• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

సరిహద్దు ప్రాంతాన్ని చైనా మనదేశానికి అప్పగించిందా ? నరేంద్రమోడీ పరువు తీస్తున్న సోషల్‌ మీడియా భక్తులు !

02 Saturday Nov 2024

Posted by raomk in Asia, BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, BJP, fake news, Indo - China trade, Indo-China standoff, Narendra Modi Failures, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ఫేక్‌ న్యూస్‌, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్‌ ఉన్న ఫోన్‌ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.

ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్‌ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్‌ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్‌ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్‌ చేసిందని, షేర్‌ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్‌, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.

చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్‌ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదని, టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్‌ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్‌ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్‌ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.


2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్‌ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఉపన్యాసమంటూ ఫేక్‌ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్‌ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్‌ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్‌ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్‌ అయింది. తీరా అది ఫేక్‌ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్‌ మహిళా మేయర్‌ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్‌ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్‌ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్‌ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్‌ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్‌ న్యూస్‌ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులకు గేట్లు తెరిచిన మోడీ సర్కార్‌ : సంఘపరివార్‌కు ఎదురు దెబ్బ ! కార్పొరేట్‌ సత్తానా మజాకా !!

26 Saturday Oct 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, BRICS, Indo - China trade, Indo-China standoff, Narendra Modi, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు.


నాలుగు సంవత్సరాల క్రితం మనదేశంలో చైనా వ్యతిరేక ఉన్మాదం తారాస్థాయిలో ఉంది.చైనా వస్తువులను బహిష్కరించి దాన్ని మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీరంగం వేశారు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు, రాతలు ఎక్కడా కనిపించవు. అక్టోబరు చివరి వారంలో కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల శీర్షికలు కొంతమందికి ఆనందం, ఆసక్తి కలిగిస్తే మరి కొందరికి ఆందోళన కలిగించవచ్చు. 2020 సంవత్సరంలో జరిగిన సరిహద్దు ఉదంతాల అనంతర అనుమానాల నుంచి బయటపడి లడక్‌ సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్దరించేందుకు భారతచైనా ప్రభుత్వాలు నిర్ణయించాయి, ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఈమేరకు కరచాలనం చేసి ఆమోద ముద్రవేశారు. ఇది రెండు దేశాలకూ శుభసూచికం. వేల కోట్ల రూపాయలను సరిహద్దుల్లో వృధా చేయనవసరం లేదు. ‘‘ భారతచైనాల సామరస్యత కొరకు భారత సిఇఓలు ఎందుకు వత్తిడి చేశారు ’’ ( 2024 అక్టోబరు 24 ) బిజినెస్‌ చెఫ్‌ డాట్‌కాం విశ్లేషణ శీర్షిక. పదాల తేడాతో అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ఇచ్చిన ఇదే వార్తకు మరికొంత విశ్లేషణను జోడిరచి జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్‌ కొన్నింటిలో దర్శనమిచ్చింది. ఇదే సమయంలో ‘‘ పావురాల మధ్య గండుపిల్లి ’’ అంటూ చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు మరోశీర్షికతో వచ్చిన వార్తా విశ్లేషణలో చైనా పెట్టుబడుల గురించి భారత మాజీ రాయబారి హెచ్చరిక గురించి రాశారు. ఈ అంశంలో ఏం జరుగుతోంది ? ఎవరు దిగి వచ్చారు, ఎవరు వెనక్కు తగ్గారన్నది పాఠకులకే వదలి వేద్దాం.

గాల్వన్‌లోయలో పెద్ద ఉదంతం జరిగిన తరువాత మన దేశం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించి రాకుండా అడ్డుకుంది. ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు ఎందుకు చైనాతో సంబంధాల పునరుద్దరణకు నరేంద్రమోడీ మీద వత్తిడి తెస్తున్నారు ? చైనా సోషలిస్టు వ్యవస్థ అంటే అభిమానమా, కమ్యూనిజం అంటే ప్రేమా ?కానే కాదు, పక్కా వాణిజ్య ప్రయోజనాలే ! పెట్టుబడుల మీద ఆంక్షల సడలింపు గురించి కొద్ది నెలల క్రితమే మన అధికారం యంత్రాంగం లీకులు వదిలింది. దాని మీద ప్రతికూల ప్రచారం, వ్యతిరేకత తలెత్తకుండా రాజకీయ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. చైనా పెట్టుబడులను అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ఈ ఏడాది వెల్లడిరచిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాలే సూచన ప్రాయంగా వెల్లడిరచాయి. అయితే సరిహద్దు వివాదం చర్చలు కొనసాగుతున్న తరుణంలో తలుపులు బార్లా తెరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చైనా వ్యతిరేకులను చల్లబరిచేందుకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు చూస్తున్నారు. సరిహద్దులో పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చిన వార్తల ప్రకారం ఇరుదేశాల పరువుకు భంగం కలగకుండా గతంలో ఎవరు ఎక్కడ ఉంటే అక్కడకు వెనక్కు తగ్గాలన్న ఒప్పందం కుదిరింది. ఆ మేరకు తట్టాబుట్టా సర్దుకోవటం ప్రారంభమైంది. చైనాతో సాధారణ స్థితికి మన సంబంధాలు రాకూడదని కోరుకుంటున్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు.దానికి తక్షణ స్పందన అన్నట్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో మన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడాకు మద్దతు పలుకుతున్న వైనాన్ని చెప్పవచ్చు.అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ సూటిగా ఉండదు.

ఇటీవలి ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చీలికలను ఉపయోగించుకొనేందుకు వెంటనే మనదేశంలో చైనా రాయబారి పావులు కదిపారని చైనాలో భారత మాజీ రాయబారి గౌతమ్‌ బంబావాలే వ్యాఖ్యానించారు. చైనా ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలతో పావురాల మధ్య గండుపిల్లిని వదలినట్లయింది. ఈ విషయంలో సమన్వయం లేదని, అలాంటి ప్రకటన చేసే ముందుకు జాతీయ భద్రతా సలహాదారులను కూడా పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని, ఎకనమిక్‌ సర్వే సమయంలో వ్యాఖ్యలు చేయటం ఆందోళనకరంగా ఉందని గౌతమ్‌ వ్యాఖ్యానించారు. టెలికమ్యూనికేషన్స్‌ ఇతర రంగాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గౌతమ్‌ సలహాఇచ్చారు. చైనా పెట్టుబడులపై పునరాలోచనలేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ గతంలోనే చెప్పినా పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. చైనాతో సఖ్యతకు కేంద్రం సుముఖంగా లేకపోతే సరిహద్దు సమస్యపై అంగీకారం కుదిరివుండేదే కాదు.రానున్న రోజుల్లో వేగం పుంజుకొనే అవకాశం ఉంది. చైనా పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) గతంలో ఏం చెప్పిందో 2020జూలై ఒకటవ తేదీ ఎఎన్‌ఐ వార్త సారాంశాన్ని చూద్దాం.ఆ సంస్థ జాతీయ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పినదాని ప్రకారం ఇలా ఉంది.‘‘పేటిఎం వంటి భారతీయ స్టార్టప్‌ కంపెనీల నుంచి చైనా పెట్టుబడులకు ఉద్వాసన పలకాలి. మన విదేశీమారకద్రవ్య నిల్వలు ఐదువందల బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు లెక్కలోనివి కాదు. మన సంస్థలు పైచేయి సాధించటానికి ఇదొక సువర్ణ అవకాశం.చైనా పెట్టుబడులను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. చైనా ఒక సూపర్‌పవర్‌ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నపుడు దాన్ని మనం దెబ్బతీయాల్సిన అవసరం లేదా ? ముందుగా మన పరిశ్రమలను రక్షించుకోవాలి.’’ సరిగ్గా ఈ మాటలు చెప్పిన నాలుగు సంవత్సరాల తరువాత అదే చైనా నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలని మన ఎకనమిక్‌ సర్వేలో రాసుకున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులను తీసుకోవచ్చని అదే పాలకపార్టీ పెద్దలు సెలవిస్తున్నారు.మేము వాణిజ్యం కావాలనుకుంటున్నాం, పెట్టుబడులను కోరుకుంటున్నాం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటాం అని తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.అమెరికన్లను ఉద్దేశించిన ఒక సమావేశంలో ఈ మాటలు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవద్దని ఎవరన్నారు? ఇది కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను నిరంతరం రెచ్చగొట్టే సంఘపరివార్‌, దాని భావజాలానికి లోనైన వారికి చెప్పుకోరానిచోట తగిలినదెబ్బ.

2020 సరిహద్దు ఉదంతం తరువాత చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎదురుతన్నుతున్నాయని మన కార్పొరేట్‌ పెద్దలు చెప్పినట్లు, వాణిజ్య ఆంక్షలను సడలించేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. నిజానికి చైనా నుంచి దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఈ విషయంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. నిబంధనలు సడలించటం అంటే పెట్టుబడుల స్వీకరణకు ద్వారాలు తెరవటమే. గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనాతో లావాదేవీలు 118.4బిలియన్‌ డాలర్లు కాగా అక్కడి నుంచి చేసుకున్న దిగుమతుల మొత్తం 101.7బిలియన్‌ డాలర్లు ఉంది. చైనా పెట్టుబడులపై ఆంక్షల కారణంగా చిప్‌ తయారీ వంటి ఉన్నత సాంకేతిక రంగాలతో పాటు విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీలో కూడా వెనుకబడుతున్నట్లు భావిస్తున్న కార్పొరేట్స్‌ చైనా పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలని మోడీ సర్కార్‌ మీద తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. భారతీయులు యజమానులుగా ఉన్న కంపెనీలలో తొలిదశలో పదిశాతం మేరకు చైనా పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత పదిహేను సంవత్సరాలలో మనదేశ దిగుమతులలో చైనావాటా 21 నుంచి 30శాతానికి పెరిగింది.ప్రస్తుతం మొత్తం దుస్తులు, వస్త్రాల దిగుమతుల్లో చైనా నుంచి 41.5, ఎలక్ట్రానిక్‌, టెలికాం ఉత్పత్తులు 38.7,యంత్రాలు 38.5 శాతం చొప్పున ఉన్నాయి.రసాయనాలు 28.7,ప్లాస్టిక్స్‌ 25, ఆటోమొబైల్‌ 23, ఐరన్‌,స్టీలు, బేస్‌ మెటల్‌ 16.6శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.నరేంద్రమోడీ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత 201920లో చైనా నుంచి దిగుమతుల విలువ 8,187 కోట్ల డాలర్లుండగా 202324నాటికి 11,839 కోట్ల డాలర్లకు పెంచారు.(2015లో 7,166కోట్ల డాలర్లు మాత్రమే ఉండేది.) ఇదే సమయంలో మన ఎగుమతులు చైనాకు 1,661 కోట్ల నుంచి 1,665 కోట్ల డాలర్లకు మాత్రమే పెరిగాయి. మన మేకిన్‌ ఇండియా ఎలా విఫలమైందో దీన్నొక ఉదాహరణగా చెప్పవచ్చు.

కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి 2023 చివరిలో చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించటమే మోడీ సర్కార్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనమని 2024 జూలై 18 ఎకానమిస్టు పత్రికలో వచ్చిన వార్తను నిదర్శనంగా చూపుతున్నారు.కొన్ని కంపెనీలలో యంత్రాల అమరిక వంటి పనులకు అవసరమైన చైనా ఇంజనీర్లను గతనాలుగు సంవత్సరాలుగా మనదేశం అనుమతించని కారణంగా మన పరిశ్రమలకే నష్టం వాటిల్లింది. తాజాగా ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఇ వీసాలు ఇచ్చేందుకు నిర్ణయించటంతో పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగింది. ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక ధోరణి తగ్గి, సరిహద్దుల్లో శాంతి మంత్రం జపించటం పెరిగింది. సరిహద్దు చర్చలు ‘‘పురోగతి’’లో ఉన్నాయని ఏప్రిల్‌ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పారు. ఆ మరుసటి నెలలోనే 18నెలల తరువాత ఢల్లీిలో చైనా నూతన రాయబారి నియామకం జరిగింది.మరో వైపు మన దేశంలో దలైలామాను అమెరికా అధికారులు కలిసినా పెద్ద సమస్యగా మార్చకుండా చైనా సంయమనం పాటించింది. దాన్ని అమెరికాతో సమస్యగా పరిగణించింది. సరిహద్దులో బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఇరు దేశాలు సేనలను వెనక్కు రప్పించి, కాపలా నిబంధనలను సడలించటం కూడా ముఖ్యపరిణామమే.చైనా ఇతర దేశాలతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదని, భారత్‌తో సఖ్యతగా మెలిగితే దానికి లాభం తప్ప నష్టం ఉండదనే ముందుచూపుతో సరిహద్దుల్లో సఖ్యతకు అంగీకరించిందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన కొన్ని కార్పారేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. చైనా ప్రభుత్వ ంగ సంస్థ ఎస్‌ఏఐసి మోటార్స్‌తో కలసి మన దేశానికి చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూపు 2030నాటికి దేశ మార్కెట్లో గణనీయ వాటాను దక్కించుకొనేందుకు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ లాంగ్‌ ఛీర్‌ మరియు హెచ్‌కెసి అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, మైక్రోమాక్స్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ల నమూనాలు, ఐటి హార్డ్‌వేర్‌, టెలికాం పరికరాల రూపకల్పనలకు ఓడిఎం హాక్విన్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. చైనాలో యాపిల్‌ ఐ ఫోన్లను తయారు చేసే అమెరికా కంపెనీ మనదేశంలో కూడా ఉత్పత్తి చేస్తున్నది. దానికి విడిభాగాలను అందిస్తున్న చైనా కంపెనీలను మనదేశంలో ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వాటివలన చైనాకు వచ్చే నష్టం ఉండదు.

సరిహద్దు సమస్యపై ఒప్పందాలు, పెట్టుబడుల స్వీకరణకు చైనాతో సఖ్యత కుదుర్చుకుంటున్న మన దేశం పాకిస్తాన్‌తో అదే మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదని కూడా మన మీడియాలో కొందరు విశ్లేషిస్తున్నారు. అదేమీ అర్ధం కానంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా కలవాలంటే చైనా నుంచి ఎఫ్‌డిఐ అవసరమని తాజా ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు. మనవాణిజ్యంలో ప్రధమ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి మరోసారి చైనా ముందు వచ్చింది.అమెరికాకు ఎగుమతులు చేయాలన్నా చైనా పెట్టుబడుల అవసరం ఉంది. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెడితే మనం ఎగుమతులు చేయవచ్చు. ఇలా ఆర్థికంగా చైనాతో ఉన్న లాభాలు పాకిస్థాన్‌తో లేవు. పాక్‌ ప్రేరేపిత లేదా అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు మనదేశంలో అనేక దాడులు చేసి ఎంతో నష్టం కలిగించారు.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ పాక్‌ నుంచి మనదేశానికి ఉగ్రవాదంతీవ్రవాదులను ఎగుమతి చేస్తున్నట్లుగా చైనా నుంచి లేదన్నది తెలిసిందే.చైనాను వ్యతిరేకించేవారు, అనుమానంతో చూసే వారు కూడా ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ ‘‘కల్యాణానంద’’ స్వామికి ఓ ప్రశ్న : హతవిధీ ! ఇలాంటి ‘‘సనాతనుల’’ సరసనా మీరు చేరింది !! రేపిస్టులు, హంతకులకు సన్మానాలు !!!

17 Thursday Oct 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

Bilkis Bano gangrape, BJP, Gouri lankesh, Gurmeet Ram Rahim Singh, Hinduthwa, Narendra Modi Failures, Pawan kalyan, RSS, Sanatan Hindu Dharma, VHP

ఎం కోటేశ్వరరావు


తాను పక్కా సనాతనవాదినంటూ పవన్‌ కల్యాణ్‌ ఊగిపోతూ చెప్పారు, చెబుతూనే ఉంటారు. ఎందుకంటే సనాతనవాదం పులి స్వారీ వంటిది. ఒకసారి పులినెక్కిన వారు అది ఎక్కడికి తీసుకుపోతే అటు పోవాల్సిందే. ఊహలు, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, సినిమాలు, సాహిత్యంలో తప్ప చరిత్రలో పులిని అదుపుచేసిన వారు ఎవరూ లేరు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తానం ఎలా ఉంటుందో చూద్దాం. వారాహి ప్రకటన సందర్భంగా చేసిన సనాతన విన్యాసాల మీద సామాజిక మాధ్యమంలో అనేక మంది అంతకంటే ఎక్కువగా స్పందించి చీల్చి చెండాడుతూ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమాధానం రాలేదు.బహుశా ఇలా జరుగుతుందని అనుకొని ఉండరు.భావజాల పోరులో ఎదుటి వారి మీదికి బంతిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. తగ్గేదేలేదని చరిత్ర నిరూపించింది. సనాతన ధర్మమునందు విడాకులు లేవు అంటూ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలనుపవన్‌ కల్యాణ్‌ సుభాషితాలను కలిపిన ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. దాన్ని తనకు వర్తింప చేసుకొని ఎలా సమర్ధించుకుంటారో తెలియదు.

పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద విరుచుకుపడిన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే సనాతనులకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకొనే వారు చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుపడిరది. అఫ్‌కోర్సు వారిలో కట్టర్‌ హిందూత్వవాదులు ఉండరనుకోండి. ప్రముఖ జర్నలిస్టు, పురోగామివాది, హిందూత్వ వ్యతిరేకి అయిన గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన కేసులో నిందితులైన పరశురామ్‌ వాగ్మోరే, మనోహర్‌ యెదవే అనే వారిని కర్ణాటక సనాతన లేదా హిందూత్వశక్తులు విజయపురాలో 2024 అక్టోబరు 11న సన్మానించాయి. గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబరు ఐదవ తేదీన కాల్చిచంపారు. బెంగలూరు సెషన్స్‌ కోర్టు అక్టోబరు తొమ్మిదవ తేదీన జారీ చేసిన ఆదేశాల మేరకు ఎనిమిది మంది నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో మొత్తం 18 మందిలో 16 మంది బెయిలు మీద బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరిలో శరద్‌ కలాస్కర్‌ అనే వాడు మహారాష్ట్ర హేతువాది నరేంద్ర దబోల్కర్‌ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా లోపలే ఉన్నాడు. వికాస్‌ పాటిల్‌ అనే వాడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు కన్నడ పత్రిక వార్తా భారతి కథనం ప్రకారం తమ స్వస్థలం విజయపుర వెళ్లినపుడు కాళికాదేవి గుడిలో పూజలు చేశారు, సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌), శ్రీరామ్‌ సేన కార్యకర్తలు వారికి సన్మానం చేశారు, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హిందూత్వ నేతలు వారిద్దరినీ ఆరేళ్లుగా అన్యాయంగా జైల్లో ఉంచారని, విజయదశమి సందర్భంగా వారిని విడుదల చేయటం సంతోషమని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ వార్తను చదివారో లేదో తెలియదు. ఒకవేళ చదివినా ఆ కేసులోని వారు ఇంకా నిందితులే తప్ప నేరం రుజువు కాలేదుగా అని లా పాయింట్‌ తీసి ‘‘సనాతనుల’’ను సమర్ధించవచ్చు. అందుకే మరికొన్ని ఉదంతాలను పేర్కొనాల్సి వస్తోంది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానూ అనే మహిళపై గోద్రా అనంతర మారణకాండ సందర్భంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన సంగతి తెలిసిందే. అత్యాచార కేసులో నేరగాండ్లలో పరివర్తన కలిగి మంచివారుగా మారారంటూ అక్కడి సనాతనవాదుల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఆ సందర్భంగా వారిని సనాతన ధర్మాన్ని లేదా హిందూత్వను కాపాడేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకొనే విశ్వహిందూపరిషత్‌ నేతలు వారికి సన్మానం చేసి, మిఠాయిలు పంచారు. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అత్యాచారం కేసులో యావజ్జీవిత శిక్షపడిన వారు జైల్లో ఉండాల్సిందే. అయితే సదరు సదాచార సనాతనుల కేసులో ఆ తీర్పు రాక ముందే శిక్ష విధించినందున తరువాత వచ్చిన తీర్పు వారికి వర్తించదని, పాత నిబంధనల ప్రకారం వారి సత్ప్రవర్తకు మెచ్చి మేకతోలు కప్పి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే సుప్రీం కోర్టు ఆ చర్యను తప్పు పట్టి నేరగాండ్లను తిరిగి జైలుకు పంపింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని ఒకనాడు నినదించిన మన సభ్యసమాజం నేడు నేరగాండ్లకు పూలదండలు వేసి సత్కరిస్తే మౌనంగా ఉండిపోయిందంటే మన చర్మాలు ఎంతగా మొద్దుబారిందీ తెలుస్తున్నది. దేన్నయినా సమర్ధించే బాపతు తయారవుతున్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ ఏమంటారో ? అంతేనా !

సకల కళావల్లభుడిగా పేరుగాంచిన హంతకుడు, ఇద్దరు మహిళలపై అత్యాచార నేరగాడు డేరా సచా సౌదా ప్రవచకుడు గర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) జీవిత ఖైదు అనుభవిస్తూ బెయిలు మీద వచ్చినపుడు హర్యానా బిజెపి నేతలు ఆశీస్సులు పొందారు. అతగాడి అనుచరుల ఓట్లు పొందేందుకు గాను తాజా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్‌ మీద బిజెపి ప్రభుత్వం విడుదల చేసిందనే విమర్శలు వచ్చాయి.2018లో జమ్మూలోని కథువాలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి మద్దతుగా అక్కడ హిందూ ఏక్తా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శన తెలిసిందే.మహిళను దేవతగా కొలిచే సమాజంలో దాని గురించి రోజూ ప్రవచనాలు చెప్పేశక్తులే ఈ ఉదంతాలకు పాల్పడ్డాయంటే దేశం ఎటుపోతోందని కాదు, కొంత మంది ఎటు తీసుకుపోతున్నారో జనం ఆలోచించాలి. రామ్‌ రహీమ్‌కు 2017లో శిక్ష పడిరది, అప్పటి నుంచి ఉత్తరాదిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పెరోలు ఇవ్వటం గమనించాల్సిన అంశం.

బిల్కిస్‌ బానూ ఉదంతంలో నేరగాండ్లను సమర్దించటంలో మతాన్ని కూడా జోడిరచిన దుర్మార్గం, దాన్నినిస్సిగ్గుగా సమర్ధించిన ఉన్మాదం కనిపిస్తుంది. వారంతా సనాతనులే.మతాలతో నిమిత్తం లేకుండా అత్యాచారం ఎవరి మీద జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే. తమ నేతల ప్రమేయం ఉన్న ఉదంతాల పేరెత్తటానికి సనాతన నరేంద్రమోడీ సిగ్గుపడి ఉంటారు. 2014లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఢల్లీి నిర్భయ కేసును పేరు పెట్టి ప్రస్తావించిన ఆ పెద్దమనిషి తమ ఏలుబడిలో జరిగిన కథువా, ఉన్నావో అత్యాచారాల తరువాత మాట్లాడుతూ సాధారణ పరిభాషలో ఖండిరచారే తప్ప వాటి ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఎందుకంటే కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాల్సి ఉండగా విమర్శలు పెరగటంతో తీరికగా తరువాత రాజీనామా చేయించారు. ఉన్నావో ఉదంతంలో బిజెపి ఏంఎల్‌ఏ దోషి, ఇప్పుడు జీవిత కాలఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకుడు, అన్యాయంగా ఇరికించారంటూ అతగాడిని రక్షించేందుకు అనేక మంది ఎంఎల్‌ఏలు, బిజెపి పెద్దలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎడిఆర్‌ అనే స్వచ్చంద సంస్థ మహిళల మీద నేరారోపుణలు తమ మీద ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్న 48 మంది ఎంఎల్‌ఏలు, ముగ్గురు ఎంపీల వారిలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి రోజూ కబుర్లు చెప్పే బిజెపికి చెందిన వారు 14 మంది, తాము కూడా అదే బాటలో నడుస్తామని చెప్పే శివసేనకు చెందిన వారు 7గురు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.

హర్యానాలోని ఆరు జిల్లాలు, పక్కనే ఉన్న పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డేరా బాబా అనుచరులు ఉన్నారు. ప్రధానంగా దళిత సామాజిక తరగతికి చెందిన వారు. వారి ఓట్ల కోసం పడేపాట్లు ఇవి.వ్రతం చెడ్డా బిజెపికి ఫలం దక్కలేదని పరిశీలకులు చెబుతున్నారు.డేరా బాబా పలుకుబడి ఉందని భావిస్తున్న ఆరు జిల్లాల్లో 28 అసెంబ్లీ సీట్లుండగా బిజెపి గెలిచింది పది చోట్ల మాత్రమే, కాంగ్రెస్‌ 15 గెలుచుకుంది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర బిజెపి ప్రభుత్వం డేరాబాబాకు పదకొండుసార్లు బెయిలు ఇచ్చి బయటకు వదిలింది. ఏడు సార్లు వేర్వేరు చోట్ల ఎన్నికలకు ముందు బెయిలు ఇచ్చారు. తాజాగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అదే జరిగింది. బిజెపికి ఓటు వేయాల్సిందిగా అనుచరులకు సందేశం పంపాడు. అతగాడి ఆశ్రమం ఉన్న సిర్సా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బిజెపికి ఒక్కటి కూడా దక్కలేదు. మూడు కాంగ్రెస్‌కు రెండు ఐఎన్‌ఎల్‌డికి వచ్చాయి. బిజెపితో పోటీ పడి కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా డేరాబాబా ఆశీసుల కోసం ప్రదక్షిణలు చేశారు. సనాతనవాదుల మందలో కొత్తగా చేరిన పవన్‌ కల్యాణ్‌ తాను ఎన్నో చదివానని చెప్పిన తరువాత ఆ వాదాన్ని భుజానవేసుకున్నారు గనుక అమాయకుడని అనుకోలేం. సినిమా రంగం మనిషి, అక్కడ ఏ ఫార్ములా నాలుగు డబ్బులు తెస్తే పొలోమంటూ మిగతావారూ దాన్నే అనుసరిస్తారు.

సనాతనంహిందూత్వ ఫార్ములా ఓట్లు రాల్చేదిగా ఉందని బిజెపి దాన్ని ఎప్పటి నుంచో రంగంలోకి తెచ్చింది. సవ్యసాచి మాదిరి సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చేయాలనుకుంటున్నారు గనుక పవన్‌ కల్యాణ్‌ సనాతన ఫార్ములాను ఎంచుకున్నారని భావించవచ్చు. దీని వెనుక ఉన్న కారణాల గురించి కూడా చర్చ జరుగుతున్నది. మర్రి చెట్టువంటి చంద్రబాబు నాయుడి నీడలో ఎంతకాలం ఉన్నా ఎదుగూ బొదుగూ ఉండదు కనుక తాను ప్రత్యేకంగా కనిపించాలంటే సనాతనాన్ని భుజాన వేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడిన తాము ఆంధ్రప్రదేశ్‌లో హిందూత్వ అజెండా అమలు జరిపితే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చు గనుక శిఖండిలా పవన్‌ కల్యాణ్ణు రంగంలోకి దించిందని కూడా చెబుతున్నారు. హిందూమతంలో సంస్కరణలు తేవాలని ఆర్య(మహత్తర)సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని సనాతన వాదులు కుట్ర చేసి చంపారనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది తాము వేదాలను ప్రమాణంగా తీసుకుంటామని అదే సనాతన ధర్మమని అందమైన ముసుగువేసుకుంటారు. ఇది వేదకాలం కాదు, మనువాదులు అమలు జరుపుతున్న కుల,మత సమాజం.వేదాలను ప్రామాణికంగా తీసుకొనే వారేమీ కులమతాలకు అతీతంగా లేరు గనుక ఉన్న దుర్మార్గపూరిత వ్యవస్థను ఏదో ఒక పేరుతో సమర్ధించేవారిగానే పరిగణించాలి. పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ తెగకు చెందిన వారే. అయితే ఐదు పదులు దాటిన ఆ పెద్దమనిషి గ్రహించాల్సిందేమంటే హిందూత్వ నినాదం పనిచేయటం వెనుక పట్టు పట్టిన తరుణంలో దాన్ని ఎంచుకున్నారు. ఆయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలోనే బిజెపి మట్టి కరచింది.వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా పడిపోయింది.


మహనీయుడు అంబేద్కర్‌ దృష్టిలో సనాతన ధర్మం అంటే వేద,బ్రాహ్మణిజం అన్నది స్పష్టం.ఆయన కాలంలో కులమతాలు, అంతరాలు లేవని చెబుతున్న వేదకాలము లేదూ వేదాలకు అనుగుణంగా పాలనా లేదు.మనువాదం మాత్రమే ఉంది. అందుకే వేదాల జోలికి పోకుండా మనుధర్మ శాస్త్రాన్నే తగులపెట్టారు. మనువాదులు తాము చెప్పేదానినే సనాతన ధర్మమని భాష్యం చెబుతున్నారు, ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తున్నది వారే. అందువలన ఎవరైనా సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మను ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్లే, దాన్ని పరిరక్షించాలని, విమర్శించేవారిని సహించబోమని పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెబుతున్నారంటే అంబేద్కర్‌ను కూడా వ్యతిరేకించుతున్నట్లే. ఉనికిలో లేని వేదకాల సనాతనంతో ఎవరికీ ఇబ్బంది లేదు,అమలులో ఉన్న మనుసనాతనం, అది సృష్టించిన వివక్షను నిర్మూలించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌ అంశంలో గీత దాటితే అంతే సంగతులు-సైనిక విన్యాసాలతో అమెరికాకు చైనా హెచ్చరిక !

16 Wednesday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, China, China Drills, Joe Biden, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

స్వాతంత్య్రం పేరుతో అమెరికా, ఇతర దేశాల అండచూసుకొని రెచ్చిపోతున్న తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పాలకులను హెచ్చరిస్తూ సోమవారం నాడు చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా తన తొలి విమానవాహక యుద్ద నౌక, పలు విమానాలు, మిలిటరీ నౌకలు,డ్రోన్లు, ఆయుధాలతో తన సత్తా ఏమిటో పశ్చిమ దేశాలకు వెల్లడిచేసింది.తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటు కోరుతున్న శక్తులకు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా ఇది గట్టి హెచ్చరిక. జాయింట్‌ స్వోర్డ్‌ 2024బి పేరుతో జరిపిన విన్యాసాల్లో అవసరమైతే తైవాన్‌ దిగ్బంధం, దాడులు ఏలా చేయగలమో చూపింది. గతంలో కూడా విన్యాసాలు జరిపినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఉన్నట్లు భావిస్తున్నారు. చైనా పిఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ లీ షీ మాట్లాడుతూ ఒకేసారి త్రివిధ దళాల సమన్వయంతో భూ, గగనతల, సముద్ర దాడులు, రేవులు, ఇతర ప్రాంతాల దిగ్బంధనం ఎలా చేయగలమో పరీక్షించి చూపినట్లు, ఇది గట్టి హెచ్చరిక అని చెప్పాడు. తైవాన్‌ నాయకత్వం పదే పదే తమ రక్షణ గగనతలం అని చెప్పుకుంటుందని, దాన్ని ఎలా చీల్చి చెండాడగలమో చూపటమే లక్ష్యంగా పలు వైపుల నుంచి దాడులను సమన్వయం ఎలా చేసేదీ చైనా త్రివిధ దళాలు చూపాయి. అందుకే ఉమ్మడి ఖడ్గం అని పేరు పెట్టారు. మెడ మీద వేలాడే ఖడ్గం లేదా సుత్తి మాదిరి రూపాందించారు. చైనాతైవాన్‌ మధ్య ఉన్న జలసంధిలో రెండు ప్రాంతాలు, తూర్పున రెండు, ఉత్తర, దక్షిణాన ఒక్కొక్క జోన్‌గా ఈ విన్యాసాలు జరిగాయి. గతం కంటే వీటిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలో ఉన్న రేవుల ద్వారా తైవాన్‌ సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నది. ఆ రేవులను దిగ్బంధనం కావించి ఆర్థిక లావాదేవీలను మిలిటరీ ఎలా దెబ్బతీయగలదో ఈ సందర్భంగా ప్రదర్శించారు.


తైవాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తాము కూడా తమ దళాలతో గమనించామని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తాము 153 విమానాల గమనాన్ని పరిశీలించామని, 90సార్లు తమ గగన తలంలోకి ప్రవేశించాయని,కొన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెప్పాడు. ఏడు నౌకలు, మరో నాలుగు ఇతర నౌకలు తైవాన్‌ దీవి చుట్టూ చక్కర్లు కొట్టాయని ఆరోపించాడు. ఈ ఏడాది మే నెలలో పిఎల్‌ఏ ఒకసారి విన్యాసాలు నిర్వహించింది.అక్టోబరు పదవ తేదీన తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ అధ్యక్షుడు లాయ్‌ మాట్లాడుతూ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తమకు ప్రాతినిధ్యవహించదని, దానికా హక్కు లేదంటూ తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాడు. విన్యాసాలు పౌరులకు వ్యతిరేకంగా కాదని, వేర్పాటువాద శక్తులను హెచ్చరించేందుకేనని, వారికి చీమ చొరబడేంత అవకాశం కూడా ఇచ్చేది లేదని, శాంతియుతంగా విలీనానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా చెప్పింది. ఒకే చైనా విధానానికి అనుగుణంగా తైవాన్‌ దీవి చుట్టూ పహరాకు నౌకా దళాన్ని నిరంతర వినియోగిస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేసింది.


తైవాన్‌ ప్రాంతంలో చైనా అంతర్భాగమే అంటూనే శాంతియుతంగా విలీనం చేసే సమయం ఆసన్నం కాలేదంటూ అమెరికా నాటకాలాడుతోంది. బలవంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పదే పదే ప్రకటిస్తోంది. చైనా అంటే తైవాన్‌లో ఉన్న ప్రభుత్వమే అని ఐరాస 1971వరకు గుర్తించింది. అంతకు ముందు దశకంలో సోవియట్‌ యూనియన్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన వివాదాలను అవకాశంగా తీసుకొని చైనాను తమవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడతో అసలైన చైనాకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ప్రధాన ప్రాంతాన్నే గుర్తించేందుకు అమెరికా పావులు కదిపింది. దాంతో భద్రతా మండలిలో 1971లో శాశ్వత సభ్యదేశంగా కమ్యూనిస్టు చైనాను గుర్తించారు. అయితే ఆ సమయంలో జరిగిన చర్చలు, నిర్ణయాల్లో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలని పేర్కొన్నారు. దాన్ని సాకుగా చూపుతూ అలాంటి సమయం ఇంకా రాలేదని గత ఐదు దశాబ్దాలుగా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను అందచేస్తూ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూస్తున్నది.బలవంతంగా విలీనం చేసుకుంటామంటే తైవాన్‌లో ఉన్న చిప్స్‌ పరిశ్రమలను పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించింది. తప్పనిసరైతే తప్ప రెండు కోట్ల 30లక్షల జనాభా ఉన్న తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకోబోమని చైనా చెబుతున్నది. బ్రిటన్‌, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటైన హాంకాంగ్‌, ఆసియా లాస్‌వేగాస్‌గా పేరుమోసిన జూద కేంద్రం మకావు దీవులు చైనా ఆధీనంలోకి వచ్చాయి.వాటిని వెంటనే చైనా సమాజంలో కలిపితే వచ్చే సమస్యలను, అక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులను గమనంలో ఉంచుకొని యాభై సంవత్సరాల పాటు 2047వరకు అక్కడ ఉన్న వ్యవస్థలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్నే ఒకేదేశంరెండు వ్యవస్థలుగా పిలుస్తున్నారు. ప్రత్యేక పాలనా యంత్రాంగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలను కూడా జరుపుతున్నారు. తైవాన్‌ పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అవసరమైతే జోక్యం చేసుకుంటామన్న మాటలను నమ్మి అక్కడి పాలకులు పదే పదే ససేమిరా అంటున్నారు. చైనా తాజా మిలిటరీ విన్యాసాల పూర్వరంగమదే.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరు ఎలా మన అంతర్గత అంశమో తైవాన్‌ కూడా చైనా స్వంత విషయమే. దానిలో జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. మన పాలకులు ఎప్పుడైనా ఆక్రమిత కాశ్మీరును విముక్తం గావిస్తామని ప్రకటిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఏడున్నర దశాబ్దాలుగా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎందుకు అంటే కారణాలనేకం, తైవాన్‌ విషయంలో కూడా చైనా అదే మాదిరి బలప్రయోగానికి పూనుకోవటం లేదు. అది వారు తేల్చుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీరు అంశంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నట్లుగానే తైవాన్‌ విషయంలో అమెరికా అంతకంటే ఎక్కువగా వేలు పెడుతోంది.పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు మిలిటరీ, ఆయుధాలు లేవు, అదే తైవాన్‌కు యుద్ద విమానాలు, క్షిపణులు, నౌకాదళం పూర్తి స్థాయి మిలిటరీ ఉంది. ప్రతి ఏటా అమెరికా సమకూరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మిలిటరీ శక్తి ఉన్న 145 దేశాలలో తైవాన్‌ 24వదిగా ఉంది. సర్వీసులో మొత్తం 2.15లక్షల మంది సైనికులు, 50వేల మంది పారా మిలిటరీ, మిలిటరీలో 35వేల మంది వైమానిక దళ సిబ్బంది,40వేల మందితో నౌకాదళం ఉంది, 286 యుద్ధ విమానాలుండగా వాటిలో ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 229 సిద్దంగా ఉంటాయి, ఇవిగాక కొన్ని హెలికాప్టర్లు ఉన్నాయి. నాలుగు జలాంతర్గాములతో సహా 93 రకాల మిలిటరీ నౌకలు ఉన్నాయి. ఇలాంటి శక్తితో తలపడితే ప్రాణనష్టం ఎక్కడ జరిగినా మరణించేది చైనా పౌరులే. అందుకే ప్రతి రోజూ రెచ్చగొడుతున్నా చైనా నాయకత్వం ఎంతో సంయమనంతో ఉంటోంది.


అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజా పరిణామాలపై మాట్లాడుతూ తైవాన్‌ జలసంధి, ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు ముప్పు రాకుండా చైనా సంయమనం పాటించాలని బోధ చేశాడు. తైవాన్‌ పాలకుడు లాయ్‌ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు అక్కడి ప్రజలకు నష్టదాయకమని చైనా పేర్కొన్నది. రాజకీయ స్వప్రయోజనాల కోసం తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే తైవాన్‌ జాతీయ దినోత్సవం పేరుతో చేసిన లాయ్‌ ఉపన్యాసమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. మే నెలలో లాయ్‌ బాధ్యతలు చేపట్టాడు, అతనొక ప్రమాదకర వేర్పాటు వాది అని అప్పుడు చైనా వర్ణించింది. అమెరికా కూడా తక్కువ తినలేదు. అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా 2022లో తైవాన్‌ పర్యటన జరిపి తమ మద్దతు వారికే అన్న సందేశమిచ్చారు. చైనా నాయకత్వ తీరు తెన్నులను చూసినపుడు అనివార్య పరిస్థితుల్లోనే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా వ్యవహరించదు. రానున్న ఐదు సంవత్సరాల్లో చైనా ఎలాంటి దాడులు చేయదని తాము నమ్ముతున్నట్లు సెప్టెంబరు నెలలో చేసిన ఒక సర్వేలో 61శాతం మంది తైవాన్‌ చైనీయులు చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తమ ఆర్థిక సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయుధ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం తద్వారా ఆయుధ అమ్మకాలను పెంచుకోవటం చూస్తున్నదే. అందుకే ఏదో ఒక మూల అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు.దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తైవాన్‌, దీవులు, అంతర్జాతీయ సముద్రమార్గంలో స్వేచ్చగా రవాణా తదితరాల పేరుతో చిచ్చుపెట్టేందుకు పూనుకున్నారు.తాను అండగా ఉంటానంటూ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను నమ్మించేందుకు,చైనాను బెదిరించేందుకు అమెరికా కూడా పదిరోజుల పాటు సాగేమిలిటరీ విన్యాసాలను ప్రారంభించింది. చైనా విన్యాసాలు బాధ్యతారహితం, ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేవిగా, భారీ ఎత్తున జరిగినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ఆరోపించింది.తైవాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలసి పదిరోజుల పాటు అమెరికా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.


తైవాన్‌ భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాలంటూ అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఎల్‌బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన విశ్లేషణను మే 11వ తేదీన తైపే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే మరింత ఎక్కువగా రక్షణ ఖర్చు పెంచాలని తైవాన్‌కు సూచించాడు.తమకు తైవాన్‌ అవసరం ఎంతో ఉన్నప్పటికీ దాని కోసం త్యాగాలు చేయాలని తమ నేతలు అమెరికన్లను అడిగే స్థితి లేదన్నాడు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని టోకియో, సియోల్‌ వంటి జనసమ్మర్ధం గల ప్రాంతాలకు సమీపంలోని అమెరికా సైనిక స్థావరాల మీద అణ్వాయుధాలను ప్రయోగించి ధ్వంసం చేస్తామని చైనా బెదరించిందని ఆరోపించాడు. అటువంటి పరిస్థితిలో తాము నేరుగా చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోనేందుకు సిద్దం కాదని, రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఇస్తున్న మాదిరిగానే పరోక్షంగా సాయం అందచేస్తామని తైవాన్‌ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
. ఐక్యరాజ్యసమితి 1949లో రూపొందించిన దేశాల హక్కులు, విధులకు సంబంధించిన ముసాయిదాలో ప్రతి దేశం అంతర్గత, విదేశీ వ్యవహరాలను ఎలా నిర్వహించాలో స్పష్టంగా పేర్కొన్నది. బయటి నుంచి ఎలాంటి జోక్యం, వత్తిడి లేదా మార్గదర్శనానికి తావు లేకుండా సాయుధ దళాల నియామకంతో సహా అనేక అంశాలు దానిలో పొందుపరిచారు. ఐరాస తీర్మానం ప్రకారం తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే, అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్నప్పటికీ దాని మీద పూర్తి అధికారం చైనాదే. అందువలన అంతర్గతంగా వేర్పాటు వాదాన్ని అదుపు చేయటంతో పాటు తైవాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా అంతర్జాతీయ నిబంధనలు అనుమతించిన మేరకు ఆధిపత్యం చైనాకే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావమ్మ మొగుడి కథ పునరావృతం అవుతోందా ? నరేంద్రమోడీ అద్భుత శక్తులెక్కడ ! ప్రశ్నిస్తున్న ప్రపంచ మీడియా !!

13 Sunday Oct 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

#Indian Economy, agriculture in india, BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీగారి మాటలను చూస్తే దేశం వెలిగిపోతోంది. భజన బృందాన్ని చూస్తే మోడీ విశ్వగురువు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లెక్కలను చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది. ఎవరి మాటలను నమ్మాలి ? తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను బట్టి జనమే తేల్చుకోవాలి. దేశంలో మాకు తిరుగులేదు అని బిజెపి చెబుతుంది. దాన్ని గుడ్డిగా నమ్మేవారున్నారు, చేసేదేముంది ! ఆ గోమాతే కనువిప్పు కలిగించాలి. వారికి వివరాలు తెలియకనా ? 2014లో బిజెపికి స్వంతంగా వచ్చిన ఓట్లు 31శాతం, ఎన్‌డిఏ కూటమి మొత్తానికి 38.5శాతం, 2019లో బిజెపికి 37.36శాతం, కూటమికి 45.3శాతం, 2024లో బిజెపికి 36.56శాతం కాగా కూటమికి 42.5శాతం వచ్చాయి. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం, జనసేన ఓట్లు కొత్తగా కలిసినా బిజెపికి, మొత్తంగా కూటమి ఓట్లశాతం తగ్గింది. దీన్ని చూస్తేమోడీ ప్రభావం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? ఇవి సాధారణ అంకెలు, ఆల్జిబ్రాకాదు గనుక అర్ధంగాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వేద గణికులను సంప్రదించవచ్చు.


ఇక్కడ ఒక పొట్టి పిట్టకత చెప్పాలి. ఊరంతా ఎప్పుడో వెళ్లిపోయిన కావమ్మ మొగుడులా ఉన్నావంటే కామోసు కామోసనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్ర ఇస్తే నాదారిన నేపోతా అన్నాడట సన్యాసివేషంలో వచ్చిన ఒక పెద్దమనిషి. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నట్లు ఇంతకాలం నమ్మిన ఊరూవాడా ఇప్పుడు అనుమానంగా చూస్తోంది.‘‘ నరేంద్రమోడీ తన అద్భుత శక్తి కోల్పోయారా ?’’ అంటూ ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ పత్రిక ‘‘ఎకానమిస్టు ’’ 2024అక్టోబరు పదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణను ప్రచురించింది. ప్రపంచ ఆర్థిక అంశాలను ప్రచురించే ఆ పత్రికే అనుమానాన్ని వ్యక్తం చేసిన తరువాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తరువాత కథ ఎలా ఉంటుంందో తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఏండ్ల తరబడి జరిగిన ప్రచారాన్ని చూసిన నరేంద్రమోడీ నిజంగా తాను దేవదూతననే నమ్మారు. నమ్మటం ఏమిటి ! చరిత్రలో అనేక మంది మాదిరి స్వయంగా ప్రకటించుకున్నారు. 2024 మే పదవ తేదీన వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్‌ 18 అనే టీవీ ఛానల్‌తో మోడీ మాట్లాడారు. దాన్లో ఏం చెప్పారు ‘‘ నా మాతృమూర్తి బతికి ఉన్నపుడు నేను దేహసంబంధంగానే(సాధారణ మానవుల్లా) పుట్టానని అనుకొనేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటినీ అవలోకించుకుంటే దేవుడు తనను పంపాడని నిర్ధారణకు వచ్చాను. కేవలం నా భౌతికదేహం నుంచైతే ఈ శక్తి వెలువడదు, దేవుడు నాకు ప్రసాదించాడు.నేను ఎప్పుడే పనిచేసినా దేవుడే నన్ను అలా నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.’’ అని చెప్పారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత అనేక మందిలో మోడీ అద్భుత శక్తుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ క్షణం తీరిక లేకుండా విదేశాలన్నీ తిరిగారు.ఎక్కువ సమయం విమానాల్లోనే గడిపారు. ఎందుకంటే యుపిఏ హయాంలో ప్రపంచంలో కోల్పోయిన భారత ప్రతిష్టను తిరిగి తీసుకురావటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పారు. జనం నిజమే కామోసనుకున్నారు. కానీ వాస్తవాలను చూస్తే వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గిపోయాయి. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏమైంది, విదేశాల్లో పెరిగిన ప్రతిష్ట ఎందుకు తగ్గినట్లు, విశ్వగురువుగా భుజకీర్తులు తప్ప పెట్టుబడులు ఎందుకు రావటం లేదు. వెనుదిరిగి చూస్తే జరిగిన ప్రచారం అంతా మాయ, కనికట్ట్లు అనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దేశానికే కాదు, ప్రపంచమంతా తగ్గటం లేదా అని దబాయించారు. ఇది నిజమా ? ఒక దగ్గర తగ్గితే మరో దగ్గర పెరుగుతున్నాయి. డబ్బునెవరూ మురగపెట్టుకోవటం లేదు. ఐరాస విడుదల చేసిన 2024 ప్రపంచ పెట్టుబడుల నివేదిక ఏం చెబుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 2022లో ఎనిమిదవ స్థానంలో ఉన్న మనదేశం 2023లో ఒక్కసారిగా 15వ స్థానానికి దిగజారింది. స్వల్పంగా తగ్గినప్పటికీ అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను కొనసాగించాయి. అమెరికాకు వచ్చిన పెట్టుడులు 332 నుంచి 311 బిలియన్‌ డాలర్లకు(6.32శాతం) తగ్గగా చైనాకు వచ్చినవి 189 నుంచి 163కు(13.75శాతం) తగ్గాయి, కానీ మనదేశానికి 49 నుంచి 28 బిలియన్‌ డాలర్లకు(42.85శాతం) తగ్గాయి. ఎఫ్‌డిఐల రాకపోకలు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ లాభం ఎక్కువగా ఉంటే అక్కడకు పోతాయి.ద్రవ్య పెట్టుబడికి ఒక ప్రాంతమంటూ ఉండదు. లాభం ఉందా లేదా అని చూసుకొని ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటే మధ్యాహ్నం భారత్‌, సాయంత్రానికి అమెరికా వెళ్లిపోతుంది. పరిశ్రమలకు అలా కుదరదు.


గాల్వన్‌లోయ సరిహద్దు ఉదంతం తరువాత చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులన్నీ భారత్‌కు మూకుమ్మడిగా తరలి వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియాలో కతలు కతలుగా కబుర్లు చెప్పారు. ఆమేరకు మన ఎఫ్‌డిఐలు పెరిగిన దాఖలాలు లేవు.‘‘ చైనా, భారత్‌ల నుంచి బయటకు వెళుతున్న పెట్టుబడులతో ఇతర దేశాలు లబ్దిపొందుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ 2024,ఏప్రిల్‌ 23) రాశారు. అంతే కాదు, చైనా వద్ద ఆపార సాంకేతిక సత్తా, అరుదైన మెటీరియల్‌, పారిశ్రామిక పునాది ఉన్నదని, దానికి ఎఫ్‌డిఐలు నిలిచిపోవచ్చు కూడా, అక్కడి నుంచే భారీ మొత్తాలలో పెట్టుబడులు బయటకు వెళుతున్నాయి,దానికి ఎఫ్‌డిఐ అవసరం లేకపోవచ్చు, భవిష్యత్‌ ఉన్న పరిశ్రమలను స్వంతంగా నిర్మించుకోగలదని కూడా రాశారు. మనదేశంలో నైపుణ్యం తప్ప సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, ఉత్పాదక వ్యవస్థలు లేవని, మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళితే ఎక్కువ నష్టం మనకే ’’ అని కూడా గార్గ్‌ పేర్కొన్నారు. ఆయనేమీ మోడీ వ్యతిరేకి కాదు.


చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశలో ఉందని సోషల్‌ మీడియాలో సంచలనాత్మక శీర్షికలతో కతలు చెప్పేవారు మనకు కొల్లలుగా ఉన్నారు. అఫ్‌కోర్సు గుడ్డిగా వాటిని నమ్మేవారు ఉండబట్టే పదే పదే అలా చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం సమాచారం వెల్లడిరచకతప్పటం లేదు. సమాచారం కొత్తగా ఉన్నప్పటికీ మోడీ అభిమానులను ఇబ్బంది పెట్టే పాత సమస్యలనే అది జనం ముందుంచుతున్నది. వాటికి ఇంకే మాత్రం నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే కారణం అనటానికి అవకాశం లేదు. జనం గడ్డిపెడతారు. ఇది చైనా కాదు భారత యుగం అని భజన చేసేందుకు కుదరదు. రానున్న రోజుల్లో ఇబ్బందులకు ఆరంభ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా చెప్పక తప్పలేదు. ఈ కారణంగానే వడ్డీరేట్ల తగ్గింపు మీద ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.అయితే ఎన్ని ఇబ్బందులున్నా వర్తమాన సంవత్సర వృద్ధి రేటు 7.2శాతం ఉంటుందని చెబుతోంది. కరోనా తరువాత గొప్పగా ముందుకు పోతోందన్న వృద్ధి రేటు వడిదుడుకులకు లోనవుతున్నది. జనవరిమార్చి నెలల్లో వృద్ధి రేటు 7.8శాతం ఉండగా ఏప్రిల్‌జూన్‌లో 6.7కు పడిపోయింది. బొగ్గు,ముడిచమురు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక రంగాల తీరును చూస్తే మూడు సంవత్సరాల్లో మొదటి సారిగా ఆగస్టులో దిగజారింది. పారిశ్రామిక, సేవారంగాలలో ఎదుగుదల లేని కారణంగా ఉపాధి కోసం జనాలు తిరిగి వ్యవసాయం వైపు మరలు తున్నారు. మోడీ గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది అన్నది ఎండమావి అన్నది ఈ పరిణామం తెలుపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 201819లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు శ్రామికశక్తిలో 43శాతం ఉండగా అది 202324నాటికి 46శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 12 నుంచి 11శాతానికి తగ్గింది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగుల శాతం 7.8గా సిఎంఐఇ పేర్కొన్నది. ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన గురించి మోడీ చెప్పిన కబుర్లన్నీ వంచన తప్ప మరొకటి కాదు.ఉన్న ఉపాధి కోల్పోయి 6.8కోట్ల మంది వ్యవసాయ రంగానికి మరలినట్లే. పరిశ్రమలు, సేవారంగాల్లో యాంత్రీకరణతో పాటు వ్యవసాయంలో కూడా రోజు రోజుకూ యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఉదాహరణకు గతంలో పురుగు మందులను మనుషులే చల్లేవారు, ఇప్పుడు డ్రోన్లు ఆపని చేస్తున్నాయి. వాటిని ఇతర అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ దీదీ తదితర పథకాల పేరుతో డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీ ఇస్తున్నది, అవింకా పెరిగితే ఉపాధి ఇంకా తగ్గుతుంది. డ్రోన్‌ పరిశ్రమలు పెరిగితే ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు తప్ప అంతకంటే ఎన్నో రెట్లు వ్యవసాయ కూలీలకు తగ్గే పని రోజులు, ఆదాయం గురించి మాత్రం మాట్లాడరు. మరోవైపు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న సబ్సీడీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు భారీ మొత్తాలలో ఉండే పరిశ్రమలకు తప్ప ఉపాధి ఎక్కువగా దొరికే వాటికి వెళ్లటం లేదని అభివృద్ధి అధ్యయనాల మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్థికవేత్త అభిషేక్‌ ఆనంద్‌ చెప్పారు.


ముడిచమురు ధరలు పీపాకు పది డాలర్లు పెరిగితే జిడిపిలో 0.4శాతం తగ్గిపోతుంది. అదే తగ్గితే అంతే మేరకు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే సబ్సిడీల మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి రాయితీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో జిడిపి పెరిగినట్లు కనిపిస్తున్నది. అది తాత్కాలికమే అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన పెట్టుబడి ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఎంతో ముఖ్యం. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 30శాతం మూలధన పెట్టుబడి ఖర్చు తగ్గిందని, అదే ఏప్రిల్‌ఆగస్టు నెలలకు 19.5శాతం తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.8శాతం తగ్గింది, ఇది గత 42నెలల్లో అధ్వాన్నపని తీరు. జిఎస్‌టి వసూళ్లు పెరుగుతున్నాయి, అవి కూడా సెప్టెంబరులో 6.5శాతమే, 2021 తరువాత ఇంత తక్కువ పెరుగుదల లేదట.ఉత్పత్తి, సేవారంగాల పిఎంఐ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది అదే నెలలో 9.3శాతం మేరకు వాహనాల అమ్మకాలు తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది.వీటిని వినిమయానికి ఒక సూచికగా పరిగణిస్తారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నాలుగు నెలలుగా పడిపోతూనే ఉన్నాయి, 43నెలల్లో అధ్వాన్నంగా తేలింది. కార్ల నిల్వలు పెరిగిపోవటంతో వాటిని వదిలించుకొనేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించటం రోజూ పత్రికల్లో కనిపిస్తున్నదే.పండుగల తరుణంలో పరిస్థితి మెరుగుపడుతుందనే ప్రకటనలు ప్రతి ఏటా తెలిసిందే.

ప్రపంచ మీడియా నరేంద్రమోడీ అద్భుత శక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తోంది ? ఎన్నికల్లో మోడీ ఆకర్ష ఆకర్ష మంత్ర ప్రభావం, గొప్పగా ప్రచారం చేసుకున్న ఎఫ్‌డిఐ, దేశ ఆర్థిక రంగం ఎలా ఉందోపైన చెప్పుకున్న విషయాలన్నీ మన గోడీ మీడియా చర్చలు పెట్టకపోతే, విశ్లేషణలు రాయనంత మాత్రాన, నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్న ముసలమ్మ మాదిరి ఉంటే సూర్యోదయంఅస్తమయం ఆగుతుందా ? హర్యానా ఎన్నికల్లో బిజెపికాంగ్రెస్‌ మధ్య ఓట్లతేడా ఒకశాతం లోపే. ఒక స్థానంలో పోటీ చేసిన సిపిఎం, 89 చోట్ల బరిలో దిగిన కాంగ్రెస్‌కు కలిపి వచ్చిన ఓట్లు 39.34శాతం కాగా, బిజెపికి 39.94 ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌ కలుపుకొని వెళ్లి ఉంటే దానికి వచ్చిన 1.79శాతం ఓట్లు తోడైతే అక్కడా బిజెపి బొక్కబోర్లా పడి ఉండేదే. ఈ చిన్న మతలబు ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా ?హర్యానా, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనుభవాలను చూసిన తరువాత రాబోయే మహారాష్ట్ర,ఢల్లీి, రaార్కండ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వారెక్కడ-మనమెక్కడ : 77 ఏండ్ల భారత్‌ – 75 సంవత్సరాల చైనా !

11 Friday Oct 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

75 years' China, Anti China Propaganda, BJP, GDP growth, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అంటే అన్నారని తెగ గుంజుకుంటారు గానీ మన దేశంలో తెలివి తేటలు ఎక్కువగా ఉన్న కొందరు పడక కుర్చీల్లో కూర్చొని అభివృద్ధిప్రజాస్వామ్యం, నియంతృత్వాలకు ముడిపెట్టి భలే సొల్లు కబుర్లు చెబుతారు. అదే నిజమైతే నిజాం సంస్థానం, బ్రిటీష్‌ పాలనలోని ఇండియా అభివృద్ధిలో ఎక్కడో ఉండి ఉండాలి. అంతెందుకు మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటివి మన కళ్ల ముందే అమెరికాను మించిపోయి ఉండాలి. ఎందుకు ఇదంతా అంటే..... చైనా 2024 అక్టోబరు ఒకటి నుంచి ఏడు వరకు 75 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన ఉత్సవాలు జరుపుకున్నది. మనదేశం రెండు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాన్ని రెండు సంవత్సరాల ముందే జరుపుకుంది. రెండు దేశాల మధ్య ఇష్టం ఉన్నా లేకున్నా పోలిక తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ పూర్వరంగంలో చైనా మాదిరి మనదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే మనది ప్రజాస్వామ్యంవారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని తడుముకోకుండా ఠకీమని చెబుతారు.
బిజినెస్‌ టుడే పత్రిక కమ్యూనిస్టులది కాదు, 2024 ఆగస్టు 25న గత రెండు దశాబ్దాల్లో భారత్‌చైనా ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేసిందీ వివరిస్తూ ఒక విశ్లేషణ చేసింది.దానిలో ఉన్న కొన్ని వివరాల సారం ఇలా ఉంది. 1980లో చైనా తలసరి జిడిపి 307 డాలర్లు కాగా దాదాపు దానికి రెండు రెట్లు ఎక్కువగా 582 డాలర్లు భారత్‌లో ఉంది. 2024లో అది తారుమారై(పిపిపి పద్దతిలో) 25,01510,123 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ సమాచారం మేరకు ప్రస్తుత ధరల ప్రకారం 2024లో చైనా జిడిపి విలువ 18.53లక్షల కోట్ల డాలర్లు. 1980లో 303 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది ఈ కాలంలో 61 రెట్లు పెరిగింది. భారత్‌ 186 బిలియన్‌ డాలర్ల నుంచి 21రెట్లు మాత్రమే పెరిగి 3.93లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మోడీ ఏలుబడి పదేండ్లలో 2.04లక్షల కోట్ల నుంచి 3.93లక్షల కోట్ల డాలర్లకు పెరగ్గా చైనాలో 10.5 నుంచి 18.53లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.ప్రస్తుతం చైనా రుణభారం జిడిపిలో 88.6శాతం కాగా భారత్‌కు 82.5శాతం.1995లో చైనా రుణం 21.6శాతం కాగా భారత్‌కు 71శాతం ఉంది.యుపిఏ పాలనా కాలంలో రుణం 84.9 నుంచి 67.1శాతానికి తగ్గితే మోడీ ఏలుబడిలో అది 82.5శాతానికి పెరిగింది. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 2023లో మూడున్నరలక్షల కోట్ల డాలర్లు లేదా 14శాతం ఉంది. అదే భారత్‌ వాటా కేవలం 0.78లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అని మెకెన్సీ నివేదిక పేర్కొన్నది.


‘‘ ప్రపంచాధిపత్యం గురించి మరచిపోండి, భారత్‌ సమీప భవిష్యత్‌లో చైనాను అందుకోలేదు ’’ అనే శీర్షికతో 2023 ఆగస్టు 18వ తేదీన హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక ఒక విశ్లేషణ ప్రకటించింది.దాన్లో ఉటంకించిన, వెల్లడిరచిన అభిప్రాయాల సారం ఇలా ఉంది. భారత్‌ గురించి సానుకూలంగా చెబుతున్న అంచనా ప్రకారం చైనా (57లక్షల కోట్ల డాలర్లు) తరువాత అమెరికా(51.5లక్షల కోట్ల డాలర్లు )ను వెనక్కు నెట్టి భారత్‌ (52.5లక్షల కోట్ల డాలర్లు) రెండవ స్థానం సంపాదించటానికి 50 సంవత్సరాలు పడుతుంది.భారత్‌ ప్రపంచాధిపత్యం గురించి నరేంద్రమోడీ 75వ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో చెప్పారు. కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన చెప్పిన పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. భారత జిడిపి వాస్తవ వృద్ధి రేటు 2040వరకు ఏటా 8శాతం, తరువాత 5శాతం వంతున వృద్ధి చెందితే ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు రెండుశాతమే ఉంటే అమెరికాను అధిగమించటానికి 2073వరకు భారత్‌ ఆగాలని కొలంబియా విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త అరవింద్‌ పనగారియా చెప్పారు. ఇవన్నీ రానున్న 50 ఏండ్లలో ఇలా లేదా అలా జరిగితే అన్న షరతుల మీద చెప్పినవే.2000 సంవత్సరంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత వాటా ఒకశాతం కాగా చైనా 7శాతంతో ఉంది. అదే 2022 నాటికి 331శాతాలతో ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో రెండు15శాతాలతో ఉన్నాయి.


‘‘ భారత్‌ నూతన చైనా కాదు(ఇంకా) ’’ అనే శీర్షికతో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2024 మే ఎనిమిదవ తేదీన ఒక విశ్లేషణ రాసింది.దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపైకి లేస్తుందా అన్న ప్రశ్నతో ప్రారంభించి అనేక మంది ఆమెరికా కార్పొరేట్స్‌ ఆ విధంగా ఆలోచిస్తున్నారని అయితే ఇది అరగ్లాసు నిండిన కథ మాత్రమే అని వ్యాఖ్యానించింది.ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలు, కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్న పురోగతి అంకెలు, అంచనాలను పేర్కొంటూ ఇదంతా నిండిన అరగ్లాసు గురించిన పొగడ్తలుగా పేర్కొంటూ ఇతర దేశాలతో పోల్చితే పనితీరు చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది.భారత తలసరి జిడిపి అమెరికాతో పోలిస్తే 30వంతు, చైనాతో 12వ వంతు, ఇప్పుడున్న వృద్ధిరేటు ప్రకారం అమెరికా తలసరి జిడిపిలో నాలుగోవంతుకు చేరాలంటే భారత్‌కు 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇందర్‌మిత్‌ గిల్‌ అంచనా వేశారు. ఇది జరుగుతుందనే గ్యారంటీ కూడా లేదు.ఇండోనేషియా తలసరి జిడిపి 5,270 డాలర్లను చేరుకోవటానికే భారత్‌కు దశాబ్దాలు పడుతుంది.


ఫారిన్‌ పాలసీ అనే పత్రికలో అమెరికా హార్వర్డ్‌ కెనడీ స్కూలు ప్రొఫెసర్‌ గ్రాహం అలిసన్‌ 2023 జూన్‌ 24వ తేదీన ‘‘ భారత్‌ తదుపరి అగ్రరాజ్యంగా మారేందుకు చైనాను అధిగమిస్తుందా ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ చేశాడు. అలాంటి అవకాశం లేదని నాలుగు ఇబ్బందికరమైన అంశాలు చెబుతున్నాయని పేర్కొన్నాడు. ఏప్రిల్‌ నెలలో (2023) ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్‌ వెనక్కు నెట్టేసినపుడు పరిశీలకులు ఆశ్చర్యపోయారు. ప్రపంచ అగ్రరాజ్యంగా కూడా మారుతుందా అన్నారు.జనాభాతో పాటు గత రెండు సంవత్సరాలుగా చైనా వృద్ధి రేటు 5.5శాతం ఉంటే భారత్‌లో 6.1శాతం ఉంది, ఈ అంకెలు ఎంతో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. భారత్‌ వేగంగా అభివృద్ది చెందుతుందని చెబుతున్నదానిని బుర్రలకు ఎక్కించుకొనే ముందు ఇబ్బందికరమైన నాలుగు వాస్తవాలు ఉన్నాయని తెలుసుకోవాలి.


మొదటిది,1990 దశకంలో భారత్‌లో పెరుగుతున్న యువజనాభాతో ఆర్థిక సరళీకరణ విధానం ఒక ‘‘ ఆర్థిక అద్బుతాన్ని’’ సృష్టిస్తుందని విశ్లేషకులు పెద్దగా చెప్పారు. అమెరికాలో భారత్‌ను ఎంతో ఆలోచనాత్మకంగా విశ్లేషించే జర్నలిస్టుల్లో ఒకరైన ఫరీద్‌ జకారియా ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో 2006లో తాను కూడా అలాంటి భావానికి లోనైనట్లు ప్రస్తావించాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్వేచ్చామార్కెట్‌ ప్రజాస్వామ్యంగా భారత్‌ను అప్పుడు దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక వర్ణించింది, త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ చైనాను దాటిపోతుందని నాటి భారత వాణిజ్య మంత్రి చెప్పారు.భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ అద్భుతం జరగలేదని జకారియా చెప్పాడు. రెండవది, గత రెండు సంవత్సరాలలో అసాధారణ వృద్ధితో భారత్‌ ప్రపంచ ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో క్లబ్‌లో చేరినప్పటికీ చైనాతో పోల్చితే చాలా చిన్నది. మూడవది, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత శాస్త్ర విద్యార్థులు భారత్‌ కంటే చైనాలో రెండు రెట్లు ఎక్కువ ఉన్నారు.పరిశోధనఅభివృద్ధికి జిడిపిలో భారత్‌ 0.7శాతం ఖర్చు చేస్తుండగా చైనాలో రెండుశాతం ఉంది. ప్రపంచంలోని ఇరవై పెద్ద టెక్‌ కంపెనీలలో నాలుగు చైనాలో ఉన్నాయి.భారత్‌లో ఒక్కటి కూడా లేదు. ఐదవ తరం మౌలిక సదుపాయాల్లో సగం ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఒక్కశాతమే ఉంది.కృత్రిమ మేథ ప్రపంచ పేటెంట్లలో చైనా 65శాతం కలిగి ఉండగా భారత్‌ వాటా మూడుశాతమే. నాలుగవది, ఒక దేశ సత్తాను విశ్లేషించేటపుడు జనాభా ఎందరని కాదు, కార్మికశక్తి నాణ్యత ఎంత అన్నది ముఖ్యం.చైనా కార్మికశక్తి ఉత్పాదకత ఎక్కువ. దుర్భరదారిద్య్రాన్ని చైనా పూర్తిగా నిర్మూలించింది.1980లో ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 90శాతం మంది చైనీయులు దారిద్య్రంలో ఉన్నారు.నేడు దాదాపు లేరు.భారత్‌లో పదిశాతం మందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.చైనాలో రెండున్నరశాతం పోషకాహారలేమితో ఉంటే భారత్‌లో 16.3శాతం ఉన్నారు. పిల్లలో పోషకాహారలేమి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటని ఐరాస నివేదిక చెప్పింది. 195051లో మన ఆహారధాన్యాల ఉత్పత్తి 51మిలియన్‌ టన్నులు కాగా ఇప్పుడు 329 మి.టన్నులకు పెరిగింది, అదే చైనాలో 113 నుంచి 695 మిలియన్‌ టన్నులకు పెరిగింది. రెండుదేశాల జనాభా ఒక్కటే, ఎక్కడ జనాల కడుపు నిండుతున్నట్లు ?


ఈ విధంగా కమ్యూనిస్టులు కానివారు చైనా 75 ఏండ్ల ప్రస్తాన ప్రాధాన్యతను తమదైన అవగాహనతో చెప్పారు. చైనాను దెబ్బతీయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ కొంత మందికి అతిశయోక్తిగా కనిపించవచ్చుగానీ దెబ్బతీస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే ముప్పు అని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా వాటా కేవలం నాలుగు కాగా, నేడు 19శాతం ఉంది.1990దశకం వరకు పేద, వర్ధమాన దేశాలన్నీ పశ్చిమ ధనికదేశాల మీద ఆధారపడ్డాయి.గడచిన పదిహేనేండ్లుగా పరిస్థితి మారుతోంది.చైనా ప్రభావం పెరుగుతోంది. అది స్వయంగా ప్రారంభించిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ), ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్‌(ఎఐఐబి), న్యూడెవలప్‌మెంట్‌ బాంకు వంటి సంస్థలు కూడా పేద దేశాలకు సాయపడుతున్నాయి.అయితే కొన్ని చైనా ఎగుమతులు, ప్రాజక్టులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో నూతన అవకాశాలను వెతుక్కుంటున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలతో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా చైనాను దెబ్బతీస్తే అది వర్దమానదేశాల మీద ప్రభావం చూపుతుంది.


ఎవరు అవునన్నా కాదన్నా, ఎంతగా గింజుకున్నా చైనాను కాదనలేని స్థితి.యావత్‌ ప్రపంచం హరిత ఇంథన దిశగా మారుతున్నది. దానికి చోదకశక్తిగా డ్రాగన్‌ ఉంది. మూడు నూతన వస్తువులుఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియమ్‌అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ సెల్స్‌` రంగాలలో మిగతాదేశాలన్నీ ఇప్పటికైతే దాని వెనుక నడవాల్సిందే. చిన్నవీ పెద్దవీ చైనా మౌలికవసతుల ప్రాజెక్టులు 190దేశాలు, ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. నిమిషానికి ఎనిమిది కోట్ల యువాన్ల (కోటీ 14లక్షల డాలర్లు) మేర వాణిజ్య కార్యకలాపాల్లో చైనా ఉంది. గంటకు 11.2 కోట్లు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నది. రోజుకు 3,377 కోట్ల యువాన్ల మేర విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.


ఇక గడచిన ఏడు దశాబ్దాల్లో చూస్తే చైనా పేద, వెనుకబడిన దేశంగా ఉన్నంత కాలం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు అది ముప్పుగా కనిపించలేదు. చివరకు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నదే అసలైన చైనా అనటమే కాదు, రెండు చైనాలు లేవంటూ ప్రకటించటమే కాదు, భద్రతా మండలిలో తమ సరసన శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు అంగీకరించాయి. అది ఎప్పుడైతే పుంజుకొని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందో అప్పటి నుంచి ‘‘ ముప్పు ’’ గా పరిగణిస్తూ కుట్ర సిద్దాంతాలను జనాల మెదళ్లలో నాటుతున్నారు. నిజానికి చైనా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. సాధారణ తలసరి జిడిపి 2023లో అమెరికాలో 76వేల డాలర్లుంటే చైనాలో 12,720 మాత్రమే. వివిధ రంగాలలో దాని వృద్ధి వేగాన్ని చూసి తమ గుత్తాధిపత్యానికి గండిపడుతుందని అవి భయపడుతున్నాయి. తాము రూపొందించిన ఆట నిబంధనలే అమల్లో ఉండాలి, ఎప్పుడు ఎలా మారిస్తే వాటిని ప్రపంచమంతా అంగీకరించాలి, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు ముప్పువచ్చినట్లు చెబుతారు. అది ఒక్క చైనా విషయంలోనే అనుకుంటే పొరపాటు. మనదేశం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరించటం అమెరికా కూటమికి గిట్టని కారణంగా వ్యతిరేకించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. పంజాబ్‌, కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదులను రెచ్చగొట్టింది కూడా దానిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ వారి వైపే మొగ్గుతున్నా పూర్తిగా తమ చంకనెక్కలేదని రుసరుసలాడుతున్నాయి.తామిచ్చిన మద్దతుతో ఉక్రెయిన్‌ జెలెనెస్కీ ఏ విధంగా రష్యాకు వ్యతిరేకంగా ఒక పావుగా మారాడో చైనాకు వ్యతిరేకంగా మనదేశం కూడా అలాంటి పాత్రనే పోషించి ఘర్షణకు దిగాలని అవి కోరుకుంటున్నాయి. దానికి మన దేశంలో ఉన్న కార్పొరేట్‌ శక్తులు అంగీకరించటం లేదు. దానికి కారణం వాటికి చైనా మీద ప్రేమ కాదు, చౌకగా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందాలనుకోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెబనాన్‌ ఆక్రమణ బాటలో ఇజ్రాయెల్‌ – ప్రతిగా ఇరాన్‌ క్షిపణి దాడి !

02 Wednesday Oct 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Hamas, Hezbollah, Iran-Israel Tensions, israel attack lebanon, Israel genocide, Joe Biden, MIDDLE EAST

ఎం కోటేశ్వరరావు

లెబనాన్‌, గాజాలపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా మంగళవారం నాడు క్షిపణులతో జరిపిన తమ దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది. తమ శత్రువు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ సేనలు లెబనాన్‌లో ప్రవేశించి దాడులను కొనసాగిస్తున్నాయి. వేలాది మంది నివాసాలు వదలి వెళ్లాలని ప్రకటించాయి.దాడులను తిప్పికొడుతున్న హిజబుల్లా ప్రకటించింది. బుధవారం నాడు కూడా దాడులు కొనసాగాయి. అటు ఇజ్రాయెల్‌, ఇటు లెబనాన్‌లో జరిగిన నష్టాల వివరాలు వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌పై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన తన సేనలను అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు అక్టోబరు ఒకటిన 70.4 డాలర్లుగా ఉన్నది రెండవ తేదీన 74.78డాలర్లకు పెరిగింది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

గత శనివారం నాడు లెబనాన్‌లోని హిజబుల్లా పార్టీ నేత హసన్‌ నస్రల్లాతో పాటు మరికొందరిని ఇజ్రాయెల్‌ హత్య చేసింది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 1,873 మంది మరణించారని, 9,134మంది గాయపడినట్లు ప్రకటించారు. 1960లో జన్మించిన నస్రల్లా 1992లో హిజ్‌బుల్లా బాధ్యతలను స్వీకరించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అందుకు ముందు నేతగా ఉన్న అబ్బాస్‌ ముసావీని కూడా ఇజ్రాయెల్‌ ఇదే విధంగా హత్య చేసింది.1997లో జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో నస్రల్లా పెద్ద కుమారుడు హడీ మరణించాడు. 2006లో ఇజ్రాయెల్‌తో జరిపిన 33 రోజుల పోరులో నస్రల్లా నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబడి పెరిగింది. తాజా హత్యలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచానికి వెల్లడిరచింది. అది అందచేసిన సమాచారం, విద్రోహుల కారణంగానే ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌లలో తమ వ్యతిరేకులను ఇజ్రాయెల్‌ హతమార్చుతోంది.అమెరికా అండ చూసుకొని గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకిస్తున్న ఇరుగుపొరుగుదేశాలన్నింటి మీదా తెగబడుతోంది. ఈ పూర్వరంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. లెబనాన్‌పై ప్రత్యక్ష దాడి వెనుక కారణాలేమిటన్నది ఆసక్తి కలిగించే అంశం. యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది.లెబనాన్‌ తరువాత ఎమెన్‌ మీద దాడులకు దిగవచ్చని చెబుతున్నారు. ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో మారణకాండకు ఏడాది నిండ నుంది, ఆ తరువాత పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ చెప్పలేము. గడచిన రెండు నెలల కాలంలో ఇజ్రాయెల్‌ చేసిన హత్యలు, దాడుల గురించి ఇరాన్‌, సిరియా, హమస్‌, హిజబుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోందన్న కొందరి విశ్లేషణలను కొట్టిపారవేయలేము. అందుకే వ్యూహాలను తిరిగి రచించుకొనేందుకు కొంత వ్యవధి పట్టవచ్చు.

మధ్యప్రాచ్య పరిణామాలు భారత్‌తో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి.ముడి చమురు ధరలు పెరుగుతాయన్నది వాటిలో ఒకటి.1973లో ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చమురును ఒక అస్త్రంగా ఉపయోగించాయి. దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా, జపాన్‌, కెనడా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చమురు ఎగుమతులను నిలిపి వేశాయి. దాంతో పీపా ధర మూడు నుంచి 11 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల, దానితో పాటు ఆర్థిక వ్యవస్థల కుదేలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎమెన్‌లోని హౌతీలు జరుపుతున్నదాడులతో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం కలుగుతూ ఆఫ్రికా గుడ్‌హోప్‌ ఆగ్రం చుట్టూ తిరిగి రావటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. గతేడాది అగస్టు పదకొండవ తేదీతో ముగిసిన వారంలో 70 ఓడలు ఎర్ర సముద్రం బాబ్‌ అల్‌ మండాబ్‌ జల సంధి గుండా ప్రయాణించగా ఈ ఏడాది అదే వారంలో కేవలం 23 మాత్రమే వచ్చినట్లు ఐఎంఎఫ్‌ రేవుల విభాగం గుర్తించింది. పరిసర దేశాల్లోని చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాల మీద దాడులు జరిగితే సంక్షోభం తలెత్తవచ్చు. చరిత్ర పునరావృతం కావచ్చు గానీ ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము.ఈ కారణంగానే భిన్న దృశ్యాలతో రాగల పరిణామాలను అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరు ఏడవ తేదీన హమస్‌దాడులు, ఆ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ పర్యవసానాల గురించి ప్రపంచబ్యాంకు మూడు అంచనాలు చెప్పింది, వాటినే ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వల్ప ఆటంకం ( లిబియాలో అంతర్యుద్ధం జరిగిన 2011 ఏడాది మాదిరి) ప్రపంచ చమురు సరఫరాలోలో ఐదు లక్షల నుంచి ఇరవైలక్షల పీపాల వరకు రోజుకు తగ్గవచ్చు, చమురు ధరలు మూడు నుంచి 13శాతం పెరగవచ్చు. రెండవది (2003లో ఇరాక్‌ సమయంలో మాదిరి) సరఫరా 30 నుంచి 50లక్షల పీపాల వరకు తగ్గవచ్చు, ధరలు 21 నుంచి 35శాతం పెరుగుదల, మూడవది 1973 చమురు సంక్షోభం మాదిరి ఎనభైలక్షల పీపాల మేరకు సరఫరా తగ్గుదల, 56 నుంచి 75శాతం మేరకు ధరలు పెరగవచ్చు.

ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ మారణకాండకు ఏడాది నిండుతుంది.ఇప్పటి వరకు 41,586 మంది మరణించగా 96,210 మంది గాయపడ్డారు, పది వేల మంది జాడ కనిపించటం లేదు.లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఐరాస నిర్వహించే సహాయశిబిరాలు దేన్నీ దాడులలో వదలటం లేదు. అయినప్పటికీ హమస్‌ సాయుధులను అంతం చేస్తామన్న ఇజ్రాయెల్‌ పంతం నెరవేరే సూచనలు కనిపించటం లేదు. ఇదే సమయంలో పాలస్తీనా దురాక్రమణ, గాజా మారణకాండను వ్యతిరేకిస్తున్న హిజబుల్లాను అణచేపేరుతో లెబనాన్‌ మీద వైమానికదాడులకు దిగింది.దాని అధిపతి, ఇతర ముఖ్యనేతలను హతమార్చవచ్చు తప్ప పూర్తిగా అణచివేయటం ఇజ్రాయెల్‌ తరం కాదని అందరూ చెబుతున్నారు. ఎందుకు అంటే హమస్‌తో పోల్చితే దాని పోరాట యోధులు, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. ఇజ్రయెల్‌ మిలిటరీతో పోల్చితే దాని ఆయుధాలు, సాయుధుల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి.హిజబుల్లా దగ్గర 30 నుంచి 50వేల మంది వరకు ఉన్నారని అంచనా. అయితే తమ యోధుల సంఖ్య లక్షకు పైబడే అని ఇటీవల హత్యకు గురైన నస్రల్లా గతంలో ప్రకటించాడు. ఐదు నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షిపణులు లక్షా ఇరవైవేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా, ఇవి గాక ఇరాన్‌ సరఫరా చేసిన మానవరహిత విమానాలు కొన్ని, ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు క్షిపణులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతం మీదనైనా దాడికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇజ్రాయెల్‌ వద్ద త్రివిధ దళాల రెగ్యులర్‌ మిలిటరీ, రిజర్వు దళాల మొత్తం 1,69,500 నుంచి 6,34,500 మంది ఉన్నారు. తమ మీదకు వదిలే క్షిపణులను ముందుగా లేదా మధ్యలో గుర్తించి కూల్చివేసే ఆధునిక రక్షణ వ్యవస్థలు, భారీ క్షిపణులు, వందలాది విమానాలు, నౌకలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగనుందో అనే భయంతో వణికిపోయే జనం, వారి రక్షణకు ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఇంత బలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబనాన్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇరాన్‌లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చిన తరువాత 1979లో షియా ముస్లిం తెగకు చెందిన కొద్ది మందితో హిజబుల్లా (దేవుడి పార్టీ)ను ఏర్పాటు చేశారు. అయితే 1982లో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు పాల్పడిన తరువాతే అది ప్రాచర్యంలోకి వచ్చింది. 1985లో లెబనాన్‌ అంతర్యుద్ధం సందర్భంగా అక్కడి వివిధ షియా సంస్థలన్నీ హిజబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి. తరువాత ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారంభించింది.2006లో ఇజ్రాయెల్‌ వైదొలగే వరకు అది పోరుబాటలో ఉంది. ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థగా కూడా రూపుదిద్దుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది. దీనికి లెబనాన్‌ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది.ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు, 128 మందితో ఉన్న పార్లమెంటులో 15 స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది.

పలు చోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగదెబ్బలతో హత్య కావించటం, పేజర్లు, వాకీటాకీలను పేల్చి లెబనాన్‌లో హిజబుల్లాపై దాడుల ద్వారా తనకు ఎదురులేదని ఆప్రాంతంలోని వ్యతిరేకులను బెదిరించటమే ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాద శక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడన్నట్లు చరిత్ర రుజువు చేసింది.నస్రల్లా ఉన్న బంకర్‌ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌15 విమానాలతో వెయ్యి కిలోల బరువుండే 85బాంబులను ప్రయోగించి హత్యచేశారు. నాలుగు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. నస్రల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని జో బైడెన్‌ అన్నాడు. ఈ చర్యలన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఒక మాప్‌ను చూపుతూ దానిలో ఉన్న లెబనాన్‌, ఇరాన్‌, సిరియా, ఇరాక్‌ ఒక చీడ అంటూ దాన్ని దాన్ని తొలగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు.అమెరికా మద్దతుతో అనేక మంది అనుకుంటున్నదాని కంటే ముందే ఈ కలను సాకారం చేస్తామని కూడా చెప్పాడు. పాలస్తీనా ఉనికే లేని నూతన మధ్య ప్రాచ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. నస్రల్లాను చంపిన బాంబుదాడి జరిపిన విమానపైలట్‌ మాట్లాడుతూ తాము ప్రతివారినీ, ప్రతి చోటా దెబ్బతీస్తామన్నాడు. ఎలాగైనా సరే ప్రపంచాన్ని గెలుచుకుంటామంటూ అమెరికా చెబుతున్నది కూడా అదే.


తాజా దాడుల విషయానికి వస్తే హిజబుల్లాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నప్పటికీ వాటి తీరుతెన్నులను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. వేలాది గృహాలను నేలమట్టం చేశారు. గాజా, బీరూట్‌, లెబనాన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న సాయుధ సంస్థలు తమ ఆయుధాలను సొరంగాల్లో దాస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరుల ఇండ్లలో కాదు. అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కారణంగా పరిస్థితి అడవుల్లో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇజ్రాయెల్‌ దాడులు చేసినపుడు పౌరులు ఇండ్లను ఖాళీచేయాలని పదే పదే చెబుతోంది. గాజాలో మాదిరే బీరూట్‌, పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ(పిఎల్‌ఓ) లెబనాన్‌ నుంచి తమ మీద దాడులు జరుపుతోందని, అందువలన రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరమంటూ 1982 ఇజ్రాయెల్‌ ఆక్రమణలకు పూనుకుంది. నిజానికి సిరియా`లెబనాన్‌ మధ్య వివాదం ఉన్న గోలన్‌ గుట్టలను 1967 తరువాత 1973, 1981లో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణలోనే ఉంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరులకు ప్రతిఘటించే హక్కును గుర్తించారు. ఆ విధంగా ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని లెబనాన్‌ ప్రాంతాల విముక్తికి తాము పోరాడుతున్నట్లు హిజబుల్లా చెబుతోంది. నస్రల్లా మరణం తరువాత ఉపనేత నయిమ్‌ ఖాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నస్రల్లా మరణ సమయంలో 20 మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ మిలిటరీ కమాండర్‌, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల డిప్యూటీ కమాండర్‌, భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పాడు. 2006లో మాదిరే ఇజ్రాయెల్‌ను వెనక్కు కొడతామని విజయం మనదే అని ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోటి దూల కంగన విచారం – చిత్తశుద్దిలేని శివపూజ ! మోడీ ఎందుకు ఆమెను అదుపుచేయలేకపోతున్నారు ?

27 Friday Sep 2024

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, Donald Trump foul mouth, farmers agitation 2020, Kangana ranaut, Narendra Modi Failures, Rahul gandhi

ఎం కోటేశ్వరరావు

అంతే, కొందరి నోటిని అదుపు చేయటం ఆ బ్రహ్మతరం కూడా కాదంటారు. విశ్వగురువుగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు, అమెరికా అధ్యక్షుడిని తన కాళ్లదగ్గరకి తెచ్చుకోగలరు అనుకుంటున్నవారిది భ్రమగాకపోతే కంగన రనౌత్‌ నోటిని అదుపులో పెట్టటం నరేంద్రమోడీ వల్ల అవుతుందా ? ఆయనకంటే శక్తివంతురాలు గాకపోతే నెల రోజుల్లోనే రెండు సార్లు బిజెపిని ఇరకాటంలో పెట్టగలరా ? రైతుల ఉద్యమం, రద్దు చేసిన మూడు సాగు చట్టాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు 2024 సెప్టెంబరు 25 ఆమె ప్రకటించారు. దానిలో చిత్తశుద్ధి కనిపించటం లేదు. ఆగస్టు చివరి వారంలో దైనిక్‌ భాస్కర్‌ అనే పత్రికతో మాట్లాడిన కంగన 202021లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లుగా నెల రోజులు తిరక్క ముందే మరోసారి నోరు పారవేసుకున్నారు. బిజెపి కూడా మరోసారి ఆమె ప్రకటనతో తమకే సంబంధం లేదని గత ప్రకటననే తేదీ మార్చి ప్రకటించింది తప్ప కనీసం మందలించలేదు.


హిమచల్‌ ప్రదేశ్‌ మండి లోక్‌సభకు ఆమె బిజెపి తరఫున ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ పరిధిలోని నాచన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 సెప్టెంబరు 23వ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో, ఆ సందర్భంగా కొంత మంది విలేకర్లతో మాట్లాడుతూ రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్‌ చేయాలన్నారు. ఇలా మాట్లాడటం వివాదాస్పదం కావచ్చు గానీ అవి ఒకే దేశం `ఒకే ఎన్నికల మాదిరి ఎంతో ప్రయోజనకరమైనవని కూడా వర్ణించారు. అక్టోబరు ఐదవ తేదీన హర్యానాలో జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో వెంటనే కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిరచారు. ఆమె మాటలతో పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతమని హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపి నేత కరణ్‌ నందా అన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ స్పందిస్తూ కంగన రైతులను రెచ్చగొడుతున్నారు. బహుశా తన సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తుండవచ్చని, ఆమెకు మూడు సాగు చట్టాల ప్రతికూల ప్రభావం తెలియదని అన్నారు. నిత్యం వివాదాల్లో ఉండాలన్న యావతో ఉన్నట్లు చెప్పారు. మరొక రైతు నేత జగమోహన్‌ సింగ్‌ డకుండా మాట్లాడుతూ ప్రధాన మంత్రే వాటిని రద్దు చేసిన తరువాత అమలు జరపాలని చెప్పటానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఆ ప్రకటనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


బుధవారం నాడు (సెప్టెంబరు 25న) ఎక్స్‌లో ఒక వీడియో ప్రకటన చేస్తూ రైతుల చట్టాల గురించి గత కొద్ది రోజులుగా మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. ఆ చట్టాలను తిరిగి తీసుకురమ్మని రైతులు ప్రధాని మోడీని కోరాలని నేను చెప్పాను. రైతుల చట్టాలను ప్రతిపాదించినపుడు మేమంతా మద్దతు ఇచ్చాము. కానీ ఎంతో సున్నిత అంశం, రైతుల పట్ల సానుభూతితో గౌరవ ప్రధాని వాటిని వెనక్కు తీసుకున్నారు. తాను ఒక కళాకారిణి మాత్రమే కాదని, బిజెపి సభ్యురాలిగా కూడా ఉన్నానని, తన ప్రకటనలు పార్టీ వైఖరికి అనువుగా ఉండాలన్నారు. అంతే కాదు బిజెపి సభ్యురాలిగా తన అభిప్రాయం పార్టీ వైఖరికి అనుగుణంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు.నా మాటలు, అభిప్రాయాలు ఎవరినైనా ఆశాభంగానికి గురిచేస్తే విచారం వెల్లడిస్తున్నాను. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరొక పోస్టులో రైతుల చట్టాలపై నా అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, అవి పార్టీ వైఖరికి ప్రాతినిధ్యం వహించవు, కృతజ్ఞతలు అని చెప్పారు.


‘‘ బిజెపి జనాలు కొన్ని అభిప్రాయాలను పరీక్షకు పెడతారు. ఒక అభిప్రాయాన్ని వెల్లడిరచమని కొందరికి పని అప్పగిస్తారు. దాని మీద వచ్చే ప్రతి స్పందనను చూస్తారు. గతంలో ఇదే జరిగింది. మూడు నల్ల సాగు చట్టాలను పునరుద్దరించాలని వారి ఎంపీ ఒకరిచేత చెప్పించారు. ఇలాంటి వాటికి మీరు వ్యతిరేకమా లేక మరోసారి ఇలాంటి చెరుపే చేయిస్తారా ?మోడీ గారు మీరు స్పష్టత ఇవ్వాలి. మూడు సాగు చట్టాలను పునరుద్దరిస్తారా లేదా చెప్పండి. మీరు గనుక అలా చేసేట్లయితే ఇండియా కూటమి మొత్తంగా దాన్ని వ్యతిరేకిస్తుందని మీకు స్పష్టం చేస్తున్నాను, ఏడు వందల మంది ప్రాణాలర్పించారు, వారిని స్మరించుకోవాలి, గౌరవించాలి ’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా స్పందించారు. కంగనా రనౌత్‌ ప్రకటనతో తమకేమీ సంబంధం లేదని పార్టీ ప్రకటించిన తరువాత క్షమాపణ చెప్పటం తప్ప ఆమెకు మరొక దారి లేదని బిజెపి మిత్ర పక్షం జెడియు ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు, విచారం ప్రకటించారు తప్ప క్షమాపణ చెప్పలేదు.


బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అనేక సందర్భాలలో ఆమె నోటి తీట తీర్చుకున్నారు.బిజెపి ఆమెను అదుపుచేయలేకపోతోందన్నది వాస్తవం.గతంలో చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో టైమ్స్‌ నౌ సమావేశంలో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. నరేంద్రమోడీ అంటే అభిమానం మరొకటి ఉండవచ్చు, ప్రాణాలు అర్పించి, సర్వంధారపోసి పోరాడిన సమరయోధులను అవమానించానని ఆమె గ్రహించలేకపోయారు.బిజెపి నేత వరుణ్‌ గాంధీ ఈ వ్యాఖ్యలను ఉన్మాదమనాలా లేక విద్రోహమనాలా అని స్పందించారు. తాను గనుక సమర యోధులను అవమానించినట్లు నిరూపిస్తే తన పద్మ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ కంగన చిందులు వేశారు. గతంలో కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు.సుభాస్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్‌ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. 2022లో దర్శకుడు ఆర్యన్‌ ముఖర్జీ, నిర్మాత కరణ్‌ జోహర్‌ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల సందర్భంగా వారి మీద దాడి చేశారు. హిందూయిజాన్ని వాడుకున్నారని, సినిమా ప్రచారానికి దక్షిణాది వారిని అడుక్కున్నారని నోరుపారవేసుకున్నారు.దర్శకుడు ఆరువందల కోట్లను బూడిదపాలు చేశారన్నారు. ఆ సినిమా దారుణంగా ఉంటుందని శాపనార్ధాలు పెట్టారు. కరణ్‌ జోహర్‌ నిరంకుశుడన్నారు. ఫిలింఫేర్‌ పత్రిక అనుసరిస్తున్న అనైతిక, అవినీతి చర్యల కారణంగా తాను 2014 నుంచి ఆ పత్రికను బహిష్కరించినప్పటికీ తనను పదే పదే ఆహ్వానిస్తున్నారని, తన తలైవి సినిమాకు అవార్డు ఇస్తామని చెపితే తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. దానికి గాను ఆ పత్రిక మీద దావా వేస్తానని బెదిరించారు. క్రిష్‌ సినిమా హీరో హృతిక్‌ రోషన్‌తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్లు 2013 కంగన చేసిన ప్రకటన వాస్తవం కాదని సదరు హీరో ఖండిరచాడు.తరువాత ఇద్దరూ పత్రికలకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముంబై పోలీసులు మాఫియా గ్యాంగుల కంటే బాలీవుడ్‌ నటుల కోసమే ఎక్కువగా వేటాడతారని 2020లో ఆరోపించారు. ముంబై మరో పాక్‌ ఆక్రమిత కాశ్మీరుగా మారిందన్నారు. శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తనను బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. అయితే కంగన ఒక మెంటల్‌ కేసు, స్వయంగా అన్నం తినే కంచంలో ఉమ్మి ఊసే రకం, అలాంటి వారిని కొన్నిపార్టీల వారు సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బిజెపిని వ్యతిరేకించే ఉద్దావ్‌ థాకరే సిఎంగా ఉన్నారు.


రైతులపై నోరుపారవేసుకున్న కంగన కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్‌ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్‌ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు. రైతు ఉద్యమంలో పాల్గన్న ఒక సిక్కు మహిళ రోజుకు వంద రూపాయల సంపాదన కోసం పాల్గంటున్నదని ఆమే అంతకు ముందు ఢల్లీిలో జరిగిన షాహిన్‌ బాగ్‌ ఆందోళనలో ఉన్నట్లు కంగన తప్పుడు ట్వీట్‌ చేశారు. తన సినిమా మణికర్ణికను విమర్శిస్తూ సమీక్షించినందుకు జస్టిన్‌ రావు అనే జర్నలిస్టుపై విరుచుకుపడితే చివరకు సినిమా నిర్మాతలు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిబంధనలను అతిక్రమించి విద్వేష పూరిత ట్వీట్లు చేసినందుకు కంగనను ట్విట్టర్‌ శాశ్వతంగా బహిష్కరించింది. ఇలాంటి నోటి దూల వ్యక్తులను నరేంద్రమోడీ అదుపుచేయలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.మొదటి సారి పార్టీ తప్పని చెప్పిన తరువాత ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు. నెలకూడా గడవక ముందే మరోసారి అదే మాటలను మరో రూపంలో చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. హర్యానా ఎన్నికల కారణంగా పార్టీ నుంచి తీవ్ర వత్తిడి వల్లనే నామ మాత్రంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారన్నది స్పష్టం. మొత్తం మీద చూస్తే మోడీ కంటే కంగన బలవంతురాలిగా కనిపిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జమిలి ఎన్నికలు – జిందా తిలిస్మాత్‌ : అసంబద్ద వాదనలు – అతకని సమర్థనలు !

22 Sunday Sep 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, one nation one election, ONOE, Ram Nath Kovind, RSS


ఎం కోటేశ్వరరావు


జమిలి ఎన్నికల గురించి తన అజెండాను అమలు జరిపేందుకు బిజెపి పూనుకుంది. ఆ విధానాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. గోడమీది పిల్లులు ఎటు వాటంగా ఉంటే అటు దూకాలని చూస్తున్నాయి. అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలంలో బిజెపి మౌనంగా ఉంది, నరేంద్రమోడీ పదేండ్ల పాలనలో చప్పుడు చేయలేదు. ఇన్నాళ్లూ జమిలి ఎన్నికలతో అభివృద్ధి అనే జ్ఞానోదయం కలిగించిన వృక్షం ఏమిటో తెలియదు. అదే ప్రాతిపదిక అయితే అసలు ఎన్నికలు లేని, తూతూమంత్రంగా జరిగే దేశాలు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, ఇతర అంశాలను చూద్దాం.


ప్రజాస్వామ్యం ఖూనీ –ముందుగానే నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీలు చెప్పేదేముంది ?

జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ? కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలు జరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసింది.రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదేమి ప్రజాస్వామ్యం ? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు రెండున తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక ఉన్నత స్థామి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది.దాని అర్ధం ఏమిటి ముందే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు జరపాలో చెప్పమని కోరటమే కదా ? ప్రతిపక్షాలు తనను గేలి చేసినట్లు నరేంద్రమోడీ ఆరోపించారు. మరి ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం లేదా గేలిచేయటం కాదా ? ఇంత చేసిన తరువాత బిల్లు పెట్టటానికి పార్టీలను అడిగేదేమిటి ? అవి చెప్పేదేమిటి? ఇంతకు ముందే కమిటీకి చెప్పాయి కదా ! అందుకే అనేక పార్టీలు తమ వ్యతిరేకతను పునరుద్ఘాటించాయి. గోడమీది పిల్లులు ఇప్పటికీ నోరు విప్పటం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగాయి.రాజ్యాంగంలో ఎక్కడా వాటికి సంబంధించి నిర్దిష్ట ఆదేశమేమీ లేదు.అందుకే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కోవింద్‌ కమిటీ కూడా చెప్పింది.

‘‘ తరచూ ఎన్నికలు రాకుండా ఉంటే విధానాలను గొప్పగా కొనసాగించవచ్చు’’

2014 నుంచి కేంద్రంలో నిరాటంకంగా పాలన కొనసాగుతున్నది. ఒకే ప్రభుత్వం ఉంది. అది ప్రకటించిన మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా విధానాలు ఎందుకు విఫలమైనట్లు ? మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నట్లు ? దీనికోసం సిద్దాంత గ్రంధాలు రాయనక్కర లేదు. బిజెపి వారే చెబుతున్నట్లు రెండిరజన్ల పాలిత రాష్ట్రాలే ఎక్కువ. అక్కడ గానీ, ఇతర పార్టీల రాష్ట్రాలలో గానీ పదేండ్లలో ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చి ఆటంకం కలిగిందా అంటే లేదు. అభివృద్ధి చెందిన దేశాల చరిత్రను చూసినపుడు అనేక అంశాలతో పాటు పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి)కి భారీ మొత్తాలలో ఖర్చు చేయటం తెలిసిందే.మోడీ పాలనలో ఆవు పేడ, మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా అన్న పరిశోధనల మీద చూపిన శ్రద్ద మరొకదాని మీద లేదు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ప్రధాన సలహాదారు అజయ్‌ కుమార్‌ సూద్‌ చెప్పిందేమిటి ? ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ 2047లో మనం ఎక్కడ ఉండాలని మీరు నన్ను అడిగితే సైన్సుకు సంబంధించి సర్వత్రా వినియోగిస్తున్న సూచికల ప్రకారం మనం ఎగువన మూడు లేదా ఐదవ స్థానంలో ఉండాలి. నిజానికి మనం మూడవ స్థానంలో ఉండాలి.ఒక దేశ శాస్త్రీయ పటిష్టను కొలిచేందుకు అన్ని చోట్లా వినియోగించే సూచికలను చూసినపుడు మనం చాలా వెనుకబడి ఉన్నాము, ప్రపంచ సగటు కంటే తక్కువ ’’ అన్నారు. ఈ సూచికలను మెరుగుపరచాలంటే ఆర్‌ ఆండ్‌ డి మీద పెట్టే మొత్తం ఖర్చు పెరగాలి, పరిశోధకలు, శాస్త్రీయ అంశాలలో మహిళలు, పేటెంట్లవంటివి పెరగాలని కూడా చెప్పారు. దరిద్రం ఏమిటంటే దేశంలో జరిగిన ప్రతి అనర్దానికి నెహ్రూ కారకుడని నిత్యం పారాయణం చేసే పెద్దలు పదేండ్లుగా పరిశోధన రంగ విధాన రూపకల్పన కూడా చేయలేకపోయారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయట అని చెప్పేవారిని నమ్ముకొని వాటిని వెలికితీసేందుకు దశాబ్ద కాలాన్ని వృధా చేశారని అనుకోవాలి. అనేక చర్చల తరువాత 2023లో వచ్చే ఐదేండ్ల కాలంలో 600 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తామని అందుకోసం జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక మంది నిజమే కదా అని సంతోషించారు. పాఠ్య పుస్తకాల నుంచి డార్విన్‌ సిద్దాంతాన్ని, కొన్ని శాస్త్రీయ అంశాలను తొలగించారు. ఇదేదో అమాయకంగా చేశారని అనుకుంటే పొరపాటు. కరోనా నిరోధానికి గిన్నెలు మోగించాలని, కొవ్వొత్తులు వెలిగించాలని, గంగలో మునగాలని చెప్పిన పెద్దలకు ఇన్నేండ్ల తరువాతైనా జ్ఞానోదయం అయిందని చాలా మంది సరిపెట్టుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు 202324 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా ? ఏటా సగటున 120 కోట్ల డాలర్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 3.09 కోట్ల డాలర్లు మాత్రమే. దశాబ్దాల తరబడి విధానాలను రూపొందించలేకపోవటమే కాదు, దానికి తగిన కేటాయింపులూ లేవు.1990దశకంలో జిడిపిలో 0.8శాతం ఉండగా 2023నాటికి 0.65శాతానికి తగ్గాయి. కబుర్లు మాత్రం రెండుశాతం ఉండాలని చెబుతారు.మూడు దశాబ్దాల క్రితం భారత్‌చైనా కేటాయింపులు దాదాపు సమంగా ఉన్నాయి. ఇప్పుడు చైనా 2.43శాతం ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో తొలి అగ్రశ్రేణి వంద విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చైనా ఏడిరటిని కలిగి ఉండగా మనదేశంలోని సంస్థలు కొన్ని 200400 మధ్య రాంకుల్లో ఉన్నాయి.మంత్రాలకు చింతకాయలు రాల్తాయా లేదా అని కళ్లలో వత్తులు వేసుకొని మరీ చూసే మన పాలకులు మాత్రం 2047నాటికి వికసిత భారత్‌కు జమిలి ఎన్నికలే జిందాతిలిస్మాత్‌ అంటే జనం చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


రాజ్యాంగం ఆమోదించిన ఆదేశిక సూత్రాలను అమలు జరిపేందుకు మాత్రం ముందుకు రారు.జమిలి ఎన్నికల మీద ఏకాభిప్రాయం రాదని తేలిపోయింది.దాన్ని పక్కన పెట్టాల్సిందిపోయి వ్యతిరేకించేవారి మీద రాజకీయదాడి చేసేందుకు పూనుకోవటం అంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.1952 నుంచి 1967వరకు లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అప్పుడేమీ దేశం గంతులు వేస్తూ అభివృద్ధి చెందిన దాఖలాలేమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రూపాయి విలువ తగ్గింపు, ఐఎంఎఫ్‌రుణం, ధరల పెరుగుదల తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటమి, కాంగ్రెస్‌లో చీలికతో 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాల పతనం వంటి పరిణామాలన్నీ జరిగాయి.జస్టిస్‌ బిపి జీవన్‌ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్‌ 1999`2000లో ఖర్చు తగ్గింపు, పాలన మెరుగుదులకు జమిలి ఎన్నికల గురించి పరిశీలించాలని చెప్పింది తప్ప అభివృద్ధికి ముడిపెట్టలేదు. ఇంత పెద్ద దేశానికి ఓటర్లకు, ఓట్ల పెట్టెలకు రక్షణ లేని ఈ దేశంలో ఎన్నికల సమయంలో భద్రతా సిబ్బంది నియామకం,ఎన్నికల సిబ్బందికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదు. దాన్నే బూతద్దంలో చూపి ఆ కారణంగానే దేశం వృద్ధి చెందటం లేదంటున్నారు.నియంతలు పాలించిన అనేక దేశాల్లో దశాబ్దాల తరబడి ఒకేపాలన సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా అవేవీ వృద్ధి చెందలేదు. జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్దం తరువాత 26సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి, 38 మంది ప్రధానులు మారారు. అది గత కొన్ని దశాబ్దాలుగా పక్షవాత రోగి మాదిరి దాని అర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి నమూనాగా ఒకప్పుడు జపాన్ను చెప్పారు.దాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. దాని పరిస్థితి ఏమిటి ? 2012లో జిడిపి ఆరులక్షల కోట్ల దాలర్లు దాటింది. ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు పడిపోయింది.


రామనాధ్‌ కోవింద్‌ కమిటీ దక్షిణాఫ్రికా,జర్మనీ, స్వీడెన్‌, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసింది. అక్కడ ఏకకాలంలో జరిగే వాటిని మాత్రమే తీసుకుంది తప్ప దామాషా ప్రాతిపదికన ప్రతి ఓటుకూ విలువ నిచ్చే నిజమైన ప్రజాస్వామిక పద్దతిని సిఫార్సు చేయకుండా వదలివేసింది.వాటిని గమనించినట్లు మాత్రం పేర్కొన్నది. ఎందుకుంటే సిఫార్సు చేస్తే బిజెపి ఆగ్రహం వస్తుంది గనుక.ప్రపంచం జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు అవి స్వీడన్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి.మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64లక్షలు (40శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటు వచ్చింది.ప్రతి ఓటుకూ విలువ ఇచ్చే అసలు సిసలు ప్రజాస్వామ్యమంటే ఇది కదా ! కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు సీట్లకు పొంతన ఉంటోందా ? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతమైతే సీట్లు 55.8శాతం, అదే 2024లో ఓట్లు 36.56శాతం కాగా సీట్లు 44శాతం వచ్చాయి. మైనారిటీ ఓట్లతో అధికారాన్ని పొందింది.


ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాము. ఇన్నేండ్ల తరువాత తమకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొన్ని చోట్ల, ఇతరులకు ఇచ్చిన మొత్తం తమకెందుకు ఇవ్వలేదని కొన్ని చోట్ల ఓటర్లు ధర్నా చేయటాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు అసలు ఊహించి ఉండరు. ఇలాంటి ధోరణులు పెరిగిన తరువాత డబ్బున్న పార్టీ ఓట్లను టోకుగా కొనుగోలు చేయటం తప్ప మరొకటి జరుగుతోందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు తప్ప ఓటర్లకు డబ్బు పంచని పార్టీ ఏది ? దాని ప్రమేయం లేకుండా ఎందుకు చేయరు ? ఎన్నికల విధానాన్ని ఎందుకు సంస్కరించరు ? బిజెపికి ఇవేవీ తెలియనంత అమాయకంగా ఉందా ? ఎన్నికల కమిషన్‌ తొలి సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటుకు చేసిన ఖర్చు రు.0.60 కాగా 2014లో ఆ మొత్తం రు.46.40కి పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి రు.25వేలకు మించి ఖర్చు చేయకూడదని చెప్పిన ఎన్నికల కమిషన్‌ తాజాగా దాన్ని రు.75 నుంచి 95లక్షల వరకు పెట్టవచ్చని, అసెంబ్లీ అభ్యర్ధులు 28 నుంచి 40 లక్షల వరకు పెంచింది. లెక్కలో చూపకుండా చేసే ఖర్చు గురించి తెలిసిందే. వీటిని పరిగణనలోకి తీసుకొని సిఎంఎస్‌ అనే సంస్థ వేసిన లెక్క ప్రకారం 2019లో ఒక్కో ఓటు ఖర్చు రు.700 కాగా 2024 రు.1,400లకు పెరిగింది.1998లో ఎన్నికల ఖర్చు రు.9,000 కోట్లు కాగా అది 2024లో లక్షా 35వేల కోట్లకు పెరిగినట్లు అంచనా ? దీన్ని నివారించటానికి కమిటీ వేయాల్సిన అవసరం లేదా ?


జమిలి ఎన్నికలు జరపాలని బిజెపి చెబుతున్నది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన ఘనత తమదే అని జబ్బలు చరుచుకుంటున్నది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ స్ఫూర్తి కనిపించటం లేదు. రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన తరువాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడా మూడోవంతు సీట్లకు ఆ పార్టీ మహిళలను నిలపలేదు. బిజెపి తాను పోటీ చేసిన 446 స్థానాల్లో కేవలం 69 మందిని 15.47శాతం మందినే నిలిపింది.బిజెడి ఒడిషాలో 33శాతం మందిని నిలిపింది. అసలు 150 స్థానాల్లో మహిళా అభ్యర్దులే లేరు. గత లోక్‌సభలో అన్ని పార్టీల తరఫున 78 మంది గెలిస్తే ఈసారి 73కు తగ్గారు. అదే విధంగా తాను తన మిత్ర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపించి ఉంటే ఆదర్శంగా ఉండేది. ఆ పార్టీ చెబుతున్నట్లు దాని వలన కలిగే లాభాలేమిటో ఎందుకు చూపలేదు ? దానికి రాజ్యాంగసవరణలతో పని లేదు. ఏ పార్టీ కూడా వ్యతిరేకించేదేమీ లేదు కదా ! బిజెపికి చివరికి ఎన్నికల కమిషన్‌కూ చిత్తశుద్ది లేదు. గతంలో హర్యానా, మహారాష్ట్రలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ సారి బిజెపికి అనుకూలంగా ఉండేందుకు మహారాష్ట్ర ఎన్నికలను విడిగా జరుపుతున్నారు. రెండు రాష్ట్రాలూ బిజెపివేగనుక ఆరునెలల కంటే తక్కువే వ్యవధి ఉన్నందున వాటినైనా రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరపవచ్చు. అదే విధంగా ఎప్పుడో జరగాల్సిన కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతో పాటు ఎందుకు జరపలేదంటే సరైన సమాధానం లేదు.


జమిలి ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్‌ అభిప్రాయపడిరది. దేశాభివృద్దికి ఇది సర్వరోగనివారణి జిందాతిలిస్మాత్‌ అనుకుంటే నాడు అధికారంలో ఉన్న వాజ్‌పాయి ఎందుకు చొరవ తీసుకోలేదు, పోనీ 2014లోనే గద్దె నెక్కిన నరేంద్రమోడీ వెంటనే దీన్ని ఎందుకు ముందుకు తేలేదు ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే తన పాలన వైఫల్య దిశగా పోతున్నదని అందరికంటే ముందుగా గ్రహించిన వ్యక్తి మోడీ. ప్రతి ఎన్నికలలోనూ పాతదాన్ని వదలి కొత్త నినాదాన్ని ముందుకు తేవటం తెలిసిందే. అధికారయంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు.కోవింద్‌ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు ఐదేండ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అన్నది ఒకటి. సంక్షోభంతో ఐదేండ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్ని సార్లు జరుపుతారా ? జనాభా లెక్కలతో కలిపి బిసి కులగణన జరపాలని కోరితే దానికి బిజెపి ససేమిరా అంటున్నది.కావాలంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అన్నది. అప్పుడు సిబ్బంది సమయం, డబ్బుదండగకాదా ? జమిలి ఎన్నికల వాదన దీనికి ఎందుకు వర్తించదు ? జమిలి ఎన్నికల చర్చ జరుగుతుండగానే దాని స్ఫూర్తిని దెబ్బతీసేదిగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఒకేసారి జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ఈసారి విడదీసింది. మరోవైపు జమిలిని వ్యతిరేకించేపార్టీలకు నీతులు చెబుతున్నారు. ? పదేండ్ల మోడీ విఫల పాలన మీద జనం దృష్టిని మళ్లించేందుకు తప్ప జమిలి ఎన్నికలు మరొక మేలుకు కాదన్నది స్పష్టం. ‘‘ మీరు కొంత కాలం జనాలందరినీ వెర్రి వారిగా చేయగలరు. కొంత మందిని కాలం చేయగలరు. అందరినీ ఎల్లకాలం వెర్రివారిని చేయలేరు.’’ అన్న అబ్రహాం లింకన్‌ మాట మోడీతో సహా ఎవరికైనా వర్తిస్తుంది. కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిజం చర్చ- ట్రంప్‌పై రెండో హత్యాయత్నం ?

17 Tuesday Sep 2024

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA, Women

≈ Leave a comment

Tags

#US Elections 2024, another assassination attempt on trump, Anti communist, Donald trump, Joe Biden, Kamala Harris, red-baiting

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఐదవ తేదీన అమెరికాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా ? తనకు ప్రతికూలంగా ఫలితం వస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా ? గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాల నడుమ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగిందని, దుండగుడిని పట్టుకున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో తన స్వంత మైదానంలో గోల్ఫ్‌ ఆడుతుండగా భద్రతా సిబ్బంది సమీపంలో ఉన్న పొదల్లో సాయుధ దుండగుడిని గమనించి కాల్పులు జరిపారు. దాంతో దుండగుడు రయన్‌ రౌత్‌ తన వద్ద ఉన్న ఎకె47 మాదిరి తుపాకి, మరికొన్ని వస్తువులను వదలి తన కారులో పారిపోగా 65 కిలోమీటర్ల తరువాత పట్టుకున్నట్లు చెబుతున్నారు. రౌత్‌ కాల్పులు జరిపాడా లేక పొదల్లో శబ్దాలకారణంగా అతని ఉనికిని గుర్తించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారా అన్నది వెంటనే స్పష్టం కాలేదు. అతని సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించగా డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని అని తేలినట్లు చెప్పారు. అయితే అది వాస్తవం కాదని గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటువేశాడని, తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన భారతీయ మూలాలున్న వివేక్‌ రామస్వామి చివరి వరకు పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మీద పోటీలో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు మరొక ప్రచారం. జూలై 13వ తేదీన జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి తమ్మెకు గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని పట్టుకొని కాల్చి చంపారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రహస్య భద్రతా సిబ్బంది డైరెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రంప్‌ మద్దతుదారైన ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ తాజా ఉదంతం మీద స్పందించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్యాయత్నాలు అధ్యక్షుడు జోబైడెన్‌, పోటీలో ఉన్న కమలాహారిస్‌ మీద ఎందుకు జరగటం లేదు, ట్రంప్‌ మీదనే ఎందుకు అంటూ ఎక్స్‌ ద్వారా మస్క్‌ స్పందించాడు. ఇది అత్యంత బాధ్యతారహితం అని అనేక మంది గర్హించారు. ట్రంప్‌కు ఏమీ కానందుకు జో బైడెన్‌, కమలా హారిస్‌ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అధ్యక్షులు గనుక గోల్ఫ్‌ ఆడితే ఆ మైదానం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడతారు. ట్రంప్‌ మాజీ గనుక అలాంటి రక్షణ కల్పించలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికాలో హింసాకాండకు తావులేదని ఎక్స్‌లో కమల స్పందించారు. అమెతో జరిగిన సంవాదంలో ట్రంప్‌ వెనుకబడినట్లు సర్వేలు తేల్చిన తరువాతే ఈ ఉదంతం జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జో బైడెన్‌, కమల తన మీద ధ్వజమెత్తుతున్న కారణంగానే హత్యాయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆరోపించాడు.


ఒకవేళ ఓడితే ఫలితాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా, గతంలో మాదిరే అనుచరులను రెచ్చగొట్టి దాడులకో మరొకదానికో పాల్పడతాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు ఐదవ తేదీ దగ్గర పడేకొద్దీ అనూహ్యపరిణామాలు సంభవిస్తాయోమోనని భావిస్తున్నారు.జో బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్‌ ముందంజలో ఉన్నాడు. తొలిసారి హత్యాయత్నం తరువాత ఆధిక్యత మరింత పెరిగి విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడిరది. కమలా హారిస్‌ రంగ ప్రవేశంతో అదంతా తారుమారైంది. తీవ్రమైన పోటీ స్వల్ప ఆధిక్యంలో కమల ఉన్నట్లు సర్వేలు వెల్లడిరచాయి. సెప్టెంబరు పదవ తేదీన వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్‌ తేలిపోయాడు. కొన్ని సర్వేలు కమల 23పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్లు పేర్కొన్నాయి. తరువాత జరిగిన మరికొన్ని సర్వేలలో కూడా ఆమెదే పైచేయిగా ఉంది.దాంతో తాను మరోసారి ఆమెతో బహిరంగ చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని ట్రంప్‌ సంచలన ప్రకటన చేశాడు. దీంతో పోలింగ్‌కు ముందే ఓటమిని అంగీకరించినట్లు కావటంతో మాటమార్చాడు. పిచ్చోడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు, ట్రంపు కూడా అంతే. అక్టోబరులో జరిగే మరో రెండు చర్చల్లో పాల్గొనేదీ లేనిదీ చెప్పలేము. ఒక వేళ సిద్దపడకపోతే పారిపోతున్నట్లుగానే ఓటర్లు భావిస్తారు.కమలతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని తానే ముందున్నట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతు ఇవ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడిరచటం లేదు రిగ్గింగు చేసినట్లు స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


అమెరికా ఎన్నికల్లో మైలురాళ్లుగా చెప్పుకోవాల్సి వస్తే జూలై 15న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశం ట్రంప్‌ను, ఆగస్టు 19న కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం అభ్యర్థులుగా ఖరారు చేశాయి.సెప్టెంబరు పదిన ట్రంప్‌కమల తొలి సంవాదం జరిగింది.నవంబరు ఐదున ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జనవరి ఆరున ఫలితాలను నిర్ధారిస్తారు.జనవరి 20న నూతన అధ్యక్ష పాలన ప్రారంభం అవుతుంది. ప్రముఖులుగా ఉన్నవారు, ఓటర్లను ప్రభావితం చేసే వారు కొందరు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరుస్తారు ఎక్స్‌ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా ప్రముఖ గాయని, నటి, రచయిత్రి టేలర్‌ స్విఫ్ట్‌ కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది. ఎలన్‌ మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్‌ కుమార్తె వివియన్‌ జెనా విల్సన్‌ విరుచుకుపడిరది.టేలర్‌ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్‌ చేస్తూ ‘‘ బాగుంది టేలర్‌..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా, నా జీవితాతం నీ కుక్కలకు కాపలా కాస్తా ’’ అని మస్క్‌ పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు. టేలర్‌ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్‌ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు.

ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోయినా కమ్యూనిజం, సోషలిజాల గురించి పెద్ద చర్చే నడుస్తున్నది. గతకొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా అనేక మంది బుర్రల్లో అది రాయిలా గడ్డకట్టింది. తాను గెలవాలంటే పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక అస్త్రంగా చేసుకోవాలని ట్రంప్‌ ఎంచుకున్నాడు.దానిలో భాగంగా కామ్రేడ్‌ కమల మన దేశానికి భయంకరమైన వ్యక్తి. అమె ఒక మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు, ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉన్నారు, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటారు, ఎన్నుకుంటే అమెరికా చరిత్ర ముగిసినట్లే అని న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ ప్రసంగంలో అన్నాడు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి, స్వేచ్చను తిరస్కరిస్తూ మార్క్సిజం, కమ్యూనిజం, ఫాసిజాలను అనుసరిస్తున్నారన్నాడు. ఆమె రూపంలో స్టాలిన్‌ జన్మించాడని చెప్పాడు. మౌలికంగా కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా ఆమె కమ్యూనిస్టు టోపీ, ఎర్ర కోటు ధరించినట్లు ఒకటి, ఇంకా కమ్యూనిస్టు అని చెప్పే రకరకాల చిత్రాలను సృష్టించి వైరల్‌ చేయించాడు. కమల అభ్యర్థిగా నిర్ణయంగాక ముందే డెమోక్రటిక్‌ పార్టీని దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు అని వర్ణించాడు. మన ప్రత్యర్థిని ఒక కమ్యూనిస్టు,సోషలిస్టు లేదా అమెరికాను నాశనం చేసే మరోవ్యక్తిగా చిత్రించి ప్రచారం చేయాలని తన మద్దతుదార్లను బహిరంగంగానే కోరాడు.ఎలన్‌ మస్క్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాడు. సోవియట్‌ నాయకుల మాదిరి కమల బొమ్మలను సృష్టించాడు.కమల తొలి రోజు నుంచే ఒక కమ్యూనిస్టు నియంతగా మారనున్నారు. అమెరికన్ల ఆర్థిక స్వేచ్చను హరించేందుకు సిద్దంగా ఉన్న ఒక సోషలిస్టు అంటూ వ్యాఖ్యలను జోడిరచి ప్రచారంలో పెట్టాడు.

కమలా హారిస్‌ కమ్యూనిస్టు కాదు, డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న ఉదారవాదుల్లో ఒకరు మాత్రమే. డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ కొన్ని అంశాలలో ఆమె వైఖరిని బట్టి పురోగామివాదిగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో గాడిద(డెమోక్రటిక్‌ పార్టీ)ఏనుగు (రిపబ్లికన్‌ పార్టీ) గుర్తుల మీద ఎవరు పోటీ చేసినా రెండిరటినీ బలపరిచే కార్పొరేట్లకు ఆమోదమైతేనే రంగంలో ఉంటారు.కమల కూడా అంతే. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహించే గోల్డ్‌మన్‌ శాచస్‌ సంస్థ ట్రంప్‌ కంటే కమల మెరుగని పేర్కొన్నది. ఆమె గెలిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు శక్తి వస్తుందని, ట్రంప్‌ వస్తే దెబ్బతింటుందని చెప్పింది. కమ్యూనిస్టు నియంత మెరుగని ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులు ఎలా చెబుతున్నారంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడిదారుల చక్రవర్తి ట్రంప్‌ ఆర్థిక ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్టు కామ్రేడ్‌ కమల చెబుతున్నదాని కంటే లోటు ఐదు రెట్లు పెరుగుతుందని తటస్థంగా ఉంటే పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ నమూనా నివేదిక చెప్పిందని ఒకరు పేర్కొన్నారు. ఇంతకీ కమల లేదా డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్నదేమిటి ? యాభైవేల డాలర్లతో ప్రారంభించే చిన్న అంకుర సంస్థలకు పన్ను రాయితీలను వర్తింపచేయటం, బడా సంస్థలకు పన్నులు పెంచటం, దీన్నే కమ్యూనిజం అంటున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా మధ్యాహ్నభోజనం పెట్టటాన్ని కూడా సోషలిజం అని వర్ణించేబాపతు ఇలా చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది? వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ అనే మీడియాతో కమలాహారిస్‌ మాట్లాడిన అంశాలను రిపబ్లికన్లు కమ్యూనిజంగా వర్ణించటాన్ని పురోగామి మార్పు ప్రచార కమిటీ స్థాపకుల్లో ఒకరైన ఆడమ్‌ గ్రీన్‌ ఎద్దేవా చేశాడు. రానున్న వారాల్లో గుడ్ల ధర ఏడు నుంచి తొమ్మిది దాలర్లకు పెరగటాన్ని అడ్డుకుంటామని కమలా హారిస్‌ చెబుతున్నారు, మితవాదులు దాన్నే గనుక కమ్యూనిజం అంటే అత్యధిక అమెరికన్లు దాన్నే కోరుకుంటారు, మీరేం మాట్లాడుతున్నారో అర్ధమౌతోందా అని గ్రీన్స్‌ ప్రశ్నించాడు.ధరలను అదుపు చేయటాన్ని కూడా ట్రంప్‌ కమ్యూనిజంగా వర్ణించాడు. కరోనా కాలం నాటితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో ధరలు 20శాతం పెరిగాయి.నిజవేతనాలు గణనీయంగా పడిపోతున్నాయి. అందుకే బతుకుదుర్భరమౌతున్న కారణంగా అనేక మంది యువతకు సోషలిజం, కమ్యూనిజాల గురించి తెలియకపోయినా అదే కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ వంటి వారు చేసే విపరీత ప్రచారం వాటి గురించి ఆసక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ దేశాల్లో చేస్తున్న సర్వేల్లో యువతలో సోషలిజం పట్ల సానుకూలత వెల్లడి అవుతున్నది. అమెరికాలో డెమోక్రాట్లను కమ్యూనిస్టులని ప్రచారం చేయటం ఇదే మొదటి సారి కాదు. ఈ ఎన్నికల్లో అది మరింతగా పెరిగింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d