జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గతేడాది సెప్టెంబరు నెలలో ఇరాన్‌లో నిర్భంధ హిజాబ్‌ వద్దంటూ మహిళలతో మొదలైన ఆందోళన ఇప్పుడు కొత్త స్వభావాన్ని సంతరించుకొంటోంది. కొత్త రూపాలు, పద్దతుల్లో వందలాది పట్టణాలకు పాకింది. ప్రతి శుక్రవారం ప్రార్ధనల తరువాత నిరసనలు తెలుపుతున్నారు.రాజధాని టెహరాన్‌తో సహా రాత్రుళ్లు సమావేశాలను ఏర్పాటు చేసి పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారికి ప్రతిరూపంగా ఉన్న చిహ్నాలు, స్థలాల మీద దాడులు చేస్తున్నారు. దేశంలోని 282 పట్టణాలకు ఇవి పాకినట్లు వార్తలు. సెప్టెంబరు నుంచి వివిధ సందర్భాలలో భద్రతా దళాలు 750 మందిని చంపినట్లు, 30వేల మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. దేశ అధినేత అలీ ఖమేనీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జిసి), పారామిలిటరీ ”బాస్‌జీ” వీరుగాక పోలీసు ఏజంట్లు, గూఢచారులకు జనం నిరసన తెలుపుతున్నారు. ఇస్లామిక్‌ విప్లవం పేరుతో సాగిన ఆందోళనతో 1979లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. 1989లో అయాతుల్లా మరణం తరువాత అలీ ఖమేనీ పగ్గాలు చేపట్టి అధికారంలో కొనసాగుతున్నాడు.
మహిళల ప్రతిఘటనతో హిజబ్‌ ధారణ గురించి పునరాలోచిస్తామని ప్రకటించి ఆందోళనను నీరుగార్చేందుకు చూసిన పాలకులు ఇప్పుడు కొత్త పద్దతులను ముందుకు తెస్తున్నారు. హిజబ్‌లను ధరించకుండా పనిచేసేందుకు మహిళలను అనుమతించారనే పేరుతో క్వాజ్‌విన్‌ అనే పట్టణంలో ఐదు దుకాణాలను అధికారులు మూసివేశారని వార్తలు. పార్లమెంటులోని ” సాంస్కృతిక ” కమిటీ సభ్యుడు హుసేన్‌ జలాలీ ఒక ప్రకటన చేస్తూ హిజబ్‌ ధరించని వారిని ముందుగా గుర్తించి ఎస్‌ఎంఎస్‌ పంపుతామని, తరువాత హెచ్చరించి, అప్పటికీ వినకపోతే అలాంటి వారి బాంకు ఖాతాలను మూసివేస్తామని చెప్పాడు. మరింత ఆధునిక చట్రంలో హిజబ్‌ను అమలు చేస్తామని మరొకడు,జనవరి ఒకటి నుంచి బహిరంగ స్థలాల్లో అమలు చేస్తామని పోలీసు అధికారి ఒకడు ప్రకటించాడు.


పశ్చిమాసియాలో అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులను వ్యతిరేకించటంలో తిరుగులేని వైఖరితో ఉన్నప్పటికీ అంతర్గతంగా మతఛాందసాన్ని మరింత పెంచేందుకు, విమర్శకులను అణచివేసేందుకు తీసుకున్న చర్యలతో పాటు ఆర్థికంగా జనజీవితాలు ప్రభావితం కావటంతో వ్యతిరేకత పెరుగుతోంది. దానికి ఒక రూపమే డైనమెట్‌ మాదిరి పేలిన హిజాబ్‌ వ్యతిరేక ఆందోళన. భద్రతా దళాలు హతమార్చింది వీరినే అంటూ 637 మంది పేర్లను పీపుల్స్‌ మొజాహిదిన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇరాన్‌ పార్టీ ప్రచురించింది. దేశంలో తాజా నిరసనలు ప్రారంభమై ఆదివారం నాటికి 129 రోజులు, ఆ రాత్రి, శనివారం రాత్రి కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు. ” సయద్‌ అలీ (ఖమేనీ)ని గద్దె దింపే సంవత్సరమిదే, నియంతకు ఉరి, ఉరితీతల పాలనకు అంతం పలకాలి, హంతక ఐఆర్‌జిసిని శిక్షించాలి, ముల్లాల అధికారమింకేమాత్రమూ వద్దు ” వంటి నినాదాలు చేస్తున్నారు.

ఐఆర్‌జిసి మింగిన తమ సొమ్మును తిరిగి ఇచ్చివేయాలంటూ టెహరాన్‌లోని న్యాయఅధికారుల భవనం ముందు క్రిప్టోలాండ్‌ ఆన్‌లైన్‌ ఎక్సేంజ్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆదివారం నాడు ప్రదర్శన జరిపారు. దాదాపు మూడులక్షల మంది దాచుకున్న పొదుపు మొత్తాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని గత రెండు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. బాధితుల్లో పెన్షనర్లు, రిటైరైన వారు ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో దిగజారుతున్న కరెన్సీ రియాల్‌ విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్లు పెంచాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టటం కూడా వీరిని ఆందోళనకు పురికొల్పుతోంది. దేశ సామాజిక భద్రతా నిధి పెట్టుబడి కంపెనీ ఒక వైపు ప్రతి ఏటా లాభాలు పొందుతుండగా వాటిని పెన్షనర్లకు బదలాయించకపోవటం, పెంపుదల గురించి చేసిన వాగ్దానాలను విస్మరించటం, గత బకాయిలు చెల్లించకపోవటం కూడా అసంతృప్తికి దోహదం చేస్తోంది. తప్పుడు కేసులతో ఉరిశిక్షలు వేసిన తమ వారి విడుదల కోరుతూ రాజధాని టెహరాన్‌లో జనవరి నెలలో మూడుసార్లు కుటుంబాలు, బంధుమిత్రులు ప్రదర్శనలు జరిపారు. తమ దండ్రులను ఉరితీయ వద్దంటూ పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా పలుచోట్ల ప్రదర్శనలు జరిపి తమ ప్రభుత్వం మీద వత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇరాన్‌ రాజుగా ఉన్న రెజా షా పహ్లవీ కాలంలో ఇరాన్‌లోని చమురు సంపదను అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్ల పరం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1941లో సింహాసనాన్ని వదిలిన తరువాత అతని కుమారుడు మహమ్మద్‌ రెజా షా అధికారంలోకి వచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1952 ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా అధికారానికి వచ్చిన మహమ్మద్‌ మొసాదిక్‌ భూ సంస్కరణలు, చమురు కంపెనీలను జాతీయం చేయటంతో అమెరికా,బ్రిటన్‌ కుట్రపన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మొసాదిక్‌ను గృహనిర్భంధంలో ఉంచటంతో ఏడాదిలోనే అధికారం కోల్పోయాడు. రాజు షా ఎంతగా కసి పెంచుకున్నాడంటే 1967లో మరణించిన మొసాదిక్‌ను ఇంట్లోనే ఖననం చేయించాడు. తరువాత కాలంలో షాను వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించినా 1979లో మతశక్తులు అధికారాన్ని కైవశం చేసుకున్నాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలను నిషేధించాయి. పౌరహక్కులను కాలరాశాయి. షా వ్యతిరేక ఉద్యమంలో పాల్గ్గొన్నవారిలో ఒకరైన మరియం రజావీ (69) ప్రతిపక్షాల తరఫున అధ్యక్షురాలిగా ప్రకటించుకొని ఫ్రాన్స్‌లో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమె, ఇతర మద్దతుదార్లను ఉగ్రవాదులుగా చిత్రించి అరెస్టుచేసిన ఫ్రెంచి పాలకులు తరువాత వదలిపెట్టారు. ముల్లాల పాలనకు చరమగీతం పాడాలన్న తమ పౌరుల డిమాండ్‌ను పశ్చిమ దేశాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తాజాగా పునరుద్ఘాటించారు.


కుర్దిస్తాన్‌ ప్రాంతం నుంచి తన కుటుంబ సభ్యులతో కలసి టెహరాన్‌ వచ్చిన మాషా అమిని అనే 22 ఏండ్ల యువతి హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ గతేడాది సెప్టెంబరు 13న ” ఉపదేశ దళాలు ” పట్టుకొని ”నైతిక పోలీసులకు” అప్పగించాయి. వారు ఆమెను దారుణంగా కొట్టటంతో పదహారవ తేదీన మరణించింది. ఈ వార్తను విన్న మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్‌ను వదలివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఆందోళనకు దిగారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో కార్మికులు, ఇతరులు కూడా తమ డిమాండ్లతో వారితో కలిశారు. వందలాది మందిని భద్రతాదళాలు చంపినట్లు చెబుతున్న అంకెలను ప్రభుత్వం అంగీకరించటం లేదు. అధికారిక మీడియా రెండువందల మంది మరణించినట్లు వార్తలు ఇచ్చింది. తాజా ఆందోళన ఇరాన్‌ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర వైరుధ్యాలను వెల్లడిస్తున్నది. మొత్తంగా మత ఛాందసపాలన, పాలకులు పోవాలని కోరుకుంటున్నారు. ఇది మరొక విప్లవ పోరాటం అని కొందరు వర్ణిస్తున్నారు.


వర్తమాన ఆందోళన జిన్‌(మహిళలు), జియాన్‌(జీవితం), ఆజాదీ( స్వేచ్చ) అనే భావనలతో నడుస్తున్నది. ప్రపంచ గాస్‌లో 15శాతం, చమురు సంపదలో పదిశాతం ఇరాన్‌లో ఉంది. ఇప్పటి వరకు తోడింది పోను 2020లో వెలికి తీసిన మాదిరే తరువాత కూడా కొనసాగిస్తే మరో 145 సంవత్సరాల పాటు తోడుకోవచ్చు. ఇంత సంపద ఉండి కూడా జనం ఇబ్బందులు పడుతున్నారంటే అంతర్గత విధానాలతో పాటు అవినీతి,అవకతవకలు, 2018 నుంచి పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.2021నాటికి జిడిపిలో అప్పు 48, నిరుద్యోగం 12, ద్రవ్యోల్బణం 30శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబరు తరువాత కరెన్సీ విలువ 20శాతం పతనమైంది. ఇలాంటి కారణాలతో 60 నుంచి 70శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. వారిలో 18.4శాతం మంది దుర్భరదారిద్య్రంలో ఉన్నారు. దేశంలో 60శాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉంది. చట్టాలు అమలు జరిగే స్థితి లేదు, అసమానతలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం ఏడాదికి 6,700 డాలర్లు కనీసవేతనంగా ఉంది. జనాల కొనుగోలు శక్తి రోజు రోజుకూ క్షీణిస్తున్నది. నెలల తరబడి వేతనాలు ఇవ్వని స్థితి. సంఘం పెట్టుకొనే వీల్లేదు. ఇస్లామిక్‌ రిపబ్లిక్కుగా ప్రకటించిన గత 43 సంవత్సరాలుగా కార్మికులకు ఎలాంటి హక్కులు లేవంటే నమ్మలేని నిజం. ఆర్థికంగా దిగజారుతూ వత్తిడి తట్టుకోలేక ఇటీవల అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనాతో నిమిత్తం లేకుండా పరిస్థితి దిగజారటంతో 2017, 2019 సంవత్సరాల్లో నిరసనలకు దిగిన జనాన్ని అణచివేశారు. మరోసారి ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.


ఇరాన్‌లోని ఇస్లామిక్‌ గార్డులు ప్రజావ్యతిరేకులు, జనాన్ని అణచివేస్తూ సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న మతోన్మాదులు అన్నది నిజం. వారు 1979 నుంచీ చేస్తున్నది అదే, కానీ ఐరోపా పార్లమెంటు ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీర్మానించటం జనం మీద ప్రేమ కంటే ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటమే అన్నది స్పష్టం. గార్డుల సంగతి జనం చూసుకుంటారు. విదేశాల జోక్యం తగనిపని. మిలిటరీ, పారామిలిటరీ, పోలీసులు ఉన్నప్పటికీ, అదనపు సృష్టి ఇరాన్‌ గార్డులు. ఆ సంస్థకు గతంలో కమాండర్‌గా పనిచేసి ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్‌గా ఉన్న గాలిబఫ్‌ తీర్మానానికే పరిమితమైతే సరే, అంతకు మించి ముందుకు పోతే ప్రతికూలంగా స్పందిస్తామని అన్నాడు. నవాబియాన్‌ అనే ఎంపీ మరొక అడుగు ముందుకు వేసి సమర్ధించిన వారిని, ఆసియాలో తమను వ్యతిరేకించే వారిని కూడా ఉగ్రవాదేశాలుగా ప్రకటించి తమ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించాడు. వారి కంపెనీలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామన్నాడు. ఐరోపా దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవాలని, అమెరికాకు తోకలుగా మారవద్దని ఇరాన్‌ అధికారపక్ష పత్రిక హెచ్చరించింది.1988లో ఇరాన్‌లోని వేలాది మంది అసమ్మతి ఖైదీల ఉరితీతకు కారకుడనే పేరుతో స్వీడన్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన ఉదంతాన్ని పేర్కొంటూ స్వీడన్‌ అధికారులను తమ వారు బంధించి తీసుకువచ్చి ఇరాన్‌లో విచారణ జరుపుతామని మరొక మరొక పత్రిక సంపాదకుడు హెచ్చరించాడు. ఇటీవల కొంత మంది టెహరాన్‌లోని బ్రిటన్‌, ఫ్రెంచి రాయబార కార్యాలయాలపై దాడి చేశారు.


గతేడాది అక్టోబరులో క్యూబా రాజధాని హవానాలో జరిగిన ప్రపంచ దేశాల, కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల మహాసభలో పాల్గొన్న సిపిఐ(ఎం), సిపిఐతో సహా 62దేశాల పార్టీలు ఒక ప్రకటనలో ఇరాన్‌ ఆందోళన కారులు, ఇరాన్‌ కమ్యూనిస్టులకు మద్దతు ప్రకటించాయి. పాలకుల అణచివేతను తీవ్రంగా ఖండించాయి. ” దేవుడిని వ్యతిరేకించారని, ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇస్లామిక్‌ రాజ్యానికి, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారు ” వంటి అభియోగాలను మోపి వేలాది మందిని కోర్టులలో విచారణ తతంగం జరుపుతున్నారని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇరాన్‌లో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండాలన్నది ఇరానీయులకు సంబంధించిన అంశమని స్పష్టం చేస్తూ పశ్చిమ దేశాలూ, మధ్య ప్రాచ్యంలోని మితవాద ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నాయి. ఇరాన్‌లో చరిత్ర పునరావృతం అవుతోందా అంటే అవకాశం ఉందని చెప్పవచ్చు. గతంలో రాజు షాను ఉరితీయాలని నినదించిన వారే నేడు సుప్రీం లీడర్‌ అలీ ఖమేని ఉరికోసం డిమాండ్‌చేస్తున్నారు. మతాధికారులు గతంలో అమెరికా,బ్రిటన్‌ సామ్రాజ్యవాదులకు మద్దతు పలికిన చరిత్ర ఉంది. ఒక వేళ వర్తమాన ఆందోళన వారి ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తే వారు స్వచ్చందంగా పదవి నుంచి తప్పుకుంటారా ? జనాన్ని అణిచివేసేందుకు పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతారా అన్నది ప్రస్తుతానికి ఊహాజనిమే కావచ్చు గానీ, జరిగినా ఆశ్చర్యం లేదు !

చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్‌ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు ” ప్రేరేపిత ఆరోపణల పత్రం ” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కనుక భాషకోసం తడుముకోవాల్సినపని లేదు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.


మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు. అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యుట్యూబును, పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్రమోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా ? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా ? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచమంతటినీ చూడకుండా ఆపలేరు కదా ! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చువేసి అనధికారికంగా పంచుతున్నవారికి ఇది తెలియదా !


హిందూ-ముస్లిం ఉద్రికత్తలను పునరుజ్జీవింప చేసేందుకు పోలీసు, జడ్జి, తలారీ ఒకరే అన్నట్లుగా భారత్‌లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు పూర్వరూపంగా బిబిసి చిత్రం ఉన్నదని 302 మంది ప్రముఖులు చెప్పారు. నల్లమందు తింటే మన్నుదిన్న పాముల్లా పడి ఉంటారు అని చెబుతారు. కానీ మత మత్తుమందు జనాలను రెచ్చగొట్టి పిచ్చివారిగా మారుస్తుంది. వర్తమానంలో దాని విత్తనాలను చల్లి, దేశమంతటా సాగు చేస్తూ ఎవరు పెంచి పోషిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ డాక్యుమెంటరీలో ఉన్న అంశాలే అవి కదా ! అందువలన 302 మంది కాదు ముప్పై రెండువేల మంది ప్రముఖులు రాసినా మన ఘనమైన చరిత్ర పుటల్లోకి ఎక్కించిన చెరగని గుజరాత్‌ మారణకాండ మచ్చను చెరిపివేయలేరు.” తోటి భారతీయుడు మరియు మన నేతకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రేరేపిత ఆరోపణల పత్రం అని, విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజ్యవిధానానికి అనుగుణంగా ఉందని ” ఆ ప్రముఖులు బిబిసి చిత్రం గురించి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు చెప్పారు. బహుశా వారికి 80-20 అంటూ బిజెపి నేతలు చేసిన ” ఐక్యత ” ప్రవచనాలు, ప్రసంగాల సారం అర్ధం కాలేదా లేక వినలేదా ? అదే బ్రిటన్‌కు సేవ చేసుకుంటామని రాసి ఇచ్చిన అపర దేశభక్తుల గురించి వేనోళ్ల పొగుడుతున్న వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ బ్రిటన్‌తోనే చెట్టపట్టాలు వేసుకొని ఊరేగుతున్నాం. ఆ ప్రముఖులు తమ ప్రకటనలో పౌరసత్వ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై రోజూ బిజెపి పెద్దలు, దాన్ని సమర్ధించేవారు చెబుతున్న అంశాలన్నింటినీ తుచ తప్పకుండా పునశ్చరణ చేశారు. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షిక బదులు ” బిబిసి : నైతిక ప్రశ్న (బిబిసి ది ఎథికల్‌ క్వొశ్చన్‌) అని పెట్టి ఉంటే బాగుండేదని ముక్తాయింపు ఇచ్చారు. ఇబ్బందేముంది ? దేనికి దాన్ని పరిగణనలోకి తీసుకొని బిబిసి కథనాలన్నింటిని పరిశీలించి బేరీజు వేద్దాం.


గుజరాత్‌ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ లింకులన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌, యుట్యూబ్‌లను ఆదేశించింది. దీని అర్ధం దాన్నింక ఎవరూ చూడలేరని కాదు. బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్‌ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి డిరెక్‌ ఓ బ్రియన్‌ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్‌ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొకమార్గం లేదని ట్విటర్‌ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమంద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు. చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్దతుల్లో దొరుకుతుంది. ” భారత తనయ ” (ఇండియాస్‌ డాటర్‌) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చింది లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్‌ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.


గతంలోనే బతకాలని భారత ముస్లింలెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పుపట్టాల్సినపని లేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని. గతాన్ని పునరుద్దరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ద హిందూత్వ దేశాన్ని పునరుద్దరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వపాలనను పునరుద్దరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్దరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేతజాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్‌ మన్సూర్‌ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు.హిందూత్వ ఉద్దారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.


ఇక తారిఖ్‌ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీం కోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు.నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్యకేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా ? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్‌ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్‌ కోర్టులు తప్పు పట్టలేదు.యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్‌ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటివారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే. తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీం కోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు.

గుజరాత్‌ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్రమోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన ? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా ? జర్మనీ, ఇటలీ,తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు. అని చెబితే మా నరేంద్రమోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వపోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారికోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్‌-2లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటిని చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.


డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ( కన్సర్వేటివ్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ( పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్‌ బిబిసి అధిపతి టిమ్‌ డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు. ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ హిందువులు-ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్‌ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్‌ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం,దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్దమనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా ?

సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యం కాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశంలో కూడా అనేక మంది పాత సంగతులను అలాగే ఎందుకు వెల్లడించకూడదు అనుకుంటారు. గోద్రా రైలు దుర్ఘటన పేరుతో జరిపిన 2002 గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌ రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన నివేదికల్లోని అంశాలను బహిర్గతం చేస్తే కొంత మంది ఇప్పుడు ధూం ధాం అంటూ మండిపడుతున్నారు. తమ రాయబారి పంపిన అంశాలను బ్రిటన్‌ సరికొత్త పద్దతుల్లో వెల్లడికావించింది. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌( బిబిసి ) రెండవ ఛానల్‌ ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) పేరుతో 2023 జనవరి 17న ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ తొలి భాగం ఆ దురంతాలను గుర్తుకు తెచ్చి మరోసారి నరేంద్రమోడీ, సంఘపరివార్‌ సంస్థల పేర్లను జనం నోళ్లలో నానేట్లు చేసింది. బిబిసికి సమాచారం ఇచ్చిన తీరు మీద బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఖండించలేని నిస్సహాయ స్థితికి ప్రపంచంలో ఎదురులేదని చెబుతున్న నరేంద్రమోడీని నెట్టింది. ప్రతిస్పందిస్తే మరింత పరువు పోతుంది అన్నట్లుగా మాట్లాడకూడదని నిర్ణయించింది. పైకి మాట్లాడినా మాట్లాడకున్నా ప్రపంచమంతా మోడీ గురించి మరోసారి అవలోకిస్తుంది.


ఈ డాక్యుమెంటరీ వక్రీకరణలతో ప్రచారం కోసం నిర్మించిందని, ఒక నిర్ధిష్టమైన పరువు తక్కువ కథనాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు రూపొందించినదని, దాని మీద ఇంతకు మించి స్పందించి గౌరవించదగినది కాదని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. వివాదం తలెత్తటంతో ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్‌ నుంచి తొలగించారు. ఈ నెల 24న మరొక భాగం ప్రసారం కావాల్సి ఉంది.తమ కథనాన్ని బిబిసి సమర్ధించుకుంది. ఉన్నతమైన సంపాదక ప్రమాణాలకు అనుగుణంగా తీవ్రంగా పరిశోధించిన తరువాత రూపొందించినట్లు పేర్కొన్నది. భిన్న గళాలు, అభిప్రాయాలు వెలిబుచ్చే వారిని, నిపుణులను తాము కలిశామని, బిజెపికి చెందిన వారి స్పందనలతో సహా పలు అభిప్రాయాలకు దానిలో తావిచ్చామని, తమ డాక్యుమెంటరీలో లేవనెత్తిన అంశాలకు తగిన సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా స్పందించేందుకు తిరస్కరించినట్లు బిబిసి తన ప్రకటనలో పేర్కొన్నది. గుజరాత్‌ ఉదంతాలు, నరేంద్రమోడీ పాత్ర గురించి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అది ప్రసారంగాక ముందే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అని బిబిసి ప్రకటన చెబుతున్నది. చర్చ మరింత జరిగితే నరేంద్రమోడీ, బిజెపికి మరింత నష్టం గనుక కేంద్రం నుంచి లేదా బిజెపి దీని గురించి ముందు ముందు ప్రస్తావించకపోవచ్చు. మొత్తంగా మీడియా నరేంద్రమోడీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పరిమితంగానైనా వార్తలు ఇవ్వకపోవచ్చు, చర్చలు జరపకపోవచ్చు. అంత మాత్రాన రచ్చగాకుండా ఉంటుందా జనం చర్చించకుండా ఉంటారా ?


ఏ దేశంలోనైనా పెద్ద ఉదంతాలు జరిగినపుడు ఆ దేశంలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు మనదేశంతో సహా తమ వనరులు, సంబంధాల ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని తమ దేశాలకు చేరవేస్తాయి. వికీలీక్స్‌ వెల్లడించిన కోట్ల కొద్దీ పత్రాలవే. గుజరాత్‌ ఉదంతాల గురించి బ్రిటీష్‌ రాయబార కార్యాలయం అలాంటి నివేదికనే ఇచ్చినట్లు దానిలోని అంశాలను డాక్యుమెంటరీ వెల్లడించింది. బిబిసికి వాటిని అందించారంటే బ్రిటన్‌ ప్రభుత్వం తొలిసారిగా వాటిని బహిర్గత పరిచినట్లే. అందువలన ఈ డాక్యుమెంటరీ గురించి, దానిలో పేర్కొన్న అంశాల సంగతి ఏమిటని పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ ప్రస్తావించినపుడు నోరు మూయించేందుకు ప్రధాని రిషి సునాక్‌ చూశాడు. సమాధానంగా ఏమి చెప్పినప్పటికీ అది మొహమాటంతో చెప్పినవిగానే పరిగణించాలి. నివేదికలోని అంశాలు వాస్తవమా కాదా అని చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానమిచ్చాడు.పాకిస్థాన్‌ మూలాలున్న ఎంపీ ఇమ్రాన్‌ హుసేన్‌ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావించగా దానితో తమకు సంబంధం లేదని, దానిలో భారత ప్రధాని గురించి చిత్రీకరించిన తీరును తాను అంగీకరించటం లేదని రిషి సునాక్‌ చెప్పాడు. మత విద్వేష హింస ఎక్కడ జరిగినా తాము సహించబోమని, అయితే నరేంద్రమోడీ పాత్రను చిత్రించిన తీరును తాను అంగీకరించనని అన్నాడు. ఇంత రచ్చ జరిగిన తరువాత కూడా బిబిసి చిత్రంలో వెల్లడించిన అంశాల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరో భాగాన్ని ప్రసారం చేస్తారా లేదా అన్నది చెప్పలేదు.


డాక్యుమెంటరీలో పేర్కొన్నదాని ప్రకారం నాటి బ్రిటన్‌ దౌత్యవేత్త పంపిన సమాచార పత్రానికి పెట్టిన శీర్షిక, సంగ్రహము ఇలా ఉంది. ” విషయము: గుజరాత్‌ మారణకాండ ” వెల్లడైనదాని కంటే హింస చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండువేల మంది మరణించారు. పధకం ప్రకారం పెద్ద ఎత్తున ముస్లిం మహిళల మీద అత్యాచారాలు జరిగాయి.లక్షా 38వేల మంది నిరాశ్రయులయ్యారు. హిందువులు ఉండే చోట, హిందువులు-ముస్లింలు కలసి ఉన్న ప్రాంతాలలో ముస్లింల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం కావించారు. పధకం ప్రకారం హింస జరిగింది. కొన్ని నెలల ముందుగానే పధకం వేసి ఉండవచ్చు. రాజకీయ ప్రేరేపితమైనది.హిందువులుండే ప్రాంతాల నుంచి ముస్లింలను తరమివేయటమే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ రక్షణలో దీనికి విహెచ్‌పి (హిందూ ఉగ్రవాద సంస్థ) నాయకత్వం వహించింది. మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా ఐకమత్యము అసాధ్యం. వారి(హిందూ మూకలు) పధకం ప్రకారం సాగించిన హింసలో నిర్దిష్ట జాతి నిర్మూలన లక్షణాలన్నీ ఉన్నాయి. శిక్షలేమీ ఉండవనే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా విహెచ్‌పి అంత ఎక్కువ నష్టం కలిగించి ఉండేది కాదు. దీనికి నరేంద్రమోడీ నేరుగా బాధ్యుడు.”


ఇంతే కాదు, డాక్యుమెంటరీ వెల్లడించిన దాని ప్రకారం బ్రిటన్‌తో పాటు ఐరోపా సమాఖ్య కూడా విచారణ జరిపింది. వాటిసారం ఒక్కటే. హింసాకాండలో మంత్రులు చురుకుగా భాగస్వాములయ్యారు. దాడుల్లో జోక్యం చేసుకోవద్దని సీనియర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయమైన వారు చెప్పినదాని ప్రకారం 2002 ఫిబ్రవరి 27న నరేంద్రమోడీ సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమై జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అసలు అలాంటి సమావేశం జరగలేదని పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు కూడా బిబిసి తన కథనంలో పేర్కొన్నది. సమావేశం జరిగిందని అంగీకరిస్తే మోడీ ఆదేశాలను అమలు జరిపినట్లుగా అంగీకరించినట్లవుతుంది, ఆ ఉదంతాలకు స్వయంగా కారకులని అంగీకరించినట్లవుతుంది కనుక అసలు సమావేశమే జరగలేదని చెప్పినట్లు కూడా పేర్కొన్నది. నాడు ఇంటలిజెన్స్‌ విభాగ అధిపతిగా ఉన్న ఆర్‌బి శ్రీకుమార్‌, మరో అధికారి సంజీవ భట్‌, మరో అధికారి మాత్రం నరేంద్రమోడీ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. సదరు సమావేశంలో అసలు వారెవరూ పాల్గొనలేదని అదే కథనంలో మరొక పోలీసు అధికారి చెప్పిన అంశాన్ని కూడా డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. మరొక కేసులో సంజీవ భట్‌ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.


ఈ కథనంలో లేదా నరేంద్రమోడీ మద్దతుదార్లు, బిజెపి ఏమి చెప్పినా కొన్ని సందేహాలకు సరైన సమాధానం రాలేదు. అంతటి తీవ్ర శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు ఏ సిఎం అయినా ఇంటలిజెన్స్‌ అధికారిని పిలిపించకుండా,ఉన్నతాధికారుల సమావేశం జరపకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారా ? ” స్నేహపూర్వకంగా ఉన్న ఒక దేశాధినేత గురించి గతంలో బిబిసిలో అలాంటి విమర్శ వచ్చినట్లు నాకు గుర్తు లేదు. కనుక సహజంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమంటే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని గట్టిగా కోరుకుంటూ ప్రస్తుతం బ్రిటన్‌ ప్రభుత్వం సున్నితమైన చర్చల్లో మునిగి ఉన్నపుడు గుజరాత్‌ కొట్లాటలపై విస్ఫోటకం వంటి చిత్రాన్ని ప్రసారం చేయాలని బిబిసి ఎందుకు నిర్ణయించినట్లు ” అని మన విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఒకరు ప్రశ్నించినట్లు బిబిసి పేర్కొన్నది. నిజమే, వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి అంశాలతో కూడిన చిత్రాన్ని ప్రసారం చేస్తే హానికలిగే అవకాశం ఉంటుంది, ఇతర సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. కనుక ఏ ప్రభుత్వమైనా తన దగ్గర ఉన్న సమాచారాన్ని, అందునా ప్రభుత్వ నిధులతో నడిచే ఒక మీడియా(బిబిసి) సంస్థకు అందచేసి బహిర్గతపరిచేందుకు అనుమతిస్తుందా ? కారణం ఏదైనా బ్రిటన్‌ ప్రభుత్వం అందించింది, ప్రసారానికి కూడా అనుమతి ఇచ్చింది.


గుజరాత్‌ మారణకాండ జరిగినపుడు బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న జాక్‌ స్ట్రా ఆ ఉదంతాలపై నివేదిక ఇవ్వాలని కోరాడు.హౌంమంత్రిగా జాక్‌ స్ట్రా పనిచేసినపుడు బ్రిటన్‌ సమాచార స్వేచ్చ చట్టాన్ని 2000లో తెచ్చారు. దాన్ని సమీక్షించేందుకు 2015లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో కూడా జాక్‌ ఉన్నాడు. బహుశా సమాచార కమిషన్‌తో ఉన్న దగ్గరి సంబంధాల కారణంగా గుజరాత్‌ నివేదికలను బహిర్గతం కావించేందుకు అతగాడు ఒక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు. జాక్‌ స్ట్రా లేబర్‌ పార్టీ నేత కనుక టోరీ పార్టీ ప్రధాని రిషి సునాక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చూసి ఉండవచ్చు అనుకుంటే, అధికారంలో ఉన్న పార్టీ, మంత్రులు, అధికారులు ఎందుకు సహకరించినట్లు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.


రాయబార కార్యాలయం పంపిన నివేదికలో నరేంద్రమోడీ పాత్ర గురించి స్పష్టంగా చెప్పిన కారణంగానే ఆ తరువాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. బ్రిటన్‌లోని హిందూత్వ సంస్థల ఆహ్వానం మేరకు 2003లో నరేంద్రమోడీ అక్కడికి వెళ్లారు. దాని మీద తలెత్తిన విమర్శలతో ” నరేంద్రమోడీ బ్రిటన్‌ సందర్శన గురించి మాకు తెలుసు, ప్రభుత్వ ఆహ్వానం మేరకు అతను రావటం లేదు, ఇక్కడ ఉన్నపుడు అతనితో ఎలాంటి సంబంధాలూ ఉండవు ” అని బ్రిటన్‌ సర్కార్‌ ప్రకటించింది. మోడీ బ్రిటన్‌ వెళ్లినపుడు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా ఉన్న సత్యవ్రత పాల్‌ తరువాత రాసిన దానిలో ఇలా ఉంది. ” విదేశాంగశాఖ మంత్రి (యశ్వంత సిన్హా) ప్రధాని వాజ్‌పాయి దగ్గరకు వెళ్లారు. ఆ పర్యటన వాంఛనీయం కాదు, రద్దు చేసుకోవాల్సిందే అన్న వైఖరితో ప్రధాని కూడా అంగీకరించారు.” ఐనా సరే జరిగింది అంటే సంఘపరివార్‌ వత్తిడి కారణం అన్నది స్పష్టం. ఇక మోడీ బ్రిటన్‌లో ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ అనే లాయరు మోడీని అరెస్టు చేయాలని అక్కడ కోర్టుకు వెళ్లారు, కోర్టు అంగీకరించలేదు. ఇప్పుడు బిబిసి వెల్లడించిన సమాచారం గనుక ఆ నాడు తన వద్ద ఉండి ఉంటే మోడీ అరెస్టుకు దారితీసేదని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నాడు. అదే సర్కార్‌ తరువాత 2005లో మోడీ వీసాను రద్దు చేసింది. అమెరికా కూడా వీసాను రద్దు చేసింది.సిఎంగా ఉన్నపుడు మోడీ రాకను అడ్డుకుంది. తరువాత 2014లో నరేంద్రమోడీ ప్రధాని కాగానే ఈ రెండు దేశాలూ వీసాను పునరుద్దరించి దేశాధినేతగా స్వాగతం పలికాయి. ఒక దేశంలో ఒక రాష్ట్రానికి సిఎంగా ఉండటం వేరు, ప్రధానిగా దేశాధినేతగా ఉండటం వేరు గనుక తామాపని చేశామని, ఒక్క నరేంద్రమోడీకే కాదు సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు సైతం వీసా పునరుద్దరించామని, అది సంప్రదాయమని 2022 నవంబరులో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.


తమ ప్రాణాలకు భద్రత గురించిన భయంతో భారత్‌కు చెందిన 30 మంది డాక్యుమెంటరీలో మాట్లాడేందుకు తిరస్కరించినట్లు బిబిసి పేర్కొన్నది.భారత ప్రభుత్వం కూడా దానిలో పేర్కొన్న అంశాలపై స్పందించేందుకు నిరాకరించింది అనికూడా వెల్లడించింది.ఈ నెల 24న ప్రసారం కానున్న రెండవ భాగంలో 2019 తరువాత మోడీ సర్కార్‌ తీరు తెన్నుల గురించి వివరించనుంది. ఈ చిత్రం గురించి పలు కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ ఎత్తులు జిత్తులలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌ ముందుకు తెచ్చిన కూటముల్లో మన దేశం చురుకుగా ఉంది. మన మీడియా వర్ణించినట్లుగా ”మనవాడు” రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు మోడీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తరువాత కూడ బిబిసి ఇలాంటి చిత్రాన్ని ప్రసారం చేయటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే బ్రిటన్‌ విదేశాంగ శాఖ వద్ద ఉన్న నివేదికలను కూడా సుప్రీం కోర్టుకు సమర్పించి దాని మీద విచారణ జరిగిన తరువాత బిబిసి ఆపని చేసి ఉంటే ఆ వాదనకు అర్ధం ఉంది. అలా జరగలేదే. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నరేంద్రమోడీని బదనాం చేసేందుకు ఇలా చేశారని చెబుతున్నారు. బ్రిటన్ను ప్రభావితం చేసే స్థితిలో ఇప్పుడు అమెరికా తప్ప మరొక దేశం లేదు. అదే వాస్తవమైతే ఆ పని 2014, 2019 ఎన్నికలపుడే చేసి ఉండవచ్చు. దాని వలన బిబిసికి, బ్రిటన్‌ ప్రభుత్వానికి కలిగే లబ్ది ఏమిటి ? ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా బిబిసి ఉత్తినే ఈ చిత్రాన్ని ప్రసారం చేస్తుందా ? దీని వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటో వెల్లడిగాక తప్పదు.

దిమ్మ తిరిగే నరేంద్రమోడీ మంత్రాంగం : రష్యా చమురు దిగుమతి అసలు మతలబు ఇదా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బతీసేందుకు ప్రకటించిన ఆనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.


పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంథన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం క్రియాశీలత, వేగాన్ని ప్రదర్శించిందని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ వర్ణించారు. ఇంథన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అన్నారు.రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రు.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్రమోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?


నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా,బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్దిపొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా ? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. రోజుకు రెండులక్షల పీపాల ఎగుమతి జరుగుతున్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా చెప్పాడు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నది ఆ రెండు కంపెనీలైనప్పటికీ ప్రభుత్వ రంగంలోని ఐఓసి,బిపి, హెచ్‌పి సంస్థలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయని, ప్రతివారూ కొంటున్నారు, ఇప్పుడిది ఒక జాతీయ క్రీడగా మారిందని కాటోనా అన్నాడు.


ప్రస్తుతం రోజుకు మన దేశం 17లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరులక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ది సామర్ధ్యంలో ఇది సగం.నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ది కంపెనీలకు ఒక టాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 టాంకర్లు ఉన్నట్లు కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు.ఎక్కడైనా ఆధునిక చమురుశుద్ది కర్మాగారం ఉంటే విజివోతో రవాణా ఇంథనాల తయారు ప్రత్యేకించి డీజిల్‌, అవసరమైతే పెట్రోలుగా కూడా మార్చవచ్చన్నాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలుదువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది. 2022లో జామ్‌ నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీ 215 టాంకర్లలో చమురు దిగుమతి చేసుకుంది.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ది కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలెనెస్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ” తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంథనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ది చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే ” అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నరెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.


ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌,ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది.లేనట్లయితే ఇంథన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంథన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది.జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన,2024వరకు గాస్‌ ధరల అదుపు వంటి పధకాలను ప్రకటించినప్పటికీీ ఇంథన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14శాతం గాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15శాతం పడిపోయింది. గతంలో వెనెజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు దొడ్డిదారిన రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ది చేసిన తరువాత దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మన ప్రభుత్వం అమెరికా- రష్యాలను సంతుష్టీకరిస్తున్నట్లు భావించవచ్చా ? తటస్థ విధానం అంటే ఇదా !

చైనాను బూచిగా చూపి పేట్రేగుతున్న అమెరికా మిలిటరీ ఉన్మాదం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


2023లో 858 బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని పెంటగన్‌ (అమెరికా రక్షణ శాఖ ) నిర్ణయించింది. ఇది అడిగినదానికంటే 45 బి.డాలర్లు అదనం. నిజానికి 1200బి.డాలర్లు ఖర్చు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజు తలచుకోవాలే గానీ దెబ్బలకు కొదవా అన్నట్లుగా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు కనుసైగ చేయాలేగానీ అమెరికా పాలకులు డాలర్లతో వాలిపోతారు. స్టాక్‌హౌం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రీ) గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో తొలిసారిగా ప్రపంచ రక్షణ ఖర్చు రెండు లక్షల కోట్ల డాలర్లు (2,113 బి.డాలర్లు) దాటింది. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా వాటా మొత్తంలో 62శాతం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు లేదా బాధితులను ఆదుకొనేందుకు చేసిన ఖర్చు సంగతేమో గానీ వరుసగా ఏడేళ్లు , కరోనాలో ఆర్థిక రంగం దిగజారినప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం మిలిటరీ ఖర్చు మాత్రం పెరిగింది.


అమెరికాలో 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. సాంకేతికంగా ఇతర దేశాల కంటే పైచేయిగా ఉండాలన్న వైఖరితో ఏటా భారీ ఎత్తున పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. రష్యా నుంచి ప్రధానంగా ఎగుమతి జరిగే చమురు ధరలు తక్కువగా ఉండి రాబడి తగ్గటంతో 2016 నుంచి 2019 వరకు దాని మిలిటరీ ఖర్చు కూడా తగ్గింది. అయితే, అమెరికా, ఇతర నాటో దేశాల కుట్రలను పసిగట్టి తరువాత ఉక్రెయిన్‌ సరిహద్దులో మిలిటరీని పెంచటంతో ఖర్చు కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2021లో ఖర్చు పెరిగినందున 65.9బి.డాలర్లకు చేరింది. గతేడాది 75, ఈ ఏడాది 84బి.డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెండవ స్థానంలో ఉన్న చైనా ఖర్చు 293 బి.డాలర్లుంది. గత 27 సంవత్సరాలుగా వరుసగా పెరుగుతూనే ఉంది.76.6 బి.డాలర్లతో మన దేశం మిలిటరీ ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. ఇటీవల జపాన్‌ భారీ మొత్తాలను పెంచటంతో మనలను వెనక్కు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించనున్నట్లు వార్తలు. 2021లో 50 బి.డాలర్లకు మించిన ఖర్చు ఉన్న దేశాలు వరుసగా అమెరికా(801), చైనా (293), భారత్‌ (76.6), బ్రిటన్‌ (68.4), రష్యా (65.9), ఫ్రాన్స్‌ (56.6), జర్మనీ (56), సౌదీ అరేబియా (55.6), జపాన్‌(54.1), దక్షిణ కొరియా (50.2) ఉంది.
అమెరికాతో సహా ప్రత్యేకించి చైనాను దెబ్బతీసేందుకు చూస్తున్న దేశాలు దాన్నొక బూచిగా చూపుతూ తమ ఖర్చును పెంచుతున్నాయి.

ఏ దేశమూ మరో దేశాన్ని నమ్మే పరిస్థితి లేనందున మిలిటరీ నవీకరణకు తప్పనిసరిగా కొంత ఖర్చు పెరగటం సహజం. అమెరికా, ఐరోపాలోని ప్రయివేటు రంగంలోని ఆయుధ కంపెనీల లాభాలను పెంచేందుకు వివిధ ప్రాంతాలలో చిచ్చు రేపుతున్నందున, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేక దేశాలు ఖర్చును పెంచాల్సి వస్తోంది. రెండవ అంశమే ప్రధానంగా పని చేస్తోంది. ప్రపంచాన్ని భయ పెట్టేందుకు, తన పెత్తనాన్ని రుద్దేందుకు అవసరం లేకున్నా తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తరువాత కాలంలో ప్రపంచమంతటా అణ్వాయుధాల తయారీ, ఇతర వాటికి పదును పెట్టే, సేకరణ పోటీకి తెరతీసింది. సోవియట్‌ యూనియన్ను బూచిగా చూపి రక్షణ పేరుతో నాటో కూటమిని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్నే ఏకంగా తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మిలిటరీ శక్తితో చైనా, ఇండో-చైనా దేశాలను ఆక్రమించుకున్నది జపాన్‌.అది రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిన తరువాత దాని మీదకు ఎవరో దాడికి రానున్నట్లు బూచిగా చూపి రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పిటలోకి తీసుకున్నదీ అమెరికానే. ఇప్పుడు చైనాను బూచిగా చూపి ఇతర దేశాలను తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే కొత్త కథలు అల్లుతోంది.


చైనా దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల అణ్వాయుధాలు 2035 నాటికి 1,500కు పెరుగుతాయని, అందువలన దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పెంటగన్‌ అందరినీ ఉసిగొల్పుతోంది. అంతే కాదు, అమెరికాలోని ఆయుధ పరిశ్రమల కోసం కూడా మీడియాలో కట్టుకథలను అల్లించటం, వాటిని చూపి బడ్జెట్‌ను పెంచాలని వత్తిడి తేవటం అమెరికాలో అనేక మంది అధికారుల, ఎంపీల రోజువారీ వృత్తి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర 13,080 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇక అణువిద్యుత్‌ కేంద్రం ఉన్న ప్రతి దేశం వాటిని ఏ క్షణంలోనైనా రూపొందించగల సత్తా కలిగినదిగా పరిగణిస్తున్నారు. రష్యా వద్ద 6,257 అణ్వస్త్రాలు ఉంటే వాటిలో తక్షణమే దాడికి పనికి వచ్చేవి 1,458, అందుబాటులో ఉన్నది 3,039, పనికి రానివి 1,760గా చెబుతున్నారు. ఆ తరువాత అమెరికా వద్ద ఇలాంటివే వరుసగా 5,550-1,389-2,361-1,800 ఉన్నట్లు అంచనా. వీటితో పోలిస్తే చైనా ఒక మరుగుజ్జు మాదిరి ఉంటుంది. ఇక దేశాల వారీగా చైనా వద్ద 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, పాకిస్థాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు ఉన్నట్లు అంచనా. ఈ అంచనాలు, సంఖ్యలను ఎవరూ పూర్తిగా నిర్ధారించలేరు. అవసరమైతే ఎప్పటికప్పుడు రూపొందిందే ఆధునిక పరిజ్ఞానం అమెరికా, రష్యా వద్ద ఉంది. ఇప్పుడు చైనాను చూపి మరింతగా మిలిటరీ ఖర్చు ఎందుకు చూపుతున్నట్లు అన్నది ప్రశ్న.


ఏడాదికి ఒక సారో రెండుసార్లో ఎవరైనా కొనుగోలు చేసి కాల్చగల దీపావళి బాంబుల వంటివి కాదుఅణ్వాయుధాలు. వాటి రూపకల్పనకు ఖర్చైన మాదిరే నిర్వీర్యం చేసేందుకు కూడా చేతి సొమ్ము వదిలించుకోవాల్సిందే. అమెరికా తప్ప ఇంతవరకు ఏ దేశమూ వాటిని ప్రయోగించలేదు.అలాంటి పని చేస్తే ఏ దేశమూ మిగలదు.భారత్‌కు పాకిస్థాన్‌ ఎంత దూరమో పాకిస్థాన్‌కూ భారత్‌ అంతే దూరం. అదే విధంగా ఇతర అణుశక్తి దేశాలూ కూడా. ఎవరు అస్త్రాన్ని వదిలినా వెంటనే మరొకరు సంధిస్తారు. కట్టుకథలు, పిట్టకతలను ఆకర్షణీయంగా మలచటం తప్ప వాటిలో హేతుబద్దత కనిపించదు. ఉదాహరణకు గతేడాది నవంబరు 29న సిఎన్‌ఎన్‌ ఒక వార్తను అల్లింది. దాని ప్రకారం చైనా వద్ద 2020లో రెండువందల అణ్వాయుధాలుండగా 2022 నాటికి 400కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేగానికి అనుగుణంగా 2035 నాటికి 1,500కు పెరగవచ్చని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు పెరిగితే పదమూడు సంవత్సరాల్లో 12,800కు చేరతాయి.అది జరిగేదేనా ? ఈ లోగా ఇతర దేశాలు చేతులు ముడుచుకు కూర్చుంటాయా ? ఇలాంటి అంకెలకు ఆధారం ఏమిటి ?


అణ్వాయుధాలంటే ఫాక్షనిస్టులు ఇండ్ల దగ్గర నాటు బాంబులను చుట్టినట్లు కాదు. అవసరమైన యురేనియం,ప్లుటోనియం కోసం అణురియాక్టర్లు, శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగాలి.దానికోసం ఎంతో ఖర్చు అవుతుంది. అనేక దేశాలు విద్యుత్‌ వంటి పౌర అవసరాల కోసం అణుకేంద్రాల నిర్మాణం చేస్తున్నాయి. అక్కడే అణ్వాయుధాల రూపకల్పనకు అవసరమైన గ్రేడ్ల యురేనియం,ప్లుటోనియం కూడా తయారు చేయవచ్చు.విద్యుత్‌ కోసం చైనాతో సహా అనేక దేశాలు అణుకేంద్రాల నిర్మాణం చేపట్టాయి. మన దేశంలో 22 రియాక్టర్లు, ఎనిమిది విద్యుత్‌ కేంద్రాలున్నాయి. మరో పది రియాక్టర్లు, విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణం,ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెంటగన్‌ నివేదికల్లో చెప్పినవన్నీ ప్రమాణాలు కాదు. ఊహాగానాలు, ఆధారం లేని ఆరోపణలు అనేకం ఉంటాయి. మూడు వందల ఖండాంతర క్షిపణుల(ఐసిబిఎం)ను ప్రయోగించేందుకు అవసరమైన నిర్మాణాలను చైనా జరుపుతోందన్నది దానిలో ఒకటి. దీనికి ఎలాంటి ఆధారం లేదని అమెరికా పత్రికలే రాశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ సంస్థకు చెందిన వారు చైనా వద్ద కేవలం 110 మాత్రమే ఖండాంతర క్షిపణులున్నట్లు, బహుశా దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా కలుపుకొని 300 సంఖ్య చెప్పి ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా1960 దశకం నుంచి ఐసిబిఎం, అణుక్షిపణి జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లను సమన్వయం చేస్తున్న విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వీటిని మరింత నవీకరించేందుకు 1.8లక్షల కోట్ల డాలర్లతో ఒక పధకాన్ని ప్రారంభించారు. చైనా కూడా ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తున్నదనే అనుమానం పెంటగన్‌కు ఉండి, చీకట్లో బాణాలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ దేశానికైనా తన జాగ్రత్తలో తానుండే హక్కు, అవకాశం ఉంది.


అణుక్షిపణుల జలాంతర్గాములతో 1959 నుంచే అమెరికా పహారా కాస్తున్నది. చైనా వద్ద ఉన్న అలాంటి జలాంతర్గాములు 2021 నుంచి పని చేస్తున్నట్లు అంచనా. అమెరికా వద్ద 11,840 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేరుకొనే జలాంతర్గాములు క్షిపణులు ఉండగా చైనా వద్ద 6,880 కిమీ దూరం వెళ్లే క్షిపణులున్నట్లు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం వాస్తవం చైనా అంటే చౌక ధరలకు అందించే పాదరక్షలు, దుస్తులు,ఫోన్లు, టీవీల వంటి వినియోగవస్తువులను మాత్రమే భారీ ఎత్తున తయారు చేయగలదని అనేక మంది ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. బొమ్మ విమానాలు, దీపావళి తారాజువ్వలనే కాదు నిజమైన వాటిని రూపొందించగల సత్తా సమకూర్చుకుంది. చైనాలో గుట్టు ఎక్కువ. రోజువారీ వస్తువులతో పాటు తనను దెబ్బతీసేందుకు చూసే వారికి దడపుట్టించే ఆధునిక అస్త్రాలను కూడా అది ఇప్పుడు కలిగి ఉంది. అమెరికాకు పట్టుకున్న భయాలలో అదొకటి. ఇటీవల తైవాన్‌ జలసంధిలో అలాంటి వాటిని చైనా ప్రదర్శించింది.


2023లో జర్మనీతో సహా నాటో దేశాలన్నీ రక్షణ ఖర్చును భారీ ఎత్తున పెంచనున్నాయి. వాటి జిడిపిలో రెండు శాతం అందుకు కేటాయించాలని, నాటో ఖర్చును తామెంత కాలం భరించాలంటూ, ఒక వేళ రష్యా గనుక దాడి చేస్తే రక్షణకు తాము వచ్చేది లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు బహిరంగంగానే వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ నేపధ్యంలో భారీగా పెంచుతున్నప్పటికీ పెంటగన్‌ వాటిని లోక కల్యాణం కోసం అన్నట్లుగా చూస్తున్నది. జిడిపిలో రెండు శాతం అన్న దానికి అనుగుణంగా ప్రత్యేక ఆయుధ నిధి కోసం తాము 106బి.డాలర్లు ఖర్చు చేస్తామని గతేడాది ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన మూడు రోజుల తరువాత జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు.జర్మనీ ఆయుధ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవటంతో పాటు, అమెరికాను సంతుష్టీకరించటం నాటోలో అమెరికా తరువాత పెత్తనం తనదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్థికంగా దిగజారి ఉన్నందున బ్రిటన్‌ ఖర్చు పెంచే స్థితిలో లేదు. జపాన్‌ మాదిరే ఇటీవలి కాలంలో జర్మనీ తన ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నది. తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌,ఫిన్లండ్‌ కూడా నాటోలో చేరి మిలిటరీ ఖర్చును పెంచనున్నాయి. పోలాండ్‌ కూడా ఖర్చు పెంచేందుకు పూనుకుంది.ఇవన్నీ జరిగితే సింహభాగం అమెరికా సంస్థలే లబ్ది పొందుతాయి.


భారీ ఎత్తున పెంచిన పెంటగన్‌ బడ్జెట్‌తో సంతృప్తి చెందని మిలిటరీ కార్పొరేట్ల కనుసన్నలలో నడిచే ఎంపీలు, అధికారులు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ సలహాదారు మెక్‌ మాస్టర్‌ పన్నెండువందల బి.డాలర్లు కావాలని చెప్పాడు. జపాన్‌ రెండింతలు చేసేందుకు పూనుకున్నదని దాన్ని చూసి నేర్చుకోవాలంటూ చైనాను నిలువరించేందుకు అవసరమైనదాని కంటే అమెరికా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు విమర్శించాడు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంటగన్‌ వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుందని కొందరు గుండెలు బాదుకున్నారు. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్న అమెరికాకు తోడుగా, జపాన్‌, ఆస్ట్రేలియా కూడా రక్షణ ఖర్చు పేరుతో సమీకరణ కావటం ఆందోళన కలిగించే పరిణామం.

చైనాతో వాణిజ్య లోటు వంద బి.డాలర్లు : వస్తువులు నాసిరకమైతే దిగుమతులు ఎందుకు ? మోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


లడక్‌ సరిహద్దులో గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా పెట్టుబడులను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్రమోడీ చైనా దిగుమతులను కూడా అడ్డుకుంటారని అనేక మంది కాషాయ దేశభక్తులు నిజంగానే ఆశించారు, భ్రమించారు, కోరుకున్నారు. మోడీ వారి మనో భావాలను దారుణంగా దెబ్బతీశారు. చైనాతో వాణిజ్య లావాదేవీలను వంద బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఆశించిన మన్మోహన్‌ సింగ్‌ అది నెరవేరకుండానే గద్దె దిగారు. మన్మోహన్‌ సింగ్‌ వైఫల్యాలను, మౌనాన్ని ఎండగట్టి రాజకీయంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీని ఒకందుకు ” అభినందించక ” తప్పదు. చైనాతో లావాదేవీలను వంద బి.డాలర్లు దాటించి ఒక రికార్డు నెలకొల్పారు. తాజాగాచైనాతో వాణిజ్య లోటును కూడా ఏకంగా వంద బి.డాలర్లు దాటించి సరిలేరు నాకెవ్వరూ అన్నట్లుగా మౌన గీతాలు పాడుతున్నారు. కాకపోతే ఈ ఘనత గురించి బిజెపితో సహా ఎవరూ ఎక్కడా చెప్పరు, టీవీలు చర్చలు జరిపి ఆహౌ ఓహౌ అన్న వాతావరణం కల్పించవు. మోడీ నోరు విప్పరు. ఇదేం నిర్వాకం బాబూ అని బిజెపి ప్రతినిధులను అడిగితే సరిహద్దు వివాదాలకూ మిగతా వాటికి లంకెలేదు, వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా చేసుకోక తప్పదు కదా అంటారు. ఇదొక జుమ్లా, తప్పించుకొనే మోసకారి వాదన.


తాజాగా చైనా జనవరి 13న విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 2022(వారి లెక్క జనవరి నుంచి డిసెంబరు )లో 135.98 బి.డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 125 బి.డాలర్లుంది. అఫ్‌ కోర్సు ఈ లెక్కలు తప్పని ” దేశభక్తులు ” చెప్పినా ఎవరూ చేసేదేమీ లేదు. చైనా నుంచి దిగుమతులు 118.5 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 17.48 బి.డాలర్లు. నిఖరంగా మనం 101.02 బి.డాలర్లు చైనాకు సమర్పించుకున్నాం.2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరిగింది. ఏ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ దిగుమతులు చేసుకుంటున్నారో, ఏటేటా పెంచుతున్నారో ఎవరైనా చెప్పగలరా ? ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలూ సభ్యులుగా ఉన్నందున లావాదేవీలు జరిపినపుడు దాని నిబంధనలను పాటించాల్సిన విధి తప్ప మరొక లంపటం ఎవరికీ లేదు. దాని వెలుపల ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న మాదిరి ద్విపక్ష ఒప్పందాలు కూడా లేవు.చైనాలోని మన దేశ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో లావాదేవీల గురించి తప్ప ఫలానా ఒప్పందం ప్రకారం పెరుగుతున్నట్లు ఎక్కడా ఉండదు.మన దేశం చైనాతో సహా 38 దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరుపుతున్నది తప్ప ఇంకా ఖరారు చేసుకోలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది కలలు కన్నారు. అనేక చైనా వస్తువుల మీద మన దేశం ఆంక్షలు విధించింది. టీవీలు, పాదరక్షలు, బొమ్మలు, ఫర్నీచర్‌ వంటి 89 వస్తువులపై దిగుమతి పన్నులు పెంచి నిరుత్సాహపరచింది. యాప్స్‌పై నిషేధం సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాకుండా చూస్తున్నది. మరి ఒప్పందాలు ఉంటే ఈ ఆంక్షలు ఎలా పెట్టినట్లు ?


గాల్వన్‌ ఉదంతాల తరువాత మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం మనతో భూ సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమీక్షించి అనుమతి ఇచ్చిన తరువాతనే స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అలాంటి సరిహద్దులున్న దేశాల్లో ఒక్క చైనా తప్ప గతంలో మన దేశంలో పెట్టుబడి పెట్టిన వారెవరూ లేరు గనుక ఆ నిబంధన చైనాను లక్ష్యంగా చేసిందే అన్నది స్పష్టం. చైనా నుంచి తెచ్చుకోవాలని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కోరలేదు. చైనాతో సహా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నింటి నుంచి నిబంధనలను పాటించిన మేరకు ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. మూడో దేశం నుంచి వచ్చే చైనా పెట్టుబడులను అడ్డుకొనే అవకాశం లేదు. స్టాటిస్టా వెబ్‌సైట్‌ సమాచారం మేరకు 2015లో గరిష్టంగా మన దేశానికి చైనా నుంచి వచ్చిన పెట్టుబడులు 70.525 కోట్ల డాలర్లు. తరువాత 2019లో 53.46 కోట్లకు తగ్గాయి. ఆంక్షలు విధించిన తరువాత 2020లో20.519 కోట్లకు, 2021లో 29.946 కోట్ల డాలర్లకు తగ్గాయి.2022 జూన్‌ 29 నాటికి 382 ప్రతిపాదనలు రాగా చైనాతో సంబంధమున్న 80కి అంగీకారం తెలిపారు. 2014నుంచి 2019 వరకు ఏటా సగటున 36 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా 2021-22 ఆరు నెలల్లో 3.6 కోట్లకు తగ్గాయి.


ఒక గణతంత్ర దేశంగా మనం ఎలాంటి నిబంధనలైనా పెట్టుకోవచ్చు, అమలు జరపవచ్చు. పెట్టుబడుల సూత్రాన్నే దిగుమతులకు వర్తింప చేసి అనుమతులు ఇచ్చిన తరువాతే లావాదేవీలు జరపాలన్న నిబంధన ఎందుకు పెట్టలేదు అన్నది సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న.ఒప్పందాల ప్రకారమే మనం రికార్డులను బద్దలు కొడుతూ చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అని చెబుతున్నవారు అదే ఒప్పందం ప్రకారం చైనా మన దేశం నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటంలేదు, ఆ మేరకు మన ప్రభుత్వం ఎందుకు డిమాండ్‌ చేయటంలేదో చెప్పాలి కదా ! 2022లో మొత్తం చైనా వాణిజ్య మిగులు 877.6 బి.డాలర్లు అంటే దానిలో మన వాటా 101 బి.డాలర్లు (11.5శాతం) ఉంది. ఇక చైనా ఆర్థికం అంతా దిగజారింది, ఇబ్బందుల్లో ఉంది అని చెబుతున్నవారు నమ్మినా నమ్మకున్నా వృద్ది వేగం తగ్గింది తప్ప తిరోగమనంలో లేదు.2021లో 3.548 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు చేస్తే 2022లో అది 3.95 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.


1962లో సరిహద్దు వివాదం తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.1988లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత 1993లో సరిహద్దులో శాంతి సామరస్యాల గురించి జరిగిన ఒప్పందం, 2003లో వాజ్‌పాయి పర్యటనతో మరొక అడుగు ముందుకు వేసి మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వాణిజ్యంతో సహా వివిధ రంగాలకు సంబంధించి చైనాతో అనేక డజన్ల సాధారణ ఒప్పందాలున్నాయి. మానస సరోవర యాత్రకు నాథూలా మార్గాన్ని తెరవటం వాటిలో ఒకటి. ఏ ప్రధానీ కలవన్ని సార్లు నరేంద్రమోడీ వివిధ సందర్భాల్లో చైనా నేతలతో భేటీ కావటం కూడా ఒక రికార్డుగా ఉంది. రాజీవ్‌ గాంధీ పర్యటనకు,చైనాలో సంస్కరణలకు తెరలేపక ముందే ఐరాస చొరవతో 1975లో ఆసియా-పసిఫిక్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాన్నే బాంకాక్‌ ఒప్పందం అంటారు.దానిలో చైనా, మనం ఇతర దేశాలు భాగస్వాములు. ఈ దేశాల మధ్య ప్రాధాన్యత ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా దానిలో ఉంది.2005లో ఒప్పంద దేశాల మంత్రుల మండలి సమావేశం బీజింగ్‌లో జరిగింది. సవరించిన పన్నుల తగ్గింపు చర్చలకు మరుసటి ఏడాది ఒక రూపం వచ్చింది. దాన్ని మరింతగా విశదీకరించి ఖరారు చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక రూపానికి రాలేదు. అప్పుడే చైనా -భారత్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఏడిబి చొరవతో చర్చలు జరిగాయి.ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థ వెబ్‌సైట్‌లో 2022 జనవరి నాలుగవ తేదీ నాటికి నవీకరించిన సమాచారం ప్రకారం చైనాకు వంద దేశాలతో వివిధ ఒప్పందాలుండగా 17 దేశాలు, బృందాలతో మాత్రమే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలున్నాయి. వీటిలో మన దేశం లేదు. ఇవిగాక 2022 నుంచి అమల్లోకి వచ్చిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో తొలుత మన దేశం చేరేందుకు అంగీకరించినా తరువాత దూరంగా ఉంది. దీనిలో చేరితే మన ఎగుమతులకు బదులు ఇతర దేశాల నుంచి దిగుమతులు మరింతగా పెరుగుతాయని, అది మన పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి దెబ్బ అని చెప్పిన అంశం తెలిసిందే. ఒప్పందంలో చేరిన దేశాలు దిగుమతుల మీద పన్నులు తగ్గించాల్సి ఉంటుంది.దాంతో చైనా నుంచి మరింతగా దిగుమతులు పెరుగుతాయని మన కార్పొరేట్లు హెచ్చరించాయి. ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దాని ప్రకారం రెండు దశాబ్దాలలో పూర్తిగా పన్నులను రద్దు చేస్తారు.


కార్పొరేట్‌ లాబీకి లొంగి మన దేశంలో దొరికే వాటిని కూడా మోడీ సర్కార్‌ దిగుమతి చేసుకుంటున్నది.ఇప్పటికి వెల్లడైన సమాచారం మేరకు మన దేశంలో 319.02 బిలియన్‌ టన్నుల బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఒక బిలియన్‌ టన్నులు కూడా మనం వెలికి తీయటం లేదు. కానీ దరిద్రం ఏమిటంటే గత పాలకుల విధానాలను తప్పు పట్టిన నరేంద్రమోడీ అదే బాటలో నడుస్తూ మన దగ్గర బొగ్గు తవ్వకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఉత్తరువులు జారీ చేసిన అపరదేశ భక్తి పరుడిగా రుజువు చేసుకున్నారు. మన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పదిశాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత దాని మీద వచ్చిన విమర్శలను తట్టుకోలేక తరువాత వెనక్కు తగ్గారు. ఇదంతా ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్న అదానీ కోసం అన్నది తెలిసిందే. మన బొగ్గును మనం తవ్వుకుంటే ఉపాధి కల్పనతో పాటు డాలర్లూ మిగులుతాయి. నరేంద్రమోడీకి ఈ మాత్రం తెలియదని అనుకొనేంత అమాయకులెవరూ లేరు.


చైనా నాసిరకం వస్తువులను తయారు చేస్తుందన్నది ఒక ప్రచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లన్నింటా నాసిరకం కొంటున్నారా ? తక్కువ ధరలకు వస్తువులను సరఫరా చేస్తున్నందున అలాంటి అభిప్రాయంతో పాటు చైనా బజార్ల పేరుతో మన దేశంలో తయారు చేసిన నకిలీ వస్తువులను అమ్మిన కారణంగా అనేక మంది అలా అనుకోవచ్చు. ఒక వేళ నిజంగానే చైనా సరకులు నాసి అనుకుంటే మన విలువైన విదేశీమారకద్రవ్యాన్ని ఫణంగా పెట్టి ఆ సరకులను దిగుమతి చేసుకొని మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? నిజానికి చైనా నుంచి ఇప్పుడు మనం రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతి చేసుకుంటున్న వస్తువులేవీ ఇతర దేశాల్లో దొరకనివి కాదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారంటే కార్పొరేట్‌ లాబీ వత్తిడికి మోడీ సర్కార్‌ తలవంచటమే, అది చెప్పినట్లు వినటమే. అవే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉండటమే అసలు కారణం. ఆ సంగతిని అంగీకరించటానికి ముందుకురారు. మరోవైపున కాషాయదళాలు మాత్రం నిరంతరం చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ కొంత మంది మనోభావాల సంతుష్టీకరణ, మరికొందరిని తప్పుదారి పట్టిస్తుంటాయి.

మోడినోమిక్స్‌ 2023 : దేశానికి కావాల్సిందేమిటి ? బిజెపి నేతలు ఇస్తామంటున్నదేమిటి ?

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


2019లో నరేంద్రమోడీ ఒక పిలుపునిచ్చారు. 2024 మార్చి నాటికి(లోక్‌సభ ఎన్నికల తరుణం) దేశ జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు దాన్నే ఊరిస్తూ జనంలో చర్చ జరగాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. అనుకోని పరిణామాలు ఎదురు కావటంతో మిగతా కబుర్ల మాదిరే ఇప్పుడు మోడీ కూడా దీని గురించి కూడా మాట్లాడటం లేదు. కొత్త ” కతలు ” తప్ప ఒకసారి చెప్పినదానిని మరోసారి చెప్పి బోరు కొట్టించే అలవాటు లేదు కదా ! ఆ తరువాత మోడీ మౌనం, ఆర్థిక సలహాదారులు 2027కి సాధిస్తాం అన్నారు, ఐఎంఎఫ్‌ 2029 అని చెప్పి కాదు కాదు లెక్క తప్పింది 2027కే అని చెప్పింది. పొలిటీషిియన్‌ అన్నతరువాత ఒపీనియన్స్‌ మారుస్తుండాలని గిరీశం చెప్పినట్లుగానే ఆ సంస్థ కూడా పరిస్థితిని బట్టి మా అంచనా తప్పిందంటూ మరోసారి మార్చదని చెప్పలేము. రానున్న ఐదు సంవత్సరాల్లో స్థిరంగా ఏటా తొమ్మిది శాతం వృద్ధి సాధిస్తే 2028-29 నాటికి ఐదులక్షల డాలర్లను సాధిస్తామని రిజర్వుబాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పినట్లు 2022 ఆగస్టు పదిహేనవ తేదీ పత్రికలు ప్రకటించాయి. తాజాగా ఐదు లక్షల డాలర్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆ పాత పాట పాడితే బోరు కొడుతుంది కనుక కొత్త పల్లవి అందుకున్నారు.


ఈ మధ్య దేశ జిడిపి గురించి కొత్త గీతాలు వినిపిస్తున్నారు. మిత్రోం అంటూ శ్రావ్యమైన గళం నుంచి జిడిపి గానం ఎక్కడా వినపడటం లేదు, కనపడటం లేదు. పది లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పెరుగుతున్న భారత్‌ అంటూ సిఇబిఆర్‌ అనే సంస్థ తాజాగా ఒక విశ్లేషణ చేసింది. దాని ప్రకారం 2035 నాటికి పది లక్షల డాలర్లకు చేరుతుందని చెప్పింది. ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు పడితే తదుపరి ఒక లక్ష డాలర్లను జత చేసేందుకు ఏడు సంవత్సరాలు, ఆ తరువాత మూడవ లక్షకు ఐదు సంవత్సరాలు (2019) పట్టిందని, ప్రస్తుతం 3.1లక్షల కోట్ల డాలర్లుగా ఉందని పేర్కొన్నది. ప్రస్తుత వేగాన్ని చూస్తే రానున్న 14-15 సంవత్సరాల్లో ప్రతి రెండేళ్లకు ఒక లక్ష కోట్ల డాలర్ల వంతున జిడిపి పెరుగుతుందని అంచనా వేసింది.


తెలుగు నాట అంత్య కంటే ఆది నిషఉ్ఠరమే మేలని భావించేవారు ఏదైనా చెప్పే ముందు అంటే అన్నారని తెగ గింజుకుంటారు గానీ అని ప్రారంభిస్తారు. పట్టణాల్లో పదిశాతం, దేశ సగటు 8.3శాతం నిరుద్యోగం ఉందని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య 2022 డిసెంబరులో 40.48 శాతం పెరిగిందని సిఎంఐఇ పేర్కొన్నది. దేశ జిడిపి ఎంత పెరిగింది, ఎన్ని పెట్టుబడులను ఆకర్షించారు అన్నది ఒక అంశమైతే దాని వలన జనాలకు ఒరిగిందేమిటి అన్నది ప్రశ్న. సంపద పెరిగి కొందరి చేతుల్లో పోగుపడితే ఫలితం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల(పిఎల్‌ఐ) పధకాన్ని అమలు జరుపుతున్నది. కరోనా కాలంలో ఫార్మా రంగంలోకి పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరగలేదు. లక్ష్యాన్ని మించి 107శాతం పెట్టుబడులు వచ్చినా ఉపాధి పెరిగింది 13శాతమే. ఇక మన దేశం నుంచి సెల్‌ఫోన్ల ఎగుమతులు పెద్దగా పెరిగినట్లు అది తమ ఘనతగా చెప్పుకుంటున్న చోట అనుకున్నదానిలో వచ్చిన పెట్టుబడి 38శాతం కాగా ఉపాధి పెరిగింది కేవలం నాలుగు శాతమే. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన పెట్టుబడులు 4.89శాతం కాగా పెరిగిన ఉపాధి 0.39శాతమే. (ఇండియా కేబుల్‌ విశ్లేషణ 2022 నవంబరు 14) అందుకే పెట్టుబడులు వచ్చి ఉపాధి రహిత వృద్ధి జరిగితే జిడిపి పెరిగినా జనానికి వచ్చేదేమీ ఉండదు.


అందుకే ఈ అంశాల గురించి జుమ్లా కబుర్లు చెబితే జనం నమ్మరు గనుక బిజెపి నేతలు కొత్త కబుర్లు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి గురించి కొత్త రికార్డులు నమోదౌతున్నా, వీటిని గురించి పట్టించుకోకుండా ఇతర అంశాల గురించి మాట్లాడేవారిని ఏమనాలి ? 2024 జనవరి ఒకటి నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం సిద్దం అవుతుందని ఆ రోజునే దర్శనం చేసుకొనేందుకు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా చెబుతారు. గతంలో కాశీని చూసేందుకు ఏడాదికి కోటి మంది వచ్చే వారని, కాశీ విశ్వనాధ్‌ ధామ్‌ అభివృద్ధి తరువాత ఒక్క గత శ్రావణమాసంలోనే కోటి మంది వచ్చారని, అదే మాదిరి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తైన తరువాత పది రెట్లు పెరుగుతారని, ఆధ్యాత్మిక టూరిజాన్ని వృద్ధి చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ సిఎం ఆదిత్య నాధ్‌ ఊరిస్తున్నారు. లక్షల కొలది ఉద్యోగాలను సృష్టిస్తామని, అందుకు గాను ఫలానా పధకాలు ఫలానా తేదీలోగా ఉనికిలోకి వస్తాయని చెప్పాల్సిన వారు పూజలు పునస్కారాలు, దేవుళ్ల సందర్శనకు వసతులు కల్పిస్తామంటున్నారు. రోడ్లు, మురుగు కాలవల వంటి అల్ప అంశాలను వదలి లవ్‌ జీహాద్‌ మీద కేంద్రీకరించాలని కర్ణాటకలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ నిరంజన్‌ సెలవిస్తారు. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టుకు అవే పండ్లు కాస్తాయి. వీరంతా దేశాన్ని ఎక్కడికి తీసుకుపోదలచుకున్నారు. గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన గుజరాత్‌ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అచ్చే దిన్‌ కబుర్లు ఎక్కడా వినిపించటం లేదిప్పుడు, ఎందుకంటారు ? ఆధ్యాత్మిక టూరిజం గురించి ఒక వైపు కబుర్లు చెబుతూ మరోవైపు ఝార్కండ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఆధ్యాత్మిక టూరిజాన్ని సంఘపరివార్‌ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి సర్కార్‌ లేదు. ఇరవై నాలుగుమంది జైన తీర్ధంకరులలో ఒకరైన( 23వ) పార్శ్వనాధ్‌ గిర్ధ్‌ జిల్లాలోని షిఖర్జీ పర్వతంపై మోక్షం పొందినట్లు చెబుతారు. జైనులకు అదొక పుణ్యస్థలం. ఆ ప్రాంతంలో టూరిజం వద్దని జైనులు అంటున్నారు, దానికి బిజెపి మద్దతు ఇస్తున్నది.అయోధ్యలో వారే అమలు చేస్తారు, మరొక చోట వద్దంటారు. రాజకీయంగాకపోతే ఏమిటి ?


రానున్న ఏడు సంవత్సరాల్లో 7లక్షల కోట్లకు చేరనున్న జిడిపి అంటూ మరొక వార్త. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ చెప్పిన అంశాల ఆధారంగా వచ్చింది. 2023 మార్చి ఆఖరుకు మన జిడిపి 3.5లక్షల డాలర్లు ఉంటుందని, వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, ఇది అసాధ్యం కాదని మర్చంట్స్‌ ఛాంబర్‌ (ఎంసిసిఐ) సమావేశంలో నాగేశ్వరన్‌ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది. అందువలన ఎంత పెరిగితే ఏమి లాభం ! దేశంలోని పది మంది ధనికుల చేతుల్లో దేశ జిడిపిలో 11శాతం విలువగల సంపద ఉంది. ఫిన్‌బోల్డ్‌ అనే సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం ప్రకారం 2022 డిసెంబరు నాటికి పది మంది సంపద 387 బిలియన్‌ డాలర్లు లేదా రు.31.64లక్షల కోట్లు. దేశ జిడిపి అక్టోబరు నాటికి 3.47 లక్షల కోట్ల డాలర్లని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది, దీనిలో 11.16శాతం పది మంది చేతిలో ఉంది. తొలి ఐదు స్థానాల్లో ఉన్నవారి వివరాలు దిగువన చూడవచ్చు.
ధనికుడి పేరు ×××× సంపద బి.డాలర్లు
గౌతమ్‌ అదానీ ××× 132.79
ముఖేష్‌ అంబానీ ×× 96.5
సైరస్‌ పూనావాలా×× 24.88
శివ నాడార్‌ ××××× 22.58
దమాని(డి మార్ట్‌) ×× 21.25
సంపదలు ఇలా కొద్ది మంది వద్ద పోగుపడుతూ ఉంటే దేశ ఆర్థిక, సామాజిక వృద్ధి కుంటుపడుతుందని, అనేక అనర్ధాలకు దారితీస్తుందని అనేక మంది హెచ్చరిస్తున్నా సంపదలు పోగుపడటాన్ని మన పాలకులు అనుమతిస్తున్నారు.ఆర్థిక వృద్ధి రేటు పెరిగితే సంపదల అంతరం తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. సంపదలు ఇలా పెరగటానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. సంపద పెరిగిన కొద్దీ పన్నులు పెంచాల్సి ఉండగా తగ్గించటం వాటిలో ఒకటి. ఉపాధి లేకపోవటం, ఉన్నవారికి కూడా వేతనాలు తక్కువగా ఉండటం, సామాజిక భద్రత లేకపోవటం, విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించటం వంటి అంశాలన్నీ సంపదల అసమానతలను పెంచుతున్నాయి. వాటిని తగ్గించేందుకు చేసిందేమీ లేదు.


వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ అనే కితాబుకు భారత్‌ దూరం అన్నది మరొక వార్త. దేశంలో డిమాండ్‌ తగ్గిన కారణంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7శాతానికి తగ్గుతుందని ప్రభుత్వమే పేర్కొన్నది. ఈ కారణంగా వేగంగా వృద్ది చెందున్న భారత్‌ అనే పేరుకు దూరం కానుంది. ప్రభుత్వం చెప్పినదాని కంటే తక్కువగా ఆర్‌బిఐ 6.8శాతమే ఉంటుందని చెప్పింది. గతేడాది 8.7శాతం ఉంది. ఈ ఏడాది సౌదీ అరేబియాలో 7.6 శాతం ఉంటుదని అంచనా వేస్తున్నందున అది మొదటి స్థానంలో ఉంటుంది.ద్రవ్యోల్బణం కారణంగా వర్తమాన సంవత్సరంలో నిజవేతనాల్లో పెరుగుదల లేకపోవటం లేదా కొన్ని నెలల్లో తిరోగమనంలో కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీన్ని అధిగమించేందుకు బిజెపి నేతలెవరూ ఏం చేసేదీ చెప్పరు.


ఆర్థికవేత్తలు లేదా వారు పని చేస్తున్న సంస్థలు వేసే అంచనాలు, చెప్పే జోశ్యాల తీరు తెన్నులు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అమెరికాలోని కార్నెగీ సంస్థ 2009లో ఒక అంచనాను ప్రపంచం ముందుంచింది. దాని ప్రకారం 2009లో 1.1లక్షల కోట్లడాలర్లుగా ఉన్న భారత జిడిపి 2050 నాటికి 17.8 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అదే కాలంలో చైనా జిడిపి 3.3 నుంచి 45.6లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని, రెండవ స్థానంలో ఉండే అమెరికాలో 39లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పింది. పైన పేర్కొన్న సిఇబిఆర్‌ సంస్థ అంచనా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక లక్ష కోట్ల డాలర్ల జిడిపి పెరుగుతుందనుకుంటే ఆ ప్రకారం చూసినా 2035 తరువాత పదిహేను సంవత్సరాలో ఏడులక్షల కోట్లు పెరిగితే దీని అంచనా ప్రకారం కూడా 17-18లక్షల కోట్లకు పరిమితం అవుతుంది. ఇక ముకేష్‌ అంబానీ పండిట్‌ దీన దయాళ్‌ ఇంథన విశ్వవిద్యాలయ సభలో చెప్పినదాని ప్రకారం 2047 నాటికి( నూరేళ్ల స్వాతంత్య్రం) ఇప్పుడున్న 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 40లక్షల కోట్లకు పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు. ఆసియా ధనికుడు గౌతమ్‌ అదానీ 2050 నాటికి 30లక్షల కోట్లకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతి పన్నెండు – పద్దెనిమిది నెలలకు ఒక లక్ష కోట్ల వంతున పెరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ప్రముఖులు ఇంత తేడాగా ఎలా చెబుతారు ?


ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో 160 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రదేశంగా ఎదుగుతుందని, చైనా జనాభా ఇప్పుడున్న 140 కోట్ల నుంచి 130 కోట్లకు తగ్గుతుందని చెబుతున్నారు.( ఈ ఏడాదే చైనాను వెనక్కు నెట్టి మన దేశం పెద్ద దేశంగా మారనుంది) పని చేసే శక్తి కలిగిన జనాభా భారత్‌లో పెరుగుతున్నందున ఆర్థిక ప్రగతికి ప్రధాన వనరుగా ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాల్లో నూతన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. అమెరికా-చైనా తెగతెంపులు చేసుకోనున్నాయని, తరువాత సరఫరా గొలుసులో చైనా లేకపోతే భారత్‌ లబ్దిపొందుతుందని చెబుతున్నారు. ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 14ను భారత్‌లో తయారు చేయటాన్ని దానికి రుజువుగా చూపుతున్నారు. నరేంద్రమోడీ జి20 బాధ్యతలు చేపట్టినందున అమెరికా, చైనా, భారత్‌ మూడు ధృవాల ప్రపంచ వ్యవస్థకు ఈ ఏడాది నాంది అవుతుందని కొందరు చెప్పటం ప్రారంభించారు.(2024లోక్‌సభ ఎన్నికలకు జి20 సారధ్యాన్ని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చేస్తున్న యత్నాలను చూసి మెప్పు పొందేందుకు కూడా అలా చెప్పవచ్చు.)


మన ఎగుమతులు తగ్గటం, దిగుమతులు పెరగటంతో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు హరించుకుపోతున్న అంశం పాలకులకు పట్టినట్లు లేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2022లో మన వస్తు దిగుమతులు 54.7శాతం పెరిగి 610 బి.డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో 494 బి.డాలర్లు కాగా అదే కాలంతో గతేడాది 381బి.డాలర్లు మాత్రమే. ఇక వాణిజ్యలోటు ఏప్రిల్‌-నవంబరు మధ్య 115.39 నుంచి 198.35 బి.డాలర్లకు చేరింది. ఈ ఏడాది 700బి.డాలర్లు దాటవచ్చని అంచనా.దాన్ని బట్టి లోటు ఎంత ఉండేది అప్పుడే చెప్పలేము. స్వయం సమృద్ధి – ఆత్మనిర్భరత, ఎగుమతి- దిగుమతులు ఉపాధి కల్పన ఫలితాల గురించి చెప్పకుండా జనాలకు రామాలయం గురించి అమిత్‌ షా చెబుతున్నారు.

చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. లావాదేవీల్లో సభ్య దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు పాటించాలి తప్ప, మన దేశానికి చైనాకు ఎగుమతులు-దిగుమతుల కోటా గురించి ఎలాంటి ప్రత్యేక ఒప్పందాలేమీ లేవు. చైనాకు ధీటుగా ఐఫోన్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెబుతున్న వారు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇతర వస్తువులను నిలిపివేసి ఇక్కడే ఎందుకు తయారు చేయటం లేదు ? విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయరు ? స్వదేశీ జాగరణ మంచ్‌ ఇటీవల ఎక్కడా ఎందుకు కనిపించటం లేదు. చైనా నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ ఏటా తన రికార్డులను తానే బద్దలు కొడుతుంటే ఏమి చేస్తున్నట్లు ? చైనా యాప్‌ల రద్దు హడావుడి చేస్తే సరిపోతుందా ? మన ఉపాధిని ఫణంగా పెట్టే దిగుమతి లాబీకి ఎందుకు లొంగిపోతున్నట్లు ? 2021-22లో తొలి ఎనిమిది నెలల్లో అక్కడి నుంచి 59.17 బి.డాలర్ల విలువ గల వస్తువులను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అదే కాలంలో 67.92 బి.డాలర్లకు పెంచారు . చైనా వస్తువులు నాసిరకం అని ప్రచారం చేస్తారు, అదే నిజమైతే అలాంటి వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసి మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చైనాకు ఎందుకు కట్టబెడుతున్నట్లు ? మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులకు పదో ఏడు వస్తున్నది. వాటి అమలుకు ఏ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడలేదే ! వాటి గురించి బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు ?

బ్రెజిల్‌ అధికార కేంద్రాలపై దాడికి అంతర్గత మద్దతు : లూలా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు



చరిత్ర పునరావృతమైంది, అదీ మరింత ఆందోళన కలిగించే రీతిలో జనవరి ఎనిమిదిన బ్రెజిల్లో జరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ఎన్నికను నిర్ధారిస్తూ ధృవీకరణ పత్రం ఇవ్వరాదంటూ ఓడిన డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదార్లు 2021 జనవరి ఆరున దాడికి తెగబడ్డారు. అమెరికా అధికార కేంద్రమైన పార్లమెంటు ఉభయ సభలు, సుప్రీం కోర్టు భవనాలున్న వాషింగ్టన్‌లోని కాపిటల్‌ హిల్‌పై దాడి చేశారు. రెండు సంవత్సరాల తరువాత 2023 జనవరి ఎనిమిదిన లాటిన్‌ అమెరికాలో పెద్ద దేశమైన బ్రెజిల్‌ అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టులపై గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓడిన జైర్‌ బోల్సనారో మద్దతుదార్లు దాదాపు మూడు వేల మంది దాడికి తెగబడ్డారు. ఈ దుండగానికి అంతర్గతంగా మద్దతు లభించినట్లు, దాని గురించి సమీక్ష జరుపుతున్నట్లు అధ్యక్షుడు లూలా ప్రకటించారు. అధ్యక్ష భవనపు ద్వారాలకు ఎలాంటి నష్టం జరగలేదంటే అక్కడ ఉన్నవారు వాటిని తెరిచి సహకరించినట్లు స్పష్టం అవుతున్నదని లూలా చెప్పారు.


లూలా ఎన్నికను నిర్దారించి, పదవీ స్వీకారం కూడా జరిగిన తరువాత ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ దాడి చేసి విధ్వంసకాండకు పాల్పడ్డారు. బోల్సనారోకు డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద మద్దతుదారన్నది తెలిసిందే. జనవరి ఒకటవ తేదీన మూడవ సారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వామపక్ష నేత లూలా డి సిల్వా డాడి జరిగినపుడు అక్కడ లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అని చెప్పుకొనే అమెరికా ఈ దాడి సూత్రధారైన బోల్సనారోకు ఆశ్రయం కల్పించింది. ఖండిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాడిని అమెరికాలోని మితవాద టీవీ, పత్రికలు సమర్ధించాయి. దాడి జరిగిన వెంటనే పొత్తి కడుపులో నొప్పి అంటూ బోల్సనారో ఆసుపత్రిలో చేరాడు. వెంటనే తగ్గిందంటూ డాక్టర్లు పంపేశారు. బోల్సనారోకు ఆశ్రయమిస్తే అనవసరంగా చెడ్డ పేరు ఎందుకన్న ఆలోచన అమెరికాలో తలెత్తటంతో బోల్సనారో ఇటలీ లేదా మరో దేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు. డాడికి పాల్పడిన వారిని, వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో తన మద్దతుదార్లకు ధైర్యం కల్పించేందుకు తిరిగి బ్రెజిల్‌కే రానున్నట్లు కూడా చెబుతున్నారు. దాడి వెనుక బోల్సనారో హస్తం ఉన్నందున అమెరికా వీసాను రద్దు చేయాలని 41 మంది డెమ్రోక్రటిక్‌ పార్టీ ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కుట్రదారులను గుర్తించి ఏరి వేయాలని, బోల్సనారో, అతగాడి ముఠాను శిక్షించాలన్న డిమాండ్‌ బ్రెజిల్లో పెరుగుతోంది. రానున్న రోజుల్లో వారు మరిన్ని దుండగాలకు పాల్పడవచ్చని భావిస్తున్నారు.


పచ్చి మితవాది, నియంతలకు జేజేలు పలికిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా చేతిలో స్వల్ప తేడాతో ఓడారు. గెలిచిన వామపక్ష లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. అమెరికాలో ట్రంప్‌ మాదిరి ఒక వేళ తాను గనుక ఓడితే ఎన్నికను గుర్తించనని ముందే చెప్పిన అతగాడు ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే తనకు 60లక్షల ఓట్లు అదనంగా వచ్చేవని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపించాడు. లూలా ఎన్నికను గుర్తించినట్లు గానీ తాను ఓడినట్లు గానీ ప్రకటించేందుకు ముందుకు రాలేదు. తానే అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలు సక్రమంగా జరగవని, ఫలితాలను తాను అంగీకరించనని, ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ ఎన్నికలకు ముందే ధ్వజమెత్తాడు. డిసెంబరు 30 అర్ధరాత్రి తన నమ్మిన బంట్లను తీసుకొని ఒక విమానంలో అమెరికాలోని ఫోరిడా రాష్ట్రానికి వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. సాంప్రదాయకంగా జరిగే అధికార మార్పిడి కార్యక్రమాన్ని బహిష్కరించటం కూడా లూలా ఎన్నికను తాను గుర్తించటం లేదని మద్దతుదారులకు ఇచ్చిన సందేశంలో భాగమే. బ్రెజిల్లో తాజాగా జరిగిన పరిణామాల తీవ్రతను అర్ధం చేసుకోవాలంటే బోల్సనారో 2018 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి జరిగిన కొన్ని ఉదంతాలను నెమరు వేసుకోవాల్సి ఉంది.


2019జనవరిలో అధికారానికి రాగానే గత మిలిటరీ నియంతలను పొగడటం, మహిళలు, ఎల్‌బిజిటిక్యు జనాలమీద నోరుపారవేసుకున్నాడు.గత ఎన్నికల్లోనే అక్రమాలు జరిగినట్లు, వచ్చే ఎన్నికల్లో తాను ఓడితే ఫలితాలను అంగీకరించేది లేదంటూ బోల్సనారో చేసిన బెదిరింపుల తరువాత మిలిటరీ అప్రమత్తమైందని, 2021జనవరి ఆరవ తేదీన అమెరికా పార్లమెంటుపై మాదిరి దాడి జరిగితే నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని, వివిధ కార్యక్రమాలతో రూపొందించిన కాలెండర్‌ను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని విభాగాలను కోరినట్లు, ఒక వేళ అమెరికా మాదిరి పరిణామాలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు మొత్తం మిలిటరీని సిద్దం చేస్తున్నట్లు అధికారులు ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడినపుడు చెప్పారు. పార్లమెంటు మీద జరిగే దాడి గురించి, వారిని అదుపు చేసేందుకు మొత్తం మిలిటరీ సన్నద్దంగా ఉండాలని చెప్పటమెందుకు అన్న అంశం అప్పుడే చర్చకు వచ్చింది. ఒక వేల బోల్సనారో తనకు అనుకూలమైన మిలిటరీ అధికారులతో కలసి తిరుగుబాటు చేస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకే ఈ పిలుపు అని కొందరు, ఆ పేరుతో బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు కూడా కావచ్చని కొందరు అన్నారు.దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి బోల్సనారో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఒక పోలీసు నివేదిక పేర్కొన్నది. ఫెడరల్‌ పోలీసు కమిషనరే ఈ నివేదికను రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకోనట్లైతే తొలి దఫాలోనే తానే గెలిచి ఉండేవాడినని బోల్సనారో చెప్పటం ఎన్నికల వ్యవస్దను కించపరచటమే అని నివేదికలో పేర్కొన్నారు.


రాజ్యాంగం ప్రకారం తేదీలు ముందే నిర్ణయం జరిగినప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఫలితాలను తాను అంగీకరించేది లేదని బోల్సనారో చెప్పటం ఫాసిస్టు ధోరణి తప్ప మరొకటి కాదు. బాలట్‌ పత్రాలు లేకపోతే అమెరికా మాదిరి ఎన్నికల అక్రమాలు జరుగుతాయని బోల్సనారో అన్నాడు. అక్కడ బాలట్‌ పత్రాలనే ఉపయోగించినప్పటికీ అక్రమాలు జరిగాయని బోల్సనారోకు గట్టి మద్దతుదారైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించి, ఓటమిని అంగీకరించని సంగతి తెలిసిందే. అధికారానికి వచ్చినప్పటి నుంచి దాన్ని సుస్థిరం చేసుకోవటం మీదనే బోల్సనారో కేంద్రీకరించాడు. కరోనాకు జనాన్ని వదలివేశాడు. అసాధారణంగా రక్షణ మంత్రిని, సాయుధ దళాధిపతులందరినీ మార్చి వేశాడు, మిలిటరీ తనకు లోబడి ఉండాలని ప్రకటించాడు. అధికారులు తనకు అనుకూలంగా లేకపోతే ఏదో ఒక కేసులో ఇరికిస్తానని బెదిరించేందుకు చూశాడు. దానిలో భాగంగానే అవినీతిపై పార్లమెంటరీ కమిటీ విచారణను ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు మిలిటరీ కమాండర్లకూ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించాడు.విచారణకు మద్దతు పేరుతో మితవాద పార్టీలతో ప్రదర్శనలు చేయించాడు. బాలట్‌ పత్రాలను ముద్రించాలన్న తన ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలపనట్లయితే ఎన్నికలను అడ్డుకుంటానని బోల్సనారో బెదిరించాడు. దీనికి మిలిటరీ మద్దతు తెలిపింది, పార్లమెంటులో చర్చ సమయంలో రాజధానిలో టాంకులతో ప్రదర్శన జరపాలన్న అతగాడి కోరికను కూడా మన్నించి మిలిటరీ ఆపని చేసింది. అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేకుండానే బాలట్‌ పత్రాల ముద్రణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తనను పదవీచ్యుతుడిని కావించేందుకు సుప్రీం కోర్టు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రదర్శనలు జరపాలని బోల్సనారో పిలుపునిచ్చాడు. ఈ చర్యలకు మీడియా పూర్తిగా మద్దతు ఇచ్చింది. పార్లమెంటు తీర్మానం చేసినా చివరకు ఎన్నికలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లతోనే జరిపారు.


2022 ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినప్పటి నుంచి బోల్సనారో మద్దతుదారులు రాజధానిలో కీలక కేంద్రాలు, మిలిటరీ కేంద్రాల సమీపంలో తిష్టవేశారు. లూలా ఎన్నికను అంగీకరించరాదని, మిలిటరీ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దేశంలో శాంతి భద్రతల సమస్యల సృష్టికి తీవ్రంగా ప్రయత్నించారు. బోల్సనారో వీటిని ఒక్కసారి కూడా తప్పు పట్టలేదు. మౌనంగా ఉంటూ ప్రోత్సహించాడు. బోల్సనారో దేశం విడిచి వెళ్లిన తరువాత రాజధానిలోని కొన్ని కేంద్రాల్లో తిష్టవేసిన మద్దతుదార్లు వెనక్కు వెళ్లినట్లు కనిపించినా తిరిగి సమీకృతం కావటానికే అని ఇప్పుడు స్పష్టమైంది. మరి కొందరు అక్కడే ఉన్నారు. ఆదివారం నాడు దాడికి తెగబడిన వారు తమది దండయాత్ర కాదని, పార్లమెంటును ఆక్రమించిన చారిత్రాత్మక ఉదంతమని చెప్పుకున్నారు.


తనకు మద్దతు ఇచ్చేదిగా మిలిటరీని మార్చుకోవాలని చూసిన బోల్సనారోకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా మద్దతుతో 1964 నుంచి 1985వరకు 21 ఏండ్ల పాటు అక్కడ మిలిటరీ పాలన సాగింది.దాని బాధితులు, వ్యతిరేకంగా పోరాడిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉక్కుపాదాల కింద నలిగేందుకు సిద్దంగా లేరు. అందుకే లూలాను సైద్దాంతికంగా ఆమోదించని వారు కూడా బోల్సనారోను ఓడించేందుకు ఓటు వేశారు. రెండవది లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలను రుద్దిన అమెరికాకు తీవ్రమైన ఎదురుదెబ్బలే తప్ప తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకోలేపోయింది. అనేక దేశాల్లో సామాజిక, మిలిటరీ వ్యతిరేక, వామపక్ష ఉద్యమాలు పెరగటానికి దాని పోకడలు దోహదం చేశాయి. దానిలో భాగంగానె బ్రెజిల్‌లో లూలా నేతగా ఉన్న వర్కర్స్‌ పార్టీ ఉనికిలోకి వచ్చింది. అందువలన పెరుగుతున్న వామపక్ష శక్తులను అడ్డుకొనేందుకు మరోసారి మిలిటరీ మార్గాన్ని అనుసరించేందుకు అమెరికా సిద్దంగా లేకపోవటం, బోల్సనారోకు మద్దతు ఇచ్చేందుకు మిలిటరీ అధికారులు సిద్దంగాకపోవటం వంటి అనేక పరిణామాలు ఉన్నాయి.


అయినప్పటికీ మిలిటరీ, పోలీసు యంత్రాంగంలో ఉన్న మితవాద శక్తుల మద్దతు కారణంగానే తాజా దాడి జరిగిందని చెప్పవచ్చు. అధ్యక్ష భవనం, పార్లమెంటు, సుప్రీం కోర్టు మీద దాడికి వచ్చిన వారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే వరకు నిఘా, భద్రతా దళాలు ఏమి చేసినట్లు అన్నది ప్రశ్న. విధుల్లో ఉన్నవారి నుంచి ఆ భవనాల్లో ప్రవేశించిన దుండగులకు ఎలాంటి ప్రతిఘటన లేకపోగా అనుమతించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. దుండగులు మిలిటరీ ప్రధాన కేంద్రం వెలుపలి నుంచే ప్రదర్శనగా వచ్చారని, అప్పుడు ఒక హెలికాప్టర్‌ ఎగిరిన శబ్దం వినిపించినట్లు, అనేక మంది పోలీసులు ప్రతి చోటా ఉన్నారని, అనేక రోడ్లను మూసివేశారని, తాము లూలాను వదిలించుకొనేందుకే వెళుతున్నట్లు, తమకు బోల్సనారో మద్దతు ఉందని దాడికి వెళ్లిన వారిలోని ఒక మహిళ చెప్పినట్లు లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ విలేకరి కథనం.


అంటే పోలీసులు దుండగుల వెనుక నడిచారు తప్ప అడ్డుకొనేందుకు చూడలేదన్నది స్పష్టం. దీని గురించి అధ్యక్షుడు లూలా మాట్లాడుతూ దుండగులను నిరోధించేందుకు భద్రతా దళాలు చేసిందేమీ లేదని, అనుమతించారని అన్నాడు. బోల్సనారోకు మిలిటరీ పోలీసుల మద్దతు గురించి 2021 ఆగస్టులో జరిగిన ఒక సమావేశంలో 25 రాష్ట్రాల గవర్నర్లు ఆందోళన వెల్లడించినట్లు వెల్లడైంది. గతేడాది రెండవ విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు 550 బస్సుల్లో వస్తున్న లూలా మద్దతుదార్లను మిలిటరీ బలగాలు రోడ్లపై అడ్డుకున్నట్లు వార్తలొచ్చాయి.2020లో సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా తన మద్దతుదార్లతో నిర్వహించిన ప్రదర్శనలో మిలిటరీ గుర్రమెక్కి బోల్సనారో పాల్గొన్నాడు. తనకు మద్దతుగా మిలిటరీ నిలవాలని, తుపాకులు కొని సిద్దంగా ఉంచుకోవాలని మద్దతుదార్లను కోరాడు, ఆయుధాలు ఉన్నవారెవరినీ బానిసలుగా చేసుకోలేరని, అవసరమైతే మనం యుద్దానికి వెళ్లాలని అన్నాడు. ఎన్నికల ఫలితాల తరువాత అలాంటి పరిణామాలు జరగలేదు గానీ మద్దతుదార్లలో ఎక్కించిన ఉన్మాదం తాజా పరిణామాలకు పురికొల్పిందన్నది స్పష్టం.అందుకే దాడి జరిగిన ఆరుగంటల తరువాత బోల్సనారో ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ భవనాలపై దాడి, విధ్వంసం సరైంది కాదన్నాడు తప్ప ఖండన మాట లేదు.


అందువలన బోల్సనారో బహిరంగంగా పిలుపు ఇచ్చినా ఇవ్వకున్నా పరోక్షంగా అతనే బాధ్యుడు. తన తండ్రి తదుపరి కార్యాచరణ గురించి మార్గదర్శనం చేయాలంటూ నవంబరు నెలలో బోల్సనారో కుమారుడు, బ్రెజిల్‌ ఎంపీగా ఎడ్వర్డ్‌ బోల్సనారో ఫ్లోరిడాలో డోనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకొని చర్చించాడు. తరువాత ఇప్పుడు దాడి జరిగింది. ఈ కారణంగానే అమెరికాలోని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కొందరు పురోగామి ఎంపీలు బోల్సనారో పాస్‌పోర్టును రద్దు చేసి వెనక్కు పంపాలని, ఆశ్రయం ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ట్రంపు మీద అతగాడి మద్దతుదార్ల మీద కాపిటల్‌ హిల్‌ దాడి గురించి విచారణ జరుపుతున్న జో బైడెన్‌ సర్కార్‌ అలాంటి దుండగానికి పురికొల్పిన బోల్సనారోకు మద్దతు ఇస్తుందా, వెంటనే బ్రెజిల్‌ వెళ్లాలని ఆదేశిస్తుందా ? అధికార భవనాలపై దాడులను ఖండించి, బ్రెజిల్‌ ప్రజాస్వామిక వ్యవస్థలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, పౌరుల వాంఛలను తక్కువగా చూడరాదని, లూలాతో కలసి పని చేసేందుకే ముందుకు పోతానని పేర్కొన్న జో బైడెన్‌ ప్రకటనలో ఎక్కడా బోల్సనారో తమ దేశంలో ఉన్నాడన్న ప్రస్తావన లేదు. రానున్న రోజుల్లో బ్రెజిల్‌లో ఏం జరగనుందన్నది మరింత ప్రశ్నార్ధకంగా మారింది. అమెరికా,బ్రెజిల్‌ పరిణామాల్లో ఓడిన శక్తులు దాడులకు తెగబడటాన్ని చూసి ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా అదే బాటలో నడిస్తే ప్రజాస్వామ్య భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్న ! బోల్సనారో మద్దతుదార్ల దుండగాలను ఖండిస్తూ లక్షలాది మంది లూలా మద్దతుదార్లు వీధుల్లోకి వచ్చారు. ప్రజా ప్రతిఘటన తప్ప మితవాద శక్తులను అడ్డుకొనేందుకు మార్గం లేదు ?



.



పాకిస్తాన్‌ దివాలా తీయనుందా : బిజెపి నేతలు పదే పదే దానితో మన దేశాన్ని ఎందుకు పోలుస్తున్నట్లు ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


గోధుమ పిండి ధర కిలో రు.150కి పెరిగింది. వంట గాస్‌ 11.8కిలోల బండ ధర రు.2,550. విద్యుత్‌ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు. లీటరు పాల ధర రు.108.71, కిలో బియ్యం రు.245, డజను గుడ్ల ధర రు.240, కోడి మాంసం కిలో రు.548, కిలో ఉల్లి రు.86, బ్రెడ్‌ రు.108,(నంబియో డాట్‌కామ్‌) పాకిస్తాన్‌ నుంచి వస్తున్న వార్తలివి.అక్కడ విద్యుత్‌ కొరత ఉంది.(మన గుజరాత్‌లో కూడా గత వేసవిలో గంటల కొద్దీ ఇండ్లకు, వారానికి ఒకసారి పరిశ్రమలకు కోత విధించారు) అక్టోబరులో సవరించిన ధరల ప్రకారం 50 యూనిట్లకు రు.2 నుంచి 700 వరకు శ్లాబుల వారీ పెరుగుతూ రు.20.82, అంతకు మించితే ప్రతియూనిట్‌కు రు.23.92, ఇవి గాక ఇతర పన్నులు అదనం. తెలంగాణాలో 50 యూనిట్లకు రు.1.45 నుంచి క్రమంగా పెరుగుతూ 401-800కు రు.9, అంతకు మించితే రు.9.50 వసూలు చేస్తున్నారు. అక్కడి ధరలతో పోల్చుకొని మన దేశంలో ధరలను చూడండి, నరేంద్రమోడీ పాలన జనాలకు మంచి రోజులు తెచ్చిందా లేదా అని భక్తులు రెచ్చిపోతున్నారు, అడ్డు సవాళ్లు విసురుతున్నారు. పాకిస్తాన్‌ తీవ్ర మైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నమాట నిజం. అక్కడ పరిస్థితులన్నీ సజావుగా ఉన్నట్లు , జరుగుతున్నదంతా సరైనదే అని ఎవరూ చెప్పటం లేదు. అవసరమూ లేదు. అలాంటి దేశం గురించి ఎక్కువగా చెబుతున్నదీ, పోలుస్తున్నదీ ఎవరంటే బిజెపి నేతలు, మద్దతుదారులే. ఎందుకంటే అంతకంటే మెరుగైన దేశంతో పోల్చుకొనేందుకు వారి దగ్గర ఏమీ లేకపోవటమే. అక్కడ పెట్రోలు, డీజిలు ధరలు తక్కువ అంటే వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎద్దేవా చేస్తారు.


మన దేశంలో గత నెల రోజులుగా గోధుమల టోకు ధర కిలో రు.28.50గా ఉందని, ఇది కనీస మద్దతు ధర కంటే 40శాతం ఎక్కువ అని జనవరి ఏడవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ప్రైస్‌ఇ డాట్‌కామ్‌ జనవరి ఎనిమిదవ తేదీ సమాచారం ప్రకారం ఆశీర్వాద్‌ షర్బతీ గోధుమ పిండి ధర అమెజాన్‌లో రు.282(ఐదు కిలోలు) అదే కంపెనీ సుపీరియర్‌ ఎంపీ రకం ధర రు.175(ఐదు కిలోలు),ఆశీర్వాద్‌ శుద్ద గోధుమ పిండి రకం ధర రు.95(రెండు కిలోలు). విడిగా ఎలాంటి బ్రాండ్‌ లేకుండా దొరికే పిండి ధర కిలో 40కి అటూ ఇటూగా ఉంటున్నది. మన దగ్గర 14.5 కిలోల గాస్‌ బండ ధర రు.1,105 గా ఉంది. మరి వీటితో పోల్చినపుడు పాకిస్తాన్‌ కంటే మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. నిజమే కనిపించేదాన్ని కాదని ఎలా అంటాం ? ఎఎన్‌ఐ వార్తా సంస్థ జనవరి ఏడవ తేదీన పేర్కొన్నదాని ప్రకారం పాక్‌ పంజాబ్‌లో 15కిలోల గోధుమ పిండి సంచి ధర రు.2,250 ( కిలో 130 నుంచి 150వరకు ఉంది), అదే వార్తలో మండ్‌ గోధుమల ధర రు.5,000కు తాకినట్లు కూడా పేర్కొన్నది. మండ్‌ అంటే 37 కిలోల 324 గ్రాములకు సమానం. ఈ లెక్కన కిలో గోధుమలకు అక్కడి రైతులు రు. 134 పొందుతున్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్న ప్రకారం అదే మన రైతులు పొందుతున్నది రు.28.50 మాత్రమే ! ఇది ఘోరం అని అనిపించటం లేదూ ! పాక్‌ రైతులు అంత మొత్తం పొందుతుండగా మన రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు ? మన రైతుల్ని పాకిస్తాన్‌ వెళ్లి అమ్ముకోమంటారా ?


ఒక డాలరుకు మన కరెన్సీ రూపాయి విలువ జనవరి ఎనిమిదిన రు.82.27 ఉంది. పాకిస్తానీ రూపాయి విలువ రు.227.25గా ఉంది. మన ఒక రూపాయి 2.76 పాక్‌ రూపాయలకు సమానం. మన దేశ బహిరంగ మార్కెట్‌నుంచి పాకిస్తాన్‌ ఒక క్వింటాలు గోధుమలను దిగుమతి చేసుకుంటే వారు చెల్లించాల్సిన మొత్తం రు.7,866 అవుతుంది.( మన బహిరంగ మార్కెట్‌ ధర కిలోకు రు.28.50, దాన్ని పాక్‌ కరెన్సీలోకి మారిస్తే రు.78.66, ఆ లెక్కన క్వింటాలు ధర రు.7,866. కానీ పాక్‌ రైతులకు కిలోకు 134 వంతున 13,400 దక్కుతున్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది. పాక్‌లో గాస్‌ కిలో ధర రు.216. మన దేశంలో రు.76.20. గాస్‌ను మనమూ దిగుమతి చేసుకోవాలి, పాకిస్తాన్‌ కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. అందువలన తక్కువగా ఉన్న పాక్‌ కరెన్సీ విలువను చూపి అక్కడ ఎంతో ఎక్కువగా ఉన్నట్లు చిత్రించటాన్ని ఏమనాలి ? రెండు కరెన్సీల పేర్లూ రూపాయి కావటంతో మభ్య పెట్టేందుకు వీలు కలుగుతోంది.


గ్లోబల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ ప్రతి దేశంలో ఉన్న స్థానిక కరెన్సీలో ఉన్న పెట్రోలు, డీజిలు ధరలను డాలర్లలోకి మార్చి ధరల తీరు తెన్నులను వారానికి ఒకసారి ప్రచురిస్తుంది. దాని ప్రకారం పెట్రోలు, (బ్రాకెట్లలో డీజిలు) ధరలు డాలర్లలో జనవరి రెండవ తేదీన ఇలా ఉన్నాయి. పాకిస్తాన్‌ 0.947(1.005),భూటాన్‌ 0.990( 0.947 ), మయన్మార్‌ 1.046(1.156) చైనా 1.178(1.051) బంగ్లాదేశ్‌ 1.221(1.024) భారత్‌ 1.260(1.130) నేపాల్‌ 1.344(1.324) శ్రీలంక 1.396(1.108) ఉంది. ఇప్పటికీ మన దేశంలో పాకిస్తాన్‌ కంటే చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో లీటరు పెట్రోలు ధర 0.893, డీజిలు ధర 1.199 డాలర్లుగా ఉంది. ప్రతి దేశం ఎగుమతులు చేస్తుందా లేదా అన్నది ఒక అంశమైతే, దానికి అనేక అంశాలు తోడు కావాలి. సాధారణంగా ఎగుమతులు చేసే దేశాల కరెన్సీ విలువ తక్కువగా ఉంటేనే అది అంతర్జాతీయ మార్కెట్లో తన సరకులను అమ్ముకోగలుగుతుంది అని చెబుతారు. ఇది ఒక అంశం తప్ప అదొక్కటే చాలదు, జపాన్‌ ఎన్‌ విలువ ఒక డాలరుకు 132 కాగా చైనా యువాన్‌ విలువ 6.84 ఉంది. జపాన్‌ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నా, చైనాతో పోలిస్తే వేతనాలు ఎక్కువ గనుక ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. అందువలన ఒకే వస్తువును చైనా తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తున్నది. మన దేశంలో వేతనాలు, కరెన్సీ విలువ తక్కువ ఉన్నప్పటికీ సరైన విధానం, నూతన ఆవిష్కరణలు,సాంకేతిక పరిజ్ఞానం లేక ఎగుమతులు చేయలేని స్థితి.


మన దేశంలో తక్కువ ఆదాయం వచ్చే వారు పెరిగిన ధరలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో పాకిస్తాన్‌లో కూడా మన కంటే ఎక్కువగా ద్రవ్యోణ పెరుగుదల ఉన్నందున అక్కడి పేదలు కూడా ఒకింత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే పెట్రోలు, డీజిలు ధరలకు పన్నులు వడ్డిస్తే భారం మరింతగా పెరుగుతుంది కనుక మన మాదిరి పన్నులు లేనందున, దాని కరెన్సీ విలువ ఎంత తగ్గినా మనతో పోలిస్తే తక్కువ ధరలకు పెట్రోలు, డీజిలు అందుబాటులో ఉంటున్నది. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రుణ భారంతో శ్రీలంక తీవ్ర పరిస్థితి ఎదుర్కొన్నట్లుగానే పాకిస్తాన్‌ కూడా అదే బాటలో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దివాలా కోరు విధానాలను అనుసరిస్తే ఏ దేశమైనా అదే విధంగా మారుతుంది. పాకిస్తాన్‌ నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ” డాన్‌ ” డిసెంబరు 18వ తేదీన ప్రచురించిన ఒక (ఇద్దరు ఆర్థిక నిపుణుల) విశ్లేషణలో కొన్ని అంశాలు దిగువ విధంగా ఉన్నాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్తాన్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం దేశాన్ని రుణగ్రస్తం గావించాయి. విభజనతో నాడు వలస పాలనలో ఉన్న రాబడిలో 17శాతం పాకిస్తాన్‌కు రాగా మిలిటరీలో 33శాతాన్ని భరించాల్సి వచ్చింది. దీని వలన అనేక ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ 22సార్లు ఐఎంఎఫ్‌ రుణాలు తీసుకోగా భారత్‌ ఏడు, బంగ్లాదేశ్‌ పదిసార్లు మాత్రమే తీసుకుంది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అనేక సార్లు సంక్షోభాలు దగ్గరకు వచ్చిన అనుభవాలను చూసింది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రతిసారీ మరింత నష్టం జరగకుండా ఐఎంఎఫ్‌ ఆదుకున్నది. ఆ సాయాన్ని సాంప్రదాయ పద్దతుల్లో ఆర్థిక రంగం స్వల్పకాలిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగించారు. తరచుగా సంక్షోభాలు రావటం, వాటి ప్రభావాలు పేరుకు పోవటంతో దీర్ఘకాలిక సవాళ్లు అలాగే ఉండి మొత్తం వృద్ధి మీద ప్రభావం చూపుతున్నది.


ప్రారంభంలో పాకిస్తాన్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉంది, 1980దశకంలో ఒక దశలో పాక్‌ ఆర్థిక వృద్ధి రేటు భారత్‌ను దాటింది.1990ల్లో భారత ఆర్థిక సంస్కరణలు నిరంతర వృద్ధి బాటలో దేశాన్ని నిలిపాయి. పాకిస్తాన్‌ ఆర్థిక పురోగమనంలో దిగజారుడు అలాగే ఉంది. ప్రస్తుతం అస్థిరమైన జిడిపి వృద్ది రేటు, కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనం, దానితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విస్తృతం అవుతున్న కరంట్‌ ఖాతా లోటు ఉంది. ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతున్నది. వ్యవస్థాగతమైన ఆర్థిక సమస్యలేమిటో నిర్ధారించకుండా రాజ్యం రెంటియర్‌ ఆర్థిక వ్యవస్థను తయారు చేసింది. (దీని అర్ధం ఏమంటే కొత్త నిర్మాణాలేమీ లేకుండానే ఉన్న ఇండ్లకు అద్దె వసూలు చేసుకోవటం, బతకటం ) సమాజంలో ఆర్థికంగా ఉన్నతులైన వారందరూ అనేక సబ్సిడీలు పొందటంలో నిమగమయ్యారు. దీంతో ఉన్న అప్పులకు తోడు మరింతగా పెరిగాయి. అప్పులు పెరిగినపుడు పెట్టుబడులను ఆకర్షించటం, నవీకరణలు ప్రోత్సహించటం పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా ఉంది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఒక కారణం నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం.1993-2020 సంవత్సరాలలో పాకిస్తాన్‌ కేవలం రెండు సార్లు ఆరుశాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించగా భారత్‌లో పద్దెనిమిది సార్లు ఉంది. ఇదీ డాన్‌ విశ్లేషణ సారం.


పాకిస్తాన్‌ మరోసారి ఇబ్బందుల్లో పడింది. దీంతో వెంటనే దీనికి కారణం చైనా నుంచి తీసుకున్న అప్పులే అనే ప్రచారం మొదలైంది. డాన్‌ పత్రికలో రాసిన విశ్లేషణ ప్రకారం పాక్‌ పాలకులు అనుసరించిన విధానాలే ప్రస్తుత స్థితికి కారణం. గతంలో 22 సార్లు ఐఎంఎఫ్‌ ఎందుకు రుణాలిచ్చి ఆదుకున్నట్లు ? అప్పుడేమీ చైనా నుంచి ప్రాజెక్టు రుణాలు లేదా ఇతర రుణాలేమీ లేవు కదా ? పాక్‌ అవసరాలకు లేదా అభివృద్ధికి పశ్చిమ దేశాలు తగినన్ని అప్పులిచ్చి పరిస్థితిని మెరుగుపరచి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేది కాదు కదా ! అవెందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్‌ లేదా మరొక దేశం అభివృద్ది చెందితే వాటి మీద ఆధారపడటం లేదా దిగుమతులను తగ్గించుకుంటే వాటికి ఒరిగేదేమీ ఉండదన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి చైనా ఎందుకు పెట్టుబడులు పెడుతోంది, అప్పులు ఇస్తోంది అంటే పరస్పరం లబ్ది చేకూరుతుంది గనుక.


చైనా -పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సిపిఇసి) 2015 నుంచి ఉనికిలోకి వచ్చింది. గల్ఫ్‌ దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న ఇంథన ఓడలు మలేషియా – ఇండోనేషియా మధ్యన ఉన్న మలక్కా జల సంధి గుండా రాకపోకలు సాగించాలి. ఏ కారణంతోనైనా వాటికి ఆటంకం కలిగితే చైనా ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువలన ప్రత్యామ్నాయ మార్గ అన్వేషణలో వచ్చిందే సిపిఇసి. అట్లాంటిక్‌ – పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ పనామాలో 82కిలోమీటర్ల పొడవున ఒక కాలువను తవ్వితే కొన్ని వేల కిలోమీటర్ల మేరకు ఓడల ప్రయాణ దూరం,ఖర్చు తగ్గుతుందన్న ఆలోచకు ప్రతి రూపమే అది. అదే ప్రాతిపదికన సూయజ్‌ కాలువను కూడా తవ్వారు. పశ్చిమాసియా నుంచి పన్నెండువేల కిలోమీటర్లు ప్రయాణించి చమురు ఓడలు చైనా వస్తున్నాయి. అరేబియా సముద్రతీరంలోని పాకిస్తాన్‌ గ్వాదర్‌ వద్ద రేవు నిర్మాణం చేసి అక్కడి నుంచి చైనాలోని షింజియాంగ్‌ వరకు రైలు మార్గం నిర్మాణం చేస్తే కేవలం 2,395 కిలోమీటర్ల దూరంతోనే చమురును తెచ్చుకోవచ్చు. దీనివలన చైనాకు ఏటా 200 కోట్ల డాలర్లు ఆదా అవుతుంది. ఈ మార్గంలో అనుబంధంగా అనేక పథకాలను ఏర్పాటు చేస్తే అది పాకిస్తాన్‌కూ లబ్ది చేకూరుస్తుంది. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందుతాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి, రాబడిని పెంచేవి. ఈ పధకంలో చైనా 25.4బి.డాలర్ల పెట్టుబడులు పెడుతుందని, పాకిస్తాన్‌కు 2.12 బి.డాలర్ల మేరకు పన్ను ఆదాయం, లక్షా92వేల మందికి ఉపాధి దొరుకుతుందని చైనా రాయబారి చెప్పాడు.

గతంలో 22 సార్లు రుణం ఇచ్చిన ఐఎంఎఫ్‌ ఇతర దేశాలు ఇచ్చిన రుణాలతో ఇలాంటి మౌలిక సదుపాయాలును అభివృద్ది చేసి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేదా ? పాక్‌ పాలకులు గానీ ఐఎంఎఫ్‌ సలహాదారులు గానీ ఆ దిశగా గతంలో ఎందుకు ఆలోచించలేదు ? ఇప్పుడు చైనా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు ?ఇప్పుడు పాకిస్తాన్‌ విదేశీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటోంది. పారిస్‌ క్లబ్‌, ఇతర సంస్థలు ఇచ్చిన రుణాల చెల్లింపు గడువు దగ్గరపడింది తప్ప చైనా రుణాలు కాదు. పారిస్‌ క్లబ్‌ పేరుతో ఉన్న 22 ధనిక దేశాలు వంద దేశాలకు 610 బి.డాలర్లు రుణాలిచ్చాయి. పాకిస్తాన్‌కు పది బి.డాలర్లు వాటిలో ఉంది. ఇప్పటి వరకు రెండు సార్లు పారిస్‌ క్లబ్‌ రుణాల చెల్లింపు గడువును పెంచి వెసులు బాటు కల్పించింది. ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలసి పాకిస్తాన్‌ పోరాడింది కనుక రుణాలు చెల్లించలేనందున 15 సంవత్సరాల పాటు కిస్తీ గడువు పెంచింది. తరువాత కరోనా కారణంగా మరో ఐదేండ్లు పెంచింది. ఇప్పుడు మరోసారి ఆ పని చేసి ఆదుకోవాలని పాక్‌ కోరుతోంది.డిసెంబరు నాటికి కిస్తీ సొమ్ము 110 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి రుణాలను తీర్చేందుకు, దిగుమతుల అవసరాల కోసం ఐఎంఎఫ్‌తో మరింత అప్పు కోసం పాక్‌ సర్కార్‌ సంప్రదింపులు జరుపుతోంది

చైనా కంపెనీలపై జాక్‌ మా ఆధిపత్యానికి తెర !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చైనాలోని టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన యాంట్‌ గ్రూప్‌ కంపెనీలపై వివాదాస్పద జాక్‌ మా ఆధిపత్యానికి తెరపడింది.జపాన్‌లో ఉంటున్నట్లు వార్తలు రాగా చైనా నుంచి తప్పుకున్నారా లేక తాత్కాలికంగా అక్కడ ఉంటున్నాడా అన్నది స్పష్టం కాలేదు.యాంట్‌ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం యాజమాన్య వ్యవస్థలో చేసిన మార్పుల ప్రకారం ఒక వాటాదారు లేదా ఇతరులతో కలసి సంయుక్తంగా గానీ కంపెనీని అదుపులోకి తీసుకొనేందుకు వీలు లేదు. పరోక్ష పద్దతుల్లో 53.46 శాతం వాటాలపై అదుపు ఉన్న కారణంగా జాక్‌ మా పెత్తనం ఇప్పటి వరకు కొనసాగింది. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అతగాడికి 6.2శాతం ఓటింగ్‌ హక్కులు మాత్రమే ఉంటాయి. మన దేశంలో అదానీ, అంబానీ వంటి వారు క్రమంగా అనేక కంపెనీలను మింగివేస్తూ రోజు రోజుకూ సంపదలను మరింత పోగు చేసుకుంటున్న తీరు తెన్నులు తెలిసిందే. చైనాలో అలాంటి అవకాశం ఉండదని జాక్‌ మా ఉదంతం స్పష్టం చేసింది.

మారిన నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకుల్లో ఒకడైన జాక్‌ మా, ఇతర యాజమాన్య, సిబ్బంది ప్రతినిధులు పది మంది తమ ఓటింగ్‌ హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవచ్చు. ఎవరి ఆర్థిక ప్రయోజనాలో మార్పు ఉండదని కంపెనీ ప్రకటన తెలిపింది.ఈ ప్రకటన తరువాత హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీల వాటాల ధర తొమ్మిదిశాతం పెరిగింది. ఈ ప్రకటన వెలువడటానికి ముందు జాక్‌ మా థాయిలాండ్‌ రాజధాని బాంకాక్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. టోకియో నగరంలో తన కుటుంబంతో సహా ఉంటున్నారని, అక్కడి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు వెళ్లి వస్తున్నట్లు గతేడాది నవంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. నూతన సంవత్సరం సందర్భంగా చైనాలోని కొందరు టీచర్లతో జాక్‌ మాట్లాడుతున్న వీడియో వెలువడినట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక రాసింది. తాను త్వరలోనే ప్రత్యక్షంగా దర్శనమిస్తానని దానిలో చెప్పటాన్ని బట్టి తిరిగి జాక్‌ మా తన కార్యకలాపాలను కొనసాగిస్తాడని భావిస్తున్నట్లు పేర్కొన్నది.దీన్ని బట్టి జాక్‌ మా తిరిగి చైనా వచ్చాడా లేక ఎక్కడ ఉన్నాడన్నది స్పష్టం కావటం లేదు. 2020లో వివాదాస్పద ప్రకటనలు చేసినప్పటి నుంచీ జాక్‌ మా గురించి అనేక పుకార్లు వచ్చాయి. జైల్లో పెట్టారని, అసలు మనిషినే అంతం చేశారని కూడ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి బహిరంగ జీవితంలో సరిగా కనిపించటం లేదు.

ఝజియాంగ్‌ వాణిజ్య,పారిశ్రామికవేత్తల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఒక వెబ్‌సైట్‌లో వార్తను ఉటంకిస్తూ డిసెంబరు ఎనిమిదవ తేదీన చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఒక వార్తను ప్రచురించింది. ఆరున్నర కోట్ల మంది జనాభా ఉన్న తూర్పు చైనా ఝజియాంగ్‌ ప్రాంతంలో గతేడాది ఆగస్టు నాటికి 9.06 మిలియన్ల సంస్థలు సదరు మండలిలో ఉన్నట్లు, అది ఏర్పడిన 2025 నుంచి జాక్‌ మా అధ్యక్షుడిగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.యాభై ఐదేండ్ల వయసులో జాక్‌ మా 2019 సెప్టెంబరు లోనే అధికారికంగా ఆలీబాబా కంపెనీ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగినట్లు, హరున్‌ సంస్థ రూపొందించిన జాబితా ప్రకారం చైనాలో తొమ్మిదవ పెద్ద ధనవంతుడిగా ఉన్నాడని, సెప్టెంబరు ఆఖరు నాటికి అతని సంపద విలువ అంతకు ముందుతో పోలిస్తే మూడుశాతం పెరిగి 29.124 బిలియన్‌ డాలర్లని కంపెనీ రికార్డుల ప్రకారం ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. చిన్న కంపెనీలను మింగివేసేందుకు జాక్‌ మా చూసినట్లు వెల్లడి కావటంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాంతో తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. తాజా పరిస్థితి గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందిందన్నది స్పష్టం. కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఇతర దేశాల మాదిరే చైనా ఆర్థిక రంగం కూడా ప్రభావితమైంది. జాక్‌ మా, ఇతర టెక్‌ కంపెనీలపై తీసుకున్న క్రమబద్దీకరణ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడినట్లు ఎవరూ చెప్పటం లేదు.


సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప వక్రీకరించి చెప్పేవారు చెబుతున్నట్లుగా దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచాల్సి ఉంది. అది ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే చెప్పలేము. అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది తెలిసిందే.
రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా అనుమతించారు. దీంతో జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతించదని జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


గ్లాస్‌నోస్త్‌ పేరుతో సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు ఇటీవలి పరిణామాలు చోటు చేసుకున్నాయి. గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. జాక్‌ మా ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రించారు. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా 2020 అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే.


చైనా మీద వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులకు తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వారి కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.నీరు వంద డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే వరకు అంతర్గతంగా మరుగుతుంది తప్ప ఆ తరువాతనే ఆవిరిగా రూపం మార్చుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కనిపించదు. చైనా సోషలిస్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా, ఇతర దాని మిత్ర దేశాలు నిరంతరం చూస్తున్నాయి. ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. అందుకు సహకరించే శక్తులు, వ్యక్తుల కోసం అది ఎదురు చూస్తుంది. సోవియట్‌ కూల్చివేతకు ముందు కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడి గా ఉన్న బోరిస్‌ ఎల్సిన్‌ ముందు రాజీనామా చేశాడు. తరువాత సిఐఏ పథకం ప్రకారం దేశాధ్యక్షుడైన చరిత్ర తెలిసిందే. అందువలన సిఐఏ ఎవరి మీద వల విసురుతుందో, ఎవరు చిక్కేదీ చెప్పలేము. దీని అర్ధం జాక్‌ మా అలాంటి వారి జాబితాలో ఉన్నాడని చెప్పటం కాదు. చరిత్ర చెప్పాల్సిందే !