చైనా మహావేగ క్షిపణి ప్రయోగం – అయోమయంలో అమెరికా ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల మిలిటరీ నిపుణులను చైనా శాస్త్రవేత్తలు అయోమయంలో పడవేశారా ! లేక ఆయుధాల పోటీకి ఒక సాకుగా అమెరికన్లు ప్రచారదాడి ప్రారంభించారా ? సినిమాలకే పరిమితమైన స్టార్‌వార్స్‌ నిజం అవుతాయా ? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! ఏదైనా జరిగేందుకు ఆస్కారముంది.చైనా ప్రయోగం నిజమైనా కాకున్నా ఈ పరిణామం అంతరిక్షాన్ని ఆయుధమయం గావిస్తుంది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన ఒక కథనంతో అమెరికా మిలిటరీ నిపుణులు, పశ్చిమ దేశాల మీడియా గుండెలు బాడుకుంటూ ఇంకేముంది అంతా అయిపోయింది మిలిటరీ రంగంలో కూడా చైనా పైచేయి సాధించింది, అణు ముప్పు తలెత్తింది అంటూ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు భయ పడాల్సిందేమీ లేదంటూ తమ వీపును తామే తట్టుకుంటున్నారు. వార్తలో రాసిందేమిటి ?

చైనా వ్యోమ నౌకతో అనుసంధానం చేసిన అణ్వాయుధం అమర్చగలిగిన క్షిపణి విపరీత వేగంతో భూమికి దగ్గర కక్ష్యలో ప్రదక్షిణం చేసిందని, దాన్ని నిర్ణీత ప్రాంతంలో జారవిడిచిందని పేర్కొన్నది. ఈక్షిపణి అన్నివైపుల నుంచి అమెరికా మీద దాడి చేస్తుందని, రాడార్లను తప్పించుకుంటుందని రాసింది. హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆగస్టునెలలో ప్రయోగించిందని లక్ష్యానికి నలభై కిలోమీటర్ల దూరంలో బాంబును వేసిందని, అసలు అలాంటి పరిజ్ఞానం సాధించిన తరువాత నిర్ధిష్టంగా లక్ష్యాన్ని చేరుకొనే విధంగా లోపాలను సవరించటం పెద్ద పని కాదంటూ కిందు మీదవుతున్నారు.(ధ్వని వేగంతో సమంగా ప్రయాణించే వాటిని సూపర్‌ సోనిక్‌ అనీ ఐదు రెట్లు అంతకంటే ఎక్కువ వేగం ఉన్న వాటిని హైపర్‌సోనిక్‌ అంటున్నారు)


దీని మీద చైనా చెబుతున్నదేమిటి ? ఒక సారి ప్రయోగించిన వ్యోమనౌకను మరోసారి వినియోగించటం ద్వారా ఖర్చు తగ్గింపు గురించి జరిపిన ప్రయోగం తప్ప క్షిపణి కాదని చెబుతోంది. సదరు నౌక భూమి మీదకు తిరిగి వచ్చే క్రమంలో దానికి అనుసంధానించిన పరికరాలు విడిపోయి సముద్రంలో మండిపోయినట్లు పేర్కొన్నది. కాదు క్షిపణి అని అమెరికా అందించిన సమాచారం ఆధారంగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన కథనం సంచలనం సృష్టించింది. దాని కొనసాగింపుగా మిగతా మీడియా అందుకుంది. రెండూ వాస్తవం కావచ్చు. అనేక దేశాలు తాము చేస్తున్న ప్రయోగాలను బహిరంగ పరచటం లేదు.


ప్రస్తుతం ప్రపంచంలో ఆయుధ పోటీ నడుస్తోందన్నది వాస్తవం. నిత్యం ప్రపంచాన్ని తన అమ్ములపొదిని చూపి బెదిరిస్తున్నది అమెరికా. తన నూతన ఆయుధాల ప్రయోగశాలగా ఇరాక్‌ యుద్ధాన్ని వినియోగించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అణ్వస్త్రాలు ఉన్న దేశాలుగా అధికారికంగా గుర్తించినవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే.ఈ ఏడాది జనవరి నాటికి వాటి వద్ద ఉన్నట్లు అంచనా వేస్తున్న అణ్వస్త్రాల సంఖ్య దేశాల వారీ ఇలా ఉంది. అమెరికా 5,550, రష్యా 4,495, చైనా 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయని పాకిస్తాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 40-50 కలిగి ఉన్నట్లు అంచనా. ఇక ఏక్షణంలో అయినా బాంబులను తయారు చేయగలిగిన, కార్యక్రమం ఉన్న దేశాలుగా ఇరాన్‌, సిరియా ఉన్నాయి. అణుకార్య క్రమాన్ని నిలిపివేసిన జాబితాలో బెలారస్‌, కజకస్తాన్‌, ఉక్రెయిన్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, లిబియా,అర్జెంటీనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయన్నది కాదు, అవి మారణహౌమం సృష్టిస్తాయన్నదే అసలు సమస్య. పరస్పర విశ్వాసం లేనందున ఎవరు ప్రయోగించినా వాటిని అడ్డుకొనే కొత్త క్షిపణులను, వాహకాలను తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. చైనా తయారు చేసిందని చెబుతున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి రగడ అదే.


మిలిటరీ రంగంలో రష్యా పోటా పోటీగా ఉందికనుకనే ఇంతకాలం అమెరికా కొంత మేరకు అదుపులో ఉంది. ఇటీవలి కాలంలో ఆర్ధికంగా చైనా సవాలు విసురుతోంది. ఈదశాబ్ది అంతానికి అమెరికాను అధిగమిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు లేకున్నా వాటిని అంతరిక్షం నుంచి ప్రయోగించగలిగే పరిజ్ఞానాన్ని చైనా సంతరించుకుందనే భయం పట్టుకుందిప్పుడు. దీనిలో రెండు అంశాలున్నాయి. ఇరాక్‌ను ఆక్రమించుకొనేందుకు దానికి ఏదో ఒక సాకు చూపాలి, దానిలో భాగంగా అక్కడ మారణాయుధాలను సద్దామ్‌ హుసేన్‌ గుట్టలుగా పోశారనే ప్రచారం చేసి దురాక్రమణకు పాల్పడ్డారు. ఇప్పుడు చైనా విషయంలో దాన్నొక బూచిగా చూపి ఇతర దేశాలను భయపెట్టటం, ఆ సాకుతో తన ఆయుధాలను మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఉంది. ఒక వైపున చైనా అంటే చౌకవస్తువులను ఉత్పత్తి చేయటం తప్ప ఆధునిక పరిజ్ఞానం వారి దగ్గర ఎక్కడుందని చెబుతారు. మరొక వైపు అరే మనకు తెలియకుండా ఇప్పుడు ఇంత పరిజ్ఞానం ఎప్పుడు సంపాదించుకుందని ఆశ్చర్యపోతున్నట్లు, అతిశయోక్తుల కథలు చెబుతారు. భారత్‌, చైనా ఏ దేశమైనా తన భద్రతను తాను చూసుకోవాలి. అందుకే భారత్‌ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరలేదు.అలాగే అమెరికా కవ్వింపులను ఎదుర్కొనేందుకు చైనా పూనకుంటుందనటంలో సందేహం ఉండనవసరం లేదు.


మరోవైపున అమెరికా చేస్తున్నదేమిటి ? దాని దగ్గర అత్యాధునిక బాంబర్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన బి-52హెచ్‌ బాంబరుకు హైపర్‌సోనిక్‌ క్షిపణి ఎజిఎం 183ఏ(ఎఆర్‌ఆర్‌డబ్ల్యు)కు రాకెట్‌ను జతచేసి ప్రయోగాలు జరుపుతోంది. జూలై నెలలో రెండవ ప్రయోగం విఫలమైనట్లు, దాన్ని విశ్లేషిస్తున్నట్లు అధికారులే చెప్పారు. మరి వీటి సంగతేమిటి ? అమెరికా చేస్తే ఒప్పు చైనా చేస్తే ముప్పా ? ఈ ప్రయోగంలో ఆయుధం బాంబరు నుంచి విడిపోయి నప్పటికీ రాకెట్‌ మోటార్‌ పనిచేయక విఫలమైంది. అంతకు ముందు చేసిన తొలి ప్రయోగంలో క్షిపణి విడిపోలేదు. దీనికి సంబంధించి అనేక ప్రయోగాలు అంతకు ముందు జరిగాయి. ఇవి ఎందుకు చేస్తున్నారు ? ఆయుధ వ్యాపారి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ కోసమేకదా ! ఈ ప్రయోగం ఇతర దేశాలను భయపెట్టేందుకు గాక ఏ లోక కల్యాణం కోసం జరుపుతున్నట్లు ? బ్రిటన్‌తో కలసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానంతో పని చేసే జలాంతర్గాములను అందచేసేందుకు ఒప్పందం(అకుస్‌) చేసుకుంది. ఇది ఎన్‌పిటిని ఉల్లంఘించటం కాదా ? ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మిగతా దేశాలు ఏం చేయాలి ?


తన నేరాలు, ఘోరాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇతర దేశాలపై నిందలు వేయటం, మీడియా ద్వారా ప్రచారం చేయించటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య.గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు చైనా గోతులు తీసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో రాశారు.పత్రికల వార్తలను పట్టుకొని అమెరికాలోని కొందరు రెచ్చిపోతున్నారు. సాయుధ దళాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాలన్నాడు.లేనట్లైతే ఈ దశాబ్దిలోనే ప్రచ్చన్నయుద్దంలో కమ్యూనిస్టు చైనాతో అమెరికా ఓడిపోనుందని చెప్పాడు.
హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు, బహిరంగ రహస్యమే.చైనా తొలిసారిగా 2014లో రష్యా 2016లో పరీక్షించింది, అమెరికా చేస్తున్నదీ అదే. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్ధలను కూడా తప్పించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించే దాన్ని చైనా రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం అమెరికా దగ్గర లేదని కూడా కొందరు చెప్పారు. ఇదే గనుక నిజమైతే తామెంతో ముందున్నామని చెప్పుకుంటున్న అమెరికా తన మిత్రదేశాలను, తన జనాన్ని ఏ విధంగా సమాధానపరుస్తుంది ? ఆప్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే ఈ వార్త అమెరికా సామర్ధ్యం మీద మరింత అనుమానాలను రేకెత్తించదా ? అయినా ప్రచారం చేస్తున్నారంటే ఏదో దాని వెనుక ఏదో ఉండి ఉండాలి.


అమెరికా దూకుడును అడ్డుకునేందుకు 1960దశకంలో నాటి సోవియట్‌ ఇలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నప్పటికీ తరువాత నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి అమెరికా తెగబడుతున్నందున ఇతర దేశాలు అందుకు పూనుకొనే అగత్యం ఏర్పడింది. అనేక రంగాల్లో దూసుకుపోతున్న చైనా నిజంగా అధునాతన క్షిపణిని పరీక్షించినా ఆశ్చర్యం లేదు. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కధనం ప్రకారం చైనా పరీక్షించిన క్షిపణి వేగం గంటకు 33,800కిలోమీటర్లు, గాలిలో ధ్వని కంటే 27 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని పసిగట్టటం లేదా అడ్డుకోవటం కష్టం. అమెరికా వద్ద ఉన్న ఖండాంతర క్షిపుణులు 23రెట్ల వేగంతో దూసుకుపోతాయి. కొందరు నిపుణులు మరోవాదన వినిపిస్తున్నారు. ఉపగ్రహాల వినియోగం పెరగటం, భూమి, అంతరిక్షంలోని వస్తువులను పసిగట్టే పరికరాలుఉన్నందున హైపర్‌సోనిక్‌ క్షిపణులతో పెద్దగా ప్రయోజనం లేదని ఖండాంతర క్షిపణులే మెరుగని చెబుతున్నారు. అదే నిజమైతే అమెరికన్లు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది ? అమెరికా నిపుణుడు మార్కో వాదన మరో విధంగా ఉంది.అమెరికా రూపొందించిన బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్ధ( బిఎండి)ను, అమెరికా నగరాలను దెబ్బతీసే శక్తి హైపర్‌సోనిక్‌ క్షిపణికి ఉంటుందని చెబుతున్నాడు. ఇదే అమెరికన్లను భయపెడుతోందన్నది మరొక వాదన. ఒక క్షిపణి ప్రయోగం జరిపినంత మాత్రానే చైనా వద్ద అలాంటివి ఉన్నట్లు కాదని మరొకరు చెప్పారు. అసలు చైనా వారెలా చేశారో తమకు అర్దం కావటం లేదని ఒక అధికారి చెప్పినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. ఈ పత్రిక విశ్వసనీయత గురించి చర్చించటంలో అర్ధం లేదని కొన్ని కీలకమైన మిలిటరీ సాంకేతిక పద్దతుల్లో అమెరికాతో ఉన్న దూరం తగ్గుతోందని, చైనాను ఎవరూ ఆపలేరని గ్రహించాలని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. బిఎండి ఉంది కదా మనకు ఇబ్బంది లేదనుకుంటే ఇప్పుడు కుదరదని, ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఒక అమెరికన్‌ సూచించాడు.


అణుబాంబును తయారు చేయటమే గాక దాన్ని ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది, మిగతాదేశాలను రెచ్చగొట్టిందీ అమెరికా. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరైనా కొత్త అస్త్రాలను సమకూర్చుకుంటే అమెరికాను రెచ్చగొట్టేందుకే ఆ పని చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. అమెరికా ఖండాంతర క్షిపణులకు ధీటుగా రష్యా ఆర్‌ఎస్‌-28 సరమాట్‌ పేరుతో కొత్త క్షిపణి తయారు చేస్తోంది. అది ఈ ఏడాదే సిద్దం అవుతుందనే వార్తలు వచ్చాయి. అది సూపర్‌ ఖండాంతర క్షిపణి అంటున్నారు. దాదాపు పదహారువేల కిలోమీటర్ల వేగంతో, ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోయి ఒకేసారి నిర్ణీత ప్రాంతాల మీద జారవిడుస్తుందని చెబుతున్నారు.

అక్టోబరు తొలివారంలో చైనా విమానాలు తైవాన్‌ దీవి మీద అనేక చక్కర్లు కొట్టటాన్ని ప్రపంచ మీడియా కథలు కథలుగా వర్ణించింది. చైనా చర్యకు పోటీగా, కవ్విస్తూ అమెరికా, కెనడాలు క్షిపణి విధ్వంసక నావ, ఫ్రైగేట్‌ను తైవాన్‌ జలసంధిలో తిప్పాయి. ఆ తరువాతే ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రపంచాన్ని రెచ్చగొట్టే విధంగా చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి గురించి కథ అల్లింది. అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్ధను రూపొందించినప్పటికీ దాని అవసరం కలగలేదు. అది ఎలా పనిచేస్తుందో పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా అమెరికా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణిని వదిలితే దాన్ని మధ్యలోóనే అడ్డుకొనేందుకు రూపొందించారు. ఇప్పటి వరకు 19సార్లు పరీక్షించగా పన్నెండుసార్లు విజయవంతమైంది. గత రెండున్నర సంవత్సరాలుగా పరీక్షలు లేవు. దాని మీద ఇంకా అనుమానాలు తొలగలేదు. ప్రస్తుతం ఉన్న ఖండాంతర క్షిపణులు వంద మీటర్లకు అటూ ఇటుగా లక్ష్యాన్ని చేరతాయి. ఇటీవలి కాలంలో చైనా అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాతో పోటీ పడుతోంది. ఈ నేపధ్యంలో చైనా పరీక్ష ఇప్పుడు నిజం కాకపోయినా త్వరలో చేసినా ఆశ్చర్యలేదు. అమెరికన్లు అదుపులో ఉంటారు.

చైనా – భూటాన్‌ ఒప్పందం ఓ కీలక మలుపు !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


కేవలం ఎనిమిది లక్షలలోపు జనాభా ఉన్న భూటాన్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనా ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. చైనా-భూటన్‌ – భారత్‌ త్రికోణ కూడలికి దగ్గరలో నాలుగు సంవత్సరాల నాడు తీవ్ర వివాదంగా మారిన డోక్లాం ప్రాంతం ఉంది. అది ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ భూటన్‌ తనదిగా చెబుతోంది. దానితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు, ఇతర నిర్మాణాలు చేసేందుకు 2017లో చైనా ప్రయత్నించినపుడు మన సైన్యాలు అడ్డుకున్నాయి. డెబ్బైమూడు రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. రోడ్డు నిర్మాణాన్ని చైనా నిలిపివేసిన తరువాత సద్దుమణగింది. వేస్తున్న రోడ్డును ఆపివేసింది తప్ప చైనా ఆప్రాంతంలోనే అప్పటి నుంచీ కొనసాగుతోంది.సిక్కిం వైపు నుంచి నిర్ధారిత సరిహద్దు నుంచి 2017జూన్‌ 18న భారత సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించి అతిక్రమణకు పాల్పడిందని అప్పుడు చైనా విమర్శించింది. మూడు దశలుగా లేదా మూడంచెలలో వివాదాలను పరిష్కరించుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది ఒప్పందం, వివరాలు వెల్లడి కాలేదు.


రెండు దేశాల మధ్య 1984 నుంచీ చర్చలు జరుగుతున్నాయి, 24 సార్లు కూర్చున్నా పరిష్కారం కాలేదు.2017లో డోక్లాం ఉదంతం తరువాత అవి కూడా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో పదవసారి జరిగిన నిపుణుల సమావేశం తరువాత తాజా ఒప్పందం కుదిరింది. దీని గురించి ఎవరికి వారు తమ ప్రయోజనాలు, భాష్యాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం గురించి ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదని, ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే అనే అభిప్రాయంవెల్లడించిన వారు కొందరు. నిజానికి దీనికి 2010లోనే పునాది పడింది. వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలను భౌతికంగా పరిశీలించాలని నిర్ణయించారు, ఆ మేరకు 2015నాటికి దాన్ని పూర్తి చేశారు.వివాదం ఉన్న వాటిలో డోక్లాంను తమకు అప్పగిస్తే దానికి బదులు ఇతర ప్రాంతాల మీద హక్కును వదులుకుంటామని చైనా చెబుతోంది. భూటాన్‌ మొత్తం విస్తీర్ణం 38వేల చదరపు కిలోమీటర్లు, నాలుగు వందల కిలోమీటర్ల మేరకు చైనాతో సరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం 765 చదరపు కిలోమీటర్లు. ఈ ఒప్పందాన్ని వీడియో సమావేశంలో చేసుకున్నారు.


త్రికోణ కూడలి ఇటు మన దేశానికి చైనాకు ప్రాధాన్యత కలిగినవే. మన ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం కూతవేటు దూరంలో ఉంది. పరస్పరం అనుమానాలు ఉన్నందున డోక్లాం చైనాలో ఆధీనంలో ఉండేందుకు మన దేశం అంగీకరించటం లేదు. భూటాన్‌ విషయానికి వస్తే అటు చైనా ఇటు మన దేశంతో దానికి భద్రతాపరమైన ముప్పు ఉందని భావించటం లేదు. మనదేశం-భూటాన్‌ మధ్య ఒక చిత్రమైన ఒప్పందం ఉంది. తరువాత అది అనేక మార్పులకు లోనైంది. ఆ ఒప్పందం ప్రకారం భూటాన్‌ మన రక్షిత ప్రాంతమని మన దేశం భావించింది.


1949 ఆగస్టు 8న కుదిరిన స్నేహ ఒప్పందం ప్రకారం అంతర్గత వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. అయితే విదేశీ, రక్షణ విషయాలలో పరస్పరం సంప్రదించుకోవాలి, మన దేశం భూటాన్‌కు మార్గదర్శనం చేయాలి. భూటాన్‌ స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించవచ్చుకనుక కొందరు దీన్ని రక్షణ కల్పించే దేశం తప్ప రక్షణలో ఉండేది (అలాంటి దేశాలను అన్నివిధాలుగా నియంత్రిస్తారు) కాదని చెప్పారు.1958లో నాటి ప్రధాని నెహ్రూ భూటాన్‌ సందర్శించిన తరువాత పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ భూటాన్‌ మీద ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే అది భారత్‌ మీద జరిపినట్లే పరిగణిస్తామని ప్రకటించారు. నాడు వేరేదేశంగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను చైనా ఆక్రమించనుందనే పుకార్లు (సిక్కింలో తిష్టవేసేందుకు అమెరికా సిఐఏ అల్లిన కట్టుకథలు )వచ్చినపుడు 1959లో పార్లమెంటులో ప్రకటన చేస్తూ భూటన్‌ రక్షణ బాధ్యత భారత్‌ వహిస్తుందని నెహ్రూ ప్రకటించారు. దాన్ని నాటి భూటాన్‌ ప్రధాని ఖండిస్తూ తమది భారత రక్షిత దేశం కాదని ఒప్పందంలో అలాంటి అంశం లేదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ భారత్‌ – భూటాన్‌ సరిహద్దు వివాదాలు 1973-84 కాలంలోనే పరిష్కారమయ్యాయి.

తమ సార్వభౌమత్వం పెంపుదలకు ఒప్పందంలోని కొన్ని అంశాలను తిరిగి రాసుకోవాలని 1970లోనే భూటాన్‌ కోరింది. దానిలో భాగంగానే మన ప్రమేయం లేకుండానే 1971లో అది ఐక్యరాజ్య సమితిలో చేరింది. బంగ్లాదేశ్‌ విముక్తిని గుర్తించి మరుసటి ఏడాది ఒక ఒప్పందం చేసుకుంది. అలీన కూటమిలో చేరింది. కంపూచియా ఖేర్మరోగ్‌ సంస్ధను ఐరాసలో ప్రతినిధిగా గుర్తించాలా లేదా అన్న అంశంపై కొన్ని ఆ ప్రాంత దేశాలు, భారత వైఖరికి భిన్నంగా చైనాతో కలసి అనుకూలంగా ఓటు వేసింది.2007లో 1949నాటి ఒప్పందాన్ని నవీకరించారు. అంతకు ముందు భూటాన్‌ సరిహద్దు సార్వభౌమత్వం గురించిన విదేశాంగ విధానంలో భారత మార్గదర్శనం చేయాలని ఉన్న అంశాన్ని తొలగించారు. ఆయుధ దిగుమతులకు కూడా భారత అనుమతి అవసరం లేదని సవరించారు. ఒప్పందంలో ఈ మార్పులు జరిగినప్పటికీ మన దేశం మీద భూటాన్‌ అనేక అంశాలలో ఆధారపడటం వంటి కారణాలతో ప్రభావితమైంది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణ సమయం భూటాన్‌ వినతి మేరకు తాము దాని భూభాగాన్ని రక్షించేందుకు వచ్చినట్లు ప్రకటించి మన మిలిటరీని అక్కడకు పంపారు.అయితే భూటాన్‌ ఆ సమయంలో మౌనం పాటించింది. భూటాన్‌ కోరితేనా లేక మనమంతట మనమే మిలిటరీని పంపామా అన్నది ఇప్పటికీ చిక్కుముడే.


సరిహద్దులతో సహా భూటాన్‌ పూర్తి సార్వభౌమత్వ దేశంగా ఉన్నట్లు చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతో మన దేశానికి, ప్రపంచానికి స్పష్టం చేసింది. ఈ కారణంగానే కావచ్చు లేదా వివరాలు పూర్తిగా వెల్లడి కానందున గానీ మన దేశం జాగ్రత్తగా స్పందించింది. 1997లో ఇచ్చి పుచ్చుకొనే ప్రాతిపదికన చైనా చేసిన ప్రతిపాదనకు భూటాన్‌ అంగీకరించకపోవటానికి మన దేశం తెచ్చిన వత్తిడే అని చైనా చెబుతోంది. డోక్లాం ప్రాంతం ఉన్న చుంబీ లోయ చైనా ఆధీనంలోకి వెళితే భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం మీద సులభంగా దాడి చేయటానికి వీలు కలగటమే గాక ఈశాన్య ప్రాంతంతో సంబంధాలు తెగిపోతాయన్నది మన దేశ భయం. మన దేశం నుంచి తమ టిబెట్‌కూ అలాంటి ముప్పు ఉంటుందని చైనా చెబుతోంది.


రెండు దేశాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ అది సజావుగా ముందుకు పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒప్పందం గురించి మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పందిస్తూ అవగాహన కుదిరినట్లు గమనించాము, 1984 నుంచి రెండు దేశాలూ సరిహద్దు గురించి సంప్రదింపులు జరుపుతున్నాయి.మనమూ చైనాతో సంప్రదింపుల్లోనే ఉన్నాం అని క్లుప్తంగా స్పందించారు. భారత్‌కు తెలియచేయ కుండా భూటాన్‌ ఒప్పందం చేసుకుందా అన్న ప్రశ్నకు బాగ్చీ స్పందించలేదు. తమ సరిహద్దు చర్చలకు ఇది నూతన ఉత్సాహాన్నిస్తుందని, విజయవంతంగా ముగుస్తుందనే ఆశాభావాన్ని భూటాన్‌ వ్యక్తం చేసింది. ఒప్పందం భారత్‌కు అవమానమని, తమ దేశానికి విజయం అని చైనా పత్రికలు వర్ణించాయి.చైనాను నిలువరించాలని, సరిహద్దు వివాదాలను ఆయుధమయం కావించాలని చూస్తున్న నరేంద్రమోడీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అని చైనా టీవీ సిజిటిఎన్‌ పేర్కొన్నది.


భూటాన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకోకుండా మనదేశం నిలువరించిందనే విమర్శలను చైనా చేసింది. గతంలో భూటాన్‌ తరఫున సరిహద్దు సమస్యను తమతో చర్చించాలని భారత్‌ ప్రతిపాదించిందని అది విఫలం కావటంతో భూటాన్‌ మీద వత్తిడి తెచ్చినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది ఇప్పుడు రెండు సార్వభౌమ దేశాల మధ్యజరిగిన ఒప్పందం గురించి వేలెత్తి చూపితే బలహీన, చిన్న దేశ సార్వభౌమత్వాన్ని భారత్‌ దెబ్బతీస్తున్నదని ప్రపంచంలో రుజువు అవుతుందని, అందువలనఒప్పందం గురించి భారత్‌ ఒక ప్రకటన చేస్తుందని భావించటం లేదని కూడా పేర్కొన్నది. బహిరంగంగా ఏమీ చెప్పలేదు కనుక అంతర్గతంగా భూటాన్‌ మీద వత్తిడి లేదా ఏం చేయాలో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని రాసింది.


ఈ ఒప్పందానికి భూటాన్‌ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృత అవకాశం లేదు.వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు. నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఒక్క భూటాన్‌తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే భూటన్‌కు ఐరాస భద్రతా మండలిలోని ఏ ఒక్క శాశ్వత సభ్యదేశంతో కూడా సంబంధాలు లేవు. ఇదొక విచిత్రమైన స్ధితి. ఈ ఒప్పందంతో చైనాతో సంబంధాలు ఏర్పడితే పెనుమార్పులేమీ సంభవించవుగానీ అమెరికా దాని కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.

అంబానీ, అదానీలకు సంపదలు- అభాగ్యులకు అప్పుల తిప్పలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ముకేష్‌ అంబానీ తరువాత అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ త్వరలో అంబానీ స్ధానాన్ని ఆక్రమించనున్నారా ? పేదలు,మధ్యతరగతి మరింతగా దిగజారనున్నారా ? తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? ప్రస్తుతం అంబానీ రోజువారీ సంపాదన 163 కోట్లు కాగా అదానీ రాబడి 1002 కోట్లు మరి. అంబానీ ఆస్తి 7,18,000 కోట్లు కాగా అదానీ దగ్గర 5,05,000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద పెరుగుదల తొమ్మిది శాతం కాగా అదానీకి 261శాతం అంటే నోరెళ్లపెట్టకండి. ఇదే సమయంలో ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌.కాం అనే వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్‌ సింగ్‌ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్‌ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్‌ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్‌ ఎవరికి చచ్చేరోజులు ఎవరికి ?


పురుషులందు పుణ్య పురుషులు వేరు (మహిళలకూ ఇదే వర్తిస్తుంది) అన్నట్లుగా పరిశోధకులందు జనపరిశోధకులు ధనశోధకులు వేరు అని నోబెల్‌ బహుమతుల ప్రకటన వెల్లడించింది. ఎందుకంటే ఆ రాణీ ప్రేమపురాణం, ఈ కైఫీయత్‌కైన ఖర్చుల గురించి గాక కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన గురించి ఈ రోజుల్లో ఎవరుంటారు ! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్‌ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్‌, జాషువా ఆగెస్‌, డేవిడ్‌ కార్డ్‌ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్‌ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశపై పరిశోధన జరిపారు.కనీసవేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని నిరూపించారు.వేతనాలు పెంచితే కార్మిక లభ్యత పెరుగుతుందని కూడా తేల్చారు. అన్నింటికీ మించి వేతనాలు పెంచితే కంపెనీ లాభాలు తగ్గుతాయన్నది వాస్తవం కాదని ఆమేరకు వస్తు ధరలు పెంచుతారని వెల్లడించారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులు ఎవరికోసం కనీసవేతనాలను సంవత్సరాల తరబడి పెంచకుండా ఉన్నట్లు ? సంపద పంపిణీలో అసమానతలను పెంచే చర్య కాదా ఇది.


గౌతమ్‌ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. ఇదంతా కష్టపడితే పెరిగిందేనా ? సాధారణ కార్మికుడి కంటే అదనంగా రోజుకు ఎన్ని గంటలు శ్రమపడి ఉంటారు ? ఇక్కడ కొంత మందికి సంపద పెరిగిందని ఏడవటం కాదు, ఎందరికో ఎందుకు పెరగటం లేదు అన్న ఆవేదనతో ఈ ప్రశ్న.కరోనా కాలంలో కొందరి సంపదలు పెరిగితే ఎందరో దిగజారారు ఎందుకని ? ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 వెల్లడించిన వివరాల మేరకు ఏడాది కాలంలో కేవలం అదానీ మాత్రమే ఒక లక్ష విలువగల కంపెనీలు ఐదింటిని ఏర్పాటు చేశారు. సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కూడా లక్ష కోట్ల సంపదదాటిని పది మందిలో ఎనిమిదవ స్దానంలో ఉన్నారు. అతగాడి రోజు వారీ సంపాదన రు.245 కోట్లు. ఏడాది కాలంలో ఏకంగా పన్నెండు స్ధానాలు ఎగబాకి రు.1.31లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఏడాది కాలంలో ఎవరెవరి సంపాదన ఎలా పెరిగిందో పట్టికలో చూడవచ్చు.


కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే బతికి ఆస్తులు అమ్ముకొని అప్పులపాలైన వారు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలోనే 58 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు, 894 మంది సంపదలు పెరిగితే 113 మందికి తగ్గాయట. పాపం కదా ! ఇక ధనికులు విపరీతంగా పెరిగిన రంగాలను చూస్తే ఫార్మాలో 130 మంది, పెట్రోకెమికల్స్‌లో 98 మంది ఉన్నారు. మహమ్మారులు సామాన్య జనం ప్రాణాలు తీస్తే ఔషధ కంపెనీలకు లాభాలను సమకూర్చుతాయని కరోనా నిరూపించింది. ఈ కంపెనీలకు గతేడాది రు.3,45,900 కోట్లు అదనంగా వచ్చిందట.ఇండియా రేటింగ్‌ సంస్ధ విశ్లేషణ ప్రకారం రెండువేల ఆర్ధికేతర కార్పొరేట్‌లలో వేతనాల గురించి విశ్లేషించగా 60శాతం కంపెనీల్లో గతేడాది సెప్టెంబరు, డిసెంబరు త్రైమాసికాల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిబ్బంది ఖర్చు తగ్గించారు. అంటే కుటుంబాలకు ఉపాధి, ఆదాయం తగ్గింది.పోయినవి తిరిగి వచ్చే అవకాశం లేదని ఆ సంస్ద పేర్కొన్నది. అసలే తక్కువ ఆదాయం ఆపై కరోనా కాటుతో అనేక కుటుంబాలు అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనం బికారులు కావటానికి అదానీ, అంబానీల సంపద మరింత పెరగటానికి కారణాలను కూడా రేటింగ్‌ సంస్ద పేర్కొన్నది. పరోక్ష పన్నులు జనం మీద పెరగ్గా కార్పొరేట్లకు పన్ను తగ్గింది. 2010లో గృహస్తుల మీద పన్ను 60శాతం ఉంటే ఇప్పుడు అది 75కు పెరిగింది. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్ను తగ్గింది. అంతకు ముందు పెంచినదిగాక 2020 మార్చి-మే మాసాల మధ్య పెట్రోలు మీద రు.13, డీజిలుపై రు.16లను కేంద్రం పెంచింది. ఈ కాలంలో పీపాధర 28 డాలర్లు ఉండగా జనానికి తగ్గిందేమీ లేదు, పెరిగిన తరువాత ఆమేరకు జనం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ కొత్త రికార్డు నెలకొంటోంది. ఇది కుటుంబాల జేబులను గుల్ల చేస్తోంది. పోనీ అంతకు ముందు నిజవేతనాలు పెరిగాయా అంటే….ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం 2015లో 2.8, 2016లో 2.6, 2017, 18లో 2.5శాతాల చొప్పున పెరిగాయి.తరువాత తగ్గాయి.కనీసవేతనం రు.176 కాగా వివిధ రాష్ట్రాల వేతనాలను విశ్లేషించినపుడు మధ్యగత వేతనం రు.269 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చినెలలో పార్లమెంట్‌లో తెలిపింది. వేతన కోడ్‌ 2019 ప్రకారం ఐదేండ్లలోపు కనీసవేతనాలను సవరించాలని నిర్దేశించటమే గొప్పఅన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.


ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో గత ఏడు సంవత్సరాల్లో ఆదాయాలు పెరిగాయా తరిగాయా అంటే పెరిగినట్లు చిత్రిస్తున్నారు.నిజం ఏమిటి ? లెక్కలతో తికమక చేస్తున్నారు. నిఖర ఆదాయం బదులు చెల్లించిన మొత్తాలనే పరిగణనలోకి తీసుకున్నారనే విమర్శ ఉంది. రికార్డు స్ధాయిలో పంటలు పండితే అది రైతాంగానికి ఆదాయం లేదా సంపద అన్నట్లు చిత్రిస్తున్నారు, గందరగోళపరుస్తున్నారు.పరిస్ధితి మదింపు సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలోసేకరించిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 కాలంలో కుటుంబంలో ఒకరు ఏడాది పాటు పొలంలో పని చేస్తే పంటల ద్వారా రు.4000కు మించి ఆదాయం వస్తే వ్యవసాయ కుటుంబంగా పరిగణిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది.నాబార్డు సర్వే 2016-17లో ఆ మొత్త రు.5,000లుగా చెప్పారు. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి ? అది తేలేది కాదు వదిలేద్దాం. ప్రభుత్వలెక్కల ప్రకారం పైన పేర్కొన్న సంవత్సరాలలో వచ్చిన ఆదాయాల మార్పు తీరుతెన్నులను చూద్దాం.ఆదాయం రూపాయలు.


వనరు×××××××× 2012-13××××2018-19××××× తేడా శాతం××××35.3శాతం ద్రవ్యోల్బణంతో తేడా
వేతన ఆదాయం××× 2,071 ××× 4,063 ××××× 96.2 ×××× 60.9
పంట ఆదాయం××× 3,081 ××× 3,798 ××××× 23.3 ×××× -12
పశుపోషణఆదాయం× 763 ××× 1,582 ××××× 107.3 ×××× 72
ఇతర ఆదాయం××× 512 ××× 641 ××××× 25.2 ×××× -10.1
మొత్తం ఆదాయం××× 6,427 ××× 10,084 ××××× 56.9 ×××× 21.6
రైతు కుటుంబానికి పంట నిజ ఆదాయం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు తగ్గింది. మిగతా పశు, ఇతరంగా లేకుండా కేవలం పంటల మీదనే ఆధారపడితే నష్టం తప్ప లాభం లేదు. మొత్తంగా తీసుకున్నప్పటికీ పెరుగుదల పెద్దగా లేదన్నది స్పష్టం.గ్రామీణ సంక్షోభంలో ఇదొక ప్రధాన అంశం. ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఖర్చుల పెరుగుదలను విస్మరిస్తే కుదరదు కదా, అందువలన నిఖర ఆదాయం ఎంతో తేలితే అసలు బండారం బయట పడుతుంది. సర్వే జరిగిన సంవత్సరం పంటల పరిస్ధితి మెరుగ్గా ఉండవచ్చు లేదా దిగజారి కూడా ఉండవచ్చు. అందువలన ఒక ఏడాది ప్రమాణం సరైన నిర్ధారణ ఇవ్వదు.


కరోనా కల్లోలంలో ఉపాధికి దెబ్బ చెప్పుకోలేనిది, సమగ్ర సమాచారం లేదు. అసలు వలస కార్మికులెంత మందో తెలియని వాస్తవాన్ని కరోనా బయట పెట్టింది. ఉపాధి నష్టం అంచనాలు తప్ప నిర్దిష్టత లేదు.2020-21లో ఆర్ధిక వృద్ది 7.3శాతం లోటు అన్న లెక్కలను కూడా అనేక మంది అంగీకరించటం లేదు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చన్నది అభిప్రాయం. అమెరికాలోని పూ పరిశోధనా సంస్ధ అంచనామేరకు 3.2కోట్ల మంది మధ్యతరగతి జనాలు ఆ వర్గీకరణ నుంచి దిగజారిపోయారు.ప్రపంచంలో వంద మంది పరిస్ధితి అలా దిగజారిందని అనుకుంటే మన వాటా 60 అని చెప్పిందంటే పరిస్ధితి ఎంతదారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే అసలు మధ్య తరగతి ఎందరనేది మౌలిక ప్రశ్న.మన దేశంలో పేదరికానికి తప్ప దీనికి నిర్ధిష్ట ప్రమాణం లేదు. బ్రూకింగ్‌ సంస్ధకు చెందిన హౌమీ ఖరాస్‌ నిర్వచనం ప్రకారం 2011లో 11-110 డాలర్ల మధ్య (రు. 171-1714)ఆదాయం ఉన్న 38 కోట్ల మంది 2015-22లో మధ్యతరగతిలోకి ప్రవేశిస్తారని 2019లో చెప్పాడు. ఎన్‌సిఏఆర్‌ చెప్పిందాని ప్రకారం రెండు నుంచి పదిలక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి అని అలాంటి వారు 2010లో 15.3 కోట్ల మందని చెప్పింది.2012లో అమెరికా సంస్ద గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ పదికోట్లని చెప్పింది.2009-10లో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం పది కోట్లు, గత దశాబ్దిలో వివిధ సర్వేల ప్రకారం ఏడు నుంచి 60 కోట్ల మంది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు.కొన్ని సర్వేలు వినిమయాన్ని బట్టి అంచనా వేశాయి. అధికారికంగా వెల్లడించని, అనధికారికంగా బయటకు వచ్చిన ఎన్‌ఎస్‌ఓ వివరాల ప్రకారం తగినంత ఉపాధి లేక గడచిన నాలుగుదశాబ్దాలలో తొలిసారిగా 2017-18లో వినిమయం తగ్గిపోయింది.2015 నుంచి పట్టణ మధ్య తరగతి తగ్గిపోగా గ్రామీణ మధ్యతరగతి గిడసబారిపోయింది. కొందరి విశ్లేషణ ప్రకారం మన దేశ మధ్యతరగతి స్దితి ధనికులకంటే పేదలకు దగ్గరగా ఉంటుంది. కరోనా కాలంలో 23 కోట్ల మంది కనీసవేతన పరిధిలోకి దిగజారినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.


అలాంటి వారి పొదుపు మొత్తాలు, బ్యాంకు డిపాజిట్లు కరోనా సమయంలో ఆవిరయ్యాయి.2020 జూలై ాసెప్టెంబరుమధ్య గృహస్తుల బ్యాంకు డిపాజిట్లు జిడిపిలో 7.7శాతం ఉండగా అక్టోబరు-డిసెంబరు నాటికి మూడు శాతానికి తగ్గాయని ఆర్‌బిఐ నివేదిక చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు సంపద అసమానతలను మరింతగా పెంచేందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, రుణ పత్రాల కొనుగోలు, 5.3లక్షల కోట్ల నగదును ద్రవ్య వ్యవస్దలోకి విడుదల చేశారు. ఈ మొత్తం నిజమైన ఆర్ధికరంగం బదులు స్టాక్‌మార్కెట్‌కు ఎక్కువ భాగం వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక రంగం తిరోగమించినా, పునరుద్దరణతో నిమిత్తం లేకుండా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డులను బద్దలు కొట్టటమే దానికి నిదర్శనం. దీని గురించి ఆర్‌బిఐ ఆందోళన కూడా తెలిపింది. గృహస్తుల సంపద కరిగిపోగా కంపెనీల ఆస్తులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన చౌకవడ్డీ రుణాలతో అంతకు ముందు అధికవడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చాయి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది.


దేశంలో పదిశాతంగా ఉన్న ధనికుల కొనుగోలు శక్తి పెరిగితే స్టాక్‌మార్కెట్‌, విలాసవస్తువుల మార్కెట్‌, బంగారం, వజ్రాల దిగుమతి మరింతగా పెరుగుతుంది తప్ప ఉపాధి పెరగదు.మధ్య తరగతి మరింతగా తగ్గిపోతుంది, పేదరికం, దారిద్య్రం పెరుగుతుంది. అదే 90శాతంగా ఉన్నవారి శక్తి పెరిగితే నిత్యావసర వస్తు గిరాకీ పెరిగి పరిశ్రమలు, వాణిజ్యంతో ఉద్యోగాలు పెరుగుతాయి.సంస్కరణలు ప్రారంభమైన మూడు దశాబ్దాలలో అసమానతలు మన దేశంలో మరింతగా పెరిగాయి.కరోనా వాటిని మరింత పెంచింది. ఒకశాతంగా ఉన్న ధనికుల సంపద 1990లో జాతీయ ఆదాయంలో 11శాతం ఉంటే 2019నాటికి 21కి పెరిగింది.ప్రపంచంలో 64దేశాల తీరుతెన్నులను పరిశీలించగా కరోనా కాలంలో ధనికుల ఆదాయాలు మరింతగా పెరగ్గా ఇతరులవి తగ్గాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు తగ్గినట్లు వేరే చెప్పనవసరం లేదు. ఏడునెలల తరువాత 2020 అక్టోబరులో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఉన్న ఆదాయాలు కంటే 15-20శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే సమాచారం అసమగ్రంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో విస్వసనీయత కోల్పోయింది. సిఎంఐఇ 2020మే నెల అంచనా ప్రకారం అంతకు ముందు నెలలో 12.2కోట్ల ఉద్యోగాలు పోయాయి. అధికారిక అంచనాల ప్రకారం పదిహేనేండ్ల వయసుపైబడిన ఉద్యోగార్ధులు 2020 జనవరి-మార్చినెలల్లో దేశంలో 18.2కోట్ల మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో 7కోట్ల మంది కార్మికశక్తి నుంచి తగ్గారు.ఉద్యోగార్ధులలో మహిళలు 4కోట్ల మందే ఉన్నా, ఉపాధి నుంచి తగ్గిన ఏడు కోట్లలో మూడు కోట్లు ఉన్నారంటే వారి మీద ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరికొన్ని గణాంకాల ప్రకారం 2020 జనవరి-మార్చి నెలల్లో 16.6 కోట్ల మంది పని చేస్తుండగా తరువాత మూడు నెలల్లో వారి సంఖ్య 2.6కోట్లకు తగ్గింది. రోజువారీ కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.కోటీ 90లక్షల మందిలో 90లక్షల మందికి ఉపాధి పోయింది. నెలవారీ వేతనం ఉన్నవారు కోటి మంది తగ్గితే స్వయ ఉపాధి కలిగిన వారు 60లక్షల మందికి ఉపాధి పోయింది.

కరోనా ప్రభావం గురించి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఆదాయాల కంటే అప్పులు ఆరు రెట్లు ఎక్కువ చేశారని తేలింది. దిగువ 25శాతం జనాభాలో పేద కుటుంబాల అప్పులు నాలుగు రెట్లు, ధనికుల అప్పు 1.4రెట్లు మాత్రమే పెరిగాయి. రానున్న రోజుల్లో అసమానతలను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.సిఎంఐఇ విశ్లేషణ ప్రకారం 2020చివరి నాటికి ఉపాధి కరోనా ముందు స్దాయికి చేరినా ఆదాయాలు పెరగలేదు.కోటీ 50లక్షల మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. కరోనా రెండవ తరం ప్రభావాల గురించి ఇప్పటికీ సరైన అంచనాలు లేవు.ఎవరి పద్దతిలో వారు వేసిన అంచనాలన్నింటినీ తలకు ఎక్కించుకుంటే బుర్రలు తిరుగుతాయి. మొత్తం మీద నడుస్తున్న చరిత్రను చూస్తే రానున్న రోజుల్లో ఆదాయ, సంపదల అసమానతలు పెరుగుతాయి. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.


గమనిక : ఈ వ్యాసం అక్టోబరు 17 ఆదివారం నవతెలంగాణా దినపత్రిక అనుబంధం సోపతి ముఖచిత్ర కథనంగా ప్రచురితమైనది

మన్మోహన్‌సింగ్‌ ఆకాంక్ష ,అమలు చేస్తున్నది నరేంద్రమోడీ – రికార్డు స్ధాయిలో చైనా దిగుమతులు, ఏమి దేశభక్తిరా బాబూ ఇది ?

Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్‌లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.


రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్‌ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్‌ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్‌ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.


ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?


2012లో నాటి చైనా ప్రధాని వెన్‌జియాబావో – మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్‌ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్‌ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.


చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్‌ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌, పేటియం, ఓలా, బైజూస్‌ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సోలార్‌ పానెల్స్‌, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.

మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్‌ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జేమ్స్‌ లారెన్స్‌సన్‌ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.


బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్‌,భారత్‌ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్‌, భారత్‌ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్‌ సన్‌ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్‌ గోల్డ్‌మన్‌ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్‌ అమెరికా పార్లమెంట్‌ సమన్వయకర్త కర్ట్‌ కాంప్‌బెల్‌ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్‌గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.


ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్‌ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్‌ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.


ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్‌ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?


సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !

మీ దేశం చుట్టుపక్కల అరవై ఆరు దేశాలకు పోతుగడ్డ మోడీ మహా ప్రభో !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశంలో అధికార రాజకీయ క్రీడ ఒక వైపు, దానిలో ఓడిపోకుండా ఉండేందుకు వెంపర్లాట మరోవైపు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య ఒకవారం ఇన్ఫోసిస్‌ దేశభక్తిని శంకిస్తే మరో వారం కథనంలో అమెజాన్‌ రెండో తరం ఈస్టిండియా కంపెనీ అని వర్ణించింది. అది ఒక కంటితోనే చూస్తోంది. మరోకంటితో అవలోకిస్తే విదేశీ ఒప్పందాల కోసం నరేంద్రమోడీ సర్కార్‌ వెంపర్లాడుతున్న దృశ్యం కూడా కనపడి ఉండేది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే అంశం తెలిసినా సర్దుబాటు చేసేందుకు పూనుకున్నారు. చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం మధ్య ప్రభుత్వ వాణిజ్య విధానంలో పెద్ద మార్పు అనే పేరుతో ఒక వార్తా సంస్ధ విశ్లేషణ వెలువడింది. పెద్ద మార్పు అంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ త్వరత్వరగా ప్రయోజనాలు పొందే ఒప్పందాలు చేసుకోనున్నది అని కూడా దానిలో చెప్పారు. కేంద్ర మంత్రులు లేదా ఉన్నతాధికారులతో జర్నలిస్టులు సంభాషించిన తరువాతనే ఇలాంటి విశ్లేషణలు వస్తుంటాయి లేదా పని కట్టుకొని రాయిస్తుంటారు. ఇది మొదటి కోవకు చెందినదే.


ఎందుకు ఇలాంటి విశ్లేషణలు అంటే ప్రతిదాని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ ఎందుకు తొందరపడుతున్నారు ? అధికారానికి వచ్చిన తొలిరోజుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు చమురు ధరలు పడిపోవటంతో వచ్చిన వెసులుబాటు నరేంద్రమోడీ ఘనతే అన్నట్లుగా ప్రచారం చేశారు. మీడియా కూడా అదే భజన చేసింది. అది నూతన సాధారణ స్ధాయికి చేరటం, చమురు ధరలు పెరగటంతో ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరు సంవత్సరాల కాలంలో దేశవృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారింది. అప్పటి నుంచి ప్రతిదానికీ కరోనాను సాకుగా చూపుతున్నారు. ఇంకేమాత్రం ఆ కబుర్లు నమ్మేందుకు జనం సిద్దంగా లేరు. తొలి నెలల్లో విదేశాల్లో, విమానాల్లోనే మోడీ ఎందుకు కాలం గడుపుతున్నారు అంటే పెట్టుబడుల కోసం అని చెప్పారు. కొత్తగా వచ్చిందేమీ లేదు. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అన్నారు. ఉన్న ఎగుమతులు కూడా తగ్గాయి. తరువాత చైనా నుంచి ఇతర దేశాల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. వాటి జాడలేదు.


ఇప్పుడు ఆత్మనిర్భరత, ఉత్పత్తి, ఎగుమతుల ఆధారిత రాయితీలంటూ విఫల పధకాన్ని మరోసారి ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలని హడావుడి చేస్తున్నారు.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఒకవైపు ఎగుమతులు-మరోవైపు తమ పౌరుల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ఆదాయాల పెంపు వంటి విధానాలను అనుసరిస్తున్న కారణంగా అవి ముందుకు పోతున్నాయి. రెండవది జరగకుండా ఎగుమతులతో ముందుకు పోవాలని మోడీ సర్కార్‌ ఆత్రంగా ఉంది. అలాంటి విధానాలను అనుసరించిన లాటిన్‌ అమెరికా దేశాల అనుభవాలను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడదు.


ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర ఒప్పందాలు కుదరాలంటే ఏండ్లూ పూండ్లూ పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం తమకే పెద్ద పీట అంటే మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తావు, మాదేశం వస్తే మాకేం తెస్తావు అన్నట్లుగా ఉన్నాయి. బేరాలాడుతున్నాయి. చైనాతో తగాదా పెట్టుకొన్న మోడీ కౌగిలింతల భాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌కు ఏ గతి పట్టిందో చూసిన తరువాత ఎవరికి మాత్రం ఆందోళన, ఆత్రం ఉండదు ! ఎన్నికలు, రాజకీయాలు నిలవనీయవు కదా ! తక్షణ ఫలితాలను జనానికి చూపాలి, అందుకు గాను ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే వెంటనే అమల్లోకి వచ్చే తాత్కాలిక ఒప్పందాలు అని చెబుతున్నారు. నిజమే కదా… చేసుకుంటే తప్పేమిటి ? కోడలు మనవడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న సామెత తెలిసిందే.(ఇది ఆడపిల్లల పట్ల వివక్షే అని వేరే చెప్పనవసరం లేదు) మన కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ గారు గత ఏడాది జరిగిన 290బిలియన్‌ డాలర్ల ఎగుమతులను 2022లో 400బి.డాలర్లకు(40వేల కోట్లు) పెంచాలని, 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని చెపుతున్నారు. ప్రస్తుతం కనీసం ఇరవై దేశాలతో ఒప్పందాల సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రేలియా,బ్రిటన్‌, ఐరోపాలోని మరికొన్నింటితో క్రిస్మస్‌లోగా ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చూస్తున్నారు.గతంలో మేకిన్‌, మేడిన్‌ ఇండియా ప్రచారంలో భాగంగా ఇలాంటి రాయితీల ఆశ చూపినా ప్రయోజనం కలగలేదు. తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యం కనుక దేశాలతో ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలమే అని స్వదేశీ జాగరణ మంచ్‌ సహకన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పారు. కరోనా సమయంలో వాణిజ్యలోటు తగ్గింది, ఇప్పుడు తిరిగి గణనీయంగా పెరుగుతోంది.


2019లో కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)ని జనవరి నుంచి అమల్లోకి తెచ్చేందుకు చైనా, ఇతర ఒప్పంద దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 15దేశాలకు గాను పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియన్‌ కూటమిలోని ఆరు, ఇతర దేశాల్లో మూడు సంతకాలు చేసిన తరువాత రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే ఆ దేశాలకు చెందిన 91శాతం వస్తువులు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు లేదా నామమాత్రం అవుతాయి. తాను లేని ఈ ఒప్పందాన్ని అమెరికా ముందుకు పోనిస్తుందా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకవేళ అమలైతే మన దేశానికి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఏ దేశం ముందుకు వస్తే వారితో వెంటనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతుల్లో పురోగతి లేక దిగుమతులు పెరిగి చెల్లింపుల సమస్య తలెత్తితే 2024 ఎన్నికల్లో ఎదురీదక తప్పదు.


మన దేశానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కొత్త కాదు.మన దేశం ఇప్పటి వరకు వివిధ దేశాలతో పెట్టుబడులకు సంబంధించి 86 ఒప్పందాలు చేసుకుంది. వాటిలో పదమూడు మాత్రమే అమల్లో ఉన్నాయి.వివాదాల కారణంగా అనేక ఒప్పందాల నుంచి వైదొలిగాము. అయితే గత అనుభవం ఏమంటే మన ఎగుమతులకు బదులు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అంటే లబ్ది ఇతర దేశాలకు కలిగింది.2001లో మన వాణిజ్యలోటు ఆరుబిలియన్‌ డాలర్లు ఉంటే 2017నాటికి 109బి.డాలర్లకు పెరిగింది. ఒప్పందం చేసుకున్న దేశాలలో ఒక్క శ్రీలంకతో మాత్రమే మనకు మిగులు ఉంది. 2011-17 మధ్య జపాన్‌, దక్షిణ కొరియాతో వాణిజ్యలోటు రెట్టింపైంది. చైనా విషయానికి వస్తే 50శాతం పెరిగింది. దీంతో రెండు అంశాలు ముందుకు వచ్చాయి. దిగుమతి వస్తువులతో వాణిజ్యం చేసే వారు లబ్ది పొందారు. అవే వస్తువులను మన దేశంలో తయారు చేసే సంస్ధలు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో, అంతకు ముందు చేసుకున్న ఒప్పందాల సారమిదే. వాటికి వ్యతిరేకంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఒక సంస్ధనే రంగంలోకి తెచ్చింది. మన్మోహన్‌ సింగ్‌ చివరి సంవత్సరాలలో కొన్ని ఒప్పందాలను సమీక్షించాలన్నంత వరకు ఆలోచన చేశారు. దాని ప్రభావం తరువాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కార్‌ మీద పడి కొత్త ఒప్పందాలేవీ చేసుకోలేదు. ఆర్‌సిఇపిలో చేరకూడదని నిర్ణయించింది.


ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ అది ఆ దేశ వాణిజ్య పోటీతత్వం మీద ఆధారపడి ఉంటుంది. స్విడ్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఐఎండి సంస్ధ ప్రకటించే ప్రపంచ పోటీతత్వ సూచికలో 64దేశాలలో మనం 2021లో 43వ స్ధానంలో ఉండగా చైనా 16 దగ్గర ఉంది. గత ఐదు సంవత్సరాల సూచికలను చూస్తే మనం 45 నుంచి 43కు పెంచుకుంటే చైనా 18 నుంచి 16కు ఎదిగింది. 2017 నుంచి వరుసగా 45,44,43,43,43 సూచికలతో మనం ఉండగా చైనా 18,13,14,20,16తో ఉంది. ప్రస్తుతం మనం ఒప్పందాల కోసం సంప్రదింపులు చేసే దేశాలన్నీ మన కంటే మెరుగైన సూచికలతో ఉన్నందున మనం పోటీ పడగలమా ?

తమ వైఫల్యాలను జనం గ్రహించకముందే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో మోడీ సర్కార్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి దేశమూ రక్షణాత్మక చర్యలను అమలు జరుపుతోంది. మనం ఆర్‌సిపిఇలో చేరకపోవటం కూడా దానిలో భాగమే.గత స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి ముందే చెప్పుకున్నాము. ఆ కారణంగానే గత ఏడు సంవత్సరాలలో వాటి పట్ల మోడీ సర్కార్‌ పెద్దగా మొగ్గుచూపలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) అలాంటి ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయటం కూడా దీని కారణాల్లో ఒకటి. అయితే వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ఇటీవలి కాలంలో వత్తిడి పెరుగుతోంది. అందుకే వారి ఉత్పత్తులకు మార్కెట్లను వెతికేపనిలో భాగంగా ఐరోపా యూనియన్‌, విడివిడిగా వివిధ దేశాలో ఒప్పందాలు చేసుకొనేందుకు పూనుకుంది. అయితే ఆ దేశాలు విధించే షరతులు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న వ్యాపారులు, చివరికి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైతం మింగుడు పడక ముందుకు సాగటం లేదు. మరోవైపు అలాంటి ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్ధలో సవాలు చేసే అవకాశం కూడా ఉంది. అందువలన తాత్కాలిక ఒప్పందాల ముసుగులో పని కానివ్వాలని చూస్తున్నారు.


కరవమంటే కప్పకు కోపం-విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్ధితి ఉంది. అనేక వస్తు దిగుమతులపై రక్షణాత్మక చర్యల్లో భాగంగా పన్నులను పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించకపోతే విదేశాలు ముందుకురావు, తగ్గిస్తే స్ధానిక సంస్ధలు నష్టపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యరాజ్యాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు కుదిరితే మిగతా దేశాలకు కూడా వాటిని వర్తింప చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే వివాదాలే. తాత్కాలిక ఒప్పందాలకు కాలపరిమితిని స్పష్టం చేయాల్సి ఉంటుంది, అది అనిశ్చితికి దారితీస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో నామమాత్ర పన్నులు విధించే చర్యలకు త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. ఏ బహుళజాతి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా పదిహేనుశాతం పన్ను విధించాలన్న ఒప్పందాన్ని అంగీకరించిన 140కి గాను 136 దేశాలు సంతకాలు చేశాయి. దీనివలన దేశాల మధ్య పోటీ నివారణ అవుతుందని భావిస్తున్నారు. అది అమల్లోకి వస్తే ద్విపక్ష ఒప్పందాలు ఏమౌతాయో తెలియదు.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ద్విపక్ష పెట్టుబడి ఒప్పందాల తీరుతెన్నులు చూసినపుడు కొన్ని అంశాలు స్పష్టం అయ్యాయి.ప్రజల,పర్యావరణాన్ని ఫణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సాధనాలుగా పని చేస్తాయి. 1950-70దశకం వరకు నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాల్లోని వలస దేశాల పెట్టుబడుల రక్షణకు వీటిని సాధానాలుగా చేసుకున్నారు. తరువాత స్వేచ్చామార్కెట్‌ పేరుతో వాటిని మరింత ఎక్కువ చేశారు. ఇప్పుడు మూడువేలకు పైగా పెట్టుబడి రక్షణ ఒప్పందాలున్నాయని అంచనా.వీటిని ఆధారం చేసుకొని అనేక కంపెనీలు ప్రభుత్వాలతో వివాదాలకు దిగాయి. పన్నుల తగ్గింపు లేదా అసలు కొన్నింటిపై పన్ను లేకుండా చేస్తారు. ఈక్రమంలో వాణిజ్యపోటీలో నిలిచే పేరుతో కార్మికుల వేతనాల తగ్గింపు, బేరమాడేశక్తి లేకుండా చేసే కార్మిక చట్టాలను వారి మీద రుద్దుతారు.ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు జనాన్ని అప్పగిస్తాయి. ఐరోపా ఫ్రీ ట్రేడ్‌ ఏరియా(ఇఎఫ్‌టిఏ), ఐరోపా యూనియన్‌తో 2007-08లోనే చర్చలకు నాంది పలికాము. వారి కార్లు, మద్యం దిగుమతులకు అంగీకరించాము. మన ధాన్యసేకరణ రంగం, బీమా, బాంకు, ఇతర ఆర్ధిక సేవల రంగంలో ప్రవేశానికి అనుమతించాలన్న వత్తిడి కారణంగా 2013లో అవి నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ధాన్యసేకరణ ప్రయివేటును అనుమతించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సమయంలో ఎలాంటి చర్చకు వీల్లేకుండా ఆదరాబాదరా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆ క్రమంలో భాగమే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది, పదినెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం దానిలో భాగమే.దీన్ని అణచివేసిన తరువాత కార్మిక హక్కులను హరించేందుకు అవసరమైన బిల్లులను సిద్దం చేశారు. అనూహ్యమైన రైతు ఉద్యమం కారణంగా సమయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపు కారణంగా తలెత్తిన లోటును పూడ్చుకొనేందుకు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించేందుకు ప్రజల మీద పన్ను భారాలు మోపుతారు. పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను, సెస్సుల మర్మమిదే. పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా రైతులకు సబ్సిడీలను పెంచకుండా నామమాత్రం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ ఏటా 70-80వేల కోట్ల మధ్యనే ఉంచటమే దానికి నిదర్శనం. ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లు ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదని చెప్పటం కూడా దానిలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వాలకు క్రాస్‌ సబ్సిడీ అవకాశాలను ఎత్తివేస్తారు. ముందుగా వినియోగదారులనుంచి వసూలు చేసి తరువాత వారి ఖాతాలో జమచేసే విధానాన్ని తీసుకురానున్నారు. వంటగ్యాస్‌ మాదిరి ధరలు పెంచుకుంటూపోయి నామమాత్రం చేస్తారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా నియంత్రణ కమిషన్ల పేరుతో చట్టసభల అవకాశాలను పరిమితం చేసి కాలక్షేప కేంద్రాలుగా మార్చివేస్తారు. ఇవి చట్టసభలకు జవాబుదారీగా ఉండవు.


రైతాంగానికి, పరిశ్రమలకు నష్టం అనే వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వత్తిడి, ఆందోళనల కారణంగా, హిందూ మత, మితవాదుల మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్ధల వైఖరి వలన మోడీ సర్కార్‌ ఆర్‌సిఇపిలో చేరలేదు.అది హ్రస్వ దృష్టికి నిదర్శనమని విదేశాంగశాఖ మాజీ అధికారి శ్మామ్‌ సరణ్‌ వంటి వారు విమర్శించారు. మరోవైపు అదే మోడీ సర్కార్‌ ఇతర దేశాలతో స్వేచ్చా, ద్విపక్ష ఒప్పందాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు అదే జాగరణమంచ్‌ దేశం కోసం ఇవి అవసరం అని కొత్త పల్లవి అందుకుంది. తాము బహుళ దేశాలతో కూడిన వాటికి తప్ప ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలం అంటోంది. చిల్లు కాదు తూటు అన్నట్లుగా ఆర్‌సిఇపి ఒప్పందంలోని అంశాలే వీటిలో కూడా ఉంటాయి, నాడు దాన్నెందుకు తప్పన్నారు, నేడు వీటినెందుకు ఒప్పంటున్నారు ? విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు వరుసలు కట్టి వస్తున్నారు. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా యూనియన్‌, గల్ఫ్‌ సహకార సంస్ధ, యుఏయి, బంగ్లాదేశ్‌ తదితర దేశాలు ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు, ఇతర కళారూపాలను ప్రదర్శించేవారు. గ్రామపెద్దలు, పౌరుల నుంచి పెద్ద మొత్తంలో కానుకల కోసం అబ్బో మీ ఊరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ, మీది పెద్ద చేయి అంటూ పొగిడేవారు. ఇప్పుడు మన మార్కెట్‌ మీద కన్నేసిన దేశాలన్నీ అలాంటి పొగడ్తలే కురిపిస్తున్నాయి, మనకు బిస్కెట్లు వేస్తున్నాయి.


స్వదేశీ కంపెనీలకు రక్షణకు కట్టుకున్న మడిని పక్కన పెట్టి మోడీ సర్కార్‌ మంత్రులు, అధికారులు వీటితో మాట్లాడుతున్నారని గ్రహించాలి. వచ్చే ఏడాది మార్చినాటికి బ్రిటన్‌తో, తరువాత ఆస్ట్రేలియాతో తాత్కాలిక ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారు. ఐరోపా,ఆస్ట్రేలియా వంటి దేశాలతో అంటే వాటి పాల ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అప్పుడు పాల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ వద్ద నిరసనలకు దిగకతప్పదు. ఐరోపా యూనియన్నుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌కు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు అవసరం గనుక అది వెంటపడుతోంది. చైనాతో వివాదం వచ్చింది కనుక ఆస్ట్రేలియా తన ఉత్పత్తులను మన దేశంలో విక్రయించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, టెలికాం పరికరాల కోసం చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే బ్రిటన్‌తో ఒప్పందం అవసరమని స్వదేశీ జాగరణ మంచ్‌ నేత అశ్వనీ మహాజన్‌ వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో ఉంది. కనుక తన వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులను మన మార్కెట్లో కుమ్మరించాలని చూస్తోంది. దానికి అంగీకరిస్తే మన రైతాంగం నష్టపోతుంది. తన ఆయుధాలు, చమురుతో పాటు వీటిని కూడా దిగమతులు చేసుకోవాలని మన మీద వత్తిడి తెస్తోంది.

అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలు కుదుర్చుకొనే ద్విపక్ష ఒప్పందాలలో కార్మికులకు సంబంధించి ప్రపంచ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) ఆమోదించిన ఎనిమిది కీలక అంశాల అమలును ఒక షరతుగా పెడతాయి. యజమానులకు ఇష్టమైనపుడు కార్మికులను పెట్టుకొనే, లేనపుడు తొలగించే, అసలు సంఘాలు పెట్టుకోవటాన్నే అసాధ్యం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చేందుకు పూనుకన్న మోడీ సర్కార్‌ మరి వాటిని ఎలా అంగీకరిస్తుంది. అంగీకరించి అమలు జరపకపోతే కార్మికులు ఊరుకుంటారా ? ఈ మార్పులను చివరికి సంఘపరివార్‌ సంస్ధ బిఎంఎస్‌ కూడా అంగీకరించటం లేదు. నిజంగా దేశానికి తద్వారా మన జనాలకు మేలు కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటానికి చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం వంటి పరిణామాలను సాకుగా చూపటం అవసరమా అనే ప్రశ్నలు అడగకూడదు. అపర దేశభక్తులు చెప్పింది వినాలి తప్ప బుర్రతో ఆలోచించకూడదు. మోడీ ప్రారంభించిన ఒప్పందాల తీరుతెన్నులు గతంలో మన్మోహన్‌ సింగ్‌కు తెచ్చిన తలనొప్పులనే పునరావృతచేస్తాయా ? మోడీ దూకుడు అలానే ఉంది మరి.

కమ్యూనిస్టు పెడధోరణులు, వక్రీకరణలపై ఆలోచనాత్మక విశ్లేషణ !

Tags

, , ,

మైకోల్‌ డేవిడ్‌ లించ్‌ అమెరికా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, యువ కమ్యూనిస్టు లీగ్‌ ప్రధాన కార్యదర్శి. 2012 సెప్టెంబరు పదవ తేదీన అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో రాసిన ఒక విశ్లేషణ ప్రపంచంలోని వామపక్ష, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఉపయోగపడేదిగా ఉందని భావించి దాని అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాను. అమెరికా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తేడాలు ఉన్నాయి. అయితే పార్టీలలో, కొన్ని గ్రూపులు, వ్యక్తులలో ఉన్న కొన్ని వక్రీకరణలు, పెడధోరణులు, కొన్ని సమస్యలపై వైఖరులను సవరించుకొనేందుకు తోడ్పడవచ్చు. ఉదాహరణకు అగ్రవర్ణాలు లేదా ఆధిపత్య కులాలకు చెందిన వారు విప్లవోద్యమాలకు నాయకులుగా ఉండకూడదు, వారిని నమ్మలేము అని చెప్పేవారు, ఒక కులం వారు మొత్తం దొంగలే అని సూత్రీకరించిన ఒక ప్రొఫెసర్‌ భావజాలానికి మూలం ఏమిటి ? దళితులు మాత్రమే దళితులను విముక్తి చేసుకోగలరు వంటి సూత్రీకరణల నేపధ్యం వంటి కొన్ని అంశాలను సరైన కోణంలో చూసేందుకు ఈ విశ్లేషణ దోహదం చేయవచ్చు. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నదానిలో విశ్వాసం ఉన్నవారందరూ చదవాల్సిన అంశమిది. ” సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం ” అనే శీర్షికతో రాసిన విశ్లేషణ సమీక్షకు వేరే శీర్షికను నేను జత చేశాను. దాని పూర్తి పాఠం ఇలా ఉంది. ఆంగ్ల మూలపు లింక్‌ను కూడా కింద జతచేశాను.


సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం !
మైకోల్‌ డేవిడ్‌ లించ్‌
విద్యార్ధులు,యువతను సంఘటిత పరచటం మొత్తగా ” సమయాన్ని వృధా ” చేయటమేనబ్బా ! వామపక్ష వాదులు నిర్వహిస్తున్న, నేను పని చేస్తున్న సమూహాలు కొన్నింటిలో ఇటీవల నేను వింటున్న మాట ఇది. ఇలా చెప్పటం సరైనదేనా అని నేను చర్చకు పెట్టినపుడు తొలుత ముందు చెప్పిన వైఖరిని తీసుకున్నవారు ” సరే యువ కార్మికులను సంఘటిత పరచటం గురించి కేంద్రీకరిద్దాం. వారిని మార్చగలము, విద్యార్ధుల కంటే మరింత విశ్వసనీయంగా మొగ్గుతారు ” అని తమ వైఖరిని మార్చుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే నేను ఒకప్పుడు కాలేజీ విద్యార్ధిని. మూడు ఉద్యోగాలు చేశాను, ఆసియన్‌ రెస్టారెంట్లలో రెండు, చిల్లర దుకాణంలో ఒకటి.చదువుకొనేందుకు నాకు సమయం ఉండేది కాదు, అయితే ఏదో విధంగా గ్రాడ్యుయేట్‌ కాలేజీలో కూడా అంగీకరించేందుకు అవసరమైన మంచి గ్రేడ్‌లు తెచ్చుకున్నాను. అయితే నేను ఎన్నడూ ఒక కార్మికుడిని అనుకోలేదు. మీరు విద్యార్ధా లేక కార్మికుడా అని అప్పుడు కొందరు నన్ను అడిగారు. తర్కబద్దమైన, ప్రత్యక్ష సమాధానంగా రెండూ అని ఉండేది. దాన్ని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మరింత స్పష్టమైన నా సమాధానంగా నేను పూర్తి కాలం పని చేస్తాను, పూర్తి కాలం చదువు కుంటాను అని చెప్పివుండే వాడిని. కరోనా మహమ్మారి మధ్యలో 2020డిసెంబరులో జరిగిన ఒక సర్వే ప్రకారం 70శాతం మంది కాలేజీ విద్యార్ధులు కూడా పని చేశారు. కనుక వారు చదువుకుంటూ పని చేస్తున్నందున విద్యార్ధులా కార్మికులా అన్న తేడాను చూడాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లో పని చేయని వారు డిగ్రీ తరువాత కార్మికశక్తిలో చేరతారు. నలభై ఒక్కశాతం కాలేజీ విద్యార్ధులు వారు కేంద్రీకరించిన డిగ్రీ- చేసిన పనికి సంబంధం లేదని తేలింది. అంతిమంగా వారు చదివిన డిగ్రీకి పని చేసే రంగానికి సంబంధం ఉండదు. కాబట్టి విద్యార్దులను సంఘటిత పరచటం సాధ్యం కాదు అని కొట్టిపారవేయటం మన కార్మికవర్గంలో గణనీయ భాగాన్ని విస్మరించటమే.

ఇప్పుడు మరొక వాదన గురించి చూద్దాం.” విద్యార్ధులు అంత విశ్వసనీయులు కాదబ్బా ”. కాలేజీ డిగ్రీలేని కార్మికుల గురించి కూడా అదే మాదిరి చెప్పవచ్చు.జనం జనమే. కమ్యూనిస్టు పార్టీలో, కమ్యూనిస్టు యువజన సంఘంలో గానీ కొందరు సభ్యులు వారు ఇరవైల్లో ఉన్నా అరవైల్లో ఉన్నా సమావేశాలకు రారబ్బా అని తరచూ చెబుతుంటారు. అది నిజం, ఒక ఇరవై ఏండ్ల వయస్కులకు కుటుంబం , స్కూలు, పని వంటి బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. దీని అర్ధం 60ఏండ్ల కామ్రేడ్లకు తమ పిల్లలు, మనవలు, పని వంటి బాధ్యతలు లేవని, నిర్వహించటం లేదని కాదు. మిలీనియల్స్‌లో అరవైశాతం మంది(24-39 ఏండ్ల వారు) పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రకమైన సోషలిజంతో ఏకీభవిస్తున్నారు. ఈ తరం యువజన తరగతి నుంచి బయట పడటం ప్రారంభమైంది. వారిని మనం విస్మరించకూడదు, వారి మనోభావాలను మరింత పటిష్టపరచాలి. మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. పౌరహక్కుల ప్రదర్శనలు, బస్‌ బహిష్కరణలు, అహింసాత్మక బైఠాయింపులకు దారి తీసింది విద్యార్ధి ఉద్యమాలే. పచ్చి మితవాది ట్రంప్‌ పాలనలో కరోనా మహమ్మారి సమయంలో నల్లజాతీయుల సమస్యల ఆందోళనలు,వలస-కస్టమ్స్‌ నిబంధనల అమలు రద్దు ఉద్యమాలకు నాయకత్వం వహించింది యువతరమే అన్నది మరచిపోకూడదు. విప్లవ లక్ష్యాల సాధనకు గాను ప్రజాస్వామిక పోరాటాలు, కార్మిక పోరాటాలకు అవసరమైన భవిష్యత్‌ తరాలను సిద్దం చేయాలని లెనిన్‌ ఇచ్చిన పిలుపు ఇలాంటి యువతరం గురించే.( దీనిలో భాగంగా ఇటీవలనే యువకుల కోసం పార్టీ మార్క్సిస్టు తరగతులను విజయవంతంగా నిర్వహించింది).

కరోనా సమయంలో నిరుద్యోగులు, దారిద్య్రంలో కూరుకుపోయిన వారి కోసం పరస్పర సహాయ కార్యక్రమాలు, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన కమ్యూనిస్టు యువత పార్టీకి ఎలా దారిచూపిందో నేను గుర్తు చేస్తున్నాను. ఈ యువ కమ్యూనిస్టులు క్యూబాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. నల్లజాతీయుల జీవన సమస్యల ప్రదర్శనల నిర్వహణకు వీరిని ఆహ్వానించారు. ఈ యువకార్యకర్తలలో ఎక్కువ మంది విద్యార్ధులు, మిగిలిన వారిలో కాలేజీ డిగ్రీలు లేని, నిరుద్యోగ లేదా ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే మార్పు కోరుకుంటున్న క్రమపు ఉత్పత్తే ఈ యువ కమ్యూనిస్టులు, అదే వీరిని కమ్యూనిస్టు పార్టీ , కమ్యూనిస్టు యువజన సంఘం వైపు నడిపించింది. వారు ఉద్యమంలోకి కాలేజీలు, పుస్తక క్లబ్‌లు, లేదా ఆన్‌లైన్‌లో చేరటం వంటి వాటి ద్వారా వచ్చారు, సమిష్టి విప్లవ క్రమంలో పోషించే తమ పాత్రను తెలుసుకుంటూ యువ కమ్యూనిస్టులు భాగస్వాములవుతున్నారు.మార్పు కోరుకొనే క్రమాలన్నీ భిన్నంగా ఉండవచ్చు. ఒక సమావేశానికి లేదా ఒక కార్యక్రమానికి రాలేదనో మరోకారణంతోనో యువ కార్యకర్తలను మనం వదలిపెట్ట కూడదు. సామాజిక మాధ్యమం, కరపత్రాలు, చిత్రాలు గీయటం వంటి ఏదో ఒక కార్యక్రమంలో వారు ఒక పాత్ర పోషించే విధంగా చూడాలి.


2020దశకంలో మార్పుకోరుకొనే క్రమంలో అనేక మంది యువకులు స్వీయ అధ్యయనం, ఆన్‌లైన్‌లో ఇతర వామపక్ష యువజన బృందాలతో చర్చల ద్వారా వామపక్షం వైపు వస్తున్నారు, ప్రత్యేకించి కరోనా సమయంలో క్వారంటైన్‌ లేదా ఇండ్లలోనే ఉన్నపుడు ఇది జరిగింది. ఈ మార్పు క్రమాన్ని అమెరికా కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిస్టు యువజన సంఘం ఆహ్వానిస్తున్నది. ఇది గందరగోళపరుస్తుందని కూడా మాకు అవగాహన ఉంది. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఒక బహుళ ప్రచారం జరుగుతోంది. అదేమంటే ” తెల్లజాతి కార్మికులు విప్లవకారులు కాలేరు. ఎందుకంటే ప్రపంచ పేద దేశాలు, రంగుజాతి కార్మికుల దోపిడీ మీద వారు ఆధారపడతారు ”. నా అభిప్రాయం ఏమంటే ఇది తృతీయ ప్రపంచ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన శ్వేతజాతి మావోయిస్టుల ప్రచారం.” మైథాలజీ ఆఫ్‌ ద వైట్‌ ప్రోలటేరియట్‌ ” అనే జె సాకాయి గ్రంధం చదవిన తరువాత ముందుకు తెచ్చారు. ఇది మార్క్సిస్టు వ్యతిరేకమైనదే కాదు, రంగు, జాతితో నిమిత్తం లేకుండా అన్ని ఖండాల కార్మికులు ఐక్యం కావాలని పిలుపు ఇచ్చి స్వయంగా ప్రయత్నించిన తెల్లవారైన ఐరోపాకు చెందిన మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌కు వ్యతిరేకమైనది. రాజకీయ మార్పు విషయానికి వస్తే ఎలాంటి కార్యాచరణకు పూనుకోకుండా తెలివిగా తప్పించుకొనే సాకును ఇది అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీల వంటి సంస్ధలు కార్మికులనందరినీ ఐక్యం చేయాలని చూస్తుంటే ఈ పుస్తకం చదివిన తరువాత నలుపు లేదా గోధుమవర్ణం విద్యార్ధి గానీ పోరాటంలో పాల్గొనేందుకు విముఖత చూపుతాడు. సాకీ ముందుకు తెచ్చిన నిరాశావాదం వారిని తాము మైనారిటీలమని, అమెరికాలో తెల్లజాతీయులు మెజారిటీ కనుక సోషలిజానికి అవకాశం లేదనే నిర్దారణకు వచ్చేట్లు చేస్తుంది.


వలసలుగా చేసుకోవటాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఓడించాలని మార్క్సిస్టులు అంగీకరిస్తారు. అదే సమయంలో ఒక జాతి వారు విప్లవకారులు కాదని లేదా విప్లవ వ్యతిరేకులని మనం వేరు చేయకూడదు.శ్వేతజాతీయులను విప్లవ వ్యతిరేకులని, కార్మికవర్గం కాదనే స్వభావ చిత్రీకరణ చేయటం మధ్య తరగతి తీవ్రవాదంలో భాగం. దీనికి విప్లకారులు, కార్మికులు, మార్క్సిస్టు-లెనినిస్టు సిద్దాంతానికి సంబంధం లేదు. ఇప్పటికీ మీరు అంగీకరించటం లేదా ? రష్యన్లు స్లావిక్‌ జాతికి చెందిన వారు కనుక, స్లావ్‌లు చారిత్రకంగా ఆర్మీనియా, అజరబైజాన్‌, జార్జియన్లను, కాకసస్‌ పర్వత ప్రాంతాలను రష్యన్‌ సామ్రాజ్యంలో వలసవారిగా చేసుకున్నారు గనుక అక్టోబరు విప్లవాన్ని రష్యన్లు నిర్వహించకూడదని, లేదా దానికి విరుద్దంగా ఆర్మీనియన్లు, అజర్‌బైజానియన్లు,జార్జియన్లు మాత్రమే నడపగలరు అని లెనిన్‌ చెప్పి ఉంటే ఏమిజరిగేదో ఊహించుకోండి.ఈ మన:ప్రవృత్తిని బోల్షివిక్‌లు తలకు ఎక్కించుకొని ఉంటే ఏం జరిగేదో ఊహించుకోండి. ఎంతో దూరం అవసరం లేదు, నేను కచ్చితంగా చెప్పగలను. కార్మికవర్గ ఐక్యతను నిరోధించే ఏ ” విప్లవ ” వైఖరి అయినా అది ఏ విధంగానూ విప్లవకరమైనది కాదు.


ఇంటర్నెట్‌ యువ వామపక్ష వాదుల మరొక తిరోగామి వైఖరి గురించి చూద్దాం. అమెరికా కార్మికవర్గాన్ని సంఘటిత పరచేందుకు, మార్పును కోరేవారిగా మార్చేందుకు, ఐక్యపరిచేందుకు వివిధ ప్రజాస్వామిక పోరాటల్లో భాగస్వాములను చేయకుండా తక్షణ హింసాత్మక ( లేదా అంత తక్షణంగాకపోవచ్చు) మద్దతు ఇచ్చేవైపు మొగ్గుతున్నది.స్వయం ప్రకటిత యువ మావోయిస్టులు, ట్రాట్‌స్కీయిస్టులు, అరాచకవాదులు, చివరికి మార్క్సిస్టు-లెనినిస్టులమని స్వయంగా చెప్పుకుంటున్నవారు గానీ ఇలాంటి వైఖరిని తీసుకోవటాన్ని నేను గమనించాను. జనాలకు దూరంగా ఉండటం ఈ బృందాలు, వ్యక్తుల ఉమ్మడి లక్షణం, అంటే వాస్తవానికి దూరంగా ఉండటం. విప్లవ వాగాడంబరానికి ఆకర్షితులవుతున్న యువ విప్లవకారులు ఎలా ఉన్నారు? మన దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలు, సంస్కృతి, సమాజం, భౌతిక పరిస్ధితుల పట్ల వారికి అవగాహన లేదు. తరువాత ఇంకొకటేమిటి, రోజాలక్సెంబర్గ్‌ చెప్పిన ” సంస్కరణ లేదా విప్లవం ” అవగాహనతో ప్రారంభమైతే ” విప్లవం లేదా మరింకేమీ లేదు” అనేదానికి దారి తీస్తుంది. ఎలాంటి కార్యాచరణ లేకుండా సాకులు చెప్పటానికి ఈ వైఖరి కూడా సిద్దంగా ఉంటుంది.” మన కార్మికవర్గం ఇంకా విప్లవకరంగా మారలేదు కనుక నేను కార్మికవర్గంతో చేరాల్సిన అవసరం లేదు లేదా మన కార్మికవర్గం సాయుధం అయ్యేంత వరకు మనమేమీ చేయలేము ” అనేట్లు చేస్తుంది. కానీ వాస్తవం ఏమంటే కార్మికవర్గం అంతర్యుద్దాన్ని కోరుకోవటం లేదు, లేదా మనం వారి మీద దాన్ని రుద్దుతున్నట్లు నటించాల్సిన పనిలేదు. మనం కార్మికులు, విద్యార్ధులను వారున్న చోట కలుస్తున్నాం తప్ప ఉండాలని మనం కోరుకున్న చోట కాదు. కాబట్టి రైతులు లేని ఒక దేశంలో హింసాత్మక రైతుల తిరుగుబాటు( మావోయిస్టులు వాంఛిస్తున్న) కోసం వేచి చూస్తూ మనం కూర్చునే బదులు చేయాల్సిందేమిటి ? స్ధానిక విద్యార్ధి సంఘాలు, కార్మికయూనియన్లు, కమ్యూనిస్టు పార్టీ క్లబ్‌ లేదా యువ కమ్యూనిస్టు సంఘం ద్వారా యువతను వర్గపోరాటాలకు ప్రోత్సహించుదాం. జనకట్టుతో కలసి పని చేసేందుకు నిరాకరించే కమ్యూనిస్టు ఒక కమ్యూనిస్టు కాదు.


ప్రజాస్వామిక పోరాటాలు అనేక రూపాల్లో ఉంటాయి. పౌరహక్కుల కోసం, యూనియన్ల కోసం, ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా, ఇలా అనేకం. సోషలిజం కోసం జరిపే మొత్తం వర్గపోరాటాలకు ఈ పోరాటాలు తప్పనిసరి.ఈ పోరాటాలు మహిళల పౌరహక్కులు, ఎల్‌బిజిటిక్యు జనాలు, ఆఫ్రికన్‌ అమెరికన్స్‌, ఇతర అనేక అణచివేతకు గురైన సమూహాలకు సంబంధించి కావచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తృత దోపిడీలో ఈ బృందాలన్నీ ప్రత్యేక అణచివేతకు గురవుతున్నందున ఇవి తప్పనిసరి. ఉదాహరణకు ఒక బిలియనీరైన మహిళా సిఇఓ వివక్షకు లేదా తరచుగా కార్మికవర్గ మహిళల మాదిరి అదే విధమైన అణచివేతలో భాగంగా లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే మహిళా సమానత్వ సమస్య వర్గాలకు అతీతమైనది. జాత్యంహంకారానికి కూడా ఇదే వర్తిస్తుంది. నల్లజాతీయులైన కార్మికుల మాదిరే నల్లజాతీయులైన బాస్కెట్‌బాల్‌,ఫుట్‌బాల్‌ క్రీడాకారులు రోజువారీ జాతిపరమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. క్యూబా ఉదాహరణ చూపుతున్నదేమిటి ? విప్లవం తరువాత కార్మికవర్గం అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ జాత్యంహంకారం అంతరించలేదు. వర్గాలకు అతీతంగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం జరుగుతుంది గనుక అది ప్రజాస్వామిక పోరాటమే. ఎల్‌బిజిటిక్యుల సమానత్వం కూడా ప్రజాస్వామ్య పోరాటాల మరో రంగమే. సోషలిస్టు దేశాలలో కార్మికులందరికీ స్వేచ్చకు హామీ ఉన్నప్పటికీ ఎల్‌బిజిటిక్యు కామ్రేడ్లు, కార్మికుల మాదిరి వారి హక్కుల విషయంలో ఎల్లవేళలా సానుకూల వైఖరితో ఉన్న రికార్డు ఉందని మనమూ మన ఉద్యమం నటిస్తే అది కపటత్వమే అవుతుంది. ఇది కూడా మనం అధిగమించాల్సిన అంశమే.

పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోసేంత వరకు ఆ తరగతికి చెందిన వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. కనుక పెట్టుబడిదారీ విధానంలో ఈ సమస్యలపై పోరాటాలు ప్రారంభమౌతూనే ఉంటాయి. అది పికెటింగ్‌ కేంద్రం, పోలింగ్‌బూత్‌, నిరసన లేదా ధర్నా అడ్డాలు ఎక్కడైనా మనం ఈ ప్రజాస్వామిక పోరాటాల్లో పాల్గొంటాము.1960-70దశకాల్లో సాగిన పౌరహక్కుల ప్రజా ఉద్యమం గొప్ప విజయాలు సాధించింది. అది ఓటింగ్‌ హక్కుల కోసం లేదా ఏంజలా డేవిస్‌(కమ్యూనిస్టు నాయకురాలు) విడుదల కోసం కావచ్చు. ప్రజాస్వామిక ఉద్యమాలు విప్లవ వ్యతిరేకమైనవని విసిగిపోయిన యువకులు తమను తాము దూరంగా పెట్టుకుంటే ఫలితం లేదు. చివరికి మితవాద తిరోగామి శక్తులు వామపక్ష విప్లవ పదజాలాన్ని గుప్పిస్తున్నపుడూ మనం చూశాము ఇటీవల జనవరి ఆరవతేదీన అమెరికా రాజధాని( పార్లమెంట్‌)పై జరిగిన దాడిని ” కార్మికవర్గ – విప్లవాత్మకమైనదని ” వర్ణించినపుడు కూడా దూరంగా ఉండకూడదు. నల్లజాతీయులు, గోధుమవర్ణం వారు, మహిళలు, ఎల్‌బిజిటి వారి సమస్యలపై ఆందోళనలను విస్మరించినపుడు సమానత్వం కోసం జరిపే పోరాటాలను ప్రారంభించినపుడు కార్మికవర్గంలోని యావత్‌ తరగతులను విస్మరించినట్లే, ఆ తప్పిదం చేయవద్దు.

2021లో యువకులు, విద్యార్ధుల ఉద్యమాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో వాతావరణ మార్పు ఒకటి. తమ తలిదండ్రులు, తాతల కంటే పర్యావరణం గురించి మరింతగా పట్టించుకోవాలి. ఎందుకంటే రానున్న ఐదు పది సంవత్సరాలలో భూ తలాన్ని రక్షించు కొనేందుకు కొట్టొచ్చినట్లుగా ఏదో ఒకటి చేయకపోతే మనం వృద్దాప్య వయస్సు వరకు చేరుకోలేము. ఈ కారణంగానే గ్రీన్‌ న్యూ డీల్‌ కోసం యువత ఆందోళనకు దిగింది, అది వాషింగ్ట్‌న్‌, డిసి, న్యూయార్క్‌, సియాటిల్‌ నగరాల్లో పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ ప్రదర్శనలకు దారితీసింది. పార్లమెంటులో పురోగామి సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్‌ కుమార్తె ఇస్రా హిరిసీ ఈ ప్రదర్శనలను నిర్వహించటంలో వహించిన పాత్ర కారణంగా, ఆన్‌లైన్‌లో కమ్యూనిస్టు అని చెప్పుకున్నందుకు గాను మితవాద మీడియా దారుణంగా ఆమె మీద దాడి చేసింది. అస్తిత్వ ఉద్యమాలను(ప్రజాస్వామిక పోరాటాలు) కొట్టిపారవేయకూడదనేందుకు ఇదొక పెద్ద ఉదాహరణ. హిరిసి మీద జరిగిన దానిని నల్లజాతీయులు, ముస్లింలు, యువత, కమ్యూనిజం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మీద మొత్తంగా జరిగిన దాడిగా చూడాలి. భూగ్రహమే లేనట్లయితే వర్గపోరాటం ఎక్కడ చేస్తాము, అందువలన వీటన్నింటినీ సిద్దాంతంగా అధ్యయనం చేసేందుకు మాత్రమే సమయాన్ని వృధా చేయరాదు, ఆచరణలో పెట్టాలి.

ఈ ఏడాది యువత పాల్గొన్న మరొక ముఖ్యమైన కార్యరంగం ఉంది, చదువుకొనేందుకు తీసుకున్న రుణాల రద్దు సమస్య.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో రుణాల రద్దు గురించి జో బైడెన్‌ చెప్పారు. పాఠశాల, కాలేజీ ఖర్చులు, బీమా చెల్లింపులు, ఆహారం, అద్దెలు, ఇతర చెల్లింపుల కోసం విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు. 2021 ఏప్రిల్‌ పీపుల్స్‌ వరల్డ్‌ (కమ్యూనిస్టు పార్టీ పత్రిక) వార్త ప్రకారం ” ఒక్కొక్కరికి జో బైడెన్‌ సర్కార్‌ గనుక 50వేల డాలర్ల రుణాన్ని రద్దు చేస్తే 84శాతం మంది పూర్తిగా రుణవిముక్తులౌతారు. మీడియా, రుణ విముక్తిని విమర్శించే వారి కేంద్రీకరణ అంతా అధిక సంపాదనా పరులకు సాయం చేయటం మీదనే కేంద్రీకృతమైంది. రుణం తీసుకున్న వారిలో నలభైశాతం మంది డిప్లొమాలు తీసుకోలేకపోయారు, తరచుగా కనీసవేతన ఉద్యోగాలలోనే ఉన్నారు.”. 2021 ఆగస్టులో ఒక్క కలం పోటుతో బైడెన్‌ 9.5బిలియన్‌ డాలర్ల విద్యార్ధి రుణాలను రద్దు చేయక ముందు పేర్కొన్న అంశమిది. ఉన్న అప్పులతో పోలిస్తే ఇది చిన్న మొత్తం, అనేక మందికి పెద్ద ఉపశమనం కలగకపోయినా కొంత మందికి విజయమే అనటంలో సందేహం లేదు. విద్యార్ధుల రుణాలను రద్దు చేసేందుకు బైడెన్‌కు అధికారం లేదు అని అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ అబద్దం చెప్పిన నెల రోజుల తరువాత బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువలన పరిమితం కాకుండా పూర్తిగా రుణాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగాల్సిందే. ఎందుకోసమో తెలియని యుద్దాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు దశాబ్దాలు సాగించేందుకు ఖర్చు చేసిన మనం మన యువత వారి కాళ్ల మీద నిలిచేందుకు తోడ్పడలేమా ! యువ కార్మికులు, విద్యార్దులను మనం విస్మరించలేము. వారిని ఉద్యమాలు, మన సంఘటిత శ్రేణుల్లోకి తీసుకురావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు, విస్తృత పరచేందుకు మొత్తం మీద జరిగే పోరాటంలో యువజన సమస్య కీలకమైనది. అది సోషలిస్టు సమాజానికి పునాదులు వేస్తుంది. విప్లవకారులైన మన యువత లేకుండా సోషలిస్టు అమెరికాకు భవిష్యత్‌ ఉండదు.


అనువాదం, వ్యాఖ్య : ఎం కోటేశ్వరరావు. ఆంగ్లంలో మూల ఆర్టికల్‌ను చదవాలని కోరుకొనే వారికి దాని లింక్‌ను దిగువ ఇస్తున్నాను.

లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై అయ్యో పాపం అని కూడా నరేంద్ర మోడీ అనలేరా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.

సామాన్యులకు గోడదెబ్బ-చెంపదెబ్బ : పెరుగుతున్న చమురు – తరుగుతున్న రూపాయి !

Tags

, ,

ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్‌ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్‌ శాచస్‌ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.


అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్‌+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్‌+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.


ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్‌ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురుతో విద్యుత్‌ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్‌ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్‌ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.
రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్‌, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్‌ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.

రష్యా గ్యాస్‌ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.


ఐరోపాలో ఒక మెగావాట్‌ అవర్‌ విద్యుత్‌(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.


మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ విఫలమైంది. ఇథనాల్‌ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.


గతంలో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్‌ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్‌ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్‌ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్‌ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.

మరోవైపున ఇరాన్‌-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్‌ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్‌తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్‌ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్‌ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.

చమురు, ఆహార కొరత బ్రిటన్‌ స్వయం కృతం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

వేలాది పందులను వధిస్తున్నారా ! ఇలాంటివి మామూలే కదా ! పెంపుడు జంతువులు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాల్లో లేని చమురు, వస్తు కొరత బ్రిటన్‌లోనే ఎందుకు తలెత్తింది ? అది గిరాకీని బట్టి ఉంటుంది.డైనోసార్‌ లేస్తోంది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు విలేకర్ల నుంచి ఎదురైన ప్రశ్నలు, ఆ పెద్ద మనిషి స్పందించిన తీరు ఇది. చైనాలో తలెత్తిన విద్యుత్‌ కొరత, ఎవర్‌గ్రాండే అనే రియెలెస్టేట్‌ కంపెనీ చెల్లింపుల సమస్య కారణంగా కొన్ని రేటింగ్‌ సంస్ధలు చైనా ఆర్ధిక రంగం గురించి తమ రేటింగ్స్‌ను సవరించాయి. దాంతో ఇంకేముంది చైనాలో సంక్షోభం తలెత్తిందని కొందరు తెగ సంతోషపడిపోతున్నారు. ఒక వేళ అదే జరిగినా చైనాతో పాటు ప్రపంచం కూడా నష్టపోతుందనే సృహ వారిలో ఉన్నట్లు కనపడదు. అలాంటి దుష్ట ఆలోచనలు పెట్టుకున్నవారు ఆశాభంగం చెందకతప్పదు. ఇదే సమయంలో ఐరోపా ధనిక దేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో చమురు సరఫరాకు అవసరమైన వాహనాలను నడిపే డ్రైవర్లు లేక అక్కడ తీవ్ర సమస్య తలెత్తింది. దీని గురించి రేటింగ్‌ సంస్ధలు స్పందించలేదు.ఎనిమిది సంవత్సరాల నాటి గరిష్ట రికార్డును చమురు ధరలు అధికమించాయి. పెరిగిన చమురు ధరలతో పాటు సిబ్బంది వేతనాల పెంపుదలను కూడా వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. బ్రెంట్‌ రకం చమురు ధర 82-83 డాలర్ల మధ్య కదలాడుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022లో అది 180 డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు వెల్లడయ్యాయి. చమురు టాంకర్లను నడిపేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. విదేశాల నుంచి పదివేల మంది డ్రైవర్లకు వీసాలు ఇస్తామని ప్రకటిస్తే మంగళవారం నాటికి కేవలం 127 మంది మాత్రమే ముందుకు వచ్చారని వార్తలు. తన ప్రభుత్వ విధానాలను బ్రిటన్‌ ప్రధాని పూర్తిగా సమర్ధించుకున్నారు. అసలు జరుగుతోందేమిటి ?


బ్రిటన్‌లో చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని బంకుల్లోకి చేర్చేందుకు అవసరమైన టాంకర్లను నడిపే డ్రైవర్ల కొరత కారణంగా సరఫరాలో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో డ్రైవర్లు ఉన్నా చమురు లేక ఆసుపత్రులు, ఆహార, వస్తు దుకాణాల వంటి రవాణా సంబంధిత రంగాలన్నీ ప్రభావితం అయ్యాయి. అనేక దుకాణాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలిక సమస్యగానే భావిస్తున్నప్పటికీ అనేక మంది నమ్మటం లేదు. ఎంతకాలం ఉంటుందో తెలియని స్ధితి. దేశ ప్రధానే నిర్దిష్టంగా చెప్పలేకపోయాడు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం అని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయేందుకు(బ్రెగ్జిట్‌) నిర్ణయించుకున్న సమయంలో పర్యవసానాల మంచి చెడ్డలను పాలకులు బేరీజు వేయలేదనే అభిప్రాయం వెల్లడి అవుతోంది.
అమెరికా, జపాన్‌ ఆర్ధిక పోటీ నుంచి తట్టుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా యూనియన్‌ రంగంలోకి వచ్చింది. దాని నిబంధనల ప్రకారం సభ్య దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి అనుమతులు, అంగీకారాలు లేకుండా ఏ సభ్య దేశంలో అయినా పని చేసేందుకు, నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు వీలు కలిగింది. ఇది ధనిక దేశాల్లోని వాణిజ్య, పారిశ్రామిక సంస్దలకు చౌకగా శ్రమశక్తిని అందించే వ్యవస్ధగానూ, పేద దేశాలకు నిరుద్యోగ సమస్య తీరేందుకు, ఆదాయవనరుగా ఉపయోగ పడింది. 2020 జనవరి 31 నుంచి బ్రిటన్‌ ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోయింది. దీంతో అక్కడి సంస్ధలకు అవసరమైన చౌకగా లభించే శ్రామికుల కొరత ప్రారంభమైంది. ఇప్పుడు వేతనాలు పెంచినా శ్రమజీవులు దొరకటం లేదు.


వర్తమాన స్ధితి గురించి మీడియాలో 1978-79 నాటి ఆర్ధిక దిగజారుడు, కార్మిక ఆందోళనల మాదిరి తయారు కావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్టాగ్‌ఫ్లేషన్‌ (ఆర్ధిక వృద్ధి నిలిచిపోవటం-ధరల పెరుగుదల వలన ద్రవ్యోల్బణ పెరుగుదల)కు గురికావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి చమురు బంకులు, అనేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో తమకంటే మెరుగైన వేతనాల కారణంగా గతంలో అనేక పేద దేశాల కార్మికులు వలసలు వచ్చారు. వలస విధానంలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వలసలను అనుమతించారు. పది సంవత్సరాల వ్యవధిలో నాలుగుశాతం వలస కార్మికులు పెరిగారు. దీంతో స్ధానికులకు అవకాశాలు తగ్గి అసంతృప్తి తలెత్తింది. తమ దుస్ధితికి ఐరోపాయూనియన్‌లో ఉండటమే కారణమని భావించి దానికి వ్యతిరేకత తెలిపారు. తమ పలుకుబడితో ఇతర దేశాలతో ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోవటం లాభదాయకంగా ఉంటుందని కార్పొరేట్‌లు కూడా విడిపోవటానికి మద్దతు ఇచ్చాయి. స్ధానికుల అసంతృప్తిని తగ్గించేందుకు ఇతర దేశాల నుంచి నైపుణ్యం తక్కువగా ఉండే కార్మికులను అనుమతించకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. అదే ఇప్పుడు వ్యవసాయం, కోళ్ల, పశుపెంపకం వంటి రంగాలలో పని చేసే కార్మికులు, డ్రైవర్ల కొరతకు దారి తీసింది. ఇతర ఉద్యోగాలతో పోల్చితే డ్రైవర్లకు ఇచ్చే వేతనాలు తక్కువ, పనిభారం ఎక్కువ, తగినంత గౌరవం కూడా లేకపోవటంతో స్ధానికులు వాటి పట్ల మొగ్గుచూపటం లేదు. బయటివారికి అవకాశం లేదు.

ఈ ఏడాది జూన్‌-ఆగస్టు మాసాల మధ్య పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంక సంస్ధ వెల్లడించింది. సంస్ధ వివరాల ప్రకారం గతేడాది మార్చి నెలాఖరుకు ఉన్న సంఖ్యతో పోల్చితే భారీ వాహనాలను నడిపే ఐరోపా యూనియన్‌ డ్రైవర్ల సంఖ్య పదహారువేలు తక్కువగా ఉంది. బ్రిటన్‌ రవాణా అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం మొత్తం లక్ష మంది కార్మికుల కొరత ఉంటే వారిలో ఇరవైవేల మంది విదేశీయులని వెల్లడించారు. డ్రైవర్లు లేక కొన్ని వస్తువుల కొరత ఏర్పడి రెస్టారెంట్‌లు, పబ్‌లు, సూపర్‌మార్కెట్లను అనేక చోట్ల మూసివేశారు.కొన్ని చోట్ల సిబ్బంది కారత కూడా తోడైంది. కరోనా సమయంలో స్వదేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు తిరిగి రాకపోవటం కూడా పరిస్ధితిని దిగజార్చింది. కరోనా కారణంగా ప్రభుత్వం వారానికి 20 పౌండ్లు (రు.2020) ఇవ్వటం కూడా కార్మికుల కొరతకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. పదిన్నరవేల మంది ట్రక్కు డ్రైవర్లు, ఐదువేల మంది కోళ్ల పరిశ్రమలో పనిచేసే విదేశీ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని బ్రిటన్‌ సర్కార్‌ నిర్ణయించింది. కార్మికుల కొరత కారణంగా కొన్ని చోట్ల పంటలను పొలాల్లోనే వదలి వేస్తున్నారని, ఆహార పంటలు పనికి రాకుండాపోతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిస్మస్‌ సందర్భంగా పెరిగే గిరాకీ కోసం టర్కీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు, ఈ సారి వాటి కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా అమెరికన్లు టాయిలెట్‌ పేపర్లను విరగబడి కొనుగోలు చేసి నిలవచేసుకున్నట్లుగా ు్లగా ప్రస్తుతం బ్రిటన్‌లో సరఫరా కొరత కారణంగా చమురుతో పాటు మద్యం, నిల్వచేసుకొనే మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వచేసుకోవటంతో దుకాణాలు ఖాళీ అయ్యాయి. ధరలు కూడా పెరిగాయి. డిసెంబరు నాటికి మెరుగుపడకపోతే పరిస్ధితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.

తాము కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన భుజాలను తానే తట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్ధితికి బ్రెగ్జిట్‌ కారణమని కొందరు భాష్యం చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం గాకపోయినా ప్రస్తుత సమస్య తీవ్రతరం అయ్యేందుకు బ్రెగ్జిట్‌ దోహదం చేసిందని మరికొందరు సూత్రీకరణ చేస్తున్నారు. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీ ఎంచుకున్న ఆర్ధిక నమూనాయే దీనికి మూలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకొనేందుకు దేశ ఆర్ధిక వ్యవస్ధ తగినదిగా లేదు. 2008లో తలెత్తిన సంక్షోభ సమయంలో బ్యాంకుల బలహీనతలు వెల్లడయ్యాయి. ఆసమయంలో కార్పొరేట్‌ సంస్ధలు తగిన నిధులు కలిగి ఉండటంతో నష్టాలను పూడ్చుకున్నాయని, ఇప్పుడు కంపెనీల వద్ద తగినన్ని నిధులు లేకపోవటం వలన ఉత్పాదక గొలుసు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నదని చెబుతున్నారు. ప్రతి దేశం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ బ్రిటన్‌ ఎక్కువగా ప్రభావితమైందని తాజా పరిస్ధితి వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్‌ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ కాగల కార్యం గంధర్వులు తీరుస్తారులెమ్మనట్లు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్లు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లకు, వాటి నిర్వహణకు పెట్టుబడులు అవసరం గనుక వాటి జోలికి పోకుండా ఇప్పటికి గడిస్తే చాలన్నట్లుగా గత కొంత కాలంగా వ్యయహరిస్తున్నారు. చలికాలం వస్తే గ్యాస్‌ వినియోగం పెరుగుతుంది.ప్రస్తుతం గత దశాబ్దికాలంలో కనిష్ట స్ధాయిలో నిల్వలున్నాయి. దేశ నిల్వసామర్ధ్యంలో 70శాతం కలిగిన రఫ్‌ అనే కేంద్రాన్ని 2017లో మూసివేశారు. నిల్వకేంద్రాల నిర్వహణకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా ప్రయివేటు వారు కూడా ముందుకు రావటం లేదు. నాలుగు లేదా ఐదు రోజుల చలికాలానికి అవసరమైన నిల్వలు మాత్రమే బ్రిటన్‌లో ఉన్నాయి.


దేశంలో 8,300 చమురు బంకులు ఉంటే వాటిలో ఐదువేల వరకు మూతబడ్డాయి.పందుల వధశాలల్లో కార్మికుల కొరత కారణంగా రైతులు ఇటీవలి కాలంలో లక్షా 20వేల జీవాలను వధించి పారవేసినట్లు జాతీయ పందుల పెంపకదారుల అసోసియేషన్‌ ప్రకటించింది. విదేశీ వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకొనే పద్దతి నుంచి ఎక్కువ వేతనాలతో నిపుణులైన స్ధానిక కార్మికులతో పని చేయించుకొనే పద్దతికి మారుతున్నట్లు చెప్పుకుంటున్నా అంత తేలిక కాదని అనేక మంది చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు చిల్లర దుకాణాల సిబ్బంది వేతనాలు 44శాతం పెరిగాయి, అయినా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. వేతనాలు పెరుగుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, ఎగుమతుల సమస్య కూడా తలెత్తనుంది.

చమురు సంక్షోభం, పందుల వధ వంటి పరిణామాలు బ్రెక్సిట్‌ అనంతర సంధి దశలో తప్పదని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. పందుల వంటి పెంపుడు జంతు వధ మామూలు విషయమే అన్నారు వలసలు, తక్కువ వేతనాలతో కూడిన విఫలమైన పాత విధానానికి వెళ్లే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. కన్సర్వేటివ్‌ పార్టీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్‌ వరకు సరఫరాలోఅంతరాయం ఉంటుందన్నారు. పన్నులను మరింతగా పెంచే అంశాన్ని కూడా తోసిపుచ్చలేదు. సరఫరా వ్యవస్ధలో తలెత్తిన సమస్యల గురించి మాట్లాడుతూ ఏమౌతుంది ? కొద్ది దశాబ్దాల క్రితం రైతులు గ్రామీణ దుకాణాల్లో పాలు అమ్ముకొనేవారు, సూపర్‌మార్కెట్లనే వాణిజ్య భక్షకుల కారణంగా ఆ పరిస్ధితి పోయింది, తిరిగి అది వస్తే సంతోషిస్తా అన్నాడు.చమురు, వస్తువుల కొరత దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందన్నాడు. ఇలాంటి సమస్యలను మిగతా ఐరోపా దేశాలు ఎదుర్కోవటం లేదు ఎందుకంటే గిరాకీని బట్టి ప్రత్యేక సమస్య తలెత్తుతుందని సమర్ధించుకున్నాడు. తమ సర్కార్‌ విధిస్తున్న పన్నులు మార్గరెట్‌ థాచర్‌కంటే తక్కువ హరోల్డ్‌ విల్సన్‌ కంటే ఎక్కువ అన్నాడు.” అయినా మీరు మాట్లాడుతున్నదంతా చెత్త, ఎందుకంటే ఆ ప్రముఖులిద్దరూ మా మాదిరి మహమ్మారిని ఎదుర్కోలేదు. మా మాదిరి ద్రవ్య పరమైన ఉల్కాపాతాలకు గురి కాలేదు ” అన్నాడు.బ్రిటన్లో తలెత్తిన కొరతలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. క్రిస్మస్‌ నాటికి పరిస్ధితి ఒక కొలిక్కి రానట్లయితే కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది బ్రిటన్‌ స్వయం కృతం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.

రష్యాలో ఏం జరుగుతోంది, పుతిన్‌కు సవాలుగా మారుతున్న కమ్యూనిస్టులు ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కొందరి దృష్టిలో కమ్యూనిస్టుల తప్పిదాలతో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతకాలం తరువాత అక్కడ కమ్యూనిస్టులు ఏమి చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులు, వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్‌కు తలనొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది.నిజమేనా -అతిశయోక్తా ? అసలు అక్కడేం జరుగుతోంది ?


సెప్టెంబరు 17-19 తేదీలలో రష్యన్‌ డ్యూమా(పార్లమెంటు ) ఎన్నికలు జరిగాయి.నాలుగు వందల యాభై స్ధానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్దతిలో మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్ధానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్‌ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్‌డిపిఆర్‌కు 7.55శాతం ఓట్లు 21 సీట్లు,న్యూపీపుల్‌ పార్టీకి 5,32శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్కసీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు.వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8శాతం పోలుకాగా ఈ సారి 45.15శాతానికి తగ్గాయి. అధికారపక్ష ఓట్లు 54.20శాతం నుంచి 49.82శాతానికి తగ్గాయి.

కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్ధులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్‌ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్యజనం కూడా గుర్తించారు. అనేక మంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్‌కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.వాషింగ్టన్‌ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.


కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్‌ గ్రుడినిన్‌ పోటీ చేశారు.గ్రుడినిన్‌కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్‌ మీద పోటీ చేసిన ఆయనకు 90లక్షల మంది మద్దతుదారుల లేరనే పేరుతో ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీలలో ఈ విధంగా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టునేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్‌ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులవైపు మొగ్గటం స్పష్టంగా కనిపించింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీనేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒకసాకుతో జైలు పాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనే అంశం పుటిన్‌కు తెలియంది కాదు.

కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరులక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల(మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల ు 30 నుంచి 36శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30శాతం ఓట్లు వచ్చాయి.38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్ధానాలుండగా ఇప్పుడు 254వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపధ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించాయి. దాంతో ఓటింగ్‌కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు,ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించటం, పరోక్ష ఎలక్ట్రానిక్‌ పద్దతిలో అధికారపక్షానికి ఓటు వేయించారు.


మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపు తప్ప ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరు 19వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూనిస్టు-అధికార యునైటెడ్‌ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్ధితి తారుమారైంది. ఇది రిగ్గింగుతప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్‌ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒకసాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయటం, ప్రదర్శనలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పార్టీ వెబ్‌సైట్‌ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు.పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.

ఎన్నికలకు ముందు ఆల్‌ రష్యన్‌ సెంటర్‌ అనే ప్రజాభిప్రాయసేకరణ సంస్ధ జరిపిన సర్వేలో కమ్యూనిస్టు నేత జుగనోవ్‌ మీద విశ్వాసం ప్రకటించిన వారు 30.7శాతం ఉన్నట్లు ప్రకటించింది. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్‌ ఫెడరేషన్‌లో 23.3శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్దాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలితాలు వెల్లడించాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఇంకా ఓటింగ్‌ శాతం, సీట్లు పెరిగి ఉండేవి.కమ్యూనిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.


గత పదిసంవత్సరాలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌కు అసలైన ప్రతిపక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకొనే యత్నాలలో భాగంగా వ్లదిమిర్‌ పుతిన్‌ ఏ పెట్టుబడిదారి విధాన సమర్ధపక్షాన్ని కూడా బతకనివ్వలేదు. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరోహించవచ్చు. దాని ప్రకారం 2036వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అనుకూలిస్తే పుతిన్‌ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.


ఆగస్టు నెలలో లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నట్లుగా మంచి పెట్టుబడిదారీ విధానానికి బదులు తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. మరోవైపున తమ కళ్ల ముందే అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రష్యన్‌ యువతరం గ్రహించకుండా ఎలా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా అమెరికా నుంచి రష్యాకు ముప్పు ఉందనే జాతీయ భావాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా కేంద్రీకరణ రష్యామీద కంటే చైనావైపు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రచారం రష్యన్లలో అంతగా ఎక్కే అవకాశం లేదు. అనేక దేశాలలో తమకు అనుకూలమైన శక్తులను ప్రతిష్టించేందుకు అమెరికా అంతర్గత అంశాలు, ఎన్నికలలో జోక్యం చేసుకొంటోంది. పుతిన్‌ బదులు మరొకరిని ప్రోత్సహించాలని చూసినా అందుకు తగిన శక్తులు రష్యాలో కనిపించటం లేదు. పురోగామి సోషలిస్టు మార్గాన పయనించటానికి తాము కట్టుబడి ఉన్నామని వెనక్కి తగ్గేది, లొంగిపోయేది లేదని, జన ధోరణి తమకు అనుకూలంగా మారుతోందని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ తరువాత ప్రకటించింది.


” ఓటర్లు మేం చెప్పింది విన్నారు. ఓటర్లు మమ్మల్ని నమ్మారు. మాకు ఓట్లు వేశారు ” అని పార్టీ అగ్రనేత గెన్నడీ జుగనోవ్‌ చెప్పారు. నియోజవర్గ ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 225 స్ధానాల్లో కమ్యూనిస్టులకు తొమ్మిది రాగా అధికారపక్షానికి 198వచ్చాయి. ఈ సీట్లలో అనేక అక్రమాలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. మొత్తగా 50శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అధికారపార్టీ నియోజకవర్గ ప్రాతిపదికన జరిగిన చోట అత్యధిక సీట్లు గెలిచిన కారణంగా మొత్తం సీట్లలో 72శాతం వచ్చాయి. అదే కమ్యూనిస్టులకు 19శాతం ఓట్లు వచ్చినా సీట్లు 12.7శాతమే వచ్చాయి. స్వతంత్ర విశ్లేషకుడు సెర్గీ షిఫిల్‌కిన్‌ అంచనా ప్రకారం కమ్యూనిస్టులకు వాస్తవంగా 31-33 శాతం మధ్య ఓట్లు వచ్చాయని అన్నాడు.మాస్కో ప్రాంతంలోని పదిహేను నియోజకవర్గాలలో అధికారపక్షం రిగ్గింగుకు పాల్పడిన కారణంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్దులు ఓడిపోయారన్నది స్పష్టం. ప్రత్యక్షంగా వేసిన ఓట్ల లెక్కింపు జరిగినంతసేపూ అధికారపక్షం, కమ్యూనిస్టులు పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రకటించిన అధికారులు ఎలక్ట్రానిక్‌ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలు మారు చేశారన్నది అభియోగం. కమ్యూనిస్టులు గట్టి పోటీ ఇచ్చిన ప్రతి చోటా ఇదే జరిగినట్లు చెబుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న యువత రానున్న రోజుల్లో మరింతగా మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జైలు పాలైన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నవల్నీ అధికారపక్షాన్ని ఓడించే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు కొందరు కమ్యూనిస్టులకు ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్‌ అంతరించి మూడు దశాబ్దాలు గడచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నలభై ఏండ్ల లోపు వారికి నాటి విషయాలు వినటం తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అలాంటి వారు అనేక మంది జాతీయ పార్లమెంట్‌, స్ధానిక అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు, పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీకి తేడా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకుపోతామని అనేక మంది యువనేతలు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఆర్ధిక రంగంలో పుతిన్‌ వైఫల్యాల కారణంగా ఇటీవలి కాలంలో కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతున్నది. మరొక ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేనందున కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోవటానికి ఇది కూడా దోహదం చేస్తుందన్నది తెలిసిందే.లెనిన్‌ జన్మించిన ఉల్యనోవస్క్‌ పట్టణం, పరిసరాలలో కమ్యూనిస్టులు 30శాతంపైగా ఓట్లు సాధించారు. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో విజయం సాధించిన కమ్యూనిస్టులను అడ్డుకొనేందుకు అధికారపక్షం అనేక ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. లెనిన్‌ పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉల్యనోవస్క్‌ను విడిచి వెళ్లిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయినా అంతటి మహానేత జన్మించిన ప్రాంతం తమదని అక్కడి వారు గర్వపడతారు. తిరిగి తమ జీవిత కాలంలో రష్యన్‌ సోషలిజాన్ని చూస్తామనే విశ్వాసం కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఉంది.


మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్ధ అధిపతి క్రిస్‌ వీఫర్‌ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ” జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్‌ యూనియన్‌ అంతరించిన తరువాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్ధిరపడాలనే పుతిన్‌ కబుర్లను వినేందుకు వీరు సిద్దంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్‌ను కోరుకుంటున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్‌ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి” అన్నాడు.