• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !

03 Wednesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Boycott of Chinese Products, China goods


ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్‌ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది.జూన్‌ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్‌ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్‌ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్‌ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ వాదులు బ్రిటీష్‌ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్‌ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్‌ వాంగ్‌చుక్‌ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్‌ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్‌, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్‌ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్‌ నుంచి టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌,విడ్‌మేట్‌ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్‌ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్‌ చైనా యాప్‌(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్‌ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్‌ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్‌ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్‌ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్‌ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్‌ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్‌ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్‌ వినియోగదారులు డౌన్లోడ్‌ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్‌ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా, మారిషస్‌ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్‌ హౌల్డింగ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని సింగపూర్‌ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్‌ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్‌ వాంగ్‌ చుక్‌ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్‌, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్‌, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్‌, ఫిన్లాండ్‌ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్‌ సోనీ, పానాసోనిక్‌, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్‌ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ నుంచి ఆత్మనిర్భరత వరకు….ఆరేండ్ల మోడీ పాలన ?

25 Monday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

India economy slowdown, Modi Six Years regime, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అన్నీ శుభసూచనలే అయినా నరేంద్రమోడీకి ఎందుకీ అపశకునాలు !

22 Friday May 2020

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Economic reforms In India, Failed Economic Reforms in India, India Economic slowdown, Narendra Modi, PM Modi, Unemployment Crisis In India

Slowdown blues: State of Indian economy and its fragile-five past ...

ఎం కోటేశ్వరరావు
కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న పిలుపులు, వాటి తీరుతెన్నులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మోడినోమిక్స్‌ ద్వారా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి గాను చేసిన కృషికి చరిత్రలో మన ప్రధానుల్లో ఎవరూ పొందని విధంగా రెండు సంవత్సరాల క్రితం సియోల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి, ప్రస్తుత మోడీ ఒకరేనా అన్న అనుమానం కలగకపోదు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎన్ని పిలుపులు, ఎంత హడావుడి చేశారు. గతంలో మాదిరి స్వదేశీ వస్తువులనే కొనండి అన్న పిలుపు తిరిగి ఇస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారేమో ” స్వదేశీ వస్తువులనే అడగండి ”(వోకల్‌ ఫర్‌ లోకల్‌ ) అని ఇచ్చిన పిలుపు నిజంగానే వీనుల విందుగా ఉంటుంది. నరేంద్రమోడీ, ఆయన మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పెద్ద స్వదేశీ లేదా భారతీయ నామాలు పెట్టుకొని జనం ముందు ప్రదర్శిస్తున్నా ఆచరణలో ఎక్కువగా విదేశీ వైపు మొగ్గుచూపటం నగ సత్యం. ప్రపంచ దేశాల వారందరూ వచ్చి మన దేశంలో ఖాయిలా పడిన లేదా అమ్మకానికి పెట్టిన కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించని, కొన్ని రంగాలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. అది ప్రపంచ వాణిజ్య సంస్ధ, స్వేచ్చా వాణిజ్య విధానాలకు వ్యతిరేకం అని చైనా విమర్శించింది. అయితే ఇదే మోడీ సర్కార్‌ చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇంతకాలం ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధించలేదు అన్న ప్రశ్నకు జవాబు లేదు. పెట్టుబడులు వద్దు-దిగుమతులు ముద్దు అని చెబుతారా ? పళ్లూడ గొట్టుకొనేందుకు అమెరికా రాయి హాయి నిస్తుంది, చైనా రాయి బాధనిస్తుంది అంటారా ?
మన దేశ ఆర్ధిక సంస్కరణల చరిత్రను చూసినపుడు అవి బాధ ఉపశమనానికి పైపూత ఔషధాల మాదిరిగా పని చేశాయి తప్ప చైనా మాదిరి మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగటానికి గానీ, సామాన్యుల జీవన స్ధితిగతులు మెరుగుపడేందుకు గానీ తోడ్పడలేదు. మన దేశమే కాదు అనేక లాటిన్‌ అమెరికా దేశాలు సంస్కరణల పేరుతో అనేక చర్యలు తీసుకున్నాయి ఏ ఒక్కటీ చైనా మాదిరి లబ్ది పొందలేదు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మనది ప్రజాస్వామ్యం అక్కడి మాదిరి మనకు కుదరదు అని ఎవరైనా చెప్పవచ్చు. అలాంటపుడు చైనాతో పోల్చుకోవటం ఎందుకు? త్వరలో చైనాను అధిగమిస్తామని ప్రగల్భాలు పలకటం ఎందుకు ? కమ్యూనిస్టు చైనా మాదిరిగాక పోతే మిగతా దేశాల మాదిరి పురోగమించకుండా అడ్డుకున్నదెవరు ? అత్యంత పేద దేశం, ఫ్రెంచ్‌, జపాన్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలు సాగిన వియత్నాం సాధించిన మేరకు అయినా మనం ఎందుకు ఎదగలేకపోయాం.2018లో ప్రపంచ ఎగుమతుల్లో మన దేశం 323,056,409,000 డాలర్లతో 18వ స్ధానంలో ఉండగా వియత్నాం 290,395,445,000 డాలర్లతో 22వ స్ధానంలో ఉంది. తొమ్మిదిన్నర కోట్ల జనాభాగల ఆదేశం ఎక్కడ 140 కోట్లు గల మనం ఎక్కడ ?

Slowdown: Does the Narendra Modi govt even understand what is ...
మన దేశంలో అమలు జరిపిన ప్రతి దశ సంస్కరణల లక్ష్యం గురించి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, పర్యవసాన మన మార్కెట్‌ను విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు, ద్రవ్యపెట్టుబడికి మరింతగా తెరవటమే అన్నది చేదు నిజం. స్వాతంత్య్రానికి ముందు పరాయి బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తే విదేశీ కార్పొరేట్లు ఇప్పుడు మనలను పరోక్షంగా నడిపిస్తున్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తే కాషాయ దళాలు వారికి సేవ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే విదేశీ పెత్తనం, కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి, ఆ ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు విదేశీ, కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నాయి. మన దేశ ఫెడరల్‌ వ్యవస్ధ మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వివిధ రంగాలలో రెగ్యులేటరీ వ్యవస్ధల ఏర్పాటుకు ఆద్యుడు బిజెపి నేత వాజ్‌పేయి, ఆయన హయాంలోనే నాంది పలికారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు కూడా అలాంటిదే. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగు వేశారు, ఆర్‌టిసి బస్సులకు ఈ రంగు వేశారంటూ గుండెలు బాదుకుంటున్న, సమర్ధించుకుంటున్న తెలుగుదేశం-వైసిపిలు రాష్ట్ర అధికారాలను హరించి వేసే ఈ బిల్లు విషయంలో కేంద్రానికి భజన చేస్తున్నాయి. తెలుగుదేశం బహిరంగంగా ప్రకటిస్తే వైసిపి తన వైఖరిని ప్రకటించేందుకు భయపడుతోంది.
దేశమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అన్న గొడవలో ఉంటే ఇక నరేంద్రమోడీ హయాంలో మరో దఫా సంస్కరణలకు ఇదే సరైన తరుణం అని కార్పొరేట్‌ మీడియా చెవిలో జోరిగలా తొలుస్తోంది. సినిమాల్లో క్లబ్‌డాన్సర్లు నృత్యం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటి తొలగిస్తూ జనాలకు మత్తు ఎక్కిస్తుంటారు. మన దేశంలో సంస్కరణల ద్వారా ఒక్కొక్క రంగాన్ని తెరుస్తూ అదే మాదిరి విదేశీ సంస్ధలకు కిక్కు ఎక్కిస్తున్నారు. ఒక మోజు తీరగానే కొంత కాలానికి మరో కొత్తదనం(సంస్కరణ) కావాలనే డిమాండు ముందుకు వస్తోంది. 1991 తరువాత ప్రతి సంస్కర్త పాలనాకాలం వైఫల్యంతోనే ముగిసింది. మరో ముఖ్య అంశం ఏమంటే 2014 ఎన్నికల్లో తప్ప అంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నిక సంకీర్ణ కూటములకే తీర్పు ఇచ్చింది. ఏక పార్టీ ఆధిపత్యం లేదు. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన వారు తమ వైఫల్యాలకు దాన్నొక కారణంగా చెప్పుకున్నారు. కిచిడీ ప్రభుత్వాలంటూ రాజకీయంగా బిజెపి ఆ పరిస్ధితిని బాగా వాడుకుంది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి అలాంటి సమస్యలు లేకుండా ఒకటికి రెండు సార్లు జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మేము సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి ఉంది, పూర్తి మెజారిటీ లేదు, ఉంటే మా తడాఖా ఏమిటో చూపే వారం అని చెప్పుకొనే అవకాశం లేకుండా చేశారు.
నిర్ణయాత్మక ప్రజాతీర్పే కాదు, నరేంద్రమోడీ నాయకత్వానికి గత ఆరు సంవత్సరాలలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ పాలనే సాగుతోంది. అయినా అనేక అంశాలలో గత రికార్డులను తలదన్నే వైఫల్యాలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాటికి తగిన చికిత్సబదులు వేరే మార్గాలను ఎంచుకొంటోంది. వాటికి మరో తరం సంస్కరణలు అని ముద్దు పేరు పెడుతోంది. 1991 సంస్కరణలతో ఎన్నో ఆశలు పెంచుకున్న నాటి యువతీ యువకులకు వరుస వైఫల్యాలకు కారణాలు తెలియటం లేదు. ఆ తరువాత పుట్టిన నేటి యువతరానికి అసలేం చేయాలో తోచటం లేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ చెల్లింపులు చేయాల్సిన దుస్ధితిలో ఆర్ధిక వ్యవస్ధ ఉన్న సమయంలో పివి నరసింహారావు 1991లో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. ఆ సమయంలో మన విదేశీ అప్పులో కేవలం ఏడుశాతమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 68.2శాతం ఉండగా 2018లో అవి గరిష్టంగా 80.2శాతానికి పెరిగాయి, ఈ ఏడాది జనవరి 11న రిజర్వు బ్యాంకు ప్రచురించిన సమాచారం ప్రకారం 77.8శాతం ఉన్నాయి. పివి నరసింహారావు సంస్కరణలు ప్రకటించిన తరువాత అవి 23శాతానికి పెరిగాయి. అందువలన ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం కోసమైతే సంస్కరణలు అవసరం లేదు. సంస్కరణలో భాగంగా పివి తన పాలనా కాలంలో రూపాయి విలువను గణనీయంగా తగ్గించారు లేదా పతనం అయ్యేట్లు చూశారు. 1991 మార్చినెలలో డాలరుకు రు.19.64 ఉన్నది కాస్తా 1996 నాటికి రూ.34.35కు పతనమైంది. గత ఆరు సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి విలువ రూ.61.14 నుంచి ప్రస్తుతం 75కు పడిపోయిన విషయం తెలిసినదే. వాజ్‌పేయి హయాం నాటి రూపాయి విలువ స్ధాయికి అయినా ఎందుకు పెంచలేదో , ఇలా ఎందుకు జరిగిందో, దాని వలన మనకు జరిగిన లాభ నష్టాలేమిటో అధికారం పక్షం చెప్పదు, ప్రతిపక్షం లేదా ఆర్ధికవేత్తలు చెప్పేదానిని అంగీకరించకపోగా ఎదురుదాడి చేసే ఒక నిరంకుశ పరిస్ధితిలో ఉన్నాం. బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ పాపాయి వంటి రూపాయిని బజారులో(మార్కెట్‌ శక్తులకు) వదలి పెట్టి మరింత బలహీనపరచకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? ఆయనలో మూర్తీభవించినట్లు చెప్పే భారతీయత, దేశభక్తి ఏమైనట్లు ?
ఇక పివి నరసింహారావు తరువాత పదమూడు రోజుల పాలనను పక్కన పెడితే 1998 నుంచి 2004వరకు అధికారంలో ఉన్న బిజెపి నేత వాజ్‌పేయి కూడా అనేక సంస్కరణలకు తెరతీశారు. ఆయన పాలనలో ప్రత్యేకత ఏమంటే మన విదేశీ అప్పులో 36శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 103శాతానికి పెరిగింది, అంతే కాదు ఆయన పాలన చివరి రెండు సంవత్సరాలలో మన విదేశీ వాణిజ్యం జిడిపిలో 1.5శాతం మిగులులో ఉంది. స్వాతంత్య్రం తరువాత అలాంటి పరిస్ధితి ఆయన ఏలుబడికి ముందూ, తరువాత కూడా లేదు. అయితే రూపాయి విలువ వాజ్‌పేయి హయాంలో రూ.37.16 నుంచి 45.95కు దిగజారింది. ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు పెట్రోలు, డీజిల్‌ మీద సబ్సిడీలను రద్దు చేశారు. మొత్తంగా తమ పాలనలో దేశం వెలిగిపోయింది అనే నినాదంతో ఎన్నికలకు పోయిన బిజెపి 2004లో ఘోరపరాజయం పాలైంది.

Decoding Slowdown: Dip in household savings, investment an ...
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ పరాజయాన్ని చూసిన తరువాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ చమురు సబ్సిడీలను తిరిగి ప్రవేశ పెట్టింది. తొలి ఏడాది రూ.5,430 కోట్ల నుంచి పదేండ్లలో రూ.1,60,000 కోట్లకు పెంచారు. యుపిఏ పాలనా కాలంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. సబ్సిడీ దాదాపు సున్నా నుంచి 1,38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. వాజ్‌పేయి హయాంలో దిగుమతి చేసుకున్న ఎరువులు పదిశాతం ఉంటే పదేండ్లలో 60శాతానికి పెరగటం దీనికి ఒక కారణం. ఈ కాలంలో చమురు ధరలు, దానికి అనుగుణంగానే దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు, వాటికి సబ్సిడీ విపరీతంగా పెరిగింది. మోడీ హయాంలో దిగుమతి ఎరువుల శాతం 30కి అటూఇటూగా ఉంటోంది. విపరీతంగా పెరిగిన చమురు, ఎరువులు, బొగ్గు దిగుమతి ఖర్చు కారణంగా యుపిఏ పాలనా కాలంలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగింది. పదేండ్లలో జిడిపిలో 1.5శాతం మిగులు నుంచి నుంచి 5.1శాతం లోటుకు చేరింది. పర్యవసానంగా విదేశీ అప్పుకు 103శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 68శాతానికి తగ్గిపోయింది. ఈ కాలంలోనే రూపాయి విలువ రూ .45.95 నుంచి 60.09కి దిగజారింది.
యుపిఏ పాలనా కాలంలో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి నాయకత్వం 2014లో అధికారానికి వచ్చిన తరువాత ఆ పతనాన్ని కొనసాగించి ప్రస్తుతం 75కు దిగజార్చింది. మోడీ తొలి మూడు సంవత్సరాల కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు 80శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చి ఆరవ తేదీ నాటికి కరంట్‌ ఖాతా లోటు 0.2 ఒకశాతానికి తగ్గిపోయింది. ఇది మన విదేశీ చెల్లింపులకు ఢోకాలేని స్ధితిని తెలుపుతోంది. అయితే ఇదే పరిస్ధితి కొనసాగుతుందని చెప్పలేము. లోటు పెరిగే కొద్దీ రూపాయి విలువ మీద వత్తిడి పెంచుతుంది. ఈ ఏడాది ఆఖరుకు 1.6శాతానికి లోటు పెరగవచ్చని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్ధాయిలో పడిపోవటంతో పరిస్ధితి ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని సానుకూల అంశాలు నరేంద్రమోడీ సర్కార్‌కు కలసి వచ్చినా అనేక రంగాలలో వైఫల్యం చెందటానికి కారణాలు ఏమిటి, దాన్నుంచి బయట పడేందుకు సర్కార్‌ తీసుకుంటున్న లేదా రాష్ట్రాలతో అమలు చేయిస్తున్న కార్మిక చట్టాల సవరణల వంటి సంస్కరణలు ఏమేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్న. కరోనా సంక్షోభం రాక ముందే అన్ని రంగాలలో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది. మాంద్యం లేదు గానీ మందగమనం ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. గతంలోనే అనేక కార్మిక చట్టాలను నీరు గార్చటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా వారే ఉన్నారు గనుక మరోసారి మిగిలిన వాటిని దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఓవర్‌ టైమ్‌ చేయించేందుకు వీలు కల్పించే పేరుతో పన్నెండు గంటల పని పద్దతిని అమలు చేయాలని అనేక చోట్ల ప్రతిపాదించారు. అంటే పని స్ధలాలకు దూరంగా ఉన్న కార్మికులు ఇండ్లకు వెళ్లేందుకు వీలు కలగదు, బ్రిటీష్‌ వారి కాలంలో మాదిరి పని చేసి ఇంటికి పోకుండా మరుసటి రోజు విధులకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేట్ల ముందే విశ్రమించే రోజులు వచ్చినా ఆశ్చర్య ం లేదు.
1971లో ఇందిరా గాంధీ జనం దృష్టిలో దేవత దుర్గాదేవి. పాక్‌ సేనలను లొంగదీసుకొని బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడిన సమయంలో ఆమె తిరుగులేని నేత. బంగ్లా విముక్తికి కొద్ది నెలల ముందు గరీబీ హఠావో పేరుతో మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తిరుగులేని విజయం సాధించారు. కానీ రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే పరిస్ధితులు మారిపోయాయి. కాలేజీ ఫీజుల పెంపుదల, అధిక ధరలకు వ్యతిరేకంగా విద్యార్ధులు ప్రారంభించిన ఉద్యమాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. బంగ్లా విముక్తి వంటి విజయం నరేంద్రమోడీ ఖాతాలో లేకపోయినా వివిధ కారణాలతో జనంలో పలుకుబడి కలిగి ఉన్నారు. సర్కార్‌ ఏలుబడిలో తీవ్ర సమస్యలున్నా అలాంటి ఉద్యమాలు లేవు.
1971లో పాక్‌ ఆర్మీతో తూర్పు పాకిస్ధాన్‌లో యుద్దం పదమూడు రోజులే జరిగినప్పటికీ అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారిందంటే అతిశయోక్తి కాదు.1971-72 మన జిడిపి వృద్ధి రేటు 0.9శాతమే. తరువాత రెండు సంవత్సరాలలో అనేక చోట్ల కరవు, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలు, బంగ్లా శరణార్దుల రక్షణ వంటి అంశాలు చుట్టుముట్టాయి. విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. పరిశ్రమల మూత, నిరుద్యోగం పెరుగుదల, 1973లో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం చమురు సంక్షోభానికి దారితీసి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కొద్ది వారాల్లోనే పీపా 60 నుంచి ఇరవై డాలర్లకు పడిపోతే నాడు కొద్ది రోజుల్లోనే మూడు నుంచి పన్నెండు డాలర్లకు పెరిగింది. మోడీకి ఎన్నో డాలర్లు మిగిలితే ఇందిరా గాంధీకి ఖర్చయ్యాయి. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే జనానికి పెరిగాయి, నేడు గణనీయంగా తగ్గినా పెరిగాయి. మోడీకి యుద్ధం లేదు, చమురు బిల్లు గణనీయంగా తగ్గింది గానీ జిడిపి వృద్ధి రేటు దిగజారింది. ఇందిరా గాంధీ నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇరవైశాతం పైనే ఉంది, దానికి తగినట్లు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం లేదు. చమురు ధరలు తగ్గి ప్రభుత్వం మీద ఆర్ధిక వత్తిడి గణనీయంగా తగ్గినా చమురు పన్ను ఒక ఆదాయవనరుగా మార్చు కుంది.2014లో లీటరు పెట్రోలు మీద రూ.9.48 ఉంటే ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.32.98కి మోడీ సర్కార్‌ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ మీద ఒక లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పదమూడు- పద్నాలువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా అంటే అదనంగా సాధారణ రోజుల్లో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తం అదనం అయితే పెట్రోలు, డీజిల్‌ సబ్సిడీ ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయింది. 2004-05 నుంచి 2018-19 వరకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం 10,99,234 కోట్ల రూపాయలు. అయితే 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే పెట్రోలియం ఉత్పత్తుల మీద వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 11,90,777 కోట్లు అన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు ?
2014 మార్చి ఒకటవ తేదీన ముడిచమురు పీపా ధర 118 డాలర్లు ఉన్నపుడు వినియోగదారుడికి ఢిల్లీలో రూ.73.20 పెట్రోలు దొరికింది, ఈ ఏడాది మే 22న పీపాధర 33.25 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోలు ధర రూ.71.30 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి చమురు ధరల పెంపు తగ్గింపు అనే విధానాన్ని గత రెండునెలలుగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పాలకులు సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతామని చెపితే నమ్మటం ఎలా ?
ఒకవైపు జనం మీద బాదుడు, మరోవైపు చమురు బిల్లు తగ్గుదల, అనేక ఆర్ధిక సూచికలు గతంతో పోల్చితే బాగున్నప్పటికీ అభివృద్ధి జాడల్లేవు. ప్రపంచంలో అభివృద్దికి పలు నమూనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దానితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ నమూనాను అభివృద్ధి చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని దేశమంతటా విస్తరించకుండా విదేశాలు, విదేశీ కార్పొరేట్ల కోసం వెంపర్లాడటం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారు లేరు.

Economic Crisis: View: India's economic crisis can bring about ...రిజర్వుబ్యాంకు శుక్రవారం నాడు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తీరు చూస్తుంటే వడ్డీ సంగతి తరువాత ఒక రూపాయి అప్పు తీసుకుంటే మరో రూపాయి ఉచితం అనే రోజులు వస్తాయా అని పిస్తోంది. రుణాలు తీసుకొనే వారు లేరు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బలహీనమైనదో అర్ధం అవుతోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 2.5 నుంచి మైనస్‌ 3.6శాతానికి దిగజార నుందని రేటింగ్‌ సంస్ధ గోల్డ్‌మాన్‌ శాచస్‌ తాజా అంచనాలో పేర్కొన్నది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఈ అంచనా ఎలా మారుతుందో తెలియదు. 2020-21లో మన జిడిపి రేటు మైనస్‌ ఆరు, ప్లస్‌ ఒక శాతం మధ్య ఉండవచ్చని పదిహేనవ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎన్‌కె సింగ్‌ జోశ్యం చెప్పారు. ఇవన్నీ నిజానికి ఆందోళనకర వార్తలు. మరోవైపు చైనాలో వృద్ధి రేటు కనిష్టంగా 1.8శాతం ఉంటుందని అంచనాలు వెలువడతున్నప్పటికీ తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించే స్ధితిలో లేమని చైనా ప్రధాని శుక్రవారం నాడు ప్రకటించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో బ్యాంకుల నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరిగిపోవటం, ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు వాటిని రద్దు చేయటం చూశాము. వీటిలో కావాలని ఎగవేసిన వాటితో పాటు ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు కూడా కనిపిస్తోంది. మోడీ సర్కార్‌ గత ఏడాది కాలంలో క్రమంగా వడ్డీ రేట్లను ఎంత తగ్గించినా, తీసుకొనే వారు కనిపించకపోవటం పలుమార్లు కోత పెడుతోంది. మన మీద ఏ విదేశీ ఆంక్షలు లేవు, విదేశీ కంపెనీలు తమ లాభాలను స్వేచ్చగా తరలించుకుపోయేందుకు ద్వారాలను ఎప్పుడో తెరిచి ఉంచాము. అయినా పెట్టుబడులు రావటం లేదు.
మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని తగ్గించాల్సి ఉంటుంది, అదే జరిగితే బ్యాంకుల్లో సొమ్ముదాచుకొనే వారు తగ్గిపోతారు. అది సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.దీన్ని ఆసరా చేసుకొని ద్రవ్యపెట్టుబడికి దారులు తెరిచేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త వాదనలను ముందుకు తెచ్చింది. అదే విదేశాల్లో డాలర్‌ రుణాలను ప్రభుత్వమే తీసుకోవటం. ఇదొక ప్రమాదకరమైన క్రీడకు పూనుకోవటమే. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా ఆ మేరకు బ్యాంకులు తమ ఖాతాదార్లకు బదలాయించటం లేదన్నది ఒక వాస్తవం.స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
ఏ దేశానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతామంటే ఎలా ? కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పిపిఇ, మాస్కులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఒక వైపు వలస కార్మికులు మాటిక్కెట్లను మా డబ్బులతో కొంటాం మా స్వంత ఊళ్లకు పంపండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోని పాలకులు మన జనాన్ని చంద్రుడి మీదకు అంతరిక్షయానం చేయించేందుకు విదేశీ కంపెనీలతో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు. అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు తిరస్కరించినపుడు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా సాయంతో మన ఇస్త్రో శాస్త్రవేత్తలు గణనీయమైన విజయాలు సాధించారు. ఇవాళ్లగాకపోతే రేపు ఇప్పుడు చౌకగా రాకెట్లను, ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లే అంతరిక్ష యానం కూడా చేయించగల సత్తా ఉంది. వారిని అవమానించే విధంగా ఇప్పుడు ప్రయివేటు విదేశీ కంపెనీలను రమ్మంటున్నారు. సంస్కరణల్లో భాగంగా మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ప్రయివేటు కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సౌకర్యాలను వినియోగించుకోవటం అంటే పుట్టా గుట్టా కొట్టి పెంచిన చెట్లు కాయలు కాసే తరుణంలో వాటికి నీరు పోసి పండ్లు కోసుకుపోయేందుకు వేరే వారికి అప్పగించటం తప్ప మరొకటి కాదు.

Where Are The Jobs? There Is A Real And Growing Unemployment Crisis In India
కరోనా సహాయచర్యలకు డబ్బులేదు , కావాలంటే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ సమయంలోనే ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణం పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేయనుంది. ఇప్పుడు ఉన్నవాటితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వర్షాకాలంలో మన ఇండ్ల మాదిరి అవేమీ కారటం లేదు, వేసవి వస్తే వాటిలో ఉండేవారికి వడదెబ్బ తగలటం లేదే ? న్యూఢిల్లీలో కొత్తగా పర్యావరణానికి, వారసత్వ నిర్మాణాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అనేక మంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.1970 దశకంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీకి ఏడాదికి యాభైవేల మారుతీ కార్ల తయారీకి ఇందిర ప్రభుత్వం లైసెన్సు ఇస్తే ఆర్దిక సంక్షోభ సమయంలో కార్లు అవసరమా అంటూ ఆ రోజు ధ్వజమెత్తిన ప్రతిపక్షాలలో నేటి బిజెపి పూర్వరూపం జనసంఫ్‌ు కూడా ఉంది. అదేమీ ప్రభుత్వ పెట్టుబడితో సంజయ గాంధీ స్వంతానికి పెట్టే కంపెనీ కాదు. అదే విమర్శ ఇప్పుడు బిజెపికి సైతం వర్తించదా ? ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం తరలింపును, తెలంగాణాలో నూతన సచివాలయ, అసెంబ్లీ భవనాల నిర్మాణాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి న్యూఢిల్లీలో చేస్తున్నదేమిటి ? కరోనా పరీక్షలకు నిధులు కేటాయించని కేంద్రం ఆర్ధికంగా దిగజారిన స్ధితిలో ఒకవైపు జనాల మీద పన్నులు బాదుతూ అన్నివేల కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేయటం అవసరమా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి వైఖరి కనిపించటం లేదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా సాయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మోడీ తక్కువ ఇచ్చారా ?

20 Wednesday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Greek, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic package, imran khan, Narendra Modi, narendra modi vs imran khan, World Bank on covid-19 packages

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈ నిస్సిగ్గు, పట్టపగలు చమురు దోపిడీ ఇంకెంత కాలం నిర్మలమ్మగారూ ?

02 Saturday May 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Fuel Price in India, Global Crude oil price of Indian Basket, oil price in India

West Bengal Congress on Twitter: "Our Prime Minister is so busy to ...

ఎం కోటేశ్వరరావు
యాభై మంది ప్రముఖులకు 68వేల కోట్ల రూపాయల రణాల రద్దు గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మనకైనా అంతే కదా ఉన్నమాటంటే ఊరుకుంటామా ! దేశ పౌరులను తప్పుదారి పట్టించేందుకు సిగ్గు లేని రీతిలో ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద మాట వాడారు. అధికారంలో ఉన్నారు , జనం కాంగ్రెస్‌ను చులకనగా చూస్తున్నారు కనుక ఎంతమాటైనా అంటారు. రుణాల రద్దు అంటే రద్దు కాదు కావాలంటే మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. సరే రాహుల్‌ గాంధీ ఇప్పటికీ పరిణితి లేని కుర్రాడు, కాంగ్రెస్‌ కనుక దాని పూర్వీకులు చేసిన నిర్వాకాలను బిజెపి వారు మీ సంగతేమిటని జనం నిలదీసే వరకు నిందిస్తూనే ఉంటారు- ఆ విషయాన్ని వదలి వేద్దాం.
నిర్మలమ్మ గారు తమ నేత ప్రధాని నరేంద్రమోడీ గారిని అడిగి యావత్‌ దేశానికి చెప్పాల్సిన అంశం గురించి ఇక్కడ చూద్దాం. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయిలో పతనమయ్యాయి. వారి మధ్య సయోధ్య కుదిరిన తరువాత కూడా ధరల పతనం ఆగలేదు. అమెరికాలో చమురు నిల్వ చేసేందుకు ఖాళీ లేకపోవటంతో ఎదురు డబ్బు ఇచ్చి చమురును వదిలించుకోవాల్సి వచ్చింది. చమురు చౌకగా వస్తోంది కనుక కేంద్ర ప్రభుత్వ బిల్లు కూడా గణనీయంగా తగ్గుతుంది.
గతేేడాది డిసెంబరు నెలలో సగటున ఒక పీపాను 66 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడు ధర వినియోగదారుడికి లీటరు పెట్రోలు ఢిల్లీలో 75.14 ఉండేది. 2015లో ఇదే సర్కార్‌ ఏలుబడిలో పీపా 35.68 డాలర్లకు కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ.59.98కి విక్రయించారు. ఇంకాస్త ముందుకు పోతే 2004లో పీపా ధర 34.22 డాలర్లు ఉన్నపుడు రూ.35.71కి దొరికింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక మరియు విశ్లేషణ విభాగం మే ఒకటవ తేదీ నవీకరించిన సమచారం ప్రకారం మార్చినెలలో ఒక పీపా చమురు సగటున మన దేశం 33.36 డాలర్లకు దిగుమతి చేసుకుంది. అది ఏప్రిల్‌ నెలలో 19.9డాలర్లకు పడిపోయింది. శుక్రవారం నాడు ధర 17.23 డాలర్లకు తగ్గింది. ఒక రోజు తగ్గవచ్చు మరో రోజు పెరగవచ్చు. కానీ ఆమేరకు వినియోగదారులకు మార్పులు జరగటం లేదు. మార్చినెల 16 నుంచి మే రెండవ తేదీ వరకు ఢిల్లీలో పెట్రోలు లీటరు రు.69.59 ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశమంతటా ఇదే విధంగా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ధరల విధానంలో ఏదైనా మార్పులు ప్రకటించిందా అంటే అదేమీ లేదు. మరో పద్దతిలో నిర్మలా సీతారామన్‌ పదజాలంలో చెప్పాలంటే చమురు వినియోగదారులను సిగ్గులేని రీతిలో పట్టపగలే వినియోగదారుల జేబులు కొట్టి వేస్తున్నారు. ప్రభుత్వ చమురు కంపెనీలు దోపిడీ చేస్తూ ప్రయివేటు చమురు కంపెనీలను కూడా దోచుకొనేందుకు వీలు కల్పిస్తున్నాయి. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోలు మీద లీటరుకు మూడు రూపాయల చొప్పున పన్ను పెంచింది. రాబోయే రోజుల్లో మరో ఎనిమిది రూపాయలు పెంచుకొనేందుకు పార్లమెంట్‌లో ముందస్తు ఆమోదం తీసుకుంది. మన పార్లమెంట్‌ సభ్యులు దీనికి ఎందుకు ఆమోదం తెలిపారో అడిగే పరిస్దితి మనకు ఉంటే ఇలా జరిగేదా ?నరేంద్రమోడీగారి అచ్చేదిన్‌లో ఇదేమి దోపిడీ ?

3 reasons why fall in crude prices won't benefit India - Rediff ...
ఇంతగా చమురు ధరలు పడిపోయినా వినియోగదారులకు ఎందుకు తగ్గించటం లేదు ?
చమురు ధరల్లో పెద్దగా తేడాలు లేని రోజుల్లో ప్రతి రోజు ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గించిన, పెంచిన రోజులు కూడా ఉన్నాయి. చూశారా మోడీ సర్కార్‌ వినియోగదారుల పట్ల ఎంత నిజాయితీగా ఉందో అని వంది మాగధులు పొగిడారు. ఇప్పుడు అసాధారణ రీతిలో చమురు ధరలు పడిపోయినందున పైసలు కాదు పదుల రూపాయలు తగ్గించాలి. పైసలంటే ఏదో కాని ఇంత పెద్ద మొత్తం తగ్గిస్తామా అన్నట్లుగా ఇప్పుడు సర్కార్‌ వ్యవహరిస్తోంది. గుండెలు తీసిన బంట్లు అంటే ఈ పాలకులేనా ? చమురు ధరలను ఎందుకు తగ్గించటం లేదో చూద్దాం.
1. ఇప్పటికే ధనికులకు ఇచ్చిన రాయితీలు, ధనికులు కావాలని ఎగవేసిన బ్యాంకు రుణాలు రద్దు చెయ్యటం, బ్యాంకులకు ఆ మేరకు ప్రభుత్వం నిధులు సమకూర్చటం. ఈ విధానాల పర్యవసానం ఖజనా గుల్లకావటం, దాన్ని పూడ్చుకొనేందుకు చమురు ధరల రూపంలో అందరి ముందే వినియోగదారుల జేబులు కొల్లగొట్టి లోటును పూడ్చుకొనేందుకు ఈ పని చేస్తున్నారు. మనం ఇంతకు ముందే చమురు దెబ్బలు తినేందుకు అలవాటు పడి చర్మం మొద్దుబారిన కారణంగా ఇదేమీ అనిపించటం లేదు, దీనికి తోడు గృహబందీల మయ్యాం. నోరెత్తితే దేశద్రోహం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ద్రవ్యలోటు జిడిపిలో 3.5శాతానికి మించకూడదు. ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాల కారణంగా ఈ ఏడాది ద్రవ్యలోటు ఏడుశాతం వరకు ఉండవచ్చని ముంబైకి చెందిన స్టాక్‌బ్రోకరేజ్‌ సంస్ధ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏప్రిల్‌13న ఒక నివేదికలో హెచ్చరించింది. మన జిడిపి వృద్ధి రేటు ఒక శాతానికి అటూ ఇటుకు దిగజారవచ్చన్న అంచనాల పూర్వరంగంలో లోటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. కనుక లోటు పూడ్చుకొనేందుకు ఇదొక మార్గం.
2. చమురు ధరలను తగ్గిస్తే కేంద్రానికి వచ్చే పన్ను ఆదాయం స్ధిరంగానే ఉంటుంది. ధరల మీద శాతాల ప్రాతిపదికన రాష్ట్రాలు వ్యాట్‌ విధిస్తున్నందున చమురు జారీ ధరలు తగ్గితే రాష్ట్రాలకు ఆదాయం పడిపోతుంది.అఫ్‌కోర్సు మిగిలిన రాష్ట్రాలకు సైతం ఉపయోగపడినా మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలోనే ఉన్నాయి కనుక వాటికి ఆదాయం తగ్గకూడదు.
3. గృహబందీ కారణంగా రవాణా రంగం స్ధంభించింది, సాధారణ వినియోగం తగ్గింది, తిరిగి ఎంతకాలం తరువాత పూర్వపు స్ధితి ఏర్పడుతుందో తెలియదు కనుక చమురు రంగంలో ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నందున లావాదేవీలు తగ్గినా లాభాలు తగ్గకుండా చూసేందుకు అధిక ధరలను కొనసాగిస్తున్నారు.
4. రూపాయి విలువ పతనాన్ని నిలబెట్టటంలో కేంద్ర సర్కార్‌ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏడుశాతం పతనమైంది. రికార్డు స్ధాయిలో 76.92కు పడిపోయింది, 80కి దిగజారవచ్చని అంచనాలు. అదృష్టం ఏమిటంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
5. ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు గుడ్ల కోసం బంగారు బాతులను కోయాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే భారత్‌ పెట్రోలియంలో వాటాలను అమ్మి ఈ ఏడాది అరవై వేల కోట్ల రూపాయలను ఖజనాకు జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. చమురు ధరలను తగ్గిస్తే ఆ సంస్ధ లాభాలు తగ్గి వాటా విలువపడిపోతుంది. దాంతో తెగనమ్మితే నష్టం కనుక వాటిని అమ్మేంతవరకు కంపెనీకి లాభాలు తగ్గకుండా చూడాలంటే చమురు ధరలను తగ్గించకూడదు. ముందస్తు ధరలకు చమురు కొనుగోలు చేస్తాము. అయితే ఆ ధరలు ఖరారు అయిన తరువాత చమురు ధరలు భారీగా పడిపోయినందున వచ్చే నష్టాలను చమురు కంపెనీలు పూడ్చుకోవాలి కనుక ధరలు తగ్గించటం లేదు. అంతే కాదు ప్రపంచ వ్యాపితంగా శుద్ధి చేసిన చమురుకు డిమాండ్‌ పడిపోయింది. అందువలన శుద్ధి కర్మాగారాలు పూర్తి స్ధాయితో పని చేస్తే చమురు నిల్వ సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో కూడా అదే పరిస్ధితి ఏర్పడింది.తాత్కాలికంగా అయినా అవసరాలకు మించి చమురుశుద్ధి సామర్ద్యం ఉంది. ఈ దశలో డిమాండ్‌ లేనపుడు కంపెనీల వాటాలకు డిమాండ్‌ పడిపోతుంది. ఏనుగు వంటి బిపిసిఎల్‌ను కొనేందుకు ఈ దశలో ఎవరు ముందుకు వస్తారు? కంపెనీ వాటాల అమ్మకపు దరఖాస్తుల గడువును జూన్‌ 13వరకు ప్రభుత్వం గడువు విధించింది. అప్పటికి పరిస్ధితికి ఇంకా దిగజారితే… వేరే చెప్పాల్సిందేముంది ?
6.కేంద్ర ప్రభుత్వం మరో విధంగా కూడా చమురు ధరలతో ఖజనా నింపుతోంది. ఇప్పుడు ధరలు రికార్డు స్ధాయిలో పడిపోయినందున ఎంత ఎక్కువ ముడి చమురుకొని నిల్వచేస్తే ఒక వేళ రాబోయే రోజుల్లో ధరలు పెరిగితే ప్రభుత్వానికి అంతగా లాభం.ఒక వైపు వినియోగం పడిపోతున్నా కేంద్ర సర్కార్‌ చమురు కొనుగోళ్లను పెంచింది. అయితే చమురు ధరలు తగ్గినపుడల్లా వినియోగదారుల పన్ను రేటు పెంచి 2014-19 మధ్య కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందింది.
మరికొన్ని అంశాలను కూడా చూద్దాం. వర్తమాన ఖాతా లోటు (కరెంట్‌ ఎకౌంట్‌ ) ఇటీవలి కాలంలో మెరుగుపడింది. అయితే రూపాయి విలువ పతనం ఆ మెరుగుదలను దెబ్బతీస్తుంది. మార్చినెలలో మన విదేశీమారక ద్రవ్య నిల్వలు 475బిలియన్‌ డాలర్లు అయితే వాటిలో 300బిలియన్‌ డాలర్లు ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌(ఎఫ్‌పిఐ) ఖాతాలోనివే. అంటే విదేశీయులు మన దేశంలోని బ్యాంకుల్లో దాచుకొనే సొమ్ము, మన కంపెనీల వాటాలు, మనకు అప్పులు ఇచ్చిన మొత్తాలు. ఇవి కొన్ని సందర్భాలలో స్పెక్యులేషన్‌ కోసం కూడా వస్తాయి. అప్పులకు ఒక కాల పరిమితి ఉంటుంది తప్ప మిగిలిన వాటికి స్ధిరత్వం ఉండదు, లాభసాటిగా ఉంటే ఉంటాయి లేకపోతే నవారు అట లేదా పుల్ల ఆటగాండ్ల మాదిరి బిచాణా ఎత్తివేస్తాయి. మన వర్తమాన ఖాతా లోటు తగ్గటం అంటే మన విదేశీ మారక ద్రవ్య అవసరాలు తగ్గటం లేదా గణనీయంగా ఆ మొత్తాలు ఉండటం. అలా ఉండటం అంటే ఎప్‌పిఐలను మన ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షించే శక్తి పరిమితం అని భావిస్తారు.
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే ధరల పెరుగుదల రేటు పడిపోతుంది. అయినా కేంద్రం పైన చెప్పుకున్న ఇతర కారణాలతో జనానికి ధరలు పెరిగితే మాత్రం ఏం అన్నట్లుగా చమురు ధరలను తగ్గించటం లేదు. పీపా ముడి చమురు ధరలో ఒక డాలరు తగ్గితే లీటరు డీజిల్‌ లేదా పెట్రోలుకు 50పైసలు తగ్గించవచ్చని చెబుతారు. ఇదే కాదు ముడి చమురు నుంచి వచ్చే నాఫ్తా వంటి ఉత్పత్తుల ధరలు కూడా తగ్గి ఎరువుల ధరలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఎరువుల ధరలు తగ్గించలేదు.

India imports more oil in 5 years of Modi Govt; 10% import cut by ...
గృహబందీ ఏప్రిల్‌ 14వరకు కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం రెండు నుంచి మూడుశాతం మధ్య పడిపోవచ్చని క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు మే 17వరకు కేంద్రం పొడిగించింది, తరువాత అయినా ఎత్తివేస్తారన్న హామీ లేదు, కరోనా వ్యాప్తి కేసులు వేగంగా పెరుగుతున్నందున తరువాత కూడా పొడిగించినా ఆశ్చర్యం లేదు. మన దేశంలో 15మిలియన్‌ టన్నుల చమురు నిల్వ సామర్ధ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుతం 5.3మిలియన్‌ టన్నులు మాత్రమే నిల్వచేయగలం. మిగతా ఏర్పాట్లు పూర్తి కాలేదు. కనుక ప్రపంచ మార్కెట్లో ఎవరైనా ఉచితంగా ఇస్తామని చెప్పినా మనం చమురు తెచ్చుకోలేని పరిస్ధితి.
తాను వస్తే మంచి రోజులను తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ జనం చచ్చేట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత ఎక్సయిజు పన్ను పెట్రోలు మీద 142, డీజిల్‌ మీద 318శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇంకా పెంచేందుకు అనుమతి తీసుకున్నారని ముందే చెప్పుకున్నాము.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. ఈ విధానం నుంచి గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఎందుకు వైదొలగిందో, ఎంతకాలం ఇలా అధిక ధరలకు విక్రయిస్తారో ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు ప్రధాని నరేంద్రమోడీని అడిగి చెబుతారా ?
బిజెపి వారు ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చేందుకు పేటెంట్‌ తీసుకున్నారు, అదే ఇతరులు పోలిస్తే దేశద్రోహం, తుకడే తుకడే గ్యాంగులంటూ దాడి చేస్తారు. గత నెల 27న ప్రపంచంలో పెట్రోలు లీటరు సగటు ధర 92 సెంట్లు(డాలరుకు వంద సెంట్లు). మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్ధాన్‌లో 60,భూటాన్‌లో 65,నేపాల్లో 79, చైనాలో 83, శ్రీలంకలో 84, మన దేశంలో 95 సెంట్లు కాగా బంగ్లాదేశ్‌లో 105 సెంట్లు ఉంది. బంగ్లా మినహా మిగిలిన దేశాలలో రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయో ఆర్ధిక మంత్రి చెబుతారా ? బిజెపి మరుగుజ్జులు ఈ వాస్తవాలను కాదనగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ ముట్టడి – రక్షణ కరవైన కర్షకులు !

25 Saturday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic Agriculture, Covid-19 lockdown, India’s farmers, India’s farmers feed produce to animals

Saving the food value chain amid Covid lockdown - The Hindu ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తోంది. కర్షకులను అయోమయంలోకి నెడుతోంది. ఎటు నుంచి ఎవరి మీద దాడి చేస్తుందో తెలియని స్ధితి. కనిపించే, చేతికి చిక్కే శత్రువుతో పోరాడగలం గానీ వైరస్‌లు సాధారణ కంటికి కనపడవు, ఉన్న ఔషధాలతో అంతం కావు. ఒక దానికి వ్యాక్సిన్‌ తయారు చేస్తే అది మార్కెట్లోకి వచ్చే సరికి వైరస్‌లు తమ స్వభావాన్ని మార్చుకోవటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కరోనా కూడా అలాంటిదే, ఇప్పటికి 33 మార్పులకు లోనైనట్లు గుర్తించారు. ఇంకా ఎన్ని విధాలుగా మారి ప్రపంచం మీద దాడి చేయనుందో తెలియదు. అంతిమంగా ఏ వైరస్‌ను అయినా అదుపు చేయగలం లేదా అది బలహీనమై పోయి మానవ శరీరాల చేతిలోనే చావు దెబ్బలు తింటుందన్నది గత చరిత్ర. అయితే ఇప్పుడు కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. మే మూడవ తేదీతో గృహబందీ(లాక్‌డౌన్‌) ఎత్తివేస్తారని భావిస్తున్నప్పటికీ ఇది రాస్తున్న సమయానికి వైరస్‌ వ్యాప్తిని చూస్తే కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ మే నెలాఖరు వరకు, పరిస్ధితి విషమిస్తే తరువాత కూడా కొనసాగవచ్చన్నది ఒక అభిప్రాయం. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ఏరువాక దగ్గరపడుతుండటంతో ఏమి చేయాలో తోచని స్ధితి అంటే అతిశయోక్తి కాదు.
కరోనా మహమ్మారి ప్రపంచం మీద ఎలా పర్యవసానాలకు నాంది పలుకుతుందో, అవి ఏవిధంగా ఉంటాయో వైరస్‌ తీరుతెన్నుల మాదిరే తెలియటం లేదు. క్షణ క్షణానికి వైరస్‌ రోగులు, మరణాల సంఖ్య మారుతున్నట్లే ఒక రోజు వేసిన అంచనాలు మరో రోజుకు పాతబడి పనికి రాకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగం మీద ప్రభావాలను ఈ సందర్భంగా చూద్దాం. మన దేశంలో 50 నుంచి 60శాతం వరకు జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సరిగ్గా పొలాల నుంచి వివిధ పంటలు ముఖ్యంగా రబీ, దోఫసలీ(దీర్ఘకాల) పంటలు రైతుల ఇండ్లకు వచ్చే సమయంలో వైరస్‌ వ్యాప్తి కారణంగా గృహబందీని ప్రకటించారు. ఫలితంగా రైతాంగం, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పంటలను కోసే దిక్కు లేకుండా పోయింది కొన్ని చోట్ల, యంత్రాలు ఒక ప్రాంతం నుంచి మరోచోటికి తరలే అవకాశాలు లేక కూలీల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల చెరకు, మిర్చి కోతలకు వచ్చిన వలస లేదా అతిధి కూలీలు సీజను ముగిసి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకు పోయారు. అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి వంటికి తడిచిపోయాయి. పండ్లు కోసేవారు, కోసినా మార్కెట్లకు తరలించే సదుపాయాల్లేక చెట్ల మీదనే పండిపోతున్నా రైతాంగం గుడ్లప్పగించి చూస్తూ వదలివేయటం తప్ప మరొకటి చేయలేని స్ధితి.అన్ని చోట్లా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావటం లేదు. ముఖ్యంగా పంట్ల తోటల రైతాంగ పరిస్ధితి దారుణంగా తయారైంది. పంటలు కాస్త బాగా పండాయి అనుకున్న స్ధితిలో గృహబందీ దేశంలోని 14 కోట్ల రైతు కుటుంబాలకు పిడుగుపాటులా మారింది.
మన దేశ వ్యవసాయ రంగంలో పరిస్ధితిని చూద్దాం. కరోనా వైరస్‌ రాక ముందే గతేడాది మధ్య నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ముఖ్యంగా ఉల్లి, బంగాళాదుంపలు, కూరగాయల వంటి వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుదల నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గినా మిగతావి తగ్గలేదు. తరువాత కరోనా కారణంగా డిమాండ్‌ బలహీనపడి ద్రవ్యోల్బణం తగ్గవచ్చని మార్చి 27న ఆర్‌బిఐ ఒక నివేదికలో పేర్కొన్నది. 2018-19 కంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20లో 2.4శాతం పెరిగి 29.2 కోట్ల టన్నులకు పెరగవచ్చని అంచనా. మార్చి ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్ధ వద్ద7.76 కోట్ల టన్నుల ధాన్యం నిలవ ఉంది. వ్యూహాత్మక, అత్యవసరాలకోసం అవసరమైన 2.14 కోట్ల టన్నుల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ. రబీ పంట సేకరణ కూడా జరిగితో మరో మూడు కోట్ల టన్నులు పెరుగుతాయని అంచనా.

Flower trade wilts under lockdown across the country - The Hindu ...
దేశంలో భిన్నమైన వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి. పంటలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులకు ప్రకటించిన ఉద్దీపన లక్షా 70వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇది జిడిపిలో కేవలం 0.7శాతమే. కనీసం ఐదు నుంచి పదిశాతం వరకు సాయం చేయాలన్న సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. అంతకు మించి రైతు ప్రతినిధులతో కనీసం చర్చలే జరపలేదు. అడిగితే ఎంతో కొంత సాయం చేయాల్సి వస్తుందన్న కారణంతో గావచ్చు రాష్ట్రాలను ప్రతిపాదనలు పంపమని కూడా అడగలేదు. కేంద్ర ప్రకటించిన మొత్తంలో ఇరవైవేల కోట్ల రూపాయలు గతంలోనే ప్రకటించి పిఎం కిసాన్‌ పధకం కింద మూడు విడతలుగా అందచేసే ఆరువేల సాయంలో మొదటి విడత రెండు వేల రూపాయలను ముందుగా విడుదల చేయటం తప్ప అదనపు సాయం కాదు. ఇక వ్యవసాయ కూలీలకు పని లేకుండానే స్వల్ప మొత్తంలో 182 నుంచి 202కు వేతనం పెంచి అదే పెద్ద సాయం అన్నట్లుగా చిత్రించారు. వచ్చే మూడు మాసాలకు అదనపు ఆహార ధాన్యాలు, జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల రూపాయల చొప్పున మూడు నెలలపాటు ఇస్తామని ప్రకటించారు. ఇవిగాక పిఎం కేర్‌ నిధుల నుంచి వలస, అసంఘటిత కార్మికులకు మరికొంత సాయం చేస్తామని చెప్పారు. ఇవి అవసరాలతో పోలిస్తే నామమాత్రమే. రైతాంగ రుణాలకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు మూడు శాతం వడ్డీ రాయితీతో రుణాలను మే31వరకు మూడునెలలు వసూలు వాయిదాను ప్రకటించారు. అసలు పంటలే అమ్ముకోలేని స్ధితి, అమ్ముకున్నా కనీస మద్దతుధరల కంటే వందల రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తున్న రైతాంగానికి ఇవి కంటి తుడుపు మాత్రమే.
ఈతి బాధలు, కరోనా వంటి మహమ్మారులు తలెత్తినపుడు మన దేశంలో ముందు ప్రభావితులౌతున్నది రైతాంగంలో 85శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులు దెబ్బతిని వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు మరలిన పేదలే అన్నది స్పష్టం. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పని చేసే వారికి కొంతమందికైనా ఏదో ఒక సామాజిక రక్షణ ఉంటుంది. గ్రామీణ కార్మికులకు అవేమీ ఉండవు. కరోనా ఉద్దీపన పేరుతో తీసుకుంటున్న చర్యలు మొత్తంగా వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరొకటి కాదన్నది తేలిపోయింది. పాస్ఫరస్‌, పొటాసియం ఉండే ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు గృహబందీ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది ఇది బడ్జెట్‌లో ప్రకటించిన దానికి అదనం అనుకుంటున్నారు, కానే కాదు. ప్రతి ఏడాది ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తాలు 75వేల కోట్ల రూపాయలకు మించటం లేదు. దానిలోనే ఒక ఎరువుకు తగ్గించినా, మరొకదానికి పెంచినా సర్దుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరిగింది. రూపాయి విలువ మరింత దిగజారిన కారణంగా దిగుమతి చేసుకొనే ఎరువుల ధరలు పెరగవచ్చు, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాంద్యం కారణంగా కంపెనీలు తెగబడి చమురు మాదిరి ఎరువులను కూడా తగ్గించి అమ్మితే తగ్గవచ్చు. ఇది రాస్తున్న సమయానికి అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు.

The great lockdown gums up animal farms
ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్‌కు సమర్పించిన 2020-21 బడ్జెట్‌ పత్రాల ప్రకారం అంతకు ముందు సంవత్సరంలో పాస్ఫరస్‌, పొటాసియం ఎరువుల సబ్సిడీ అంచనా రూ.26,335 కోట్లుగా చూపారు. వాస్తవానికి ఎంత ఖర్చు చేసిందీ మనకు వచ్చే ఏడాది పత్రాలలో గానీ తెలియదు. కేంద్ర సమాచార శాఖ మంత్రి విలేకర్లతో ఇలా చెప్పారు. ” 2020-21కి ఫాస్పేటిక్‌ మరియు పొటాసియం ఎరువులకు సబ్సిడీ రూపంలో ఖర్చు రూ. 22,186 కోట్లకు పెంచాలని నిర్ణయించాము, ఈ సబ్సిడీ పధకం ప్రతి ఏడాదీ ఉండేదే, ఈ ఏడాది ఐదు నుంచి ఏడు శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించాము” అన్నారు. అంటే గత ఏడాది అంచనా మొత్తం కంటే ఖర్చు గణనీయంగా తగ్గి ఉండాలి. గత ఏడాది కంటే ఎరువులు, ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత సంవత్సరం 80వేల కోట్ల రూపాయల అంచనా కాగా దాన్ని 70వేల కోట్లకు సవరించారు. ఈ ఏడాది ఆ 70వేల కోట్లనే అంచనాగా చూపారు. ఆహార సబ్సిడీని కూడా రూ.1.84లక్షల కోట్ల నుంచి 1.15లక్షల కోట్లకు తగ్గించారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే భారత ఆహార సంస్ధను అప్పుల పాలు చేసి ఆ పేరుతో దాన్ని మూసివేసేందుకు ఎంచుకున్నదారి ఇది. బడ్జెట్‌లోటును తగ్గించే దొడ్డిదారి. ఎఫ్‌సిఐ లాభాల ప్రాతిపదికన పని చేసే వాణిజ్య సంస్ధ కాదు. ఇటీవలి సంవత్సరాలలో దాని బడ్జెట్‌కు నిధులు కేటాయించని కారణంగా అది జాతీయ చిన్న మొత్తాల పొదుపు సంస్ధ నుంచి అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నది. గతేడాది మార్చి ఆఖరుకు దాని అప్పులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. దాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయటం లేదు.ఈ ఏడాది ఇంకా కోత పెట్టింది. అంటే కేటాయించిన మొత్తం పోను ఎఫ్‌సిఐ మరింత ఎక్కువగా ఈ ఏడాది అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా పధకం కింద ఉన్న 67శాతం మందిని 20శాతానికి కుదించాలని, రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తున్న సరకుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే సూచించింది. అది కేంద్ర ప్రభుత్వం తయారు చేసేదే కనుక మోడీ సర్కార్‌ ఆలోచనకు ప్రతిబింబం. దీనిలో భాగంగానే ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసి రాష్ట్రాలకే ధాన్యం కొనుగోలు బాధ్యతను ఇప్పటికే బదలాయించారు. వారెలా చేస్తున్నదీ చూస్తున్నాము.
బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2019-20లో నేరగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న మొత్తాలకు కేటాయించిన 75వేల కోట్ల రూపాయలకు గాను ఖర్చయింది రూ.54,370 కోట్ల రూపాయలే. ఇరవై ఒక్కవేల కోట్ల రూపాయలను ”పొదుపు” చేసింది. ఈ పధకం కింద దేశంలోని 14కోట్ల రైతు కుటుంబాలకు గాను లబ్దిపొందింది కేవలం 8.4కోట్ల కుటుంబాలే అని అంచనా. కరోనా కారణంగా తలెత్తిన పరిస్ధితిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. ఆరోగ్య సేవలను ప్రయివేటు రంగానికి అప్పగించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు జరుపుతున్నారు. కరోనా సందర్భంగా అదెంత ప్రమాదకర పోకడో ప్రపంచ వ్యాపితంగా వెల్లడైంది. ఇలాంటి మహమ్మారులు, ప్రకృతి ప్రళయాల సమయాల్లో ఎఫ్‌సిఐ లేదా మరొక ప్రభుత్వ సంస్ధ లేకపోతే ఎంత నష్టమో ఇప్పటికే రైతాంగానికి అర్ధం అయింది.
మన దేశం వెలుపల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే చైనా, ఇతర ఐరోపా దేశాలతో ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దం అమెరికా రైతాంగానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్దితిలోకి నెట్టింది. కరోనా కారణంగా చైనా ఆర్ధిక స్ధితి కూడా తాత్కాలికంగానే అయినా గణనీయంగా దెబ్బతిన్నట్లు స్వయంగా వారే ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్‌ తన ఎన్నికల కోసం కరోనా వైరస్‌ పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అవసరమైతే వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాకు చైనా ఎంత దూరమో చైనాకు కూడా అమెరికా అంతే దూరంలో ఉంటుంది. చైనాకు వచ్చే ఆర్ధిక ఇబ్బందులు దానికే పరిమితం కావు,చైనాతో పోల్చితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో చెప్పనవసరం లేదు.చమురు నిల్వ ఖాళీ లేక, ఉన.్నది అమ్ముడు పోక చమురు ధరలు పడిపోవటంతో కొనుగోలుదార్లు అమ్మకం దార్లకు ఎదురు డబ్బులు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నారు.కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో అమెరికా రైతులు పాలు అమ్ముడుపోక గోతుల్లో పోస్తున్నారని, కూరగాయల తోటలను దున్నివేస్తున్నారని వార్తలు వచ్చాయి. పంటలకు పదిశాతం, పశువులకు 12శాతం ధరలు పడిపోతాయని, రైతుల నిఖర ఆదాయాలు 20బిలియన్‌ డాలర్లు తగ్గుతాయని ఆహార మరియు వ్యవసాయ విధాన పరిశోధనా సంస్ద అంచనా వేసింది. అమెరికాలో అలా జరగటం అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో వారు ప్రపంచ మార్కెట్లో మరింత చౌకగా వాటిని కుమ్మరిస్తారు. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ రంగానికి ఇచ్చేందుకు ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నాడు. మన దేశంలో అలాంటి నష్టం ఎంత జరిగిందో అంచనా వేసేవారు లేరు, వేసినా పరిహారం ఇచ్చేవారూ లేరు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందన్నది అందరూ అంగీకరిస్తున్న అంశం. వేగతీవ్రత అంచనాలో తేడాలుండవచ్చు.2020లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. కరోనా ప్రారంభంలో నష్టం జరిగితే అది చైనాకే పరిమితం అవుతుందన్నది ఎక్కువ మంది జోశ్యం. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నది. మన పరిస్ధితి గురించి కేంద్ర పెద్దలు అంగీకరించినా లేకున్నా గతేడాది కాలంగా దిగజారుతూనే ఉంది.ప్రపంచంలో గతేడాది ఆహార వస్తువుల ధరలు ప్రారంభంలో తగ్గినప్పటికీ కరోనా కారణంగా ఇటీవల ధరలు పెరిగినట్లు ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు తెలుపుతున్నాయి. అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎగుమతులపై ఆంక్షలు విధించటం, వినియోగదారులు నిల్వలు చేసుకోవటం ఒక కారణంగా చెబుతున్నారు. వియత్నాం నిషేధం కారణంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 15శాతం తగ్గాయి, మన దేశం, థారులాండ్‌ కూడా ఆంక్షలు విధిస్తే ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది.

No crops if lockdown extended: Karnataka farmers wary of distress ...
గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేసే రష్యా, గోధుమ పిండిని ఎగుమతి చేసే కజకస్తాన్‌ కూడా ఎగుమతుల మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇంకా అనేక దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని ”ఆహార జాతీయవాదం ” తలెత్తటంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో చమురు వినియోగం గణనీయంగా పడిపోవటంతో మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఎథనాల్‌కు సైతం డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా మొక్కజొన్నల ధరలు పడిపోయాయి. అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం బియ్యం, గోధుమల ఉత్పత్తి రికార్డు స్ధాయిలో ఈ ఏడాది 126 కోట్ల టన్నులు ఉండవచ్చని, ఇది వినియోగం కంటే ఎక్కువ కనుక ఆంక్షలు సడలిస్తే సరఫరా మెరుగుపడవచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను బట్టి అంచనాలు, జోశ్యాలు మారిపోవచ్చు. అమెరికాలో గుడ్లు, పాలు, మాంసం సరఫరా తగ్గటంతో ధరలు ముఖ్యంగా గుడ్ల ధరలు 180శాతం వరకు పెరిగాయి. గత నెలలో జనం అవసరాలకు మించి కొనుగోలు చేయటం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు.చైనా పాల దిగుమతులు ఈ ఏడాది 19శాతం తగ్గుతాయని, అదే సమయంలో ప్రపంచంలో దిగుబడి తగ్గే అవకాశాలు లేనందున పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని భావిస్తున్నారు. 2018 చివరిలో చైనాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని సగం పందులను చంపివేయటంతో మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. పంది మాంసం బదులు గొడ్డు మాంసానికి మరలటంతో దాని ధరలు కూడా పెరిగాయి. కరోనా కారణంగా అన్ని చోట్లా ధరలు పడిపోయాయి.అయితే అమెరికాలో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడవచ్చనే భయంతో జనం కొనుగోళ్లకు ఎగబడటంతో అక్కడ ధరలు పెరిగాయి.
ఈ ఏడాది కరోనా దాదాపు ప్రపంచమంతటా కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆయా వ్యవసాయ సీజన్లలో వలస లేదా అతిధి కూలీలు ఎక్కడ పని దొరికితే లేదా అవసరం మేరకు వలస పోవటం సర్వసాధారణం. గృహబందీ, రవాణా లేకపోవటం వలన ఈ ఏడాది కొరత తీవ్రమైంది. సీజనల్‌ వలస కూలీలు రాని కారణంగా తమకు రానున్న మూడు నెలల్లో రెండు లక్షల మంది అవసరమని ఫ్రాన్స్‌ అంచనా వేసింది. ఇండ్లలో చిక్కుకు పోయిన వారు పనులకు రావాలని వ్యవసాయ మంత్రి బహిరంగ విజ్ఞప్తి చేశాడు. నిరుద్యోగులైన కాటరింగ్‌ కార్మికులు వ్యవసాయ పనులకు రావాలని జర్మనీ అధికారులు కోరుతున్నారు. అక్కడ పండ్లు, కూరగాయల కోతకు ఏటా మూడులక్షల మంది వస్తారు. ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ పనులకోసం కూలీలు పోలాండ్‌కు వలస వెళతారు. వారిని స్వదేశానికి పంపకుండా అక్కడే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని రైతుల యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయ కూలీలు ఎక్కడకు పోవాలనుకుంటే అక్కడకు స్వేచ్చగా అనుమతించాలని ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలను కోరింది. బ్రిటన్‌లో కూరగాయలు, పండ్ల కోతకు 80వేల మంది అవసరమని, వారికి ప్రత్యేక పాకేజ్‌ ఇచ్చేందుకు 93లక్షల పౌండ్లను ప్రభుత్వం మంజూరు చేయాలని రైతు సంఘాలు కోరాయి. ఇతర చోట్ల పనులు కోల్పోయిన వారిని వ్యవసాయరంగానికి మరలేట్లు ప్రోత్సహించాలని ఇతరులు కూడా కోరుతున్నారు. అమెరికాలో వ్యవసాయ కూలీల సంఖ్య చాలా తక్కువ, ఎక్కువ భాగం యంత్రాలతోనే పని నడుస్తుంది. అయితే మనుషులు అవసరమైన చోట పని చేసేందుకు పక్కనే ఉన్న మెక్సికో నుంచి హెచ్‌ 2ఏ వీసాలతో అనుమతిస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా అలాంటి వారు కనీసం అరవైవేల మంది తగ్గుతారని అంచనా వేశారు. ఇప్పటికే వచ్చి పని చేస్తున్నవారి వీసాలను పొడిగించాలని కోరుతున్నారు. ఒక వైపు వ్యవసాయేతర రంగాలలో పని చేసేందుకు ఇతర వీసాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ సర్కార్‌ వ్యవసాయంలో పని చేసే వారికి మాత్రం వీసాలు అదనంగా ఇవ్వాలని చూస్తోంది. అనేక దేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన పధకాలలో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న మొత్తాల వివరాలు ఇంకా తెలియనప్పటికీ మన కంటే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.

Indian Farmers Struggle to Harvest, Sell Crops During COVID ...
మన రైతాంగ విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటికే జరిగిన నష్టంతో పోల్చితే నామ మాత్రమే అయినా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇస్తున్న ఆరువేల రూపాయలను రెట్టింపు చేయాలి.దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. కరోనా కారణంగా నష్టపోయిన పంటలకు బీమా పధకాన్ని వర్తింప చేసి పరిహారం ఇవ్వాలి. గ్రామీణ కార్మికులకు కనీసం వందరోజుల ఉపాధిని కల్పించాలి. ఉచితంగా అందచేస్తున్న ధాన్యం మొత్తాలను రెట్టింపు చేయాలి. కార్డులు లేనివారికి కూడా ఉదారంగా సాయం చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌లో తీసుకున్న రుణాలకు చిన్న సన్నకారు రైతులకు వడ్డీ రద్దు చేయాలి. వచ్చే ఏడాది పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచాలి.
ఏప్రిల్‌ 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటదినం జరిగింది. ఎనభై దేశాలకు చెందిన 180 రైతు సంఘాలు ఒక ప్రకటన చేస్తూ కరోనా కారణంగా ఇండ్లకే పరిమితం అవండి, మౌనంగా ఉండవద్దు అని పిలుపునిచ్చాయి. ప్రపంచ జనాభా కడుపు నింపేందుకు పూనుకోవటంతో పాటు రైతాంగ హక్కుల కోసం పోరాడాలన్నదే దాని సారాంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనుచూపు మేరలో హెలికాప్టర్‌ మనీ కానరావటం లేదు కెసిఆర్‌ సార్‌ !

16 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, USA

≈ Leave a comment

Tags

covid 19 India Stimulus package, COVID-19, Helicopter money, KCR

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మే 3వరకు గృహ బందీ – జనానికి నరేంద్రమోడీ వట్టిస్తరి-మంచినీళ్లు !

14 Tuesday Apr 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

how narendra modi disappointed entire nation, lock down extension, Lock down extension up to May 3rd

PM Narendra Modi Extends Lockdown Until May 3, Other Key ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ కరోనా, గృహబందీ(లాక్‌డౌన్‌) మూడవ ప్రసంగంలో సప్తపది అనే పదాన్ని వినియోగించారు. ఏడు అంశాలను పేర్కొన్నారు కనుక ప్రాసకోసం ప్రయోగించారని సరిపెట్టుకోవాలా ? నిజానికి అది హిందువుల సంప్రదాయ వివాహ శుభ సందర్భంగా నిర్వహించే ఒక క్రతువు. వివాహంలో సూత్రధారణ తరువాత నవ వధువులు అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడవటాన్ని సప్తపది అంటారు. అయితే విశ్వాసులు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ క్రతువును పాటించిన వారు కాళ్లపారాణి ఆరక ముందే భార్యలను వదలివేసే భర్తలు, భర్తలను వదలివేసే భార్యలను మనం చూస్తున్నాం. దీనికి ఇంకా ఏమైనా అర్ధాలున్నాయేమో నాకు తెలియదు. వివాహం వేరు, కరోనా లేదా మరొక మహమ్మారి మీద పోరాడటం వేరు. రెండూ పరస్పర విరుద్దమైనవి. మోడీ ప్రసంగం విని, చూసిన వారికి పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం చదివినట్లుగా సప్త పది ప్రయోగం అనిపిస్తే అది వారి తప్పుకాదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ నేపధ్యంలో అనేక మంది గృహబందీ వ్యవధిని పొడిగించాలని సూచించారు, అనేక రాష్ట్రాలు ఏప్రిల్‌ 30వరకు పొడిగించాలని ముందే నిర్ణయించి ప్రకటించాయి. దీనికి మోడీ గారు కొత్త ట్టిస్ట్‌ ఇచ్చి మండల దీక్షగా ( అయ్యప్ప, దానికి అనుకరణగా ఇతర దీక్షలు) ధ్వనింప చేస్తూ మే మూడవ తేదీ వరకు 19రోజులు పొడిగించారు. ఇవన్నీ పక్కన పెడదాం.దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మోడీ పలుకుల్లో కొత్తదనం ఏముంది ? జనం లేదా అనేక రంగాలు కోరుతున్న అంశాలను ఎక్కడైనా ప్రస్తావించారా ? ఏమి ప్రస్తావించారు అనేది ముఖ్యం. తెలుగులో ఒక లోకోక్తి లేదా సామెతల గురించి చాలా మంది వినే ఉంటారు. వాటిలో ఒకటి వట్టి మాటలకు కడుపులు నిండుతాయా ? రెండవది వట్టిస్తరి – మంచినీళ్లు. ఇంతకు మించి మోడీగారి ప్రసంగంలో మరొకటి కనిపించలేదు.
మొదటి రెండు ఉపన్యాసాలలో చప్పట్లు, దీపాల వెలిగింపు పిలుపు ఇచ్చారు. మూడవ దానిలో ఇప్పటికే జనమందరూ పాటిస్తున్న అంశాల సప్తపది సుభాషితం తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. దీని గురించి నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. కొందరు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు. రెండో పిలుపు సందర్భంగా దీపాల వెలుగు పేరుతో దీపావళి జరుపుకున్నవారు ఇప్పుడు అలాంటి మరొక అవకాశం రాలేదే అని నిరాశపడి ఉంటారు. ఈనెల 20వరకు మరింత గట్టిగా గృహబందీ అమలు తరువాత ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయిస్తారు. ఆ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదు కానట్లయి బందీ నిబంధనల సడలింపుకు సంబంధించి బుధవారం నాడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామని మోడీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమంలో వెల్లడైన ధోరణి చూస్తే తరువాత ఏమిటి అని అనేక మంది ప్రశ్నించారు.హిందీ సినిమాల్లో మాదిరి ప్రసంగంలో 80శాతం ఏమీ లేదన్నది ఒక వ్యాఖ్య. మిగతా కొన్ని ఇలా ఉన్నాయి. ఆయనెందుకు అలా మాట్లాడారు మనం ఏమన్నా నాలుగేండ్ల పిల్లలమా ? మోడీ చెప్పదలచుకున్న సందేశానికి 30నిమిషాలు అవసరం లేదు. ప్రసంగం మోడీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని మోడీ చెప్పటం మా ఛానల్‌ చందాదారులుగా చేరండి అని చెప్పిట్లుగా ఉంది. మోడీ ప్రసంగాన్ని ముందుకు జరిపే బటన్‌ ఇచ్చి ఉండాల్సింది. పావు గంటసేపు అబద్దాలు, చెత్త మాట్లాడారు. పావు గంటసేపు సరకులేకుండా మాట్లాడారు. వాస్తవాలను మరుగుపరచి మాటల జడివాన కురిపిస్తూ ఎలా మాట్లాడవచ్చో నేర్చుకున్నాను. వైద్యులు, వైద్య సిబ్బందికి పిపిఇ కిట్స్‌ ఏర్పాటు, దేశమంతటా కరోనా పరీక్షల పెంపు, పేదల సంరక్షణ, ఆరోగ్యవసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్ద మరియు ఉపాధి పునరుద్దరణ, ఔషధాల కొరత, వలస కార్మికుల గురించి ప్రస్తావన లేకుండా చక్కగా ప్రసంగించారు.
నరేంద్రమోడీ ప్రసంగం గురించి ఇంతకంటే ఎక్కువ రాయనవసరం లేదు. పరీక్షా సమయాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు వ్యవహరించే తీరు తెన్నులను బట్టి జనం స్పందిస్తారు. పొగిడిన నోళ్లతోనే నవ్వుతారు. ఇక మోడీ గారి ‘సప్తపది’ గురించి చూస్తే 1.వృద్దుల సంరక్షణ, 2. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో తయారు చేసిన ముఖతొడుగులు ధరించండి, 3.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోండి.4,ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించండి, 5. పేదలను ఆదుకోండి, ఆహారం అందించండి, 6. ఉద్యోగులను ఆదుకోండి, తొలగించవద్దు, 7. ఆరోగ్య సిబ్బంది, పోలీసు తదితర యంత్రాంగ సేవలను అభినందించండి. వీటిలో కొత్త అంశాలేమి ఉన్నాయి గనుక.

PM Modi's Covid Lockdown Address Not Up To Congress' Expectations ...
కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ గృహబందీని మే 25 నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో అందరూ చెప్పలేని ఇబ్బందులు పడ్డారు. అయినా ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం కనుక జనం సర్దుకున్నారు. ఈ 21 రోజుల్లో అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జనాన్ని, అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవటం గురించి ఎదురు చూసిన వారికి ప్రధాని ప్రసంగం తీవ్ర నిరాశపరచింది. ఇబ్బందులు పడుతున్నవారికి కావాల్సింది ప్రధాని మోడీ మాదిరి కార్చిన కడవల కొద్దీ కన్నీరు, సానుభూతి, జనం ముందు తలవంచటం కాదు. ఇప్పటికే సామాన్యులు, మధ్యతరగతి వారు తమ వంతు త్యాగాలు చేశారు. ఇంకేమాత్రం చేసే స్ధితిలో లేరు.
గతంలో వాజ్‌పేయి పాలించినా, కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల ప్రధానుల ఏలుబడిలో ఉన్నా మన దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడే విధానాలే అనుసరించారు, ఇప్పుడు నరేంద్రమోడీ కూడా అదే చేస్తున్నారు.కరోనా కష్టాలను తెచ్చింది నిజం. కానీ ఇప్పుడు జనాన్ని ఆదుకొమ్మని చెబుతుంటే రాష్ట్రాల, దేశ ఆర్ధిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నవారికి ఇంతకాలం సంపదలు పోగేసుకున్న వారు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఈ కష్ట కాలంలో వారేమి చేస్తున్నారు, పాలకులు వారి నుంచి వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.2018లో ప్రతి రెండు రోజులకు ఒకరు డాలర్‌ బిలియనీర్‌గా మారారు. అంటే సంపద కోట్లు దాటటం. ప్రపంచ చరిత్రలో 2016 రెండవ త్రైమాసిక కాలం నుంచి 2018లో అదే సమయానికి ప్రపంచ సంపదల్లో 82శాతం ఒక శాతం మంది చేతిలో ఉన్నాయి. చరిత్రలో ఇంత పెరుగుదల ఎన్నడూ నమోదు కాలేదని ఆక్స్‌పామ్‌ సంస్ద తెలిపింది. 2006 నుంచి 2015వరకు జరిపిన పరిశీలన ప్రకారం సామాన్య కార్మికుల ఆదాయం ఏడాదికి సగటున రెండు శాతం పెరిగితే బిలియనీర్ల సంపద దానికి ఆరురెట్లు ఎక్కువగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే ఒకశాతం ధనికుల వద్ద 58శాతం పోగుపడింది. ఈ మధ్యకాలంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2017 బడ్జెట్‌ వివరాల ప్రకారం మన దేశంలో ఒక శాతం ధనికులు 73శాతం కలిగి ఉంటే పేదలుగా ఉన్న 67కోట్ల మంది జనం సంపద కేవలం ఒకశాతమే పెరిగింది. బిలియనీర్ల పెరుగుదల ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం తప్ప అభివృద్ధి సూచిక కాదు. ఒక ప్రముఖ పరిశ్రమ సిఇఓ ఏడాదికి పొందుతున్న ఆదాయ స్దాయికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కనీసవేతనాలకు పని చేసే కార్మికుడు చేరాలంటే 941 సంవత్సరాలు పడుతుంది.
కార్పొరేట్‌ సంస్ధలకు ఏటా లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రభుత్వం కట్టబెడుతున్నది. వాటికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కావాలని ఎగవేస్తుంటే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కింద మూడు సంవత్సరాల నిఖర లాభాల సగటులో రెండుశాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్దితి అవసరాలకోసం పిఎం-కేర్‌ (ప్రధాని పౌరసహాయం మరియు ఉపశమన నిధి) నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నివారణను అత్యవసర పరిస్ధితిగా పరిగణిస్తున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ నిధికి కంపెనీలు ఇచ్చే మొత్తాలను సిఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసినట్లుగానే పరిగణించి ఆ మేరకు మినహాయింపులు ఇస్తారు. అదే కంపెనీలు ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చే మొత్తాలకు ఇది వర్తించదు. అయితే రాష్ట్రాలలో విపత్తు సహాయం లేదా అత్యవసర నిధికి కూడా ఈ మొత్తాలను ఇస్తే మినహాయింపు ఇస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ మీడియాలో ప్రచారం పొందుతున్న బడా కంపెనీలన్నీ ఆ సొమ్మును పిఎం కేర్‌కు బదలాయిస్తున్నాయా లేక నిజంగా విరాళాలు ఇస్తున్నాయా అన్నది తరువాత గానీ బయట పడదు. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు కంపెనీలు సిఎస్‌ఆర్‌ నిధి నుంచి కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తాలను కూడా ఈ నిధిఖాతాలో రాయవచ్చు. కరోనా సమయంలో తాత్కాలిక, కాజువల్‌, రోజువారీ కార్మికులకు సాయం చేయవచ్చు. కంపెనీ నిఖర ఆస్ధుల విలువ ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే కంపెనీలు అంతకు ముందు సంవత్సరంలో నిఖరలాభం ఐదు కోట్లు ఉన్నవి సామాజిక బాధ్యత కింద రెండుశాతం మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.గడచిన ఐదు ఆర్ధిక సంవత్సరాలలో ఈ మేరకు కంపెనీలు 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదించాయి.
నరేంద్రమోడీ సర్కార్‌ ఈ కంపెనీలను విరాళంగా తీసుకున్న మొత్తాలను తన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. నిజానికి ఇలాంటి సందర్భాలలో లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధుల నిల్వలున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచి కొంత శాతం మొత్తాలను విధిగా ప్రభుత్వాలకు జమచేసేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ సొమ్ము కష్టపడి పనిచేసిన కార్మికులదీ, ప్రజలది తప్ప మరొకటి కాదు. అలాంటి ప్రత్యేక పధకాలను ప్రకటిస్తారని అనేక మంది ఎదురు చూశారు. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని చెప్పకూడని మాటలు చెప్పారు. కనీసం ఒక్క కరోనా కేసు కూడా మన దేశంలో నమోదు కాక ముందే నివారణకు ఏర్పాట్లు చేసినట్లు మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఇది విమర్శించటానికి తగిన సందర్భం కాదు కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని చెప్పిందే నిజమైతే విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు ? విదేశాల నుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు రాదలచుకున్న వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు, రోగులకు చికిత్స ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పాలి. తొలి కేసు జనవరిలోనే నమోదైన విషయం అందరికీ తెలిసిందే మార్చి 22న జనతా కర్ఫ్యూ, 25 నుంచి గృహబందీ ప్రకటించారు.

Coronavirus India: PM Modi New Twitter Bio Pic After Address To ...
గత ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోట్లాది మంది వలస కార్మికులు అనేక చోట్ల చిక్కుకు పోయారు, వారు తమ ఇండ్లకు వెళ్లే అవకాశాలు ఈనెల 20వ తేదీవరకు ఉండవు. తరువాత ఉంటాయో లేదో తెలియదు. వారి అవసరాలను ఎవరు చూడాలి? వారుంటున్న ప్రాంతాలలో పారిశుధ్యం,తదితరాల పరిస్ధితి ఏమిటి? అందుకు కేంద్రం వద్ద ఉన్న పధకాలేమిటి ? రాష్ట్రాలు తమకున్న పరిమిత వనరులతో వారిని ఆదుకోగలవా ? పోనీ అప్పోసప్పో చేసి ఖర్చు చేస్తే కేంద్రం భరిస్తుందా ? అదనపు ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలకు పరిస్ధితి తీవ్రతను బట్టి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా ? అప్పులు తీసుకొనేందుకు అడ్డువస్తున్న నిబంధనలను కూడా కేంద్రం, రిజర్వుబ్యాంకు సవరించలేదనే అంశాల గురించి పట్టించుకోవనవసరం లేదా ? వైద్య పరికరాల సరఫరాను కేంద్రం పర్యవేక్షించాల్సిన అగత్యం లేదా ? చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం చేసే సాయం ఏమిటి ? కార్మికులను తొలగించవద్దని సలహా చెబితే సరిపోతుందా ? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లేదా కనీసం ప్రస్తావన అయినా ఉంటుందనుకున్న వారిని ప్రధాని తీవ్ర నిరాశకు గురిచేయలేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఛీ.. ఛీ….చివరికి కరోనా నుంచి కూడా లాభాలు పిండుకుంటున్న అమెరికా !

13 Monday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Coronavirus and pharmaceutical companies, Donald trump, US corporate profits Corona

Cartoon of the week - BioVoice News

ఎం కోటేశ్వరరావు
” కరోనా మహమ్మారి సమయంలో మనకు అత్యంత అవసరమైన తరుణంలో ఎన్‌95ముఖ తొడుగులు దేశం బయటకు పోతున్నాయి – తరువాత ఏం జరుగుతుంది ?” అనే శీర్షికతో అమెరికాకు చెందిన ” ఫోర్బ్స్‌ ” పత్రిక విలేకరి డేవిడ్‌ డిసాల్వో రాసిన విశ్లేషణా వ్యాఖ్య ఏప్రిల్‌ ఆరవ తేదీన ప్రచురితమైంది. సరిగ్గా అదే రోజు మన ప్రధాని నరేంద్రమోడీ కౌగిలి నేస్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లతో మమాట్లాడుతూ తాను కోరిన విధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపక పోతే భారత్‌ మీద ప్రతీకార చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. స్నేహంలో ఇలాంటివి మామూలే అన్నట్లుగా మన నరేంద్రమోడీ వ్యవహరించారు.
మన దేశానికి చేసిన బెదిరింపును చూసి అనేక మంది అమెరికా తన అవసరాల కోసం అందుకు తెగిస్తోంది అనుకుంటున్నారు. అది వాస్తవమే, అయితే అదే సమయంలో అమెరికాలో తయారైన వైద్య పరికరాలను ట్రంప్‌ ఇతర దేశాలకు విక్రయించటానికి అనుమతించాడు, అంతే కాదు, ఇతర దేశాలు ఎక్కడో కొనుక్కున వాటిని దారి మధ్యలో అటకాయించి తీసుకుపోయిన దుండగానికి కూడా ట్రంప్‌ పాల్పడ్డాడు. ట్రంప్‌ బెదిరింపులు, మోడీ లొంగుబాటు గురించి మాట్లాడలేని మన మీడియా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల ఎగుమతుల గురించి చిలవలు పలవలుగా వర్ణిస్తూ మోడీ భజనకు, తద్వారా మెరుగైన పాకేజీలకు అంటే నీకిది నాకదిగా ఉపయోగించుకుంది అని చెప్పాల్సి వస్తోంది. భజన చేయని కొన్ని మీడియా సంస్ధలకు ఈ విమర్శ వర్తించదన్నది షరా మామూలే.
అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పైన పేర్కొన్న విలేకరి ఒక రోజు అమెరికాలో వైద్య పరికరాల విక్రయాకొనుగోలు దార్ల , ముఖ్యంగా ఎన్‌95 ముఖతొడుగుల లావాదేవీల మీద కేంద్రీకరించి పరిశీలించాడు. మార్చి 30వ తేదీన అదే పత్రికలో ఒక కథనాన్ని కూడా రాశాడు. దాని సారాంశం ఇలా ఉంది. ” కొద్ది గంటల్లోనే 28 కోట్ల ముఖతొడుగుల లావాదేవీలు జరగ్గా అత్యధిక భాగం అవి విదేశాల కొనుగోలు దార్లకు సంబంధించినవే. అదే రోజు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగం కూడా ముఖతొడుగుల కోసం ఎక్కని -దిగని గుమ్మం లేదు. ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు. మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, బ్రిటన్లలో అమ్మకాలకు కోట్లాది తొడుగులు ఉన్నట్లు మధ్యవర్తులు చెప్పారు. డిమాండ్‌ను చూసి విపరీతంగా ధరలను పెంచటంతో కొనుగోలుదార్లు ముఖ్యంగా అమెరికా దేశీయ కొనుగోలు దార్లనుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.ధరలు పెరిగిపోయిన కారణంగా విక్రయాలను గుట్టుగా సాగించటంతో పాటు అప్పటికే కుంభకోణాలు కూడా చోటు చేసుకుంటుండంతో కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఇవి జరిగాయి. తొడుగులు, పరికరాలకు విపరీతమైన డిమాండ్‌ పెరగటంతో వెంటనే డబ్బు చెల్లిస్తారా లేదా అసలు కొనుగోలు దార్ల దగ్గర డబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకొని మరీ విక్రయాలు జరిపారు. నిధులు తమ దగ్గర ఉన్నట్లు రుజువు చూపటంలో ఆలస్యం అయిన సందర్భాలలో గంట వ్యవధిలోనే అప్పటికే ఒకరు కుదుర్చుకున్న వస్తువులను వేరే వారు కొనుగోలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రతి పత్రికా గోష్టిలో పాల్గొన్నవారు ఎన్‌95 ముఖతొడుగులను ధరించి కనిపించటంతో వాటికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. న్యూజెర్సీ రాష్ట్ర అధికారులు తాము తొడుగుల కోసం ప్రపంచవ్యాపితంగా ప్రయత్నిస్తున్నామని చెప్పిన సమయంలో అక్కడ నాలుగు కోట్ల 30లక్షల తొడుగులు అందుబాటులో ఉన్నాయి. స్ధానికులెవరూ లేకపోవటంతో వాటిని విదేశీ కొనుగోలుదార్లు ఎగరేసుకుపోయారు. ప్రభుత్వ సంస్ధలు కొనుగోలుకు ప్రయత్నించినపుడు ఎక్కువ భాగం ఖరారు కాలేదు. సంప్రదింపులు కొనసాగుతుండగా మధ్యలోనే ధరలు మారిపోయాయి, మధ్యవర్తులు సాధ్యమైన మేరకు సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు.”
అమెరికాలో కరోనా మహమ్మారి విస్తరించటానికి చైనా వారు కారణమని ఇప్పటికీ కొన్ని ఉష్ట్రపక్షులు మాట్లాడుతూనే ఉన్నాయి. లాభాల కోసం ఎంతకైనా తెగించే పెట్టుబడిదారీ వ్యవస్ధ, దాన్ని కాపాడే కావలి కుక్కల వంటి ట్రంప్‌లు తమకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల రక్షణ కోసం ఉపయోగించనంత కాలం ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. లాభాలు ఆర్జించే ఆంబోతులకు స్వేచ్చ ఇచ్చిన ట్రంప్‌ నిర్వాకం ఇది. ఫోర్బ్స్‌ పత్రికలో ఈ లావాదేవీల గురించి వార్తలు వచ్చిన తరువాత కూడా ట్రంప్‌ సర్కార్‌ ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. ఇతర దేశాలకు వైద్య పరికరాల నిరాటంకంగా ఎలా వెళ్లిపోయాయో పత్రికలు రాశాయి. చైనా వ్యతిరేక కళ్లద్దాలు పెట్టుకున్న కొన్ని పత్రికలు కరోనా వైరస్‌తో పాటే వందల కోట్ల వైద్యపరికరాలను కూడా చైనా తయారు చేసి సిద్దంగా ఉంచుకుంది అని రాసినవి కూడా లేకపోలేదు. ఈ విషయాలు తెలిసినపుడు వైరస్‌ నిరోధ చర్యలను ఆయా దేశాలు ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఆ రాతలు రాసే వారికి తట్టలేదు. ప్రమాదం గురించి తెలిసినా నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తే పాలకులు ఎక్కడ కన్నెర్ల చేస్తారో అని భయం.
చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారిందని రాసిన, చెప్పిన నోళ్లతోనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. సాధారణ సమయాల్లో ఇతర దేశాలకు ఎగుమతి కోసం చైనా వైద్య పరికరాలు తయారు చేస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. చైనా కంటే ఎన్నో రెట్లు మహమ్మారి వ్యాపించిన సమయంలో తమకు వెంటిలేటర్లు పెద్ద సంఖ్యలో కావాలని అడిగిన న్యూయార్క్‌ గవర్నర్‌ను ఎక్కువ చేస్తున్నావంటూ నోరు పారవేసుకున్న ట్రంప్‌ ఏలుబడిలో అదే సమయంలో అమెరికా నుంచి ఏఏ దేశాలకు వెంటిలేటర్ల ఎగుమతి జరిగిందో చెబుతూ ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక రాసింది. అవేవీ రహస్యంగా తరలిపోలేదు, కావాలంటే రికార్డులు తనిఖీ చేసుకోవచ్చు. తైవాన్‌ వంటి చోట్ల కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పటికీ వైద్య పరికరాల ఎగుమతులపై నిషేధం విధించారు. అమెరికా నుంచి స్వేచ్చగా బయటకు పోనిచ్చారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు తీరా అలవికాని పరిస్ధితి ఏర్పడగానే జనాన్ని రక్షించేందుకు ఏమైనా చేస్తా అన్నట్లుగా ట్రంప్‌ ఫోజు పెట్టాడు. తమ దేశాలకు వస్తున్న వైద్య పరికరాలు, ముఖతొడుగులను బలవంతంగా చైనా నుంచి అనుమానాస్పద స్ధితిలో పక్కదారి పట్టించినట్లు జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ ఆరోపించాయి. తమకు దానం చేసిన 20వెంటిలేటర్లను అమెరికా అధికారులు అడ్డుకున్నట్లు బార్బడోస్‌ ప్రభుత్వం పేర్కొన్నది. చైనానుంచి బెర్లిన్‌ రావాల్సిన రెండు లక్షల ఎన్‌95 ముఖతొడుగులను దారి మధ్యలో థారులాండ్‌కు అక్కడి నుంచి ఏప్రిల్‌ 3న అమెరికాకు తరలించటం ఆధునిక సముద్రదోపిడీ అని జర్మన్‌ అధికారులు వర్ణించారు. అదే రోజు ఫ్రెంచి అధికారులు ఒక ప్రకటన చేస్తూ తమ దేశానికి రావలసిన సరఫరాలు షాంఘై విమానాశ్రయంలో రన్‌వే మీద ఉండగానే మూడు రెట్ల అధిక ధరలకు అమెరికా కొనుగోలు దార్లు ఎగరేసుకుపోయారని తెలిపారు. తాము పెట్టిన ఆర్డర్ల ప్రకారం వైద్య పరికరాలు సకాలంలో అందకుండా మధ్యలో అడ్డుపడుతున్నారని బ్రెజిల్‌ ఆరోపించింది. తాము చేస్తున్నదానిలో తప్పు లేదని ట్రంప్‌ సమర్ధించుకున్నాడు. తగిన మార్గాల్లో పరికరాలను సేకరిస్తున్నామని చెప్పాడు. ఎం3 అమెరికా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను కెనడా ఇతర దేశాలకు ఎగుమతి చేయటంపై ట్రంప్‌ సర్కార్‌ విధించిన నిషేధాన్ని కెనడా ప్రధాని విమర్శించటంతో ట్రంప్‌ నిషేధాన్ని ఎత్తివేశాడు.
వైద్య పరికరాలకు డిమాండ్‌ పెరిగిపోవటంతో అమెరికా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఒకదాని మీద మరొకటి విమర్శలకు సైతం దిగాయి. యాభై రాష్ట్రాల మధ్య ఇది ఎలక్ట్రానిక్‌ వేలంగా ఉందని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో వ్యాఖ్యానించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సాయం విషయంలో రాజకీయ ప్రాధాన్యతలను ట్రంప్‌ ముందుకు తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారి సమయంలో అమెరికా ప్రభుత్వం వైద్యపరికరాల అపహరణకు పాల్పడుతున్నదా అని అమెరికాలోని కాటో సంస్ధ నిపుణుడు క్రిస్‌ ఎడ్వర్డ్‌ ప్రశ్న వేసుకొని అలాగే కనిపిస్తున్నదని తానే సమాధానం చెప్పాడు. ప్రభుత్వం చట్టబద్దమైన ఉత్పత్తులకు ఆర్డర్‌ ఇవ్వకుండా వాటిని స్వాధీనం చేసుకోవటాన్ని మరో విధంగా అపహరించటమే అని చెప్పాల్సి ఉంటుందని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.
తమకు వస్తున్న వాటిలో ఓడ నుంచి ఎనిమిది వెంటిలేటర్లు, 50వేల ముఖతొడుగులు, ఇతర వైద్య సరఫరాలను అమెరికా తొలగించటం తీవ్ర ఆశాభంగం కలిగించిందని బ్రిటన్‌ వలస ప్రాంతమైన కరీబియన్‌ కేమాన్‌ దీవుల ప్రధాని ఆల్డన్‌ మెక్‌లాహిన్‌ వ్యాఖ్యానించాడు. జమైకా రాయబారి జోక్యం చేసుకోవటం అమెరికా తిరిగి వాటిని ఆ దీవులకు పంపింది.

President Donald J. Trump Archives - The iPINIONS Journal
వైద్యులు సిఫార్సు చేస్తున్న ఔషధాల ఎగుమతుల విలువ ప్రపంచవ్యాపితంగా 2018లో 371.3 బిలియన్‌ డాలర్లని వరల్డ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డాట్‌కామ్‌ తాజాగా తెలిపింది. 2014 నుంచి సగటున ఎగుమతులు అన్ని దేశాల నుంచి 5.8శాతం చొప్పున ఏటా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో 79.7శాతం ఐరోపా దేశాల నుంచే జరుగుతున్నాయి. వాటి విలువ 295.8 బిలియన్‌ డాలర్లు. రెండవ స్ధానంలో ఉన్న ఆసియా నుంచి 10.7, ఉత్తర అమెరికా ఖండం నుంచి 8.1శాతం ఉన్నాయి. ఎగుమతులు ఉన్నాయి. ప్రపంచంలో 4.3శాతంగా ఉన్న 3003 ఔషధాలలో రెండు అంతకంటే ఎక్కువ కలసి ఉన్నాయి, మరో 3004 ఔషధాలు అసలేమీ కలవనివి, ఒకటి రెండు కలిసినవి 95.7శాతం ఉన్నాయి.2018లో అగ్రస్ధానంలో ఉన్న పది దేశాల ఎగుమతులు బిలియన్‌ డాలర్లు, శాతాలలో ఇలా ఉన్నాయి.1.జర్మనీ 62.3(16.8), 2. స్విట్జర్లాండ్‌ 45.3(12.2), 3.బెల్జియం 27.8(7.5), 4.ఫ్రాన్స్‌ 25.9(7), 5. అమెరికా 22(5.9), 6.ఐర్లండ్‌21.7(5.8), 7.బ్రిటన్‌ 19.7(5.3),8.ఇటలీ 19.6(5.3), 9.నెదర్లాండ్స్‌ 16.3(4.5), 10 భారత్‌ 13.1(3.5). మొత్తం ఎగుమతులలో పదిహేను దేశాల వాటా 85శాతంగా ఉంది. 2014 తరువాత వేగంగా ఎగుమతులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతుల పెరుగుదల డెన్మార్క్‌ 293.4శాతం కాగా స్విడ్జర్లాండ్‌ 26.7, భారత్‌ 22.5, జర్మనీ 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో బ్రిటన్‌ ఎగుమతులు 18.1శాతం తగ్గగా తరువాత అమెరికా 14.3, ఇటలీ 12.4, బెల్జియం 9.6, ఆస్ట్రియా 8.3శాతం తగ్గాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే హైడ్రాక్సీ క్లోరో క్విన్‌ మందు బిళ్లల గురించి నరేంద్రమోడీకి లంకె పెట్టి అదొక ఘనతగా పెద్దఎత్తునప్రచారం చేస్తున్నారు. ఔషధ రంగంలో ముందున్న అన్ని దేశాలలో దీనిని తయారు చేస్తున్నారు. చలితో వచ్చే జ్వరాన్ని తగ్గించేందుకు లాటిన్‌ అమెరికాలోని పెరూలోని గిరిజనులు(స్ధానికులు) స్ధానికంగా దొరికే సింకోనా చెట్టు బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని వినియోగించే వారు. ఆ ప్రాంతానికి ఐరోపా వారు వలస వచ్చిన తరువాత ఆ చెట్టు మందును తమ దేశాలలో అదే జ్వరం, మలేరియాకు వినియోగించారు. తరువాత సింకోనా నుంచి 1820లో క్వినైన్‌ను వేరు చేసి వినియోగించటం ప్రారంభించారు. 1902లో బ్రిటీష్‌ వైద్యుడు రోనాల్డ్‌ రాస్‌ దోమల నుంచి మలేరియా వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొన్నారు. 1934లో జర్మనీకి చెందిన బేయర్‌ కంపెనీ శాస్త్రవేత్త హాన్స్‌ అండెర్‌సగ్‌ నాయకత్వంలోని బృందం క్లోరోక్విన్‌ తయారు చేసింది. దానికి రిసోచిన్‌ అని పేరు పెట్టారు. అయితే అది చాలా తీవ్ర విషతుల్యంగా ఉండటంతో మానవ వినియోగానికి పనికి రాదని నిర్ణయించి పట్టించుకోలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఆఫ్రికాలో జర్మనీ దాని మిత్ర దేశాల సైనికులకు మలేరియా సోకింది. క్లోరోక్విన్‌ నుంచి వేరు చేసిన మిథైల్‌ క్లోరోక్విన్‌ దాన్నే సంటోచిన్‌ అని పిలిచారు. మలేరియా నివారణకు దాన్ని ఉపయోగించారు. ఆ యుద్దంలో జర్మనీ ఓడిపోయినపుడు ట్యునిస్‌లో ఆ ఔషధం అమెరికన్లకు దొరికింది. వారు దాన్ని తమ దేశానికి తీసుకుపోయి మరింత అభివృద్ధి చేసి 1947 నుంచి మలేరియా నివారణకు వినియోగించటం ప్రారంభించారు.
మలేరియా భూమధ్య రేఖకు అటూ ఇటూ ఉండే ఉష్ణమండల దేశాలలో ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో ఎక్కువగా వ్యాపిస్తోంది. వాటిలో మన దేశం ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ 2018 నివేదిక ప్రకారం 22.8కోట్ల మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఆఫ్రికాలోనే 21.3 కోట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో కూడా ఆరు దేశాల్లో ప్రపంచంలోని 85శాతం కేసులు నమోదయ్యాయి. వాటిలో నైజీరియాలో 25, కాంగో 12, ఉగాండా 5, కోట్‌ డి ఐవరీ, మొజాంబిక్‌, నైగర్‌లో మూడుశాతం చొప్పున ప్రపంచంలోని సగం కేసులు కలిగి ఉన్నాయి.

Cartoon Movement - Profit from Tragedy
మన దేశం విషయానికి వస్తే 2001లో 2.08 మిలియన్‌ కేసులు నమోదు కాగా 2018లో నాలుగు లక్షలకు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నది. ఇప్పటికీ గణనీయంగా ఉన్నందున మన దేశంలో మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మందును అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. రెండువందల మిల్లీ గ్రాములుండే ఒక్కోబిళ్ల తయారీకి మూడు రూపాయలు అవుతున్నట్లు అంచనా. దాన్ని ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు. బ్రాండ్‌, డోసు ఎక్కువ, తక్కువను బట్టి రేట్లలో తేడాలు ఉంటాయి. ఇదే అమెరికాలో 200 మిగ్రా ఒక్కోబిళ్ల తయారీకి ఇరవై నుంచి 70 రూపాయలవరకు ఖర్చు అవుతుంది. బహుశా ఈ కారణంగానే ట్రంప్‌ మన దేశం నుంచి చౌక ధరలకు ఈ మందు కావాలని మన ప్రధాని నరేంద్రమోడీని బెదిరించి ఉండవచ్చన్నది ఒక కారణం. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులను అధిక ధరలకు ఇతర దేశాలకు విక్రయించి మన దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటే అమెరికా వాణిజ్య కంపెనీలకు రెండు చేతులా లాభాలే లాభాలు. ఇది నగ సత్యం. కరోనా వైరస్‌ నివారణకు ఈ మందు పని చేస్తుందని ఎవరూ నిర్దారించకపోయినా ట్రంప్‌ పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించటంతో అమెరికన్లు తుపాకులతో పాటు ఈ ఔషధాన్ని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఎప్పుడైనా పనికి వస్తుందని నిలవ చేసుకుంటున్నట్లు వార్తలు. తుపాకులు ఎందుకు అంటే అమెరికాలో ఏ కారణంతో అయినా సంక్షోభ పరిస్ధితులు ఏర్పడినపుడు చేతిలో తుపాకీ ఉంటే రక్షించుకోవచ్చన్నది అమెరికన్ల నమ్మిక !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d