• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాదేదీ మోడీ భజనకనర్హం : చంద్రబాబు అండ్‌కో ముందంజ, వెనుకబడిన జగన్‌, చమురుపై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు మతలబేమిటి !

02 Thursday Apr 2026

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, excise duty cut on fuel, Nara lokesh, Narendra Modi Failures, YS jagan

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.భారత చక్రవర్తి నరేంద్రమోడీకి భజన చేసేందుకు ఏ అవకావశాన్నీ వదలం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాజు చంద్రబాబు నాయుడు, యువరాజు లోకేష్‌ నాయుడు, సామంత రాజు పవన్‌ కల్యాణ్‌. పెట్రోలు,డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం లీటరుకు పది రూపాయల చొప్పున ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గించిందన్న వార్త రాగానే ముగ్గురూ మోడీని అభినందించారు. ఎందుకటా ! వినియోగదారులకు ధర తగ్గించినందుకు కాదు, పెంచనందుకు అన్నది వారి స్పందనల సారం. పూర్వం రాజుల కాలంలో రాజుగారు ఏది చేసినా గొప్పదే అని పొగిడే భట్రాజుల(కులం గురించి కాదు)ను వారు గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. భట్రాజులకు రాజులు, రంగప్పలు నజరానా ఇచ్చేవారు, కేంద్రం ఇస్తున్నది వడ్డీలకే చాలటం లేదని చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నట్లు లీకు వార్తలు. ఈ పూర్వరంగంలో మోడీని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా ఒరగబెడతారా ? వ్రతం చెడ్డా ఫలం దక్కదా ! చూద్దాం. కొసమెరుపు ఏమంటే నరేంద్రమోడీని పొగడటంలో పోటీపడే వైసిపి నేత జగన్‌మోహనరెడ్డి ఈ విషయంలో వెనుకబడినట్లు కనిపిస్తున్నది, స్పందన కనిపించలేదు, వినిపించలేదు. ఇక్కడ ఒక్క సందేహం. చంద్రబాబు సిఎం, పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి, మరి మోడీని పొగడటంలో మంత్రిలోకేష్‌ పాత్ర ఏమిటి ? పలుకుబడి, ప్రతిష్ట పెంచేకసరత్తులో భాగమా ? మిగిలిన మంత్రులు ఎందుకు స్పందించలేదు.ఎవరికి తోచింది వారు అనుకొనే స్వేచ్చ ఉంది గనుక వదిలేద్దాం !చిత్రం ఏమిటంటే వినియోగదారుల మీద విపరీత భారం మోపినపుడు చంద్రబాబు అండ్‌ కో మౌనంగా ఉండి ఇప్పుడు ఏదో ఒరగబెట్టినట్లు భజన చేశారు. ?ఏమి రాజకీయంరా నాయనా ! అసలు నరేంద్రమోడీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు ?

ఎక్సయిజ్‌ పన్ను తగ్గింపు వార్త వినగానే శ్రీరామనవమి వేడుకల్లో ఉన్న జనం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెరుగుతాయని మానసికంగా సిద్ధం అయిపోయిన వారు నిజమేనా మోడీ సర్కార్‌ ఇంత మేలు చేసిందా అని కాళ్లు చేతులు గిల్లుకున్నారు, తలలు కొట్టుకున్నారు.చర్మాలు స్పందించటంతో రామా ఇలా కరుణించావా అని సంబరపడ్డారు. అయితే బంకుల వద్దకు వెళ్లగానే ఆ ” తగ్గింపు ” అంబానీ, నయారా వంటి ప్రైవేటు కంపెనీలతో బాటు కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప వినియోగదారులకు కాదని తెలియగానేే చల్లబడిపోయారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గదాడుల కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఆ పేరుతో నయారా అనే ప్రైవేటు కంపెనీ పెట్రోలు మీద లీటరుకు ఐదు, డీజిలు మీద మూడు రూపాయల చొప్పన ధర పెంచింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పవర్‌ పెట్రోలు ధర లీటరుకు రు.2.36వరకు పరిశ్రమల్లో ఉపయోగించే డీజిల్‌ ధరను 22 రూపాయలు పెంచింది. దిగుమతి ఖర్చు పెరిగినందున మన దేశంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు లీటరు పెట్రోలు మీద రు.18-20. డీజిలు మీద రు.30-35 నష్టం వస్తున్నదని చెబుతున్నారు. (అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమైనపుడు వాటికి ఎంత లాభవచ్చిందో చెప్పరు) అందువలన వాటికి ఉపశమనం కలిగించేందుకు మోడీ పూనుకున్నారు. ప్రత్యేక ఎక్సయిజ్‌ డ్యూటీని పెట్రోలు మీద రు.13ను మూడుకు తగ్గించగా, డీజిల్‌ మీద పదిరూపాయలను పూర్తిగా ఎత్తివేశారు.ఈ శ్రద్ధ కోట్లాది మంది వినియోగదారుల మీద లేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం కాగానే వంటగ్యాస్‌ మీద గృహ వినియోగదారులకు అరవై రూపాయలు పెంచారు, ముష్టిగా విదుల్చుతున్న 40రూపాయల సబ్సిడీని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తివేశారు, అంటే వంద రూపాయల మేరకు వడ్డించారు.

అచ్చేదిన్‌ పేరుతో 2014లో అధికారానికి వచ్చిన మోడీ జనాలకు ఏదో ఒరగబెడతారని అందరూ ఆశించారు.అదనంగా అన్నవస్త్రాలు ఇస్తారనుకొంటే ఉన్న వస్త్రాలను లాగేసుకున్నట్లు కొత్తగా మేలు చేస్తారనుకుంటే డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదిల్చారు.ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేశారు. మేలు సంగతి తరువాత భారం ఎలా మోపారో చూద్దాం. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం చమురు రంగం నుంచి ఎక్సైజ్‌ డ్యూటీ రాబడి రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26 తొలి ఆరునెలల్లో రు.1.30వేల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అసలు సిసలు ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40,(దీన్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంది) ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 వసూలు చేస్తున్నారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు రు.13లో పది రూపాయలు తగ్గించినప్పటికీ అది వినియోగదారులకు చేరటం లేదు. సాధారణ డీజిల్‌పై పదహారు రూపాయల బాదుడులో పది రూపాయలు రద్దు చేశారు. అయినా వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గలేదు. అంటే చమురు మార్కెట్‌ కంపెనీలు పది రూపాయల మేరకు ధరలను పెంచినట్లే.ఈ మాత్రానికే మోడీకి భజన చేయాలా ?

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం తగ్గిన ఆదాయలోటును ఎలా సర్దుబాటు చేయనుంది ?బడ్జెట్‌లో సంక్షేమ పధకాల కేటాయింపులకు కోత పెట్టటం లేదా ఏదో ఒకసాకుతో జిఎస్‌టి, సెస్‌ల పెంపుదలకు పూనుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు.చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.అధికారులెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు ? ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంటే ఏడాదికి రు.1.68లక్షల కోట్లు. మోడీ సర్కార్‌ వంచన గురించి చెప్పుకోకపోతే జనాలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత మార్చినెల 25వ తేదీ వరకు ఉన్న కొనుగోలు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఈ వివరాలు ఏ కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌ వారో చెప్పినవి కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. నాలుగేండ్ల పాటు జనాల నుంచి లక్షల కోట్లు అదనంగా వసూలు చేసి ఖజానా నింపుకొని అదానీ, అంబానీ వంటి వారికి సబ్సిడీలు రూపంలో కట్టబెట్టారు, పారుబాకీల పేరుతో లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు.ఇప్పుడు ధరలు పెరిగి ఒక నెల రోజులు కూడా గడవక ముందే చమురు కంపెనీల కోసం నడుంకట్టారు. మోడీ మీద తెలుగుదేశం, జనసేన, వైసిపి వంటి పార్టీలకు ఉన్న మోజు తెలిసిందే. అది ఎంత ఉన్నా జనాన్ని ఇలా చావబాదుతుంటే పల్లెత్తు విమర్శ చేయలేదు.అఫ్‌ కోర్స్‌ జనానికి కూడా ఆ మత్తు వదలలేదు అన్నది నిజం. ఇతర సందర్భాలలో మాట్లాడినపుడు బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు అంటారు. కానీ ఆచరణలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసినట్లు కనిపించటం లేదా ?

దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ గుండెలు బాదుకుంటారు. దీనికి రూపాయి విలువపతనాన్ని అరికట్టటంలో వైఫల్యం లేదా ? మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 94చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ అని చెప్పక తప్పదు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా దిగజారింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్ని కలసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే. ఇలాంటివారు ఆత్మనిర్భరత, వికసిత్‌ భారత్‌ పేరుతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతుంటే జనం చెవుల్లో పూలు పెట్టుకొని తలలు ఊపాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని నాలుగేండ్లు ఎందుకు పక్కన పెట్టారో ఇప్పుడు తిరిగి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ?

రాజకీయనేతలను కాసేపు పక్కన పెడదాం. వారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తెలిసిన జనంలో అసలు ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? నిజంగానే ఈ ధోరణి గురించి పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలు వారికి పట్టవు. పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది. మంచి రోజులను(అచ్చేదిన్‌) తెస్తామంటే జనం నమ్మారు. ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించినపుడు జనం నిజమే కదా నిజమే కదా అనుకున్నారు. 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీసినమాట నిజం. తరువాత చంద్రబాబును వదలి వేశారు.నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే 2024 ఎన్నికల వరకు అది జనం సమస్యలైనా, జగన్‌ వ్యవహారశైలినైనా నిలదీశారు, తాటవలిచారు. ఇప్పుడు తత్వం తలకెక్కింది గనుక మౌన దీక్ష పట్టారు. అక్రమం జరుగుతుంటే మౌనంగా ఉండమని సనాతనం కూడా ఎక్కడా చెప్పలేదు.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినట్లు తెలియగానే ఎవరైనా వెంటనే దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, తక్కువ మొత్తమే అని తెలిస్తే పోనీలే అని ఊపిరి పీల్చుకుంటాం.అదే కేంద్ర ప్రభుత్వమైనా మరొకరైనా చమురు పన్ను పేరుతో మన పర్సుకొట్టేస్తున్నపుడు ఎంత పోగొట్టుకున్నాం అని ఆలోచించాలా వద్దా ? అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాకపోతే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ పోరు మరో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందా !

02 Thursday Apr 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, Donald trump, Imperialist war, Netanyahu

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్టకూటమి ఇరాన్‌పై ప్రారంభించిన దాడులకు ముందు వారు అనుకున్నది ఒకటి అయింది, అవుతున్నదీ మరొకటి.పండుగాడి దెబ్బ తగిలినట్లుంది ట్రంప్‌కు, అందుకే ఏం మాట్లాడుతున్నాడో, ఉన్మాదంతో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇది రాస్తున్న సమయానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవకపోయినా దాడులను ముగించాలనుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ భీకరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ఐదవ వారంలో ప్రవేశించాయి. జలసంధిని తెరవటం తన ప్రాధాన్యతల్లో లేదన్నాడు, అందుకే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది.ఎన్ని అదిరింపులు, బెదిరింపులకు పాల్పడినా నాటో కూటమి దేశాలు ఇది తమ యుద్ధం కాదంటూ జలసంధి ఛాయలకు వచ్చేది లేదని చెప్పాయి. మీ మీద దాడులు జరుపుతున్నా మీకు పౌరుషం లేదా అంటూ దాడుల్లో భాగస్వాములను చేసేందుకు గల్ఫ్‌ దేశాలను రెచ్చగొట్టినా కావాలంటే నష్టాల ఖర్చులను భరిస్తాం తప్ప వచ్చేది లేదన్నట్లుగా అవి ఉన్నాయి.దీంతో ట్రంప్‌కు ఉన్న పిచ్చికాస్త మరింత ముదిరింది.ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే అమెరికా దినపత్రిక కథనం సారాంశం ఇలా ఉంది.హార్ముజ్‌ జలసంధిని తెరవకపోయినా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ దాడులను ముగించేస్తానని మిత్రదేశాలకు ట్రంప్‌ చెప్పాడు. వ్యూహాత్మకమైన ఆ జలసంధిని తెరిపించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ట్రంప్‌ చెప్పిన గడువు దాటి వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.జలసంధిని తెరిపించే అంశాన్ని తరువాత చూసుకోవచ్చు ప్రస్తుతానికి అది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ముందు ఇరాన్‌ నౌకా దళాన్ని, క్షిపణులు తయారీ సామర్ధ్యాన్ని బలహీనపరచి దాడులను నిలిపివేస్తే తరువాత దౌత్యపరంగా టెహరాన్ను వత్తిడి చేయవచ్చు. అది కూడా విఫలమైతే ఐరోపా ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రదేశాలు రంగంలోకి దిగి చొరవ చూపాలని ట్రంప్‌ కోరతాడు.మిలటరీ చర్యలను నిలిపివేసేందుకు జలసంధిని తెరిపించటం ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాదని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌, దాడులు ముగిసిన తరువాత ఏదో విధంగా జలసంధి తిరిగి తెరుచుకొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చెప్పాడు.ఎందుకంటే మూసివేయటం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధం అని రూబియో అన్నాడు. నౌకా దళంలో కొంత భాగాన్ని ముంచివేయటంతో సహా భారీ నష్టాలు జరిగినా ఇంకా ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది. త్వరగా దాడులను ముగిస్తానని చెబుతూనే ఇప్పటికే ట్రిపోలీ అనే భారీ యుద్ద నౌక, రెండున్నరవేల మందికి పైగా మెరైన్లను మధ్య ప్రాచ్య ప్రాంతానికి అమెరికా తరలించింది, మరో పదివేల మంది పదాతి దళాలను చేరవేసేందుకు చూస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 113 డాలర్ల వద్ద ఉండగా మనదేశం దిగుమతి చేసుకొనే రకం ముడి చమురు ధర 121 డాలర్లు(నాలుగురోజుల నాటిది) ఉంది. అంతకు ముందు 157డాలర్లకు పెరిగింది.

దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ చర్చల సంగతి ఎటూ తేలలేదు, అమెరికా షరతులకు లొంగేది లేదని ఇరాన్‌ కరాఖండిగా చెప్పింది.పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచంలో తలెత్తే ఆర్థిక సమస్యల గురించి చర్చ మొదలైంది. నెల రోజులు దాటిన యుద్దంతో చమురు నుంచి ఆహారం వరకు ప్రభావితం అవుతున్నాయి.అమెరికాకు మంగళవారం నాటి వరకు 36 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ప్రతి సెకనుకు 11,574 డాలర్లు (డాలరకు 95 రూపాయలు) ఖర్చు అవుతున్నాయి. ప్రపంచం 1970దశకం నాటి స్టాగ్‌ఫ్లేషన్‌కు( ఆర్థిరంగం గిడసబారటం, ధరలు, నిరుద్యోగం పెరుగుదల దీని లక్షణాలు) గురవుతుందా అని కొందరు సందేహిస్తుండగా పరిస్థితి తీవ్రంగా ఉంది తప్ప అలాంటి అవకాశం లేదని మరికొందరంటున్నారు. అమెరికాలో గడచిన తొమ్మిది నెలల్లో మూడుసార్లు అక్కడి కార్మికవర్గం రాజులు లేరు, రాజరికాలు లేవు అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తొలిసారి 50,రెండవసారి 70, మూడవసారి 90లక్షల మంది పాల్గ్గొన్నారు.మూడవసారి మార్చి చివరి వారంలో జరిగిన ప్రదర్శనల్లో అమెరికాలో జరిగిన రోజునే వివిధ ఖండాలలోని పన్నెండు దేశాలలో కార్మికులు స్థానిక సమస్యలను తీసుకొని ప్రదర్శనలు జరపటం విశేషం. అమెరికా వినియోగదారులపై భారం ఎలా పడిందంటే ఫిబ్రవరి నెలలో జాతీయ సగటు గ్యాస్‌ ధర 2.98 డాలర్లు ఉంటే ఆదివారం నాడు అది 3.98 డాలర్లు ఉంది.సరఫరా, ధరల నియంత్రణలో భాగంగా 32దేశాలు,13 సహదేశాలు (వీటిలో మనదేశం లేదు) సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఇంథన సంస్థ(ఐఇఏ) తన పర్యవేక్షణలో ఉన్న 120కోట్ల పీపాల చమరులో 40 కోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థ నిబంధన ప్రకారం ప్రతి సభ్యదేశం 90 రోజులకు సరిపడా చమురు ఉత్పత్తులను నిల్వచేసుకోవాలి. ఈ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌ చరిత్రలో సరఫరా విచ్చిన్నంలో అతిపెద్దదని ఆ సంస్థ పేర్కొన్నది.దీనికి ట్రంప్‌ బాధ్యుడని వేరే చెప్పనవసరం లేదు.దేశం కోసం-ధర్మం కోసం ఏమైనా చేస్తామని ఒట్టి కబుర్లు చెప్పటం తప్ప తాజా పరిస్థితికి కారకుడైన తన మిత్రుడిని నరేంద్ర మోడీ ఇంతవరకు తప్పు పట్టలేదు.పరీక్షా సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందంటారు.

ఇరాన్‌పై దాడుల తరువాత అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి విలువ ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేము.మన దేశంలో రు.51లక్షల కోట్లు నష్టపోయినట్లు అంచనా, ఇంకా పతనం కొనసాగితే నష్టాలు పెరుగుతాయి.అమెరికాలో జతకూర్చిన సమాచారం ప్రకారం ఒక్క రోజులో ఎస్‌ అండ్‌ పి 500 సూచిక 1.66శాతం పతనంతో ఒక లక్ష కోట్ల డాలర్లు, నాస్‌డాక్‌ 2.09శాతం పతనంతో ఆరువందల బిలియన్‌ డాలర్లు, డౌ సూచిక 1.2శాతం పతనం 300బి.డాలర్లు మొత్తం ఒక్కరోజులో 1.2లక్షల కోట్ల డాలర్లు ఆవిరైంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా మాంద్యంలోకి వెళ్లేందుకు 37శాతం అవకాశాలున్నట్లు పోలీమార్కెట్‌ అంచనా వేసింది.కార్పొరేట్‌ కంపెనీలు పెరిగిన ఖర్చులను వినియోగదారుల మీద మోపితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగేస్తారు,నియామకాలు తగ్గిపోతాయి.అమెరికాలో ఉత్పత్తి అయ్యే డబ్ల్యుటిఐ రకం ముడి చమురు ధర 2025 డిసెంబరులో 57 డాలర్లు ఉంటే ఇది రాసిన సమయంలో 102 డాలర్లు ఉంది.దీనికి అనుగుణంగానే అమెరికాలో ధరలు పెరిగాయి.ఫిబ్రవరిలో విమాన ఇంథనం పీపాధర 99 డాలర్లు ఉంటే మార్చినెల 20న 197 డాలర్లకు పెరిగింది. స్లోక్‌ అనే ఆర్థికవేత్త జనవరిలో అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆశాభావం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్‌ యుద్ధాన్ని ప్రారంభించాడో ఇప్పుడా పెద్దమనిషి స్టాగ్‌ఫ్లేషన్‌ అవకాశాల గురించి హెచ్చరించాడు.

ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది జరుగుతున్నది మరొకటి, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఉన్నాడు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్‌ ఎలా ముగిస్తాడో తెలియదు.స్వస్థిపలకటం అనివార్యం, అయితే అది అమెరికా నిర్దేశించినట్లు కాదు.ఇప్పుడు ఇరాన్‌ తన షరతులను ముందుకు తెస్తున్నది, ఇది ట్రంప్‌ కలలో కూడా ఊహించి ఉండడు. పెట్రోడాలర్‌ను సవాలు చేస్తూ చైనా యువాన్‌తో లావాదేవీలు జరిపేవారి నౌకలను హార్ముజ్‌ జలసంధి నుంచి అనుమతిస్తామని అది ప్రకటించింది.ఆ కరెన్సీలోనే అది కప్పం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ యుద్ధం చైనా పెట్రో యువాన్‌కు శక్తినిస్తుందని అమెరికా డాలర్‌ ఆధిపత్యం బలహీనపడుతుందని ఈ పరిణామాల గురించి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఇతర దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు తనకు అనుగుణంగా ఆడించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలుగా ప్రపంచంలోని చమురు సంపద, ఇతర వనరులను వినియోగించుకొనేందుకు వాటి మీద అదుపు సాధనకు అమెరికా ఎప్పుడో ఎత్తువేసింది.ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ అదే పాత్ర పోషించాలని చూస్తోంది. సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించిందేకు పర్షియా గల్ఫ్‌-ఎర్ర సముద్రాన్ని అనుసంధానం చేసే అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా ఎమెన్‌ ద్వారా తన అదుపులోకి తెచ్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఐరోపా దేశాలను కూడా అది ఒక ఆట ఆడించగలదు. అమెరికా అనుసరిస్తున్న మొరటు సూత్రం ఒక్కటే.ఎవరినైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే అంతర్జాతీయ సూత్రాలను పక్కన పెట్టు, జనం మీద బాంబులువేసి చంపు, దేశాలను నాశనం చేయి, అప్పుడు జనం నిరాశతో లొంగిపోతారు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతమైన గాజాలో చేసింది అదే.ఆసుపత్రులు, స్కూళ్లు, సహాయకేంద్రాలు వేటినీ వదల కుండా నాశనం చేసింది, 70వేల మందికి పైగా పిల్లలు, మహిళలను చంపివేసింది. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చింది. అయినప్పటికీ హమస్‌గానీ, పాలస్తీనియన్లుగానీ ఇజ్రాయెల్‌కు లొంగలేదు.ఇప్పుడు ఇరాన్‌ కూడా యావత్‌ప్రపంచానికి అదే సందేశమిచ్చింది. మీ మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు, మీ అధినేత అయాతుల్లా అలీ ఖమేనిని పదవి నుంచి తొలగిస్తే మీకు రక్షణ కల్పిస్తాం, లేకపోతే దాడులు చేస్తాం అని మెరికా తొలిరోజుల్లో బెదిరించింది.ఆడపిల్లలు చదుకొనే పాఠశాల మీద అమెరికా విమానాలు బాంబులు వేసిన దుర్మార్గం గురించి తెలిసిందే.ఇప్పుడు వేరేగా మాట్లాడుతోంది.

మార్చినెల 31, ఏప్రిల్‌ ఒకటవ తేదీల్లో చైనా సందర్శించాలని ట్రంప్‌ కార్యక్రమం నిర్ణయించుకున్నాడు. ఈ తేదీలకు ఉన్న ప్రాధాన్యత ఏమంటే ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించిన తరువాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972 తొలిసారిగా బీజింగ్‌ను సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో అవసరం లేకపోయినా జపాన్‌ మీద అణుబాంబులు వేసి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. బహుశా డోనాల్డ్‌ ట్రంప్‌ లేదా అతగాడికి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాంటి దుష్టాలోచననే ముందు పెట్టి ఉండాలి. అయితే ఈ సారి ప్రపంచం కంటే తనకు పోటీగా సవాల్‌ విసురుతున్న చైనాను బెదిరించేందుకు, తద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు సిద్దపడినట్లు కనిపిస్తోంది.చైనా పర్యటన ఎప్పుడో ఖరారైంది గనుక ఈ లోగా ఇరాన్ను దెబ్బతీసి దాన్నే చైనా ముందు ప్రదర్శించాలన్న దుష్టాలోచనతోనే ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ట్రంప్‌ఆలోచన ఏమిటి ? ” రెండు మూడు వారాల్లో ఇరాన్‌ మీద విజయం సాధిస్తాం.చైనా వెళ్లినపుడు షీ జింపింగ్‌తో చర్చల్లో చూశారుగా ఇరాన్‌ పాలకులను మార్చాం, అక్కడ గతంలో రష్యాలో బోరిస్‌ ఎల్సిన్‌ అనే తొత్తును పీఠం ఎక్కించినట్లుగా మాకు అనుకూలమైన వాడిని పదవిలో ప్రతిష్టించాం.వాడు అక్కడి చమురు నిల్వలన్నింటి మీద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే వెనెజులా చమురును స్వాధీనం చేసుకున్నా.మీకు ముడి చమురు అవసరం గనుక మేం చెప్పినట్లు వింటే, మాకు అవసరమైన విలువైన ఖనిజాలను మాకు సమర్పించుకుంటే ఓకే లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు పెడతాం ” అని రిహార్సల్స్‌ వేసుకున్న ట్రంప్‌కు ఇరాన్‌ చుక్కలు చూపించింది. దాంతో మార్చినెలాఖరులో చైనా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే నెల 14,15 తేదీల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.జరుగుతున్న పరిణామాలను బట్టి అది కూడా జరుగుతుందా వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. తొందరేం లేదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చన్నట్లుగా చైనా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ట్రంప్‌ వెళతాడో చూద్దాం.చివరిగా చెప్పుకుంటున్నా అతి ముఖ్యమైన అంశం ఒకటుంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అది వియత్నాం,ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, లిబియా ఏ దేశం మీద దాడి చేసినా అమెరికాకు మిత్ర దేశాలు సహకరించాయి.తొలిసారిగా ఇరాన్‌పై దాడికి ముఖం చాటేశాయి, అది తమ యుద్దం కాదని ప్రకటించాయి. కొంత మంది వర్ణించినట్లు ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఇరాన్‌ మీద కాదు, దానికి మద్దతు ఇస్తున్న రష్యా, చైనాల మీద అన్నది నిజమేనా ! చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !

20 Friday Mar 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ 1 Comment

Tags

BJP, Donald trump, India-China trade, Narendra Modi Failures, TRADE BALANCE, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశ వస్తు వాణిజ్య లోటు 34.7 నుంచి 27.1 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు తమ భుజాలను తామే చరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ అసలు విషయం ఏమంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే అది 14.4 బిలియన్‌ డాలర్ల నుంచి పెరిగి రెండింతలైంది.ఒక నెలలో పెరిగి మరొక నెలలో తగ్గటం సర్వసాధారణం, మొత్తంగా ఏడాదిలో ఏం జరిగిందన్నదే గీటురాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి దిగుమతులు 142 శాతం పెరిగితే బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28.7శాతం పెరిగాయి, ఎందుకంటే నిత్యావసర వస్తువు కదా ! ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు గనుక మోడీ సర్కార్‌ వ్యాపార లాభనష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం. మన మీడియాలో మరోసారి చైనా మీద ఆధారపడటం ఎంతో ప్రమాదకరమంటూ హితోక్తుల రూపంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒక దాని శీర్షిక ఏమంటే ”102 బిలియన్‌ డాలర్ల షాక్‌ ” వారు గ్రహించాల్సిందేమంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే రేటింగ్‌లు పెరిగే తరుణం కాదిది.బీజింగ్‌తో ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదంటూ తలుపులు మూసుకున్న మనం పెట్టుబడుల కోసం వాటిని తెరిచాం, గత ఏడు సంవత్సరాలుగా మూతపడిన సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లో భారత్‌-చైనా-నేపాల్‌ సరిహద్దులు కలిసే లిపులేక్‌ కనుమదారిలో జూన్‌ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా నేపాల్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం ముందుకు పోతున్నది. ఇలా చైనా కమ్యూనిస్టులకు ఎర్రతివాచీని పరిచామని తెలిసినప్పటికీ పుట్టుకతో పుట్టిన బుద్ధి గనుక కొందరు హెచ్చరికలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు చైనాతో వాణిజ్య లోటు 102 బిలియన్‌ డాలర్లు దాటింది.మోడీ సర్కార్‌ సాధించిన మరో రికార్డు ఇది.మార్చి నెల కూడా గడచిన తరువాత ఈ తేడా 111.4 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఏడాది క్రితం 91బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతుల ప్రోత్సాహ పిఎల్‌ఐ, వికసిత్‌ భారత్‌ వంటి నినాదాల అమలు, ఆచరణ ఫలితమిది. పెట్టుబడికి కనిపించేది లాభం తప్ప భావజాలం కాదు, దీని అర్ధం భావజాలాన్ని వాడుకోదు అని కాదు.1970 దశకం వరకు చైనాకు ఐరాసలో ప్రవేశం కల్పించకుండా అడ్డుకున్న వాషింగ్టన్‌ తనకు లాభం వస్తుందని గ్రహించే కదా పక్కా కమ్యూనిస్టు చైనాతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టింది.దాని కమ్యూనిస్టు వ్యతిరేకత ఏమైనట్లు ? మనదేశంలో కూడా దాని ఏజంట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను వంటబట్టించుకున్నారు. ఇప్పటికీ రెచ్చిపోతున్నారు. గాల్వన్‌లోయ ఉదంతం తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.నేరుగా పెట్టుబడులను అడ్డుకోకుండా సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే వాటిని పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలనే వంకతో ఆరు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నది కాస్తా ఎలాంటి కారణం చెప్పకుండానే పదిశాతం వరకు పెట్టుబడులు నేరుగా చైనా వాటాదారుగా ఉన్న విదేశీ కంపెనీల నుంచి వచ్చేందుకు అనుమతించింది. దీని గురించి చైనా ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ ఇది చాలదు అన్నట్లుగా ఉందని వార్తలు వచ్చాయి. అందువలన రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించవచ్చు.అవసరం మనది మరి ! కేంద్రంలో ఉన్న బిజెపి, దాని వెనుక ఉండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగానికి ఏమీ తెలియకుండానే మోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చిందనుకుంటే అమాయకత్వం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత రెచ్చగొట్టటం తమను గుడ్డిగా అనుసరిస్తున్నవారిని నిలబెట్టుకొనేందుకు, సంతుష్టీకరించేందుకు కాషాయదళాలు నిత్యం చేస్తున్నదే, దానిలో ఎలాంటి మార్పు లేదు.చైనా వస్తువులు కార్పొరేట్లకు అవసరం. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని అధికారానికి దూరం చేయటం పెద్దపనేమీ కాదు. ఇప్పుడు వారి ప్రయోజనాలే ముందుకు వచ్చాయి గనుక కాస్త తగ్గండి లేకపోతే మీ గురించి ఆలోచించాల్సి వస్తుందన్న హెచ్చరికతో తాజా పరిణామాలు సంభవిస్తున్నాయన్నది పచ్చినిజం. సంఘపరివార్‌ తన అజెండాను దేశం మీద రుద్దేందుకు అధికారం కావాలి గనుక వారి వత్తిడికి లొంగి మౌనంగా ఉంది.చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి, దాని వస్తువులను బహిష్కరించాలంటూ వీధుల్లో వీరంగం వేసిన అపర దేశభక్తులు ఇప్పుడెక్కడా కానరారు, సంఘపరివార్‌ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నది.

గతంలో చైనా బజార్ల పేరుతో పెద్ద ఎత్తున కొందరు దుకాణాలను ఏర్పాటు చేసి మనదేశంలో తయారు చేసే నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగట్టారు.అదే సమయంలో చైనా చాలా తక్కువ ధరలకు వస్తువులను అందచేస్తున్న కారణంగా అనేక మంది అవి చౌక, నాశిరకం అని కూడా ప్రచారం చేశారు.కాని తరువాత కాలంలో నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే చైనా వస్తువులు లేని ఇల్లు లేదు.ప్రస్తుతం మన ప్రభుత్వ పెద్దలు ఎన్ని కబుర్లు చెప్పినా ఔషధరంగం, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహనాలు,సూర్యరశ్మి పలకల వంటి రంగాలలో చైనా నుంచి ముడి సరకులు లేదా సగం తయారైన వస్తువులు, యంత్రాలు, విడిభాగాలు లేకుండా మన దేశంలో అనేక పరిశ్రమలకు మనుగడలేదు. అందుకే కార్పొరేట్‌ శక్తులు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి తప్ప కమ్యూనిజం, చైనా మీద ప్రేమతో కాదు. అవే వస్తువులను మరొక దేశం ఏదైనా అందచేస్తే పొలోమంటూ అటే వెళతారు.చైనా అంత తక్కువ ధరలకు ఎలా అందిస్తున్నదని అనేక మంది ప్రశ్నించటాన్ని చూస్తున్నాము. ఆధునిక పద్దతుల్లో వస్తూత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని వేరే చెప్పనవసరం లేదు. తన 140 కోట్ల జనానికి పనికల్పించాలంటే అవసరాలకు మించి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న విధానంలో భాగంగా ఇప్పటి వరకు పని చేసింది. ఇప్పుడు తన కార్మికులకు గణనీయంగా వేతనాలు పెంచిన కారణంగా గతంలో మాదిరి చౌకగా అన్ని వస్తువులను అందించటానికి వీలుకాదు గనుక విలువ ఎక్కువగా ఉంటే వస్తూత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నది.గతంలో తక్కువ ధరకు ఫోన్లు అందించిన చైనా నుంచి ఇప్పుడు ఎక్కువ విలువగల ఫోన్లే వస్తున్నాయి, లేకపోతే మనదేశంలోనే తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా సగటున మన వద్ద నుంచి 65 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న మన ఎగుమతుల గురించి పైకి చెప్పుకోలేని ఆందోళన పడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తలెత్తిన పశ్చిమాసియా పరిస్థితి ఎలాంటి పర్యవసానాలకు దోహదం చేయనుందో తరువాత గానీ వెల్లడికాదు. మార్చినెలలో అమెరికా కుదురుతుందని చెబుతున్న ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.అమెరికాలో పన్నులు పెంచిన కారణంగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది మన ఎగుమతులు 12.8శాతం తగ్గాయి.

ఇప్పుడున్న వాణిజ్య లోటు గురించి గుండెలు బాదుకోకుండా దీర్ఘకాలంలో వచ్చే లాభాల గురించి దృష్టి పెట్టాలని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ మన దేశంలో వెలువడుతున్న మీడియా కథనాలపై వ్యాఖ్యానించింది. లోటు గురించి అతిగా కేంద్రీకరించి నిజమైన అవకాశాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నది.ఏప్రిల్‌ 2025 నుంచి ఫిబ్రవరి 2026వరకు మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 38శాతం పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు మన వాణిజ్య శాఖ వేసిన అంచనాను ఆ పత్రిక ఉటంకించింది. ( ఇదే నెలల్లో అమెరికాకు మన ఎగుమతులు 79.3బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ వృద్ధి రేటు 3.8శాతమే.) ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 15శాతం పెరిగి 120 బిలియన్లకు చేరటంతో వాణిజ్య లోటు 102 బి.డాలర్లుగా ఉంది, ఏడాది ముగిసేలోగా ఇదే దామాషాలో ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. గత ఏడాది కాలంగా సాధారణ సంబంధాల ఏర్పాటుకు మన వైపు నుంచి చూపుతున్న చొరవకు స్పందనగా మన దేశం నుంచి చైనా దిగుమతులను వ్యూహాత్మకంగానే పెంచిందన్నది వాస్తవం.ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి మరి. ఏటా అప్పనంగా వందబిలియన్‌ డాలర్ల మేర మనదేశం హారతిపళ్లెంలో పెట్టి అప్పగిస్తుంటే వాటిని బీజింగ్‌ పోగొట్టుకుంటుందా ! ఇప్పుడున్న సంబంధాలు ఇలాగే మెరుగుపడితే రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 1.4లక్షల కోట్ల డాలర్ల మేర వాణిజ్యలావాదేవీలకు అవకాశం ఉందని 2025 డిసెంబరులో మన దేశంలో చైనా రాయబారి షు ఫెయిహాంగ్‌ చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నికబుర్లు చెప్పినా ప్రపంచ ఫ్యాక్టరీగా మారలేదు, సమీప భవిష్యత్‌లో అలాంటి సూచనలు కూడా లేవు.వస్తు, సేవారంగాలను చూస్తే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎగుమతులు తక్కువగా ఉన్నందున ఏటా మొత్తం మీద వాణిజ్య లోటు వందబిలియన్‌ డాలర్ల వరకు ఉంటున్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిబ్రవరి వరకు 5.8శాతం వృద్ధి రేటుతో 791 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను ఎగుమతి చేశాము. ఇదే సమయంలో 7.4శాతం వృద్ది రేటుతో 900 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాం. ఇతర దేశాలతో మన వాణిజ్యం మిగులు ఉన్న కారణంగా కేవలం ఒక్క చైనాకే వంద బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లిస్తున్నప్పటికీ మన మొత్తం వాణిజ్య లోటు వంద బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మిగతా దేశాలన్నించి నుంచి సంపాదించిన మొత్తాన్ని చైనాకు అప్పగిస్తున్నాం. ప్రవాస భారతీయులు ఏటా 135బిలియన్‌ డాలర్లు మనదేశానికి పంపుతున్న కారణంగా డాలర్ల కొరతను గణనీయంగా తీర్చుతున్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉండి వృద్దిని పరుగులు పెట్టిస్తున్నట్లు బడాయిచెప్పుకోవటం తప్ప ఎగుమతులను పెంచలేని కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే దీనికి కారణం.మన వస్తువుల కంటే సేవల ఎగుమతుల రేటు ఎక్కువగా ఉంది.ధరల విషయంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం ఎగుమతుల్లో 403 డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతుల్లో 900బిలియన్‌ డాలర్లలో 714 బి.డాలర్లు వస్తువులే ఉన్నాయి. మన దిగుమతుల్లో ఎరువుల వాటా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 64.5శాతం పెరిగాయి, ధరలు కూడా ఎక్కువే. వర్తమాన పశ్చిమాసియా సంక్షోభం వీటి దిగుమతుల బిల్లును ఎంతగా పెంచుతుందో చెప్పలేము. ఇప్పటికే గల్ఫ్‌ నుంచి దిగుమతలకు అంతరాయ కలిగిన కారణంగా మన యూరియా ఫ్యాక్టరీలు సగం సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలు వచ్చే రంగాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎరువుల వంటివి అంతర్జాతీయ ధరలతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున వాటి జోలికి పోవటం లేదు. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు నిలిపివేసిన తరువాత తప్పనిసరై రామగుండం వంటి మూతబడిన వాటిని పునరుద్దరించటం తప్ప కొత్త వాటిని నెలకొల్పటం లేదు. చివరకు యూరియా దిగుమతులకు సైతం చైనా మీద ఆధారపడ్డాం. గతేడాది మన దేశంలో యూరియా కొరతకు చైనా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణం. అందువలన మన మీడియా విశ్లేషకులు, ఇతరులు గమనించాల్సిందేమంటే తమ వస్తువులను కొనాలని చైనా వారు మనలను ఎప్పుడూ దేబిరించలేదు. రెండు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు లేవు. అది చేసే ఎగుమతులు మనకు పెద్దమొత్తంగా కనిపించవచ్చుగానీ మొత్తం ఎగుమతుల్లో 3-4శాతం మధ్యనే మన వాటా ఉంది. అందువలన వీధుల్లో వీరంగం వేసేవారిని చూసి మనం తలుపులు మూసుకుంటే ఆ మాత్రం ఎగుమతులకు నూతన మార్కెట్లను చూసుకోలేని స్థితిలో చైనా లేదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శనగ రైతుల సంక్షోభం

04 Wednesday Mar 2026

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ 1 Comment

Tags

Bengal Gram price, CHANDRABABU, Farmers

డా|| కొల్లా రాజమోహన్‌

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్ల బర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో వున్నారు. నల్ల బర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం – దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్‌ స్టోరేజ్‌లో వున్న శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.

పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పుధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్‌ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావాల్సినంత పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంపిణీ సరిగ్గా లేక అందరికీ అందనందున ”ప్రొటీన్‌ క్యాలరీ మాల్‌న్యూట్రిషన్‌” దాపురిస్తున్నది. ఒకపక్క గోడౌన్లలో శనగలు పుచ్చిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పుధాన్యాలు అందటంలేదు. రేషన్‌ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడు పోవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులు – తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. శనగలకు ఉత్తరాదిన డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది.
దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్‌ స్టోరేజీలలో శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కోల్డ్‌ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
భూసారం క్షీణించడం వలన, వాతావరణంలో మార్పుల వలన, దిగుబడులు తగ్గిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులతో సహా వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను పోత్సహిస్తున్నాయి. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో ఇక్కడి శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి.
ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

సుంకాల రద్దు- రైతుకు ఉరి
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత 2025 ఏప్రిల్‌ నుండి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియని పరిస్థితులలో, కొద్దిగా డబ్బులు వస్తాయనే ఆశతో నల్ల బర్లీ పొగాకును సాగు చేశారు. నల్ల బర్లీ పొగాకు 15-18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్‌ నల్ల బర్లీ పొగాకు రేట్లను రూ.12000-9000-6000గా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశాయి. ఈ సంవత్సరం అసలు నల్ల బర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు.
పత్తికి ధర లేదు. విదేశాల నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి. రెండు సంవత్సరాల నుండి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజ్‌లో స్టాక్‌ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్లు, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే…
– రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి.
– కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
– ఇదివరకు లాగా విదేశీ దిగుమతులపైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్‌ ఉంటుంది.
– విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
– వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి.
రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
– వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు, సెల్‌: 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

అగ్రగామిగా జపాన్‌ – నయా సైనికవాదం !

18 Wednesday Feb 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Imperialist war, Japan LDP, Japan militarism, Sanae Takaichi, Wang Yi

ఎం కోటేశ్వరరావు

మరోసారి అమెరికాను అగ్రగామిగా నిలపాలన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. వాషింగ్టన్‌ అడుగుజాడల్లో నడుస్తున్నది జపాన్‌.గత వారంలో జరిగిన ఎన్నికల్లో 1955 తరువాత అత్యధిక మెజారిటీ సాధించిన మితవాద ఎల్‌డిపి నేత, ప్రధాని సానే తకాయిచీ మరోసారి జపాన్ను అగ్రగామిగా చేయాలని ఇచ్చిన పిలుపు ప్రమాద ఘంటికలను మోగించింది. డైట్‌(పార్లమెంటు) ఎగువ సభలో మెజారిటీ లేనప్పటికీ అవసరమైతే వ్యతిరేకతను పక్కకు నెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.ఇప్పటికే పెద్ద మొత్తాలలో మిలిటరీ బడ్జెట్‌కు కేటాయించిన ప్రభుత్వం అవసరమైతే యుద్ధాలను నిషేధించి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత మిలిటరీ ఉండాలన్న శాంతికాముక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు చూస్తున్నది.తనను తాను జపాన్‌ మార్గరెట్‌ ధాచర్‌గా వర్ణించుకొనే తకాయిచీ చైనా, ఉత్తర కొరియాలనుంచి ముప్పు అంటూ సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అధికారానికి వచ్చిన షింజే అబే ” ధృడమైన జపాన్ను పునరుద్దరించాలని ” ప్రతిజ్ఞ పూనాడు. గత విధానాలను క్రమంగా పక్కన పెట్టటం ప్రారంభించాడు. దాని కొనసాగింపుగా ” మరోసారి జపాన్ను అగ్రగామి ” చేయాలని తకాయిచీ చెబుతున్నారు.దానిలో భాగంగా మిలిటరీని పటిష్టపరచటం, ఆయుధ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, నాటో, ఐరోపాయూనియన్‌, క్వాడ్‌తో సహా నూతన భద్రతా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, అమెరికాతో బంధాన్ని మరింత పటిష్టపరుచుకొనే వ్యూహంతో ముందుకు పోవాలని జపాన్‌ నిర్ణయించుకుంది. తమ మీద ఎవరైనా దాడి చేస్తే ఉమ్మడిగా ఆత్మరక్షణ లేదా భాగస్వాముల సాయం పొందవచ్చని రాజ్యాంగమే అనుమతిస్తున్నదంటూ నూతన భాష్యాలు చెబుతున్నారు. గత ఏడాది అధికారానికి వచ్చిన వెంటనే ఒక వేళ చైనా గనుక తైవాన్‌పై దాడి చేస్తే తమ మిలిటరీని రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఈ వైఖరి ప్రాంతీయ భద్రతకు ముప్పు అని చైనా వర్ణించింది.

ఆర్థిక రంగంలో దీర్ఘకాల పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌ ఇప్పుడు ఆర్థిక, మిలిటరీ లక్ష్యాలను ఉమ్మడిగా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నది. ఇప్పటికే జిడిపిలో రెండు శాతానికి రక్షణ ఖర్చు చేరింది.అణు జలాంతర్గాములను సమకూర్చుకోవాలని, ఆయుధ విక్రయాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని,మారణాయుధాలను ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు పంపటంతో తగ్గిన పేట్రియాట్‌ పిఏసి-3 క్షిపణులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.ఇటలీ,ఆస్ట్రేలియాకు ఫ్రైగేట్స్‌ సరఫరా, నూతనతరం జెట్‌ఫైటర్ల రూపకల్పనకు బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాటో పేరుతో ఉక్రెయిన్‌కు మిలిటరీ పరికరాలను సరఫరా చేస్తున్నది. సిఐఏ మాదిరి నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. తద్వారా ఇప్పటికే ఐదు కళ్ల పేరుతో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గూఢచర్యంలో సహకరించుకుంటున్నాయి, దీనిలో చేరటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమెరికాతో రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా మిలిటరీ, సైనిక కేంద్రాలను ఏర్పాటును అనుమతించింది. ”డోన్రో సిద్దాంతం”(డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడలు) పశ్చిమార్ధగోళం వైపు కేంద్రీకరిస్తూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ ప్రాంతంలో తాను కేంద్ర బిందువుగా ఉండాలని జపాన్‌ భావిస్తున్నది, అందుకోసం అమెరికాతో మరింతగా జతకట్టేందుకు పూనుకుంది. తన దగ్గర ఉన్న నిల్వనుంచి 550 బిలియన్‌ డాలర్ల మేర అమెరికాలో పెట్టుబడులు పెడతామంటూ అమెరికాకు ఆశచూపుతున్నది.

మరోసారి మిలిటరీవాదం వైపు పయనిస్తున్న జపాన్‌ చర్యలను దాని బాధిత దేశాలలో ఒకటైన చైనా సహజంగానే వ్యతిరేకిస్తుంది. జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో ప్రస్తుతం జరుగుతున్న భద్రతా సమావేశాలలో మిలిటరీ భూతంలా జపాన్‌ ఉందని చైనా విమర్శించింది. మమ్మల్ని అంతమాట అంటారా అని జపాన్‌ నిరసన తెలిపింది. ” ప్రపంచంలో చైనా ” అనే ఇతివృత్తంపై మ్యూనిచ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ మాట్లాడుతూ చైనాకు దూరంగా జరుగుతున్న జపాన్‌ మరోవైపు తైవాన్‌కు మద్దతు ఇస్తూ దురాక్రమణ ఉద్దేశ్యాలను బయటపెట్టుకున్నదని విమర్శించాడు. తైవాన్‌పై దాడితో వలసగా మార్చుకొనేందుకు చూస్తున్నదని, జపాన్‌ మిలిటరీ వాద భూతం భయం కొనసాగుతున్నదంటూ ఒకవేళ గతంలో మాదిరి పాత పద్దతిలో దురాక్రమణకు పూనుకుంటే వెనక్కు తిరిగి చూసుకొనే లోపే చావు దెబ్బతింటుందని హెచ్చరించాడు. తైవాన్‌కు మద్దతు ఇవ్వటం ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పరిణామం అవుతుందని, చైనా సర్వసత్తాకతకు సవాలు, 140 మంది జనాభా అంగీకరించే సమస్యే లేదని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తరువాత సామ్రాజ్యవాదాన్ని జర్మనీ తిరస్కరించిందని, నాజీల ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయగా జపాన్‌ మాత్రం యుద్ద నేరగాండ్లకకు ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్నదని, వారికి వందనాలు చేయటమే సమస్యలన్నింటికీ మూలమని వాంగ్‌ ఇ చెప్పాడు.చైనా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని జపాన్‌ పేర్కొన్నది. తమ మిలిటరీ నిర్మాణం పెరుగుతున్న భద్రతా పర్యావరణానికి స్పందన తప్ప ఒక దేశానికి వ్యతిరేకం కాదని, తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పుకుంది. కొన్ని దేశాలు తమ మిలిటరీ శక్తిని పెంచుకుంటున్నాయని, బెదిరిస్తున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా జపాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో వ్యాఖ్యానించారు. తమ పరిసర దేశాలు తీసుకుంటున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని జపాన్‌ రక్షణ మంత్రి కొజుమీ మ్యూనిచ్‌ సమావేశాల్లో ఆరోపించాడు.

అక్టోబరులో అధికారానికి వచ్చిన తకాయిచి జపాన్‌కు తొలి మహిళా ప్రధాని, వచ్చీ రావటంతోనే దూకుడుగా వ్యవహరిస్తున్నారు, చైనాను రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. తమ భూ భాగాల రక్షణకు ఇప్పటికే తిష్టవేసిన అరవైవేల మంది అమెరికన్‌ మిలిటరీతో పాటు తాము కూడా రక్షణ ఏర్పాట్లను మరింతగా పెంచుతామని ప్రకటించారు. గత 14 సంవత్సరాలుగా క్రమంగా జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతూనే ఉంది.తాజాగా 2026 సంవత్సరానికి రికార్డు స్థాయిలో గత రికార్డులను బద్దలు కొట్టి 57.8 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ మొత్తమే ఖర్చు చేయనుందని, జిడిపిలో రెండుశాతానికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదేదో అనుకోకుండా జరిగే పరిణామం కాదు. నయా సైనికవాదంలో భాగమే. రాజ్యాంగం శాంతికాముకమని, ఆత్మరక్షణ మిలిటరీ బలగాలని చెబుతున్నప్పటికీ వర్తమాన ఆచరణ యుద్దోన్మాద బాటగా ఉంది. ప్రతిదాడులు చేసే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను దెబ్బతీసే సామర్ద్యాలను సమకూర్చుకుంటున్నది. చైనా, తైవాన్‌ల సమీపంలో ఉన్న తన దీవులను మిలిటరీ, ఆయుధాలతో నింపుతున్నది. నిజానికి జపాన్‌ వద్ద ఆధునిక ఆయుధాలను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదు. ఇప్పుడు ఉపగ్రహాలు పనిచేయకుండా స్థంభింపచేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నది. అనేక ఆంక్షల కారణంగా ఆయుధాల బదులు ఎలక్ట్రానిక్‌, వినియోగవస్తువులపై కేంద్రీకరించి కొన్ని దశాబ్దాల పాటు హవా నడిపింది. ఇటీవలి కాలంలో చైనా సవాలు విసురుతున్నది. ఈ నేపధ్యంలోనే ఆయుధాల తయారీకి పూనుకుందని చెప్పవచ్చు, అయితే తనకు ముప్పు రానంతవరకు లేదా తనకు అవసరమైన వాటిని మాత్రమే అమెరికా అనుమతించవచ్చు. తానుగా విదేశాలపై దాడులు చేసినపుడు అంతర్గతంగా తలెత్తుతున్న వ్యతిరేకత, నష్టాలను గమనంలో ఉంచుకొని తమ చేతికి మట్టి అంటకుండా చూసుకుంటున్నది. నాటో దేశాలు తమ మిలిటరీ బడ్జెట్లను పెంచుకోవాలని వత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి ఆసియాలో చైనా మీద దాడికి దిగితే పక్కనే ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎంతో అవసరం. అందువలన వాటి మిలిటరీ ఖర్చు పెంచేందుకు అమెరికా పూనుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కుదిరిన ఒప్పందాల ప్రకారం జపాన్‌, జర్మనీ మిలిటరీ వాదాన్ని వదులుకోవాలని స్పష్టంగా ఉంది. అందువలన దానికి దానికి తూట్లు పొడుస్తూ రెండు దేశాలు కూడా మిలిటరీబాటలో ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఓడిపోయింది తప్ప దాని మిలిటరీ సామర్ధ్యాలు అంతరించలేదు. అందుకే మరోసారి వాటిని ప్రదర్శించేందుకు పూనుకుంది. తూర్పు ఆసియాను ఉద్రిక్తల్లోకి నెట్టేందుకు చూస్తున్నది.తొలుత వాణిజ్యం, మత ప్రచారం పేరుతో మనదేశానికి బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదులు వచ్చినట్లుగానే 1,600 సంవత్సరంలో పోర్చుగీసు వాణిజ్య, మత ప్రచారకులు జపాన్‌లో అడుగుపెట్టారు. జపాన్‌ నాలుగు ప్రధాన దీవులు, 14,121 చిన్నదీవుల సముదాయం. పోర్చుగీసు, ఇతర పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులను ఎదుర్కొనే క్రమంలో అక్కడి రాజులు తామే సామ్రాజ్యవాదులుగా మారి కొరియాను ఆక్రమించుకున్నారు.చైనా ఆక్రమణకూ పూనుకున్నారు. ఈ క్రమంలో జపాన్‌-చైనా, జపాన్‌-రష్యా యుద్దాలు జరిగాయి.కాముకురా, ఆషికా షోగుంటే రాజరికాలు జపాన్ను ఐక్యం కావించిన తరువాత ప్రపంచానికి దూరంగా ఒక అగ్రహారంలా ఉంది. అమెరికా 1853లో నౌకా దళాన్ని పంపి రాజును లొంగదీసుకొని పశ్చిమదేశాలకు మార్కెట్‌గా మార్చింది. దాంతో 1868లో షోగుంటే పాలన రద్దయి, మెజి పాలన ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్‌ సంబంధాలను బద్దలు కొట్టి పారిశ్రామీకరణ, నవీకరణ, మిలిటరీ వాదంతో పాలకులు ముందుకు వచ్చారు.ప్రష్యా(జర్మనీ) పాలకులను అనుకరించారు.ఈ క్రమంలో 1910లో కొరియాను ఆక్రమించుకుంది, 1937చైనా ఆక్రమణకు పూనుకుంది. తరువాత అమెరికా,ఐరోపా దేశాలతో తలపడింది.రెండవ ప్రపంచ యుద్దంలో మితవాద భావజాలం, మిలిటరీ శక్తులు, సామ్రాజ్యవాదులుగా ఉన్న ఇటలీ, జర్మనీలతో చేతులు కలిపి సోవియట్‌ యూనియన్‌, అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో తలపడింది. ఆ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయటంతో సామాన్య జపనీయులు యుద్ధ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో శాంతికాముక రాజ్యాంగంతో యుద్దాలకు దూరంగా ఉంటామని జపాన్‌ పాలకవర్గం ప్రకటించకతప్పలేదు. అయితే వలసలు, సామ్రాజ్యవాదంతో ఎలా లబ్ది పొందవచ్చో తెలిసిన వారు గనుక మరోసారి నయా సైనిక వాదంతో ప్రాంతీయంగా అయినా తమ ప్రభావాన్ని రుద్దేందుకు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించారు. వాటి గురించి ఎగువన చెప్పుకున్నాం. గడచిన ఎనిమిది దశాబ్దాలలో ప్రపంచ పటంలో అనేక మార్పులు వచ్చాయి. బలాబలాలు తారుమారవుతున్నాయి.గతంలో మాదిరి ఏ దేశాన్ని కూడా భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశాలు లేదు. అందువలన జపాన్‌ గతాన్ని తలుచుకోవటం తప్ప అంతకు మించి చేసేదేమీ లేదు, అయినప్పటికీ పాలకవర్గ స్వభావం మారదు, అందుకే మరోసారి జాతీయోన్మాదాన్ని, నయా సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నారు, అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో జపనీయులకు తెలిసినంతగా మరొరికి తెలియదు గనుక పాలకవర్గ యత్నాలను అడ్డుకుంటారని, అడ్డుకోవాలని ఆశిద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవాస్తవాలు చెబుతున్నదెవరు పియూష్‌ గోయలా – రాహుల్‌ గాంధీనా : పత్తి రైతులు, పరిశ్రమకు ముప్పుగా మారిన మోడీ-ట్రంప్‌ ఒప్పందం !

15 Sunday Feb 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, Donald trump, Farmers matters, Narendra Modi Failures, Piyush Goyal, Rahul gandhi, Textiles Industry, US-India trade Deal

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయదళానికి కర్రుకాల్చి వాత పెట్టిన పినరయి విజయన్‌ : బోనస్‌ , ధాన్యం పండిస్తే భారమ ంటూ లేఖ రాసిన మోడీ సర్కార్‌, ఇరుకున పడ్డ బిజెపి !

09 Monday Feb 2026

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Anti Farmer BJP, BJP, Kerala Paddy Bonus Policy, LDF, Narendra Modi Failures, Pinarayi Vijayan

ఎం కోటేశ్వరరావు

ధాన్య ఉత్పత్తి పెరిగితే దేశానికి భారంగా మారుతుందా ? నేరుగా రైతులకే ఎగుమతి అవకాశాలు కల్పిస్తామంటూ కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ అదే చెబుతోంది, రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. అవర్‌ వరల్డ్‌ డాటా ప్రకారం మన పక్కనే ఉన్న చైనాలో 2022లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున 3,454 కాలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని అందిస్తుండగా నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్న నరేంద్రమోడీ ఏలుబడిలో 2,574 కాలరీలు ఉంది. అయినప్పటికీ ధాన్యం పండించే రైతులకు బోనస్‌ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుందని, అది దేశానికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర వైఖరిని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి మద్దతు ధరకంటే అదనంగా క్వింటాలుకు కేరళ ప్రభుత్వం రు.631 అందిస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇవ్వటాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా ఇస్తున్న కారణంగా ధాన్య సేకరణ ఖర్చు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద వత్తిడిని పెంచుతున్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణాలో సన్న రకాలు పండించే వారికి బోనస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర లేఖ ఒక్క కేరళకేనా, అన్ని రాష్ట్రాలు పంపిందా అన్నది తెలియదు. ఎలాంటి శషభిషలు లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నదని, రైతులకు ఇచ్చే బోనస్‌ను ప్రధాన ఆర్థిక భారంగా ఎందుకు భావిస్తున్నదని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఈ లేఖలో వెల్లడించిన అభిప్రాయం వెనుక మనదేశ మార్కెట్‌ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తెరవాలన్న ఆలోచన ఉందా అని కూడా ప్రశ్నించారు.వరి రైతులకు చెల్లించాల్సిన సాయాన్ని సకాలంలో విడుదల చేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరి ఆహార భద్రత, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖలో గోధుమ,వరి పంటలకు అదనపు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పు ధాన్యాలు,చమురు గింజలు,చిరుధాన్యాలకు ప్రోత్సాహాకాలను అందించాలని పేర్కొన్నారు.కేంద్ర సూచనను తిరస్కరిస్తున్నామని, వరి సాగు విషయంలో రాజీపడేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌ కేంద్రానికి లేఖ రాశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు ప్రోతాహకాలను తాము వ్యతిరేకించటం లేదని, వరిని ఫణంగా పెట్టి ఆ పని చేయలేమని, వాటి ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ అవసరాలలో కేవలం 21శాతం మాత్రమే స్థానికంగా బియ్యం ఉత్పత్తి ఉంది, దాన్ని 30శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందిస్తున్నది.

కొసమెరుపు ఏమంటే కేంద్ర చర్యతో రైతాంగంలో వెలువడిన వ్యతిరేకతతో రాష్ట్ర బిజెపి బెంబేలెత్తింది. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్త వచ్చింది. అంతవరకైతే అదో దారి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్య రైతాంగాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు, సేకరణ యంత్రాంగం, మార్కెటింగ్‌ మద్దతు ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ప్రకటించలేదని కూడా చెప్పారు.కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నట్లు కేరళలో అదనపు ఉత్పత్తిలేదని, కేంద్ర నిల్వలు కూడా అదనంగా లేవని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పిన అంశాలు కేరళకు వర్తించవని బిజెపి నేత వాపోయారు. ధాన్య సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.ఈ కారణంగానే కేంద్రం ఆర్థికంగా కేరళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును పెంచేందుకు అదనంగా బోనస్‌ ఇస్తున్నది. దీన్ని సాకుగా చూపి మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకే ఆర్థిక శాఖ రాసిన లేఖ అన్నది స్పష్టం. త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఇబ్బందులను ఊహించి బిజెపి నేత నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కూడా ఇరుకునపడింది.ఇప్పుడు లేఖను వెనక్కు తీసుకున్నా, లేకున్నా బిజెపికే నష్టం.అదొక అసెంబ్లీ ఎన్నికల అస్త్రంగా మారుతుంది.

ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం గురించి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో వేసిన కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు, ఏం చేస్తున్నారని కేంద్రం అడగనూ లేదు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ శ్రద్దకు ఇది చక్కటి తార్కాణం.అమెరికా ఉత్పత్తులకు ఒక్కసారే పూర్తి స్థాయిలో మార్కెట్‌ను తెరిస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో దశలవారీ చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరినైనా హత్య చేయదలచుకుంటే మెల్లగా పనిచేసే విషం ఇవ్వటం తెలిసిందే. అలా ఒక్కొక్కటిగా వెల్లడిస్తే ఈలోగా జనం అలవాటు పడిపోతారన్నది భావన కావచ్చు. మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పినట్లు ఇప్పుడు కుదిరింది ఒక స్వరూప అవగాహన మాత్రమే. ఉదాహరణకు ఇల్లు కట్టేటపుడు ఒక ప్లాన్‌ గీస్తారు. తరువాత పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ వేస్తారు. ఇంట్లో ఏమేమి ఉండేది తరువాత మాత్రమే బయటివారికి తెలుస్తుంది. అలాంటిదే అమెరికాతో కుదిరిన అవగాహన. తాత్కాలిక ఒప్పందం పేరుతో పశుదాణా అవసరాలకు ఎర్ర జొన్నలు, పలురకాల ధాన్యాలతో చేస్తున్న ఇథనాల్‌ తయారీలో ఉప ఉత్పత్తిగా తయారయ్యే చెక్కను కూడా కూడా దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిగుమతి పన్నులేకుండా అనుమతించింది. ఇప్పటికే పత్తి దిగుమతి పన్ను తగ్గింపుతో క్వింటాలకు వెయ్యి నుంచి రెండువేల వరకు రైతాంగం నష్టపోయింది.ఈ పశుదాణా పేరుతో దిగుమతులు, అందుకోసం మనదేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న, ఇతర పంటల ధరల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సోయా ఆయిల్‌ దిగుమతి ఆ పంట పండించే రైతాంగంతో పాటు పామాయిల్‌, నూనె గింజల సాగుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుందో అధ్యయనం చేయాల్సి ఉంది. యాపిల్‌ పండ్ల దిగుమతులు కాశ్మీర్‌,హిమచల్‌ ప్రదేశ్‌ ఇతర ప్రాంతాల్లోని రైతాంగానికి గొడ్డలి పెట్టని యాపిల్‌ సాగుదార్ల అఖిల భారత సంఘ అధ్యక్షుడు, సిపిఐ(ఎం) నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామి పేర్కొన్నారు.

అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం గనుక ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, దాన్నుంచి విడిపోయిన వారితో సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికన్‌ కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేశారని పేర్కొన్నాయి.వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మనం ఎగుమతి చేసే వాటిపై 18శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు గిడసబారిన స్థితిలో ఉన్నందున చేసుకొనే ఒప్పందాలు వాటికి ఉపయోగం తప్ప భారత్‌కు మేలు చేయవని అనేక మంది చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈనెల పన్నెండున లేబర్‌ కోడ్‌లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాపిత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే, వారికి మద్దతుగా, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆ రోజున రైతాంగం కూడా పాల్గ్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున ట్రంప్‌, మోడీ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) ఒక ప్రకటన చేస్తూ త్వరలో సమావేశం జరిపి, అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తామని పేర్కొన్నది. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ముప్పు ఉండదని పియూష్‌ గోయల్‌ చెప్పుకున్నారు.

వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి 13న డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ చర్చలకు శ్రీకారం చుట్టారు.రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు మరియు పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను భారత్‌ పూర్తిగా ఎత్తివేయటం లేదా తగ్గించటం చేస్తుంది.వాటిలో పశుదాణా అవసరాల కోసం డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ గ్రెయిన్స్‌(పైన చెప్పుకున్న ఇథనాల్‌ ఉప ఉత్పత్తులు), ఎర్ర జొన్నలు,ట్రీ నట్స్‌, తాజా మరియు ప్రోసెస్‌ చేసిన పండ్లు, సోయాబీన్‌ నూనె, వైన్‌, ఆల్కహాల్‌ మరియు అదనపు ఉత్పత్తులు.దీనికి ప్రతిగా ఏప్రిల్‌ రెండవ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై 18శాతం పన్నులు విధిస్తారు. వాటిలో వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ మరియు రబ్బరు, ఆర్గానిక్‌ రసాయనాలు,గృహ అలంకరణ వస్తువులు, కళా ఉత్పత్తులు మరియు కొన్ని యంత్రాలు ఉన్నాయి.జనరిక్‌ ఔషధాలు, వజ్ర వైఢూర్యాలు, విమానాల విడిభాగాల మీ పన్నులను రద్దు చేస్తారు.అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించి గతంలో పన్నులు విధించిన భారత విమానాల విడిభాగాలు,అల్యూమినియం, ఉక్కు, రాగి, వాహన ఉత్పత్తులపై రాయితీలు, కోటాలను అమలు చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఇంథన ఉత్పత్తులు, విమానాలు, విమానవిడి భాగాలు, వంట బొగ్గు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పతులను 500 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేయాలనుందని భారత్‌ చెప్పింది. ఈ ఒప్పందంలో భారత్‌ నుంచి అమెరికా ఏ వస్తువులను, ఎంత మొత్తంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించిందీ లేదా వాంఛిస్తున్నదీ వివరాలు లేవు.ఈ కారణంగానే దీన్ని ఖరారు చేసే నాటికి వాటిలో ఎన్ని చేరుస్తారో ఏమిటో జనాలకు అంతుబట్టటం లేదు గనుకనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇది అమెరికాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం రావటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఒప్పందంపై సంతకాల తరువాత అవి వెల్లడౌతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

17 Saturday Jan 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, inequality, Narendra Modi Achhedin, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Economics, Farmers, Gujarat, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

agricultural research, Agriculture Crisis in India, agriculture in india, BJP, Donald trump, MSP in India, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్నికబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది.రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.వివిధ రంగాల జివిఏల తీరు తెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తరువాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి.మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ ీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవారంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011-12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.

2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటుతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రు.6,426 ఉంటే 2024-25లో రు.19,696గా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదల రు.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం 4శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేకపోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం నాలుగుశాతంగా ఉన్న పశుపోషణ రాబడి 2018-19 నాటికి 16శాతానికి పెరిగింది. పంటల రాబడి వాటా 40శాతం దిగువకు పడిపోయింది.ఉద్యానవన పంటల సాగు మెరుగ్గా ఉండటంతో సాగు భూమి పెరుగుతున్నది.వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల్లో కేవలం రెండుశాతమే ఉద్యానవన పంటలకు ఉంది. ఈ పంటల రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తేనే వారికి ఉపయోగం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు పూనుకున్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి.మౌలిక సదుపాయాలు, రోడ్లు,పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళాదుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.

ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రధమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రు.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం.

పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు 60 శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చుకుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా ? 2021 ఆగస్టులో ఖాద్య తైలాలు- పామాయిల్‌ ఉత్పత్తి పెంపు పథకాన్ని ప్రకటించి 2025-26 నాటికి అదనంగా పామాయిల్‌ 6.64లక్షల హెక్టార్ల సాగు చేయిస్తామని చెప్పారు, కానీ 1.89లక్షలే పెరిగింది, ఇదే కాలంలో ఆవనూనె సాగు, ఉత్పత్తి రెండూ తగ్గాయి. దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ నేతలే కారణమని చెప్పినా నమ్మే జనాలున్నారు మరి ! మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుసెనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది ! గుజరాత్‌ వేరుశన సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశాబ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బిజెపి రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపివేయటమే దీనికి కారణం.పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటంలో ఉన్న శ్రద్ద రైతాంగం మీద లేదు. ఇతర ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా సబ్సిడీకి లభిస్తుండటంతో రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు, దానికి తోడు గతేడాది వర్షాలు బాగాపడటం కూడా డిమాండ్‌ను పెంచింది.

అంతర్గత పరిస్థితి ఇలా ఉంటే అమెరికా కత్తి మన రైతాంగం మీద వేలాడుతున్నది.2030 నాటికి ఇరుదేశాల వాణిజ్యాన్ని 128 బిలియన్‌ డాలర్ల నుంచి 500బి.డాలర్లకు తీసుకుపోతామని మన నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గాను తమ దేశంలో వినియోగించని కోడికాళ్లు, మిగులుగా ఉన్న వెన్న, జున్ను వంటి పాడి ఉత్పత్తులను, సోయా, మొక్కజొన్నలు, పత్తి తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతితో పాటు పన్ను భారాన్ని తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది.ఏటా 20 బిలియన్‌ డాలర్ల మేర అక్కడి రైతాంగానికి అమెరికా సబ్సిడీలు ఇస్తున్నది. షరతులను అంగీకరిస్తే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో కుమ్మరిస్తారు,మనకు వ్యవసాయం వాణిజ్యం కంటే జీవనాధారంగా ప్రాధాన్యత కలిగి ఉంది.అమెరికా వస్తువులకు మార్కెట్‌ను తెరిస్తే నరేంద్రమోడీతో పాటు బిజెపి రాజకీయ పతనానికి నాంది పలికినట్లే.ట్రంప్‌ను సంతుష్టీకరించటానికి సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పత్తి దిగుమతి పన్ను రద్దు చేశారు. దాని ప్రభావం మన పత్తిమార్కెట్‌పై పడి కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ వ్యవసాయ మార్కెట్‌ విలువ 452 బిలియన్‌ డాలర్లని, 2030నాటికి 563బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా,146 కోట్ల జనాభా ఉన్నందున మన మార్కెట్‌ ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ పూర్వరంగంలో కనీస మద్దతు ధరలను పెంచటంతో పాటు వాటికి చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ సరైనదే అని తేలుతున్నది.ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 సార్లు సమావేశం జరపటం తప్ప చేసిందేమీ లేదు, దానికి ఎలాంటి వ్యవధి నిర్ణయించలేదు గనుక అలా సాగదీస్తూనే ఉంటారు. ఈలోగా రైతులు మరచిపోతారు.ఏడాది క్రితమే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను పన్నెండు వేలకు పెంచాలని కూడా చెప్పింది. అయినా మోడీ సర్కార్‌ ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.గ్రామీణ ఆదాయ పెరుగుదల 57.6, ఖర్చు పెరుగుదల 69.4శాతాల చొప్పున ఉంది.ఈ కారణంగా రుణ భారం పెరిగినందున రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలి.2016-17లో రుణ భారం ఉన్న గ్రామీణ కుటుంబాలు 47.4శాతం కాగా 2021-22 నాటికి 52శాతానికి చేరినట్లు నాబార్డు సర్వే తెలిపింది.వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు 2020-21లో 3.53శాతం ఉండగా 2024-25లో 2.54శాతానికి తగ్గాయి.వ్యవసాయ వృద్ధి రేటు 2023-24లో 1.4శాతానికి తగ్గింది, ఇది ఏడు సంవత్సరాల్లో కనిష్టం. రెండు ఎకరాలలోపు రైతాంగానికి విధిగా అందిరికీ పంటల బీమా చేయించాలి. వ్యవసాయ కార్మికులకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖగా ఉన్న పేరును వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మిక సంక్షేమ శాఖగా మార్చాలి. పంటల సేకరణ పరిమితంగానే ఉన్నందున కనీస మద్దతు ధరలను కేవలం ఆరుశాతం మంది రైతులు మాత్రమే 2021-22లో లబ్ది పొందినట్లు తేలింది.చట్టబద్ద హామీ ఉంటే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి నిర్ణయించాలి.బలహీనమైన మార్కెట్‌ సంబంధాలు ఉన్న రాష్ట్రాలలో రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. మొత్తం 23 పంటలకు అమలు జరపాలంటే ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి కావాలి. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. గోధుమలు, బియ్యానికి ఒక శాతం కనీస మద్దతు ధర పెంచితే చిల్లర ధరలు 0.22శాతం పెరుగుతాయి.రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యేక విధానాలను రూపొందించాలి.చట్టబద్దత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు ఆధరలకు కొనేందుకు ముందుకు రారు, ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా అవసరయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల ధరలకు చట్టబద్దత కల్పిస్తే భూగర్భ జలాల వాడకం ఎక్కువ అవుతుంది, భూసారం దిగజారుతుంది. చట్టబద్దత కల్పించటం ప్రపంచవాణిజ్య సంస్థ నిబంధనకు విరుద్దం, మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వటానికి ఉండదు. బియ్యం ఎగుమతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను మద్దతు ధరలతో ప్రోత్సహించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులలో అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రతికూలంగా ఉన్న అంశాలను మాత్రమే పట్టించుకొని అనుకూలంగా ఉన్నవాటిని విస్మరించటం రైతాంగం మీద ఉన్న కక్ష, వివక్షగాక మరేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d