• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

మనకూ చైనాకూ పోలిక హాస్యాస్పదం !

04 Tuesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, China Trade surplus, Currency Value, Indian Rupee, Rupee, yuan

Image result for yuan vs rupee

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -2

ఎం కోటేశ్వరరావు

మన రూపాయే కాదు చైనా యువాన్‌ కూడా అంతకంటే ఎక్కువగానే పతనమైంది కదా, దాని గురించి మాట్లాడరేమని ఒక విమర్శ. ఈ విషయంలో చైనాతో పోల్చేవారు మిగతా అంశాలలో కూడా ఆ దేశంతో పోల్చితే నిజాయితీగా వుంటుంది. మన కంటే బాగా అభివృద్ధి చెంది, జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగింది అంటే అది కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామిక దేశం అని వితండవాదం.మనకంటే అనేక దేశాలలో ప్రజాస్వామ్యమేగా వుంది, వాటితో సమంగా లేదా దగ్గరగా అయినా ఎందుకు ఎదగలేదు అంటే సమాధానం వుండదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి మనకంటే యువాన్‌ పతన శాతం ఎక్కువ కాదు, గణనీయంగానే మనకు దగ్గరగా పడిపోయింది. మన కంటే పొరుగున వున్న పాక్‌ రూపాయి డాలరు మారకంతో మరింతగా పతనమైంది. దాన్ని చూసి మన దేశం మోడీ పాలనలో వెలిగిపోతున్నట్లు భావించాలా ?

కరెన్సీ విలువల పనితీరు గురించి చెప్పేటపుడు పోలిక సాధారణం. కరెన్సీ పతనమైన దేశాలన్నీ ఏదో ఒక తీవ్ర సమస్యను ఎదుర్కొంటాయి. పతనం కాని దేశాలన్నీ సజావుగా వున్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే ! ఒక దేశ కరెన్సీ విలువ పతనం లేదా పెరుగుదల అన్నది వాటి పరిస్ధితులు, అంతర్గత విధానాల మీద ఆధారపడి వుంటాయి. తెలిసి లేదా తెలియకగానీ చైనాను ముందుకు తెస్తున్నారు గనుక దాని గురించే చూద్ధాం. మన దేశం దాదాపు ప్రతి దేశంతో వాణిజ్యలోటులోనే వుంది. అంటే మనం చేసే ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. అందువల్లనే మన విదేశీమారక ద్రవ్య ఎప్పటి కప్పుడు ఎన్నినెలల దిగుమతులకు సరిపడా వుంటుంది అని లెక్క పెట్టుకుంటూ వుంటాము. చైనాకు మరికొన్ని దేశాలకు అటువంటి దురవస్ధలేదు. 2013లో మన దగ్గర ఆరునెలల దిగుమతులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు పది నెలలకు సరిపడా వున్నాయి. కొందరు వూహిస్తున్నట్లు త్వరలో రూపాయి పతనం 74కు చేరితే ఆ నిల్వలు హరించుకుపోతాయి. చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో మన కంటే ఎక్కువగా డాలర్లు వున్నాయి. చైనా గురించి చెప్పనవసరం లేదు. మన నిల్వలు 400 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా వుంటే చైనా వద్ద 3,110 బిలియన్లు వున్నాయి. తరువాత స్ధానంలో జపాన్‌ 1,250 బిలియన్‌ డాలర్లతో వుంది. డాలర్‌ విలువతో పోల్చితే చైనా,జపాన్‌ కరెన్సీల విలువ తక్కువే. సెప్టెంబరు మూడున( 2018 ) ఒక చైనా యువాన్‌కు మన రు.10.43, జపాన్‌ ఎన్‌కు రు.1.56 మారకపు విలువగా వున్నాయి.

ప్రతి దేశం తన కరెన్సీ విలువను పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయించుకుంటుంది. ప్రజల ప్రయోజనాలను పట్టించుకోదు. చైనా,వియత్నాం, క్యూబా, వుత్తర కొరియా వంటి సోషలిస్టు దేశాల పాలకవర్గం కార్మికవర్గమే కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా వాటి విధానాలు వుంటాయి. అయితే అవి ఇతర పెట్టుబడిదారీ దేశాలతో కూడా ముడిపడి వున్నాయి కనుక వాటికి కూడా కొన్ని సమస్యలు వుంటాయి. ప్రస్తుతం ద్రవ్య పెట్టుబడి పెత్తనం నడుస్తోంది కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా కరెన్సీల విలువ నిరంతరం మారుతూ వుంటుంది. వుదాహరణకు ఒక యూరో లేదా బ్రిటీష్‌ పౌండ్‌తో ఇప్పుడు రెండు అమెరికన్‌ డాలర్లు కొనే అవకాశం వుంది. మొదటి రెండు కరెన్సీలు తమ విలువను కొంత తగ్గించుకుంటే అప్పుడు ఒకటిన్నర డాలర్లే వస్తాయి. అధికారికంగా చేస్తే విలువ తగ్గింపు లేదా మార్కెట్‌ శక్తుల కారణంగా తగ్గితే దాన్ని పతనం అంటారు. మన రూపాయి విలువలో జరిగిన మార్పుల క్రమం ఇలా వుంది.

స్వాతంత్య్రం పొందిన సమయంలో మన రూపాయి బ్రిటీష్‌ పౌండ్‌తో ముడివడి వుంది. ఒక పౌండుకు ఒక రూపాయి విలువ వుండేది.1949లో బ్రిటన్‌ తన కరెన్సీ విలువను తగ్గించటంతో మనది కూడా ఆమేరకు తగ్గింది.1966లో మన దేశం తొలిసారిగా చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్నది, దానికి తోడు దుర్భిక్షం, పాకిస్ధాన్‌తో యుద్దం తదితర కారణాలు తోడయ్యాయి. అప్పు కావాలంటే దేశ ఆర్ధిక వ్యవస్ధలోకి విదేశాలకు మార్కెట్లు తెరవాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులు విధించాయి. తొలిసారిగా వాటిని అంగీకరించి రూపాయి విలువను 36.5శాతం తగ్గించి డాలరుకు 4.76 నుంచి 7.50కు పడిపోయేట్లు ప్రభుత్వమే చేసింది. దాని పర్యవసానాలతో 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ తొలిసారి తొమ్మిది రాష్ట్రాలలో ఏర్పడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తి తదుపరి చీలి పోవటం వంటి పరిణామాలు, దాని కొనసాగింపుగానే 1975లో అత్యవసర పరిస్ధితికి దారి తీసింది. 1971లో రూపాయిని డాలర్‌తో ముడివేశారు.1972లో తిరిగి రూపాయిని బ్రిటీష్‌ పౌండ్‌తో ముడివేశారు.1975లో ప్రధాన కరెన్సీలతో మారకపు విలువలను ముడివేశారు, కాలనుగుణ్యంగా కొన్ని మార్పులు చేసినా ఆ సంబంధాలను 1991వరకు కొనసాగించారు. ఆ ఏడాది ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా 19శాతం వరకు రూపాయి విలువను తగ్గించటమే గాక క్రమంగా 1994నాటికి వాణిజ్యం కోసం స్వేచ్చగా మార్కెట్‌ శక్తులకు మన రూపాయిని వదలి వేశారు. అప్పటి నుంచి డాలరుకు రు. 31.37గా వున్న విలువ క్రమంగా పతనమౌతూ మోడీ హయాంలో 71 దాటి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇది తప్పుడు విధానమని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని రుజువైంది. కాంగ్రెస్‌ ప్రారంభించిన ఈ క్రమాన్ని బిజెపి తు.చ తప్పకుండా అనుసరిస్తోంది.

హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక(ఇదేమీ కమ్యూనిస్టు అనుకూలం కాదు) తాజా విశ్లేషణ సారాంశం ఇలా వుంది. రాబోయే రోజుల్లో అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే ఏమోగాని యువాన్‌ విలువ ఒక శాతం పతనమైతే చైనా ఎగుమతులు 0.6శాతం పెరుగుతాయి. జూన్‌ మధ్యనాటికి ఐదుశాతం పతనమైనందున నాలుగో త్రైమాసికం నుంచి మూడుశాతం ఎగుమతులు పెరుగుతాయి.(తాజా విలువల ప్రకారం యువాన్‌ ఎనిమిదిశాతం పతనం అయింది) దీని వలన అదనంగా వచ్చే 68.4బిలియన్‌ డాలర్లు చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి పన్ను కంటే ఎక్కువ.

ఆర్ధికవేత్తల విశ్లేషణల ప్రకారం వాణిజ్య మిగులు కారణంగా ముందే చెప్పుకున్నట్లు చైనా దగ్గర డాలర్ల నిల్వలు మూడులక్షల కోట్ల డాలర్లకు పైగా వున్నాయి. వాటిలో 1.4లక్షల కోట్ల డాలర్లను అమెరికా అప్పుగా తీసుకుంది. ఇప్పుడు గనుక చైనా అప్పు వసూలు చేసుకొనేందుకు అమెరికా బాండ్లను విక్రయిస్తే డాలరు విలువ పతనం అవుతుంది. చైనా యువాన్‌ విలువ పెరుగుతుంది. చైనా ఇంకే మాత్రం డాలర్ల ఆస్ధులను కొనుగోలు చేయకపోయినా, అమెరికాతో కరంటు ఖాతా మిగులు వున్నందున డాలర్లు చైనా వ్యవస్ధలోకి ప్రవేశించినపుడు దాని కరెన్సీ విలువ పెరుగుతుంది. అందువలన అవసరం వున్నా లేకపోయినా డాలరు ఆస్ధులను కొనుగోలు చేసి తన కరెన్సీ విలువ బలహీనంగా వుంచటం ద్వారా తన ఎగుమతులు మరింతగా గిట్టుబాటు అయ్యేట్లుగా చూసుకోగలుకు తుంది. పరిమితంగా డాలర్ల నిల్వలున్న దేశాలకు వాటిని విక్రయించి తమ కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అవకాశాలు తక్కువగా వుంటాయి.

ఈ నేపధ్యంలో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఏమి చేయగలదో, ఏమి చేస్తోందో ఎవరైనా చెబుతారా, ఇంతవరకు అలాంటి ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. మోడీ హయాంలో 58 నుంచి 71కి మన రూపాయి పతనమైంది. మన కరెన్సీ విలువ పడిపోయినా ఒక్క ఐటి సేవల ఎగుమతులు తప్ప ఇతర వస్తు ఎగుమతులు నేలచూపులు చూడటం తప్ప పైకి లేవలేదు. ఎక్కడుందీ వైఫల్యం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న అమెరికా !

17 Sunday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

Donald Trump starting trade war, TRADE WAR, US-CHINA TRADE WAR

Image result for Is Donald Trump starting trade war

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక బఫూన్‌ కావచ్చు, కానీ అతగాడి వాణిజ్య యుద్ధం నిజం, ట్రంప్‌ ఎల్లవేళలా వాణిజ్య యుద్ధాన్ని కోరుకుంటాడు, ఇప్పుడు ఎన్నో తెచ్చుకున్నాడు, ట్రంప్‌ వాణిజ్య యుద్ధం ఎంతటి తప్పిదమో ఒక విదూషకుడు కూడా చెప్పగలడు, గనులు, రైతుల లక్ష్యంగా వాణిజ్య యుద్ధం ఇప్పటికే ట్రంప్‌ గుండెకాయను తాకింది, చైనా పన్నులు ఇప్పటికే ట్రంప్‌ ఓటర్లను దెబ్బతీస్తున్నాయి, ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు’.పత్రికలను తిరగేస్తే కనిపిస్తున్న కొన్ని వార్తల శీర్షికలివి. నిజంగా వాణిజ్య యుద్దమే వస్తే కలిగే లాభనష్టాలేమిటన్నది ప్రతి దేశమూ లెక్కలు వేసుకొంటోంది. గతంలో పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తరణ కోసం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాలు చివరికి దేశాల ఆక్రమణలు, వలసలు, పలు ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అనేక ప్రాంతీయ కూటముల ఏర్పాటు ద్వారా మార్కెట్లను విస్తరించుకొనే, రక్షించుకొనే చర్యలకు పూనుకున్నారు. ఇప్పుడు సరికొత్త రక్షణాత్మక చర్యలకు పూనుకోవటమే తాజా వాణిజ్య యుద్ధ శంఖాల పూరింపు. ఇవి మార్కెట్ల విస్తరణ కాంక్షను, పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన తీవ్ర సమస్యలనూ వెల్లడిస్తోంది.

ట్రంప్‌ బఫూనా లేక వయస్సుతో వచ్చిన చిత్త చాంచల్యంతో ఇలా ప్రవర్తిస్తున్నాడా ? కొంత మందికి నిజంగా కలుగుతున్న సందేహాలివి. అమెరికా పీఠంపై ఒక విదూషకుడిని, ముది, మది తప్పిన ముసలివారిని కూర్చో పెట్టేందుకు అక్కడి కార్పొరేట్‌ శక్తులేమీ తెలివితక్కువవి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో తలెత్తే సంక్షోభాలను ఇతరుల మీదకు తోసి వేసేందుకు సామ,దాన, బేధోపాయాలు విఫలమైన తరువాత దండోపాయాన్ని ప్రయోగిస్తారు. దానిలో ఒక రంగం వాణిజ్య యుద్ధం. కమ్యూనిస్టు చైనా మీదే కాదు, పక్కనే వున్న తన అనుంగు దేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు అంతర్జాతీయ రంగంలో దుర్మార్గపు పనులు చేసేందుకు సై అంటే సై అని కలసి వచ్చే ఐరోపా ధనిక దేశాల మీద కూడా ట్రంప్‌ ఇప్పుడు బస్తీమే సవాలు అంటూ పలు రంగాలలో దాడులకు సిద్ధం అవుతున్నాడు. కొద్ది వారాల క్రితం చైనాతో వాణిజ్య యుద్ధం దాదాపు వచ్చినట్లే అనేంతగా వాతావరణం ఏర్పడినపుడు నాటకీయంగా పరిష్కారమైందని చెప్పారు. ఇప్పుడు తిరిగి మొదలైంది. ఈ రోజు మరణిస్తే రేపటికి రెండు అన్నట్లుగా అమెరికాను పక్కన పెడితే ఇంకా ఆరుగురం వున్నాం, జి6 బృందాన్ని ఏర్పాటు చేద్దాం అంటూ ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించటాన్ని చూస్తే వీటి పర్యవసానాలు అంత తీవ్రంగా వుంటాయా అంటే అవునని చెప్పలేము. ఎందుకంటే ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటంతో పాటు తమకు పోటీదారుగా తయారవుతున్న చైనాను వుమ్మడిగా తప్ప ఎదుర్కోలేమనే భావంతో వున్నాయి. అందువల్లనే పైకి బింకాలు పోయినా వాటి మధ్య రాజీకి అవకాశాలు వున్నాయి. గత మూడు దశాబ్దాల పరిణామాలను చూసినపుడు ధనిక దేశాల మధ్య విబేధాల గ్రాఫ్‌ వూర్ధ్వముఖంగా పయనిస్తోంది.

Image result for Is Donald Trump starting trade war cartoons

కెనడా, ఐరోపా యూనియన్‌, మెక్సికోల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకొనే వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై పదిశాతం పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఇది అంతటితో ఆగకుండా కెనడా, జపాన్‌ ఆటోమొబైల్‌ రంగం మీద కూడా పన్నులు విధించే అవకాశం వుంది. జూలై నుంచి చైనా నుంచి వచ్చే దిగుమతులపై 50బిలియన్‌ డాలర్ల మేరకు పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాపీగా మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అన్నట్లుగా తాము కూడా అదే పని చేయకతప్పదని తనదైన శైలిలో చైనా ప్రకటించింది. ఈ వైఖరి చివరకు ప్రపంచ మాంద్యానికి దారి తీస్తుందా అన్న భయాలు తలెత్తుతున్నాయి. గతేడాది అమెరికా వాణిజ్య లోటు 566 బిలియన్‌ డాలర్లు,ఇది దాని జిడిపిలో 2.9శాతం. జి7 దేశాల మధ్య వాణిజ్య సుంకాలు చాలా తక్కువగా వున్నాయి. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ఐరోపా యూనియన్‌ సగటున కేవలం మూడుశాతమే పన్ను విధిస్తోంది. మనదేదో ప్రపంచ పిగ్గీబ్యాంక్‌ అయినట్లు ప్రతివారూ దాన్నుంచి లబ్ది పొందుతున్నారు, ఇదింకేమాత్రం కుదరదని ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు. నిజానికి అమెరికాకు నష్టం అనేది తప్పుడు ప్రచారమే. అనేక రూపాలలో దానికి వచ్చే ఇతర ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే అది మిగులులోనే వుంటుంది.

గుండెలు బాదుకుంటున్న అమెరికా వాణిజ్య లోటులో సగానికి పైగా (385బిలియన్‌ డాలర్లు) ఒక్క చైనాతోనే వుంది. అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలు కూడా వాణిజ్యలోటు విషయంలో చైనా పట్ల గుర్రుగా వున్నాయి. అదే సమయంలో వివిధ కారణాలతో అమెరికా మాదిరి చైనాతో యుద్ధానికి అవి సిద్దంగా లేవు. ఇదే సమయంలో తాత్కాలికంగా అయినా అమెరికాతో కలసి ఐక్యంగా దాడి చేసే స్ధితిలో కూడా లేవు. అమెరికాకు ఇప్పుడున్న అప్పును చూస్తే ప్రతివారికీ ఆందోళన కలుగుతోంది. మమ్మల్ని కాపాడుకోవటం మీకే శ్రేయస్కరం అన్నట్లుగా అమెరికా వైఖరి కనిపిస్తోంది. అనేక యుద్ధాలలో దెబ్బలు తిన్న అమెరికా ఒకవైపు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధాలతో పాటు రెండో వైపు వాణిజ్య యుద్ధాలకు తెరలేపుతోందని భావిస్తున్నారు. స్వేచ్చా వాణిజ్యం గురించి ఇంతకాలం చెప్పిన అమెరికా దానికి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతోంది. కెనడా, ఐరోపాయూనియన్‌, మెక్సికో వంటి తన మిత్రదేశాలతో పాటు రాజకీయంగా వ్యతిరేకించే చైనాతో యుద్ధానికి పూనుకుంది. సహజంగానే ఈ దేశాలు కూడా ప్రతి చర్యలకు పూనుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వర్గం తక్కువ వ్యయంతో ఎక్కడ వస్తువులు తయారైతే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ తన లాభాలను కాపాడుకుంటోంది. ఆ విధంగా చూసినపుడు ఆ దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్నులు విధించటమంటే తన వినియోగదారులపై భారం మోపటం ఒకటైతే ఎగుమతి చేసే దేశంలో వుత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. అందువలన వుభయతారకంగా సమస్యను పరిష్కరించుకోవటం అందరికీ మేలు. కానీ ట్రంప్‌ అలా అనుకోవటం లేదు, తాను పన్నులు విధిస్తే ఇతర దేశాలు భయపడిపోయి తమ దగ్గర ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తాయని, తద్వారా అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలకు ముప్పు వుండదని భావిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయం, ద్రవ్యరంగం, సాఫ్ట్‌వేర్‌ రంగాలలో పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తోంది. అందుకనే వస్తూత్పత్తి రంగంలో వస్తున్న వడిదుడుకులను ఎదుర్కోగలుగుతోంది. చౌకగా తయారయ్యే దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుండటం, యాంత్రీకరణతో వస్తూత్పత్తి రంగంలో అమెరికన్లకు నానాటికీ పని లభ్యత తగ్గిపోతోంది. వేతనాలు తగ్గిపోతున్నాయి, అది కొనుగోలు శక్తి క్షీణతకు దారి తీస్తుంది. దాని వలన దేశీయంగా వస్తూత్పత్తి కూడా పడిపోతుంది. ఇది ఒక విష వలయం. ఇప్పటికిప్పుడు అమెరికా తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకొనే ధరలకు తయారు చేసి తన వినియోగదారులకు అందించగలదా? అంత సీను లేదు. అందుకే మిగతాదేశాలు కూడా కన్నుకు కన్ను పన్నుకు పన్ను సై అంటున్నాయి. ఇది మరింత ముదిరితే మిగతా దేశాలు తమ వస్తువులు,సేవలను కొనుగోలు చేయటం మానుకుంటే తమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అమెరికన్లలో వుంది. అమెరికా నుంచి వస్తున్న సేవలు, వస్తువులు ఆగిపోతే ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకుంటే నష్టపోయేది అమెరికాయే. లేదూ అదే వ్యాపారం ఇతర దేశాలకు పోయినా నష్టపోయేది అమెరికన్‌ కార్పొరేట్లే. ప్రతి దేశమూ కొన్నింటికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్ధితులలో అమెరికా కొండెక్కితే మిగతా దేశాలు కూడా అదే చేస్తాయి. అందుకే వాణిజ్య యుద్ధం తమకు నష్టదాయకమని అమెరికన్లు భావిస్తున్నారు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధానికి ఇప్పుడున్న లోటు కంటే భవిష్యత్‌లో ఎదురయ్యే పోటీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మేడిన్‌ 2025పేరుతో చైనా రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, పారిశ్రామిక యంత్రాలు, ఆటోమొబైల్‌ రంగాలలో వున్నత సాంకేతిక పరిజ్ఞాన వుత్పత్తుల తయారీ దిశగా ముందుకు పోతోంది. ఇప్పటి వరకు ఆ రంగంలో అగ్రగామిగా వున్న అమెరికాకు మరిన్ని సవాళ్లు ఎదురుకావటం అనివార్యం. అందుకే ముందుచూపుతో అదిరింపులు బెదిరింపులకు పూనుకుందనేది ఒక అభిప్రాయం.

అమెరికాలో వుపాధి తగ్గిపోవటానికి చైనా, ఇతర తక్కువ వ్యయమయ్యే దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటమే అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు అమెరికన్‌ పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఇది పూర్తివాస్తవం కాదు. అమెరికాలో పెరిగిన యాంత్రీకరణ ఒక ప్రధాన కారణం అన్నది అనేక మంది చెబుతున్న నిజం. అదే విధంగా ఒక్కొక్క దేశం పట్ల ఒక్కో కారణం చెబుతోంది. చైనా అక్రమవాణిజ్య పద్దతులకు, సాంకేతికపరిజ్ఞాన చోరీకి పాల్పడుతున్నదంటూ ఆరోపిస్తుండగా కెనడా,మెక్సికో, ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి చేసుకొనే దిగుమతులు తమ రక్షణకు ముప్పు తెస్తున్నాయని అంటోంది. అమెరికాతో రెండవ పెద్ద వాణిజ్య సంబంధాలున్న కెనడా వుత్పత్తులను పన్నుల పెంపు నుంచి మినహాయిస్తామని చెప్పిన ట్రంప్‌ మాటతప్పాడు. గతేడాది రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాదే మిగులు. అమెరికా పాడి వుత్పత్తులపై 270శాతం పన్నులు విధిస్తోందంటూ కెనడాపై ట్రంప్‌ మండి పడ్డారు. కెనడాతో అమెరికా జరుపుతున్న 680 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో పాడి వుత్పత్తుల శాతం 0.1 మాత్రమే, 99శాతం వాణిజ్యంపై అసలు పన్నులే లేవు.కెనడా తన రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా గతేడాది అమెరికాతో మూడుబిలియన్ల లోటులోనే వుంది. పోనీ అమెరికా ఏమైనా వుదారంగా వుంటోందా అంటే లేదు. అక్కడి పొగాకు పరిశ్రమకు ఇతరుల నుంచి పోటీ లేకుండా చూసేందుకు దిగుమతులపై 350శాతం పన్నులు విధిస్తోంది.

ట్రంప్‌ చర్యకు ప్రతిగా చైనా ప్రారంభించిన ఎదురుదాడిలో భాగంగా 34బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ వుత్పత్తులు, 16బిలియన్‌ డాలర్ల మేరకు బగ్గు, చమురు వంటి వాటిపై దిగుమతి పన్నులు పెంచింది. తరువాత మరికొన్నింటిని పెంచుతామని ప్రకటించింది. గత నెలలో సయోధ్య కుదిరిన సమయంలో తాము అమెరికా వ్యవసాయ వుత్పత్తుల కొనుగోలు పెంచుతామని చైనా పేర్కొన్నది ఇప్పుడు వాటిమీదే ఎక్కువ పన్నులు విధించింది.తొలి దఫా ప్రకటించిన 50బిలియన్‌ డాలర్ల పన్నులు గాకుండా తదుపరి మరో వంద బిలియన్ల మేరకు విధిస్తామని ట్రంప్‌ బెదిరించాడు.

Image result for Is Donald Trump starting trade war cartoons

ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లు మన దేశ పరిస్ధితి వుంది. ఒకవైపు ఈ యుద్ధంతో మనం లాభపడవచ్చని కొందరు సంతోషపడుతున్నారు. నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా ఆ నాయకులతో ఎంతో సాన్నిహిత్యం వున్నట్లు వెల్లడించేందుకు ఆలింగనాలు చేసుకుంటున్నారు. ట్రంప్‌తో కూడా అలాగే చేశారు. వుక్కు వుత్పత్తులపై 25, అల్యూమినియంపై 10శాతం పన్నుల నుంచి మన దేశాన్ని మినహాయించాలని వేడుకున్నా ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా తిరస్కరించింది. మన మంత్రి సురేష్‌ ప్రభు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు అమెరికాకు 30వస్తువుల విషయంలో ఇస్తున్న 24 కోట్ల డాలర్ల రాయితీలను వుపసంహరించనున్నట్లు ప్రకటించారు. స్వదేశంలో విమర్శలపాలైన మోడీ ఎంతగా విదేశాల్లో పర్యటించినా మన ఎగుమతులు నానాటికీ తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు.ఆర్‌సియిపిలోని పదహారింటిలో ఏడు దేశాలతో మన వాణిజ్య లోటు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18లో చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో మన వాణిజ్యలోటు 97.71బిలియన్‌ డాలర్లు, అంతకు ఏడాది 77.58 బిలియన్‌ డాలర్లు మాత్రమే వుంది. మన దేశంలో వుత్పాదకశక్తి తక్కువగా వున్నందున ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు చేసుకున్నా బలవంతులకు తప్ప మనకు పయోజనం వుండదు. నాలుగేండ్లుగా మోడీ మేకిన్‌ ఇండియా ప్రభుత్వ ప్రకటనలకే పరిమితం తప్ప అడుగు ముందుకు సాగలేదు. అమెరికా-చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య ఒకవేళ నిజంగా వాణిజ్య యుద్ధమే జరిగితే మన వుత్పత్తులకు జరిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ చైనా నుంచి మరిన్ని దిగుమతులు పెరగటం ఖాయం. అందువలన ధనిక దేశాల మధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధ పరిణామ పర్యవసానాలు, పరిష్కారాలు ఎలా వుంటాయన్నదే ఆసక్తి కరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుత్తర కొరియాతో ఒప్పందం ఓకే, ఇరాన్‌ మాటేమిటి ట్రంప్‌ !

13 Wednesday Jun 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

denuke deal with north korea, Donald trump, iran, Kim Jong-un, kim-trump meet, North Korean leader Kim Jong-un, nuclear threat

ఎం కోటేశ్వరరావు

తాతా మనవల వంటి డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ అన్‌ అనూహ్య భేటీ ముగిసింది. విశ్లేషకులందరూ ఎవరిది పైచేయి, ఎవరు తామనుకున్నది సాధించారు అనే మల్లగుల్లాల్లో తలమునకలై వున్నారు. ఎవరేం చెప్పినా ఒక చిన్న దేశమైన వుత్తర కొరియా ప్రపంచానికి ఒక పెద్ద సందేశం ఇచ్చింది. బలవంతమైన సర్పం చలిచీమల చేతుల్లో హతమౌతుందన్నది పాత అనుభవం అయితే ఒళ్లంతా అణుబాంబులు కట్టుకొని తిరిగే ప్రపంచంలోనే బలవంతుడైన అమెరికాను అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక్క అణుబాంబు, దానిని అమెరికా గడ్డ మీదకు ప్రయోగించగలిగిన క్షిపణి వుంటే చాలని వుత్తర కొరియా నిరూపించిందని చెప్పక తప్పదు. ప్రపంచ మానవాళిని వందసార్లు చంపటానికి అవసరమైనన్ని మారణాయుధాలు మా దగ్గర వున్నాయని ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. పిచ్చిపట్టిన అమెరికా అధ్య క్షుడెవరైనా అణుమీట ఒకసారి నొక్కితేనే ప్రపంచం భస్మీపటలం అవుతుంది, రెండోసారికే ఏమీ వుండదు, ఇంక వందసార్లకు అవకాశం ఎక్కడుంటుంది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే వారికి బాగా అర్ధం అయిన విషయం ఏమంటే తమ దేశం నుంచి బయలుదేరిన అణ్వస్త్రం మారణహోమం సృష్టించకముందే ఇతర దేశాలలో వున్న అణుమీటలు కూడా పని చేసి అన్ని వైపుల నుంచి అమెరికాను చుట్టుముడతాయని, అన్నీ ఒకేసారి అందరినీ హతమారుస్తాయని తెలుసు.

‘ఇప్పుడే విమానం దిగాను, సుదీర్ఘ ప్రయాణం, అయితే నేను పదవీ బాధ్యతలు స్వీకరించేనాటితో పోలిస్తే ఇప్పుడు మరింత సురక్షితం అని ప్రతి ఒక్కరు భావించవచ్చు. కిమ్‌ జోంగ్‌ అన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా ఎంతో సానుకూల అనుభవంతో జరిగింది. వుత్తర కొరియాకు మంచి భవిష్యత్‌ వుంది. నేను అధికారాన్ని స్వీకరించబోయే ముందు మనం వుత్తర కొరియాతో యుద్ధానికి దిగబోతున్నామని జనం అనుకుంటున్నారు. వుత్తర కొరియా మనకు అతి పెద్ద ప్రమాదకర సమస్య అని బరాక్‌ ఒబామా చెప్పాడు, అలాంటిదింకేమీ లేదు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి అని సింగపూర్‌ నుంచి అమెరికా గడ్డపై కాలు పెట్టగానే ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. అంటే అమెరికన్లలో ఎంత భయం గూడు కట్టుకొని వుందో, దానిని పోగొట్టటం అక్కడి ప్రభుత్వానికి ఎంత అవసరమో ఇవి విదితం చేయటం లేదా ?

కొరియాలో యుద్ధవిన్యాసాలు ఆపుతామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. వచ్చే ఏడాది 716బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. కిమ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ కొరియా ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పాడు. అంతటితో ఆగలేదు, మా గువామ్‌ దీవి నుంచి విమానాలను తీసుకు వచ్చి దక్షిణ కొరియాలో విన్యాసాలు చేయించి తిరిగి ఆ దీవికి తీసుకుపోవాలంటే మాకు చాలా ఖర్చు అవుతోంది, సింహభాగం మేమే భరించాల్సి వస్తోంది అని వ్యాఖ్యానించి ఇంటా బయటా నవ్వుల పాలయ్యాడు. అడుసుతొక్కనేల కాలు కడగనేల. ఎవరు విన్యాసాలు చేయమన్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఖర్చు భరించటం చేతకానపుడు కొనసాగించటం ఎందుకు? అసలు యుద్ధ విన్యాసాలు ఆపమని వుత్తర కొరియా అసలు అడిగిందా? మా ప్రాంతం నుంచి తుండు తుపాకీ మొత్తంగా సర్దుకొని మీ దేశానికి వెళ్లిపోయి మా రెడు దేశాలను ఐక్యం చేసేందుకు అడ్డుతొలగండి అని డిమాండ్‌ చేస్తోంది తప్ప, విన్యాసాలకే పరిమితం కావటం లేదు. జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధపోరాటం ప్రారంభించి, తరువాత అమెరికాతో యుద్దంతో చేసి, గత ఆరున్నర దశాబ్దాలుగా అణ్యాయుధాల మోహరింపులు, యుద్ద విన్యాసాలు, బెదిరింపుల మధ్య పెరిగిన వుత్తర కొరియన్లను యుద్ద విన్యాసాలు ఏమాత్రం భయపెట్టలేదని రుజువైంది. గాలికిపోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లు ప్రయోజనం లేని విన్యాసాలు నిలిపివేస్తామని చెప్పినంత మాత్రాన కొరియా సమస్య పరిష్కారం కాదు.

కొరియా ద్వీపకల్పంలో అమెరికా తిష్ట ఎందుకు వేసిందో కమ్యూనిస్టులు చెబితే, ఆ వారు అంతకు మించి ఏమి చెబుతారులే అని చాలా మంది పట్టించుకోరు. సింగపూర్‌లో ట్రంప్‌ ప్రకటన తరువాత అమెరికాలోని స్వంత రిపబ్లికన్‌ పార్టీ నేతలే వ్యతిరేకించారు. తమ నేత తెలివి తక్కువ ప్రకటన చేశాడని పార్టీ ఎంపీ లిండ్‌సే గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. చేస్తున్న ఖర్చు వూరికే పోవటం లేదని అసలు కొరియాలో దళాల తిష్ట చైనాకు హెచ్చరిక అంటూ కొనసాగించాలని కోరాడు. అంటే దుష్టఆలోచన మనసులో పెట్టుకొని గడ్డికొస్తావా పిల్లా అన్నట్లుగా దక్షిణ కొరియా రక్షణ పేరుతో ఇంతకాలం అమెరికా చేస్తున్న యుద్ధ విన్యాసాలు, బలగాల మోహరింపు చైనాకు వ్యతిరేకం అని గ్రాహమ్‌ చెప్పకనే చెప్పాడు. సమగ్రమైన ఒప్పందం మీద సంతకం చేశామని ట్రంప్‌ చెప్పాడు. గతంలో వుత్తర కొరియాతో కుదిరిన ఒప్పందాలతో పోలిస్తే ఇది ఒక స్పష్టత లేని, ఎలాగైనా భాష్యం చెప్పటానికి, చర్చకు దారితీసేదిగా వుందనే అభిప్రాయం అమెరికాలో వెల్లడైంది. ఎవరూ వ్యతిరేకించటం లేదు గానీ సంతోషించటానికి ఏముంది అని పెదవి విరుస్తున్నారు.2005లో కుదిరిన ఒప్పందంలో మరోనాలుగు ప్రాంతీయ దేశాలు కూడా భాగస్వాములు ఇప్పుడు వాటి ప్రస్తావన లేదు.

వుత్తర కొరియా అణు సమస్య పరిష్కారం అంటే అది సమగ్రమైంది కాదు.దీనిలో రెండు అంశాలున్నాయి. వుత్తర కొరియా అణు కార్యక్రమం నిలిపివేత అంటే ఆయుధాల తయారీ తప్ప శాంతియుత ప్రయోజనాల కార్యక్రమాన్ని నిలిపి వేయటానికి ఏ దేశమైనా అంగీకరిస్తుందా? దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా మోహరించిన అణ్వాయుధఛత్రం, ఇతర ప్రమాదకర క్షిపణులు, సైన్యం మాటేమిటి? వీటి గురించి సింగపూర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు, ఒప్పందమూ కుదరలేదు. సమస్యల పరిష్కారానికి ఒక సూత్రప్రాయ అంగీకారం మాత్రమే కుదిరింది కనుక ప్రపంచమంతా ఈ పరిణామాన్ని సహజంగానే హర్షిస్తోంది. వుత్తర కొరియా పూర్తిగా అణుకార్యక్రమాన్ని నిలిపివేయాలంటే దానికి జరిగే నష్టాన్ని ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారు, ఇప్పటి వరకు విధించిన ఆంక్షలను ఎలా, ఎంతకాలంలో తొలగిస్తారు, దానికి హామీ ఏమిటి అనేక అనేక అంశాలు పరిష్కారం కావాల్సి వుంది. వీటిపై గతంలో అంగీకరించిన ఒప్పంద నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన మచ్చ వుంది. ఒకవైపు వుత్తర కొరియాతో చర్చలు జరుపుతూనే అణు సమస్యపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగింది. అన్ని ప్రధాన దేశాలతో వాణిజ్యలోటు కలిగి వున్న అమెరికా అదిరించి బెదిరించి తన వుత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఈ క్రమంలో దానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిఘటన ఎదురవుతున్నది. వుత్తర కొరియాను అదుపు చేసే పేరుతో ఇంతకాలం పెద్ద మొత్తంలో అమెరికా నిధులు ఖర్చు చేసింది. అనుకున్నట్లుగా ఒప్పందం అమలు జరిగితే ఇప్పుడు సైనిక విన్యాసాలకు బదులు వుత్తర కొరియా రక్షణ గురించి ఖర్చు చేయాల్సిన పరిస్ధితి వస్తుంది. దాన్ని ఎవరి మీద రుద్దుతుంది? ఇలాంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి వుంది.

Image result for denuke deal with north korea

ఒప్పందాల విషయంలో గతంలో అమెరికా ఇతర దేశాల నిర్వాకం చూసిన తరువాత వుత్తర కొరియా తన రక్షణకు మరింత జాగ్రత్త పడుతుంది. వుదాహరణకు 30దేశాలు నిధులు అందచేసే కొరియా ద్వీపకల్ప ఇంధన అభివృద్ధి సంస్ధ(కెడో) ద్వారా 250 కోట్ల డాలర్లు వెచ్చింది ఒక అణుఇంధన రియాక్టర్‌ను నిర్మించారు. దానికి అమెరికా 50కోట్ల డాలర్ల విలువగల తేలిక జల ఇంధనాన్ని సమకూర్చేందుకు ఖర్చు చేసింది. చివరికి దాన్ని 2006లో మూసివేశారు. అయితే దానికి రెండువందల కోట్ల డాలర్లను సమకూర్చాయి. ఆమొత్తం సొమ్ము దానిని నిర్మించిన ఐరోపా యూనియన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ కంపెనీలకే తిరిగి చేరింది తప్ప వుత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు. ఒప్పందం విఫలం కావటంతో వుత్తర కారియా అప్పటి వరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ పర్యవేక్షణలో వుంచిన ప్లూటోనియం రాడ్ల సీళ్లను తొలగించి తిరిగి అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి అమెరికాదే పూర్తి బాధ్యత.

ప్రాంతీయ రాజకీయాలు, దేశాలలో జోక్యం చేసుకోవటంలో అమెరికాను మించిన వారు ఇప్పుడు లేరు. వుదాహరణకు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకొని అమెరికా పాల్పడని జోక్యం లేదు. చివరకు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా తయారు చేసి కిరాయికి ప్రయోగిస్తోంది. అలాంటి అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో ఇరాన్‌ జోక్యం చేసుకొంటోందనే నెపంతో దానితో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇప్పుడు వుత్తర కొరియా నుంచి ప్రమాదం లేదు, హాయిగా నిదురపొండి అని తన జనానికి చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఇరాన్‌ గురించి ఏమి చెబుతారు? కొద్ది రోజుల తరువాత వుత్తర కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా తూ నా బడ్డుబాలు అని చెప్పరన్న గ్యారంటీ ఏముంది? అందుకే అమెరికా అడుతోంది రాజకీయం తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తోంది. వుత్తర కొరియాలో నిర్బంధించిన అమెరికన్ల విడుదల కొరకు ఆదేశం ఎలాంటి మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. ఇరాన్‌లో బందీలైన అమెరికన్లను విడిపించుకొనేందుకు 40కోట్ల యూరోలను విమానంలో తరలించి, దానిలోనే బందీలను వెనక్కు తీసుకువచ్చారు. అయితే ఆ సొమ్మును ఒప్పందం ప్రకారం సరఫరా చేయని మిలిటరీ పరికరాల కోసమని అమెరికా చెప్పుకొన్నది. అలాంటి మొత్తం అయితే ఇంకా 200 కోట్ల డాలర్ల వరకు అమెరికా చెల్లించాల్సి వుంది. ఇవన్నీ చూసినపుడు అమెరికా ఆడుతున్నది రాజకీయం తప్ప ప్రపంచశాంతి సమస్యపై దానికి చిత్తశుద్ధి లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ ధృతరాష్ట్ర కౌగిలి దిశగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ !

30 Wednesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

american dhritarashtra embrace, dhritarashtra embrace, India Foreign Policy, India foreign policy under narendra modi, modi foreign policy

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ ప్రధానిగా పదవిని స్వీకరించి నాలుగు సంవత్సరాలు గడిచింది. స్వదేశీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి అంటూ ఒక జోక్‌ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మోడీ పదవీ స్వీకార ప్రమాణం చేసింది మొదలు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లోనే ఎక్కువగా గడిపారనే పేరు తెచ్చుకున్నారు. మోజు తీరినపుడు, అసంతృప్తి కలిగినపుడు ఎప్పుడన్నా జనం ఈ విషయాల గురించి చర్చించి వుంటారేమోగానీ మన విదేశాంగ విధానం గురించి మాత్రం కచ్చితంగా చర్చకు రావటం లేదని చెప్పవచ్చు. అంతర్గత విధానాలు మన జన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో వర్తమాన ప్రపంచీకరణ యుగంలో విదేశాంగ విధానాల పర్యవసానం కూడా తీవ్రంగానే వుంటుంది. ఈ విషయం మనకు స్వాతంత్య్రానికి ముందు తెలిసినంతగా ఇప్పుడు తెలియటం లేదు. బ్రిటీష్‌ పాలకుల దేశీయ, విదేశాంగ విధానాలు మన దేశాన్ని ఎలా దోపిడీకి గురిచేశాయో నాడు స్వాతంత్య్ర సమరయోధులు నిత్య పారాయణం చేసేవారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవీ ఈ విషయాల గురించి నోరెత్తవు.

సోవియట్‌ యూనియన్‌ కూల్చివేత, మన దేశంలో సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన 1991 నుంచి మన దేశ విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు వచ్చాయి. నాటి నుంచి నేటి వరకు చూస్తే అలీన విధానం నుంచి వైదొలగి అమెరికా బిగి కౌగిట్లోకి మరింతగా చేరువు కావటం ముఖ్యమైన మార్పు. గత పాతిక సంవత్సరాలలో కాంగ్రెస్‌, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ఎవరు అధికారంలో వున్నప్పటికీ అదే కొనసాగుతోంది. యుపిఏ పాలనా కాలంలో అమెరికావైపు మొగ్గు, దానికి చిన్న భాగస్వామిగా చేరేందుకు పూనుకున్న కారణంగానే వామపక్షాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు వుపసంహరించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ హయాంలో వాటిలో ఎలాంటి మార్పు లేదు, మరింత విస్తృతం, చేరువైంది. 2015లో బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు వచ్చినపుడు సంయుక్త స్వప్న దర్శనం పేరుతో ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భూ, రాజకీయ వ్యూహంతో సమన్వయం చేసుకొనేందుకు మన దేశం అంగీకరించింది. సోషలిస్టు చైనా, వియత్నాం, లావోస్‌ వియత్నాంలను చక్రబంధంలో బిగించటంతో పాటు ఈ ప్రాంతంపై మొత్తంగా తన పట్టుబిగించుకోవటం అమెరికా లక్ష్యం. ఇప్పటికే జపాన్‌, ఆస్ట్రేలియాలతో అమెరికాకు ఒప్పందం వుంది. ఆ మూడింటితో సమన్వయం చేసుకుంటామని మోడీ సర్కార్‌ మరొక అడుగు ముందుకు వేసింది. అంతకు ముందు చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని మరో పది సంవత్సరాలు పొడిగించింది. గతంలో ఏ ప్రభుత్వమూ అంగీకరించని విధంగా మన రేవులు, వైమానిక స్ధావరాలకు వచ్చి అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ ఓడలు ఇంధనం నింపుకొనేందుకు, మరమ్మతులు చేయించుకొనేందుకు అంగీకరించింది. ఇది మన సార్వభౌమత్వాన్ని తక్కువ చేసుకోవటమే.

దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న విధానాన్ని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద భావజాలానికి అనుగుణంగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రకెక్కారు.పాలస్తీనా సందర్శనను తప్పించారు. వెనెజులా రాజధాని కారకాస్‌లో జరిగిన అలీన దేశాల సభకు వెళ్లకుండా అమెరికాను మెప్పించేందుకు ప్రయత్నించారు. ఇలా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు, వాటి అడుగుజాడలలో నడిచే దేశాలతో బంధాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర దేశాలకు ఇవ్వలేదు. వుదాహరణకు మన దేశం బ్రెజిల్‌,రష్యా,చైనా, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడింది. అదే విధంగా షాంఘై కూటమిలో పూర్తి సభ్యురాలిగా చేరింది. ఇవి ప్రాంతీయ, పరస్పర సహకారం, బహుళధృవ ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటు వంటి అనేక లక్ష్యాలను కలిగి వున్నాయి. వాటన్నింటినీ వదలి పెట్టి కేవలం వుగ్రవాద సమస్య మీద మాత్రమే ఈ వేదికల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరిస్తున్నది. పోనీ వుగ్రవాదులను పెంచి పోషిస్తున్న అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాలను, సౌదీ వంటి రాజ్యాల వైఖరి, చర్యలను తప్పుపడుతున్నదా అంటే లేదు.

ఇరుగు పొరుగు దేశాలన్న తరువాత అనేక సమస్యలూ, సానుకూల అంశాలూ వుంటాయి.మన రక్షణ ఖర్చు తగ్గి ఆమేరకు అభివృద్ధి వైపు కేంద్రీకరించాలంటే సరిహద్దులలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సానుకూల అంశాలను పెంచుకోవటం అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి ఆవిధంగా లేదు. పాకిస్ధాన్‌ మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మాట వాస్తవం. దానికి సూత్రధారి, తెరవెనుక పాత్రధారి అమెరికా అన్నది బహిరంగ రహస్యం. అలాంటి దేశంతో సఖ్యత, పాకిస్ధాన్‌తో వైరంలో అర్ధం లేదు. పాక్‌తో వైరాన్ని పెంచుకోవటం ద్వారా దేశంలో ముస్లిం వ్యతిరేకతను, జాతీయ దురహంకారాన్ని రెచ్చగొట్టి హిందూ ఓట్‌ బ్యాంకును ఏర్పరచుకోవాలనే యావ తప్ప మరొక లక్ష్యం కనిపించటం లేదు.పోనీ పాకిస్ధాన్‌ను సరిహద్దులలో అదుపు చేసిందా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుపుతారో, రెచ్చగొడతారో, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెడతారో, ఎక్కడ దాడులు చేయిస్తారో తెలియని స్ధితి. పక్కనే వున్న నేపాల్‌లో మధేషీ ఆందోళనకు మద్దతు తెలిపి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని అక్కడి ప్రజానీకానికి, అన్ని రాజకీయపార్టీలను వ్యతిరేకం చేసుకున్నది. నరేంద్రమోడీ భజనలో భాగంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తప్పుడు వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. నరేంద్రమోడీ మే రెండవ వారంలో నేపాల్‌ పర్యటనలో భాగంగా జనక్‌పూర్‌( సీత జన్మించిన ప్రాంతం అని నమ్మకం)లో ఒక సభలో ప్రసంగించారు. దానికి వచ్చిన జనాన్ని భారతీయులని సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. అది నేపాల్‌ సార్వభౌమాధికారాన్ని కించపరచటమే.

డోక్లాం సమస్య భూటాన్‌ాచైనా తేల్చుకోవాల్సిన అంశం. ఆ ప్రాంతంలో చైనా మిలిటరీ కేంద్రీకరణ జరిగితే దాని గురించి చైనాతో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. అందుకు విరుద్దంగా అక్కడ జోక్యం చేసుకోవటం ద్వారా సాధించిందేమీ లేకపోగా చైనాతో అనవసరంగా మరో సమస్యను తెచ్చుకున్నట్లయింది. ఒకనోటితో అధికారికంగా చైనాతో సంబంధాల మెరుగుదల గురించి చెబుతూ మరోనోటితో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో సంఘపరివార్‌ వ్యవస్ధలు నిమగ్నమయ్యాయి. దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించటమంటే చైనాను చక్రబంధంలో బిగించటమే. దాని వ్యూహంలో మన దేశం భాగస్వామి కావటం అంటే మన ప్రయోజనాలను మనమే దెబ్బతీసుకున్నట్లు. మన మలబార్‌ తీరంలో అమెరికా, జపాన్‌తో కలసి మనం సైనిక విన్యాసాలు చేయటం దానిలో భాగమే. దానికి ప్రతీకారంగా అణుసరఫరా గ్రూపులో మనకు సభ్యత్వం రాకుండా చైనా అడ్డుపడుతోంది. అజార్‌ మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు ఐరాసలో చైనా అడ్డుపడటం కూడా చైనా పట్ల మనం అనుసరిస్తున్న వైఖరి పర్యవసానమే. చైనా మసూద్‌ పట్ల అనుసరించిన వైఖరికి ప్రతిగా చైనా వుగ్రవాదిగా ఇంటర్‌పోల్‌ ప్రకటించిన వాడిని మన దేశం ఆహ్వానించటం, టిబెట్‌ను చైనా అంతర్భాంగా గుర్తిస్తూనే మరోవైపు దానిని రెచ్చగొడుతూ దలైలామాను అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనకు అంగీకరించటం వంటి వన్నీ ప్రతీకార పర్యవసానాలే.యూరేషియాాఆఫ్రికన్‌ రైలు,రోడ్డు, సముద్ర రవాణా పధకానే ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ ప్రాజెక్టుఅని పిలుస్తున్నారు. చైనా చొరవతో ప్రారంభమైన ఈ పధకంలో చేరేందుకు దాదాపు వంద దేశాలు సంతకాలు చేశాయి. చైనాాపాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ కూడా దానిలో భాగమే. దానిలో చేరటమా లేదా అన్నది నిర్ణయించుకోవటానికి భారత్‌కు హక్కుంది. చేరకపోతే మన దేశం వంటరి అవుతుంది.ఆ పధకాన్ని వ్యతిరేకించేందుకు మద్దతు పలికిన అమెరికా ఇటీవల బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపింది. మనం మాత్రం దూరంగా వుండటం ఎవరికి ప్రయోజనమో ఆలోచించుకోవాలి.

మన విదేశాంగ విధానంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రెండు రకాల ధోరణులు వున్నాయి. పూసల్లో దారంలా సామాన్య జన ప్రయోజనాల కంటే మన కార్పొరేట్‌ సంస్ధలకు లాభాలే ముఖ్యంగా దానిని అమలు జరుపుతూ వచ్చారు. ఆ క్రమంలో 1991కి ముందు మన జనానికి కూడా కొన్ని వుపయోగాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వామిక శక్తులు స్నేహితులుగా మన పాలకవర్గ పొందిక వుంది. అందువలన రెండు దోపిడీ తరగతుల ప్రయోజనాలు ఎప్పుడూ ఇమిడి వుంటాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు మన దేశం వదలి వెళ్లిన వెంటనే ఆ స్ధానాన్ని ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నించింది. అప్పుడే విస్తరణకు ప్రయత్నిస్తున్న స్వదేశీ పెట్టుబడిదారులకు అది సమ్మతం కాదు. అదే సమయంలో రెడవ ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయినప్పటికీ సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికంగా బాగా పుంజుకున్నది. రాజకీయంగా సామ్రాజ్యవాదుల కూటమిని సవాలు చేసేదిగా బలంగా తయారైంది. దీన్ని అవకాశంగా తీసుకొని లబ్దిపడేందుకు సోవియట్‌వైపు మొగ్గిన పాలకవర్గం ఎంతగానో లబ్దిపొందింది. తనవైపు నిలబడిన నిలబడిన భారత్‌ను నిలుపుకొనేందుకు సోవియట్‌ యూనియన్‌, తమ వైపు ఆకర్షించేందుకు అమెరికా కూటమి కూడా మన దేశంలో అనేక బడాపరిశ్రమలు, ఇతర సంస్ధల ఏర్పాటుకు పోటీ పడ్డాయి. సోవియట్‌ది పైచేయిగా వుంది. 1950-90 దశకం మధ్య మన కార్పొరేట్‌ సంస్ధలు మరింత విస్తరించి మరొక దేశంతో నిమిత్తం లేకుండా స్వంతంగా బడా పరిశ్రమలు ఏర్పాటు చేసే స్ధాయికి ఎదగటమే కాదు, మన కంటే చిన్న దేశాలలో తమ పెట్టుబడులను పెట్టేవిగా తయారయ్యాయి. సోవియట్‌ కూలిపోవటం, ఆ సమయానికి బలమైన దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం తయారు కావటంతో ప్రభుత్వ ప్రమేయం తగ్గి ఆర్ధిక రంగాన్ని మొత్తంగా తమకు అప్పగించాలనే డిమాండ్‌ చేయటంతో సంస్కరణల పేరుతో 1991లో విధానాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక శక్తిగా వున్న అమెరికా తదితర దేశాలతో జతకట్టి జూనియర్‌ భాగస్వాములుగా మారేందుకు కూడా పాలకవర్గం నిర్ణయించుకుంది. పర్యవసానంగా మన మార్కెట్‌ను తెరవాల్సివచ్చింది. తొలుతు సంయుక్త భాగస్వామ్య సంస్ధల రూపంలో ప్రవేశించిన విదేశీ సంస్ధలు క్రమంగా వాటి స్ధానంలో తమ వుత్పత్తులనే నేరుగా ప్రవేశపెట్టాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో 1990 దశకంలో మార్కెట్‌కు వచ్చిన స్వదేశీ బ్రాండ్‌ టీవీలు ఇప్పుడు మనకు ఒక్కటీ కనపడదు, ఆటోమొబైల్‌ రంగంలో కూడా అదే పరిస్ధితి స్వరాజ్‌-మజ్డా, మారుతీ-సుజుకి, హీరో-హోండా వంటి కంపెనీల ఒప్పందాలు ముగిసిన తరువాత అత్యధిక భాగం విదేశీ కంపెనీలు తమ వుత్పత్తులను స్వయంగా ఇక్కడే తయారు(విడిభాగాల కూర్పు) చేయటం, ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా చేయటం ప్రారంభించాయి. బలమైన స్వదేశీ హీరో వంటి కంపెనీలు వాటితో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మన రిటెయిల్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అమెజాన్‌, మెట్రో, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎప్పుడైతే సామ్రాజ్యవాద దేశాల నుంచి పెట్టుబడులు రావటం ప్రారంభమైందో ప్రపంచ రాజకీయాలలో వాటి విధానాలను కూడా మన మీద రుద్దటం ప్రారంభించారు. వుదాహరణకు ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా స్వతంత్ర పాలస్తీనా పునరుద్దరణకు మద్దతు ప్రకటించింది మన దేశం. ఇప్పటికీ అధికారికంగా దాని నుంచి వైదొలగనప్పటికీ ఆచరణలో నీరుగార్చటాన్ని చూస్తున్నాము. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెంచుకోవటమే దానికి నిదర్శనం.

మన కార్పొరేట్‌ రంగం అటు సోవియట్‌, ఇటు అమెరికా, ఐరోపా ధనిక దేశాలను వినియోగించుకొని లాభపడేందుకు గతంలో ప్రయత్నించినట్లుగానే ఇప్పుడు కూడా చేస్తోంది. విబేధాలను వినియోగించుకొని లాభపడేందుకు చూడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.తనకు నష్టం కలిగిస్తుందనుకున్నపుడు అమెరికా వాంఛలకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని కూడా చూడవచ్చు. చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రారంభించింది అనగానే అది మనకు ఎలా లాభమో దాన్నుంచి ఎలా లబ్ది పొందవచ్చో సూచిస్తూ వాణిజ్య వార్తల పత్రికల్లో అనేక మంది విశ్లేషణలు రాశారు. దాదాపు అన్ని దేశాలతో వాణిజ్య లావాదేవీలలో ఈరోజు చైనా మిగులును కలిగి వుంది. ఈ పరిస్ధితి ఎంతకాలం అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో చూస్తే అన్ని దేశాలూ ముఖ్యంగా ధనిక దేశాలు చైనా పట్ల ముద్దులాట-దెబ్బలాటలు అడుతున్నాయి. అమెరికా బెదిరింపులు, అదే సమయంలో ఐరోపా దేశాల మౌనం దానిలో భాగమే. మన విషయానికి వస్తే ఏటేటా చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతోంది. గడిచిన పది సంవత్సరాలలో ఈ మొత్తం 16 నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది.నరేంద్రమోడీ హయాంలో గత నాలుగు సంవత్సరాలలో తగ్గుదల తప్ప పెరుగుదల లేదు. కారణం చైనాతో రాజకీయంగా వైరభావంతో వుండటం ఒకటి అని వేరే చెప్పనవసరం లేదు. గత కొద్ది కాలంగా మన ఎగుమతిదారుల లాబీవత్తిడి కారణంగా ఈ మధ్య నరేంద్రమోడీ ఎలాంటి అజెండా లేకుండానే చైనా పర్యటన జరిపి వచ్చారు. పైకి అలా కనిపించినప్పటికీ మన దిగుమతులు పెంచాలని కోరటమే అసలు లక్ష్యం. అందుకే చైనాపై రెచ్చగొట్టే వైఖరిని ఇటీవలి కాలంలో తగ్గించింది అని కూడా చెప్పాలి.

Image result for narendra modi foreign policy, china cartoons

ఇరాన్‌తో రాజకీయ వైరంలో భాగంగానే దానితో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయితే దానికనుగుణ్యంగా మన దేశం కూడా ఇరాన్‌తో తెగతెంపులు చేసుకుంటే నష్టపోయేది మనమే. అసలే చమురు ధరలు పెరుగుతూ దడపుట్టిస్తున్న తరుణంలో రూపాయి వాణిజ్యానికి అంగీకరించిన ఇరాన్‌ను వదులుకుంటే ఇబ్బంది మనకే. అందుకే అణుఒప్పందం విషయంలో మన వైఖరి ఇరాన్‌కు అనుకూలంగానే వుంది. మొత్తం మీద చూసినపుడు అమెరికా వైపే మొగ్గుచూపుతున్నప్పటికీ అది తమ లాభాలకు ముప్పురానంత వరకే మన కార్పొరేట్‌ రంగం దానిని అనుమతిస్తుంది, మొదటికే మోసం వచ్చినపుడు ప్రతిఘటించటం తప్పనిసరి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటి కొస్తూ మాకేమి తెస్తారంటే కుదరదు అమెరికా పెద్దన్నా !

22 Tuesday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, CHINA TRADE, Donald trump, Indo-China trade, TRADE WAR, US-CHINA TRADE WAR

ఎం కోటేశ్వరరావు

వాణిజ్య యుద్ధంలో అమెరికా ముందు చైనా చేతులెత్తేసిందా? ఏమో ! చైనా మెడలు వంచి వాణిజ్య పోరులో అమెరికా విజయం సాధించిందా ? ఏమో చెప్పలేం గానీ తాత్కాలికంగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరింది. ‘చైనాతో యుద్దం వాయిదా పడింది, కానీ ట్రంప్‌ వ్యూహ గందరగోళం కొనసాగుతూనే వుంది’ . కార్పొరేట్ల పత్రిక ఫోర్బ్స్‌ ఒప్పందంపై రాసిన తక్షణ విశ్లేషణ శీర్షిక ఇది. ‘ చైనా ముఖ్యమైన ప్రయోజనాలను కాపాడుకుంది’ ఇది చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణకు పెట్టిన శీర్షిక. వివరాలేమీ తెలియకుండానే అమెరికాన్లకు చైనా లంగిపోయిందని సంతోష పడే వారికి చివరకు మిగిలేది నిరాశే అని గత చరిత్రను బట్టి చెప్పక తప్పదు.

ప్రపంచంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా నాయకత్వంలోని ధనిక దేశాలు వునికిలోకి తెచ్చినదే ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ). అది ఒక పక్క వుండగానే మరోవైపు దానిలోని సభ్యదేశాలు వాణిజ్య యుద్ధాలకు తలపడటం అంటే దాని వైఫల్యాన్ని సూచిస్తున్నది. నిజానికి ప్రపంచీకరణ యుగంలో రెండు దేశాల మధ్య తలెత్తే వాణిజ్యపోరు, పరిష్కారం కూడా వాటికే పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ధనిక దేశమూ చైనాతో వాణిజ్యంలో లోటుతోనే వుంది, కనుక ప్రతి దేశమూ దానిని తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. వాటిలో అమెరికా ఒకటి. దిగుమతి సుంకాల పెంపుతో ఎవరైనా చైనాను దెబ్బతీయాలని చూస్తే ఆ విబేధాన్ని వినియోగించుకొనేందుకు మిగతా దేశాలు కాచుకొని వుంటాయి, వున్నాయి. అందుకు పెద్ద వుదాహరణ మన దేశమే.

కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతుంటారు. దేశభక్తి నిరూపణకు చైనా వ్యతిరేకతను ఒక ప్రమాణంగా ముందుకు తెస్తున్నారు. అయితే గతకొద్ది నెలలుగా ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగమంత్రి మొదలు, వున్నత అధికారయంత్రాంగం మొత్తం చైనాతో సయోధ్య దిశగా ముందుకు పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పాత సామెత ప్రకారం వ్యాపారి వరదనబడి పోతున్నాడంటే ఏదో లాభం కనిపించబట్టే అని వేరే చెప్పనవసరం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకతలో అమెరికా కంటే సంఘపరివారం పేరుమోసిందేమీ కాదు. అలాంటి అమెరికానే చైనాతో కాళ్లబేరానికి వస్తున్నపుడు పరివార పెద్దలైన మోడీ, మరొకరు ఎంత? వారంతా కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప మరొకరు కాదు. ఎడ్లెవిస్‌ అగ్రీవాల్యూ చైన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశోధన విభాగ అధిపతి పెరెరాణా దేశాయ్‌ చైనా-అమెరికా వాణిజ్య పోరు గురించి ఇలా చెప్పారు.’ ఎగుమతుల ధరలు పోటాపోటీగా వున్నట్లయితే అయిల్‌ సీడ్స్‌ మీల్స్‌ అయిన సోయా, ఆవ, పత్తి మరియు మొక్కజన్న భారతీయ ఎగుమతిదార్లకు ఒక చిన్న వ్యవసాయ ఎగుమతి కిటికీ తెరుచుకుంటుంది. నూట ఆరు అమెరికా వుత్పత్తులపై చైనా 25శాతం వరకు కొత్త పన్నులు ప్రకటించింది, అంతకు ముందు 128 అమెరికా వుత్పత్తులపై పన్నులు పెంచింది. రెండు అతి పెద్ద దేశాలు ఒక వాణిజ్య యుద్ధంలోకి అడుగుపెట్టాయి.పదమూడు వందల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్నులు విధించింది.’ భారత పత్తి సంఘం అధ్యక్షుడు అతుల్‌ గణత్ర మాట్లాడుతూ ‘ అమెరికా తరువాత పత్తి ఎగుమతిలో స్థానం భారత్‌దే. చైనా 50మిలియన్‌ బేళ్ళ పత్తి దిగుమతి చేసుకుంటే దానిలో 40శాతం అమెరికా నుంచి వస్తోంది. ఆ పత్తిపై చైనా 25శాతం పన్ను విధిస్తోంది. మన పత్తిపై చైనాలో ఎలాంటి పన్నులు లేవు, అందువలన అమెరికా పత్తి కంటే మన సరకు చౌక అవుతుంది కనుక మనకు ఇది మనకు లాభదాయకం.’ సౌరాష్ట్ర జిన్నర్స్‌ అసోసియేషన్‌ ఆనంద్‌ పోపట్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా, ఆఫ్రికన్‌ కాటన్‌ కంపెనీల కంటే మన పత్తి ధర చౌక, భారత సోయాబీన్‌పై వున్న ఆంక్షలను చైనా తొలగించినట్లయితే వారికి మనం సరఫరా చేయగల మరొక వస్తువు అవుతుంది. చైనాకు అవసరమైన 93.4 మిలియన్‌ టన్నులు సోయాలో ప్రస్తుతం అమెరికా 39శాతం సరఫరా చేస్తోంది.’ అన్నారు. చైనా పశు, కోళ్ల దాణాకు వుపయోగించే సోయాను మన దేశం నుంచి ఎగుమతి చేసేందుకు ఇప్పుడున్న ఆంక్షల ఎత్తివేతకు మన దేశవాణిజ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

గత నాలుగు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ తన విజయాల గురించి ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా పరిస్ధితి వుంది. మన వాణిజ్యలోటు గతేడాది ఏప్రిల్‌లో 13.25బిలియన్‌ డాలర్లు వుండగా ఈ ఏడాది 13.72 బిలియన్లకు పెరిగింది. రోజు రోజుకూ చమురు ధరల పెరుగుదల కారణంగా ఇది మరింత విస్తరించటమే కాదు, మన దేశం నుంచి డాలర్లు తరలిపోవటం పెరుగుతుండటంతో విదేశీమారకద్రవ్య సమస్యకూడా తలెత్తే అవకాశం వుంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన మార్కెట్లో ప్రవేశించేందుకు మోడీని కౌగలించుకోవటం తప్ప వారి మార్కెట్లలో మనకు ప్రవేశం ఇవ్వటం లేదు. మన దేశ ధనికులు ఏ కారణం చేతో బంగారం, బంగారు ఆభరణాలు, ముత్యాలు, రంగురాళ్లు దిగుమతి చేసుకోవటం తగ్గించబట్టిగాని లేకపోతే వాణిజ్యలోటు మరింత పెరిగి వుండేది. గత ఏప్రిల్‌లో చమురు దిగుమతులకు 7.36బిలియన్‌ డాలర్లు మనం చెల్లించగా ఈ ఏడాది ఆ మొత్తం 10.41బిలియన్లకు పెరిగింది.

ప్రపంచంలో నేడు చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, పెద్ద వినియోగదారుగా కూడా మారుతోంది. అక్కడి జనాభా కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగా ఆ మార్కెట్‌ను వదులుకొనేందుకు ఏ ధనిక దేశమూ సిద్దంగా లేదు. అలాంటి దేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయం మన కార్పొరేట్‌ రంగంలో క్రమంగా పెరుగుతోంది. సంఘపరివార్‌ చైనా వ్యతిరేక చిల్లర ప్రచారం ఎలా వున్నప్పటికీ ప్రభుత్వపరంగా అది కుదరదని స్పష్టం చేస్తున్న కారణంగానే ఇటీవలి కాలంలో డోక్లాం దగ్గర నుంచి అనేక సానుకూల వైఖరులను వెల్లడిస్తున్నది. చైనా ఆహార, ఔషధ నియంత్రణ శాఖ వద్ద పెండింగ్‌లో వున్న 254 వుత్పత్తుల నమోదుకు వేగంగా అనుమతులు తీసుకోవాలని మన ఫార్మారంగం మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తోంది.

తాను ఎగుమతి చేయటమే తప్ప దిగుమతులు చేసుకోవటం లేదన్న విమర్శలను పూర్వపక్షం చేసేందుకు లేదా ఎవరేమి ఎగుమతి చేయగలరో చూపండి అన్నట్లుగా ఈ ఏడాది నవంబరు నెలలో షాంఘై నగరంలో తొలిసారిగా చైనా దిగుమతుల ప్రదర్శన నిర్వహిస్తోంది. అంటే ప్రపంచ దేశాలన్నీ తమ వుత్పత్తులను అక్కడ ప్రదర్శించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో తాము పది లక్షల కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటామని చైనా చెబుతోంది. అందువలన ప్రతి దేశం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తుంది. షాంఘై ప్రదర్శనలో చైనా తన విధానాన్ని, నిబంధనలను ప్రపంచానికి తెలియచేయనుంది. ఈ ప్రదర్శనలో మన దేశం నుంచి కనీసం వందమంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం వుంది. చైనా వస్తువుల దిగమతులు నిలిపివేసి దేశభక్తి నిరూపించుకోవాలని సంఘపరివార్‌ సంస్ధలు ఎంతగా గగ్గోలు పెట్టినా గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మన దేశం చైనా నుంచి 69.4బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకోగా ఇదే సమయంలో కేవలం 11.5బిలియన్ల మేరకు మాత్రమే ఎగుమతులు చేసింది. వాణిజ్య తేడా 58 బిలియన్‌ డాలర్లు. చైనాతో సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్యపరంగా ఇలాంటి ఎన్నో ప్రాధాన్యత అంశాలున్నందున వారితో వైరం తెచ్చుకోవాలని ఏ కార్పొరేట్‌ సంస్ధా కోరుకోదు. పాలకులు ఎవరైనా అలాంటి పిచ్చిపనులకు పూనుకుంటే వైఖరి మార్చుకునే విధంగా తాను చేయాల్సింది చేస్తుంది. ఈ పూర్వరంగంలోనే ఎలాంటి ముందస్తు ఎజండా లేకుండా నరేంద్రమోడీ చైనా వెళ్లినప్పటికీ సానుకూలంగా వున్నామన్న సందేశం దానిలో ఇమిడి వుంది.

అమెరికాాచైనాల మధ్య వాణిజ్య పోరుకు స్వస్థిచెప్పి వాణిజ్యలోటు సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఆచరణలో ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి గనుక అమలు ప్రశ్న తలెత్తుతోంది. గతంలో కూడా ప్రతి అమెరికా అధ్యక్షుడూ ఏదో ఒక దశలో వాణిజ్యపోరు పేరుతో బెదిరింపులకు దిగిన వారే. ట్రంప్‌ వైఖరి మొరటుగా వుంది. తన పదవీకాలం పూర్తయ్యే నాటికి రెండు దేశాల మధ్య వున్న వాణిజ్యలోటులో 200బిలియన్‌ డాలర్లను తగ్గించాలని చెబుతున్నాడు. అయితే హడావుడి చేస్తోందని చైనీయులు చెబుతున్నారు. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా తన వుత్పాదక పరిశ్రమను వున్నత స్ధాయికి పెంచుకొనేందుకు దీర్ఘకాలిక క్రీడను ప్రారంభించిందని, దానిని పడనివ్వకుండా చేయటంతో పాటు అమెరికా తాత్కాలిక ప్రయోజాలను కోరుతోందని, చైనా కీలక ప్రయోజనాలను ఎట్టి పరిస్ధితులలో ఫణంగా పెట్టదని పరిశోధకులు చెబుతున్నారు.

చైనాతో పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం తప్పిపోయిందని విజయోత్సవాలు చేసుకోవటం తప్ప సాధించిందేమిటో తెలియదని అమెరికాలో విమర్శకులు అంటున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధతో కలవకుండా తన ప్రయోజాలకే పెద్ద పీట వేస్తున్న చైనాను ఒంటరి పాటు చేయటం లేదా అంకెకు తీసుకురావటం అన్న అసలు లక్ష్యాన్ని ట్రంప్‌ పట్టించుకోవటం లేదన్న విమర్శలు చెలరేగాయి. అసలు చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టనివ్వటమే అమెరికా చేసిన పెద్ద తప్పిదమని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక నివేదికలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్ధలో రాజ్య జోక్యం చేసుకోకుండా చైనాను కట్టడి చేయటమే అంతి మ లక్ష్యం అయితే అమెరికా వస్తువులను కొనుగోలు చేయించమని చైనాను కోరటం ప్రతికూలమౌతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

అమెరికా ఇప్పుడు ఒక్క చైనా మీదే కాదు మా వస్తువులు కొంటారా లేక మీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించమంటారా తేల్చుకోండని అన్ని దేశాలను బెదిరిస్తున్నది. వాటిలో జపాన్‌ ఒకటి. రాజకీయంగా చైనాకు వ్యతిరేకంగా దానిని కూడగడుతున్నప్పటికీ ఆర్ధిక విషయాల్లో జపాన్‌పై అమెరికా తన షరతులను రుద్దేందుకు పూనుకుంది. తమ వుక్కు, అల్యూమినియం వస్తువులపై 25,10 శాతం చొప్పున దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా పూనుకుంటే తాము కూడా ప్రతి చర్యలకు దిగక తప్పదని ప్రపంచవాణిజ్య సంస్ధకు జపాన్‌ తెలియచేసింది. అమెరికా బెదిరింపులకు చైనా లంగకపోవటం జపాన్‌కు వూతమిచ్చి అమెరికాను హెచ్చరించేంత వరకు వెళ్లిందని పరిశీలకులు భావిస్తున్నారు. 1970,80 దశకాలలో అమెరికాను ఎదిరించే శక్తిలేని జపాన్‌ ప్లాజా ఒప్పందాన్ని అంగీకరించాల్సి వచ్చిందని పర్యవసానంగా జపాన్‌లో దీర్ఘకాల ఆర్ధిక తిరోగమనానికి దారి తీసిందని ఇప్పుడు అమెరికా గొంతెమ్మ కోర్కెలను చైనా అంగీకరించటం లేదని అందువలన చైనా నుంచి నేర్చుకోవాల్సి వుందని జపాన్‌ భావిస్తున్నది.

చిత్రం ఏమిటంటే ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలుపుతున్న అక్కడి ధనిక దేశాలు కూడా జపాన్‌ చర్యను చూసి అమెరికా దిగుమతి సుంకాలకు ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై అదనపు సుంకాలను విధించాల్సి వుంటుందని ఐరోపా యూనియన్‌ పేర్కొన్నది.అయితే ఈ హెచ్చరికలేవీ జపాన్‌-ఐరోపాయూనియన్‌- అమెరికా మధ్య వున్న రాజకీయ బంధాన్ని దెబ్బతీసేవిగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మన దేశంపై అమెరికా వాణిజ్య యుద్దానికి దిగకపోయినప్పటికీ మన వ్యవసాయ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వత్తిడి తెస్తోంది. దానిలో భాగంగానే మన దేశంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధరలను ఎక్కువగా నిర్ణయిస్తోందని, వ్యవసాయ, ఆహార రాయితీలను పరిమితికి ఇస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్ధకు కొద్దివారాల క్రితం ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో వుక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి కూడా వర్తిస్తాయని మన దేశం కూడా వాణిజ్య సంస్ధకు నోటీసు అందచేసింది. మొత్తం మీద చూసినపుడు మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తారు, మా ఇంటికొస్తూ మాకేమి తెస్తారు అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తోంది. అందువలన దాని వైఖరికి ప్రభావితులయ్యే ప్రతి ఒక్కరు ఏదో విధంగా సమన్వయం చేసుకొని పెద్దన్న వైఖరిని అడ్డుకోవటం అవసరం. ఈ దృష్ట్యా కూడా చైనాతో మన దేశం సఖ్యంగా వుండి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొరియా శాంతి ఒప్పందం అమలే పెద్ద సమస్య !

04 Friday May 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

inter-Korean agreements, inter-Korean summit, korea peace agreement, North Korean leader Kim Jong-un, Panmunjeom Declaration, South Korean President Moon Jae-in

ఎం కోటేశ్వరరావు

‘ప్రపంచం ద అష్టిలో ఆ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది’ అన్నట్లు కనిపించే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వారం రోజుల క్రితం ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాని పర్యవసానాల గురించి పండితులు చర్చలు చేస్తుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ భేటీ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఉభయ కొరియాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమలు జరగటానికి ముందు అనేక అంశాలపై స్పష్టత రావాల్సి వుంది. రెండు దేశాలను అణు రహితంగా మార్చడం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్తి పలకడం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చడం, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకు పోవటం, కొరియా యుద్ధ సమయం లో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది. 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం కుదరడం ఒక చారిత్రక సంఘటన. అయినప్పటికీ అమలు లోకి రావటం అంత తేలిక కాదని తరువాత వెలువడిన వార్తలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో 1953 నుంచీ తిష్ట వేసిన అమెరికా సేనలను ఉపసంహరించాలన్నది ఉత్తర కొరియా ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్‌. ఒప్పంద సమయంలో దాని ప్రస్తావన లేనప్పటికీ ఆ డిమాండును అది వదులుకుంటుండా అన్నది ప్రశ్న. తమ రక్షణకు హామీ వుంటే అణ్వాయుధాలతో తమకు పని లేదని, అమెరికా సైనికుల ఉపసంహరణను కూడా పెద్దగా పట్టుపట్టబోమని పరోక్షంగా సూచించినట్లు నిర్దారణ కాని వార్తలు వచ్చాయి. అయితే శాంతి ఒప్పందా లకు, తమ దేశంలో వున్న 29 వేల అమెరికన్‌ సైనికుల ఉపసంహరణకు సంబంధం లేదని దక్షిణ కొరియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌-కిమ్‌ మధ్య జరగబోయే భేటీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.దక్షిణ కొరియాలో అమెరికన్‌ సైనికుల సంఖ్య తగ్గింపు గురించి పరిశీలించాలని అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఆలోచనలు గతంలో కూడా జిమ్మీ కార్టర్‌ నుంచి అనేక మంది చేయకపోలేదు. ప్రపంచంలో అనేక చోట్ల పరాజయమే తప్ప విజయాలు లేనపుడు అమెరికా సైనికులను విదేశాలలో వుంచి పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేయాలన్న చర్చ అమెరికాలో చాలా కాలం నుంచి వుంది. దక్షిణ కొరియాలో తిష్టవేసిన సైన్యానికి అయ్యే ఖర్చు తగినంత అమెరికాకు తిరిగి రావటం లేదు. ఆ సైనికులు జపాన్‌కు రక్షణగా వున్నారు తప్ప మరొకటి కాదు. ఇరవైతొమ్మిది వేల మంది సైనికులు పక్కనే వున్నా అమెరికా నుంచి అణ్వస్త్రాలను తెచ్చి దక్షిణ కొరియాలో మోహరించినా, గువాం ప్రాంతంలో బాంబర్లు, పసిఫిక్‌ సముద్రంలో జలాంతర్గాములను మోహరించినా వుత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను నివారించలేకపోయాయి. వుత్తర కొరియన్లు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. చేతి చమురు వదలి, పరువు పోగొట్టుకోవటం ఎందుకని కొందరు అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదితో ముగిసే దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సైనికులకు ఏడాదికి అయ్యే ఖర్చు 80కోట్ల డాలర్లలో సగమే దక్షిణ కొరియా చెల్లిస్తోంది. మొత్తం ఖర్చు భరించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. వారు వున్నా ప్రయోజనం లేనపుడు అంత ఖర్చు తామెందుకు చెల్లించాలన్న ప్రశ్న దక్షిణ కొరియాలోనూ వస్తోంది. వుభయ కొరియాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తరువాత అమెరికా సైన్యాల తిష్టను సమర్ధించుకోవటం కష్టం అవుతుందని దక్షిణ కారియా ప్రభుత్వ సలహాదారు మూన్‌ చంగ్‌ ఇన్‌ స్వయంగా చెప్పారు. గతంతో పోలిస్తే దక్షిణ కొరియా సైన్యం కూడా పటిష్టంగా తయారైంది. వుత్తర కొరియా విషయానికి వస్తే అమెరికన్‌ సైనికుల వుపసంహరణ డిమాండ్‌ గురించి తాము పట్టుపట్టకపోవచ్చని కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియా అధికారులతో సూచన ప్రాయంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఎత్తుగడలలో భాగం.

ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం 1991వరకు వున్నది ఒకటే, రెండు కొరియాలు లేవు.1948లో ఐక్యరాజ్యసమితి దక్షిణ కొరియాను పరిశీలక హోదాలో గుర్తించింది. వుత్తర కొరియాను గుర్తించ నిరాకరించింది. 1950లో దక్షిణ కొరియాపై వుత్తర కొరియా దాడి చేసిందనే ఫిర్యాదు రావటంతో భద్రతా మండలి వుత్తర కొరియాపై చర్య తీసుకోవాలని తీర్మా నించింది. ఆ తీర్మానాన్ని నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో చేయలేదు. దాంతో అమెరికా నాయకత్వంలో వుత్తర కొరియాపై దాడి జరిగింది. ఆ దాడిని చైనా సహకారంతో వుత్తర కొరియా తిప్పి కొట్టి తన భూభాగాన్ని నిలుపు కొన్నది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 1971 వరకు ఐక్యరాజ్యసమితిలో చైనా అంటే నేటి తైవాన్‌ ప్రతినిధిగా వుంది. ఆ ఏడాది చైనాను గుర్తించిన తరువాత తైవాన్‌ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కొరియా విషయంలో భిన్నంగా జరిగింది. అది ఐరాస ఏర్పాటు సమయానికి స్వతంత్ర దేశంగా లేదు. 1971లో కమ్యూనిస్టు చైనాకు గుర్తింపు వచ్చిన తరువాత వుత్తర కొరియాకు పరిశీలక హోదా కల్పించారు. తరువాత రెండు దేశాలూ తాము శాంతియుత పద్దతుల్లో విలీనానికి చర్యలు తీసుకుంటామని సంయుక్తంగా ప్ర కటించాయి. తరువాత రెండు దేశాలకు 1991లో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. విలీస సమస్య పరిష్కారం కాలేదు. నేటి వరకు వరకు వుభయులు ప్రకటనలైతే చేస్తున్నారు గానీ ముందుకు సాగటం లేదు. అందువల్లనే ఆచరణలో మనకు కనిపిస్తున్నది ఒకే దేశం, రెండు వ్యవస్ధలు. వుత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంలో వున్న రెండున్నర కోట్ల జనాభా వున్న దేశం. దీర్ఘకాలం పాటు సైనిక నియంతల పాలనలో తరువాత సైనికాధికారుల కనుసన్నలలో పనిచేసే పౌర పాలకులతో పని చేస్తున్న ఐదు కోట్లకు పైగా జనాభాతో పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న దేశం దక్షిణ కొరియా.

ప్రపంచం దృష్టి సారించే విధంగా వుభయ దేశాల మధ్య వురుములు మెరుపులతో పాటు పెద్దగా సంప్రదింపుల వాతావరణం కూడా కనపడలేదు. కానీ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాపీగా ప్రకటించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. అదీ ఎక్కడా 1953లో ఎక్కడైతే కొరియా యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందో, తాత్కాలిక సరిహద్దుగా గుర్తించిన చోట, దక్షిణ కొరియా వైపున వున్న మిలిటరీ రహిత ప్రాంతమైన పాముంజోమ్‌లోని ‘శాంతి నివాసం’లో వుత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌, దక్షిణ కొరియా నేత మూన్‌ జె ఇన్‌ భేటీలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండు దేశాలను అణురహితంగా మార్చటం, రెండు దేశాల మధ్య వున్న శత్రుపూరిత కార్యకలపాలకు స్వస్ధి పలకటం, ప్రచార దాడులను నిలిపివేసి రెండు దేశాల మధ్య వున్న మిలిటరీ రహిత ప్రాంతాన్ని శాంతి మండలంగా మార్చాలి, సరిహద్దు ప్రాంతంలో ఆయుధాల సంఖ్య తగ్గింపు, అమెరికా, చైనాల ప్రమేయంతో చర్చలను ముందుకు తీసుకుపోవటం, కొరియా యుద్ద సమయంలో విడిపోయిన కుటుంబాలను దగ్గరకు చేర్చటం, సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాల నవీకరణ, ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో సహా అన్ని క్రీడలలో సంయుక్త జట్లతో పాల్గనటంపై ఒప్పందం కుదిరింది.

వివాహానికి ముందే విడాకుల గురించి చర్చించే ప్రబుద్ధుల మాదిరి రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి వూహాగానాలు చేసే పశ్చిమ దేశాల మీడియా కుదిరిన ఒప్పందాంశాలపై కూడా మరుక్షణం నుంచే వుత్తర కొరియాపై చిత్తశుద్ధిపై రచ్చ ప్రారంభించింది. గతంలో కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వుత్తర కొరియా వెనక్కు తగ్గిన మాట వాస్తవం. దానికంటే ముందు మరో ఒప్పంద భాగస్వామి అమెరికా వాగ్దానభంగం చేయటమే కాదు, వుత్తర కొరియాను రెచ్చగొట్టిన పర్యవసానమే అది. కొరియా ద్వీపకల్పంలో చిచ్చు పెట్టింది, పిర్ర గిల్లి జోలపాడుతోంది, దక్షిణ కొరియాను తన చేతిలో పావుగా చేసుకొని వుత్తర కొరియాకే కాదు, పక్కనే వున్న సోషలిస్టు చైనాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోంది అమెరికాయే.

వుత్తర కొరియా విశ్వసనీయతపై సందేహాలు లేవనెత్తుతున్న పశ్చిమ దేశాలు మరో నూతన ఒప్పందాన్ని ఎందుకు ప్రోత్సహించినట్లు? ఇది సమాధానం లేని ప్రశ్న. పశ్చిమ దేశాల కుట్రలు, కుయుక్తుల గురించి తెలిసీ వుత్తర కొరియా ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు దేశాల వెనుక పనిచేసిన వత్తిడులేమిటి? ఈ రీత్యా చూసుకున్నపుడు వుభయులకూ ఇది అవసరమే. ఎవరి ఎత్తుగడలు వారికి, ఎవరి ప్రయోజనాలు వారికీ వున్నాయి.

వేల సంవత్సరాల పాటు ఒకే దేశంగా కొనసాగిన కొరియాను కే దేశంగా 1910లో జపాన్‌ ఆక్రమించింది. దానికి వ్యతిరేకంగా కొరియన్లు పెద్ద ఎత్తున వుద్యమాలు నడిపారు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయంలో 1945 ఆగస్టు తొమ్మిదిన యాల్టా సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు జపాన్‌పై నాటి సోవియట్‌ యూనియన్‌ యుద్ధం ప్రకటించింది. అయితే కొరియాలో అప్పటికే కమ్యూనిస్టులు విముక్తి పోరాటాలలో ముందుండటంతో విముక్తి జరిగిన తరువాత కొరియా సోవియట్‌ ప్రభావంలోకి వెళుతుందనే భయంతో 38వ అక్షాంశ రేఖ వరకు మాత్రమే సోవియట్‌ సైన్యాలు పరిమితం కావాలని మిగతా ప్రాంతాన్ని తమకు వదలాలని అమెరికా కోరింది. వారం రోజులలోపే అమెరికా సేనలు ప్రవేశించక ముందే జపాన్‌ చేతులేత్తేసింది. మరో పది రోజుల తరువాత ఎర్ర సైన్యం వుత్తర కొరియాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇరవై రోజులకు అమెరికా సేనలు వచ్చాయి. తమకు అనుకూలంగా వుంటే మిలిటరీ ప్రభుత్వాన్ని దక్షిణ కొరియాలో ఏర్పాటు చేశాయి.

Image result for korea missile

జపాన్‌ తప్పుకున్న తరువాత రెండవ ప్రపంచ యుద్ధ మిత్రరాజ్యాల పర్యవేక్షణలో కొంతకాలం కొరియాలో పాలన సాగించాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దేశభక్తులు తమకు వెంటనే స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టులను, పోటీగా స్వాతంత్య్రపోరాట సమయంలో పశ్చిమ దేశాలకు పారిపోయిన, జపాన్‌తో చేతులు కలిపిన ద్రోహులను, కమ్యూనిస్టు వ్యతిరేకులను అమెరికన్లు చేరదీశారు.

అమెరికా ప్రోద్బలంతో కొరియాపై తాత్కాలిక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రతిపాదనను సోవియట్‌ యూనియన్‌ తిరస్కరించింది. తరువాత అమెరికన్లు దక్షిణ కొరియాలో ఎన్నికల తతంగం జరిపి మిలిటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని దానికి బదలాయించారు. వుత్తర కొరియా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సోవియట్‌ సేనలు అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. అయితే దక్షిణ కొరియా మిలిటరీకి శిక్షణ ఇచ్చే నెపంతో అమెరికా సేనలు అక్కడే తిష్టవేశాయి. కొరియాను ఒకే దేశంగా పరిగణిస్తూ రెండు ప్రభుత్వాలు మొత్తం కొరియాకు తామే ప్రతినిధులమని ప్రకటించుకున్నాయి. విభజన తాత్కాలికమే అని రెండు ప్రాంతాల విలీనానికి కట్టుబడి వున్నట్లు పేర్కొన్నాయి. ఎవరికి వారు పైచేయి సాధించి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలోనే 1950 జూన్‌ 25న రెండు ప్రాంతాల మిలిటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. దక్షిణ కొరియాలోని ప్రభుత్వానికి రక్షణ కల్పించే పేరుతో భద్రతా మండలిలో అమెరికా ఒక తీర్మానం చేయించటం, ఐరాస సేనల పేరుతో వుత్తర కొరియాపై దాడికి దిగాయి. కొద్ధి కాలం తరువాత వుత్తర కొరియాకు మద్దతుగా చైనా రంగంలోకి వచ్చింది. అమెరికా నాయకత్వంలోని సేనలను తరిమి కొట్టింది. చివరకు 1953 జూలై 27న వుభయ ప్రాంతాల మధ్య పూర్వపు సరిహద్దులను పునరుద్దరిస్తూ 38వ అక్షాంశ రేఖ పరిసరాలను మిలిటరీ రహిత ప్రాంతంగా గుర్తిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు

ఈ ఒప్పందం కాల్పుల విరమణకే పరిమితమైంది తప్ప తదుపరి శాంతి ఒప్పందం కుదరలేదు.దాన్ని కూడా దక్షిణ కొరియా పాలకులు ఆమోదించి సంతకాలు చేయలేదు, చివరకు కట్టుబడి వుంటామని మాత్రమే ప్రకటించారు.దాంతో తాము కూడా కట్టుబడటం లేదని వుత్తర కొరియా ప్రకటించింది. అందువలన ఇప్పటికీ సాంకేతికంగా కాల్పుల విరమణ జరిగింది తప్ప సాంకేతికంగా యుద్ధం ముగిసినట్లు కాదు.

కొరియా యుద్దం, దేశ విభజన కొరియన్లను అనేక కష్ట నష్టాలపాలు చేసింది. ఏడున్నరలక్షల మంది తమ కుటుంబ సభ్యులకు దూరమయ్యారు. ఎదురుగా కనిపిస్తున్నా ఒకరి నొకరు కలుసుకోలేని దుస్ధితి. రెండు ప్రాంతాల మధ్య నిత్యం వుద్రిక్తతలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళన,భయం వెన్నాడుతూ వుంటుంది. వుభయ ప్రాంతాలను వేరు పరచి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఒకే దేశం, ఒకే ప్రజగా ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడాలన్న తపన ఇంకా మెజారిటీ జనంలో వుందని అనేక సర్వేలు వెల్లడించాయి. గత ఐదు ద శాబ్దాలలో వుభయుల మధ్య విబేధాలను పెంచే అనేక వుదంతాలు జరిగాయి. వాటి వెనుక అమెరికా ప్రచ్చన్న హస్తం వుంది. కొరియా ప్రాంతంలో తిష్ట వేయాలంటే అమెరికన్లకు ఒక దేశం అవసరం. అది దక్షిణకొరియాగా వుండాలన్నది దాని వాంఛ అందుకే విలీనానికి ఇంకా సమయం రాలేదు, దక్షిణ కొరియన్లలో భయం తొలగలేదంటూ కుంటి సాకులు చెబుతున్నది. నిజానికి రెండు ప్రాంతాలు విలీనమైతే జనాభా రీత్యా చూసుకుంటే రెండున్నర కోట్ల మంది వుత్తర కొరియన్లతో పోలిస్తే ఐదుకోట్లమందికి పైగా వున్న దక్షిణ కొరియన్లే నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. అందువలన వారు భయపడుతున్నారని చెప్పటంలో అర్ధం లేదు. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక తిష్ట వుత్తర కొరియన్లనే భయపెడుతున్నది, ఎందుకంటే 1950దశకంలో వారిపై దాడి చేసింది అమెరికన్లు, వారి కనుసన్నలలో పనిచేసే దక్షిణ కొరియా మిలిటరీ తప్ప మరొకటి కాదు.

Image result for north korea  arms show

అమెరికా ఈ వైఖరి కారణంగానే వుత్తర కొరియా తన రక్షణ చర్యల్లో భాగం ఆధునిక క్షిపణులు, అణు కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో అణు రియాక్టర్లను కలిగిన ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయటానికి అవసరమైన ముడి సరకును కలిగి వున్నట్లే. అందువలన దక్షిణ కొరియా అధికారికంగా ప్రకటించలేదు తప్ప దాని దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పలేము. వుత్తర కొరియా అణుక్షిపణుల కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 2003 నుంచి అమెరికా, చైనా,జపాన్‌, రష్యా, వుభయ కొరియాల( ఆరు దేశాల) మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. 2006ల వుత్తర కొరియా తొలి అణుపరీక్ష జరిపింది.

తాజా ఒప్పందానికి దారితీసిన నేపధ్యాన్ని చూస్తే వుభయుల మీద పరిస్ధితులు, పర్యవసానాలు వత్తిడి తెచ్చాయనే చెప్పాలి. తమ వనరులను మిలిటరీ అవసరాలకు ఖర్చు చేయటం వుత్తర కొరియాకు ఎల్లవేళలా సాధ్యం కాదు. అది వాంఛనీయం కూడా కాదు. చైనా ఎంతగా సాయం చేసినప్పటికీ అమెరికా విధించిన అధికారిక, అనధికారిక ఆంక్షలు వుత్తర కొరియాను ఇబ్బంది పెట్టేవే. అందువలన కాస్త వూపిరి పీల్చుకోవాలంటే దక్షిణ కొరియాతో సామరస్యక పూర్వక ఒప్పందం దానికి కూడా అవసరమే.

వుత్తర కొరియా అణు పరీక్షలు, అణ్వాయుధాలను మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగాల ద్వారా అమెరికా,జపాన్లపై తాము బాంబుల వర్షం కురిపించగలమని వారు చేసిన హెచ్చరిక అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వాసులను అనిశ్చితి, భయాందోళనలకు గురిచేసింది. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా వుత్తర కొరియా వెనక్కు తగ్గదని తేలిపోవటంతో ఏదో ఒక విధంగా రాజీ ఒప్పందం చేయించట ద్వారా తమ జనాల్లో వున్న భయాన్ని పొగొట్టేందుకు అమెరికా, జపాన్‌ పాలకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా తలెత్తి కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం దక్షిణ కొరియాను కూడా తాకింది. అది అక్కడి కార్మికవర్గంలో అసంతృప్తికి దారితీస్తోంది. దీనికి తోడు నిత్యం వుత్తర కొరియా నుంచి ఏం జరుగుతుందో తెలియని స్ధితి దక్షిణ కారియా పాలకవర్గం వత్తిడి కలిగిస్తోంది. వుత్తర కొరియాకు తోటి సోషలిస్టు దేశ ంగా ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికల మీద కొన్ని సందర్భాలలో చైనా కూడా గట్టిగా మాట్లాడలేని స్ధితి వుంది. ఈ విధంగా కొరియా రాజకీయాలతో ప్రమేయం వున్న అన్ని దేశాలకు అనుకూల, ప్రతికూల వత్తిళ్లు వున్నాయి. ఈ కారణంగానే వుభయ కొరియాల మధ్య ఒప్పందానికి తెరవెనుక వుండి అన్ని దేశాలూ సంతకాలు చేయటానికి సహకరించాయనే చెప్పవచ్చు. ఈ పూర్వరంగంలోనే

2015 జనవరి ఒకటిన వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ దక్షిణ కారియాతో వున్నత స్ధాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.అదే ఏడాది ఆగస్టులో సరిహద్దులలో సంభవించిన కొన్ని సంఘటనలు వుద్రిక్తతలను కలిగించినా సర్దుబాటు చేసుకున్నారు. శాంతి చర్చలకు సంసిద్ధతతో పాటు వుత్తర కొరియా తన అణుపరీక్షలను కూడా కొనసాగిస్తూనే వస్తోంది. 2016లోఅరవైఎనిమిద వార్షికోత్సవం సందర్భంగా ఆరవ పరీక్ష జరిపింది.కిమ్‌ జోంగ్‌ ఇన్‌ను హత్య చేసేందుకు తమ వద్ద పధకం వుందని దక్షిణ కొరియా బెదిరించింది.ఈ ఏడాది మార్చి ఆరున కిమ్‌ దక్షి ణకొరియా రాయబారులతో సమావేశమై సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌ గురించి చర్చించారు.2017 మేనెలలో అధికారానికి వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ వుత్తర కొరియా సయోధ్య కు సై అన్నాడు.2018 నూతన సంవత్సర సందేశంల సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు జట్టును పంపేందుకు కిమ్‌జోంగ్‌ అన్‌ సంసిద్ధత ప్రకటించారు.

రెండు సంవత్సరాల తరువాత ముఖాముఖీ చర్చలకు తెరలేచింది. సియోల్‌ శీతాకాల ఒలింపిక్స్‌కు ఐస్‌ హాకీలో వుమ్మడి జట్టును, అధ్లెట్లను పంపటంతో పాటు రెండు ప్రాంతాల క్రీడాకారులు ఒకటిగానే పరేడ్‌లో పాల్గన్నారు. ఈ పోటీలకు అసాధారణ రీతిలో వుత్తర కొరియా పార్లమెంట్‌ అధ్యక్షుడి నాయకత్వంలో పెద్ద ప్రతినిధి బృందం తరలి వచ్చింది. ఈ సందర్బంగానే తమ దేశాన్ని సందర్శించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడికి ఆహ్వానం అందచేశారు. ఈ పరిణామం తరువాత వుభయ దేశాల అధికారులు వుమ్మడిగా 2021 ఆసియా శీతాకాల ఆటల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. మార్చినెలలో దక్షిణకారియా ప్రతినిధి బృందం పోంగ్‌యాంగ్‌లో వుత్తర కొరియా అధ్య క్షుడు కిమ్‌ను కలసింది. తరువాత అదే బృందం వాషింగ్టన్‌ వెళ్లి కిమ్‌తో భేటీ కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆహ్వానం అందచేసింది.

ఏప్రిల్‌ ఒకటవ తేదీన దక్షిణ కారియా పాప్‌ స్టార్స్‌ పోంగ్‌యాంగ్‌ వెళ్లి వసంతం వస్తోందంటూ ఒక సంగీత కచేరి నిర్వహించింది. దానికి కిమ్‌ హాజరయ్యారు. ఈలోగా పరస్పర ప్రచార దాడులు ఆగిపోయాయి.ఏప్రిల్‌ 27న వుభయ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది, ఒప్పందం కుదిరింది. కొరియా యుద్దం 1953 తరువాత తొలిసారిగా వుత్తర కొరియా నేత దక్షిణ కొరియాలో అడుగు పెట్టటం ఇదే ప్రధమం. ఎక్కడైతే నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందో అక్కడే ఈ భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాంతి ఒప్పందంగా మార్చాలన్న ఆకాంక్ష ఇరువురిలో వ్యక్తమైంది. ఒంటిచేతితో చప్పట్లు రావు, చేతులు కలపాలి, చేతలు జరగాలి.అలాగే కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు, వారి వెనుక వున్న మద్దతుదార్లు చిత్తశుద్దితో వుంటేనే ఆచరణలోకి వస్తుంది. ఎవరు ద్రోహం చేసినా అది ఒక్క కారియా ద్వీపకల్పానికే కాదు, యావత్తు ప్రపంచానికి నష్టదాయకం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు చైనా – కాథలిక్‌ మతం !

19 Monday Feb 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

catholic religion, china communist party, pope, Pope Francis

Image result for china communist party-catholic religion

ఎం కోటేశ్వరరావు

మతం జనం పాలిట మత్తు వంటిదన్నది కమ్యూనిస్టుల అవగాహన. కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అన్నది కాథలిక్‌ మతాధికారుల భాష్యం. అటువంటి రెండు పరస్పర విరుద్ధ శక్తులు కారణాలేమైతేనేం రాజీబాటలో వున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు కదూ ! ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించటానికి ఎవరి స్వేచ్చ వారికి వుంది. అనుకూల, వ్యతిరేక తీర్పుల జోలికి పోకుండా అసలేం జరుగుతోందో ముందు చూద్దాం.గత కొద్ది వారాలుగా గతంలో ఎవరి మీదా లేని విధంగా క్రైస్తవులే పోప్‌ ఫ్రాన్సిస్‌పై పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మతాన్ని మంటగలుపుతున్నారని శాపనార్ధాలు పెడుతున్నారు. పోప్‌ కూడా చివరికి కమ్యూనిస్టు చైనాకు లో0గిపోతున్నారని, ఆ దేశం చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే జరిగితే గత వెయ్యి సంవత్సరాలుగా పోప్‌ల నియామకంపై పెత్తనం చలాయియిస్తున్న వాటికన్‌ ఓడిపోయినట్లే అని కొందరు రెచ్చగొడుతున్నారు. అది జరిగితే కొందరైతే గొర్రెపిల్లలను తోడేళ్లకు అప్పగిస్తున్న వ్యక్తిగా పోప్‌ను నిందిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతి సమాజంలో ఎవరు సుప్రీం, అంతిమ అధికారం ఎవరిది అన్న అంశంపై మతం, రాజ్యాధికారం మధ్య ఏదో ఒక రూపంలో పోరు సాగింది. దోపిడీవర్గ జోక్యంతో రాజీలు, సర్దుబాట్లు జరిగాయి. తమ దోపిడీ సజావుగా సాగటానికి అటు రాజ్యాన్ని, మతాన్ని దోపిడీవర్గం కుడిఎడమల డాల్‌, కత్తుల మాదిరి సహజీవనం చేయిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా చైనా-వాటికన్‌ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నా నిర్ధిష్టంగా ఎలాంటి పురోగతి లేదు. చైనాలో 1948లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వాన్ని 1971 వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అమెరికా నాయకత్వంలోని కూటమి చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా గుర్తిస్తూ వచ్చింది. బౌద్దమతాధిపతి దలైలామా అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి టిబెట్‌ తన పాలనలోని రాజ్యమంటూ విఫల తిరుగుబాటు చేసి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టిబెట్‌లో నిత్యం ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు కలిగి వున్నాడు. గతేడాది నవంబరు 23న ఒక ప్రకటన చేస్తూ జరిగిందేదో జరిగిపోయింది, చైనాతో టిబెట్‌ కలసి వుండాలనుకొంటోంది, చైనా అంగీకరిస్తే టిబెట్‌కు తిరిగి వస్తాను అని దలైలామా ప్రకటన చేశారు. కమ్యూనిస్టులు, సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధంలో భాగంగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా నుంచి హాంకాంగ్‌ పారిపోయి తైవాన్‌, మకావుల్లో బిషప్పుగా పని చేసి రిటైరైన చైనాలోని కాధలిక్‌ మత కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌(86) మాత్రం ససేమిరా రాజీపడేది లేదు అంటున్నారు.

డిసెంబరులో వాటికన్‌ నుంచి చైనా వెళ్లిన ఒక ప్రతినిధి బృందం గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని షాంటౌలో బిషప్పుగా పనిచేస్తున్న పీటర్‌ ఝువాంగ్‌ జియాన్‌ జియాన్‌(88)ను బీజింగ్‌లో కలసింది. బాధ్యతల నుంచి వైదొలగి చైనా ప్రభుత్వం నియమించిన పార్లమెంట్‌ సభ్యుడు, బిషప్పు హువాంగ్‌ బింగ్‌ఝాంగ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు వీలు కల్పించాలని కోరింది. హువాంగ్‌ను 2011లో వాటికన్‌ అధికారులు మతం నుంచి బహిష్కరించారు. మరోబిషప్పు జోసెఫ్‌ గువో గ్జీజిన్‌ను కూడా తప్పుకోవాలని వాటికన్‌ బృందం కోరింది. 1999తో బ్రిటన్‌ కౌలు గడువు ముగిసిన హాంకాంగ్‌ చైనా ఆధీనంలోకి వచ్చినప్పటికీ విలీనం సందర్భంగా కుదురిన ఒప్పందం ప్రకారం 2050వరకు అక్కడ ప్రత్యేక పాలనా వ్యవస్ధ కొనసాగుతుంది. జోసెఫ్‌ జెన్‌ 2002లో అక్కడ బిషప్పు అయ్యాడు. తరువాత రిటైర్‌ అయిన ఈ మాజీ బిషప్పు చైనాలో హాంకాంగ్‌ విలీన వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతూ రాజకీయాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే సదరు జెన్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జనవరి పదిన వాటికన్‌ నగరానికి వెళ్లి అక్కడ పోప్‌ను కలిసింది. చైనా ప్రభుత్వానికి లంగిపోయి వాటికన్‌ గుర్తించిన ఇద్దరు బిషప్పుల స్ధానంలో కమ్యూనిస్టు పార్టీ ఆమోదం వున్న బిషప్పులను నియమించవద్దని వాదించింది. ఈ కలయిక, చర్చల గురించి పశ్చిమ దేశాలు, క్రైస్తవమత కేంద్రాలు, మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వెయ్యి సంవత్సరాల తరువాత మరోసా రి మతం, రాజ్యం మధ్య ఆధిపత్యపోరు కొత్త రూపంలో ముందుకు వచ్చిందన్నది వాటిలో ఒకటి.

చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నగరానికి చైనాకు పరస్పర గుర్తింపు, దౌత్య సంబంధాలు లేవు. అయినా వాటికన్‌ అక్కడ ఇంతకాలంగా మత పెద్దలను నియమిస్తూనే వుంది. వారిని చైనా గుర్తించటం లేదు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్నవారిగానే భావిస్తున్నది. 1957లో చైనా ప్రభుత్వం కాథలిక్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా బిషప్పు, ఇతర మతాధికారుల నియమాకాన్ని చేపట్టింది. దీన్ని తాము గుర్తించటం లేదని అలాంటి మతాధికారులను బహిష్కరిస్తున్నట్లు 1958లో పోప్‌ 14వ బెండిక్ట్‌ ప్రకటించారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతున్నది. అప్పటి నుంచి అధికార, అనధికార బిషప్పుల నియామకాలు జరుగుతూనే వున్నాయి. అనధికార ప్రార్ధనలపై చైనా సర్కార్‌ క్రమంగా ఆంక్షలను పెంచటం ప్రారంభించింది. వాటికన్‌ అధికారాన్ని గుర్తించేందుకు చైనా ససేమిరా అంటోంది. మొత్తంగా చూసినపుడు ప్రతి మతం ప్రజల పాలిట మత్తు మందే అన్నది స్పష్టం. అయినప్పటికీ కొందరు మతాన్ని సంపూర్ణంగా సంస్కరించలేకపోయినా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే పురోగామివాదులు కొందరైతే మొరటుగా వెనక్కు నడిపించజూసే కొందరు అన్ని మతాల్లోనూ వుంటారు. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌లలో సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో అమెరికా సామ్రాజ్యవాదులు, ఇతర ఐరోపా ధనిక దేశాలతో పాటు రెండవ పోప్‌ జాన్‌పాల్‌ కూడా పుణ్యం కట్టుకున్న రెండవ తెగకు చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌పై చేస్తున్న విమర్శలు, వస్తున్న వూహాగానాలను బట్టి ఆయన జాన్‌పాల్‌ వంటి వ్యక్తి మాత్రం కాదని చెప్పవచ్చు.

తిరుగుబాటు మాజీ బిషప్‌ జెన్‌ బృందం రోమ్‌లో పోప్‌ను కలిసి చైనా ప్రభుత్వ వత్తిడికి లంగవద్దని కోరింది. దాని మీద పోప్‌ స్పందిస్తూ గతంలో హంగరీలో మాదిరి తిరుగుబాటు చేసి జైలు పాలయ్యే పరిస్ధితి తెచ్చుకోవద్దని చైనాలో రహస్యంగా పని చేస్తున్న బిషప్పులనుద్ధేశించి సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. జోసెఫ్‌ మైండ్‌జెంటీ అనే బిషప్పు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు పాలయ్యాడు.1956లో ప్రతీఘాతవిప్లవ సమయంలో తిరుగుబాటుదార్లు జైలుపై దాడి చేసి మైండ్‌ జెంటీని అమెరికా రాయబార కార్యాలయంలోకి పంపారు. హంగరీ ప్రభుత్వ వత్తిడి కారణంగా మైంట్‌జెంటీని దేశం వదలి వెళ్లాలని ఆదేశించిన వాటికన్‌ ఆయన స్ధానంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యుడైన మరొక బిషప్పును నియమించింది. అటువంటి స్ధితిని మరోమారు తెచ్చుకోవద్దని చైనా బిషప్పులకు పోప్‌ సలహాఇచ్చారన్నది వార్తల సారాంశం. ‘ చైనా కాథలిక్‌ చర్చిని వాటికన్‌ చర్చి(కమ్యూనిస్టులకు) ధారాదత్తం చేస్తున్నదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా వారు నడిచినబాటనే కొనసాగిస్తే అదే జరుగుతుంది. వాటికన్‌-చైనా మధ్య ఒప్పందం కుదిరే క్రమంలో నేను ప్రధాన ఆటంకం వున్నానా? ఒక వేళ అది దుష్ట లావాదేవీ అనుకుంటే దానికి ఆటంకంగా వున్నందుకు నేను సంతోషపడతాను’ అని జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొట్లు వార్తలు వచ్చాయి. జెన్‌ వైఖరి చైనా సర్కార్‌తో ఘర్షణనే కోరుతున్నట్లు వెల్లడి కావటంతో ఒప్పందాన్ని ఖరారు చేసుకొనేందుకు వుభయపక్షాలు వేగంగా కదులుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వాటికన్‌ విదేశాంగమంత్రి పిట్రో పారోలిన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్‌ పేరు ప్రస్తావించకుండా ‘ అవును, చైనా ప్రభుత్వ అధికారులతో ప్రస్తుత సంబంధాలను పోప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ అనధికార చొరవలు తీసుకోవటం లేదు. చేస్తున్న త్యాగం చైనా ప్రభుత్వం కోసం కాదు, క్రీస్తు చర్చికోసమే, అని చెప్పారు.

కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టి రెండు వందల సంవత్సరాలైతే క్రైస్తవం దాని కంటే రెండువేల సంవత్సరాల ముందు పుట్టింది. సోదరత్వాన్ని ప్రబోధించటమే తప్ప సోదరుల మధ్య అంతరాలు,దోపిడీ పెరగటాన్ని అది నిరోధించలేకపోయింది. దోపిడీకి వ్యతిరేకంగా నూతన సమాజాన్ని నిర్మించాలన్న కమ్యూనిజాన్ని దోపిడీదారులు, వారికి వత్తాసుగా వున్న మతపెద్దలు వ్యతిరేకించేందుకు నడుం కట్టారు. దోపిడీదార్లతో మత పెద్దలు చేతులు కలపాలంటే ఏదో ఒక సాకు కావాలి కనుక మతానికి కమ్యూనిజం వ్యతిరేకం అని అర్ధాలు తీశారు. దోపిడీ మతానికి వ్యతిరేకమని ఏనాడూ పెట్టుబడిదారీ వ్యవస్ధను, సిద్ధాంతాలను మతం చెప్పలేదు. సోవియట్‌, తూర్పు ఐరోపాదేశాలలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే సామ్రాజ్యవాదులతో పాటు వారితో చేతులు కలిపిన చర్చి అధికారుల పాత్రను చైనా కమ్యూనిస్టుపార్టీ గుర్తించి కనుకనే మతం ముసుగులో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న మతాధికారులను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం పూనుకుంది. మత స్వేచ్చను అనుమతిస్తున్నది కనుకనే దాన్ని ఇంటికి పరిమితం చేసుకోవాలని, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతోంది. ఒకసారి జనంలో మతోన్మాదాన్ని నింపితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులను చూస్తున్న ప్రపంచానికి వేరే చెప్పనవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అమెరికన్లు, వారితో చేతులు కలిపిన ఆ ప్రాంత కమ్యూనిస్టు వ్యతిరేకులు తాలిబాన్ల సృష్టికి తెరలేపారు. పశ్చిమాసియాలో రాజకీయంగా తమను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా తాలిబాన్లతో పాటు ఐఎస్‌ తీవ్రవాదులను కూడా పెంచి పోషించింది అమెరికా, దాని అనుయాయి దేశాలే అన్నది స్పష్టం. ఈ పరిణామాలను చూసిన తరువాత చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధను కాపాడుకొనేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది. అందువలన చైనాలో అనధికార క్రైస్తవ, ఇస్లామిక్‌ మతకార్యకలాపాలను ఈ నేపధ్యం, దృష్టితోనే చూడాల్సి వుంది.

ఇక్కడ కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులకు ఒక సందేహం రావటం సహజం.మతం మత్తు మందు అని చెప్పే కమ్యూనిస్టులు మతాన్ని నిర్మూలించకుండా అధికారికంగా అనుమతించటం ఏమిటి అన్నదే అది. కమ్యూనిస్టు పార్టీ అంగీకారంతో నియమించే బిషప్పులు కూడా అదే క్రీస్తు, అదే బైబిల్‌నే ప్రచారం చేస్తారు కదా తేడా ఏముంది అని ప్రశ్నించ వచ్చు. మన సమాజంలో మతం అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్లూనుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ లేదా మరో అధికార కమ్యూనిస్టు పార్టీ దాని ప్రభావాన్ని తగ్గించటానికి చర్యలు తీసుకుంటున్నదా, మతభావాలను పెంచేవిధంగా వ్యవహరిస్తున్నదా అన్నదే గీటురాయి. ఆ విధంగా చూసినపుడు చైనా ప్రభుత్వం మతంతో సహా అనేక అన్యవర్గధోరణులను అరికట్టేందుకు ఓపికతో పని చేయాలే తప్ప నిషేధాలతో కాదు. అక్కడ ఇంకా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం ఇంకా ప్రాధమిక దశలోనే వుంది, ఎన్నో దశ లను అధిగమించాల్సి వుంది. అటువంటపుడు అన్యవర్గ ధోరణులు అంతమయ్యే అవకాశ ం లేదు. కనుక కొంత కాలం పాటు కుట్రలూ, కూహకాలకు అవకాశం లేని మత స్వేచ్చను అనుమతించటం తప్ప మరో మార్గం లేదు.జనం తమ అనుభవం ద్వారా మత ప్రభావం నుంచి బయటపడాల్సి వుంది.

విశ్లేషకులు చెబుతున్నదాని ప్రకారం చైనాలోని 140 కోట్ల జనాభాలో ఏడు కోట్ల మంది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులుంటే కోటి మంది కాథలిక్కులున్నారని అంచనా. చైనా కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, ఏడు దశాబ్దాల ప్రభుత్వ తీరుతెన్నులను గమనిస్తే మతం రాజ్యానికి లోబడి వుండాలే తప్ప రాజ్యంపై మత పెత్తనాన్ని అంగీకరించేది లేదని రుజువైంది. కమ్యూనిస్టు పార్టీ అధికారానికి రాగానే బౌద్ద మతాధిపతి దలైలామా తాను సర్వస్వతంత్రుడనని, తన ఆధీనంలోని టిబెట్‌ తన రాజ్యమని ప్రకటించుకోవటమేగాక కమ్యూనిస్టు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో తిరుగుబాటు విఫలమై మన దేశానికి పారిపోయి రావటం, మన ప్రభుత్వం ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చరిత్ర తెలిసిందే. క్రైస్తవ మత చరిత్రలో బిషప్పులు, ఇతర మతాధికారులను నియమించే అధికారం రాజులదా, పోప్‌దా అనే ఆధిపత్యపోరు సాగింది.అది పదకొండవ శతాబ్దిలో తారాస్ధాయికి చేరింది. పోప్‌ ఏడవ గ్రెగరీ ఆధిపత్యాన్ని రోమన్‌ లేదా జర్మన్‌ చక్రవర్తి నాలుగవ హెన్రీ సవాలు చేయటంతో ముగ్గురు పోప్‌లు ఐదుసార్లు అతడిని మతం నుంచి బహిష్కరించారు. ఇటలీ, జర్మనీలలో అంతర్యుద్ధాలు సంభవించాయి. ఆ పోరులో బలహీనపడిన హెన్రీ 1076,77 సంవత్సరాలనాటికి చేతులెత్తేశాడు. ఈ పోరులోనే పోప్‌ ఏడవ గ్రెగరీని కిడ్నాప్‌ చేసి ఇటలీలోని కానోసా కోటలో బంధించారు. అయితే కొంత మంది ప్రభువుల అండతో తప్పించుకున్నాడు. కిడ్నాప్‌లో హెన్రీ హస్తం వుందని భావించారు. చివరకు హెన్రీ పోప్‌కు లంగిపోవాల్సి వచ్చింది. పోప్‌ నివాసానికి వెళ్లి మూడు రోజుల పాటు చెప్పుల్లేకుండా మంచులో బయట నిలబడి తన తప్పులను క్షమించాలని వేడుకున్నాడు. తరువాత పోప్‌ ఇతరులకు మద్దతు ఇచ్చి మరోసారి హెన్రీని మతం నుంచి బహిష్కరించాడు.

ఇది పదకొండవ శతాబ్దం కాదు, చైనా పాలకులకు నాలుగవ హెన్రీకి, ఏడవ పోప్‌ గ్రెగరీకి, ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌కు పోలికేలేదు. ఆయన స్ధానంలో మరొకరుండి పెత్తనం చెలాయించాలని చూసినా చైనాను కట్టడి చేసే శక్తివంతులెవరూ నేడు ప్రపంచంలో లేరు. పోప్‌దే సర్వాధికారం అని రుజువు చెయ్యటానికి పాలకులు యుద్ధాలు చేసే పరిస్ధితీ లేదు. వాటికన్‌ మొండిగా వ్యవహరించి చైనాలో రహస్యకార్యకలాపాలు నిర్వహిస్తున్న కాథలిక్కులను ప్రోత్సహించటమంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయటం, తద్వారా వారిని ఇబ్బందుల పాలు చేయటం తప్ప మరొకటి కాదు. గతంతో పోల్చితే ఒక్క క్రైస్తవమే కాదు అన్నిరకాల మతకార్యకలాపాలను అదుపు చేసేందుకు మరిన్ని చర్యలను తీసుకొనేందుకు చైనా నాయకత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రహస్య ప్రార్ధనలను ఏమాత్రం సహించేది లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు చైనా తిరుగుబాటు బిషప్‌ జెన్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నాడు. ఆసియా న్యూస్‌ అనే పత్రిక 2015లో ప్రచురించిన ఒక వార్తను వుటంకిస్తూ దాని సంపాదకుడు వ్యాఖ్యానించారు. జైలు పాలైన మతాధికారుల గురించి చైనా ప్రభుత్వం అసలు చర్చలకే అంగీకరించలేదు, అప్పుడూ ఇప్పుడు తాము ప్రతిపాదించిన బిషప్పును గుర్తిస్తేనే వాటికన్‌ను గుర్తిస్తామని చైనా చెబుతోంది. ఆంక్షల పెంపుదలకు ఒకటే వుద్ధేశం. అదేమంటే కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని సుస్ధిరం చేసుకొనేందుకు, ఎవరైనా దాని వునికిని సవాలు చేస్తే అణచివేసేందుకు’ అన్నాడు. పదజాలం ఎలా వున్నప్పటికీ చైనా సోషలిస్టు వ్యవస్ధకు హాని తలపెట్టే ఏ పరిణామాన్ని కూడా అక్కడి నాయకత్వం తక్కువ చేసి చూడటం లేదని, దానిని రక్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే అనేక పరిణామాలు స్పష్టం చేశాయి. వాటికన్‌-చైనా సంబంధాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు ఏ రీత్యాచూసినా ఆహ్వానించదగినవే అని చెప్పవచ్చు. మతానికి కమ్యూనిజానికి మధ్య కట్టిన అడ్డుగోడల కూల్చివేతకు ఏ మాత్రం తోడ్పడినా మంచిదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది, ఎందుకలా ?

31 Wednesday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Communist Party Groups, foreign companies in China, Xi Jinping

Image result for communist party vangaurd in china companeis

ఎం కోటేశ్వరరావు

చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్‌, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్‌ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.

స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్‌ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్‌ ఇంటర్నేషనల్‌ సిఇఓ ఆర్నె సోరెన్సన్‌ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్‌ నిర్వహిస్తున్న మారియట్‌ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్‌ సర్వే జరిపింది. దానిలో టిబెట్‌, హాంకాంగ్‌, మకావో, తైవాన్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్‌ మొబైల్‌ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్‌ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.

చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్‌ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.

చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్‌ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు జేమ్స్‌ జిమర్‌మన్‌ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్‌ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.

వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్‌ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్‌ హోటల్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.

ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్‌ అనే ఇంటర్నెట్‌ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.

చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d