చైనా గ్రామాల నిర్మాణం నిజానిజాలేమిటి : మీడియా పాత్ర దేశభక్తా – దేశ ద్రోహమా ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” భారత భూభాగాల్లో అరుణాచల్‌ సమీపంలో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తున్నది ” అమెరికా పార్లమెంట్‌కు అక్కడి రక్షణ శాఖ పెంటగన్‌ ఇటీవల వార్షిక నివేదికలో చేసిన వ్యాఖ్యలలో ఒకటి. ఇంకేముంది దున్న ఈనిందని చెప్పగానే గాటన కట్టేయమన్నట్లుగా మీడియా మన జనాలకు ఆ వార్తను అందించింది. ఇంత ఘోరమా అని అనేక మంది ఆగ్రహించారు. చైనాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది, ఏదో ఒకటి చేయాలని జనాలు కొందరు ఊగి ఊగిపోయారు. చుట్టుముడుతున్న సమస్యల నుంచి జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని నిరంతరం మార్గాలు వెతికే పాలకులకు కాగల పని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టి పెంటగన్‌, మీడియా తమ పాత్రలను తాము చక్కగా పోషించాయి. నివేదిక, వార్తలు వెలువడిన కొద్ది రోజుల తరువాత తాపీగా ప్రభుత్వం, మిలిటరీ అధికారి రంగంలోకి దిగారు. ఆ చెప్పేదేదో మరుసటి రోజే చెబితే జనాలకు అనవసర ఆయాసం తప్పేది కదా ! బుర్రలు ఖరాబు చేసుకొని ఉండేవారు కదా కదా !! ఎందుకు ఆలశ్యం చేసినట్లు ?


కావాలనే ఆలశ్యంగా స్పందించారన్నది స్పష్టం. పెంటగన్‌ ప్రచారాన్ని కొనసాగనిస్తే చైనా వారు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తుంటే మన ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నది అని ఆవేశం నుంచి తేరుకున్న జనం ప్రశ్నిస్తారు, వాడెవడో అమెరికా వాడు చెప్పేంతవరకు మన సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న సంగతులే తెలియకుండా లేదా తెలుసుకోకుండా మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు ? దేశ రక్షణ బాధ్యత తనదే అని పదే పదే ప్రకటించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవద్దా అని జనం అడుగుతారు. రెండోవైపు నుంచి పెంటగన్‌ చెప్పినదాని మీద మీరు మాట్లాడలేదంటే అది నిజమే అని మీరు నమ్మినట్లే అని మేం భావించవచ్చా అని చైనా వారు కూడా అడుగుతారు. అందుకే స్పందించారు. ఏమన్నారు ?


భారత భూభాగంలో చైనా వారు గ్రామాలు నిర్మిస్తున్నారన్నది వాస్తవం కాదు అని మన రక్షణ దళాల ప్రధాన అధికారి (సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌ గురువారం నాడు అన్నీ పుకార్లే అని చెప్పారు. వాస్తవాధీన రేఖ అన్న దానికి మన ప్రస్తుత అవగాహనకు విరుద్దంగా ఎలాంటి చొరబాట్లు లేవు, గ్రామాల నిర్మాణం కోసం రేఖను దాటి రాలేదు, ఆ వార్తలు వాస్తవం కాదు, నిర్మించారని చెబుతున్న గ్రామాలు వాస్తవాధీన రేఖకు చైనా వైపే ఉన్నాయి అని రావత్‌ చెప్పారు. మాకు తెలిసినంత వరకు అలాంటి గ్రామ అభివృద్ధి వాస్తవాధీన రేఖకు మన వైపున జరగలేదు. కొత్త గ్రామాన్ని నిర్మించేందుకు చైనా వారు రేఖను దాటి మన ప్రాంతంలోకి వచ్చి నిర్మాణం చేశారన్న వార్తమీద ప్రస్తుత వివాదం తలెత్తింది. బహుశా ప్రత్యేకించి ఇటీవల మనతో తలపడిన తరువాత వాస్తవాధీన రేఖ వెంట వారి సైనికులు, పౌరుల కోసం లేదా భవిష్యత్‌లో మిలిటరీ అవసరాల కోసం గ్రామాలను నిర్మిస్తుండవచ్చు అని కూడా రావత్‌ చెప్పారు. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ వెంట దళాలను నియమిస్తున్నాయి. చైనీయులు తమవైపు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినపుడు అక్కడ కొన్ని శిధిలమైన, పాత గుడిసెలను మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని దెబ్బతిన్నపుడు కొత్త వాటిని నిర్మించవచ్చు, ఆధునిక నిర్మాణాలు జరుపుతుండవచ్చు, వాటిలో కొన్ని గ్రామాలు కూడా ఉండవచ్చు, ఉన్నవాటిని విస్తరించి ఉండవచ్చు, చైనా సైనికులు తమ ప్రధాన ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, మన సైనికులు సంతోషంగా ఉండటాన్ని వారు చూస్తున్నారు, మన పౌరులు ఆప్రాంతాలకు వెళతారు, మన కుటుంబాలు ఆప్రాంతాలను సందర్శిస్తాయి, వీటన్నింటినీ వారు చూస్తారు. అందువలన వారి సైనికుల కుటుంబాలు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు కూడా వాటిని నిర్మిస్తుండవచ్చు, మన సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు తమ కుటుంబాలను చూసేందుకు స్వస్ధలాలకు వెళతారు, చైనీయులకు అలాంటి అవకాశం లేదు అని రావత్‌ అన్నారు.


వాస్తవాధీన రేఖ అంటే అనేక అవగాహనలు ఉన్నాయి. మన సైనికులకు వాస్తవాధీన రేఖ ఎక్కడ ఉందో తెలుసు ఎందుకు అంటే ఇది రేఖ, ఈ ప్రాంతాన్ని మనం రక్షించాలి అని వారు నిర్విహించాల్సిన విధుల గురించి వారికి చెబుతాము కనుక వారికి తెలుసు. ఒక అవగాహన ఉంది. చైనా వారికి కొన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉందని మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే వారికి వాస్తవాధీన రేఖ గురించిన అవగాహనను వారికి చెప్పకపోవచ్చు.వాస్తవాధీన రేఖ వెంట గ్రామాల నిర్మాణం కండబల ప్రదర్శన అన్నదాన్ని కచ్చితంగా కాదంటాను, బలప్రదర్శన అని నేను వర్ణించను, ఈ గ్రామాల ద్వారా వారు తమ సరిహద్దులకు సులభంగా చేరుకొనేట్లు చూసుకుంటున్నారు, మనం కూడా అదే చేయాల్సి ఉంది, మన ప్రభుత్వం కూడా సరిహద్దు ఏరియా అభివృద్ది కార్యక్రమ పధకానికి (బిఏడిపి) నిధులు విడుదల చేసింది. నిజానికి మనం సరిహద్దు ప్రాంతాలకు తిరిగి వెళ్లండి అని పౌరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే వాస్తవాధీన సరిహద్దు రేఖ వెంట అనేక గ్రామాలవారు ఖాళీ చేశారు అని రావత్‌ వెల్లడించారు. ఎందుకు వారు ఖాళీ చేస్తున్నారంటే లోపలి ప్రాంతాలలో వారికి మరింతగా విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రావత్‌ చెప్పారు.


మన విదేశాంగశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిందేమిటి ? ” దశాబ్దాల క్రితం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో సహా కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిర్మాణకార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటాన్ని గానీ లేదా చైనా చెబుతున్న అంశాలను గానీ భారత్‌ అంగీకరించలేదు. దౌత్యపద్దతుల్లో ఎప్పుడూ అలాంటి కార్యకలాపాలకు నిరసన తెలుపుతూనే ఉన్నాము. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగిస్తాము.భారత భద్రత, భూభాగాన్ని కాపాడుకొనేందుకు నిరంతరం పరిణామాలను గమనిస్తూనే ఉంటాము, తగిన చర్య తీసుకుంటాము. అమెరికా పార్లమెంట్‌కు ఆ దేశ రక్షణశాఖ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రత్యేకించి తూర్పు రంగంలోని అంశాలను గమనంలోకి తీసుకున్నాము. చైనాతో ఉన్న సరిహద్దు ఆప్రాంతాన్ని కలుపుతూ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నాము” అని చెప్పారు.


పెంటగన్‌ నివేదిక, బిపిన్‌ రావత్‌, అరిందమ్‌ బాగ్చీ చేసిన ప్రకటనల్లో తేడా గురించి, ఏది వాస్తవమో ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలంటూ కాంగ్రెస్‌ స్పందించింది. ఈ నివేదిక గురించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం లేదా పార్టీ ప్రతినిధులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.చైనా అక్రమ ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతారు, సైనికదళాల సిడిఎస్‌ చైనా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటారు, గతంలో అఖిలపక్ష సమావేశంలో మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీనిలో ఏది వాస్తవమో జనానికి మోడీ సర్కార్‌ చెబుతుందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నిజానికి రావత్‌-అరిందమ్‌ బాగ్చీ చెప్పిందాన్లో పరస్పర విరుద్దతేమీ లేదు. ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలను అరిందమ్‌ చెప్పారు. అక్కడి వాస్తవ పరిస్ధితి గురించి బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్యసరిహద్దు వివాదం బ్రిటీష్‌ వారు సృష్టించింది. వారు గీసిన గీతలకు భిన్నంగా మన దేశానికి చెందినవిగా చూపినవి చైనా ఆధీనంలో, చైనాలో భాగంగా చూపినవి మన ఆధీనంలో ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో ఆక్సాయిచిన్‌, మరికొన్నింటిని మనవి అని మన దేశం చెబుతోంది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా అంటోంది. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను అనుసరిస్తున్నాయి. ఈ వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప మరొక పద్దతిలో సాధ్యం కాదు. దీన్ని మరింతగా రాజేయాలని అమెరికా చూస్తోంది.


ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే అజెండాతో ముందుకు పోతున్న అమెరికా ఎక్కడిక్కడ దేశాల మధ్య తంపులు పెట్టేందుకు చేయని తప్పుడు పనులులేవు. తప్పుడు నివేదికలను రూపొందించటం, వాటి మీద మీడియాలో కట్టుకథలు-పిట్టకథలు రాయించటం దాని నిరంతర కార్యక్రమం. వాటిని పట్టుకొని మన మీడియా రెచ్చిపోతోంది.ఏ దేశంతో అయినా సమస్యలు వచ్చినపుడు జనాలకు వాస్తవాలను వివరించేందుకు భిన్న అభిప్రాయాలతో అంశాలను అందించటం తప్పుకాదు. ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకొనే ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖల్లాలేవు. ఆ దిశగా రెచ్చగొట్టే మీడియా ఏ విధంగానూ దేశానికి మేలు చేసేది కాదు. అమెరికా తన గోతిని తానే తవ్వుకొని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎంత అవమానకరంగా బయట పడిందీ తెలిసిందే, అది ఆడించినట్లు ఆడే దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి. అందుకు ఇరాన్‌-ఇరాక్‌లే పక్కా నిదర్శనం. అక్కడి చమురు సంపదలపై కన్నేసిన అమెరికా రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మి పదేండ్ల పాటు తలపడేట్లు చేసిన చరిత్ర, చివరకు ఇరాక్‌ను ఆక్రమించిన దుర్మార్గం, లొంగని ఇరాన్‌పై ఆంక్షల అమలు తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన అమెరికా తప్పుడు నివేదికలను ఆధారం చేసుకొని తప్పుడు వార్తలను జనాల మెదళ్లకు ఎక్కించటాన్ని మీడియా దేశభక్తిగా భావిస్తోందా ? ఇంతకు మించి సంచలనాలు, రేటింగ్‌లు పెంచుకొనే సత్తా లేదా ? మీడియాను గుడ్డిగా నమ్మి రెచ్చిపోకూడదని జనం గ్రహించాలి.

పరిస్ధితులు బాగోలేవు, నరేంద్రమోడీ గారు చెప్పిన మంచి రోజుల గురించి ఇంకా భ్రమలతో జనం ఎదురు చూస్తున్నారు. లక్షలాది కుటుంబాలు కరోనా కల్లోలం నుంచి కోలుకోలేదు.పూర్వపు స్ధాయికి ఆదాయాలు రాలేదు.ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినపుడు మానసిక బలహీనతకు లోనుకావటాన్ని ఆసరా చేసుకొని పాలకపార్టీలకు చెందిన మరుగుజ్జు దళాలు వాట్సప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే మరమ్మతు చేయటానికి కూడా వీల్లేనంతగా ఎందరో బుర్రలను ఖరాబు చేశాయి.ఇలాంటి ప్రచారానికి పాల్పడేందుకు ఇప్పుడు సాంప్రదాయ మీడియా-సామాజిక మాధ్యమం పరస్పర ఆధారితంగా మారుతున్నాయి. వాస్తవాల కంటే సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది దేశభక్తా, దేశద్రోహమా ? దేశమంటే మట్టికాదోయి-దేశమంటే మనుషులోయి అని మహాకవి గురజాడ చెప్పిందాని ప్రకారం జనాలను తప్పుదారి పట్టించి ఉన్మాదానికి లోను చేయటం ప్రజాద్రోహం- దేశద్రోహం కాదా ?

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

మేడిన్‌ ఇండియా : అమెరికాకు ” అగ్రహారాలు ” ఎగుమతి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము అని అభినవ నన్నయ అని పేరు తెచ్చుకున్న రాయప్రోలు సుబ్బారావు తన దేశభక్తి గీతంలో ఉద్భోదించారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్‌ వివక్ష వ్యతిరేక చర్యల్లో భాగంగా కుల వివక్షను గుర్తించేందుకు పూనుకుంది. కోల్బి కాలేజీలో కులవివక్షపై నిషేధం విధించారు. ఈ చర్యతో మన కులం కంపును అంతర్జాతీయంగా వ్యాపింప చేస్తున్నామని మరోసారి లోకానికి వెల్లడైంది. ఇప్పటి వరకు దీని తెలియని వారు కూడా తెలుసుకొని ముక్కుమీద వేలేసుకుంటున్నారు. పరాయి దేశాలకు పోయినా కులాల కుంపట్లు రాజేసుకొని రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తున్నాం.ప్రస్తుతం నడుస్తున్న జైభీమ్‌ సినిమా దర్శకుడు జ్ఞానవేల్‌ తన సినిమాలో గిరిజనులపై పోలీసు కస్టడీలో చిత్ర హింసల గురించి చెబుతూ అవి పదే పదే జరగటం కంటే వాటి మీద సమాజం మౌనం పాటించటం తీవ్ర అంశమని చెప్పారు. కులవివక్ష కూడా అలాంటిదే. అనేక మంది తాము పాటించటం లేదని చెబుతారు. అది అభినందనీయమే కానీ ఇతరులు పాటిస్తుంటే ప్రేక్షకులుగా, మౌనంగా ఉండటాన్ని ఏమనాలి ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఆఫ్రికన్లు, ఆసియన్లు, శ్వేతేతరులందరూ జాత్యహంకారానికి గురవుతున్నారు. భారతీయులు కూడా దానికి గురౌతున్నారు.కానీ వారిలో అగ్రకులం అనుకొనే వారు మిగతా వారి పట్ల కులవివక్షను పాటిస్తున్నారు. వీరిలో ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. మొత్తం పాతికలక్షల మంది అమెరికాలో భారత సంతతికి చెందిన వారున్నారు. రెండు లక్షల మంది దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్దులు అమెరికాలో ఉన్నట్లు అంచనా.


గతేడాది జూన్‌లో అమెరికాలో వివక్ష కేసు ఒకటి దాఖలైంది. సిస్కో కంపెనీలో పని చేస్తున్న దళిత సామాజిక తరగతికి చెందిన ఒక ఇంజనీరు అదే కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్న మరో ఇద్దరు అగ్రకులాలుగా పరిగణించే వారు తన పట్ల వివక్ష చూపారన్నది ఫిర్యాదు. సదరు కంపెనీ ఎలాంటి చర్యతీసుకోకపోగా తమ వద్ద అలాంటి వివక్ష లేదని చెప్పుకుంది. ఫిర్యాదు చేసిన దళితుడిని పక్కన పెట్టింది. ఈ వార్త వెలువడిన తరువాత అమెరికాలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈక్వాలిటీ లాబ్స్‌కు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌,ఐబిఎం వంటి కంపెనీలలో కూడా అలాంటి పరిస్ధితి ఉందంటూ అనేక ఫిరా ్యదులు అందాయి. సిలికాన్‌ వ్యాలీలో ” అగ్రహార వ్యాలీలు ” ఉన్నాయని ఈక్వాలిటీ లాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీమతి తనిమొళి సౌందర్‌రాజన్‌ చెప్పారు. (మన దేశంలో అగ్రహారాలు వివక్షకు ప్రతి రూపాలుగా ఉన్నందున వివక్ష పాటించే వారందరికీ అది వర్తిస్తుంది తప్ప కేవలం బ్రాహ్మణ సామాజిక తరగతిని లేదా అగ్రకులాలు అని భావిస్తున్న సామాజిక తరగతులందరినీ తప్పు పట్టటంగా భావించకూడదు)

తమిళనాడులోని ఐఐటి-మద్రాస్‌ను అయ్యర్‌ అయ్యరగార్‌ టెక్నాలజీ అని గుసగుసలాడుకుంటారు. కులపరమైన వివక్ష దేశంలో నిషేధించబడిందనే అంశం తెలిసినప్పటికీ ఖర్గపూర్‌ ఐఐటి ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఎస్‌సి, ఎస్‌టి విద్యార్దులను బ్లడీ బాస్టర్డ్‌ అంటూ తూలనాడిన దురహంకార ఉదంతం తెలిసిందే. అమెరికాలోని హిందూమతానికి చెందిన స్వామినారాయణ సంస్ధ న్యూజెర్సీలో దేవాలయ నిర్మాణం కోసం రెండు వందల మంది బలహీనవర్గాలకు చెందిన వారిని అక్కడికి తీసుకుపోయి గంటకు కేవలం 1.2 డాలర్లు మాత్రమే ఇస్తూ సంవత్సరాల తరబడి పని చేయిస్తున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వారు కార్మికులు కాదని, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న నిపుణులైన చేతిపని స్వచ్చందసేవకులని, వారినెంతో గౌరవంగా చూస్తున్నామని సంస్ధ అధిపతి కాను పటేల్‌ సమర్ధించుకున్నారు. సిస్కో, ఈ దేవాలయ నిర్మాణంలో వెట్టి కార్మికుల కేసు ఇంకా పరిష్కారం కాలేదు.


ఈక్వాలిటీ లాబ్‌ 2016లో నిర్వహించిన ఒక సర్వేలో దిగువ కులాలుగా పరిగణించబడుతున్న తరగతులకు చెందిన వారిలో 41శాతం మంది వివక్షకు గురవుతున్నట్లు చెప్పినట్లు తేలింది. అమెరికా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ఈ సర్వే జరిగింది. పని స్ధలాల్లో వివక్షకు గురైనట్లు 67శాతం చెప్పారు. మొత్తంగా దక్షిణాసియా వారు వివక్షకు గురవుతున్నప్పటికీ వారిలో అగ్రకులాలకు చెందిన వారు నామమాత్రంగా ఉన్నారని సర్వే తెలిసింది. కార్నెగీ సంస్ధ 2020లో జరిపిన సర్వేలో అమెరికాలో జన్మించిన వారితో పోలిస్తే వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది తమ కుల గుర్తింపును గట్టిగా చెప్పినట్లు తేలిసింది. పది మందిలో ఎనిమిది మంది తాము అగ్రకుల హిందువులమని చెప్పుకున్నారట. వివక్ష గురించి అడిగిన ప్రశ్నకు అమెరికాలో శ్వేతజాతి వివక్ష అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పని భారత సంతతికి చెందిన వారిలో 73శాతం మంది చెప్పగా భారత్‌లో హిందూత్వ మెజారిటీ వివక్ష ఇక్కడి ప్రజాస్వామ్యానికి ముప్పని 53శాతం మాత్రమే చెప్పారట.


ఇటీవలి కాలంలో అమెరికా, ఇతర దేశాలలో ఉన్న దళితులు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అవమానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు, బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో సెల్వీ రాజన్‌ ఒకరు. ఆమె ఆర్గనైజ్‌ పేరుతో కుల వివక్ష వ్యతిరేక శక్తులను సమీకరిస్తున్నారు. ఆమె తలిదండ్రులు కులవివక్షను తప్పించుకొనేందుకు అమెరికా వలస వెళ్లారు.తాము భారత్‌ నుంచి అమెరికా వచ్చినా అక్కడా కులముద్ర వెంటాడుతోందని సెల్వీ ఆవేదన చెందారు. తన అనుభవం గురించి చెబుతూ దళితులు అమెరికాకు రావటం అరుదుగా ఉంటున్న స్ధితిలో తనను అగ్రకులస్తురాలిగా అనేక మంది భావించారన్నారు. ఒక ఆసియన్‌గా శ్వేతజాతి దురహంకారానికి గురైనట్లు చెప్పారు.తన రూమ్మేట్‌గా ఉన్న ఒక బ్రాహ్మణ యువతి తన వంట పాత్రల్లో మాంసం కాదు కదా గుడ్లు కూడా ఉడికించటానికి వీల్లేదని కరాఖండితగా చెప్పినట్లు వెల్లడించారు. అమెరికాలో కూడా కులాన్ని పాటిస్తున్నందున ఇతరుల మాదిరే తోటి భారతీయుల ముందు కులాన్ని దాచుకోవాల్సి వచ్చిందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే అమెరికాలో కూడా అది పాతుకుపోతుంది కనుక ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆర్గనైజ్‌ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికాలో జాత్యహంకారం, భారత్‌లో కులతత్వానికి దగ్గరి పోలికలు ఉన్నాయని రెండూ అణచివేతకు పాల్పడేవే అన్నారు. ముందుగా వాటి గురించి మాట్లాడుకోవాలి, అర్ధం చేసుకోవాలని సెల్వి చెప్పారు. భారత హాకీ ఒలింపిక్‌ టీమ్‌లో ఎక్కువ మంది దళితులు ఉన్న కారణంగానే జట్టు ఓడిపోయిందని క్రీడాకారిణి వందనా కటారియా కుటుంబ సభ్యులను అగ్రకుల దురహంకారులు నిందించిన ఉదంతాన్ని సెల్వి గుర్తు చేసింది. కులదురహంకారం, జాత్యహంకారం ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయంటూ 1959లో అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భారత పర్యటన అనుభవాన్ని సెల్వి ఉటంకించారు. తిరువనంతపురంలోని ఒక ఉన్నత పాఠశాలను కింగ్‌ దంపతులు సందర్శించారు. అక్కడి హెడ్‌మాస్టర్‌ దళిత విద్యార్దులకు వారిని పరిచయం చేస్తూ కింగ్‌ మీకులపు వారే అని పేర్కొన్నట్లు సెల్వి చెప్పారు.


మన దేశంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు తెలివితేటలు, ప్రతిభాపాటవాల్లో ఇతర కులస్తులకంటే పుట్టుకతోనే తక్కువ అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అమెరికాలోని శ్వేతజాతి వారితో పోలిస్తే ఆఫ్రో-అమెరికన్లలో జన్యుపరంగానే ఐక్యు (తెలివితేటలు) తక్కువ అంటూ 1994లో బెల్‌కర్వ్‌ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన అంశం తెలిసినదే. 2018లో జరిపిన ఒక సర్వే ప్రకారం 26శాతం మంది దక్షిణాసియా వాసులు భౌతికదాడులకు గురైనట్లు , 59శాతం మంది కులపరమైన వివక్షకుగురైనట్లు, సగం మంది తాము దళితులమని వెల్లడైతే దూరంగా పెడతారని భయపడినట్లు తేలింది.2003లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని భారత అధ్యయన కేంద్ర సర్వే ప్రకారం భారత్‌ నుంచి వలస వచ్చిన వారిలో దళితులు కేవలం 1.5శాతమే అని 90శాతం మందికి పైగా తాము ఆధిపత్యకులాలకు చెందిన వారిగా చెప్పినట్లు తేలింది. అమెరికాలో జన్మించిన భారత సంతతివారితో పోలిస్తే వలస వచ్చిన వారితో కులవివక్ష సమస్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీతి మేషరామ్‌ అనే దళితయువతి అమెరికాలో తన అనుభవం గురించి చెబుతూ పార్టీలు జరుపుకునే సమయంలో ప్రతి గదిలో ఉన్నవారిని పలుకరించి కులం గురించి తెలుసుకున్నవారు తన వద్దకు వచ్చేసరికి ఇబ్బంది పడేవారని, కారణం తాను దళితకులానికి చెందినట్లు తెలియటమే అన్నారు. తనపై జరిగిన అత్యాచారం గురించి ఆమె వివరిస్తూ గ్రామాల్లో పొలాల్లో పని చేసే దళిత స్త్రీల శరీరాలకు తామే యజమానులమన్నట్లు ప్రవర్తించే భూస్వాముల మాదిరి ఒక అగ్రకుల విద్యార్ధి తన పట్ల ప్రవర్తించాడని, ఆ విషయాన్ని అగ్రకులానికి చెందిన తన రూమ్మేట్‌కు చెబితే నమ్మకుండా తిట్టిందని మేషరామ్‌ చెప్పింది. రుజువు చేసే అవకాశాలు లేనందున ఫిర్యాదు చేయ లేదని చెప్పింది.


అమెరికాలోని దళితుల గురించి ఈక్వాలిటీ లాబ్‌ జరిపిన సర్వే విశ్లేషణ ఫలితాలు ఇలా ఉన్నాయి. సర్వేలో పాల్గన్నవారిలో 25శాతం మంది భౌతిక లేదా దూషణ దాడికి గురయ్యారు. చదువుకొనేటపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు వివక్షను అనుభవించారు. పని స్ధలాల్లో మూడింట రెండువంతుల మంది పట్ల అనుచితంగా వ్యవహరించారు. అరవైశాతం మంది కులపరమైన జోక్స్‌ లేదా మాటలను ఎదుర్కొన్నారు.నలభైశాతం మంది దళితులు, 14శాతం మంది శూద్రులను పని స్ధలాల్లో ఎందుకు వచ్చారన్నట్లుగా చూశారు. తమ కులం కారణంగా వాణిజ్యంలో వివక్షకు గురైనట్లు 14శాతం మంది దళితులు చెప్పారు.తమ కులం కారణంగా అమ్మాయిలు తమతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌కు తిరస్కరించినట్లు 40శాతం మంది చెప్పారు.తమ కులాన్ని ఎక్కడ వెల్లడిస్తారో అనే భయం ప్రతి ఇద్దరు దళితుల్లో ఒకరు, ప్రతి నలుగురు శూద్రుల్లో ఒకరిలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే అనేక మంది కులవివక్షను వ్యతిరేకిస్తూనే ఆత్మన్యూనతకు లోను కాకుండా తమ కులం గురించి గర్వంగా చెప్పుకొనే దళితులు కూడా గణనీయంగా ఉన్నారు. ప్రపంచీకరణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలతో పాటు ప్రపంచవ్యాపితం అవుతున్న కులవివక్ష మహమ్మారికిి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకించే అందరితో కలసి పోరాడాల్సి ఉంది.

అమెరికా అబద్దాల అమ్ముల పొదిలో మరో అస్త్రం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా – అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా ? ఇప్పటి వరకు అమెరికా జరిపిన యుద్దాలలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా చెప్పుకొనేందుకు విజయం లేదు. అవమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధమైనా ముందు ప్రచార దాడితోనే ప్రారంభమైంది. అదేమంటే నిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టటం. ఇప్పుడు చైనా మీద అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి ముప్పేట ప్రచారదాడి మొదలైంది. అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌, వాటితో జట్టుకట్టిన దేశాలన్నీ తమ తమ పాత్రలను పోషిస్తున్నాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉన్న యుద్ధోన్మాదులు ఈ పరిణామాలను చూసి రెచ్చిపోతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. పర్యవసానాలను పట్టించుకోవటం లేదు. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగన్‌ వార్షిక నివేదికలో ఒక ప్రచార అస్త్రాన్ని వదిలింది. దాన్ని పట్టుకొని అనేక మంది పండితులు అది నిజమే అని జనాన్ని నమ్మించేందుకు, చైనాను ఒక బూచిగా చూపేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తున్నారు.


ఇంతకీ పెంటగన్‌ చెప్పిందేమిటి ? చైనా వద్ద రెండువందల వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు, దశాబ్ది చివరికి అవి రెట్టింపు కావచ్చని గతేడాది అమెరికా రక్షణ అంచనా వేసిందట. అప్పటి నుంచి చైనా తన అస్త్రాలను విస్తరించటం ప్రారంభించటంతో 2027నాటికి ఏడువందలకు, 2030 నాటికి 1000కి పెరగవచ్చని, దీంతో ప్రపంచానికి ముప్పు పెరుగుతుందని ఈ ఏడాది పెంటగన్‌ చెప్పింది. ఆధారం లేని అంశాలను, అబద్దాలను చెప్పటంలో పెంటగన్‌ పేరు మోసింది. ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులంటూ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా మీడియా అల్లిన కట్టు-పిట్ట కథలను జనం నమ్మారు, ఇప్పటికీ నమ్మే వారున్నారు. నిజానికి అలాంటి వేమీ లేవు. వియత్నాం యుద్దం గురించి అది ఎలాంటి నివేదికలను రూపొందించిందో, మిలిటరీ, పౌర అధికారులు, విధాన నిర్ణేతలు ఎన్ని అబద్దాలు చెప్పి పార్లమెంటు, స్వంత పౌరులను , ప్రపంచాన్ని తప్పుదారి పట్టించారో తరువాత వివరాలు బయటపడ్డాయి. అందరూ కలిసి చేసిన ఈ దారుణానికి లక్షలాది మంది వియత్నాం పౌరులు దెబ్బతిన్నారు. సైగాన్‌ వంటి నగరాలు, పంట పొలాలను నాశనం చేశారు. ఎందరో మానవతులను చెరబట్టారు. చివరికి ఆ దాడుల్లో ఉత్తిపుణ్యానికి తమ 58వేల మంది సైనికులు మరణించారని, లక్షలాది మంది భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్నారంటూ ఆ దాడులను ఆపివేయాలని అమెరికా జనం వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అంశం తెలిసిందే.వియత్నాం టాస్క్‌ ఫోర్స్‌ పేరుతో రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం రూపొందించిన నివేదికను పత్రికలు ప్రచురించరాదని అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం వత్తిడి తెచ్చింది. అటార్నీ జనరల్‌ జాన్‌ డబ్ల్యు మిచెల్‌ టైమ్‌ పత్రికకు ఒక టెలిగ్రాం పంపాడు. ఆ నివేదిక ప్రచురణ అమెరికా రక్షణ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించాడు.(ఈ ప్రబుద్దుడు తరువాత నిక్సన్‌ పాల్పడిన వాటర్‌గేట్‌ కుంభకోణంలో పోషించిన పాత్రకు జైలు పాలయ్యాడు, సదరు నిక్సన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.) తరువాత ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పత్రికలకు ప్రచురించే హక్కుందని తీర్పు వచ్చింది.


ఇరాన్‌కు ఆయుధాల సరఫరాపై నిషేధం ఉన్నప్పటికీ రీగన్‌ ప్రభుత్వం రహస్యంగా విక్రయించటమే గాక ఆ సొమ్మును నికరాగువాలో వామపక్ష శాండినిస్టా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తయారు చేసిన కిరాయి మూక కాంట్రాలకు అందచేసింది. వారికి నిధులు ఇవ్వటాన్ని పార్లమెంట్‌ నిషేధించింది. దీని గురించి కూడా పెంటగన్‌ పచ్చి అబద్దాలు, అతకని వాదనలు వినిపించింది. తరువాత జార్జి బుష్‌ పాలనాకాలంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు అల్లిన అబద్దాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిలవ చేశాడని ప్రచారం చేసిన అంశం, తరువాత అలాంటివేమీ దొరకలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండోచైనా దేశాలైన వియత్నాం, లావోస్‌, కంపూచియాలను ఆక్రమించుకొనేందుకు, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వరుసగా దాడులు చేశాయి. చివరిగా పాల్గొన్న అమెరికన్లు అవమానకర రీతిలో అక్కడి నుంచి తోకముడిచారు. ఆ ఉదంతం నుంచి అమెరికన్లు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు పేరుతో జోక్యం చేసుకున్నారు. అక్కడా పరాభవాలు ఎదురైనా రెండు దశాబ్దాల పాటు విజయం సాధిస్తున్నట్లు అమెరికన్లను, యావత్‌ ప్రపంచాన్ని ఎలా నమ్మించారో, చివరకు ఆ తాలిబాన్ల కాళ్లు పట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.


సోవియట్‌ యూనియన్నుంచి పశ్చిమ ఐరోపాకు ముప్పువస్తుందనే ముసుగులో నాటో కూటమి ఏర్పాటు చేశారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు. తూర్పు ఐరోపా రాజ్యాలన్నీ ఇప్పుడు రష్యాతో కూడా లేవు, అయినా అమెరికన్లు నాటోను కొనసాగిస్తూ మరింతగా విస్తరిస్తున్నారు ? ఐరోపాకు ముప్పు అని కథలు చెబుతూనే ఉన్నారు. పెంటగన్‌ తన సేనలను కొనసాగిస్తూనే ఉంది.తమ ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడిస్తూనే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియాలో విస్తరించేందుకు, ఇక్కడ కూడా నాటో మాదిరి ఆసియా కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దానిలో భాగమే మన దేశం, జపాన్‌,ఆస్ట్రేలియాలను కలుపుకొని చతుష్టయ(క్వాడ్‌) కూటమి, తరువాత బ్రిటన్‌,ఆస్ట్రేలియాలతో చేరి అకుస్‌ ఏర్పాటు సంగతి తెలిసిందే.వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఎత్తుగడతోనే చైనా అణ్వాయుధాల బూచిని చూపటం, ఖండాంతర క్షిపణుల ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం, అంతరిక్షం నుంచి ప్రయోగించే మహావేగ క్షిపణి పరీక్ష అనే తప్పుడు వార్తలు, తైవాన్‌ పేరుతో రెచ్చగొడుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో తిష్టవేసేందుకు అమెరికన్లకు ఒక సాకు కావాలి. దాన్లో భాగమే పెంటగన్‌ ప్రచారదాడి.


ఆయుధాలు కలిగి ఉండే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా, తమ దగ్గర ఉంటే లోక కల్యాణం, ఇతరులు సమకూర్చుకుంటే వినాశనానికి, కనుక అందరం కలిసి అలాంటి వారిని దెబ్బతీద్దాం, అందుకు గాను మా దగ్గర మీరు ఆయుధాలు కొనుగోలు చేయండి అన్నట్లుగా ఉంది అమెరికన్ల తీరు. అమెరికా సైనిక దళాల అధికారుల చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిలే ఒక మీడియా సంస్ధతో మాట్లాడుతూ చైనా గురించి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.” మీరు గనుక మరోసారి చూస్తే, నాలుగుదశాబ్దాల క్రితం వారికి ఉపగ్రహాలు అసలు లేవు. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి ఖండాంతర క్షిపణులు లేవు, ఈ రోజు వారికి ఎన్నున్నాయో చూడండి. వారికి అణ్వాయుధాలు లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి నాలుగవ లేదా ఐదవ తరం లేదా చివరికి ఆధునిక యుద్ద విమానాలు కూడా లేవు. మరలా చూడండి వారి దగ్గరెన్ని ఉన్నాయో. వారికి నౌకాదళం లేదు, జలాంతర్గాములు లేవు, వారికి ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి.” ఇవన్నీ కలిగి ఉండటం ప్రపంచానికి ప్రమాదమైతే తొలి ముప్పు అమెరికా నుంచే వస్తుంది. వారి దగ్గర ఉన్నన్ని మరొక దేశానికి లేవు. పోనీ ఇవన్నీ ఒక్క చైనాకేనా మిగతా దేశాల దగ్గర లేవా ? వాటిని నుంచి మిగతా దేశాలకు ముప్పు లేదా ? ఇదంతా చైనాను దెబ్బతీసే, అనుమానాలు కలిగించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.


ఈ ఏడాది మొదట్లో ప్రపంచానికి తెలిసిన అంచనా ప్రకారం అమెరికా దగ్గర 5,500 అణ్వాయుధాలున్నాయి.ప్రతి ఏటా లక్షల కోట్ల డాలర్లతో నూతన బాంబర్లు, కొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. ఖండాంతర క్షిపణి వ్యతిరేక ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధాల నిరోధ ఒప్పందాల నుంచి వైదొలిగింది.ప్రపంచమంతటా ఏదో ఒక పేరుతో తన క్షిపణులను మోహరిస్తూనే ఉంది. అకుస్‌ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన అణుపరిజ్ఞానాన్ని కూడా అంద చేసేందుకు బ్రిటన్‌తో కలసి ఒప్పందం చేసుకుంది. మరి చైనా ఆయుధాలను తయారు చేయటం లేదా ? ప్రతి ఏటా తన వద్ద ఉన్న వాటిని చైనా బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ప్రతిదేశం అదే చేస్తోంది. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన దేశం కూడా ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో కలసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నది. అమెరికన్లు ప్రపంచ పెత్తనం కోసం ఆయుధాలను వినియోగిస్తుంటే మిగిలిన దేశాలు ఆత్మ రక్షణ కోసం తయారు చేసుకుంటున్నాయి. తొలిసారిగా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయ పెట్టింది అమెరికా తప్ప మరో అణుశక్తి ఏదీ అలాంటి దుర్మార్గానికి పాల్పడలేదు. తాముగా ఎవరి మీద ముందుగా అణుబాంబులను ప్రయోగించబోమని చైనా ప్రకటించింది.


కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం ఎలాగో తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమని అమెరికాతో సహా ప్రతిదేశం అధికారికంగా గుర్తించింది. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు అది తిరుగుబాటు ప్రాంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి, ఇప్పటికీ కొనసాగుతోంది. ఐరాసలో చైనా అంటే తైవాన్‌తో కూడినది తప్ప మరొకటి కాదు. కానీ అమెరికా, ఐరోపాయూనియన్‌, తదితర కొన్ని దేశాలు తైవాన్ను బలప్రయోగంతో ఆక్రమించేందుకు చైనా చూస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నాయి. శాంతియుత పద్దతిలోనే విలీనం జరగాలని చైనా చెబుతోంది. గత నెల 27న అమెరికా నావలు తైవాన్‌ తీరంలో సంచరించాయి.తైవాన్‌ మిలిటరీకి ఆధునిక ఆయుధాలను విక్రయిస్తున్నది. పదమూడు మంది సభ్యులున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటరీ కమిటీ తైవాన్‌కు రావటం అమెరికా పధకంలో భాగమే. గత పది నెలల్లో ఐరోపా యూనియన్‌ పార్లమెంటు పన్నెండు తైవాన్‌ అనుకూల తీర్మానాలు చేసింది. ఇవన్నీ చైనాను రెచ్చగొట్టే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చేందుకు చైనా గురించి కట్టుకధలను ప్రచారం చేస్తున్నది. ఇలాంటివి ఇదే ప్రారంభం కాదు, ఇంతటితో ఆగేవి కాదు. 2049 నాటికి చైనాలో కమ్యూనిస్టు పాలనకు వందేళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి హాంకాంగ్‌, మకావూ, తైవాన్‌ దీవులను పూర్తిగా ప్రధాన చైనా భూభాగంలో విలీనం చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దాన్ని కొనసాగనివ్వకుండా చూసేందుకు అమెరికా, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.పెంటగన్‌ నివేదిక దానిలో భాగమే !

ఉప ఎన్నికల్లో బిజెపికి చమురు సెగ -ఐదు రాష్ట్రాల కోసం పన్ను తగ్గింపు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పద మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలలో బిజెపికి అనూహ్య ఎదురు దెబ్బలు తగిలాయి. మరో ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.బిజెపి అధికారంలో ఉన్న చలి రాష్ట్రమైన హిమచలప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్ధానంలో ఓటమి బిజెపికి వేడి పుట్టించింది. తమ ఓటమికి కారణం ద్రవ్యోల్బణం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కారణమని ఆ రాష్ట్ర బిజెపి బిజెపి ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ చెప్పారు. అది ఒక్క తమ రాష్ట్రానికి, దేశానికే కాదు, మొత్తం ప్రపంచ సమస్య అన్నారనుకోండి. ఏదైతేనేం తలకు బొప్పికట్టింది , మరో ఐదు రాష్ట్రాల ఎన్నికల దృశ్యం కళ్ల ముందు ఆందోళన కలిగిస్తోంది. కనుక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఎన్నికలకు సంబంధం లేదని బిజెపి చెప్పుకోవచ్చు, ఎందుకు తగ్గించిందో చెప్పాలి.కేంద్ర ప్రకటన వెంటనే పది బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా నాటకీయంగా వ్యాట్‌లో కొన్ని రూపాయలు తగ్గించాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో మోడీ భక్తులు వహ్వా, ఆహా, ఓహౌలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గిస్తాయా లేదా అంటూ అడ్డుసవాళ్లు ప్రారంభించారు. చర్చ జరగటం మంచిదే !


ఇప్పటికీ బిజెపి మద్దతుదారులు చేస్తున్న వాదన ప్రకారం కేంద్రం విధిస్తున్న చమురు పన్ను భారంలో రాష్ట్రాలకు 41శాతం వాటాగా తిరిగి వస్తుంది, కేంద్రం కూడా తన వంతు రాష్ట్రాలలో వివిధ పధకాలకు ఖర్చు చేస్తున్నది కనుక చమురుపై ఎక్కువ భారం మోపుతున్నది రాష్ట్రాలే అని చెబుతున్నది తెలిసిందే. వారి వేద గణితం ప్రకారమే 41శాతం అంటే ఐదులో రు.2.05 పెట్రోలు మీద, డీజిలు మీద రు.4.10 రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తద్వారా ఆ మేరకు రాష్ట్రాల బడ్జెట్ల కేటాయింపులకు కోత పడుతుంది. కేంద్రం చేస్తున్న ఖర్చు కూడా ఆ మేరకు తగ్గుతుంది. అదే జిఎస్‌టి అయితే తగ్గిన మేరకు రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సి వచ్చేది.కనుక ఈ తగ్గింపే ఘనత అనుకుంటే అది రాష్ట్రాలకూ వాటా ప్రకారం దక్కాలి కదా ! బిజెపి మిత్రపక్షం ఒడిషా బిజెడి సర్కార్‌ కూడా పన్ను తగ్గించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున తగ్గించింది. దీనివలన తమ ఖజానాకు రు.1,400 కోట్లు, కేంద్రం పన్ను తగ్గించిన కారణంగా తమ వాటాలో తగ్గే ఏడువందల కోట్ల రూపాయలతో కలుపుకుంటే 2,100 కోట్ల మేరకు తమ మీద భారం పడుతుందని పేర్కొన్నది. వివిధ రాష్ట్రాల మీద ప్రభావం ఇదే మాదిరి ఉంటుంది.


ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్ను తగ్గిస్తాయా లేదా అన్న సవాలు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది. ఇదే సమయంలో బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో ఒక్క శాతం కూడా పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం వాటన్నింటినీ పునరుద్దరించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. గతంలో అంగీకరించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రాలకు ఒకవేళ ఆదాయం తగ్గితే ఆ మేరకు చెల్లించాలి. ఎందుకంటే నోట్లు అచ్చువేసి లోటును పూడ్చుకొనే అవకాశం కేంద్రానికి ఉంది తప్ప రాష్ట్రాలకు లేదు.


కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు పెట్రోలు, డీజిలు మీద ఒక్కొక్క లీటరుకు తగ్గించిన పన్ను మొత్తాలు ఇలా ఉన్నాయి.ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రు.12-12 చొప్పున, గుజరాత్‌, అసోం, కర్ణాటక, గోవా, మణిపూర్‌, త్రిపుర రు.7-7 చొప్పున, బీహార్‌, ఒడిషా మూడేసి రూపాయలు, ఉత్తరాఖండ్‌ రు.2-2, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తగ్గించాయి. బిజెపి అధికార ప్రతినిధి, ఆర్ధికవేత్త సంజు వర్మ నవంబరు ఒకటవ తేదీన ఒక విశ్లేషణ రాశారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు మొదటి పక్షం వరకు పద్దెనిమిది నెలల్లో ముడిచమురు ధర పీపా 19 డాలర్ల నుంచి 85డాలర్లకు అంటే నమ్మశక్యం కాని విధంగా 347శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత పెంచుతాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము అనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో ధరలను తగ్గించినట్లు ఏ వినియోగదారుడైనా చెప్పగలడా ? అందువలన మన జేబుల నుంచి కొట్టివేసిన మొత్తాలతో పోలిస్తే ఇప్పుడు తగ్గించిన ఐదు, పది రూపాయలు కంటి తుడుపు తప్ప మరొకటి కాదు.


ఈ మేధావి గతం నుంచీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొనసాగించారు. అదేమంటే గత మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ రు.1.44లక్షల కోట్లకు చమురు బాండ్లను తీసుకున్నదని, దానితో పాటు మరో 70వేల కోట్లు వడ్డీ కూడా తమ మోడీ సర్కార్‌ మీద అదనపు భారం పడిందని సంజు వర్మ మొసలి కన్నీరు కార్చారు. ఆ మొత్తం నాటి ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ తప్ప మరొకటి కాదు. జనాలకు సబ్సిడీ ఇచ్చినందుకు ఈ ఏడుపెందుకు ? ఒక వేళ ఈ మొత్తమే మోడీ సర్కారు మీద పెనుభారం మోపిందా ? ఈ సాకుతో జనాల నుంచి ఏటా వసూలు చేసిన రెండు, మూడులక్షల కోట్లు, రద్దు చేసిస సబ్సిడీల మాటేమిటి ? అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదా ? 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు రు.54,90,763 కోట్లు కాగా 2020జూన్‌ నాటికి రు.101,30,000 కోట్లు కాగా వచ్చే మార్చి నాటికి అది 130లక్షల కోట్లకు చేరనుందని అంచనా, మరి దీని సంగతేమిటి ? కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరేండ్లలో రెట్టింపు ఎందుకు చేసినట్లు ?


చమురు పన్నుల భారం గురించి అడిగితే బిజెపి మంత్రులు, నేతలు చెబుతున్నదేమిటి ? కరోనా వాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారంటే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే చమురు పన్నులు అన్న సంగతులు తెలిసినవే. ఇది నిజమా ? ఆసియా అభివృద్ది బాంకు నుంచి 150 కోట్లు, ఏఐఐబి నుంచి మరో 50 కోట్ల డాలర్లను వాక్సిన్ల పేరుతో మోడీ సర్కార్‌ అప్పు తీసుకున్న సొమ్మును దేనికి ఖర్చు చేసినట్లు మరి ?
బిజెపి ప్రతినిధి సంజువర్మ ఒక లెక్క చెప్పారు. పెట్రోలు ధర లీటరు వంద అనుకోమన్నారు. దానిలో చమురు ధర రు.32.97, కేంద్ర ప్రభుత్వం పన్ను 21.58, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 41.67, డీలరు కమిషన్‌ రు.3.78 దీన్ని చూపి చూశారా కేంద్రం కంటే రాష్ట్రపన్నులే ఎక్కువ అని చెప్పారు. వర్మగారి విశ్లేషణ వెలువడిన నవంబరు ఒకటవ తేదీనే ఢిల్లీలోని హెచ్‌పి సంస్ధ వివరాల ప్రకారం చమురు ధర రు. 47.59, కేంద్ర పన్ను 32.90, ఢిల్లీ ప్రభుత్వ 30శాతం వాట్‌ రు.25.32, డీలరు కమిషన్‌ రు.3.90, అన్నీ కలిపి నీతి రోడ్డులోని బంకులో ధర రు.109.71 ఉంది. మూడవ తేదీ నాటికి అది రు.110.04కు పెరిగింది నాలుగవ తేదీ నుంచి కేంద్రం పెట్రోలు మీద తగ్గించిన ఐదు రూపాయలను పరిగణలోకి తీసుకొని మిగిలిన ధరల్లో మార్పు లేదనుకుంటే 30శాతం వాట్‌ను(రు.5+1.50=6.50, డీజిలు మీద రు.10+3 = 13) తీసివేస్తే రు.103.21 ఉండాలి, కానీ నాలుగవ తేదీ ధర రు. 103.97. ఒకటి-నాలుగవ తేదీ మధ్య చమురు ధర పెరిగింది కనుక దాని మీద వచ్చే 30శాతం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 150పైసల బదులు 76పైసలు తగ్గింది. అందువలన ముందు ముందు ధరలు పెరిగితే రాష్ట్రాలు లోటును పూడ్చుకొంటాయి తప్ప ప్రతి లీటరుకు 150 పైసలు కోల్పోతాయి.


మరి బిజెపి ప్రతినిధి ఆర్ధికవేత్త సంజువర్మ కేంద్ర ప్రభుత్వ పన్ను రు.21.58 అని ఏ గణాంకాల ప్రకారం చెప్పారు ? గట్టిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మొత్తం 41.47, కేంద్ర పన్నులు 21.58శాతం అని చెబుతున్నారు. జనాన్ని తప్పుదారి పట్టించే లెక్క కదా ! రోడ్డు, వ్యవసాసెస్‌ల పేరుతో భారీగా రాష్ట్రాలకు వాటాలేని కేంద్ర వడ్డింపులను దాచిపెట్టి రాష్ట్రాలు విధిస్తున్న స్వల్ప సెస్‌ల గురించి సంజువర్మ గుండెలు బాదుకుంటున్నారు. కేంద్రం విధిస్తున్న పన్నులు నిర్ణీత మొత్తాలు గనుక అంతర్జాతీయంగా ధరలు పెరిగినా తగ్గినా కేంద్రానికి ఒరిగేదేమీ లేదని పెరిగిన కొద్దీ రాష్ట్రాలు ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. నిజమే, పద్దెనిమిది నెలల్లో ముడి చమురు ధర తగ్గినపుడు వర్మగారే చెప్పినట్లు కేంద్రానికి రాబడి పైసా తగ్గలేదు, రాష్ట్రాలకు గణనీయంగా పడిపోయిందా లేదా ? దీన్ని దాచిపెట్టి పెరిగిన అంశం గురించి మాత్రమే చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా ?


దేశంలో ధరల పెరుగుదల గురించి జనం ఆందోళన చెందుతుంటే మోడీ పాలనలో పెరుగుదల రేటు తక్కువ ఉందా, మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఎక్కువ ఉందా చూడండి అంటూ బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. దాని వలన ప్రయోజనం లేదు. మా ఏలుబడిలో తక్కువగా పెరుగుతున్నాయి, వారి పాలనలో ఎక్కువ అంటే కుదరదు.2014 కంటే ధరలు తగ్గాయా పెరిగాయా అన్నది గీటు రాయి. లేకుంటే అచ్చేదిన్‌కు అర్ధం ఏముంది ? మొత్తం ధరల పెరుగుదలలో చమురు ధరల వాటా ఎక్కువగా ఉంది కనుక పన్ను మొత్తాలను తగ్గించాలని గత కొద్ది నెలలుగా రిజర్వుబాంకు కేంద్రానికి ఎందుకు సూచిస్తున్నది ? అదేమీ ప్రతిపక్ష పాలిత సంస్ధ కాదు కదా ! ఆగస్టు నెలలో ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణంతో పోల్చితే సెప్టెంబరులో 3.11శాతం కాగా ఏడాది క్రితం సెప్టెంబరుతో పోల్చితే 0.68శాతమే ఉంది. ఇదే చమురు ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల 12.95-13.63శాతాల చొప్పున ఉన్నాయి. అందువలన అనేక చమురు మీద చేస్తున్న జనాలు చేస్తున్న ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. అందుకే రిజర్వుబాంకు పన్నులు తగ్గించి ధరల పెరుగుదలను నివారించాలని కోరింది.


కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు పెంచినా, సబ్సిడీలు తగ్గించినా జనంలో స్పందన లేని మాట నిజం. వాజపాయి ఏలుబడిలో పూర్తి అధికారం లేక మిత్రపక్షాల మీద ఆధారపడ్డార గనుక చేయాల్సింది చేయలేకపోయాం, ఇప్పుడు నరేంద్రమోడీని ముందుకు తెస్తున్నాం చూడండి అనే బిజెపి ప్రచారాన్ని జనం నమ్మారు, తగ్గిస్తారనే భ్రమలకు లోనుకావటం, నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న గుడ్డి విశ్వాసమే దీనికి కారణం. గాడిదలకు సహనం ఎక్కువ అంటారు.నడుము భరించే వరకు ఎంత భారమైనా మోస్తుంది. విరుగుతుంది అనుకుంటే అది కూడా ఆగ్రహిస్తుంది. జనం కూడా అంతే. కరోనాలో తగ్గిన ఆదాయాలు జనం ఆశించినట్లుగా పూర్వపు స్ధాయికి పెరగటం లేదు. మరోవైపు చమురు, ఇతర వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మోడీ మంత్రదండం పని చేయటం లేదు. గత రెండు సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో జనం మోడీ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతోంది. దాని ఫలితమే ఎన్నికలలో ఎదురుదెబ్బలు. అందుకే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అవే పునరావృతం అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అసలుకే ముప్పువస్తుందనే భయం పట్టుకుంది. దాని పర్యవసానమే పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది తగ్గింపు.

భారాలకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి రావాలని గతంలో బిజెపి కూడా జనానికి పిలుపులు ఇచ్చింది. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనేక మంది సిలిండర్లను పట్టుకొని వీధుల్లో, ధర్నాలు, ప్రదర్శనలు చేశారు. ఏ పార్టీ అయినా ఇదే చేస్తుంది. ప్రభుత్వమే జనమనోభావాలను గ్రహించి నివారణకు పూనుకోవాలనే ఎవరైనా కోరుకుంటారు తప్ప కావాలనే ఆందోళనలకు పురికొల్పరు. ఇప్పుడు జనం ఓటుద్వారా నిరసన తెలుపుతున్నట్లు భావిస్తే, దానివల్లనే స్వల్పంగా అయినా భారం తగ్గిందంటే అది ఆహ్వానించదగిన పరిణామమే. వచ్చే ఎన్నికల్లో జనం తమ ఓటు ఆయుధాన్ని మరింతగా భారాలకు వ్యతిరేకంగా వినియోగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ! ఇదే సమయరలో అనేక మంది ఓటర్లు ఇంకా భ్రమలతో అబద్దాలు, అవాస్తవాలతో తమ ముందుకు వస్తున్న పార్టీలను తమ ఓటుతో ఇంకా ఆదుకుంటున్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి పన్నులు పెంచితే ? ఏదో ఒకసాకుతో పెంచరనే హామీ ఏముంది ? మన్యంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వాన గిరిజనులు వినతులు విఫలమైన తరువాత ముందుగా విల్లంబులతోనే ప్రతిఘటన ప్రారంభించి తరువాత తుపాకులు పట్టారు. నైజా నవాబు మీద ప్రతిఘటన తొలి రోజుల్లో వడిసెలలతో ప్రారంభించి చివరికి తుపాకి పట్టారు. అందువలన పాలకుల అణచివేత తీవ్రతను బట్టి తమ ఆందోళన, పోరాట రూపాలను జనం నిర్ణయించుకుంటారు, తేల్చుకుంటారు !

సామ్రాజ్యవాదులను వణికిస్తున్న రష్యన్‌ కమ్యూనిస్టులు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రష్యాలో ఏం జరుగుతోంది ? వందేండ్ల క్రితం బోల్షివిక్‌ విప్లవం జరిగినపుడు జారు చక్రవర్తి ఒక సామ్రాజ్యవాది, ఇతర సామ్రాజ్యవాదులతో విబేధాలు ఉన్నాయి. ఇప్పుడు పుతిన్‌ నాయకత్వంలోని రష్యా పెత్తనాన్ని కోరుకొంటోంది. అందుకోసం అమెరికా-ఐరోపా పోటీదారులతో లడాయిలో ఉంది. కొన్ని అంశాలలో వాటికి వ్యతిరేకంగా సోషలిస్టు చైనాతో చేతులు కలుపుతోంది. అంతర్గతంగా ఆర్ధికంగా అనుసరిస్తున్న విధానాలు సమాజంలో అశాంతిని రేపుతున్నాయి. ప్రతిపక్షాలను బతకనివ్వటం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. తోటి బూర్జువా పార్టీల నేతలను తప్పుడు కేసులతో ఇరికించి తనకు ఎదురులేదనే స్ధితిని కల్పించేందుకు పూనుకున్నాడు. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు కొరకరాని కొయ్యలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. దాంతో వారి మీద కూడా దాడికి పూనుకున్నట్లు కొన్ని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మాస్కో కమ్యూనిస్టు నేత, 1999 నుంచి వరుసగా పార్లమెంట్‌కు ఎన్నికవుతున్న వలెరీ రష్కిన్‌పై ఒక తప్పుడు కేసును నమోదు చేయటం దానిలో భాగంగానే భావిస్తున్నారు.


వచ్చే అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్ధిగా పుతిన్‌ మీద రష్కిన్‌ తలపడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అధినేత జుగనోవ్‌ తరువాత ప్రముఖనేతగా ఎదిగిన వలెరీ రష్కిన్‌ మీద పుతిన్‌ సర్కార్‌ తప్పుడు కేసు అంతర్జాతీయదృష్టిని ఆకర్షించింది. సెప్టెంబరు నెలలో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీని ఎదిరించటం,యువతను ఆకర్షించటంలో ప్రముఖుడిగా ముందుకు వచ్చిన రష్కిన్‌ వంటి వారి మీద ప్రభుత్వం అణచివేతకు పాల్పడనుందని ఎన్నికలు జరిగినప్పటి నుంచీ ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తనకు బలమైన ప్రత్యర్ధులు లేకుండా చూసుకొనేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నాడు.జింకల జాతికి చెందిన ఒక కణుజు మృతకళేబరాన్ని చూపి రష్కిన్‌ అక్రమంగా వేటాడినట్లు, పోలీసులు కోరినపుడు మద్య పరీక్షకు అంగీకరించలేదని ఒక కథనాన్ని అల్లారు.


సరటోవ్‌ అనే పట్టణ సమీపంలోని గ్రామంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తూ సమీప అడవిలో నడుస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా వెళ్లిందని, అది ఆగిన చోటికి వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడిన స్ధితిలో ఉన్న కణుజు కనిపించిందని, వెనక్కు వెళ్లి ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పి తిరిగి వచ్చి కణుజు మరణించిన అంశాన్ని అధికారులకు తెలిపేందుకు దాన్ని తన కారులో తీసుకు వెళుతుండగా వచ్చిన పోలీసులు, అటవీ సిబ్బంది తనను పట్టుకొని తానే వేటాడినట్లు కేసు నమోదు చేశారని రష్కిన్‌ చెప్పాడు. అడవిలో తుపాకి మోతలు వినిపించగా వెళ్లిన తమకు కణుజు కళేబరంతో రష్కిన్‌ కనిపించాడని, మద్యం సేవించారా లేదా అనేది తెలుసుకొనేందుకు పరీక్షించబోగా తిరస్కరించినట్లు అధికారులు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని రష్కిన్‌ అన్నారు. సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అక్రమాలకు నిరసన తెలుపుటంలో రష్కిన్‌ ప్రముఖ పాత్ర పోషించిన నేపధ్యంలో ఈ కేసు నమోదైంది. సరటోవ్‌ జైలులో సిబ్బంది అక్రమాలపై పార్లమెంటరీ దర్యాప్తు జరపాలనీ కమ్యూనిస్టు ఎంపీలు పట్టుబట్టిన కారణంగా కూడా ఈ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ప్రభుత్వ అనుకూల టీవీల్లో దీని గురించి ప్రముఖంగా చూపారు. రష్యాలో జరుగుతున్న పరిణామాల గురించి వివిధ పత్రికలు విశ్లేషణలు,వ్యాఖ్యానాలు రాస్తున్నాయి.


” ఒకనాడు నెమ్మదిగా ఉన్న కమ్యూనిస్టుపార్టీ ప్రతిపక్ష శక్తిగా ఎదుగుతున్నది ” అంటూ ప్రముఖ పత్రిక ఎకానమిస్టు అక్టోబరు 30వ తేదీన ఒక విశ్లేషణ రాసింది. దానిలో కమ్యూనిస్టు పార్టీ, నాయకత్వం గురించి అనేక తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ వర్తమాన పరిణామాలు, పరిస్ధితి గురించి చేసిన కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.” కమ్యూనిస్టుల పెరుగుదల పరిణామాన్ని చూసి ప్రభుత్వం, దాని నేత పుతిన్‌ ఆందోళన పడ్డారు. పుతిన్ను వ్యతిరేకించే ప్రతిపక్ష నేత అలెగ్నీ నవాల్నేను తప్పుడు కేసులతో పుతిన్‌ జైలు పాలు చేశాడు. ఆ చర్యను గట్టిగా వ్యతిరేకించిన అనేక మంది కమ్యూనిస్టులపై కూడా కేసులు పెట్టారు. ఈ పరిణామాలతో నిజమైన ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని ప్రభుత్వ వ్యతిరేకులు భావించి తాజా ఎన్నికల్లో ఓటు వేయటం పుతిన్‌కు ఆందోళన కలిగిస్తోంది. ౖ” 1996 అధ్యక్ష ఎన్నికల్లో బోరిస్‌ ఎల్సిన్‌ మీద పోటీ చేసిన కమ్యూనిస్టు జుగనోవ్‌ ఓడిపోయాడు. గెలిస్తే కమ్యూనిస్టులు పగతీర్చుకుంటారేమో అని భయపడిన వారు, ఉదారవాదులు, వ్యాపారులు తమ వనరులన్నింటినీ మరణశయ్య మీద ఉన్న ఎల్సిన్‌కోసం వెచ్చించారు. ఎల్సిన్‌ శవానికైనా ఓటు వేస్తాం కానీ బతికి ఉన్న జుగనోవ్‌ను ఎన్నుకొనేది లేదని ఒక టీవీ అధిపతి ఆ నాడు చెప్పాడు. జుగనోవ్‌ ఓడారు…… నేడు అనేక మంది రష్యన్‌ ప్రజాస్వామిక వాదులు క్రెమ్లిన్‌(రష్యా అధికార కేంద్రం)నుంచి ఎల్సిన్‌ వారసుడిని గెంటివేయాలని కోరుకుంటూ ఓటు వేసేందుకు కమ్యూనిస్టులను ఎంచుకున్నారు. ఎంత కఠినంగా ఉండబోతున్నారో వారికి బాగా తెలుసు. రష్యన్‌ ప్రతిపక్ష మీడియా విమర్శకుడు ఎవగెని ఆల్‌బట్స్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ తోడేలు మాకు మరొక అవకాశం లేకుండా చేసిందన్నారు……సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో ఓట్లను సక్రమంగా లెక్కించి ఉంటే దాదాపు యునైటెడ్‌ రష్యాతో సమంగా ఓట్లు పొంది ఉండేవారు. అన్ని రకాల రిగ్గింగులు చేసినప్పటికీ 2016లో వచ్చిన 13శాతం కంటే కమ్యూనిస్టులు 19శాతం ఓట్లు పొందారు…ప్రపంచంలో ఎక్కువ చోట్ల వామపక్షవాదం ముందుకు పోతున్నది, ఈ లోకరీతి రష్యాలో వచ్చేందుకు ఎంతకాలం పట్టిందో కనిపిస్తోంది.ప్రత్యేకించి పుతిన్‌ పాలనలో పాతుకు పోయిన అసమానత దీనికి అవకాశమిచ్చింది….. ఆరు సంవత్సరాలుగా పడిపోతున్న ఆదాయాలు వామపక్ష రాజకీయాలను మరోసారి పరిగణనలోకి తీసుకొనే విధంగా అనేక మంది రష్యన్లను పురికొల్పాయి…..ప్రభుత్వం ఇప్పుడు యువకమ్యూనిస్టులకు స్టాలినిస్టులనే ముద్రవేసి అణచివేసేందుకు పూనుకుంది.ఇదిలా ఉండగా జైళ్లలో జరిగిన చిత్రహింసల గురించి దర్యాప్తు జరపాలనే మానవహక్కుల గురించి కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. పుతిన్‌ రష్యా నిజంగా అద్దాల మేడలా కనిపిస్తోంది.” అని పేర్కొన్నది.


అనేక దేశాలలో పాలకుల మాదిరి తనకు రాజకీయ ప్రత్యర్ధులు లేకుండా చేసుకొనేందుకే ఇప్పటి వరకు పుతిన్‌ ప్రయత్నించాడు. కమ్యూనిస్టుల మీద చేసిన తప్పుడు ప్రచారం కారణంగా సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత ముందే చెప్పుకున్నట్లు అనేక మంది ఇతర పార్టీలవైపే చూశారు. అలాంటి ఏ పార్టీని కూడా పుతిన్‌ బతకనివ్వలేదు. మూడు దశాబ్దాల తరువాత పుతిన్‌కు నిఖరమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నందున దాడి ఇప్పుడు వారి మీద కేంద్రీకరించవచ్చు. మన దేశంలో నరేంద్రమోడీ విధానాలను విమర్శించేవారందరికీ దేశద్రోహులు, విదేశీతొత్తులు, ఉగ్రవాదులు అని ముద్రవేస్తున్నట్లుగానే పుతిన్‌ కూడా చేస్తున్నాడు. ఎన్నికల రిగ్గింగు అనేది ప్రారంభం నుంచీ జరుగుతోంది. వాటన్నింటినీ ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో పుతిన్‌కు పోటీగా అన్ని పార్టీలను కమ్యూనిస్టులు ఏకం చేయగలరా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత నవాల్నే ప్రారంభించిన సంస్ధకు ఉగముద్రవేసి నిషేధం విధించాడు.జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, సంస్ధలకు విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులనే ముద్రవేస్తున్నారు. ఒక ఏడాది కాలంగా ఈ ధోరణి పెరిగింది. ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు పుతిన్‌ మీద విమర్శతో కూడిన ట్వీట్‌ను ఎవరైనా తిరిగి చేసినా అలాంటి వారిని విదేశీ ఏజంట్లుగా పరిగణిస్తున్నారు.

2012లో ఒక చట్టం చేసి విదేశీ ఏజంటు అనే ముద్రవేసేందుకు పూనుకున్న తరువాత ఇంతవరకు 88 మంది మీడియా, వివిధ సంస్ధలకు చెందిన వారితో సహా 359 మందిని విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులని ముద్రవేయగా ఈ ఏడాది ఇంతవరకు 101 మందిని చేర్చారంటే దాడి తీవ్రతను వెల్లడిస్తున్నది. వారంతా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. ఈ దాడులన్నింటినీ తట్టుకొని నిలిచిందీ, నిలవగలిగిందీ కమ్యూనిస్టులనే అభిప్రాయాలు బలపడటంతో పాటు ఎవరు అధికార పార్టీని ఓడించగలిగితే వారికి ఓటు వేయాలని జైలుపాలైన నవాల్నే ఇచ్చిన పిలుపుతో అది మరింత బలపడింది. సెప్టెంబరు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 18.9శాతం వచ్చినట్లు ప్రకటించినా రిగ్గింగు జరపకపోతే వాస్తవంగా 30శాతం, అధికార పార్టీకి 49.8శాతం అని చెప్పినా 35శాతానికి మించి వచ్చి ఉండేవి కాదన్నది అనేక మంది పరిశీలకుల అభిప్రాయం. ఈ పరిణామంతో అనేక మంది రష్యన్లకు పుతిన్‌ కంటే కమ్యూనిస్టులు మరింత గౌరవనీయులైనట్లు కొందరు పేర్కొన్నారు, ఇప్పుడు కమ్యూనిస్టులు పుంజుకుంటున్న తీరుతెన్నులు1917లో బోల్షివిక్‌లు జనం మద్దతు పొందిన తీరును గుర్తుకు తెస్తున్నట్లు ఒక వ్యాఖ్యాత వర్ణించారు. దేశంలో స్ధిరత్వాన్ని తాను కోరుకుంటున్నట్లు చెబుతున్న పుతిన్‌ తన విధానాలు, అసహనం ద్వారా నిజానికి అస్ధిరతకు బాటలు వేస్తున్నాడు. చట్టాలకు తన చిత్తం వచ్చినట్లు భాష్యాలు చెబుతూ ఉదారవాదుల పట్ల అనుచితంగా వ్యవహరించిన మాదిరి కమ్యూనిస్టులతో కూడా ప్రవర్తిస్తే వారిని అజ్ఞాతవాసంలోకి నెట్టినట్లు అవుతుంది. సామాజిక అశాంతి బద్దలవుతుంది అది అణచివేతకు దారితీస్తే కమ్యూనిస్టులు ఏమాత్రం విస్మరించరాని శక్తిగా మారతారు అనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇతర దేశాల్లో మాదిరి పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించే వారిలో ఒకరి స్ధానంలో మరొకరిని బలపరిచే అవకాశాలు రష్యాలో లేవు. పుతిన్‌కు పోటీగా కమ్యూనిస్టులు తప్ప మరొక పార్టీ ఏదీ నిలదొక్కుకోలేకపోయింది.ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారీ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

జనాలను వెర్రినాగన్నలుగా పరిగణిస్తున్న కాషాయ దళాలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


వారు కన్నూరు, కాసరగోడ్‌, కోజికోడ్‌, మలప్పురం పట్టణాలలో ఏర్పాటు చేయరు. ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయంలలో చేస్తారు, ఇప్పుడు పాలక్కాడ్‌కు, ఎందుకు అంటూ ఆంగ్లంలో ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. కేరళకు చెందిన ఎంఎ యుసుఫ్‌ అలీ కుటుంబం అబుదాబీ కేంద్రంగా నిర్వహిస్తున్న లూలు గ్రూపు ఏర్పాటు చేస్తున్న షాపింగ్‌ మాల్స్‌ గురించిన పోస్టు అది. దేశంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాల అమ్ముల పొదిలోని అనేక అస్త్రాలలో లవ్‌ జీహాద్‌ ఒకటి. ఇప్పుడు కేరళలో దానికి షాపింగ్‌ మాల్‌ జీహాద్‌ను జత చేశారు. వ్యాపారానికి కూడా మతం రంగు పులిమారు. దాన్లో భాగమే లూలూ గ్రూప్‌ గురించి ప్రచారం. కొన్ని పట్టణాలలోనే మాల్స్‌ ఎందుకట ? ముస్లింలు నిర్వహిస్తున్న చిన్న దుకాణాలకు బదులు హిందువులు, క్రైస్తవులు ఎక్కువగా నిర్వహించే చిన్న దుకాణాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వారిని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని ఆ పోస్టులో చెప్పారు. ఒక్కో మాల్‌కు ఇరవై వేల మంది సిబ్బందిని తీసుకుంటారట. వారిలో మలప్పురం ప్రాంతం నుంచి ముస్లిం యువకులను15వేల మందిని, ఐదువేల మంది ముస్లిమేతర యువతులను తీసుకుంటారట. ఇలా వారిని ఒక దగ్గరకు చేర్చి లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించుతున్నారట. నోరుమెదిపితే ఉద్యోగం నుంచి తీసివేస్తారు గనుక యువతులు మౌనంగా ఉంటున్నారట. దీనిలో మరొక అంశం పదిహేనువేల మంది విశ్వాసపాత్రులైన ముస్లింకుటుంబాలను ముస్లిమేతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించటం. ఇది ఎందుకట ? ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాన్ని ప్రభావితం చేయాలంటే 30వేల ఓట్లు అవసరం కనుక ఇలా చేస్తున్నారట. అందుకోసమే ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారట. ఇందుకు గాను, ప్రపంచ ఉగ్రవాదులకు నిధులు అందచేయటంలో పేరు మోసిన ఒక అరబ్‌ దేశం నుంచి లూలు యజమాని పెట్టుబడులు సేకరిస్తున్నాడట. ఈ మాల్స్‌ వచ్చిన చోట ముస్లింల దుకాణాలు పెరిగి ఇతరులవి మూతపడుతున్నాయట. కనుక ఇలాంటి మాల్‌ జీహాద్‌ను అంతమొందించాలంటే రిలయన్స్‌, సెంట్రల్‌, బిగ్‌బజార్‌లకు మద్దతు ఇవ్వాలట. వినేవారుంటే ఏమైనా చెబుతారు, ఒక్కొక్క మాల్‌లో ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారా ?


అసలు నిజం ఏమిటి ? లూలూ గ్రూపు బెంగలూరులో మాల్‌ ప్రారంభ సమయంలో అక్టోబరు 11న పిటిఐ వార్తా సంస్ద విలేకరితో యజమాని యుసుఫ్‌ అలీ మాట్లాడారు. కోచి, త్రిసూరులో తమ మాల్స్‌ ఏర్పాటు చేశామని, మొదటి దశలో నాలుగున్నరవేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఐదింటిలో మరో రెండు తిరువనంతపురం, లక్నోలో ఏర్పాటు అవుతాయన్నారు. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ టర్నోవర్‌ గత ఏడాది 740కోట్ల డాలర్లు.
ఇక ముస్లిమేతరులు ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు అన్న ప్రచార బండారాన్ని చూద్దాం. ఇరవై రెండు దేశాల్లో ఈ కంపెనీకి 215 దుకాణాలున్నాయి. వీటిలో పెద్ద మాల్స్‌ 23. ఒమన్‌లో 50, సౌదీలో 34, కతార్‌లో 13, బహరెయిన్‌ 8,కువాయిత్‌ 6,ఇండోనేసియా 5, ఈజిప్టు, మలేసియాల్లో రెండేసి, సురినామ్‌, ఎమెన్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. మనదేశంలోని ఐదు మినహా మిగిలినవన్నీ ఏడు ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నాయి.మత కళ్లద్దాలతో చూసే వారు దీని గురించి ఏమి చెబుతారు. వాట్సాప్‌ ఉన్న జనాలందరిని వెర్రివాళ్లుగా పరిగణిస్తే తప్ప ఇలాంటి అసంబద్ద, అవాస్తవ పోస్టులను ఎవరైనా పెట్టగలరా ? ఇవన్నీ ముస్లిం దేశాలే కదా, ఇక్కడ ఎవరిని దెబ్బతీసేందుకు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ? అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక కంపెనీలు మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి ? మరి అవి ఎవరిని దెబ్బతీసేందుకు ? క్రైస్తవులనా ? వ్యాపారులకు లాభాలు తప్ప మతాలవారీ జనాభా కాదు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తారు. మాల్‌ జీహాద్‌ కథలు కూడా తప్పుడు ప్రచారమే.మనం బుర్రకు పని పెట్టకుండా చెవులు అప్పగిస్తే ఏమైనా ఎక్కిస్తారు.


ఈ బాపతుకు ముస్లిం వ్యతిరేకత తప్ప మరొకటి పట్టదు. బిగ్‌బజార్‌, డీమార్ట్‌, మెట్రో, విశాల్‌, రిలయన్స్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ వంటి కంపెనీల గొలుసు దుకాణాలు, ప్రతి పెద్ద పట్టణంలో వెలుస్తున్న ఇతర మాల్స్‌ ఏ మత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెడుతున్నారు? దేశంలో 80శాతం మంది హిందువులే ఉన్నారు. ఆ ప్రాంతాలన్నింటా చిన్న దుకాణాలను నడిపేది వారే. పైన చెప్పుకున్న కంపెనీల దుకాణాలు దెబ్బతీస్తున్నది ఎవరిని ? ఎందుకీ ఉన్మాదం ? ఎవరిని ఉద్దరించేందుకు ? ఉదాహరణకు ఒక డి మార్ట్‌ దుకాణం చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోని చిల్లర దుకాణాల అమ్మకాలు పడిపోతున్నాయి. అనేకం మూతపడ్డాయి, కొత్తగా పెట్టిన వారు వెంటనే ఎత్తివేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సరకుల అందచేత గురించి చెప్పనవసరం లేదు.


రెడ్‌ సీర్‌ అనే సంస్ధ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో కోటీ 50లక్షలు, నీల్సన్‌ సర్వే ప్రకారం కోటీ 20లక్షల చిల్లర దుకాణాలున్నాయి. అన్ని రకాల అంకుర సంస్ధలలో పెట్టుబడులు వంద రూపాయలనుకుంటే ఇంటి అవసరాల సరకుల సరఫరా సంస్దల వాటా 40గా ఉందంటే రానున్న రోజుల్లో ఇవి ఎంతగా విస్తరించనున్నాయో ఊహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాల వాటా 0.2 నుంచి 2023 నాటికి 1.2శాతానికి పెరుగుతుందన్నది ఒక అంచనా. కరోనా వీటిని మరింతగా పెంచింది.జనాలు వాటికి అలవాటు పడిపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ఆప్‌లు అందుబాటులోకి వచ్చినందున ప్రతిదాన్నీ ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. ఐస్‌క్రీమ్‌, కూరగాయలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనేక కంపెనీలు చిల్లర దుకాణదారులతో ఒప్పందాలు చేసుకొని తమ సరకుల విక్రయ కేంద్రాలు, ఏజంట్లుగా మార్చుకోబోతున్నాయి. స్టాకిస్టులు, ఏరియా, జిల్లా పంపిణీదారులు, హౌల్‌ సేలర్ల వంటి దొంతరలేమీ లేకుండా కంపెనీలే నేరుగా ఉత్పత్తిదారు నుంచి కొనుగోలు చేసి తమ దుకాణాలు, చిల్లర దుకాణల ద్వారా విక్రయించే, కమిషన్‌ ఏజంట్లుగా మార్చబోతున్నాయి. ఇవి దెబ్బతీసేది ఎవరిని ? హిందువులనా, ముస్లింలనా ?ఇవి దెబ్బతీసే ఉపాధి ఏ మతం వారిది ?


ఇలాంటి ప్రచారాలు చేసేది పనీ పాటాలేని జనాలా ? కానే కాదు. ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం ఇది. దీని వెనుక పాలకుల పని తీరు గురించి జనాల దృష్టి మళ్లించటం ఒక ఎత్తుగడైతే, జనాల్లో పరస్పర అనుమానాలు , విద్వేషం రేకెత్తించటం శత్రుశిబిరాల్లో చేర్చటం మరొకటి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అజెండా ఉంటుంది. ఉదాహరణకు 5జి టెక్నాలజీలో చైనా ముందుంది గనుక దాన్ని దెబ్బతీయాలంటే వక్రీకరణ ప్రచారం జరపాలి. దాన్లో భాగంగానే చైనా 5జి కారణంగా కరోనా వైరస్‌ పుట్టిందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని ప్రచారం చేసే వారికి కనీస పరిజ్ఞానం లేదన్నది స్పష్టం. రేడియో తరంగాలు వైరస్‌ను వ్యాపింప చేస్తే అవి ఒక్క 5జికే, కరోనాకే ఎందుకు పరిమితం కావాలి ? ఇతర వైరస్‌ల పట్ల వాటికి వివక్ష ఏముంది? కరోనాతో వాటికేమైనా ఒప్పందం ఉందా ?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అంశాలను కావాలనే నియంత్రించటం లేదని గతంలో, తాజాగా వెల్లడైంది. దాని అంతర్గత పత్రాలను ఫ్రాన్సెస్‌ హేగన్‌ బయటపెట్టిన అంశం తెలిసిందే. మన దేశంలో 40కోట్ల మంది వాట్సాప్‌, 34కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారులు ఉన్నారు. ఫేస్‌బుక్‌ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా పని చేసినట్లు గతేడాది అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. హేగన్‌ వెల్లడించిన పత్రాలు దాన్ని నిర్దారించాయి. ఫేస్‌బుక్‌ మాజీ అధికారిణి, బిజెపితో సంబంధాలున్న అంఖీదాస్‌ స్వయంగా ముస్లిం వ్యతిరేక అంశాలను షేర్‌ చేసినట్లు నిర్ధారణైంది. బిజెపితో వ్యాపార సంబంధాలున్నందున కొంత మంది పార్టీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల అంశాలను తొలగించవద్దని సిబ్బందిని ఆమె ఆదేశించినట్లు కూడా వెల్లడైంది.2020 డిసెంబరులో రాసిన అంతర్గత పత్రంలో అమెరికా వెలుపల ఇతర దేశాల్లో ఫేస్‌బుక్‌ స్ధానిక అధికారులను సాధారణంగా అధికార పార్టీలకు చెందిన వారిని, సహజంగా వారికి లొంగేవారిని నియమించారని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే విద్వేష ప్రచారాన్ని అనుమతిస్తున్నారు.


ఈ ఏడాది మార్చినెలలో ఫేస్‌బుక్‌ లోటస్‌ మహల్‌ (కమలం మహల్‌) పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది. కమలం పువ్వు బిజెపి ఎన్నికల గుర్తు అన్నది తెలిసిందే. బిజెపితో సంబంధం ఉన్న వారు పుంఖాను పుంఖాలుగా ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచి లవ్‌ జీహాద్‌తో సహా అనేక అంశాలతో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని నింపినట్లు దానిలో పేర్కొన్నారు. బిజెపి నేత ఒకరు ఢిల్లీలోని రోడ్డు మీద నిరసన తెలుపుతున్న ముస్లింలను తొలగించాలని ఇచ్చిన పిలుపుతో జరిగిన దాడుల్లో 53 మంది మరణించినట్లు దానిలో రాశారు. కరోనాను వ్యాపింప చేశారని, వైద్యుల మీద ఉమ్మారనే కల్పిత అంశాలను ప్రచారం చేశారని, ఇలాంటి ప్రచారం చేసిన హిందూత్వ గ్రూపుల మీద ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఉదంతాన్ని ఆసరా చేసుకొని ముస్లిం వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టిందీ తెలిసిందే.


చరిత్రను వక్రీకరించే పోస్టుల ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1945లోనే చైనా శాశ్వత రాజ్యంగా ఉన్న అంశం తెలిసినా మనకు శాశ్వత హౌదా ఇస్తామంటే తిరస్కరించి చైనాకే ఇవ్వాలని నెహ్రూ కోరినట్లు జరుగుతున్న ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందున్న వాస్తవాలను వక్రీకరించి వివిధ అంశాలపై బాహాటంగా చేస్తున్న ప్రచార బండారాన్ని లూలూ, నెహ్రూ ఎవరి గురించైనా ఎవరికి వారు తర్కబద్దంగా ఆలోచించి ఎండగట్టాలి.

అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? పశ్చిమ దేశాల యువత సోషలిజం వైపు మొగ్గుతోందా ?

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


రష్యా నవంబరు విప్లవం గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు అంటూ అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ రాశారు. 1917 నవంబరు ఏడవ తేదీ( పాత కాలెండరు ప్రకారం అక్టోబరు 25)న జారు చక్రవర్తిని కూల్చివేసి కమ్యూనిస్టులు ప్రధమ శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.1991లో దాన్ని కూల్చివేశారు.అయినా ఆ విప్లవం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రమజీవుల పోరాటాలకు ఉత్తేజం కలిగించేదే, గుణపాఠాలు నేర్పేదే. దాని గురించి ఎంత రాసినా, ఎన్నిసార్లు రాసినా తరిగేది కాదు. 2017నవంబరు ఆరవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన విశ్లేషణకు ” వందేండ్ల తరువాత తిరిగి వచ్చిన బోల్షివిజం, మనం ఆందోళన పడాలి ” అని శీర్షిక పెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. దాని ప్రకారం అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? రష్యాలో తిరిగి సోషలిజం వస్తుందా ? అమెరికాలో కుర్రకారు పెట్టుబడిదారీ విధానాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు.చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా, లావోస్‌, కంపూచియా సోషలిస్టు దేశాలుగా నిలిచి కొనసాగుతున్నప్పటికీ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలకు తగిలిన ఎదురు దెబ్బలతో అనేక మంది నిరాశ చెందారు. తరువాత లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు వామపక్ష శక్తులకు ఉత్తేజమిస్తున్నాయి. నవంబరు విప్లవదినం సోషలిస్టు దేశాలకు ఉత్సవ రోజైతే మిగిలిన వారికి దీక్షాదినం. ఒక్కసారి తాజా పరిణామాలను అవలోకిద్దాం.


తమకు నచ్చనివారిని, విబేధించేవారిని దేశద్రోహులు, అర్బన్‌నక్సల్స్‌, తుకడేతుకడే గాంగ్‌, హిందూవ్యతిరేకులని ముద్రవేయటం మన దేశంలో ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం. నిత్యం స్వదేశీ కబుర్లు చెబుతూ విదేశాల నుంచి తెచ్చుకున్న అనుకరణ ఇది. దీన్ని మెకార్ధిజం అంటారు. అమెరికాలో 1947 నుంచి 1957వరకు జోసెఫ్‌ మెకార్ధీ అనే సెనెటర్‌ ఉండేవాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. మీడియాలో అందరూ వామపక్ష భావజాలం ఉన్నవారే కనుక ఇలాంటి వార్తలు ఎక్కడా రావు అంటూ కల్పిత అంశాలను వాట్సాప్‌లో పంపే అబద్దాల కోర్లు మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి ఎల్లవేళలా మెకార్ధీ ఉత్తేజమిస్తుంటాడు. వారి స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడూ, ఇప్పుడు పదవి పోయిన తరువాత మెకార్ధీని అనుసరిస్తున్నాడు. మెకార్ధీ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు, నచ్చని వారికి కమ్యూనిస్టు ముద్రవేసేవాడు.రచయితలు, జర్నలిస్టులు, సినిమాతారలు, వాణిజ్యవేత్తలు ఒకరేమిటి లొంగని ప్రతివారినీ బెదిరించేవాడు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసేది. ఎంతగా వాడి ప్రభావం పెరిగిందంటే ఎన్నికల్లో వాడు సమర్ధించిన వారు గెలిచి, వ్యతిరేకించిన వారు ఓడారు. వాడి ఉపన్యాలకు మీడియా విపరీత ప్రచారమిచ్చేది.చివరికి వాడు చెప్పిన అబద్దాలకు సెనెట్‌ మందలించింది. అబద్దాలు, అవలక్షణాలన్నీ విచారణలో బహిర్గతమయ్యాయి.నలభై ఎనిమిది సంవత్సరాలకే పచ్చి తాగుబోతుగా మారి జబ్బులతో దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు అమెరికాలో మెకార్ధీలు తామరతంపరగా పుట్టుకువచ్చారు. డెమోక్రాట్లు, పురోగామివాదులు, తమను ఆక్షేపించేవారిని సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా ముద్రవేసి గతాన్ని పునరావృతం చేసేందుకు పూనుకున్నారు.అయితే బెర్నీశాండర్స్‌ వంటి ప్రముఖులు అవును మేము సోషలిస్టులమే అని ముందుకు రావటంతో లక్షల మంది యువత తాము కూడా సోషలిస్టులమే,కమ్యూనిస్టులమే అని ప్రకటించుకోవటం పెరుగుతోంది.

నవంబరు విప్లవ సమయంలో సోషలిజం ఒక ఊహ. దానికి వ్యతిరేకంగా సైద్దాంతిక చర్చ జరిగింది. పెట్టుబడిదారులు సవాళ్లు విసిరారు. తరువాత సోవియట్‌ , సోషలిస్టు శిబిరం ఏర్పడింది. వైఫల్యాలు ఎదురయ్యాయి. గత వందేళ్లుగా సోషలిజం వైఫల్యం గురించి ప్రచారం చేశారు, దానికి అమెరికా ప్రధాన కేంద్రం. చిత్రం ఏమంటే ఇప్పుడు అక్కడ సోషలిజం వైఫల్యం బదులు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ జరుగుతోంది. ఇదొక అనూహ్య పరిణామం. పెట్టుబడిదారీ సమర్ధకులు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారు. అక్కడ మీడియా సోషలిజానికి అనుకూలం కాదు, బలమైన కమూనిస్టుపార్టీ లేదు. అయినా అక్కడి విదార్ధులు సోషలిజం మంచిది, ప్రైవేటు ఆస్తిహక్కులు రద్దవుతాయి అని చెబుతున్నారు. ఎంత మాట అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా ఇది, వేదంలా విలువైన మాట అనేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు.కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కులను తీసివేసే వారిని ఎన్నుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని ఒక విలేకరి ఒక విద్యార్ధితో అన్నాడు. దానికి లేదు కేవలం పన్ను ఎగవేతకు మాత్రమే ఆస్తి హక్కులు కాదు అన్నాడు విద్యార్ది. డబ్బు అంటే ఆస్తేకదా అని విలేకరి రెట్టించాడు. పన్ను ఎగవేత ఆస్తి హక్కు అనేట్లైతే కచ్చితంగా దాన్ని రద్దు చేయాల్సిందే అని విద్యార్ధి సమాధానమిచ్చాడు. అమెరికా అంతటా ఇలాంటి ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నా. అసమానతలు, తమ రుణాలు కొండల్లా పెరగటం, తీరే దారి కనిపించకపోవటంతో విద్యార్దులు, యువతలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి.


గత వంద సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పుడు 40శాతం మంది అమెరికన్లలో, 49శాతం మంది యువతలో సోషలిజం పట్ల సానుకూలత ఉంది. అమెరికాలో స్కూలు విద్యాకమిటీలు చురుకుగా పని చేస్తున్నాయి. వాటి సమావేశాలు కమ్యూనిస్టు వ్యతిరేకులకు దడపుట్టిస్తున్నాయి. ఆ సమావేశాల్లో రాజకీయాలను చర్చించకూడదనే వారు కొందరైతే, రద్దు కోరుతున్నారు కొందరు. అది ఎంతగా అంటే ఆ కమిటీల ద్వారా తదుపరి అక్టోబరు విప్లవాన్ని త్వరలో కమ్యూనిస్టులు ప్రారంభించనున్నారని ఒక జర్నలిస్టు తాజాగా తన అక్కసును వెళ్లగక్కాడు. వాస్తవాన్ని చూస్తే దేశమంతటి నుంచి డెమోక్రటిక్‌ సోషలిస్టులు వందమంది ఎన్నికయ్యారని, బెర్లిన్‌ గోడ పతనంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారికి నోరుపడిపోయిందని, తరువాత ఒక మంచి అంశంగా తీవ్రవాద ముస్లిం జీహాద్‌ ప్రచారం వచ్చింది. మార్క్సిస్టు టీచర్లు మీ పిల్లల లింగమార్పిడి చేస్తున్నారని మధ్యతరగతి అమెరికన్లను నమ్మించటం కంటే ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధించామని చెప్పటం కష్టమని, ఎందుకంటే అవమానకర రీతిలో ఉగ్రవాదంపై మన ప్రపంచ పోరు ముగిసిందని వాపోయాడు. అమెరికా కమ్యూనిజం వైపు పయనిస్తోందని జనాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.చివరకు కరోనా కారణంగా క్రిస్మస్‌ సందర్భంగా ఎక్కువ మంది గుమికూడవద్దని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్ద డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ సలహా ఇవ్వటం కూడా కమ్యూనిజం దిశగా ప్రయాణంలో భాగమే అని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ జిమ్‌ జోర్డాన్‌ ఆరోపించాడు. పాఠశాల విద్యాకమిటీలు వామపక్ష అధికార కేంద్రాలుగా ఉన్నాయని, వాటి సమావేశాలకు వెళ్లే వారిని స్ధానిక ఉగ్రవాదులుగా ఎఫ్‌బిఐ పరిగణించాలని సెలవిచ్చాడు.


కమ్యూనిజానికి వ్యతిరేకంగా గూఢచారిగా పని చేసిన ఒక మాజీ అధికారి అమెరికాలో కమ్యూనిస్టుల కార్యక్రమం ఇదీ అంటూ పత్రికల్లో రాశాడు. ఏమిటట,యువతను సెక్స్‌, మాదక ద్రవ్యాలు, వీడియో గేమ్‌లకు బానిసలుగా చేసి వారి ధృడత్వాన్ని దెబ్బతీసి 17-24 ఏండ్ల వయసున్నవారిలో 71శాతం మందిని మిలిటరీకి పనికి రాకుండా చేయటం.ప్రస్తుతం 1,500 దినపత్రికలు, 1,100 వార,పక్ష,మాసపత్రికలు, 1,500 టీవీ ఛానళ్లు, 9,000వేల రేడియో స్టేషన్లు, 2,400 ప్రచురణ సంస్దలుండగా అవన్నీ కేవలం ఆరు కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్నాయి, వీటిన్నింటి ప్రచారం మీద అదుపుసాధించటం, జనాలను శత్రుబృందాలుగా విడదీయటం, తమ నేతల మీద విశ్వాసం లేకుండా చేయటం, ప్రజాస్వామ్యం గురించి ప్రబోధించి నిర్దాక్షిణ్యంగా, అక్రమాలతో వేగంగా అధికార స్వాధీనం,ప్రభుత్వంతో ఇష్టం వచ్చినట్లు వివిధ పధకాలకు ఖర్చు చేయించటం, ప్రజల్లో అశాంతిని ప్రోత్సహించటం, నైతిక విలువలను కుప్పకూల్చటం, మారణాయుధాలను కొనిపించాలి, తరువాత వాటిని తిరిగి తీసుకొని జనాన్ని ఇబ్బందుల్లో పడేయటం. ఈ కార్యక్రమంతో కమ్యూనిస్టులున్నారు గనుక మన దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 2022లో వాటిని తొలగించాలంటూ రాశాడు. ఊరూపేరూ లేకుండా లేదా ఏదో ఒక సంస్ద పేరుతో ముస్లింల అజెండా లేక హిందువుల అజెండా ఇది అని రెచ్చగొడుతూ రాసి పంచే కరపత్రాల గురించి మనకు తెలిసిందే. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి.


అమెరికాలో మాదిరి బ్రిటన్‌ యువతలో కూడా పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు తగ్గుతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేల్లో 80శాతం మంది కుర్రకారు తమ ఇబ్బందులకు పెట్టుబడిదారీ విధానమే కారణమన్నారు. మూడింట రెండువంతుల మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ కావాలన్నారు.పద్దెనిమిదవ శతాబ్దిలో తత్వవేత్త జీన్‌ జాక్విస్‌ రౌసియవు చెప్పిన అంశాలను ఒక విశ్లేషకుడు ఉటంకించారు. ” తినేందుకు జనానికి ఏమీ మిగలనపుడు వారు ధనికులను తింటారు” అన్నాడు. దీనికి సూచికగానే బ్రిటన్‌ సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్న టిక్‌టాక్‌, ఇతర వీడియోలలో యువత ఏదైనా తినే సమయంలో వినియోగించే ఫోర్కులతో కార్లలో ఉన్నవారు, ఫ్రిజ్‌ల దగ్గర ఉన్నవారిని చూపుతూ ఇవి మాకు లేకపోవటానికి మీరే కారకులు అనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ధనికులు నిద్రించేటపుడు ఒకకన్ను తెరవటాన్ని ప్రారంభించాలన్న మాట అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. లండన్‌ కేంద్రంగా పని చేసే ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ జూలైలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో గృహ సంక్షోభానికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని 80శాతం యువత భావిస్తోంది. వాతావరణ అత్యవసర పరిస్ధితి ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని75శాతం మంది చెప్పారు. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు 67శాతం చెప్పారు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులకు ఇది హెచ్చరిక అని సదరు సంస్ధ పేర్కొన్నది. ఈ లెక్కల గురించి కొందరికి చిన్న చూపు ఉండవచ్చు, వీటిని చెప్పింది వామపక్షవాదులు కాదని గమనించాలి.2019లో బర్నార్డో సంస్ధ జరిపిన సర్వేలో పాతికేండ్ల లోపు వారిలో మూడింట రెండువంతుల మంది తమ తలిదండ్రులతో పోలిస్తే తమ జీవితాలు అధ్వాన్నంగా ఉంటాయనే భయాన్ని వ్యక్తం చేశారు.ఆర్ధిక పరిస్ధితులే యువతను వామపక్ష అభిమానులుగా మారుస్తున్నాయని ” జనరేషన్‌ లెఫ్ట్‌ ” అనే పుస్తక రచయిత కెయిర్‌ మిల్‌బరన్‌ అన్నారు.


బ్రిటన్‌లో సుఖవంతమైన జీవితం గడపాలంటే చేతిలో మంచి జీతం తెచ్చే ఒక డిగ్రీ ఉండాలని చెప్పిన రోజులున్నాయి.2020లో జరిపిన సర్వే ప్రకారం డిగ్రీ ఉన్న-లేని వారి వేతన తేడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. మరోవైపు విద్యార్ధుల అప్పులు సగటున ఒకరికి 40,280 పౌండ్లకు చేరాయి.మూడోవంతుకు పైగా డిగ్రీ ఉన్న వారు డిగ్రీతో పనిలేని ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది.దీనికి తోడు మొత్తంగానే వేతనాలు పడిపోతున్నాయి.మన దేశంలో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని పాలకులు చెబుతున్నట్లుగానే బ్రిటన్‌ నేతలు కూడా మీకు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ” స్వయం ఉపాధి పధకంలో చేరండి ” అని చెప్పారు. మూడోవంతు మంది పాతికేండ్ల లోపు కార్మికులు వారానికి ఎంత వేతనం వస్తుందో తెలియని పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నమోదైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లవద్ద కనీసవేతనాలు, వేతనంతో కూడిన సెలవులు లేని పనులు చేస్తున్నారు. స్వేచ్చ దొరికింది గానీ పనికి భద్రత లేమి వారికి బహుమతిగా దక్కింది.యువత సోషలిజం వైపు మొగ్గుతున్నదంటే దాని అర్దం వారంతా విప్లవకారులుగా మారుతున్నారని కాదు. ఎలాంటి సంక్షోభాలు లేని సోషలిస్టు చైనా, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న సరకులను వారు నిత్యం చూస్తున్నారు గనుక అలాంటి విధానం మంచిదనే సానుకూలతవైపు మొగ్గుతున్నారు. అవసరమైతే తరువాత విప్లవకారులుగా మారతారు.యువ రచయిత్రి సాలీ రూనే తాజా నవల ” ఇన్‌ ద బ్యూటిఫుల్‌ వరల్డ్‌ వేర్‌ యు ఆర్‌ ” (అందమైన లోకంలో మీరెక్కడున్నారు)లో ఒక పాత్ర చేత ఇలా పలికించారు. ” తొలుత నేను మార్క్సిజం గురించి మాట్లాడినపుడు జనాలు నన్ను చూసి నవ్వారు, ఇప్పుడు అది అందరి నోటా నానుతోంది” దీని అర్ధం ఏమిటి ప్రచ్చన్న యుద్దంలో తాము విజయం సాధించినట్లు పెట్టుబడిదారులు ప్రకటించుకున్న మూడు దశాబ్దాల తరువాత కుర్రకారు మరింత స్వేచ్చగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి చర్చిస్తున్నారనే కదా ! అందుకే ఆర్ధికవేత్త జేమ్స్‌ మిడ్‌వే ఇటీవల ఒక తన వ్యాసానికి ” జనరేషన్‌ లెఫ్ట్‌ మైట్‌ నాట్‌ బి దట్‌ లెఫ్ట్‌ ఆఫ్టరాల్‌ ” ( ఆ వామపక్ష వాదులా… వారెంత అని ఉపేక్షించిన మాదిరి కాదు కుర్ర వామపక్షవాదులు ” అని శీర్షిక పెట్టారు.


రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడి ప్రభుత్వం పట్ల దూకుడుగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. ఇది ఎవరూ తీర్పు ఇచ్చే అంశం కాదు. ” తాజాగా జరిగిన డ్యూమా(పార్లమెంట్‌) ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు,యువ కమ్యూనిస్టులు, పార్టీతో కలసిన ఇతర వామపక్ష శక్తులు అధ్యక్షుడు పుతిన్‌కు అనూహ్య సవాలు విసురుతున్నారు. పాత తరం అంతరిస్తున్నది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొత్త పటాలం, సామాజిక మాధ్యమంతో పనిచేసే కమ్యూనిస్టులు ఎదుగుతున్నారు. వారు సిద్దాంత ఉపన్యాలు చేయకపోవచ్చు, ఎర్రజెండాలను ఊపకపోవచ్చు, వారు పుతిన్‌ ప్రభుత్వ అవినీతి, దేశంలో దారిద్య్రం గురించి నిరసన తెలుపుతున్నారు ” అని ఒకరు పేర్కొనగా, ” ఇది నిజంగా రష్యన్‌ రాజకీయాలలో శక్తివంతమైన టెక్టోనిక్‌ ప్లేట్ల (భూమి ఖండాలుగా విడిపోయి కోట్ల సంవత్సరాలు గడచినా ఆ ముక్కలు సముద్రంలో ఇంకా కుదురుకోలేదు, వాటి కదలికలు సునామీలు, భూకంపాలకు దారితీస్తున్నాయి. వాటినే శిలావరణం అంటున్నారు-రష్యన్‌ యువ వామపక్ష వాదులు రాజకీయ సునామీలు, భూకంపాలు సృష్టించగలిగిన వారని భావం) వంటివి, మార్పునకు ఇది ప్రారంభం ” అని లండన్‌ విశ్లేషకుడు మార్క్‌ గలియోటి అన్నాడు. సెప్టెంబరు పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించిన వాటి కంటే కమ్యూనిస్టులకు ఎక్కువ, అధికార పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గలియోటి అన్నాడు. ” అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి వెల్లడైన మద్దతు స్ధాయి గురించి రష్యన్‌ కులీనులకు ఎలాంటి భ్రమలు లేవు ” అని ఆర్‌ పోలిటిక్స్‌ అనే రాజకీయ సలహా సంస్ధను ఏర్పాటు చేసిన తాతియానా స్టానోవయా చెప్పింది. రష్యా రాజకీయాలలో కమ్యూలను ఇంకేమాత్రం విస్మరించకూడదని, వారిని అణచివేస్తే అజ్ఞాతవాసానికి వెళతారని కొందరు పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పటికీ స్ధలాభావం వలన మరోసారి చర్చించవచ్చు.


చరిత్ర పునరావృతం అవుతుందని పెద్దలు చెప్పారు, దాని అర్ధం గతం మాదిరే జరుగుతుందని కాదు. ప్రతి తరంలోనూ నిరంకుశ పాలకులు తలెత్తినపుడు వారిని ఎదిరించేవారు కూడా అదేమాదిరి తయారవుతారు. ఒకానొక కాలంలో ప్రత్యక్షంగా తలపడ్డారు, కర్రలు, విల్లంబులు, కత్తులతో తిరుగుబాట్లు జరిపారు. తుపాకులు వచ్చిన తరువాత అలాంటి అవసరం లేదు. పద్దతి మారింది తప్ప తిరుగుబాటు లక్ష్యం ఒక్కటే -అదే అణచివేత, దోపిడీ నిర్మూలన, ఇప్పుడూ అదే జరుగుతోంది. ” ఐరోపాను ఒక భూతం వేటాడుతోంది-అది కమ్యూనిస్టు భూతం. పాత ఐరోపాలోని అధికారశక్తులన్నీ ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు అపవిత్ర కూటమి గట్టాయి. పోప్‌, జార్‌, మెట్రినిచ్‌, గుయిజోట్‌, ఫ్రెంచి విప్లవకారులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు చేతులు కలిపారు.” అనే పదాలతో 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రచురితమైన కమ్యూనిస్టు ప్రణాళిక (మానిఫెస్టో) ప్రారంభ పదాలవి. తరువాత పరిస్దితి మారింది. ఆ కమ్యూనిస్టు భూతం అన్ని ఖండాలకు విస్తరించింది. అందువలన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాన్ని అంతమొందించాలని చూస్తూనే ఉన్నారు. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరొకడు పుట్టుకువచ్చినట్లుగా ఒక విప్లవకారుడిని అంతమొందిస్తే వేయి మంది కొత్తవారు రంగంలోకి వస్తున్నారు. దోపిడీ శక్తులను ప్రతిఘటించే, పీచమణిచే కమ్యూనిస్టులూ అవతరిస్తున్నారు. ఇరు పక్షాల ఎత్తుగడలూ, రూపాలు అన్నీ మారాయి.


ఈ నేపధ్యంలో చూసినపుడు మహత్తర నవంబరు(పాత కాలెండర్‌ ప్రకారం అక్టోబరు) విప్లవం గతం. అది ఒక్క రష్యాలోనే కాదు, దోపిడీ జరిగే ప్రతిచోటా అనివార్యం. దాని అర్ధం నవంబరులోనే జరగాలని, జరుగుతుందనీ కాదు. నవంబరు విప్లవం అంటే నరజాతి చరిత్రలో తొలిసారిగా రష్యా శ్రామికులు జారు చక్రవర్తి రూపంలో ఉన్న దోపిడీ శక్తులను కూల్చివేసి శ్రామిక రాజ్యఏర్పాటుకు నాందిపలికిన ఉదంతం. తరువాత చైనా విప్లవం అక్టోబరులోనే జయప్రదమైంది. రష్యాలో ఇప్పుడు జారు చక్రవర్తి లేడు. వాడి స్ధానంలో ఇప్పుడు ఉన్న శక్తులు వేరే ముసుగులు ధరించి ఉన్నాయి. ఆ లెనిన్‌, స్టాలిన్లు లేరు, నూతన తరం కమ్యూనిస్టులున్నారు. తిరిగి సోషలిజం స్ధాపన అనివార్యం అని నమ్ముతున్నారు. అయితే గతంలో మాదిరే వింటర్‌ పాలెస్‌ ముట్టడిస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ జారు చక్రవర్తి లేడు. అధికార కేంద్రం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు మారింది. అందువలన మరోపద్దతి, మరో రూపం అనుసరించాల్సిందే. విప్లవ కాలంలో రష్యాలో కార్మికులు, రైతులూ, చైనాలో రైతులు ఎక్కువగా కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులు నామమాత్రం. దోపిడీ కొనసాగుతూనే ఉంది, దాన్ని అంతమొందించాల్సిందే. అందువలన అక్కడ విప్లవం రావాలంటే పాత పద్దతులు, ఎత్తుగడలూ పనికి రావు. విప్లవం చుంచెలుక వంటిది. అది నిరంతరం నేలను తవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుందో తెలియదు, విప్లవం కూడా అలాంటిదే నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా బయట పడుతుందో చెప్పలేము.


వలసవాద కాలంలో శత్రువు ప్రత్యక్షంగా కనిపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్ధితులు మారాయి. కార్మికులకు తమ శ్రమను దోచుకుంటున్నవాడు ప్రత్యక్షంగా కనిపించడు, అసలు ఫ్యాక్టరీలే లేకుండా కూడా దోపిడీ సాగుతోంది. అందువలన ఎక్కడికక్కడ స్ధానిక పద్దతులు, ఎత్తుగడలు అనుసరించాల్సిందే. ఒక నమూనా అనేది లేదు, సాధ్యం కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పాటు వ్యతిరేకించేశక్తులూ, సవాళ్లూ పెరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలను వివరించటం సాధ్యం కాదు. అందుకే అమెరికా, బ్రిటన్‌, రష్యాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలనే పరిమితంగా సృజించాల్సి వచ్చింది.

ఆడపిల్లలే తక్కువ, ముస్లింలకు బహు భార్య లు- వారి నుంచి ముప్పా ? నిజాలేమిటి ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

మన వాళ్లు వొట్టి వెధవాయలోయి(తెల్లవారు) చుట్టకాల్చటం నేర్పినందుకు థాంకు చెయ్యక అన్నాడు మహాకవి గురజాడ గిరీశం. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఉండి ఉంటేనా అసలు సిసలు భారతీయులం అనుకొనే మన వాట్సాప్‌ పండితుల భాష్యాలు, వక్రీకరణలు, వారి జ్ఞానాన్ని జనానికి ఉచితంగా పంచుతున్న మహాదాతృత్వం గురించి ఎలాంటి పదజాలం ఉపయోగించి ఉండేవారో కదా ! వాట్సాప్‌ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా ముస్లింల నుంచి ముప్పు లేదా మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెబ్‌సైట్‌లో ఒక వార్తకు పెట్టిన శీర్షిక ” భారత్‌లో హిందూ జనాభా వృద్ది రేటు తగ్గుదల, ముస్లింలో గర్భధారణ శక్తి (ప్రజనన) ఎక్కువ : పూ సర్వే సంస్ధ నివేదిక” అనే పేరుతో కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్ధ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతుష్టీకరించేదిగా ఉంది.


ఇంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం బిజెపితో సహా దాని సంస్ధలు, వారి ప్రచారదాడి మహమ్మారి సోకిన వారు చేస్తున్న ప్రచారం ఏమిటి ? 2035 నాటికి( సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి గాని సారాంశం ఒక్కటే) మన దేశంలో ముస్లిం జనాభా హిందువుల కంటే ఎక్కువ అవుతుంది. హమ్‌ పాంచ్‌, హమారే పచ్చీస్‌ (మనం ఐదుగురం మనకు ఇరవై ఐదు) దీని అర్దం ఏమిటి ? ప్రతి ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు, వారికి ఐదుగురి చొప్పున పిల్లలు పుడతారు అని చెప్పటమే.2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” అనేకదా ! ఆర్‌ఎస్‌ఎస్‌ వారి ఈ వైఖరిలో మార్పు వచ్చిందా ?2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.


విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషలూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. మతమార్పిడి వద్దనండి, ఘర్‌వాపసికి అవునని చెప్పండి. లవ్‌ జీహాద్‌ వద్దు, ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి, బంగ్లా ముస్లింలు వద్దనండి..హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి ?చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులౌతారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం ఎన్నికల లబ్దే అసలు కథ.


పూ సంస్ధ కనుగొన్న ముఖ్యఅంశాలంటూ ఆర్గనైజర్‌ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒక అబద్దాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్దాంతం. మనకూ బ్రాహ్మణుడు, మేక, నలుగురు దొంగల కథ తెలిసిందే.మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువులు 30.4 కోట్ల నుంచి 96.6కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్దులు 0.27 నుంచి 84లక్షలకు, జైనులు 17 నుంచి 45లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2లక్షల నుంచి 60వేలకు తగ్గారు.


1990దశకకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరుశాతం ఉన్నారు.1951-2011కాలంలో హిందువులు నాలుగుశాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటపుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా వాస్తవాలను బట్టి ఎలా చెబుతున్నారు ? నమ్మేవారు ఎలా చెవులప్పగిస్తున్నారు ? దేశంలో జరుగుతున్నదేమిటి ? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ?ప్రజనన లేదా గర్భధారణకు మహిళల్లో విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం.2015 సమాచారం ప్రకారం క్రైస్తవుల్లో మహిళలు సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింల్లో 3.2సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

2019లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో జన్మించిన వారు విదేశాల్లో 1.75లక్షల మంది నివసిస్తుండగా విదేశీయులు 52లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆ ఏడాది మన జనాభాలో కేవలం 0.4శాతం మాత్రమే. అందువలన వలసవలన మతపరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదని కూడా తేలింది.కొన్ని వార్తల ప్రకారం మరికొన్ని లక్షల మంది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చి అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్నారని చెబుతున్నారని అయితే దానికి తగిన రుజువులు లేవని పూ సంస్ధ పేర్కొన్నది.2012 పూ సంస్ధ అంచనా ప్రకారం భారత్‌ను వదలి వెళుతున్నవారిలో ముస్లింలు, క్రైస్తవులే ఎక్కువ ఉంటారని, భారత్‌కు వలస వచ్చే వారిలో మూడింట రెండువంతుల మంది హిందువులని పేర్కొన్నది. మతమార్పిడి ప్రచార బండారాన్ని కూడా పూ సంస్ధ వెల్లడించింది. ఇటీవల జరిపిన తమ సర్వే ప్రకారం 99శాతం హిందువులు,97శాతం ముస్లింలు, 94శాతం క్రైస్తవులు తాము పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నామని చెప్పారని, 0.7శాతం మంది హిందువులుగా పెరిగిన వారు తాము హిందువులుగా ఉండదలచుకోలేదని చెప్పగా హిందూమతానికి వెలుపల పెరిగిన 0.8శాతం మంది తాము ఇప్పుడు హిందువులుగా ఉన్నట్లు చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు ? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. కాషాయ దళాల వేదగణిత లెక్కలు కాకుండా దీనికి భిన్నమైన అధికారిక తాజా సమాచారం ఉంటే సరిచేసుకుందాం.2011లెక్కల ప్రకారం వహిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? అనేక మంది పేదరికం కారణంగా హైదరాబాద్‌ వంటి చోట్ల ముస్లింలు అరబ్‌ షేకులకు తమ పిల్లలను కట్టబెడుతున్నారనే అంశం పలుసార్లు వెలుగులోకి వచ్చింది.


అయితే దేశంలో బహుభార్యాత్వం లేదా ? ఘనమైనదిగా కొందరు చెప్పుకొనే మన చరిత్ర, సంస్కృతిలో ఎక్కువ మంది దేవుళ్లకు, రాజులు, రంగప్పలకు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని లొట్టలు వేసుకుంటూ రంజుగా చెప్పుకుంటాం కదా. ఇక వర్తమానానికి వస్తే దేశమంతటా ముస్లింలకు, గోవాలో హిందువులు ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. చిత్రం ఏమంటే అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?
2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లింల పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2015 -2060 మధó్య ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఆ రెండు మతాల మధ్య 2055-60లో తేడా 60లక్షలు. ముస్లింలు 23.2 కోట్లు, క్రైస్తవులు 22.6కోట్లు అని, 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు హిందూమతానికి వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదే కాలంలో మన దేశంలో హిందువుల సంఖ్య తగ్గనుందని అంచనా. 2050నాటికి ముస్లింలు ఇప్పుడున్న 14.4 నుంచి 18.4శాతానికి పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ఇప్పుడున్న మాదిరి వారిలో కూడా కుటుంబనియంత్రణ వేగం పెరిగితే తగ్గనూ వచ్చు.

ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


భక్తుల నీరాజనాలు, విశ్వగురువు అంటూ ప్రశంసలు అందుకుంటున్న బిజెపి నేత నరేంద్రమోడీ ఏ క్షణాన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారో అది ఎలాంటి ముహూర్తమో తెలియదు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పేరు ఏదైతనేం గానీ ఇచ్చిన పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనావార్తల ఉత్పత్తి జరుగుతోంది, దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

పెట్రోలు ధరలపై బిజెపి నేతల నోటి తుత్తర – సామాన్య జనానికి విషాదం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు


పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటగానే వచ్చిన విమర్శలను తట్టుకోలేని నరేంద్రమోడీ-బిజెపి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. వంద కాదు రెండు వందలైనా చెల్లిస్తాం, దేశం కోసం తప్ప నరేంద్రమోడీకి ఇస్తున్నారా అంటూ ఎదురుదాడులకు దిగారు. వారిలో ఏ దుష్ట క్షణంలో అలాంటి భావం కలిగిందో గానీ తధాస్తు దేవతలు వారి కోరికను తీర్చనున్నట్లు పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పీపా ధర త్వరలో వంద డాలర్లు కానుంది ఎవరైనా పందెం కాస్తారా అని సవాలు చేసే వారిని మరికొందరు పందెం రాయుళ్లు వందేంటి వచ్చే ఏడాది చివరికి రెండువందల డాలర్లు చూసుకుందామా అంటున్నారు.


శుక్రవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.106.89, హైదరాబాదులో రు. 111.18 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రాసిన సమయానికి పీపా ముడి చమురు ధర 85.24 డాలర్లుంది. కొద్ది రోజుల క్రితం 86డాలర్లు దాటింది. పెరుగుతున్న ధరల గురించి ఏం చెప్పాలో తెలియక బిజెపి నేతలు నోటి తుత్తర వినోదం పండిస్తుంటే అది జనాలకు విషాదాన్ని నింపుతోంది. మద్దతు ఇచ్చిన మోజో లేక తగ్గకపోతాయా అన్న ఆశ, రోడ్లమీదకొస్తే నీకు దేశభక్తి లేదా, నువ్వు భారతీయుడివి కాదా ? వేయించుకున్న వాక్సినుకు డబ్బు ఇచ్చావా అని కాషాయదళాలు నిలదీస్తాయన్న భయం, ఏదైనా కావచ్చు, వినియోగదారుల నుంచి స్పందన లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలు అపహాస్యంగా మాట్లాడుతున్నా అది ప్రతిపక్ష నేతలను అనుకుంటున్నారు తప్ప తమను కూడా వెర్రివెంగళప్పలను చేస్తున్నారని అనుకోవటం లేదు. గుర్తించటం లేదు.


తాజాగా ఉపేంద్ర తివారీ అనే ఉత్తర ప్రదేశ్‌ మంత్రిగారు ” కార్లున్న కేవలం కొద్ది మందికి మాత్రమే పెట్రోలు అవసరం, 95శాతం మందికి అవసరం లేదు. వందకోట్ల కరోనా వాక్సిన్లు ఉచితంగా వేశారు.తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోలు ధరలు ఇప్పుడు చాలా తక్కువ.” అని చెప్పారు. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి గారేమన్నారంటే ” మన ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చమురు మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు మా మంత్రిత్వశాఖ నుంచి ఆరోగ్యశాఖకు నిధులు మళ్లించాము. మీరు గనుక హిమాలయ బ్రాండ్‌ మంచినీరు తాగాలంటే సీసాకు వంద రూపాయలు పెట్టాలి.” కర్ణాటక మంత్రి ఉమేష్‌ విశ్వనాధ్‌ కత్తి ఏం చెప్పారంటే ” కరోనాను కట్టడి చేయాలంటే ఖర్చు అవుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరం గనుక చమురు ధరలు పెరిగాయి.త్వరలో వీటిని పరిష్కరిస్తారు.” అన్నారు. మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రద్యుమ్న సింగ్‌ తోమర్‌ ఏమని సెలవిచ్చారంటే ” కూరగాయల మార్కెట్‌కు పోవాలంటే సైకిలును ఉపయోగిస్తామా ? అలా చేస్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలుష్యమూ ఉండదు. ధరలు ఎక్కువే కానీ దీని ద్వారా పేదలకు లబ్ది సమకూర్చేందుకు డబ్బులు వస్తాయి. మనకు దేశ ఆరోగ్య సేవలు ముఖ్యమా పెట్రోలు, డీజిలు ధరలు ముఖ్యమా ? ” అని ఎదురుదాడికి దిగారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఓమ్‌ ప్రకాష్‌ సక్లేచా జనాన్ని వెర్రివెంగళప్పలను ఎలా చేశారో చూడండి.” కష్టాలు వచ్చినపుడే మంచి రోజుల్లో ఉన్న సంతోషం ఏమిటో మీరు గుర్తిస్తారు, ఇబ్బందుల్లేవనుకోండి మీరు సంతోషాన్ని అనుభవించలేరు. ” అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు రేట్లు తక్కువంట అక్కడకు వెళ్లండి అన్న పెద్ద మనుషుల గురించి తెలిసిందే, ఇలాంటి వారు మీకు రోజూ చాలా మంది తగులుతూనే ఉంటారు.


గతేడాది ఏప్రిల్‌ 22న పీపా ముడిచమురు 16డాలర్లకు తగ్గింది. మనకు పైసా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఒక డాలరు పెరిగినా తెల్లవారే సరికి పెంచేస్తున్నారు. 2019-20లో మన దేశం దిగుమతి చేసుకున్న చమురు విలువ 130బి.డాలర్లు, మరుసటి ఏడాది కరోనా కారణంగా 82.4 బి.డాలర్లకు తగ్గింది. వర్తమాన సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే బిల్లు 70.5బి. డాలర్లుగా ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మిగిలిన ఆరునెలల్లో ఏమేరకు పెరుగుతుందో తెలియదు. ఎంత పెరిగితే అంత మన జేబుల నుంచి తీసుకుంటారు, పన్ను తగ్గించరు, పైసా సబ్సిడీ ఇవ్వరు. గతంలో రుపాయి విలువ పడిపోతే మన్మోహన్‌ సింగ్‌ అసమర్దత అని బిజెపి నేతలు సెలవిచ్చారు. గత ఏడు సంవత్సరాల్లో 58 నుంచి 75కు పతనమైంది. ఇది మోడీగారి సామర్ధ్యానికి నిదర్శనం, దేశం కోసమే అని మనం అంగీకరించాలి. ఇది కూడా చమురు ధరలను పెంచుతోంది. 2020 జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో మన చమురు దిగుమతి బిల్లు 8.5బి.డాలర్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 24.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని జనం నుంచి పిండారు. ఈ కారణంగా ధరల పెరుగుదలతో మరెంత భారం పెరిగిందో లెక్కలు లేవు. పీపా ధర పది డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ప్రాతిపదిక సూచి పది పెరుగుతుంది.


బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 2018లో 85 డాలర్లు ఉంది. ఇప్పుడు దాన్ని దాటింది. ఏడాది క్రితం దీనిలో సగం ధర ఉంది. దానికి ఒకటి రెండు డాలర్లు తక్కువగా మనం వాడే చమురు ధర ఉంటుంది. సహజంగా ఆర్ధిక రంగం కోలుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ పెరుగుతున్న చమురు ధరలను చూస్తుంటే భయమేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో పరిస్ధితి ఎలా ఉందంటే ముందస్తు ఒప్పందం ప్రకారం చమురు తీసుకొనేందుకు కంపెనీలు తిరస్కరించాయి, సరఫరాదార్లకు ఎదురు డబ్బిచ్చి చమురొద్దురా బాబూ నిలవకు జాగా లేదు అన్నాయి. ఇప్పుడు దానికి విరుద్దంగా ఎక్కడ చూసినా ఖాళీ టాంకులే ఉన్నాయట. అంతకు ముందుతో పోలిస్తే నాలుగోవంతు మాత్రమే ఉందట.ఐరోపాలో కూడా నిల్వలు తగ్గాయి. చమురు ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 95డాలర్లకు పెరగవచ్చని జెపిమోర్గాన్‌ సంస్ధ జోశ్యం చెప్పింది.


కొందరి అంచనాల ప్రకారం ప్రస్తుతం 83 డాలర్లకు పైగా ఉన్న అమెరికన్‌ రకం ముడి చమురు డిసెంబరు నాటికి వంద డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరుకు 200 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఈ మేరకు బ్రెంట్‌ రకం 200 డాలర్లకు కాల్‌ ఆప్షన్‌ లావాదేవీలు జరిగాయి.2022 డిసెంబరులో 200 డాలర్లు ఉంటుందని ఒకరు పది పీపాల మీద రెండు డాలర్ల చొప్పున 20డాలర్ల ప్రీమియం చెల్లించాడనుకుందాం. గడువు నాటికి చమురు ధర అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని కోల్పోతాడు. లేదు 210 డాలర్లకు పెరిగిందనుకోండి. ఒక్కొక్క పీపాకు ప్రీమియం పోను ఎనిమిది డాలర్లు అతనికి లాభం వస్తుంది. ఇలా ఎన్ని పీపాల మీద పందెం కాస్తే నష్టం లేదా లాభం దాన్ని బట్టి ఉంటుంది. అమెరికా, ఐరోపాల్లో ఉన్న స్ధితి, ఆర్ధిక రంగం కోలుకుంటున్నది కనుక డిమాండ్‌ పెరిగి చమురు ధరలు పెరుగుతాయనే అంచనాలు దీన్ని సూచిస్తున్నాయి. ఇదొక జూదం, దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ విస్మరించకూడదు. అమెరికా ముడిచమురు వచ్చే ఫిబ్రవరిలో వంద డాలర్లకు చేరనుందని పందాలు పెరుగుతున్నాయి. 95 నుంచి 180 డాలర్ల వరకు రకరకాల పందాలను కాస్తున్నారు. పెట్రోలు, డీజిలును వాడేది కార్ల యజమానులు మాత్రమే కాదని, వివిధ పరిశ్రమలు కూడా వాడతాయని తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయని బిజెపి మంత్రులకు ఎవరు చెప్పాలి ? కరోనాతో నిమిత్తం లేకుండానే పన్నులు పెంచారని బిజెపి నేతలకు ఎలా చెప్పాలో జనానికే వదిలేద్దాం !