• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

కరోనా కాఠిన్యం -కర్షకులకు కష్టకాలం, అనిశ్చితి !

06 Monday Jul 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agriculture, Corona Virus impact on farmers, Fuel Price in India, Pandemic Corona Virus, WTO


ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విజృంభణ తగ్గలేదు.రానున్న రోజుల్లో ఏ రంగంపై ఎలాంటి దుష్ట ప్రభావం చూపనుందో అంతుచిక్కటం లేదు. రానున్నది రాకమానదు-కానున్నది కాకమానదు-కాడి పట్టుకోక తప్పదు అన్నట్లుగా రైతాంగ ఏరువాక ప్రారంభమై దేశంలోని అనేక ప్రాంతాలలో ఖరీఫ్‌ సాగు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు. ఇప్పటి వరకు వర్షాలు సకాలంలో, తగిన మోతాదులో పడిన కారణంగా కొన్ని చోట్ల విత్తనాల కొరత ఏర్పడిందని జార్ఖండ్‌, బీహార్‌ వంటి చోట్ల 15 నుంచి 25శాతం మేరకు విత్తన ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఎక్కడైనా పెద్ద రైతులు ముందే కొనుగోలు చేస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది, భారమూ ఉండదు, అప్పటి కప్పుడు కొనుగోలు చేసే చిన్న రైతుల మీద ఇది అదనపు ఖర్చు. కరోనా కారణంగా వలస కార్మికులు తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన కారణంగా పంజాబ్‌, హర్యానా వంటి ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడితే, మరికొన్ని చోట్ల మిగులుగా మారారు. దీనివలన కొన్ని చోట్ల వేతనాలు పెరిగితే, మరికొన్ని చోట్ల పడిపోయే పరిస్ధితి. ప్రపంచీకరణ యుగం కనుక రైతాంగాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్న కొన్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను చూద్దాం.
నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే సంగతి నోరు లేని గోమాత కెరుక. చమురు పన్ను, ధరల పెంపుదల ద్వారా వ్యవసాయ పెట్టుబడుల భారాన్ని మాత్రం గణనీయంగా పెంచుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు డీజిల్‌ వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. గతంలో డీజిల్‌ మీద ఉన్న సబ్సిడీలను తొలగించారు, కొంతకాలం డీజిల్‌ మీద పన్ను తక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా దాదాపు సమం చేసి పెట్రోలు కంటే డీజిల్‌ రేటు ఎక్కువ ఉండేట్లు చేశారు. ఎందుకంటే ఎక్కువగా అమ్ముడు పోతున్నది డీజిలు కనుక కంపెనీలకు బాగా లాభాలు రావాలంటే డీజిల్‌ ధరలు పెంచాలి మరి. దీని ధర పెరిగితే వ్యవసాయం, పంటల రవాణా, పురుగుమందులు, ఎరువులు ఇలా అన్ని రకాల వ్యవసాయ పెట్టుబడుల ధరలూ గణనీయంగా పెరుగుతాయి. ఉదాహరణకు పంట వేసేందుకు ఎకరం పొలాన్ని సిద్దం చేయాలంటే ఇంతకు ముందు అవుతున్న రెండున్నర వేల రూపాయల ఖర్చు కాస్తా మూడున్నరవేలు అవుతుందని ఒక అంచనా. చేపలు పట్టేందుకు డీజిల్‌ సబ్సిడీ ఇస్తున్నట్లుగానే రైతాంగానికి కూడా సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవటం లేదు. దేశంలోని డీజిల్‌ వినియోగంలో 2013లోనే ట్రాక్టర్లు, నాటు, కోత యంత్రాల వంటి వాటికి 10.8శాతం అయితే పంపుసెట్లకు 3.3శాతంగా అంచనా మొత్తంగా చూసినపుడు 14.1శాతం ఉంది. ఇప్పుడు యాంత్రీకరణ ఇంకా పెరిగినందున వినియోగ వాటా గణనీయంగా పెరుగుతుంది. రవాణా రంగం, అది ప్రయివేటు అయినా, ప్రభుత్వరంగమైనా చమురు ధరలను వినియోగదారుల మీద వెంటనే మోపుతాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచి, అమలు జరిపితే తప్ప రైతాంగానికి అలాంటి అవకాశం లేదు.
లాక్‌డౌన్‌ సమయంలో మొత్తంగా మూతపడటంతో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. తమ ఉత్పత్తులను ముఖ్యంగా నిలవ ఉంచటానికి అవకాశం లేని కూరగాయలు, పండ్లు, పూల వంటి వాటిని రవాణా చేయటానికి, విక్రయించటానికి కూడా అవకాశం లేకపోయింది. ఈ నష్టాన్ని ఏ ప్రభుత్వమూ చెల్లించలేదు. కరోనా వైరస్‌ కారణంగా తలెత్తిన పరిస్ధితిని అధిగమించేందుకు ప్రకటించిన ఉద్దీపన పధకం 21లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌలిస సదుపాయాల నిధిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఆహార తయారీ సంస్ధలకు పెట్టుబడి అని ఒక ముక్తాయింపు. వ్యాపారుల ఉల్లి, బంగాళా దుంపలు, ధాన్య నిల్వలపై ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులుగా ఉన్న ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. దీని వలన వ్యాపారులంతా వాటిని ఎగబడి కొంటారు, రైతులకు ధరలు పెరుగుతాయి అని మనల్ని నమ్మమంటారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ సంస్ధల పట్టును మరింత పెంచేందుకు తోడ్పడే చర్య ఇది.
ప్రభుత్వం ఒక వైపు చైనాతో పోల్చుతూ ఆర్ధిక సర్వే, బడ్జెట్‌ పత్రాలలో పుంఖాను పుంఖాలుగా రాస్తుంది. కానీ అదే ఎవరైనా చైనాతో పోల్చితే చూడండి అని చైనా మద్దతుదారులు అంటూ సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ మరుగుజ్జులు దాడి చేస్తారు. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒక కారణం పెట్టుబడులు తగ్గిపోవటం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రాస్‌ కాపిటల్‌ ఫార్మేషన్‌లో 18శాతం వ్యవసాయ రంగానికి వస్తే ఇప్పుడు ఎనిమిదిశాతానికి పడిపోయింది. అది కూడా అనుత్పాదక సబ్సిడీల రూపంలో ఎక్కువ భాగం ఉంటున్నందున పెద్ద రైతులకే ఎక్కువ లబ్ది కలుగుతున్నదని ఆ రంగ నిపుణులు చెబుతున్నమాట. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే 2019-20లో చైనాను ఉదహరిస్తూ కార్మికులు ఎక్కువగా పని చేసే వస్తు ఎగుమతుల కారణంగా కేవలం ప్రాధమిక విద్య మాత్రమే ఉన్న వారికి 2001-06 మధ్య 70లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని, మన దేశంలో ఎగుమతుల కారణంగా 1999-2011 మధ్య కేవలం పది లక్షల లోపే అసంఘటిత రంగ ఉద్యోగాలు పెరిగాయని, మనం కూడా చైనా మాదిరి చర్యలు తీసుకోవాలని చెప్పారు. కానీ గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పని తీరులో అలాంటి చిత్తశుద్ది ఎక్కడా కనపడదు. మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఎన్ని కొత్త ఉద్యోగాలు ఆరేండ్లు గడిచినా చెప్పటం లేదు. మన దేశంలో ఒక కమతం సగటు విస్తీర్ణం 1.4హెక్టార్లు కాగా చైనాలో 0.6 మాత్రమే. అయినా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. వ్యవసాయరంగంలో కేంద్ర పెట్టుబడులే కాదు, దిగుబడులు, నాణ్యత పెంచేందుకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, వ్యవసాయ విస్తరణను గాలికి వదలివేశారు. అన్ని పంటల ఉత్పాదకత, దిగుబడులు చైనాలో గణనీయంగా పెరిగేందుకు తీసుకున్న చర్యల కారణంగా ప్రపంచ మార్కెట్లో వచ్చే ఎగుడుదిగుడులు అక్కడి రైతాంగాన్ని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. రైతాంగానికి ప్రభుత్వం అందచేసే రాయితీలు కూడా మన కంటే ఎంతో ఎక్కువ.
2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఎన్‌డిఏ ప్రభుత్వం చెప్పింది. కరోనా వైరస్‌ మహమ్మారి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర భారత పధకాన్ని అమలు జరపనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలంటే 2022 నాటికి 30 బిలియన్‌ డాలర్లుగా వున్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను 60బిలియన్‌ డాలర్లకు పెంచాలని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం మన దేశం వాణిజ్యంలో చైనాతో బాగాలోటులో ఉంది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మిగుల్లో ఉంది. వాటి దిగుమతులను ఇంకా పెంచుకోవాలని వత్తిడి చేస్తోంది, కొంత మేరకు చేసుకుంటామని చైనా కూడా చెప్పింది. 2018-19లో మన దేశం చైనాకు 190 కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు చేస్తే మన దేశం 28.2 కోట్ల మేరకే చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ముడిపత్తి, రొయ్యల వంటి ఎగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 117 శాతం ఎక్కువ. అయితే తాజాగా లడఖ్‌ సరిహద్దు వివాదం కారణంగా మన దేశం చైనా వస్తువుల దిగుమతులపై నిషేధాలను విధిస్తామని ప్రకటించింది. అదే జరిగితే మొక్కజొన్న, చింతపండు, కాఫీ, పొగాకు, జీడిపప్పు, నూకల బియ్యం వంటి మన వ్యవసాయ దిగుమతులను చైనా కూడా ఏదో ఒక పేరుతో నిలిపివేయటం లేదా నామమాత్రం చేయటం ఖాయం. యుపిఏ ప్రభుత్వ చివరి ఏడాది మన దేశం గరిష్టంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఆరు సంవత్సరాలుగా మధ్యలో కొంత మేరకు తగ్గినప్పటికీ మొత్తంగా చూస్తే అంతకు తగ్గలేదు, అయితే దిగుమతులు గణనీయంగా తగ్గిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఇప్పుడు మిగుల్లోనే ఉన్నాము. ఆర్ధిక సర్వే ప్రకారం 2018-19లో మన వ్యవసాయ ఎగుమతులు 2.7లక్షల కోట్ల రూపాయల మేర ఉంటే దిగుమతులు 1.37లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అయితే ధనిక దేశాలు సబ్సిడీలు ఇచ్చినా, చైనా వంటివి మన దిగుమతులను నిలిపివేసినా ఈ మిగులు హరించిపోతుంది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌ దేశాలు తమ రైతాంగానికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నాయి. కానీ ఆ దేశాలు మాత్రం మన వంటి దేశాలు ఇచ్చే సబ్సిడీల మీద ధ్వజమెత్తుతాయి. ఉదాహరణకు అంబర్‌ బాక్స్‌ వర్గీకరణ కిందకు వచ్చే, ఇతరంగా మొత్తం సబ్సిడీల గురించి మన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డబ్ల్యుటిఓ స్టడీస్‌ అనే సంస్ధ ఒక పత్రాన్ని ప్రచురించింది. దానిలో దిగువ వివరాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు సగటున ఆ ఏడాదిలో సబ్సిడీ మొత్తాన్ని డాలర్లుగా పరిగణించాలి. ఉపాధి పొందుతున్నవారిని మిలియన్లలో సూచించారు.
దేశం == సంవత్సరం ==ఉపాధి పొం సంఖ్య == అంబర్‌బాక్సు == స్ధానిక మద్దతు
ఆస్ట్రేలియా == 2017-18 ==== 0.3 ==== 222 ==== 5357
కెనడా == == 2016 ==== 0.3 ==== 7414 ==== 13010
ఇయు ==== 2016 ==== 9.8 ==== 1068 ==== 8589
జపాన్‌ ==== 2016 ==== 2.3 ==== 3492 ==== 11437
నార్వే ==== 2018 ==== 0.1 ==== 22509 ==== 53697
రష్యా ==== 2017 ==== 4.2 ==== 855 ==== 1378
స్విడ్జర్లాండ్‌==== 2018 ==== 0.1 ==== 9716 ==== 57820
అమెరికా ==== 2016 ==== 2.2 ==== 7253 ==== 61286
బంగ్లాదేశ్‌ ==== 2006 ==== 24.6 ==== 8 ==== 11
బ్రెజిల్‌ ==== 2018 ==== 8.6 ==== 134 ==== 332
చైనా ==== 2016 ==== 212.9 ==== 109 ==== 1065
ఈజిప్టు ==== 2016 ==== 6.7 ==== 0 ==== 9
భారత్‌ ==== 2018-19 ==== 200 ==== 49 ==== 282
ఇండోనేషియా ==== 2018 ==== 37.6 ==== 7 ==== 139
ఫిలిప్పీన్స్‌ ==== 2018 ==== 10.4 ==== 0 ==== 125
ద.కొరియా ==== 2015 ==== 1.4 ==== 547 ==== 5369
థాయలాండ్‌ ==== 2016 ==== 12 ==== 11 ==== 367
ప్రపంచంలోని భారత్‌, చైనాలతో సహా 54 ప్రధాన దేశాలు వ్యవసాయంలో వచ్చే మొత్తం ఆదాయంలో పన్నెండుశాతానికి సమానమైన 700 బిలియన్‌ డాలర్లను ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నట్లు ఓయిసిడి తాజా నివేదిక ఒకటి పేర్కొన్నది. వర్ధమాన దేశాల కంటే ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీల రెట్టింపు ఉంటున్నాయి. వర్దమాన దేశాలు 8.5శాతం ఇస్తుంటే ఓయిసిడి దేశాలు 17.6శాతం ఇస్తున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియా 40శాతం ఇస్తుండగా, చైనా, ఇండోనేషియా, ఐరోపా యూనియన్‌ ఇస్తున్న సబ్సిడీలు 54దేశాల సగటు 12 నుంచి 30శాతం వరకు ఇస్తున్నాయి.అమెరికాలో ఈ ఏడాది సబ్సిడీలు 33 బిలియన్‌ డాలర్ల వరకు ఉండవచ్చని, అవి వ్యవసాయ ఆదాయంలో నేరుగా రైతులకు అందచేసే మొత్తం 36శాతమని కొన్ని వార్తలు సూచించాయి. మన ప్రభుత్వం చైనా స్దాయిలో అయినా రైతాంగానికి రాయితీలు ఇస్తుందా ? నల్లధనం వెలికితీత, దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు, అచ్చేదిన్‌ వంటి అనేక వాగ్దానాలకు ఏ గతి పట్టించారో ఇప్పుడు రైతుల ఆదాయాల రెట్టింపు వాగ్దానానికి కూడా అదే గతి పట్టిస్తున్నారు.
ప్రపంచంలో ధనిక దేశాలు రైతాంగానికి ఎలా సబ్సిడీలు ఇస్తున్నాయో ముందు చూశాము. వాటిని నియంత్రించాల్సిన ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను పని చేయనివ్వకుండా అమెరికా ఆటంకాలు కల్పిస్తున్నది. దానిని నిరసగా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ రాబర్ట్‌ అజెవీడో మరో ఏడాది పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2013లో ఈ బాధ్యతలను చేపట్టిన బ్రెజిలియన్‌ దౌత్యవేత్త అమెరికా, మరికొన్ని దేశాల వైఖరితో విసిగి పోయారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వాణిజ్య సంస్దను ఖాతరు చేయకుండా సభ్యదేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకోవటం ఒకటైతే వివాదాల పరిష్కారానికి అమెరికా మోకాలడ్డుతుండటం సంస్ధ పని తీరు, విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. డబ్ల్యుటిఓ సమగ్రమైనది కాకపోవచ్చు గానీ అందరికీ అవసరమైనదే, ప్రపంచమంతటా ఆటవిక న్యాయం అమలుజరుగుతున్న తరుణంలో కనీసం వాణిజ్యానికి ఇది అవసరం అని అజెవీడో రాజీనామా ప్రకటన సమయంలో వ్యాఖ్యానించాడు.
2015లో దోహాదఫా చర్చలను అర్ధంతరంగా వదలి వేసిన తరువాత 164 సభ్యదేశాలు గల ఈ సంస్ధ ఒక పెద్ద అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా కుదర్చలేకపోయింది. అమెరికా-చైనా మధ్య 2018లో ప్రారంభమైన దెబ్బకు దెబ్బ వాణిజ్యపోరు మూడో ఏడాదిలో ప్రవేశించింది. దీనికి కరోనా మహమ్మారి సంక్షోభం తోడైంది. తమ పెత్తనం, తన సరకులను ఇతర దేశాల మీద రుద్దాలనే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్దను ముందుకు తెచ్చింది అమెరికా. అయితే అనుకున్నదొకటీ అయింది ఒకటీ కావటంతో చివరకు ఆ సంస్దనే పని చేయకుండా అడ్డుకోవటం ప్రారంభించింది. సంస్ధలో సభ్య దేశాలు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినపుడు ఫిర్యాదులను పరిష్కరించటం ఒక ప్రధాన విధి. అందుకుగాను ఏడుగురు సభ్యులతో ఒక ట్రిబ్యునల్‌ ఉంది. దానిలో న్యాయమూర్తుల నియామకం ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. వారి పదవీ కాలం ముగియగానే కొత్తవారిని నియమించాల్సి ఉండగా కుంటి సాకులతో అమెరికా అంగీకరించటం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధ వలన చైనాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది కనుక నిబంధనలను మార్చాలని అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు ఒక పల్లవి అందుకున్నాయి. చైనాను తమతో పాటు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలన్నది వాటి డిమాండ్‌. మన దేశం కూడా వరి, గోధుమల వంటి వాటికి కనీస మద్దతు ధరలను అనుచితంగా పెంచుతున్నదని, పత్తికి కనీస మద్దతు ధర పేరుతో రాయితీలు ఇస్తున్నదని అమెరికా, మరికొన్ని దేశాలు ఫిర్యాదు చేశాయి. అన్నింటికీ మించి వివాదాలు దీర్ఘకాలం కొనసాగటం ఒకటైతే అనేక కేసులలో తీర్పులు తమకు వ్యతిరేకంగా రావటాన్ని అవి సహించలేకపోతున్నాయి. తీర్పులన్నీ నిబంధనలు ఏవి ఉంటే వాటికి అనుగుణ్యంగానే వస్తాయి తప్ప అడ్డగోలుగా ఇవ్వలేరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చైనా వర్దమాన దేశ తరగతిలోకే వస్తుంది. అందువలన సబ్సిడీలు, ఇతర అంశాలలో దానికి వెసులు బాటు ఉంది. అది ధనిక దేశాల లాభాలకు గండికొడుతోంది. చైనాను ధనిక దేశంగా తీర్పు చెప్పాలన్నది అమెరికా డిమాండ్‌. అమెరికాకే అగ్రస్ధానం అనే నినాదంతో అధికారానికి వచ్చిన ట్రంప్‌ సర్కార్‌ మరింత అడ్డంగా వ్యవహరించింది. ఏడుగురికి గాను కనీసం ముగ్గురు ఉంటే కేసులను విచారించవచ్చు. ఇటీవలి వరకు అదే జరిగింది. ఆరునెలల క్రితం ముగ్గురిలో ఇద్దరి పదవీ కాలం ముగియటంతో వారు తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసులు దాఖలైనా విచారించే వారు లేరు. ప్రపంచ వాణిజ్య సంస్దలో సంస్కరణలు తేవాలి గానీ అవి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉండకూడదని, అంటే తాము చేసిన దాన్ని ప్రశ్నించే అధికారం ఆ సంస్ధకు ఉండకూడదని అమెరికా పరోక్షంగా చెబుతోంది. ఈ నేపధ్యంలో న్యాయమూర్తుల నియామకం జరగదు, సంస్కరణలకు అవకాశం లేదు. అమెరికా అడ్డగోలు కోరికలు, ఆకాంక్షలను మిగిలిన దేశాలు అంగీకరించే ప్రసక్తే లేదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అమెరికా చూస్తుంటే, స్వేచ్చా వాణిజ్య సూత్రాలను పరిరక్షించాలని చైనా వాదిస్తోంది. ఈ సంస్దలో చేరిన 164 దేశాలు ఏడాదికి తమ జిడిపిని 855 బిలియన్‌ డాలర్లు పెంచుకున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. వీటిలో అమెరికా 87, చైనా 86, జర్మనీ 66 బిలియన్‌ డాలర్ల చొప్పున లబ్ది పొందాయని తేలింది. అగ్రరాజ్యాలకే అధిక ఫలం అన్నది స్పష్టం. అయితే ఈ సంస్ద నిబంధనలలో పెద్ద మార్పులు లేకపోయినా అనేక అంశాలలో మార్పులకు ఒక్కో దఫా చర్చలు దోహదం చేస్తున్నాయి. వాణిజ్యంలో ఉన్న ఆటంకాలను మరింతగా తొలగించేందుకు, సబ్సిడీల తగ్గింపు తదితర అంశాలపై 2001లో దోహాలో మంత్రుల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ముగియలేదు, 2015లో విసుగుపుట్టి వదలివేశారు. అమెరికా-ఐరోపా యూనియన్‌ ధనిక దేశాల మధ్య తలెత్తిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సబ్సిడీ ఒక పెద్ద పీఠముడి. జరుగుతున్న పరిణామాలను చూస్తే న్యాయమూర్తుల నియామకాన్ని ఇలాగే అడ్డుకుంటే చివరకు ప్రపంచ వాణిజ్య సంస్ధ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది.
వ్యవసాయ దిగుమతులపై పన్నుల గురించి అమెరికాాఐరోపా యూనియన్‌ తమకు అనుకూలమైన పద్దతుల్లో ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ధనిక దేశాలు వ్యవసాయ సబ్సిడీలను గణనీయంగా తగ్గించకుండా ప్రయోజనం లేదని, వాటి సంగతి తేల్చాలని చైనా, భారత్‌, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలు పట్టుబట్టటంతో 2005 నుంచి ప్రతిష్ఠంభన ఏర్పడింది. అంతకు ముందు ఉరుగ్వే దఫా చర్చలలో కొన్ని దేశాలు తమలో తాము ఒక ఒప్పందం చేసుకొని ఇతర దేశాలను క్రమంగా వాటిలో చేర్చుకున్నాయి. అయితే దోహా చర్చలలో వర్ధమాన దేశాలు మొత్తంగా ఒప్పందం జరగాలి తప్ప ప్రయివేటు వ్యవహారాలు కుదరవని తేల్చి చెప్పాయి. ఉరుగ్వే దఫా చర్చల నాటికి చైనా ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామి కాదు, దోహా చర్చల సమయంలోనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరింది. చర్చల సమయంలోనే చైనా అమెరికా తరువాత రెండో పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వృద్ధి చెందింది. దీంతో వర్దమాన దేశాల పట్టు పెరిగింది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకుంటున్నది. మనకు మిత్ర దేశం,సహ భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి చెబుతున్న అమెరికాతో లడాయిలో మన దేశం చైనాతో కలసి వ్యవహరిస్తోంది. ఇప్పుడు లడఖ్‌ లడాయితో చైనా మీది కోపంతో అమెరికా పంచన చేరుతుందా ? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎరువులు, ఇతర రాయితీలను పెంచకుండా పరిమితం చేసి ధనిక దేశాలను సంతృప్తి పరుస్తోంది. ఇప్పుడు మరింతగా వాటికి లొంగిపోనుందా ?
ప్రపంచమంతటా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఆహార ధాన్య నిల్వల గురించి ఎలాంటి ఆందోళన లేదు. అనేక చోట్ల పంటలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కరోనా కారణంగా ఆహార జాతీయవాదం ప్రబలి కొన్ని దేశాలలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆంక్షల వంటి రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా,బ్రెజిల్‌, ఐరోపా దేశాలలో కరోనా కారణంగా మాంస పరిశ్రమలు మూతపడ్డాయి. మన దేశం మాదిరే అనేక చోట్ల వలస కార్మికుల సమస్యలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పరిస్ధితి లేదు గానీ కరోనా మరింత ముదిరితే ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ధరలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రంగా విజృంభిస్తుండగా చైనాలో కట్టడి చేసి సాధారణ ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా డోనాల్డ్‌ ట్రంప్‌ తన విజయావకాశాల కోసం పిచ్చి పనులకు పూనుకుంటే రెండు దేశాల మధ్య సాగుతున్న వాణిజ్యం యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో, వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వీసాల రద్దుపై మౌనమేల మోడీ మహాశయా !

24 Wednesday Jun 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 2 Comments

Tags

Donald trump, H1B Visa issue, Narendra modi and BJP silent on H1B visa issue


ఎం కోటేశ్వరరావు
లక్షలాది మంది యువత ఆశల మీద నీళ్లు చల్లుతూ తమ దేశంలోకి విదేశీ కార్మికులు రావద్దంటూ వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్‌ తాజా చర్య గురించి మోడీ లేదా ఆయన పరివారం ఇంతవరకు నోరు మెదపలేదు. పచ్చిగా చెప్పాలంటే కరోనాతో సహజీవనం చేయాలంటూ కనీస చర్యలకు సైతం తిలోదాకాలు ఇస్తున్న పాలకులు ట్రంప్‌ చర్యపై మౌనానికి అర్ధం మీ చావు చావండి అనటమే. అమెరికన్లు ఎందరో నిరుద్యోగంతో ఉన్నందున కొన్ని మినహాయింపులలో తప్ప విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో మా దేశంలో ప్రవేశించటానికి లేదు అని మన ప్రధాని జిగినీ దోస్త్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. ఆ నిషేధం ఈ ఏడాది చివరి వరకు ఉంటుందని చెప్పాడు. ట్రంప్‌ ప్రకటనను గూగుల్‌ సిఇఓ సుందర పిచ్చయ్యతో సహా అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులందరూ తప్పు పట్టారు.
డాలర్‌ కలలు కంటున్న అనేక మంది లబోదిబో మంటున్నారు. డాలర్‌ దేవుడు చిలుకూరు బాలాజీ ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ ఉద్యోగాలు లేక అమెరికా పోలేక మన యువత తీవ్ర నిరాశకు గురవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గత చర్యల కొనసాగింపుగా డోనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని కోరుతూ మన ప్రధాని నరేంద్రమోడీ చప్పుట్లు కొట్టిస్తారో, వీసాల నిషేధంపై మనసు మార్పించాలని ప్రార్ధిస్తూ దీపాలు ఆర్పించి కొవ్వొత్తులు వెలిగించమని చెబుతారో లేక మరేదైనా ఖర్చులేని వినూత్న కార్యక్రమం ఏమైనా ప్రకటిస్తారో తెలియదు.
ట్రంప్‌ నిర్ణయం వెలువడగానే సామాజిక మాధ్యమంలో ఎలాంటి స్పందన వచ్చిందో ఒక్కసారి చూద్దాం.
అమెరికా కలలు కంటున్నవారికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం.భారత అభివృద్ధి కథ ఇప్పుడే ప్రారంభమైంది-తిరిగి రండి దేశాన్ని నిర్మిద్దాం. నమస్తే ట్రంప్‌కు భారత ప్రభుత్వం పెద్దమొత్తంలో ఖర్చు చేసింది-దానికి బదులుగా డిసెంబరు వరకు హెచ్‌1బి వీసాలను ట్రంప్‌ రద్దుచేశాడు. మచ్చుకు కొన్ని ఇవి, యువతలో ఉన్న నిరాశను, మన పాలకులపై ఉన్న ఆశ-భ్రమలు, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి.
అసలెందుకు ట్రంప్‌ ఈ పని చేశాడు ? అమెరికా ఎన్నికలు 133 రోజులు ఉన్నాయనగా ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేందుకు విదేశాలు మిలియన్ల కొద్దీ బ్యాలట్‌ పత్రాలను ముద్రిస్తాయని, వర్తమానంలో ఇది పెద్ద కుంభకోణమని సోమవారం నాడు ప్రకటించిన ట్రంప్‌ మంగళవారం నాడు వీసాల రద్దు నిర్ణయాన్ని వెలువరించాడు. ఓక్లహామా రాష్ట్రంలోని తుల్సాలో గత వారాంతంలో జరిగిన ఎన్నికల సభకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని కలలు కన్న ట్రంప్‌కు ఖాళీ కుర్చీలు దర్శనమివ్వటంతో హతాశుడయ్యాడు.మన దేశంలో పోస్టల్‌ బ్యాలట్ల మాదిరి విదేశాలలో ఉన్న అమెరికన్లకు ఇమెయిల్‌ ద్వారా అటువంటి సౌకర్యం ఉంది. గతంలో ఎవరు అధికారంలో ఉంటే వారు అలాంటి నకిలీ బ్యాలట్లను తమకు అనుకూలంగా తెప్పించుకున్న ఉదంతాలేమైనా జరిగి ఉన్న కారణంగానేే ట్రంప్‌ ముందే ఎదురుదాడికి దిగారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఓడిపోతే నేను ముందే దొంగ ఓట్ల గురించి చెప్పాను అని చెప్పేందుకు ఒక సాకును వెతుక్కుంటున్నారా ? అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా బ్యాలట్‌ పత్రాలను ముద్రించే విధానం ఉన్నందున ఏవి నకిలీవో ఏవి కాదో గుర్తించటం అంత సులభం కాదని వార్తలు వచ్చాయి.
ఇక గూగుల్‌,ఇతర బడా కంపెనీల ప్రతినిధులు ట్రంప్‌ నిర్ణయంపై ఆశాభంగం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిసెంబరు వరకే అని చెప్పినా వారి నుంచి అలాంటి స్పందన వెలువడిందంటే ఒక వేళ ట్రంప్‌ ఓడిపోయి డెమోక్రాట్లు గెలిచినా ఒక వేళ అనూహ్యంగా ట్రంపే గెలిచినా అమెరికా యువతను సంతృప్తి పరచేందుకు ఆ నిర్ణయాన్ని కొనసాగిస్తే తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన వారిలో కలిగిందా ? ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం ఎప్పుడు తొలుగుతుందో, ఇంకెంతగా దిగజారుతుందో ఎవరి ఊహకూ అందటం లేదు. అసలే ఆర్ధిక సంక్షోభం దానికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటులా కరోనా వైరస్‌ జమిలిగా ప్రపంచ ధనిక దేశాలను ఊపివేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటు వేసిన భారతీయులు తక్కువ మందే అయినప్పటికీ తాజా పరిణామంతో తాము ట్రంప్‌ చేతిలో మోసపోయినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తగినంత మంది నిపుణులు ఉన్పప్పటికీ భారత్‌, ఇతర దేశాల నుంచి వచ్చే వారు తక్కువ వేతనాలకు పని చేసేందుకు ముందుకు వస్తారు. ఆ విధంగా వారి శ్రమదోపిడీని కొనసాగించేందుకు తప్ప అమెరికన్‌ కార్పొరేట్‌లకు విదేశీయుల మీద ప్రేమ, అనురాగాలు ఉండి కాదు. వీసాల మీద ఆంక్షలు విధించి విదేశీ కార్మికులను అడ్డుకుంటే కంపెనీలే కెనడా వంటి దేశాల్లో దుకాణాలు తెరిచి అక్కడి నుంచి పని చేయించుకుంటాయి.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 2019లో తాత్కాలికంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు గరిష్టంగా పని చేసేందుకు వీలు కల్పించే 1,33,000 హెచ్‌1బి వీసాలను, ఆయా దేశాలను బట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు పని చేసేందుకు ఇచ్చే పన్నెండువేల ఎల్‌1 వీసాలను, విదేశీ కార్మికులను పనిలో పెట్టుకొనేందుకు యజమానులకు వీలు కల్పించే 98వేల హెచ్‌2బి వీసాలను అమెరికా జారీ చేసింది. కరోనా పేరుతో ఇలాంటి వీసాలను నిలిపివేయాలని ట్రంప్‌ నిర్ణయించాడు.
అమెరికా సంపదల సృష్టిలో విదేశీ కార్మికుల శ్రమ భాగం తక్కువేమీ కాదు. స్ధానిక కార్మికులకు ఇచ్చే వేతనం కంటే బయటి దేశాల వారికి తక్కువ ఇస్తారు. అనేక దేశాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే కార్మికులను చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. వారికి వేతనాలు తక్కువే కాదు, అసలు ఎక్కడా వారి నమోదు ఉండదు, యజమానులకు కార్మిక చట్టాలను అమలు జరపాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయితే అక్కడ స్ధానికుల్లో అసంతృప్తి తలెత్తినపుడు విదేశీ కార్మికుల మీద ఆంక్షల చర్యల వంటి హడావుడి చేస్తారు. అమెరికాలో పని చేసే కార్మికుల్లో హెచ్‌1బి వీసాలతో వచ్చి పని చేసే వారు 0.05శాతమే అని చెబుతున్నారు. ఆ మేరకు కూడా అనుమతించే పరిస్ధితి లేదంటే స్ధానికుల్లో ఉన్న అసంతృప్తి లేదా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులకు వీసాలు నిరాకరించటం లేదా గడువు తీరిన వీసాలను పొడిగించకుండా తిరస్కరించటం ద్వారా నవంబరు ఎన్నికలలోపు కనీసం ఐదు లక్షల ఉద్యోగాలను స్ధానికులకు కల్పించాలన్నది ట్రంప్‌ లక్ష్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన సమయం, అమెరికాలో ఆర్ధిక సమస్యలు తీవ్రతరం అవుతున్న కారణంగా ప్రాజెక్టులు లేక అక్కడి కంపెనీలు(ఇన్ఫోసిస్‌, విప్రో వంటి మనదేశానివి కూడా) గత కొద్ది సంవత్సరాలుగా విదేశీ కార్మికుల నియామకాలను గణనీయంగా తగ్గించాయి. ఇన్ఫోసిస్‌ 2017లో హెచ్‌1 బి వీసాలున్న వారిని 14,586 మందిని నియమిస్తే 2019 నాటికి 60శాతం తగ్గించి 5,496 మందినే నియమించింది. అలాగే విప్రో 56, టిసిఎస్‌ 52, హెసిఎల్‌ 46, కాగ్నిజంట్‌ 56శాతం మందిని తగ్గించాయి. 2016-2019 మధ్య ఈ కంపెనీల నియామకాలు 59,478 నుంచి 32,350కి తగ్గాయి.
అమెరికా వీసాల నిరాకరణ కారణంగా కంపెనీలు ఎక్కడ ఖర్చు తక్కువ ఉంటే అక్కడకు తరలిపోతాయి.ఈ రీత్యా కొన్ని విదేశీ కంపెనీలు మన వంటి దేశాలకు రావచ్చు.అయితే అది పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ సుందర పిచ్చయ్య, ఇతర అమెరికన్‌ కంపెనీల ప్రతినిధుల అసంతృప్తికి కారణం లేకపోలేదు.హెచ్‌1బి వీసాల మీద పని చేసే కార్మికుల మీద ఆధారపడటం భారతీయ కంపెనీలు 50శాతానికి పైగా తగ్గిస్తే, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి కంపెనీల ఆధారం 43శాతం పెరిగింది. అందువలన ట్రంప్‌ చర్యతో వెంటనే ఈ కంపెనీల మీద ప్రభావం పడుతుంది కనుకనే స్పందించాయి. ఈ కంపెనీలు 2016లో17,810 మంది విదేశీ కార్మికులను పెట్టుకోగా 2019కి 25,441కి పెరిగారు. ఈ నేపధ్యంలో అధ్యక్ష ఎన్నికల తరువాత తిరిగి గెలిస్తే ట్రంప్‌ లేదా అధికారానికి వచ్చే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి జో బిడెన్‌ మీద ఈ కంపెనీలు వత్తిడి తీసుకు వచ్చి ఆంక్షలను ఎత్తివేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి భారతీయుల మీద ప్రేమ కాదు స్ధానిక కార్మికుల కంటే విదేశీ కార్మికులకు ఇచ్చే వేతనాలు తక్కువ, పని ఎక్కువ చేయించుకొనే వీలు ఉండటమే అసలు రహస్యం.
అమెరికా వెళ్లి డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించమని చెప్పి వచ్చారు-మన దేశానికి పిలిపించి పెద్ద పీట వేసి మేము మీ వెంటే అని మరోసారి చెప్పి పంపారు మన ప్రధాని మోడీ గారు. గత మూడు సంవత్సరాలుగా ఈ సమస్య గురించి ట్రంప్‌ ప్రతి సారీ బహిరంగంగానే తన మనసులోని మాట చెబుతున్నాడు. అలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ మోడీ, ప్రభుత్వం కూడా అమెరికాతో చర్చిస్తున్నది అనే లీకు వార్తలు తప్ప ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారైనా నరేంద్రమోడీ బహిరంగంగా అభ్యంతరాల వెల్లడి సంగతి గోమాత ఎరుగు అసంతృప్తి అయినా వ్యక్తం చేసిన ఉదంతం ఉందా ? పోనీ మౌనంగా ఉండి సాధించిందేమిటి ? గతంలో దీని గురించి వార్తలు వచ్చినపుడు మై హూనా అన్నట్లు ఫోజు పెట్టిన వారు ఇప్పుడేమయ్యారని యువత ప్రశ్నిస్తోంది. వారికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పటానికి కూడా నోరు రావటం లేదా అంటున్న వారికి ఏమి చెబుతారు ? మన దేశంలో ఏమి జరిగినా కారకులు మోడీయే అని చెబుతున్నారు కనుక దీన్ని గురించి కూడా అడగాల్సింది మోడీనే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు !

21 Sunday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Boycott china goods, Ladakh border clash, Narendra Modi, swadeshi jagran manch


ఎం కోటేశ్వరరావు
మన ప్రధాని నరేంద్రమోడీ గారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బిజెపి నేత, మాజీ సైనిక అధికారి 45 మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్‌లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నపుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కనుక అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్న వారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్‌ ఆర్‌ఆర్‌టిఎస్‌ ( మెట్రో రైల్‌) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఎస్‌టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్‌ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్‌ను పిలిచేటపుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినపుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా ? క్రమశిక్షణకు మారు పేరు, పద్దతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి ?
ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు(ఏడిబి) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ( మా మోడీ ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధల నుంచి అప్పులు తీసుకోవటం నిలిపివేశారు, అప్పులను తగ్గిస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారు దీని గురించి తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు) మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది.నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్‌అండ్‌ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్‌ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ లోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్‌15న గాల్వాన్‌లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగి ఆ టెండర్‌ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా ? చేస్తే ఎడిబికి ఏ సంజాయిషీ ఇస్తుంది ? అది అంగీకరిస్తుందా ? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్‌ చైనా కంపెనీకి అప్పగిస్తుందా ?
ప్రభుత్వ రంగ సంస్ధ బిఎన్‌ఎన్‌ఎల్‌ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్‌లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా ? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్‌టెల్‌ వంటి వారికి మార్కెట్‌ను అప్పగించేందుకు మన బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌లను ఇంకా 3జిలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జి కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది.దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్ధిక, బ్యాంకింగ్‌, రక్షణ, టెలికామ్‌ రంగాలలో పిపిఇ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్‌ ఘటనకు ముందే ఎందుకు లేదు ? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు-చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం ! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్దాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా ?
మేకిన్‌ ఇండియా అంటూ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో బిజెపి దాని మిత్రపక్షాలకు ఓట్లేసిన జనం, బిజెపికి మద్దతుదార్లుగా ఉన్న వ్యాపారులు మేడిన్‌ చైనా వస్తుమయంగా దేశ మార్కెట్‌ను మార్చివేశారు. అంటే వారిలో దేశభక్తిని పెంపొందించటంలో మోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందనుకోవాలా ? నరేంద్రమోడీ తీరుతెన్నులను నిత్యం పర్యవేక్షించే, చాపకింద నీరులా భలే పని చేస్తుంది అని కొందరు అనుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేస్తున్నట్లు ? స్వదేశీ అంటూ బయలు దేరిన తమ నేతలు విదేశీగా మారిపోవటాన్ని ఆ సంస్ధ ఎలా అనుమతించింది? అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటుందా ? పరిణామాలను చూస్తుంటే దాని తీరుతెన్నులపై అనుమానాలు కలగటం లేదా ? ఎవరైనా ఎందుకిలా సందేహించాల్సి వస్తోంది?
” 2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పుటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600 కోట్ల డాలర్లు, మరో 1500 కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్దలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు గ్జియోమీ టెలికాం సంస్ధ సింగపూర్‌ అనుబంధ కంపెనీ ద్వారా 50.4 కోట్ల డాలర్ల పెట్టుబడి ఒకటి. పశ్చిమ దేశాల్లో మాదిరి భారత్‌లో చైనా సంస్ధలు తనిఖీని తప్పించుకున్నాయి టెలికాం రంగంలో 5జి ప్రయోగాల్లో అనేక దేశాలల్లో చైనా సంస్ధ హువెయిపై ఆంక్షలు విధించగా భారత్‌లో ఒక నిర్ణయం తీసుకోకపోయినా తొలి ప్రయోగాల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ( మార్చి 31వ తేదీ ది ప్రింట్‌ వ్యాసం).” ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా ? పరిహారం ఎవరు చెల్లిస్తారు ? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా ? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా ?
చైనాతో లడాయి ఎవరికి లాభం, ఎవరికి నష్టం ? వీధుల్లో చైనా ఉన్మాదంతో వీరంగం వేస్తున్న వారు కమ్యూనిస్టులు చెబుతున్నది ఎలాగూ వినిపించుకోరు. కమ్యూనిస్టేతరులు చెబుతున్నదైనా పట్టించుకుంటారా ? జూన్‌ 20న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరి అతుల్‌ ఠాకూర్‌ ఒక విశ్లేషణ చేశారు. ఆయనేమీ కమ్యూనిస్టు పార్టీ నేత కాదు.చైనాతో విరోధం ఆదేశం కంటే భారత్‌కే ఎక్కువ నష్టం అన్నది దాని సారం. మన దేశం అమెరికాకు ఎంతశాతం వస్తువులను ఎగుమతి చేస్తున్నదో కాస్త అటూ ఇటూగా రెండవ స్ధానంలో చైనాకు ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు చైనాకు పదకొండుశాతం వరకు ఉంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనేది 2.1శాతంతో పన్నెండవ స్దానంలో ఉన్నామని అతుల్‌ చెప్పారు. మన దేశం నుంచి ఏటా చైనాకు ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తుంటే చైనా నుంచి వస్తున్నవారు రెండున్నరలక్షలు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్‌ బజార్‌లో దాదాపు 40వేల మంది రిటైల్‌ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. ఆ దుకాణాల్లో ఒక్కటి కూడా సీతారామ్‌ ఏచూరి లేదా ప్రకాష్‌ కారత్‌కు గానీ లేవు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటే , తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు.పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణ వాదులు అందుకు సిద్దమేనా ? భారతీయ వస్తువులను తమకు ఇస్తే తమ దగ్గర ఉన్న చైనా వస్తువులను నాశనం చేస్తామని వినియోగదారులు అంటున్నారు, మరి ఆ పని చేస్తారా ? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడి వస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి ? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా ? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా ? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని కాషాయ తాలిబాన్లు కోరుకుంటున్నారా ?
ఈ మధ్య కాషాయ దళాలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలకు కట్టుబడి ఉంది కనుక చైనా వస్తువుల మీద చర్య తీసుకుంటే దాని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అందువలన దాన్ని తప్పించుకోవాలంటే జనమే స్వచ్చందంగా చైనా వస్తువులను బహిష్కరించాలని చెబుతూ తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. అంతే కాదు, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మీద అమెరికా వాడు అణుబాంబులు వేసినప్పటి నుంచి జపనీయులు అమెరికా వస్తువులు కొనటం లేదని, మనం కూడా ఆపని ఎందుకు చేయకూడదనే ప్రచారం చేస్తున్నారు. ఉద్రేకంలో ఉన్నవారు ఇలాంటి అంశాలను నిర్ధారించుకొనేందుకు ప్రయత్నించరు.2019లో జపాన్‌ 23శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఐరోపా యూనియన్‌ నుంచి 12, అమెరికా నుంచి 11శాతం దిగుమతి చేసుకుంది. అణుబాంబులు వేసిన అమెరికా సైనిక స్ధావరాన్ని జపనీయులు సహించారు, అమెరికా రక్షణలో ఉంటామని ఒప్పందం చేసుకున్నారు. అందువలన తప్పుడు ప్రచారంతో జనాన్ని మభ్యపెట్టలేరు.
మన ఆర్ధిక వ్యవస్ధ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇచ్చేదీ పాలకపార్టీ వారే. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత ? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుందా ? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు-మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా ? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా ? మతి ఉండే మాట్లాడుతున్నారా ? అదే నిజమైతే మోడీగారు ఏం చేస్తున్నట్లు ? చైనా వస్తువుల మీద అధికపన్నులు వేసి దిగుమతులను నిరుత్సాహపరిస్తే ప్రధాని మోడీ లేదా ఆయన మంత్రి వర్గ సభ్యులను డబ్ల్యుటిఓ లేదా ప్రపంచ నేర న్యాయస్ధానంలో విచారణ జరిపి శిక్షలు వేస్తారా ? వేస్తే వేయనివ్వండి ఎలాగూ వారి పూర్వీకులకు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న లేదా త్యాగాలు చేసిన చరిత్ర ఎలాగూ లేదు. ఇప్పుడు దేశం కోసం పోరాడి శిక్షలకు గురైన వారిగా చెప్పుకోవచ్చు కదా ! అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారికి దేశం, జనం ముఖ్యమా ! మనకు హానికరమైన ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు ముఖ్యమా ?
ప్రపంచ వాణిజ్య సంస్ధ వివాదాల ట్రిబ్యునల్‌ ముందు వేలాది కేసులు దాఖలయ్యాయి. ఏ ఒక్కదానిలో కూడా ఒక్క దేశాన్ని లేదా దేశాధినేతను శిక్షించిన దాఖలా లేదు. కేసులు అలాసాగుతూనే ఉంటాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు పూర్తి కాలేదు, అసలు పూర్తవుతాయో లేదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకొని ధనిక దేశాలు వ్యవసాయరంగంలో దొడ్డిదారిన సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి.
అంతెందుకు మన మోడీగారి జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇక్కడకు వచ్చి కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఒకే కంచం ఒకే మంచం అంటాడు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన మీద కేసులు వేస్తాడు. ఏమిటా కేసులు ? మన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్దమని 2018లో ప్రపంచ వాణిజ్య సంస్ధకు అమెరికా ఫిర్యాదు చేసింది. అదేమిటటా ! సంస్ధ నిబంధనల ప్రకారం పదిశాతంలోపు సబ్సిడీ మాత్రమే ఇవ్వాల్సిన భారత్‌ తన వరి, గోధుమ రైతాంగానికి కనీస మద్దతు ధరల రూపంలో 60-70శాతం ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నట్లు చిత్రించింది. పత్తి మీద కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసింది. ఎంతైనా ” మిత్ర ” దేశం కదా !
అమెరికాలో ఏటా ప్రతి రైతు సగటున 50వేల డాలర్ల మేర సబ్సిడీ పొందుతుంటే మన దేశంలో 200 డాలర్లు మాత్రమే అని నిపుణులు చెప్పారు. అమెరికాను అడ్డుకోలేని ప్రపంచ వాణిజ్య సంస్ధ మనం చైనా, లేదా మరొక దేశ వస్తువుల మీద పన్నులు వేస్తే ఎలా అడ్డుకోగలదు ? మరి ఎందుకు చేయటం లేదంటే మన బలహీనత, చేతగాని తనం, దాన్ని దాచుకొనేందుకు కుంటి సాకులు ? అసలు విషయం ఏమంటే మనకు విదేశీ పెట్టుబడులు కావాలి, అవి పెట్టే దేశాల వస్తువుల మీద పన్నులు వేస్తే అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి ? నరేంద్రమోడీ హయాంలో ముందే చెప్పుకున్నట్లు లెక్కల్లో చూపిన మేరకే 160 నుంచి 2600 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెరగటంతో పాటు వస్తువుల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. వస్తువులను నిలిపివేస్తే పెట్టుబడులు నిలిచిపోతాయి.
తాజా వివాదం గురించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిందేమిటి? చైనా వారు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, మన మిలిటరీ పోస్టులను ఆక్రమించ లేదని చెప్పారు. ఈ ప్రకటన తరువాత అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే వారు, వస్తు బహిష్కరణ పిలుపు ఇచ్చి వీధులకు ఎక్కే వారు తమ నాటకాలను ఆపుతారా ? కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తాయి. మన వారి విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టాము. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఇన్ని తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బిఎస్‌ఎన్‌ఎల్‌ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్ధం ఏమిటి ?అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా ! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా ? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ? కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ మాటల్లో చెప్పాలంటే వినాయక విగ్రహాలను కూడా మనం చౌకగా తయారు చేసుకోలేని దుస్ధితిలో ఉన్నాం. చైనా కమ్యూనిస్టులు తయారు చేసిన విగ్రహాలను మన భక్తులు వినియోగిస్తున్నారు. చైనా వస్తువుల నాణ్యత గురించి గట్టి మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని పాస్వాన్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డుకున్నారు? ఇప్పటి వరకు నాశిరకం వస్తువులను అనుమతించి మన జనాన్ని ఎందుకు నష్టపెట్టారు ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్‌ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. ఒక వ్యాపారి మాదిరే ఆలోచిస్తారు, వ్యాపారుల వత్తిడికి లొంగిపోతారు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ఉదాహరణకు అమెరికా పత్తి దిగుమతుల మీద చైనా 25శాతం పన్ను విధించటంతో అది అమెరికా ఎగుమతిదార్లకు గిట్టుబాటు కాలేదు. అదే సమయంలో మన పత్తి ఎగుమతిదార్లకు వరమైంది. పర్యవసానంగా మన పత్తికి ఆమేరకు డిమాండ్‌ పెరిగి రైతులు కూడా పరిమితంగా అయినా లాభపడ్డారు. చైనాకు పెద్ద ఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. అయితే పరిస్ధితులెప్పుడూ ఇలాగే ఉండవు. అంతర్జాతీయ రాజకీయాల్లో తీసుకొనే వైఖరులను బట్టి మిగతాదేశాల వైఖరులు మారుతుంటాయి.
గత ఏడాది చైనా వైఖరి కారణంగా మన దేశం నుంచి చైనాకు నూలు ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఒకటి ప్రపంచ వ్యాపితంగా డిమాండ్‌ పడిపోవటం ఒక కారణం అయితే, రెండవది పాకిస్ధాన్‌, వియత్నాం. ఆ దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పన్నులు లేని నూలు దిగుమతులను చైనా అనుమతించటంతో మన ఎగుమతులు పెద్ద ఎత్తున పడిపోయాయి. దాని ప్రభావం మన రైతుల మీద కూడా పడిందా లేదా ! చైనాకు వ్యతిరేకంగా అమెరికాను కౌగిలించుకొని అది చెప్పినట్లు చేయటమే దీనికి కారణం అన్నది లోగుట్టు.మనం డబ్ల్యుటిఓ సూత్రాలకు కట్టుబడి ఉన్నాం కనుక చైనా వస్తువుల మీద పన్నులు విధించలేమని అంటున్నవారు అమెరికా వస్తువుల మీద ఎలా విధించారు? మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువుల మీద గతంలో ఇచ్చిన పన్నురాయితీలను ”మన అపర స్నేహితుడు ” డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశాడు. మన ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై పదిశాతం పన్నులు పెంచలేదా దానికి ప్రతిగా మన మోడీ 28 అమెరికా ఉత్పత్తుల మీద దిగుమతి పన్ను పెంచలేదా ? కొన్నింటి మీద 120శాతం వేశారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ మనమీదేమీ చర్య తీసుకోలేదే? మన దేశం పన్నులను ఎక్కువగా విధిస్తున్నట్లు ట్రంప్‌ మనలను ఆడిపోసుకోలేదా ? తమ వస్తువులను మరిన్ని దిగుమతి చేసుకోవాలని మన మీద వత్తిడి తేవటం లేదా ? సరే దీని మీద కూడా ఇప్పుడు కేసు వేశారనుకోండి. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. పాకిస్ధాన్‌తో ఉన్న వైరం కారణంగా పంచదార దిగుమతులను అడ్డుకొనేందుకు 2018లో మన దేశం 50శాతంగా ఉన్న దిగుమతి పన్నును వందశాతానికి పెంచింది. ఈనెలలోనే మలేసియా నుంచి కాలిక్యులేటర్ల మీద ఒక్కోదానిపై 92సెంట్ల చొప్పున ఐదేండ్ల పాటు వసూలు చేసే విధంగా మన దేశం పన్ను పెంచింది. ఇదే పని చైనా వస్తువుల మీద ఎందుకు తీసుకోకూడదు ? ఎందుకంటే పాకిస్ధాన్‌, మలేషియాలు చైనా వంటివి కాదు గనుక. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్లుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఏ దేశమైనా తన మౌలిక ప్రయోజనాలకు భంగం కలిగినపుడు చర్యలు తీసుకొనేందుకు ఆ సంస్ధ నిబంధనలు అవకాశం కలిగిస్తున్నాయి. లేదూ అవి మనకు నష్టదాయకం అనుకుంటే బయటకు వచ్చేయటమే. ఈ రోజు అమెరికా ప్రయోజనాలకే అగ్రస్ధానం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక అంతర్జాతీయ సంస్ధల నుంచి బయటకు రావటం లేదా ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగటం లేదా ? డోనాల్డ్‌ ట్రంప్‌కు ఉన్న మాదిరి 56 అంగుళాల ఛాతీ మన నరేంద్రమోడీకి లేదా ? ఆయనకు మన ప్రయోజనాలు పట్టవా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగనాంధ్రప్రదేశ్‌లో అప్పు చేసి పప్పుకూడు !

17 Wednesday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Andhra Pradesh budget 2020-21, Andhra Pradesh Debt, YS jagan, YS Jagan first year regime


ఎం కోటేశ్వరరావు
అవును జగన్మోహనరెడ్డే ఆంధ్రప్రదేశ్‌-ఆంధ్రప్రదేశ్‌ అంటేనే జగన్మోహనరెడ్డి అన్నట్లుగా అధికారపక్షం భజన చేస్తున్నపుడు అన్నింటికీ బాధ్యుడు జగనే కదా ! మంగళవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన రెండవ బడ్జెట్‌ విన్యాసాలు ప్రదర్శించారు. ఆయన బడ్జెట్‌ ప్రసంగంలో అడుగడుగునా జగన్నామ స్పరణం చేశారు మరి. గతేడాది రెండు లక్షల 27వేల 975 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దాన్ని రూ.1,74,757 కోట్లకు సవరించారు. అంటే 53వేల కోట్ల రూపాయల కోత పెట్టారు. ఇది కూడా జగన్‌ అనుమతి లేకుండా చేసేంత స్వతంత్ర ప్రతిపత్తి ఆర్ధిక మంత్రికి ఉందనుకోవటం లేదు. గత ఏడాది కాలంలో నవరత్నాలకు, మరికొన్ని మరకతాలు తోడయ్యాయి తప్ప తగ్గలేదు. మరి అన్ని వేల కోట్ల రూపాయలను ఏ రంగాలకు తగ్గించినట్లు ? నవరత్నాలకు తగ్గించిన దాఖల్లాలవు కనుక కచ్చితంగా అభివృద్ధి పనులకే అని వేరే చెప్పాల్సిన పనేముంది. మరో విధంగా చెప్పాలంటే గతేడాది కాలంలో ఎంత అప్పయితే చేశారో అంతమేరకు అభివృద్ది పనులకు కోతలు పెట్టారు. తెచ్చిన అప్పును నవరత్నాలకు వినియోగించారు. కొందరు దీన్నే అప్పుచేసి పప్పుకూడు అంటున్నారు.
చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వం తొలి ఏడాది దాన్నే రెండులక్షల 28వేల కోట్లకు పెంచి లక్షా 74వేల కోట్లకు(53వేల కోట్లు) కుదించింది. ఇది చంద్రబాబు కంటే ఎక్కువా తక్కువా ? జగన్‌ గారి ఇంగ్లీషు మీడియం పిల్లలు కూడా మోర్‌ దేన్‌ చంద్రబాబు సర్‌ (చంద్రబాబు కంటే ఎక్కువే అండీ) అని కచ్చితంగా చెబుతారు. వారిని పచ్చ పిల్లలు అనకండి, చాల బాగోదు.
చంద్రబాబు నాయుడు బిజెపితో అంటకాగారు కనుక రాష్ట్రానికి జరిగిన అన్యాయాల గురించి మాట్లాడలేని బలహీనతకు లోనయ్యారు. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టలేకపోయారు. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల గురించి అడిగేందుకు ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. చివరి క్షణంలో మంత్రుల చెయ్యి ఖాళీ లేదు రావద్దు అని వర్తమానం పంపారని వార్తలు. అసలు రమ్మనటమెందుకు ? ఖాళీగా లేమని వద్దనటమెందుకు ? తమాషాగా ఉందా ? ఇది వ్యక్తిగతంగా జగన్‌కు ఏమిటన్నది ప్రధానం కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రికి జరిగిన అవమానంగానే పరిగణించాలి.
తెలుగుదేశం సర్కార్‌ చివరి బడ్జెట్‌లో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు కాగా వచ్చిందని చూపిన మొత్తం 21,876 కోట్లు మాత్రమే. వర్తమాన సంవత్సరంలో వస్తుందని చూపిన మొత్తం 53,175 కోట్లు. రెండేళ్ల తీరు తెన్నులు చూస్తే రాష్ట్రం రావాలంటున్న మొత్తం రాదని తేలిపోయింది. అసలు ఆ మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలా లేదా ? బిజెపి నేతలు తమ పలుకుబడిని ఉపయోగించలేరా ? వారికి బాధ్యత లేదా ? జగన్‌ ఎలాగూ గట్టిగా అడగలేరు. చంద్రబాబు నాయుడి సంగతి సరే సరి. అలాంటపుడు అంత మొత్తాలను బడ్జెట్‌లో చూపటమెందుకు ? వస్తుందో రాదో ఖరారు చేసుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకీ దోబూచులాట ?
కీలకమైన సాగునీటి రంగానికి జగన్‌ తొలి బడ్జెట్‌లో 13,139 కోట్లు కేటాయించి చివరకు ఖర్చు చేసింది 5,345 కోట్లు మాత్రమే. రెండవ బడ్జెట్లో కేటాయింపు రూ. 11,805 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపుల మేరకైనా ఖర్చు చేయకుండా, పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. మరికొన్ని ముఖ్యమైన రంగాల కేటాయింపుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూడండి.( కేటాయింపులు కోట్ల రూపాయల్లో )
శాఖ 2019-20 ప్రతిపాదన —సవరణ —–2020-21ప్రతిపాదన——- శాతాలలో కోత
గ్రామీణాభివృద్ది 31,564 —- 11,661 — 16,710 —– 47.10
వ్య-సహకారం 18,327 — 5,986 —- 11,891 —- 35.12
పశు సంవర్ధక 1912 —- 720 — 1,279 —– 33.08
పరిశ్రమలు, వాణి 3,416 —- 852 —- 2,705 —- 20.82
సెకండరీ విద్య 29,772—- 17,971 — 22,604 —– 24.08
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య జీవనాధారం వ్యవసాయం, గ్రామీణ రంగాలు వాటికి కేటాయింపులు ఎంత పెద్దమొత్తంలో కోత పెట్టారో చూస్తే రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారో అర్ధం అవుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. సంక్షేమ చర్యలను ఎవరూ తప్పుపట్టటం లేదు. అవి ఉపశమనం కలిగించే చర్యలే తప్ప సంపదలను ఉత్పత్తి చేసేవి కాదు. అందువలన సమతూకం తప్పితే సంక్షేమ పధకాలను పొందిన పేదల జీవితాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి మాదిరి అక్కడే ఉంటాయి తప్ప సంక్షేమ చర్యలతో మెరుగుపడిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు.
ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయం గమనంలో ఉంచుకొని గానీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది 7,271 కోట్లు కేటాయించి 18,986 కోట్లు ఖర్చు చేసి ఈ బడ్జెట్‌లో 26,934 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా మైనారిటీల సంక్షేమానికి 952 కోట్ల కేటాయింపు, 1,562 కోట్ల ఖర్చు, కొత్తగా 2,055 కోట్లు ప్రతిపాదించారు.
కరోనా వైరస్‌ దేశంలో ఒక అంశాన్ని ముందుకు తెచ్చింది. ప్రజారోగ్య వ్యవస్ధను నిర్లక్ష్యం చేస్తే అలాంటి మహమ్మారులు వచ్చినపుడు ప్రయివేటు రంగం చేతులెత్తివేస్తుందని తేలిపోయింది. అందువలన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు తగినన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ ఆసుపత్రుల స్ధాయిని మెరుగుపరచాల్సి ఉంది. గతేడాది రూ.11,399 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 7,408 కోట్లు మాత్రమే ఈ ఏడాది కేటాయింపు 11,419 కోట్లు మాత్రమే చూపారు.
వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి వంటి ఆర్ధిక సేవల రంగాలకు గత బడ్జెట్‌లో 37.8 శాతం కేటాయిస్తే తాజా బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని 27.39కి కోత పెట్టారు. ఇదే సమయంలో విద్య, వైద్యం, గృహనిర్మాణం వంటి సామాజిక సేవలకు 33 నుంచి 43శాతానికి పెంచారు. వీటిలో సాధారణ విద్యకు 14.38శాతంగా ఉన్న మొత్తాన్ని 11.21శాతానికి కోత పెట్టారు. సంక్షేమ చర్యల వాటాను 6.2 నుంచి 18.44శాతానికి పెంచారు. కరోనా వైరస్‌ కారణంగా పారిశుధ్య కార్మికుల సేవల గురించి పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. బడ్జెట్‌లో మంచినీటి సరఫరా, పారిశుధ్య బడ్జెట్‌ను 2234కోట్ల నుంచి 1644 కోట్లకు తగ్గించటాన్ని ఏమనాలి ?
తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 60 వేల కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అల్లుడికి బుద్ధి చెప్పి మామ తప్పు చేసినట్లుగా లేదూ ఇది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచారు. వచ్చే ఏడాదికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. అంటే మొత్తం నాలుగు లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గత నాలుగు సంవత్సరాలుగా 27.92శాతంగా ఉన్న అప్పు వచ్చే ఏడాదికి చివరికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. అందుకే జగనాంధ్ర అప్పుచేసి పప్పు కూడు ఆంధ్రగా మారబోతోందని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయ్యా నరేంద్రమోడీ గారూ మీ ఏలుబడిలో చమురు ధరలింకా ఏమేరకు పెరుగుతాయో తెలుసుకోవచ్చా ?

15 Monday Jun 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

Fuel Price in India, Fuel tax hike in India, Global Crude oil price of Indian Basket, oil price in India

ఎం కోటేశ్వరరావు
అబ్బో ఆరోజులే వేరు. మన జనం ఎంత త్యాగశీలురు, సహనమూర్తులుగా ఉండేవారు. జేబులను కొల్లగొడుతున్నా స్వేచ్చా వాయువులను పీలుస్తూ మైమరచి పోయే వారు. అప్పటి వరకు సహనంలో మనకు మనమే సాటి అని ఒకదాని నొకటి వెనుక కాళ్లతో తన్నుకొని పరస్పరం అభినందించుకున్న గాడిదలు కూడా విస్తుపోయేలా జనం సహనశీలురుగా ఉండేవారు అని చరిత్ర గురించి కొత్త తరాలకు తాతయ్యలు, తాతమ్మలు చెప్పే రోజు వస్తుందా ?
చూస్తుంటే అదే అనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయిన మేరకు వినియోగదారులకు ధర తగ్గించకపోయినా నోరెత్తలేదు. వరుసగా పెట్రోలు, డీజిలు ధరలు (ఇది రాసే సమయానికి తొమ్మిది రోజులు) పెంచుతున్నా ఇదేమిటి అన్నట్లుగా కూడా చూడటం లేదు. మన మెదళ్లలో ఎందుకు అని ప్రశ్నించే సాప్ట్‌వేర్‌ పని చేయటం లేదా లేక హార్డ్‌వేర్‌ చెడిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అసలు ఏదీ పట్టించుకోని వారికి అంధులకు ఇంధ్రధనుస్సును చూపించినట్లు ఎన్ని వివరాలు చెప్పినా ప్రయోజనం ఏముంది ! ఉండబట్టలేక వామపక్షాలు పిలుపులు ఇచ్చినా జనం పట్టించుకోనపుడు మిగులుతున్నది కంఠశోష మాత్రమే.
2019 మే నెలలో మనం సగటున ఒక పీపా ముడి చమురును రూ.4,664కు, జూన్‌ నెలలో రూ.4,149కి కొనుగోలు చేస్తే ఈ ఏడాది జూన్‌ 15 ధర రూ.2,642 ఉంది. అంతకు ముందు పదిహేను రోజులుగా దీనికి కాస్త అటూ ఇటూగా ఉంది తప్ప మిన్ను విరిగి మీద పడినట్లు పెరగలేదు. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.69.59గా ఉన్నదానిని మార్చి 16 నుంచి 82 రోజుల పాటు ఎలాంటి మార్పు చేయలేదు. తొమ్మిది రోజులుగా పెంచిన ఫలితంగా అది రూ.76.26కు పెరిగింది.
గతేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం 2020 జూన్‌ 11వ తేదీన నవీకరించిన ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. మే నెలలో 30.60 డాలర్లకు పెరిగింది. జూన్‌ 15న ధర 40.66 డాలర్లు ఉంది తప్ప వెనుకటి అరవై డాలర్ల స్ధాయికి చేరకపోయినా తొమ్మిది రోజులుగా ఎందుకు పెంచుతున్నట్లు ? 2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ రూ.16.86లు ఉంది.
ఈ అన్యాయం గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు బిజెపి దృష్టిలో జాతి వ్యతిరేకులు కనుక మాట్లాడటం లేదు అనుకుందాం. మరి అసలు సిసలు జాతీయ వాదులుగా పిలుచుకొనే బిజెపి ఈ ధరల దోపిడీ గురించి మాట్లాడదేం ? లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ధర పెంచితే పెట్రోలియం కంపెనీలకు లాభం వస్తుంది. వినియోగదారు జేబుకు చిల్లిపడుతుంది.
గొప్పలు చెప్పుకోవటంలో బిజెపి తరువాతే . కానీ అది తమకు ప్రయోజనం అనుకున్నవాటి విషయంలోనే సుమా ! సిగ్గుపడాల్సిన వాటిని ప్రస్తావించేందుకు సైతం భయపడతారు. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ ప్రతి వారం అధికారిక సమాచారం అధారంగా ధరలను సమీక్షిస్తుంది. ఈ మేరకు జూన్‌ ఎనిమిది నాటి సమాచారం ప్రకారం ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 95 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 46,మయన్మార్‌లో 48, భూటాన్‌లో 66,నేపాల్లో 80, చైనాలో 83, శ్రీలంకలో 87, మన దేశంలో 101 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం చెప్పగలదా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?
మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఆరు సంవత్సరాల తరువాత ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు.
వరుసగా చమురు ధరలను ఎందుకు పెంచుతున్నారు అన్నది ప్రశ్న. కనిష్టానికి పడిపోయిన ముడి చమురు ధరలు పూర్వపు స్ధితికి చేరకపోయినా తిరిగి పెరుగుతున్నాయి. మన దేశంలో 2019-20 సంవత్సరంలో చమురు కంపెనీలకు ఒక లీటరుకు లాభం సగటున రూ.2.20 ఉంది. చమురు ధరలు భారీగా తగ్గిన కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని మోపినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో రూ.13 నుంచి 19 వరకు లాభాలు వచ్చాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సమాచారం ప్రకారం మే నెల 1-5 తేదీల మధ్య లీటరుకు రూ.16.10 ఉన్న లాభం కాస్తా కేంద్ర ప్రభుత్వం మే ఆరు నుంచి పెట్రోలు మీద 10 డీజిలు మీద 13 రూపాయల పన్ను పెంచిన కారణంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీల లాభం రెండింటి సగటు లాభం రూ.3.90కి పడిపోయింది. తరువాత ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగినందున మే మధ్య నాటికి కంపెనీలకు ఒక లీటరుకు రూ.1.84, మే ఆఖరు నాటికి 1.56 తరుగు వచ్చిందట. దాంతో తిరిగి ధరలను పెంచటం ప్రారంభించాయి, ఒక్క రోజులో పెంచితే సంచలనాత్మకంగా ఉంటుంది కనుక రోజూ కాస్త కాస్త పెంచుతున్నాయి. అంటే తరుగుపోయి మిగుల్లోకి వచ్చేంత వరకు పెంచుతూనే ఉంటాయి. ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో సగటున లీటరుకు రూ.7.9 మిగులు ఉంటుందనుకుంటే అది తరుగులోకి వచ్చింది. అందు వలన కనీసం రూ.5.10 మిగులు ఉండేట్లు చూడాలని నిర్ణయించారని వార్తలు. అంటే ఆ మేరకు లాభాలు వచ్చే వరకు పెంచుతూనే ఉంటారు. చమురు వినియోగం పడిపోయిన సమయంలో చమురు శుద్ధి కర్మాగారాలు కూడా ఆమేరకు తగ్గించాల్సి వచ్చింది. ఆ సమయంలో వాటికి వచ్చిన నష్టాలను కూడా ఇప్పుడు పూడ్చుకుంటున్నాయి. అందువలన ఇప్పుడున్న ముడి చమురు ధర ఇంకా పెరిగితే వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేయటం తప్ప కేంద్రం పన్ను తగ్గించదు. ధరలూ తగ్గవు.
మన దేశంలో ఉన్న చమురు పన్ను ప్రపంచంలో మరెక్కడా లేదంటే మోడీ గారి మంచి రోజులకు, ఇంత పన్ను భరించటం మన జనాల సహనానికి చిహ్నం. కేర్‌ రేటింగ్స్‌ సంస్ధ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం ఫిబ్రవరి 2020 నాటికి కేంద్రం, రాష్ట్రాలు విధిస్తున్న పన్ను సగటున పెట్రోలుపై 107, డీజిల్‌పై 69శాతం ఉంది. మార్చి 16వ తేదీన ఆ పన్నులు 134,88శాతాలకు పెరిగాయి. మే మొదటి వారంలో అవి 260,256 శాతాలకు చేరాయి. జర్మనీ, ఇటలీ దేశాల్లో 65శాతం, బ్రిటన్‌లో 62, జపాన్‌లో 45, మోడీ దోస్తు ట్రంప్‌ ఏలుబడిలో 20శాతం వరకు పన్నులు ఉన్నాయి. నరేంద్రమోడీ ఎంత గొప్పవ్యక్తో ఇతర ప్రపంచ నేతలతో పోల్చితే అది దేశభక్తి, ప్రజలపై భారాలను పోల్చితే అది దేశద్రోహం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతాంగ ఆదాయాల రెట్టింపు ఓ ప్రహసనం !

13 Saturday Jun 2020

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

doubling the farmers income, doubling the farmers income in India a farce, Farmers in India


ఎం కోటేశ్వరరావు
తమ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ పంటల కనీస మద్దతు ధర ప్రపంచ మార్కెట్‌కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ చెప్పారు. అరవై లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్రం మరో ఆరువేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల వరకు మనకు బియ్యం, గోధుమ మిగులు ఉంటుందని వాటిని నిల్వ చేసుకొనేందుకు స్దలం కూడా లేదని అన్నారు. ప్రస్తుతం ఆరు- ఏడులక్షల కోట్ల రూపాయల మేరకు చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ప్రస్తుతం ఇరవై వేల కోట్ల రూపాయల విలువగల ఇథనాల్‌ తయారు చేస్తున్నామని దాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. ఏటా 90వేల కోట్ల రూపాయల విలువగల ఖాద్య తైలాలను దిగుమతి చేసుకుంటున్నామని, అందువలన చమురు గింజల ఉత్పత్తి కూడా పెంచాలన్నారు. అమెరికా, బ్రెజిల్‌ దేశాలలో 30, 27-28 క్వింటాళ్ల మేరకు సోయా బీన్స్‌ దిగుబడి ఒక ఎకరానికి వస్తుండగా మన దేశంలో 4.5క్వింటాళ్లకు మించి లేదన్నారు.
దీనిలో మొదటిది అతిశయోక్తి లేదా ఆధారం లేని అంశం. ఏ దేశంలో ఎంత ఇస్తున్నారో మంత్రి చెప్పి వుంటే దానికి విశ్వసననీయత ఉండేది.రెండవది రైతాంగానికి మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర వేరు. మంత్రి చెప్పినట్లుగానే సోయా విషయాన్నే తీసుకుంటే అమెరికా కంటే మన రైతాంగానికి మద్దతు ధర ఎక్కువ ఇచ్చినా గిట్టుబాటు కాదు,ఎందుకంటే అమెరికాలో ఆరు రెట్లు దిగుబడి ఎక్కువ. అందువలన అక్కడ ధర తక్కువ ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చే ఇతర సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే మన రైతుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాల వరకు బియ్యం, గోధుమలు మిగుల్లో ఉంటాయని చెప్పినందుననే ఈ ఏడాది రైతాంగానికి క్వింటాలు ధాన్యానికి కేవలం 53 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచారు.రానున్న మూడు సంవత్సరాలలో కూడా ఇంతకు మించి ఎక్కువ పెంచే అవకాశం ఉండదనేందుకు ఈ వ్యాఖ్యలు ఒక సూచిక అని చెప్పవచ్చు. ఒక వేళ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కరోనా వైరస్‌ ఆర్ధిక రంగంలో కలిగించే విపత్కర పరిస్ధితి ఆ వైపు నెట్టదని చెప్పలేము.
కుండలో కూడు కుండలోనే ఉండాలిాపిల్లాడు మాత్రం లడ్డులా తయారు కావాలన్నట్లుగా రైతుల పరిస్ధితి ప్రస్తుతం తయారైంది. గత ఆరు సంవత్సరాలుగా పెరుగుదల లేని ఒకే మొత్తం సబ్సిడీ. యూరియాకు మాత్రమే సబ్సిడీ ఇస్తాం. మిశ్రమ ఎరువుల ధరలు పెరిగితే ఉన్నదాన్నే సర్దుతాం తప్ప మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాలనుకున్న మేరకే సబ్సిడీ ఇస్తాం లేదా తగ్గిస్తాం తప్ప పెంచేది లేదు. కనీస మద్దతు ధరలను ముష్టి మాదిరి విదిలించి 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తాం. స్ధూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలివి.
డిఏపి, ఎంఓపి, ఎన్‌పికె వంటి ఎరువులకు సబ్సిడీని తగ్గిస్తున్నాం, మంచం పొట్టిదైతే కాళ్లు నరుక్కోవాల్సిందే తప్ప వేరే ఏర్పాటు చేయలేం, వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి మిశ్రమ ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయలనే సబ్సిడీగా ఇస్తాం, దాంతో సర్దుకోవాల్సిందే ఈ విషయం మీకు ముందే చెబుతున్నాం అన్నట్లుగా ఏప్రిల్‌ మూడవ వారంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మీడియా పెద్దగా వార్తలివ్వలేదు, జనం కూడా పట్టించుకోలేదు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం చేసింది.
వ్యవసాయంలో ఎరువుల ప్రాధాన్యత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. అయితే ఏ పంటకు, ఏనేలలో ఏ ఎరువు ఎంత వేయాలనేది మాత్రం నిరంతరం చెప్పుకుంటూ ఉండాల్సిందే. లేనట్లయితే, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంట దిగుబడుల మీద ప్రతికూల ప్రభావాలు పడతాయి. గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూస్తే మన వంటి వర్ధమాన దేశాల సాగులో ఎరువుల సబ్సిడీ ఒక ప్రధాన పాత్ర వహించింది. దాన్ని తగ్గిస్తే అది చిన్న,సన్నకారు రైతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ధనిక దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించేందుకు వాటి సాధనాలుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలు వర్దమాన దేశాలకు రుణాలు కావాలంటే వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలనే ఒక షరతును 1980దశకంలో ముందుకు తెచ్చాయి. దొడ్డిదారిన ధనిక దేశాలు ఇచ్చే సబ్సిడీల గురించి మాట్లాడవు.
కరోనా వైరస్‌ నేపధ్యంలో వ్యవసాయ రంగం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి ఏర్పడింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలోకి జారిపోతోందని ప్రపంచ బ్యాంకుతో సహా అన్ని సంస్ధలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనాకు ముందే దేశ వ్యవసాయరంగం కుదేలైంది. గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధిలో మెరుగుదల లేదు, గిడసబారిపోయింది, ఈ ఏడాది కూడా అంతకు మించి పెరుగుదల ఉండదు, మూడుశాతం ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. యుపిఏ పాలనా కాలంలో దాదాపు పన్నెండుశాతం కనీస మద్దతు ధరలు పెరిగితే బిజెపి ఏలుబడిలో నాలుగున్నరశాతానికి మించి లేవు.
వివిధ దేశాలలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ధనిక దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు ముగియ లేదు, ఒక కొలిక్కి వస్తాయనే ఆశలేదు. వ్యవసాయ సబ్సిడీలపై ధనిక దేశాల మధ్య పడిన చిక్కుముడే దీనికి కారణం. ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి గురైతే అసలు ప్రపంచ వాణిజ్య సంస్దే కుప్పకూలినా ఆశ్చర్యం లేదు. దోహా చర్చలు ఇంకా ముగియ లేదు కనుక అటు ధనిక దేశాలు తమ రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్దల ద్వారా వర్ధమాన దేశాల్లో సబ్సిడీల రద్దు లేదా నామమాత్రం చేయటానికి వత్తిడి పెంచుతున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నది చూద్దాం. ఎందుకంటే రెండు దేశాలు తమ జనాభాకు అవసరమైన ఆహార భద్రతను సమకూర్చాల్సి ఉంది.
మన దేశంలో సాగుకు అనుకూలమైన భూమి 156మి.హె ఉంటే చైనాలో 120 మి.హె మాత్రమే ఉంది. సాగునీరు మన దేశంలో 48శాతం సాగుభూమికి ఉంటే చైనాలో 41శాతానికి ఉంది. దీని కారణంగా మొత్తం పంటలు సాగు చేసే ప్రాంతం చైనాలో 166 మి.హె, మన దేశంలో 198మి.హెక్టార్లు ఉంటుంది. చైనాలో సాగు భూమి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1,367 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ కేవలం 407 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ?
రెండు దేశాలూ పురాతన నాగరికత కలిగినవే, రెండూ స్వాతంత్య్రం వచ్చే నాటికి వ్యవసాయాధారిత దేశాలుగానే ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, వినూత్న పద్దతులను కనుగొనేందుకు 2018-19లో మన దేశం 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనాలో 780 కోట్ల డాలర్లు ఉంది. మన దేశంలో జరిపిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయ పరిశోధన-విస్తరణ పధకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జిడిపిలో రూ.11.20 పెరుగుదల ఉంటుంది. వీటి మీద చేసే ప్రతి పది లక్షల రూపాయల ఖర్చుతో 328 మంది దారిద్య్రం నుంచి బయట పడవేయవచ్చు. దేశ జివిఏ(గ్రాస్‌వాల్యూయాడెడ్‌- ఒక ప్రాంతం లేదా ఒక పరిశ్రమలో ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ)లో మనం కేవలం 0.35శాతమే ఖర్చు చేస్తుండగా చైనా 0.8శాతం ఉంది. అందువలన పరిశోధన, అభివృద్ధి, విస్తరణకు మన దేశం చేయాల్సిన ఖర్చు పెరగాల్సి ఉంది. ఈ ఖర్చు పెంచితే రైతాంగ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ దిశగా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు లేవు.
నాణ్యమైన విత్తన తయారీతో పాటు ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది.2016లో ఒక హెక్టారుకు చైనాలో 503కిలోల ఎరువులు వినియోగిస్తే మన దేశంలో 166కేజీలు మాత్రమే ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక పంటల ఉత్పాదన విషయానికి వస్తే మన దేశంతో పోల్చితే చైనాలో 50 నుంచి వందశాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. రైతాంగానికి వివిధ రూపాలలో ఇచ్చే సబ్సిడీని ఇప్పుడు ఆంగ్లంలో ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ) అంటున్నారు. అనేక దేశాల్లో ఈ భావనతో రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి సబ్సిడీ లేదా దానికి సమానమైన వాటిని గణిస్తున్నారు. చైనాలో 2018-19కి మూడు సంవత్సరాలలో దేశ మొత్తం వ్యవసాయ ఆదాయంలో 15.3శాతం రైతాంగానికి సబ్సిడీ రూపంలో అందింది. ఇదే కాలంలో మన దేశంలో 5.7శాతం ప్రతికూలత ఉంది. అంటే రైతాంగానికి ఇచ్చే సబ్సిడీల కన్నా వారి మీద మోపిన పన్ను తదితర భారం పెరిగింది. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఇదొక కారణం అన్నది స్పష్టం. దీన్ని సరిదిద్దటానికి బదులు 23 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచటం ద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. పోనీ ఇదైనా స్వామినాధన్‌ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణ్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నదా అంటే అదీ లేదు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులను కూడా పూర్తిగా మద్దతు ధరలకు ప్రాతిపాదికగా తీసుకోవటం లేదు. కనీస మద్దతు ధరల గురించి బిజెపి ఎన్నికబుర్లైనా చెప్పవచ్చు, అంకెలు నిజాలే చెబుతాయి. 2004-14 పదేండ్ల కాలంలో యుపిఏ హయాంలో సాధారణ ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.560 నుంచి 1310కి (750) పెరిగింది. అదే ఎన్‌డిఏ హయాంలో ఏడు సంవత్సరాల కాలంలో (2014-15 నుంచి 2020-21) 1310 నుంచి రూ.1868కి (558) మాత్రమే పెరిగింది. శాతాల్లో చూస్తే మొత్తంగా యుపిఏ కాలంలో 133శాతం,ఎన్‌డిఏ కాలంలో 42.5శాతమే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకంటే ఎంతో ఎక్కువ మొత్తాలను చెల్లించి చైనాలో రైతుల వద్ద పంటలను కొనుగోలు చేయటంతో ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. తెలంగాణాలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్దేశించిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు నిధులు ఇస్తామని ఒక షరతును పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా అందచేస్తున్న నగదుకు ఎలాంటి షరతులు లేవు. చైనాలో కూడా ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రైతులకు నిధులను బదిలీ చేస్తున్న పధకాన్ని అమలు జరుపుతున్నారు. అయితే చైనాలో రైతులకు, యావత్‌ ప్రజానీకానీకానికి అమలు జరుపుతున్న ఇతర సంక్షేమ పధకాలు, అన్నింటికీ మించి రైతులకు మనకంటే రెట్టింపు దిగుబడుల కారణంగా అక్కడ వ్యవసాయ రంగంలో ఎలాంటి సంక్షోభాలు రాలేదు. అందువలన చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం పరిశోధన, అభివృద్ధి, విస్తరణ ఖర్చు గణనీయంగా పెంచటమే. అది కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చేయాల్సి ఉంది.
2022 నాటికి అంటే మన స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచే నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016లో నరేంద్రమోడీ ప్రకటించారు. అంటే ఆ రోజుకు ఉన్న ఆదాయాలు రెట్టింపు అని మనం అర్ధం చేసుకోవాలి. మోడీ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలను రెట్టింపు చేస్తే ఆదాయం రెట్టింపు అవుతుందనా లేక ఖర్చులన్నీ పోను వచ్చే మిగులు రెట్టింపు అవుతుందా అన్నది స్పష్టత లేదు. వ్యవసాయ ఖర్చులు ఒక రాష్ట్రంలోనే ప్రాంతానికి ప్రాంతానికి మారుతున్నాయి. కాలువల ద్వారా నీరు పారే ప్రాంతానికి బోర్ల ద్వారా నీటిని అందించే లేదా వర్షాధారిత చోట్లకు ఎంత తేడా ఉంటుందో తెలిసిందే. మన వ్యవసాయ వృద్ధి రేటు నిలకడగా ఉండటం లేదు. ఒక రంగంలో ఉండే జివిఏకు మరో రంగానికి పోలిక ఉండటం లేదు. ఉదాహరణకు మత్స్యరంగంలో ఏడుశాతం, హార్టీ కల్చర్‌లో 4.5, పశుసంపదలో 6శాతం ఉంది.2019 వ్యవసాయంపై క్రిసిల్‌ అధ్యయన నివేదికలో ఖరీఫ్‌ దిగుబడి మూడున్నర శాతం తగ్గుతుందని అంచనా వేసింది. అంటే రైతుల లాభం 10-12శాతం తగ్గిపోతుంది. నీతి అయోగ్‌ 2017లో రూపొందించిన పత్రంలో వార్షిక వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నది. కానీ మన సగటు మూడుశాతానికి మించటం లేదు. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం తీరిగ్గా రెండు సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రులతో ఒక ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసిందంటే ఆ వాగ్దాన అమలు తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశ్రద్ధ వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తిలోదకాలు ఇస్తున్న కారణంగా గత పాతిక సంవత్సరాలలో సగం రాష్ట్రాలలో ఒక్క ఎకరానికి కూడా నీటి పారుదల సౌకర్యం అదనంగా కలిగించలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం లేదా పాత ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోవటం, కాలువల చివరి భూములకు నీరందకపోవటం వంటి కారణాలతో కొన్ని చోట్ల వాస్తవ సాగు భూమి తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
ప్రపంచంలోనే మన మద్దతు ధరలు ఎక్కువగా ఉన్నాయనే గొప్ప గురించి చూద్దాం. ప్రపంచ దేశాలలో ధాన్యం ధరల గురించి మనకు సమాచారం అందుబాటులో లేదు. బియ్యం ధరలను ప్రాతిపదికగా తీసుకొని పరిశీలిద్దాం. ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేయటంలో మనమే ప్రధమ స్ధానంలో ఉన్నాం. మన తరువాత స్ధానాల్లో థారులాండ్‌, వియత్నాం, పాకిస్ధాన్‌ ఉన్నాయి. బియ్యాన్ని దిగుమతి చేసుకోవటంలో చైనా తొలి స్ధానంలో ఉంది. చైనా జనాభా 140 కోట్లయితే మనం 135 కోట్లు ఉన్నాం. మన దేశంలో 2019-20లో 1,17,939 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయగా చైనా 1,46,730 వేల టన్నులని అంచనా. మన దేశంలో ఈ మొత్తమే మూడేండ్లకు మిగుల్లో ఉండగా మన కంటే జనాభా, ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చైనా దిగుమతి చేసుకుంటోంది అంటే అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, జనం మన కంటే ఎక్కువ తింటున్నారని అర్ధం.
ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్ద (ఎఫ్‌ఏఓ) నిర్వహించే వివరాల ప్రకారం 2015 నుంచి 2019 సంవత్సరాలలో ఒక టన్ను ఎగుమతి చేసిన బియ్యానికి మన రకాలకు వచ్చిన ధర 337 నుంచి 361 డాలర్ల మధ్య ఉంది. ఏడాది సగటు 353 డాలర్లు. ఇదే కాలంలో థారులాండ్‌ బియ్యానికి వచ్చిన సగటు ధర 392 డాలర్లు, వియత్నాం బియ్యానికి 346, పాకిస్ధాన్‌ బియ్యానికి 336 డాలర్లు ఉంది. మనం పోల్చుకోవాల్సింది మన కంటే ఎక్కువ ధర వచ్చిన థారులాండ్‌తోనా తక్కువ వచ్చిన దేశాలతోనా ? అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టే దేశీయ మార్కెట్‌ ధరలు కూడా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఆ ఏడాది పంటలకు మద్దతు ధరలను అంతకు ముందు-తరువాత సంవత్సరాల కంటే కాస్త ఎక్కువగా పెంచిన తీరు కాంగ్రెస్‌-బిజెపి పాలన రెండింటిలోనూ గమనించవచ్చు. ఉదాహరణకు ధాన్యం, పత్తి విషయాలు తీసుకుందాం. గడచిన ఐదు సంవత్సరాలలో 2019లో ఎన్నికలకు ముందు 2015-16 నుంచి 2017-18 వరకు మూడు సంవత్సరాలలో సాధారణ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1410 నుంచి 1550కి(240) పెరగ్గా 2018-19లో రూ. 1750(200) పెరిగింది. తరువాత గత ఏడాది, ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు కలిపి పెంచింది రూ. 1868కి అంటే 118 మాత్రమే. పెరుగుదల రేటు తగ్గిపోయింది. పత్తి విషయం తీసుకున్నా ఇదే ధోరణి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పొడవు పింజ పత్తి ధర 2016-17కు రూ.4,160 నుంచి 2017-18లో రూ.4,320(120)కి పెరగ్గా 2018-19లో రూ.5,450(230) గత ఏడాది రూ100, ఈ ఏడాది రూ. 275 పెంచారు. నాలుగేండ్లలో ఏడాది సగటు 180 మాత్రమే ఉంది. ఈ తీరును గమనించినపుడు దిగుబడులు తక్కువగానూ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సమయంలో అన్ని రకాల ఖర్చులు, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచుతున్న మద్దతు ధరలు రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయంటే నమ్మే దెలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !

03 Wednesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Boycott of Chinese Products, China goods


ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్‌ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది.జూన్‌ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్‌ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్‌ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్‌ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ వాదులు బ్రిటీష్‌ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్‌ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్‌ వాంగ్‌చుక్‌ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్‌ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్‌, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్‌ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్‌ నుంచి టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌,విడ్‌మేట్‌ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్‌ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్‌ చైనా యాప్‌(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్‌ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్‌ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్‌ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్‌ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్‌ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్‌ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్‌ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్‌ వినియోగదారులు డౌన్లోడ్‌ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్‌ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా, మారిషస్‌ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్‌ హౌల్డింగ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని సింగపూర్‌ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్‌ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్‌ వాంగ్‌ చుక్‌ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్‌, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్‌, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్‌, ఫిన్లాండ్‌ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్‌ సోనీ, పానాసోనిక్‌, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్‌ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ నుంచి ఆత్మనిర్భరత వరకు….ఆరేండ్ల మోడీ పాలన ?

25 Monday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

India economy slowdown, Modi Six Years regime, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !
  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d