• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: History

ఇరాన్‌పై అమెరికా దాడి : చర్చలు, కాల్పుల విరమణ నిరవధిక వాయిదా ?

22 Wednesday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, China, Donald trump, Hormuz mission, Iran nuclear weapon, Islamabad Talks, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చలు నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ వినతి మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నిర్ణీత వ్యవధిని పేర్కొనలేదు గనుక నిరవధికం అనుకుంటున్నారు. మాటమార్చి మరోసారి ఏ చెబుతాడో తెలియదు. చర్చలంటూనే వివిధ దేశాల్లో ఉన్న 14 మంది ఇరానియన్లు, సంస్థలపై కొత్తగా ఆంక్షలను ప్రకటించాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో ఇరాన్ను దారికి తేవాలని చూస్తే కుదిరేది కాదని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌ ప్రయాణ సన్నాహాలు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వాయిదా వేసుకున్నాడు.బుధవారం నాడు చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా గొంతెమ్మ కోరికలను ముందుకు తెస్తోందని, ఇలాంటి స్థితిలో చర్చలంటే సమయం వృధాతప్ప మరొకటి కాదంటూ చర్చలుకు వచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం ముగిసేవరకు మాటల్లేవని అన్నది. కాల్పుల విరమణ పొడిగింపు గురించి గురువారం ఉదయం వరకు ఇరాన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పేరుతో అమెరికా బలగాలను కూడగట్టుకుంటున్నదని గతంలోనే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మిలిటరీకి అనుకూలంగా టెహరాన్‌లో జనం వీధుల్లోకి వచ్చారు, ఈ సందర్భంగా ఒక ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగ వాహనాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌ వద్ద దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇప్పటికీ వేలాదిగా ఉన్నాయని అమెరికా రక్షణశాఖ గూఢచార నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రత్యర్ధుల క్షిపణులను కూల్చివేసే అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థలు సగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు.తాను విజయం సాధించినట్లు కూడా చెప్పుకున్నాడు.గడువు పొడిగించేది లేదన్నాడు.తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు.ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపించారు.నిజమే నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోందంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

పశ్చిమాసియా సంక్షోభం బుధవారం నాటికి 54వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు.శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు.దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.నిజం ఏమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి,మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించుకోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు.ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు.చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే.ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జలసంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూ తేల్చకుండా పరిణామాలను గమనిస్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనుండగా పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండు సార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒక దేశ రేవు నుంచి బయలు దేరిన అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు నడిపేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 54 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు.అదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు.పట్టుసాధించటమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్దరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది.పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది.సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచ వ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు.గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి.ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరువాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది.పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయెల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది.ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం !బ్‌ ూ్‌శీషసర

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మాహుతిదళ బుడిబుడి రాగాలు – భారత మహిళలకు దొంగనక్క క్షమాపణలు !

19 Sunday Apr 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Delimitation bill 2026 India, Donald trump, Emotional blackmail, Narendra Modi Failures, pavan kalyan, RSS, women reservation, YS jagan

!ఎం కోటేశ్వరరావు

దేశంలో సరికొత్త నాటక రాజకీయాలు అదీ మరోసారి మహిళల పేరుతో మొదలయ్యాయి.ప్రతిపక్షాల మద్దతు లేకుండా వీగిపోతుందని తెలుసు. వేదగణితం ప్రకారం కూడా మూడింట రెండువంతుల మెజారిటీ పాలక కూటమికి లేదు. అయినా కనీసం మాటమాత్రంగా సంప్రదింపులు జరపని అపర ప్రజాస్వామిక వాదులతో కూడిన ఎన్‌డిఏ పక్షాల కారణంగా నారీశక్తి ముసుగులో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయింది.నారీ బిల్లు వీగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టమై గజెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఓడిపోయింది మోడీ మరియు మద్దతు ఇచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహనరెడ్డి బిల్లు మాత్రమే.కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతున్నారు.బిల్లును ఓడించిన పార్టీలు తాము ఏమి సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోడీకి మద్దతు ఇచ్చి వ్రతం చెడినా ఫలం దగ్గని ఆ పెద్దమనిషి తానేమి సాధించారో చెప్పాలి. పచ్చి అబద్దాలతో ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50శాతం పెంపుదలను ఆమోదించి ఉంటే అన్నారు. బిల్లులో అలాంటి పదజాలం ఉందో లేదో కూడా సరిచూసుకోకుండా జనాన్ని, తన గణాలను తప్పుదారి పట్టించారు. బిల్లును ఓడించారంటూ బుడిబుడి రాగాలు తీస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలతో కలసి వైసిపి నాయకులు కూడా సామూహిక రోదన కార్యక్రమాల్లో పాల్గ్గొని ఉంటే జగన్‌ వ్రతం సంపూర్ణం అయి ఉండేది.దీన్లో కూడా ఎటూ కాకుండా పోయారు.నిడదవోలులో మూడు పార్టీల కూటమి దుకాణం పెడితే దానికి దగ్గరలో అయినా మోడీ ఓదార్పు యాత్రను జగన్‌ చేపట్టి ఉంటే సార్ధకనామధేయుడై ఉండేవారు. దక్షిణాది, కుటుంబనియంత్రణ పాటించిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవటమే ప్రతిపక్షాలు సాధించిన అంశం. ఇది కూడా అర్ధంగాక పోతే ఎక్కడైనా చికిత్సకు చేర్చటం మంచిది.

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం, మెప్పు పొందటంలో దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని చెప్పవచ్చు. ఎదుటివారికి కన్ను కొడుతూ వేరే వారితో సంబంధాలు నెరపటంలో దిట్ట. నిడదవోలు ప్రసంగంలో యుపిఏ పాలనలో మహిళా రిజర్వేషన్‌ గురించి పట్టించుకోలేదని చెప్పారు, సరే, 2014 నుంచి 2023వరకు తొమ్మిదేండ్లు నరేంద్రమోడీ ఏం చేశారన్న ఒక్క ముక్క నోటి నుంచి రాలేదు.రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన తరువాత కూడా గురువారం రాత్రి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయని నిర్వాకం గురించి ప్రశ్నించలేదు. ”నోటిఫికేషన్‌” ప్రాధాన్యత ఏమిటో అమరావతి గురించి చూసిన తరువాత చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదు.తెలుగుదేశం ఉప్పు తిని విశ్వాసంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో జర్నలిస్టు ఆర్‌కె జగమెరిగిన బ్రాహ్మణుడు. ఏం చేద్దాం బ్రదర్‌ అని చంద్రబాబు అడిగి ఉంటే ఏ సలహా చెప్పేవారో ఆదివారం నాటి కొత్త పలుకు చూసిన తరువాత అర్ధం అవుతుంది.” కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని స్థితి ” అని రాశారు. చంద్రబాబు నాయుడిని చూసి జగన్‌మోహనరెడ్డి సానుభూతి చూపాల్సిన దుస్థితి. అవున్లే బాబుకే తెలియకపోతే దేనికైనా మద్దతు అని ప్రకటించిన వైసిపి నేతలను కనీసం ఈ విషయంలో అయినా తండ్రీ కొడుకులు ఓదార్చి ఉండాల్సింది. తనతో సంప్రదింంచకుండా మోడీ ఏపనీ చేయరనే ధీమాతో ఉన్న చంద్రబాబు ”కేంద్రమంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ట్రాలలో 50శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు ” అని ఆర్‌కె ముక్తాయించారు. ఆ ముక్క అసలు బిల్లులో పెట్టలేదని తన పత్రికలోనే రాసిన విషయం తెలియదని అనుకోవాలా ? చంద్రబాబుకు సైతం తెలియదని రాయటం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి ? తెలిసి ఉంటే బాబుగారు జాగ్రత్తపడి ఉండేవారు అని భజన చేయటం కావచ్చు.లేకపోతే మీ మద్దతు తీసుకోవటం తప్ప మీరంటే మోడీకి లెక్కలేదు అని ఇరుకునపెట్టటానికి రాసి ఉండవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చన్న సంభాషణను గుర్తుకు తెచ్చుకోవాలి. కలానికి, కత్తికి రెండు రకాల పదను, ప్రయోజనం దాగి ఉంటుంది.ఆర్‌కె ఏ లక్ష్యంతో రాసినప్పటికీ అది ప్రచురితంగాక ముందు మోడీని బలపరిచిన తెలుగుదేశం, జనసేన వీరాభిమానులందరూ చదివిన తరువాత తమ నేత పలుకుబడిని చూసి నీరులేని బావులను చూసుకొని ఉండి ఉండాలి. ఆత్మగౌరవం, అన్న ఎన్‌టిఆర్‌ అని జపం చేసే వారందరూ ఆర్‌కె వ్యాఖ్యానం చదివిన తరువాత కూడా మామూలుగానే భజన కొనసాగిస్తుంటే చంద్రబాబు నాయుడి మాదిరి ” స్థితప్రజ్ఞత ” సంతరించుకొని ఉండాలి.చంద్రబాబు నాయుడు కూడా బ్యూరోక్రాట్‌ మాదిరి వ్యవహరించారని ప్రవచించిన ఆర్‌కెకు అంతకు మించిన పెద్ద బ్యూరోక్రాట్‌ మోడీ గురించి తెలియదనుకోవాలా ? తమను బలపరచటం తప్ప బాబుకు మరోదారి లేదన్నదే మోడీ ధీమా ! గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మింగివేసిన మోడీకి ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని స్వాహా చేయటం చిటికెలో పని. చంద్రబాబు అండ్‌కోకు మోడీ ఏం చేసినా బలపరచటం తప్ప మరో మార్గం లేదు. అందుకే అన్నీ తెలిసి రాజ్యాంగసవరణ బిల్లును బలపరచి తన కాళ్లను తానే నరుక్కొనేందుకు కూడా సిద్దపడక తప్పలేదు.

భవిష్యత్‌లో కూడా జనాభా ప్రాతిపదికన అది 2011 అయినా 2027 లెక్కల ప్రకారమైనా లోక్‌సభ సీట్లను కేటాయించాలని చూస్తే మరోసారి ఇదే సమస్య పునరావృతం అవుతుంది.కుటుంబనియంత్రణ పథకాన్ని అమలు చేసిన తరువాత 1961-71 జనాభాలెక్కల్లో వెల్లడైన వ్యత్యాసాన్ని గమనించి ఇందిరాగాంధీ ముందు చూపుతో రాజ్యాంగ సవరణద్వారా 25 సంవత్సరాల పాటు లోక్‌సభ సీట్ల పెంపుదలను స్థంభింప చేశారు. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసి మూర్ఖపు చర్యతో అంతకు ముందు తమిళనాట తలెత్తిన నిరసన ఏమిటో ఆమెకు అవగతం అయింది.తరువాత వాజ్‌పాయి కూడా ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడిన కారణంగా ఆ కందిరీగల తుట్టెను కదిపేందుకు సాహసించలేదు. మరోసారి పాతిక సంవత్సరాల స్థంభన విధించారు.తన రూటే సపరేటు(ఇతరుల మార్గంలో నడవను) అన్నట్లుగా మోడీ వ్యవహరించారు.ఇరాన్‌తో వ్యవహారంలో జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అతితెలివి తీరును చూస్తున్నాం.బిజెపి నేతలు కూడా అదే చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చింది.దాన్ని ఎవరూ మార్చలేరు. అయినా సవరణ బిల్లు పేరుతో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం, కొన్నింటికి విపరీత లబ్దికలిగే పద్దతిలో సంఖ్య పెంచి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లంకెపెట్టటమే అసలు వివాదానికి కారణమైంది. మహిళల పేరు చెప్పి భావోద్వేగపూరిత బెదిరింపులకు(ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)పూనుకున్నారు. మీరు గనుక మేం చెప్పినట్లు ఆమోదించకపోతే మాకే లాభం అన్నారంటేే అర్ధం ఏమిటి ? మీ గురించి వ్యతిరేకతను రెచ్చగొడతాం అని చెప్పటమే.చిత్తశుద్ది ఉన్నవారెవరైనా అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే వేరే పదజాలాన్ని ఉపయోగిస్తారు. పెంచిన 50శాతం సీట్లను రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల దామాషా ప్రకారం కేటాయిస్తామంటే గుడ్డిలో మెల్లమాదిరి అన్ని పార్టీలూ అంగీకరించి ఉండేవి.

అసలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదన లేక ముందు అమిత్‌షా మొదలు బిజెపి గల్లీ లీడరు వరకు అన్ని రాష్ట్రాలకు అలాగే పంచుతామని చెప్పారు. తీరా బిల్లులో ఆ ప్రస్తావనే లేదు.రెండు రోజులు పాటు పార్లమెంటులోపలా వెలుపలా ప్రభుత్వ ప్రతిపాదనతో కొన్ని రాష్ట్రాలకు గలిగే నష్టం, లబ్ది గురించి వివరంగా చర్చ జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా సరిగ్గా ఓటింగ్‌కు వెళ్లే ముందు(తొలుత సాయంత్రం నాలుగు అన్నారు, తరువాత ఆరు, మరోసారి ఏడు అన్నారు) అమిత్‌షా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టి మీరు గనుక మా షరతుకు అంగీకరిస్తే 50శాతం చేరుస్తామని అన్నారు. అంతకు ముందు బిజెపి నేతలు ఇరవై నాలుగు గంటలపాటు అలాంటి లీకులు ఇచ్చారు, చివరికి తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదే చెప్పారు.అయినా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా నాటకమాడారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు 2023 నుంచి గజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గురువారం రాత్రి ప్రకటించారు. స్వంత మిత్రులనే తప్పుదారి పట్టించి మోసం చేసిన బిజెపి మంత్రుల మాటలను ఎవరు నమ్ముతారు.చివరికి అదే జరిగింది.బిల్లు ఓడిపోయింది. అలాంటి పరిణామం జరుగుతుందని ముందే తెలుసుగనుకనే వారు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే నినాదాలతో కూడిన ప్లకార్డులను సిద్దం చేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో దాచబట్టే వెంటనే నిరసనపేరుతో వీధుల్లో ఊరేగారు. ఇప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాలకు వదలివేసి 543 స్థానాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలుకు పూనుకోవాలి.2023 చట్టంలో తదుపరి జనాభా లెక్కల తరువాత అమలు అని లంకె పెట్టినందున దాన్ని సవరించేందుకు ఇప్పుడు జరుగుతున్న జనాభాలెక్కల ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను మార్చకుండా పునర్విభజన చేసేందుకు చట్టసవరణ చేయాలి.అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.మహిళలూ క్షమించండి అంటూ ప్రకటించిన మోడీ చిత్తశుద్దికి ఇప్పుడు పరీక్ష ఎదురుకానుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా ముందుగానే జన సంఖ్య ఎక్కడ ఎంత అనేది స్పష్టం అవుతుంది గనుక దానికి అనుగుణంగా లోక్‌సభ, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇక నరేంద్రమోడీ క్షమాపణల చిత్తశుద్ది బండారం గురించి చెప్పుకోకపోతే సంపూర్ణం కాదు. ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలలో ఒకటి కనీస మద్దతు ధరలకు చట్టబద్దత.మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చినప్పటికీ తాను ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మిగతా వాగ్దానాల మాదిరే దాన్ని కూడా విస్మరించారు.అయితే రైతుల ఆందోళనను చల్లార్చేందుకు మద్దతుధరల చట్టబద్దత పరిశీలన పేరుతో 2021నవంబరు 19న ఒక కమిటీని ప్రకటించారు.దానికి 2022 జూలై 22న సభ్యులను ఎంపిక చేశారు.త్వరలో నాలుగో వార్షికోత్సవం జరుపుకోనుంది.అసలా కమిటీ ఏమి చేస్తున్నదో, సమావేశాల పేరుతో కాలక్షేపం, టిఏ, డిఏలు తీసుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదు. జరిగిన ప్రతి సమావేశమూ అసంపూర్ణమే, 35 ఉపసంఘాల సమావేశాలు జరిగాయి.చివరి సమావేశం చాలా కాలం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కమిటీలో ఉన్న అధికారగణ సభ్యులు మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలను అమలు జరపటానికి విముఖత చూపటంతో ఇతర కమిటీ సభ్యులు తీవ్రంగా విబేధించినట్లు నిర్దారణగాని వార్తలు. కనీస మద్దతు ధర ఎక్కడైనా రైతులకు దక్కాల్సిందేనని ఐదుగురు సభ్యులు కమిటీ చైర్మన్‌ మీద వత్తిడి తెచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. నివేదిక ఇవ్వాలని మోడీ సర్కార్‌ అడగలేదు, అసలా కమిటీకి ఒక నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదు.రైతుల్లో మహిళలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిజర్వేషన్లు, కనీస మద్దతు ధరలకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఆర్థికంగా ఒరిగేదేమీ లేదు. అదే పంటల కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తే కోట్లాది మంది మహిళా రైతుల జీవితాలు కాస్త మెరుగుపడతాయి.ఈ విషయంలో చిత్తశుద్దిలేని మోడీ సర్కార్‌ ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లను ఎలా అమలు జరుపుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సూక్ష్మంలో మోక్షం : అచ్చేదిన్‌ అర్ధం ఏమిటి శిష్యా ! ” మోడీ గోవు ” పాలు అదానీ, అంబానీలకు, పేడ, మూత్రం భక్త జనాలకు గురువా !!

11 Saturday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Acche Din Modi, BJP, CHANDRABABU, India Super Rich, inequality, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు

అదానీ, అంబానీ,గూగుల్‌, అమెజాన్‌లకు ప్రజల సొమ్మును రాయితీల రూపంలో ఇస్తే అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లు ఏడవకండి. ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు జనాన్ని ఏమార్చే ఊసరవెల్లులు రంగులనే కాదు, సిద్దాంతాలను కూడా మార్చివేస్తున్నారు. వాస్తవాలను తలకిందులుగా చూపితే కొందరు తమ మెదళ్లను అలాగే ఉంచుకొని నిజమే అంటారు. సంపద సృష్టికర్తలు జనం.కానీ కొందరు ముందు చెప్పుకున్న కంపెనీల వంటివే సృష్టికర్తలని చెబుతూ వాటికి సర్వం సమర్పించుకుంటున్నారు. దాన్ని సమర్ధించుకొనేందుకు ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు.ఈ సిద్దాంతం ఎప్పుడు వచ్చింది. దోపిడీ పెరిగిపోయి భరించలేని స్థితిలో కార్మికవర్గం, రైతాంగం తిరగబడి రష్యా,చైనా, మరికొన్ని దేశాలలో సోషలిస్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.జనం వాటికి ఆకర్షితులు కావటాన్ని గమనించి 1960దశకంలో ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. సూక్ష్మంలో మోక్షంలా ఒక్క ముక్కలో చెప్పాలంటే సంపదలను పెరగనిస్తే వాటి ఫలాలు క్రమంగా ఊటనీరులా సమాజంలోకి దిగుతాయి.అందరికీ ఉపయోగం. దీన్ని ఎవరైతేనేం మహానుభావులు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు,రాహుల్‌ గాంధీ, రేవంతరెడ్డి, కెసిఆర్‌, స్టాలిన్‌, అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి అండ్‌కో గట్టిగా బలపరుస్తారు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా జరుగుతున్నది తద్విరుద్దంగా ఉంది.

తాజాగా ” భారత సంపదల గుర్తింపు నివేదిక 2026 ” (వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా రిపోర్టు 2026) ప్రకారం మనదేశంలో సంపన్నుల్లో అగ్రభాగాన ఉన్న 1,688 మంది సంపద దేశ జిడిపిలో సగానికి సమానం. ఇంత అసమానత, కేంద్రీకరణ బ్రిటీష్‌ వారి కాలంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనూ లేదు.1980దశకం వరకు కూడా నేడున్నంత తీవ్రంగా లేవు. ఊట సిద్దాంతం చెప్పటం ప్రారంభించిన తరువాత కిందికి బదులు సంపద పైకి చేరుతున్నది.ఈ 1,688 మంది కలవారి మీద రెండు నుంచి ఆరుశాతం సంపద పన్ను విధిస్తే ఏటా పదిలక్షల కోట్ల రూపాయల వరకు రాబడి వస్తుందని, ఆ మొత్తాన్ని సంక్షేమానికి వినియోగించవచ్చని సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఎకౌంటబులిటీ -సిఎఫ్‌ఏ (ఆర్థిక జవాబుదారీతన కేంద్రం) రూపొందించిన సదరు నివేదిక పేర్కొన్నది.ఎప్పటికైనా వామపక్షాలు అధికారానికి వచ్చి పిల్లిమెడలో గంట కట్టాల్సిందే తప్ప మిగిలినవారెవరూ అలాంటి ఆలోచన కూడా చేయరు. మరోవైపు నిధుల కొరత గురించి శ్రీరంగ నీతులు చెబుతారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు సవరించేందుకు ముందుకు రారు. గూగుల్‌ వంటి ధనిక సంస్థలకు వేల కోట్ల రూపాయలు రాయితీలుగా ఇచ్చేందుకు తాంబూలాలు ఇచ్చేశారు.రేవంత రెడ్డి బాట కూడా అదే. పన్నెండేండ్ల క్రితం నరేంద్రమోడీ చెప్పిన కబుర్లలో అచ్చేదిన్‌(మంచి రోజులు ) ఒకటి.దేశంలో మోడీని చూసి ఓట్లు వేసిన ఎవరికైనా ఐదు సంవత్సరాల్లో రాబడి 400 శాతం పెరిగిందా ? మోడీ మద్దతు ఉన్న అంబానీ, అదానీ, జిందాల్‌,శివనాడార్‌, సునీల్‌ మిట్టల్‌ వంటి వారికి 2019-25 సంవత్సరాలలో సంపదలు దాదాపు 400శాతం పెరిగాయి.వాటిలోంచి కొంత తీసి ఎన్నికల బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలను బిజెపికి కట్టబెట్టారు.అనధికారికంగా సమర్పించుకున్న మొత్తాలకు లెక్కలేదు.ఎంత డబ్బు లేకపోతే కేరళలోని పాలక్కాడ్‌లో బిజెపి మద్దతుదారులు ఓటుకు ఐదువేల రూపాయలు ఎలా పంచగలిగారు ?

నూతన ఆర్థిక విధానాలకు ఆద్యులం మేమే అని కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకుంటుంది. వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఖ్యాతి మాదే అని బిజెపి ఢంకా బజాయించి మరీ బాకాలూదుతున్నది.వందకోట్ల డాలర్ల సంపద కలిగిన శ్రీమంతుడు 1991దేశంలో ఒక్కరే, అలాంటిది ఇప్పుడు 358 మంది ఉన్నారు.నివేదికలో పేర్కొన్న 1,688 మంది సంపద విలువ 166లక్షల కోట్లు, ఇది మన జిడిపిలో దాదాపు సగం. దేశంలోని ఎగువ ఒక శాతం మంది సంపద 2019లో 36.5శాతం ఉండగా 2022 నాటికి 40.1శాతానికి పెరగ్గా ఇదే కాలంలో దిగువ 50శాతం మంది వాటా 6.8 నుంచి 6.4శాతానికి దిగజారింది. అచ్చే దిన్‌ ఎవరికి ? ఇక వెయ్యి కోట్లకు మించి ఆస్తులున్న వ్యక్తుల సంఖ్య 2019-25 మధ్య 77శాతం పెరగ్గా, వారి సంపద (31లక్షల కోట్ల నుంచి 88లక్షల కోట్లకు) 227శాతం పెరిగింది.వీరిలో అదానీ ఆస్తి 625, ముకేష్‌ అంబానీ సంపద 153శాతం పెరిగింది.కేంద్ర ప్రభుత్వం వారిపట్ల ఎలాంటి సానుకూలత, అభిమానం చూపకుండానే స్వంతంగా చెమటోడ్చి పెంచుకున్నారని చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి.ఈ అపర కుబేరుల మీద పన్ను వేస్తే వచ్చే అదనపు రాబడితో విద్య, వైద్యం వంటి సేవలకు జిడిపిలో అదనంగా ప్రతి రంగానికి ఒక్కో శాతం ఖర్చు పెంచవచ్చు, వృద్దు లందరికీ నెల నెలా పన్నెండు వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వవచ్చు.మానవత్వం ఉట్టి పడే నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ ఎంతో తెలుసా ? 80 ఏండ్ల లోపు వారికి నెలకు రు.200, ఆపైబడిన వారికి రు.500, వితంతువులకు రు.500, వికలాంగులకు రు.300-500 మాత్రమే. మోడీ ఏలుబడిలో ఒక్క పైసా కూడా పెంచలేదు. అంతకు ముందు యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాలనే ఇస్తున్నారు. అంతకు మించి ఇస్తున్నారంటే అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉదారత్వమే.ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న నాలుగువేలు, తెలంగాణాలో ఉన్న రెండువేలల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రెండు, ఐదు వందలు మాత్రమే. అందుకే ఎప్పుడూ ఈ పెన్షన్లలో మా మోడీ గురించి చెప్పరేం అని ఏ ఒక్క బిజెపి నేతా డిమాండ్‌ చేయరు.

అపర కుబేరుల మీద సంపద పన్ను విధిస్తే ఏం చేయవచ్చో కూడా నివేదిక పేర్కొన్నది.అంబానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశంలో ఉన్న 185 లక్షల మంది పదవ తరగతి విద్యార్ధులకు మూడేసి లాప్‌టాప్‌లు ఉచితంగా ఇవ్వవచ్చు. లేదా 2.85కోట్ల మంది తల్లులకు రెండు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేయవచ్చు.ఏడాదికి రు.18వేలు ఇస్తే అయ్యే ఖర్చు సంవత్సరానికి రు.51,300 కోట్లు.అదానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశమంతటా రెండు సంవత్సరాల పాటు ప్రాధమిక ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చు లేదా 87 కోట్ల గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇవ్వవచ్చు.లేదా ఎనిమిది కోట్ల కుటుంబాలకు చెడు గాలి నుంచి రక్షణకు శుద్ధి చేసే పరికరాలను ఉచితంగా అందించవచ్చు.సావిత్రీ జిందాల్‌ నుంచి వసూలు చేసే పన్నుతో దళితులు, గిరిజన విద్యార్ధులకు కొన్ని సంవత్సరాలపాటు స్కాలర్‌షిప్పులు ఇవ్వవచ్చు.లేదా పదివేల రూపాయల చొప్పున రెండున్నర కోట్ల మంది బాలికలు తమ విద్యను మెరుగుపరుచుకొనేందుకు ఇవ్వవచ్చు.కార్పొరేట్‌లు, వ్యక్తులకు పన్నుమినహాయింపులు ఇస్తున్న కారణంగా ఆ భారాన్ని సామాన్యులు భరిస్తున్నారు. గత పదకొండు సంవత్సరాల్లో కార్పొరేట్లకు రు.19.6లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. అయితే రికార్డుల్లో వాటిని పారుబాకీలుగా చూపుతారు తప్ప రద్దు చేసినట్లు ఉండదు.మన దేశం జి 20 కూటమిలో భాగస్వామి. జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ అనే ఆర్థికవేత్త నాయకత్వంలో ప్రపంచ అసమానతల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేశారు.అసమానతల పెరుగుదల విధానపరంగా ఎంచుకున్న అంశమని, సంపద పెరిగే కొద్దీ పన్ను మొత్తాలను పెంచే విధంగా ఆ విధానాన్ని మార్చాలని కమిటీ నివేదిక పేర్కొన్నది.కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? అసమానతలను తగ్గించాలని మన రాజ్యాంగమే చెప్పింది.అధికారంలో ఎవరున్నా దాన్ని తుంగలో తొక్కారు.చివరకు మోడీ సంపదపన్నునే రద్దు చేశారని సదరు నివేదిక వ్యాఖ్యానించింది.ఎందుకయ్యా అంటే వసూలు చేసే పన్ను కంటే అందుకయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని చూపారు.చట్టంలో లోపాలు ఉన్నాయన్నారు.ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వాటిని చంపటం కంటే ఇల్లుతగులబెట్టటమే లాభదాయకమని చెప్పినట్లుగా ఉంది.చట్టాల్లో ఉన్న అనేక లోపాలను సరిచేస్తున్నామని చెప్పిన వారు ఈ చట్టాన్ని ఎందుకు సరి చేయలేదు ? 1957 చట్టం ప్రకారం రు.30 లక్షల సంపద మీద ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.దాన్ని రద్దు చేసి ఒక కోటికి మించి రాబడి ఉన్నవారు చెల్లించే పన్ను మీద రెండుశాతం సర్‌ఛార్జి విధిస్తున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల రాబడిలో మినహాయింపులన్నీ పోను 20లక్షలకు పన్ను చెల్లించాల్సి వస్తే దాని మీద రెండుశాతం విధిస్తారు. ధనికులకు ఎన్ని రాయితీలు కల్పిస్తున్నారో చూడండి.

దేశంలో అసమానతల గురించి సిఎఫ్‌ఏ ప్రచార విభాగ డైరెక్టర్‌ అనిర్భన్‌ భట్టాచార్య మాట్లాడుతూ ” నేడు రెండు భారత్‌లు ఉన్నాయి.ఒక భారత్‌లో ఎగువన ఉన్న వేళ్లమీద లెక్కించదగిన కొద్ది మంది సంపదలు లక్షల కోట్లుగా పెరుగుతుంటే మరో భారత్‌ అప్పులపాలవుతున్నది ” అన్నారు. ” నోట్ల రద్దు మొదలు కరోనా మహమ్మారి వరకు గత పదేండ్లుగా బతకాలంటే ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని జనాలకు చెప్పిన వారు ఇప్పుడు ఎల్‌పిజి-బొగ్గు గురించి కూడా అడగవద్దంటున్నారని” ధనికుల మీద పన్నువేయాలనే ప్రచార కర్త రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు.కష్టపడే సామాన్యులు రోడ్ల మీద వరుసల్లో నిలుస్తుంటే దేశంలోని అపరకుబేరులకు దోపిడీ కొనసాగించేందుకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారని కూడా అన్నారు. నివేదిక రూపకల్పనలో భాగస్వామి జాకబ్‌ జోషి మాట్లాడుతూ ఆందోళనకర స్థాయికి సంపద కేంద్రీకరణ పెరిగినప్పటికీ విధానపరమైన చర్చలో దాని ఊసే లేదన్నారు. అసమానతలు సాధారణం అయ్యాయని, సంపదపన్ను అద్భుతాలు చేస్తుందని కాదు గానీ పేదల మౌలిక హక్కుల అమలుకు కొంత మేర దోహదం చేస్తుందని కూడా చెప్పారు. అసమానతలు పెరిగితే ఏమౌతుంది ? మానవాభివృద్ది దిగజారిపోతుంది. ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవదిగా తీసుకురావటం తమ ఘనత అని బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది.కాసేపు అంగీకరిద్దాం.తలసరి జిడిపిలో సంగతేమిటి ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ 2025 సమాచారం ప్రకారం చైనా 13,806 డాలర్లతో 99వదిగా ఉంది, మనదేశం 2,818 డాలర్లతో 166వదిగా ఉంది.మానవాభివృద్ది సూచికల్లో 2012లో 136వ స్థానం నుంచి మోడీ అధికారానికి వచ్చిన 2014లో 130వదిగా కాస్త పెరిగింది.సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ పాలనలో 2025లో కూడా 130వదిగానే ఉంది.సాధించిన అభివృద్ది ఏమిటి ? ఇంక మోడీ ప్రత్యేక ఏముంది ! కాషాయదళాలు చెప్పే ఆవు పాలు అంబానీ, అదానీలకు పేడ, మూత్రం జనాలకు పంచితే ఇదే జరుగుతుంది.మానవాభివృద్ది సూచికలో చైనా 0.797 పాయింట్లు కలిగి ఉంటే మనదేశం 0.685 దగ్గర ఉంది.అసమానతలు పెరిగే కొద్దీ ఆ సంఖ్య పెరగదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మట్టికాదోరు మనుషులోరు అన్నది నిజం కావాలంటే సంపదలు కేంద్రీకృతమైతే కుదరదు. పిండికొద్దీ రొట్టె అన్నట్లుగా ఆదాయం ఉంటేనే ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవనం సాధ్యం.సర్వేజనా సుఖినోభవంతు అంటే చాలదు, అందుకు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌ చెప్పిందే నిజమా : అడ్డంతిరిగిన అమెరికా ! సందిగ్దంలో ఒప్పందం !

09 Thursday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Netanyahu, US attack Iran, US-Iran Truce

ఎం కోటేశ్వరరావు

అమెరికా, డోనాల్డ్‌ ట్రంప్‌ నమ్మక ద్రోహులని ఇరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. రెండువారాల పాటు ఇరాన్‌పై దాడులను విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రకటన వెలువడింది. దానికి ప్రతిగా హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాను సమర్ధిస్తానని అయితే దానిలో లెబనాన్‌పై దాడులకు సంబంధించిన అంశం లేనందున దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని సందిగ్దంలో పడవేసింది. ఇరాన్‌తో కుదిరిన అవగాహనలో లెబనాన్‌పై కాల్పుల విరమణ అంశం లేదని బుధవారం నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటించాడు. దీంతో అమెరికా ఆడిన నాటకం బట్టబయలైంది. ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైంది. ఒప్పందానికి తూట్లు పొడిచి ఇరాన్‌ మీద నెపం మోపేందుకు ట్రంప్‌ యంత్రాంగం అతి తెలివి ప్రదర్శించింది. అమెరికాకు అందచేసిన పది అంశాల్లో ఒకటిగా లెబనాన్‌ మీద దాడుల నిలిపివేతను ఇరాన్‌ స్పష్టంగా పేర్కొన్నది.అదేమీ తెలియనట్లు జెడి వాన్స్‌ మాట్లాడటం మోసకారితనమే. ఒప్పందం జరిగిన రోజే లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ వందలాది మందిని చంపింది. దీనికి ప్రతిగా తెరిచిన హార్ముజ్‌ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.రెండో రోజు గురువారం నాడు కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగాయి.దానికి ప్రతిగా ఇరాన్‌, లెబనాన్‌లోని హిజబుల్లా కూడా దాడులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి కుదిరిన ఒప్పందం విఫలమైనట్లే కనిపిస్తోంది. దానికి పూర్తి బాధ్యత ట్రంప్‌దే. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు అమెరికా కనుసన్నలలో పనిచేసే ఇజ్రాయెల్‌ దాడులకు వాషింగ్టన్‌ అనుమతి ఉందన్నది నిర్వివాదం.

తాజా అంశాలకు ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకుందాం. పోరు ఇంకా ముగియలేదని తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌ మీదనే(తుపాకి గుండు బయటకు రావాలంటే నొక్కాల్సిన మీటను ట్రిగ్గర్‌ అంటారు) ఉన్నాయని ఇరాన్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటన తరువాత రెండు వైపుల నుంచీ దాడుల వార్తలు లేవు.ఇరాన్‌ ప్రతిఘటనతో గుక్కతిప్పుకోలేని అమెరికా వ్యూహాత్మకంగా ఈ అవగాహనను అంగీకరించిందా ? ఈలోగా తన బలగాలను మరింతగా కూడదీసుకుంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఏకపక్షంగా గడువులను ప్రకటించిన ట్రంప్‌ ఆ సమయంలో అన్ని రకాల దళాలను అదనంగా పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యానికి తరలించి భూతల దాడులకు సన్నాహాలు చేశాడు.ఒక్క రాత్రితో ఇరాన్‌ నాగరికతను నాశనం చేస్తానని మాట్లాడిన సంగతి తెలిసిందే.అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్ట ఆలోచన గురించి ఎలాంటి భ్రమలు లేనప్పటికీ ఎంతో సంయమనం,దూరదృష్టితో ఇరాన్‌ ప్రతిఘటన నిలిపివేతకు అంగీకరించింది. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా పదిహేను అంశాలు, ఇరాన్‌ పది ప్రతిపాదనలను అందచేశాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత రెండువారాల వ్యవధిలో వీటి గురించి చర్చలు జరుగుతాయి. ఎవరు వేటిని అంగీకరిస్తారు, తిరస్కరిస్తారు అన్నది చర్చల ప్రారంభం తరువాత మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఈ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నవే.రెండు దేశాలూ వాటిని తిరస్కరించాయి.అందువలన ఇప్పుడేమి జరగనుందనే ఉత్కంఠ సహజంగానే ప్రపంచమంతటా తలెత్తింది.

అమెరికా 15ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. తక్షణమే నెల రోజుల కాల్పుల విరమణ జరగాలి, అన్ని చర్యలు నిలిపివేసి ముఖాముఖీ చర్చలు పాకిస్తాన్‌లో జరిపేందుకు అవకాశం కల్పించాలి.ఇరాన్‌లోని నాటంజ్‌, ఇష్‌ఫహాన్‌, ఫోర్డో అణుకేంద్రాలను శాశ్వతంగా ధ్వంసం చేయాలి. ఇరాన్‌ గడ్డమీద యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి.శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ (ఐఏఇఏ) పర్యవేక్షణలో మరోదేశానికి తరలించాలి.ఇరాన్‌లోని అన్ని మిలిటరీ, పౌరకేంద్రాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఐఏఇఏ నిరాటంక తనిఖీకి అనుమతించాలి.హార్ముజ్‌ జలసంధిని తటస్థ ప్రాంతంగా చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతించాలి.బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిని పరిమితం చేసి సంఖ్యను తగ్గించుకొని ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించాలి.హిజబుల్లా, హౌతీల వంటి సాయుధ బృందాలకు నిధులు, ఆయుధాల అందచేత నిలిపివేయాలి. నిర్బంధంలో ఉన్న విదేశీ పౌరులందరకీ, ద్వంద్వ పౌరసత్వం ఉన్న అందరికీ స్వేచ్చ నివ్వాలి.అమెరికా ఆస్తులు మరియు పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక ఒప్పందానికి రావాలి.సమగ్రమైన ఆంక్షల నుంచి ఊరట, ప్రాధమిక,ఇతర ఆంక్షలు పూర్తిగా తొలగింపు.విదేశాల నుంచి సేకరించే ఇంధనంతో బుషేహర్‌లో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రానికి అమెరికా మద్దతు.ఇరాన్‌ ఇంథన రంగంలో పశ్చిమదేశాల పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.ఒప్పందం కుదిరిన తరువాత ఆటోమేటిక్‌గా అమల్లోకి వచ్చే ఐరాస ఆంక్షల తొలగింపు.ప్రాంతీయ స్థిరత్వానికి చట్టపరమైన అంగీకారంతో శాశ్వత శాంతి ఒప్పందం.

ఇరాన్‌ ప్రతిపాదించిన పది అంశాలు ఇలా ఉన్నాయి.ఇరాన్‌ మీద ఇంకేమాత్రం దాడులు చేయకూడదు.అమెరికా, దాని అనుయాయి దేశాలు అన్ని రకాల దాడులను శాశ్వతంగా ఆపాలి.తాత్కాలిక విరమణ కాదు, శాశ్వత ఒప్పందం కుదరాలి.విదేశాల్లో స్థంభింపచేసిన ఇరాన్‌ ఆస్తులన్నింటినీ ఒప్పందంలో భాగంగా తిరిగి ఇవ్వాలి. లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులను ఆపాలి.అన్ని రకాల అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి.ఇరాన్‌ అనుయాయుల మీద ఇంకేమాత్రం దాడులు జరపకూడదు.హార్ముజ్‌ జలసంధిలో స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతి. ప్రయాణించే ప్రతి నౌకకూ ఇరవైలక్షల డాలర్ల ఫీజు చెల్లించాలి.ఈ ఫీజులో ఒమన్‌కూ వాటా ఇస్తాం.దాడుల కారణంగా దెబ్బతిన్న తమ ఆస్తుల పునరరుద్దరణకు ఈ ఫీజు ద్వారా సమకూడే సొమ్మును ఖర్చు చేస్తాం. అన్ని ఒప్పందాలకు ఐరాస భద్రతా మండలి తీర్మాన హామీ ఉండాలి. అయితే బుధవారం నాడు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం అధికారిక పార్సీ భాషలో పేర్కొన్న ఒక కీలక అంశం విదేశీ మీడియా, ఇతరులకు ఆంగ్లంలో జారీ చేసిన ప్రతిపాదనల్లో లేదని చెబుతున్నారు. యురేనియంను శుద్ధి చేసుకొనే హక్కు తమకు ఉండాలన్న అంశం పార్సీలో ఉందని అంటున్నారు.. ఎన్నో ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ పాకిస్తాన్‌ తడిక రాయబారానికి ఎందుకు అంగీకరించాడు అన్నది చర్చ.

డోనాల్డ్‌ ట్రంప్‌ హీన సంస్కృతికి ప్రతిబింబం.ు ముందు ఇరాన్‌పై దాడులకు తెగబడి దిక్కుతోచని ట్రంప్‌ సభ్యసమాజం నోటితో ఉచ్చరించలేని, సైగలద్వారా చూపలేని బూతు పదజాలంతో ఇరాన్‌పై దూషణలకు దిగాడు. స్వేచ్చ పేరుతో బూతులు మాట్లాడటం అమెరికాలో సర్వసాధారణం అని తెలిసిన వారికి ట్రంప్‌ బూతుపురాణం ఆశ్చర్యం కలిగించలేదు.అలాంటి వాడిని తన స్నేహితుడు, వ్యూహాత్మక భాగస్వామి అని 56 అంగుళాల ఛాతీ విరుచుకొని చెప్పుకున్నవారందరూ సిగ్గుపడతారా ? గర్వపడతారా ! జాలి చూపుదాం, వదిలేద్దాం. ఇరాన్‌లో పాలకులను గద్దె దింపుతాం అంటూ బయలు దేరిన ట్రంప్‌నే గద్దె దించాలని అమెరికాలో అధికార పార్టీకి చెందిన వారు కూడా కోరారు.దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. ఇరాన్‌ గెలిచింది అనటం కంటే అమెరికా ఓడిందని వర్ణించటం సరైనది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల లోగా తాను చెప్పినట్లుగా హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలను పేల్చివేస్తామని ట్రంప్‌ బెదిరించాడు. ఒక్క రోజులో ఇరాన్ను ఆక్రమించుకోగలమని చెప్పాడు. తమ విద్యుత్‌ కేంద్రాల చుట్టూ మానవకవచాలుగా ఏర్పడాలని కవులు, కళాకారులు, యువకులు,యావత్‌ పౌరులకు ఇరాన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వేలాది మంది జాతీయ పతాకాలతోగుమికూడారు.అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గాల చరిత్రను చూసినపుడు నిరాయుధులైన పిల్లలు,మహిళలు, ఆసుపత్రుల్లోని రోగులు, సహాయ కేంద్రాలకు చేరిన అభాగ్యులు ఎవరినీ వదలకుండా చంపివేసిన దుర్మార్గాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఇరాన్‌లో అని ప్రాంతాల మీద దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నందున ఎక్కడో మరణించేబదులు, దేశరక్షణ కోసం ప్రాణాలర్పించటానికి మానవ కవచాలుగా ఏర్పడటానికి ముందుకు వచ్చారు. వారిని చంపివేస్తారా ? భయపడి వెనక్కు తగ్గుతారా ? అన్న చర్చ జరిగింది, చివరకు ట్రంప్‌ తోకముడవక తప్పలేదు.

రాజ్యాగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చింది.అయితే ఇది అంత తేలిక కాదు. అతగాడి చర్యల ద్వారా తమ ప్రయోజనాలకు ముప్పు వచ్చినట్లు పాలకవర్గం భావిస్తేమాత్రం ఎంతో సులువు. ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో మారణకాండ, తాజాగా ఇరాన్‌పై దాడులతో అమెరికాలోని చమురు, ఆయుధ కంపెనీలు, వ్యాపారులకు లాభాల పంట పంట పండుతున్నది. ఆయుధ కంపెనీల వాటాల ధరలు నెల రోజుల్లో 25శాతం పెరిగాయి.చమురు కంపెనీల సంగతి సరేసరి అమెరికాలో దొరికే ముడి చమురు ధర 60 నుంచి 110 డాలర్లకు పెరిగింది, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరలు కూడా అలాగే పెరిగాయి. అందువలన ట్రంప్‌ను ఇప్పటికిప్పుడు తొలగించేందుకు పూనుకుంటే ఈ రంగంలోని కార్పొరేట్లు మౌనంగా ఉంటారా ? సమస్యే లేదు. ప్రపంచంతో వారికి పనిలేదు. నిజానికి ట్రంప్‌ను గద్దె దించాలన్న డిమాండ్‌ దాడులు ప్రారంభమైన నెల రోజుల వరకు ముందుకు రాలేదు.అమెరికాకు తగులుతున్న ఎదురుదెబ్బలు, ఇరాన్‌ లొంగే అవకాశం, అమెరికా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన తరువాతే ప్రారంభమైంది.బహుశా తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని కార్పొరేట్‌ శక్తులు కూడా వత్తిడి తెచ్చి ఉంటాయి, జనంలో తలెత్తిన నిరసన తెలిసిందే. రెండు వారాల విరామ ఒప్పందం వెనుక సూత్రధారి చైనా, పాత్రధారి పాకిస్తాన్‌ అనే విశ్లేషణలు వెలువడ్డాయి. పాక్‌ మధ్యవర్తిత్వం గురించి వార్తలు వెలువడిన సమయంలో ఇస్లామాబాద్‌లో చర్చలకు తాము అంగీకరించేది లేదని కొద్ది రోజుల క్రితం ఇరాన్‌ ప్రకటించింది.పాకిస్తాన్‌ అమెరికా తొత్తు అన్న సంగతి తెలిసిందే. అటువంటి దాన్ని నమ్ముకొని చర్చలకు దిగితే ఏం జరిగేది చెప్పలేని స్థితిలో నాటకీయంగా కాల్పుల విరమణ అవగాహన ఎలా కుదిరిందన్న ప్రశ్న ముందుకు వచ్చింది.ట్రంప్‌ ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా అవలోకనం చేసుకోవటం అవసరం. ఇరాన్‌ మీద దాడి చేసేందుకు అమెరికా భద్రతామండలి తీర్మానాన్ని ఆయుధంగా చేసుకొనేందుకు చూసింది. హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు అవసరమైతే బలప్రయోగం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న తీర్మానం మండలి ముందుకు వచ్చినపుడు మంగళవారం నాడు చైనా, రష్యా వీటో చేసి ఇరాన్‌కు బాసటగా నిలిచాయి. అది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.ఆ తీర్మానం, ట్రంప్‌ విధించిన దాడుల గడువు మధ్య పది గంటల వ్యవధిలో చైనా రంగంలోకి దిగి తన మిత్రదేశమైన ఇరాన్ను ఒప్పించింది అని చెబుతున్నారు.ట్రంప్‌ను విలేకర్లు దీని గురించి అడగ్గా అవును నేను విన్నాను అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం.హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ను ఒప్పించటం అంటే అమెరికాకు లొంగిపొమ్మని కాదు. సంక్షోభ ముగింపుకు ఎక్కడో ఒక దగ్గర నాంది పలకాలి. ఇరాన్‌ ఎంత మిత్రదేశమో గల్ఫ్‌ దేశాలు కూడా చైనాకు అంతే దగ్గర. సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య సయోధ్య కుదిర్చిన సంగతిని మరచిపోరాదు.గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరుపుతున్నదాడులు వాంఛనీయం కాదన్నది తప్ప చైనా ఖండించలేదు.ఐరాస తీర్మాన సమయంలో చైనా, రష్యా తటస్థంగా ఉన్నాయి. అదే బలప్రయోగానికి పూనుకోవాలన్న తీర్మానం వచ్చినపుడు అవి రెండూ టెహరాన్‌ రక్షణకు నిలిచాయి.ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మార్గదర్శనం చేశాయంటే అతిశయోక్తి కాదు. నలభై రోజుల దాడుల సమయంలో ఈ రెండు దేశాలు ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా మద్దతునిచ్చాయి.అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు, నావలు, విమానాల కదలికలకు సంబంధించిన ఉపగ్రహ,కృత్రిమ మేధ విశ్లేషణలు ఇరాన్‌కు అందచేసిన కారణంగానే నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేసి ట్రంప్‌కు ఊపిరి సలపకుండా చేశాయని అమెరికా పత్రికలే రాశాయి. ఒప్పందానికి ముందు తమ విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇరాన్‌,రష్యా, గల్ఫ్‌ దేశాలతో 26సార్లు ఫోన్‌ సంభాషణలు జరిపినట్లు చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పాడు. దాడుల సమయంలో చైనా మౌనం గురించి ” నీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అస్సలు అంతరాయం కలిగించవద్దు ” అనే శీర్షికతో ఎకనమిస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణ చేసింది.వచ్చే నెలలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరటం గమనించాల్సిన అంశం. కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం గురించి ప్రధాని షెహబాజ్‌, ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ పాత్ర గురించి ట్రంప్‌ పేర్కొన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ ఒప్పందాన్ని హర్షించిన ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ ప్రస్తావన చేయలేదు.అందుకే అందని ద్రాక్ష పుల్లన అన్నారు, అసలు సంగతేమంటే విశ్వగురువును పిలిచినవారెవరూ లేరు ! ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలని తమ ఆరాధ్య దైవం మౌనంపై భక్తులు సమర్ధనకు దిగారు. ఒప్పందం కుదరగానే హర్షం వెలిబుచ్చుతూ ప్రభుత్వం ఎందుకు స్పందించింది ? ఇరాన్‌ మీద ఏకపక్షంగా అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడినపుడు ఎందుకు మౌనం దాల్చినట్లు ? నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ పోరు మరో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందా !

02 Thursday Apr 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, Donald trump, Imperialist war, Netanyahu

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్టకూటమి ఇరాన్‌పై ప్రారంభించిన దాడులకు ముందు వారు అనుకున్నది ఒకటి అయింది, అవుతున్నదీ మరొకటి.పండుగాడి దెబ్బ తగిలినట్లుంది ట్రంప్‌కు, అందుకే ఏం మాట్లాడుతున్నాడో, ఉన్మాదంతో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇది రాస్తున్న సమయానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవకపోయినా దాడులను ముగించాలనుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ భీకరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ఐదవ వారంలో ప్రవేశించాయి. జలసంధిని తెరవటం తన ప్రాధాన్యతల్లో లేదన్నాడు, అందుకే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది.ఎన్ని అదిరింపులు, బెదిరింపులకు పాల్పడినా నాటో కూటమి దేశాలు ఇది తమ యుద్ధం కాదంటూ జలసంధి ఛాయలకు వచ్చేది లేదని చెప్పాయి. మీ మీద దాడులు జరుపుతున్నా మీకు పౌరుషం లేదా అంటూ దాడుల్లో భాగస్వాములను చేసేందుకు గల్ఫ్‌ దేశాలను రెచ్చగొట్టినా కావాలంటే నష్టాల ఖర్చులను భరిస్తాం తప్ప వచ్చేది లేదన్నట్లుగా అవి ఉన్నాయి.దీంతో ట్రంప్‌కు ఉన్న పిచ్చికాస్త మరింత ముదిరింది.ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే అమెరికా దినపత్రిక కథనం సారాంశం ఇలా ఉంది.హార్ముజ్‌ జలసంధిని తెరవకపోయినా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ దాడులను ముగించేస్తానని మిత్రదేశాలకు ట్రంప్‌ చెప్పాడు. వ్యూహాత్మకమైన ఆ జలసంధిని తెరిపించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ట్రంప్‌ చెప్పిన గడువు దాటి వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.జలసంధిని తెరిపించే అంశాన్ని తరువాత చూసుకోవచ్చు ప్రస్తుతానికి అది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ముందు ఇరాన్‌ నౌకా దళాన్ని, క్షిపణులు తయారీ సామర్ధ్యాన్ని బలహీనపరచి దాడులను నిలిపివేస్తే తరువాత దౌత్యపరంగా టెహరాన్ను వత్తిడి చేయవచ్చు. అది కూడా విఫలమైతే ఐరోపా ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రదేశాలు రంగంలోకి దిగి చొరవ చూపాలని ట్రంప్‌ కోరతాడు.మిలటరీ చర్యలను నిలిపివేసేందుకు జలసంధిని తెరిపించటం ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాదని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌, దాడులు ముగిసిన తరువాత ఏదో విధంగా జలసంధి తిరిగి తెరుచుకొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చెప్పాడు.ఎందుకంటే మూసివేయటం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధం అని రూబియో అన్నాడు. నౌకా దళంలో కొంత భాగాన్ని ముంచివేయటంతో సహా భారీ నష్టాలు జరిగినా ఇంకా ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది. త్వరగా దాడులను ముగిస్తానని చెబుతూనే ఇప్పటికే ట్రిపోలీ అనే భారీ యుద్ద నౌక, రెండున్నరవేల మందికి పైగా మెరైన్లను మధ్య ప్రాచ్య ప్రాంతానికి అమెరికా తరలించింది, మరో పదివేల మంది పదాతి దళాలను చేరవేసేందుకు చూస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 113 డాలర్ల వద్ద ఉండగా మనదేశం దిగుమతి చేసుకొనే రకం ముడి చమురు ధర 121 డాలర్లు(నాలుగురోజుల నాటిది) ఉంది. అంతకు ముందు 157డాలర్లకు పెరిగింది.

దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ చర్చల సంగతి ఎటూ తేలలేదు, అమెరికా షరతులకు లొంగేది లేదని ఇరాన్‌ కరాఖండిగా చెప్పింది.పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచంలో తలెత్తే ఆర్థిక సమస్యల గురించి చర్చ మొదలైంది. నెల రోజులు దాటిన యుద్దంతో చమురు నుంచి ఆహారం వరకు ప్రభావితం అవుతున్నాయి.అమెరికాకు మంగళవారం నాటి వరకు 36 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ప్రతి సెకనుకు 11,574 డాలర్లు (డాలరకు 95 రూపాయలు) ఖర్చు అవుతున్నాయి. ప్రపంచం 1970దశకం నాటి స్టాగ్‌ఫ్లేషన్‌కు( ఆర్థిరంగం గిడసబారటం, ధరలు, నిరుద్యోగం పెరుగుదల దీని లక్షణాలు) గురవుతుందా అని కొందరు సందేహిస్తుండగా పరిస్థితి తీవ్రంగా ఉంది తప్ప అలాంటి అవకాశం లేదని మరికొందరంటున్నారు. అమెరికాలో గడచిన తొమ్మిది నెలల్లో మూడుసార్లు అక్కడి కార్మికవర్గం రాజులు లేరు, రాజరికాలు లేవు అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తొలిసారి 50,రెండవసారి 70, మూడవసారి 90లక్షల మంది పాల్గ్గొన్నారు.మూడవసారి మార్చి చివరి వారంలో జరిగిన ప్రదర్శనల్లో అమెరికాలో జరిగిన రోజునే వివిధ ఖండాలలోని పన్నెండు దేశాలలో కార్మికులు స్థానిక సమస్యలను తీసుకొని ప్రదర్శనలు జరపటం విశేషం. అమెరికా వినియోగదారులపై భారం ఎలా పడిందంటే ఫిబ్రవరి నెలలో జాతీయ సగటు గ్యాస్‌ ధర 2.98 డాలర్లు ఉంటే ఆదివారం నాడు అది 3.98 డాలర్లు ఉంది.సరఫరా, ధరల నియంత్రణలో భాగంగా 32దేశాలు,13 సహదేశాలు (వీటిలో మనదేశం లేదు) సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఇంథన సంస్థ(ఐఇఏ) తన పర్యవేక్షణలో ఉన్న 120కోట్ల పీపాల చమరులో 40 కోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థ నిబంధన ప్రకారం ప్రతి సభ్యదేశం 90 రోజులకు సరిపడా చమురు ఉత్పత్తులను నిల్వచేసుకోవాలి. ఈ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌ చరిత్రలో సరఫరా విచ్చిన్నంలో అతిపెద్దదని ఆ సంస్థ పేర్కొన్నది.దీనికి ట్రంప్‌ బాధ్యుడని వేరే చెప్పనవసరం లేదు.దేశం కోసం-ధర్మం కోసం ఏమైనా చేస్తామని ఒట్టి కబుర్లు చెప్పటం తప్ప తాజా పరిస్థితికి కారకుడైన తన మిత్రుడిని నరేంద్ర మోడీ ఇంతవరకు తప్పు పట్టలేదు.పరీక్షా సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందంటారు.

ఇరాన్‌పై దాడుల తరువాత అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి విలువ ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేము.మన దేశంలో రు.51లక్షల కోట్లు నష్టపోయినట్లు అంచనా, ఇంకా పతనం కొనసాగితే నష్టాలు పెరుగుతాయి.అమెరికాలో జతకూర్చిన సమాచారం ప్రకారం ఒక్క రోజులో ఎస్‌ అండ్‌ పి 500 సూచిక 1.66శాతం పతనంతో ఒక లక్ష కోట్ల డాలర్లు, నాస్‌డాక్‌ 2.09శాతం పతనంతో ఆరువందల బిలియన్‌ డాలర్లు, డౌ సూచిక 1.2శాతం పతనం 300బి.డాలర్లు మొత్తం ఒక్కరోజులో 1.2లక్షల కోట్ల డాలర్లు ఆవిరైంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా మాంద్యంలోకి వెళ్లేందుకు 37శాతం అవకాశాలున్నట్లు పోలీమార్కెట్‌ అంచనా వేసింది.కార్పొరేట్‌ కంపెనీలు పెరిగిన ఖర్చులను వినియోగదారుల మీద మోపితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగేస్తారు,నియామకాలు తగ్గిపోతాయి.అమెరికాలో ఉత్పత్తి అయ్యే డబ్ల్యుటిఐ రకం ముడి చమురు ధర 2025 డిసెంబరులో 57 డాలర్లు ఉంటే ఇది రాసిన సమయంలో 102 డాలర్లు ఉంది.దీనికి అనుగుణంగానే అమెరికాలో ధరలు పెరిగాయి.ఫిబ్రవరిలో విమాన ఇంథనం పీపాధర 99 డాలర్లు ఉంటే మార్చినెల 20న 197 డాలర్లకు పెరిగింది. స్లోక్‌ అనే ఆర్థికవేత్త జనవరిలో అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆశాభావం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్‌ యుద్ధాన్ని ప్రారంభించాడో ఇప్పుడా పెద్దమనిషి స్టాగ్‌ఫ్లేషన్‌ అవకాశాల గురించి హెచ్చరించాడు.

ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది జరుగుతున్నది మరొకటి, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఉన్నాడు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్‌ ఎలా ముగిస్తాడో తెలియదు.స్వస్థిపలకటం అనివార్యం, అయితే అది అమెరికా నిర్దేశించినట్లు కాదు.ఇప్పుడు ఇరాన్‌ తన షరతులను ముందుకు తెస్తున్నది, ఇది ట్రంప్‌ కలలో కూడా ఊహించి ఉండడు. పెట్రోడాలర్‌ను సవాలు చేస్తూ చైనా యువాన్‌తో లావాదేవీలు జరిపేవారి నౌకలను హార్ముజ్‌ జలసంధి నుంచి అనుమతిస్తామని అది ప్రకటించింది.ఆ కరెన్సీలోనే అది కప్పం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ యుద్ధం చైనా పెట్రో యువాన్‌కు శక్తినిస్తుందని అమెరికా డాలర్‌ ఆధిపత్యం బలహీనపడుతుందని ఈ పరిణామాల గురించి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఇతర దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు తనకు అనుగుణంగా ఆడించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలుగా ప్రపంచంలోని చమురు సంపద, ఇతర వనరులను వినియోగించుకొనేందుకు వాటి మీద అదుపు సాధనకు అమెరికా ఎప్పుడో ఎత్తువేసింది.ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ అదే పాత్ర పోషించాలని చూస్తోంది. సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించిందేకు పర్షియా గల్ఫ్‌-ఎర్ర సముద్రాన్ని అనుసంధానం చేసే అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా ఎమెన్‌ ద్వారా తన అదుపులోకి తెచ్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఐరోపా దేశాలను కూడా అది ఒక ఆట ఆడించగలదు. అమెరికా అనుసరిస్తున్న మొరటు సూత్రం ఒక్కటే.ఎవరినైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే అంతర్జాతీయ సూత్రాలను పక్కన పెట్టు, జనం మీద బాంబులువేసి చంపు, దేశాలను నాశనం చేయి, అప్పుడు జనం నిరాశతో లొంగిపోతారు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతమైన గాజాలో చేసింది అదే.ఆసుపత్రులు, స్కూళ్లు, సహాయకేంద్రాలు వేటినీ వదల కుండా నాశనం చేసింది, 70వేల మందికి పైగా పిల్లలు, మహిళలను చంపివేసింది. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చింది. అయినప్పటికీ హమస్‌గానీ, పాలస్తీనియన్లుగానీ ఇజ్రాయెల్‌కు లొంగలేదు.ఇప్పుడు ఇరాన్‌ కూడా యావత్‌ప్రపంచానికి అదే సందేశమిచ్చింది. మీ మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు, మీ అధినేత అయాతుల్లా అలీ ఖమేనిని పదవి నుంచి తొలగిస్తే మీకు రక్షణ కల్పిస్తాం, లేకపోతే దాడులు చేస్తాం అని మెరికా తొలిరోజుల్లో బెదిరించింది.ఆడపిల్లలు చదుకొనే పాఠశాల మీద అమెరికా విమానాలు బాంబులు వేసిన దుర్మార్గం గురించి తెలిసిందే.ఇప్పుడు వేరేగా మాట్లాడుతోంది.

మార్చినెల 31, ఏప్రిల్‌ ఒకటవ తేదీల్లో చైనా సందర్శించాలని ట్రంప్‌ కార్యక్రమం నిర్ణయించుకున్నాడు. ఈ తేదీలకు ఉన్న ప్రాధాన్యత ఏమంటే ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించిన తరువాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972 తొలిసారిగా బీజింగ్‌ను సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో అవసరం లేకపోయినా జపాన్‌ మీద అణుబాంబులు వేసి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. బహుశా డోనాల్డ్‌ ట్రంప్‌ లేదా అతగాడికి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాంటి దుష్టాలోచననే ముందు పెట్టి ఉండాలి. అయితే ఈ సారి ప్రపంచం కంటే తనకు పోటీగా సవాల్‌ విసురుతున్న చైనాను బెదిరించేందుకు, తద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు సిద్దపడినట్లు కనిపిస్తోంది.చైనా పర్యటన ఎప్పుడో ఖరారైంది గనుక ఈ లోగా ఇరాన్ను దెబ్బతీసి దాన్నే చైనా ముందు ప్రదర్శించాలన్న దుష్టాలోచనతోనే ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ట్రంప్‌ఆలోచన ఏమిటి ? ” రెండు మూడు వారాల్లో ఇరాన్‌ మీద విజయం సాధిస్తాం.చైనా వెళ్లినపుడు షీ జింపింగ్‌తో చర్చల్లో చూశారుగా ఇరాన్‌ పాలకులను మార్చాం, అక్కడ గతంలో రష్యాలో బోరిస్‌ ఎల్సిన్‌ అనే తొత్తును పీఠం ఎక్కించినట్లుగా మాకు అనుకూలమైన వాడిని పదవిలో ప్రతిష్టించాం.వాడు అక్కడి చమురు నిల్వలన్నింటి మీద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే వెనెజులా చమురును స్వాధీనం చేసుకున్నా.మీకు ముడి చమురు అవసరం గనుక మేం చెప్పినట్లు వింటే, మాకు అవసరమైన విలువైన ఖనిజాలను మాకు సమర్పించుకుంటే ఓకే లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు పెడతాం ” అని రిహార్సల్స్‌ వేసుకున్న ట్రంప్‌కు ఇరాన్‌ చుక్కలు చూపించింది. దాంతో మార్చినెలాఖరులో చైనా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే నెల 14,15 తేదీల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.జరుగుతున్న పరిణామాలను బట్టి అది కూడా జరుగుతుందా వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. తొందరేం లేదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చన్నట్లుగా చైనా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ట్రంప్‌ వెళతాడో చూద్దాం.చివరిగా చెప్పుకుంటున్నా అతి ముఖ్యమైన అంశం ఒకటుంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అది వియత్నాం,ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, లిబియా ఏ దేశం మీద దాడి చేసినా అమెరికాకు మిత్ర దేశాలు సహకరించాయి.తొలిసారిగా ఇరాన్‌పై దాడికి ముఖం చాటేశాయి, అది తమ యుద్దం కాదని ప్రకటించాయి. కొంత మంది వర్ణించినట్లు ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఇరాన్‌ మీద కాదు, దానికి మద్దతు ఇస్తున్న రష్యా, చైనాల మీద అన్నది నిజమేనా ! చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !

25 Wednesday Mar 2026

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Data centres, Donald trump, Joe Kent, oil price, Pete Hegseth, Trump’s peace talk, US attack Iran, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

అయ్యగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నది ఒక లోకోక్తి. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌, అతగాడి మాటలు నమ్మి ఎటూకాకుండా పోయిన అపర చాణుక్యులు ఇప్పుడు అదే చేస్తున్నారు. దాడులకు ముందు అమెరికా ప్రతిపాదించిన అంశాలపై జెనీవా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. వియన్నాలో తదుపరి సంప్రదింపులు జరుపుదామన్న అమెరికా ఏకపక్షంగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలసి ఇరాన్‌పై దాడులకు దిగింది. ఇప్పుడు ఆ పాత అంశాలనే ఇప్పుడు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనలుగా ఇరాన్‌ ముందుంచినట్లు వార్తలు. గతంలోనే వాటిని తిరస్కరించిన ఇరాన్‌ ఇప్పుడు కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చింది. భవిష్యత్‌లో అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు జరపవనే హామీ, పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో తమ పాత్రకు గుర్తింపు, దాడులకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు సిద్దమే అని, గతంలో మాదిరి హామీలను ఉల్లంఘిస్తే కుదరదని ఇరాన్‌ స్పందించినట్లు కూడా చెబుతున్నారు. అంతకు ముందు మంగళవారం నాటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.

ఇరాన్‌పై ఏకపక్ష దాడులకు దిగిన అమెరికా వెనకడుగు వేసిందా ? పోరును ఆపేందుకు ట్రంప్‌ దారులు వెతుకుతున్నాడా ? దానిలో భాగంగానే ఇరాన్‌లో ఇంథన వ్యవస్థలపై ఐదు రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడా ! అవన్నీ ఒట్టి మాటలే అని టెహరాన్‌ ఎందుకన్నది ! ఒక్కటి మాత్రం వాస్తవం ఇరాన్‌పై దాడులను అమెరికా-ఇజ్రాయెల్‌ కూటమి ఇంకెన్ని రోజులో కొనసాగించే అవకాశాలు లేవన్నది అత్యధిక విశ్లేషకుల అభిప్రాయం.దీనికి విరుద్దంగా జరుగుతుందా ? ఏమో ! ట్రంప్‌ ప్రకటన చేసిన తరువాత అమెరికా, మనదేశంలో కూడా మంగళ, బుధవారాల్లో యుద్దం ఆగనుందనే అంచనాతో స్టాక్‌ మార్కెట్లు కళకళలాడాయి. ఐదు రోజుల విరామం ప్రకటన చేసిన తరువాత కూడా సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఇరాన్‌పై దాడులు ఆగలేదు. ఇరాన్‌లోని ఒక ప్రముఖుడితో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. ఆ పెద్దమనిషి టెహరాన్‌ మేయర్‌, పోలీసు అధికారి, అధ్యక్ష స్థానం కోసం పోటీ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్న పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగరె గాలిబ్‌ కావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.చర్చలకు తాము సిద్దమే అని ఇరాస్‌ సుప్రీమ్‌ నేత అయాతుల్లా మొజ్తాబా ఖమేనీ చెప్పినట్లు నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి. అమెరికా తరఫున ట్రంప్‌ అల్లుడు జెరెడ్‌ కుషనర్‌, రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ రంగంలో ఉన్నట్లు వార్తలు. ఇరాన్‌తో చర్చలు సాగుతున్నాయని, విశాలమైన ఒప్పందం కుదురుతుందా లేదా అన్నది చూడాలని, వారు పరిష్కారాన్ని, శాంతిని కోరుకుంటున్నారని ట్రంప్‌ చెప్పాడు. అయితే అయితే ఈ కబుర్లన్నీ తప్పుడు వార్తలని ఎలాంటి చర్చలు జరగలేదని తొలుత ఇరాన్‌ వార్తా సంస్థ పేర్కొనగా తరువాత పార్లమెంటు స్పీకర్‌ కూడా చెప్పాడు. ద్రవ్య, చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకు వాటిని వాడుకున్నారని అన్నాడు. ట్రంప్‌ ప్రకటనకు ముందు బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 114 డాలర్లకు పెరిగింది, ప్రకటన తరువాత 98 డాలర్లకు పడిపోయి, చర్చలు జరగలేదన్న ఇరాన్‌ ప్రకటన తరువాత మంగళవారం మధ్యాహ్నానికి 104 డాలర్లకు చేరింది. బుధవారం నాడు వంద డాలర్లలోపు ఉంది. ఒక వైపు ట్రంప్‌ ఐదురోజుల విరామ ప్రకటన చేసినప్పటికీ మరోవైపు అమెరికా మిలిటరీ కేంద్ర కమాండ్‌ ఇరాన్‌ మీద తీవ్రమైన దాడులు జరుపుతూనే ఉంటాయని ప్రకటించింది. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా క్షిపణులను ప్రయోగిస్తున్నది.ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు లెబనాన్‌ మీద దాడులను కొనసాగిస్తున్నాయి.దాడులు దీర్ఘకాలం కొనసాగితే అమెరికన్లలో వ్యతిరేకత మరింత పెరుగుతుందని, నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే పదవీకాలం పూర్తయ్యే వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ట్రంప్‌ వెనకడుగు వేసేందుకు నిర్ణయించుకొని దారి వెతుక్కుంటున్నట్లు చెబుతున్నారు.

అమెరికా బలహీనతలు, దాని ఎత్తుగడల వైఫల్యం గురించి పెద్ద ఎత్తున సాగుతున్న చర్చతో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్న సమయంలో ట్రంప్‌ 48 గంటల బెదిరింపు ప్రకటన చేశాడు.హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్‌ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించాడు. అయితే ఆ గడువు ముగిసిన వెంటనే ఐదు రోజుల పాటు దాడులను వాయిదా వేస్తామంటూ నాటకీయంగా సోమవారం సాయంత్రం ప్రకటించాడు.తమపై దాడులకు మరింత మంది సైనికులను కూడ గట్టుకొనేందుకే ఈ ప్రకటన చేశాడని ఇరాన్‌ స్పందించింది. తమ విద్యుత్‌ సంస్థలపై దాడులు జరిపితే తలెత్తే పర్యవసానాలకు భయపడి ట్రంప్‌ ఆ ప్రకటన చేశాడని ఇరాన్‌ జాతీయ టీవీ, ఇతర మీడియా సంస్థలు పేర్కొన్నాయి.రెండు దేశాల మధ్య చర్చల గురించి ఎవరేమి చెప్పినప్పటికీ తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌ను ఎవరు ప్రేరేపించారనే అంశంపై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే సోమవారం నాడు ట్రంప్‌ టెన్నెసీలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌పై నెపం మోపాయి.తన పక్కనే ఉన్న హెగ్‌సేత్‌తో ట్రంప్‌ మాట్లాడుతూ ” వారు అణ్వాయుధాలను కలిగి ఉండకూడదంటే మనం వారిని వదల కూడదని నువ్వే కదా మొదట చెప్పింది ” అన్నాడు. అంతా అధ్యక్షుడి చేతుల్లోనే ఉంది అన్నాడు తప్ప పీట్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇతరులపై నెపం మోపటంలో ట్రంప్‌ ఘనుడు. ఇరాన్‌ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల గురించి తనకు తెలియదని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. ఇరాన్‌ ప్రతిఘటన ఇలా ఉంటుందని తనకెవరూ చెప్పలేదన్నాడు. ఇప్పుడు మరొక కొత్త కథ చెప్పాడు.రేపు ఇంకెన్ని చెబుతాడో చూద్దాం.

ఇరాన్‌పై దాడులు ఎందుకు చేశారని ట్రంప్‌ యంత్రాంగంలో ఏ ఇద్దరిని అడిగినా ఒకే సమాధానం రావటం లేదు.ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు దిగాలని నిర్ణయించినందున అమెరికాకు తప్పలేదన్నది ఒక కథనం. ఇరాన్‌ అణ్వాయుధాలను మోహరిస్తున్నందున దాడికి దిగక తప్పదని మరికొందరు చెబుతున్నారు. ముందే చెప్పినట్లుగా ట్రంప్‌ మరోవిధంగా మాట్లాడాడు.” నేను పీట్‌ను సంప్రదించాను, నేను జనరల్‌ కానేతో మాట్లాడాను. అనేక మంది మన గొప్ప జనాలతో మాట్లాడాను.మధ్య ప్రాచ్యంలో మనకు ఒక సమస్య వచ్చింది.మనం దాన్ని ఆపగలం, మధ్య ప్రాచ్యంలోకి చిన్న ప్రయాణం పెట్టుకొని పెద్ద సమస్యను అంతం చేయాలి ” అని ట్రంప్‌ చెప్పాడు. అంతకు ముందు మాట్లాడుతూ గల్ఫ్‌ దేశాల మీద ఆకస్మికంగా ఇరాన్‌ చేసిన దాడులను చూస్తే ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు అన్నాడు. అయితే ఇలా మాట్లాడటానికి ముందే ఇరాన్‌ ప్రతిఘటన గురించి దాడులకు ముందుగానే ట్రంప్‌ను హెచ్చరించారని, వాటిని ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.అందరికీ తెలిసినప్పటికీ ఇరాన్‌ సామర్ధాన్ని అంచనా వేయటంలో విఫలం, పెత్తందారీ పోకడలతో దాడులకు తెగబడ్డారన్నది సత్యం. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అంత ఉత్సాహంగా లేకున్నా, వ్యతిరేకతను వెల్లడించలేదన్నది ఒక కథనం. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, మీడియా అధిపతి రూపర్ట్‌ మర్డోచ్‌ దాడులను ఎగదోసిన ప్రముఖుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.జాతీయ ఉగ్రవాద నిరోధ కేంద్రం అధికారి జో కెంట్‌ దాడులను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన తీరు ట్రంప్‌ యంత్రాంగంలో ఉన్న భిన్నాభిప్రాయాలను వెల్లడించింది.ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి, అంతా సవ్యంగా జరిగితే సరే లేకుంటే బాంబుదాడులను కొనసాగిస్తూనే ఉంటామని ట్రంప్‌ చెప్పాడు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడులు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఇప్పటి వరకు వరకు ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాదాపు రెండువేల దాడులు జరిపినట్లు అంచనా. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ పేరుతో అమెరికా, రోరింగ్‌ లయన్‌ పేరుతో ఇజ్రాయెల్‌ తెగబడుతున్నాయి. వందకు పైగా విమానాలను దాడులకు వినియోగించినట్లు చెబుతున్నారు. అత్యధిక దాడులు రాజధాని టెహరాన్‌ నగరం మీదే జరిగాయి. ఈ దాడులతో భారీగా నష్టపోయినప్పటికీ ఇరాన్‌ ఎందుకు వెనక్కు తగ్గటం లేదన్నది యావత్‌ ప్రపంచంలో చర్చగా ఉందంటే అతిశయోక్తి కాదు. సుప్రీమ్‌ నేత అయాతుల్లా అలీ ఖమేని, ఇతర అనేక మంది ప్రముఖులను పోగొట్టుకున్నప్పటికీ ధైర్యం కోల్పోలేదు. అమెరికా మీద గెలవటం అన్నది కల అని తెలిసినప్పటికీ ప్రతిఘటన దాడులు జరుపుతున్నది.ముందుగా దాడులు నిలిపివేయాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, భవిష్యత్‌లో ఎలాంటి దాడులు జరపబోమనే హామీ కావాలని అమెరికాకే షరతులు పెట్టింది. తాను బలహీనంగా ఉన్నపుడు ఎదుటి వాడి బలహీనతల మీద దెబ్బకొట్టాలన్నది ఒక సూత్రం. ఇప్పుడు అదే జరిగింది. హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధనం చేయటంతో ఆ మార్గంలో చమురు, గ్యాస్‌ ఎగుమ తి, దిగుమతి చేసుకొనే దేశాలు ప్రభావితమై అమెరికా మీద వత్తిడి తెస్తాయన్నది ఒకటైతే అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేస్తే అవి కూడా వాషింగ్టన్‌ మీద ప్రభావం చూపుతాయన్నది ఇరాన్‌ అంచనా, అదే జరిగింది. నిజానికి ఈ విషయాలన్నీ ముందే చెప్పినా ఎవరూ ఖాతరు చేయలేదు.చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కతార్‌, ఒమన్‌ తెరవెనుక కాల్పుల విరమణ యత్నాలు ప్రారంభించాయి, అయితే తొందరేం లేదు ముందు మాపై దాడులను నిలిపివేయనివ్వండి, అర్దవంతమైన ప్రతిపాదనలతో రానివ్వండి అన్నట్లు ఇరాన్‌ తాపీగా ఉంది.ఎలాంటి చర్చలకూ సంసిద్దత వెల్లడించలేదు. యుద్ధం మీద అమెరికా అదుపు కోల్పోతున్నదంటూ సోమవారం నాడు అమెరికా ప్రధాన మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.ఉభయపక్షాలూ ఎవరూ ఎవరిని నమ్మే స్థితి లేనందున చర్చలు అనుమానమే. ఒక వేళ తామే విజయం సాధించినట్లు అమెరికా ప్రకటిస్తే హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ ఆధిపత్యం నిర్ధారణ అవుతుంది. దాని అణుకార్యక్రమం కూడా కొనసాగుతుంది.రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిపితే గల్ఫ్‌ దేశాల మీద ఇరాన్‌ దాడులు కొనసాగుతాయి. ఇరాన్‌ చమురు కేంద్రం ఖార్గ్‌ దీవి మీద దాడులకు దిగితే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మెరైన్‌ దళాలతో ఈ దీవిని చేరుకుంటే పెద్ద సంఖ్యలో అమెరికన్లను బందీలుగా ఇరాన్‌కు అప్పటించటమే అని రాజీనామా చేసిన ఉన్నతాధికారి కెంట్‌ హెచ్చరించాడు. అందువలన ఏకపక్షంగా దాడులను విరమించటమే అమెరికా ముందున్న మార్గం అని చెప్పవచ్చు. అయితే సామ్రాజ్యవాదం తన ఓటమిని అంత తేలికగా అంగీకరిస్తుందా ? ఒక వైపు ఐదు రోజుల విరామం ప్రకటించిన ట్రంప్‌ మరోవైపు అదనపు దళాలను సమీకరిస్తున్నాడు.జపాన్‌లో ఉన్న సైనిక స్థావరం నుంచి రెండువేల మంది మెరైన్‌(సముద్రం, భూమి మీదా దాడులు చేసే శిక్షణ పొందినవారు) దళాన్ని మధ్య ప్రాచ్యానికి తరలించారు.అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి మరో రెండున్నరవేల మందిని తరలిస్తున్నారు. ఏప్రిల్‌ నాటికి ఇతర మరికొన్ని దళాలను కూడా తరలించేందుకు నిర్ణయించారు.

అమెరికా దూకుడు వైఖరిలో వచ్చిన మార్పుతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా వాషింగ్టన్‌-టెహరాన్‌ చర్చలు ఈ వారంలో జరగవచ్చని రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయపక్షాలను దగ్గరకు చేర్చేందుకు ఈజిప్టు, టర్కీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.పాక్‌ సైన్యాధికారి మునీర్‌ రెండు దేశాల అధ్యక్షులతో ఈపాటికే సంప్రదింపులు జరిపినట్లు వార్తలు. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ గాలీబ్‌తో ట్రంప్‌ అల్లుడు కుషనర్‌, రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ సంప్రదింపులు జరిపినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. ట్రంప్‌ చర్యలకు నిరసనగా రాజీనామా చేసిన అమెరికా ఉగ్రవాద వ్యతిరేక సంస్థ మాజీ అధిపతి జో కెంట్‌ ఐదు రోజుల ట్రంప్‌ విరామప్రకటన గురించి స్పందించాడు. ముందుగా ఇజ్రాయెల్‌ను అదుపు చేస్తే తప్ప సంప్రదింపులు ముందుకు వెళ్లవని, అవి కొనసాగితే అమెరికా సంప్రదింపుల సామర్ధ్యం బలహీనపడుతుందని చెప్పాడు.ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు ఇచ్చిన తప్పుడు సమాచారం అమెరికాను యుద్ధంలోకి లాగిందని, అమెరికా విదేశాంగ విధానంపై ప్రభావం చూపిందన్నది కెంట్‌ అభిప్రాయం. యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇరాన్‌ మరొక చర్య ఏమంటే గల్ఫ్‌ దేశాల్లో ఉన్న డేటా(సమాచార) కేంద్రాలపై దాడులు. ఈ కేంద్రాలు అమెరికా, ఇజ్రాయెల్‌ చేపట్టిన కృత్రిమ మేథ లక్ష్యాలను నెరవేర్చకుండా చేసేందుకు ఇరాన్‌ కేంద్రీకరించింది.అయితే అమెరికా కూడా టెహరాన్‌లో ఉన్నకేంద్రాల మీద దాడులు చేసింది.ఇప్పటి వరకు రెండు వైపులా ఐదు కేంద్రాలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇరవై తొమ్మిది సాంకేతిక కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ ప్రకటించింది. సాంప్రదాయ యుద్ధంలో వంతెనలు, విమానాశ్రయాలు, నౌకా కేంద్రాల మీద కేంద్రీకరించటం తెలిసిందే.ఇప్పుడు యుద్ధంలో డేటా కేంద్రాలను కూడా వినియోగిస్తున్నందున వాటిని కూడా వదలటం లేదు. గల్ఫ్‌ దేశాలు వివాదాలకు దూరంగా ఉంటాయంటూ అమెరికా, ఇతర అనేక దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. తాజా పరిణామాలతో అవి ఆర్థికంగా నష్టపోవటమేగాక గల్ఫ్‌ దేశాల మీద ఉన్న నమ్మకం కూడా సడలటం ఖాయం. ఇరాన్‌కు వీటిని దెబ్బతీయాలనే ఆలోచన కలగటానికి అమెరికా, ఐరోపా దేశాలు చూపిన మార్గమే. రష్యాను దెబ్బతీసేందుకు ఈ దేశాలు ఉక్రెయిన్‌కు డేటా కేంద్రాల ద్వారా కీలకమైన రష్యా కేంద్రాల గురించి సమాచారం ఇవ్వటమేగాక ఉక్రెయిన్‌ దాడులను సమన్వయపరచటం, ఎప్పటికప్పుడు మాప్‌లను అందించటం వంటి సేవలను అందించాయి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ఇరాన్‌కు అవసరమైన సలహాలు, సమాచారాన్ని రష్యా అందిస్తున్నదని ఎవరైనా వాపోతే చేసేదేమీ లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !

20 Friday Mar 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ 1 Comment

Tags

BJP, Donald trump, India-China trade, Narendra Modi Failures, TRADE BALANCE, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశ వస్తు వాణిజ్య లోటు 34.7 నుంచి 27.1 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు తమ భుజాలను తామే చరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ అసలు విషయం ఏమంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే అది 14.4 బిలియన్‌ డాలర్ల నుంచి పెరిగి రెండింతలైంది.ఒక నెలలో పెరిగి మరొక నెలలో తగ్గటం సర్వసాధారణం, మొత్తంగా ఏడాదిలో ఏం జరిగిందన్నదే గీటురాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి దిగుమతులు 142 శాతం పెరిగితే బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28.7శాతం పెరిగాయి, ఎందుకంటే నిత్యావసర వస్తువు కదా ! ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు గనుక మోడీ సర్కార్‌ వ్యాపార లాభనష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం. మన మీడియాలో మరోసారి చైనా మీద ఆధారపడటం ఎంతో ప్రమాదకరమంటూ హితోక్తుల రూపంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒక దాని శీర్షిక ఏమంటే ”102 బిలియన్‌ డాలర్ల షాక్‌ ” వారు గ్రహించాల్సిందేమంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే రేటింగ్‌లు పెరిగే తరుణం కాదిది.బీజింగ్‌తో ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదంటూ తలుపులు మూసుకున్న మనం పెట్టుబడుల కోసం వాటిని తెరిచాం, గత ఏడు సంవత్సరాలుగా మూతపడిన సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లో భారత్‌-చైనా-నేపాల్‌ సరిహద్దులు కలిసే లిపులేక్‌ కనుమదారిలో జూన్‌ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా నేపాల్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం ముందుకు పోతున్నది. ఇలా చైనా కమ్యూనిస్టులకు ఎర్రతివాచీని పరిచామని తెలిసినప్పటికీ పుట్టుకతో పుట్టిన బుద్ధి గనుక కొందరు హెచ్చరికలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు చైనాతో వాణిజ్య లోటు 102 బిలియన్‌ డాలర్లు దాటింది.మోడీ సర్కార్‌ సాధించిన మరో రికార్డు ఇది.మార్చి నెల కూడా గడచిన తరువాత ఈ తేడా 111.4 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఏడాది క్రితం 91బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతుల ప్రోత్సాహ పిఎల్‌ఐ, వికసిత్‌ భారత్‌ వంటి నినాదాల అమలు, ఆచరణ ఫలితమిది. పెట్టుబడికి కనిపించేది లాభం తప్ప భావజాలం కాదు, దీని అర్ధం భావజాలాన్ని వాడుకోదు అని కాదు.1970 దశకం వరకు చైనాకు ఐరాసలో ప్రవేశం కల్పించకుండా అడ్డుకున్న వాషింగ్టన్‌ తనకు లాభం వస్తుందని గ్రహించే కదా పక్కా కమ్యూనిస్టు చైనాతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టింది.దాని కమ్యూనిస్టు వ్యతిరేకత ఏమైనట్లు ? మనదేశంలో కూడా దాని ఏజంట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను వంటబట్టించుకున్నారు. ఇప్పటికీ రెచ్చిపోతున్నారు. గాల్వన్‌లోయ ఉదంతం తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.నేరుగా పెట్టుబడులను అడ్డుకోకుండా సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే వాటిని పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలనే వంకతో ఆరు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నది కాస్తా ఎలాంటి కారణం చెప్పకుండానే పదిశాతం వరకు పెట్టుబడులు నేరుగా చైనా వాటాదారుగా ఉన్న విదేశీ కంపెనీల నుంచి వచ్చేందుకు అనుమతించింది. దీని గురించి చైనా ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ ఇది చాలదు అన్నట్లుగా ఉందని వార్తలు వచ్చాయి. అందువలన రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించవచ్చు.అవసరం మనది మరి ! కేంద్రంలో ఉన్న బిజెపి, దాని వెనుక ఉండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగానికి ఏమీ తెలియకుండానే మోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చిందనుకుంటే అమాయకత్వం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత రెచ్చగొట్టటం తమను గుడ్డిగా అనుసరిస్తున్నవారిని నిలబెట్టుకొనేందుకు, సంతుష్టీకరించేందుకు కాషాయదళాలు నిత్యం చేస్తున్నదే, దానిలో ఎలాంటి మార్పు లేదు.చైనా వస్తువులు కార్పొరేట్లకు అవసరం. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని అధికారానికి దూరం చేయటం పెద్దపనేమీ కాదు. ఇప్పుడు వారి ప్రయోజనాలే ముందుకు వచ్చాయి గనుక కాస్త తగ్గండి లేకపోతే మీ గురించి ఆలోచించాల్సి వస్తుందన్న హెచ్చరికతో తాజా పరిణామాలు సంభవిస్తున్నాయన్నది పచ్చినిజం. సంఘపరివార్‌ తన అజెండాను దేశం మీద రుద్దేందుకు అధికారం కావాలి గనుక వారి వత్తిడికి లొంగి మౌనంగా ఉంది.చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి, దాని వస్తువులను బహిష్కరించాలంటూ వీధుల్లో వీరంగం వేసిన అపర దేశభక్తులు ఇప్పుడెక్కడా కానరారు, సంఘపరివార్‌ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నది.

గతంలో చైనా బజార్ల పేరుతో పెద్ద ఎత్తున కొందరు దుకాణాలను ఏర్పాటు చేసి మనదేశంలో తయారు చేసే నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగట్టారు.అదే సమయంలో చైనా చాలా తక్కువ ధరలకు వస్తువులను అందచేస్తున్న కారణంగా అనేక మంది అవి చౌక, నాశిరకం అని కూడా ప్రచారం చేశారు.కాని తరువాత కాలంలో నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే చైనా వస్తువులు లేని ఇల్లు లేదు.ప్రస్తుతం మన ప్రభుత్వ పెద్దలు ఎన్ని కబుర్లు చెప్పినా ఔషధరంగం, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహనాలు,సూర్యరశ్మి పలకల వంటి రంగాలలో చైనా నుంచి ముడి సరకులు లేదా సగం తయారైన వస్తువులు, యంత్రాలు, విడిభాగాలు లేకుండా మన దేశంలో అనేక పరిశ్రమలకు మనుగడలేదు. అందుకే కార్పొరేట్‌ శక్తులు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి తప్ప కమ్యూనిజం, చైనా మీద ప్రేమతో కాదు. అవే వస్తువులను మరొక దేశం ఏదైనా అందచేస్తే పొలోమంటూ అటే వెళతారు.చైనా అంత తక్కువ ధరలకు ఎలా అందిస్తున్నదని అనేక మంది ప్రశ్నించటాన్ని చూస్తున్నాము. ఆధునిక పద్దతుల్లో వస్తూత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని వేరే చెప్పనవసరం లేదు. తన 140 కోట్ల జనానికి పనికల్పించాలంటే అవసరాలకు మించి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న విధానంలో భాగంగా ఇప్పటి వరకు పని చేసింది. ఇప్పుడు తన కార్మికులకు గణనీయంగా వేతనాలు పెంచిన కారణంగా గతంలో మాదిరి చౌకగా అన్ని వస్తువులను అందించటానికి వీలుకాదు గనుక విలువ ఎక్కువగా ఉంటే వస్తూత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నది.గతంలో తక్కువ ధరకు ఫోన్లు అందించిన చైనా నుంచి ఇప్పుడు ఎక్కువ విలువగల ఫోన్లే వస్తున్నాయి, లేకపోతే మనదేశంలోనే తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా సగటున మన వద్ద నుంచి 65 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న మన ఎగుమతుల గురించి పైకి చెప్పుకోలేని ఆందోళన పడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తలెత్తిన పశ్చిమాసియా పరిస్థితి ఎలాంటి పర్యవసానాలకు దోహదం చేయనుందో తరువాత గానీ వెల్లడికాదు. మార్చినెలలో అమెరికా కుదురుతుందని చెబుతున్న ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.అమెరికాలో పన్నులు పెంచిన కారణంగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది మన ఎగుమతులు 12.8శాతం తగ్గాయి.

ఇప్పుడున్న వాణిజ్య లోటు గురించి గుండెలు బాదుకోకుండా దీర్ఘకాలంలో వచ్చే లాభాల గురించి దృష్టి పెట్టాలని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ మన దేశంలో వెలువడుతున్న మీడియా కథనాలపై వ్యాఖ్యానించింది. లోటు గురించి అతిగా కేంద్రీకరించి నిజమైన అవకాశాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నది.ఏప్రిల్‌ 2025 నుంచి ఫిబ్రవరి 2026వరకు మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 38శాతం పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు మన వాణిజ్య శాఖ వేసిన అంచనాను ఆ పత్రిక ఉటంకించింది. ( ఇదే నెలల్లో అమెరికాకు మన ఎగుమతులు 79.3బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ వృద్ధి రేటు 3.8శాతమే.) ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 15శాతం పెరిగి 120 బిలియన్లకు చేరటంతో వాణిజ్య లోటు 102 బి.డాలర్లుగా ఉంది, ఏడాది ముగిసేలోగా ఇదే దామాషాలో ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. గత ఏడాది కాలంగా సాధారణ సంబంధాల ఏర్పాటుకు మన వైపు నుంచి చూపుతున్న చొరవకు స్పందనగా మన దేశం నుంచి చైనా దిగుమతులను వ్యూహాత్మకంగానే పెంచిందన్నది వాస్తవం.ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి మరి. ఏటా అప్పనంగా వందబిలియన్‌ డాలర్ల మేర మనదేశం హారతిపళ్లెంలో పెట్టి అప్పగిస్తుంటే వాటిని బీజింగ్‌ పోగొట్టుకుంటుందా ! ఇప్పుడున్న సంబంధాలు ఇలాగే మెరుగుపడితే రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 1.4లక్షల కోట్ల డాలర్ల మేర వాణిజ్యలావాదేవీలకు అవకాశం ఉందని 2025 డిసెంబరులో మన దేశంలో చైనా రాయబారి షు ఫెయిహాంగ్‌ చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నికబుర్లు చెప్పినా ప్రపంచ ఫ్యాక్టరీగా మారలేదు, సమీప భవిష్యత్‌లో అలాంటి సూచనలు కూడా లేవు.వస్తు, సేవారంగాలను చూస్తే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎగుమతులు తక్కువగా ఉన్నందున ఏటా మొత్తం మీద వాణిజ్య లోటు వందబిలియన్‌ డాలర్ల వరకు ఉంటున్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిబ్రవరి వరకు 5.8శాతం వృద్ధి రేటుతో 791 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను ఎగుమతి చేశాము. ఇదే సమయంలో 7.4శాతం వృద్ది రేటుతో 900 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాం. ఇతర దేశాలతో మన వాణిజ్యం మిగులు ఉన్న కారణంగా కేవలం ఒక్క చైనాకే వంద బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లిస్తున్నప్పటికీ మన మొత్తం వాణిజ్య లోటు వంద బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మిగతా దేశాలన్నించి నుంచి సంపాదించిన మొత్తాన్ని చైనాకు అప్పగిస్తున్నాం. ప్రవాస భారతీయులు ఏటా 135బిలియన్‌ డాలర్లు మనదేశానికి పంపుతున్న కారణంగా డాలర్ల కొరతను గణనీయంగా తీర్చుతున్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉండి వృద్దిని పరుగులు పెట్టిస్తున్నట్లు బడాయిచెప్పుకోవటం తప్ప ఎగుమతులను పెంచలేని కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే దీనికి కారణం.మన వస్తువుల కంటే సేవల ఎగుమతుల రేటు ఎక్కువగా ఉంది.ధరల విషయంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం ఎగుమతుల్లో 403 డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతుల్లో 900బిలియన్‌ డాలర్లలో 714 బి.డాలర్లు వస్తువులే ఉన్నాయి. మన దిగుమతుల్లో ఎరువుల వాటా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 64.5శాతం పెరిగాయి, ధరలు కూడా ఎక్కువే. వర్తమాన పశ్చిమాసియా సంక్షోభం వీటి దిగుమతుల బిల్లును ఎంతగా పెంచుతుందో చెప్పలేము. ఇప్పటికే గల్ఫ్‌ నుంచి దిగుమతలకు అంతరాయ కలిగిన కారణంగా మన యూరియా ఫ్యాక్టరీలు సగం సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలు వచ్చే రంగాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎరువుల వంటివి అంతర్జాతీయ ధరలతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున వాటి జోలికి పోవటం లేదు. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు నిలిపివేసిన తరువాత తప్పనిసరై రామగుండం వంటి మూతబడిన వాటిని పునరుద్దరించటం తప్ప కొత్త వాటిని నెలకొల్పటం లేదు. చివరకు యూరియా దిగుమతులకు సైతం చైనా మీద ఆధారపడ్డాం. గతేడాది మన దేశంలో యూరియా కొరతకు చైనా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణం. అందువలన మన మీడియా విశ్లేషకులు, ఇతరులు గమనించాల్సిందేమంటే తమ వస్తువులను కొనాలని చైనా వారు మనలను ఎప్పుడూ దేబిరించలేదు. రెండు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు లేవు. అది చేసే ఎగుమతులు మనకు పెద్దమొత్తంగా కనిపించవచ్చుగానీ మొత్తం ఎగుమతుల్లో 3-4శాతం మధ్యనే మన వాటా ఉంది. అందువలన వీధుల్లో వీరంగం వేసేవారిని చూసి మనం తలుపులు మూసుకుంటే ఆ మాత్రం ఎగుమతులకు నూతన మార్కెట్లను చూసుకోలేని స్థితిలో చైనా లేదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !

11 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#China arms to Iran, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

త్వరలో ఇరాన్‌పై యుద్ధం ముగుస్తుందని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అది నిజమో కాదో ఎత్తుగడో తెలియదు. సోమవారం నాడు 116 డాలర్లకు పెరిగిన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బుధవారం నాడు ఇది రాసిన సమయానికి 87 డాలర్లకు తగ్గింది.. ఇదే విధంగా మన స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం నాడు రెండున్నరవేల పాయింట్ల వరకు పతనమైన సూచి మంగళవారం నాడు ఆరువందల పాయింట్లు పెరిగింది.ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.యుద్ధ ప్రభావం మన మీద పడుతున్నది.పెట్రోలు, డీజిలు కొరత లేదు గానీ వంటగ్యాస్‌ మండుతున్నది.ఇది ఒక అంశం. ఇరాన్‌పై జరిగిన దాడి సందర్భంగా కొంత మంది చైనా ఆయుధాల పనితీరు గురించి చర్చ చేస్తున్నారు. పాకిస్తాన్‌, వెనెజులా తరువాత ఇరాన్‌లో కూడా అవి తుస్సుమన్నాయని చెబుతున్నారు.ఇరాన్‌ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినట్లు , రోజూ ప్రయోగించే క్షిపణుల సంఖ్య పడిపోయినట్లు మరికొన్ని కథనాలు.మరోవైపున దాని క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశామని అమెరికా చెబుతోంది.ఇంకో వైపున రోజూ క్షిపణి దాడుల వార్తలు తెలిసిందే. యుద్ధ సమయాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు సహజమే.

ఇరాన్‌కు మిత్రదేశాలు అని చెబుతున్న చైనా, రష్యా దాని తరఫున యుద్దంలోకి ఎందుకు దిగటం లేదు అని కొందరు తెలివిగా ప్రశ్నిస్తున్నామనుకుంటున్నారు. అమెరికా దాడిని అవి రెండూ ఖండించాయి.మనమూ యుద్ధంలోని మూడు దేశాలకూ మిత్రులమే కదా మనమెందుకు యుద్ధంలో అడుగుపెట్టలేదని మోడీని ఎవరైనా ప్రశిస్తున్నారా ? కనీసం ఇరాన్‌తో మాట్లాడను కూడా మాట్లాడలేదే !.అనేక పశ్చిమ దేశాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి, అవి కూడా తమ మిలిటరీలను దించలేదు. అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన కారణంగా గల్ఫ్‌దేశాల మీద ఇరాన్‌ దాడులు జరుపుతున్నది.ప్రత్యక్ష బాధితులైన ఆ దేశాలు కూడా యుద్దాన్ని ఎందుకు ప్రకటించటం లేదు. వాటి రక్షణకు అమెరికా చేస్తున్నదేమిటి ? చెప్పేవాడు లోకువ అయితే అడిగేవాడు రెచ్చిపోతుంటాడు.

కొందరు విశ్లేషకులు చెబుతున్నదేమిటి ? తాజా యుద్ధంతో ప్రధానంగా నష్టపోయేది చైనా.హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా నిలిచిపోతుంది.ఇరాన్‌లో దాని పెట్టుబడులకు దెబ్బతగులుతుంది. దాని ఆయుధాలు పనికిరావని తేలినందున కొనేవారు ఉండరు.అసలు ఇరాన్‌కు చైనా ఇచ్చిన ఆయుధాల గురించి ఊహాగానాలు తప్ప నిజానిజాలను నిర్ధారణగా చెప్పటం లేదు. చైనా ఆయుధాల గురించి చెబుతున్నవి వాస్తవం కాదు అని చెబుతున్నవారూ ఉన్నారు. విమానదాడుల నుంచి రక్షణకు జనవరిలో చైనా రాడార్లను భారీ విమానంలో పంపిందన్నది ఒక వార్త. రాడార్లు పెద్దవిగా ఉన్నందున ఉపగ్రహాల నిఘా నుంచి వాటిని దాచటం కష్టం. గతంలో చైనా ఆయుధాలను సరఫరా చేసింది. ఐరాస 2007లో చేసిన తీర్మానం తరువాత వాణిజ్యం నిలిచిపోయింది. అంతకు ముందుకుదిరిన ఒప్పందాల ప్రకారం 2015వరకు సరఫరాలు కొనసాగాయి. ఇరాన్‌ తయారు చేస్తున్న షాహేద్‌ డ్రోన్ల గురించి 2022 దర్యాప్తులో తేలిన అంశం ఏమంటే 80శాతం భాగాలు పశ్చిమదేశాలు అడ్డదారుల్లో అందించినవే.ఓల్టేజ్‌ కన్వర్టర్లు, ఇంజన్లు మాత్రం చైనావని చెప్పారు. ఇతర దేశాల డ్రోన్లు దొరికినపుడు వాటిని పరిశీలించి అదే రకాలను ఇరాన్‌ స్వయంగా తయారు చేస్తున్నది. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలతో కూడా చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే సమతుల్యత పాటించాలి గనుక యుద్ధ విమానాలు కావాలని ఇరాన్‌ వత్తిడి తెచ్చినప్పటికీ వాటిని సరఫరా చేయలేదు. అయితే చైనా ఏమి సరఫరా చేసింది.2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూమి, అంతరిక్షంలో సమాచార సేకరణ కేంద్రాలను ఇరాన్‌లో ఏర్పాటు చేసింది.తరువాత 2021లో కుదిరిన 25 సంవత్సరాల ఒప్పందంలో కూడా వాటిని చేర్చింది.దాంతో బెయిడౌ-3 ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన 12రోజుల దాడుల సమయంలో ఇరాన్‌లోని జిపిఎస్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆ యుద్ధం తరువాత జూన్‌ నెలలో పౌర, మిలిటరీ అవసరాలకు బెయిడౌ-3 మీద పూర్తిగా ఆధారపడేందుకు ఇరాన్‌ ఒప్పందం చేసుకుంది. బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న మిజరావిషన్‌ అనే ఉపగ్రహ నిఘా కంపెనీ సేవలను కూడా పొందుతున్నది.

తాజా అమెరికా దాడుల సమయంలో ఇజ్రాయెల్‌లోని అవడా విమాన స్థావరంలో ఉంచిన 11 అమెరికా ఎఫ్‌-22 బాంబర్లు, అమెరికా యుద్ద నౌకలు, గగనతలంలోనే ఇంథనం నింపుకొనే విమానాల వంటి వాటి చిత్రాలను, సమాచారాన్ని ఆ సంస్థ ఇరాన్‌కు అందచేయటంతో వాటిని గురిచూసి కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమాచారం రష్యా కూడా అందచేసి ఉంటుంది. ఈ కారణంగానే ఆ రెండు దేశాలూ సమాచారమిస్తున్నాయని అమెరికా మీడియా రాసింది. ఆధునిక యుద్ధంలో ఆయుధాలతో పాటు శత్రువు కదలికలను పసిగట్టే సమాచారమూ అంతే ముఖ్యమైనది.ఈ రంగంలో అమెరికాకు ధీటుగా చైనా అనేక ఉపగ్రహాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌-రష్యా పోరులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అందించిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ అనేక దాడులు చేసి రష్యాకు నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.అమెరికా బెదిరింపులతో మనదేశం ఇరాన్‌ చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇతర దేశాలు కూడా అదే చేశాయి. ఈ పూర్వరంగంలో ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 80శాతం చైనాకే జరుగుతున్నాయి. ఈ మొత్తం చైనా దిగుమతుల్లో 12-15శాతమే. హార్ముజ్‌ జలసంధిని ఇతర దేశాల నౌకలకు మూసివేసినప్పటికీ చైనా వాటిని మినహాయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పరిమితంగానే చైనా ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి మినహాయింపు మనకు ఇవ్వలేదు, కారణం మనం ఇజ్రాయెల్‌, అమెరికా వైపు మొగ్గటమే అని చెప్పవచ్చు.

రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినపుడు ఎవరి బలాన్ని వారు ప్రదర్శిస్తారు. ఎలాంటి క్షిపణి ప్రయోగంలేకుండానే అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాలను చైనా దెబ్బతీస్తున్నందంటూ తాజాగా ఒక విశ్లేషణ వెలువడింది.అమెరికాకు పోటీగా చైనా మరో యుద్ధాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రపంచ బలాబలాలను సమతూకం చేసేందుకు చైనా మార్చినెల ఐదున 15వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఖనిజాల రంగంలో పురోగతికి దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. అది పైకి ఆర్థిక పరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చడీ చప్పుడు లేకుండా చైనా ముందుకు పోతున్నతీరును ఎవరూ పట్టించుకోవటం లేదంటూ పెట్టుబడుల విశ్లేషకుడు షనాకా అన్సెలెమ్‌ పెరేరా వాపోయాడు. ఐదేండ్ల కాలంలో కృత్రిమ మేథ వినియోగం ద్వారా పరిశ్రమల్లో 1.4లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అనేక రంగాల గురించి దానిలో పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఒక ఇనుపతెరను ఏర్పాటు చేసింది.ఫాక్స్‌సిలికా పేరుతో మనతో సహా అనేక దేశాలతో ఒక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక చిప్స్‌, వాటి తయారీకి అవసరమైన యంత్రాలను అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చైనా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఒక ఆర్థిక పథకం కాదు, అమెరికాతో యుద్ధ ప్రణాళిక అని పెరేరా పేర్కొన్నాడు. అమెరికా చిప్స్‌ చట్టం ఒక రైఫిల్‌ వంటిది కాగా చైనా పంచవర్ష ప్రణాళిక ఒక అమ్ముల పొది అని వర్ణించాడు.దీనిలో విలువైన ఖనిజాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం వహిస్తున్నది.ఈ ఖనిజాలు విద్యుత్‌ వాహనాల నుంచి లక్ష్యాల మార్గదర్శనం చేసే వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ల వరకు ఎంతో ముఖ్యమైనవి. అమెరికా ప్రతి ఎఫ్‌-35 ఆధునిక యుద్ద విమానానికి వందల కిలోల ఖనిజాలు, లోహాలు అవసరం. ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలకు ఇవి లేకుండా పని జరగదు.

చైనా మీద అమెరికా 2018 నుంచి వాణిజ్యంతో పాటు చిప్స్‌ యుద్ధం కూడా చేస్తున్నది.దీనికి ప్రతిగా బీజింగ్‌ నూతన ఎత్తుగడలను రంగంలోకి తెచ్చింది. విలువైన ఖనిజాలు, వాటితో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరకు ఉత్పత్తిలో నైపుణ్యం సాధించి, ఇతర దేశాలకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.వీటి దిగుమతులకు సంబంధించిన అమెరికా రక్షణశాఖ చేసుకున్న ఒప్పందాలు 2027లో ముగుస్తాయి.చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికాకు సంవత్సరాలు, దశాబ్దం పట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌ పోరులో అమెరికా పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలతో కూడిన ఆయుధాలను వినియోగిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంలో అమెరికన్లు క్షిపణులు,డ్రోన్లను అడ్డుకొనే ఆయుధాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు, మరోవైపు చైనా వాటి తయారీకి అవసరమైన ఆ ఖనిజాల సరఫరాను కఠినతరం కావిస్తున్నదని పెరేరా వాపోయాడు. తెలివితేటలు అమెరికా సొత్తు కాదు. విలువైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం రానున్న 15 సంవత్సరాలు ఉంటుందని అంచనా. నిజంగానే చైనా తన పట్టు నిలుపు కుంటే అమెరికా ఎఫ్‌-35 విమానాలు ఎగిరే అవకాశాలు లేవని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది కాస్త అతిగా ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.

చైనా ఆయుధాల్లో పసలేదని ఒక వైపు ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో చైనా కూడా అలాంటి ఆధునిక మిలిటరీ ఉత్పత్తులను సేకరించుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా గడచిన ఐదు సంవత్సరాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను 72శాతం తగ్గించింది. మరోవైపు మనదేశం ప్రపంచంలో సాధారణ పరిస్థితుల్లో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాం.(యుద్ధంలో ఉంది కనుక ఉక్రెయిన్‌ మనకంటే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది) విదేశీ ఆయుధాల స్థానంలో చైనా తన స్వంత ఉత్పత్తులను చేరుస్తున్నది. మరోవైపు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌లకు ఆధునిక ఆయుధాలను అమెరికా అందచేస్తున్నది, అవసరమైతే తైవాన్‌ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటామని అమెరికా, జపాన్‌ ప్రకటించాయి. నిజంగా తన ఆయుధాలు నాశిరకమైతే చైనా వాటితోఅమెరికాను అడ్డుకోగలదా ! చిత్రం ఏమిటంటే చైనా ఆయుధాలను చూసి ఇరుగు పొరుగు దేశాలు ఆధునిక ఆయుధాలను సమీకరించుకుంటున్నట్లు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు పాటపాడుతుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) తాజాగా వివిధ దేశాల ఆయుధాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఐరోపా 2021-25 సంవత్సరాలలో 33శాతం, ఆసియా,ఓషియానా దేశాలు 31శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి.అంతకు ముందు ఐదు సంవత్సరాలతో పోల్చితే ఇరవై శాతం తగ్గాయి. చైనా 72, దక్షిణ కొరియా 54, ఆస్ట్రేలియా 39 శాతం తగ్గించాయి. గతంలో ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల్లో ఉన్న చైనా 1991-95 తరువాత ప్రస్తుతం 21వదిగా ఉంది. తన దిగుమతుల్లో రష్యా నుంచి 66శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా సాధించిన ప్రగతి గురించి కొందరు ఉక్రోషంతో తక్కువ చేసి చూడవచ్చు. కానీ విధాన నిర్ణేతలు వాటి ఆధారంగా అంచనా వేసుకుంటే పప్పులో కాలేసినట్లే !అఱa

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d