు.13,681 కోట్లు, ఆస్తులకు రు.18,797 ఖర్చు చేశారు. వర్తమాన బడ్జెట్‌లో రెండింటికీ కలిపి రు. 47,583 కోట్లుగానూ, ఆస్తుల కల్పనకు రు.31,198 కోట్లుగాచూపారు. దీనిలో ముందే చెప్పుకున్నట్లు తొలి ఆరునెలల్లో ఖర్చు చేసింది రు. 6,415.51 మాత్రమే. రెవెన్యూ ఖర్చును చూస్తే 2019-20లో రు.1,37,475 కోట్లు, మరుసటి ఏడాది దాన్ని రు.1,80,393 కోట్ల నుంచి రు.1,52,990 కోట్లకు కోత పెట్టారు. వర్తమాన సంవత్సరంలో ప్రతిపాదనే రు.1,82,197 కోట్లు. దీన్లో ఎంత కోత పెడతారో తెలియదు. పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉంది కనుకనే ఉద్యోగులు, టీచర్లకు కొత్త వేతనాలు ఖరారు చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇక అప్పుల తిప్పల సంగతి చూద్దాం. 2019-20లో అసలు చెల్లింపు రు.18,625, వడ్డీకి రు.17,635 కోట్లు, 2020-21లో ఈ మొత్తాలు రు.11,973 – 22,026గా, 2021-22లో రు.15,503-22,740 కోట్లుగా చూపారు.


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. కార్పొరేట్లకు మార్గాన్ని సుగమం చేస్తోంది. ఉదాహరణకు 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


రాష్ట్రానికి ఉన్న అన్నిరకాల అప్పుల సంగతి చూస్తే 2019-20 ఆదాయలోటు 2.7, ద్రవ్యలోటు 4.1శాతం ఉన్నపుడు జిఎస్‌డిపిలో రుణాలు 31శాతం ఉన్నాయి. మరుసటి ఏడాది అంచనాలను సవరించిన తరువాత అవి వరుసగా 3.5, 5.4, 35.2శాతంగా చూపారు. వర్తమాన సంవత్సరంలో 0.5, 3.5, 36.5 శాతాలుగా ప్రతిపాదించినప్పటికీ ఎంతకు సవరిస్తారో తెలీదు.ప్రభుత్వ పనితీరును చూస్తే కీలకమైన ఐదు శాఖల్లో మిగతా రాష్ట్రాల సగటుతో పోలిస్తే బడ్జెట్లలో కేటాయింపుల శాతాలు ,ఆంధ్ర ప్రదేశ్‌ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు 2021-22వి కాగా ఇతర రాష్ట్రాలవి 2020-21 వివరాలు.
శాఖ××××× ఆంధ్రప్రదేశ్‌ ×× మొత్తం రాష్ట్రాల సగటు
విద్య ×××××× 12.8 ××××× 15.8
ఆరోగ్యం ×××× 6.6 ××××× 5.5
వ్యవసాయం××× 6.2 ××××× 6.3
గ్రామీణాభివృద్ది×× 7 ××××× 6.1
రోడ్లు, వంతెనలు× 1.7 ××××× 4.3
కరోనా, మరొకపేరుతో గతేడాది మోపిన పన్నులు ఇప్పుడు కొంత మేరకు జగన్‌ సర్కార్‌కు ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే పన్నెండువేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏడాదికి తీసుకుంటామని చెప్పిన రుణాల మొత్తం కూడా తీసుకున్నారు. రెవెన్యూలోటు ఏడాదికి ఐదువేల కోట్లని చెబితే 31వేల కోట్లు దాటింది. సంక్షేమ పధకాలకు గతేడాది 75వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 84కోట్లకు పెరిగింది. దశలవారీగా మద్యనిషేధం గురించి చెప్పినా దాన్నొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ప్రొబేషన్‌ టాక్సు పేరుతో రు.4,500 కోట్లు, రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు, సహజవాయువుపై 900 కోట్లు పన్ను విధించారు. వాటిని రోడ్ల మరమ్మతుకు వినియోగించినా ఇంత అధ్వానంగా ఉండేవి కాదు. పైన చెప్పుకున్నట్లు చెత్త పన్ను 350 కోట్లు, పట్టణ ఆస్తులపై రెండువేల కోట్లు, విద్యుత్‌పై 1000 కోట్లు వడ్డించారు.భూముల విలువ పెంచి అదనంగా 800 కోట్లు రాబట్టారు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే !ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించలేరు. ఏదో ఒక పేరుతో వాయిదా వేసే ఎత్తుగడ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు జరపలేరు. తెలంగాణా అనుభవం చూసిన తరువాత ఉద్యోగులు, ఇతరులను ఏమాత్రం మభ్యపెట్టలేరు. నవరత్నాలే సర్వస్వం కాదనే తత్వం ఇప్పుడే తలకెక్కుతోంది. కేంద్రం ఆదేశించిన మేరకు విధించిన భారాల గురించి చెప్పుకోలేరు, విద్యుత్‌ సంస్కరణలను ఎదిరించలేరు. మొత్తం మీద మూడో ఏడాది నాటికే తలకు మించిన ఆర్ధిక భారాన్ని తలకెత్తుకున్నారు. ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగాయి. ఇవిగాక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్దలు, శాఖలకు హామీ ఇచ్చిన అప్పులు మరో లక్ష కోట్లు ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను తప్పించుకొనేందుకు ఇలా రెండు ఖాతాల్లో చూపుతున్నారు. 2024 నాటికి 6.54 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !

2014లోనే అసలైన స్వాతంత్య్రం – కంగనా రనౌత్‌ భుజం మీద నుంచి తూటా పేల్చిన సంఘపరివార్‌ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


స్వాతంత్య్రం గురించి చేసిన వ్వాఖ్వలను వెనక్కు తీసుకొనేది లేదని , తన ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెబితే తాను పొందిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానని సినీనటి కంగన రనౌత్‌ ఊగిపోతున్నారు. ఆమెను ఎప్పుడు ఏ అమ్మోరు ఆవహిస్తుందో తెలియదు- దాంతో ఏం మాట్లాడతారో అసలు ఊహించలేము.మరోసారి అదే జరిగింది. గతంలో మతపరమైన హింసాకాండ, పురోగామిశక్తుల హత్యల మీద పాలకుల మౌనానికి నిరసనగా అనేక మంది తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు.స్వాతంత్య్రం గురించి సెలవిచ్చిన కంగన మతిమాలిన ప్రకటనను ఇప్పుడు ప్రశ్నించినందుకు ఆమె శివాలెత్తారు. పురోగామిభావజాల రచయితలు, ఉద్యమకారులైన కలుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే వంటి వారి హత్యలకు, మతహింసాకాండపై నిరసనగా అనేక మంది ప్రముఖులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన ఉదంతాలు తెలిసిందే. 2015లో దాదాపు 40 మంది అలాంటి వారున్నారు. తిరోగామి భావజాలానికి చెందిన వారు వీరిని అవార్డు వాపసీ గాంగ్‌ అని నిందిస్తూ ఎదురుదాడి చేశారు. కంగన కంటే అనేక మంది అనుభవం, సీనియారిటీ ఉన్న వారు ఉండగా ఆమెకు ఎందుకు అవార్డు వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. తెరమీద ఆమె ఒళ్లు దాచుకోకుండా నటించటానికి ఎలా కష్టపడతారో రాజకీయ తెరమీద అంతకంటే ఎక్కువగా శ్రమిస్తున్న అంశం తెలిసిందే.
కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యానికి మోడీదే బాధ్యత అంటూ రాజీనామా చేయాలని ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్‌ చేసినపుడు కంగనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ” మోడీ గారికి ఎలా నడపాలో(దేశాన్ని) తెలియదు, కంగనకు ఎలా నటించాలో తెలియదు, సచిన్‌ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియదు, లతామంగేష్కర్‌కు ఎలా పాడాలో రాదు గానీ ప్రమాణాల్లేని ఈ మరుగుజ్జులకు మాత్రం అన్నీ తెలుసు. మోడీ గారూ మీరు రాజీనామా చేసి విష్ణు అవతారాలైన ఈ మరుగుజ్జుల్లో ఒకరిని తదుపరి ప్రధానిగా చేయండి ” అంటూ టీట్లతో కంగన శివతాండవం చేశారు.


రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్‌ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్‌ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది.స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్‌ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్‌ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్నవాటిని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. కంగన సినిమాలను చూసిన వారికి పద్మశ్రీ కంగన ఏమి చూపిందో చెప్పనవసరం లేదు. ఒక వేళ చూసినా వర్ణించటానికి ఆ స్ధాయికి దిగజారలేము.గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన కంగనా బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. రీఆనె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్‌ దోసాంజ్‌ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్‌ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. పద్మశ్రీ కంగన తీరుతెన్నులివి. ఆమెకు తెలియని అంశం ఉండదు మరి.


బాధ్యతారహితంగా ట్వీట్లు చేయటంలో, ఎదుటి వారిని నిందించటంలో పేరు మోసిన కంగనకు నెటిజన్లు ఆమె గడ్డిని ఆమెకే తినిపిస్తున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌లో ఇలా సలహాయిచ్చారు.” ఆక్సిజన్‌ స్ధాయిలు తక్కువగా ఉన్న వారు ఇలా చేసి చూడండి.చెట్లు నాటటం శాశ్వత పరిష్కారం. మీరా పని చేయలేకపోతే కనీసం వాటిని నరకవద్దు. వాడిన దుస్తులను తిరిగి ఉపయోగించండి, వేద ఆహారం తీసుకోండి, సహజమైన జీవితం గడపండి, ఇది తాత్కాలికమైన పరిష్కారం, ఇప్పటికైతే ఇది మీకు తోడ్పడుతుంది. జై శ్రీరామ్‌ ” దీని మీద బాజార్‌ చిత్ర దర్శకుడు గౌరవ్‌ కె చావ్లా అపహాస్యం చేస్తూ ” ఆక్సిజన్‌ వృధా మనిషి ” అని ఎద్దేవా చేశారు. దాని మీద కంగనా మండిపడుతూ ” మీ వంటి వారు పాలు సంచుల నుంచి వస్తాయనుకుంటారు.హ హ ఎంత బుద్దిహీనత, సిలిండర్లలోని ఆక్సిజన్‌ కూడా చెట్ల నుంచే తీసుకుంటారు. గాలిలో కాలుష్యం తక్కువ ఉంటే దానిలోని ఎక్కువ భాగం ఆక్సిజన్‌ను తీసుకొనే ఊపిరితిత్తులను కలిగి ఉంటారు, ఏదైతేనేం అమాయకత్వం ఆనందం కలిగించే అంశం, దానిలోనే జీవించండి ” అని పేర్కొన్నారు. నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేస్తారు అని పేర్కొన్న అంశాన్ని కంగనా షేర్‌ చేశారు.ఆక్సిజన్‌ గురించి కంగన్‌ ట్వీట్ల మీద నెటిజన్లు ఆమెను ఆటపట్టించారు. మీరు పూర్తిగా పిచ్చివారయ్యారు చికిత్స చేయించుకోండి అని సలహా ఇచ్చిన వారున్నారు. విద్య ఎంత అవసరమో పెద్దలు ఇందుకే చెప్పారంటూ మరొకరు ఎకసెక్కాలాడారు. వారినీ కంగన వదల్లేదు. ప్రకృతి ప్రకోపం గురించి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది. చెట్లకూ బాధ,భావోద్వేగాలు ఉంటాయి. వాటిని విచక్షణా రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాము, ఈ రోజు గాలిపీల్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాము, వాటిని బతకనివ్వండి అని ట్వీట్‌ చేశారు.


రైతు ఉద్యమం సందర్భంగా తాప్సీపన్ను మీద విరుచుకు పడిన కంగన బస్తీమే సవాల్‌ అంటూ ట్వీట్లతో వీధులకెక్కారు. తాప్పీ తనను అనుకరించిందని, చౌకబారు స్టార్‌, ఆడ పురుషుడు అంటూ నోరు పారవేసుకుంది. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి. ఇక తాజా విషయానికి వస్తే మన దేశానికి నిజమైన, అసలైన స్వాతంత్య్రం నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే వచ్చిందని, 1947లో వచ్చింది బ్రిటీష్‌ వారు వేసిన భిక్ష తప్ప నిజమైనది కాదని పద్మశ్రీ కంగన రనౌత్‌ ప్రకటించారు. భారతీయ చైతన్యం,అంతరాత్మ, నశించిన నాగరికత పునరుజ్జీవం పొంది గర్జింపు, ఉన్నత స్దాయి 2014లోనే వచ్చిందన్నారు. తనకు అవార్డు ఇచ్చినందుకు నరేంద్రమోడీ గారి గురించి ఆ మాత్రం చెప్పకపోతే బాగుంటుందా ? డోనాల్డ్‌ ట్రంప్‌ మోడీని దేశపితగా ప్రకటించారు, ఇక కంగన అండ్‌ కో జాతిపితగా ప్రకటించటమే తరువాయి. కంగన సినిమాల్లో డైరెక్టర్‌ చెప్పినట్లు ఆడతారు,పాడతారు, మాట్లాడతారు. కానీ ప్రజాజీవితంలో అలాంటి డైరెక్టర్లు ఉండరు. అందుకే చివరికి బిజెపి ప్రతినిధితో సహా వివిధ రాజకీయ పక్షాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాంతో గుక్కతిప్పుకోలేక స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని అగౌరవపరచినట్లు ఎవరైనా నిరూపిస్తే తన అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ వీధులకు ఎక్కారు.1857లో స్వాతంత్య్రం కోసం తొలి పోరు జరిగింది, 1947 ఏ పోరు జరిగింది ?నాకు తెలియదు. ఎవరైనా తెలిపితే నా అవార్డును తిరిగి ఇచ్చేస్తా, క్షమాపణలు కూడా చెబుతా, దయచేసి నాకు సాయం చేయండి అంటూ అతి తెలివి ప్రదర్శించారు. మరి 2014లో ఏ పోరు జరిగి,ఎవరు జరిపితే అసలైన స్వాతంత్య్రం వచ్చిందో కంగన చెబుతారా ?


కాంగ్రెస్‌ బిచ్చగత్తె అని అన్నది తానొక్కదాన్నే కాదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను ఉటంకించిన ఒక పుస్తకంలోని పేజీని కంగన చూపారు. కాంగ్రెస్‌ కేవలం వినతులకే పరిమితమైందని, మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దం కావటం లేదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ అడుక్కునే సంస్ధ అని అరవింద ఘోష్‌, అడుక్కోవటానికి, హక్కుగా కోరటానికి ఉన్న తేడాను కాంగ్రెస్‌ తెలుసుకోవాలని లాలా లజపతిరాయి, కాంగ్రెస్‌ బుడగలతో ఆడుకుంటున్నదని బిపిన్‌ చంద్రపాల్‌ అన్న మాటలు దానిలో ఉన్నాయి. వారు కాంగ్రెస్‌ను విమర్శించినా బ్రిటీష్‌ వారికి లొంగినవారు కాదు. కానీ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానని పదే పదే లేఖలు రాసి సావర్కర్‌ను తమ ఆదర్శంగా పరిగణించే నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు కంగన చెప్పటం తప్పుడు ప్రచారంలో భాగం, ఆమె భుజం మీద నుంచి సంఘపరివార్‌ పేల్చిన తుపాకి తూటా తప్ప మరొకటి కాదు. ఆమె పేర్కొన్న పుస్తకాలు, ఇతర అంశాలు సంఘపరివార్‌ ప్రచారంలో ఉంచినవి తప్ప కంగనకు అంతసీన్‌ ఉందని భావించలేము. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్‌ చంద్రబోస్‌ల సరసన సావర్కర్‌ను చేర్చి గొప్ప దేశభక్తుడని చెప్పటం దాన్లో భాగమే. తాను 1957నాటి ప్రధమ స్వాతంత్య్ర పోరాటాన్ని ఎంతగానో పరిశోధించానని, ఝాన్నీ లక్ష్మీబాయి సినిమాలో నటించానని అంటూ ఆ పోరాటం ఎందుకు ఆకస్మికంగా నిలిచిపోయింది, ఎందుకు గాంధీ భగత్‌ సింగ్‌ను మరణించేట్లుగా వదలివేశారు, నేతాజీని ఎందుకు చంపారు, గాంధీ ఎందుకు ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు, దేశవిభజనను తెల్లవారెందుకు చేశారు, స్వాతంత్య్రాన్ని ఉత్సవంగా చేసుకోకుండా ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు, వీటి మీద సమాధానం కావాలని కూడా కంగన కోరారు. సంఘపరివార్‌ స్క్రిప్టును ఒక నటి మాదిరి కంగన వల్లించటం తప్ప ఇది వేరు కాదు.

కంగన ఉవాచ వైరల్‌ కావటంతో ఆమె మీద దేశద్రోహ, రెచ్చగొట్టే వైఖరి మీద కేసులు నమోదు చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఒక ట్వీట్‌ చేస్తూ కంగనపై చర్య తీసుకోవాలని కోరారు.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబనుంచి ఒక సమరయోధుడి కుమారుడిగా కంగన ప్రకటనలు అమరజీవులను అవమానించటమే అని స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు.కంగన వ్యాఖ్యలను ఉన్మాదం అననా దేశద్రోహం అనాలా అని బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ అడిగారు.శివసేన, కాంగ్రెస్‌ కూడా ఖండించింది. కొన్ని చోట్ల కంగన మీద కేసులు నమోదు చేశారు. ఇంత రచ్చ జరిగినా కేంద్ర బిజెపి మౌనం దాల్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం తనపని తాను చేసుకుపోతుంది, కొందరి బుర్రలను చెడగొడుతుంది, చరిత్రను వక్రీకరించే వారికి, తిరగరాయదలచుకున్నవారు కోరుకుంటున్నది ఇదే !