• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ పోరు మరో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందా !

02 Thursday Apr 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, Donald trump, Imperialist war, Netanyahu

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్టకూటమి ఇరాన్‌పై ప్రారంభించిన దాడులకు ముందు వారు అనుకున్నది ఒకటి అయింది, అవుతున్నదీ మరొకటి.పండుగాడి దెబ్బ తగిలినట్లుంది ట్రంప్‌కు, అందుకే ఏం మాట్లాడుతున్నాడో, ఉన్మాదంతో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇది రాస్తున్న సమయానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవకపోయినా దాడులను ముగించాలనుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ భీకరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ఐదవ వారంలో ప్రవేశించాయి. జలసంధిని తెరవటం తన ప్రాధాన్యతల్లో లేదన్నాడు, అందుకే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది.ఎన్ని అదిరింపులు, బెదిరింపులకు పాల్పడినా నాటో కూటమి దేశాలు ఇది తమ యుద్ధం కాదంటూ జలసంధి ఛాయలకు వచ్చేది లేదని చెప్పాయి. మీ మీద దాడులు జరుపుతున్నా మీకు పౌరుషం లేదా అంటూ దాడుల్లో భాగస్వాములను చేసేందుకు గల్ఫ్‌ దేశాలను రెచ్చగొట్టినా కావాలంటే నష్టాల ఖర్చులను భరిస్తాం తప్ప వచ్చేది లేదన్నట్లుగా అవి ఉన్నాయి.దీంతో ట్రంప్‌కు ఉన్న పిచ్చికాస్త మరింత ముదిరింది.ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే అమెరికా దినపత్రిక కథనం సారాంశం ఇలా ఉంది.హార్ముజ్‌ జలసంధిని తెరవకపోయినా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ దాడులను ముగించేస్తానని మిత్రదేశాలకు ట్రంప్‌ చెప్పాడు. వ్యూహాత్మకమైన ఆ జలసంధిని తెరిపించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ట్రంప్‌ చెప్పిన గడువు దాటి వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.జలసంధిని తెరిపించే అంశాన్ని తరువాత చూసుకోవచ్చు ప్రస్తుతానికి అది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ముందు ఇరాన్‌ నౌకా దళాన్ని, క్షిపణులు తయారీ సామర్ధ్యాన్ని బలహీనపరచి దాడులను నిలిపివేస్తే తరువాత దౌత్యపరంగా టెహరాన్ను వత్తిడి చేయవచ్చు. అది కూడా విఫలమైతే ఐరోపా ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రదేశాలు రంగంలోకి దిగి చొరవ చూపాలని ట్రంప్‌ కోరతాడు.మిలటరీ చర్యలను నిలిపివేసేందుకు జలసంధిని తెరిపించటం ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాదని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌, దాడులు ముగిసిన తరువాత ఏదో విధంగా జలసంధి తిరిగి తెరుచుకొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చెప్పాడు.ఎందుకంటే మూసివేయటం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధం అని రూబియో అన్నాడు. నౌకా దళంలో కొంత భాగాన్ని ముంచివేయటంతో సహా భారీ నష్టాలు జరిగినా ఇంకా ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది. త్వరగా దాడులను ముగిస్తానని చెబుతూనే ఇప్పటికే ట్రిపోలీ అనే భారీ యుద్ద నౌక, రెండున్నరవేల మందికి పైగా మెరైన్లను మధ్య ప్రాచ్య ప్రాంతానికి అమెరికా తరలించింది, మరో పదివేల మంది పదాతి దళాలను చేరవేసేందుకు చూస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 113 డాలర్ల వద్ద ఉండగా మనదేశం దిగుమతి చేసుకొనే రకం ముడి చమురు ధర 121 డాలర్లు(నాలుగురోజుల నాటిది) ఉంది. అంతకు ముందు 157డాలర్లకు పెరిగింది.

దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ చర్చల సంగతి ఎటూ తేలలేదు, అమెరికా షరతులకు లొంగేది లేదని ఇరాన్‌ కరాఖండిగా చెప్పింది.పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచంలో తలెత్తే ఆర్థిక సమస్యల గురించి చర్చ మొదలైంది. నెల రోజులు దాటిన యుద్దంతో చమురు నుంచి ఆహారం వరకు ప్రభావితం అవుతున్నాయి.అమెరికాకు మంగళవారం నాటి వరకు 36 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ప్రతి సెకనుకు 11,574 డాలర్లు (డాలరకు 95 రూపాయలు) ఖర్చు అవుతున్నాయి. ప్రపంచం 1970దశకం నాటి స్టాగ్‌ఫ్లేషన్‌కు( ఆర్థిరంగం గిడసబారటం, ధరలు, నిరుద్యోగం పెరుగుదల దీని లక్షణాలు) గురవుతుందా అని కొందరు సందేహిస్తుండగా పరిస్థితి తీవ్రంగా ఉంది తప్ప అలాంటి అవకాశం లేదని మరికొందరంటున్నారు. అమెరికాలో గడచిన తొమ్మిది నెలల్లో మూడుసార్లు అక్కడి కార్మికవర్గం రాజులు లేరు, రాజరికాలు లేవు అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తొలిసారి 50,రెండవసారి 70, మూడవసారి 90లక్షల మంది పాల్గ్గొన్నారు.మూడవసారి మార్చి చివరి వారంలో జరిగిన ప్రదర్శనల్లో అమెరికాలో జరిగిన రోజునే వివిధ ఖండాలలోని పన్నెండు దేశాలలో కార్మికులు స్థానిక సమస్యలను తీసుకొని ప్రదర్శనలు జరపటం విశేషం. అమెరికా వినియోగదారులపై భారం ఎలా పడిందంటే ఫిబ్రవరి నెలలో జాతీయ సగటు గ్యాస్‌ ధర 2.98 డాలర్లు ఉంటే ఆదివారం నాడు అది 3.98 డాలర్లు ఉంది.సరఫరా, ధరల నియంత్రణలో భాగంగా 32దేశాలు,13 సహదేశాలు (వీటిలో మనదేశం లేదు) సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఇంథన సంస్థ(ఐఇఏ) తన పర్యవేక్షణలో ఉన్న 120కోట్ల పీపాల చమరులో 40 కోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థ నిబంధన ప్రకారం ప్రతి సభ్యదేశం 90 రోజులకు సరిపడా చమురు ఉత్పత్తులను నిల్వచేసుకోవాలి. ఈ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌ చరిత్రలో సరఫరా విచ్చిన్నంలో అతిపెద్దదని ఆ సంస్థ పేర్కొన్నది.దీనికి ట్రంప్‌ బాధ్యుడని వేరే చెప్పనవసరం లేదు.దేశం కోసం-ధర్మం కోసం ఏమైనా చేస్తామని ఒట్టి కబుర్లు చెప్పటం తప్ప తాజా పరిస్థితికి కారకుడైన తన మిత్రుడిని నరేంద్ర మోడీ ఇంతవరకు తప్పు పట్టలేదు.పరీక్షా సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందంటారు.

ఇరాన్‌పై దాడుల తరువాత అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి విలువ ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేము.మన దేశంలో రు.51లక్షల కోట్లు నష్టపోయినట్లు అంచనా, ఇంకా పతనం కొనసాగితే నష్టాలు పెరుగుతాయి.అమెరికాలో జతకూర్చిన సమాచారం ప్రకారం ఒక్క రోజులో ఎస్‌ అండ్‌ పి 500 సూచిక 1.66శాతం పతనంతో ఒక లక్ష కోట్ల డాలర్లు, నాస్‌డాక్‌ 2.09శాతం పతనంతో ఆరువందల బిలియన్‌ డాలర్లు, డౌ సూచిక 1.2శాతం పతనం 300బి.డాలర్లు మొత్తం ఒక్కరోజులో 1.2లక్షల కోట్ల డాలర్లు ఆవిరైంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా మాంద్యంలోకి వెళ్లేందుకు 37శాతం అవకాశాలున్నట్లు పోలీమార్కెట్‌ అంచనా వేసింది.కార్పొరేట్‌ కంపెనీలు పెరిగిన ఖర్చులను వినియోగదారుల మీద మోపితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగేస్తారు,నియామకాలు తగ్గిపోతాయి.అమెరికాలో ఉత్పత్తి అయ్యే డబ్ల్యుటిఐ రకం ముడి చమురు ధర 2025 డిసెంబరులో 57 డాలర్లు ఉంటే ఇది రాసిన సమయంలో 102 డాలర్లు ఉంది.దీనికి అనుగుణంగానే అమెరికాలో ధరలు పెరిగాయి.ఫిబ్రవరిలో విమాన ఇంథనం పీపాధర 99 డాలర్లు ఉంటే మార్చినెల 20న 197 డాలర్లకు పెరిగింది. స్లోక్‌ అనే ఆర్థికవేత్త జనవరిలో అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆశాభావం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్‌ యుద్ధాన్ని ప్రారంభించాడో ఇప్పుడా పెద్దమనిషి స్టాగ్‌ఫ్లేషన్‌ అవకాశాల గురించి హెచ్చరించాడు.

ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది జరుగుతున్నది మరొకటి, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఉన్నాడు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్‌ ఎలా ముగిస్తాడో తెలియదు.స్వస్థిపలకటం అనివార్యం, అయితే అది అమెరికా నిర్దేశించినట్లు కాదు.ఇప్పుడు ఇరాన్‌ తన షరతులను ముందుకు తెస్తున్నది, ఇది ట్రంప్‌ కలలో కూడా ఊహించి ఉండడు. పెట్రోడాలర్‌ను సవాలు చేస్తూ చైనా యువాన్‌తో లావాదేవీలు జరిపేవారి నౌకలను హార్ముజ్‌ జలసంధి నుంచి అనుమతిస్తామని అది ప్రకటించింది.ఆ కరెన్సీలోనే అది కప్పం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ యుద్ధం చైనా పెట్రో యువాన్‌కు శక్తినిస్తుందని అమెరికా డాలర్‌ ఆధిపత్యం బలహీనపడుతుందని ఈ పరిణామాల గురించి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఇతర దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు తనకు అనుగుణంగా ఆడించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలుగా ప్రపంచంలోని చమురు సంపద, ఇతర వనరులను వినియోగించుకొనేందుకు వాటి మీద అదుపు సాధనకు అమెరికా ఎప్పుడో ఎత్తువేసింది.ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ అదే పాత్ర పోషించాలని చూస్తోంది. సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించిందేకు పర్షియా గల్ఫ్‌-ఎర్ర సముద్రాన్ని అనుసంధానం చేసే అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా ఎమెన్‌ ద్వారా తన అదుపులోకి తెచ్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఐరోపా దేశాలను కూడా అది ఒక ఆట ఆడించగలదు. అమెరికా అనుసరిస్తున్న మొరటు సూత్రం ఒక్కటే.ఎవరినైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే అంతర్జాతీయ సూత్రాలను పక్కన పెట్టు, జనం మీద బాంబులువేసి చంపు, దేశాలను నాశనం చేయి, అప్పుడు జనం నిరాశతో లొంగిపోతారు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతమైన గాజాలో చేసింది అదే.ఆసుపత్రులు, స్కూళ్లు, సహాయకేంద్రాలు వేటినీ వదల కుండా నాశనం చేసింది, 70వేల మందికి పైగా పిల్లలు, మహిళలను చంపివేసింది. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చింది. అయినప్పటికీ హమస్‌గానీ, పాలస్తీనియన్లుగానీ ఇజ్రాయెల్‌కు లొంగలేదు.ఇప్పుడు ఇరాన్‌ కూడా యావత్‌ప్రపంచానికి అదే సందేశమిచ్చింది. మీ మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు, మీ అధినేత అయాతుల్లా అలీ ఖమేనిని పదవి నుంచి తొలగిస్తే మీకు రక్షణ కల్పిస్తాం, లేకపోతే దాడులు చేస్తాం అని మెరికా తొలిరోజుల్లో బెదిరించింది.ఆడపిల్లలు చదుకొనే పాఠశాల మీద అమెరికా విమానాలు బాంబులు వేసిన దుర్మార్గం గురించి తెలిసిందే.ఇప్పుడు వేరేగా మాట్లాడుతోంది.

మార్చినెల 31, ఏప్రిల్‌ ఒకటవ తేదీల్లో చైనా సందర్శించాలని ట్రంప్‌ కార్యక్రమం నిర్ణయించుకున్నాడు. ఈ తేదీలకు ఉన్న ప్రాధాన్యత ఏమంటే ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించిన తరువాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972 తొలిసారిగా బీజింగ్‌ను సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో అవసరం లేకపోయినా జపాన్‌ మీద అణుబాంబులు వేసి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. బహుశా డోనాల్డ్‌ ట్రంప్‌ లేదా అతగాడికి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాంటి దుష్టాలోచననే ముందు పెట్టి ఉండాలి. అయితే ఈ సారి ప్రపంచం కంటే తనకు పోటీగా సవాల్‌ విసురుతున్న చైనాను బెదిరించేందుకు, తద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు సిద్దపడినట్లు కనిపిస్తోంది.చైనా పర్యటన ఎప్పుడో ఖరారైంది గనుక ఈ లోగా ఇరాన్ను దెబ్బతీసి దాన్నే చైనా ముందు ప్రదర్శించాలన్న దుష్టాలోచనతోనే ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ట్రంప్‌ఆలోచన ఏమిటి ? ” రెండు మూడు వారాల్లో ఇరాన్‌ మీద విజయం సాధిస్తాం.చైనా వెళ్లినపుడు షీ జింపింగ్‌తో చర్చల్లో చూశారుగా ఇరాన్‌ పాలకులను మార్చాం, అక్కడ గతంలో రష్యాలో బోరిస్‌ ఎల్సిన్‌ అనే తొత్తును పీఠం ఎక్కించినట్లుగా మాకు అనుకూలమైన వాడిని పదవిలో ప్రతిష్టించాం.వాడు అక్కడి చమురు నిల్వలన్నింటి మీద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే వెనెజులా చమురును స్వాధీనం చేసుకున్నా.మీకు ముడి చమురు అవసరం గనుక మేం చెప్పినట్లు వింటే, మాకు అవసరమైన విలువైన ఖనిజాలను మాకు సమర్పించుకుంటే ఓకే లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు పెడతాం ” అని రిహార్సల్స్‌ వేసుకున్న ట్రంప్‌కు ఇరాన్‌ చుక్కలు చూపించింది. దాంతో మార్చినెలాఖరులో చైనా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే నెల 14,15 తేదీల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.జరుగుతున్న పరిణామాలను బట్టి అది కూడా జరుగుతుందా వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. తొందరేం లేదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చన్నట్లుగా చైనా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ట్రంప్‌ వెళతాడో చూద్దాం.చివరిగా చెప్పుకుంటున్నా అతి ముఖ్యమైన అంశం ఒకటుంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అది వియత్నాం,ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, లిబియా ఏ దేశం మీద దాడి చేసినా అమెరికాకు మిత్ర దేశాలు సహకరించాయి.తొలిసారిగా ఇరాన్‌పై దాడికి ముఖం చాటేశాయి, అది తమ యుద్దం కాదని ప్రకటించాయి. కొంత మంది వర్ణించినట్లు ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఇరాన్‌ మీద కాదు, దానికి మద్దతు ఇస్తున్న రష్యా, చైనాల మీద అన్నది నిజమేనా ! చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !

25 Wednesday Mar 2026

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Data centres, Donald trump, Joe Kent, oil price, Pete Hegseth, Trump’s peace talk, US attack Iran, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

అయ్యగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నది ఒక లోకోక్తి. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌, అతగాడి మాటలు నమ్మి ఎటూకాకుండా పోయిన అపర చాణుక్యులు ఇప్పుడు అదే చేస్తున్నారు. దాడులకు ముందు అమెరికా ప్రతిపాదించిన అంశాలపై జెనీవా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. వియన్నాలో తదుపరి సంప్రదింపులు జరుపుదామన్న అమెరికా ఏకపక్షంగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలసి ఇరాన్‌పై దాడులకు దిగింది. ఇప్పుడు ఆ పాత అంశాలనే ఇప్పుడు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనలుగా ఇరాన్‌ ముందుంచినట్లు వార్తలు. గతంలోనే వాటిని తిరస్కరించిన ఇరాన్‌ ఇప్పుడు కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది. భవిష్యత్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు జరపవనే హామీ, పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో తమ పాత్రకు గుర్తింపు, దాడులకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు సిద్దమే అని, గతంలో మాదిరి హామీలను ఉల్లంఘిస్తే కుదరదని ఇరాన్‌ స్పందించినట్లు కూడా చెబుతున్నారు. అంతకు ముందు మంగళవారం నాటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.

ఇరాన్‌పై ఏకపక్ష దాడులకు దిగిన అమెరికా వెనకడుగు వేసిందా ? పోరును ఆపేందుకు ట్రంప్‌ దారులు వెతుకుతున్నాడా ? దానిలో భాగంగానే ఇరాన్‌లో ఇంథన వ్యవస్థలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడా ! అవన్నీ ఒట్టి మాటలే అని టెహరాన్‌ ఎందుకన్నది ! ఒక్కటి మాత్రం వాస్తవం ఇరాన్‌పై దాడులను అమెరికా-ఇజ్రాయెల్‌ కూటమి ఇంకెన్ని రోజులో కొనసాగించే అవకాశాలు లేవన్నది అత్యధిక విశ్లేషకుల అభిప్రాయం.దీనికి విరుద్దంగా జరుగుతుందా ? ఏమో ! ట్రంప్‌ ప్రకటన చేసిన తరువాత అమెరికా, మనదేశంలో కూడా మంగళ, బుధవారాల్లో యుద్దం ఆగనుందనే అంచనాతో స్టాక్‌ మార్కెట్లు కళకళలాడాయి. ఐదు రోజుల విరామం ప్రకటన చేసిన తరువాత కూడా సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఇరాన్‌పై దాడులు ఆగలేదు. ఇరాన్‌లోని ఒక ప్రముఖుడితో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. ఆ పెద్దమనిషి టెహరాన్‌ మేయర్‌, పోలీసు అధికారి, అధ్యక్ష స్థానం కోసం పోటీ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్న పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగరె గాలిబ్‌ కావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.చర్చలకు తాము సిద్దమే అని ఇరాస్‌ సుప్రీమ్‌ నేత అయాతుల్లా మొజ్తాబా ఖమేనీ చెప్పినట్లు నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి. అమెరికా తరఫున ట్రంప్‌ అల్లుడు జెరెడ్‌ కుషనర్‌, రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ రంగంలో ఉన్నట్లు వార్తలు. ఇరాన్‌తో చర్చలు సాగుతున్నాయని, విశాలమైన ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది చూడాలని, వారు పరిష్కారాన్ని, శాంతిని కోరుకుంటున్నారని ట్రంప్‌ చెప్పాడు. అయితే అయితే ఈ కబుర్లన్నీ తప్పుడు వార్తలని ఎలాంటి చర్చలు జరగలేదని తొలుత ఇరాన్‌ వార్తా సంస్థ పేర్కొనగా తరువాత పార్లమెంటు స్పీకర్‌ కూడా చెప్పాడు. ద్రవ్య, చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకు వాటిని వాడుకున్నారని అన్నాడు. ట్రంప్‌ ప్రకటనకు ముందు బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 114 డాలర్లకు పెరిగింది, ప్రకటన తరువాత 98 డాలర్లకు పడిపోయి, చర్చలు జరగలేదన్న ఇరాన్‌ ప్రకటన తరువాత మంగళవారం మధ్యాహ్నానికి 104 డాలర్లకు చేరింది. బుధవారం నాడు వంద డాలర్లలోపు ఉంది. ఒక వైపు ట్రంప్‌ ఐదురోజుల విరామ ప్రకటన చేసినప్పటికీ మరోవైపు అమెరికా మిలిటరీ కేంద్ర కమాండ్‌ ఇరాన్‌ మీద తీవ్రమైన దాడులు జరుపుతూనే ఉంటాయని ప్రకటించింది. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా క్షిపణులను ప్రయోగిస్తున్నది.ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు లెబనాన్‌ మీద దాడులను కొనసాగిస్తున్నాయి.దాడులు దీర్ఘకాలం కొనసాగితే అమెరికన్లలో వ్యతిరేకత మరింత పెరుగుతుందని, నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే పదవీకాలం పూర్తయ్యే వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ట్రంప్‌ వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకొని దారి వెతుక్కుంటున్నట్లు చెబుతున్నారు.

అమెరికా బలహీనతలు, దాని ఎత్తుగడల వైఫల్యం గురించి పెద్ద ఎత్తున సాగుతున్న చర్చతో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలో ట్రంప్‌ 48 గంటల బెదిరింపు ప్రకటన చేశాడు.హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్‌ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించాడు. అయితే ఆ గడువు ముగిసిన వెంటనే ఐదు రోజుల పాటు దాడులను వాయిదా వేస్తామంటూ నాటకీయంగా సోమవారం సాయంత్రం ప్రకటించాడు.తమపై దాడులకు మరింత మంది సైనికులను కూడ గట్టుకొనేందుకే ఈ ప్రకటన చేశాడని ఇరాన్‌ స్పందించింది. తమ విద్యుత్‌ సంస్థలపై దాడులు జరిపితే తలెత్తే పర్యవసానాలకు భయపడి ట్రంప్‌ ఆ ప్రకటన చేశాడని ఇరాన్‌ జాతీయ టీవీ, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి.రెండు దేశాల మధ్య చర్చల గురించి ఎవరేమి చెప్పినప్పటికీ తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌ను ఎవరు ప్రేరేపించారనే అంశంపై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే సోమవారం నాడు ట్రంప్‌ టెన్నెసీలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌పై నెపం మోపాయి.తన పక్కనే ఉన్న హెగ్‌సేత్‌తో ట్రంప్‌ మాట్లాడుతూ ” వారు అణ్వాయుధాలను కలిగి ఉండకూడదంటే మనం వారిని వదల కూడదని నువ్వే కదా మొదట చెప్పింది ” అన్నాడు. అంతా అధ్యక్షుడి చేతుల్లోనే ఉంది అన్నాడు తప్ప పీట్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇతరులపై నెపం మోపటంలో ట్రంప్‌ ఘనుడు. ఇరాన్‌ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల గురించి తనకు తెలియదని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. ఇరాన్‌ ప్రతిఘటన ఇలా ఉంటుందని తనకెవరూ చెప్పలేదన్నాడు. ఇప్పుడు మరొక కొత్త కథ చెప్పాడు.రేపు ఇంకెన్ని చెబుతాడో చూద్దాం.

ఇరాన్‌పై దాడులు ఎందుకు చేశారని ట్రంప్‌ యంత్రాంగంలో ఏ ఇద్దరిని అడిగినా ఒకే సమాధానం రావటం లేదు.ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు దిగాలని నిర్ణయించినందున అమెరికాకు తప్పలేదన్నది ఒక కథనం. ఇరాన్‌ అణ్వాయుధాలను మోహరిస్తున్నందున దాడికి దిగక తప్పదని మరికొందరు చెబుతున్నారు. ముందే చెప్పినట్లుగా ట్రంప్‌ మరోవిధంగా మాట్లాడాడు.” నేను పీట్‌ను సంప్రదించాను, నేను జనరల్‌ కానేతో మాట్లాడాను. అనేక మంది మన గొప్ప జనాలతో మాట్లాడాను.మధ్య ప్రాచ్యంలో మనకు ఒక సమస్య వచ్చింది.మనం దాన్ని ఆపగలం, మధ్య ప్రాచ్యంలోకి చిన్న ప్రయాణం పెట్టుకొని పెద్ద సమస్యను అంతం చేయాలి ” అని ట్రంప్‌ చెప్పాడు. అంతకు ముందు మాట్లాడుతూ గల్ఫ్‌ దేశాల మీద ఆకస్మికంగా ఇరాన్‌ చేసిన దాడులను చూస్తే ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు అన్నాడు. అయితే ఇలా మాట్లాడటానికి ముందే ఇరాన్‌ ప్రతిఘటన గురించి దాడులకు ముందుగానే ట్రంప్‌ను హెచ్చరించారని, వాటిని ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.అందరికీ తెలిసినప్పటికీ ఇరాన్‌ సామర్ధాన్ని అంచనా వేయటంలో విఫలం, పెత్తందారీ పోకడలతో దాడులకు తెగబడ్డారన్నది సత్యం. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అంత ఉత్సాహంగా లేకున్నా, వ్యతిరేకతను వెల్లడించలేదన్నది ఒక కథనం. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, మీడియా అధిపతి రూపర్ట్‌ మర్డోచ్‌ దాడులను ఎగదోసిన ప్రముఖుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.జాతీయ ఉగ్రవాద నిరోధ కేంద్రం అధికారి జో కెంట్‌ దాడులను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తీరు ట్రంప్‌ యంత్రాంగంలో ఉన్న భిన్నాభిప్రాయాలను వెల్లడించింది.ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి, అంతా సవ్యంగా జరిగితే సరే లేకుంటే బాంబుదాడులను కొనసాగిస్తూనే ఉంటామని ట్రంప్‌ చెప్పాడు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడులు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఇప్పటి వరకు వరకు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాదాపు రెండువేల దాడులు జరిపినట్లు అంచనా. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ పేరుతో అమెరికా, రోరింగ్‌ లయన్‌ పేరుతో ఇజ్రాయెల్‌ తెగబడుతున్నాయి. వందకు పైగా విమానాలను దాడులకు వినియోగించినట్లు చెబుతున్నారు. అత్యధిక దాడులు రాజధాని టెహరాన్‌ నగరం మీదే జరిగాయి. ఈ దాడులతో భారీగా నష్టపోయినప్పటికీ ఇరాన్‌ ఎందుకు వెనక్కు తగ్గటం లేదన్నది యావత్‌ ప్రపంచంలో చర్చగా ఉందంటే అతిశయోక్తి కాదు. సుప్రీమ్‌ నేత అయాతుల్లా అలీ ఖమేని, ఇతర అనేక మంది ప్రముఖులను పోగొట్టుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. అమెరికా మీద గెలవటం అన్నది కల అని తెలిసినప్పటికీ ప్రతిఘటన దాడులు జరుపుతున్నది.ముందుగా దాడులు నిలిపివేయాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, భవిష్యత్‌లో ఎలాంటి దాడులు జరపబోమనే హామీ కావాలని అమెరికాకే షరతులు పెట్టింది. తాను బలహీనంగా ఉన్నపుడు ఎదుటి వాడి బలహీనతల మీద దెబ్బకొట్టాలన్నది ఒక సూత్రం. ఇప్పుడు అదే జరిగింది. హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధనం చేయటంతో ఆ మార్గంలో చమురు, గ్యాస్‌ ఎగుమ తి, దిగుమతి చేసుకొనే దేశాలు ప్రభావితమై అమెరికా మీద వత్తిడి తెస్తాయన్నది ఒకటైతే అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేస్తే అవి కూడా వాషింగ్టన్‌ మీద ప్రభావం చూపుతాయన్నది ఇరాన్‌ అంచనా, అదే జరిగింది. నిజానికి ఈ విషయాలన్నీ ముందే చెప్పినా ఎవరూ ఖాతరు చేయలేదు.చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కతార్‌, ఒమన్‌ తెరవెనుక కాల్పుల విరమణ యత్నాలు ప్రారంభించాయి, అయితే తొందరేం లేదు ముందు మాపై దాడులను నిలిపివేయనివ్వండి, అర్దవంతమైన ప్రతిపాదనలతో రానివ్వండి అన్నట్లు ఇరాన్‌ తాపీగా ఉంది.ఎలాంటి చర్చలకూ సంసిద్దత వెల్లడించలేదు. యుద్ధం మీద అమెరికా అదుపు కోల్పోతున్నదంటూ సోమవారం నాడు అమెరికా ప్రధాన మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఉభయపక్షాలూ ఎవరూ ఎవరిని నమ్మే స్థితి లేనందున చర్చలు అనుమానమే. ఒక వేళ తామే విజయం సాధించినట్లు అమెరికా ప్రకటిస్తే హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ ఆధిపత్యం నిర్ధారణ అవుతుంది. దాని అణుకార్యక్రమం కూడా కొనసాగుతుంది.రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపితే గల్ఫ్‌ దేశాల మీద ఇరాన్‌ దాడులు కొనసాగుతాయి. ఇరాన్‌ చమురు కేంద్రం ఖార్గ్‌ దీవి మీద దాడులకు దిగితే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మెరైన్‌ దళాలతో ఈ దీవిని చేరుకుంటే పెద్ద సంఖ్యలో అమెరికన్లను బందీలుగా ఇరాన్‌కు అప్పటించటమే అని రాజీనామా చేసిన ఉన్నతాధికారి కెంట్‌ హెచ్చరించాడు. అందువలన ఏకపక్షంగా దాడులను విరమించటమే అమెరికా ముందున్న మార్గం అని చెప్పవచ్చు. అయితే సామ్రాజ్యవాదం తన ఓటమిని అంత తేలికగా అంగీకరిస్తుందా ? ఒక వైపు ఐదు రోజుల విరామం ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు అదనపు దళాలను సమీకరిస్తున్నాడు.జపాన్‌లో ఉన్న సైనిక స్థావరం నుంచి రెండువేల మంది మెరైన్‌(సముద్రం, భూమి మీదా దాడులు చేసే శిక్షణ పొందినవారు) దళాన్ని మధ్య ప్రాచ్యానికి తరలించారు.అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి మరో రెండున్నరవేల మందిని తరలిస్తున్నారు. ఏప్రిల్‌ నాటికి ఇతర మరికొన్ని దళాలను కూడా తరలించేందుకు నిర్ణయించారు.

అమెరికా దూకుడు వైఖరిలో వచ్చిన మార్పుతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా వాషింగ్టన్‌-టెహరాన్‌ చర్చలు ఈ వారంలో జరగవచ్చని రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయపక్షాలను దగ్గరకు చేర్చేందుకు ఈజిప్టు, టర్కీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.పాక్‌ సైన్యాధికారి మునీర్‌ రెండు దేశాల అధ్యక్షులతో ఈపాటికే సంప్రదింపులు జరిపినట్లు వార్తలు. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ గాలీబ్‌తో ట్రంప్‌ అల్లుడు కుషనర్‌, రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ సంప్రదింపులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. ట్రంప్‌ చర్యలకు నిరసనగా రాజీనామా చేసిన అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సంస్థ మాజీ అధిపతి జో కెంట్‌ ఐదు రోజుల ట్రంప్‌ విరామప్రకటన గురించి స్పందించాడు. ముందుగా ఇజ్రాయెల్‌ను అదుపు చేస్తే తప్ప సంప్రదింపులు ముందుకు వెళ్లవని, అవి కొనసాగితే అమెరికా సంప్రదింపుల సామర్ధ్యం బలహీనపడుతుందని చెప్పాడు.ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు ఇచ్చిన తప్పుడు సమాచారం అమెరికాను యుద్ధంలోకి లాగిందని, అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం చూపిందన్నది కెంట్‌ అభిప్రాయం. యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇరాన్‌ మరొక చర్య ఏమంటే గల్ఫ్‌ దేశాల్లో ఉన్న డేటా(సమాచార) కేంద్రాలపై దాడులు. ఈ కేంద్రాలు అమెరికా, ఇజ్రాయెల్‌ చేపట్టిన కృత్రిమ మేథ లక్ష్యాలను నెరవేర్చకుండా చేసేందుకు ఇరాన్‌ కేంద్రీకరించింది.అయితే అమెరికా కూడా టెహరాన్‌లో ఉన్నకేంద్రాల మీద దాడులు చేసింది.ఇప్పటి వరకు రెండు వైపులా ఐదు కేంద్రాలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇరవై తొమ్మిది సాంకేతిక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ ప్రకటించింది. సాంప్రదాయ యుద్ధంలో వంతెనలు, విమానాశ్రయాలు, నౌకా కేంద్రాల మీద కేంద్రీకరించటం తెలిసిందే.ఇప్పుడు యుద్ధంలో డేటా కేంద్రాలను కూడా వినియోగిస్తున్నందున వాటిని కూడా వదలటం లేదు. గల్ఫ్‌ దేశాలు వివాదాలకు దూరంగా ఉంటాయంటూ అమెరికా, ఇతర అనేక దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. తాజా పరిణామాలతో అవి ఆర్థికంగా నష్టపోవటమేగాక గల్ఫ్‌ దేశాల మీద ఉన్న నమ్మకం కూడా సడలటం ఖాయం. ఇరాన్‌కు వీటిని దెబ్బతీయాలనే ఆలోచన కలగటానికి అమెరికా, ఐరోపా దేశాలు చూపిన మార్గమే. రష్యాను దెబ్బతీసేందుకు ఈ దేశాలు ఉక్రెయిన్‌కు డేటా కేంద్రాల ద్వారా కీలకమైన రష్యా కేంద్రాల గురించి సమాచారం ఇవ్వటమేగాక ఉక్రెయిన్‌ దాడులను సమన్వయపరచటం, ఎప్పటికప్పుడు మాప్‌లను అందించటం వంటి సేవలను అందించాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ఇరాన్‌కు అవసరమైన సలహాలు, సమాచారాన్ని రష్యా అందిస్తున్నదని ఎవరైనా వాపోతే చేసేదేమీ లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !

11 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#China arms to Iran, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

త్వరలో ఇరాన్‌పై యుద్ధం ముగుస్తుందని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అది నిజమో కాదో ఎత్తుగడో తెలియదు. సోమవారం నాడు 116 డాలర్లకు పెరిగిన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బుధవారం నాడు ఇది రాసిన సమయానికి 87 డాలర్లకు తగ్గింది.. ఇదే విధంగా మన స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం నాడు రెండున్నరవేల పాయింట్ల వరకు పతనమైన సూచి మంగళవారం నాడు ఆరువందల పాయింట్లు పెరిగింది.ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.యుద్ధ ప్రభావం మన మీద పడుతున్నది.పెట్రోలు, డీజిలు కొరత లేదు గానీ వంటగ్యాస్‌ మండుతున్నది.ఇది ఒక అంశం. ఇరాన్‌పై జరిగిన దాడి సందర్భంగా కొంత మంది చైనా ఆయుధాల పనితీరు గురించి చర్చ చేస్తున్నారు. పాకిస్తాన్‌, వెనెజులా తరువాత ఇరాన్‌లో కూడా అవి తుస్సుమన్నాయని చెబుతున్నారు.ఇరాన్‌ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినట్లు , రోజూ ప్రయోగించే క్షిపణుల సంఖ్య పడిపోయినట్లు మరికొన్ని కథనాలు.మరోవైపున దాని క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశామని అమెరికా చెబుతోంది.ఇంకో వైపున రోజూ క్షిపణి దాడుల వార్తలు తెలిసిందే. యుద్ధ సమయాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు సహజమే.

ఇరాన్‌కు మిత్రదేశాలు అని చెబుతున్న చైనా, రష్యా దాని తరఫున యుద్దంలోకి ఎందుకు దిగటం లేదు అని కొందరు తెలివిగా ప్రశ్నిస్తున్నామనుకుంటున్నారు. అమెరికా దాడిని అవి రెండూ ఖండించాయి.మనమూ యుద్ధంలోని మూడు దేశాలకూ మిత్రులమే కదా మనమెందుకు యుద్ధంలో అడుగుపెట్టలేదని మోడీని ఎవరైనా ప్రశిస్తున్నారా ? కనీసం ఇరాన్‌తో మాట్లాడను కూడా మాట్లాడలేదే !.అనేక పశ్చిమ దేశాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి, అవి కూడా తమ మిలిటరీలను దించలేదు. అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన కారణంగా గల్ఫ్‌దేశాల మీద ఇరాన్‌ దాడులు జరుపుతున్నది.ప్రత్యక్ష బాధితులైన ఆ దేశాలు కూడా యుద్దాన్ని ఎందుకు ప్రకటించటం లేదు. వాటి రక్షణకు అమెరికా చేస్తున్నదేమిటి ? చెప్పేవాడు లోకువ అయితే అడిగేవాడు రెచ్చిపోతుంటాడు.

కొందరు విశ్లేషకులు చెబుతున్నదేమిటి ? తాజా యుద్ధంతో ప్రధానంగా నష్టపోయేది చైనా.హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా నిలిచిపోతుంది.ఇరాన్‌లో దాని పెట్టుబడులకు దెబ్బతగులుతుంది. దాని ఆయుధాలు పనికిరావని తేలినందున కొనేవారు ఉండరు.అసలు ఇరాన్‌కు చైనా ఇచ్చిన ఆయుధాల గురించి ఊహాగానాలు తప్ప నిజానిజాలను నిర్ధారణగా చెప్పటం లేదు. చైనా ఆయుధాల గురించి చెబుతున్నవి వాస్తవం కాదు అని చెబుతున్నవారూ ఉన్నారు. విమానదాడుల నుంచి రక్షణకు జనవరిలో చైనా రాడార్లను భారీ విమానంలో పంపిందన్నది ఒక వార్త. రాడార్లు పెద్దవిగా ఉన్నందున ఉపగ్రహాల నిఘా నుంచి వాటిని దాచటం కష్టం. గతంలో చైనా ఆయుధాలను సరఫరా చేసింది. ఐరాస 2007లో చేసిన తీర్మానం తరువాత వాణిజ్యం నిలిచిపోయింది. అంతకు ముందుకుదిరిన ఒప్పందాల ప్రకారం 2015వరకు సరఫరాలు కొనసాగాయి. ఇరాన్‌ తయారు చేస్తున్న షాహేద్‌ డ్రోన్ల గురించి 2022 దర్యాప్తులో తేలిన అంశం ఏమంటే 80శాతం భాగాలు పశ్చిమదేశాలు అడ్డదారుల్లో అందించినవే.ఓల్టేజ్‌ కన్వర్టర్లు, ఇంజన్లు మాత్రం చైనావని చెప్పారు. ఇతర దేశాల డ్రోన్లు దొరికినపుడు వాటిని పరిశీలించి అదే రకాలను ఇరాన్‌ స్వయంగా తయారు చేస్తున్నది. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలతో కూడా చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే సమతుల్యత పాటించాలి గనుక యుద్ధ విమానాలు కావాలని ఇరాన్‌ వత్తిడి తెచ్చినప్పటికీ వాటిని సరఫరా చేయలేదు. అయితే చైనా ఏమి సరఫరా చేసింది.2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూమి, అంతరిక్షంలో సమాచార సేకరణ కేంద్రాలను ఇరాన్‌లో ఏర్పాటు చేసింది.తరువాత 2021లో కుదిరిన 25 సంవత్సరాల ఒప్పందంలో కూడా వాటిని చేర్చింది.దాంతో బెయిడౌ-3 ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన 12రోజుల దాడుల సమయంలో ఇరాన్‌లోని జిపిఎస్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆ యుద్ధం తరువాత జూన్‌ నెలలో పౌర, మిలిటరీ అవసరాలకు బెయిడౌ-3 మీద పూర్తిగా ఆధారపడేందుకు ఇరాన్‌ ఒప్పందం చేసుకుంది. బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న మిజరావిషన్‌ అనే ఉపగ్రహ నిఘా కంపెనీ సేవలను కూడా పొందుతున్నది.

తాజా అమెరికా దాడుల సమయంలో ఇజ్రాయెల్‌లోని అవడా విమాన స్థావరంలో ఉంచిన 11 అమెరికా ఎఫ్‌-22 బాంబర్లు, అమెరికా యుద్ద నౌకలు, గగనతలంలోనే ఇంథనం నింపుకొనే విమానాల వంటి వాటి చిత్రాలను, సమాచారాన్ని ఆ సంస్థ ఇరాన్‌కు అందచేయటంతో వాటిని గురిచూసి కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమాచారం రష్యా కూడా అందచేసి ఉంటుంది. ఈ కారణంగానే ఆ రెండు దేశాలూ సమాచారమిస్తున్నాయని అమెరికా మీడియా రాసింది. ఆధునిక యుద్ధంలో ఆయుధాలతో పాటు శత్రువు కదలికలను పసిగట్టే సమాచారమూ అంతే ముఖ్యమైనది.ఈ రంగంలో అమెరికాకు ధీటుగా చైనా అనేక ఉపగ్రహాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌-రష్యా పోరులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అందించిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ అనేక దాడులు చేసి రష్యాకు నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.అమెరికా బెదిరింపులతో మనదేశం ఇరాన్‌ చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇతర దేశాలు కూడా అదే చేశాయి. ఈ పూర్వరంగంలో ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 80శాతం చైనాకే జరుగుతున్నాయి. ఈ మొత్తం చైనా దిగుమతుల్లో 12-15శాతమే. హార్ముజ్‌ జలసంధిని ఇతర దేశాల నౌకలకు మూసివేసినప్పటికీ చైనా వాటిని మినహాయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పరిమితంగానే చైనా ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి మినహాయింపు మనకు ఇవ్వలేదు, కారణం మనం ఇజ్రాయెల్‌, అమెరికా వైపు మొగ్గటమే అని చెప్పవచ్చు.

రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినపుడు ఎవరి బలాన్ని వారు ప్రదర్శిస్తారు. ఎలాంటి క్షిపణి ప్రయోగంలేకుండానే అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాలను చైనా దెబ్బతీస్తున్నందంటూ తాజాగా ఒక విశ్లేషణ వెలువడింది.అమెరికాకు పోటీగా చైనా మరో యుద్ధాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రపంచ బలాబలాలను సమతూకం చేసేందుకు చైనా మార్చినెల ఐదున 15వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఖనిజాల రంగంలో పురోగతికి దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. అది పైకి ఆర్థిక పరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చడీ చప్పుడు లేకుండా చైనా ముందుకు పోతున్నతీరును ఎవరూ పట్టించుకోవటం లేదంటూ పెట్టుబడుల విశ్లేషకుడు షనాకా అన్సెలెమ్‌ పెరేరా వాపోయాడు. ఐదేండ్ల కాలంలో కృత్రిమ మేథ వినియోగం ద్వారా పరిశ్రమల్లో 1.4లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అనేక రంగాల గురించి దానిలో పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఒక ఇనుపతెరను ఏర్పాటు చేసింది.ఫాక్స్‌సిలికా పేరుతో మనతో సహా అనేక దేశాలతో ఒక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక చిప్స్‌, వాటి తయారీకి అవసరమైన యంత్రాలను అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చైనా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఒక ఆర్థిక పథకం కాదు, అమెరికాతో యుద్ధ ప్రణాళిక అని పెరేరా పేర్కొన్నాడు. అమెరికా చిప్స్‌ చట్టం ఒక రైఫిల్‌ వంటిది కాగా చైనా పంచవర్ష ప్రణాళిక ఒక అమ్ముల పొది అని వర్ణించాడు.దీనిలో విలువైన ఖనిజాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం వహిస్తున్నది.ఈ ఖనిజాలు విద్యుత్‌ వాహనాల నుంచి లక్ష్యాల మార్గదర్శనం చేసే వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ల వరకు ఎంతో ముఖ్యమైనవి. అమెరికా ప్రతి ఎఫ్‌-35 ఆధునిక యుద్ద విమానానికి వందల కిలోల ఖనిజాలు, లోహాలు అవసరం. ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలకు ఇవి లేకుండా పని జరగదు.

చైనా మీద అమెరికా 2018 నుంచి వాణిజ్యంతో పాటు చిప్స్‌ యుద్ధం కూడా చేస్తున్నది.దీనికి ప్రతిగా బీజింగ్‌ నూతన ఎత్తుగడలను రంగంలోకి తెచ్చింది. విలువైన ఖనిజాలు, వాటితో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరకు ఉత్పత్తిలో నైపుణ్యం సాధించి, ఇతర దేశాలకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.వీటి దిగుమతులకు సంబంధించిన అమెరికా రక్షణశాఖ చేసుకున్న ఒప్పందాలు 2027లో ముగుస్తాయి.చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికాకు సంవత్సరాలు, దశాబ్దం పట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌ పోరులో అమెరికా పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలతో కూడిన ఆయుధాలను వినియోగిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంలో అమెరికన్లు క్షిపణులు,డ్రోన్లను అడ్డుకొనే ఆయుధాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు, మరోవైపు చైనా వాటి తయారీకి అవసరమైన ఆ ఖనిజాల సరఫరాను కఠినతరం కావిస్తున్నదని పెరేరా వాపోయాడు. తెలివితేటలు అమెరికా సొత్తు కాదు. విలువైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం రానున్న 15 సంవత్సరాలు ఉంటుందని అంచనా. నిజంగానే చైనా తన పట్టు నిలుపు కుంటే అమెరికా ఎఫ్‌-35 విమానాలు ఎగిరే అవకాశాలు లేవని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది కాస్త అతిగా ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.

చైనా ఆయుధాల్లో పసలేదని ఒక వైపు ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో చైనా కూడా అలాంటి ఆధునిక మిలిటరీ ఉత్పత్తులను సేకరించుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా గడచిన ఐదు సంవత్సరాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను 72శాతం తగ్గించింది. మరోవైపు మనదేశం ప్రపంచంలో సాధారణ పరిస్థితుల్లో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాం.(యుద్ధంలో ఉంది కనుక ఉక్రెయిన్‌ మనకంటే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది) విదేశీ ఆయుధాల స్థానంలో చైనా తన స్వంత ఉత్పత్తులను చేరుస్తున్నది. మరోవైపు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌లకు ఆధునిక ఆయుధాలను అమెరికా అందచేస్తున్నది, అవసరమైతే తైవాన్‌ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటామని అమెరికా, జపాన్‌ ప్రకటించాయి. నిజంగా తన ఆయుధాలు నాశిరకమైతే చైనా వాటితోఅమెరికాను అడ్డుకోగలదా ! చిత్రం ఏమిటంటే చైనా ఆయుధాలను చూసి ఇరుగు పొరుగు దేశాలు ఆధునిక ఆయుధాలను సమీకరించుకుంటున్నట్లు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు పాటపాడుతుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) తాజాగా వివిధ దేశాల ఆయుధాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఐరోపా 2021-25 సంవత్సరాలలో 33శాతం, ఆసియా,ఓషియానా దేశాలు 31శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి.అంతకు ముందు ఐదు సంవత్సరాలతో పోల్చితే ఇరవై శాతం తగ్గాయి. చైనా 72, దక్షిణ కొరియా 54, ఆస్ట్రేలియా 39 శాతం తగ్గించాయి. గతంలో ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల్లో ఉన్న చైనా 1991-95 తరువాత ప్రస్తుతం 21వదిగా ఉంది. తన దిగుమతుల్లో రష్యా నుంచి 66శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా సాధించిన ప్రగతి గురించి కొందరు ఉక్రోషంతో తక్కువ చేసి చూడవచ్చు. కానీ విధాన నిర్ణేతలు వాటి ఆధారంగా అంచనా వేసుకుంటే పప్పులో కాలేసినట్లే !అఱa

Share this:

  • Tweet
  • More
Like Loading...

వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

10 Tuesday Mar 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Donald trump, India-US trade deal, MAGA, Narendra Modi Failures, Russian oil, US attack Iran

ఎం కోటేశ్వరరావు

కేవలం విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటనతో సరిపెడదామని చూసిన పాలక కూటమి యత్నంతో సోమవారం నాడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పశ్చిమాసియాలో పరిస్థితి గురించి ప్రకటన కాదు, చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గల్ఫ్‌లో చిక్కుకు పోయిన భారతీయుల గురించి ఆందోళన చెందుతున్నట్లు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి మంత్రి చెప్పారు.యుద్ధం, దాని పర్యవసానాల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టటంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి, పశ్చిమాసియా పరిస్థితి గురించి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ స్థానం అనుమతించలేదు. యుద్ధాలు, ప్రపంచాన్ని కుదిపివేసే ఇతర సంక్షోభాలు అప్పటి వరకు ఉదాసీనంగా ఉన్నవారిలో, కొందరు నేతల మీద ఉన్న భ్రమలు పటాపంచలు అవుతాయి, అయితే కొందరు వాటిని బహిరంగంగా అంగీకరించటానికి ముందుకు రారు. ఫర్లేదు, ఒకసారి బుర్ర ఆలోచించటం ప్రారంభించిన తరువాత ఎంతకాలం బిడియపడతారు ! ఎన్‌డిఏ ప్రభుత్వం, నరేంద్రమోడీ అనుసరించే లొంగుబాటు విధానాల గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు ఎంతగా మొత్తుకున్నా చెవికి ఎక్కని వారికి గూబగుయ్యి మనిపించేలా వినిపించినందుకు నిజంగా డోనాల్డ్‌ ట్రంప్‌కు ” అభినందనలు ” చెప్పక తప్పదు.ప్రతి తరంలోనూ ఒక మహానుభావుడు అవతరిస్తాడు మరి ! జీవ పరిణామ క్రమంలో కొన్ని జీవుల మెదళ్లు ఎదగలేదు, మనుషుల్లో కూడా అలాంటి వారు ఉంటే వారి పట్ల జాలి చూపుదాం !!

నెల రోజుల పాటు రష్యన్‌ ముడిచమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే నరేంద్రమోడీ భక్తి మైకంలో ఉన్నవారికి చెర్నాకోల దెబ్బలా తగిలి మత్తువదిలింది. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అన్న శ్రీశ్రీ పాట చాలా మందికి డోనాల్డ్‌ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చింది. అది కూడా కొత్తగా రష్యాలో కొనుగోలు చేసేందుకు కాదు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యన్‌ రేవుల నుంచి బయలుదేరి, ఏ దేశానికి వెళ్లాలో తెలియక సముద్రంలో లంగరు వేసిన చమురు టాంకర్లలో ఉన్న సరకు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.ఈ ఉదంతాన్ని చూస్తే బందీగా ఉన్న బానిసకు రెండు నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకురా అన్న యజమాని ఉదారత్వం కనిపించింది. ఇంతకీ మనం అసలైన దేశభక్తులం అని చెప్పుకొనే కాషాయదళాల పాలనలో ఉన్న స్వేచ్చా జీవులమా, అమెరికా యజమానులకు బానిసలమా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ! యావత్‌ దేశంలో ఆత్మగౌరవం గలవారందరూ అమెరికా ప్రకటనపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే బిజెపి మాత్రం నరేంద్రమోడీ దౌత్య విజయం అంటూ భజన చేస్తున్నది. మొత్తం మీద ఈ పరిణామం ఆ పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడించింది. నిజంగా విజయమే అయితే 30 రోజులే గడువు ఎందుకు ? నీ ఆంక్షలను మేము ఖాతరు చేయం, ఇప్పటి వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు ఇది, ముందు ముందు కూడా కొనసాగిస్తాం అని మోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? మధ్యలో రష్యా నుంచి దిగుమతులను ఎందుకు తగ్గించినట్లు ? పిల్లి పాలుతాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుందట. అమెరికా బెదిరింపులకు లొంగి మాస్కో నుంచి దిగుమతులు ఎలా తగ్గించారో లోకం కోడై కూస్తున్నది.చైనా అలా తగ్గించినట్లు వార్తలు లేవు. మన ఛాతీ 56 నుంచి 6 అంగుళాలకు తగ్గిపోయిందా ! ఇంతా చేసి ఇంటా బయటా పరువుపోయినా భారత్‌ సాధించింది కేవలం 30రోజుల పాటు దిగుమతులకు అనుమతా, సిగ్గుచేటు !ఈ చమురు గురించి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు ధర కంటే నాలుగైదు డాలర్లు ఎక్కువగా ఉంటుందట, గతంలో రష్యా మనకు ఇచ్చిన 13 డాలర్ల రాయితీ పోయి ఇది అదనం. అవసరం మనదైపుడు వ్యాపారులు కొండెక్కుతారని తెలిసిందే.

నియంత జూలియస్‌ సీజర్‌ చరిత్రలో అతగాడి నమ్మినబంటు బ్రూటస్‌ వెన్నుపోటు పొడుస్తాడు, అప్పుడు బ్రూటస్‌ నువ్వు కూడానా ( యూ టూ బ్రూటస్‌) అంటాడు సీజర్‌.ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అధికారమే పరమావధిగా ఉన్నవారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ముఖ్యంగా పరీక్షా సమయం వచ్చినపుడు అసలు రంగు బయటపడుతుంది. బ్రిక్స్‌ కూటమిలో స్థాపక సభ్యులైన బ్రెజిల్‌,రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, ఈజిప్టు,ఇథియోపియా ఉన్నాయి.ఒక సభ్యురాలైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్నాయి, వాటిని ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది.ఈ క్రమంలో కూటమిలోని సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలు, ఎంబసీల మీద ఇరాన్‌ దాడులు చేస్తున్నది.ఈ పరిణామంపై కూటమికి ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో నాయకత్వం వహిస్తున్న భారత్‌ నోరుమెదపలేదు. ఇది మన గురించి ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నది ? గతేడాది ఇదే అమెరికా, ఇజ్రాయెల్‌ పన్నెండు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేసినపుడు బ్రిక్స్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్‌ వెంటనే ఆ చర్య అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించటమే అని ఖండించింది. అప్పుడు అది తన ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. గత డిసెంబరు నుంచి భారత్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చింది. కూటమి కంటే తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని, అమెరికా-ఇజ్రాయెల్‌కు దగ్గర ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు అల్‌ జజీరా పత్రిక, సండే గార్డియన్‌ వ్యాఖ్యానించాయి. సరిగ్డా యుద్ధ ప్రారంభానికి ముందు నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ పర్యటన, ఇతర అంశాల గురించి పేర్కొన్నాయి. పారిశ్రామిక దేశాలతో కూడిన జి 7 కూటమికి ప్రత్యామ్నాయంగా పేద దేశాల ప్రయోజనాల కోసం ఏర్పడిందే బ్రిక్స్‌, దాని అజెండాల్లో ఇప్పుడు సభ్య దేశాల భద్రత అంశం కూడా ఉంది. అందువలన ఇరాన్‌ భద్రతకు ముప్పు తెచ్చిన వారి గురించి మౌనంగా ఉంటే కుదరదు, మనకు మన ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలి. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక కూటమి అని ట్రంప్‌ ఆరోపించాడు. సభ్య దేశాల సంగతి తేలుస్తాం అని మాట్లాడాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మిలిటరీ విన్యాసాలకు భారత్‌ దూరంగా ఉంది.అమెరికాకు ఆగ్రహం కలిగించే చర్యలేవీ చేపట్టబోమని చెప్పకనే చెప్పింది. విశాఖపట్టణంలో మనదేశం మిలన్‌ 2026 విన్యాసాల్లో ఇరాన్‌ పాల్గొనగా అమెరికా మొఖం చాటేసింది.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి అన్న లోకోక్తులు తెలిసిందే. అమెరికాతో అన్ని దేశాలూ వాణిజ్యం చేస్తున్నాయి, అయినా ఒక పరిణామం జరిగినపుడు వాటి గురించి పట్టించుకోకుండా స్పందిస్తున్నాయి. అమెరికా దాడులను ఒక్క మనదేశం తప్ప బ్రిక్స్‌ స్థాపకసభ్యులైన నాలుగు దేశాలూ విడివిగా ఖండించాయి. మూడు రోజులు ఆలశ్యంగా ఈ ఉన్మాదానికి స్వస్థి పలకాలని దక్షిణాఫ్రికా స్పందించింది. ముందుగా పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. అవసరమైతే మధ్యవర్తి పాత్రపోషిస్తామని కూడా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించాడు. ఇదే దక్షిణాఫ్రికా జనవరి నెలలో నిర్వహించిన బ్రిక్స్‌ నౌకాదళ విన్యాసాలలో ఇరాన్‌ భాగస్వామిగా ఉండటానికి అంగీకరించినందుకు దక్షిణాఫ్రికాపై ట్రంప్‌ తీవ్రంగా విమర్శించాడు. తొలి దాడి, ఖమేనీ హత్య జరిగిన మూడు రోజుల తరువాత భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ చర్చలు, దౌత్యాన్ని కోరుతున్నామని, వివాదం త్వరగా ముగియాలని పేర్కొన్నది. ఇరాన్‌ నేతలతో ఎలాంటి మాటలు లేకపోగా దాని పేరు ఎత్తకుండా గల్ఫ్‌ దేశాల నేతలతో మాట్లాడుతూ వాటి భూభాగాలపై జరుగుతున్న దాడులను నరేంద్రమోడీ విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ, వెస్ట్‌బాంక్‌ ప్రాంతంలో పాలస్తీనియన్లపై కొనసాగుతున్న మారణకాండను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా ఫిబ్రవరి 25,25 తేదీలలో పర్యటన జరిపి పార్లమెంట్‌ నెసెట్‌లో మాట్లాడుతూ వర్తమానంలో, తరువాత కూడా తాము ఇజ్రాయెల్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.హమస్‌ దాడులను ఖండించారు గానీ వారిని అణచేపేరుతో గాజాలో టెల్‌అవీవ్‌ జరిపిన మారణకాండ గురించి పల్లెత్తుమాట అనలేదు. గాజాలో యుద్ద నేరాల కేసులో తమ ముందు హాజరు కావాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు కోరిన నెతన్యాహును ఆలింగనాలు చేసుకున్నారు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని కూడా మోడీ చెప్పారు. ఆ మాటలు చెబుతున్న సమాయానికే అమెరికా, ఇజ్రాయెల్‌ అన్ని యుద్ధ సన్నాహాలు చేసుకున్నాయి.ఒక రోజు తేడాతో దాడులను ప్రారంభించాయంటే మోడీకి ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. నిజంగా తెలియదంటే మన వేగుల వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. తెలుసు అంటే ఎరుకలో ఉండి కూడా మోడీ వెళ్లారంటే ఇజ్రాయెల్‌కు సమర్ధనే అన్నది స్పష్టం. దీని గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల గురించే మా తపన అని జైశంకర్‌ చెప్పారు. ఇరాన్‌లో కూడా ఉన్నారుగా, అయినా తమ మీద దాడి చేస్తే ఎక్కడ అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నా వాటి మీద దాడి చేస్తామని ముందే ఇరాన్‌ ప్రకటించింది. దాని అర్ధం తెలియనంత అమాయకంగా కేంద్ర ప్రభుత్వం ఉందని నమ్మటానికి ఎవరూ చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. గతంలో ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపారని మోడీ గురించి పెద్ద ప్రచారం చేశారు కదా, ఆ పని ఇప్పుడెందుకు చేయలేదు ?

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో భ్రమల్లో ఉన్న అనేక మంది భారతీయులను మరో అంశంలో కూడా అమెరికా కళ్లు తెరిపించింది. మన స్వేచ్చా మీడియా దాని గురించి పెద్దగా వార్తలు ఇవ్వటానికి చర్చిందేందుకు భయపడింది. తమను దెబ్బతీసేందుకు భారత్‌ను అనుమతించనివ్వం, ఇరవై ఏండ్ల క్రితం చైనా వ్యవహారంలో చేసిన తప్పిదాన్ని పునరావృతం కానివ్వం, ఇది భారత్‌కు అర్ధమైంది, మాకు పోటీగా మరొక అర్ధిక వ్యవస్థ ఎదగటం మా పౌరుల ప్రయోజనాలకు విరుద్దం అని న్యూఢిల్లీ గడ్డమీద రైసినా 2026 చర్చల్లో అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రి క్రిస్టోఫర్‌ లాండవ్‌ తెగేసి చెప్పినా మనం గొణగటం తప్ప గట్టిగా మాట్లాడలేకపోయాం. దీని అర్ధం ఏమిటి ? గత పన్నెండు సంవత్సరాలుగా చైనాను పక్కకు నెట్టి మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా పథకాలతో భారత్‌ను ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తాని మోడీ అండ్‌కో చెబుతున్నది.దానికి మేం అనుమతించం అని అమెరికా చెప్పింది. అంతే కాదు భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కూడా తొలుత తమ ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని కూడా క్రిస్టోఫర్‌ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పాడు. ముందే చెప్పినట్లుగా సంచలనాత్మక పరిణామాలు జరిగినపుడు జనంలో అనేక ఆలోచనలకు నాంది పడుతుంది. భారత్‌ను విశ్వగురువుగా మారుస్తానని చెప్పిన నరేంద్రమోడీ అమెరికా తోకగా మారుస్తున్నారని పశ్చిమాసియా సంక్షోభం వెల్లడించింది. గతంలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఎందరో మేథావులు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో ఆలోచించకతప్పటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

04 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

Share this:

  • Tweet
  • More
Like Loading...

అగ్రగామిగా జపాన్‌ – నయా సైనికవాదం !

18 Wednesday Feb 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Imperialist war, Japan LDP, Japan militarism, Sanae Takaichi, Wang Yi

ఎం కోటేశ్వరరావు

మరోసారి అమెరికాను అగ్రగామిగా నిలపాలన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. వాషింగ్టన్‌ అడుగుజాడల్లో నడుస్తున్నది జపాన్‌.గత వారంలో జరిగిన ఎన్నికల్లో 1955 తరువాత అత్యధిక మెజారిటీ సాధించిన మితవాద ఎల్‌డిపి నేత, ప్రధాని సానే తకాయిచీ మరోసారి జపాన్ను అగ్రగామిగా చేయాలని ఇచ్చిన పిలుపు ప్రమాద ఘంటికలను మోగించింది. డైట్‌(పార్లమెంటు) ఎగువ సభలో మెజారిటీ లేనప్పటికీ అవసరమైతే వ్యతిరేకతను పక్కకు నెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.ఇప్పటికే పెద్ద మొత్తాలలో మిలిటరీ బడ్జెట్‌కు కేటాయించిన ప్రభుత్వం అవసరమైతే యుద్ధాలను నిషేధించి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత మిలిటరీ ఉండాలన్న శాంతికాముక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు చూస్తున్నది.తనను తాను జపాన్‌ మార్గరెట్‌ ధాచర్‌గా వర్ణించుకొనే తకాయిచీ చైనా, ఉత్తర కొరియాలనుంచి ముప్పు అంటూ సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అధికారానికి వచ్చిన షింజే అబే ” ధృడమైన జపాన్ను పునరుద్దరించాలని ” ప్రతిజ్ఞ పూనాడు. గత విధానాలను క్రమంగా పక్కన పెట్టటం ప్రారంభించాడు. దాని కొనసాగింపుగా ” మరోసారి జపాన్ను అగ్రగామి ” చేయాలని తకాయిచీ చెబుతున్నారు.దానిలో భాగంగా మిలిటరీని పటిష్టపరచటం, ఆయుధ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, నాటో, ఐరోపాయూనియన్‌, క్వాడ్‌తో సహా నూతన భద్రతా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, అమెరికాతో బంధాన్ని మరింత పటిష్టపరుచుకొనే వ్యూహంతో ముందుకు పోవాలని జపాన్‌ నిర్ణయించుకుంది. తమ మీద ఎవరైనా దాడి చేస్తే ఉమ్మడిగా ఆత్మరక్షణ లేదా భాగస్వాముల సాయం పొందవచ్చని రాజ్యాంగమే అనుమతిస్తున్నదంటూ నూతన భాష్యాలు చెబుతున్నారు. గత ఏడాది అధికారానికి వచ్చిన వెంటనే ఒక వేళ చైనా గనుక తైవాన్‌పై దాడి చేస్తే తమ మిలిటరీని రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఈ వైఖరి ప్రాంతీయ భద్రతకు ముప్పు అని చైనా వర్ణించింది.

ఆర్థిక రంగంలో దీర్ఘకాల పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌ ఇప్పుడు ఆర్థిక, మిలిటరీ లక్ష్యాలను ఉమ్మడిగా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నది. ఇప్పటికే జిడిపిలో రెండు శాతానికి రక్షణ ఖర్చు చేరింది.అణు జలాంతర్గాములను సమకూర్చుకోవాలని, ఆయుధ విక్రయాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని,మారణాయుధాలను ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు పంపటంతో తగ్గిన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.ఇటలీ,ఆస్ట్రేలియాకు ఫ్రైగేట్స్‌ సరఫరా, నూతనతరం జెట్‌ఫైటర్ల రూపకల్పనకు బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాటో పేరుతో ఉక్రెయిన్‌కు మిలిటరీ పరికరాలను సరఫరా చేస్తున్నది. సిఐఏ మాదిరి నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. తద్వారా ఇప్పటికే ఐదు కళ్ల పేరుతో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గూఢచర్యంలో సహకరించుకుంటున్నాయి, దీనిలో చేరటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమెరికాతో రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా మిలిటరీ, సైనిక కేంద్రాలను ఏర్పాటును అనుమతించింది. ”డోన్రో సిద్దాంతం”(డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడలు) పశ్చిమార్ధగోళం వైపు కేంద్రీకరిస్తూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ ప్రాంతంలో తాను కేంద్ర బిందువుగా ఉండాలని జపాన్‌ భావిస్తున్నది, అందుకోసం అమెరికాతో మరింతగా జతకట్టేందుకు పూనుకుంది. తన దగ్గర ఉన్న నిల్వనుంచి 550 బిలియన్‌ డాలర్ల మేర అమెరికాలో పెట్టుబడులు పెడతామంటూ అమెరికాకు ఆశచూపుతున్నది.

మరోసారి మిలిటరీవాదం వైపు పయనిస్తున్న జపాన్‌ చర్యలను దాని బాధిత దేశాలలో ఒకటైన చైనా సహజంగానే వ్యతిరేకిస్తుంది. జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో ప్రస్తుతం జరుగుతున్న భద్రతా సమావేశాలలో మిలిటరీ భూతంలా జపాన్‌ ఉందని చైనా విమర్శించింది. మమ్మల్ని అంతమాట అంటారా అని జపాన్‌ నిరసన తెలిపింది. ” ప్రపంచంలో చైనా ” అనే ఇతివృత్తంపై మ్యూనిచ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ మాట్లాడుతూ చైనాకు దూరంగా జరుగుతున్న జపాన్‌ మరోవైపు తైవాన్‌కు మద్దతు ఇస్తూ దురాక్రమణ ఉద్దేశ్యాలను బయటపెట్టుకున్నదని విమర్శించాడు. తైవాన్‌పై దాడితో వలసగా మార్చుకొనేందుకు చూస్తున్నదని, జపాన్‌ మిలిటరీ వాద భూతం భయం కొనసాగుతున్నదంటూ ఒకవేళ గతంలో మాదిరి పాత పద్దతిలో దురాక్రమణకు పూనుకుంటే వెనక్కు తిరిగి చూసుకొనే లోపే చావు దెబ్బతింటుందని హెచ్చరించాడు. తైవాన్‌కు మద్దతు ఇవ్వటం ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పరిణామం అవుతుందని, చైనా సర్వసత్తాకతకు సవాలు, 140 మంది జనాభా అంగీకరించే సమస్యే లేదని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తరువాత సామ్రాజ్యవాదాన్ని జర్మనీ తిరస్కరించిందని, నాజీల ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయగా జపాన్‌ మాత్రం యుద్ద నేరగాండ్లకకు ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్నదని, వారికి వందనాలు చేయటమే సమస్యలన్నింటికీ మూలమని వాంగ్‌ ఇ చెప్పాడు.చైనా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని జపాన్‌ పేర్కొన్నది. తమ మిలిటరీ నిర్మాణం పెరుగుతున్న భద్రతా పర్యావరణానికి స్పందన తప్ప ఒక దేశానికి వ్యతిరేకం కాదని, తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పుకుంది. కొన్ని దేశాలు తమ మిలిటరీ శక్తిని పెంచుకుంటున్నాయని, బెదిరిస్తున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా జపాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో వ్యాఖ్యానించారు. తమ పరిసర దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని జపాన్‌ రక్షణ మంత్రి కొజుమీ మ్యూనిచ్‌ సమావేశాల్లో ఆరోపించాడు.

అక్టోబరులో అధికారానికి వచ్చిన తకాయిచి జపాన్‌కు తొలి మహిళా ప్రధాని, వచ్చీ రావటంతోనే దూకుడుగా వ్యవహరిస్తున్నారు, చైనాను రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. తమ భూ భాగాల రక్షణకు ఇప్పటికే తిష్టవేసిన అరవైవేల మంది అమెరికన్‌ మిలిటరీతో పాటు తాము కూడా రక్షణ ఏర్పాట్లను మరింతగా పెంచుతామని ప్రకటించారు. గత 14 సంవత్సరాలుగా క్రమంగా జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది.తాజాగా 2026 సంవత్సరానికి రికార్డు స్థాయిలో గత రికార్డులను బద్దలు కొట్టి 57.8 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ మొత్తమే ఖర్చు చేయనుందని, జిడిపిలో రెండుశాతానికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదేదో అనుకోకుండా జరిగే పరిణామం కాదు. నయా సైనికవాదంలో భాగమే. రాజ్యాంగం శాంతికాముకమని, ఆత్మరక్షణ మిలిటరీ బలగాలని చెబుతున్నప్పటికీ వర్తమాన ఆచరణ యుద్దోన్మాద బాటగా ఉంది. ప్రతిదాడులు చేసే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను దెబ్బతీసే సామర్ద్యాలను సమకూర్చుకుంటున్నది. చైనా, తైవాన్‌ల సమీపంలో ఉన్న తన దీవులను మిలిటరీ, ఆయుధాలతో నింపుతున్నది. నిజానికి జపాన్‌ వద్ద ఆధునిక ఆయుధాలను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదు. ఇప్పుడు ఉపగ్రహాలు పనిచేయకుండా స్థంభింపచేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నది. అనేక ఆంక్షల కారణంగా ఆయుధాల బదులు ఎలక్ట్రానిక్‌, వినియోగవస్తువులపై కేంద్రీకరించి కొన్ని దశాబ్దాల పాటు హవా నడిపింది. ఇటీవలి కాలంలో చైనా సవాలు విసురుతున్నది. ఈ నేపధ్యంలోనే ఆయుధాల తయారీకి పూనుకుందని చెప్పవచ్చు, అయితే తనకు ముప్పు రానంతవరకు లేదా తనకు అవసరమైన వాటిని మాత్రమే అమెరికా అనుమతించవచ్చు. తానుగా విదేశాలపై దాడులు చేసినపుడు అంతర్గతంగా తలెత్తుతున్న వ్యతిరేకత, నష్టాలను గమనంలో ఉంచుకొని తమ చేతికి మట్టి అంటకుండా చూసుకుంటున్నది. నాటో దేశాలు తమ మిలిటరీ బడ్జెట్లను పెంచుకోవాలని వత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి ఆసియాలో చైనా మీద దాడికి దిగితే పక్కనే ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎంతో అవసరం. అందువలన వాటి మిలిటరీ ఖర్చు పెంచేందుకు అమెరికా పూనుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కుదిరిన ఒప్పందాల ప్రకారం జపాన్‌, జర్మనీ మిలిటరీ వాదాన్ని వదులుకోవాలని స్పష్టంగా ఉంది. అందువలన దానికి దానికి తూట్లు పొడుస్తూ రెండు దేశాలు కూడా మిలిటరీబాటలో ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఓడిపోయింది తప్ప దాని మిలిటరీ సామర్ధ్యాలు అంతరించలేదు. అందుకే మరోసారి వాటిని ప్రదర్శించేందుకు పూనుకుంది. తూర్పు ఆసియాను ఉద్రిక్తల్లోకి నెట్టేందుకు చూస్తున్నది.తొలుత వాణిజ్యం, మత ప్రచారం పేరుతో మనదేశానికి బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదులు వచ్చినట్లుగానే 1,600 సంవత్సరంలో పోర్చుగీసు వాణిజ్య, మత ప్రచారకులు జపాన్‌లో అడుగుపెట్టారు. జపాన్‌ నాలుగు ప్రధాన దీవులు, 14,121 చిన్నదీవుల సముదాయం. పోర్చుగీసు, ఇతర పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులను ఎదుర్కొనే క్రమంలో అక్కడి రాజులు తామే సామ్రాజ్యవాదులుగా మారి కొరియాను ఆక్రమించుకున్నారు.చైనా ఆక్రమణకూ పూనుకున్నారు. ఈ క్రమంలో జపాన్‌-చైనా, జపాన్‌-రష్యా యుద్దాలు జరిగాయి.కాముకురా, ఆషికా షోగుంటే రాజరికాలు జపాన్ను ఐక్యం కావించిన తరువాత ప్రపంచానికి దూరంగా ఒక అగ్రహారంలా ఉంది. అమెరికా 1853లో నౌకా దళాన్ని పంపి రాజును లొంగదీసుకొని పశ్చిమదేశాలకు మార్కెట్‌గా మార్చింది. దాంతో 1868లో షోగుంటే పాలన రద్దయి, మెజి పాలన ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్‌ సంబంధాలను బద్దలు కొట్టి పారిశ్రామీకరణ, నవీకరణ, మిలిటరీ వాదంతో పాలకులు ముందుకు వచ్చారు.ప్రష్యా(జర్మనీ) పాలకులను అనుకరించారు.ఈ క్రమంలో 1910లో కొరియాను ఆక్రమించుకుంది, 1937చైనా ఆక్రమణకు పూనుకుంది. తరువాత అమెరికా,ఐరోపా దేశాలతో తలపడింది.రెండవ ప్రపంచ యుద్దంలో మితవాద భావజాలం, మిలిటరీ శక్తులు, సామ్రాజ్యవాదులుగా ఉన్న ఇటలీ, జర్మనీలతో చేతులు కలిపి సోవియట్‌ యూనియన్‌, అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో తలపడింది. ఆ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయటంతో సామాన్య జపనీయులు యుద్ధ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో శాంతికాముక రాజ్యాంగంతో యుద్దాలకు దూరంగా ఉంటామని జపాన్‌ పాలకవర్గం ప్రకటించకతప్పలేదు. అయితే వలసలు, సామ్రాజ్యవాదంతో ఎలా లబ్ది పొందవచ్చో తెలిసిన వారు గనుక మరోసారి నయా సైనిక వాదంతో ప్రాంతీయంగా అయినా తమ ప్రభావాన్ని రుద్దేందుకు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించారు. వాటి గురించి ఎగువన చెప్పుకున్నాం. గడచిన ఎనిమిది దశాబ్దాలలో ప్రపంచ పటంలో అనేక మార్పులు వచ్చాయి. బలాబలాలు తారుమారవుతున్నాయి.గతంలో మాదిరి ఏ దేశాన్ని కూడా భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశాలు లేదు. అందువలన జపాన్‌ గతాన్ని తలుచుకోవటం తప్ప అంతకు మించి చేసేదేమీ లేదు, అయినప్పటికీ పాలకవర్గ స్వభావం మారదు, అందుకే మరోసారి జాతీయోన్మాదాన్ని, నయా సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నారు, అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో జపనీయులకు తెలిసినంతగా మరొరికి తెలియదు గనుక పాలకవర్గ యత్నాలను అడ్డుకుంటారని, అడ్డుకోవాలని ఆశిద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాల కట్టడికి మరిన్ని అణ్వాయుధాలు కావాలంటున్న అమెరికా !

04 Wednesday Feb 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Arms race, Donald trump, East Asia Semiconductors, New START treaty, nuclear and missile tests, US build-up, US-Russia Nuclear Limits, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అమెరికా ా రష్యా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌) గడువు బుధవారం రాత్రితో (ఫిబ్రవరి నాలుగు) ముగియనుంది. పునరుద్దరణకు అవకాశాలు లేనందున ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో ముందుకు వస్తుందో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది. ఆయుధ రంగంలో ముందున్న అమెరికా తాపీగా ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబిస్తూ ఒక వేళ ఒప్పందం గడువు తీరితే,అది ముగిసిపోతుంది అంతే అని స్పందించాడు.అమెరికా, రష్యా రెండు దేశాలూ పాతబడిన ఆయుధాలను తొలగించుకొనేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని వినియోగించుకున్నాయి తప్ప కొత్తవాటిని తయారు చేయటం మానుకోలేదనే విమర్శ ఉంది. ఆ రెండు దేశాల దగ్గర ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 87శాతం ఉన్నాయి. గతంలో 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలను 1,700 మరియు 2,200కు పరిమితం చేసుకోవాల్సి ఉంది. దాని స్థానంలో 2010లో పదేండ్లపాటు అమల్లో ఉండే నూతన ఒప్పందం ప్రకారం మరింతగా తగ్గించేందుకు అంగీకరించాయి.దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోనుంది. ఉన్నవాటిని నవీకరించుకొనేందుకు, వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ వంటి వాటికి అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లమేర ఖర్చు అవుతుందని అంచనావేశారు.రష్యా పరిస్థితి కూడా అటూఇటూగా అంతే. పోనీ ఇంత ఖర్చు చేసినా అమెరికా కలలుగన్న ప్రపంచాధిపత్యం సాధ్యం కాలేదు, పూర్వపు సోవియట్‌, తరువాత రష్యాకు యావత్‌ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం లేకపోయినా అమెరికాను అడ్డుకొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒప్పందం లాంఛనంగా ఫిబ్రవరి ఐదుతో ముగియనున్నప్పటికీ ఆ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. సమాచార మార్పిడి, తనిఖీల వంటి వాటిని రష్యా పక్కన పెట్టింది.

అమెరికాకు ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కొత్తగా దానికి మరొక భయం పట్టుకుంది. గతంలో ఒక్క రష్యాతోనే పోటీ అనుకుంటే ఇప్పుడు చైనా ముందుకు వస్తోంది, రెండూ కలసి వస్తే తమ పరిస్థితేమిటని వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట. నిజానికి అణుయుద్దమే వస్తే ఎవరూ మిగలరు. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకారం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఆ సమాచారాన్ని మూడు నాలుగు నిమిషాల్లోనే చైనా కమాండర్లకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ బీజింగ్‌ వద్ద ఉందని పేర్కొన్నారు. శత్రు క్షిపణులు తమను చేరేలోగానే పసిగట్టి ఎదురుదాడికి దిగే సత్తా కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఆధునిక క్షిపణిని చైనా 2024లో పసిఫిక్‌ సముద్రంలో పరీక్షించింది. తరువాత అనేక ప్రయోగాలు చేసింది. అమెరికాను ఎదుర్కొనేందుకు రకరాల క్షిపణుల తయారీలో ఉంది. 2050 నాటికి ఇప్పుడు మోహరించిన 1,770 అణ్వాయుధాల సంఖ్యను 4,625కు పెంచుకోవాలని చూస్తోంది. ఇతర ఆయుధాల సంగతి సరేసరి. ఒకవైపు ఇలా మారణాయుధాల గుట్టలను పెంచుతూనే ఎదుటి దేశాల మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నది.

ఈ పూర్వరంగంలో భవిష్యత్‌లో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే వాటిలో చైనా కూడా చేరాల్సిందేనని అమెరికా పట్టుబడుతున్నది, ససేమిరా కుదరదని బీజింగ్‌ పలుసార్లు స్పష్టం చేసింది. ఒప్పందాల్లేకపోతే జరిగేదేమిటి ? ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కొద్ది నెలల్లోనే రష్యా 60, అమెరికా వందశాతంపైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలు, వాటి స్థితి ఇలా ఉంది.

దేశం× ఆయుధాలు×మోహరింపు×నిల్వలు ×ఉపయోగంలో లేనివి

రష్యా×××× 5,449 ×× 1,710 ×× 2,589 ×× 1,150

అమెరికా×× 5,277 ×× 1,770 ×× 1,930 ×× 1,577

చైనా ×××× 600 ×× 24 ×× 576 ×× 0000

ఫ్రాన్స్‌×××× 290 ×× 280 ×× 10 ×× 0000

యుకె×××× 220 ×× 120 ×× 105 ×× 0000

భారత్‌×××× 180 ×× 0000 ×× 180 ×× 0000

పాక్‌ ×××× 170 ×× 0000 ×× 170 ×× 0000

ఇజ్రాయెల్‌ × 90 ×× 0000 ×× 90 ×× 0000

ఉ.కొరియా × 50 ×× 0000 ×× 50 ×× 0000

రెండవ ప్రపంచ యుద్దం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా జపాన్‌ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది.దాంతో మిగిలిన దేశాలు కూడా వాటిని సమకూర్చుకున్న కారణంగానే దాని దూకుడు తగ్గింది.అయినప్పటికీ దాని దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు ఉండటంతో అనేక దేశాలను ఇతరంగా బెదిరిస్తూనే ఉంది,దాడులు, దురాక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఎర్రగీత దాటితే అణ్వాయుధాలను మోహరిస్తానని ఉక్రెయిన్‌ పోరులో రష్యా హెచ్చరించిన కారణంగానే నాటో దేశాలు అదుపులో ఉన్నాయి.ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద అనేక కట్టుకథలను ప్రచారంలో పెట్టి ఇతర దేశాలను తన వెనుక సమీకరించుకొనేందుకు అమెరికా పూనుకుంది.వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజింగ్‌ తన అణ్వాయుధాలను వెయ్యికి పెంచుకోనుందని, వాటిని మోహరించటానికి ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం దానిలో భాగమే. ప్రతిదేశం మాదిరే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటున్నది.చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి మనదేశాన్ని కూడా ఆయుధ పోటీలోకి పశ్చిమదేశాలు దించుతున్నాయి. అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలకు ఖర్చు చేస్తే పాక్‌ మాదిరి దివాలాదీయటం ఖాయం. ఆయుధాలను అమ్ముకొనేవారు రకరకాల కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తే వేర్వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజంట్లు వాటికి మసాలా దట్టిస్తారు. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మనదేశం రక్షణ బడ్జెట్‌ను పెద్ద మొత్తంలో పెంచిన తీరు చూశాము.

ఆయుధ నియంత్రణ ఒప్పందం లేకపోవటంతో భారత్‌కు ఇబ్బంది వచ్చిందనే కొత్త పల్లవి కొందరు అందుకున్నారు. నిజానికి ఆ ఒప్పందంలో చైనా లేదు, అయినప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఆయుధాలు పెంచుకొనేందుకు పూనుకున్నందున మనం కూడా ఆలోచించాలని చెబుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ కూడా అమ్ములపొదిని విస్తరించుకోవచ్చంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ చైనాతో పోటీపడాలని చెప్పటం సరైందేనా ! మన దేశం నుంచి ముప్పు ఉందనే కారణంతో చైనా తన ఆయుధాలను పెంచుకోవటం లేదు, దాని కేంద్రీకరణ అంతా అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తదితర దేశాల మీదనే. అమెరికాతో అవసరానికి మించి ఆయుధ పోటీకి దిగటం కూడా సోవియట్‌ దెబ్బతినటానికి ఒక కారణంగా కొందరు చెప్పటాన్ని, చైనా, మన ఆర్థిక శక్తిని విస్మరించకూడదు.

వర్తమాన కాలంలో మిలిటరీ శక్తిలో అణ్వాయుధాలు ప్రముఖ పాత్రపోషిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృత్రిమ మేథ(ఎఐ) ఆయుధ పోటీని గణనీయంగా ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైన సెమీకండక్టర్ల రంగంలో అమెరికా-చైనా పోటీపడుతున్నాయి. ఏ రంగంలోనైనా అవి లేకుండా గడిచే స్థితి లేదు.శత్రువుల కదలికలను పసిగట్టటం, స్థావరాలను స్పష్టంగా ఫొటోలు తీయటంలోనూ అవి కీలకంగా మారాయి. చైనా తన సత్తాను చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో సెమీకండక్టర్ల రంగంలో ప్రస్తుతం తూర్పు ఆసియాలోని తైవాన్‌ ప్రాంతం, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రధానంగా ముందుండగా అమెరికా, ఐరోపా దేశాలు కూడా గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సెమికండక్టర్లను చైనాకు అందకుండా అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. విడిగా ఉంటున్న తైవాన్‌ విలీనం 2049 నాటికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించగా అడ్డుకొని తీరతామని, రక్షణగా సిలికాన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేస్తామని, ఒక వేళ బలవంతంగా విలీనం చేసుకుంటే అంతిమంగా అక్కడ ఉన్న సెమికండక్టర్‌ పరిశ్రమలన్నింటినీ పేల్చివేస్తామని కూడా వాషింగ్టన్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు తైవాన్‌ తమదే అని వెనక్కు తగ్గేది లేదని ప్రకటిస్తున్నది, తాను విధించిన గడువు చాలా సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి మిలిటరీ చర్యకు పాల్పడటం లేదు.ప్రస్తుతం అమెరికా వద్ద ఆధునిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ చిప్స్‌ తయారీలో కేవలం 12శాతమే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దాని అవసరాల కోసం ఎక్కువగా తైవాన్‌ మీద ఆధారపడుతున్నది. చైనాలో విలీనాన్ని అడ్డుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.మొత్తం మీద ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌ సగం, ఆధునిక చిప్స్‌లో 90శాతం కలిగి కీలకమైన స్థానంలో ఉంది. పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఈ పాటికి అమెరికా ఆ పని చేసి ఉండేది, అది సాధ్యం కాదని, వాటిలో పనిచేసే నిపుణులు కూడా తైవాన్‌లో గణనీయంగా ఉండటమే అని చెబుతున్నారు.మొత్తం 66శాతం ఉత్పాదక సంస్థలు తూర్పు ఆసియాలో 292 చోట్ల ఉన్నాయి.

మిలిటరీ రంగంలో ఏఐ లేదా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది.ప్రస్తుతం ప్రయోగశాలలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద వాటిని పరీక్షించారు, అయితే అధిక వేడి, శీతల ప్రాంతాల్లో వాటి పనితీరును చూడాల్సి ఉంది.అవసరమైన సంఖ్యలో తయారు చేసే సంస్థల అవసరం కూడా ఒక సమస్యే. జోబైడెన్‌ హయాంలో చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ నివిడియా కంపెనీ మీద ఆంక్షలు విధించారు. అయితే దాన్ని సవాలుగా తీసుకొని భారీ మొత్తాలను కేటాయించిన డ్రాగన్‌ తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఆధునిక రకాల కోసం పరిశోధనలు చేస్తున్నది. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత నిషేధాన్ని సడలించి ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ నివిడియా ఉత్పత్తి హెచ్‌-200రకం చిప్స్‌ తమకు అవసరం లేదని చైనా ప్రకటించినట్లు వార్తలు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించటం తెలిసిందే.ఒకవైపు పన్నుల యుద్ధం మరోవైపు సాంకేతిక రంగంలో అమెరికా దాడిని తట్టుకొనేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయటమే గాక అనేక విజయాలను సాధించి స్వయంసమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నది.చాట్‌జిపిటికి పోటీగా చాలా తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తన అవసరాలకు ప్రపంచ సరఫరా గొలుసు మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నది. ఎప్పుడైనా తైవాన్‌ విలీనం చేసుకుంటానంటూ చేస్తున్న ప్రకటనలతో సెమీకండక్టర్లకు దాని మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు దడపుట్టిస్తున్నది. బహుశా అందుకే తమ దేశంలో ఉత్పత్తి చేసే విధంగా 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను వమ్ము చేసేందుకు కృత్రిమ మేథలో ఇతరుల మీద ఆధారపడకుండా చైనా పూనుకుంది.2025 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా సమావేశం జరిపి కర్తవ్య నిర్దేశం చేసింది. ప్రభుత్వం దేశీయంగా ఉన్న పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్లను స్వయంగా తయారు చేస్తున్నప్పటికీ అమెరికాలోని నివిడియా కంపెనీ మాదిరి ఆధునిక డిజైన్లలో అది ఇంకా వెనుకబడే ఉంది. సాంకేతిక అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నది. ప్రపంచ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా మాదిరి సౌకర్యాలు కల్పిస్తూ 2025 అక్టోబరు నుంచి కె వీసాలను జారీ చేస్తున్నది.అమెరికాలో ఉన్న తన జాతీయులైన వారిని స్వదేశానికి రప్పిస్తున్నది. గతంలో అమెరికా విసిరిన సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు పోయిన చైనా కృత్రిమ మేథలో కూడా విజయం సాధిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d