• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Asia

అధికారం పదిలం – అవినీతి సునామీలో జపాన్‌ పాలకపార్టీకి చావు దెబ్బ !

30 Wednesday Oct 2024

Posted by raomk in Asia, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, USA

≈ Leave a comment

Tags

Japan Communist Party, Japan Elections 2024, Japan LDP, Shigeru Ishiba

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో జపాన్‌ పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి)కి చావు దెబ్బ తగిలింది.అయితే దాని అధికారం పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. పార్లమెంటులోని దిగువ సభలో ఉన్న 465 స్థానాలకు గాను గత ఎన్నికలలో 34.66శాతం ఓట్లు, 259 సీట్లు తెచ్చుకున్న ఎల్‌డిపి ఈ సారి 26.73శాతం ఓట్లు, 191 సీట్లతో సరిపెట్టుకుంది. మిత్రపక్షం కొమిటో పార్టీ పొందిన 24తో కలిపి 215 మాత్రమే తెచ్చుకుంది. సాధారణ మెజారిటీ 233 స్థానాలను ఏ పార్టీ కూడా గెలుచుకోలేకపోయింది. ఇరవై ఎనిమిది సీట్లు తెచ్చుకున్న డిపిపి కింగ్‌మేకర్‌గా మారిందని చెబుతున్నారు. దీంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం లేదా పార్టీలలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. మద్దతు కూడగట్టేందుకు వివిధ పార్టీలతో ప్రధాని షిగెరు షిబా మంతనాలు జరుపుతున్నాడు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని పాలకపార్టీ పెద్దలు పెద్ద మొత్తంలో విరాళాల వసూలు, వాటిలో కొంత నొక్కేయటం వంటి విమర్శల సునామీలో పాలకపార్టీ ఓడిపోయింది. ఎల్‌డిపి జపాన్‌లో అవినీతికి పెట్టింది పేరు, అయినప్పటికీ అక్కడి ఓటర్లు దానికి దశాబ్దాల పాటు పట్టంకడుతూనే ఉన్నారు. ఈ సారి ఓడిరచారంటే వారి సహనానికి అవినీతి పరులు పరీక్ష పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలకపార్టీకి చెందిన మాజీ ప్రధానులు షింజో అబే, ఫుమియో కిషిడాతో సహా 82 మంది ఎంపీలు స్వంత ఖాతాలకు నిధులు మళ్లించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఆర్థిక మాంద్యంతో దేశం కొట్టుమిట్టాడుతున్నది. దాన్నుంచి బయటపడవేసే మార్గం కనిపించటం లేదు. ఇవన్నీ పాలకపార్టీ, దాని మిత్ర పక్షాన్ని దెబ్బతీశాయి. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దూరంగా పెడతామని చెప్పినప్పటికీ కొద్ది మందినే పోటీ నుంచి తప్పించటం, ఎక్కువ మందికి నిధులు కూడా సమకూర్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. జనంలో అనుమానం, ఆగ్రహం తమను దెబ్బతీశాయని ప్రధాని షిబా చెప్పాడు. అవినీతి ఆరోపణల పూర్వరంగంలో ఆగస్టు నెలలో కిషిదా రాజీనామా చేయగా అధికారానికి వచ్చిన షిబా మరుసటి నెలలోనే పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. వ్రతం చెడినా ఫలం దక్కలేదు.1955 నుంచి వరుసగా గెలుస్తున్న ఎల్‌డిపి 2009లో ఒకసారి ఓడిపోయింది. తిరిగి ఇప్పుడు మెజారిటీని కోల్పోయింది.ఎల్‌డిపి మిత్రపక్షం కొమిటో పార్టీ బలం 32 నుంచి 24కు పడిపోయింది. అయితే రెండూ కలిసినప్పటికీ 215 మాత్రమే, మరో పద్దెనిమిది సీట్లు అవసరం. పార్లమెంటును నవంబరు 26వ తేదీలోగా సమావేశపరచాల్సి ఉంది, పదకొండవ తేదీన బలపరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజు జరిగే ఓటింగ్‌లో సంపూర్ణ మెజారిటీ ఎవరికీ రాకపోతే తొలి రెండు స్థానాలలో ఉన్నవారితో రెండవ సారి ప్రధాని పదవికి ఓటింగ్‌ జరుగుతుంది. సంపూర్ణ మెజారిటీ వచ్చినా రాకున్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారు ప్రధాని అవుతారు.సబ్సిడీలు పెంచాలని, విద్యుత్‌ బిల్లులు తగ్గించాలనే అజెండాతో ఎన్నికలలో పోటీచేసిన ఆ పార్టీ నేతలు చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.చర్చలకు సిద్దపడితే తిరస్కరించాల్సిన కారణం కనిపించటం లేదని అయితే ఏ అంశాలను చర్చిస్తారన్నదాని మీద ఫలితం ఆధారపడి ఉంటుందని డిపిపి నేత యుచిరో తమాకీ చెప్పాడు.వివిధ పద్దతుల్లో చర్చలు జరుగుతున్నాయన్నాడు.ఎల్‌డిపి పైకి మాత్రం బెట్టు ప్రదర్శిస్తోంది.

రోజూ గంటల తరబడి ఓవర్‌ టైమ్‌ చేస్తే తప్ప కార్మికులకు గడవని స్థితి. దీంతో రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి అలాంటి వాతావరణానికి జనాన్ని అలవాటు చేశారు. దేశం దుస్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలంటూ దేశభక్తి నూరిపోశారు. అయితే జపనీయులు ఎక్కువ గంటలు పని చేస్తారంటూ ముద్దుపేరు పెట్టి సమర్ధించుకుంటారు. అధిక పని కారణంగా మరణాలు కూడా అక్కడ సర్వసాధారణమే. వాటిని కరోషీ అంటున్నారు. ప్రతి పది మందిలో ఒకరు నెలకు 80గంటలు ఓవర్‌ టైమ్‌ చేస్తున్నారు. ప్రతి ఐదు మందిలో ఒకరు కరోషీ గుండెపోటు లేదా పనివత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఒకనాటి అద్భుతంగా వర్ణించిన అంశం ఇప్పుడు జాతీయ ఆరోగ్య సమస్యగా మారింది.ఈ పరిస్థితిని మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కార్పొరేట్లు అందుకు అంగీకరించటం లేదు. ఓవర్‌ టైమ్‌ తగ్గించుకొనేందుకు కార్మికులే అంగీకరించటం లేదని, ఏడు గంటలకల్లా ఆఫీసు వదలాలని బలవంతం చేయాల్సి వస్తోందని కొన్ని సంస్థలు చెప్పుకుంటాయి. పని వత్తిడితో 2015లో ఆత్మహత్య చేసుకున్న 24 ఏండ్ల తకహషి ఉదంతం దేశ వ్యాపితంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.తాను రోజుకు 20గంటలకు పైగా పనిచేస్తున్నానని, ఎందుకు జీవిస్తున్నానో అర్ధం కావటం లేదని ఆమె ట్వీట్‌ చేసింది. ఆ తరువాత 50మందికి పైగా సిబ్బంది ఉన్న సంస్థలన్నీ స్వచ్చందంగా ఏడాదికి ఒకసారి తమ సిబ్బంది మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది.అయితే ఎక్కువ కంపెనీలు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తేలింది. కార్మికులు నిజాలను దాస్తున్నట్లు కంపెనీలు చేతులు దులుపుకున్నాయి.అబెనోమిక్స్‌ పేరుతో మాజీ ప్రధాని షింజో అబె అనుసరించిన విధానాలు స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన వారికి లాభాలు తెచ్చాయి తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు. దీనికి తోడు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ దిగజారుడు, నిరుద్యోగ సమస్య కూడా తోడు కావటంతో కార్మికవర్గం ఆగ్రహించింది.

ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ తన పదవికి ఎలాంటి ఢోకా లేదని ప్రధాని షిగెరు షిబా చెప్పాడు.ఏ పార్టీ లేదా కూటమికీ మెజారిటీ లేనందున ఎన్నికలు జరిగిన 30రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలకు అంత బలం లేనందున మైనారిటీ ప్రభుత్వాన్ని ఎల్‌డిపి కొనసాగించగలదని కొందరు భావిస్తున్నారు. ఇషిబా రెండవసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే సరి లేకుంటే రెండవ ప్రపంచ యుద్దం తరువాత అతి తక్కువ రోజులు అధికారంలో ఉన్న ప్రధానిగా చరిత్రకు ఎక్కుతాడు. రెండవ పెద్ద పార్టీగా అవతరించిన కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ తన బలాన్ని 96 నుంచి 148కి మాత్రమే పెంచుకుంది. ఎల్‌డిపిలో మాజీ ప్రధాని షింజో అబే వర్గం ప్రస్తుత ప్రధాని షిబా పట్ల సానుకూలంగా లేదని, అధికార పార్టీలో చీలిక రావచ్చని కూడా జోశ్యం చెబుతున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఎగువ సభ ఎన్నికలు జరగాల్సి వుంది. జపాన్‌ మిలిటరీ పాత్రను పెంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిదిని సవరించాలని ఎల్‌డిపి ఎప్పటి నుంచో చెబుతున్నది.తద్వారా ప్రపంచ మార్కెట్లలో తనవంతు వాటాను పొందవచ్చని జపాన్‌ పాలకవర్గం భావిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదిస్తున్న ‘‘ ఆసియన్‌ నాటో ’’ కూటమికి నాయకత్వం వహించాలని అది భావిస్తున్నది. అయితే అలాంటి సవరణను కమ్యూనిస్టు పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు పాలక కూటమి మైనారిటీలో పడినందున ఆ అజెండాను పక్కన పెట్టవచ్చు. అమెరికాతో అంతకంతకూ దగ్గర అవుతూనే చైనాతో సంబంధాలను విడగొట్టుకొనేందుకూ జపాన్‌ పాలకవర్గం సిద్దం కావటం లేదు. ఎందుకంటే చైనాతో వాణిజ్యం వారికి ఎంతో అవసరం. ఎన్నికలు జపాన్‌ అంతర్గత వ్యవహారమని తాము దాని గురించి చెప్పాల్సిందేమీ లేదని చైనా ముక్తసరిగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల్లో 148 సీట్లు తెచ్చుకున్న సిడిపి, 38, 28 చొప్పున సీట్లు పొందిన జెఐపి, డిపిపి పార్టీలు తాము చేతులు కలిపే అవకాశం లేదని అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు లేదా వ్యతిరేకతను వెల్లడిస్తామని పేర్కొన్నాయి. అయితే స్వతంత్రులు, చిన్న పార్టీలను కలుపుకొని ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని భావిస్తున్నవారూ ఉన్నారు. అది జరగకపోతే మైనారిటీ ఎల్‌డిపి కూటమి అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్‌డిపిలోనే కుమ్ములాటలతో కొత్త నేత ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది జరిగినా అస్థిరత కత్తి వేలాడుతూనే ఉంటుంది.లాబీల బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎవరు అధికారానికి వచ్చినా అటు కార్మికవర్గంఇటు కార్పొరేట్‌ వర్గమూ తమ సంగతేమిటని పాలకుల మీద వత్తిడి పెంచుతాయి. తక్షణ సవాళ్లుగా ఆర్థిక అంశాలే ఉంటాయని జపనీస్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

అవినీతిపరులుగా ముద్రపడిన కొందరిని పక్కన పెట్టి ఓటర్లను సంతుష్టీకరించేందుకు షిబా ప్రకటించినప్పటికీ ఎక్కువ మందికి పెద్ద పీట వేయటంతో ఓటర్లు అతని నాయకత్వాన్ని విశ్వసించలేదు. అందరి మాదిరే అని భావించారు.అవినీతి నిరోధానికి కొత్తగా తీసుకున్న చర్యలేవీ ఓటర్లకు కనిపించలేదు. వారి ఆగ్రహాన్ని పసిగట్టటంలో ఎల్‌డిపి నాయకత్వం విఫలమైంది. పాత ముఖాలనే షీబా కూడా మంత్రులుగా తీసుకున్నాడు.కార్పొరేట్‌ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవటాన్ని గట్టిగా సమర్థించాడు. పాలకపార్టీకి వస్తున్న రాబడిలో 60శాతం వరకు కార్పొరేట్‌ విరాళాలే ఉన్నాయి. వాటి నిషేధం పగటి కల అన్నాడు.ఓటర్లు ఎన్నికల పట్ల ఆసక్తి కోల్పోయినట్లు కేవలం 53.85శాతం మాత్రమే పోల్‌ కావటం తెలుపుతున్నది. గత ఎన్నికలతో పోలిస్తే 2.08శాతం తక్కువ. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత తక్కువ మంది పాల్గొనటం ఇది మూడవసారి. జపాన్‌లో రెండు రకాల నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 465కు గాను 289 సీట్లలో నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రతినిధులు ఎన్నికౌతారు. 176 చోట్ల ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లను కేటాయిస్తారు. నియోజకవర్గాలలో డబ్బున్న పార్టీలు తప్ప మరొకరు పోటీపడలేరు. కమ్యూనిస్టు పార్టీ గెలిచిన ఎనిమిదింటిలో ఒకటి మాత్రమే నియోజకవర్గాల జాబితా నుంచి ఉంది. పార్టీ గతంకంటే రెండు సీట్లను, 7.25 నుంచి 6.16శాతానికి ఓట్లను కోల్పోయింది. సింగిల్‌ సీటు నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు 213 చోట్ల పోటీ చేశారు.పాలకపార్టీ నిధుల కుంభకోణం గురించి కమ్యూనిస్టు పార్టీ, పార్టీ పత్రిక అకహటా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికలలో ఇవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివిధ అంశాలపై విబేధాల కారణంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సర్దుబాటు సాధ్యం కాలేదు. అనేక చోట్ల పరస్పరం పోటీపడ్డాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికార పార్టీ అభ్యర్దులున్న చోట ప్రతి పక్షాల తరఫున ఒకే అభ్యర్ధిని నిలపాలన్న ప్రతిపాదనను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది.భద్రతా చట్టాల రద్దు తదితర అంశాలపై ఏకాభిప్రాయం అవసరమని పేర్కొన్నది.అయితే రాజధాని టోకియో వంటి కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష అభ్యర్ధులను బలపరిచింది. ఒకినావా నియోజకవర్గంలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాన్ని ఎత్తివేయాలని కోరుతున్న శక్తులన్నీ అక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి అకామైన్‌ను బలపరచగా పాలక పార్టీపై విజయం సాధించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌ అంశంలో గీత దాటితే అంతే సంగతులు-సైనిక విన్యాసాలతో అమెరికాకు చైనా హెచ్చరిక !

16 Wednesday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, China, China Drills, Joe Biden, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

స్వాతంత్య్రం పేరుతో అమెరికా, ఇతర దేశాల అండచూసుకొని రెచ్చిపోతున్న తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పాలకులను హెచ్చరిస్తూ సోమవారం నాడు చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా తన తొలి విమానవాహక యుద్ద నౌక, పలు విమానాలు, మిలిటరీ నౌకలు,డ్రోన్లు, ఆయుధాలతో తన సత్తా ఏమిటో పశ్చిమ దేశాలకు వెల్లడిచేసింది.తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటు కోరుతున్న శక్తులకు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా ఇది గట్టి హెచ్చరిక. జాయింట్‌ స్వోర్డ్‌ 2024బి పేరుతో జరిపిన విన్యాసాల్లో అవసరమైతే తైవాన్‌ దిగ్బంధం, దాడులు ఏలా చేయగలమో చూపింది. గతంలో కూడా విన్యాసాలు జరిపినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఉన్నట్లు భావిస్తున్నారు. చైనా పిఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ లీ షీ మాట్లాడుతూ ఒకేసారి త్రివిధ దళాల సమన్వయంతో భూ, గగనతల, సముద్ర దాడులు, రేవులు, ఇతర ప్రాంతాల దిగ్బంధనం ఎలా చేయగలమో పరీక్షించి చూపినట్లు, ఇది గట్టి హెచ్చరిక అని చెప్పాడు. తైవాన్‌ నాయకత్వం పదే పదే తమ రక్షణ గగనతలం అని చెప్పుకుంటుందని, దాన్ని ఎలా చీల్చి చెండాడగలమో చూపటమే లక్ష్యంగా పలు వైపుల నుంచి దాడులను సమన్వయం ఎలా చేసేదీ చైనా త్రివిధ దళాలు చూపాయి. అందుకే ఉమ్మడి ఖడ్గం అని పేరు పెట్టారు. మెడ మీద వేలాడే ఖడ్గం లేదా సుత్తి మాదిరి రూపాందించారు. చైనాతైవాన్‌ మధ్య ఉన్న జలసంధిలో రెండు ప్రాంతాలు, తూర్పున రెండు, ఉత్తర, దక్షిణాన ఒక్కొక్క జోన్‌గా ఈ విన్యాసాలు జరిగాయి. గతం కంటే వీటిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలో ఉన్న రేవుల ద్వారా తైవాన్‌ సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నది. ఆ రేవులను దిగ్బంధనం కావించి ఆర్థిక లావాదేవీలను మిలిటరీ ఎలా దెబ్బతీయగలదో ఈ సందర్భంగా ప్రదర్శించారు.


తైవాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తాము కూడా తమ దళాలతో గమనించామని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తాము 153 విమానాల గమనాన్ని పరిశీలించామని, 90సార్లు తమ గగన తలంలోకి ప్రవేశించాయని,కొన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెప్పాడు. ఏడు నౌకలు, మరో నాలుగు ఇతర నౌకలు తైవాన్‌ దీవి చుట్టూ చక్కర్లు కొట్టాయని ఆరోపించాడు. ఈ ఏడాది మే నెలలో పిఎల్‌ఏ ఒకసారి విన్యాసాలు నిర్వహించింది.అక్టోబరు పదవ తేదీన తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ అధ్యక్షుడు లాయ్‌ మాట్లాడుతూ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తమకు ప్రాతినిధ్యవహించదని, దానికా హక్కు లేదంటూ తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాడు. విన్యాసాలు పౌరులకు వ్యతిరేకంగా కాదని, వేర్పాటువాద శక్తులను హెచ్చరించేందుకేనని, వారికి చీమ చొరబడేంత అవకాశం కూడా ఇచ్చేది లేదని, శాంతియుతంగా విలీనానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా చెప్పింది. ఒకే చైనా విధానానికి అనుగుణంగా తైవాన్‌ దీవి చుట్టూ పహరాకు నౌకా దళాన్ని నిరంతర వినియోగిస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేసింది.


తైవాన్‌ ప్రాంతంలో చైనా అంతర్భాగమే అంటూనే శాంతియుతంగా విలీనం చేసే సమయం ఆసన్నం కాలేదంటూ అమెరికా నాటకాలాడుతోంది. బలవంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పదే పదే ప్రకటిస్తోంది. చైనా అంటే తైవాన్‌లో ఉన్న ప్రభుత్వమే అని ఐరాస 1971వరకు గుర్తించింది. అంతకు ముందు దశకంలో సోవియట్‌ యూనియన్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన వివాదాలను అవకాశంగా తీసుకొని చైనాను తమవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడతో అసలైన చైనాకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ప్రధాన ప్రాంతాన్నే గుర్తించేందుకు అమెరికా పావులు కదిపింది. దాంతో భద్రతా మండలిలో 1971లో శాశ్వత సభ్యదేశంగా కమ్యూనిస్టు చైనాను గుర్తించారు. అయితే ఆ సమయంలో జరిగిన చర్చలు, నిర్ణయాల్లో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలని పేర్కొన్నారు. దాన్ని సాకుగా చూపుతూ అలాంటి సమయం ఇంకా రాలేదని గత ఐదు దశాబ్దాలుగా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను అందచేస్తూ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూస్తున్నది.బలవంతంగా విలీనం చేసుకుంటామంటే తైవాన్‌లో ఉన్న చిప్స్‌ పరిశ్రమలను పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించింది. తప్పనిసరైతే తప్ప రెండు కోట్ల 30లక్షల జనాభా ఉన్న తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకోబోమని చైనా చెబుతున్నది. బ్రిటన్‌, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటైన హాంకాంగ్‌, ఆసియా లాస్‌వేగాస్‌గా పేరుమోసిన జూద కేంద్రం మకావు దీవులు చైనా ఆధీనంలోకి వచ్చాయి.వాటిని వెంటనే చైనా సమాజంలో కలిపితే వచ్చే సమస్యలను, అక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులను గమనంలో ఉంచుకొని యాభై సంవత్సరాల పాటు 2047వరకు అక్కడ ఉన్న వ్యవస్థలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్నే ఒకేదేశంరెండు వ్యవస్థలుగా పిలుస్తున్నారు. ప్రత్యేక పాలనా యంత్రాంగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలను కూడా జరుపుతున్నారు. తైవాన్‌ పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అవసరమైతే జోక్యం చేసుకుంటామన్న మాటలను నమ్మి అక్కడి పాలకులు పదే పదే ససేమిరా అంటున్నారు. చైనా తాజా మిలిటరీ విన్యాసాల పూర్వరంగమదే.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరు ఎలా మన అంతర్గత అంశమో తైవాన్‌ కూడా చైనా స్వంత విషయమే. దానిలో జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. మన పాలకులు ఎప్పుడైనా ఆక్రమిత కాశ్మీరును విముక్తం గావిస్తామని ప్రకటిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఏడున్నర దశాబ్దాలుగా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎందుకు అంటే కారణాలనేకం, తైవాన్‌ విషయంలో కూడా చైనా అదే మాదిరి బలప్రయోగానికి పూనుకోవటం లేదు. అది వారు తేల్చుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీరు అంశంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నట్లుగానే తైవాన్‌ విషయంలో అమెరికా అంతకంటే ఎక్కువగా వేలు పెడుతోంది.పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు మిలిటరీ, ఆయుధాలు లేవు, అదే తైవాన్‌కు యుద్ద విమానాలు, క్షిపణులు, నౌకాదళం పూర్తి స్థాయి మిలిటరీ ఉంది. ప్రతి ఏటా అమెరికా సమకూరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మిలిటరీ శక్తి ఉన్న 145 దేశాలలో తైవాన్‌ 24వదిగా ఉంది. సర్వీసులో మొత్తం 2.15లక్షల మంది సైనికులు, 50వేల మంది పారా మిలిటరీ, మిలిటరీలో 35వేల మంది వైమానిక దళ సిబ్బంది,40వేల మందితో నౌకాదళం ఉంది, 286 యుద్ధ విమానాలుండగా వాటిలో ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 229 సిద్దంగా ఉంటాయి, ఇవిగాక కొన్ని హెలికాప్టర్లు ఉన్నాయి. నాలుగు జలాంతర్గాములతో సహా 93 రకాల మిలిటరీ నౌకలు ఉన్నాయి. ఇలాంటి శక్తితో తలపడితే ప్రాణనష్టం ఎక్కడ జరిగినా మరణించేది చైనా పౌరులే. అందుకే ప్రతి రోజూ రెచ్చగొడుతున్నా చైనా నాయకత్వం ఎంతో సంయమనంతో ఉంటోంది.


అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజా పరిణామాలపై మాట్లాడుతూ తైవాన్‌ జలసంధి, ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు ముప్పు రాకుండా చైనా సంయమనం పాటించాలని బోధ చేశాడు. తైవాన్‌ పాలకుడు లాయ్‌ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు అక్కడి ప్రజలకు నష్టదాయకమని చైనా పేర్కొన్నది. రాజకీయ స్వప్రయోజనాల కోసం తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే తైవాన్‌ జాతీయ దినోత్సవం పేరుతో చేసిన లాయ్‌ ఉపన్యాసమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. మే నెలలో లాయ్‌ బాధ్యతలు చేపట్టాడు, అతనొక ప్రమాదకర వేర్పాటు వాది అని అప్పుడు చైనా వర్ణించింది. అమెరికా కూడా తక్కువ తినలేదు. అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా 2022లో తైవాన్‌ పర్యటన జరిపి తమ మద్దతు వారికే అన్న సందేశమిచ్చారు. చైనా నాయకత్వ తీరు తెన్నులను చూసినపుడు అనివార్య పరిస్థితుల్లోనే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా వ్యవహరించదు. రానున్న ఐదు సంవత్సరాల్లో చైనా ఎలాంటి దాడులు చేయదని తాము నమ్ముతున్నట్లు సెప్టెంబరు నెలలో చేసిన ఒక సర్వేలో 61శాతం మంది తైవాన్‌ చైనీయులు చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తమ ఆర్థిక సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయుధ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం తద్వారా ఆయుధ అమ్మకాలను పెంచుకోవటం చూస్తున్నదే. అందుకే ఏదో ఒక మూల అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు.దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తైవాన్‌, దీవులు, అంతర్జాతీయ సముద్రమార్గంలో స్వేచ్చగా రవాణా తదితరాల పేరుతో చిచ్చుపెట్టేందుకు పూనుకున్నారు.తాను అండగా ఉంటానంటూ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను నమ్మించేందుకు,చైనాను బెదిరించేందుకు అమెరికా కూడా పదిరోజుల పాటు సాగేమిలిటరీ విన్యాసాలను ప్రారంభించింది. చైనా విన్యాసాలు బాధ్యతారహితం, ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేవిగా, భారీ ఎత్తున జరిగినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ఆరోపించింది.తైవాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలసి పదిరోజుల పాటు అమెరికా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.


తైవాన్‌ భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాలంటూ అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఎల్‌బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన విశ్లేషణను మే 11వ తేదీన తైపే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే మరింత ఎక్కువగా రక్షణ ఖర్చు పెంచాలని తైవాన్‌కు సూచించాడు.తమకు తైవాన్‌ అవసరం ఎంతో ఉన్నప్పటికీ దాని కోసం త్యాగాలు చేయాలని తమ నేతలు అమెరికన్లను అడిగే స్థితి లేదన్నాడు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని టోకియో, సియోల్‌ వంటి జనసమ్మర్ధం గల ప్రాంతాలకు సమీపంలోని అమెరికా సైనిక స్థావరాల మీద అణ్వాయుధాలను ప్రయోగించి ధ్వంసం చేస్తామని చైనా బెదరించిందని ఆరోపించాడు. అటువంటి పరిస్థితిలో తాము నేరుగా చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోనేందుకు సిద్దం కాదని, రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఇస్తున్న మాదిరిగానే పరోక్షంగా సాయం అందచేస్తామని తైవాన్‌ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
. ఐక్యరాజ్యసమితి 1949లో రూపొందించిన దేశాల హక్కులు, విధులకు సంబంధించిన ముసాయిదాలో ప్రతి దేశం అంతర్గత, విదేశీ వ్యవహరాలను ఎలా నిర్వహించాలో స్పష్టంగా పేర్కొన్నది. బయటి నుంచి ఎలాంటి జోక్యం, వత్తిడి లేదా మార్గదర్శనానికి తావు లేకుండా సాయుధ దళాల నియామకంతో సహా అనేక అంశాలు దానిలో పొందుపరిచారు. ఐరాస తీర్మానం ప్రకారం తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే, అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్నప్పటికీ దాని మీద పూర్తి అధికారం చైనాదే. అందువలన అంతర్గతంగా వేర్పాటు వాదాన్ని అదుపు చేయటంతో పాటు తైవాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా అంతర్జాతీయ నిబంధనలు అనుమతించిన మేరకు ఆధిపత్యం చైనాకే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో హసీనా పతనానికి ముందు ఏం జరిగింది : అమెరికా మానసపుత్రుడు మహమ్మద్‌ యూనిస్‌ !

09 Friday Aug 2024

Posted by raomk in Asia, Communalism, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RELIGION, USA

≈ Leave a comment

Tags

cia, coup against Sheikh Hasina, Hillary Clinton, Muhammad Yunus, Narendra Modi, Sheikh Hasina, Sheikh Hasina's ouster



ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్‌ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.


ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్‌ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్‌ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.


ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్‌ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్‌ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్‌ షిప్‌ను 1965లో యూనస్‌ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్‌ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ లాబీయింగ్‌ చేశాడు.మైక్రోఫైనాన్స్‌ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్‌ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్‌ కోర్స్‌ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్‌ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్‌ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్‌ హసీనా విషయానికి వస్తే యూనస్‌ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్‌ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్‌ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆ తీర్పును తప్పుపట్టింది.


అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్‌ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్‌ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ సతి హిల్లరీ క్లింటన్‌ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతిదూతగా నోబెల్‌ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్‌ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్‌ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్‌ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్‌ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్‌ ఎయిడ్‌ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్‌ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్‌ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్‌ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్‌ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్‌ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్‌ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్‌), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్‌) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్‌ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్‌ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ చుక్‌ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్‌ టూ ఫార్ములా ( షేక్‌ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్‌ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్‌ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్‌ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్‌ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్‌ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్‌ జనరల్‌ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.


హసీనాకు ఉద్వాసన మహమ్మద్‌ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్‌ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్‌ పత్రికలో 2019 ఏప్రిల్‌ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్‌ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్‌ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్‌ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ జలీల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్‌ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్‌ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్‌ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.


హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్‌ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్‌ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్‌ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

07 Wednesday Aug 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh Elections 2024, China, cia, Coup In Bangladesh, Joe Biden, Sheikh Hasina


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలస్తీనియన్లపై మారణకాండ : ఆపితే నెతన్యాహు, కొనసాగిస్తే జో బైడెన్‌ పతనం !!

08 Wednesday May 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza, Hamas Israel, Israel’s Gaza Onslaught, Joe Biden, Netanyahu, Rafah


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ బుధవారం నాటికి 215వ రోజుకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చలు సాగుతున్నాయి.తమకు అంగీకారమే అని హమస్‌ చెప్పింది.ఎటూ తేల్చకపోగా రఫా నగరం మీద సైనిక చర్యకు ముందుకు పోవాలని ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.మరొకవైపు చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని చెబుతూనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వైమానిక దాడులు జరుపుతూ రాఫా-ఈజిప్డు సరిహద్దు ద్వారం దగ్గర పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యను చర్చల మధ్యవర్తి కతార్‌ ఖండించింది. దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని పౌరులకు ఐరాస అందిస్తున్న సహాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయి.దాడుల్లో అనేక మంది మరణించారు. మధ్యవర్తులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను హమస్‌ ఆమోదించినప్పటికీ తమకు అంగీకారం కాదని, తమ డిమాండ్లకు చాలా దూరంగా ఉందని నెతన్యాహు కార్యాలయం చెప్పింది. మంగళవారం నాటికి గాజాలో 34,789 మందిని ఇజ్రాయెల్‌ చంపివేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారు 78,204 మంది. రాఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయెల్‌ ఆదేశించింది. ఇతర దేశాలకు ప్రత్యేకించి పక్కనే ఉన్న ఈజిప్టుకు వెళ్లకుండా దిగ్బంధనం గావించింది.ఇది రాసిన సమయానికి ఏం జరగనుందో తెలియని స్థితి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒకటి స్పష్టం.ఏదో ఒక ఒప్పందం చేసుకొని హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని నెతన్యాహు మీద రోజు రోజుకూ వత్తిడి పెరుగుతోంది.మరోవైపు హమస్‌ను తుడిచిపెట్టకుండా వెనుదిరిగితే మీ సంగతి చూస్తామనే దురహంకారులు.మారణకాండకు మద్దతు ఇవ్వటాన్ని ఏమాత్రం సహించం అంటున్న విద్యార్థులపై జో బైడెన్‌ సర్కార్‌ కాల్పులకూ పాల్పడింది. గాజా దక్షిణ ప్రాంతంలోని రాఫా నగరం మీద దాడులకు దిగితే అక్కడ ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించే అవకాశం ఉన్నందున హమస్‌ ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మారణకాండను కొనసాగించకపోతే నెతన్యాహు, ముందుకు పోతే ఎన్నికల్లో జో బైడెన్‌ పతనం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. మారణకాండను అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా అడ్డుకోలేకపోయింది. తన ఆదేశాన్ని ధిక్కరించిన ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేని అశక్తురాలిగా మారింది.పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిందించి మరింతగా రెచ్చగొట్టారు.


మంగళవారం తెల్లవారు ఝామున ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో అనేక మంది మరణించినట్లు వార్తలు. వైమానిక దళం జరిపినదాడుల్లో అనేక భవనాలు నేలమట్టం కాగా అనేక మంది శిధిలాల్లో చిక్కుకు పోయారు. ఎందరు గాయపడింది, మరణించిందీ ఇంకా స్పష్టం కాలేదు. తమ ఆసుపత్రికి పదకొండు మృతదేహాలు వచ్చినట్లు రాఫాలోని కువాయిట్‌ ఆసుపత్రి వెల్లడించింది. హమస్‌ వద్ద ఉన్న తమ బందీలను విడిపించే వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని మరోవైపు చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరవైలక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాజాలో వున్నారు. వారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇజ్రాయెల్‌ మిలిటరీ తరలిస్తున్నది.ఈ క్రమంలో 64చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాఫా నగరం, పరిసరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమస్‌ సాయుధులు జనంలో కలసిపోయినందున వారిని పట్టుకోవాలంటే పెద్ద ఎత్తున దాడులు చేయకతప్పదని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. అసలు ఆ సాకుతోనే ఏడు నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.రాఫా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం ఏ మాత్రం సహించరాదని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ దాడులను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా కబుర్లు చెబుతున్నది. బందీల విడుదలకు తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇజ్రాయెల్‌ చెబుతుండగా పూర్తిగా గాజా నుంచి వైదొలగాని హమస్‌ పట్టుబట్టటంతో ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. సంప్రదింపుల ప్రక్రియ వెంటిలేటర్‌ మీద ఉంది, అందుకే ఒక మధ్యవర్తిగా ఉన్న కతార్‌తో చర్చలు జరిపేందుకు సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బరన్స్‌ వెళ్లినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. మూడు దశల్లో ఒప్పందం అమలు జరుగుతుందని, తన వద్ద బందీలుగా ఉన్న 132 మందిలో 33 మందిని 42 రోజుల వ్యవధిలో విడుదలు చేస్తుందని దీనికి ఇరు పక్షాలూ అంగీకరించినప్పటికీ తదుపరి రెండు దశల గురించి వివాదం ఏర్పడిందని తొలుత వార్తలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు సోమవారం హమస్‌ ప్రతినిధి ఈజిప్టు, కతార్‌ మంత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాఫా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు వెళ్లిపోవాలని విమానాల నుంచి వెదజల్లిన కరపత్రాల్లో ఆదేశించటమేగాక, రాత్రి నుంచి దాడులను కూడా ప్రారంభించింది. ఒప్పందం కుదిరినా కుదరకున్నా దాడులు చేసి తీరుతామని నెతన్యాహు చెబుతున్నాడు.


కైరో చర్చలు సఫలమౌతాయని, తక్షణ, శాశ్వత కాల్పుల విరణమకు దారితీస్తాయని కతార్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు.వ్యవధి కోసం హమస్‌ నాటకమాడుతున్నదని, దాడులను నిలిపివేసేందుకు, చర్చల వైఫల్య నెపం తమపై నెట్టేందుకు చూస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది.రాఫా ఇప్పుడు బాలల నగరంగా మారిందని, దాడులు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం ఉంటుందని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, రక్షణ కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారని సంస్థ డైరెక్టర్‌ కాథరీన్‌ రసెల్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడి పిల్లలు భౌతికంగా, మానసికంగా ఎంతో బలహీనపడ్డారని, పిల్లలతో పాటు మొత్తం జనాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు ముందు నగరం, పరిసరాల జనాభా రెండున్నరలక్షలు కాగా ప్రస్తుతం అక్కడ పన్నెండు లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిలో దాదాపు ఆరులక్షల మంది పిల్లలే ఉంటారని చెబుతున్నారు.హమస్‌ ఒక మెట్టు దిగిరావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దాడుల ప్రభావం పెద్దల మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. రాఫా మీద దాడి అంటే ఏదో విహారయాత్ర అని భావిస్తే పొరపాటు తమ వారిని రక్షించేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని హమస్‌ ప్రకటించింది. దాడులకు పాల్పడవద్దని సౌదీ అరేబియా విదేశాంగశాఖ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.


తమ నేత జో బైడెన్‌కు గాజా మరో వియత్నాంగా మారుతున్నదని, అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ను వెనక్కు కొట్టేందుకు తాను బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ ప్రకటించాడు.గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్ళులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగటంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరకాటంలో పడ్డాడు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకోవటంతో పాటు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు నాటకం ప్రారంభించాడు.రాఫాపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ స్పష్టం చేసినట్లు జాతీయ భద్రతా మీడియా సలహాదారు జాన్‌ కిర్బీ చెప్పాడు. అర్ధగంటపాటు నెతన్యాహు-జో బైడెన్‌ ప్రైవేటుగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నారని అన్నాడు. నెతన్యాహుతో మాట్లాడిన తరువాత జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు అనధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్‌ గనుక రాఫాపై దాడులకు దిగితే పెద్ద ఎత్తున మారణకాండ జరిగే అవకాశముందని అబ్దుల్లా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఏడు నెలల దాడుల తరువాత గాజాలో తీవ్రమైన కరవు పరిస్థితి ఏర్పడిందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమ అధిపతి సిండీ మెకెయిన్‌ చెప్పాడు.తన మీద ప్రపంచ నేతలెవరూ ఏమాత్రం వత్తిడి తేలేరని, ఏ అంతర్జాతీయ సంస్థా ఇజ్రాయెల్‌ తనను తాను కాపాడుకోవటాన్ని అడ్డుకోజాలదని నెతన్యాహు ఆదివారం నాడు చెప్పాడు.


కొలంబియా విశ్వవిద్యాలయాన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్‌ పోలీసుల్లో ఒకడు విద్యార్థుల మీద కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారి వెనుక బయటి శక్తుల హస్తం ఉందనే సాకుతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది.దీనికి కార్పొరేట్‌ మీడియా మరింతగా ఆజ్యం పోస్తున్నది.ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా రెచ్చగొడుతుంటే అంత ఎక్కువగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. గుడారాలను పీకివేస్తే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దొంగే దొంగని అరచినట్లుగా విద్యార్థుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు ఇజ్రాయెల్‌ అనుకూలురను రెచ్చగొట్టి పోటీ ప్రదర్శనలను చేయించటం, ఆ ముసుగులో పౌరదుస్తుల్లో ఉన్న పోలీసులు, బయటివారిని రప్పిస్తున్నట్లు అనేక చోట్ల స్పష్టమైంది.వారు విద్యా ప్రాంగణాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. యూదు వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్ధుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి చర్యలను చూపి మీడియా దాడులకు దిగుతున్నది. మీడియాకు జరుగుతున్నదేమిటో తెలిసినప్పటికీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది కనుక దాని ప్రాపకం కోసం కట్టుకథలు రాస్తున్నది పిట్టకతలు చెబుతున్నది. పార్లమెంటు సభ్యుల కమిటీల పేరుతో విద్యా సంస్థల చాన్సలర్లు, అధ్యక్షులు, ఇతర అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆందోళనను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నారు. గట్టిగా వ్యవహరించకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండని వత్తిడి తెస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకపోతే తాము ఇచ్చిన విరాళాలను స్థంభింప చేస్తామని బెదిరించేందుకు దాతలను రంగంలోకి దించారు. నిజానికి వీరంతా బయటివారు తప్ప ఆందోళన చేస్తున్న వారు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు కాదు. ఇలాంటి వారిని చూసి ఆందోళనలకు దూరంగా ఉన్నవారు తొలి రోజుల్లో పొరపాటు పడిన అనేక మంది ఇప్పుడు తోటి విద్యార్థులతో చేతులు కలుపుతున్నారు. మహిమగల దుస్తులు వేసుకున్నానంటూ దిగంబరంగా వీధుల్లోకి వచ్చిన రాజును చూసి నిజం చెబితే రాజుగారి దెబ్బలకు గురికావాల్సి వస్తుందని ప్రతి వారూ రాజుగారి దుస్తులు బహుబాగున్నాయని పొగుడుతుంటే భయమంటే ఏమిటో తెలియని ఒక పిల్లవాడు రాజుగారి గురించి నిజం చెప్పినట్లుగా విద్యార్థులు ఆందోళన ద్వారా అనేక మంది కళ్లు తెరిపిస్తున్నారు. దిగంబర అమెరికా పాలకుల నైజాన్ని బయటపెడుతున్నారు.ఉన్మాద పులిని ఎక్కిన ఇజ్రాయెల్‌ నెతన్యాహు ఇప్పుడు వెనక్కు తగ్గితే రాజకీయంగా పతనమే, గాజాలో మారణకాండ ఇంకా కొనసాగితే దాన్ని నిస్సిగ్గుగా బలపరిస్తే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటమి తప్పదంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షేక్‌ హసీనా విజయం : చైనాకు మరింత దగ్గరగా బంగ్లాదేశ్‌ !

10 Wednesday Jan 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

Awami League, Bangladesh Elections 2024, BNP, Joe Biden, Khaleda Zia, Narendra Modi Failures, Sheikh Hasina, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా బంగ్లాదేశ్‌లో నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారంలో ఉన్న మరే దేశ మహిళ ఎవరూ ఇంత దీర్ఘకాలం పదవిలో లేరు.పార్లమెంటులోని 350 స్థానాలకు గాను 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 సీట్లను మహిళలకు కేటాయించారు. పార్లమెంటులో తెచ్చుకున్న సీట్ల దామాషాకు అనుగుణంగా ఆయా పార్టీల నుంచి మహిళను నామినేట్‌ చేస్తారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 222 సాధించింది.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమిలోని చిన్న పార్టీలు, స్వతంత్రులను కూడా కలుపుకుంటే మద్దతు ఇంకా ఎక్కువే ఉంటుంది. రద్దయిన పార్లమెంటులో అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. పదిహేడు కోట్ల మంది జనాభా ఉన్న ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కొన్ని కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా తక్కువ మంది పాల్గొనటాన్ని బట్టి పాలకపక్షం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెప్పవచ్చు.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా తాజాగా 41.8శాతమే నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల అక్రమాల ఆరోపణలు, విమర్శలు, బహిష్కరించటాలు మామూలే. తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను హసీనా తిరస్కరించారు, స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలు జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. తొలుత ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి అదే పదవిలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆరుపదుల వయస్సులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించినప్పటికీ 76 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు.ఆమె సోదరి రెహనా లేదా కుమారుడు సాజిద్‌ వాహెద్‌ రాజకీయ వారసులుగా వస్తారని చెబుతున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియాఉర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. వర్తమాన రాజకీయాల్లో బిఎన్‌పి మితవాద పార్టీగా ఉంది. దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. దాంతో ప్రధాన ఎగుమతి పరిశ్రమ రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలో కార్మికులు సమ్మెలకు దిగారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40 నుంచి 17 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ ఏడాది విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. బంగ్లా విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌ పాలకులతో చేతులు కలిపిన విద్రోహులను శిక్షించేందుకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపి అనేక మందిని ఉరితీశారు. హేతువాదులను శిక్షించేందుకు, ఇస్లాంను కించపరిచేవారిని దండించేందుకు కొత్త చట్టాలను తేవాలంటూ హిఫాజత్‌ ఇ ఇస్లామ్‌ అనే మితవాద సంస్థ పుట్టుకు వచ్చింది.లౌకికవాదులు, హేతువాదులను ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు చెందిన వారు అనేక మందిని హత్య చేశారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా, ఐరోపాలోని మానవహక్కుల నంస్థలు విమర్శలు చేశాయి. ఎన్నికలను తటస్థ ఆపద్దర్మ ప్రభుత్వం నిర్వహించాలన్న నిబంధనను 2014 ఎన్నికల్లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కారణంతో బిఎన్‌పి 2014 ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడూ అదే చెప్పింది.


తాజాగా ఎన్నికలు స్వేచ్చగా జరగలేదని అమెరికా, బ్రిటన్‌ ఆరోపించాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్‌ ఈ దేశాలకు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక దేశ అంతర్గత అంశాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవటం, వ్యాఖ్యానించటం తగనిపని, నిజంగా అక్రమాలు జరిగితే అక్కడి జనమే తేల్చుకోవాలి తప్ప మరొకరికి హక్కు లేదు.మరోవైపున చైనా, రష్యా, భారత్‌లు హసీనాను అభినందించాయి. ఆ మేరకు రాయబారులు ఆమెను కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌ చేసి హసీనాకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానం గురించి అనేక కథనాలు వచ్చాయి. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందన్న ప్రచారం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అమెరికా, ఇతర దేశాల మాదిరి తాజా ఎన్నికల్లో ఫలానా చర్యలు తీసుకోవాలి అంటూ చైనా ఎలాంటి షరతులను బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగటానికి 2012లో జరిగిన పరిణామం ఒక ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానది ఉపనదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. అది అక్కడ పెద్ద నది. పద్మానది మీద కట్టిన భారీ వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు ఆ ఏడాది బహిరంగంగా ప్రకటించింది.నిధులు నిలిపివేయటంతో పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించిన బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది.తరువాత ఇతర దేశాల నుంచి తీసుకున్నట్లుగానే ప్రాజెక్టు రుణాలను చైనా నుంచి కూడా బంగ్లాదేశ్‌ పొందింది. 2016ay బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతా లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. ప్రచ్చన్న యుద్ధ ఆలోచనలు, కూటమి రాజకీయాలకు బంగ్లాదేశ్‌ దూరంగా ఉండాలని 2022లో చైనా బహిరంగంగానే హితవు చెప్పింది. దాంతో తాము అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని తరువాత బంగ్లాదేశ్‌ ప్రకటించింది. అమెరికా చెబుతున్నదానికి భిన్నంగా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఒకే చైనా అని కూడా చెప్పింది.కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు.


ఇక చైనా రుణాల గురించి తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్‌ మీద కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 2023లో 7,230 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. వాటిలో ప్రపంచ బాంకు నుంచి 1,820, ఆసియన్‌ అభివృద్ధి బాంకు నుంచి 1,330, జపాన్‌ నుంచి 920, రష్యా నుంచి 510, చైనా నుంచి 480, భారత్‌ నుంచి 102 కోట్లు ఉన్నాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఎంఎ అబ్దుల్‌ మోమెన్‌ చెప్పాడు. దీన్ని బంగ్లాదేశ్‌కు అన్ని దేశాల నుంచి రుణాలు కావాలి, తీసుకుంటున్నది. ఇవి గాక వివిధ పథకాలకు తీసుకొనే రుణాలు వేరు. అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు తెలిపినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో ఒక సమీక్ష ప్రచురించింది.ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు ఉంది, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!

05 Monday Jun 2023

Posted by raomk in Africa, Asia, BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim propaganda in India, BJP, Desecularization, Global Religion 2023, hindutva, Hindutva nationalism, India’s population, polygamy, polygamy in india, RSS


ఎం కోటేశ్వరరావు


మతం మంచి కంటే హాని ఎక్కువగా చేస్తున్నదని నమ్ముతున్న వారు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ” ప్రపంచ మతం 2023 ” అనే నివేదిక వెల్లడించిన అంశమిది. ఇప్‌సాస్‌ అనే అమెరికన్‌ మీడియా సంస్థ 26దేశాలకు చెందిన వారి మీద జరిపిన సర్వే వివరాలను ఇటీవలనే వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 20 ఫిబ్రవరి మూడవ తేదీ మధ్య సర్వే జరిగింది. కొన్ని దేశాల్లో వెయ్యి, కొన్ని చోట్ల ఐదు వందల మందిని ప్రశ్నించగా మన దేశంలో 2,200 మందిని ఎంచుకున్నట్లు సంస్థ పేర్కొన్నది. వీరిలో తాము హిందువులమని 87శాతం, ముస్లింలు పది, క్రైస్తవులమని రెండు శాతం, మతం ఏమిటో చెప్పని వారు ఒక శాతం ఉన్నారు. సర్వేలో ప్రశ్నలకు వచ్చిన కొన్ని సమాధానాల సారం ఇలా ఉంది. మంచి కంటే మతం హాని ఎక్కువ చేస్తున్నదని నమ్ముతున్న వారు 26 దేశాల సగటు 47శాతం కాగా అగ్రస్థానంలో మన దేశంలో 73 శాతం ఉన్నారు. చుట్టుపక్కల ఇతర మత విశ్వాసాల వారు ఉన్నప్పటికీ పూర్తి నిశ్చింతగా ఉన్నట్లు చెప్పిన వారు సగటున 76శాతం కాగా మన దేశంలో 80శాతం ఉన్నారు. దక్షిణాఫ్రికా 92శాతంతో ప్రధమ, 53శాతంతో దక్షిణ కొరియా అధమ స్థానంలో ఉంది. మత విశ్వాసాలు, దేవుడికి సంబంధించి మన దేశంలో నమ్మకం ఉన్న వారు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేవుడిని కొలిచేందుకు ప్రార్ధనా స్థలాలకు వెళ్లే వారు సగటున 28శాతం ఉండగా మన దేశంలో అధికంగా 71శాతం ఉన్నారు. జపాన్‌లో అతి తక్కువ ఐదుశాతం. మతం, దేవుడు, స్వర్గం, నరకం గురించి విశ్వాసాలు ఉన్నవారు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలోని పట్టణపౌరుల్లో పదింట ఎనిమిదికి దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుడిని నమ్మే వారు సగటున 40శాతం మంది, అదృశ్య శక్తి ఏదో ఉందని భావిస్తున్నవారు 20 శాతం ఉన్నారు. అదే మన దేశంలో 70, 11 శాతాల చొప్పున ఉన్నట్లు తేలింది.


మన దేశంలో ఓటు బాంకు రాజకీయాల సంతుష్టీకరణ అంశం చర్చనీయాంశంగా ఉంది.మైనారిటీల పరిరక్షణకు పూనుకోవటాన్ని సంతుష్టీకరణగా వర్ణించుతున్న శక్తులు, ఉన్మాదం, విద్వేషాన్ని రెచ్చగొడుతూ మెజారిటీ ఓటు బాంకు సృష్టికి పూనుకున్నాయి. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెబుతున్న బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారెవరినీ ఒక్క చోట కూడా అభ్యర్ధులుగా పోటీకి నిలపటం లేదు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రముఖ నేత ఒకరు తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే పార్టీ నేతలు అసెంబ్లీ ఫలితాల తరువాత ముస్లిలంతా ఒక పార్టీకి వేసినందున తాము ఓడినట్లు ఆరోపించారు.ఇది మెజారిటీని ఆకర్షించే మార్కెటింగ్‌ ఎత్తుగడ, ఒక తరహా విద్వేష ప్రచారం. హిందూ మత రక్షణ అంటూ లేని ప్రమాదాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించటమే. వందల సంవత్సరాల ముస్లిం, ఆంగ్లేయుల పాలనలో జరగని హాని ఇప్పుడు జరుగుతోందని చెప్పటం దుష్ట పధకంలో భాగం తప్ప మరొకటి కాదు. హిందూత్వ శక్తులు చెబుతున్నట్లుగా మెజారిటీ మతరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే పాకిస్తాన్‌ మాదిరి మట్టి కొట్టుకుపోవటం తప్ప మరొకటి జరగదు. దీన్ని దేశ పౌరులు అంగీకరిస్తారా ? త్వరలో దేశంలో ముస్లిం జనాభా పెరిగి వారి పాలన వస్తుందంటూ వాట్సాప్‌లో రోజూ ఊరూ పేరు, ఆధారం లేని సమాచారాన్ని జనానికి చేరవేసి బుర్రలను ఖరాబు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశం 2030 నాటికి చైనాను నెట్టేసి అధిక జనాభా దేశంగా మారనుందని ఐరాస గతంలో వేసిన అంచనాను దెబ్బతీసి ఏడు సంవత్సరాల ముందే ఆ ఘనతను మనం సాధించాము. ఇతర అభివృద్ధి లక్ష్యాలకు ఎంతో దూరంలో ఉన్నాము.


మత రాజ్యం దిశగా దేశాన్ని మార్చాలని, అదే ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలని చూస్తున్న శక్తులు రెచ్చిపోతున్న కాలమిది. మతం, దేవుళ్లను వీధుల్లోకి తెచ్చి ఓట్లను దండుకోవటం తాత్కాలికం తప్ప శాశ్వతం కాదు గానీ, ఒక్కటిగా ఉండాల్సిన సమాజం పరస్పర అనుమానాలతో విడిపోతుంది. కొన్ని మతాల వారు ఉంటే పరిసరాల్లో ఉండలేమని కొన్ని శక్తులు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని అని ఇప్‌సాస్‌ సర్వే వెల్లడించింది. మార్కెటింగ్‌ అవసరాల కోసం ఇప్‌సాస్‌ సంస్థ వివిధ సర్వేలు చేస్తున్నది. ఓట్లను దండుకోవటం, అధికారం కోసం మతాన్ని, విశ్వాసాలను మార్కెటింగ్‌ చేసుకొనే శక్తులకు ఈ సర్వే కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో అలాంటి శక్తుల కుట్రలకు దేశం, జనం బలికాకుండా చూసేందుకు పూనుకున్న లౌకిక, పురోగామి శక్తులు కూడా తమ విధానాలు, వైఖరులను రూపొందించుకొనేందుకూ ఇది తోడ్పడుతుంది. ప్రతిదాన్నీ మార్కెట్‌ సరకుగా మార్చివేస్తున్న పూర్వరంగంలో మతం, విశ్వాసాలు, దేవుడు, దేవతలను కూడా అదే చేస్తున్నారు. ప్రతి పండుగనూ ఒక ఆదాయవనరుగా మార్చివేసి పెట్టుబడి లేకుండా, ఏమాత్రం శ్రమపడకుండా పరాన్న జీవులుగా మారి లబ్దిపొందేందుకు కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వారు అలాంటి శక్తులకు మద్దతుదారులుగా మారటం సహజం. ఇది మార్కెట్‌ సూత్రంలో భాగమే. వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ తరతమ తేడాలతో మత మార్కెటింగ్‌లో పోటీపడుతుండగా బిజెపి అన్నింటికీ అందనంత ముందు ఉంది. మాది నాణ్యమైన సరకు అంటే కాదు మాదే అసలు సిసలు అని కంపెనీలు పోటీ పడుతున్నట్లుగా నిజమైన హిందూత్వకు ప్రతీకలం తామంటే తామని బిజెపి-శివసేన పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. హిందూత్వ మార్కెటింగ్‌లో భాగంగానే విద్వేష ప్రచారాన్ని చూడాల్సి ఉంటుంది.


ముస్లింలు నాలుగు వివాహాలు చేసుకోవచ్చు, ఎందరినైనా పిల్లలను కనవచ్చు గనుక వారు జనాభాను ఉత్పత్తి చేసి మెజారిటీగా మారనున్నారు అనే తప్పుడు ప్రచారం సాగుతోంది. దేశంలో పిల్లలను ఎందరినైనా కనేందుకు అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో పోటీ చేసేందుకు, సంక్షేమ పధకాలను అందించేందుకు ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టాయి. అంతకు మించి సంతానం ఉన్నవారు వాటికి అనర్హులు. 1951 నుంచి 2011 వరకు నిర్వహించిన జనాభా లెక్కలను చూస్తే మొత్తంగా జనాభా పెరుగుదల రేటు 21.6 నుంచి 17.7శాతానికి తగ్గింది. హిందువుల్లో అది 20.7 నుంచి 16.6కు (నాలుగుశాతం తగ్గింది) పడిపోగా ముస్లింలో 32.7 నుంచి 24.7(ఎనిమిదిశాతం తగ్గింది)శాతానికి, క్రైస్తవుల్లో 29 నుంచి 15.7 శాతానికి తగ్గింది. అందువలన మెజారిటీ ముస్లింలు ఉంటారని చెప్పటం దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమే. ఈ కాలంలో ముస్లిం జనాభా 4.4శాతం పెరిగి 14.2కు, హిందువులు 4.3శాతం తగ్గి 79.8శాతం వద్ద ఉంది. ఈ తీరు తెన్నులతో హిందువులు మైనారిటీ కావటం జరగదు.2050 నాటికి ముస్లింలు 31.1 కోట్లకు, హిందువులు 130 కోట్లకు, క్రైస్తవులు 3.7, ఇతరులు 4.6 కోట్లకు పెరుగుతారని అంచనా. హమ్‌ పాంచ్‌ హమారో పచ్చాస్‌ (మనం ఐదుగురం మనకు పాతిక మంది) హమ్‌ దో హమారే బారా(మన మిద్దరం మనకు పన్నెండు మంది) అనే తప్పుడు ప్రచారం పనిగట్టుకు చేస్తున్నారు. మన దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలలో వెనుకబాటుతనం, దారిద్య్రం ఎక్కువ.ఇలాంటి స్థితిలో పిల్లలు ఎక్కువ ఉంటారు, దీనికి మతానికి సంబంధం లేదు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింలలో సంతనోత్పత్తి రేటు 3.1, కేరళలో 1.86 ఉందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ఐదవ సర్వే వెల్లడించింది. దీనికి ఆర్థిక, విద్య, గ్రామీణ, పట్టణ తేడాలు అన్నది స్పష్టం. తమిళనాడులో 1.74 మాత్రమే ఉంది. ఉత్తర ప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో 2.1 మంది పిల్లలు ఉంటే గ్రామాల్లో ముగ్గురు ఉన్నారు. జనాభా పెరుగదలలో మత విశ్వాసాల కోణం కొంత మేరకు ఉంది. అది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, అన్ని మతాల్లో , వెనుకబడిన సమాజాలన్నింటా ఉన్న లక్షణమే. ఉత్తర ప్రదేశ్‌ను తీసుకుంటే 1991-2001 కాలంలో మొత్తంగా 25.85 శాతం పెరిగితే అది 2001-11 నాటికి 20.9శాతానికి తగ్గింది.


బహుభార్యత్వం గురించి కూడా తప్పుడు ప్రచారం సాగుతున్నది. రాముడు ఏకపత్నీ వ్రతుడైతే, కృష్ణుడు బహుపత్నీ వ్రతుడు. ఇద్దరూ పూజనీయులుగానే ఉన్నారు. అసలు 1955లో చట్టం నిషేధించేవరకు హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు ఒకరికి మించి భార్యలను కలిగి ఉండవచ్చని ఎంత మందికి తెలుసు ? ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మహిళల స్థితి గురించి 1974లో వేసిన కమిటీ నివేదికలో నిషేధించినప్పటికీ హిందువుల్లో బహుభార్యత్వం కొనసాగుతున్నది.గిరిజనుల్లో 15.25, బౌద్దులలో 9.7,జైనుల్లో 6.72, హిందువుల్లో 5.8, ముస్లింలలో 5.7శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నారని పేర్కొన్నది. తరువాత ఇంతవరకు అలాంటి సర్వే జరగలేదు ? అలాంటపుడు ఏ ప్రాతిపదికన ముస్లింలను దోషులుగా చిత్రిస్తున్నట్లు ? ముస్లిం పర్సనల్‌ లా 1937 ప్రకారం ఎక్కువ మంది భార్యలను, పిల్లలను కలిగి ఉండవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ భాష్యం చెప్పింది.2015లో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం బహుభార్యత్వం ఇస్లాంలో మౌలిక అంతర్భాగం కాదని, ఆర్టికల్‌ 25 ప్రకారం ఏక భార్యత్వ సంస్కరణ గురించి చట్టం చేసే హక్కు రాజ్యానికి ఉందని చెప్పింది. పర్సనల్‌ లా అనుమతించినప్పటికీ అది ఇస్లాంను పాటించే వారికి మౌలిక హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


2020 డిసెంబరులో అమెరికా పూ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఈజిప్టులలో బహు భార్యలు ఉన్న పురుషులు ఒక శాతం కూడా లేరు. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో గరిష్టంగా 36శాతం మంది బహుభార్యలను కలిగి ఉంటే ముస్లింలలో 40శాతం, క్రైస్తవులలో 24శాతం మంది కలిగి ఉన్నారు. మరో పద్నాలుగు ఆఫ్రికా దేశాలలో 34 నుంచి రెండు శాతం వరకు ఉన్నారు. ఈ దేశాలన్నింటా ముస్లింలతో పాటు క్రైస్తవులు, మతంతో సంబంధం లేని గిరిజన తెగల్లో కూడా ఎక్కువ మందిని వివాహమాడుతున్నారు. వందల సంవత్సరాలనాడు అరేబియా యుద్ధాలలో పురుషులు ఎక్కువ మంది మరణించటంతో వితంతువులు, అనాధల సమస్య తలెత్తి వారి ఆలనా పాలనా చూసేందుకు బహుభార్యలను కలిగి ఉండవచ్చని ఇస్లాం అనుమతించిందని చరిత్రకారులు చెప్పారు. పాకిస్తాన్‌లో రెండవ వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య రాతపూర్వక అనుమతి అవసరం. అలా తీసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకున్న ఒక కేసులో భర్తకు 2017లో కోర్టు జైలు శిక్ష విధించింది.
మన దేశంలో స్త్రీ – పురుషుల నిష్పత్తిని చూసినపుడు పురుషులకు అనేక ప్రాంతాల్లో అసలు వివాహం కావటమే ఒక సమస్యగా మారినపుడు బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యం కాదు.1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి అది 943కు తగ్గింది. ఏడు దశాబ్దాల సగటు 936 గా ఉంది. ఒక సర్వే ప్రకారం ముస్లింలలో మొదటి భార్యకు సగటున 4.67 మంది ఉంటే రెండవ భార్యకు 1.78 మాత్రమే పిల్లలు ఉన్నట్లు తేలింది. ఒక పరిశీలన ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు హిందువుల్లో 29 ఉండగా ముస్లిం పిల్లల్లో 18 మాత్రమే. అందువలన ఇరు మతాల వారికీ పిల్లలు ఒకే సంఖ్యలో పుట్టినా జీవించే వారు ఎక్కువగా ఉన్నందున జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండవచ్చని తేలింది.

ముస్లింలలో మగపిల్లవాడే కావాలనే వైఖరి లేకపోవటం కూడా స్త్రీ-పురుష నిష్పత్తిలో పెద్ద తేడా ఉండటం లేదన్నది పరిశీలనల్లో తేలింది. మతం కారణంగానే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారనే నిర్ణయానికి వస్తే జననాల రేటు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గటానికి కారణాలేమిటి అనే దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. విద్య, ఆర్థికం వంటి అనేక అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచమంతటినీ ఇస్లామిక్‌ సమాజంగా మార్చేందుకు పిల్లల్ని ఎక్కువ కంటున్నారనేది మరొక ఆరోపణ. పాకిస్తాన్‌ సంగతి చూస్తే 1951లో సగటున ఒక స్త్రీ 6.6 మంది పిల్లల్ని కనగా(1980 వరకు అదే రేటు) 2023లో 3.238కి తగ్గింది.2050 నాటికి 2.332కు 2100నాటికి 1.81కి తగ్గనుందని అంచనా. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 1961పాకిస్తాన్‌లో ఒక మహిళ 6.8 మందిని కంటే మన దేశంలో 5.92 మంది.1971లో బంగ్లాదేశ్‌లో 6.86 ఉండగా 2020 నాటికి రెండుకు తగ్గారు.మన దేశంలో 2.05 ఉన్నారు. ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు ?


గతంతో పోల్చితే భావజాల పోరు తగ్గింది. అటువంటపుడు సహజంగానే వివిధ కారణాలతో అణగిమణిగి ఉన్న మతశక్తులు విజృంభిస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రపంచంలో మత ప్రభావం పెరిగింది, దీనికి మినహాయింపుగా మన దేశం ఉండజాలదు. అందుకే మత శక్తులకు అనువైన వాతావరణం నేడున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతం, దాని మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే 45శాతం. 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 41.29శాతమే.ఈ పార్టీలకు కేవలం హిందువులే వేశారని భాష్యం చెప్పినా మెజారిటీ హిందువులు వ్యతిరేకమే అన్నది స్పష్టం. ఓటే వేయనివారు మత రాజ్యంగా మార్చి దేశాన్ని నాశనం చేస్తామంటే అంగీకరిస్తారా ?పేదరికం, బాధల నుంచి బయటపడే చిట్కాల కోసం పేదలు, మరింత ధనికులుగా మారేందుకు, దానికి ఆటంకాలు లేకుండా చూసుకొనేందుకు మధ్యతరగతి, ధనికులు నేడు ఎక్కడ చూసినా గురువులు, స్వామీజీలు, సాధ్వులు, హస్త సాముద్రికులు, వాస్తు పండితుల చుట్టూ తిరుగుతున్నారు. వారి వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా ఉంది. 2007లో అమెరికాకు చెందిన పూ సంస్థ ప్రపంచ దృక్పధం అనే అంశంపై 47 దేశాలలో జరిపిన సర్వేలో ఒక ప్రశ్న అడిగింది. ” మా జనాలు నిర్దోషమైన వారు కాదు. కానీ మా సంస్కృతి ఇతరుల కంటే ఉన్నతమైనది ” అనే అంశాన్ని అంగీకరిస్తారా లేదా అంటే మన దేశానికి చెందిన వారు 93శాతం మంది అవును అని చెప్పి అగ్రస్తానంలో ఉన్నారు. సంస్కృతి పేరుతో సంఘపరివార్‌ జనంలో మనోభావాలను ఎంతగా చొప్పించిందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా సంస్కృతి మంచి చెడ్డలను ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా, పశ్చిమ దేశాల ప్రభావానికి గురైన వారిగా చిత్రించి దాడి చేస్తున్నారు. ఒక్కసారిగా చంపివేస్తే వేరు కానీ జీవితాంతం మీరు అంటరాని వారు అంటూ కోట్లాది మందిని నిత్యం మానసికంగా చంపటం ఘనమైన సంస్కృతిలో భాగమా ? దాన్ని ప్రశ్నిస్తే నేరమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

27 Saturday May 2023

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, TDP, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti-China 'Remove China Apps', BJP, CHANDRABABU, Narendra Modi, Narendra Modi Failures, Reliance Group, RSS, Shein, SJM


ఎం కోటేశ్వరరావు


షీ ఇన్‌ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడాసంస్థ రిలయన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశ భక్తి అన్నట్లు అవకాశం దొరికినపుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు.


ఒకటి మాత్రం నిజం, అంగీకరించకతప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. గాల్వన్‌ లోయలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద, చైనా పెట్టుబడుల మీద నిషేధం విధించారు. ఆ విధంగా జనాల మనోభావాలను సంతుష్టీకరించి వారి దృష్టిలో చైనాను దెబ్బతీసిన మొనగాడిగా కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌ల మీద ఆంక్షలతో ఒక దేశాన్ని దెబ్బతీస్తున్నామంటే మన జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. ఇంకే ముంది చైనా కథ ముగిసినట్లే అని సంతోషించారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. గాల్వన్‌ ఘర్షణ తరువాత చైనా వస్తువులను నిషేధించాలని కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వదేశీ జాగరణ మంచ్‌ నిదురలేచింది. తరువాత అదే చైనా నుంచి మన దిగుమతుల అంశంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు.వందల కోట్ల డాలర్లను ప్రతి ఏటా సమర్పించుకుంటున్నారు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అదే మొనగాడు ఇప్పుడు అంబానీ కంపెనీ కోసం వాటిలో షీ ఇన్‌ అనే ఒక యాప్‌కు గుట్టుచప్పుడు కాకుండా అనుమతించేందుకు ఇచ్చేశారు. అటు జనం ఓట్లు ఇటు కార్పొరేట్ల నోట్లు కావాలి కదా ! నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.


అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది.నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d