• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

చైనా, చైనా, చైనా – రెచ్చగొట్టిన అమెరికా నూతన రక్షణ మంత్రి

04 Friday Jan 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

china china china, Message to Compatriots in Taiwan., patrick shanahan, Taiwan, Taiwan independence, US provocation, Xi Jinping

Image result for china china china patrick shanahan

ఎం కోటేశ్వరరావు

జనవరి రెండవ తేదీన ప్రపంచంలో జరిగిన పరిణామాలలో రెండు ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి అమెరికా రక్షణశాఖ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాట్రిక్‌ షహనాహన్‌ పెంటగన్‌ అధికారులతో మాట్లాడుతూ మనం ఒకవైపు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఇస్లామిక్‌ తీవ్రవాదులతో పోరాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్రీకరించాల్సింది చైనా, చైనా, చైనా అని వ్యాఖ్యానించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్ధలు అదే శీర్షికతో వార్తలను ఇచ్చాయి. దానికి కొద్ది సేపటి ముందే చైనా రాజధాని బీజింగ్‌లో మాట్లాడిన దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తోటి తైవాన్‌ సోదరులకు ఒక విన్నపం అంటూ 1979లో చైనా చేసిన ప్రకటన 40వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఇంతకాలం నెలకొన్న స్ధిరమైన సంబంధాల దశ నుంచి పునరేకీకరణకు చొరవ చూపాల్సిన సమయమాసన్నమైందని చెప్పారు. బలవంతంగా విలీనం చేసుకొనేందుకు తమకు అవకాశం వున్నా శాంతియుత పద్దతులకే ప్రాధాన్యత ఇస్తామని జింపింగ్‌ చెప్పారు. నిజానికి ఇది తైవాన్‌ కంటే అమెరికాకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాల్సి వుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వుద్రిక్తతలకు ఇది ఒక సూచికగా కూడా చెప్పవచ్చు.

ఏడు దశాబ్దాల క్రితం చైనాలో విప్లవం జయప్రదమై కమ్యూనిస్టులు అధికారానికి వచ్చే సమయానికి తైవాన్‌ అనే రాష్ట్రం, కమ్యూనిస్టుల ఆధీనంలోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండున్నర కోట్ల మంది జనం వున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి కౌలు కింద, మకావో దీవులు పోర్చుగీసు కౌలు కింద వున్నాయి. చుట్టూ సామ్రాజ్యవాదుల కుట్రలు. ఇంటా బయటి శత్రువుల కుట్రలను అధిగమించి ప్రధాన భూభాగం చైనాలో కమ్యూనిస్టులు నిలదొక్కుకోవటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది.ఈలోగా జరిగిన అనేక పరిణామాల పర్యవసానంగా తైవాన్‌ విలీనం సంక్లిష్టంగా మారింది. కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.

చైనా సంస్కరణలతోపాటు కమ్యూనిస్టు చైనా ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి, తైవాన్‌కు సాంకేతికంగా గుర్తింపు రద్దు చేసి కూడా 40సంవత్సరాలు గడిచాయి. 1978 డిసెంబరు 15న తాము చైనాను గుర్తిస్తున్నట్లు, తైవాన్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం 1979 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి తైవాన్‌ సంబంధాల చట్టం పేరుతో అమెరికా తైవాన్‌తో నూతన సంబంధాలకు కూడా నాలుగు దశాబ్దాలు నిండాయి. ఆ చట్టం ప్రకారం అమెరికా ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించినపుడు ఎలాంటి సంబంధాలుంటాయో ఒక్క రాయబారకార్యాలయం, రాయబారి నియామకం తప్ప ఆయుధాల విక్రయంతో సహా మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతాయి. అందుకుగాను తైవాన్‌లో అమెరికన్‌ సంస్ధ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఆధునిక ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములతో సహా అన్నింటినీ తైవాన్‌కు విక్రయించిన అమెరికా గతేడాది తైవాన్‌లో జోక్యానికి ప్రాతిపదికవేసుకుంది. తైపే లోని అమెరికన్‌ సంస్ద రక్షణకు మెరైన్‌ దళాలను పంపాలని అమెరికా విదేశాంగశాఖ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరింది. అంతకు ముందు తొలిసారిగా 2017లో రెండు యుద్ధనౌకలను తైవాన్‌ జలసంధిలోకి అమెరికా తరలించింది. మరోసారి జెట్‌ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా పూనుకుంది. ఈ పూర్వరంగంలో గ్జీ జింపింగ్‌ ప్రకటన, హెచ్చరికలను చూడాల్సి వుంది.

1949లో చైనాలో మావో జెడాంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలుఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మూడు దశాబ్దాల పాటు అసలైన చైనాగా కొనసాగింది. అయితే 1960 దశకంలో సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన నేపధ్యం, విదేశీ పెట్టుబడులు అవసరమని చైనా నాయకత్వం భావించిన తరుణంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు వచ్చాయని అంచనా వేసిన అమెరికా పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వత్తిడి మేరకు 1970దశకం రెండవ అర్ధభాగంలో కమ్యూనిస్టు చైనాతో సయోధ్యకు అమెరికా సిద్దపడింది. రాజకీయంగా సోవియట్‌ మీద వత్తిడి పెంచే లక్ష్యం కూడా దాగి వుండటంతో అమెరికా నేతలు చైనాకు దారితీశారు. పరస్పరం లాభదాయకమని గుర్తించి 1979 జనవరి ఒకటి నుంచి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే చైనాను సాంకేతికంగా గుర్తించినప్పటికీ తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేంత వరకు, తైవాన్‌ పౌరులు ఆమోదించే వరకు తైవాన్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించటం లేదని, యథాతధ స్ధితిని మార్చేందుకు తైవాన్‌ లేదా చైనా ప్రయత్నించకూడదని, చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే తైవాన్‌కు మద్దతు ఇస్తామని తన చట్టంలో రాసుకుంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యమే అని ఆ చట్టం మీద చైనా వ్యాఖ్యానించింది.

అంతర్భాగమైన తైవాన్‌ దీవులను విలీనం చేసుకొనే అవకాశం వున్నప్పటికీ చైనా తన అధికారాన్ని వుపయోగించలేదు. దీనికి వివిధ అంశాలు దోహదం చేశాయి. 1949లో చైనా పాలకుడిగా వున్న చాంగ్‌కై షేక్‌ తైవాన్‌కు పారిపోతూ తనతో పాటు మొత్తం బంగారు నిల్వలను త్రిదళాలకు చెందిన ఇరవైలక్షల మంది సైనికులను కూడా తరలించాడు. అంతర్యుద్ధ సమయంలో బర్మా సరిహద్దులతో సహా అనేక చోట్ల నిధుల కోసం నల్లమందు సాగును ప్రోత్సహించి పెద్ద మొత్తంలో నిధులు పోగేశాడు. దాదాపు పన్నెండువేల మంది సైనికులు బర్మా సరిహద్దు ప్రాంతాలలో తిష్టవేసి అమెరికా సాయంతో 1954వరకు తిరుగుబాట్లు చేయించాడు. చైనా అధికారం తనదే అని ప్రకటించుకున్నాడు. తైవాన్‌ను సైనిక పరంగా విలీనం చేసుకొనేందుకు మావో నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో 1950లో వుత్తర కొరియాపై అమెరికా నాయకత్వంలోని సేనలు దక్షిణ కొరియా రక్షణ పేరుతో దాడులకు దిగాయి. వుత్తర కొరియాను కాపాడుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా తన సైనికబలగాలను ఇటువైపు మళ్లించాల్సి వచ్చింది. దాంతో తైవాన్‌ విలీనం వాయిదా పడింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా అండతో నాడున్న బలాబలాల్లో చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్నే అధికారికమైనదిగా గుర్తింపును కొనసాగించారు. తరువాత అమెరికన్లు తైవాన్‌ను ఒక బలీయమైన సైనికశక్తిగా నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తూనే వున్నారు.

తైవాన్‌ వెన్నుదన్నుగా అమెరికా వున్న పూర్వరంగంలో దాన్ని ఎదిరించి తైవాన్‌ను విలీనం చేసుకోగలిగిన శక్తి చైనాకు ఇటీవలి వరకు లేదన్న విశ్లేషకుల అంచనా వాస్తవానికి దగ్గరగా వుంది. ఇప్పుడు అజెండా, మార్గాన్ని నిర్దేశించే శక్తి వచ్చినట్లు గ్జీ ప్రకటనను బట్టి భావిస్తున్నారు.హాంకాంగ్‌లో 1992లో పాక్షిక అధికారాలు కలిగిన చైనా-తైవాన్‌ ప్రతినిధులు జరిపిన సమావేశంలో చైనా అంటే ఒక్కటే అనే ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రెండు ప్రాంతాల మధ్య సంబంధాల పునరుద్దరణకు నాంది పలికింది. అయితే దానిని గుర్తించేందుకు తైవాన్‌లోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నిరాకరిస్తోంది. భిన్న భాష్యాలు చెబుతోంది. చైనా ఒక్కటే, అవిభక్త దేశానికి ఏకైక ప్రతినిధి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి), ఒకే దేశంలో రెండు వ్యవస్ధలు, విలీనం శాంతియుతంగా జరగాలి, తప్పని సరి అయితే బలప్రయోగం తప్పదు అన్నది బీజింగ్‌ భాష్యం. తైవాన్‌ కేంద్రంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ, మరికొందరి భాష్యం ప్రకారం చైనా ఒక్కటే, దాని అసలైన ప్రతినిధి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(ఆర్‌ఓసి), జలసంధికి రెండువైపులా వున్న ఒకే దేశం. రెండు ముక్కలూ సార్వభౌమత్వం కలిగినవే. రెండు దేశాలూ సంప్రదించుకోవచ్చు. విలీనానికి బల ప్రయోగం జరపబోమని మేము వాగ్దానం చేయటం లేదు, అన్ని రకాల అవసరమైన పద్దతులను కలిగి వుంటాం. తైవాన్‌ స్వాతంత్య్రం అనేది చరిత్ర ధోరణికి వ్యతిరేకం, మరొక మార్గం లేని చోటుకు అది తీసుకుపోతుంది. శాంతియుత విలీనం తరువాత తైవాన్‌ సోదరుల సామాజిక వ్యవస్ధను జీవన విధానాన్ని పూర్తిగా గౌరవిస్తాం, ప్రయివేటు ఆస్ధులు, మతవిశ్వాసాలను, న్యాయమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాం అని జనవరి రెండవ తేదీన గ్జీ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన స్ధానిక ఎన్నికలలో 1992ఏకాభిప్రాయాన్ని గుర్తించని, వ్యతిరేకించే డిపిపి, కొమింటాంగ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ ఎన్నికలు 2020లో జరగనున్నాయి. హాంకాంగ్‌, మకావూల విలీనం సమయంలో అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలను 2049 డిసెంబరు 31వరకు కొనసాగిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొన్నది.ఇదే అంశాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేస్తామన్నదే గ్జీ తాజా సందేశ అంతరార్ధం.

Image result for angry  patrick shanahan

చైనా పట్ల కఠిన వైఖరిని తీసుకోవాలనే వైఖరి కలిగిన షహనాహన్‌ పెంటగన్‌లో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించదు. బస్తీమే సవాల్‌ అంటూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సై అంటే సై అనే రక్షణ మంత్రి తోడయ్యాడు. 2018 జాతీయ రక్షణ వ్యూహం పేరుతో పెంటగన్‌ రూపొందించిన పత్రంలో వ్యూహాత్మక పోటీదారు చైనా అని పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి తలెత్తుతున్న ముప్పులు అగ్రభాగాన వున్నాయని, వారినియంత్రత్వ వైఖరులకు అనుగుణ్యంగా ప్రపంచాన్ని మలచాలని, పెంటగన్‌ ప్రాధాన్యతల్లో వాటిని ప్రధానమైనవిగా చేర్చాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణ ఖర్చులో సింహభాగాన్ని పొందుతున్న ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌లో మూడు దశాబ్దాలపాటు వున్నత అధికారిగా షహనాహన్‌ పని చేశాడు. సిరియా నుంచి సేనల వుపసంహరణ ప్రకటనకు నిరసనగా రక్షణ మంత్రి మాటిస్‌ రాజీనామా చేసిన తరువాత వుప మంత్రిగా వున్న షహనాహన్‌ తాత్కాలిక మంత్రిగా వుంటారని ప్రకటించిన రోజే ట్రంప్‌ సర్కార్‌ బోయింగ్‌ నుంచి యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అతగాడిని వుప మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వచ్చిన వార్తల గురించి సెనెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వున్న జాన్‌ మెకెయిన్‌ వ్యాఖ్యానిస్తూ కోళ్ల గూటిలో నక్కను పెడతారని అనుకోవటం లేదన్నాడు.

షహనాహన్‌ మాటలను బట్టి రానున్న రోజుల్లో ఒకవైపు వాణిజ్య యుద్ధంతో పాటు మిలిటరీ రీత్యా మరింతగా చైనాపై కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న బలాబలాను బట్టి అమెరికాను అతిక్రమించే శక్తి చైనాకు లేదు. అయితే అమెరికా అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రతిఘటించే శక్తి చైనా సంతరించుకుంది. అమెరికా ఖండాంతర అణు క్షిపణులతో సమానమైన డాంగ్‌ఫెంగ్‌ 41క్షిపణి చైనా అమ్ములపొదిలో 2017లో చేరింది. అణుయుద్ధమే సంభవిస్తే విజేతలంటూ ఎవరూ వుండరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

24 Monday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 1 : దారిద్య్ర నిర్మూలనలో అసాధారణ ప్రగతి !

22 Saturday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

china reforms, four decades of china reforms, poverty reduction

Image result for four decades of china reforms

ఎం కోటేశ్వరరావు

ఏమి చెయ్యాలో చెయ్య కూడదో చైనాను నిర్దేశించే స్ధితిలో ఎవరూ లేరు, మా బాటలో మేము ప్రయాణిస్తాం ! ఇదీ తమ సంస్కరణల నలభయ్యవ వార్షికోత్సవాన్ని ప్రారంభించిన చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌ డిసెంబరు 18న ప్రపంచానికి స్పష్టం చేసిన అంశం. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు పధానికి మరియు సోషలిజానికి, దాని అభివృద్ధికి కట్టుబడి వుంటూ ముందుకు పోతామని ప్రపంచానికి తెలిపారు. సంస్కరణల పట్ల ప్రజల విశ్వాసాన్ని, సంస్కరణలను పెంచుతామని కూడా చెప్పారు. చైనీయులు మాట్లాడేది తక్కువ ఆచరించేది ఎక్కువ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. సంస్కరణల విషయాన్ని గతంలో కూడా పదే పదే స్పష్టం చేశారు గనుక పునశ్చరణ అవసరం లేదు. మావో మరణానంతరం బాధ్యతలు స్వీకరించిన డెంగ్‌ సియావో పింగ్‌ నాయకత్వంలోని పార్టీ ఎన్నో తర్జన భర్జనలు పడిన తరువాత ఎంతో ముందు చూపుతో, ఆత్మ విశ్వాసంతో ప్రారంభించిన సంస్కరణలు చైనాలో అద్భుతాలను ఆవిష్కరించాయంటే అతిశయోక్తి కాదు.

సోషలిస్టు వ్యవస్ధలను ఫలానా విధంగా నిర్మించాలనే ఒక నమూనా లేదు. అన్ని దేశాలలో ఒకే విధంగా నిర్మించటమూ సాధ్యం కాదన్నది స్పష్టం. తమ దేశ లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నామని చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది.చైనాలో నిర్మాణం చేస్తున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని, ప్రభుత్వ రంగంలోని పెట్టుబడిదారీ వ్యవస్ధ్ద అని మరొకటని కొందరు వర్ణించవచ్చు.వారికా స్వేచ్చ వుంది. చిత్రం ఏమిటంటే ఒకవైపు కమ్యూనిస్టులుగా చెప్పుకొనే వారు అక్కడ వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదని తిరస్కరిస్తుంటే, మరోవైపు అసలు సిసలు పెట్టుబడిదారీ విధానం కాదంటూ పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు చైనాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైనా తరహా సోషలిస్టు విధానంలో కనిపించిన తప్పులు ఒప్పులతో చర్చించటం, మెరుగుపడేందుకు తోడ్పడటం ఒక ఎత్తు. అలాగాక ఏ పేరుతో వ్యతిరేకించినా అది సామ్రాజ్యవాదులు, సోషలిస్టు వ్యతిరేకులకే ప్రయోజనం. ఈ పూర్వరంగంలో గత నాలుగు దశాబ్దాలలో చైనా సాధించిన అభివృద్ధిని, అది ఎలా సాధ్యమైందో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం అవసరం.

చైనా సమాజ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దేశ ఆర్ధిక వ్యవస్ధను మరింతగా విదేశాలకు తెరవాలని అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు ఒకవైపుకు లాగుతున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్ధ, సమాజంలోని అన్ని అంశాల మీద మ్యూనిస్టు పార్టీ అదుపులో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేయాలని గ్జీ జింగ్‌పింగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ మరోవైపు ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్ధితిలో చైనా ఎటు ప్రయాణిస్తుంది అన్నది సహజంగానే కమ్యూనిస్టుల్లో, వ్యతిరేకుల్లో కూడా ఆసక్తి కలిగించే అంశమే. డెంగ్‌సియావో పింగ్‌ చెప్పినట్లుగా పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పట్టగలిగినంత వరకు అది ఏ రంగుదైనా ఫర్లేదు. చైనాతో పాటు భారత్‌తో సహా అనేక దేశాలు సంస్కరణల పేరుతో తమ మార్కెట్లను విదేశీకార్పొరేట్లకు తెరిచాయి. వాటిలో ప్రజాస్వామ్యం, నియంతల పాలనలో వున్నవీ వున్నాయి కానీ సోషలిస్టు చైనా మాదిరి అభివృద్ధి చెందలేదు. పెత్తందారీ అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలను సవాలు చేసే స్ధితిలో లేవు. ప్రపంచంలో అత్యధిక జనాభాతో, అత్యంత వెనుకబడిన దేశంగా వున్న చైనాలో ప్రస్తుతం వున్నది సోషలిజమా-పెట్టుబడిదారీ విధానమా అనే మీమాంసలో కూరుకుపోతే ప్రధాన అంశాన్ని మరచిపోయినట్లే. అసలు సమస్య చైనా జనానికి తిండిపెట్టటం, దానికి ఏది పని చేస్తుంది అన్నది ముఖ్యం. ఈ పూర్వరంగంలో చైనాలో వున్న ప్రత్యేక పరిస్ధితులను గమనంలో వుంచుకొని అక్కడి పార్టీ నాయకత్వం తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఇంకా సమస్యలున్నప్పటికీ ఆకలి దారిద్య్రాల నుంచి జనాన్ని బయటపడవేసింది. తానేమిటో ప్రపంచానికి చాటింది. చైనా వ్యవస్ధ కూలిపోతుందని అనేక మంది పశ్చిమ దేశాల పండితులు ఇప్పటికి ఎన్నో జోశ్యాలు చెప్పారు. తమ వ్యవస్ధలు ఎదుర్కొన్న సంక్షోభాలను వారు పసిగట్ట లేకపోయారు, లేదా తెలిసినా మూసిపెట్టారు. సంక్షోభాలను నివారించలేకపోయారు. ప్రపంచీకరణలో భాగంగా లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్దలుగా మారిపోయి అప్పులపాలై దివాలా తీసి, తీవ్ర సామాజిక, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనటం మన కళ్ల ముందే చూశాము. ఇతర దేశాల మీద ఆధారపడిన ఎగుమతి ఆర్ధిక విధానాన్ని చైనా ప్రధానంగా అనుసరించినప్పటికీ గత నలభై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికా లేదా ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి సమస్యలను ఎదుర్కోలేదు. అనేక ముందు జాగ్రత్తలను తీసుకొని వ్యవహరించిన కారణంగా కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి రేటు తగ్గినా మొత్తం మీద రెండంకెల ప్రగతిని సాధించింది. మరే దేశంలోనూ ఈ తీరు కనిపించదు. చైనా అనుసరిస్తున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని వర్ణించే వారు సైతం ప్రభుత్వేతర పెట్టుబడిదారీ విధానం కంటే ఇదే మెరుగైనదని, మిగతా విధానాలు వైఫల్యం చెందాయని అంగీకరించకతప్పదు. ఒక దేశం అనుసరిస్తున్నది పెట్టుబడిదారీ విధానమా దానికి భిన్నమైనదా అనేందుకు కొలబద్ద పౌరుల జీవన పరిస్ధితుల మెరుగుదల మాత్రమే.

Image result for four decades of china reforms

చైనా అధ్యక్షుడు గ్జీ గింగ్‌పింగ్‌

దారిద్య్రనిర్మూలన పెట్టుబడిదారీ విధానానికి ఒక నినాదం మాత్రమే. దానికి భిన్నమైన విధానాలకు ఒక బృహత్తర కార్యక్రమం, సవాలు. దానికి చక్కటి వుదాహరణలు భారత్‌, చైనాలే. 1971లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇందిరా గాంధీ గరీబీ హఠావో పేరుతో పేదరిక నిర్మూలన నినాదమిచ్చి ఘనవిజయం సాధించారు. చైనా విషయానికి వస్తే అలాంటి నినాదాలేమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు గానీ 1978లో విదేశీ కార్పొరేట్లకు తన మార్కెట్‌ను తెరుస్తూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిలో దారిద్య్ర నిర్మూలన లక్ష్యం కూడా ఒకటి. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలన్నీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు దశాబ్దాలలో 70 నుంచి 80 కోట్ల మందికి( జనాభాలో 90శాతం నుంచి రెండుశాతానికి) దారిద్య్రం నుంచి విముక్తి కలిగించింది. 2030నాటికి ప్రపంచ వ్యాపితంగా దారిద్య్రనిర్మూలన సాధించాలన్న ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది లక్ష్యాలకు అనుగుణ్యంగా పని చేయటాన్ని చూస్తే పది సంవత్సరాల ముందే నూటికి నూరుశాతం మందిని దారిద్య్రరేఖకు ఎగువకు చేర్చాలని ప్రయత్నిస్తున్నది. చైనా జాతీయ గణాంక సంస్ధ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం 1978-2017 మధ్య 74కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తెచ్చింది. సరాసరి ఏటా కోటీ 90లక్షల మందికి విముక్తి కలిగించింది.తాజాగా విడుదల చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆహారం, దుస్తులు, విధిగా పిల్లలకు తొమ్మిది సంవత్సరాల విద్య, మౌలిక వైద్య, గృహవసతి కల్పించాల్సి వుంది. దీనికి అనుగుణంగా 2020 నాటికి మిగిలిన వారికి ఆ వసతులు కల్పించేందుకు వచ్చే ఏడాది 13బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక వ్యక్తికి వార్షికాదాయం 2,300 యువాన్లు లేదా 337 డాలర్ల కంటే తక్కువ లభిస్తే దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ప్రపంచబ్యాంకు తాజాగా ప్రకటించినదాని ప్రకారం రోజుకు 1.9డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు దారిద్య్రంలో వున్నట్లు లెక్క. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ(యుఎన్‌డిపి) సంస్ధ బహుఅంశాల దారిద్య్ర సూచిక (ఎంపిఐ-మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌) 2018 ప్రకారం 2015-16 సర్వే ప్రకారం భారత్‌ సూచిక 0.121, జనాభాలో 27.51శాతం మంది దారిద్య్రంలో వున్నారు. అదే చైనాలో 2014 సర్వే ప్రకారం సూచిక 0.017గానూ, 4.11శాతం మంది దారిద్య్రంలో వున్నారు. ఈ లెక్కన త్వరలో నూటికి నూరుశాతం మంది చైనాలో దారిద్య్రం నుంచి బయటపడనుండగా మన దేశం 2030లక్ష్యాన్ని చేరుకోగలదా అన్నది సమస్య. అందువలన ఏ విధంగా చూసినా చైనా మనకంటే ఎంతో ముందుంది. చైనా సమాజంలో ఆర్ధిక అసమానతలు వున్నాయని ప్రభుత్వమే స్వయంగా చెబుతోంది. మొత్తంగా అసమానతలతో పాటు గ్రామీణ- పట్టణ అసమానలు ఒక సమస్య. పట్టణ పేదరిక సమస్య దాదాపు పూర్తిగా నిర్మూలన అయింది. గ్రామాలు, బాగా వెనుకబడిన ప్రాంతాలలో మిగిలి వున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రీకరణ చేపట్టింది.

Image result for four decades of china reforms

డెంగ్‌సియావో పింగ్‌

అభివృద్ధిలో పోటీపడి ఏ దేశమైనా తన పౌరుల జీవన పరిస్ధితులను మెరుగుపరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. గత కొద్ది సంవత్సరాలుగా త్వరలో చైనాను అధిగమించి భారత్‌ పురోగమించనుందని అనేక మంది చెబుతున్నారు. రెండు దేశాలను పోల్చి కొన్ని అంకెలను కూడా చెబుతున్నారు. విమర్శనాత్మకంగా పరిశీలించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని జాతివ్యతిరేకులుగా వర్ణించే ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయి. 2018 మార్చినాటికి భారత జిడిపి 2.6లక్షల కోట్లుగానూ, 2023 మార్చినాటికి నాలుగు లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని నీతిఅయోగ్‌ తాజా అంచనాలో తెలిపింది. అభివృద్ధి రేటు ఎనిమిది నుంచి పదిశాతం మధ్య వుంటుందనే అంచనాతో ఈ జోస్యం చెప్పారు. ప్రస్తుతం 14లక్షల కోట్ల డాలర్లుగా వున్న చైనా జిడిపి 2023నాటికి 21.5లక్షల కోట్లకు పెరుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఒక వేళ చైనా అభివృద్ది పూర్తిగా ఆగిపోతుందని అనుకుంటే ఇప్పుడున్న చైనా స్ధాయికి చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. 2.6లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షలకోట్లకు ఐదు సంవత్సరాలు పడితే ఊఏటా పదిశాతం అభివృద్ది రేటు వుంటే గింటే 2034 నాటికి గాని మనం చైనా స్ధాయికి చేరుకోలేమన్నది అంచనా. అందువలన ప్రస్తుత విధానాలతో త్వరలోనే మనం చైనాను అధిగమించుతామని చెప్పటం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటమే. మన ఆర్ధికవేత్తలు, ఇతరులు చెబుతున్నట్లు మన దేశం ఏటా 7.5శాతం అభివృద్ధి సాధిస్తే మన ఆర్ధిక వ్యవస్ధ 0.195లక్షల డాలర్ల మేర పెరుగుతుంది. అదే చైనా 6.9శాతం వున్నా 0.86లక్షల కోట్లు పెరుగుతుంది. 2018 ప్రపంచ ఆర్ధిక వేదిక సంఘటిత అభివృద్ధి సూచిక ప్రకారం మన దేశంలో ప్రతి పదిమందిలో ఆరుగురు రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో వున్నారు. చైనాలో అది ప్రతి పది మందికి 1.2 మంది మాత్రమే అలా వున్నారు. సంఘటిత అభివృద్ధి పధంలో వున్నాయని ఆ సంస్ధ ఎంపిక చేసిన 74 దేశాలలో చైనా 26వదిగా వుండగా మన దేశం 62వ స్ధానంలో వుంది. చైనా సాధించిన విజయాల గురించి కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులు పెదవి విరుస్తుంటారు. చెబుతున్న అభివృద్ధికి రుజువుల్లేవంటారు, మేం నమ్మం అంటారు. ఎయిడ్స్‌ వైరస్‌కు చికిత్సలేదు. మాకు నమ్మకం లేదు అనేది కూడా అలాంటి చికిత్సలేని వ్యాధే. అలాంటి వారిని ఒప్పిందచేందుకు పూనుకోవటం వృధా ప్రయాసే. ఎయిడ్స్‌ రోగుల మాదిరి సానుభూతి చూపాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా రైతాంగానికి వ్యవసాయ పరిశోధనల తోడ్పాటు !

13 Tuesday Nov 2018

Posted by raomk in CHINA, Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agricultural research, automation in china agriculture, china agriculture, chinese farmers

Image result for how the chinese farmers are benefits of agricultural research

ఎం కోటేశ్వరరావు

అలవిగాని ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు సోకితే తప్ప రైతు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఆ పెట్టుబడులు కూడా గుడ్డిగా కాకుండా శాస్త్రీయంగా వుంటే మరింత ప్రయోజనం. దానికి మార్కెట్‌ రక్షణ కూడా వుంటే నాలుగు డబ్బులు మిగులుతాయి. శాస్త్రీయ పద్దతులు, సమాచారం రైతులకు కావాలంటే ఎవరికి వారు సంపాదించుకోలేరు. అందరికీ ఆఫలాలు అందే విధంగా పభుత్వాలే సమకూర్చాలి. వాటినే పరిశోధన, అభివృద్ధి అంటున్నారు. కొత్త వాటి కోసం పరిశోధన, వున్నవాటిని మెరుగుపరటం అభివృద్ధి జరగాలి. అటువంటి దానికి ఏ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది అనేదాన్ని బట్టి ఫలితాలు వుంటాయి.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అన్ని రంగాలలో చైనా ముందుకు దూసుకుపోతున్నది అనేది వాస్తవం. దాన్ని పాలించే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎవరైనా విబేధించవచ్చుగాని జనం కోసం చేస్తున్న వారి కృషిని కాదనలేరు. గత నెలలో చైనా వ్యవసాయ రంగ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుపయోగపడుతున్నదో ఒక నివేదికను ప్రకటించారు. దాని వలన చైనాకు ఆహార భద్రత సమకూరటంతో పాటు రైతుల ఆదాయాలు పెరిగాయన్నది దాని సారాంశం. అయితే వుత్పాదక ఖర్చు ఇంకా ఎక్కువగానే వుందని, వుత్పత్తుల ధరలు ఒక పరిమితికి చేరాయని ఫలితంగా లాభాలు తగ్గుతున్నాయంటూ ఈ సమస్యతో పరిమిత వనరులు, పర్యావరణ కాలుష్యం, కీలకమైన పోటీ లేమి వంటి సవాళ్లను చైనా ఎదుర్కొంటున్నదని, వాటిని అధిగమించటానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సి వుందని కూడా దానిలో పేర్కొన్నారు.

వాటిలో భాగంగా మరింత నాణ్యమైన పంటల రకాలు, స్వయం చాలిత యంత్రాలు, వ్యవసాయ, ఆహార వుత్పత్తుల తయారీ, సమర్ధ నీటి వినియోగం, కాలుష్య అదుపు, వ్యవసాయ వృధాను వుపయోగించుకోవటం, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వ అకాడమీ ఐదు సంవత్సరాల ప్రణాళికను కూడా రూపొందించింది.వ్యవసాయ రంగంలో చైనా సాధించిన అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నవాటి సారాంశం ఇలా వుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన పురోగతి చైనా వ్యవసాయ అభివృద్దికి 2012లో 53.5శాతం దోహదం చేస్తే 2017నాటికి 57.5శాతంగా వుంది. ఆ పురోగతి వరి, పత్తిలో అధిక దిగుబడి, చీడపీడల నిరోధ రకాల రూపకల్పన, ప్రమాదరకర బర్డ్‌ ఫ్లూ నిరోధానికి సమర్ధవంతంగా పని చేసే వాక్సిన్ల తయారీ వంటి వాటిలో వుంది.వ్యవసాయ భూమి, మంచినీరు, ఇతర వనరుల లభ్యత తగ్గుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఆహార ధాన్యాల వుత్పత్తి 60కోట్ల టన్నుల వద్ద స్ధిరంగా వుంది. జన్యుపరమైన పరిజ్ఞానంలో కనుగొన్న అంశాల ఆధారంగా పందులు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సంతతి వృద్ధి గణనీయంగా పెరిగింది. అనేక పంటలకు జన్యుపరమైన మాప్‌లను తయారు చేశారు. వ్యవసాయ రంగంలోని యంత్రాలు, పరికరాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేశారు. పురుగుమందులను చల్లేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.చైనాలో సాధించిన పురోగతి ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యవసాయ రంగానికి వుపయోగపడుతోంది.

Image result for how the chinese farmers are benefits of agricultural research

వివిధ పంటల దిగుబడులకు సంబంధించి 2015లో భారత్‌, చైనా, ప్రపంచ సగటు వివరాలు

హెక్టారుకు కిలోలు

పంట         భారత్‌        చైనా          ప్రపంచ సగటు

వరి          3608       6891          4604

గోధుమ      2750       5393         3317

జన్న        2597       5893         5538

పప్పులు    647          1741         950

చెరకు       71466     73121        70764

వేరుశనగ   1485         3562        1682

(ఆధారం: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసి 2017 పాకెట్‌ బుక్‌లో పేర్కొన్న వివరాలు )

ఒక దేశం సాధించిన పురోగతి గురించి చెప్పుకుంటున్నామంటే మనం సాధించినదాని గురించి తక్కువ చేయటం కాదు. పోటీ పడాలన్న వాంఛను వ్యక్తం చేయటమే.ప్రధాని నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు ఆచరణ ఏమిటన్నది విమర్శనాత్మకంగా చూడటం అవసరం. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి మనం చేస్తున్న ఖర్చు చైనా కంటే మరీ అంత వెనుకబడి లేదని నీతి అయోగ్‌ సభ్యుడైన ప్రముఖవ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ ఆ మధ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2017-18 ఆర్ధిక సర్వేలో పేర్కొన్నదాని ప్రకారం అన్ని రంగాలలో పరిశోధన, అభివృద్దికి ఆయా దేశాల జిడిపిలో దక్షిణ కొరియా 4.3, ఇజ్రాయెల్‌ 4.2,అమెరికా 2.8,చైనా 2.1 శాతాల చొప్పున ఖర్చు చేస్తుండగా మన దేశం గత రెండుదశాబ్దాలుగా 0.6-07శాతం మధ్య ఖర్చు చేస్తున్నది. మన కంటే అమెరికా, చైనా జిడిపిలు ఏడు, నాలుగు రెట్లు అధికం అని గమనంలో వుంచుకోవాలి. అయితే చైనా కంటే మనం పెద్దగా వెనుకబడిలేమని రమేష్‌ చంద్‌ ఎలా చెప్పారు? ఆ పెద్దమనిషి మన స్ధూలాదాయంలో వ్యవసాయరంగం నుంచి వస్తున్న మొత్తాన్ని లెక్కల్లోకి తీసుకొని దానిలో వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పారు. దాని ప్రకారం ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌కామ్‌ అందచేసిన వివరాల ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా 3.6, బ్రెజిల్‌ 1.82, అమెరికా 1.2, చైనా 0.62, భారత్‌ 0.30శాతం ఖర్చు చేస్తున్నాయి. దీన్ని చూపి చైనాకు మనకు పెద్ద తేడాలేదని రమేష్‌ చంద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Image result for automation in china agriculture

ఏదేశమైనా మొత్తంగా పరిశోధన, అభివృద్ధికి చేసే ఖర్చును చూసుకోవాలి. వుదాహరణకు ఒక డ్రోన్‌ తయారు చేస్తే దాన్ని ఏ ఖాతాలో వేయాలి? దానిని నిఘా, లేదా రహస్యంగా ఫొటోలు తీయటానికి, కొన్ని చోట్ల సరకు రవాణాకూ వినియోగిస్తున్నారు. వ్యవసాయంలో కూడా వినియోగపడుతోంది. అందువలన అంకెల గారడీ చేసి అధికారంలో వున్నవారిని మెప్పించవచ్చు. సామాన్య జనానికి ప్రయోజనం లేదు. మన దేశంలో స్వాతంత్య్రానికంటే ముందే 1880లోనే దేశంలో, ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయటం ద్వారా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.1919లో ఇంపీరియల్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పారు. స్వాతంత్య్రం తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయాను ఏర్పాటు చేసి పరిశోధన, అభివృద్ది బాధ్యతలను వాటికి అప్పగించారు. దీని వల్లనే హరిత విప్లవం జయప్రదం అయింది. తాజా పరిస్ధితిని చూస్తే మనకు అవసరమైన శాస్త్రవేత్తలు, వసతులు వున్నప్పటికీ వాటికి తగిన మొత్తంలో నిధులు, అన్నింటికీ మించి ప్రభుత్వరంగంలో పరిశోధనలు చేయించాలన్న వుత్సాహం, చొరవ పాలకుల్లో లేదు. ఇప్పటికే విత్తనాభివృద్ధి సంస్ధలను నామమాత్రం చేసి ప్ర యివేటు రంగానికి అప్పగించారు. ఏ రంగంలో అయినా పరిశోధన అంటే తక్షణమే లాభాలు చేకూర్చదు, కొన్ని సార్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితాలు కూడా రాకపోవచ్చు. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అది జరగటం లేదు.భిన్న వాతావరణ పరిస్ధితులున్న మన దేశంలో పరిశోధన అవసరం గురించి చెప్పనవసరం లేదు. వ్యవసాయం, హరిత విప్లవం అంటే గోధుమలు, వరి వుత్పత్తి పెంపుదల ఒక్కటే కాదు. మనదేశం ఆ రెండు పంటల విషయంలో గణనీయమైన పురోగతి సాధించిన తరువాత మన పాలకులు వ్యవసాయం మీద శ్రద్ద తగ్గించారు.ఫలితంగా వ్యవసాయ పెట్టుబడుల తగ్గింపు, వుత్పాదకత పెంపు, నీటి కొరతను అధిగమించటం, మార్కెటింగ్‌, ఆహార తయారీ వంటి అంశాలపై మన శాస్త్రవేత్తలు అవసరాలకు తగినట్లుగా స్పందించలేని స్ధితికి కారణం పాలకులు, వారి మెప్పు పొందేందుకు తాపత్రయపడే వున్నత విధాన నిర్ణాయక అధికార యంత్రాంగం తప్ప మరొకరు కాదు.భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం అనే పుస్తకంలో రాసినదాని ప్రకారం ప్రకారం ఎరువుల సబ్సిడీకి ఒక రూపాయి ఖర్చు చేస్తే దాని మీద 88, విద్యుత్‌కు 79, రోడ్లకు 110, కాలువల మీద 0.31 పైసల వంతున తిరిగి ఆదాయం వస్తుంది, అదే వ్యవసాయ పరిశోధనకు ఒక రూపాయి ఖర్చు చేస్తే రు.11.20 ఆదాయం వస్తుందట. అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్ధ(ఐఎఫ్‌పిఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం 2030సంవత్సరానికి నిరంతర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ణయించిన పదిహేడింటిలో సగం నెరవేరాలంటే వ్యవసాయమే కీలకమని, దాని మీద పరిశోధనకు చేసే ఖర్చు నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని, మిగతావాటితో పోల్చితే మరింతగా వనరుల సమపంపిణీ జరుగుతుందని తేలింది.

చైనా వ్యవసాయ పరిశోధనా రంగంలో ప్రభుత్వ వ్యవస్ధదే పైచేయి. ప్రయివేటు రంగం కూడా వుంది. ప్రభుత్వరంగ అదుపు అంటే వ్యవసాయ పరిశోధన ప్రజలకు చెందినది అన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహన. దాని మీద చేసే ఖర్చు ప్రజలదే, వచ్చే ఫలితాలు కూడా ప్రజలకే చెందాలి. ఒక ప్రయివేటు కంపెనీ ఒక అంశంపై కేంద్రీకరించి దాని మీదే పని చేస్తుంది. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. దీన్ని చూపి ప్రభుత్వ రంగం వుత్సాహాన్ని నీరుగార్చుతుంది అని కొందరు చిత్రించవచ్చు. అటువంటి స్ధితి నుంచి ఎలా ముందుకు పోవాలా అన్నది చర్చించవచ్చు, మార్గం కనుగొనవచ్చు. చైనా సర్కార్‌ ఈ అంశం మీద అభిప్రాయాలు, సూచనలు తీసుకొంటోంది.చైనా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనం పని చేస్తున్నారు. అందువలన ఆ రంగాన్ని కమ్యూనిస్టు పార్టీ విస్మరించజాలదు. వ్యవసాయ అభివృద్ధికి చైనా ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఒక అధ్యయన పత్రం పేటెంట్ల రూపంలో వెల్లడించింది. 1985-2009 మధ్య స్ధానిక పేటెంట్‌ దరఖాస్తులు 69రెట్లు పెరగ్గా, విదేశీ పేటెంట్ల దరఖాస్తులు తొమ్మిది రెట్లు వున్నాయి. స్ధానిక దరఖాస్తులలో నవకల్పన లేదా సృష్టిగా 57.2శాతానికి గుర్తింపు వచ్చింది. విదేశీ దరఖాస్తుల విషయంలో అది 99శాతం వుంది.

వ్యవసాయానికి సబ్సిడీల ద్వారా చేయూత నివ్వటం బుద్దితక్కువ వ్యవహారమని మన దేశంలో కొందరి వాదన. సబ్సిడీలు ఇచ్చి అసమర్ధతను పెంచుతున్నారని, దాని కంటే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఎక్కువ ప్రయోజమన్నది వారి భావం. యూరియాకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నందువలన దాన్ని దుర్వినియోగ పరచి అతిగా వాడి భూములు దెబ్బతినటానికి కారకులౌతున్నారని, అవసరం కంటే విలువైన నీటిని అధికంగా వాడి దుర్వినియోగం చేస్తున్నారని రైతుల మీద చేసే ఆరోపణ గురించి తెలిసిందే. మిగతా ఎరువులను సరసమైన ధరలకు అందిస్తే ఏ రైతూ తన భూమిని పనికిరాకుండా చేసుకోడు.అలాగే రైతాంగానికి సరైన మార్గదర్శనం చేస్తే నీటి దుర్వినియోగమూ వుండదు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 1980-81లో 3.9శాతంవుండగా 2014-15 నాటికి 2.2శాతానికి( 2016-17లో 2.6) తగ్గిపోగా ఇదే కాలంలో పెట్టుబడుల సబ్సిడీల మొత్తం 2.8 నుంచి 8శాతానికి పెరిగిందని సపోర్టింగ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌, ది స్మార్ట్‌ వే( భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం) అనే పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పెట్టుబడులకు-సబ్సిడీలకు లంకె పెట్టటం అసంబద్దం. పెట్టుబడులు పెట్టద్దని ఏ రైతూ అడ్డుకోలేదు. ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల కారణంగా ఎరువులు, విద్యుత్‌ వంటివి రైతాంగానికి భారం అవుతున్నాయనే విషయం తెలిసిందే.ఇలాంటి అంశాల గురించి మేథోమధనం, అధ్యయనాలు జరిపి ఒక మార్గం కనుగొనటం కష్టమేమీ కాదు. ఏ రంగంలో అయినా ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది అంటే దాని వలన వచ్చే లాభం పౌరులందరికీ చెందుతుంది. ప్రభుత్వాలు మిలిటరీ, పోలీసు, కరెన్సీ, దేశ సరిహద్ధు భద్రతల వంటి విషయాలకే పరిమితమై మిగిలిన అన్ని అంశాలను ప్రయివేటురంగానికి వదలి వేయాలన్నది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి బహుళజాతి గుత్త సంస్ధల కనుసన్నలలో వాటి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసే సంస్ధలు ఆదేశం. ప్రపంచంలో ఏడు బడా కంపెనీలు వ్యవసాయ రంగంలో పరిశోధనకు ఏటా ఏడువందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ మొత్తం మన దేశంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఖర్చుకు ఏడు రెట్లు ఎక్కువ. మనం చేసే ఖర్చు మన అవసరాలకు తగినదిగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – రష్యా మధ్యలో చైనా !

24 Wednesday Oct 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, INF Treaty, Intermediate-Range Nuclear Forces, RUSSIA, The 1987 INF Treaty

Related image

గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌  ఒప్పందం

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు మరో రెండు వారాలుండగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యావత్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా ఐరోపాను ఆందోళనకు గురిచేసే ప్రకటన చేశాడు. మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. దీని మీద ఐరోపాలో మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది రష్యా వ్యాఖ్యానించినట్లు బెదిరింపా లేక చెప్పినట్లు నిజంగానే వైదొలుగుతుందా అన్నది చూడాల్సి వుంది. ఐరోపాలో వెల్లడయ్యే స్పందన వ్యతిరేకంగా వుంటే తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఒప్పందం నుంచి వైదొలగటం ఖాయం అని చెప్పవచ్చు. ప్రపంచానికి ట్రంప్‌ పిచ్చివాడనిపించవచ్చుగానీ ఒక పధకం ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా సెనెట్‌్‌ ఆమోదించిన ఒప్పందాలను దాని అనుమతి లేకుండా రద్దు చేసేందుకు లేదా వాటి నుంచి వుపసంహరించుకుంటామని ప్రకటించేందుకు అధ్యక్షుడికి అనుమతి లేదు. అయినా ట్రంప్‌ ప్రకటన తక్షణ ప్రయోజనం ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ విజయం దిశగా పయనిస్తున్నదన్న వార్తల పూర్వరంగంలో అధికారపార్టీ రిపబ్లికన్లకు లబ్ది చేకూర్చటమే. ఎన్నికల్లో లబ్దికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవటం ఒక ఎత్తుగడ కావచ్చుగాని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు మరొక ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపేందుకు ఎప్పటి నుంచో చేస్తున్న సన్నాహాలలో భాగమే ఇది. నిజంగానే ఒప్పందం నుంచి వైదొలిగితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

అసలీ ఒప్పందం ఏమిటి ? ఐరోపాలో ఆయుధాల మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది. ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి. ఇవి ప్రధానంగా ఐరోపాలో యుద్ధానికి అనువుగా రూపొందించినవి కావటంతో వాటిని తొలగించటం ప్రాంతీయ భద్రతకు ఎంతో ముఖ్యమని ఐరోపా భావించింది.

ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంతవరకు అమలు వుల్లంఘన గురించి కొన్ని ఫిర్యాదులు రెండువైపుల నుంచీ వున్నప్పటికీ పెద్ద వివాదాలేమీ బయటి ప్రపంచానికి తెలియదు. ఆకస్మికంగా ఈనెల 20న తాము వైదొలగాలనుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాడు. ఈ ఒప్పందంతో చైనాకు ఎలాంటి ప్రమేయమూ లేదు, ఏ విధంగానూ భాగస్వామి కాదు. చిత్రం ఏమిటంటే తాము వైదొలగదలచుకుంటే అది అమెరికా తలనొప్పి అనుకోవచ్చు కానీ, ఈ సమస్యలోకి ట్రంప్‌ మహాశయుడు చైనాను లాగాడు.రష్యా మన దగ్గరకు రావాలి, చైనా మన దగ్గరకు రావాలి, అందరూ మన దగ్గరకు రావాలి. అందరం మంచిగా తయారవుదాం మనలో ఎవరమూ ఆ అయుధాలను తయారు చేయవద్దు అని చెబితే తప్ప మనం తయారు చేయాల్సిందే. కానీ రష్యా తయారు చేస్తూ, చైనా తయారు చేస్తూ వుంటే మనం ఒప్పందానికి కట్టుబడివుండాలంటే కుదరదు. రష్యా ఒప్పందానికి కట్టుబడి వుండటం లేదు కాబట్టి మనం కూడా కట్టుబడి వుండనవసరం లేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నాం అని ట్రంప్‌ ప్రకటించాడు. అంటే రష్యాతో ముడి పెట్టి చైనాను కూడా దెబ్బతీయాలనే లక్ష్యం ట్రంప్‌ ప్రకటన వెనుక వుందా ? ముగిసిందని ప్రకటించిన ప్రచ్చన్న యుద్ధాన్ని చైనా మీద ప్రారంభించదలచారా ? అంటే వెలువడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అవుననే చెప్పాల్సి వుంది. ట్రంప్‌ ప్రత్యక్షంగా రష్యా, చైనాలను రంగంలోకి తెచ్చేందుకు పూనుకున్నప్పటికీ మరోవైపు ఐరోపా రాజ్యాలను మరింతగా తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నం కూడా లేకపోలేదు.

‘ ట్రంప్‌ ప్రచ్చన్న యుద్ధాన్ని పునరుద్ధరించవచ్చు , కానీ చైనా దాని గతిని మార్చగలదు’ అనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక వ్యాఖ్యానాన్ని ప్రకటించింది. బెదిరింపులు, అణ్వాయుధాలు పాతవయ్యాయి. కొద్ది రోజులుగా ఐరోపా, అమెరికాలో అనేక మంది నూతన ప్రచ్చన్న యుద్ధం ప్రారంభం అవుతున్నదని అనుకుంటున్నారు, నూతన గతులు దానికి తూట్లు పొడుస్తాయి ఎందుకంటే సంపద్వంతమైన, జాతీయవాద చైనా అవతరించిందని సదరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రష్యా, చైనాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎఎన్‌ఎఫ్‌ ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందని తమ ఎన్నికలు, అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకొంటోందని గత రెండు సంవత్సరాలుగా అమెరికా ఒక పధకం ప్రకారం ఆరోపణలు చేస్తోంది. మరోవైపున పెట్టుబడులు, వాణిజ్యం, మేథోసంపత్తి హక్కు చౌర్యం, ఇతర పద్దతుల్లో అమెరికా ప్రజాభిప్రాయాన్ని మలచేందుకు చైనా ప్రయత్నిస్తోందని ట్రంప్‌ అండ్‌కో ప్రచారం చేస్తోంది.దాన్ని అడ్డుకొనే పేరుతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆయుధపోటీకి కాలుదువ్వుతోంది.

1987నాటి రష్యాాఅమెరికా ఆయుధ నియంత్రణ ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని అమెరికా వ్యూహకర్తలు వాదిస్తున్నారు. దాన్నే ట్రంప్‌ వెళ్లగక్కాడు.ఈ ఒప్పందంలో చైనా భాగస్వామి కానప్పటికీ దాని దగ్గర వున్న క్షిపణులలో 95శాతం మధ్యశ్రేణివే అని దక్షిణ కొరియాలో రాయబారిగా పని చేసిన అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ అధిపతి హారీ హారిస్‌ ఒక నివేదికలో ఆరోపించాడు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికాాచైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని ఇటీవల కొందరు కొత్త వాదనలు లేవనెత్తారు. ఆసియాలో చైనా ఇతర దేశాలను బెదిరించేందుకు గాను సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్ధల కంటే భూతలం నుంచి ప్రయోగించే ఆయుధాల ఖర్చు అమెరికాకు కలసి వస్తుంది. అయితే మిత్రదేశాల అనుమతి లేకుండా చైనా లక్ష్యంగా పసిఫిక్‌ ప్రాంతం నుంచి క్షిపణులను ప్రయోగించే కేంద్రాలు పరిమితంగా వుండటం అమెరికాకు ఒక సమస్య. జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు అటువంటి వ్యవస్ధలను తమ భూభాగంపై నెలకొల్పేందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహాస్పదమే. అలా చేయటం అంటే అమెరికా కోసం చైనాతో వైరం తెచ్చిపెట్టుకోవటమే.గత నాలుగు దశాబ్దాలుగా చైనా తన సంస్కరణలు, తన అభివృద్ధి తప్ప ఆయుధపోటీలో వున్నట్లు మనకు కనిపించదు.అలాంటి దానిని వాణిజ్యంలో తన షరతులను రుద్దటంలో విఫలమైన అమెరికా ఇప్పుడు మిలిటరీ రీత్యా ఆయుధపోటీకి దిగి చైనా దృష్టి మళ్లించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అణ్వాయుధాలతో పోల్చితే చైనా ఎంతో వెనుకబడి వుంది, దానికి వాటి అవసరం కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు అమెరికా కవ్వింపులకు దిగుతుండటంతో ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే ఇది అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. మొత్తంగా చూసినపుడు ఇటీవలి కాలంలో అనేక ఒప్పందాలను తిరగదోడుతోంది, కొత్తవి కావాలని వత్తిడి తెస్తోంది. అమెరికాకు అగ్రస్ధానం లేదా సింహభాగం రాబట్టుకొనేందుకు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. తనకేమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇది అమెరికన్లకేగాక యావత్‌ మానవాళికి హానికలిగించే పోకడ అని చెప్పకతప్పదు. ఒక పరిశీలన ప్రకారం చాలా సంవత్సరాలుగా అమెరికా వుపరితల ఆధారిత లఘు, మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ది చేయలేదు. ఇటీవలనే అందుకు నిధులు కేటాయించింది. వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను మోహరించేందుకు ఏ ఐరోపా దేశం కూడా తమ భూ భాగాలను అనుమతించే అవకాశం లేదు. అయితే రష్యా దగ్గర అలాంటి ఆయుధాలు వున్నందున చాలా త్వరగా మోహరించే అవకాశాలున్నాయి. నిషేధిత శ్రేణిలో కొత్త క్షిపణులను రష్యా తయారు చేసిందని అయితే ఒప్పందం కారణంగా వాటి శ్రేణిని పెంచి ఖండాంతర క్షిపణిగా పేర్కొన్నదని అమెరికా అనుమానిస్తున్నది.

Image result for intermediate-range nuclear missile

తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినప్పటి నుంచి రష్యాను చక్రబంధంలో బిగించేందుకు నాటో కూటమిని విస్తరించేందుకు అమెరికన్లు ప్రయత్నించి ఇప్పుడు రుమేనియా, పోలాండ్‌ వంటి చోట్ల రష్యా ముంగిటికి తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. దానికి ప్రతిగా అది కూడా తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.గురివిందగింజ మాదిరి తన చర్యల గురించి నోరెత్తని ట్రంప్‌ రష్యా మోహరింపులను సాకుగా చూపి ఒప్పందం నుంచి వైదొలుగుతాననటం ఒక సాకు మాత్రమే. మూడు దశాబ్దాలుగా ప్రశాంతంగా వున్న తమకు మరోసారి ఆయుధముప్పు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం ఐరోపాలో వ్యక్తం అవుతోంది. రష్యాను అంకెకు తెచ్చేందుకు అమెరికా చేసే యత్నాలకు తాము మద్దతిస్తాం తప్ప ఒప్పందం నుంచి తప్పుకుంటామనే అమెరికా వైఖరిని ఐరోపా నాయకులు తప్పు పడుతున్నారు. నిరాయుధీకరణ ఒప్పందం ఐరోపా భద్రత అనే కట్టడానికి గత మూడు దశాబ్దాలుగా ఒక స్ధంభం మాదిరి వుంది, ప్రచ్చన్న యుద్ధాన్ని అంతం చేసేందుకు తోడ్పడింది అని ఐరోపా యూనియన్‌ విదేశాంగ విధాన విభాగ ప్రతినిధి ఫెడరేసియా మోఘెరిని ఒక రాత పూర్వక ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం కారణంగా దాదాపు అణు, సాంప్రదాయ ఆయుధాలున్న మూడువేల క్షిపణులను తొలగించి నాశనం చేశారు. ప్రపంచానికి నూతన ఆయుధపోటీ అవసరం లేదు, దాని వలన ఎవరికీ లాభం లేకపోగా మరింత అస్ధిరత్వాన్ని తెస్తుందని పేర్కొన్నారు. స్వీడిష్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిడిట్‌ అమెరికా చర్య రష్యాకు ఒక బహుమతి లాంటిది. ఐరోపాకు అణుముప్పును పెంచుతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధపోటీలో చేరటంతో రష్యా పెద్ద సంఖ్యలో నూతన ఆయుధాలను మోహరిస్తుందన్నాడు. ఇబ్బందులు రష్యా క్షిపణుల పరిధిలో వున్న ఐరోపావారికి తప్ప అమెరికన్లకు కాదని జర్మనీ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ పేర్కొన్నారు.ట్రంప్‌ ప్రకటన విచారకరమని ఒప్పందానికి కట్టుబడే అంశాలను పరిష్కరించాలని రష్యాను కోరారు. తాము అమెరికా వైఖరిని సమర్ధిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. ఈ చర్య ఎక్కడికి దారితీస్తుందో వాష్టింగ్టన్‌లోని వారికి నిజంగా అర్ధం కావటం లేదా అని ఒప్పందంపై సంతకం చేసిన సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌ ప్రశ్నించాడు.ఒప్పందం నుంచి వైదొలగటం ప్రమాకర అడుగు అవుతుందని, తమను బ్లాక్‌ మెయిల్‌ చేయటమే అని, అయితే దాన్ని అంగీకరించేది లేదని రష్యా తక్షణ స్పందనలో పేర్కొన్నది.

ట్రంప్‌ చర్యను అమెరికాలోని కొందరు మేథావులే తప్పు పడుతున్నారు. దౌత్యపరంగా హ్రస్వదృష్టి, మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌కు రాజకీయంగా ప్రమాదకరం, ముప్పుతో కూడుకున్నదని వాషింగ్టన్‌లోని ఆయుధాల అదుపు అసోసియేషన్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబాల్‌ వ్యాఖ్యానించారు. ఒప్పంద వుల్లంఘనకు రష్యా పాల్పడుతున్నదనే ఆందోళన ఒకవైపు వుండగా దాన్నుంచి అమెరికా వుపసంహరణ ప్రకటన చేయటంతో వైఫల్య నిందను నెత్తిన వేసుకున్నట్లయిందని కింబాల్‌ వాపోయారు. వివాద పరిష్కారానికి దౌత్య అవకాశాలు ఆవిరి కాలేదని, ట్రంప్‌ పాలనా కాలంలో ఆయన సలహాదారు బోల్టన్‌ మాస్కో పర్యటన కేవలం మూడవదేనని కూడా కిబాల్‌ చెప్పారు. రుమేనియాలో ఆమెరికా మోహరించిన క్షిపణులను అడ్డుకొనే కేంద్రాలను రష్యన్‌ నిపుణులు, ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్న రష్యా 9ఎం729 వ్యవస్ధలను అమెరికా నిపుణులు పరస్పరం తనిఖీ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు.

ట్రంప్‌ ప్రతినిధిగా మాస్కో పర్యటనలో వున్న బోల్టన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఒప్పందంలో పేర్కొన్న క్షిపణులు అనేక దేశాలు తయారు చేస్తున్నందున ప్రచ్చన్న యుద్ధకాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు కాలదోషం పట్టిందని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌, ఇతర అమెరికకా నిపుణులు కోరుతున్నట్లు అణ్వాయుధ క్షిపణుల నిషేధ ఒప్పందంలో చైనా చేరే అవకాశాలేమాత్రం లేవని కింబల్‌ వ్యాఖ్యానించారు. దాని దగ్గర వున్న అణ్వాయుధాలు తక్కువ, వారి దగ్గర లఘు, మధ్య శ్రేణి క్షిపణులు ఎక్కువగా వున్నాయి. నిజంగా వారు ఒప్పందంలో చేరితే అది అమెరికా, రష్యాలకు విజయం, చైనాకు నష్టం అన్నారు. అమెరికా నిజంగా ఒప్పందం నుంచి తప్పుకుంటుందా అన్న ప్రశ్నకు కింబల్‌ ఇలా స్పందించాడు. గత కొద్ది వారాలుగా ఒప్పందాన్ని ఏమి చేయాలని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది.బోల్లన్‌ గనుకు చక్కగా వుండి వుంటే ఈ సమస్యను దీర్ఘకాలం నాన్చటం మంచిది కాదు, మీరు తదుపరి చర్యలు తీసుకోనట్లయితే మేము ఒప్పందం నుంచి వెనక్కు పోవచ్చు అని చెప్పేందుకు మాస్కో వెళ్లి వుండాల్సింది, కానీ గట్టిగా వ్యవహరించాలనే ప్రవత్తిగల ట్రంప్‌ ముందుగానే తుపాకిని ఎక్కు పెట్టి ఒప్పందాన్నుంచి వైదొలుగుతామని చెప్పాడు. రష్యా గురించి గట్టిగా మాట్లాడి రాజకీయంగా లబ్దిపొంద చూసేందుకు రాజకీయవేత్తలు ప్రయత్నిస్తున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్ధ నొవొస్తి పేర్కొన్నది.

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం రద్దయితే పర్యవసానాలేమిటి? మరోసారి ఆయుధ పోటీకి అమెరికా తెరలేపినట్లు అవుతుంది. అని వార్యంగా రష్యా, చైనా ఇతర దేశాలు అందుకోసం అమెరికా అంతగాకపోయినా అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఐరోపా గడ్డమీద ఆయుధాలు పెరుగుతాయి. అక్కడి దేశాలు తమ రక్షణ ఖర్చును గణనీయంగా పెంచుకోవాల్సి వుంటుంది, అదిగాకుండా అమెరికా ఆయుధాలకు అదనంగా చెల్లించాల్సిన పరిస్ధితి. వీటన్నింటి వలన ప్రయివేటు రంగంలోని అమెరికా మిలిటరీ పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. తన రాజకీయ వైఖరికి అనేక అంశాల్లో అడ్డుపడుతున్న రష్యాపై అనేక ఆంక్షలను అమలు జరుపుతున్న అమెరికా రాబోయే రోజుల్లో మరింగా విస్తరించవచ్చు. ఒప్పందం నుంచి అమెరికా వైదులుగుతున్న కారణంగా నాటో కూటమి, ఐరోపా యూనియన్‌ దేశాల మధ్య విబేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐరోపా తన భద్రతను తాను చూసుకోగలదు అంటున్న దేశాలు అమెరికా తెచ్చి పెట్టిన కొత్త సమస్యమీద ఎలా స్పందిస్తాయో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వున్న రాయితీలనే ఎత్తి వేస్తున్నవారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారా ?

06 Saturday Oct 2018

Posted by raomk in AP NEWS, BJP, CHINA, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cutting down the farm subsidies, DFI, double the farmers income, India Farm Subsidies

Related image

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా స్విడ్జర్లాండ్‌లోని ప్రతి కుటుంబం రెండున్నరవేల ఫ్రాంక్‌లు(స్విస్‌ కరెన్సీ) దేశ వ్యవసాయ విధానాల అమలుకు మూల్యంగా చెల్లించాల్సి వస్తోందని సెప్టెంబరు రెండవ వారంలో ఒక వార్త వచ్చింది. ఇది రాసే సమయానికి ఒక ఫ్రాంక్‌ విలువ 75రూపాయలకు పైబడి వుంది. అంటే ప్రభుత్వం నుంచి ఏటా లక్షా తొంభైవేల రూపాయలు రైతాంగానికి సబ్సిడీ లేదా మరో రూపంలో అందుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్ధకు వ్యవసాయ రంగం నుంచి వస్తున్న ఆదాయం 340 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగానికి దేశం ఖర్చు చేస్తున్న మొత్తం 1990 కోట్ల ఫ్రాంక్‌లుగా వుందని, ఇలా ఇంకెంత మాత్రం కొనసాగకూడదని తాజాగా ఒక సంస్ధ తన అధ్యయనంలో పేర్కొన్నది. కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు నేరుగా ఇస్తున్న మొత్తాలు, పన్నుల రాయితీలు 490, దిగుమతుల ఆంక్షల కారణంగా వినియోగదారులకు ధరలు పెరిగి 460, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలు 310, పర్యావరణ నష్టం 730 కోట్ల ఫ్రాంక్‌ల వంతున వున్నట్లు దానిలో తేల్చారు. పురుగు మందుల వాడకం, మాంసం కోసం పెంచే పశువుల పెంపకం, మాంస పరిశ్రమల ద్వారా జరిగే పర్యావరణ నష్టాల వంటివాటిని వ్యవసాయానికి చేస్తున్న ఖర్చుగా లెక్కించారు.

ఐరోపాలో వ్యవసాయానికి రాయితీలు ఇచ్చే దేశాల వరుసలో నార్వే, ఐస్‌లాండ్‌, స్విడ్జర్లాండ్‌ మొదటి మూడు స్ధానాల్లో వున్నాయి. స్విస్‌లో వ్యవసాయ రంగానికి అవుతున్న మొత్తం ఖర్చు పైన చెప్పుకున్నట్లుగా 1990 కోట్ల ఫ్రాంక్‌లైతే ఆ రంగం ద్వారా వచ్చే మొత్తం 340 కోట్లకు వ్యవసాయ వస్తువులపై విధించే దిగుమతి పన్ను ద్వారా వచ్చే 60కోట్లను కూడా కలుపుకుంటే నికరంగా ప్రభుత్వం అంటే జనం భరించే మొత్తం 1590 కోట్ల ఫ్రాంక్‌లని, ప్రతి కుటుంబానికి 4,500 ఫ్రాంక్‌లైతే పర్యావరణ నష్టాన్ని మినహాయించి లెక్కవేస్తే 2,570 ఫ్రాంక్‌లను భరించాల్సి వస్తోందని లెక్కలు చెప్పారు. ఈ నివేదిక చదివిన,విన్న,కన్నవారు ఇంత భారం మోపి వ్యవసాయం చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, కావాల్సినవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పోదా అనుకోవటం సహజం.ఈ లెక్కలు అక్కడి పాలకులకు తెలియవా ? అసలు విషయం ఏమంటే వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేయాలనేవారి కుతర్కమిది. స్విస్‌ వ్యవసాయ- ఆహార పరిశ్రమ ద్వారా ఏటా జిడిపికి 9000 కోట్ల ఫ్రాంక్‌లు సమకూరుతున్నాయి.వ్యవసాయం లేకపోతే దానికి ముడిసరకులు ఎక్కడి నుంచి వస్తాయని కొన్ని పార్టీల వారు ఆ నివేదిక మీద ధ్వజమెత్తారు. ప్రస్తుతం అక్కడ వున్న వ్యవస్ధలో పన్నెండుశాతం మంది రైతులు నష్టపోతున్నారన్నది వాస్తవమని ఒక పత్రిక రాసింది.

అయినప్పటికీ 2018ా21మధ్య 78.9 కోట్ల ఫ్రాంక్‌ల సబ్సిడీ కోత పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.2014 వివరాల ప్రకారం అక్కడి రైతు కుటుంబం సగటున ఏడాదికి 65వేల ఫ్రాంక్‌ల రాయితీలు పొందుతున్నది. వ్యవసాయ పంటల మీద వచ్చే నిఖరాదాయం 3000 ఫ్రాంక్‌లు, ఇతర ఆదాయం 26వేలు కలుపుకుంటే మొత్తం 94వేల ఫ్రాంక్‌లు పొందుతున్నట్లు అంచనా వేశారు. 2004ా14 మధ్య సగటున అక్కడి రైతు కుటుంబాల ఆదాయం 12శాతం పెరిగింది. గమనించాల్సిన అంశం ఏమంటే వ్యవసాయం ద్వారా వచ్చే నిఖరాదాయం ఇదే కాలంలో 13 నుంచి మూడు వేల ఫ్రాంక్‌లకు పడిపోయింది. మరి పెరుగుదల ఎలా సాధ్యమైందంటే సబ్సిడీలు 37శాతం, వ్యవసాయేతర ఆదాయం 22శాతం పెరుగుదల ఫలితం. భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ రైతాంగంలో కొంత మంది ఇప్పటికీ దారిద్య్రంలోనే వున్నారు.మన దగ్గర దారిద్య్రం గోచిపాతరాయుళ్ల రూపంలో కనిపిస్తే అక్కడ సూటు, కోటు వేసుకొని కనిపిస్తారు. దాదాపు 50శాతం వరకు రాయితీలు పొందుతున్న రైతుల పరిస్ధితే అలా వుంటే మన దగ్గర రోజు రోజుకూ సబ్సిడీలు తగ్గిస్తున్న పాలకులు మరోవైపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు.

తల్లికి తిండి పెట్టని వాడు పిన్నమ్మ చేతికి బంగారు గాజులు వేయిస్తానంటే నమ్మగలమా ! గతంలో రైతులకు ఇచ్చిన రాయితీలకు కోత పెడుతూ, మేం ఇచ్చిన రాయితీలు మీతో అంగీకరించిన వ్యవసాయరాబడిలో పదిశాతం మొత్తానికి లోబడే వున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్ధకు సంజాయిషీ ఇస్తున్న మన పాలకులు రాబోయే రోజుల్లో రాయితీలు తగ్గించటం తప్ప పెంచే అవకాశాలు లేవని ముందుగా తెలుసుకోవాలి. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలు పదిశాతం మేరకు పెరిగినట్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు మీడియా పేర్కొన్నది. ఎరువుల సబ్సిడీ 64970 కోట్ల రూపాయల నుంచి 70100 కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. దేశ స్ధూల జాతీయోత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది, త్వరలో చైనాను అధిగమిస్తాం, దానికి మా నరేంద్రమోడీఏ కారణమంటూ ఒక వైపు భజన సాగుతోంది. దానికి అనుగుణ్యంగా లేదా ద్రవ్యోల్బణం మేరకు రైతాంగానికి సబ్సిడీలు మాత్రం పెరగటం లేదు. 2008-09లో మిశ్రమ ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ 65554 కోట్లు యూరియాకు 33940 కోట్లు మొత్తం 989494 కోట్ల రూపాయలకు గాను తాజా బడ్జెట్‌లో కేటాయింపుపైన పేర్కొన్న మొత్తం. అంటే 30వేల కోట్లకు కోత పడింది. తాజా 70వేల కోట్లలో యూరియా సబ్సిడీ 45వేల కోట్లు అయితే మిశ్రమ ఎరువులకు 25వేల కోట్లు మాత్రమే. అంటే మిశ్రమ ఎరువులు వాడే రైతుల మీద ఈ కాలంలో 40వేల కోట్ల అదనపు భారం పడుతున్నట్లే. నూతన ఎరువుల రాయితీ విధానం ప్రకారం నూట్రియంట్‌లను బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.2013-14లో అంటే మోడీ అధికారానికి రాక ముందు ఎన్‌పికె,సల్పర్‌ ఎరువులను ఒక్కొక్క కిలో చొప్పున కొన్న రైతుకు రు.20.875,18.679,18.833,1.677 అంటే మొత్తం రు.60.06లను ప్రభుత్వ సబ్సిడీగా ఇచ్చింది. ఇదే ఎరువులను మోడీ హయాంలో అంటే ఇప్పుడు కొనుగోలు చేస్తే ఆ మొత్తం రు.47.96కు తగ్గిపోయింది. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ శక్తులకు వదలి వేసింది. నిర్ణీత మొత్తాన్ని రాయితీగా ఇస్తోంది. 2011-12నుంచి ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత అప్పటి నుంచి సబ్సిడీ మొత్తం 70వేల కోట్లకు అటూ ఇటూగానే వుంటోంది. రాబోయే రోజుల్లో ఒక వేళ యూరియా ధరలను పెంచితే ఇంతకంటే తగ్గవచ్చు తప్ప పెరిగే అవకాశాలు లేవు. కొన్ని ఎరువుల ధరలు ఎలా పెరిగాయో చూద్దాం. డిఏపి 2017 ఏప్రిల్‌లో టన్ను రు. 21,818, 2018 మార్చి నాటికి 23,894కు చేరింది. జూలై నెలలో 25,706 వున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిత్వశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. టన్నుకు నాలుగు వేలు పెరిగింది. అన్నింటికీ ఇంత పెద్ద ఎత్తున లేనప్పటికీ గణనీయంగా పెరిగాయి.

దేశంలో వినియోగించే డీజిల్‌ ప్రతి వందలో 14 లీటర్లు వ్యవసాయానికి అవుతోంది. వ్యవసాయ వుత్పత్తులను రవాణా చేసే ట్రక్కులది కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. డీజిల్‌ ధరలపై నియంత్రణను మోడీ సర్కార్‌ ఎత్తివేసింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు ఢిల్లీలో ఒక రైతు ట్రాక్టర్‌కు ఒక రోజు పది లీటర్ల డీజిల్‌ను వాడితే 2014 మార్చినెల ఒకటవ తేదీన రు 554.80 చెల్లించాడు. లీటరుకు రు.8.37 చొప్పున 83.70 సబ్సిడీ పొందాడు. అదే రైతు 2018 సెప్టెంబరు 17న అదే ఢిల్లీ బంకులో రు.738.70 చెల్లించాడు. నాలుగేండ్ల క్రితం పీపా అన్ని ఖర్చులతో 126.93 డాలర్లకు దిగుమతి చేసుకున్నాం. సెప్టెంబరు 17న 93.45 డాలర్లకే వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ జరిగిన మార్పేమిటంటే దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర తగ్గింది, ఇతరులతో పాటు రైతులకు వచ్చే రాయితీ ఎగిరిపోయింది, 180 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. నాలుగేండ్ల క్రితం ఒక లీటరు డీజిలుపై ఎక్సయిజు పన్ను రు.3.56, దాన్ని మోడీ గారు రు.15.33 చేశారు.

మోడీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ 58 అయితే ఇప్పుడు 73వరకు పతనమైంది. దీని వలన రైతాంగం వినియోగించే పురుగుమందులలో దిగుమతి చేసుకొనే వాటి ధర ఆ మేరకు పెరుగుతుంది. ఒక లీటరు మందును నాలుగు సంవత్సరాల క్రితం 58కి కొంటే ఇప్పుడు 73 చెల్లించాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ 45-50 మధ్యనే వుంది. రానున్న రోజుల్లో ఇంకా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను కొనసాగిస్తున్నాయి. అమెరికా 95, బ్రెజిల్‌ 75శాతం స్ధాయికి చేరుకుంటే డీజిల్‌ వినియోగం ఇంకా పెరుగుతుంది. వ్యవసాయ ఖర్చు తగ్గించే పేరుతో యాంత్రీకరణ, దానికి డీజిల్‌ ఖర్చు తడిచి మోపెడైతే బాగుపడేది యంత్రాలను తయారు యజమానులు, చమురు కంపెనీల వారు, పన్నులతో జనాల జేబులకు కత్తెర వేసే ప్రభుత్వం తప్ప ఇంక రైతాంగానికి మిగిలేదేముంటుంది.

Image result for double the farmers income

ఇప్పటికే వున్న సబ్సిడీలు రద్దు లేదా నామమాత్రం అవుతున్నాయి. వాటి కంటే మోయలేని కొత్త భారాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు గద్దెనెక్కినా లేదా వాటికి మద్దతు పలికి భుజాలు నొప్పి పుట్టేట్లు మోసిన ప్రాంతీయ పార్టీల వారు గానీ రైతాంగానికి, మొత్తంగా జనానికి నిజాలు చెప్పటం లేదు. మన దేశంలో ఆహార భద్రతలో భాగంగా పౌరపంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా చేసే ఆహార ధాన్యాలకు ఇచ్చే రాయితీలు లేదా నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా కొన్ని సందర్భాలలో వ్యవసాయ రాయితీలలో భాగంగా చూపుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో మోడీగారు ఆబగా కౌగలించుకొనే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఫిర్యాదులో సారాంశమిదే. కనీస మద్దతు ధరల ప్ర కటనను కూడా రాయితీల కిందనే జమకడుతోంది. పౌర పంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలని, రాయితీలు ఇవ్వాలనుకుంటే లబ్దిదార్లకు నేరుగా నగదు ఇవ్వాలని, ఎఫ్‌సిఐ ద్వారా కొనుగోళ్లను నిలిపివేసి మొత్తం వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదలి వేయాలన్నది అమెరికాతో సహా ధనిక దేశాలన్నీ సంస్కరణల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వంతపాడుతున్నాయి. అందుకు అంగీకరించిన మోడీ సర్కార్‌ తొలి దశలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఛండీఘర్‌, పాండిచ్చేరిలో చౌకదుకాణాలను ఎత్తివేసింది. క్లబ్బుడాన్సర్‌లు ఒంటి మీది దుస్తులను ఒకటకటి తొలగించే మాదిరి మన పాలకులు సబ్సిడీలను ఎత్తి వేస్తున్నారు.ఎఫ్‌సిఐకి చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పుగా మార్చివేస్తోంది. 2015-16లో లక్షా35వేల కోట్ల రూపాయలు ఆహార సబ్సిడీ కాగా మరుసటి ఏడాది దానిని లక్షా ఐదువేల కోట్లకు తగ్గించి 25వేల కోట్ల రూపాయలను జాతీయ చిన్నపొదుపు మొత్తాల నిధి నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పుగా అందచేశారు. కేటాయించిన మొత్తాలను కూడా చెల్లించకుండా బకాయి పెట్టి మరుసటి ఏడాది ఆ బకాయిలను కూడా చెల్లింపులలో చేర్చి ఆహార సబ్సిడీ మొత్తాన్ని పెంచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

వివిధ కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల్లో పెరుగుదల లేకపోవటం లేదా తగ్గుదల కనిపిస్తోంది. ఈ సమయంలోనే మోడీ సర్కార్‌ రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తానంటూ ముందుకు వచ్చింది. ప్రపంచ మార్కెట్‌తో పోల్చితే కొన్ని సందర్భాలలో మన దేశంలో ధరలు ఎక్కువగా వున్నాయి. అవి తమకు గిట్టుబాటు కావటం లేదని మన రైతాంగం గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్ధితులలో అనేక దేశాలు తమ రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. 2015లో అమెరికాలో ఒక్కొక్క రైతుకు సగటున 7,860 డాలర్లు, బ్రిటన్‌లో 28,300 పౌండ్లు, జపాన్‌లో 14,136, న్యూజిలాండ్‌లో 2,623 డాలర్లు చెల్లించగా మన దేశంలో 417 డాలర్లు మాత్రమే ఇచ్చినట్లు తేలింది. రైతుల ఆదాయాల రెట్టింపు చేయాల్సిన అవసరం, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక గురించి నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ ఒక పత్రాన్ని రూపొందించారు. 2004-05 నుంచి 2011-12 మధ్య దేశంలో వ్యవసాయదారుల సంఖ్య 16.61 కోట్ల నుంచి 14.62కోట్లకు పడిపోయింది. ఈ ధోరణే కొనసాగితే 2015-16 నుంచి 2022-23 మధ్య మరొక కోటీ 96లక్షల మంది అంటే రోజుకు 6,710 మంది వ్యవసాయం మానుకొంటారని అంచనా వేశారు. జనం తగ్గుతారు గనుక వ్యవసాయ ఆదాయం పెరుగుతుందని, కనుక సబ్సిడీలు తగ్గించవచ్చని కొందరు వాదించేవారు లేకపోలేదు.

అన్ని తరగతుల వారికీ టోకరా వేసి వచ్చే ఎన్నికలలో ఏదో విధంగా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పూనుకున్న పెద్ద మనుషులు అమాయకపు రైతాంగాన్ని వదలి పెడతారా ? 2022 అంటే మనకు స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడిచే నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది నరేంద్రమోడీ అండ్‌ కో చేసిన వాగ్దానం. దాన్ని ఎలా అమలు జరుపుతారు,ఆ దిశలో ఎంతవరకు పయనించారు అని అడుగుదామంటే కుదరదు.ఎందుకంటే ఆ పెద్దమనిషి చెప్పరు, అడుగుదామంటే మీడియాతో మాట్లాడరు. భజనపరులకు అడిగే ధైర్యం ఎలాగూ వుండదు. మౌనమునిగా మన్మోహన్‌సింగ్‌ను వర్ణించిన బిజెపి పెద్దలు తమలో అంతకంటే పెద్ద మహామౌన మునిని పెట్టుకొని లేనట్లే ప్రవర్తిస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాలనా కాలంలో మూడు సార్లు మీడియాతో మాట్లాడితే నరేంద్ర ముని ఐదేండ్లలో ఇంతవరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. రైతు జనోద్ధారకుడిగా రాబోయే రోజుల్లో ఓటర్ల ముందుకు వెళ్లేందుకు అమలులో వున్న మూడు పాత పధకాలను కలిపి స్వల్పమార్పులతో కొత్తగా ప్రధాన మంత్రి ఆషా పేరుతో అమలు జరుపుతామని ప్రకటించారు.

రైతాంగ ఆదాయాల రెట్టింపు అన్నది ఆషామాషీ సమస్య కాదు. దానిలో ఎన్నో అంశాలు ఇమిడి వున్నాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపధ్యంలో వారి బాగుకోసం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతున్నది. స్వామినాధన్‌ కమిషన్‌ వున్నంతలో ఒక శాస్త్రీయ సూత్రాన్ని చెప్పింది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేయటం గురించి ఇంతవరకు ఎలాంటి సర్వే జరపలేదు, ఒక ప్రాతిపదికను ఏర్పరచలేదన్నది పచ్చి నిజం.ఈ విషయాన్ని వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్‌ రూప్లా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2013లో జరిపిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) తప్ప తరువాత ఇంతవరకు అలాంటిది జరగలేదు. దానిలో ( 2012 జూలై 2013జూన్‌ మధ్య జరిపిన సర్వే) వ్యవసాయ రంగం పరిస్ధితి మదింపు సర్వే అంశాలనే పార్లమెంట్‌కు సమర్పించారు.

ఆ నివేదికలో వున్న అంశాలేమిటి? దేశ రైతు కుటుంబ తలసరి నెలసరి ఆదాయం రు.6,426, బీహార్‌లో అతి తక్కువ రు.3,558, పశ్చిమ బెంగాల్‌లో రు.3980, వుత్తరా ఖండ్‌లో రు.4,701 కాగా అత్యధికంగా పంజాబ్‌లో రు.18,059, హర్యానాలో రు.14,434, జమ్మూకాశ్మీర్‌లో రు.12,683 వున్నాయి. ఇక తెలుగురాష్ట్రాలకు వస్తే తెలంగాణా రు.6,311, ఆంధ్రప్రదేశ్‌ రు.5,979 చొప్పున వున్నాయి. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కేరళ రు.11,888, కర్ణాటక రు.8,832, తమిళనాడు రు.6,980. నాబార్డు రూపొందించిన నివేదిక ప్ర కారం 2015-16లో దేశ తలసరి కుటుంబ నెలాదాయం రు. 8,931కి పెరిగింది. అత్యధికంగా మొదటి మూడు రాష్ట్రాలైన పంజాబ్‌లో రు.23,133, హర్యానాలో రు.18,49,, కేరళలోరు.16,927 వున్నాయి. చివరి మూడు రాష్ట్రాలైన వుత్తర ప్రదేశ్‌లో 6,668,ఆంధ్రప్రదేశ్‌లో రు.6,920, ఝార్ఖండ్‌లో రు.6,991 వుంది. తెలంగాణాలో రు.8,951, తమిళనాడులో రు.9,775, కర్ణాటకలో రు.10,603గా నమోదైంది.

Image result for cutting down the farm subsidies,india cartoons

ఈ రెండు నివేదికల మధ్య ఆదాయ పెరుగుదల దేశ సగటు 39శాతం వుంది. మహారాష్ట్ర ఒక్కటే దేశ సగటును కలిగి వుంది. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను పరిశీలిస్తే నాలుగు రాష్ట్రాలలో ఒకటి నుంచి 16.5శాతం వరకు తగ్గగా గరిష్టంగా మూడు రాష్ట్రాలలో 94.9 నుంచి 130.9శాతం వరకు పెరుగదల వుంది. దేశ సగటుకు ఎగువన తొమ్మిది రాష్ట్రాలు 39-65.7శాతం మధ్య వున్నాయి. మిగిలిన చోట్ల తక్కువ నమోదైంది. తెలంగాణాలో 41.8శాతం పెరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 15శాతమే వుంది. మూడు సంవత్సరాలలోనే ఇంతటి ఎగుడుదిగుడులు వున్నపుడు ఆదాయాల రెట్టింపునకు ప్రాతిపదిక దేనిని తీసుకోవాలి అన్నది సమస్య. భిన్న ప్రాంతాలు, భిన్న వాతావరణం, భిన్న పంటలు, వనరులు ఇలా అనేక అంశాలలో ఏ ఒక్క రాష్ట్రమూ మిగతావాటితో వాటితో పోల్చటానికి లేదు. ఈ పూర్వరంగంలోనే నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఏడాదికేడాది రైతుల ఆదాయాన్ని మదింపు వేసేందుకు పూనుకుంది, వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది. ఒక అంచనా మేరకు నిజధరల ప్రకారం ప్రస్తుతం రైతుల ఆదాయం ఏటా 3.8శాతం పెరుగుతున్నది. మరోవైపు మార్కెట్‌ ధరల ప్రకారం 11శాతం పెరుగుదల చూపుతున్నది. ఈ లెక్కన మోడీ చెబుతున్నట్లు 2022 నాటికి ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి? నిజధరల మేరకు ఆదాయాలు రెట్టింపు కావాలంటే రెండుదశాబ్దాలకుపైనే పడుతుంది. ఈ లోగా వచ్చే మార్పుల సంగతేమిటి?

వ్యవసాయం, పశుసంపద, చేపల పెంపకాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఆదాయం లెక్కలు వేస్తున్నారు. కేరళ, హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలలో అడవి మీద ఆధారపడే వారు గణనీయంగా వున్నారు. వారిని ఎలా లెక్కిస్తారు. మిగతా రాష్ట్రాలలో అడవుల నుంచి వచ్చే ఆదాయాన్ని కలిపి వాటికి తేడాలు రావా ? ఆదాయం ఎక్కువగా వున్న పంజాబ్‌, హర్యానా, లేదా దేశ సగటుకు దగ్గరగా వున్న మహారాష్ట్రల్ల వ్యవసాయ రంగంలో సంక్షోభం కనిపిస్తున్నది. గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఏటా 16.5శాతం వ్యవసాయ అభివృద్ధిని సాధిస్తున్నది. చిత్రం ఏమిటంటే గిట్టుబాటు ధరలు కావాలని, రుణాల రద్దును కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున రైతులు వీధుల్లోకి వచ్చారు. అందువలన అభివృద్ధి అంటే ఏమిటి? ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే తరువాత మూడు సంవత్సరాలలో సగటున రైతుల ఆదాయం 39శాతం పెరిగిందని నాబార్డు నివేదిక చెప్పింది. ఈ కాలంలో పాత విధానాల కొనసాగింపు తప్ప ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవు. ఆ నివేదికే వాస్తవం అనుకుంటే కొన్ని చోట్ల రెట్టింపు ఆదాయాలు ఇప్పటికే వచ్చాయి, మరికొన్నిచోట్ల వున్న ఆదాయాలకే గండిపడింది. వీటిని ఎలా చూడాలి? ఏనుగు ఎలా వుందని అడిగితే తలా ఒక వర్ణన చేసినట్లుగా ఎవరి అవగాహనకు అనుగుణంగా వారు నివేదికలు ఇస్తున్నట్లు మనకు స్పష్టం అవుతున్నది. దారీ తెన్నూ నిర్ధారించుకోలేని మోడీ సర్కార్‌ రైతాంగాన్ని ఎక్కడికో తీసుకుపోతోంది తప్ప ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d