• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

సాకు ఎమెన్‌ హౌతీలు అసలు లక్ష్యం ఇరాన్‌పై దాడి ?

25 Wednesday Dec 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, iran, Israel, Joe Biden, Netanyahu, US Attack on Yemen, Yemen Houthis

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మధ్య ప్రాచ్యంలోని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. పొరపాటున దాన్ని తమ దళాలే కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించగా, తామే కూల్చివేసినట్లు రాజధాని సనా నగరంతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకున్న హౌతీ సాయుధ దళం ప్రకటించింది. మరోవైపు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ రాడార్లు పసిగట్టలేకపోయాయని, ఫలితంగా కొద్ది మంది తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ రెండు పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనతలను వెల్లడిరచాయి. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఎమెన్‌పై వైమానిక దాడులు జరుపుతున్నాయి. సిరియాలో బాత్‌ పార్టీ నేత అసద్‌ సర్కార్‌ కూలిపోయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.హౌతీలకు బదులు వారి వెనుక ఉన్న ఇరాన్‌ సంగతే చూడాలంటూ ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నెయా తమ నేతలకు సూచించాడు. దీన్ని బట్టి ఇరాన్‌పై దాడికి పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఏడాది కాలంగా ఎమెన్‌ కేంద్రంగా పని చేస్తున్న హౌతీలు జరుపుతున్న దాడుల తీరుతెన్నులను చూస్తే వారిని అణచివేయటం అంతతేలిక కాదని నిపుణలు చెబుతున్నారు.వారు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ మీద ప్రయోగించిన క్షిపణులు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి భారీ నష్టం కలిగించాయి. లెబనాన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిజబుల్లా కంటే వీరు శక్తివంతులని తేలింది. ఈ పూర్వరంగంలో ఒకేసారి ఇరాన్‌ఎమెన్‌ మీద దాడులకు దిగితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా కూటమి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పవచ్చు. మధ్యప్రాచ్య పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఇంకా స్పష్టంగా తెలియటం లేదు.

ఎర్ర సముద్ర తీరం ఒకవైపు, మరోవైపు అరేబియా సముద్రం సరిహద్దులుగా కీలక ప్రాంతంలో ఉన్న పశ్చిమాసియాలోని ఎమెన్‌ తొలుత బ్రిటన్‌ తరువాత అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రకు బలైంది. అంతర్యుద్ధం తరువాత ఉత్తర, దక్షిణ ఎమెన్‌లు 1990లో విలీనమైన తరువాత తిరిగి అంతర్యుద్ధం ప్రారంభమైంది.ప్రస్తుతం వివిధ దేశాల మద్దతు ఉన్న పక్షాల ఆధీనంలో ఎమెన్‌ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో మెజారిటీ ప్రాంతం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఎడారి, తరువాత ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మద్దతున్న సాయుధులు, పరిమిత ప్రాంతంలో ఆల్‌ఖైదా, మరో రెండు సాయుధ శక్తుల ఆధీనంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రం ఏడెన్‌ సంధి దగ్గర అరేబియా సముద్రం కలుస్తాయి. నౌకా రవాణాకు కీలకమైన ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఎమెన్‌ రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలు హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఇటీవలి వరకు వీరిని వ్యతిరేకించే ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతు ఇచ్చింది. గతంలో దక్షిణ ఎమెన్‌ ప్రాంతానికి సౌదీ రక్షితదారుగా ఉంది. తరువాత చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌సౌదీ అరేబియా ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత సౌదీ అరేబియా జోక్యం నిలిచిపోయింది. పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా ఉన్న హౌతీల ఆధీనంలోని ఎమెన్‌ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను అడ్డుకుంటున్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు వచ్చే, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను అడ్డుకోవటం ద్వారా వత్తిడి తెస్తున్నది. ఈ కారణంగానే సూయజ్‌ కాలువ లేకముందు మన దేశానికి వచ్చే నౌకలు ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చినట్లుగా ఇప్పుడు కూడా అనేక దేశాల నౌకలు చుట్టుతిరిగి వస్తున్నాయి.ఈ కారణంగానే మధ్య ధరా, ఎర్ర సముద్రాల్లో తిష్టవేసిన అమెరికా మిలిటరీ ఎమెన్‌పై దాడులకు పాల్పడుతున్నది.తమపై జరుపుతున్న క్షిపణి దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా దాడులకు దిగింది.తొలిసారిగా రాజధాని సనా నగరం మీద బాంబులు కురిపించింది.

ఇరాన్‌పై ఎంత బలమైన దాడులు జరిపామో అదే విధంగా ఎమెన్‌పై కూడా చేసి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం నాడు ప్రకటించాడు.హౌతీలు ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్‌ పౌరులు వణికిపోయారు. ఎందుకంటే చీమ చిటుక్కుమన్నా తమపైకి వచ్చే ప్రతి క్షిపణిని మధ్యలోనే కూల్చివేసే సామర్ధ్యం తమకుందని చెబుతున్న వారు శనివారం రాత్రి రాజధాని టెల్‌అవీవ్‌పై జరిగిన దాడిని పసిగట్టలేకపోయినట్లు స్వయంగా అంగీకరించారు. కేవలం పదహారు మంది గాయపడ్డారని మాత్రమే చెబుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువే నష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు కూడా క్షిపణి దాడిని సూచిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. జరిగిన నష్టాన్ని యంత్రాంగం మూసిపెడుతున్నది. టెహరాన్‌ మద్దతుదారులపై ఎందుకు ఏకంగా ఇరాన్‌పైనే దాడులకు దిగాలని ఇజ్రాయెల్‌ యుద్ధ దురహంకారులు రంకెలు వేస్తున్నారు. యుద్ధ కాబినెట్‌ సమావేశం తరువాత నెతన్యాహు మాట్లాడుతూ హౌతీలపై దాడుల్లో తాము ఒంటరి కాదని, గత ఏడాదిగా అమెరికా, బ్రిటన్‌ దళాలు కూడా ఉన్నాయని చెప్పాడు. కాస్త సమయం తీసుకున్నప్పటికీ గాజాలోని హమస్‌, లెబనాన్‌లోని హిజబుల్లా మాదిరి దెబ్బతీస్తామని అన్నాడు. 2023 అక్టోబరు ఏడున గాజాలో మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 క్షిపణులు, 170డ్రోన్లు ప్రయోగించినట్లు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలోకి రాకుండా వంద వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్‌ మీద కొనసాగిస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాల తయారీకి పూనుకున్నదని మరోసారి అమెరికా ఆరోపించింది. తాము శాంతియుత ప్రయోజనాల కోసం అణుకార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, అయితే గతంలో ట్రంప్‌ అధికారంలో ఉన్నపుడు అంతకు ముందు కుదిరిన ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగి, తమ మీద విధించిన ఆంక్షల కారణంగా యురేనియం శుద్దికి పూనుకున్నట్లు ఇరాన్‌ అంటోంది.

ఆదివారం నాడు అమెరికాకు చెందిన ఎఫ్‌18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఎమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ దాడులను అడ్డుకున్నామని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా శారీ ప్రకటించాడు. అమెరికా విమానవాహక నౌక హారీ ఎస్‌ ట్రూమన్‌, ఇతర అనేక అనుబంధ నౌకలు శనివారం నుంచి దాడులు ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. విమానాన్ని కూల్చివేసేందుకు తాము ఎనిమిది క్షిపణులు, 17 డ్రోన్లను వినియోగించినట్లు వెల్లడిరచాడు. అయితే తమ విమానాన్ని తామే కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. అయితే అది ఎలా జరిగిందన్నది మాత్రం వెల్లడిరచలేదు.శనివారం నాడు ఎమెన్‌లోని క్షిపణి కేంద్రాల మీద దాడులు చేసినట్లు చెప్పుకుంది.తమ, ప్రాంతీయ భాగస్వాముల, అంతర్జాతీయ నౌకల ప్రయోజనాల రక్షణకే దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీలు దాడులను ముమ్మరం చేయటంతో అమెరికా తీవ్ర వత్తిడికి లోనైన కారణంగానే తమ స్వంత విమానాన్ని కూడా గుర్తించలేని ఆత్రత కారణంగా స్వయంగా కూల్చివేసినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ పరిస్థితి కారణంగా రానున్న రోజుల్లో దాని దాడుల సామర్ధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధుల వైపు నుంచి మానవరహిత ఆయుధాల ప్రయోగ సమయంలో ఇలాంటి తప్పిదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.అమెరికా సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని యుఎస్‌ఎస్‌ హారీ ఎస్‌ ట్రూమన్‌ నౌక నుంచి ప్రయోగించగా ఆ నౌకకు కాపలాగా అనుసరించే గెటీఎస్‌బర్గ్‌ అనే మరో నౌక రాత్రి మూడు గంటల సమయంలో నియంత్రిత క్షిపణి ద్వారా కూల్చివేసింది. అయితే ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ అసాధారణ ఉదంతం హౌతీల నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనే క్రమంలో జరిగింది.తమవైపు వస్తున్నది శత్రువులదా లేక మిత్రులదా అన్నది గుర్తించటంలో అమెరికా మిలిటరీ విఫలమైంది.హౌతీల దాడులు తగ్గకపోవటంతో గత గురువారం నాడు ఎమెన్‌ రిజర్వుబాంకు, మరికొన్ని కంపెనీల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరికొత్త ఆంక్షలు ప్రకటించాడు.


సిరియాలో తాము మద్దతు ఇస్తున్న అసద్‌ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ప్రతిఘటన కొనసాగించాల్సిందేనని ఇరాన్‌ భావిస్తున్నది. ప్రతిఘటించే దేశాల కూటమి కుప్పకూలిపోయినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటని అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ చెప్పాడు. లెబనాన్‌లో హిజబుల్లా సాయుధ సంస్థ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సజీవంగానే ఉందన్నాడు.ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే సిరియాలో ప్రభుత్వం పతనమై నూతన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటి వైఖరి, ఆచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ లోగా కొంత మంది పశ్చిమదేశాల వారు చైనాఇరాన్‌ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.ఇరాన్‌ బలహీన పడినందున ఇప్పటి మాదిరి చైనా దానికి మద్దతుగా ఉండకపోవచ్చని, పశ్చిమదేశాల మార్కెట్‌ను వదులు కొనేందుకు సిద్ధపడదంటూ కొందరు, ఇరాన్‌తో సంబంధాలను చూపి పశ్చిమదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చన్న విపరీత వ్యాఖ్యానాలు కూడా చేశారు. రెండు దేశాలూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదుల దాడులు, ఆర్థిక ఆంక్షలకు గురవుతున్నాయి, వాణిజ్య పోరును ఎదుర్కొంటున్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత అన్న అంశమే వారి మధ్య బంధం పెరగటానికి కారణం. పాతిక సంవత్సరాల సహకార ఒప్పందం రెండు దేశాల మధ్య 2021లో కుదిరింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌సౌదీ మధ్య సయోధ్య కుదిర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. తాత్కాలికంగా మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ బలహీనపడినంత మాత్రాన దాన్ని వదలివేసే అవకాశాలు లేవని చైనా తీరుతెన్నులను చూసినపుడు అర్ధం అవుతుంది. మరింత పటిష్టపరుచుకోవటం, ఆ ప్రాంతంలో అమెరికా, దాని తొత్తు దేశాలను ఎదుర్కోవటం ఎలా అన్న అంశం రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనిలో భాగంగానే బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థలోకి ఇరాన్‌కు షీ జింపింగ్‌ ఆహ్వానం పలికాడు.


సిరియాలో అసద్‌ ప్రభుత్వం కూలిపోయినంత మాత్రాన అక్కడ అధికారానికి వచ్చిన శక్తులు అమెరికా ఒళ్లో వాలిపోతాయని, ఇజ్రాయెల్‌కు దాసోహమంటాయని చెప్పలేము. తొలుత అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి. ఆ తరువాతే దాని బాట ఎటు అన్నది స్పష్టం అవుతుంది. అమెరికా అనుకూల దేశంగా ఉన్న సౌదీ అరేబియా నాటకీయ పరిణామాల మధ్య దాన్ని ధిక్కరించి రష్యాకు దగ్గరైంది.చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తాము అమెరికాతో అంటకాగేది లేదన్న సందేశమిచ్చింది. చైనా చొరవతో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకుంది. ఇది మధ్య ప్రాచ్యంలో చైనా చొరవలో ఒక మైలు రాయి, అమెరికాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎదురుదెబ్బ. అమెరికా ఆర్థిక ఆంక్షలు, రాజకీయ వంటరితనం నుంచి ఇరాన్‌ కొంత మేర బయటపడిరది. చైనాను దెబ్బతీసేందుకు అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో ప్రతి ప్రాంతంలోనూ వాటిని ప్రతిఘటించే శక్తిగా చైనా ముందుకు వస్తోందని ఇటీవలి అనేక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చగొట్టే చర్యలతో చైనాఇరాన్‌రష్యా మరింత దగ్గరవుతాయి. ట్రంప్‌ తన యంత్రాంగంలోకి ఎంచుకున్న వ్యక్తుల తీరుతెన్నులను చూసినపుడు అసలే కోతి ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా వారి చర్యలుంటాయని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

07 Wednesday Aug 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh Elections 2024, China, cia, Coup In Bangladesh, Joe Biden, Sheikh Hasina


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

04 Thursday Jul 2024

Posted by raomk in Africa, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK, USA

≈ Leave a comment

Tags

IMF, imperialism, Kenya -IMF, Kenya Protests, Kenya's President William Ruto


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-రష్యాలను మరింత దగ్గర చేసిన జి7 కూటమి !

19 Wednesday Jun 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, Europe, Germany, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, China, G7 Apulia, Joe Biden, Narendra Modi Failures, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకుగాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ,యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌,ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.


అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందీ చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటాదేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.


ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అయినా లేస్తే మనుషలం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు.చైనాను దెబ్బతీసేందుకు మిత్రదేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ” ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక ” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేందుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జింపింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జింపింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గత ఏడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రం ఏమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?


అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున పశ్చిమదేశాలు చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా ? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా ? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.


చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ” ఓల్ట్‌ టైఫూన్‌ ” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌,నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా ? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు ) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరోపా పార్లమెంటు ఎన్నికలు : పెరిగిన నాజీ, ఫాసిస్టుల ముప్పు !

12 Wednesday Jun 2024

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, WAR

≈ Leave a comment

Tags

emmanuel macron, EU, EU elections 2024, European People’s Party (EPP), Far Right, Giorgia Meloni, Olaf Scholz, Ursula von der Leyen


ఎం కోటేశ్వరరావు


ఐరోపా యూనియన్‌లోని 27దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీవరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు, నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురుదెబ్బలు తగిలాయి.ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది ఐరోపా సమాఖ్యకు ఒక స్థంభం వంటి ఫ్రాన్సు మీద పిడుగులా పడి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్న పార్లమెంటురద్దుకు దారితీసింది.పాలకపక్షం ఘోరంగా దెబ్బతినటంలో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వెంటనే ప్రకటించాడు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నా, ప్రధాని, మంత్రులు వేరే పార్టీకి చెందినవారైనా, అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉంటాయి. 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో మక్రాన్‌ పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు . జర్మనీ ప్రతిపక్షం మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేసింది. అధికార త్రిపక్ష సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలినా ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించింది.


పార్లమెంటులోని మొత్తం 720స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతి దేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో 751 స్థానాలుండగా 27 సీట్లున్న బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినందున వాటిని ఇతర దేశాలకు కేటాయించినప్పటికీ తరువాత వాటికి ఉపఎన్నికలు జరగలేదు. తరువాత 46 స్థానాలను రద్దు చేశారు. తాజా ఎన్నికలకు ముందు ఆమోదించిన విధానం ప్రకారం 705 నుంచి 720కి స్థానాలను పెంచారు. జర్మనీలో 96,ఫ్రాన్స్‌81, ఇటలీ 76 స్థానాలతో అగ్రభాగాన ఉన్నాయి. మాల్టా, సైప్రస్‌, లక్జెంబర్గ్‌ దేశాలలో తక్కువగా ఆరేసి స్థానాల చొప్పున ఉన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఎంచుకున్న పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటులో ఒక పక్షాన్ని గుర్తించాలంటే ఏడు దేశాలలో పోటీచేసి కనీసం 23 స్థానాలను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా లేని వాటిని గుర్తింపులేని పార్టీలుగా పరిగణిస్తారు.ఈ ఎన్నికల్లో కేవలం 51శాతం మాత్రమే ఓటర్లు పాల్గొన్నట్లు తొలి వార్తలు తెలిపాయి. గరిష్టంగా బెల్జియంలో 89.2, లక్జెంబర్గ్‌లో 82.3శాతం పోలు కాగా క్రోషియాలో అత్యల్పంగా కేవలం 21.3శాతమే ఓటర్లు పాల్గొని ఒక రికార్డు సృష్టించారు. కొన్ని దేశాలలో ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు.


ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఇపిపి) 191సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మేరీనె లీపెన్‌ నాయకత్వంలోని పచ్చిమితవాద ఐడెంటిటీ(ఉనికి)-డెమోక్రసీ(ప్రజాస్వామ్య) పార్టీ(ఐడి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్సర్వేటివ్‌, రిఫార్మిస్టు(ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమోక్రాట్స్‌ కూటమి(ఎస్‌డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి.గ్రీన్స్‌ పార్టీ 53,రెన్యూ(పునరుద్దరణ) యూరోప్‌(ఆర్‌ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చిమితవాద పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు.హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44శాతం తెచ్చుకుంది.ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30శాతం తెచ్చుకుంది.


ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 30,జూలై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మేరీనే లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మరియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చిమితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మరియో వ్యాఖ్యానించింది. వ్యతిరేకులు, పోటీదార్లకు తేడా ఉంది అన్నారు.అయితే ఇప్పటికే మార్చెల్‌తో మేరీ లీపెన్‌ ప్రతినిధి జోర్డాన్‌ బార్‌డెలా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ(పిఎస్‌)కు 14శాతం ఓట్లు వచ్చాయి.కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినయసాన్స్‌ పార్టీ(ఆర్‌ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.


జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 13.9శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చిమితవాద పార్టీ ఏఎఫ్‌డి 16శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30శాతం తెచ్చుకొని ప్రధమ స్థానంలో ఉంది.తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌,ఫ్రీ డెమోక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9 -11.9-5.2శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినందున మామూలుగా తమపని తాము చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నాడు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తామన్నాడు.నూటముప్ఫై సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువగా ఎస్‌పిడి ఎన్నడూ ఓట్లు తెచ్చుకోలేదు. ప్రత్యామ్నాయ జర్మనీ (ఎఎఫ్‌డి) ఈ ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లతో సుస్థిరం కావటాన్ని అడ్డుకుంటామని, వెనక్కు కొడతామని అన్నాడు. జర్మనీలో, ఐరోపా అంతటా సంప్రదాయ ప్రజాస్వామిక పార్టీలు ఇప్పటికీ మెజారిటీగా ఉన్నాయని అన్నాడు. ప్రతిపక్షం కోరినట్లుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, గడువు ప్రకారమే జరుగుతాయని షుల్జ్‌ ప్రతినిధి స్టెఫెన్‌ ó చెప్పాడు. జాతీయవాదం,విద్వేష ప్రమాదాలను జనం మరచిపోరాదని జర్మనీ అధ్యక్షుడు (మన రాష్ట్రపతి మాదిరి) ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిమెయిర్‌ హెచ్చరించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీల మారణకాండకు బలైనవారి గౌరవార్ధం ప్రాన్సులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు ఎదగటాన్ని ప్రస్తావించి జర్మనీలో నేషనల్‌ సోషలిస్టులు(హిట్లర్‌ నాజీ పార్టీ) సాగించిన అత్యాచారాలను గుర్తు చేశాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు,ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయవెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు.ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడోవంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది.ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి.ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చిమితవాదులకు స్వల్పతేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వరంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.పచ్చిమితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ,వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టుపట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

01 Saturday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

BJP, GANDHI INTERNATIONAL FAME, Mahatma Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జూలై 4న బ్రిటన్‌ ఎన్నికలు : టోరీలకు శృంగభంగం, రిషి సునాక్‌ గెలుపూ కష్టమే !

24 Friday May 2024

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

2024 United Kingdom general election, Rishi Sunak, Tory party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జనవరి వరకు పార్లమెంటు గడువు ఉన్నప్పటికీ జూలై నాలుగున ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయించాడు. లేబర్‌ పార్టీతో పోల్చితే టోరీల పలుకుబడి 21పాయింట్లు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతుండగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలకు వెళతారన్న పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటీవలి కాలంలో రిషి సునాక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఓటమి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఓడినా గౌరవ ప్రదంగా కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది.మేనెల పదమూడవ తేదీ సర్వప్రకారం లేబర్‌ పార్టీ 44, టోరీలు 23పాయింట్లతో ఉండగా ప్రధాని రిషి సునాక్‌ పనితీరు బాగోలేదన్నవారు గత ఏడాది జూన్‌తో పోల్చితే 57 నుంచి 65శాతానికి పెరిగారు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా ?


సునాక్‌ దంపతుల సంపద 12 కోట్ల నుంచి 65.1కోట్ల పౌండ్లకు పెరిగిందని తాజాగా సండే టైమ్స్‌ ధనికుల జాబితాలో ప్రకటించింది. కానీ ప్రధానిగా జనాభిమానం మాత్రం దిగజారుతోంది.పద్నాలుగేండ్ల టోరీల పాలన పొదుపు చర్యలతో జనం విసిగిపోయారు.అన్ని విధాలుగా కార్మికవర్గం దెబ్బతిన్నది. లండన్‌ కింగ్స్‌ కాలేజీ జరిపిన అధ్యయనం ప్రకారం 2010-20 సంవత్సరాల మధ్య ప్రభుత్వ పొదుపు విధానాల వలన 148వేల మంది మరణించారు. ఇండ్ల అద్దెలపై అడ్డుఅదుపూ లేదు, బలహీనవర్గాల ఇండ్ల పధకాన్ని రద్దు చేశారు.ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలో బ్రిటన్‌ ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే.జనాభా 6.7 కోట్ల మందిలో ఒక ప్రమాణాన్ని తీసుకుంటే కోటీ పది లక్షలు, ఇండ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1.44 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అంచనా.పిల్లల్లో 42.2లక్షల మంది దారిద్య్రంలో ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 22.8లక్షలు.2021-22లో దాదాపు 2.8లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎవరికైనా ఇల్లు లేకపోతే కనీసం ఆరునెలలు ఉండేందుకు ప్రభుత్వం ఇంటి వసతిని చూపాల్సి ఉంటుంది.ఎక్కడో ఒక దగ్గర నిద్రపోతూ పని చేసే వారు గణనీయంగా ఉన్నారు. అలా నిద్రపోతూ దొరికిన వారికి వెయ్యి పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రభుత్వం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీవన వ్యయం విపరీతంగా పెరిగింది.మనదేశంలో తగినంత ఉపాధి చూపటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా పేదలు ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.ఈ కారణంగానే 80 కోట్ల మందికి నెలకు ఐదు కిలోల చొప్పున ఐదేండ్ల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో తినటానికి తిండి దొరకనివారికి ఆహార కూపన్ల ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఆహార పొట్లాలను అందిస్తారు. వాటిని ఆహార బ్యాంకులని ముద్దుపేరుతో పిలుస్తారు. ట్రసెల్‌ అనే పేరుతో ఉన్న ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆహార బ్యాంకు నుంచి 2008-09లో కేవలం 25,899 మంది ఇలా ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటే 2022-23నాటికి ” మన హిందువు, భారత సంతతి ”గా అనేక మంది కీర్తించిన రిషి సునాక్‌ ఏలుబడిలో వారి సంఖ్య 29లక్షల 86వేల 203కు పెరిగింది.


పొట్టచేతబట్టుకొని లేదా అణచివేతలను తప్పించుకొనేందుకు శరణార్ధులుగా వచ్చే వారిని సహించలేని స్థితిలో బ్రిటన్‌ పెట్టుబడిదారీ వర్గం ఉన్నదంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఎదుర్కొనేందుకు అనుమతి లేకుండా వచ్చే వారిని బలవంతంగా ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి తరలించి అక్కడ శిబిరాల్లో ఉంచి వారికి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు ర్వాండా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నది బ్రిటన్‌. అందుకు గాను ప్రతి మనిషికి ఇంత అని చెల్లిస్తుంది. ఉదాహరణకు మూడు వందలు అంతకు మించి జనాలను పంపితే పన్నెండు కోట్ల పౌండ్లు ప్రభుత్వానికి, ఇరవైవేల చొప్పున శరణార్ధులకు చెల్లిస్తుంది. డబ్బుకక్కుర్తితో ర్వాండా సర్కార్‌కూడా శరణార్ధులను స్వీకరించేందుకు అంగీకరించింది. ముందు ర్వాండాకు తరలించి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేదీ లేనిదీ అక్కడ విచారిస్తారు.ఆశ్రయం కల్పించేందుకు నిర్ణయిస్తే బ్రిటన్‌కు తిరిగి అనుమతిస్తారు లేకపోతే ర్వాండా అంగీకరిస్తే అక్కడే ఉండేందుకు లేదా మూడో దేశం ఏదైనా అంగీకరిస్తే అక్కడకు పంపుతారు. ఇంగ్లీషు ఛానల్‌ దాటి పడవల ద్వారా అనుమతి లేకుండా ప్రవేశించిన వారు స్వచ్చందంగా వెనక్కు వెళ్లిపోయేందుకు అంగీకరిస్తే వారికి మూడువేల పౌండ్లు ఇస్తారు, లేకుంటే విమానాల ద్వారా ర్వాండాకు బలవంతంగా తరలిస్తారు. సుప్రీం కోర్టు ఈ ఒప్పందం చట్టవిరుద్దమని కొట్టివేసిన తరువాత తీర్పును వమ్ము చేస్తూ మరొక చట్టాన్ని 2023నవంబరులో పార్లమెంటు ఆమోదించింది.దీని మీద కూడా పిటీషన్లు దాఖలైతే విచారణకు 25 కోర్టు గదులు, 150 మంది న్యాయమూర్తులను సిద్దంగా ఉంచారు. తన కుటుంబం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంగతి గుర్తుంటే వలస వచ్చిన వారిని బలవంతంగా ర్వాండా పంపే కార్యక్రమానికి రిషి సునాక్‌ పూనుకొని ఉండేవాడు కాదు. ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ మాదిరి ఒక కార్పొరేట్‌గా తన వర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు.


టోరీల పద్నాలుగేండ్ల చరిత్రను చూసినపుడు ప్రతి ప్రధానీ విఫలం చెందినట్లు రుజువైంది.ముందస్తు ఎన్నికలతో రిషి సునాక్‌ కూడా చారిత్రక వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ” ఇది ఏం చేయాలో తోచని వ్యక్తి ఆడుతున్న ఆట,దారులు కూడా మూసుకుపోయాయి, తన అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశ సైతం కనిపించని స్థితి ” అని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. మార్చినెలలో 3.2శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 2.3శాతానికి తగ్గటం తన ఘనతే అని చెప్పుకుంటూ ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.2008 సంక్షోభం నుంచి బ్రిటీష్‌ పెట్టుబడిదారీ విధానం ఇంకా కోలుకోలేదని, అంతకు ముందుతో పోలిస్తే ఏడాదికి ప్రతి కార్మికుడు సగటున పద్నాలువేల పౌండ్లు నష్టపోతున్నట్లు ఒక అంచనా వెలువడింది.వేతన పెరుగుదల తీరుతెన్నులు చూస్తే నెపోలియన్‌ యుద్ధాల (1803-15) తరువాత ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకు కోత, జనజీవీతాలు గిడసబారిపోవటంతో ఆలస్యయ్యేకొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ఒక సర్వేలో ఈ ఏడాది తమ జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని 58శాతం మంది చెప్పారు, అనేక మంది రుణ ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితిలో సునాక్‌ ప్రకటనతో అధికారం ముందుగానే దక్కనుందనే సంతోషంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పండుగ చేసుకుంటున్నది.జూలై నాలుగు స్వాతంత్య్రదినమని కొందరు వర్ణించారు. పిచ్చిపని అని టోరీ ఎంపీలు తమలో తాము గొణుక్కుంటున్నారు. కార్మికుల మీద దాడులు జరిపిన టోరీ పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుగానే వచ్చిన అవకాశమని కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను స్వాగతించాయి. అయితే కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలో ఏర్పడే లేబర్‌ పార్టీ ప్రభుత్వం పట్ల అప్రమత్తగా ఉండాలని కూడా కొన్ని సంఘాలు హెచ్చరించాయి. కార్మికవర్గ జీవితాలను ఫణంగా పెట్టి తాము బయటపడాలని కార్పొరేట్‌శక్తులు చూస్తున్నాయని, స్టార్మర్‌ యజమానులకు, ఇజ్రాయెల్‌కు అనుకూలం, కార్మికులు, వలసలకు వ్యతిరేకి అని పేర్కొన్నాయి. ఇటీవల లేబర్‌ పార్టీ ప్రకటనలు చూస్తే యజమానులకు అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ ప్రతిఘటించాల్సిందేనని సోషలిస్టు వర్కర్‌ వంటి సంస్థలు స్పష్టం చేశాయి.ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందేనని పేర్కొన్నాయి.బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభ(కామన్స్‌)లోని 650 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ 43.6శాతం ఓట్లతో 365, లేబర్‌ పార్టీ 32.1శాతం ఓట్లతో 202 సీట్లు తెచ్చుకుంది.ఈసారి ఎన్నికల్లో టోరీ పార్టీకి 98, లేబర్‌ పార్టీకి 468 వస్తాయని సండే టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అనేక మంత్రులు కూడా ఓడిపోనున్నట్లు జోశ్యం చెప్పింది. ప్రధాని రిషి సునాక్‌ కూడా ప్రత్యర్ధికంటే కేవలం 2.5శాతం ఆధిక్యంతోనే ఉన్నట్లు, ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పింది. వేల్స్‌, స్కాట్లాండ్‌ ప్రాంతాలలో, లండన్‌ నగరంలో ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నది.


రిషి సునాక్‌ మన వాడు ! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు ! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు !
భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ ! బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త అంటూ కొండంత రాగాలు.సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.


అనేక దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు అనేక మంది ఉన్నత పదవులను అధిష్టించారు.ఆ జాబితాను చూసినపుడు రిషి సునాక్కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు ? ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు ? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు ? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు ? కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు.అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్ను ప్రధానిగా రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు.బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 190 సంవత్సరాలు, తొలుత దాని పేరు టోరీ.నూటపన్నెండు సంవత్సరాల క్రితం కన్సర్వేటివ్‌ అని మార్చుకున్నది. అయినప్పటికీ ఈ పార్టీ వారిని ఇప్పటికీ టోరీలనే ఎక్కువగా పిలుస్తారు. ఇంత సుదీర్ఘచరిత్ర కలిగిన పార్టీ 1906లో కనిష్టంగా 131 సీట్లు తెచ్చుకుంది. ఈ సారి రిషి సునాక్‌ నాయకత్వంలో 98కి మించి రావనే సర్వేలు నిజమైతే పార్టీ చరిత్రలో మరో అధ్యాయం నమోదౌతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

15 Wednesday May 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Andi War protests, Donald trump, Israel genocide, Joe Biden, Pro-Palestinian protests, US Student Protests


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d